5, ఆగస్టు 2026, బుధవారం

శ్రీమద్భాగవతం

  *మంగళవారం 4 ఆగస్టు 2026*


*శ్రీమద్భాగవతం - 11/42* 


        *పృథు చక్రవర్తి చరిత్ర*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత అధ్యయనం లో భాగంగా 

నిన్నటి రోజున ధ్రువుని బాల్యం, చిన్నమ్మ సురుచి పరుషోక్తులు, నారద మంత్రోపదేశం, సుమధుర తపస్సు మరియు అచలమైన ధ్రువ పదాన్ని పొందడం గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈరోజు **చతుర్థ స్కంధం – అధ్యాయాలు 13 నుండి 23**ఆధారంగా శ్రీమహావిష్ణువు అవతారమైన **పృథు చక్రవర్తి అవతారం గురించి, భూదేవిని గోవుగా మలచి సమస్త రసాలను, సంపదలను పిండడం మరియు పృథురాజ యజ్ఞాల విశేషాలు**శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహించిన మేరకు తెలుసుకుందాం.


1. వేనరాజు అధర్మ పాలన & మునుల శాపం (4వ స్కంధం – 13, 14 అధ్యాయాలు)


ధ్రువుని వంశంలో 'అంగుడు' అనే ధర్మాత్ముడైన రాజుకు **'వేనుడు'** అనే పుత్రుడు జన్మించాడు. వేనుడికి తల్లి వైపు నుండి అధర్మ గుణాలు అబ్బాయి(తల్లి గారి తండ్రి అధర్మాంశ అయిన మృత్యువు). తండ్రి అయిన అంగుడు ఎంత ప్రయత్నం చేసినా అతడు దారిలోకి రాకపోవడంతో, వేనుడి ప్రవర్తనకు విరక్తి చెంది ఎవరికీ చెప్పకుండా అడవులకు వెళ్లిపోయాడు.


ప్రజాపాలన కోసం మహర్షులు వేనుడికి పట్టాభిషేకం చేశారు. కానీ అధికార మదంతో వేనుడు తీవ్రమైన అహంకారిగా మారాడు:


* రాజ్యంలో యజ్ఞయాగాదులు, దానధర్మాలు, హరిపూజలు పూర్తిగా నిషేధించాడు.


* "నేనే పరమేశ్వరుడిని, నాకే పూజలు చేయాలి" అని చాటింపు వేయించాడు.


మహర్షులు ఎంత హితవు చెప్పినా వేనుడు వినకపోగా, వారిని అతి ఘోరంగా,తీవ్రముగా అవమానించాడు. దాంతో మునులు ధర్మ రక్షణ, ప్రజల క్షేమం కోసం తమ తపోబలంతో **"హుంకారం"** చేసి వేనుడిని సంహరించారు.


 2. *పృథు చక్రవర్తి ఆవిర్భావం* 


కానీ రాజు లేకపోవడంతో రాజ్యంలో అరాచకం, చోరభయం ఎక్కువయ్యాయి. దాంతో మహర్షులు మళ్ళీ ఎంతో దిగులు చెందారు.

అంగరాజు గారి వంశం ఎంతో పవిత్రమైనది, వారంతా సాక్షాత్ శ్రీహరి అనుగ్రహం పొందిన మహానుభావులు అది అంతం కాకుడదు,ఏదో ఉపాయం చేత తిరిగి పునరుద్ధరించాలి అని నిర్ణయం తీసుకుని. మృతుడైన వేనుడి ఒక తోడను బాగా మధించారు .


1. అప్పుడు వేనుడి ఒక తొడ నుండి నల్లటి రూపంతో, కురచ శరీరంతో అధర్మ స్వరూపుడైన **'నిషాదుడు'** జన్మించాడు. జన్మిస్తూనే నేను ఏమి చేయాలి అని మునులను అడిగాడు, ఋషులు నిశీధ అంటే కూర్చో అన్నారు.ఆ కారణంగా అతడు నిషాదుడు అని పిలవబడ్డాడు. అతను పుట్టుకతోనే వేణుని క్రూరత్వానికి వారసుడు అయ్యాడు,వారు గ్రామ పట్టణాల్లో నివసింపక అడవులకు వెళ్లి నిషాద (బోయ) వంశానికి మూలపురుషుడయ్యాడు. అతని వంశం వారినే నైషధులు అంటారు.


2. అనంతరం వేనుడి చేతులను మథించగా, అందులో ఒక భుజం నిండు నుండి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు దివ్యాంశతో, శంఖ చక్ర రేఖలు కలిగిన చేతులతో **'పృథు చక్రవర్తి'** ఆవిర్భవించాడు! ఆయనతో పాటు మరో చేతి నుండి ఆయన ధర్మపత్నిగా 'అర్చి' అనే దేవి కూడా ఉద్భవించింది.


దేవతలు, మహర్షులు ఆనందించి ఇతను మున్ముందు గొప్ప మహారాజు అవుతాడు, అతని యశస్సు జగద్వ్యాప్తం అవుతుంది.మహా ప్రభువులలోనే అగ్రగణ్యుడు అవుతాడు అన్నారు.ఆ సమయంలో దేవ దుందుభులు మోగాయి. పృథువు అని పేరు పెట్టారు. ఆ మహారాజుకు చేతిలో శంఖ చక్రం చిహ్నాలు ఉన్నాయి.


ఆ తర్వాత ఋషులు పృథువుకు పట్టాభిషేకం చేసి, అనేక దివ్య ఆయుధాలను, రథాన్ని బహుకరించారు.


3. భూదేవిని గోవుగా మలచి ధాన్యాలు పిండడం (17, 18 అధ్యాయాలు)


వేనుడి పాలనలో యజ్ఞాలు ఆగిపోవడం వల్ల భూదేవి సమస్త ఓషధులను, ధాన్యాలను తన కుక్షిలో (కడుపులో) దాచుకుంది. దీనివల్ల రాజ్యంలో తీవ్రమైన క్షామం (కరువు) వచ్చి ప్రజలు ఆకలితో అలమటించసాగారు.


* **పృథువు ఆగ్రహం:** ప్రజల ఆకలి కేకలు విన్న పృథు చక్రవర్తి ధనుర్బాణాలు ధరించి, భూదేవిపైకి దండయాత్రకు సిద్ధమయ్యాడు.


* **భూదేవి శరణాగతి:** భూదేవి భయపడి **గోవు (ఆవు)** రూపాన్ని ధరించి పారిపోగా, పృథువు ఆమెను వెంటాడాడు. చివరకు భూదేవి పృథువును శరణువేడి ఇలా అంది:


 "రాజా! వేనుడి వంటి అధర్మాత్ములు ధాన్యాన్ని దుర్వినియోగం చేస్తారని నేను ఓషధులను కడుపులో దాచుకున్నాను. 

