13, ఫిబ్రవరి 2025, గురువారం

శయన నియమాలు

 శయన నియమాలు


1. నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు ( మనుస్మృతి)


2పడుకొని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు ( విష్ణుస్మృతి)


3. విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును ( చాణక్య నీతి)


4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి( దేవీ భాగవతము).

పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు (పద్మ పురాణము)


5. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది( అత్రి స్మృతి)

 విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం ( మహాభారతం)


6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు( గౌతమ ధర్మ సూత్రం)


7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు.ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది( ఆచార మయూఖ్ )


8. పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసం లో  1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుంది.


9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు( బ్రహ్మా వైవర్తపురాణం)


10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి.


11.ఎడమవైపు పడుకోవడం వలన  స్వస్థత లభిస్తుంది.


12.దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు యముడు మరియు దుష్ట గ్రహముల  నివాసము వుంటారు.దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.


13.గుండెపై చేయి వేసుకుని, చెట్టు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.


14.పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.


15. పడుకొని పుస్తక పఠనం  చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)


ఈ నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు

జీవితం అంటే

 వృద్ధాప్యంలోనూ యవ్వనమై ఉన్న జీవితం


గోదావరి తీరంలోని ఒక చిన్న గ్రామంలో వెంకటరెడ్డి, లక్ష్మమ్మ దంపతులు నివసించేవారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు నిశ్చయించిన పెళ్లి, అదృష్టం కొద్దీ ఒకరినొకరు అర్థం చేసుకున్న దాంపత్య జీవితం, పిల్లల పెంపకం, బాధ్యతల నడుమ కాలం ఎలా గడిచిందో తెలియలేదు.


వయస్సు పెరిగేకొద్దీ పిల్లలు పెద్దవాళ్లయ్యారు, వాళ్లు వాళ్ల జీవితాల్లో స్థిరపడ్డారు. కొంతకాలానికి ఇద్దరూ మాత్రమే మిగిలిపోయారు. కానీ, వెంకటరెడ్డికి ఒక ప్రత్యేకమైన గుణం ఉండేది – జీవితాన్ని అతి తేలికగా తీసుకునే స్వభావం.


"లక్ష్మమ్మా, మన జీవితానికి ఎప్పుడైనా లక్ష్యాలు పెట్టుకున్నామా? ఏమైనా సాధించాలన్న కోరికలు పెట్టుకున్నామా?"


ఆమె నవ్వుతూ, "ఇద్దరూ కలిసుండటమే మాకు గొప్ప సాధన" అని చెప్పేది.


మరుపు, నడకలో బలహీనత, ఆరోగ్య సమస్యలు – ఇవన్నీ వచ్చాయి. కానీ, వారి మనసులో మాత్రం వృద్ధాప్యం ఆవరించలేదు. ఎందుకంటే, వాళ్లకు ఏ ఆశలూ, కోరికలూ లేవు. భగవంతుడు ఎలా నడిపిస్తాడో అలా ముందుకు సాగుతూ, "మనకు ఏం అవసరం, ఏం కోల్పోయాం" అనే ఆలోచనే లేకుండా జీవించారు.


ఒక్కోసారి ఊర్లో వాళ్లు అడిగేవారు, "నాయనా, మీకు పిల్లలు పట్టించుకోవడం లేదా?"


వెంకటరెడ్డి ఆహ్లాదంగా నవ్వేవాడు, "భగవంతుడు పెట్టాడు, ఆయనే చూసుకుంటాడు! పిల్లలు, మనమంతా కేవలం నిమిత్తమాత్రులం."


ఈ భావనతోనే, వారు నిత్యం నవ్వుతూ, చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ, బడలిక లేకుండా జీవించారు. వృద్ధాప్యం అంటే బాధ అనుకునే వాళ్లకూ, ఈ జంట జీవన విధానం ఒక సందేశంగా మారింది. వాళ్లను చూసిన వారందరూ ఆశ్చర్యపోయేవారు – వెంకటరెడ్డి, లక్ష్మమ్మ వయసు మీద పడినప్పటికీ బాల్య ఉత్సాహంతో ఉండేవారు.


