9, మే 2026, శనివారం

వ్యాఘ్ర గోమాయి సంవాదం*

 

*వ్యాఘ్ర గోమాయి సంవాదం*                             వ్యాసభారతం శాంతి పర్వం 11వ అధ్యాయం.

పూర్వకాలం సుసంపన్నమైన పురిక అనే పేరు గల పట్టణంలో పౌరికుడు అను ఒక రాజు ఉండేవాడు. అతడు క్రూరుడు. నరాధముడు. ఇతరులను హింసించడం వేడుకగా భావించేవాడు. అతడు ఆయువు తీరగానే ఎవరునూ కోరుకొనని గతిని పొందాడు. పూర్వ కర్మల వలన నక్క జన్మను పొందాడు. పూర్వజన్మ వైభవం స్మరించుకొని పరమ నిర్వేదమును పొందినాడు. ఇతరులు తెచ్చి ఇచ్చిన మాంసమును కూడా తినెడివాడు కాదు. సర్వప్రాణులను శిక్షించడం మానుకొన్నాడు. సత్యభాషణమును పాటించుచూ ఆ వ్రతాన్ని మిక్కిలి నియమంగా కొనసాగిస్తున్నాడు. చెట్లనుండి రాలిన పళ్ళనే నియమిత సమయాలలో ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాడు. నియమంగా వ్రతాన్ని పాటిస్తున్నప్పటికీ ఒక్కొక్కసారి ఆకులను ఆహారంగా తీసుకొంటూ ఒక్కొక్కసారి నీటితో గడపుచూ సంయమనంతో ఉంటున్నాడు. స్మశానమే ఆ నక్కకు నివాస స్థానం అయినది. అదే దానికి ఇష్టమైనది జన్మభూమి అనే పట్టింపు వల్ల ఇతరత్రా నివసించడానికి ఇష్టపడలేదు. ఆ నక్క యొక్క సదాచారములంటే గిట్టక తోడబుట్టిన నక్కలన్నీ వినయంగా నమ్మకంగా మాటలాడుతూ దాని బుద్ధిని చలింప చేయాలని ప్రయత్నించాయి. నీవు మాంసాహారివై ఉండి శ్మశానంలో నివసిస్తూ పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నావు. ఇది విపరీతంగా ఉంది  కాబట్టి నీవు మాతో సమానంగా ఉండు. నీకు భోజనం మేము పెడతాము. తిను. నీ సదాచారాలు వదలిపెట్టు. నీ జాతి వారికి ఏది ఆహారమో అదే నీకు ఎప్పుడు ఉండుగాక. అని పలికిన వాటి మాటలు విని ఆ నక్క ఏకాగ్రతతో మధురంగా వివరంగా యుక్తియుక్తంగా మృదువైన మాటలతో ఇలా బదులిచ్చింది. (సశేషం)

*శ్రీ మహావిష్ణు పురాణం*

 

      *శ్రీ మహావిష్ణు పురాణం*                                  

              *82వ భాగం*


*శ్రీరామావతారం -3*

*తాటకి సుబాహువుల వధ *అహల్యా శాప విమోచనం*```


దశరథుడు తనకు అతిప్రియమైన శ్రీరామునితో ఎక్కువ కాలం ఉండలేక పోయాడు. ఒకరోజు దశరథుని రాజసభకు కార్యార్థియై విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. 


దశరథుడు మహర్షిని సాదరంగా స్వాగతం పలికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఉచితాసనుని చేసి నమస్కరించి “వచ్చిన కార్యం ఆజ్ఞాపించమని” వినయంగా అడిగాడు.


విశ్వామిత్రుడు దశరథునితో “రాజా! విశ్వశాంతి కోసం నేను యాగం చేస్తూ యాగదీక్ష తీసు కున్నాను. నా యాగాన్ని తాటకి అనే రాక్షసి, ఆమె కుమారులు మారీచ సుబాహువులు అనేక విఘ్నాలు కల్పిస్తూ పూర్తి 

కానివ్వకుండా చేస్తున్నారు. యాగదీక్షలో ఉన్న నేను అస్త్రశస్త్రాలు, తపశ్శక్తి వినియోగించలేను. రాక్షసులను సంహరించి యాగం సమాప్తి చేయడంలో నీ సహాయం కోరి వచ్చాను” అని తను వచ్చిన పని చెప్పాడు.


దశరథుడు వెంటనే “మహర్షీ! నా సమస్త సైన్యం తమ వెంట పంపుతాను” అనగానే విశ్వామిత్రుడు వద్దన్నాడు. 


"నేనే స్వయంగా వస్తాను" అని దశరథుడు అంటే విశ్వామిత్రుడు "రాజు రాజ్యంలో ఉండాలి. 

నీ అవసరం లేదు" అన్నాడు. 


దశరథుడు సందేహంగా "మరి ఏమి కావాలి మహర్షీ!" అని అడిగాడు.


అప్పుడే రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వచ్చాడని తెలిసి దర్శనానికి వచ్చి మహర్షికి నమస్కరించారు. 


విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆశీర్వదించి దశరథుని వంక చూసి "నీ తనయుడు శ్రీరాముని నాతో పంపించుము! యాగ రక్షణకు రాముడు ఒక్కడు చాలును" అని అడిగాడు.


దశరథుడు ఉలిక్కిపడ్డాడు. "పసివాడు రాముడు రాక్షసులను సంహరిస్తాడా! వసిష్టాశ్రమం నుండి వచ్చి కొద్ది సమయమే అయ్యింది. ఇంతలో తిరిగి ప్రియ పుత్రుని, పసివానిని మునితో రాక్షస సంహారానికి పంపడమా!" అనుకుని విశ్వామిత్రునితో “మహర్షీ! పసివాడు రాముడు మొన్ననే వసిష్టాశ్రమంలో పదహారేళ్ళు విద్యాభ్యాసం చేసి వచ్చాడు. బాలుని వలన రాక్షస సంహారం ఏమవుతుంది? నేను సకల సైన్యాలతో వచ్చి యాగరక్షణ చేస్తాను. అంగీకరించండి" అని ప్రాధేయపడ్డాడు.


“శ్రీరాముడు తప్ప అన్యులు నాకు వద్దు. లేదంటే వెళ్లిపోతాను. మాట ఇచ్చి తప్పిన ఇక్ష్వాకు వంశపు మొదటి రాజువి అవుతావు" అని విశ్వామిత్రుడు కోపంగా లేచి వెళ్ళబోయాడు. 


