19, జనవరి 2023, గురువారం







 

అగస్త్యాశ్రమం

 *కాశీ ఖండం - 2*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻


 *అగస్త్యాశ్రమం* 


 దేవతలందరూ వారణాసి చేరి, అయిదు రోజులు నిత్యము గంగా స్నానం చేస్తూ, విశ్వేశ్వర విశాలాక్షీ అన్నపూర్ణా, దుండి గణపతి, కాలభైరవులను దర్శించారు. 


 ఆ తర్వాత అగస్త్యముని ఆశ్రమాన్ని చేరుకొన్నారు. అగస్త్యుడు తన పేర, అగస్త్యేశ్వర స్వామిని స్థాపించి, జప,హోమాలను చేస్తూ, పరమేశ్వర ధ్యానంలో, భార్య లోపాముద్ర తో, గడుపుతున్నాడు. 

 

 సముద్రాలను తన పుక్కిలిలో ఉంచి పానం చేసినప్పుడు, అందులో ఉండే బడబాగ్ని, ఆయన శరీరంలో ప్రవేశించి, దివ్యకాంతులను వెలువరుస్తోంది. ఆయన తన తపస్సుచే, సూర్యుని ప్రకాశింప జేస్తున్నాడు, అగ్నిని మండింప జేస్తున్నాడు, ఆయన తపో బలం వల్ల, చపలాలు ఆచపలాలుగా మారాయి. ఆశ్రమంలో క్రూర మృగాలతో సాధుజంతువులు, కలిసి మెలుగుతున్నాయి. మహా 

ప్రశాంతంగా అగస్త్యాశ్రమం ఉన్నది. దుష్ట మృగాలు మాంసభక్షణ మాని, పచ్చ గడ్డి మేస్తున్నాయి. కొంగలు చేపలను, పెద్ద చేపలు చిన్న వాటిని తినటం లేదు. ఆశ్రమంలో‘మాంసం ఎక్కడ? శివ భక్తీ ఎక్కడ? మందిర మెక్కడ ?శివార్చనం ఎక్కడ? మద్యమాంసాలు తిన్న వారికి, శంకరుడు దూరంగా ఉంటాడు. "శివానుగ్రహం లేక అజ్ఞానం నశించదు‘’ అన్న వాక్యం వ్రాసి, అందరికి అహింసా ధర్మాన్ని బోధిస్తోంది - అగస్త్యాశ్రమం. 


 ఈ ప్రశాంతతను చూసి దేవతలు ఆశ్చర్యపడ్డారు. ’’ఇక్కడున్న పక్షులు, విశ్వేశ్వరుని ధ్యానిస్తున్నాయా? చిలుకలు విశ్వనాధుని కీర్తిస్తున్నాయా ?కోకిలలు కలికాల పరిస్థితులకు కలత చెంది, విశ్వేశ్వర 

తలంపుతో చిత్తశాంతి పొందుతున్నాయి. స్వర్గంలో నుండి పతనం చెడటం ఉంది కాని, కాశీ లో పతనం ఉండదు. యముడి దగ్గర ఉండటం కంటే, కాశీలో ఉండటం శ్రేయస్కరం. బ్రహ్మాండంలో ఏ ప్రదేశంలో ఉన్న దాని కంటే, కాశీ లో నివశించటం శ్రేష్టం. ఇక్కడ ఉన్నా, ఈశ్వరదర్శనం లేకపోతే వ్యర్ధం. ఉత్తర వాహిని అయిన గంగానదిలో స్నానం చేసి, విశ్వేశుని దర్శించిన వారి శ్రేయస్సుకు, అంతం ఉండదు. *’’దేవ దేవ మహా దేవ శంభో! శివా శివా! ధూర్జటే ! నీల కంఠేశ! పినాకీ! శశి శేఖర! నన్ను రక్షించు‘’* అంటూ ముక్తిమండపం పై కూర్చోవటం, ధర్మ విషయాలు మాట్లాడుకోవటం, పురాణ శ్రవణం చేయటం, నిత్య కర్మలు చేయటం, పిండాదులు పెట్టటం, పరోపకారం చేయటం, అంటే సమస్త ధర్మాలను ఆచరించటమే.  


