2, మే 2023, మంగళవారం

వైశాఖ పురాణం - 12 వ అధ్యాయము

 _*🚩వైశాఖ పురాణం - 12 వ అధ్యాయము🚩*_


🕉🪷🕉️🪷🕉️🪷🕉️🪷🕉️


*కుమార జననము*


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మన్మధుని దహించి శివుడంతర్ధానము చెందగా గిరిరాజ పుత్రికయగు పార్వతి నిరాశపడి యేమి చేయవలెనో తెలియనిస్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను జూచిన హిమవంతుడును భయపడి యామెను ఇంటికి జేర్చెను. పార్వతియు పరమశివుని రూపమును , ఔదార్యాదిగుణములను జూచి నాకితడే భర్త కావలయునని తలచెను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరింప నిశ్చయించెను. తల్లితండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకీ తపము వలదని వారించినను ఆమె మానలేదు.


పార్వతి గంగాతీరమును జేరి మహాలింగస్వరూపము నేర్పరచి నిరాహారియై జటాధారిణియై కొన్నివేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించెను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చెను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలిసికొని శివుని పరిహసించెను. నిందించెను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరము నిచ్చి యంతర్ధానమందెను.


శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచు వచ్చి శివుని యెదుట నిలిచిరి. శివుడు మీరు నాకై కన్యనిమ్మని హిమవంతుని  యడుగుడని చెప్పెను. సప్తర్షులు శివుని యాజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు నాకాశమార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వారి కెదురువెళ్ళి నమస్కరించి గృహములోనికి దీసికొని వచ్చి పూజించెను. వారిని సుఖాసీనులగావించి మీరు నాయింటికి వచ్చుటచే నేను ధన్యుడనైతిని. మీవంటి తపోధనులు నాయింటికి వచ్చుట నా తపఃఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములగు మీకు నా వలన కాదగిన కార్యము నాజ్ఞాపించుడని ప్రార్థించెను. అప్పుడు సప్తర్షులు నీవు మాటలాడిన మాటలు యుక్తములై యున్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్షప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీర త్యాగము చేసి నీ కుమార్తె పార్వతిగ జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరును ముల్లోకములయందును లేరు. ఆమె ఆనందమును కోరు నీవామెను పరమశివునకిచ్చి వివాహము చేయవలయును. వేలకొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమిప్పటికి నీకిట్లు ఫలించినది అని పలికిరి.


హిమవంతుడును సప్తర్షుల మాటలను విని నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు త్రినేత్రునకిచ్చితిని. మీరు పరమేశ్వరుని వద్దకు బోయి హిమవంతునిచే కుమార్తెయగు పార్వతి నీకు ఈయబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగ పరమానందముతో బలికెను. సప్తర్షులును హిమవంతుని మాటలను విని శివుని వద్దకు వెళ్లిరి. శివునకు హిమవంతుని మాటలను చెప్పిరి.


లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు , విష్ణు మున్నగు దేవతలు షణ్మాతలు , మునులు అందరును శివపార్వతుల కల్యాణ మహోత్సవమును జూడవచ్చిరి. శివుడును సర్వదేవతాగణములు , మునులు , షణ్మాతలు పరివేష్టించియుండగా వృషభ వాహనారూఢుడై వేదఘోషతో భేరీ మృదంగప్రభృతి వాద్యధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణమును చేరెను.


హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నమున పార్వతిని శివునకిచ్చి వివాహము గావించెను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యెను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో గలసి లోక ధర్మాను సారముగ సుఖించుచుండెను. పగలు సర్వ సంపత్సంపన్నమగు హిమవంతుని ఇంటను , రాత్రులయందు సరస్తీరముల యందు , పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు మనోహరములగు పర్వత సీమలయందును శివపార్వతులు స్వేచ్చావిహారములతో సుఖించుచుండిరి. ఈ విధముగ కొన్ని వేల సంవత్సరములు గడచినవి.


ఇంద్రుని శాసనముననుసరించి ఆ కాలమున సంయోగమున నేర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించెడిది. అందుచే శివుని కలయిక వలన పార్వతీదేవికేర్పడిన గర్భము శివపార్వతుల పునస్సమాగమముచే పోయెడిది. ఈ విధముగ గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతికి కలిగిన గర్భము నిలువకపోవుటచే పార్వతీ గర్భమున బుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశమున కెదురు చూచుచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారమధికమయ్యెను.


