కనువిప్పు:
కాంచీపురం దగ్గరలో ఉండే నాగలాపురంలో శివయ్య అనే స్వర్ణకారుడు ఉండేవాడు. నగలు తయారు చేయడంలో అతన్ని మించిన వారు లేరు. ఆడవాళ్ళు ధరించే జుమికీలు, పాపిడి చేరు, గాజులు, చంద్రహారాలు అతను తయారు చేస్తే కళ్ళు చెదిరేలా ఉండేవి.
ముఖ్యంగా నడుముకి పెట్టుకొనే వడ్డాణం శివయ్య తయారుచేస్తే అత్యద్భుతంగా ఉండేది. అయితే అతని పేరు ఎక్కువ మందికి తెలీకపోడానికి కారణం, అతనికి డబ్బు ఆశలేదు. దానికన్నా ఎక్కువ అతను శివభక్తుడు. శివభక్తులకి నగలు చేసిచ్చి సాదాగా బతికేవాడు.
ఇదిలా ఉంటే, కంచి రాజధానిలో మహారాణీ వైష్ణవీ దేవి, విష్ణుభక్తురాలు. ఆమె శ్రీ మహా విష్ణువుకి ఆలయం నిర్మించాలని అనుకుంది. ఆలయ నిర్మాణం పూర్తయింది. మూల విరాట్టుకి చాలా నగలు చేయించింది. అయినా నడుముకి పెట్టే వడ్ఢాణం బాగా రాలేదు.
మహారాణికి ఇష్టసఖి ఒకామె రాణీకి శివయ్య గురించి చెప్పి, అతని చేత నడుముకి నగ చేయించమంది. తన స్నేహితురాలు ఆ ఊరి ఆడపిల్ల అని, ఆమె నగ చూసి ఈ మాట చెప్పేనని కూడా అంది. మర్నాడు తన స్నేహితురాలిని ఆ నగతో రప్పించి చూపించింది.
నగ చూడగానే మహారాణికి కళ్ళు చెదిరిపోయేయి. ఆ పనితనం, అందం ఆమె మనసుని దోచుకుంది.
నాగులాపుర వాసులయిన తన భటులని ఇద్దరిని వెంటనే శివయ్యని తెమ్మని పంపింది. తన దేవుడికి అతను నడుముకి పెట్టే నగ చేయాలని చెప్పమంది.
ఈ భటులు శివయ్యని కలిసి, రాణీగారి ఆనతి చెప్పేరు. అయితే శివయ్య, విష్ణువుకి నగ చేయడానికి నిరాకరించేడు. అతని నియమం ప్రకారం అతను శివుడికి, శివ భక్తులకీ మాత్రమే నగలు చేస్తాడు.
భటులు మహారాణికి ఆగ్రహం వస్తుందని భయపెట్టేరు. అప్పుడు శివయ్య మేలుకోరే ఆ ఊరి పెద్దమనిషి ఒక సలహా ఇచ్చేడు.
“నువ్వు ఆ దేవాలయానికి వెళ్ళకు. రాజమందిరంలో కూచొని నగ తయారు చేసి ఇవ్వు” అన్నాడు.
శివయ్య అందుకు మహారాణీ ఒప్పుకుంటే తను అలా నగ చేస్తాను అన్నాడు. భటులు అతన్నే ఆ మాట చెప్పమని తీసుకెళ్ళేరు.
మహారాణికి శివభక్తుల నియమాలు తెలుసు. సరే అని శివయ్యకి తమకి నగ ఎలా కావాలో చెప్పింది. కొలతలు ఆమె ఆస్థాన శిల్పులు ఇచ్చేరు. శివయ్య రెండే రోజుల్లో నగ తయారు చేసి ఆమెకి ఇచ్చేడు.
తనకి సెలవు ఇమ్మని కోరేడు.
మహారాణీకి నగ అందం చూస్తూ ఉంటే మతిపోయింది. విప్పారిన కళ్ళతో ‘నగ స్వామికి అలంకరించి, అప్పుడు శివయ్యని సత్కరించి, పల్లకీమీద పంపుతానని’ చెప్పింది.
ఆ రోజే ఆమె నగ తీసుకువెళ్ళి స్వామి విగ్రహానికి అలంకరించమని ప్రధాన పూజారికి ఇచ్చింది. నగ బెత్తెడు చిన్నదయింది. ఎంత చిన్నది అయిందో కొలిచి ఆ దారం శివయ్యకి ఇచ్చి మళ్ళా మార్చమంది.