ఒక రోజు ఒక యువకుడు అడిగాడు, "తాతయ్యా, మీలో ఈ నవ్వు ఎక్కడిది?"


ఆయన మెత్తగా నవ్వి చెప్పాడు – "మనసును బాధల నుండి స్వచ్ఛంగా ఉంచితే వయసు ఏమీ కాదు బాబు! మనం బాల్యంలో ఎలా నిర్లక్ష్యంగా ఆనందంగా ఉండేవాళ్లమో, అలాగే ఉండాలి. అప్పుడే వృద్ధాప్యమూ, క్షీణతా తాకదు."


ఆరోజు ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళినప్పటికీ, వెంకటరెడ్డి మాటలు వేదాంతమై పదిలమైపోయాయి.


"జీవితం అంటే తీపి-వగరు కలిసిన స్వాదం. ఏది ఎక్కువగా అనిపిస్తుందో అది మన దృష్టినే కాదు, మన జీవితాన్నీ నిర్ణయిస్తుంది."

పోతన - భాగవతం 🙏

 🙏   పోతన - భాగవతం 🙏

                ఐదవ భాగం 


దితికి హిరణ్యకశిపుని హితబోధ- అమ్మా! ఉశీనర దేశానికి సుయజ్ఞుడు రాజు. అతడు శత్రువీరులతో వీరోచితంగా పోరాడుతూ యుద్ధంలో వీరమరణం పొందాడు. అతని నిడుపైన చేతులు తెగి నేలమీద ఎడంగా పడి ఉన్నాయి. శోణితం (నెత్తురు) చేత క్షోణి (భూమి) తలమంతా తడిసిపోయింది. తెగిపడిన తలజుట్టు ముడి విడిపోయింది. దివంగతుడైన ఆ భూపతి శవం చూసి భయాక్రాంతలైన అతని కాంతలు (రాణులు), బిడ్డలు, బంధువులు చుట్టుముట్టి హృదయ విదారకంగా రోదిస్తున్నారు. అవనీపతి (రాజు) అంత్యక్రియలకు అడ్డుపడుతూ, అంగలారుస్తూ అలమటిస్తున్నారు. ఇంతలో ఆదిత్యుడు అస్తమించే వేళ అయింది. ఆ సమయంలో వారి భీకర రోదన విని సమవర్తి, సంయమ చక్రవర్తి అయిన యమధర్మరాజు బాలవేషంలో వచ్చి నొచ్చుకుంటున్న ఆ ప్రేత బంధువులకు ఇలా

నచ్చచెప్పాడు.


ఉ॥ మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము, దేహి పుట్టుచుం

జచ్చుచునుండఁ జూచెదరు, చావక మానెడు వారిభంగి నీ

చచ్చిన వాని కేడ్చెదరు? చావున కొల్లక డాఁగవచ్చునే?

యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్‌


ఆహా! ఏమి ఈ మోహ మహిమ? ఇదెంత ఊహాతీతం! మీరెంత అజ్ఞానులు! మేను (దేహం) మీద మక్కువను ఇంత ఎక్కువగా పెంచుకొని కాలం తీరినవారి కోసం ఈ తీరున భోరున విలపించడం మిక్కిలి వింతగా ఉంది. ప్రాణులకు చావు పుట్టుకలు అపరిహార్యాలు- తిరుగులేనివి, తొలగించుకోజాలనివి. మీరు ప్రతినిత్యం కనేవి, వినేవే గాని ఎరుక లేనివేమీ కాదు కదా! ఈ మట్టి మీద పుట్టి గిట్టని వాడున్నాడా? సతులారా! మీకు మాత్రం అసలు మృతే (చావే)లేనట్లు మరణించిన వారికోసం ఇలా మతిలేకుండా ఇంతగా అతిగా వెత చెందుతున్నారు. చావుకు చిక్కకుండా ఎంచక్కా నక్కి (దాగి) ఉండేవాడు ఎక్కడైనా ఒక్కడన్నా ఉన్నాడా? ఎట్టి ప్రాణికైనా పుట్టిన చోటికి పోవడం ప్రకృతి సిద్ధమే కదా! జీవులకు పరమాత్మ స్వగృహం, ప్రపంచం పరగృహం!