వంశగురువు వసిష్ట మహర్షి లేచి విశ్వామిత్రుని ఉండమని చెప్పి దశరథునితో “దశరథా! తలచుకుంటే విశ్వామిత్ర మహర్షి క్షణంలో రాక్షస సంహారం చేయగలడు. అటువంటి మహాశక్తి సంపన్నుడు అడుగుతుంటే ధైర్యంగా రాముని పంపించుము. శ్రీరాముడు విశ్వామిత్రుడి వలన అనేక మహిమాన్విత శస్త్రాస్త్రాలు పొంది జగదేక వీరుడు అవుతాడు. రాక్షస సంహారంతో శ్రీరాముని కీర్తి దశదిశల వ్యాపిస్తుంది" అని నచ్చచెప్పి శ్రీరాముని విశ్వామిత్రునితో పంపించడానికి ఒప్పించాడు.


దశరథుడు రాముని వెంట రావడానికి లక్ష్మణుడి అనుమతించమని కోరగా విశ్వామిత్రుడు అంగీకరించాడు. 


రామలక్ష్మణులు తండ్రికి, వసిష్ట మహర్షికి నమస్కరించి అనుమతి, ఆశీస్సులు తీసుకుని విశ్వామిత్రుని వెంట బయలుదేరి వెళ్లారు. చీకటి పడే సమయానికి సరయూనది అవతల తీరంచేరి విశ్రమించారు. మహావిష్ణువు అవతార కథలు విశ్వామిత్రుడు ఆ రాత్రి రామలక్ష్మణులకు వినిపించాడు.


మరుసటి రోజు ఉదయాన్నే శ్రీరామ లక్ష్మణులను నిద్ర లేపి స్నానసంధ్యలు పూర్తి చేయించాడు. తరువాత వారిరువురిని తనకు అభిముఖంగా కూర్చోబెట్టి రాముని వంక చూసి "రామా! దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నీవు మహావిష్ణు స్వరూపంగా భూమిపై అవతరించావు. రాక్షస దానవ సంహారం కోసం మీ అన్నదమ్ములకు బల,అతిబల, మహాబల మొదలైన మహావిద్యలతో పాటు బ్రహ్మ ఇంద్ర అగ్ని వరుణ మొదలైన దేవతల శక్తుల గల దేవతాస్త్రాలను ప్రయోగ ఉపసంహార మంత్రాది పూర్వకంగా ఉపదేశి స్తాను" అని సకల అస్త్ర శాస్త్రాలు రామలక్ష్మణులకు ఉపదేశించాడు.


తరువాత బయలుదేరి అరణ్యాల గుండా ప్రయాణం చేసి దండకారణ్యంలో తాటకి ఉండే ప్రదేశానికి వచ్చారు. 


తాటకి వీరిని చూడగానే భీకర ఆకారం దాల్చి పెద్ద పెద్ద వృక్షాలను, బండరాళ్ళను వీరి పైకి విసిరి వేయసాగింది. పడుతున్న వృక్షాలను, బండరాళ్ళను రామలక్ష్మణులు ఆకాశంలోనే బాణాలతో ఛేదించి పడగొట్ట సాగారు.


తాటకి మరింతగా విజృంభించడంతో విశ్వామిత్రుడు తాటకిని చంపమని రామునికి చెప్పాడు.   


"తాటకి రాక్షసి అయినా స్త్రీకదా" అని చంపడానికి రాముడు సందేహించాడు. 


విశ్వామిత్రుడు గ్రహించి రామునికి "ధర్మ సంరక్షణార్ధం రాక్షస స్త్రీ తాటకిని చంపడం ధర్మవిరుద్దం కాదు" అని ధర్మసూక్ష్మాన్ని వివరించాడు. 


సందేహం తొలగటంతో బాణం సంధించి రాముడు ఒక్కవేటుతో తాటకిని నేలకూల్చాడు. మహాపర్వతం నేలకు పడినట్లు తాటకి నేలపై పడి మరణించింది.


ఆశ్రమంచేరుకున్నవిశ్వామిత్రుడు యాగ రక్షణ బాధ్యత రామలక్ష్మణులకు అప్పగించి యాగ దీక్షలో కూర్చుని యాగం చేయసాగాడు. 


తాటకి మరణవార్త తెలిసిన ఆమె కుమారులు మారీచ సుబాహువులు ప్రతీకారేశ్ఛతో తమ పద్నాలుగు వేల రాక్షస సైన్యాన్ని విశ్వామిత్రుడి ఆశ్రమం పై దాడికి పంపారు.


రామలక్ష్మణులు రాక్షస సేనలను అవలీలగా సంహరించడంతో మరింత కోపంతో మారీచ సుబాహువులు ఆకాశంలో అదృశ్యం రూపంలో ఉండి యాగం భగ్నం చేయడానికి జంతు మానవ రక్త మాంసాలు, ఎముకలు మొదలైనవి యాగ కుండంలో పడవేసే ప్రయత్నం చేసారు. రామలక్ష్మణులు యాగశాలపై బాణాలతో రక్షణ కవచం ఏర్పాటు చేసి ఒక్క చుక్క కూడా యాగ కుండలో పడకుండా చేసారు.


తరువాత శ్రీరాముడు ఒక బాణంతో సుబాహుని చంపివేశాడు. మరొక బాణంతో తప్పించుకుని పారిపోతున్న మారీచుని సప్తసముద్రాల అవతల పడేటట్టు చేసాడు.  


విశ్వామిత్రుడి యాగం నిర్విఘ్నంగా పూర్తి అయ్యింది. విశ్వామిత్రుడు మరియు ఇతర ఋషులు పురుష సూక్తం పఠించి రామలక్ష్మణులను

ఆశీర్వదించారు.


అదే సమయంలో దేవర్షి నారదుడు అక్కడకు వచ్చాడు. విశ్వశాంతి యాగం సుసంపన్నం అయినందుకు విశ్వామిత్రుని అభినందించి రామలక్ష్మణులను ఆశీర్వదించాడు. 


మిథిలానగరంలో జనక మహారాజు తన కుమార్తె సీతాదేవికి వివాహానికి ఏర్పాటు చేసిన స్వయంవరం గురించి చెప్పాడు.


“సాక్షాత్తు పరమేశ్వరుడు 

విదేహ వంశానికి ప్రసాదించిన అమోఘమైన శివధనస్సు ఎత్తినవారికే సీతాదేవితో వివాహం అని జనకుడు ప్రకటించి సకల దేశ రాజులను ఆహ్వానించాడు. సీతాదేవి జనన వృత్తాంతం చెప్పి వేయి మంది మహావీరులైనా కదలించ లేని శివధనుస్సు గల శకటాన్ని బాలికగా ఉన్న జానకి అవలీలగా పక్కకు జరిపింది ఆడుకునే బంతి కోసం. అందుకే జనకుడు శివధనస్సు ఎత్తి నారి సంధించిన వానికే సీత నిచ్చి కన్యాదానం చేస్తానని స్వయంవరం ప్రకటించాడు అని చెప్పి నారదుడు వెళ్లి పోయాడు.