వారందరు నొకచోట కలిసికొని పరమేశ్వరుడు నిత్యము రతాసక్తుడై యున్నాడు. ఇందువలన గర్భములు నిలుచుట లేదు. కావున శివునకు పార్వతితో మరల కలయిక లేకుండునట్లు చేయవలయును. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి అగ్నిదేవా ! నీవు దేవతలకు ముఖము వంటివాడవు. దేవతలకు బంధువువు. నీవు ఇప్పుడు శివపార్వతులు విహరించుచోటకు పొమ్ము. రతాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరల కలయిక లేకుండునట్లు వ్యవహరింపుము. వారికి పునస్సంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రతాంతమున నిన్ను జూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరల పునస్సంగమముండదు. శివపార్వతుల రతాంతమున నీవు శివునకెదురు నిలిచి శిష్యుడవై వేదాంత విషయమును ప్రశ్నింపుము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగనైనచో గర్భవతియగు పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించిరి. అగ్నియు దేవతల ప్రార్థన నంగీకరించి శివపార్వతులున్నచోటకు బోయెను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగనే అగ్ని శివ పార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యెను. వస్త్ర విహీనయై యున్న పార్వతి అగ్ని రాకడను గమనించి సిగ్గుపడి బాధపడుచు చాటునకు బోయెను.


శివుడును పార్వతి తన దగ్గరనుండి దూరముగ వెళ్లుటచే అందుకు కారణమగు అగ్నిపై కోపించి మా సంగమమున కాటంకము చేసితివి. వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చట లేకుండుటకు నీవే కారణము. నా యీ వీర్యమును నీవే భరింపుమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్నియందుంచెను.


అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు యెట్లో దేవతల యొద్దక బోయి జరిగిన దానిని వారికి చెప్పెను. దేవతలును అగ్నిమాటలను విని శివ వీర్యము లభించినదని సంతోషమును , ఆ వీర్యమునుండి సంతానమెట్లు కలుగునని విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండిరూపమున పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దానిని ప్రసవించుటయెట్లు విచారపడిన అగ్ని దేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో గలసి గంగానది యొద్దకు పోయిరి. ఆమెను బహు విధములుగ స్తుతించిరి. నీవు మా అందరికిని తల్లివి. అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన నంగీకరించెను. దేవతలు అగ్నికి గర్భమున విడిపించుకొను మంత్రమునుపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచెను. గంగానదియు కొన్ని మాసముల తరువాత నా రుద్రవీర్యమును భరింపలేకపోయెను. దుర్భరమగు ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచెను. రెల్లు దుబ్బులోపడిన శివ వీర్యము ఆరు విధములయ్యెను.


బ్రహ్మ పంపగా వచ్చిన షట్ కృత్తికా దేవతలు ఆరు విధములుగ నున్న ఆ రుద్ర తేజస్సు నొకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు ఆరు ముఖములు కల పురుషాకారమై యుండెను. ఆరు ముఖములు కల ఆ రూపమచటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగు చుండెను.


ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభము నెక్కి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీస్తనములనుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతియు తన స్తనముల నుండి నిష్కారణముగ క్షీరస్రావము జరిగినందుల కాశ్చర్యపడి విశ్వాత్మకా ! నా స్తనముల నుండి క్షీరధారలిట్లు నిష్కారణముగ స్రవించుటకు కారణమేమని యడిగెను. అప్పుడు శివుడు పార్వతీ వినుము , పూర్వము మనము సంగమములో నుండగా అగ్ని వచ్చెను. అప్పుడు నీవతనిని జూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజమునగ్నియందుంచితిని. అగ్నియు దానిని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచెను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలో విడిచెను. ఆరు విభాగములైన ఆ తేజస్సును షట్ కృత్తికలు ఒకటిగా చేసిరి. అప్పుడు ఆరు ముఖములు కల పురుష రూపమయ్యెను. ఆ పురుష రూపమున్న చోటకు మనము వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడగుచేతనే నీ స్తనములు క్షీరమును స్రవించుటచే నితడే నీ పుత్రుడు. నా తేజస్సు వలన జన్మించిన వాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపుము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికెను.


