15, జూన్ 2026, సోమవారం

రేపటికి పునాదులు*

  *రేపటికి పునాదులు*


*-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు,*

 


ఎండలు మండిన కాలానంతరం

బడుల్లో నవ క్రాంతి

భవిత కేంద్రాలకు కొత్త కాంతి

 

కొన్ని ఆశలు

హరివిల్లులై సాక్షాత్కరిస్తాయి

కొన్ని ఆశయాలు

గాలిపటాలై

అక్కడి వినువీధుల్లో

కనువిందు చేస్తాయి

కొన్ని కలలు

అక్కడ రంగురంగుల

రంగవల్లికలై

భూమాత హృదయానికి

రంగుల కలలద్దుతాయి

కొన్ని మెలకువలు

కిలకిలరావాలై

అక్కడ గాలి చేసే నృత్యానికి

నేపథ్య రాగాలవుతాయి

కొన్ని నెమళ్లు 

అక్కడ పురివిప్పి

నృత్యాలు చేస్తాయి

కొన్ని సీతాకోకచిలుకలు

అక్కడ మనసులకు రెక్కలిస్తూ  

పరిసరాలకు                                                     

ఆహ్లాదపు లేపనమద్దుతాయి

కొన్ని కంఠాలు   

దోస్తులను దూరం చేసిన

సెలవులను

నవ్వుల పువ్వులు               

వెదజల్లుతూ వెక్కిరిస్తాయి


ఇప్పుడు అక్కడ

పాత వెలుగులు

కొత్త మెరుగులు దిద్దుకుంటాయి

రేపటికి పునాదులు వేసుకుంటాయి


*(తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా)*

పరిపూర్ణ వికాస దిశగా

 *సందర్భం: జూన్ 15వ తేదీ పాఠశాలల పునఃప్రారంభం*


*పరిపూర్ణ వికాస దిశగా …*

*-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు* 


ఇక్కడి గోడలు

తిమిర నిర్మూలనకు

కంకణం కట్టుకున్న

విజ్ఞాన కేంద్రాలు


నోట్లోని శ్వేత కుడ్యాల చాటు నుండి

బుజ్జి నాలుకలు

లోపలికీ బయటికీ

కిందికీ పైకీ

లేలేత పెదాలు పైకీ కిందికీ

కదులుతూ

ఇక్కడి పరిసరాల్లో

అనునిత్యం జరిగే శబ్దప్రసారం  

అడుగడుగునా చేతనకు కారణమవుతుంది.