"మహా మహిమాన్వతమైన శివధనుస్సు చూడాలని ఉందా రామా" అని విశ్వామిత్రుడు శ్రీరాముని వంక చూస్తూ అడిగాడు. 


రాముడు వినయంగా "తమరు అనుగ్రహిస్తే పరమేశ్వరుని నిజ ధనుస్సు చూడాలని ఉంది" అని అన్నాడు. 


"సరే మిథిలానగరం వెళ్లి వద్దాం" అని రామలక్ష్మణులను వెంట తీసుకుని విశ్వామిత్రుడు మిథిల బయలుదేరి వెళ్లాడు.


మిథిలానగరానికి సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమం కనిపించింది. అడవిలా ఉన్న ఆశ్రమాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు ఇంద్రుని దుశ్చర్య వలన గౌతమ మహర్షి అహల్యకు రాయిగా పడి ఉండమని ఇచ్చిన శాపం గురించి వివరంగా చెప్పాడు. ఇంద్రుడు చేసిన దుష్కర్మలో అహల్య నిర్దోషి అని తెలుసుకున్న గౌతమ మహర్షి "భవిష్యత్తులో మహావిష్ణువు అవతారమైన ఇక్ష్వాకు వంశజుని చేత అహల్యకు శాప విమోచనం కలుగుతుంది" అని చెప్పి ఆశ్రమం వదలి వెళ్లి పోయాడు.


ఆనాటి నుండి ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంది. ‘అహల్య రాయిగా శాప విమోచనం కోసం ఎదురు చూస్తోంది’ అని రాముని వంక చూశాడు. 


విశ్వామిత్ర మహర్షి చూపులోని అర్ధం గ్రహించిన ఇక్ష్వాకు వంశజుడు అయిన శ్రీరాముడు, అక్కడి వారు శాపగ్రస్తమైన ఆశ్రమంలోకి వద్దంటున్నా లోపలికి వెళ్లాడు. ఆశ్రమం అంతా రకరకాల చెట్లు, పొదలు, దుమ్ము, ధూళి, రాళ్ళతో నిండి పోయి ఉంది. శిథిలావస్థలో ఉన్న ఆశ్రమం ముఖద్వారం వద్దకు రాముడు రాగానే, అక్కడ రాయిగా మారి ఉండిన అహల్యకు శ్రీరాముని పాదం తగిలింది.


శ్రీమహావిష్ణువు అవతారం, ఇక్ష్వాకు వంశజుడైన రాముని పాదం తగలగానే అహల్యకు శాప విమోచనం కలిగి స్త్రీ రూపం పొందింది. క్షణంలో ఆశ్రమానికి శిథిలావస్థ రూపం పోయి సుందర రూపం వచ్చింది. గౌతమ మహర్షి అక్కడకు వచ్చాడు. అహల్యను పత్నిగా స్వీకరించాడు. దంపతులిరువురు శ్రీరామునికి ధన్యవాదాలు తెలిపి ఆశీస్సులు ఇచ్చారు. గౌతమ మహర్షి "రాముని తీసుకువచ్చి అహల్యకు శాప విమోచనం చేసినందుకు" విశ్వామిత్రునికి కృతజ్ఞతలు తెలియ జేశాడు. 


విశ్వామిత్రుడు గౌతమ మహర్షి, అహల్యలకు వీడ్కోలు పలికి రామలక్ష్మణులను తీసుకుని మిథిలకు బయలుదేరి వెళ్లాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శనివారం 🍁* *🌹09, మే, 2026🌹*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁శనివారం 🍁*

 *🌹09, మే, 2026🌹*

 *దృగ్గణిత పంచాంగం*              


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : సప్తమి* మ 02.02 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : శ్రవణం* రా 11.24 వరకు ఉపరి *ధనిష్ఠ*

*యోగం : శుక్ల* రా 02.36 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : బవ* మ 02.02 *బాలువ* రా 02.39 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు*

 *ఉ 10.30 - 12.30 సా 05.00 - 06.00*       

అమృత కాలం  : *మ 12.06 - 01.51*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : రా 03.39 - 05.20*

*దుర్ముహూర్తం :ఉ05.39- 07.22* 

*రాహు కాలం  :ఉ08.52 - 10.28*

గుళికకాళం      : *ఉ 05.39 - 07.15*

యమగండం    : *మ 01.40 - 03.16*

సూర్యరాశి : *మేషం*                  

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 05.47* 

సూర్యాస్తమయం :*సా 06.39*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 05.39 - 08.13*

సంగవ కాలం    :*08.13 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.21*

అపరాహ్న కాలం    : *మ 01.21 - 03.55*

*ఆబ్ధికం తిధి     : వైశాఖ బహుళ అష్టమి*

సాయంకాలం    :*సా 03.55- 06.29*

ప్రదోష కాలం      :*సా 06.29- 08.43*

రాత్రి కాలం       :*రా 08.43 - 11.41*

నిశీధి కాలం       :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.09 - 04.54*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*


*వినా వేంకటేశం న నాథో న* 

*నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


     *🍁హనుమకృత🍁*  

 *🍁సీతారామ స్తోత్రమ్🍁*


*పుత్రం దశరథస్యాద్యమ్*

*పుత్రీం జనక భూపతే!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శనివారం 9 మే 2026*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

        *శనివారం 9 మే 2026*


  *🙏శ్రీ హనుమాన్ చాలీసా 🍁*


*🍁జ్ఞాన యజ్ఞం - 5వ రోజు**🍁


గత రెండు చౌపాయిల్లో హనుమంతుని జ్ఞానాన్ని, శక్తిని మరియు ఆయన జన్మ వృత్తాంతాన్ని స్మరించుకున్నాం. ఇప్పుడు ఆయన శారీరక బలాన్ని, మానసిక దృఢత్వం మరియు ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని ఈ మూడవ చౌపాయిలో దర్శించుకుందాం.


 **మూడవ చౌపాయి**


 **మహాభీర బిక్రమ బజరంగీ |**

 **కుమతి నివార సుమతికే సంగీ ||**


         **ప్రతిపదార్థం**


      * **మహావీర** 

    గొప్ప వీరుడైనవాడా!


         * **విక్రమ**     

      పరాక్రమవంతుడా!


