3, మే 2026, ఆదివారం

సుభాషితమ్

 🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    కం. *తనుజులనుం గురు వృద్దుల*

              *జననీజనకులను సాధుజనుల నెవడు దా*

              *ఘనుడయ్యు బ్రోవడో యా*

              *జనుడే జీవన్ మృతుడగు జగతి కుమారా*


                        ( *కుమార శతకం* )

 

   తా𝕝𝕝 *ఓ కుమారా ! తన కుమారులను, గురువులను, పెద్దవారిని, తల్లిదండ్రులను, సజ్జనులైన వారిని తగిన సమయమున రక్షింపడో అతడు బతికి యున్నను చచ్చిన వానితో సమానము*.


✍️🪷💐🌹🙏

పంచాంగం 03.05.2026 Sunday,

 ఈ రోజు పంచాంగం 03.05.2026 Sunday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష ద్వితీయ తిథి భాను వాసర విశాఖ నక్షత్రం వరీయాన్ యోగః తైతుల తదువరి గరజి కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: ద్వితీయ


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము


యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః ।

జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ।। 19 ।।



ప్రతిపదార్థ:


 

యస్య — ఎవరైతే; సర్వే — సమస్త; సమారంభాః — క్రియాకలాపములు; కామ — భౌతిక సుఖముల వాంఛ; సంకల్ప — సంకల్పము; వర్జితాః — రహితములై (త్యజించినవారై); జ్ఞాన — ఆధ్యాత్మిక జ్ఞానమనే; అగ్ని — అగ్నిలో; దగ్ధ — కాలి భస్మమై; కర్మాణం — కర్మలు; తం — వానిని; ఆహుః — అందురు; పండితం — పండితుడని; బుధాః — జ్ఞానులు.



తాత్పర్యము : 


ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేసారో అట్టివారు, జ్ఞానోదయమైన మునులచే, పండితులు అనబడుతారు.



వివరణ:


జీవాత్మ అనేది, ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు-అంశము కాబట్టి, సహజంగానే తనుకూడా ఆనందం కోసం అన్వేషిస్తుంటుంది. కానీ, భౌతిక శక్తితో ఆవరింపబడిన జీవాత్మ, తనను తాను ఈ భౌతిక శరీరమే అనుకుంటుంది. ఈ అజ్ఞానంలో, భౌతిక జగత్తు నుండి ఆనందం పొందటానికి కర్మలు చేస్తుంటుంది. ఈ వ్యవహారములు మనోఇంద్రియ సుఖాల కోసం చేసేవి కాబట్టి జీవాత్మను కర్మ బంధములలో పెనవేస్తాయి.


కానీ, జీవాత్మ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు, తను కోరుకునే ఆనందం ఇంద్రియ వస్తు-విషయముల ద్వారా లభించదని, ప్రేమ పూర్వక భగవత్ సేవ ద్వారా దొరుకుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు తన ప్రతి కార్యమును భగవత్ ప్రీతి కోసమే చేస్తుంది. ‘నీవు ఏం చేసినా, ఏం తిన్నా, యజ్ఞ హోమంలో ఏమి సమర్పించినా, ఏది బహుమతిగా ప్రసాదించినా, ఏ వ్రతాలు చేసినా, ఓ కుంతీ పుత్రుడా, వాటన్నిటిని నాకు అర్పితముగా చేయుము.’ (భగవత్ గీత 9.27). ఈ విధంగా జ్ఞానోదయమైన జీవాత్మ భౌతిక సుఖాల కోసం స్వార్థంతో కూడిన పనులు త్యజించి, అన్ని కర్మలను భగవంతుడికే అంకితం చేస్తుంది, ఈ పనులు ఎలాంటి కర్మ బంధనాలను కలుగచేయవు. ఆ కర్మలు ఆధ్యాత్మిక జ్ఞానాగ్నిలో కాలిభస్మమై పోయాయని చెప్పబడుతాయి.

ఆర్యా శతకం - 1*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 100*


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షీ* 

*జయ జయ జయాద్రిసుతే।*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిత్ గగన కౌముదీధారే॥*


*భావము :*


*ఓ జగన్మాతా! సర్వ మంగళస్వరూపిణీ, పర్వతరాజ పుత్రీ, ఈశ్వరీప్రియా, చిదాకాశములోని వెన్నెల కాంతి స్వరూపమా, నీకు నిరంతరము జయ జయ ధ్యానములు పలుకుతున్నాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

03-05-2026 ఆదివారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

03-05-2026 ఆదివారం రాశి ఫలితాలు


మేషం


కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 

---------------------------------------


వృషభం


వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. సంతాన ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


మిధునం


ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

---------------------------------------


కర్కాటకం


బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. 