నోటి నుండి వెలువడే శబ్దానికి

రూపం కల్పిస్తూ

పలకపై రాసిన అక్షరాన్ని

మెదడు ఛాయాచిత్రంగా భద్రపర్చుకుంటుంది

ఆ ఛాయాచిత్రమే డీకోడ్ అయి

తిరిగి పెదవుల గుండా

పరావర్తనమవుతుంది


నల్లబల్లపై చిత్రితమయ్యే

అక్షరమాలలు

అరవై అవతారాలెత్తి  

ఒకేసారి అరవై గమ్యాలకు

ప్రయాణం చేస్తాయి  


ఇంటర్వెల్ బెల్లు కొట్టగానే

పరుగులు తీసే చిట్టి కాళ్లు

పాదముద్రలతో

బడినేలపై హాజరు వేసుకుంటాయ్


ఇక్కడే

చిట్టి నెమళ్లు

పరిసరాల్ని మరచి

పురివిప్పుకుని ఆడతాయ్  

చదువులూ

ఆటలూ

పాటలూ

పోటాపోటీగా కొనసాగుతాయ్  

సమగ్ర మూర్తిమత్వమూ

పరిపూర్ణ వికాసమూ

గమ్యాలుగా

అడుగులు కదులుతాయ్

అరుణాచలేశ్వరా

 _తండ్రీ అరుణాచలేశ్వరా!🌹_ 


ఎక్కడెక్కడో ఉన్నావని 

పిలిచి పిలిచి

అలసి సొలసి డస్సిపోయాను

ఎదలో కొలువైనావని 

ఎరిగే జ్ఞానము లేదు

ఆగని ఆరాటం 

అంతులేని ఉక్రోషం తో

మాటలు రాక మూగబోయిన మనసు

ఆర్తితో జాలువారిన 

కన్నీరు ఇంకిపొయింది

మరో కన్నీటి బొట్టు జనిస్తే

నీ అభిషేకానికి వాడుకో మహదేవా

నా ఎదలో చెమ్మతో మీరు 

ఎపుడూ చల్లంగా ఉండాలి


 _హరః నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర!🙏_

మన మనస్సులో కలిగే ఆలోచనలే మన స్వభావాన్ని నిర్మిస్తాయి.*

  *మన మనస్సులో కలిగే ఆలోచనలే మన స్వభావాన్ని నిర్మిస్తాయి.*


*ఎల్లవేళలా భగవంతుణ్ణే స్మరిస్తూ, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మన మనోబుద్ధులు ఆయనకే సమర్పించాలి. అప్పుడు నిస్సంశయంగా ఆయననే పొందుతాము.*


*పవిత్రములైన వాటి గురించి యోచిస్తే, మనం పవిత్రులం అవుతాము.*


*మన హృదయం సదా ప్రేమతో నిండి ఉంటే ద్వేషానికి అక్కడ తావులేదు. అప్పుడు మనలోని శాంతిని ఎవరూ భగ్నపరచలేరు.*


*మనం అజాగ్రత్తగా వ్యవహరిస్తే మన స్వభావం మారిపోగలదు. ఎవరి గురించైనా చెడు తలపు కలిగే ముందు ఆ చెడు మనలో ప్రవేశిస్తుంది.*


*మనం సాధు వర్తనను కలిగి ఉంటే సాధుశీలురం అవుతాము. దాని గురించి యోచిస్తే, ఆ సాధుత్వం మనలో స్ఫూర్తిని కలిగిస్తుంది.*


*మనకు సరియైన త్రోవను చూపుతుంది. మన జీవితాన్నే మార్చివేస్తుంది.*

ధనం పెరిగిన కొద్దీ

  “ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.”


వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది, అధికమైతే, 

ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.


ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...  తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !


అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. 


ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పద్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి.


చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా, ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. 


క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైనత ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి.


మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది. 


దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది! ఇది సత్యం ..!!

.

సత్సంగం

  🔔 *సత్సంగం* 🔔


అందరూ రెమెడీస్ చెబుతారు 

దోష నివారణలు చెబుతారు…

గ్రహశాంతులు, క్రియలు, హోమాలు, యజ్ఞాలు, రత్నాలు, తాయెత్తులు…...


మరి"కర్మ, పశ్చాత్తాపం, సేవ, ప్రేమ, క్షమ, బాధ్యత, మౌనం, వివేకం, ఆత్మపరిశీలన, నియమం, త్యాగం, ధర్మం, చైతన్యం… ఇవే ఎందుకు?”


“ఎందుకంటే…

రోగం బయట లేదు.

మనిషి లోపల ఉంది.


గ్రహాలు నీ జీవితాన్ని అంతగా నాశనం చేయవు.

నీ అహంకారం చేస్తుంది.


శని కన్నా భయంకరమైనది

నీ అలసత్వం, నిన్ను నువ్వు నమ్మకపోవడం, భయం..


రాహు కన్నా ప్రమాదకరమైనది

నీ మోహం, స్వార్థం..


కేతు కన్నా విచిత్రమైనది

నీ అయోమయం.


కుజదోషం కన్నా ఎక్కువ ఇళ్ళను కూల్చింది

మనుషుల కోపం.


పితృదోషం కన్నా ఎక్కువ శాపాన్ని ఇచ్చింది

తల్లిదండ్రుల కళ్లలో వచ్చిన కన్నీరు.


అందుకే నేను రెమెడీస్ కంటే

మనిషిని సరిచేసే మార్గం చెబుతాను.


ఎందుకంటే

నీ చేతులతో చేసిన కర్మను, కొబ్బరికాయలు కొడితే దేవుడు తుడిచేయడు.


నువ్వు నాటింది ముల్లు అయితే

పూజలతో పూలు పూయవు.


ఈ సృష్టి అంత చౌక కాదు.


వేదం ‘కర్మణ్యేవాధికారస్తే’ అని చెప్పింది.