పార్వతియు శివుని మాటలను విని యా బాలుని తనయుడి యందుంచుకొని తన స్తన్యమును వానికిచ్చెను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్ర వాత్సల్యమును చూసిన పార్వతి వానియందు పుత్రస్నేహమునంది యుండెను. ఈ విధముగా నా బాలుని దీసికొని ఆమె కైలాసమునకు వెళ్ళెను. పుత్రుని లాలించుచు నామె మిక్కిలి ఆనందమునందుచుండెను.


రాజా ! పరమాద్భుతమగు కుమార జననమును నీకు వివరించితిని. దీనిని చదివినను , వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు. సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగమును చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖవ్రతమును చేసి పూర్వము కంటె గొప్పవాడయ్యెను. కావున *వైశాఖమాస వ్రతము* అన్ని పాపములను పోగొట్టును , మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్తలేకపోవుటను , పురుషులకు భార్య లేకపోవుటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయినను మన్మధుడు అనంగుడైనను యే వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతడు సర్వోత్తముడు , భార్యా ద్వితీయుడు అయ్యెనో ఆ వైశాఖవ్రతము నాచరింపని వారికి వైశాఖ స్నానము చేయని వారికి , దానము చేయనివారికి వారెన్ని ధర్మముల నాచరించిన వారైనను కష్టపరంపరలనందుదురు. ఏ ధర్మముల నాచరింపని వారైనను వైశాఖ వ్రతము నాచరించినచో వారికి అన్ని ధర్మముల నాచరించినంత పుణ్యలాభము కలుగును.


*వైశాఖ పురాణం పన్నెండవ అధ్యాయం సమాప్తం*

           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

కుప్పింట

 కుప్పింట చెట్టుతో వైద్యం  - 


         ఇది వర్షాకాలంలో  ఖాళీ ప్రదేశాలలో  బాగా పెరిగే చెట్టు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒక జాతి యొక్క ఆకులు గుండ్రముగా ఉంటాయి. రెండోవది ఆకులు చివర కోణం కలిగి ఉండును. ఇవి రెండూ సమాన గుణాలు కలిగి ఉండును. 


    దీని ఉపయోగాలు మీకు వివరిస్తాను.


  *  దీని ఆకులు 9, మిరియాలు 9, కొంచం హారతికర్పూరం ( ముద్ద కర్పూరం ) కలిపి నూరి శనగ గింజ అంత మాత్రలు కట్టి ఉదయం , సాయంత్రం నీటితో తీసుకుంటూ పథ్యం చేస్తూ పాలు తీసుకుంటూ ఉండిన కామెర్లు హరించును 


  *  దీని ఆకు , వేరు కలిపి కషాయం లా చేసుకుని తాగినా లేక చూర్ణం లోల్లికి తీసుకున్న మొలలు నివారణ అగును. 


  *  ఆకుల పసరు పూసిన చర్మరోగాలు నయం అగును. 


  *  దీని ఆకుల పసరు గేదెవెన్నలో కలిపి ఇచ్చిన మూర్ఛరోగం నివారణ అగును.


  *  దీని వేరుతో దంతధావనం చేసిన దంతరోగాలు నశించును. 


  *  దీని ఆకు పసరు కండ్లలో లేక ముక్కులో పిండిన పిల్లలకు వచ్చు బాలపాపచిన్నెలు నివారణ అగును. 


  *  అదే పసరు చెవిలో పిండిన చెవిపోటు నివారణ అగును.


  *  దీని ఆకుల రసం ఒక స్పూన్ లొపలికి ఇచ్చిన వాంతులు చేయను. లొపల పేరుకున్న శ్లేష్మం బయటకి పంపును. బ్రాంకైటిస్ అనగా వగర్పు గల దగ్గు నివారణ అగును. 


  *  దీని ఆకు నూరి కట్టిన వ్రణాలు మానును . 


  *  తేలు , జెర్రి , కందిరీగ , తేనెటీగ కుట్టిన వెంటనే ఈ ఆకు వేసి కట్టు కట్టిన బాధ నివారణ అగును. 


  *  గోరుచుట్టు లేచినప్పుడు దీని ఆకు , వెల్లుల్లిపాయ , తమలపాకు కలిపి నూరి కట్టిన అది పగిలి మానిపోవును . 


  *  పుప్పిపంటికి  దీని ఆకు నలిపి పుప్పిపంటిలో ఉంచిన బాధ తగ్గిపొవును.