 శుక్లపక్షంలో చంద్రకళ  అభివృద్ధి చెందినట్లు, కాశీ క్షేత్రంలో ఉన్నవారికి, పుణ్యం అలా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పురుషార్ధాలను ఇచ్చేది, భవానీమాత.  కోరికలను తీర్చేవాడు డుంఢి విఘ్నేశ్వరుడు. విశ్వేశ్వరుడు మరణ కాలంలో సమస్త ప్రాణులకు, రామ తారక మంత్రాన్ని చెవిలో, బోధించి మొక్షాన్నిస్తాడు. విశ్వేశ్వరుడు ధర్మార్ధ కామ మోక్ష స్వరూపుడు. పరమాత్మ స్వరూపుడు. అందుకనే కాశీ వంటి పట్టణం, మూడు లోకాలలోనూ లేదనే ప్రఖ్యాతి వచ్చింది. అని దేవతలందురూ అను కొంటూ, అనేకమంది బ్రహ్మచారి శిష్యులతో పరివేష్టించి ఉన్న అగస్త్య మునిని దర్శించారు. శ్యామక ధాన్యాన్ని, హోమంకోసం చేతులో పట్టుకొన్న రుషి కన్యలను చూశారు. సాధ్వి,  లోపాముద్ర పాద ముద్ర లను చూసి పులకించారు. ఆ పాద ముద్రలకు భక్తీ గా నమస్కరించారు. అక్కడ సమాధి నుండి మేల్కొన్న, బ్రహ్మదేవునిలా ప్రకాశిస్తున్న అగస్త్య మహర్షిని దర్శించి, నమోవాకాలనర్పించారు. 

 

 ఆయన వీరిని సాదరంగా ఆహ్వానించి, అతిధి మర్యాదలు చేసి, శుఖాసీనులను చేశాడు. వారి రాకకు కారణాన్ని అడిగాడు మహర్షి.

                                               

 *పతివ్రతాఖ్యానం*


అప్పుడు దేవతలందరి తరఫున, దేవ గురుడు బృహస్పతి, మహర్షితో,  ‘’లోపాముద్ర వల్లభా !నీవు ఘనులలో ఘనుడవు. 

నీవంటి తపోధనులు లేరు. ఈ కల్యాణి లోపాముద్ర, నీ సహాధర్మచారిణిగా నీ ఛాయలాగా ప్రవర్తిస్తోంది. మహా పతివ్రతలైన అరుంధతి, అనసూయ, సావిత్రి, శాండిల్య , సత్య , లక్ష్మి , శతరూపలతో ఈమె సమానం. ఈమెను మించిన పతివ్రతను ఊహించలేము." అని, లోపాముద్రాగాస్త్యులను కీర్తించాడు. 


 తర్వాత, పతివ్రతా ధర్మాలను వివరించాడు బృహస్పతి. 


 ‘’కన్య వివాహ సందర్భంలో, పెండ్లి కుమార్తెతో పురోహితుడు, ‘’భర్త తో జీవించినా లేకపోయినా సహచరిగా ఉండు‘’ అని చెబుతారు. కనుక భార్య, భర్తను నీడ లాగా అనుసరించాలట. అది పతివ్రత లక్షణం. యమ దూతలు పతివ్రతను చూస్తె, అగ్నిని చూసి నంత భయంతో, పారిపోతారు. ఆమె తేజస్సు ముందు, సూర్యాగ్నుల తేజస్సు, దిగదుడుపు. స్త్రీల పతివ్రతాచారణం వల్లనే, భూమి భారం తగ్గుతోంది.  ఈ లోకానికి, పరలోకానికి, భార్యయే మూలం. భార్య తో కలిసి, దేవ ,పితృ కార్యాలు చేయాలి. భర్తను కోల్పోయిన స్త్రీ, ఏ దానం చేసినా, ‘’నా భర్త సంతోషించు గాక ‘’అని చేయాలి. శ్రావణ, భాద్రపద మాసాలలో, ఆమె, భోజనాలు అతిధులకు పెట్టాలి. కార్తీకంలో మౌనాన్ని పాటించాలి. ఆకులలో భుజించాలి. దీప దానం చేయాలి. ఈ దానంతో ఏదీ సమానం కాదు. సూర్యోదయం అవగానే, మాఘస్నానం చేయాలి. దీపాన్ని దానం చేసేటప్పుడు, పరమేశ్వర స్వరూపుడైన తన భర్త సంతోషించాలి, అని అనుకోవాలి. కొడుకు అనుమతితో, పనులు చేయాలి . పాతివ్రత్యం గల స్త్రీ ని పూజిస్తే, గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది. 