        * **బజరంగీ** 

వజ్రం వంటి కఠినమైన శరీరం కలవాడా! (వజ్రాంగీ)


  * **కుమతి నివార** 


చెడు బుద్ధిని (దుర్బుద్ధిని) తొలగించేవాడా


      * **సుమతి కే సంగీ**


 మంచి బుద్ధి కలవారికి తోడుగా ఉండేవాడా\! (మంచి ఆలోచనలను ఇచ్చేవాడా)


 **విస్తృత ఆధ్యాత్మిక వివరణ**


**1. మహాభీర విక్రమ బజరంగీ (శక్తి స్వరూపం)**


మహాభీర, భిక్రమ, బజరంగీ ఈ మూడు స్వామి వీరత్వాన్ని తెలిపే నామాలు.


అసలు హనుమంతుని వ్యక్తిత్వం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన గొప్పయోగి, మహాజ్ఞాని, మహాపండితుడు, సర్వశాస్త్రవేత్త. దానికి తోడు సర్వదేవతాత్మకుడు వీటన్నింటిని కలబోసుకుని, పరమసత్త్వమయుడే కాకుండా, మహా శౌర్యమయుడు కూడా శౌర్యము, సౌమ్యము... రెండూ ఆయన వద్ద ఉన్నాయి.


ఎంత సౌమ్యమో అంత శౌర్యం హనుమ వద్ద ఉంది,ఈ రెండు గుణాలు కలిగి ఉండటం చాలా కష్టం. ప్రతాపం ఉన్నవాడికి ప్రసన్నత ఉండదు, ప్రసన్నత ఉన్న వాడికి ప్రతాపం తీవ్రంగా ఉండదు. మనో నిగ్రహం ఉన్నవారు మాత్రమే ఈ రెండు గుణాలు నిభాయించుకుంటారు.ఏది ఎప్పుడు అవసరమో దాన్నే చేస్తాడు.


సీతమ్మ తో పిల్లి పిల్లంత పరిమాణం లో అతి సౌమ్యంగా మాట్లాడి అమ్మ దుఃఖం పోగొట్టిన స్వామి. మరుక్షణం లో మహా పర్వతం అంత పరిమాణం లోకి మారి లక్షలాది మంది రావణ సైనికులను,రావణ పుత్రులతో సహా సంహరించాడు. మళ్ళీ అంతలోనే బ్రహ్మాస్త్రం కి గౌరవం ఇచ్చి కట్టుబడి పోయాడు. ఇలా, తిరుగు లేని శారీకర బలం,మానసిక బలం, ఆత్మ జ్ఞానం కలిగి ఉన్న వీరుడు హనుమ. 


వీరుడు అంటే గొప్పవాడు అని అర్దం. ఆయన అన్నిటిలోనూ తిరుగులేని వాడే, దయ లో కూడా తన భక్తుల మీద అపార దయ చూపించి వారిని కాపాడుతాడు.


భగవత్ ఆరాధన చేసేవాడు బలహీనుడు గా ఉండకూడదు,వీరుడిగా, ధీరుడిగా ఉండాలి, అలా ఉండి మనసును నిగ్రహించి ఈశ్వరుని పాదాల దగ్గర పెట్టీ పూజిస్తేనే కదా అనుగ్రహం లభించేది, మనసు ఎటు పడితే అటు పోతే పూజ ఎక్కడిది ఫలితం ఎక్కడిది. వీరుల చేత ఇంద్రియాలు నిగ్రహించి న వారి చేత ఆరాధించబడే వాడు అని కూడా అర్దం.


విక్రమం అంటే పరాక్రమం

క్రమించుట అంటే నడచుట, వెళ్ళుట.

విశేషముగా క్రమించుట విక్రమం ఆక్రమము, విక్రమము, పరాక్రమము... ఇత్యాది మాటలు వింటూ ఉంటాం. అంటే అవతలివానికంటే ఎక్కువతనాన్ని ఋజువు చేస్తూ, వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెడితే దానిని విక్రమము అనాలి. స్వామివారు ఈ విక్రమాలు ఎన్ని రకాలుగా చూపించాడో రామాయణంలో కనబడుతున్నది.


బజరంగీ ఇది గొప్ప నామం. స్వామి పుట్టుక తోనే వజ్రము వంటి శరీరం తో పుట్టారు అని పరాశర సంహిత చెప్పింది. ఇంద్రుని వజ్రాయుధం కూడా స్వామిని ఏమి చేయలేక పోయింది. అందుకే వజ్రాంగభలి అని పేరు,అదే తెలుగులో భజరంగ బలి అయింది.


హనుమంతుడు "మహావీరుడు". ఆయన పరాక్రమం సాటిలేనిది. 'బజరంగీ' అంటే వజ్రం వంటి దృఢమైన అవయవాలు కలిగినవాడు అని అర్థం. సాధకుడికి లౌకికమైన ఆపదలను ఎదుర్కోవడానికి కావలసిన శారీరక దార్ఢ్యాన్ని, మానసిక స్థిరత్వాన్ని ఆయన ప్రసాదిస్తారు.


**2. కుమతి నివార (అజ్ఞాన నాశనం)**


మనలోని 'కుమతి' అంటే కేవలం చెడు ఆలోచనలు, అహంకారం, అసూయ, కామ క్రోధాలు. హనుమంతుని ఉపాసన వల్ల మన మనస్సులోని ఈ మలినాలు (దుష్ట బుద్ధి) తొలగిపోతాయి. హనుమత్ ఉపాసనకు ముందు కావలసింది చెడు బుద్ధి నివారణ.

కుమతి బలహీన ఆలోచన ఈ బాధలు పడే కంటే మారణమే మేలు అని భావించిన సీతమ్మ ఆలోచన నివారించి బతుకు మీద ఆశ పుట్టించాడు స్వామి.మనలని కష్టం అనే కుమతి నుండి బయట పడేసే వాడు స్వామి.


**3. సుమతి కే సంగీ (సద్బుద్ధికి తోడు)**


చెడు బుద్ధి తొలగించడం ఒకటే కాదు మంచి బుద్ధినీ, సత్పురుషుల సాంగత్యం కూడా ఇచ్చేవాడు స్వామి.

ఎవరి హృదయంలో అయితే మంచి ఆలోచనలు, భగవంతుని పట్ల భక్తి ఉంటాయో, హనుమంతుడు వారికి వెన్నంటి ఉంటాడు. విభీషణుడు సద్బుద్ధితో రాముడిని శరణు కోరినప్పుడు, హనుమంతుడే అతనికి అండగా నిలబడ్డాడు. మనం మంచి మార్గంలో నడవాలని నిశ్చయించుకుంటే, ఆయన మనకు మార్గదర్శిగా మారి వెలుగునిస్తారు.


రామాయణంలో కుమతి అయిన వాలిని వదిలి, 

సుమతి అయిన సుగ్రీవుని పట్టుకున్నాడు

హనుమ, రాముడు కూడా అంతే, కాబట్టి నీకు దైవ అనుగ్రహం కావాలి అంటే చెడు సావాసాలు,ఆలోచనలు వదులు,విభీషణుడి లాగా.