  *  పురుగులు పట్టిన వ్రణములకు మొక్కని నీడలో ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణం చల్లిన పురుగులు నశించి పుండ్లు మానును . 


  *  దీని చూర్ణం నస్యం వలే లొపలికి పీల్చిన మెదడులో గడ్డకట్టిన రక్తం కరుగును.


 

     మరింత సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


చర్మవ్యాధుల గురించి

 చర్మవ్యాధుల గురించి సంపూర్ణ వివరణ  - 


 చర్మవ్యాధులు రావడానికి గల కారణాలు  - 


  *  విరుద్ధములగు అన్నపానములు తినటం అనగా పాలతో తయారైన సేమ్యా , కోవా , ఐస్ క్రీం తిని పెరుగన్నం తినటం లేదా చల్లని కూల్ డ్రింక్ ని  వేడిఅన్నం , కూరలు కలిపి తినటం ఇలాంటి ఆహారపు అలవాట్లు పాటించటం . 


 *  మలమూత్రాలను ఆపడం , అదేవిధముగా వాంతి వంటి సహజ వేగాలను బలవంతముగా నిరోధించడం . 


 *  భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయుట , ఎండలో తిరుగుట చేయరాదు . 


 *  ఎండలో తిరిగి వచ్చి చల్లని నీరు తాగరాదు . 


 *  అతిగా శ్రమపడి వచ్చి వెంటనే నీటిని సేవించరాదు . 


 *  అజీర్ణముగా ఉండగా మరలా భుజించరాదు . అనగా ముందు తిన్నది సంపూర్ణముగా అరగక ముందు మరలా భోజనం చేయరాదు . 


 *  కొత్తబియ్యపు అన్నం , పెరుగు మరియు చేపలు కలిపి తినరాదు . 


 *  అధికంగా పులుపు , ఉప్పు తినరాదు . 


 *  మినుములు , ముల్లంగితో చేయబడిన వంటలు , పాలు నువ్వులతో చేసిన వంటలు ఎక్కువుగా తీసుకొనుట 


 *  తినిన ఆహారం జీర్ణం కాకముందే దాంపత్యములో పాల్గొనుట చేయరాదు . 


 *  పగలు నిద్రించరాదు . పగలు నిద్రించుట వలన శరీరం నందు శ్లేష్మము పెరిగి దానివలన రక్తప్రసరణకు అవరోధము కలిగి చర్మమునకు రక్తప్రసరణ సరిగ్గా జరగక చర్మవ్యాధులు సంభవించును . ఎండాకాలం కొంచంసేపు పగలు నిద్రించవచ్చు . 


        పైన చెప్పినవిధముగా విరుద్ధమైన ఆహారం , పనులు చేయుటవలన శరీరంలో చర్మము , రక్తము , మాంసము , లింప్ గ్రంథులు దోషమును పొంది రకరకాల చర్మవ్యాధులు కలుగును. 


  చర్మవ్యాధులు రావడానికి పూర్వము కనిపించు లక్షణములు  - 


 *  స్పర్శజ్ఞానం క్రమేపి తగ్గిపోవుట . 


 *  చెమట ఎక్కువుగా పట్టుట లేదా చర్మవ్యాధి ప్రదేశము నందు అసలు చెమట పట్టకపోవును . 


 *  శరీరవర్ణము మారి నల్లబారిపోవుట . 


 *  దద్దుర్లు . 


 *  పోట్లు . 


 *  అలసట , వడలినట్లు అగుట. 


 *  వ్రణములు లేచి అధికభాధతో కూడి శీఘ్రముగా  

      జనించి త్వరగా మానకుండా ఉండటం. 


 *  తాపము ( చర్మం అంతా మంటలు ) . 


  అసాధ్య చర్మవ్యాధి లక్షణములు  - 


 *  రోగి బలహీనుడుగా ఉండి దప్పిక , మంట ,   అగ్నిమాంద్యములతో కూడి క్రిములు ఏర్పడిన అసాధ్యము . 


 *  చర్మవ్యాధి ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన     

      అసాధ్యము . 