ఉపనిషత్తులు ‘యథా కర్మ యథా శ్రుతం’ అని చెప్పాయి.

బుద్ధుడు ‘చిత్తమే మూలం’ అన్నాడు.

అష్టావక్రుడు ‘నీ బంధనానికి కారణం నీ మనసే’ అన్నాడు.


కానీ మనిషి ఏమి కోరుతున్నాడు?


పాపం చేసేందుకు స్వేచ్ఛ…

ఫలితం తప్పించుకునేందుకు రెమెడీ.


కోపం మార్చుకోడు…

కాని కుజశాంతి చేయిస్తాడు.


తల్లిదండ్రులను బాధపెడతాడు…

కాని పితృతర్పణం చేస్తాడు.


భార్యను ఏడిపిస్తాడు…

కాని లక్ష్మీపూజ చేస్తాడు.


మోసం చేస్తాడు…

కాని దోష నివారణ కోసం దేవాలయాలు తిరుగుతాడు.


ఇది ఆధ్యాత్మికత కాదు.

ఇది భయంతో చేసే వ్యాపారం.


నిజమైన పరిహారం ఏమిటో తెలుసా?


ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం.

నిన్ను నమ్మినవారిని మోసం చేయకపోవడం.

తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడం.

అహంకారాన్ని తగ్గించుకోవడం.

కోపం వచ్చినప్పుడు మౌనం పాటించడం.

డబ్బు కన్నా ధర్మాన్ని ఎంచుకోవడం.

రోజు కాసేపు జపం లేదా ధ్యానం చేయడం.


 తల్లిదండ్రులను, భర్తను, పెద్దలను, గురువును, ప్రేమించినవారిని నమ్మడం, గౌరవించడం...


స్వార్థం తగ్గించి సేవ చేయడం.

నిత్యం ఆత్మపరిశీలన చేయడం.


పిల్లలను ప్రేమతో, క్రమశిక్షణ తో పెంచడం..


ఇవే మహా రెమెడీస్.


ఎందుకంటే

దేవుడు నీ చేతిలో రాయి పెట్టలేదు…

బుద్ధి పెట్టాడు.


దేవుడు నీకు తాయెత్తు ఇవ్వలేదు…

వివేకం ఇచ్చాడు.


అందుకే నేను

భయాన్ని కాదు — బాధ్యతను నేర్పుతాను.

రెమెడీని కాదు — రూపాంతరాన్ని చెబుతాను.


ఎందుకంటే

జాతకం మారితే జీవితం కొద్దిగా మారొచ్చు…

కాని

మనిషి మారితే అతని ప్రపంచమే మారిపోతుంది.”


రోజు తప్పకుండా ధ్యానం లేదా జపం చేస్తే - మనని మనం సులువుగా జయించవచ్చు 🙏🏻

_వజ్ర కవచం 1000 కోట్ల కథ_

 _వజ్ర కవచం 1000 కోట్ల కథ_


_శ్రీవారి అత్యంత ఖరీదైన ఆభరణం_


_వజ్ర కవచం అంటే:_  

స్వామివారి శరీరాన్ని పూర్తిగా కప్పే బంగారు కవచం. దీనిపై 28000 పైగా వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగి ఉంటాయి. మొత్తం బరువు సుమారు 30 కేజీల బంగారం. ఇప్పటి విలువ 1000 కోట్లకు పైనే.


_ఎవరు చేయించారు:_  

1930లలో మైసూర్ మహారాజు నాలుగవ కృష్ణరాజ వడయార్ భక్తితో చేయించారు. ఆ రోజుల్లోనే లక్షలు ఖర్చు అయింది.


_ఎప్పుడు తొడుగుతారు:_  

సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే శుక్రవారం నాడు. దీన్నే "వజ్ర కవచ అలంకారం" అంటారు. ఆ రోజు స్వామి దర్శనం మహా అద్భుతం.


_విశేషం:_  

1. వజ్రం ఇంద్రుడి ఆయుధం. ఈ కవచం వల్ల స్వామి శక్తి వంద రెట్లు పెరుగుతుందని నమ్మకం.  

2. ఈ కవచాన్ని ఎప్పుడూ తూకం వేయరు. లెక్క పెట్టరు.  