సత్సంగాన్ని సాధించు దుస్సంగాన్ని విడిచిపెట్టు. దేనిని పట్టుకోవాలో, దేనిని వదలాలో తెలియాలి. దుస్సంగమంటే దుష్టుడని కాదు... దుష్టబుద్ధులతో సంగము కూడదని చెప్పడం.


ఆంజనేయస్వామిని ఉపాసన చేస్తే చెడుబుద్ధిని పుట్టనివ్వడు, పుట్టినా తుంచేస్తాడు. చెడు ఆలోచనను ఆచరణరూపంలో రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ప్రారబ్ధవశాత్తూ దుర్వాసనల వల్ల చెడుబుద్ధి పుట్టినా, అది చెడుపనిగా రానివ్వకుండా నా బుద్ధిని సరైన మార్గంలో 'స్వామీ! నడిపించు' అని ప్రార్ధించాలి.


**తులసీదాసు గారి సందేశం:**


మొదటి పాదం లో స్వామి పరాక్రమం చెప్పే నామాలు చెప్పి, రెండవ పాదంలో కుమతి నివారణ అన్నాడు అంటే. మహావీరుడిలా ఇంద్రియాలు నిగ్రహించి, విక్రమము క్రమ పద్ధతిలో నీ ఉత్సాహాన్ని వినియోగించి, బజరంగి లా ఎలాంటి ప్రలోభాల కు లొంగక, దుష్ట బుద్దులను దూరం పెట్టీ, సద్బుద్ధి నీ, సత్పురుషుల ను విడవక పట్టుకునేలా నన్ను అనుగ్రహించు స్వామి అని వేడుకోవడం.


బాహ్య శత్రువుల కంటే అంతర్గత శత్రువులైన (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) 'కుమతి'ని జయించడం గొప్ప విషయం. హనుమంతుడిని వేడుకుంటే ఆయన మనలో వివేకాన్ని (సుమతి) రగిలిస్తాడు. బలం ఉన్నచోట వివేకం ఉంటేనే అది సమాజానికి హితం చేకూరుస్తుంది.


అలాంటి శారీరక, మానసిక బలం ఉన్న దృఢమైన సమాజం నిర్మాణం కావాలి అని మనసారా స్వామి హనుమను కోరుకుందాం. వచ్చే రెండు చౌపాయి లలో స్వామి వారి రూప ధ్యానం ఉంటుంది చాలా అద్భుత శ్లోకాలు అవి రేపు తెలుసుకుని తరిద్దాం.


**జై శ్రీరామ్! జై హనుమాన్!**

       🍁🌹🙏🌹🍁


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

నిద్రమోహం కొడకా"

 ఇంటర్ లో 99% మార్కులు తెచ్చుకుని, ఐ.ఐ.టి ఢిల్లీలో సీట్ కొట్టి.....ఆ జిల్లాలోనే తెలివైన కుర్రోడిగా పేరు తెచ్చుకున్న సుందరం కొడుకు, ఎక్కడికన్నా తీసుకెళ్లమని వాళ్ళ నాన్నతో ఒకటే గోల.

కొడుకు బాధ పడలేక ఎక్కడకి తీసుకెళ్ళాలో చెప్పమన్నాడు సుందరం. చలికాలం రాత్రి లంబసింగిలో టెంట్ వేసుకుని ఉంటే బాగుంటుంది అన్నాడా అబ్బాయి. టెంట్ ఒకటి కొని, 

శనివారం ఉదయం బయలుదేరి సాయంత్రం లంబసింగి చేరుకుని, 

మంచి ప్లేస్ ఒకటి పట్టుకుని, టెంటు వేసుకుని పడుకున్నారు 

తండ్రి కొడుకులు. 

మధ్య రాత్రి లేపి 

కొడుకుని పైకి చూడమన్నాడు సుందరం. చూశాడు కొడుకు...... 

"ఏమి కనపడుతుందిరా?" అడిగాడు సుందరం. 

"నక్షత్రాలు!" అన్నాడు కొడుకు.

"నీకేం అర్ధం అయింది" అనడిగాడు సుందరం. 

.

"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే శుక్రుడు మకరరాశిలోకి వెళ్తున్నాడు, 

జీవ శాస్త్రం ప్రకారం చూస్తే జీవం ఉన్న ఏకైక గ్రహం మీద మనమున్నాం, 

అంతరిక్ష శాస్త్రం ప్రకారం చూస్తే ఈ విశ్వము అనంతమైనది,

భౌతిక శాస్త్రం ప్రకారం చూస్తే సూర్యుడు తన గురుత్వాకర్షణ శక్తితో భూమిని, దాని మీద ఉన్న మనల్ని తిప్పుకుంటున్నాడు, 

రసాయన శాస్త్రం ప్రకారం చూస్తే, ఈ విశ్వములో ఉదజని 99 శాతం ఉంది" అన్నాడా కొడుకు.

ఇంతలా అడుగుతున్నావు, "ఇంతకీ నీకేమర్థమయింది నాన్నా?" అనడిగాడా అబ్బాయి,


*"మన టెంట్ ఎవడో దొబ్బుకెళ్ళాడ్రా నిద్రమోహం నా కొడకా"*- 

అని తిట్టాడాయన 

ఐ.ఐ.టి లో నెంబర్ వన్ తెచ్చుకున్న కొడుకుని


అందుకే చెప్పేది....

లోకజ్ఞానం కూడా నేర్పండి అని 😉.....

తలుపు తెరిచింది.

 నేను ఒక డెలివరీ బాయ్‌ని. ఎక్కువగా సాయంత్రం షిఫ్ట్‌లో పని చేస్తాను.

ఆ రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో చివరి ఆర్డర్ తీసుకున్నాను.

రెస్టారెంట్ నుండి ప్యాకెట్ తీసుకున్నప్పుడు గమనించాను—చాలా చిన్న ఆర్డర్: సాధారణ ఖిచ్డీ, పెరుగు, రెండు అరటిపండ్లు మాత్రమే.


అడ్రస్ నగరంలోని పాత ప్రాంతంలో ఉంది.

చాలా పాడైపోయిన భవనం. మూడో అంతస్తు.

నేను డోర్‌బెల్ నొక్కాను.


ఒక వృద్ధ మహిళ తలుపు తెరిచింది.

తెల్ల జుట్టు, వణుకుతున్న చేతులు, మందపాటి కళ్లజోడు.

ఆమె ముఖంలో అలసట కనిపించింది, కానీ స్వరంలో మాధుర్యం ఉంది—


"బాబూ, లోపల పెట్టేయి… నా చేతులు వణుకుతాయి."