  చర్మవ్యాధుల యందు చికిత్సాక్రమము  - 


        శరీరము నందలి వ్యర్ధపదార్ధముల వలన చర్మవ్యాధులు వచ్చును . కాబట్టి వానిని వివిధరకాల పద్ధతుల ద్వారా వాంతి , విరేచనం మొదలగు శోధన పద్ధతులను ఉపయోగించి వ్యర్ధాలను బయటకి పంపుతూ ఔషధాలను ఇయ్యవలెను . 


  చర్మవ్యాధుల యందు పథ్యము  - 


  *  తేలికగా అరిగెడి ఆహారం తీసికొనవలెను . 


  *  త్రిఫలములు - ఉశిరి , కరక్కాయ , తానికాయ 

       విరివిగా వాడవలెను . 

  

  *  త్రిఫలా ఘృతము కూడా వాడవచ్చు . 


  *  పాతధాన్యములు వాడవలెను . 


  *  యవలు , చామలు , కొర్రలు , కందికట్టు , పెసర 

       కట్టు , మేకమాంసం వాడవలెను . 


  *  బీరకాయ , పొట్లకాయ , దోసకాయ , పెరుగు 

      తోటకూర , పొన్నగంటికూర , మెంతికూర , ఆవు 

       నెయ్యి , తెల్ల గలిజేరుకూర , తేనె , నీరుల్లి . 


           పైన చెప్పిన పదార్ధాలు ఆహారంలో తప్పక భాగం చేసుకొనవలెను . 


  చర్మవ్యాధుల యందు అపథ్యము  - 


 *  చింతపండు పులుపు , అతిగా కారం , ఆవాలు , 

      గుమ్మడి , వెల్లుల్లి , పెరుగు , పాలు . 


 *  బెల్లం , కల్లు , సారాయి , నువ్వులు .


 *  మినుములు , చెరుకురసము , పానకము .


 *  చేపలు , నీటిపక్షులు , కోడి మాంసం , పావురం .


 *  అతిగా వ్యాయామం , స్త్రీసంభోగం చేయరాదు .  


          పైన చెప్పినవిధముగా ఆహారపు అలవాట్లు పాటిస్తూ సరైన వైద్యుడి పర్యవేక్షణలో ఔషధాలు సేవించుచున్న చర్మవ్యాధుల నుంచి త్వరగా బయటపడగలరు. ఇక్కడ మనం ముఖ్యముగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయము ఏమిటంటే వ్యాధి సంప్రాప్తినిచ్చిన తరువాత ఔషధాలు సేవించుట కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే అత్యంత ప్రధానమైనది. 


   మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    

ఖాళీలు పూరిద్దామా! 'గ' పదాలతో

 *ఖాళీలు పూరిద్దామా!  'గ'   పదాలతో...*

      


1. పెద్ద నిమ్మకాయలను ____కాయలు అంటారు

2. ____గణపతియే నమః.

3. బావిలోని వస్తువులు_____తో తీస్తారు.

4. ___ లేని అమ్మకు గంజే పానకం.

5. ఆమెకు కొంచెం ___ఎక్కువే.

6.____దాటిన సీత పాట్లు మనకు తెలుసు.

7. నువ్వు  ___పెట్టి అరిచినా నేను వినను.

8.హిమవంతుని కుమార్తె ____.

9.______శబ్దం కుండకు నష్టం.

10. _____చెయ్యడం అంటే ఎగతాళి.

11. ___అంటే  గోవు.

12. పంట  నిలువ చేసేది_____ అంటారు.

13. _____కింద పందికొక్కు.

14.______పూసింది కొమ్మ లేకుండా.

15._____లు కొండంతలు చెయ్యకు.

16.______మనే గుండె నృపులకు. ఝల్లుమనే జానకీ దేహము.

17.చిన్న పిల్లలు_____ వండి విందు చేసుకుంటున్నారు.

18.పూజారి ___నామాలు అడుగుతున్నారు.

19.   ____సౌలభ్యం కొరకు పాలు మిరియాలు.

20.మర్రిచెట్టు తొర్రలో ____గాడి గూడు.

21.____కు ఓటమి మొదటి మెట్టు.

22. ____ లేనివిద్య గుడ్డి విద్య.

23.వనభోజనాలు ___పొయ్యి మీద వండుతారు.

24.కృష్ణుని____ధారి అంటారు.

25.వేసవిలో ___లతో పచ్చీస్ ఆడతాము.

26.మొగలిపూవు ఎక్కడున్నా____ పరిమళం వెదజల్లుతుంది.

27.గాడిద కే మెరుక____ వాసన.