 అమ్మా! లోపాముద్రా దేవీ ! మీ దర్శనం మాకు గంగా స్నానం తో సమానం‘, అని చెప్పాడు. 


 బృహస్పతి తాము వచ్చిన కారణాన్ని ఇప్పుడు వివరించి చెబుతున్నాడు.  


 ‘’మహర్షీ వీరు అగ్ని , యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, రుద్రదేవతలు. లోకంలో జనం, వీరివల్ల అన్ని అర్ధాలను పొందుతున్నారు.

 

 వింధ్య పర్వతం మేరుగిరి పై ఈర్ష్య పెంచుకొని, విపరీతంగా పెరిగింది. సూర్యుని మార్గానికి అవరోధమేర్పడింది. దానిని మీరే దారిలోకి తేవాలి, లోక కార్యాలన్నీ మళ్ళీ యధాప్రకారం జరిగేటట్లు చేయాలి. అందుకే మేమంతా మీ దర్శనం చేసి అర్ధించటానికి వచ్చాం. అని విన్నవించాడు.

 

 అగస్త్య మహర్షి,  ‘’అలాగే చేస్తాను. నిశ్చింత గా వెళ్ళండి."  అని అభయమిచ్చి దేవతలను పంపించాడు. 


 *కాశీఖండం సశేషం..*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*🅰️🅿️SRINU*

మీరొస్తారని

 మీరొస్తారని...


నీ తల్లికి దూరమాయే

నీ ఊరుకి దూరమాయే

నీ తల్లి కన్నీరాయే

నీ ఊరు సిన్న బోయే.


నినుగన్న తల్లి పెంచేలే

పుట్టిన ఊరు బలమునిచ్చేలే

అమ్మను మరిచి

ఊరమ్మను వదిలావా.


పల్లెలోని ఇళ్లు బోసిపోయాయి.

ముసలి కాళ్ళు ఈడుస్తుంటే

రచ్చబండ రాయిలా

కనిపిస్తుంటే... 

ఏమయ్యి పోయావు

నీవు మరిచిపోయావా...


బాల్యమంత ఆడి పాడావా

చెరువులు మావే అన్నావా

కుంటలు మావే అన్నావా

పొలంగట్ల పైన ఆటలాడావా

పల్లెతల్లి ఒడిలో బిడ్డలయ్యారా.


పండగ రోజున అందంగా దిద్దావా

సంకురాతిరి సంబరం జేశావా

మట్టి బొమ్మలను పూజించావా

ఊయల పండగ ఊరేగేవా


వరసలు పెట్టి పలికి

అక్కాబావంటు

అత్తమామంటు

కూతురా కోడాల అంటూ

పిలుచు కున్నారా.


పొలాన ఏరువాక పండగ చేసావా

పంటకు కోతలు నూర్పులు జేసావా

పండిన పంటలు ఇంటముందు 

ధాన్యపు సిరులు జేసి

పల్లె పండగ జరిపారా.


పట్నం మోజులో

పల్లె విడిచి పరుగులు పెట్టి

వెళ్ళి పోయావా

బ్రతుకే భారమైయిందా...

నన్ను మరచి పోయావా.


బస్తీలో బందీ ఆయ్యావా

ఒంటరి బతుకు బ్రతికేవా

నీవు దూరంగా ఉంటేను

అమ్మ అల్లాడి పోతుందో.