నేను ఆహారాన్ని టేబుల్‌పై పెట్టి వెళ్లడానికి తిరిగినప్పుడు, ఆమె అడిగింది—


"రెండు నిమిషాలు కూర్చుంటావా?

ఒంటరిగా తినడం బాగుండదు."


నేను గడియారం చూసాను.

నా షిఫ్ట్ అయిపోయింది.

కొంచెం అలసటగా ఉంది.

కానీ ఏదో కారణంగా నేను కూర్చున్నాను.


గది నిశ్శబ్దంగా ఉంది.

గోడపై ఒక పాత గడియారం టిక్‌టిక్ మంటూ ఉంది.

ఒక మూలలో చిన్న దేవుడి ఫోటో.

మరో గోడపై అనేక ఫోటోలు.


ఆమె ప్లేట్ తెరిచి, నెమ్మదిగా ఖిచ్డీ తినడం ప్రారంభించింది.

ప్రతి రెండు ముద్దల తర్వాత, నన్ను చూసి నవ్వేది.


ఆమె చెప్పింది—


"తెలుసా బాబూ, నేను ప్రతి రోజు బయట నుంచి ఆర్డర్ చేయను.

ఈరోజు మాత్రం… ఒక మనిషి గొంతు వినాలని అనిపించింది."


నేను మౌనంగా ఉన్నాను.


ఆమె గోడపై ఉన్న ఒక ఫోటో చూపించింది.


"ఇతనే నా భర్త. రైల్వేలో పని చేసేవాడు.

ఐదేళ్ల క్రితం చనిపోయాడు."


మరో ఫోటో—


"ఇతనే నా కొడుకు. కెనడాలో ఉంటాడు.

బాగా ఉన్నాడు… ప్రతి నెల డబ్బు పంపిస్తాడు."


కొద్దిసేపు ఆమె మౌనంగా ఉంది.

ఆమె నవ్వింది, కానీ ఈసారి కళ్లలో నీళ్లు—


"కానీ… పంపడానికి సమయం మాత్రం ఉండదు."


అప్పుడే గదిలో గడియారం శబ్దం చాలా గట్టిగా వినిపించింది.


ఆమె ఇంకో ముద్ద తీసుకుంది.


"ఇది నా కూతురు. బెంగళూరులో ఉంటుంది.

తన ప్రపంచంలో సంతోషంగా ఉంది.

అలా ఉండాలి కూడా.

పిల్లలు ఎగరాలి కదా… లేదంటే పెంచిన ప్రయోజనం ఏమిటి?"


ఆమె మాట్లాడుతుండగా స్వరం కొద్దిగా కంపించింది.

కానీ ముఖంలో ఎలాంటి ఫిర్యాదు లేదు.

కేవలం ఖాళీ.


ఆమె నన్ను అడిగింది—


"నీకు అమ్మ ఉందా?"


నేను చెప్పాను—

"ఉంది."


"ప్రతి రోజు ఆమెతో మాట్లాడుతావా?"


నేను మౌనంగా ఉన్నాను.


నిజానికి, నేనూ ఇంటికి ఫోన్ చేయకుండా రోజులు గడిపేవాడిని.

అలసట, పని, పరుగులు…

ప్రతి సారి ‘రేపు చేస్తాను’ అని వాయిదా వేసేవాడిని.


ఆమె నా మౌనాన్ని అర్థం చేసుకుంది.


ఆమె మెల్లగా చెప్పింది—


"తల్లిదండ్రులు డబ్బు లెక్కించరు బాబూ…

వాళ్లు స్వరాలను లెక్కిస్తారు."


నా లోపల ఏదో మెల్లగా విరిగిపోయింది.


భోజనం ముగిసింది.

ఆమె నీళ్లు తాగింది.

తర్వాత తన పర్సులో నుంచి 500 రూపాయలు తీసి నాకు ఇచ్చింది.


"ఇది టిప్ కాదు.

నన్ను ఒంటరిగా తిననివ్వని ఆ అరగంటకి ధర."


నేను వెంటనే తిరస్కరించాను—


"వద్దు అమ్మా, నేను తీసుకోలేను."


ఆమె నవ్వింది—


"తీసుకో.

ఈరోజు నువ్వు ఆహారం డెలివర్ చేయలేదు…

సంగతిని డెలివర్ చేశావు."


నేను డబ్బు తీసుకున్నాను.

కానీ జేబులో పెట్టలేదు.

చేతిలోనే పట్టుకున్నాను.


నేను వెళ్లేటప్పుడు ఆమె చెప్పింది—


"మరియు—

ఈరోజే ఇంటికి వెళ్లి నీ అమ్మకు తప్పకుండా ఫోన్ చేయి."


ఆ రాత్రి నేను భవనం కింద బైక్ స్టార్ట్ చేయలేదు.

ముందు అమ్మకు ఫోన్ చేశాను.


అక్కడి నుంచి ఆమె స్వరం వచ్చింది—


"ఈరోజు అకస్మాత్తుగా ఫోన్ చేశావే? అన్నీ బాగున్నాయా?"


ఆ స్వరం వినగానే నా గొంతు దిగబడ్డింది.


నేను చెప్పాను—


"అవును అమ్మా…

నీ స్వరం వినాలనిపించింది."


కొన్ని క్షణాలు అక్కడ మౌనం.

తర్వాత అమ్మ అడిగింది—


"తిన్నావా?"


నేను రోడ్డు పక్కనే నిలబడి ఏడ్చేశాను.


ఆ రాత్రి తర్వాత, నేను ప్రతి రోజు అమ్మకు ఫోన్ చేయడం ప్రారంభించాను.


మరియు అమ్మ మాత్రమే కాదు—

ప్రతి డెలివరీ కూడా నాకు కేవలం ఆర్డర్‌గా అనిపించలేదు.


కొన్ని ఇళ్లకు మందులు అవసరం.

కొన్ని ఇళ్లకు ఒంటరితనం నుంచి ఉపశమనం కావాలి.

కొన్ని ఇళ్లలో ఎదురు చూపు ముగియాలి.

కొన్ని ఇళ్లకు కేవలం ఒక స్వరం కావాలి.


ఇప్పుడు తలుపు తెరుచుకున్నప్పుడు, నేను తొందరపడను.

ముఖాన్ని చూస్తాను.

స్వరాన్ని వింటాను.

కొన్నిసార్లు అడుగుతాను—

"మిగతావన్నీ బాగున్నాయా?"


చాలామంది "అవును" అంటారు.

కొంతమంది నవ్వుతారు.

మరికొంతమంది ముఖాలు రోజంతా ఎవరితోనూ మాట్లాడలేదని చెబుతాయి.


రెండు నెలల తర్వాత, అదే అడ్రస్ నుంచి మళ్లీ ఆర్డర్ వచ్చింది.