ఆ॥ ధనము వీధి బడిన దైవ వశంబున

నుండుఁ బోవు మూలనున్న నైన

నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు

రక్షితుండు మందిరమునఁ జచ్చు!


బంధువులారా! నిధి (ధనం) నడివీధిలో జారిపడినా విధి (దైవ యోగం) వక్రించకుండా ఉంటే అది సడి-సవ్వడి లేకుండా పడినచోటే భద్రంగా ఉంటుంది. గీత-రాత చెడిపోతే గృహంలో గుట్టుగా దాచిపెట్టినా రట్టయి మట్టుమాయమై పోతుంది. రక్షణలేని దుర్బలుడైనా పుష్కరాక్షుని- భగవంతుని కృపావీక్షణం ఉంటే వనం- అడవిలో కూడా సులక్షణంగా వర్ధిల్లుతాడు. మాతృగర్భంలో అర్భకుని పోషించే హిరణ్యగర్భుని ఈ సందర్భంలో స్మరించుకోవాలి. వాని దయ లోపిస్తే ఎంత పదిలమైన భద్రత ఉన్న సదనం (గృహం)లో ఉన్నా నిధనం (మరణం) నిశ్చయమవుతుంది.


పై ఆటవెలది పద్యం మూలశ్లోకానికి దీటుగా సాగిన పోతనగారి ముచ్చటైన అనువాదం. పంచభూతాల సమూహమైన ఈ దేహం ఒక గేహం (గృహం) లాంటిది. ఇందు మోహంతో మురిసిపోతూ మసలుతూ ఉండే జీవుడు ప్రారబ్ధం తీరిపోగానే పయనమైపోతాడు. దేహం అనిత్యం, దేహి (ఆత్మ) నిత్యం. అరణి (కట్టె)లో దాగి ఉన్న అగ్నివలె, గాత్రం (దేహం)లో సంచరించే గాలివలె, బిసము (తామరతూడు)లో ఉన్న ఆకసం (శూన్యం, అవకాశం) వలె దేహంలో దేహి వేరుగా- అంటకుండా, విలసిల్లుతుంటాడు.


బ్రాహ్మణ బాలక రూపంలో ఉన్న యముడు బేలలై విలపిస్తున ఆ బాల (స్త్రీ)లకు ఇంకా ఇలా బోధించాడు- ఈ భూపాలకుడు (రాజు) నిద్రిస్తుంటే వెర్రి పట్టినట్లు విలపిస్తారేమిటి? ఇప్పటివరకూ అంటూ, వింటూ, కంటూ, తింటూ, మంటూ ఉన్న ప్రాణం పోయిందని మీరు భావించడం పెద్ద పొరపాటు. ఎందుకని? సుషుప్తి (గాఢనిద్ర)లో ప్రాణం ఉన్నా అది అంటున్నదా? వింటున్నదా?.. అనే, వినే, కనే, తినేవాడు జీవుడు- ఆత్మ. వాడు దేహ, ఇంద్రియ, ప్రాణాలకు విలక్షణం- వేరైనవాడు. ఆత్మ ఈ కాయాన్ని (దేహాన్ని) ధరించి ఉన్నంత వరకే కర్మయోగం. జీవుడు దేహాన్ని వదలగానే ఈ సంబంధాల బంధాలన్నీ తెగిపోతాయి. కాలం మూడితే ఎంతటి గుణం, ధనం, బలం కలిగినవాడైనా నేల కూలక తప్పదు. వాన రాకడ, ప్రాణం పోకడ తెలియదంటారుగా! కావున, కాంతలారా! ఇక క్రందించక వెళ్లిపొండి. ఇలా వందల వత్సరాలు కుందుతూ, కుములుతూ కూర్చున్నా మృతి చెందిన మీ పతిదేవుని మీరు పొందలేరు- ‘మృతిబొందిన వారలు చేరవత్తురే?’


ఇలా ధర్మజ్ఞుడైన కృతాంతు (యము)ని నితాంత (మిక్కిలి) ప్రశాంతి, విజ్ఞాన ప్రదాలైన మృదు వచనాలు విని సుయజ్ఞుని భ్రాంత (మోహిత)లైన కాంతలు, బంధువులు ఎంతగానో వింతకులోనై, అంతలోనే లోకంలో ‘అనిత్యమే నిత్యమనే శాశ్వత సత్యా’న్ని గ్రహించి శోకం మానుకున్నారు. తత్తరపాటు తొలగిపోగా కర్తవ్యం గుర్తించి సుయజ్ఞ మహారాజుకి ఉత్తరక్రియలు నిర్వహించి నిర్వికారంగా నిష్క్రమించారు. అంతకుడు కూడా ఆనందాంతరంగుడై అంతర్థానమయ్యాడు.


     మిగిలిన భాగాలు తరువాత అందిస్తాను                                   స్వస్తి 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

అఘోరీ_First_Part_1

 #అఘోరీ_First_Part_1

[ పెద్ద కథ--మొదటి భాగము ]

పక్కనే శంఖనాదం వినపడటంతో తలతిప్పి చూసిందామె. తనకు స్వాగతం చెబుతున్నారా అన్నట్టు ఓ పది మంది యువకులు వరుసలో నించొని శంఖాలు పైకెత్తి, అరమోడ్పుకన్నులతో బలంగా శంఖాన్ని పూరిస్తున్నారు. రంగురంగుల ధ్వజాలు ఆ చీకట్లో కూడా రెపరెపలాడుతూ  ముద్దలుగా పడుతున్న కాంతి వెలుగులో తమ రంగుల జిలుగులను వెదజల్లుతున్నాయి 

ఎక్కడ చూసినా కాషాయ మయం. అంటే తాను జనస్రవంతిని దాటి వచ్చేసినట్టేనా? కాదు, భక్తకోటిని దాటి మాత్రమే వచ్చింది. జన ప్రవాహము ఇంకా ఉంది. వందలూ, వేలూ కాదు.. లక్షల్లో ఉన్నట్టుంది. అర్ధరాత్రిళ్ళు తిరగటము అలవాటేకానీ, ఇంతమంది జనం మధ్యకు రావడము ఇదే మొదటిసారి. కానీ సంకోచము, అప్రమత్తత అనేవి ఆమె మొహంలో లేవు.  ఆమె తలతిప్పి చూసినపుడు కుడి చెవికి పెట్టుకున్న లోలాకు వింతగా కదలి అదొకరకమైన గంభీర భావాన్ని ప్రకటిస్తోంది. 

అన్ని లక్షల మందిలో తాను వెతుకుతున్నవారిని కనుక్కోగలదా? కనుక్కున్నా, గుర్తించగలదా?  తాను గుర్తించినా, వారు గుర్తిస్తారా?  అయినా, తాను వచ్చిన పనేమి?  చేస్తున్నదేమి? 

ఒక్క క్షణం న్యూనతగా అనిపించినా, తన కర్త వ్యా న్ని సరిగ్గా తెలుసుకొని నిర్వహించాలంటే ఇది కూడా తప్పనిసరి..... అని మళ్ళీ తానే సమాధానం చెప్పుకొని మందగమనముతో ముందుకు వెళుతోంది. ఎటువంటి తొట్రుపాటు, ఆత్రము లేవు. బయలుదేరినప్పుడు ఉన్న  జాగ్రత్త, తాను అన్న ఎరుకగానీ,  లజ్జ గానీ ఇప్పుడేమీ లేవు.  

తాను పూర్తిగా నగ్నంగా లేదు.  కానీ, నగ్నంగా ఉందేమో అనుకునేవారికి అవుననిపించేటట్టూ,  కాదేమో అనుకునేవారికి కూడా ఔననిపించేటట్టూ దట్టంగా బూడిద పూసుకొని, పుర్రెలు, రుద్రాక్షలు, ఇంకా పూసలతో చేసిన మాలలు , విరబోసుకున్న జడలు కట్టిన జుత్తు ఆమె ఒంటిపై బట్టలు ఉన్నాయో లేవో తెలీకుండా కప్పి ఉన్నాయి. 

శవాలు కాలుతున్న వాసన రానురాను దగ్గరైంది. జనాలు పలుచబడుతున్నారు. వారిని జనాలు అనకూడదేమో... సాధకులు, సాధువులు, సన్యాసులు, నాగా సాధువులు, సాధ్వీమణులు, అఘోరాలు,  అక్కడక్కడా తనలాంటి అఘోరీలు... అడుగడుగునా ఉన్నారు. ఎవరూ ఎవరినీ పట్టించుకోవటము లేదు. ఎవరి సాధన, అనుష్ఠానములలో వారున్నారు. కాళ్ళ కింద ఇసక ఇప్పుడు తడిగా అనిపిస్తోంది.  అంటే వచ్చేశానన్నమాట.  ఎక్కడ చూడాలి, ఎవరిని అడగాలి?  అసలు ఎవరినైనా అడిగితే ఏమనుకుంటారు?  తన మీద అనుమానం రాదూ? తనకు పేరు కూడా తెలియదాయె.  చూస్తే కూడా గుర్తుపడతానన్న నమ్మకము లేదు.  అసలు తనకు ఎందుకు ఈ ప్రస్థానము? గురూజీ కి చెప్పి వచ్చానన్న ధైర్యం ఒకటే తప్ప, తాను నియమాలు తప్పి ప్రవర్తిస్తోందా ?అన్న అనుమానం అప్పుడప్పుడూ కలుగుతోంది.  అలాగైతే గురూజీ వారించేవారు కదా? 

మనుషులు బాగా తగ్గిపోయారు. రాత్రి రెండో జాము చివరలో ఉన్నట్టుంది.  ఉన్నట్టుండి దూరంగా ఒక సంగీతం లాంటిది వినపడింది.  డప్పులు మోగుతున్నాయా?  కాదు, ఢమరుకాలు మోగుతున్నాయి. నల్లటి పొగ నదిపై తేలుతూ వెళుతున్నది ఆ అష్టమి వెన్నెల్లో బాగానే తెలుస్తోంది.  ఏదో పాట... తెలుగు పాట!! మనసు ఉరకలు వేసింది. ఆ పాట తనకు తెలుసు!!  చిన్నప్పుడు అమ్మ పాడేది.  

నలుపూ నరుడనీ నగుబాటు గురుడని..

నలుపు నారాయణుడు నగునూ కాదా.

సుక్కలు తెలుపు సూరీడు తెలుపు

సక్కన్ని నా తల్లే తగును కాదా? 

శంభుడు, శర్వుడు, సాంబ సదాశివుడు

రుద్ర రూపుడు శివుడు అగును కాదా? 

నియత నిరుపమ రేజసు కలది 

జిల్లేడు శాఖము తెగును కాదా 

ఎవరా పాడేది? దాదాపు అరవై యేళ్ళ కిందట తన తల్లి పాడిన పాట, ఇప్పుడు ఈ త్రివేణీ సంగమములో ఈ అపరాత్రి  కాలుతున్న శవం ముందర కూర్చొని ఆ పాడేది ఎవరు?  ఆమేనా జేజెమ్మ? జేజెమ్మ ఫోటో తాను చిన్నపుడు చూసి ఉంది.  అప్పట్లో ఆ ఫోటోలో ఆమెకు పన్నెండేళ్ళు ఉంటాయి. ఆ ఫోటో ఎప్పటిదో తెలీదు. అంతకు ముందు ఒక వందేళ్ళ వెనుకటిది అని చెప్పుకునేవారు.  అంటే వంద కు అరవై కలిపితే నూట అరవై. ఆమె వయసు నూట అరవై ఉంటుందా? ఇన్నేళ్ళు బతికిందా?  బతకడము ఆశ్చర్యమేమీ కాదు.  మూడు వందల యేళ్ళు బతికినవారినీ తాను చూసింది.  అలాగని అందరూ వందల యేళ్ళు బతుకుతారని ఎలా అనగలము?  మరి, మరి.... ఆ పాట?  చిన్నపుడు తన తల్లికి ఆమె అత్తగారు నేర్పిందట.  ఆ అత్తగారికి ఆమె అత్తగారు నేర్పిందట. ఆ పాట ఎప్పటిదో? చిన్నపుడు రేడియోలో కూడా వచ్చేదట.  అలా రేడియోలో విన్నవారు  ఎందరైనా ఉండచ్చు, ఎవరైనా కావచ్చు.. ఆ పాట నేర్చుకొని ఉండచ్చు.. ఇక్కడ పాడేది జేజెమ్మే అని ఎలా చెప్పగలను?  ఒక వేళ జేజెమ్మే అయినా, గుర్తుపట్టడం అసాధ్యం. ఇప్పటి ఆమె పేరు ఇంకేదో ఉంటుంది. చిన్నప్పటి పేరు  " కుముద్వతి " అని చెప్పేవారు. ఈమెకు ఆ పేరు గుర్తు ఉండి ఉంటుందా? 

కాలుతున్న శవం దగ్గరికి వచ్చింది. 

[ సశేషం ]


-- by Vibhatha Mitra

తెనాలిరామలింగని కీర్తి!!

 శు భో ద యం🙏


తెనాలిరామలింగని కీర్తి!!


 

లింగనిషిధ్ధు కల్వలచెలింగని, మేచకకంధరున్ త్రి

శూలింగని సంగతాళిలవలింగని కర్దమదూషితన్ మృ

ణాలింగని,కృష్ణచేలుని హలింగని నీలకచెన్ విధాతృ

నాలింగని రామకృష్ణకవిలింగని కీర్తిహసించు దిక్కులన్;


       అద్భుతమైన ఈచాటుపద్యము.

స్వోత్కర్షమైన రామకృష్ణుని పద్యమో లేక ఇతరకవుల ప్రశంసయోతెలియరాదు.

      ఇంతకూ ఈపద్యమున చెప్పబడినవిషయము తెనాలి రామకృష్ణునిదిగంతవ్యాప్తమైనకీర్తిని గురించి,కవిసమయమును బట్టి కీర్తి తెల్లని తెలుపు.కళంకరహితమై విశుధ్ధమైన యాతని తెల్లని కీర్తిదిగంతవ్యాప్తమై,

         చంద్రుని, పరమేశ్వరుని, లవలీలతను, తామరను  బలరాముని

లరస్వతిని గాంచి నవ్వుచున్నదట!

        చంద్రునిలోని మచ్చ, పరమేశ్వరుని నీలగళత్వము, లవలీలతపైవ్రాలుతుమ్మెదగమి,పుండరీకమునకు బురద,బలరామునకు నీలవస్త్రధారణ,సర్వస్వతియసితకేశపాశము. వారి శ్వేతతాలోపమునకు కారణమట!

    అట్టిలోపములేనిదగుట రామకృష్ణుని కీర్తి వానిని గాంచినవ్వుచున్నదని ఈపద్యసారాంశము.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నెగెటివ్ ఆలోచనలతో ఉండకండి..

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏           🌹జీవితంలో ప్రతీ విషయంలో నెగెటివ్ ఆలోచనలతో ఉండకండి.. నెగెటివ్ ఆలోచనలు మనసుని మరియు ఆరోగ్యాన్ని మన చెజేతుల మనమే పాడుచేసుకున్న వారం అవుతాము.. అందుకే కొంతలో కొంత అయిన పాజిటివ్ ఆలోచనలతో ఉండడం చాలా అవసరం మంచిది కూడా🏵️మనిషిలోని అహంకారాన్ని జయించటం అంటే ఓ బలమైన శత్రువును ఒడించినట్లే.. మితి మీరిన అహం జీవితం నాశనానికి దారి తీస్తుంది.. మనలో ఉన్న ఆహాన్ని  విడిచి పెట్టి అందరిని సమాన భావంతో చూసిన రోజున నీకు జీవితం రంగుల హరివిల్లు అవుతుంది🏵️మనిషి లో ఉండే అహం అనేది అగ్ని జ్యాల లాంటిది.. ఆ జ్యాల జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది..అహం ఉన్నవాడు జీవితంలో ఏదైనా కోల్పోవడం క్షణం పట్టదు.. కానీ సాధించాలంటే జీవిత కాలం పడుతుంది🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్  D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593.9182075510* 🙏🙏🙏