---------------------------------------


సింహం


చేపట్టిన పనులు మందగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------


కన్య


చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


తుల


దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

---------------------------------------


వృశ్చికం


కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. 

---------------------------------------


ధనస్సు


స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

---------------------------------------


మకరం


బంధువర్గంతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------


కుంభం


ఆర్థికపరంగా ఒడిదుడుకులు అధికం అవుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్ట సూచనలున్నవి.

---------------------------------------


మీనం


మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

---------------------------------------

ఆదివారం*🌞 *🌹03, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

    *🌹03, మే, 2026🌹*

    *దృగ్గణిత పంచాంగం* 

               

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : విదియ* రా 03.01 వరకు ఉపరి *తదియ*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : విశాఖ* ఉ 07.10 వరకు ఉపరి *అనూరాధ*

*యోగం : వరీయాన్* రా 10.28 వరకు ఉపరి *పరిఘ*

*కరణం  : తైతుల* మ 01.54 *గరజి* రా 03.01 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00 - 09.30 మ 02.00 - 04.30*       

 అమృత కాలం  : *రా 10.21 - 12.08*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.30*

*వర్జ్యం    : ప 11.38 - 01.25*

*దుర్ముహూర్తం :సా 04.45- 05.36* 

*రాహు కాలం  :సా 04.51- 06.27*

గుళికకాళం      : *మ 03.16 - 04.51*

యమగండం    : *మ 12.04 - 01.40*

సూర్యరాశి : *మేషం*                       

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.49*

సూర్యాస్తమయం :*సా 06.37*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :  *ఉ 05.42- 08.15*

సంగవ కాలం      :*08.15 - 10.48*

మధ్యాహ్న కాలం    :*10.48 - 01.21*

అపరాహ్న కాలం   :*మ 01.21- 03.54*

*ఆబ్ధికం తిధి  :వైశాఖ బహుళ విదియ*

సాయంకాలం    :*సా 03.54- 06.27*

ప్రదోష కాలం       :*సా 06.27- 08.42*

రాత్రి కాలం        :*రా 08.42 - 11.42*

నిశీధి కాలం       :*రా 11.42 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.11 - 04.56*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*పూష్ణే నమః వామపాదే మాం రక్షతు*


*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

శ్రీ మహావిష్ణు పురాణం

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శనివారం 2 మే 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

               *75వ భాగము*


*సగర చక్రవర్తి నూరవ అశ్వమేధ యజ్ఞం - ఇంద్రుని చేత అశ్వం అపహరణ - సగర చక్రవర్తి అరవై వేల పుత్రుల మరణం:*```


శాస్త్ర విద్యలు, యుద్ద విద్యలు నేర్చి మహా బలవంతుడు, పరాక్రముడు అయిన సగరుడు తన తల్లి ఎల్లపుడు దుఖంతో ఉండటం గమనించి కారణం అడిగాడు. సగరుని తల్లి దుఖిస్తూ “కుమారా! హైహయులు ఆకస్మాత్తుగా అన్యాయంగా చెప్పకుండా రాజ్యంపై దాడిచేసి ఆక్రమించారు. మీ తండ్రి గర్భవతి అయిన నాతో అడవుల్లోకి వచ్చి ఔర్వ మహర్షి ఆశ్రమంలో శరణు పొందారు. నా సవతి నాకు విషం పెట్టి నిన్ను పుట్టకుండానే చంపాలని చూసింది. మీ తండ్రిగారు రాజ్యం పోయిన దిగులుతో మరణించారు. ఔర్వ మహర్షి దయ వలన నీవు జన్మించి మహావీరుడివి అయ్యావు” అని జరిగినదంతా చెప్పింది.


సగరుడు “అమ్మా! హైహయులను సంహరించి రాజ్యం గెలిచి మరణించిన తండ్రిగారిఆత్మకు శాంతి చేకూరుస్తాను”అని ప్రతిజ్ఞచేసి సేనలను సమకూర్చుకుని హైహయులపై యుద్దానికి వెళ్లాడు. యుద్ధంలో హైహయులను ఓడించి నిర్దాక్షిణ్యంగా ముక్కలుముక్కలు గా ఖండించి సంహరించాడు.


సగరుని బలపరాక్రమాలకు, జరిగిన మారణకాండకు శక యవన కాంభోజాది రాజులు భయపడి పారిపోయి సూర్యవంశ కులగురువైన వసిష్ట మహర్షిని శరణు కోరారు. వసిష్టుడు ఆలోచించి వారిని కులాచారాలు పాటించని వారిగా, బ్రతికినా చచ్చినవారిగా ప్రకటించి సగరుడి దగ్గరకు వెళ్లాడు.