నేను వెంటనే వెళ్లాను.


ఇంకొకరు తలుపు తెరిచారు.

అది పక్కింటి ఆంటీ.


ఆమె మెల్లగా చెప్పింది—


"అమ్మా గత వారం చనిపోయింది."


నేను కొన్ని క్షణాలు తలుపు దగ్గర నిలబడ్డాను.

నా చేతులు ఖాళీగా ఉన్నాయి, కానీ నా లోపల ఏదో భారంగా పడిపోయింది.


ఆమె లోపల నుంచి ఒక చిన్న కవర్ తీసుకొచ్చింది.

"ఇది నీకోసం ఆమె వదిలింది."


నా చేతులు వణుకుతుండగా, నేను దాన్ని తెరిచాను.


లోపల 500 రూపాయలు ఉన్నాయి.

మరియు ఒక చిన్న నోట్.


దానిలో ఇలా ఉంది—


"బాబూ,

నువ్వు ఇది చదువుతున్నావంటే, నేను వెళ్లిపోయాను.

ఆ రాత్రి నాతో కలిసి తిన్నందుకు ధన్యవాదాలు.

నువ్వు నాకు ఆహారం ఇవ్వలేదు—గౌరవం ఇచ్చావు.

మరియు అవును—నీ అమ్మకు ఫోన్ చేస్తూ ఉండు.

అమ్మ"


ఇప్పటికీ ఆ 500 రూపాయలు నా బ్యాగ్‌లోని లోపలి జేబులోనే ఉన్నాయి.

నేను వాటిని ఖర్చు చేయలేదు.


ఎందుకంటే ఆ రాత్రి నాకు మొదటిసారి అర్థమైంది—


ప్రతి తలుపు వెనుక కేవలం కస్టమర్ ఉండడు.

కొన్నిసార్లు అది ఒక తల్లి.

కొన్నిసార్లు అది ఎదురు చూపు.

కొన్నిసార్లు అది చివరి సంభాషణ.


మనందరం మన మన ఆకలులతో జీవిస్తున్నాం—

కొంతమందికి అన్నం కావాలి,

కొంతమందికి మందులు కావాలి,

మరికొంతమందికి కేవలం రెండు నిమిషాల సాంగత్యం కావాలి.


మనుషులకు ఎప్పుడూ డబ్బు డెలివరీ అవసరం ఉండదు—

కొన్నిసార్లు వారికి ప్రేమ డెలివరీ కావాలి. 😭


సేకరణ

సావడి కబుర్లు

  *సావడి కబుర్లు -1*


వందేమాతరం


*అమ్మలకి లెక్కల రావు*


_జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ॥_

_తల్లి మరియు జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవి._


ఆ మధ్య సాయంత్రం సావడిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఎవరో నవ్వుతూ అన్నారు, “ఈ అమ్మలకి లెక్కలు రావు!” అని. ఆ మాట విన్నాక నేను కాసేపు ఆలోచించాను. నిజమేనేమో అనిపించింది. ఎందుకంటే మా అమ్మకి లెక్కలు వచ్చి ఉంటే,


 “అమ్మా… ఆకలిగా ఉంది, రెండు చపాతీలు పెట్టు” అన్నప్పుడు నాలుగు ఎందుకు పెడుతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, పరీక్షల రోజున తెల్లవారుజామున ఐదు గంటలకే లేపి, “ఏడయ్యిందిరా! ఇంకా పడుకున్నావేంటి?” అని ఎందుకు తొందర పెడుతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, నేను పరీక్షలో ముప్పై మార్కులు తెచ్చినా, పక్కింటివారికి “యాభై వచ్చాయి” అని గర్వంగా ఎందుకు చెబుతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, ఖర్చులకని గోముగా యాభై రూపాయలు అడిగితే, పోపుల డబ్బాలోంచి వంద రూపాయలు ఎందుకు ఇస్తుంది?


లెక్కలు వచ్చి ఉంటే, నాన్న తెచ్చిన జీతం నుంచి పాలవాడు, చాకలివాడు, కిరాణావాడు, పనివాడు అంటూ అందరికీ ఇచ్చిన లెక్కలు చెప్పి, పోపులు డబ్బాలో దాచిన చిల్లర సంగతిని మాత్రం ఎందుకు మర్చిపోతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, నేను దొంగచాటుగా సినిమాకు వెళ్లి రాత్రి ఒంటిగంటకు వచ్చి పడుకున్నా, ఉదయాన్నే నాన్నకి “రాత్రి పదింటికే వచ్చి పడుకున్నాడు” అని ఎందుకు కాపాడుతుంది?


అందుకే అనిపించింది, అమ్మకి నిజంగానే లెక్కలు రావు.

ఒక్క ప్రేమ తప్ప!


అమ్మ అంటే మా అమ్మ ఒక్కతే కాదు. ఈ లోకంలోని ప్రతి అమ్మది అదే తీరు. వారు చదివేది పాఠశాల పుస్తకాలు కాదు, జీవితంలోని ప్రేమానురాగాలు. వారు అనుసరించేది గణిత సూత్రాలు కాదు, అనురాగ సూత్రాలు.


సమకాలీన జీవితంలో సాగే ప్రతి చిన్న మార్పునూ, ప్రతి కష్టాన్నీ, ప్రతి ఆనందాన్నీ నిశ్శబ్దంగా గమనించేది అమ్మ మాత్రమే. కుటుంబానికి అవసరమైనది ఏదో, అవసరం లేనిది ఏదో చెప్పకుండానే తెలుసుకునే అంతర్దృష్టి ఆమెది. బయటకు సాధారణురాలిగా కనిపించినా, లోపల పరిపూర్ణ ఆలోచనాశీలి.


అసలు అమ్మలు ఆత్మకథలు రాస్తే అవి ఆయా కాలాలకు చెందిన చారిత్రిక గ్రంధాలుగా ఆవిష్కృతమవుతాయి. అందులో మన జీవిత పోరాటాలు ఉంటాయి, కన్నీటి చరిత్ర ఉంటుంది, త్యాగాల గాథ ఉంటుంది, వాటిపై మనకు కావలసిన సమీక్షలు ఉంటాయి, విమర్శలకు సమాధానాలుంటాయి, ప్రేమకు నిర్వచనాలుంటాయి.


ఉద్యోగంలో చేరిన కొత్తలో, ఒకవైపు కార్యాలయ పని, మరోవైపు ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉండగా ఒక్కసారిగా అనిపించింది “వామ్మో! అమ్మకు ఎన్ని చేతులున్నాయో!” అని. అప్పుడే తెలిసింది, ఆమెకు రెండు చేతులే ఉన్నా, ఆ చేతుల్లో వెయ్యి పనుల శక్తి ఉందని.