28.పిల్లలు____  కజ్జాలు పెట్టుకుంటారు.

29. ____ గజ్జెల కేడిస్తే, వీపు దెబ్బల కేడ్చిందట.

30.పండిత____ లు జరుగుతున్నవి తిరుపతి లో.

 *ప్రారంభించండి*

అరవై లో ఇరవై లా

 అరవై లో ఇరవై లా ఉండాలంటే పాటించాల్సిన పది చిట్కాలు (యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్ ఆగ్రా )


60 దాటారంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే 100 కి   11 మంది మాత్రమే 60 దాట గలుగుతున్నారు. ఏడు మంది మాత్రమే 65 దాటి 70 చేర గలుగు తున్నారు.

 మీరు ఆనందంగా ఉండడానికి పది చిట్కాలు

 1. దప్పిక అనిపించినా లేకున్నా నీరు తాగుతూ ఉండాలి. రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.

 2.  ఆడతారో, తిరుగుతారో, నాట్యం చేస్తారో  మీ ఇష్టం కదులుతూ ఉండండి. లేకపోతే కీళ్ల న్నీ బిగుసుకుపోతాయి .

3 . బ్రతకడానికి తినండి తినటానికి బ్రతకకండి పిండి పదార్థాలు బాగా తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం తినండి. ముఖ్యంగా రాత్రిపూట పిండి పదార్థాలు బాగా తగ్గించాలి.

 4.  వీలైనంత వరకు నడవండి లేదా సైక్లింగ్ చేయండి 100 నుంచి 200 మీటర్ల దూరం వాహనం వాడకండి, నడవండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎలివేటర్ వాడొద్దు రైల్వేస్టేషన్లలో ఎస్క లేటర్లు వాడొద్దు వాహనాలు వాడొద్దు. మెట్లు ఎక్కండి రాంప్ పై నడవండి.

 5. కోపం తగ్గించండి. తక్కువ మాట్లాడండి. మీ నివాస ప్రాంతంలో " కోప నిషేధ స్థలం " బోర్డు పెట్టండి. అది  మీకు కోపం రాకుండా ఉంచుతుంది.  మీ చుట్టూ ఉన్నవారికి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది.

 6. ధనం పై  వ్యామోహం వదిలిపెట్టండి జీవనానికి అవసరమైనంత వరకు మాత్రమే సంపాదించాలి డబ్బు వెంట మీరు పరిగెత్తకండి డబ్బు మీ వెంట పరిగెత్తాలి .

7 మీరు కోరుకున్నది  దక్కకపోతే బాధపడకండి. నిన్ను నీవు దూసించుకో వద్దు. దానిని మర్చిపోండి.

 8 డబ్బు, తెలివి, సౌందర్యం, అధికారం, కులం, పదవి వీటి వల్ల అహంకారం పెరుగుతుంది. దీనిని వదిలిపెట్టాలి దీనికోసం పై వాటిపై  నియంత్రణ సాధించాలి‌. వినయంగా ప్రజలతో ప్రేమగా ఉండాలి. ఆనందంగా నవ్వుతూ గడపాలి అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు.

 9. తెల్ల జుట్టు గురించి ఆందోళన వద్దు. కాళ్లు అనుమతించి నంతకాలం యాత్రలు చేయండి ఆనందంగా ఉండండి తెల్లజుట్టు వార్దక్యానికి సంకేతం కాదు. 

10. అందరితో స్నేహంగా కలిసి మెలిసి ఉండండి ఒక్కోక్కప్పుడు చిన్నవారే మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు . నేను పెద్దవాన్ని అందరు నాకు నమస్కరించాలి, గౌరవించాలి అని ఆశించకండి‌ నిశ్శబ్దంగా ఉన్న వారిని కూడా ఆప్యాయంగా పలకరించండి.

 ఈ 10 చిట్కాలు పాటించండి. 

గమనించండి మీ జీవితం ఎంత హాయిగా, ఆనందంగా, యవ్వనంగా గడిచిపోతుందో.....     ఆకెళ్ళ రామ కృష్ణ.      పాదగయా క్షేత్రము  పిఠాపురం

వైశాఖ పురాణం - 11 వ అధ్యాయము🚩*

 _*🚩వైశాఖ పురాణం - 11 వ అధ్యాయము🚩*_ 


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹🕉️


*రతి దుఃఖము - దేవతల ఊరడింపు*


🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది ? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను.


కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని , పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము.


శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను.


ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని ఊరడించుచునిట్లనెను. అమ్మా నేను నీ పుత్రునివంటివాడను. పుత్రుడనగు నేనుండగ నీవు సహగమనమొనర్ప వలదు. అని వసంతుడు బహువిధములుగ జెప్పినను రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింప లేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీతీరమున యేర్పరచెను ఆమె గంగాస్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తిచేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి కల్యాణీ పతిభక్తిమతీ ! అగ్ని ప్రవేశము చేయకుము. శివుని వలనను , శ్రీకృష్ణావతారము నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు. రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీ దేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని యింటనుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడునీతో గలసి శంబరాసురుని యింటనుండగలడు. ఆ విధముగ నీకు భర్తృసమాగమము కలదు. అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బ్రహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు ఆచటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతిదేవిని బహువిధములుగ నూరడించిరి. ఆమెకు అనేక వరములనిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రము యధాపూర్వముగ కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి యూరడించి పెక్కు ధర్మములను నుపదేశించి ఇట్లనిరి.


కల్యాణీ ! పూర్వజన్మలోనితడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖమాసమున గంగాస్నానము చేయుచు వైశాఖ వ్రతము నాచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతఃకాలమున గంగాస్నానము చేసి శ్రీమహావిష్ణువును అర్చింపుము. పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతము నాచరించు విధమును చెప్పి దేవతలు వెళ్లిరి.


రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును మ్రింగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున వైశాఖవ్రతము నాచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యధాపూర్వముగ సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగనుండెను. అప్పుడతడు వైశాఖవ్రతము చేయలేదు. వైశాఖదానములను చేయలేదు. అందుచే నితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖవ్రతము నాచరింపకపోవు వలన నిట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలయును ? కావున ఇహలోక సుఖముల నాశించువారు అందరును తప్పక వైశాఖవ్రతము నాచరింపవలయును సుమా !


*వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం సంపూర్ణం*

            🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

స్థితప్రజ్ఞుడే

 సుభాషితమ్


శ్లోకంII


ఆపూర్యమాణ మచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్ | తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే స శాన్తిమాప్నోతి న కామకామీ ॥


తా|


"సముద్రం నింపబడుతూనే ఉంటుంది.... నిశ్చలంగా ఉంటుంది. జలం దానిలో చేరిననూ దానిని కదిల్చలేవు..... అదే రీతిగా భోగములు లభించినప్పటికీ నిర్వికారంగా ఉండే స్థితప్రజ్ఞుడే కోరికలకు దూరమై సుఖశాంతులను పొందగలడు ".


సేకరణ:- శ్రీ శర్మద గారి వాట్సాప్ పోస్ట్ 

ఆర్య చాణక్య

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 48*


"మహాజనులారా ! రండి. మా గురుదేవుల వారి అత్యద్భుత శక్తి సామర్థ్యాలను గ్రహించండి. వారి రక్షణ పొంది మీకు గల దీర్ఘరోగాలనుండీ భూత ప్రేత పిశాచ బాధల నుండి విముక్తి పొందండి. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించండి. రండి. కదలిరండి... వేలాదిగా తరలి రండి ... గురుదేవుల వారి దర్శనం చేసుకుని తరించండి..." అంటూ నడివీధి మధ్యన నిలచి బిగ్గరగా ప్రచారం ప్రారంభించాడు ఒక శిష్యుడు. జనం క్రమక్రమంగా అతని చుట్టూ మూగి ప్రశ్నల వర్షం కురిపించసాగారు. 


"మా గురువుగారి పేరు జీవసిద్ధి. వారు అఖండ ప్రజ్ఞావంతులు. దైవాంశ సంభూతులు. ఆయనతో దేవుడు మాట్లాడుతుంటాడు. దుఃఖ పీడితులకు తరుణోపాయాన్ని ఆ దేవుడే మా గురువర్యులకు తెలియజేస్తుంటాడు." అని చెప్పాడతడు ఉద్విగ్న స్వరంతో. 


జనం ఆశ్చర్యపోతూ "మీ గురువుగారితో దేవుడు మాట్లాడుతుంటాడా ? ఆయన అంతటి మహిమాన్వితుడా ? ఆ మాట నమ్మేదెట్లా ?" అనడిగారు. 