శివయ్య గంటలో ఆ మేరకి ఎక్కువ చేసి ఇచ్చేడు. మళ్ళా స్వామికి అలంకరించేసరికి మళ్ళా బెత్తెడు తక్కువ అయింది. శివయ్య మళ్ళా మార్చేడు. అయినా బెత్తెడు తక్కువ అయింది. ఇలా మూడు నాలుగుసార్లు జరిగింది.
“మీ వాళ్ళు కొలతలు సరిగా ఇవ్వలేదమ్మా!” అన్నాడు శివయ్య.
మహారాణీకి దిక్కు తోచలేదు. “పోనీ శివయ్యా! నువ్వే స్వయంగా కొలత తీసుకువచ్చు కదా! కళ్ళకి గంతలు కట్టుకో. నేను స్వయంగా చెయ్యి పట్టుకొని తీసుకెళతాను. కొలత తీసుకున్న మరు క్షణం బయటకి వచ్చేద్దాం. నగ తయారవగానే మీ ఊరు పంపుతాను” అంది ప్రాధేయ పడుతూ.
శివయ్యకి ఇష్టం లేకపోయినా, మహారాణీ అంత దీనంగా ప్రాధేయపడుతూ అడగడం, నగ ఇచ్చేస్తే తనకి విముక్తి వస్తుందని ఒప్పుకున్నాడు.
మహారాణీ, శివయ్యా సేవకులూ రథం మీద దేవాలయానికి వెళ్ళేరు. శివయ్య కళ్ళకి గంతలు కట్టుకొని మరీ రథం ఎక్కేడు.
దేవాలయంలో మహారాణి అతని చెయ్యిపట్టుకొని మరీ గర్భగుడిలోకి తీసుకెళ్ళింది. శివయ్య కొలత కోసం స్వామి విగ్రహపు నడుము పట్టుకున్నాడు. అతని చేతికి విష్ణు ప్రతిమ కాక శివలింగంలా తగిలింది.
శివయ్య ఉలిక్కిపడి “శివా! నువ్వా?” అంటూ కళ్ళ గంతలు లాగేసేడు. ఎదురుగా విష్ణుమూర్తి విగ్రహం.
“అయ్యో” అంటూ మళ్ళా కళ్ళకి గంతలు కట్టుకొని నడుం పట్టుకోబోతే మళ్ళా శివలింగమే చేతికి తగిలింది. “మహాదేవా! నువ్వా?” అంటూ కళ్ళ గంతలు తీసేసేడు. మళ్ళా నవ్వుతూ విష్ణుమూర్తి. ఇలా మరో రెండుసార్లు జరిగింది.
శివయ్య ఏడుస్తూ “స్వామీ! ‘శివకేశవులు ఒకటే’ అని నాకు చెప్పడానికా ఈ మాయ? అజ్ఞానినే కాదు అహంకారిని కూడా! అయినా నన్ను దీవించేవా?” అంటూ కాళ్ళమీద పడ్డాడు.
అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. మహారాణీ తేరుకొని
“శివయ్యా! నీలాటి భక్తుడిని చూడడం మా అదృష్టం. ఇహమీదట అందరం శివకేశవులని ఒకేలా పూజిద్దాం.” అంది. శివయ్య తన కళ్ళతో చూస్తూ స్వామివారి నడుం కొలత తీసుకున్నాడు.
మహారాణీ, ఈసారి చేసిన నగ శివయ్యనే అలంకరించమంది.
శివయ్య నగ పెట్టగానే ఏ తేడా లేకుండా చక్కగా అమరిపోయింది.
ఆలయ ప్రారంభం దాకా శివయ్య అక్కడే ఉండి, తన వంతుగా స్వామివారికి మకర కుండలాలూ, కౌస్తుభ మణీ తయారు చేసి, సమర్పించి, ప్రత్యేక పూజలు చేయించేడు.
మహారాణీ అతనికి చాలా కానుకలు ఇచ్చి, గౌరవంగా అతని ఊరు పంపింది.
అటు పిమ్మట శివయ్య శివకేశవులని సమానంగా పూజించడం మొదలెట్టేడు.
సమాప్తం.
కథా, కథనం అందించిన MaMangu Krishna Kumariారికి ధన్యవాదాలు.