16, ఆగస్టు 2026, ఆదివారం

గ్యాస్ సమస్య

 తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం  -


    ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.


      వాము  ౨50 గ్రాములు .


      జీలకర్ర  ౨50 గ్రాములు .


      ధనియాలు  ౨50 గ్రాములు . 


         మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత ౨ స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.


            పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.


  అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు  -


  పాటించవలసిన నియామాలు  -


      తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .


 పాటించకూడనివి  -


       కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం 


          పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.


   విరేచనం సాఫీ లేనప్పుడు కూడా గ్యాస్ వచ్చును . దానికొరకు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆహారం + మీరేదన్న ఇతర సమస్యలకు ఔషధాలు వాడుచున్న  అవన్నీ తీసుకున్న గంటన్నర తరువాత ఒక చిన్న స్పూన్ త్రిఫల చూర్ణం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి లోపలికి తీసుకోవలెను. మీరు తీసుకున్న ఆహారం మరియు మీరు నిద్రించడానికి మధ్య సమయం కనీసం 2 గంటలు ఉండాలి . 


       మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    

ధర్మో రక్షతి రక్షితః*

 *ధర్మో రక్షతి రక్షితః*


*ధర్మాన్ని కాపాడిన వారిని ధర్మమే కాపాడుతుంది.*


*ఈ  మహావాక్యం మన భారతీయ సంస్కృతికి మూలస్తంభం. ఈ వాక్యం మనుస్మృతిలో ప్రసిద్ధిగా పేర్కొనబడింది.*


*మన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు అన్నీ మానవుడు ధర్మమార్గంలో నడవాలని బోధిస్తాయి. సంపద, అధికారం, కీర్తి, విద్య కంటె ధర్మమే గొప్పదని మన ఋషులు చెప్పారు.*


*ధర్మం అంటే ఏమిటి ?*


*ధర్మం అంటే కేవలం పూజలు, యజ్ఞాలు చేయడం మాత్రమే కాదు. సత్యం మాట్లాడటం, ఇతరులకు హాని చేయకుండా జీవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, నిస్వార్థంగా సేవ చేయడం, న్యాయంగా ప్రవర్తించడం, తన కర్తవ్యాన్ని నిజాయితీతో నిర్వర్తించడం  ఇవన్నీ ధర్మమే.*


*ఈ సృష్టిలో ధర్మాచరణను మించిన మహిమాన్వితమైన కార్యం మరొకటి లేదని మన పెద్దలు చెప్పారు.*


*ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది.*


*ఈ ప్రపంచానికి నీవు ఏమి ఇస్తావో, అదే నీకు తిరిగి వస్తుంది.*


*ప్రేమ ఇస్తే ప్రేమ లభిస్తుంది.*

*సహాయం చేస్తే సహాయం లభిస్తుంది.*

*మోసం చేస్తే మోసమే ఎదురవుతుంది.*

*బాధ కలిగిస్తే బాధనే అనుభవించాల్సి వస్తుంది.*


*సమాజానికి కీడు చేసి, తనకు మాత్రమే మంచి జరగాలని కోరుకోవడం ధర్మానికి విరుద్ధం. ధర్మం ఎప్పటికైనా తన ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది.*


*కర్మఫలం తప్పదు.*

*మనిషి చేసే ప్రతి పనికీ ఫలితం ఉంటుంది.*

*మంచి చేస్తే మంచి ఫలితం.*

*చెడు చేస్తే చెడు ఫలితం.*

*కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా రావచ్చు. కాని, అది తప్పకుండా వస్తుంది. ధర్మం ఆలస్యం చేయవచ్చు కాని, అన్యాయం చేయదు.*

*మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి మాటలు మన జీవితాన్ని సంతోషంతో నింపుతాయి. ఇదే సృష్టి ధర్మం. సత్ప్రవర్తనే రక్షణ.*

*మన సత్ప్రవర్తనే మనకు నిజమైన రక్ష.*


*సత్యం, నిజాయితీ, వినయం, దయ, క్షమ, ప్రేమ వంటి గుణాలు కలిగినవారికి జీవితంలో చివరికి విజయం తప్పకుండా లభిస్తుంది.*

*ఆధ్యాత్మిక జీవితానికి ధర్మమే పునాది.*

*మనిషికి ఆధ్యాత్మిక చైతన్యం కలిగించేది ధర్మం.*

*ఆత్మజ్ఞానం, భగవద్భక్తి, సద్గుణాలు, శాంతి, ఆనందం అన్నీ ధర్మాచరణ ద్వారానే లభిస్తాయి.*


*ధర్మాన్ని కాపాడడం అంటే :*

*ప్రతి పనిలో నిజాయితీగా ఉండటం.*

*ఇతరులకు హాని చేయకపోవడం.*

*న్యాయాన్ని పాటించడం.*

*తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం.*

*సత్యాన్ని విడవకపోవడం.*


*అప్పుడు ఆ ధర్మమే మన జీవితాన్ని కాపాడుతుంది.*

*మనుస్మృతి ప్రకారం :*

*ధర్మం మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది.* *అధర్మం పతనానికి కారణమవుతుంది.*


*మహాభారతం మనిషి ఎలా జీవించాలో విపులంగా బోధించింది.*


*"నీకు ఇష్టం లేని పని ఇతరులకు చేయవద్దు" అనే ధర్మసూత్రం మహాభారతంలోని గొప్ప బోధలలో ఒకటి.*

*నన్నయ భారతాన్ని ధర్మశాస్త్రంగా అభివర్ణించారు.*

*ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికీ ధర్మబద్ధమైన మార్గాన్ని మహాభారతం చూపిస్తుంది.*


*వ్యాస మహర్షి ధర్మసారాన్ని సంక్షిప్తంగా వివరించారు.*

*ఇతరులకు మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం కలుగుతుందని చెప్పారు.*

*ధర్మాచరణే పరమ తపస్సు.*


*మహాత్ములు చెప్పినట్లు :*

*ధర్మాచరణమే పరమ ధర్మం.*

*సచ్ఛీలతే తపస్సు.*

*సద్చరిత్రే పరమ జ్ఞానం,*


*ఉత్తమ ధర్మం :*


*మనం ధర్మాన్ని ఆచరించడం మాత్రమే కాదు, ధర్మంగా జీవించే వారికి తోడ్పడటం కూడా ఉత్తమ ధర్మమే.*


*త్యాగం – సద్గుణాల మార్గం :*

*ధర్మం మనకు*

*భోగాల కంటే త్యాగం,*

*అహంకారం కంటే వినయం,*

*ద్వేషం కంటే ప్రేమ,*

*స్వార్థం కంటే సేవ*

*ఎక్కువ గొప్పవని బోధిస్తుంది.*


*మానవతా ధర్మం :*

*నిస్సహాయులకు, వృద్ధులకు, అనాథలకు, బాధలో ఉన్నవారికి సహాయం చేయడం మానవతా ధర్మం.*


*నిజమైన ధర్మం :*


*నీవు ఇతరుల నుండి ఏ విధమైన ప్రవర్తన ఆశిస్తున్నావో, అదే ప్రవర్తనను నీవు ఇతరుల పట్ల చూపడం నిజమైన ధర్మం.*


*ధర్మవంతులకు జయం*


*ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారికి చివరికి విజయం తప్పకుండా లభిస్తుంది.*

*కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడువకూడదని మన పురాణాలు బోధిస్తున్నాయి.*


*మనిషి జీవితాంతం ఎంత సంపాదించినా, మరణానంతరం ఒక్క రూపాయి కూడా వెంట తీసుకెళ్లలేడు.*


*భార్య ఇంటి గుమ్మం వరకు మాత్రమే వస్తుంది.*

*బంధువులు శ్మశానం వరకు మాత్రమే వస్తారు.*

*శరీరం కూడా బూడిదైపోతుంది.*

*కాని, జీవితంలో చేసిన ధర్మం, పుణ్యకార్యాలు మాత్రమే మన వెంట వస్తాయి.*


*ధర్మం అనేది కేవలం గ్రంథాల్లో ఉండే మాట కాదు; ప్రతి రోజూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో ఆచరించాల్సిన జీవన విధానం.*


*ధర్మాన్ని అనుసరించినవారికి మనశ్శాంతి, సమాజంలో గౌరవం, భగవంతుని అనుగ్రహం, చివరికి శాశ్వత ఉపకారం లభిస్తాయి.*


*ధర్మాన్ని కాపాడుదాం... ధర్మమే మనలను కాపాడుతుంది.*

🙏🙏🙏

15, ఆగస్టు 2026, శనివారం

వృద్ధాప్యంలో

 వృద్ధాప్యంలో మీరు ఒంటరిగా మిగిలిపోకూడదని, ఎవరికీ భారం కాకూడదని అనుకుంటే, ఇప్పుడే ఈ విషయాలను గ్రహించండి. 


01. భూమి గొడవల్లో చిక్కుకోకండి:"పక్కింటి వాడికి బుద్ధి చెప్పాలి" అనే ఒకే ఒక్క మొండి పట్టుదలతో మీ జీవితాన్ని కోర్టు మెట్ల చుట్టూ వృథా చేసుకోకండి. ఆ కేసు తెమలక ముందే మీ ఆయుష్షు తీరిపోవచ్చు. మీరు పోరాడి ఆ భూమిని గెలిచినా, అనుభవించడానికి మీరుండరు — అక్కడ శాశ్వతంగా స్థిరపడేది కేవలం లాయర్లు మాత్రమే.


2. పాత వాహనాలు భారం కావచ్చు:ఐదు లక్షల లాభం వస్తుందనే ఆశతో పాత వాహనాన్ని ఇంటికి తెచ్చే తప్పు చేయకండి. ఆ బండి రోడ్డు మీద కంటే ఎక్కువ రోజులు గ్యారేజీలోనే గడిపితే, గుండెపోటు ఆ వాహనానికి రాదు — మీకే వస్తుంది.


3.. ఆస్తులను ఇప్పుడే పిల్లల పేరిట రాయకండి:ఈ రోజు మీ పిల్లలు మీకు "దైవ సమానులు"గా కనిపించినా, మీ ఆస్తి మొత్తాన్ని వారి పేరిట రాసిచ్చిన మరుక్షణమే, అదే ఇంట్లో మీరు ఒక "పనికిరాని వస్తువు"లా మారిపోవచ్చు. పిల్లలు చెడ్డవారు కాదు, కానీ ఈ ప్రపంచం చాలా క్రూరమైనది. మీ చివరి శ్వాస వరకు ఏదో ఒకటి మీ పేరు మీదనే ఉంచుకోండి.


 04. మీ చివరి పొదుపును జాగ్రత్తగా దాచుకోండి:30 ఏళ్ల కష్టార్జితమైన మీ పెన్షన్ డబ్బును పిల్లల వ్యాపారాల కోసం ఇచ్చేయకండి. చివరికి మీ మందుల ఖర్చుల కోసం కూడా అదే పిల్లల ముందు చేతులు చాచాల్సిన పరిస్థితి రావచ్చు.


 05. పిల్లల జీవితాల్లో అతిగా తలదూర్చకండి:"మన పిల్లలే కదా" అని వారి వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. అతిగా దగ్గరవడం వల్ల మీ ప్రేమ వారికి చికాకుగా మారవచ్చు. మీకంటూ ఒక చిన్న స్థానాన్ని ఏర్పరచుకుని, స్వతంత్రంగా జీవించడం అలవాటు చేసుకోండి.


 06. తీర్థయాత్రలకు తీసుకెళ్తారని పిల్లల కోసం ఎదురుచూడకండి:"పిల్లలకు సెలవులు దొరికినప్పుడు తీసుకెళ్తారు" అని ఆశగా కూర్చోకండి. వారికి సమయం దొరికే సరికి, కనీసం మీరు నడవలేని స్థితికి చేరుకోవచ్చు. ఒంట్లో సత్తా ఉన్నప్పుడే మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లండి — అవసరమైతే ఒంటరిగానైనా సరే ప్రయాణించండి.


 07. తినాలనిపించింది ఈ రోజే తినండి:మోతాదు మించకుండా!

 08. మీకంటూ కాస్త విశ్రాంతిని కేటాయించుకోండి:చనిపోయే రోజు వరకు బాధ్యతల భారాన్ని మోస్తూనే ఉండకండి. పొద్దున్న నుంచి రాత్రి వరకు నిరంతరం పరిగెడుతూనే ఉంటే, చివరికి మీరు సాధించేది ఏమీ ఉండదు. మీ శరీరానికి కావలసిన విశ్రాంతిని ఇవ్వండి.


 09. నిద్రను మించిన మందు లేదు:అనవసరమైన ఆలోచనలతో నిద్రలేమిని కొనితెచ్చుకోకండి, ప్రశాంతంగా నిద్రపోండి. రేపు మీరు అనారోగ్యానికి గురైతే, మీ బాధను ఎవరూ పంచుకోలేరు — మీరే ఒంటరిగా భరించాలి.


 10. మీరు ఒంటరిగానే వచ్చారని ఎన్నడూ మరువకండి:ఎవరైనా మీ కోసం ఏదో ఒకటి చేస్తారనే అంచనాలను తగ్గించుకోండి. ఒకరోజు మీ నీడ కూడా మిమ్మల్ని వదిలేస్తుంది. మరణం కూడా ఒంటరిగానే వస్తుంది — కాబట్టి ఒంటరిగా ఉన్నా సంతోషంగా జీవించడం నేర్చుకోండి.   ఆనందం అనేది ఎవరో ఇచ్చేది కాదు; అది మీ అంతట మీరే అంతరంగంలో సృష్టించుకోవాల్సింది.


11. మీ భార్య లేదా భర్త ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఇంట్లోని చిన్న పెద్ద పనులన్నీ మీ స్వహస్తాలతో చేసుకోవడం నేర్చుకోవడానికి వెనుకాడకండి.


12.  మీరు ఒకవేళ విల్లు (Will) రాసినప్పటికీ, దానిని ఎప్పుడైనా మార్చే పూర్తి హక్కు మీకు ఉంటుందని గుర్తుంచుకోండి.


13. మీ వారసులు మిమ్మల్ని వేధిస్తున్నా లేదా వేలెత్తి చూపిస్తున్నా, ఈ రోజు చట్టం మరియు జిల్లా యంత్రాంగం (డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్) మీ వైపు ఉన్నాయని మరువకండి.


14.. ప్రతిరోజూ నడకను అలవాటు చేసుకోండి. మీ పాత స్నేహితులు లేదా బంధువులు ఉంటే, వారితో కలిసి మీ చిన్ననాటి తీపి గుర్తులను పంచుకోవడానికి వెనుకాడకండి.


15. ఏ రోజైనా జీవితపు లెక్కలు ముగిసిపోతాయని గుర్తుంచుకోండి, ఆ చివరి రోజు కోసం మానసికంగా ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.


16. చివరికి మీరు ఈ ప్రపంచం నుండి ఏమీ తీసుకెళ్లలేరని గ్రహించండి, అందుకే అందరితో ప్రేమగా, స్నేహపూర్వకంగా మెలగండి. అవసరమైన వారికి సహాయం చేస్తూ మిమ్మల్ని మీరు ఒక మంచి మనిషిగా  జీవించేలా చేసుకోండి.  🙏🙏

Revathi MS Goud 

Bengaluru 💞


సేకరణ 🌹

14, ఆగస్టు 2026, శుక్రవారం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః ।

సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ।। 31 ।।



ప్రతిపదార్థ:


సర్వ-భూత-స్థితం — అన్ని ప్రాణుల యందు స్థితుడనై ఉన్న; యః — ఎవరైతే; మాం — నన్ను; భజతి — ఆరాధించునో; ఏకత్వం — ఏకమై ఉండి; ఆస్థితః — స్థితుడై; సర్వథా — అన్ని రకాలలో; వర్త-మానః — ఉండినా; అపి — కూడా; సః — అతను; యోగీ — ఒక యోగి; మయి — నాయందే; వర్తతే — నివసించును.



తాత్పర్యము: 


నా యందే ఏకత్వంలో స్థితుడై ఉండి, మరియు నన్నే సర్వ భూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి, అన్ని రకాల కార్య కలాపములు చేస్తునే ఉన్నా, నా యందే నివసించును.



వివరణ:


భగవంతుడు ఈ జగత్తులో సర్వ వ్యాపి. ఆయన సర్వభూతముల హృదయములలో పరమాత్మ రూపంలో కూర్చుని ఉన్నాడు. 18.61వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొంటున్నాడు: ‘నేను సమస్త ప్రాణుల హృదయములలో కూర్చుని ఉన్నాను.’ ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాణి శరీరంలో, రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి - ఆత్మ మరియు పరమాత్మ.


వ్యక్తుల ఆధ్యాత్మిక పరిణితి బట్టి ఇది ప్రధానంగా నాలుగు స్థాయిల దృష్టికోణానికి దారితీస్తుంది


1. భౌతిక దృక్పథంతో ఉన్నవారు, ప్రతి వారినీ శరీరముగా చూస్తారు, మరియు జాతి, కులము, లింగము, వయస్సు, సామాజిక స్థాయి, దేశపౌరసత్వం వంటి వాటి ఆధారంగా భిన్నముగా చూస్తారు.


2. అంతకన్నా ఉన్నతమైన దృక్పథం కలవారు, ప్రతి వారినీ ఆత్మగా చూస్తారు, అందుకే 5.18వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొన్నాడు: ‘దివ్య జ్ఞాన చక్షువులుకల నిజమైన పండితులు - ఒక బ్రాహ్మణుడిని, ఒక ఆవుని, ఒక ఏనుగుని, ఒక కుక్కని, మరియు ఒక చండాలుడిని అందరినీ ఒకే దృష్టితో చూస్తారు’


3. ఉన్నతమైన యోగులు, ఇంకా పై స్థాయిలో ఉన్న దృక్పథంతో, అందరిలో పరమాత్మగా స్థితుడై ఉన్న భగవంతుడినే చూస్తారు. వారు కూడా భౌతిక జగత్తుని గ్రహిస్తారు, కానీ దాని పట్ల ఉదాసీనంగా ఉంటారు. వారు హంస లాంటి వారు, అవి పాలు-నీరు మిశ్రమంలో, పాలనే తీసుకుని, నీటిని విడిచి పెడతాయి.


4. అత్యునత స్థాయి యోగులని 'పరమహంస' లు అంటారు. వారు భగవంతుడినే దర్శిస్తారు, వారికి ఈ ప్రపంచం స్పృహ ఉండదు. భాగవతంలో చెప్పబడిన విధంగా వేదవ్యాస తనయుడైన శుకదేవుని విజ్ఞాన స్థాయి ఇదే.


యం ప్రవ్రజంతమనుపేతమ్ అపేత కృత్యం,

ద్వైపాయనో విరహ-కాతర ఆజుహావ

పుత్రేతి, తన్-మయతయా తరవో ఽభినేదుస్

తం సర్వ-భూత-హృదయం మునిమానతోఽస్మి (1.2.2)


చిన్నతనంలోనే తన ఇంటి నుండి వెళ్ళిపోతూ, శుకదేవుడు సన్యాసాశ్రమము స్వీకరించినప్పుడు, ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడంటే ఆయనకు ఈ ప్రపంచంపు స్పృహే లేదు. ఆయన అటుగా వెళ్తూ, కొలనులో నగ్నంగా స్నానం చేస్తున్న అందమైన యువతులను గమనించనేలేదు. ఆయన చూసినది అంతా భగవంతుడినే; ఆయన విన్నది అంతా భగవంతుడినే; ఆయన తలచినది అంతా భగవంతుడినే, అని ఈ శ్లోకం పేర్కొంటున్నది.


ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, పైన పేర్కొనబడిన స్థాయిల్లో, మూడవ, నాలుగవ స్థాయిలో ఉన్న పరిపూర్ణ సిద్ది సాధించిన యోగుల గురించి మాట్లాడుతున్నాడు.

శుక్రవారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

14-08-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి.      

---------------------------------------


వృషభం


చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

---------------------------------------


మిధునం


సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. 

---------------------------------------


కర్కాటకం


చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


సింహం


ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

---------------------------------------


కన్య


చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------


తుల


బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

---------------------------------------


వృశ్చికం


కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

---------------------------------------


ధనస్సు


నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------


మకరం


ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. 

---------------------------------------


కుంభం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభఫలితాలు పొందుతారు.

---------------------------------------


మీనం


చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.  

---------------------------------------

13, ఆగస్టు 2026, గురువారం

ప్రతి రోజు చావొద్దు

 “చావు ఒకరోజు వస్తుంది… కానీ ఆసుపత్రి మంచంపై ప్రతి రోజు చావొద్దు!”




“ఏది పడితే అది తిను…

జీవితం ఒక్కసారే వస్తుంది…”


ఈ మాటలు చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు.


కానీ…


షుగర్ వచ్చిన తర్వాత టాబ్లెట్ మీ కోసం వాళ్లు మింగరు.

బీపీ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ వాళ్లు వేయించుకోరు.

కిడ్నీ పాడైతే డయాలసిస్‌కు వాళ్లు వెళ్లరు.

లివర్ దెబ్బతింటే బాధ వాళ్లది కాదు.


బాధంతా మీదే…


ఒకప్పుడు నేనూ ఇదే తప్పు చేశాను.


93 కిలోల బరువు…


ప్రీ-డయాబెటిస్…


గ్రేడ్-3 ఫ్యాటీ లివర్…


కిడ్నీలో రాళ్లు…


నాలుగు నెలలకు ఒకసారి ఆసుపత్రి.


స్కాన్లు…

బ్లడ్ టెస్టులు…

మందులు…

మళ్లీ అదే సమస్య.


అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది.


“మందులు మార్చాలా… లేక నా జీవితాన్నే మార్చాలా?”


నేను రెండో దారిని ఎంచుకున్నాను.


ఆ రోజు నుంచి ఆసుపత్రిపై కాదు…

నా అలవాట్లపై నమ్మకం పెట్టుకున్నాను.


ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం అర్థమైంది.


మన శరీరాన్ని చంపేది వయసు కాదు… మన నిర్లక్ష్యం.



నా జీవితాన్ని మార్చిన 10 అలవాట్లు


1. ప్రతి రోజు నడవడం


వాచ్‌లో 10,000 స్టెప్స్ వచ్చాయని కాదు.


బాత్రూమ్‌కు వెళ్లినవి…

ఇంట్లో తిరిగినవి…

వంట చేసినవి…


అవి వ్యాయామం కావు.


రోజుకు కనీసం 30–60 నిమిషాలు ఆగకుండా నడవండి.


మీ గుండె పని చేయాలి.

చెమట పట్టాలి.

అప్పుడే కొవ్వు కరుగుతుంది.



2. ప్లేట్‌లో రంగులు పెంచండి


తెల్ల అన్నం తగ్గించండి.


ఆకుకూరలు…

కూరగాయలు…

పప్పులు…

గుడ్లు…

పెరుగు…

చేపలు లేదా మంచి ప్రోటీన్ ఆహారం పెంచండి.


ప్రతి భోజనంలో…


40% ప్రోటీన్


30% మంచి కార్బోహైడ్రేట్స్


30% కూరగాయలు, ఫైబర్


మీ ప్లేట్ మారితే…

మీ రక్తం మారుతుంది.

మీ శరీరం మారుతుంది.



3. చక్కెర ఒక మెల్లి విషం


టీలో వేసే చక్కెర మాత్రమే కాదు…


బిస్కెట్లు…

కూల్‌డ్రింక్స్…

స్వీట్లు…

బేకరీ పదార్థాలు…


ఇవి కూడా శరీరానికి భారమే.


ఒక్క రోజు తింటే ఏమీ కాదు.


కానీ…

రోజూ తింటే శరీరం నిశ్శబ్దంగా కూలిపోతుంది.



4. రాత్రి భోజనం త్వరగా ముగించండి


సాధ్యమైతే సాయంత్రం 7 గంటలలోపు.


అవకాశముంటే వారంలో కొన్ని రోజులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి.


శరీరానికి కూడా విశ్రాంతి అవసరం.



5. నిద్రను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు


మొబైల్‌కు ఛార్జింగ్ పెడతాం.


కానీ మన శరీరానికి ఛార్జింగ్ అయిన నిద్రను దూరం చేస్తున్నాం.


రోజుకు 7–8 గంటలు నిద్రపోండి.


నిద్రే శరీరానికి సహజ వైద్యుడు.



6. యోగా… ధ్యానం… శ్వాస


రోజుకు 10 నిమిషాలు అయినా కళ్లుమూసుకుని ప్రశాంతంగా కూర్చోండి.


ప్రాణాయామం చేయండి.


ధ్యానం చేయండి.


మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.



7. కోపం తగ్గించండి


ఇంట్లో గొడవలు…

ఆఫీసులో ఒత్తిడి…


ఇవి కూడా ఒక రకమైన విషమే.


ఒత్తిడి పెరిగితే…


బీపీ పెరుగుతుంది.


బరువు పెరుగుతుంది.


షుగర్ ప్రమాదం పెరుగుతుంది.


మనసు ప్రశాంతంగా ఉంటే సగం వ్యాధులు దూరమవుతాయి.



8. ఉప్పు తగ్గించండి


అధిక ఉప్పు అంటే…


అధిక బీపీ…


శరీరంలో నీరు నిల్వ…


గుండెపై ఒత్తిడి…


రుచికోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దు.



9. నీళ్లు తాగండి… శరీరాన్ని కదిలించండి


లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కండి.


దగ్గర దూరాలకు నడవండి.


ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవద్దు.


ప్రతి గంటకోసారి లేచి కదలండి.


శరీరం కదిలితేనే జీవితం కదులుతుంది.



10. మీ కుటుంబానికి మీరు అవసరం


మీరు అనారోగ్యానికి గురైతే…


ముందుగా ఏడ్చేది మీ అమ్మ.


నిద్రపోకుండా చూసేది మీ భార్య.


భయపడేది మీ పిల్లలు.


మీరు ఆరోగ్యంగా ఉంటేనే…


మీ కుటుంబానికి వెన్నెముక.


డబ్బు సంపాదించడం గొప్ప కాదు.


ఆ డబ్బును ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టకుండా ఉండడం గొప్ప.



చివరిగా…


నేను డాక్టర్‌ను కాదు.


కానీ…


ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న మనిషిని.


మందుల విలువ తెలిసిన మనిషిని.


ఆరోగ్యం పోతే జీవితం ఎలా మారిపోతుందో చూసిన మనిషిని.


అందుకే చెబుతున్నాను…


40 సంవత్సరాలు దాటిన తర్వాత డబ్బు సంపాదించడం మాత్రమే కాదు… ఆరోగ్యాన్ని కూడా సంపాదించాలి.


శరీరాన్ని ప్రేమించండి.


మనసును ప్రశాంతంగా ఉంచండి.


ఆహారాన్ని మందుగా మార్చుకోండి.


లేకపోతే…


ఒక రోజు మందులనే ఆహారంగా తినాల్సి వస్తుంది.


చనిపోవడం తప్పదు…


కానీ చావు వచ్చే వరకు ఆసుపత్రి కారిడార్లలో తిరుగుతూ బతకడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.


ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి.


“నా ఆరోగ్యం… నా బాధ్యత.”


ఈ వ్యాసం మీకు ఉపయోగపడితే…


ఒక్కసారి షేర్ చేయండి.


మీ ఒక్క షేర్ వల్ల…


ఒక వ్యక్తి బరువు తగ్గవచ్చు.


ఒక కుటుంబం షుగర్ నుంచి బయటపడవచ్చు.


ఒక తండ్రి తన పిల్లలతో ఇంకొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించవచ్చు.


ఆరోగ్యాన్ని పంచండి… ఈ వ్యాసాన్ని కూడా పంచండి.

ఇది చావు బతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్న...

ఓ మనిషి..

తనతో గుండె చెప్పింది🌱🍀🍀🙏

పంచాంగం

 🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏


☘️ రేపటి పంచాంగం ☘️


🌹 శ్రీరస్తు 卐 శుభమస్తు 🚩 అవిఘ్నమస్తు 💐

 

శుక్రవారం, ఆగష్టు 14, 2026


శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం- వర్ష ఋతువు

శ్రావణ మాసం - శుక్ల పక్షం

తిథి:విదియ రా8.31 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:మఖ ఉ6.55 వరకు

యోగం:పరిఘము మ12.45 వరకు

కరణం:బాలువ ఉ9.14 వరకు తదుపరి కౌలువ రా8.31 వరకు


వర్జ్యం:మ2.45 - 4.19

దుర్ముహూర్తము:ఉ8.15 - 9.08

మరల మ12.30 - 1.20

అమృతకాలం:ఉ6.09 వరకు మరల రా12.09 - 1.43

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 -4.30


సూర్యరాశి:కర్కాటకం

చంద్రరాశి:సింహం


సూర్యోదయం:5.46

సూర్యాస్తమయం:6.24


సాధు దేశీ గోమాతను పూజించండి

సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


అభిప్రాయాలను తెలపండి

  మీ అభిప్రాయాలను తెలపండి 


మన బ్లాగును దేశ విదేశాల నుండి అనేకమంది వీక్షకులు చూస్తున్నట్లుగా నాకు సమాచారం అందుతున్నది.


 కానీ ఎవరికి ఏ పోస్ట్ నచ్చుచున్నది ఎందుకు నచ్చుచున్నది ఏ పోస్ట్ నచ్చటం లేదు ఎందుకు నచ్చటం లేదు మొదలైన విషయాలు మాత్రం నాకు తెలియటం లేదు కాబట్టి నేను ప్రతి వారిని కోరేది ఏమిటంటే మీకు ఏ పోస్ట్ నచ్చినా నచ్చకపోయినా దాన్ని  వివరణ ఆత్మకంగా దానికి సంబంధించినటువంటి కామెంట్లు చేయగలరు.


మీరు చేసే కామెంట్ల  ఈ బ్లాగును ఇంకా మంచిగా తీర్చేదించడానికి అనువుగా ఉంటుందన్న విషయం మరచిపోవద్దు 

స్నేహానికి కూడా మాంద్యం

 #######################

*స్నేహానికి కూడా మాంద్యం వచ్చేసింది!*

 ######################

వేల మంది పరిచయస్తులు…``` 

కానీ ఒక్క ఫోన్ చేయడానికి ఒక్క స్నేహితుడు కూడా లేని పరిస్థితి! 

ఒకప్పుడు మనిషికి డబ్బు లేకపోతే పేదవాడు అనేవారు. ఇప్పుడు?


డబ్బు ఉంది. ఉద్యోగం ఉంది. మంచి ఇల్లు ఉంది. ఖరీదైన కారు ఉంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ… రాత్రి పదకొండు గంటలకు మనసు బాగోలేకపోతే ఫోన్ చేసి “రా… కాసేపు మాట్లాడాలి” అని చెప్పగలిగే స్నేహితుడు లేడు.


ఇదే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సంక్షోభం. 

Friendship Recession. అంటే ఆర్థిక మాంద్యం కాదు… స్నేహాల మాంద్యం.


అమెరికాలో 1990లో కేవలం 3 శాతం మంది మాత్రమే తమకు ఒక్క సన్నిహిత స్నేహితుడు కూడా లేడని చెప్పారు. 2021 నాటికి ఆ సంఖ్య 12 శాతానికి చేరింది. ఇదే సమయంలో 10 మందికి పైగా సన్నిహిత స్నేహితులున్నవారి శాతం 33 నుంచి 13కి పడిపోయింది.


తాజా 2024 గణాంకాలను చూస్తే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా కనిపిస్తోంది. సన్నిహిత స్నేహితులు లేరని చెప్పేవారి శాతం 17కి చేరినట్టు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.


అంటే…

సోషల్ నెట్‌వర్క్ పెరుగుతోంది.

సోషల్ కనెక్షన్ తగ్గుతోంది.


ఇదే అసలు విషాదం.


ఫేస్‌బుక్‌లో 5 వేల మంది… కానీ మనసులో ఒక్కరూ లేరా?


ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం స్నేహం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉండేది కాదు.


టీ కొట్టులో కూర్చుంటే పక్కన కూర్చున్న వ్యక్తితో మాట కలిసేది.


బస్సులో ప్రయాణిస్తే పక్క సీట్లో ఉన్నవారితో పరిచయం అయ్యేది.


కాలేజీలో, ఆఫీసులో, క్లబ్‌లో, ఆట మైదానంలో… ఎక్కడైనా మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు.

అలా పరిచయం స్నేహంగా మారేది.

స్నేహం అనుబంధంగా మారేది.


ఇప్పుడు?

కాఫీ షాపులో పక్క టేబుల్‌లో ముగ్గురు కూర్చున్నారు.

ముగ్గురి చేతుల్లో మూడు ఫోన్లు.

ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో.

మరొకరు యూట్యూబ్‌లో.

ఇంకొకరు వాట్సాప్‌లో.

ముగ్గురు మనుషులు ఒకే టేబుల్ దగ్గర ఉన్నారు.

కానీ ముగ్గురు మూడు ప్రపంచాల్లో ఉన్నారు.

ఇది కేవలం అమెరికా కథ కాదు.

మన నగరాల్లో కూడా ఇదే మార్పు కనిపిస్తోంది.


పరిచయాలు పెరిగాయి.

కాంటాక్ట్స్ పెరిగాయి.

ఫాలోవర్లు పెరిగారు.

వాట్సాప్ గ్రూపులు పెరిగాయి.

కానీ…

“నిజంగా నా మనిషి ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేవారి సంఖ్య తగ్గుతోంది.```

*friendship recession*```

ఒంటరిగా తినడం కూడా ఒక సంకేతమే!

అమెరికాలో ఒంటరిగా భోజనం చేసే వారి సంఖ్య చాలా కాలంగా పెరుగుతోంది.

2023లో దాదాపు ప్రతి నలుగురు అమెరికన్ పెద్దల్లో ఒకరు—26 శాతం—తాము ముందు రోజు రోజంతా భోజనాలన్నీ ఒంటరిగానే చేశామని చెప్పారు. 2003తో పోలిస్తే ఇది 50 శాతానికి పైగా పెరుగుదల.


ఇది “ఒంటరిగా తినడం తప్పు” అనే విషయం కాదు.

ఒక్కోసారి ఒంటరిగా కాఫీ తాగడం, భోజనం చేయడం, సినిమా చూడడం చాలా ఆరోగ్యకరమైన వ్యక్తిగత సమయం కావచ్చు.

కానీ ఒక సమాజంలో కలిసి తినే సంస్కృతి తగ్గిపోవడం మాత్రం ఒక పెద్ద సామాజిక మార్పుకు సంకేతం.

ఎందుకంటే భోజనం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు.

అది సంభాషణ.

అది అనుబంధం.

అది మనుషుల మధ్య దూరాన్ని తగ్గించే ఒక చిన్న సామాజిక ఆచారం.

అందుకే ప్రపంచ సంతోష నివేదికలు కూడా ఇతరులతో కలిసి భోజనం చేసే అలవాటుకు మెరుగైన శ్రేయస్సుతో సంబంధం ఉందని చూపిస్తున్నాయి.


మనకు స్నేహితులు లేరా? లేక సమయం లేదా?

ఇది అసలు ప్రశ్న.


నిజానికి చాలామందికి స్నేహితులు కావాలనే ఉంటుంది.

కానీ సమయం ఉండదు.

ఉదయం ఆఫీసు.

సాయంత్రం ట్రాఫిక్.డ

ఇంటికి వచ్చేసరికి అలసట.

మిగిలిన సమయం ఫోన్.

వీకెండ్ వస్తే వ్యక్తిగత పనులు.

అలా నెలలు గడుస్తాయి.

తర్వాత…

“అరే! వాడితో మాట్లాడి చాలా కాలమైపోయింది కదా!”

అని గుర్తొస్తుంది.

కాల్ చేయాలనిపిస్తుంది.

కానీ…

“ఇప్పుడు చేస్తే ఏం అనుకుంటాడు?”

అని ఆలోచిస్తాం., లేదా వాడు చేయచ్చు కదా అని ఇగో 

అదే స్నేహానికి మొదటి శత్రువు.

సమయం లేకపోవడం కాదు.

స్నేహానికి సమయం కేటాయించకపోవడం.

సోషల్ మీడియా మనల్ని కలిపిందా? విడదీసిందా?

సోషల్ మీడియా వచ్చినప్పుడు ప్రపంచం దగ్గరైపోతుందని అనుకున్నాం.

నిజమే.

దూరంగా ఉన్న మనిషిని ఒక్క క్షణంలో పలకరించగలిగాం.

కానీ ఒక విచిత్రమైన పరిణామం జరిగింది.

మనకు ఇప్పుడు ఎక్కువ మంది పరిచయం.

తక్కువ మంది స్నేహితులు.

వందల మంది పోస్టులు చూస్తున్నారు.

వేల మంది మన పోస్టులు చూస్తున్నారు.

కానీ మన బాధను చూసేవారు ఎంతమంది?

మన విజయాన్ని నిజంగా సంతోషించేవారు ఎంతమంది?

మన ఓటమిలో మన పక్కన నిలబడేవారు ఎంతమంది?

ఇదే అసలు స్నేహానికి పరీక్ష.


లైక్ కొట్టేవాడు స్నేహితుడు కాదు.

కామెంట్ చేసేవాడు స్నేహితుడు కాదు.

ప్రతిరోజూ మెసేజ్ చేసేవాడు కూడా తప్పనిసరిగా స్నేహితుడు కాదు.

మనకు ఏమీ ఇవ్వలేని సమయంలో కూడా మనతో ఉండేవాడే స్నేహితుడు.

ఒంటరితనం కేవలం భావోద్వేగ సమస్య కాదు.

ఇక్కడే ఈ విషయం మరింత సీరియస్ అవుతుంది.

అమెరికా సర్జన్ జనరల్ 2023లో సామాజిక అనుబంధం లేకపోవడం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు. వారి నివేదిక ప్రకారం ఒంటరితనం, సామాజిక దూరం గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, డిమెన్షియా, ఆందోళన, డిప్రెషన్‌తో సంబంధం కలిగి ఉన్నాయి. సామాజిక అనుబంధం లేకపోవడం వల్ల అకాల మరణ ప్రమాదం కూడా పెరుగుతుంది.


“రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదం” అనే ప్రసిద్ధ పోలిక కూడా ఇదే నివేదిక నుంచి వచ్చింది.

అయితే దీన్ని “ఒంటరితనం = రోజూ 15 సిగరెట్లు” అనే వైద్య సమీకరణంగా తీసుకోవడం సరికాదు. ఇది అకాల మరణ ప్రమాదాన్ని పోల్చి చెప్పే ఒక ఆరోగ్య హెచ్చరిక.


అంటే…

స్నేహం ఒక విలాసం కాదు.

మనిషి ఆరోగ్యానికి అవసరమైన సామాజిక పోషకం.

80 ఏళ్ల పరిశోధన చెప్పిన విషయం ఇదే!


డబ్బు సంపాదించాలి.

కెరీర్‌లో ఎదగాలి.

పేరు తెచ్చుకోవాలి.

స్థానం సంపాదించాలి.

ఇవన్నీ జీవితంలో అవసరమే.


కానీ దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా సాగుతున్న Harvard Study of Adult Development మనిషి దీర్ఘకాలిక సంతోషం, ఆరోగ్యంతో మంచి సంబంధాల ప్రాముఖ్యతను పదేపదే చూపించింది.


అంటే చివరికి మనిషి జీవితాన్ని నిలబెట్టేది బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు.

ఎవరితో జీవించాం?

ఎవరిని ప్రేమించాం?

ఎవరికి మనసు విప్పి మాట్లాడాం?

మన కష్టకాలంలో ఎవరు మన పక్కన నిలబడ్డారు?

అవే ముఖ్యమైన ప్రశ్నలు.


ఒకప్పుడు స్నేహం కోసం గంటలు కేటాయించేవాళ్లం…

మన తరం గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది.

సాయంత్రం ఇంటి ముందు నాలుగు కుర్చీలు.

ఒకడు టీ తీసుకొస్తాడు.

మరొకడు బిస్కెట్లు తెస్తాడు.

మరొకడు ఏదో రాజకీయ వాదన మొదలుపెడతాడు.

రాత్రి ఎప్పుడైందో తెలియదు.

ఇప్పుడు అదే నలుగురు స్నేహితులు ఒక వాట్సాప్ గ్రూపులో ఉన్నారు.

రోజుకు వంద మెసేజీలు వస్తాయి.

కానీ నాలుగు నెలలుగా ఎవరూ ఒకరిని ఒకరు కలవలేదు.

టెక్నాలజీ మన సంభాషణను పెంచింది.

కానీ మన అనుబంధాన్ని పెంచలేదు.

స్నేహానికి కూడా “మెయింటెనెన్స్” కావాలి

కారు సర్వీసింగ్ చేయాలి.

ఇంటికి పెయింటింగ్ చేయాలి.

బ్యాంక్ అకౌంట్ చూసుకోవాలి.

శరీరాన్ని వ్యాయామంతో చూసుకోవాలి.

మరి స్నేహాన్ని?


దానిని మాత్రం “అది అలాగే ఉంటుంది” అని వదిలేస్తాం.


అలా ఉండదు.

ఎప్పుడో కలిసిన స్నేహితుడికి ఒక ఫోన్ చేయాలి.

“ఎలా ఉన్నావు?” అని అడగాలి.

అవసరం లేకపోయినా కలవాలి.

పాత గొడవలు ఉంటే కొన్ని మర్చిపోవాలి.

మన స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు అతని దగ్గరకు వెళ్లాలి.

ఎందుకంటే…

స్నేహం కూడా ఒక మొక్కలాంటిదే.

నీళ్లు పోయకపోతే ఎండిపోతుంది.

చివరికి మనిషి ఏం మిగుల్చుకుంటాడు?

ఇల్లు ఉండొచ్చు.

డబ్బు ఉండొచ్చు.

పదవి ఉండొచ్చు.

పేరు ఉండొచ్చు.


కానీ జీవితంలో ఒక దశకు వచ్చాక మనిషి వెనక్కి తిరిగి చూసుకుంటాడు.


అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్‌తో మాట్లాడలేడు.

పదవితో నవ్వలేడు.

ఫాలోవర్లతో కౌగిలించుకోలేడు.

అప్పుడు గుర్తొచ్చేది…

“ఆ రోజుల్లో మనం ఎంత నవ్వుకున్నాం!”

అని చెప్పగలిగే మనుషులే.

అందుకే ఈ “Friendship Recession” కథనం కేవలం అమెరికా గణాంకాల కథ కాదు.

మన ఇళ్లలోకి కూడా నెమ్మదిగా వస్తున్న ఒక సామాజిక మార్పు గురించి హెచ్చరిక!


మన దగ్గరున్న మంచి స్నేహితుడిని కోల్పోయిన తర్వాత కొత్త స్నేహితుడిని సంపాదించడం కష్టం.


అందుకే…

ఈరోజే ఒక స్నేహితుడికి ఫోన్ చేయండి.

ఎటువంటి పని లేకుండా.

ఎటువంటి అవసరం లేకుండా.

కేవలం…

“ఏరా… ఎలా ఉన్నావ్?”

అని అడగండి.

బహుశా ఆ ఒక్క ఫోన్ కాల్ మీ స్నేహితుడికే కాదు…

మీ జీవితానికీ అవసరమై ఉండొచ్చు.

పరిచయాలు జీవితాన్ని నింపవు.

నిజమైన స్నేహాలే నింపుతాయి.

స్నేహితులను సంపాదించండి.

ఉన్న స్నేహాలను కాపాడుకోండి.

ఎందుకంటే డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు.

పదవి పోతే మళ్లీ రావచ్చు.


కానీ…

మనసుకు దగ్గరైన ఒక నిజమైన స్నేహితుడు దూరమైతే ఆ ఖాళీని పూరించడం అంత సులభం కాదు.

పెయిను కిల్లరేసి

 పెయిను కిల్లరేసి పిట్టలా తిరిగేస్తె

ముడుకు లరిగి మీరు మూలకెళ్ళు

నమ్ము హోమియోను నయమౌను నిజముగా

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: కీళ్ళనొప్పులు, స్పాండిలైటిస్ (మెడ నొప్పి), సయాటికా, నడుం నొప్పి, అలాగే ఇతర నొప్పులకూ పెయిన్ కిల్లర్లూ, పై పూతలు(పెయిన్ బామ్, ఆయింట్ మెంటూ), స్టెరాయిడ్ ఇంజక్షన్లూ వాడేసి, సమస్య తగ్గిపోయిందనుకుని ఆనందంగా తిరిగేస్తే, అది మీ పిచ్చితనమే! ఏడుస్తున్న పిల్లాడి మూతికి స్టిక్కర్ అంటించి, ఏడుపు సౌండు లేదు కాబట్టి వాడు ఆనందంగా ఉన్నాడనుకోవడం ఎంత మూర్ఖత్వమో, పెయిన్ కిల్లర్ తో సమస్య తగ్గిందనుకోవడం కూడా భ్రమే! క్రమంగా ముడుకులు,కీళ్ళు అరిగిపోయి, పూర్తిగా కదలలేని పరిస్థితికి చేరుకుంటారు! అంతేగాక తప్పుడు ఇంగ్లీషు మందుల వాడకంతో అల్సర్, కిడ్నీ ట్రబుల్, బి.పి, షుగర్, లివర్ ప్రోబ్లమ్, కేన్సర్ మొదలైన జబ్బులు అదనపు బోనస్ గా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది! కాబట్టి హోమియో మందులు వాడుకుంటే నాలుగు రోజులు సమయం పట్టినా, చక్కగా కీలు సందులో కార్టిలేజ్ తయారై, కీలు సక్రమంగా రిపేరై, సహజంగా తిరగ గలుగుతారు! ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు! 

సకురు అప్పారావూ ఇది నిజంగా నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)