3. మిగతా రోజుల్లో 6 లాకర్ల భద్రతలో TTD ఖజానాలో ఉంటుంది.


_ఉత్సవమూర్తికి:_  

మలయప్ప స్వామికి కూడా చిన్న వజ్ర కవచం ఉంది. దాన్ని గరుడ సేవ రోజు తొడుగుతారు.


_గమనిక:_  

వజ్ర కవచ అలంకారంలో ఉన్న స్వామి ఫోటోలు TTD వెబ్‌సైట్‌లో చూడవచ్చు. గర్భగుడి దీపాల కాంతి వజ్రాలపై పడి గుడి అంతా వెలిగిపోతుంది.


_ఓం నమో వెంకటేశాయ_ 🙏


🟡🟢🔴🔵🙏🔵🔴🟢🟡

కాలం వేగాన్ని అణచే అంకుశం

 కాలం వేగాన్ని అణచే అంకుశం - ​విష్ణు పాదంలోని కాల రహస్యం..........!!

​మహావిష్ణువు కుడి పాద పద్మంపై రెండు ముఖ్యమైన చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి ఒకటి వజ్రాయుధం, మరొకటి అంకుశం (ఏనుగును నియంత్రించడానికి ఉపయోగించే ఆయుధం).

​సాధారణంగా వీటిని కేవలం ఆయుధాలుగానే చూస్తారు. కానీ, ఇవి కాల గమనానికి మరియు మన ఆత్మకు సంబంధించిన ఒక లోతైన విశ్వ రహస్యాన్ని తమలో దాచుకున్నాయి.


​వజ్రాయుధ చిహ్నం.......

​మార్చలేని కాల నియమం. కాలాన్ని ఎవరూ మార్చలేరు, వంచలేరు; అది వజ్రాయుధంలా అత్యంత బలమైనది. మనం చేసే పుణ్య, పాప కర్మల ఫలాలను కాలం మనకు అత్యంత ఖచ్చితత్వంతో అందిస్తుంది. అయితే, భగవంతుడి పాదాలపై ఉండే ఈ వజ్రాయుధ చిహ్నం దేనికి సంకేతమో తెలుసా? విధి బలీయత వల్ల కలిగే కర్మ ఫలాలను, కాలం యొక్క క్రూరమైన ప్రభావాలను ముక్కలు ముక్కలు చేసే శక్తి కేవలం ఆ పరమాత్ముని పాదాలకు మాత్రమే ఉందనే పరమ రహస్యాన్ని ఇది మనకు బోధిస్తుంది!


​అంకుశ చిహ్నం..........

​కాలాన్ని, మనస్సును లొంగతీసుకోవడం. మదించిన ఏనుగును మావటివాడు ఒక చిన్న అంకుశంతో లొంగతీసుకుంటాడు. ఈ విశ్వంలో మదగజం కంటే వేగంగా పరుగెత్తేది ఏంటో తెలుసా? ఒకటి 'కాలం', మరొకటి మన 'మనస్సు'!

​గత కాలపు బాధల్లో, భవిష్యత్తు గురించిన భయాల్లో చిక్కుకుని మన మనస్సు నిరంతరం పరుగెడుతూనే ఉంటుంది. మహావిష్ణువు తన పాదంలో ఈ అంకుశాన్ని ధరించడం వెనుక ఉన్న రహస్యం ఇదే మనం ఆయన పాదాలను శరణు వేడినప్పుడు, అదుపు లేకుండా పరుగెత్తే మన మనస్సు శాంతిస్తుంది, మనల్ని శాసించే కాలం యొక్క వేగం కూడా అణిగిపోయి ప్రశాంతత చేకూరుతుంది.


​మన సిద్ధులు (మహర్షులు) చూపిన ఆధ్యాత్మిక మార్గం యొక్క ముఖ్య ఉద్దేశ్యం "మనస్సును ఏకాగ్రం చేయడం" (నిశ్చలం చేయడం). మనస్సు లొంగిపోతే, అక్కడ కాల గమనం ఆగిపోతుంది; మరణం లేని మహాజీవనం లభిస్తుంది. విష్ణు పాదంలోని అంకుశం, మన చంచల బుద్ధిని అణచివేసి, కాలాన్ని దాటి నిలిచే "శాశ్వత బ్రహ్మానంద" స్థితికి మనల్ని నడిపించే ఒక దివ్య సంకేతం.