కొడుకా కొమరయ్య

బిడ్డా లచ్చమ్మ 

పల్లెమ్మను నేనున్నా

సేద తీర రారండో...

నా చెంతన చేరండో...


అమ్మను మరువకు

ఊరమ్మను మరచకు

ఎదురు చూపులు

చూస్తున్నాము..



మీరొస్తారని....!


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

కచ్ఛపేశ్వరుడు - కంచి

 కచ్ఛపేశ్వరుడు - కంచి


పరమాచార్య స్వామివారు కాంచీపురంలోని కొల్ల చత్రంలో చాలా రోజులపాటు మకాం చేశారు. ప్రతిరోజూ కచ్ఛపేశ్వర దేవాలయ కొలనులో స్నానం చేసేవారు. కార్తీక సోమవారాలలో ఆ కొలనులో స్నానాదికాలు చెయ్యడం ఎంతో పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి.


అలా ఒకనాటి కార్తీక సోమవారం రోజు పరమాచార్య స్వామివారు కొలనులో స్నానం చేసి, దైవదర్శనం కోసమని దేవాలయంలోనికి వెళ్ళారు. చెన్నై నుండి వచ్చిన ఒక భక్తుడు కూడా ఇతర భక్తులతో మహాస్వామివారి వెంట వెళ్తున్నాడు. అతను ఎకామ్రేశ్వర దేవాలయానికి వెళ్ళవలసి ఉన్నందున మహాస్వామివారి వద్ద నుండి సెలవు కావాలని ప్రార్థించాడు.


“ఈరోజు కార్తీక సోమవారం. ఇటువంటి రోజున శివాలయంలో పరమశివ దర్శనం అత్యంత పుణ్యప్రదం. కాంచీపురంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఎన్ని వీలైతే అన్ని శివాలయాలను దర్శించుకో. నాకు వయస్సు అయిపొయింది. కాబట్టి నేను అన్ని ఆలయలాను దర్శించలేను. ఈ పృథ్వీ క్షేత్రమైన కంచిలో అత్యంత పురాతన దేవాలయంగా ఈ కచ్ఛపేశ్వర దేవాలయాన్ని చెబుతారు. ఈ దేవాలయ నిర్మాణము, ప్రతిష్ట జరిగిన తరువాతనే ఎకామ్రేశ్వర దేవాలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. కచ్ఛపేశ్వరుడు వెలసి ఉండడం వల్ల ఈ కాంచీపురానికి కచ్చిముదూర్, కచ్చి ఏకాంబరం అను పేర్లు కూడా కలవు. ఆ ‘కచ్చి’యే సంస్కృతమున ‘కంచి’గా మారిందని చెబుతారు” అని సెలవిచ్చారు స్వామివారు.


ఆ చెన్నై భక్తుడు గొప్ప విద్వాంసుడు. పరమాచార్య స్వామివారు చెబుతున్న విషయాలను విని అమిత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంతటి గొప్ప చారిత్రిక విషయాలను స్వయంగా స్వామివారి నుండే వినే భాగ్యం పొందాడు. స్వామివారి ఆంతరంగిక సహాయకులకు తెలుసు. స్వామివారికి కంచి చరిత్రే కాదు ప్రపంచ చరిత్ర కూడా తెలుసని.


--- శ్రీ మఠం బాలు మామ, మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్ 3


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

వడ్డీ వ్యాపారం - వేద ధర్మం

 వడ్డీ వ్యాపారం - వేద ధర్మం


ఒకరోజు మహాస్వామి వారు మేనాలో కూర్చుని ఉన్నారు. ఎప్పటిలాగే చాలామంది భక్తులు మహాస్వామి వారి దర్శనం కోసం వేచియున్నారు. స్వామివారు భక్తులందరితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తున్నారు.


వారిలో శామ అనే ఒక భక్తుడు కూడా ఉన్నాడు. వరుసలో అతని వంతురాగానే మహాస్వామి వారు మేనా తలుపు వేసుకునారు. శామ మరియు అక్కడున్నవారందరూ నిరాశపడ్డారు. ఎందుకంటే శామ వల్ల వారికి దర్శనం లభించలేదు. అతను ఏదో తప్పు చేసి ఉంటాడు. కాని అతని కోసం అందరిని శిక్షించడం సబబు కాదు కదా.