ఎప్పుడో చదివాను రాఘవ గారు తన "అమ్మ ముచ్చట్లు" లో అమ్మ ఉన్నంతకాలం నేను ఎంత పెద్దయినా, అమ్మ కొంగుచాటు బిడ్డనే అన్నారు. అలాగే మన మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారు నంద్యాలలో మాట్లాడుతూ దేశానికి రాజైన అమ్మకు బిడ్డే అని తన మనసులోని మాట చెప్పారు. రాజ్యాలను నడిపినవారికైనా, శాస్త్రాలను జయించినవారికైనా, ప్రపంచం గెలిచినవారికైనా, అమ్మ ఎదుట మాత్రం వారు పిల్లలే.


మానవత్వం మిగిలి ఉన్న ప్రతి మనసుకీ అమ్మ ప్రేమ అర్థమవుతుంది. అమ్మ హృదయం సముద్రంలా ఎంత విశాలమైనదో అంత లోతైనది. ఆ ప్రేమను కొనలేం, కొలవలేం, తీర్చలేం. కాలాలు మారినా, యుగాలు గడిచినా, అది కాలాతీత సత్యంగానే నిలుస్తుంది.


మనకు నడక నేర్పింది అమ్మే, నడత నేర్పింది అమ్మే, మాట నేర్పింది అమ్మే, మనిషిగా నిలబడటం నేర్పింది కూడా అమ్మే. అలాంటి తల్లికి సేవ చేయగలగడం జీవితంలో దక్కే మహాభాగ్యం. అటువంటి అమ్మపై మన ఫేమస్ సత్యమై, నిత్యమై ఉండాలి.


అబ్బురపరిచే విషయమేమిటంటే, ఇప్పుడు చాలామంది పౌర్ణమి రోజునో, పాడ్యమి రోజునో సముద్ర తీరాన నిలబడి గట్టిగా కేక వేస్తూ తమ స్వరమే సముద్ర ఘోషలా వినిపిస్తోందని చాటింపు వేసుకుంటున్నారు. కానీ నిజానికి మన జీవితమంతా వినిపించే మహాఘోష ఒకటే, అది అమ్మ పిలుపు.


అది సరే… ఇంతకీ అమ్మ కమ్యూనిస్టా? విప్లవవాదా? శ్రామికవాదా? ఆధ్యాత్మిక అమృతవాహినియా? జాతీయవాదా? లేక నా జీవితానికి జగద్గురువా?

ఏమో… నాకు అవన్నీ తెలియదు.

నాకు మాత్రం అమ్మే.

అమ్మ పిలుపు ఎప్పుడైనా మధురమే.

గడిచిన నిన్నైనా…

జరుగుతున్న నేడైనా…

రాబోయే రేపైనా…


ఉంటా

మృశి

(దశిక ప్రభాకర శాస్త్రి)

14.12.2024

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం - సప్తమి - శ్రవణం -‌‌ స్థిర వాసరే* (09.05.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

విష్ణు స్తుతి

 ☘️🌸☘️ విష్ణు స్తుతి🙏


కేశవా! హరిహృషీకేశ నారాయణా

   దామోదర మధుసూదన మహాత్మ

విష్ణు అధోక్షజా!జిష్ణు త్రివిక్రమ

   పద్మనాభ !యుపేంద్ర వాసుదేవ

యచ్యుత గోవింద యనిరుద్ధ మాధవ

  శ్రీధరా !శ్రీకృష్ణ శిష్ట పోష

సంకర్షణ నృసింహ శాశ్వతా యనుచును

మునులునిన్ కొలిచిరి ముదముతోడ

తే..వాసుదేవమాధవనీకు వందనములు

 నందగోపాల శ్రీ పతి నాగశయన 

సకల దేవతా పూజిత శరణు శరణు 

విన్నపాలు వినుము దేవ విష్ణుమూర్తి



సాహితీ శ్రీ జయలక్ష్మీ

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ।

సమః సిద్ధావసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే ।। 22 ।।



ప్రతిపదార్థ:


యదృచ్ఛా— అప్రయత్నముగానే లభించిన; లాభ — లాభము; సంతుష్టో — తృప్తి; ద్వంద్వ — ద్వంద్వములకు (సుఖ-దుఃఖములవంటి); అతీతః — అతీతుడు; విమత్సరః — అసూయా రహితుడై; సమః — సమత్వముతో; సిద్దౌ — జయమునందు; అసిద్దౌ — అపజయమునందు; చ — మరియు; కృత్వా — కర్మలను చేయుచూ; అపి — ఉన్నాసరే; న, నిబధ్యతే — బంధింపబడడు.



తాత్పర్యము : 


   

అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది, అసూయారహితులై, వారు జీవన ద్వంద్వములకు (సుఖ-దుఃఖాలు, లాభ-నష్టాలు వంటివి) అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా, గెలుపు-ఓటమిలలో సమత్వ బుద్ధి తో ఉండి, వారు తమ కర్మలచే బంధింపబడరు.



వివరణ:


ఒకే నాణానికి రెండు పక్కలు ఉన్నట్టు, భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని ద్వంద్వములతో సృష్టించాడు - పగలు, రాత్రి; తీపి-చేదు; వేడిమి-చల్లదనం; వాన-కరువు మొదలగునవి. అందమైన పువ్వు ఉన్న గులాబి మొక్కకి, వికృతమైన ముల్లు కూడా ఉంది. జీవితం కూడా తన వంతు ద్వంద్వములను తెస్తుంది – సుఖము-దుఃఖము; గెలుపు-ఓటమి; కీర్తి-అపకీర్తి. శ్రీ రామచంద్రమూర్తి సైతం, తన దివ్య లీలలలో, అయోధ్యకి మహారాజుగా పట్టాభిషేకం అయ్యే ఒక్కరోజు ముందు వనవాసానికి పంపివేయబడ్డాడు.


ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు, ఎవ్వరూకూడా ద్వంద్వములు లేకుండా, కేవలం అనుకూల పరిస్థితులే ఉండాలని ఆశించలేరు. మరి మన జీవితంలో ఎదురయ్యే ద్వంద్వములను విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలి? ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదిగి అన్ని పరిస్థితులను సమానంగా స్వీకరిస్తూ, సమస్థితిలో ఉండటమే దీనికి పరిష్కారం. ఫలితాలపై ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని చేస్తూపోతూ, మన కర్మ ఫలాలపై అనాసక్తి పెంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనం భగవంతుని ప్రీతి కోసం కర్మలను ఆచరించినప్పుడు, అనుకూల-ప్రతికూల ఫలితాలను ఈశ్వర సంకల్పంగా పరిగణించి రెంటినీ సంతోషంగా స్వీకరిస్తాము.