​కాల చక్రంలో, విధి చేతిలో చిక్కుకుని తల్లడిల్లకుండా ఉండటానికి.. ఆ కాలాన్నే శాసించే పరమేశ్వరుని పాద చిహ్నాలను మన హృదయంలో ప్రతిష్టించుకుందాం! 

​"మనస్సు అనే ఏనుగును ఆయన పాదాలనే అంకుశంతో అదుపు చేద్దాం; కాలాన్ని దాటి ఆ పరబ్రహ్మంలో లీనమవుదాం!"

తాబేలు రావడం వల్ల

 "ఇంట్లోకి తాబేలు రావడం వల్ల దురదృష్టం కలగదు, ఇదొక భ్రమ మాత్రమే".............!!

​భారతీయ లోకజీవనంలో "తాబేలు గనుక ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లు వృద్ధి చెందదు" అనే ఒక సామెత ప్రచారంలో ఉంది. ఈ సామెత ఆధారంగా చాలా మంది తాబేలును అశుభానికి, దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కానీ ఈ నమ్మకం నిజంగా నిజమేనా?

​నిజానికి తాబేలు ఏమాత్రం అశుభకరమైన జీవి కాదు. సనాతన ధర్మంలో తాబేలుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. భగవంతుడైన విష్ణుమూర్తి దశావతారాలలో రెండవ అవతారం కూర్మావతారం (తాబేలు అవతారం).


 క్షీరసాగర మధనం సమయంలో విష్ణుమూర్తి తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై మోశారు. సాక్షాత్తూ శ్రీహరి స్వరూపంగా భావించే జీవిని అశుభం అని ఎలా అనగలం?

​ఒకవేళ ఎప్పుడైనా తాబేలు మీ ఇంట్లోకి వస్తే, దానికి హాని చేయకండి. ప్రేమతో దానిని సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టండి. అనేక సంప్రదాయాలలో దీనిని విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిల అనుగ్రహానికి సంకేతంగా కూడా భావిస్తారు.


​నిజానికి కాలక్రమేణా ఈ సామెత యొక్క మూల రూపం మారిపోయింది. ప్రాచీన తమిళ సంప్రదాయంలో అసలు సామెత ఇలా ఉండేది.

​"ఆంబి పూసిన ఇల్లు వృద్ధి చెందదు."

​ఇక్కడ "ఆంబి" అంటే కుక్కగొడుగు (మష్రూమ్). కుక్కగొడుగులు సాధారణంగా చీకటి, తేమ, శిథిలావస్థ మరియు కుళ్ళిన ప్రదేశాలలో పెరుగుతాయి. ఏదైనా ఇంట్లో నిరంతరం తేమ, చీకటి మరియు కుళ్లు ఉంటే, అక్కడ రోగాలు, అనారోగ్యం మరియు దరిద్ర వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి ఇల్లు వృద్ధి చెందకపోవడం సహజం.


​కాలక్రమేణా "ఆంబి" అనే పదం యొక్క ఉచ్చారణ మారి "ఆమి" గా, ఆ తర్వాత "ఆమా (తాబేలు)" గా రూపాంతరం చెందింది. దీనివల్ల సామెత యొక్క అసలు అర్థమే మారిపోయింది.

​కాబట్టి తాబేలును తప్పుపట్టడం సరైనది కాదు. అశుభానికి కారణం తాబేలు కాదు, ఇంటి యొక్క అపరిశుభ్రత, చీకటి మరియు తేమ మాత్రమే.


​కూర్మావతార స్తుతి......


​నమామి దేవం కూర్మాఖ్యం

మందరాధారకారకమ్।

సముద్రమంథనే విష్ణుం

భక్తానాం హితకారకమ్॥


​కూర్మ గాయత్రీ మంత్రం.........


​ఓం కూర్మరూపాయ విద్మహే

మహావిష్ణవే ధీమహి।

తన్నో కూర్మః ప్రచోదయాత్॥


​ఎవరైతే శ్రద్ధతో కూర్మావతారాన్ని స్మరిస్తారో, వారి జీవితంలో సహనం, స్థిరత్వం, రక్షణ మరియు విష్ణుమూర్తి అనుగ్రహం నిలిచివుంటాయి.

సోమవతి అమావాస్య

 సోమవతి అమావాస్య


  సోమవారం రోజున వచ్చే అమావాస్య. 

హిందూ ధర్మంలో ఇది అత్యంత పుణ్యప్రదమైన అమావాస్యలలో ఒకటిగా భావించబడుతుంది.


సోమవతి అమావాస్య ప్రాముఖ్యత:

ఈ రోజు పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధం చేయడం ఎంతో శ్రేయస్కరం.

పవిత్ర నదుల్లో స్నానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతాయి.

వివాహిత స్త్రీలు భర్త ఆయురారోగ్యాల కోసం వ్రతం ఆచరిస్తారు.

రావి (అశ్వత్థ) చెట్టుకు ప్రదక్షిణలు చేసి పూజ చేస్తారు.

దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని నమ్మకం.

వ్రత విధానం

ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి.

సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి.

శివుడు, విష్ణువు, పితృదేవతలను పూజించాలి.

అశ్వత్థ వృక్షానికి జలాభిషేకం చేసి 108 ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ.

ఉపవాసం లేదా ఫలాహారం తీసుకోవచ్చు.

బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి.

ఆధ్యాత్మిక ఫలితాలు

పితృదోష నివారణకు ఉపకరిస్తుందని విశ్వాసం.

కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం.

పాపక్షయం మరియు పుణ్యప్రాప్తి కలుగుతాయని పురాణాలు పేర్కొంటాయి.

2026లో సోమవతి అమావాస్య

2026 సంవత్సరంలో జూన్ 15, సోమవారం రోజున సోమవతి అమావాస్య వస్తోంది.


సోమవతి అమావాస్య పూజా విధానం :

తేదీ: 15 జూన్ 2026, సోమవారం

సంకల్పం

స్నానం చేసి, తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖంగా కూర్చుని ఇలా సంకల్పం చేయండి:

"మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, పితృదేవతానుగ్రహ సిద్ధ్యర్థం, కుటుంబ క్షేమ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సోమవతి అమావాస్య వ్రతం కరిష్యే."

పూజా సామగ్రి

పసుపు, కుంకుమ

పూలు

దీపం, అగరుబత్తులు

పండ్లు

కొబ్బరికాయ

నువ్వులు

అక్షింతలు

తులసి దళాలు (విష్ణు పూజకు)

పూజా క్రమం

గణపతి ప్రార్థన

శివ పూజ

విష్ణు పూజ

పితృ తర్పణం (తెలిసినవారు చేయవచ్చు)

అశ్వత్థ (రావి) వృక్ష పూజ

దీపారాధన

నైవేద్యం

హారతి

శివ ప్రార్థన

ఓం నమః శివాయ

108 సార్లు జపించవచ్చు.

విష్ణు ప్రార్థన

ఓం నమో నారాయణాయ

108 సార్లు జపించవచ్చు.

పితృ తర్పణం కోసం సరళ ప్రార్థన

"మా పితృదేవతలు సంతుష్టులై మమ్మల్ని అనుగ్రహించుగాక."

రావి చెట్టు ప్రదక్షిణ

సాధ్యమైనంత వరకు 11, 21 లేదా 108 ప్రదక్షిణలు చేయండి.

ప్రతి ప్రదక్షిణ సమయంలో:

ఓం నమో భగవతే వాసుదేవాయ

అని జపించవచ్చు.

దానం చేయవలసినవి

నువ్వులు

బియ్యం

వస్త్రాలు

పండ్లు

అన్నదానం

అమావాస్య రోజున చదవదగిన స్తోత్రాలు

విష్ణు సహస్రనామం

శివ పంచాక్షరి స్తోత్రం

ఆదిత్య హృదయం

గరుడ పురాణంలోని పితృ స్మరణ శ్లోకాలు

విశేష ఫలితం

సోమవతి అమావాస్య రోజున స్నానం, జపం, పూజ, పితృతర్పణం, దానం చేయడం ద్వారా పితృ అనుగ్రహం, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటాయి.

శుభమస్తు. శ్రీ పరమేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు, పితృదేవతల అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.