అనుభవజ్ఞులైన పెద్దలు బాగుగా ఆలోచించి, తెలిపిన శాస్త్రీయ *విధానముల యెడ ఆదరము చూపక అజ్ఞానియగు మానవుడు తాను స్వయముగా కల్పించుకొనిన ఉపాయములను ఆశ్రయించినచో, అవి శాశ్వతముగా సత్ఫలితములను ఇయ్యజాలవు. వాటికై మరలమరల కృషి చేసినను ఫలితము ఉండదు.


నరేంద్రా! సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు సకలజనుల శ్రేయోభివృద్ధికై ధాన్యాది వనస్పతులను సృజించెను. కాని వాటిని అందరికిని అందుబాటులో ఉండనీయక స్వార్థపరులైన దుష్టులు అనుభవించుచున్నారు. ఇది నేను స్వయముగా గమనించితిని.


ప్రజలకు ఉపయోగపడవలసిన పైరుపంటలను దుర్మార్గులు దొంగలవలె దోచుకొనుచున్నారు. అందువలన సమస్త ప్రజల క్షేమముకొరకై వాటిని (ఆ ఓషధులను) నాలో దాచుకొంటిని (పాలకులు ఆహారధాన్యాదులను ప్రజలందరికిని అందించుటకై సరియగు వ్యవస్థను నడపనిచో స్వార్థపరులు దొంగలై వాటిని దోచుకొందురు .


చాలా కాలము గడచిపోవుటతో ఆ ధాన్యాదులు నాలో జీర్ణమైపోయినవి. 


నన్ను సంహరిస్తే ప్రజలకు ఆధారం ఉండదు. నన్ను చంపక, ఒక దూడను నిలిపి, సమస్త లోకాలకు ఏది కావాలో దానిని నా నుండి పిండుకో!"


* **భూమిని సమం చేయడం & పిండడం:** 


పృథు చక్రవర్తి **స్వాయంభువ మనువును దూడగా చేసి**, తన చేతులనే పాత్ర గామార్చి భూమి అనే గోవు నుండి సమస్త ధాన్యాలను, ఓషధులను పితికాడు.


* **మహర్షులు:** బృహస్పతిని దూడగా చేసి వేదాలను, తపస్సును పితికారు.


* **దేవతలు:** ఇంద్రుడిని దూడగా చేసి అమృతాన్ని, వీర్యాన్ని పితికారు.


* **దైత్యులు/రాక్షసులు:** ప్రహ్లాదుడిని దూడగా చేసి మద్యాన్ని, రక్తాన్ని పితికారు.


* **నాగులు:** తక్షకుడిని దూడగా చేసి విషాన్ని పితికారు.


*గంధర్వులు**విశ్వావసుడు అనే గంధర్వునీ దూడగా చేసుకొని పద్మరూప పాత్ర యందు సంగీతం,వాఙ్మయం, సౌందర్యం అనే వాటిని పిండారు.(ఇంకా చాలా చెప్పబడ్డాయి విస్తార భీతి చేత ముఖ్యమైన వి అందించాను.)


అనంతరం పృథు చక్రవర్తి తన ధనుస్సు కొనతో పర్వతాలను పిండి చేసి, భూమిని సమతలం చేసి మానవ నివాసాలకు, వ్యవసాయానికి అనువుగా మార్చాడు. పృథు మహారాజుకి ముందు ప్రజలు తోచిన స్థలం లో నివసించేవారు కానీ, భూమిని చదును చేసి పట్టణ, నగర వ్యవస్థలు ఏర్పాటు చేశాడు.భూదేవిని తన పుత్రికగా స్వీకరించాడు. అందుకే భూమికి **'పృథ్వి'** అనే పేరు వచ్చింది!


4. వంద అశ్వమేధ యజ్ఞాలు & ఇంద్రుని గర్వభంగం (19, 20 అధ్యాయాలు)


పృథు చక్రవర్తి బ్రహ్మావర్తంలో వంద (100) అశ్వమేధ యజ్ఞాలు చేయడం ప్రారంభించాడు. ఇప్పటికే 100 యజ్ఞాలు చేసిన ఇంద్రుడు, పృథువు తన పదవిని ఆక్రమిస్తాడేమోనని ఈర్ష్య పడ్డాడు.99 యజ్ఞాలు దిగ్విజయంగా పూర్తి చేసాడు కానీ వందవ యజ్ఞంలో.


* **అశ్వాపహరణం:** ఇంద్రుడు సన్యాసి వేషంలో వచ్చి యజ్ఞ అశ్వాన్ని (గుర్రాన్ని) దొంగిలించి పారిపోయాడు. పృథువు కుమారుడైన 'జితాశ్వుడు' ఇంద్రుడిని వెంటాడి గుర్రాన్ని తిరిగి తెచ్చాడు. ఇంద్రుడు మళ్లీ మళ్లీ గుర్రాన్ని అపహరించాడు.


* **పృథువు శాంతి:** పృథువు కోపంతో ఇంద్రుడిని యజ్ఞాగ్నిలో ఆహుతి చేయడానికి సిద్ధపడగా, బ్రహ్మదేవుడు వచ్చి: "పృథురాజా! నీకు ఇంద్రపదవితో పనిలేదు. 99 యజ్ఞాలతోనే నిలిపివేయి" అని నచ్చచెప్పి.పితృదేవతలు, దేవతలు, ఋషులు మానవులు మొదలగువారు పెక్కుమంది నీ ఆహ్వానమును అందుకొని యజ్ఞమునకు విచ్చేసిరి. వారిని అందరిని చక్కగా పూజించి, దానములతో, బహుమతులతో సత్కరించు అన్నారు అలాగే చేశాడు.నీకు శుభమగుగాక!” అని ఆశీర్వదిచారు.


* **శ్రీహరి ప్రత్యక్షం:** పృథువు యజ్ఞాన్ని నిలిపివేయగానే సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఇంద్రుడితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహా విష్ణువు సనక సనందన ఋషులు నీకు ఆత్మజ్ఞాన బోధ చేస్తారు అని చెప్తాడు.(ఇక్కడ రాజ ధర్మాలు అనేకం చెప్తాడు శ్రీమహా విష్ణువు)


ఇంద్రుడు పృథువు పాదాలపై పడి క్షమాపణ కోరాడు. పృథువు ఇంద్రుడిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు.


5. సనత్కుమారుల బోధ & పృథువు నిర్యాణం (21, 22, 23 అధ్యాయాలు)


యజ్ఞవాటికకు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు వేంచేయగా పృథువు వారిని పూజించాడు.వారు 


పూర్వకర్మల వాసనలు అన్నియును కలిసి జీవునకు అహంకారరూపమగు గ్రంథిగా ఏర్పడును. సత్పురుషులు వాసుదేవుని చరణకమలముల వ్రేళ్ళనుండి ప్రసరించెడు కాంతులను స్మరించి, అనన్యభక్తిని చేయుదురు. దాని ప్రభావమువలన ఆ అహంకారరూపమగు గ్రంథిని సునాయాసముగా విప్పుకొని కృతకృత్యులు అగుచున్నారు.