అప్పుడు మహాస్వామివారి పరిచారకుల బంధువులొకరు వచ్చారు. అతను స్వామివారి ఆంతరంగిన శిష్యుడైనందువల్ల స్వతంత్రించి, మేనా తలుపులు తెరిచి వారి బంధువులు వచ్చిన విషయం విన్నవించాడు. కాని స్వామివారు మరలా తలుపులు వేసుకున్నారు. అరగంట గడిచిన తరువాత స్వామివారు మేనా తలుపులు తెరిచి యధావిధిగా దర్శనం ఇస్తున్నారు. వరుసలో మళ్ళా శామ వంతు వచ్చింది.


పరమాచార్య స్వామివారి కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే వారు ఒక చిన్న వస్త్రం తీసుకుని గొంతుకు చుట్టుకుని బిగించసాగారు. వెంటనే పక్కకు తిరిగి ఎవరితోనో ఎక్కడో మాట్లాడుతున్నట్టుగా, “ఈ మనిషి ఇలాగే ఇచ్చిన అప్పుయొక్క వడ్డీ డబ్బులకోసం అందరి జీవితాలను పిండుతాడు. పేదవారు అవసరం కోసం వడ్డీపై అప్పు చేస్తారు. ఇతను అసలకు వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ అని వేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తాడు. ఇతని వల్ల ఎంతమంది పేదలు బలయ్యారో తెలుసా? ఈశ్వరుడు నీకు మంచి జీవితం ఇచ్చినప్పుడు ఇలా పేదవారిని బాధించడం ఎంతవరకు సమంజసం? ఇలా వడ్డి వెయ్యడం న్యాయమా? అందుకే కొన్ని మతములయందు మత్తు పదార్థములు తీసుకొనుట, వడ్డికి డబ్బు ఇవ్వుట పాపం అని చెప్తారు. మరి అలాంటి పాపము చేసి ఆ పాప ప్రక్షాళన కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే దాన్ని భగవంతుడు అంగీకరించడు”


పరమాచార్య స్వామివారు మేనా తలుపు వేసారు. శామ పశ్చాత్తాపంతో బిగ్గరగా ఏడుస్తున్నాడు. స్వామివారి అంతరంగిక భక్తుడు కలగజేసుకుని మాహాస్వామిని ప్రార్థించారు. “అందరూ పరమాచార్య స్వామిలాగా ధర్మస్వరూపులుగా ఉండలేరు. తెలిసి తెలియక తప్పు చేస్తుంతారు. దయచేసి క్షమించండి. కోపం వలదు”


స్వామివారు శామాను పిలిచి మేనా దగ్గర కూర్చోమన్నారు. అతనితో, “అప్పు ఇచ్చిన వారి వద్దకు కుక్కలాగా తిరిగి వడ్డీ లాక్కుని రావడం ఇక ఆపు. ఉన్నదాన్ని బ్యాంకులో వెయ్యి. అందునుండి వచ్చే వడ్డీ డబ్బులు నీకు సరిపోతుంది. డబ్బుకోసం పరిగెత్తడం బాధపడటం మానుకో. తరువాతి జన్మ మంచిగా ఉండేట్టు చూసుకొ. మిగిలిన సమయాన్ని పూజ, జపము, ధ్యానము, దేవాలయ దర్శనం చేస్తూ గడుపు” అని చెప్పారు.


శామ మహాస్వామి వారికి సాష్టాంగపడ్డాడు. “పెరియవ నా అజ్ఞానం తొలగిపోయింది” అని కళ్ళనీరు తుడుచుకుంటూ చెప్పాడు.


పరమాచార్య స్వామివారు రాశీభూతమైన క్షమ, ఆత్మజ్ఞాన సంపన్నులు. వారి కరుణ అపారం.


--- ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ అనుభవాల సంగ్రహం


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం