*
*
*శ్రీమద్భాగవతం - 27/42*
*దామోదర లీల & యమలార్జున భంజనం*
ఓం నమో భగవతే వాసుదేవాయ!
భాగవత అధ్యయనం లో భాగంగా ఈరోజు మరికొన్ని శ్రీకృష్ణలీలలు తెలుసుకుని తరిద్దాం..
1. *వెన్నదొంగ లీలలు & గోపికల ముద్దు ఫిర్యాదులు*
చిన్నికృష్ణుడు క్రమంగా కొద్దిగా పెద్దవాడు అయ్యాడు, అప్పటి నుండి గోపబాలురతో కలిసి గోపికల ఇళ్లలోకి చొరబడి వెన్న దొంగిలించడం నిత్యకృత్యమైంది. ఉట్టిపై దాచిన కుండలను కర్రలతో పగలగొట్టడం, కోతులకు వెన్న తినిపించడం, వెన్న చిక్కకపోతే దూడలను వదిలివేయడం వంటి అల్లర్లు చేసేవాడు.
గోపికలు యశోద వద్దకు వచ్చి కృష్ణునిపై ముద్దుగా ఫిర్యాదులు చేసేవారు:
* "యశోదా! నీ కుమారుడు మా ఇంట్లోకి వచ్చి వెన్నంతా తినేస్తున్నాడు. చీకటి గదిలో దాచినా ఆయన శరీర కాంతితోనే వెన్న కుండలు కనిపిస్తున్నాయని అంటున్నాడు. అడిగితే 'ఇది నా ఇల్లే' అంటున్నాడు!"
* గోపికల మాటలు వింటూ కృష్ణుడు భయపడినట్లు తల్లి చీర కొంగు వెనుక దాక్కోవడం చూసి యశోద, గోపికలు పరవశించి నవ్వుకునేవారు.
2. *దామోదర లీల*
ఒకనాడు యశోదాదేవి తన ఇంటి దాసీలకు వేర్వేరు పనులు చెప్పి
కృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైన వెన్న స్వయంగా తానే తీయడానికి పెరుగు చిలకడం ప్రారంభించింది.శ్రీకృష్ణుని లీలలను మధురంగా గానం చేస్తూ కవ్వం తిప్పుతోంది.
* అంతలోనే శ్రీకృష్ణుడు స్తన్యం గ్రోలుటకు (పాలుతాగడానికి) పెరుగు చిలికే తల్లి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆమెలో మురిపములు నింపుతూ,కవ్వం పట్టుకుని పెరుగు చిలుకుటకు అడ్డం వచ్చాడు,బిడ్డ ఆకలి తీర్చడానికి తల్లి ఒడిలోకి తీసుకుని స్తన్యం ఇచ్చి, చిన్ని కృష్ణుడు పాలు తాగుతుండగా, పొయ్యిపై పెట్టిన పాలు పొంగిపోవడం చూసి యశోద కృష్ణుడిని పక్కన పెట్టి పొయ్యి వద్దకు పరుగెత్తింది.
పాలు తాగడం మధ్యలోనే ఆపినందుకు కోపించి, అలకబూనిన బాలకృష్ణుడు దొంగ ఏడుపుతో మొన దేలిన రాతి ముక్కతో పెరుగు కుండను పగలగొట్టి,పక్క గదిలోకి వెళ్లి తినసాగెను.యశోదమ్మ పొయ్యి మీద నుండి పాలు దింపి పెరుగు చిలికే ప్రదేశానికి తిరిగి వచ్చి పగిలిపోయిన పెరుగుకుండను చూసింది.ఇది నా కుమారుడి నిర్వాకమే అని గ్రహించి అక్కడ కనపడకపోవడంతో తనలో తానే నవ్వుకున్నది. అప్పుడు కృష్ణుడు బోర్లింప బడి ఉన్న రోలుపై ఎక్కి ఉట్టిపై గల కుండలోని వెన్న తాను తింటూ తనవారికి కోతులకు పెట్టసాగాడు.ఈ విషయం తల్లికి ఎక్కడ తెలుస్తుందో అని భయంతో అటు ఇటు చూస్తున్నాడు.
అది గమనించి యశోద చేతిలో బెత్తం పట్టుకుని కృష్ణుని వద్దకు వచ్చింది, చిన్ని కృష్ణుడు భయపడుతూ రోటి పై నుండి దూకి భయపడుతున్న వాడి వలె అటు ఇటు పరిగెత్తాడు.ఆ యశోదమ్మ ఎంత ప్రయత్నించినా దొరకలేదు.
యోగుల ధ్యానానికి చిక్కని పరమాత్మ తల్లి భయంతో అటూఇటూ పరుగెత్తి చివరకు పట్టుబడ్డాడు.
తన దుడుకు కొడుకును పట్టుకొనిన పిదప ఆమె భయపెట్టుచు అతనిని దండించుటకై చేతిని పైకెత్తెను. అపరాధమొనర్చిన ఆ బాలుడు పైగా ఏడ్చుచు తన చిట్టిచేతులతో కనులను నులుముకొనసాగెను. అంతట కనులకుగల కాటుక ముఖమంతయు వ్యాపించెను. అతడు భయముతో వణకిపోవుచు వీక్షింపసాగెను.
కృష్ణుని కళ్లలో భయం, కన్నీటి బిందువులను చూసి యశోద చేతిలోని బెత్తాన్ని పారేసి, అమ్మో కన్నయ్య నిజంగానే భయపడ్డాడు అని బెత్తం పారేసి మళ్ళీ అల్లరి చేయకుండా ఒక రోలుకు తాడుతో కట్టాలని ప్రయత్నించింది.
అనంతకోటి బ్రహ్మాండాలలో వ్యాపించిన విశ్వవ్యాపకుడు అయిన స్వామిని తాడుతో కట్టాలి అని చూసింది.
కానీయశోద ఇంట్లో ఉన్న తాళ్లన్నీ తెచ్చి కలిపి కట్టినా, ప్రతిసారీ తాడు రెండు అంగుళాలు (రెండంగుళాల పొడవు) తక్కువయ్యేది! ఆమె మరియొక త్రాడును దానికి జతపరచెను. అదియును ఆ బుడుతడిని బంధించుటకు రెండు అంగుళములు తక్కువగుటతో ఆ తల్లి దానికిని మరియొక త్రాడును జోడించెను. ఇట్లు ఎన్నెన్ని త్రాళ్లు కూర్చినను రెండు అంగుళములమేర తక్కువ అగుచునే యుండెను. ఈవిధముగా ఇంటిలోగల అన్ని త్రాళ్లను దెచ్చి ముడివేసినను ఆ స్వామిని బంధింపలేకపోయెను. ఆమె పరిస్థితిని జూచి గోపికలు అందరును ముసిముసినవ్వులు నవ్వసాగిరి. అంతట యశోదయు నవ్వుకొనుచు ఆశ్చర్యమునకు లోనయ్యెను. (ముజ్జగములను తనలో నిల్పికొనిన ఆ బుజ్జి బొజ్జను కట్టివేయుటకు ఎవరికి తరమగును?)అంతట శ్రీకృష్ణుడు తనను త్రాడుతో బంధించుటకై ప్రయాసపడుచున్న తన తల్లిని చూచెను. ఆమె ఒళ్ళంతయు చెమటబిందువులతో తడిసిపోవుచుండెను. ఆమె కొప్పు ముడివీడి అందలి పూలమాలలు జారిపోవుచుండెను. అప్పుడు ఆ స్వామి తన తల్లిపై జాలిపడుచు స్వయముగా కట్టువడెను.”
సర్వస్వతంత్రుడు అయిన స్వామి యశోదమ్మ భక్తికి కట్టుబడి భక్త పరాదీనుని నేను అని చాటుకున్నాడు.
*ఉదరమున (పొట్టకు) దామము (తాడు) చేత కట్టబడినవాడు కాబట్టి శ్రీకృష్ణునికి 'దామోదరుడు' అనే దివ్య నామం సార్థకమైంది.
గోపికానందనుడైన (యశోదమ్మ
సుతుడైన) శ్రీకృష్ణుడు (శ్రీహరి) అనన్యభక్తులకు
లభించునట్లు, తత్త్వజ్ఞానులకుగాని, పరమమునులకుగాని,
మహాదాతలకు గాని, దేహాభిమానులైన కర్మయోగులకుగాని, ఉత్తమోత్తమ యోగులకు కానీ లభ్యుడు కాదు.
అలా రోటికి బంధింపబడియున్న శ్రీకృష్ణప్రభువు తన తల్లి గృహకృత్యములలో మునిగియుండుట గమనించెను. పిదప ఆ స్వామి మద్దిచెట్ల రూపములోనున్న కుబేరుని పుత్రులగు యక్షులను జూచెను. నలకూబరుడు, మణిగ్రీవుడు అను పేరుగల ఈ యక్షకుమారులు ధనబలమువలనను, సౌందర్యాతిశయము చేతను మదించినవారై, పూర్వము నారదుని శాపమునకు గుఱియై, మద్దివృక్షములుగా ఇచట | పడియుండిరి. వారిని శాపవిముక్తులను జేయుటకై ఆ స్వామి తన దయా దృష్టి ప్రసరింపచేసెను..
3.*నలకూబర-మణిగ్రీవుల పూర్వజన్మ & నారదుని శాపం*
నందభవనం ముంగిట జంటగా ఉన్న రెండు పెద్ద మద్దిచెట్లు (యమలార్జున వృక్షాలు) ఉండేవి. అవి సాధారణ వృక్షాలు కావు.
పూర్వజన్మలో కుబేరుని కుమారులైన 'నలకూబరుడు', 'మణిగ్రీవుడు'.అనే శివ భక్తులు అలా మారారు,వారు ధనమదంతో మందాకినీ నదిలో అప్సరసలతో దిగంబరులై జలక్రీడలాడుతుండగా నారద మహర్షి అటుగా వచ్చారు.
*నారదుడిని చూసి అప్సరసలు వస్త్రాలు ధరించారు కానీ, ఈ ఇద్దరు మత్తులో నిలబడి ఉన్నారు. నారదుడు వారి అహంకారాన్ని పోగొట్టడానికి: "వస్త్రాలు లేక వృక్షాల వలె ఉన్న మీరు గోకులంలో మద్దిచెట్లుగా మారండి. వందేళ్ల తర్వాత శ్రీకృష్ణుని స్పర్శతో మీకు శాపవిమోచనం కలుగుతుంది" అని శపించాడు.
4. యమలార్జున భంజనం & శాపవిమోచనం
నారద మహర్షి ఇచ్చిన శాపాన్ని తొలగించుటకు రోలుకు కట్టబడిన చిన్నికృష్ణుడు ఆ రోలును ఈడ్చుకుంటూ రెండు మద్దిచెట్ల మధ్యకు పాక్కుంటూ వెళ్ళాడు
*ఆ రోలు ఆ రెండు చెట్ల మధ్య అడ్డంగా ఇరుక్కుపోయింది. బాలకృష్ణుడు ఒక్క బలమైన లాగు లాగాడు. ఆ దెబ్బకు ఆ మహా వృక్షాలు వేళ్లతో సహా పెళ్లగించుకుని భయంకరమైన శబ్దంతో నేలకూలాయి!
* నేల కూలిన ఆ చెట్ల నుండి సూర్యతేజస్సుతో ఇద్దరు దివ్యపురుషులు బయటకు వచ్చి, బాలకృష్ణుని చరణాలపై పడి దివ్య స్తుతి చేశారు:
"వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః |
స్మృత్యాం శిరస్తవ నివాసజగత్ప్రణామే దృష్టిః సతాం దర్శనేస్తు భవత్తనూనామ్ ||"
"ఓ కృష్ణా! మా వాక్కు నిరంతరం నీ లీలలను కీర్తించుగాక, మా చెవులు నీ కథలనే వినుగాక, మా చేతులు నీ కైంకర్యమే చేయుగాక, మా శిరస్సు నీ విగ్రహాలకే ప్రణమిల్లునుగాక!"అని ప్రార్ధన చేశారు.
వారి ప్రార్థనలకు సంతుష్టుడై శ్రీకృష్ణుడు వారికి అచంచలమైన భక్తిని ప్రసాదించి దివ్యలోకాలకు పంపాడు.
5. *బృందావన ప్రవేశం*
మద్దిచెట్లు పడిపోయిన శబ్దానికి నందుడు, గోపాలురంతా పరుగెత్తుకుంటూ వచ్చారు.ఇవి ఎలా కూలాయి అని అడగ్గా అక్కడున్న బాలుడు చిన్ని కృష్ణుడు కూల్చాడు అన్నారు, ఓరి వెర్రి వాళ్ళలా ఉన్నారే ఇంత చిన్న బాలుడు చెట్లు కులుస్తాడా ఆపండి మీ చాడీలు అన్నారు, కొందరు విజ్ఞులు మాత్రం ఈ బాలుడు ఎన్నో లీలలు చేసి ఉన్నాడు ఇప్పటికే అయి ఉండవచ్చు అన్నారు మళ్ళీ ఏదో ఒకటి ముందు పిల్లాణ్ణి చూడండి అన్నారు. తన దివ్యత్వాన్ని ఎక్కడ గుర్తిస్తారో అని స్వామి కొన్ని బాల్య క్రీడలు చేసి వారిని మైమరిపించాడుఅదే కదా స్వామి మాయ...రోలు మధ్యలో నవ్వుతూ కూర్చున్న కృష్ణుడిని చూసి నందుడు కట్లను విప్పి గుండెలకు హత్తుకున్నాడు.
గోకులంలో వరుసగా జరుగుతున్న రాక్షసోత్పాతాలను, అద్భుతాలను చూసి ఉపనందుడు మొదలైన పెద్దలు ఆలోచించి: "గోకులం ఇక సురక్షితం కాదు; పచ్చని గడ్డి, యమునా నది, గోవర్ధన పర్వతం ఉన్న 'బృందావనానికి' మన నివాసాన్ని మార్చుకుందాం" అని నిర్ణయించారు. గోపాలురంతా తమ బండ్లపై సామాన్లు, గోవులను సర్దుకుని బృందావన క్షేత్రానికి తరలివెళ్లారు.
📝 నేటి ముఖ్య విషయాలు:
* భక్తికి బద్ధుడైన పరమాత్మ: బ్రహ్మాండ భాండాలను తన గర్భంలో మోసే జగన్నాథుడు, తల్లి నిష్కల్మష ప్రేమకు లొంగి చిన్న తాడుతో కట్టబడ్డాడు. భగవంతుడు అహంకారానికి లొంగడు, కేవలం భక్తికే లొంగుతాడు.
* రెండు అంగుళాల అంతరార్థం: తాడు సరిపోవడానికి కావాల్సిన రెండు అంగుళాలు: ఒకటి మానవ ప్రయత్నం (సాధన), రెండవది భగవత్ కృప (అనుగ్రహం). ఇవి రెండూ కలిస్తేనే భగవత్ ప్రాప్తి!
* సాధు శాపం కూడా వరమే: నారదుని శాపం కుబేర పుత్రులకు శాపంగా కాక, సాక్షాత్తు శ్రీకృష్ణుని దివ్య దర్శనానికి, శాశ్వత భక్తికి కారణమైంది.
(రేపటి రోజు 28 లో: బృందావన బాల్య లీలలు – దూడల మేపుట, బకాసుర వధ, వత్సాసుర సంహారం & భయంకరమైన అఘాసుర సంహార మహోత్సవం తెలుసుకుందాం!)
...సశేషం
🙏🌹🙏
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*
*శ్రీమద్భాగవతం - 28/42*
*వత్సాసుర, బకాసుర వధ & అఘాసుర మోక్షం*
ఓం నమో భగవతే వాసుదేవాయ!
మన భాగవత అధ్యయనం లో భాగంగా నిన్న బృందావన ప్రవేశం వరకు తెలుసుకున్నాం,ఇక ఈరోజు నుండి బృందావన కృష్ణుడి లీలలు చదువుకుందాం
1. *బృందావనంలో గోవత్స పాలన*
బృందావనానికి చేరుకున్న తర్వాత అందరిని తమ ముద్దు మీ. ముద్దు మాటలు అల్లరి చేష్టలతో ఆనందింప చేస్తూ కాలక్రమమున రామకృష్ణులు కొద్దిగా పెద్దవారై 'పౌగండ' వయస్సుకు చేరుకున్నారు. వారు కూడా తోటి గోపబాలురతో కలిసి దూడలను (గోవత్సాలను) మేపడానికి అడవులకు వెళ్లడం ప్రారంభించారు.
పిల్లనగ్రోవి (మురళి) ఊదుతూ, నెమలి పింఛాన్ని శిరస్సున ధరించి, పక్షుల కిలకిలారావాలను అనుకరిస్తూ, కోతులతో గెంతుతూ బృందావన వనాలలో బాలకృష్ణుడు సృష్టించిన ఆనందం వర్ణనాతీతం.
ఏమి అదృష్టమో ఆ గోప బాలురది జగత్తును లీలగా తన మాయచే ఆడించే జగన్నాటక సూత్రధారి వారితో ఆటలు ఆడాడు, గంతులు వేశాడు, కేరింతలు కొట్టాడు,మాట్లాడడు, ఆటల్లో భాగంగా పోట్లాడాడు ఆహా స్వామి చర్యలు ఊహాతీతం పరమాత్మ అనుగ్రహం వర్ణనాతీతం.
2. వత్సాసుర సంహార
అలా ఒకరోజు రామకృష్ణులు యమునా నదీ తీరాన దూడలను మేపుతుండగా, కంసుని అనుచరుడైన ఒక రాక్షసుడు ఒక దూడ రూపాన్ని ధరించి (వత్సాసురుడు) దూడల మందలో కలిసిపోయాడు. కృష్ణుడిపై దాడి చేయడానికి అదను కోసం చూస్తున్నాడు.అది గమనించిన అంతర్యామియైన శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడి కపట రూపాన్ని బలరామునికి కనుసైగతో బలరాముని తెలుపుచు, అమాయకుని వలె
మెల్లగా ఆ దూడ వెనుకకు వెళ్లి, దాని రెండు వెనుక కాళ్లను, తోకను గట్టిగా పట్టుకుని గిరగిరా తిప్పి ఒక వెలగ చెట్టుపైకి విసిరికొట్టాడు. ఆ దెబ్బకు చెట్టు పండ్లతో సహా నేలకూలింది; వత్సాసురుడు ప్రాణాలు విడిచాడు. తోటి గోపబాలురు "శ్రీకృష్ణా! ఎంత గొప్ప పని చేశావు!" అంటూ పరమానందంతో జయజయధ్వానాలు చేశారు.
3. బకాసుర వధ (11వ అధ్యాయం)
అలా మరొకరోజు గోపబాలురంతా, ఆవులతో సహా దప్పిక గని ఒక పెద్ద సరస్సు వద్దకు వెళ్ళి నీళ్లు తాగుతుండగా, అక్కడ ఒక పెద్ద కొండశిఖరం వంటి ఆకారం కనిపించింది. అది కంసుడు పంపిన **బకాసురుడు** అనే రాక్షసుడు. ఆయన ఒక భయంకరమైన పెద్ద కొంగ (బకము) రూపాన్ని ధరించి ఉన్నాడు.దాన్ని చూసి అందరూ బయటపడ్డారు.
అంతలోనే బకాసురుడు తన వాడియైన ముక్కుతో కృష్ణుడిని అమాంతం నోట్లో వేసుకుని మింగివేశాడు. అది చూసి బలరామాది గోపబాలురు భయంతో మూర్ఛపోయారు.
సాక్షాత్తు సమస్త బ్రహ్మాండాలకు ఆధారమైన పరమాత్మ బకాసురుని గొంతులోకి వెళ్లగానే... ఆయన గొంతులో కార్చిచ్చు పెట్టినట్లు తీవ్రమైన మంట పుట్టింది. ఆ వేడిని తాళలేక బకాసురుడు కృష్ణుడిని బయటకు కక్కివేశాడు.
కక్కిన వెంటనే మళ్లీ ముక్కుతో పొడవడానికి రాగా, శ్రీకృష్ణుడు ఒడుపుతో ఆ రాక్షస కొంగ ముక్కు రెండు రెక్కలను రెండు చేతులతో పట్టుకుని, దర్భపుల్లను చీల్చినట్లుగా నిలువుగా చీల్చి సంహరించాడు. దేవతలు ఆకాశం నుండి పూలవాన కురిపించారు.
తమ చిన్ని కృష్ణునికి ఏమి కానందుకు గోపబాలురు అంతా కేరింతలు కొట్టారు, అంతా తిరిగి బృందావనానికి ఆవులు తోలుకొని వచ్చారు.బలరామకృష్ణులు గోపబాలురతోగూడి దాగుడుమూత లాడుచుండిరి. అప్పుడప్పుడు ఉత్తుత్తి సేతుబంధన క్రీడలను (ఆనకట్టలు వేయుట, పిట్టగూళ్లు కట్టుట మున్నగు ఆటలను) నడపుచుండిరి, అట్లే కోతులవలె గంతులు వేయుచు చెట్లపైనను ఆడుకొనుచుండిరి. ఈవిధముగా వారు ఈడునకు తగిన క్రీడలతో తమ కౌమారవయస్సును హాయిగా ఆటపాటలతో గడపిరి.
4. అఘాసురుని ఆగమనం & కొండచిలువ గుహ (12వ అధ్యాయం)
ఒకనాడు శ్రీకృష్ణుడు వనభోజనమునకు సంకల్పించి, ప్రాతఃకాలమునందే నిద్రనుండి మేల్కొనెను. ఆ తర్వాత ఆ స్వామి ఇంపైన కొమ్మువాద్యధ్వనితో తన మిత్రులైన గోపబాలురను మేల్కొల్పి, ఆవుదూడలను ముందుభాగమున నడపుచు వ్రజభూమి (బృందావనము) నుండి బయలుదేరెను.
అప్పుడు పరస్పర ప్రేమానురాగములుగల వేలకొలది గోపబాలురు చక్కని చిక్కములను, బెత్తములను, కొమ్ములను, పిల్లనగ్రోవులను తీసికొని, అసంఖ్యాకములైన తమ తమ గోవత్సములను ముందుభాగమున నడిపించుచు, శ్రీకృష్ణునితోపాటు సంతోషముగా బయలుదేరిరి.
ఆనాడు వారంతా ఎంతో సంతోషంగా ఆటలు ఆడుతూ కేరింతలు కొడుతూ గడుపుతూ ఉన్నారు.
ఇంద్రియములను, అంతఃకరణమును వశపరచుకొని, అనేక జన్మలలో పలుశ్రమలకోర్చి వివిధరీతుల తపస్సులు ఒనర్చిన యోగిపుంగవులు సైతము ఆ శ్రీహరి (శ్రీకృష్ణుని) పాదరేణువుల దర్శనభాగ్యమునకు నోచుకొనరు. అట్టి కృష్ణపరమాత్మను నిరంతరము స్వయముగా దర్శించుచు ఆ స్వామితోగూడి యాడెడి ఈ గోపబాలురయొక్క అదృష్టమును ఎంతని వర్ణింపగలము?
ఆ గోపబాలురు అందరును ఇట్లు హాయిగా ఆడుకొనుచుండిరి. వారి ఆనంద విహారములను జూచి ఓర్వలేక 'అఘాసురుడు' అను ఒక గొప్ప రాక్షసుడు హఠాత్తుగా అచటికి వచ్చి వాలెను. అతడు
పూతన, బకాసురుల సోదరుడు తన తోబుట్టువులను చంపిన కృష్ణుడిపై పగ తీర్చుకోవడానికి వచ్చాడు.
ఆయన ఎనిమిది మైళ్ల (ఒక యోజనం) పొడవున్న ఒక మహా కొండచిలువ (సర్పం) రూపాన్ని ధరించి, రహదారి మధ్యలో పడుకున్నాడు.
గుహ లాంటి నోరుతో తన క్రింది పెదవిని భూమిపై, పై పెదవిని ఆకాశంలో మేఘాలకు ఆనించి, నోటిని ఒక పెద్ద కొండగుహలా తెరిచి ఉంచాడు. ఆయన నాలుక ఎర్రటి దారిలా, నోటి నుండి వచ్చే శ్వాస వేడి గాలిలా, కళ్లు మండుతున్న నిప్పులలా ఉన్నాయి.
అక్కడ స్వేచ్చగా విహరించుచున్న గోపబాలులు అందఱును దానిని జూచి, 'విహారభూమి అయిన బృందావనము నందు ఇదియొక భాగమేమో?' అని తలంచి. గుహాకృతితో నున్న ఆ దృశ్యము వారికి తెఱచుకొనియున్న ఒక మహాసర్పముయొక్క ముఖముగా తోచెను. (అనిపించెను)
మనము దీని ముఖమునందు. ప్రవేశించినచో ఇది మనలను కబళించివేయునా? అట్లు చేయుట దీనివలన కానిపని. ఒకవేళ ఇది మనలను మ్రింగివేయుటకు పూనుకొనినను (ఇంతకుముందు కృష్ణునిచేతిలో చచ్చిన బకాసురునివలె) వెంటనే నశించును.
మన కృష్ణయ్య దీనిపని పట్టకుండునా?” ఈవిధముగా పలికిన పిమ్మట ఆ గోపబాలకులు అందఱును శ్రీకృష్ణుని సుందరవదనమును చూచుచు, మనకు తోడునీడగా శ్రీకృష్ణుడు గలడను ధీమాతో బిగ్గఱగా నవ్వుచు, చప్పట్లు చఱచుచు ఆ అజగరముఖములో ప్రవేశించిరి.(నమ్ముకున్న వాడిని మృత్యు ముఖం నుండి కూడా బయట పడేసే అపార కరుణాసముద్రుడు నా తండ్రి)
5. అఘాసుర సంహారం & దివ్య తేజో లీనం
గోపబాలురు లోపలికి వెళ్లిన తర్వాత కూడా వాడు నోరు మూయలేదు ఎందుకుంటే వాడి పగ శ్రీకృష్ణ పరమాత్మ మీద కదా, వారిని రక్షించడం కోసం పరమాత్మ శ్రీకృష్ణుడు కూడా ఆ కొండచిలువ నోట్లోకి ప్రవేశించాడు. వెంటనే రాక్షసుడు సంతోషంతో నోరు మూయడానికి సిద్ధమయ్యాడు.
వెంటనే శ్రీకృష్ణుడు ఆ అఘాసురుని గొంతులోనే ఉండి తన శరీరాన్ని అనంతంగా పెంచడం ప్రారంభించాడు.దాంతో రాక్షసునికి ఊపిరాడక కళ్లు బయటకు వచ్చాయి; గొంతు పగిలిపోయి బ్రహ్మరంధ్రం నుండి ప్రాణాలు అనంత ఆకాశంలోకి ఎగిరిపోయాయి. శ్రీకృష్ణుడు తన అమృత దృష్టితో స్పృశించి లోపల మూర్ఛపోయిన గోపబాలురను, దూడలను బ్రతికించి క్షేమంగా బయటకు తీసుకువచ్చాడు.
* **దివ్య మోక్షం:** అఘాసురుని శరీరం నుండి వెలువడిన ఒక దివ్యజ్యోతి ఆకాశంలో వేచి ఉండి, శ్రీకృష్ణుడు బయటకు రాగానే సమస్త దేవతలు చూస్తుండగా **శ్రీకృష్ణుని పాదపద్మాలలో లీనమైంది!**
దేవతలు అంతా స్వామిని స్తుతించారుఅవి బ్రహ్మలోకానికి వినపడ్డాయి బ్రహ్మదేవుడు తన వాహనముపై అచటికి చేరి, శ్రీకృష్ణమహిమను కన్నులార దర్శించి ఆశ్చర్యమున మునిగిపోయెను.
పరీక్షిన్మహారాజా! ఆ కొండచిలువయొక్క చర్మము ఎండిపోయి, ఒక గుహాకారమున విలసిల్లెను. పిమ్మట బృందావనమునందలి గోపబాలురకు అందఱకును పెక్కుదినములవఱకు అది అద్భుతమైన ఒక క్రీడాభూమిగా కౌమారవయస్సునందు ఉపయోగపడెను.
కౌమారప్రాయమున ప్రకటితములైన ఈ లీలలుశ్రీకృష్ణుని పౌగండ వయస్సునందు (ఆఱవ ఏట) జరిగినట్లుగా భావించుచు, వారు ఆ కన్నయ్య దివ్యమహిమలను గూర్చి వ్రజవాసులకు విస్మయావహముగా వర్ణించిచెప్పిరి. అదేంటి స్వామి కౌమారంలో జరిగిన లీల పౌగండం లో జరిగినట్టు ఎందుకు చెప్పారు ఈ మధ్యలో ఏమి జరిగిందో దయచేసి తెలియచేయండి అని శౌనకాది మహర్షులు అడగగా బ్రహ్మమోహన లీల చెప్పడం ప్రారంభం చేశాడు సూతుడు వాటిని రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శ్రీ కృష్ణ పరమాత్మ అనుగ్రహం తో...
📝 నేటి ముఖ్య విషయాలు:
1. **పాపినాశకుడైన అఘహరుడు:** 'అఘము' అంటే పాపము. అఘాసుర సంహారం అంటే భగవంతుని శరణుజొచ్చిన సాధకుడి సమస్త పాపాలను శ్రీహరి దహించివేస్తాడనడానికి ప్రతీక.
2. **రాక్షసులకైనా మోక్షం:** కృష్ణుని చేతిలో మరణించిన పూతన, బకాసుర, అఘాసురుల వంటి క్రూరులకు కూడా పరమాత్మ సాయుజ్య ముక్తిని ప్రసాదించాడు.
3. **బాల్య సఖ్య భక్తి:** గోపబాలురు శ్రీకృష్ణుడిని భగవంతుడిగా కాక, తమ ప్రాణసఖుడిగా భావించి సమస్త ఆపదల నుండి రక్షించబడ్డారు.
....సశేషం
🙏🌹🙏
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*