కాని, యోగాభ్యాసపరులు ఇంద్రియములను నిరోధించి అంతఃకరణవృత్తులను నిలిపివేసిన సమాధిస్థితిలో కూడా అంత తేలికగా వారు అహంకారముడిని విప్పలేకపోయెదరు. అట్టి వాసుదేవుని నీవు శరణుగోరి చక్కగా సేవింపుము. 


భగవంతుని ఆశ్రయింపనివారు ‘మనస్సు పంచేంద్రియములు' అనెడి ఆరు మొసళ్లతో నిండిన సంసార సాగరమును దాటుట యోగాభ్యాసాదులద్వారా గూడ కష్టసాధ్యము. కనుక, నీవు సులభముగా ఆరాధింపదగిన భగవంతుడైన శ్రీహరియొక్క పాదపద్మములనెడి నౌకను ఆశ్రయించి దుస్తరమైన భవసాగరమును దాటుము”. అని సనత్కుమారులు పృథువుకు పరమ ఆత్మజ్ఞానాన్ని, భగవద్భక్తి మహత్యాన్ని ఉపదేశించారు.


ఆ తదుపరి పరిపూర్ణమైన ధర్మపాలన చేసి పృథు చక్రవర్తి తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి, తన ప్రజలకు దివ్యమైన సుదీర్ఘమైన సందేశం ఇచ్చి భార్య అర్చితో కలిసి అడవులకు వెళ్లి తీవ్రమైన తపస్సు చేశాడు. యోగమార్గంలో దేహాన్ని విడిచి పరమపదాన్ని పొందాడు. పృథువు వెంటే అర్చీదేవి కూడా సహగమనం చేసి దివ్యలోకాలను చేరుకుంది.


ఆత్మజ్ఞానులలో శ్రేష్ఠుడైన పృథుమహారాజు వైకుంఠమును పొందెను. మహారాణియైన అర్చియు అంతటి పుణ్యాత్మురాలే. ఆమె అమరభామినుల స్తుతులను అందుకొనుచు తన పతిదేవుడు చేరిన పరమపదమును పొందెను. 


 విదుర! పృథుమహారాజు పరమభాగవతోత్తముడు, అలౌకిక ప్రభావశాలి. ఉదారచరితుడు. అట్టి మహాత్ముని చరితమును నీ అభ్యర్థనపై నేను వివరించితిని. ఈ వృత్తాంతము పరమపవిత్రమైనది. ఏకాగ్రచిత్తులై నిష్కామభావముతో దీనిని పఠించినవారు, వినిపించినవారు, వినువారుకూడ పృథుమహారాజు చేరిన పరమపదమును పొందుదురు. 


ఈ పునీతచరితమును సాదరముగా ముమ్మారు వినిన స్త్రీలుగాని, పురుషులుగాని ధన్యతను పొందుదురు. సంతానము లేనివారు ఉత్తమ సంతానముతో వర్ధిల్లుదురు. నిర్ధనులు గొప్ప సంపన్నులగుదురు.ప్రసిద్ధులు కానివారు యశోవైభవములతో తేజరిల్లుదురు. పామరులు పండితులగుదురు. ఈ వృత్తాంతము మానవాళికి అభ్యుదయములను చేకూర్చును. అశుభములను పారద్రోలును. 


ఈ దివ్యగాథ ధనధాన్యములను ఇచ్చును. కీర్తిప్రతిష్ఠలను పెంపొందించును. ఆయురారోగ్యములను వృద్ధిపరచును. కలియుగ దోషములను నిర్మూలించును.అని పృథు మహారాజు గారి వృత్తాంతం పూర్తి చేశాడు మైత్రేయ మహర్షి.


📝 నేటి ముఖ్య విషయాలు:


1. **పృథువు – పర్యావరణ పరిరక్షణ:** భూమిని సమతలం చేయడం, వ్యవసాయం, నివాస ప్రాంతాల ఏర్పాటుకు మూలపురుషుడు పృథు చక్రవర్తి.


2. **అహంకార రహిత శక్తి:** 100వ యజ్ఞం పూర్తి కాకపోయినా, భగవంతుని ఆజ్ఞకు లొంగి ఇంద్రుడిని క్షమించడమే పృథువు మహోన్నత వైష్ణవ గుణం.


3. **ప్రజాపాలన ముఖ్యం:** రాజు లేదా పాలకుడు ప్రణాళికాబద్ధంగా సంపదను సృష్టించి ప్రజల ఆకలిని తీర్చడమే ఉత్తమ పాలన అని పృథు చరిత్ర ప్రబోధిస్తుంది.


రేపటిరోజు చతుర్థ స్కంధ ముగింపు – ప్రచేతసుల వృత్తాంతం & జీవుడు, దేహం, మాయల అంతరార్థం కలిగిన అత్యద్భుత రూపక కథ "పురంజనోపాఖ్యానం" యథాతథంగా తెలుసుకుందాం!


...🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

05ఆగష్టు2026

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌷 *బుధవారం*🌷 

 *🪷05ఆగష్టు2026🪷*  

  *దృగ్గణిత పంచాంగం* 

                

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు*

*ఆషాఢ మాసం - బహుళపక్షం* 


*తిథి : సప్తమి* రా 08.42 వరకు ఉపరి *అష్టమి*

*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : అశ్విని* రా 09.18 వరకు ఉపరి *భరణి*

*యోగం : శూల* సా 05.29 వరకు ఉపరి *గండ*

*కరణం  : భద్ర* ఉ 09.26 *బవ* రా 08.42 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.30 - 08.00 & 09.00 - 10.00*      

అమృత కాలం  : *మ02.16- 03.50*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    :సా05.24 - 06.57*

*దుర్ముహూర్తం  :ప11.48- 12.39*

*రాహు కాలం   : మ12.13- 01.49*

గుళికకాళం      : *ఉ 10.37 - 12.13*

యమగండం    : *ఉ 07.25 - 09.01*

సూర్యరాశి : *కర్కాటకం*                 

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 05.57*

సూర్యాస్తమయం :*సా 06.48*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ05.49- 08.23*

సంగవ కాలం        : *08.23 - 10.56*

మధ్యాహ్న కాలం    : *10.56 - 01.30*

అపరాహ్నకాలం  : *మ01.30-04.04*

*ఆబ్ధికం తిధి        : ఆషాఢ బహుళ సప్తమి*

సాయంకాలం    : *సా04.04- 06.38*

ప్రదోష కాలం      : *సా06.38 -08.52*

రాత్రి కాలం        :*రా 08.52 - 11.51*

నిశీధి కాలం        : *రా11.51 -12.36*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.20 - 05.04*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

పురంజనోపాఖ్యానం

 *బుధవారం 5 ఆగస్టు 2026*


*శ్రీమద్భాగవతం - 12/42*


*పురంజనోపాఖ్యానం & ప్రచేతసుల తపస్సు*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత అధ్యయనం లో భాగంగా 

నిన్నటి రోజున పృథు చక్రవర్తి అవతార విశేషాలు తెలుసుకున్నాం. ఈరోజు చతుర్థ స్కంధం – అధ్యాయాలు 24 నుండి 31ఆధారంగా శ్రీమద్భాగవతంలోనే అత్యంత విలక్షణమైన ఆధ్యాత్మిక రూపక కథ — పురంజనోపాఖ్యానం మరియు ప్రచేతసుల వృత్తాంతం తెలుసుకుందాం.


1. *ప్రచేతసులు & పరమశివుని 'రుద్ర గీత '*

పృథు చక్రవర్తి తపస్సుకు వెళ్ళిన తర్వాత విజితాశ్వుడు రాజు అయ్యాడు ఆయన గొప్పగా పాలన చేశాడు,ఆ తర్వాత ఆయన కుమారుడు హవిర్దానుడు పాలన చేశాడు ఈ హవీర్ధానునికి బర్హిషధుడు అని కుమారుడు ఈయన కర్మ కాండలు యోగ విద్యలలో గొప్ప నిపుణుడు అందువల్ల అతను ప్రజాపతి పదవి పొందాడు.


బర్హిషదుడు వరుసగా దేవయజ్ఞమును ఆచరించుచు కుశాగ్రములు(దర్భల కొనలు) తూర్పుదిక్కునకు ఉండునట్లు పరచెను. ఆ దర్భలతో ఆ ప్రదేశము పూర్తిగా నిండిపోయెను. అందువలన అతడు 'ప్రాచీనబర్హి' అను పేరుతో ప్రసిద్ధిగాంచెను.


ప్రాచీనబర్హి సముద్రుని కుమార్తెయైన శతద్రుతిని బ్రహ్మదేవుని ఆదేశముపై వివాహమాడెను ఆమె వలన ప్రాచీన బర్హికి పదిమంది కుమారులు జన్మించారు. వారిని 'ప్రచేతసులు' అంటారు. తండ్రి ఆజ్ఞ మేరకు సృష్టి విస్తరణ కోసం తపస్సు చేయడానికి వారు పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళారు.


వారు తపస్సు కు వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ప్రశాంతమైన ఒక మహా సరస్సు నుండి పరమశివుడు నారాయణ ధ్యానంలో బయటకు వచ్చాడు. ప్రచేతసులకు ప్రత్యక్షమై పరమశివుడు ఇలా అన్నాడు


 "ఎవరైతే శ్రీమహావిష్ణువును ఆశ్రయిస్తారో వారే నాకు అత్యంత ప్రియమైనవారు. భగవద్దర్శనం కోసం నేను మీకు ఒక దివ్యమైన స్తోత్రాన్ని ఉపదేశిస్తున్నాను. దీనిని 'రుద్ర గీత' అంటారు."


పరమశివుడు ప్రచేతసులకు రుద్రగీతను ఉపదేశించగా, వారు నీటిలో మునిగి దాన్ని జపిస్తూ పదివేల సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశారు.


2. నారద మహర్షి ఉపదేశం – ప్రాచీనబర్హికి వైరాగ్యం

అక్కడ ప్రచేతసులు తపస్సు చేస్తుంటే, ఇక్కడ వారి తండ్రి ప్రాచీనబర్హి నిరంతరం జంతువులను బలి ఇస్తూ వేలాది కర్మకాండ యజ్ఞాలు చేస్తూ మోహంలో పడిపోయాడు. ఆయనను ఉద్ధరించడానికి నారద మహర్షి వచ్చి: "రాజా! నీ యజ్ఞాలలో బలి అయిన జంతువులు పరలోకంలో నీ కోసం ఇనుప కొమ్ములతో వేచి ఉన్నాయి. కేవలం కర్మకాండల వల్ల చిత్తశుద్ధి రాదు. నీకు ఒక కథ చెబుతాను విను" అని పురంజనుడి కథను ప్రారంభించాడు.


**పురంజన కథ**


పూర్వం **పురంజనుడు** అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయనకి **అవిజ్ఞాతుడు** అనే ఒక అజ్ఞాత మిత్రుడు ఉండేవాడు. ఆయన చేష్టలు ఎవరికీ తెలియదు, కానీ ఆయన ఎప్పుడూ పురంజనుడి క్షేమాన్ని కోరుకుంటూ, వెంటే ఉంటూ రక్షిస్తూ ఉండేవాడు.


ఆ పురంజనుడు తాను నివసించుటకు అనువగు ఒక స్థలముకొరకు భూతలమునందు అంతటను వెదకెను. కాని సరియగు ప్రదేశము కనబడకపోవుటవలన అతడు ఎంతయు నిస్పృహకు లోనయ్యెను. అతడు అనేకవిధములగు భోగానుభవములకొరకై ఉవ్విళ్ళూరు


కాని, భోగానుభవములను పొందుటకై అతడు భూమండలమున నగరములను అన్నింటిని గాలించెను. ఐనను, వాటిలో ఏ ఒక్కటియు ఆయనకు నచ్చకుండెను. 


తన అన్వేషణలో భాగముగా అతడు హిమవత్పర్వతమునకు దక్షిణమునగల సానువులకు చేరెను. అచట ఆయనకు తొమ్మిది ద్వారములుగల ఒక నగరము కనబడెను. అది అన్నివిధములగు మంచి లక్షణములతో ఉన్నట్లు తోచెను.ఆ నగరం రత్నాలు వజ్రాల తో నిర్మించబడిన గోడలతో అద్భుతంగా విలసిల్లుతూ ఉంది. అక్కడి మృగాలు క్రూర స్వభావం విడిచి ఎలాంటి విరోధం లేకుండా అన్యోన్యంగా నివసిస్తూ ఉన్నాయి.


పురంజనుడు ఆ అందాలు ఆస్వాదిస్తూ అందులో తిరుగుతూ ఉండగా

ఆ నగరంలో పురంజనుడికి అనుకోకుండా వచ్చిన అత్యంత సౌందర్యవతియైన ఒక సుందరి (స్త్రీ) కనిపించింది. ఆమె చుట్టూ 11 మంది నమ్మకమైన కాపలాదారులు ఉన్నారు. ఆ సుందరిని చూసి మోహించిన పురంజనుడు ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. ఆమె అంద చందాలకు దాసుడు అయి పూర్తిగా మొహం లో పడిపోయాడు.ఆ స్త్రీ కూడా పురందరునీ స్వీకరించింది ఇద్దరూ ఆ తొమ్మిది ద్వారాల నగరంలోనే నివాసం ఏర్పరచుకున్నాడు.


అలా కాలం గడిచి పోతూ ఉంది పురంజనుడు ఆ స్త్రీకి పూర్తిగా దాసుడైపోయాడు. ఆమె సంతోషిస్తే ఈయన సంతోషించేవాడు, ఆమె ఏడిస్తే ఈయన ఏడ్చేవాడు. ఆమె మోహంలో పడి తన నిజమైన ఆప్తమిత్రుడైన అవిజ్ఞాతుడిని పూర్తిగా మరచిపోయాడు. 


ఒకనాడు పురంజనునికి వేట మీద ఆసక్తి పుట్టింది వెంటనే ఐదు గుర్రాలు ఉన్న రథాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు ఒక్కరోజు కూడా మహారాణి నీ విడచి అతను వెళ్ళింది లేదు.కానీ ఆరోజు వేట యందు మక్కువ చేత వెళ్ళాడు. తీవ్రమైన తామసిక,అసురీ ప్రవ్రుత్తి చేత విచ్చల విడిగా దయలేని వాడి లా కనపడ్డ ప్రతి జంతువుని వేటాడాడు.అలా వేటాడి వేటాడి అలసిపోయి తిరిగి రాజ్యానికి వచ్చాడు. ఆకలి దప్పులు బాగా ఇబ్బంది పెట్టాయి వెంటనే స్నానాదులు చేసి ఆహారం భుజించాడు. అప్పుడు రాణి గారు గుర్తుకు వచ్చారు నాకు చెప్పకుండా వెళ్తావా అని అలక పూనారు, ఎంతో బతికాడు కున్నారు రాజుగారు ఇక విడిచి వెళ్ళను మాట తీసుకుని హాయిగా గడుపుతూ ఉన్నారు. ఇది రాత్రి ఇది పగలు అనే తేడా లేకుండా అలా గడిపేశారు భోగాలలో..


కాలక్రమేణా వారికి 1100 మంది పిల్లలు, మనుమలు పుట్టారు. వారి రక్షణ, లాలన, సంపాదన కోసమే పురంజనుడు తన జీవితాన్నంతా వ్యర్థం చేసుకున్నాడు.


భోగాలు, బాధ్యతలలో పడి అతను తన ఆత్మను ఉద్ధరించే కర్మలు అన్ని విడిచి పెట్టడు. వయస్సు మళ్లింది స్త్రీల యందు ఆసక్తి కలవారికి నచ్చని ముసలి తనం రానే వచ్చింది.అప్పుడు


ఒకరోజు ఆ నగరంపై **చండవేగుడు** అనే గంధర్వ రాజు 360 మంది నల్లని, 360 మంది తెల్లని సైనికులతో దాడి చేశాడు. వారితో పాటు **కాలకన్య** (ముసలితనం), ఆమె సోదరుడైన **భయుడు** (భయం), **ప్రజ్వారుడు** (జ్వరం/రోగం) ఆ నగరంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టారు. అప్పుడు ఐదు పడగల పాంచాల సర్పం వారికి అడ్డుపడి వందేళ్లు తీవ్రముగా పోరాడింది. క్రమంగా దాని శక్తి కూడా క్షీణించి పోయింది.


అంతవరకు ఆ పాంచాలదేశంలోని తన దూతలు తీసుకువచ్చిన పన్నులతో భోగాలు అనుభవిస్తూ రాబోవు ప్రమాదాలు పసిగట్టలేదు 


అదే సమయంలో కాలుని కుమార్తె జర అనే కాలకన్య భర్త కోసం వెదుకుతూ ఉంది.ఈ జర కూడా పురంజన పురాన్ని ఆక్రమించింది. జర చేత ఆక్రమింప బడిన పురంజనుడు పూర్తిగా దైన్యుడు అయి

వారితో యుద్ధం చేయలేకపోయాడు. నగర ద్వారాలన్నీ ఒక్కొక్కటిగా పాడైపోయాయి. చివరికి **ప్రజ్వారుడు** ఆ నగరానికి నిప్పు పెట్టాడు. నగరం తగలేబడిపోతుంటే, శరీరం క్షీణిస్తుంటే... పురంజనుడు చివరి క్షణంలో కూడా భగవంతుణ్ణి తలచుకోలేదు. "అయ్యో! నేను చనిపోతే నా భార్య ఏమైపోతుందో, నా పిల్లలు ఎలా బతుకుతారో" అని తన భార్య ధ్యాసలోనే ప్రాణాలు వదిలాడు. అదే సమయంలో తాను జీవితం మొత్తం కేటాయించి ఎవరిని ఉద్దరించాలి అనుకున్నాడో వారు మాత్రం అతనికి తోడు రాలేదు.


ఇతను ఆమె ఆలోచనలతోనే చనిపోవడం వల్ల, తదుపరి జన్మలో ఆయన **వైదర్భి** అనే రాజకుమారిగా (స్త్రీగా) జన్మించాడు. వైదర్భికి వివాహమైంది. కొంతకాలానికి ఆమె భర్త కూడా మరణించాడు. ఆమె తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయి, భర్త శవం దగ్గర ఏడుస్తూ ప్రాణత్యాగానికి సిద్ధపడింది.


అప్పుడు ఆ అడవికి ఒక **అజ్ఞాత బ్రాహ్మణుడు** వచ్చాడు. ఆయన మరెవరో కాదు... పురంజనుడి పాత మిత్రుడైన **అవిజ్ఞాతుడు**. ఆయన వచ్చి ఇలా అన్నాడు: *"అమ్మా! నీవు ఎవరు? నీ భర్త ఎవరు? గత జన్మలో నీవు పురంజనుడివి. నేను నీ ఆత్మమిత్రుడిని. నీవు ఈ శరీరం కావు, పంజరంలో చిలకలా ఈ శరీరంలో బంధించబడ్డావు. నన్ను గుర్తుపట్టు!"*


ఆ ఉపదేశంతో వైదర్భికి జ్ఞానోదయం అయి, తన నిజరూపాన్ని తెలుసుకుని ముక్తిని పొందింది.


-*ఆధ్యాత్మిక అంతరార్థం (పరమార్థం)*


ఈ కథ కేవలం ఒక రాజు కథ కాదు, ప్రతి ఒక్క మానవుడి జీవిత సత్యం. ఇందులో ఉన్న పాత్రలు, స్థలాల వెనుక ఉన్న ఆంతర్యం ఇది:


* **పురంజనుడు = జీవుడు (మనలోని ఆత్మ / జీవాత్మ):** సంసారంలో కొట్టుమిట్టాడే ప్రతి మానవుడికి ఇది సంకేతం.

* **అవిజ్ఞాతుడు = పరమాత్మ (భగవంతుడు):** మనలోని అంతరాత్మ. మనం ఆయనను గుర్తించలేము (అవిజ్ఞాత), కానీ ఆయన ఎప్పుడూ మన వెంటే ఉంటాడు.

* ** తొమ్మిది ద్వారాల నగరం = మానవ శరీరం:** మన శరీరానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి (రెండు కళ్లు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రాలు, నోరు, రెండు విసర్జన అవయవాలు).


* **సుందరి (స్త్రీ) = బుద్ధి:** జీవుడు తన బుద్ధి చెప్పినట్లు వింటూ మోహంలో పడతాడు.


* **11 మంది కాపలాదారులు = ఇంద్రియాలు & మనస్సు:** 5 జ్ఞానేంద్రియాలు + 5 కర్మేంద్రియాలు + 1 మనస్సు.


* **పిల్లలు & మనుమలు = కోరికలు & కర్మలు:** ఇంద్రియ సుఖాల వల్ల పుట్టే అపరిమితమైన కోరికలు, పాపపుణ్యాలు.


* **చండవేగుడు & 360/360 సైనికులు = కాలం (సమయం):** 360 పగళ్లు, 360 రాత్రులు ఉన్న ఒక సంవత్సరం. కాలం మన ఆయుష్షును కరిగిస్తోంది.


* **కాలకన్య, భయుడు, ప్రజ్వారుడు = వృద్ధాప్యం, భయం, రోగాలు:** ముసలితనం వచ్చి శరీరం అనే నగరాన్ని క్షీణింపజేస్తుంది.


* **నగరానికి నిప్పు పెట్టడం = మరణ సమయం:** రోగాలు, తీవ్రమైన బాధతో శరీరం నశించడం.


* **స్త్రీగా పుట్టడం = పునర్జన్మ:** *"యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్"* (భగవద్గీత) — చనిపోయేటప్పుడు దేని గురించి ఆలోచిస్తే మరుసటి జన్మలో అదే రూపాన్ని ఎత్తుతారు. మోహంలో ఉంటే మళ్లీ జన్మలు తప్పవు.


* **అజ్ఞాత బ్రాహ్మణుడి ఉపదేశం = గురుకృప / జ్ఞానోదయం:** బ్రాహ్మణుని రూపంలో వచ్చిన భగవంతుడే "నీవు ఈ శరీరం కావు, ఆత్మవు" అని జ్ఞానోదయం కలిగించి ముక్తిని ప్రసాదిస్తాడు.


సారాంశం: జీవుడు బుద్ధికి, ఇంద్రియాలకు లొంగిపోయి తనను తాను దేహంగా భావించి నరక-స్వర్గాల మధ్య తిరుగుతుంటాడు. కానీ అంతర్యామియైన పరమాత్మను గుర్తించిన నాడు మోక్షాన్ని పొందుతాడు.


అని నారదుడు చేసిన ఆత్మ బోధతో ప్రాచీనబర్హి కర్మకాండలను విడిచిపెట్టి, కపిలాశ్రమానికి వెళ్లి భగవద్భక్తిలో ముక్తి పొందాడు.


5. ప్రచేతసుల భగవద్దర్శనం

నీటి అడుగున ప్రచేతసులు చేసిన రుద్రగీతా జపానికి ప్రసన్నుడై శ్రీమహావిష్ణువు దివ్యరూపంతో ప్రత్యక్షమయ్యాడు.


 * శ్రీహరి అనుగ్రహం: "ప్రచేతసులారా! పరమశివుడు ఉపదేశించిన స్తోత్రంతో నన్ను పూజించినందుకు ఆనందించాను. మీరు కండూ మహర్షి కుమార్తె అయిన 'మార్ష'ను వివాహం చేసుకుని సృష్టిని విస్తరించండి. మీ వంశంలో గొప్ప భాగవతోత్తముడు జన్మిస్తాడు" అని వరమిచ్చాడు.


 * దక్షుని పునర్జన్మ: ప్రచేతసులకు, మార్షకు 'దక్ష ప్రజాపతి' జన్మించాడు. (గతంలో దక్షయజ్ఞంలో మరణించిన దక్షుడు, పరమశివుని అనుగ్రహంతో ఈ జన్మలో ప్రచేతసుల కుమారుడిగా జన్మించి సృష్టి కార్యంలో నిమగ్నమయ్యాడు).


ప్రచేతసులు తమ రాజ్యపాలన ముగిశాక నారద మహర్షిని దర్శించుకుని, ఆయన వద్ద భాగవత ధర్మాలు విని, యోగమార్గంలో పరమపదాన్ని పొందారు.


📝 నేటి ముఖ్య విషయాలు:

 * రూపక కథ విశిష్టత: సంసార బంధంలో చిక్కుకున్న జీవుడి మానసిక స్థితిని ప్రతిబింబించే అత్యుత్తమ తత్త్వ శాస్త్రం పురంజనోపాఖ్యానం.


 * రుద్రగీతా మహత్యం: పరమశివుడు స్వయంగా ఉపదేశించిన రుద్రగీత శ్రీహరి అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత శక్తివంతమైన సాధనం.


 * కర్మకాండల పరిమితి: కేవలం యజ్ఞాలు, బలుల వల్ల శాశ్వత శాంతి లభించదు; అంతర్ముఖ భగవద్భక్తి మాత్రమే జీవునికి ముక్తిని ఇస్తుంది.


(రేపటి రోజు 13 లో: పంచమ స్కంధ ప్రవేశం – ప్రియవ్రతుని చరిత్ర, ఋషభదేవుని అవతారం & ఆయన తన వందమంది కుమారులకు చేసిన పరమహంస ధర్మ ఉపదేశం (ముక్తి మార్గం) తెలుసుకుందాం!)


.....సశేషం🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

ఆత్మేతరములు

 

 ఆత్మేతరములు 

ఆత్మేతరములు  అనే పదంలోనే ఆత్మకాదు ఆత్మకన్నా వేరుగా వున్నవి అనే అర్ధం స్ఫురిస్తుంది. అంటే మనకు ఒక విషయం గోచరిస్తుంది అదేమిటంటే ఆత్మ ఒక్కటీ ఒక్కటీ ఆత్మకానివి మిగిలినవి. అంటే మిగిలినవి అన్నీకూడా ఆత్మ కన్నా భిన్నంగా ఉన్నాయని అర్ధమే కదాదానిని బట్టి మనం అర్ధం చేసుకునేది ఏమిటంటే ఆత్మ అన్నిటిలో లేదు, కలవదు  అది తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞ్యానం లేక ఆత్మజ్ఞానం

ఎరుక: ఎరుక అనేపదాన్ని మనం తెలుసుకోవటం అనే దానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తాం ఇది మనందరికీ తెలిసినదేనీకు రామారావు తెలుసా అంటే నాకు యెరుకలేదు అని అన్నాడు అంటే అతనికి రామారావు తెలియదు అని అర్ధం.  

ఎరుక కలిగి ఉండటమే బ్రహ్మజ్ఞ్యానం లేక ఆత్మజ్ఞానం. ఇప్పుడు ప్రశ్న యేమని వస్తుందంటే దేనిని గూర్చి ఎరుక కలిగి ఉండటం అంటే బ్రహ్మను గూర్చి లేదా ఆత్మను గూర్చి అనే సమాధానం వస్తుంది

ప్రతివారు ఏమనుకుంటారటే  ఇన్ని రకాలుగా చెప్పటం ఎందుకు నాకు ఆత్మను గూర్చి తెలియదు తెలపండి అంటే గురువు  ఆయినా తెలిపారంటే అది ఏమయినా కావచ్చు కానీ ఆత్మకు సంబందించినది కాదుఅంటే మరి దేనికి సంబందించినది. తెలిపిన గురువుకు నిజంగా ఆత్మా జ్ఞ్యానం ఉంటే  అతడు తెలుపలేడు అదేవిధంగా ఆత్మజ్ఞ్యానం లేకపోయినా కూడా తనకు తెలియదు కాబట్టి తెలుపలేడు

ఇది అసంబద్ధంగా వున్నది తెలియని గురువు తనకు తెలియదు కాబట్టి చెప్పలేక పోయాడు అనటంలో అర్ధం వుంది మరి తెలిసినవాడు ఎందుకు చెప్పలేడు అని ప్రతివారు సందేహించవచ్చు

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బ్రహ్మ జ్ఞ్యానం అనేది తెలిసినది కాదు అంటే తెలుసుకోలేదు, ఆలాగే తెలియపడేది కాదు ఒకరికి తెలియనప్పుడు ఇంకొకరికి తెలియపరచటం అస్సలు సాధ్యపడదు  కాబట్టి తెలియపడటం అనేది ఉండదు. అటువంటప్పుడు బ్రహ్మజ్ఞానం పొందటం యెట్లా అనే మీమాంస వస్తుంది

నిజానికి  బ్రహ్మజ్ఞానం పొందటం అనేదే ఉండదు. ఎందుకంటె నీవు ఏదైనా పొందుతున్నావంటే అంతకు ముందు నీదగ్గర అది లేకపోతేనే దానిని పొందగలవు. నీ దగ్గర ధనం లేదనుకో నీవు సంపాదించి ధనాన్ని పొందగలవు, నీ దగ్గర ఏదైనా వస్తువు గురించి, కానీ విషయం గురించి గాని జ్ఞ్యానం లేదనుకో దానిని తెలుసుకున్న పండితుడిని గురువుగా భావించి అయన వద్దనుండి తెలుసుకొని పొందవచ్చు. దీనిని బట్టి మనకు ఏమి అర్ధమౌతుంది అంటే నీవు పొందాలసినది అది వస్తువైనా కానీ లేక విషయమైనా గాని అది నీకన్నా వేరుగా  వుంది. అలాగే దానిని నీకు వసంగె వ్యక్తి కానీ మరొకటి గాని నీకన్నా వేరుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మనకు మూడు విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి తెలుసుకోవలసిన వాడు అంటే నీవు రెండోవది తెలుసుకోవలసిన విషయం అది ఏమైనా కావచ్చు అది కూడా నీ కన్నా వేరుగా వుంది. అదేమాదిరిగా తెలియచేసే గురువు కూడా వేరుగా వున్నాడు

ఒక మనిషి నేర్చుకునేది, తెలుసుకునేది పూర్తిగా పరోక్ష జ్ఞ్యానం మాత్రమే, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలుసుకునే వానికి తెలుసుకోబడే విషయం పూర్తిగా వేరుగా వుంటున్నదికాబట్టి సదరు విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుంటున్నారు. ఉదాహరణకు నీకు కారు డ్రైవింగ్ రాదునీకు తెలుసు డ్రైవింగ్ అనేది ఒక విద్య విద్య వచ్చిన నిపుణుడు కారును అదుపులో ఉంచి సరైన వేగంగా నడుపగలడుఒక సమర్ధుడైన కారు డ్రైవరు ఇరుకు రోడ్లలో, వీధులలో ఎంతోమంది నడుస్తున్నా కూడా ఎవ్వరికీ మాత్రం తాకకుండా నిపుణతతో నడుప గలడుఅదే తర్ఫీదు సరిగా లేని వాని చేతికి స్టీరింగ్ ఇస్తే కారుతో పలువురుకు హాని కలిగించి కారుకు కూడా డామేజ్ చేయవచ్చుకాబట్టి విద్య నేర్చిన వానికి విద్య నేర్వనివానికి తేడా వుంటున్నది. విద్యను నేర్వటానికి విద్యలో ఆరితేరిన నిపుణుని శిక్షణ అవసరము. రకంగా మనం నిత్యం అనేక విద్యలను నేర్చుకుంటున్నాము. కానీ బ్రహ్మ విద్య అలా తెలుసుకోవటానికి సాధ్యపడదు. ఎందుకంటె ఇక్కడ తెలుసుకునే నీవు తెలుసుకోపడేది కేవలం నీలో దాగి వున్న నీ గురునిచే. అదేమిటో చూద్దాం

ప్రతివారు వారికి ఉన్న ఇంద్రియముల సహాయముతో జగతితో సంబంధం కలిగి వున్నారు. కళ్ళతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, ముక్కుతో వాసన చూస్తున్నారు ఇలా ఒక్కొక్క ఇంద్రియముతో ఒక్కొక్క రకమైన పని చేస్తున్నారు. ఇది సర్వసాధారణ విషయంకానీ నీలో దాగి వున్నది ఎవరు అదేమిటి నాలో దాగి ఎవరు లేరు నేనే వున్నాను అని నీవనవచ్చు నిజానికి నీవు నీ శరీరం కాదు నీ శరీరంలో నీ కన్నా భిన్నంగా దాగి వున్న నీవు అదే సుద్దచెతన్యమైన ఆత్మ స్వరూపం. విషయంలో కేనోపనిషత్తు విషయాన్ని ఇలా వివరిస్తున్నది.

 

కేనేషితం పతతి ప్రేషితం మనః

కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః |

కేనేషితాం వాచమిమాం వదన్తి

చక్షుః శ్రోత్రం దేవోయుదక్తి || 1

మనస్సుని దాని విషయాలపైకి పడేటట్లు ఏది ప్రేరేపిస్తుంది? దేనిచేత ప్రయోగించబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాటలు మాట్లాడుతున్నారు? నిజంగా బుద్ధి కళ్ళను, చెవులను నియమిస్తుంది? మంత్రం మనకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నది. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, మనస్సు విషయాలమీదకు వెళుతున్నదిఇవ్వన్నీ మనకు తెలిసినవిషయాలే మరి అవి వాటి వాటి నిర్దుష్ట కర్మలు చేయటానికి కారణం ఎవరు? ఎవరి ఆదేశాలమీద అవన్నీ పనిచేస్తున్నాయి అనేది ఒక సందేహాం

శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్

వాచో వాచం ప్రాణస్య ప్రాణః |

చక్షుషశ్చక్షురతి ముచ్య ధీరాః

ప్రేత్యాస్మాల్లోకా దమృతాభవన్తి || 2

ఆత్మ శక్తి వలననే చెవి వింటుంది. కన్ను చూస్థుంది. జిహ్వ మాట్లాడుతుంది. మనస్సు గ్రహిస్తుంది. ప్రాణాలు పని చేస్తాయి. బుద్ధిమంతుడు ఆత్మను ఇంద్రియ వ్యాపారాలనుండి వివక్షిస్తాడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు.మనకు బౌతికంగా కనపడని ఆత్మా శక్తి మన ఇంద్రియాలను, మనస్సును, బుద్దిని నియంత్రిస్తుంది.

నతత్ర చక్షుర్గచ్చతి నవాగ్ గచ్చతి నోమనః |

విద్యో విజానీయో యథైవ దనుశిష్యాత్ || 3

మరి ఆత్మను మనం చూడగలమా అంటే బ్రహ్మ విషయంలో కన్ను పోజాలదు. మాటలుగాని మనస్సుగాని పోలేవు. కాబట్టి మాకు దాని గురించి తెలియదు. దాన్ని విధంగా నేర్పించవచ్చునో పద్ధతికూడా మాకు తెలియదు. మహర్షులు వారి దివ్యజ్ఞానంతో మనకు ఆత్మా శక్తి దాని ఉనికిని తెలుపుతున్నారు. కన్ను దాని ముందర వున్న వాటిని మాత్రమే చూడగలదు మాటలు తన అనుభవంలో ఉన్నవాటిని మాత్రమే తెలుపగలవు. మనస్సు తన ఊహకు అందినవాటిని మాత్రమే తెలుసుకోగలడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంద్రియాలు శరీరానికి బాహ్యంగా ఉన్నవాటిని మాత్రమే గుర్తించగలవు

అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి |

ఇతి శుశ్రుమ పూర్వేషాం యేనస్తద్ వ్యాచచక్షిరే || 4

నిశ్చయంగా అది తెలిసిన దానికంటే భిన్నమైనది. తరువాత అది తెలియనిదానికంటే అతీతమైనది. దానిని మాకు వివరించిన పూర్వీకులనుండి మేం విధంగా విన్నాం.ప్రపంచంలో వున్న జ్ఞానం కొంతవరకు మనకు తెలియవచ్చు అంటే దానిని మనము తెలిసిన జ్ఞానంగా పేర్కొనవచ్చు. మరి మనకు తెలియని జ్ఞానం కూడా అంటే మనం తెలుసుకోనిది తెలుసుకోవలసినది కూడా వున్నదికానీ ఆత్మా అనేది మనం తెలుసుకున్న జ్ఞానంలోనూ, మనం తెలుసుకోవలసిన జ్ఞానంలోను లేదు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం బాహ్యంగా తెలుసుకునే జ్ఞానం పరిధిలోనికి ఆత్మా జ్ఞానం రాదు. అంటే ఆత్మా జ్ఞానం బాహ్యంగా లేదు.

యత్ వాచా నభ్యుదితం యేన వాగభ్యుద్యతే|

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 5

మాటలు దేన్ని ప్రకటించలేవో, మాటలనే ఏది ప్రకటిస్తుందో అది మాత్రమే బ్రహ్మం అనీ జనులు పూజించేది కాదనీ తెలుసుకో.

యన్మనసా నమనుతే యేనాహుర్మనో మతమ్|

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే|| 6

మనస్సుచేత గ్రహించ శక్యం కానిదీ, దేనిచేత మనస్సు సంకల్పాదులలో తిరుగునో అది మాత్రమే బ్రహ్మం అనీ, జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యచ్చక్షుషా పశ్యతియే చక్షూంషి పశ్యతి|

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 7

కన్నులు చూడజాలనిదికాని దృష్టిని చూసేది - అది మాత్రమే బ్రహ్మం అనీ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యచ్చోత్రేణ శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్|

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 8

మానవుడు చెవిద్వారా వినజాలనిదీ దేనిచేత వినికిడి వినబడుచున్నదో - అది మాత్రమే బ్రహ్మం అనీ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

యత్ ప్రాణేన ప్రాణిత యేన ప్రాణః ప్రణీయతే|

తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే || 9

మానవుడు ఊపిరిచేత వాసన చూడజాలడో, దేనిచేత ఊపిరి శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో - అది మాత్రమే బ్రహ్మం అనీ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.అన్ని మంత్రాలు ఒక్కటే చెపుతున్నాయి. మనం ఆత్మా గురించి తెలుసుకోవటం ఇంద్రియాలవలన, మనస్సు బుద్ధిల వలన సాధ్యం కాదు. మరి అటువంటప్పుడు ఆత్మా జ్ఞానాన్ని పొందటం ఎట్లా?

శరీరం పూర్తిగా ఆత్మస్వాధీనంలో ఉండి శారీరక వ్యాపారాలను చేస్తున్నదికానీ ఆత్మా శరీరంలోని అంగం కాదు అది కేవలం శరీరంతో కలువకుండా తామరాకుమీద నీటిబిందువు వలే వుంటూ శరీరాన్ని నియంత్రిస్తుంది. ఆత్మ శరీరంలో ఉన్నంతవరకే శరీరానికి దేహవ్యాపారాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదిలి వెళుతుందో అప్పుడు పంచ ప్రాణాలు, మనస్సు బుద్ది  పంచేంద్రియాలు లయమైతాయి. శరీరం నిస్చేష్ఠలతో మిగులుతుంది

శరీరపు అంగము కాకుండా శరీరంలో పరోక్షంగా వుంటూ శరీరానికి కలసివుండకుండా ఉండి శరీరాన్ని నియంత్రిస్తున్న దివ్య తేజస్సే ఆత్మగా మన మహర్షులు  తెలిపారు. దాని ఉనికిని తెలుసుకొని నిత్యం ఆత్మాసంయమంగా వుంది నిరంతరం ఆత్మలో లయమై ఉండటాన్ని ఆత్మానుభవంగా మహర్షులు తెలిపారుఅట్లా పొందిన జ్ఞానాన్ని ఆత్మా  జ్ఞానంగా పేర్కొన్నారు

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