"ఇక్కడే ! ఇప్పుడే ! మీ అందరి సమక్షంలో గురుదేవుల మహత్తుని నిరూపిస్తా... అగ్నిగుండం ఏర్పాటు చేయించండి ..." అన్నాడా శిష్యుడు గంభీరంగా. 


ఆ వింత ఏమిటో చూద్దామనుకుని కొందరు అప్పటికప్పుడే అక్కడే అగ్ని గుండాన్ని ఏర్పాటు చేశారు. అగ్ని గుండంలో చండ్ర నిప్పులు కణకణమండుతున్నాయి. 


"రండి... నా అరికాళ్ళను ఎవరైనా పరీక్షించండి" అన్నాడా యువకుడు. 


జనంలో నుంచి ఎవరో వెళ్లి అతని పాదాలను చేతులతో తాకి, పరీక్షించి ...

"అందరిలాగే... మామూలు పాదాలే..." అని ప్రకటించాడు. 


"ఇప్పుడు నేను ఇందరి సమక్షంలో ఆ అగ్నిగుండం మీద నుంచి సురక్షితంగా నడిచి మా గురుదేవుల మహత్యాన్ని నిరూపిస్తాను" అని ప్రకటించి, ఆ శిష్యుడు తలెత్తి ఆకాశం వైపు చూస్తూ... 

"జై గురుదేవా ! ఈ పరీక్ష నాకు కాదు. మీకే... దూకనా ? ఈ అగ్నిగుండంలో దూకనా ?" అని అరిచాడు. 


అతడు ఆకాశంలో ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి అందరూ తలెత్తి ఆకాశం వైపు ఉత్కంఠంగా చూశారు. వాళ్ళ కళ్ళకి ఎవ్వరూ కనిపించలేదు. ఆ క్షణంలోని ఆ శిష్యుడు తన అరచేతులకి అంటి ఉన్న 'మండూకవసతో కలిపిన తైలాన్ని' అరికాళ్ళకు చాలా వేగంగా, నేర్పుగా రాసుకున్నాడు. అరక్షణంలో జరిగిన మోసాన్ని ఎవ్వరూ గమనించలేదు. 


"అగ్నిలో దూకడానికి అనుమతించారా గురుదేవా ! సరే ... " అంటూ అతడు తలదించి "గురుదేవుల అనుమతి లభించింది. ఇక చూడండి మహత్తు... జై గురుదేవా.... !" అని అరుస్తూ అతడు నిప్పుల మీద కాళ్ళూ పెట్టాడు. అందరూ గుడ్లప్పగించి చూడసాగారు.


"జై గురుదేవా ! జై జై గురుదేవా !" అని స్మరిస్తూ అతడు నెమ్మదిగా ఒక్కొక్క అడుగే నిప్పుల మీద వేస్తూ, ముఖంలో ఏ మాత్రం భయం, బాధ లేకుండా అగ్నిగుండంమీద ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ నడుచుకుంటూ వచ్చి తన కాళ్లు ఒకదాని తర్వాత మరొకటి పైకెత్తి అరికాళ్ళను ప్రదర్శించాడు. అతడి అరికాళ్ళు నిప్పుల్లో కాలిన సూచనలేవీ లేకుండా మామూలుగా, సహజంగా కనిపించాయి. 


అతడు తన పాదాలను మార్చి మార్చి చూపిస్తూ "చూశారా ! చూస్తున్నారా ! నాకీ ' అగ్నిగమన ' సిద్ధిని నేర్పిన వారు మా గురుదేవులు జీవసిద్ధి మహాశయులు. వారి మహత్తు అపారం. వారి హృదయం దయాసముద్రం. ఆర్తులు, రోగార్తులంతా వారిని ఆశ్రయించండి. వారి అనుగ్రహాన్ని పొందండి. జై జీవ సిద్ధి గురుదేవా !" అని అరిచాడు. 


"జై .... జీవసిద్ది గురుదేవులకు జై !" అని అరుస్తూ, ఉత్సాహంతో నినాదాలు చేసుకుంటూ జనం తండోపాతండాలుగా జీవసిద్ధి ఆశ్రమంవైపు పరుగులు తీశారు. 


(ఇంకా ఉంది)...🙏


సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌹