శ్రీరామ (96)
( భక్తి మార్కెట్ లో కొనేది కాదు. ఎన్నోజన్మలు సత్కర్మానుష్ఠానము చేసినందువల్ల భగవంతుని యందు భక్తి ఏర్పడుతుంది)
శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం//
(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).
-----------------
"భక్తి మార్గం చాలా సులభం" అని మనలో చాలా మంది అభిప్రాయం.
కానీ భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం కలగడం, భగవంతునియందు భక్తి జన్మించడం, అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అంటున్నాడు ప్రహ్లాదుడు.
ఆ విషయం ఇప్పుడు చెప్పుకుందాం.
హిరణ్యకశిపుడు,
"నాయనా!గురువుల దగ్గర ఏమి నేర్చుకున్నావు?"
అని ప్రహ్లాదుని అడిగాడు.
" నాన్నగారు! గురువులు నన్ను చక్కగా చదివించారు.
ధర్మార్థకామములకు సంబంధించిన అన్ని శాస్త్రములను చదివాను.
ఇవి గాక నేను ఇంకా ఎన్నో విషయములు తెలుసుకున్నాను.
అన్ని విద్యలలోని సారము గ్రహించాను.
తండ్రీ! త్రికరణశుద్ధిగా విష్ణువును ధ్యానిస్తూ, సారం లేని ఈ సంసారం వదిలేసి అరణ్యాలలో ఉండటం మంచిదని తెలిసింది.
విద్యలన్నిటి సారాంశం ఇదే"
అన్నాడు.
ఈ మాటలకు మండిపడ్డాడు హిరణ్యకశిపుడు.
" నీకీ బుద్ధి ఎవరు పుట్టించారు? " అని ప్రహ్లాదుని గద్దించాడు.
" తండ్రీ! విష్ణుభక్తి ఒకరు చెబితే వస్తుందా!
ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే విష్ణువు మీద భక్తి జన్మిస్తుంది" అన్నాడు ప్రహ్లాదుడు.
ఉ// అచ్చపు జీకటింబడి గృహ వ్రతులై విషయ ప్రవిష్టులై/
చచ్చుచు బుట్టుచున్ మరల జర్విత చర్వణులైన వారికిం/
జెచ్చెర బుట్టునే పరులు సెప్పిన నైన,నిజేచ్ఛ నైన నే/
మిచ్చిన నైన గానలకు నేగిన నైన హరి ప్రబోధముల్//
(తండ్రీ! అజ్ఞానపు చీకటిలో బడి,
సంసారం చేస్తూ,
విషయ భోగములలో కూరుకుపోయి,
జనన మరణాలకు లోనై,
అనుభవించిన ఆహార, నిద్రా, మైధునాదులనే తిరిగి, తిరిగి అనుభవించుచు,
పశుప్రాయులుగా ఉన్న మనష్యులకు, విష్ణుభక్తి ఒకరు చెబితే వస్తుందా?
తమంత తమకు తోస్తుందా?
డబ్బులిచ్చి కొనుక్కునేదా తండ్రీ నారాయణుని మీది భక్తి?
అంతేకాదు అడవులకు వెళ్ళి ముక్కు మూసుకున్నంత మాత్రాన భక్తి వస్తుందా?
ఎంత వెర్రి వాడవు!
ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే మాధవుని మీద భక్తి జన్మిస్తుంది ).
ఉ// కానని వాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్/
గానని భంగి, గర్మములు గైకొని కొందరు కర్మ బద్ధులై/
కానరు విష్ణు, గొందరట గందు రకించన వైష్ణవాంఘ్రి సం/
స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా! //
( గ్రుడ్డివాడు ఇంకొక గ్రుడ్డివాని సహాయంతో వస్తువులను చూడగలడా?
అలాగే కర్మబద్ధులై కర్మలనాచరిస్తున్న వారు విష్ణువును చూడలేరు.
విష్ణు భక్తుల పాదపరాగం శిరస్సుపై ధరించినందువల్ల పవిత్రులై,
కర్మలను త్యజించిన, కొంతమంది పుణ్యాత్ములు మాత్రమే నారాయణుని దర్శించగలుగుతారు).
శా// శోధింపంబడె సర్వ శాస్త్రములు రక్షోనాధ వేయేటికిన్/
గాధల్, మాధవ శేముషీ తరణి సాంగత్యంబునం గాక దు/
ర్మేధన్ దాటగ వచ్చునే సుత వధూ మీనోగ్ర వాంఛా మద/
క్రోధోల్లోల విశాల సంసృతి మహా ఘోరామి తాంభోనిధిన్//
(రాక్షసరాజా! లోకములో గల సమస్త శాస్త్రములు క్షుణ్ణంగా పరిశీలించాను.
ఈ సంసారము అనేది మహావిశాలమైన సముద్రం లాంటిది.
భార్యలు, భర్తలు, పిల్లలు, ఆ సముద్రము లోని తిమింగిలముల వంటి జలజంతువులు.
కొరికలు, గర్వము, క్రోధము అనునవి ఆ సముద్రములోని పెద్ద పెద్ద అలలు.
మహా ఘోరమైన ఈ సంసార సముద్రానికి ఒడ్డు అనేది లేదు.
అహంకార, మమకారములతో కలుషితమైన మన "బుద్ధితో" ఈ సంసార సాగరాన్ని దాటటం అసంభవం.
విష్ణు భక్తి అనే ఓడ ఉంటేనే దీనిని దాట గలం).
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
20-2-'26.