“సగరా!నేను మీవంశ కులగురువుని. నా మాట వినుము. హైహయులను ఓడించి నీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నావు. మిగిలిన రాజులందరు భూమండలానికి నిన్నుచక్రవర్తిగా అంగీకరించి సామంతులైనారు. ప్రాణభయంతో రక్షించమని శక యవన కాంభోజాదులు నన్ను శరణు వేడారు. వీరు బ్రతికుండ గా చచ్చినవారితో సమానంగా ప్రటించాను. అలాగే వైదిక కులా చారాలు పాటించనివారు అవుతారు. వీరిని ప్రాణాలతో వదిలేయుము” అని చెప్పాడు. 


సగరుడు కులగురువు మాటను గౌరవించి ఆ రాజులతో “మీమీ రాజ్యాలకు వెళ్లి నిర్భయంగా జీవించండి. నేను అభయం ఇస్తున్నాను” అని పంపివేశాడు. ఆనాటి నుండి యవనులు,శకులు, పారదులు, ప్లవులు, కాంభోజులు కులాచారాలు వదలి బ్రాహ్మణులకు దూరమై మ్లేచ్ఛులయ్యారు.


సప్త ద్వీప వసుంధరకు సగరుడు చక్రవర్తి అయ్యాడు. తన రాజ్యానికి వెళ్లి అభిషిక్తుడు అయ్యాడు. కశ్యపుని కుమార్తె సుమతి, విదర్భ రాజ పుత్రిక సుకేశిని వివాహం చేసుకుని రాజ్యభోగాలు అనుభవించ సాగాడు. చాలాకాలం సంతానం కలుగక పోవడంతో భార్యలను తీసుకుని ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు.


ఔర్వ మహర్షి వారి చేత యజ్ఞం చేయించి మంత్రించిన యాగ జలం ఇస్తూ “మీలో ఒకరికి వంశాన్ని ఉద్దరించే సంతతి గల పుత్రుడు కలుగుతాడు. మరొకరికి అమితమైన బలం గల అరవై వేల మంది పుత్రులు కలుగుతారు. ఎవరికి ఏమి కావాలో కోరుకుని మంత్రజలం స్వీకరించండి” అని అన్నాడు.


సుకేశిని ఒక్క కుమారుడు పుట్టాలని మంత్రజలం తీసుకుంటే, సుమతి అరవై వేల వీరులైన పుత్రులని కోరుకుంటూ మంత్రజలం తీసుకుంది. ఔర్వ మహర్షి ఆశీర్వచనం, అనుమతి తీసుకుని నగరానికి తిరిగి వచ్చారు. కొంతకాలానికి సుకేశి నికి ఒక పుత్రుడు, సుమతికి అరవై వేల మంది పుత్రులు కలిగారు.


సుకేశినికి కలిగిన పుత్రునికి అసమంజసుడు అని నామకరణం చేశారు. పేరుకు తగ్గట్టే పెద్దవాడైన అసమంజసుడు బలవంతులైన తమ్ముళ్ళను తీసుకుని దుష్ట కార్యాలు చేస్తూ ప్రజలకు, మునులకు, బ్రాహ్మ ణులకు ఇబ్బందులు, కష్టాలు కలిగించసాగారు.యజ్ఞయాగాదులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సగరుడు తెలిసినా పుత్రప్రేమతో కొంతకాలం ఊరకున్నాడు. 


అసమంజసునికి పెళ్లి అయ్యి అంశుమంతుడు అనే కుమారుడు పుట్టాడు. మనవడు పుట్టాక, సగరచక్రవర్తి మారని అసమంజసుని నాయకత్వం తీసేసి బహిష్కరిస్తే మిగిలిన పుత్రులందరు మంచి మార్గానికి వస్తారు అని తలచి అసమంజసుని రాజ్యం నుంచి బహిష్కరించాడు. అరవై వేల మంది కుమారులు భయపడి జాగ్రత్తగా ఉండసాగారు.


ఆగిపోయిన యజ్ఞయాగాదులు చేసి దేవతలను, మునులను, బ్రాహ్మణులను సగరుడు సంతృప్తి చేయదలచాడు. అరవైవేలమంది కుమారులు, మనవడు అంశుమం తుడు సహాయంగా ఉండగా సగర చక్రవర్తి వరుసగా తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు చేసాడు. నూరవ ఆశ్వమేధ యాగం చేయ సంకల్పించి సగరుడు యాగదీక్షలో కూర్చున్నాడు.


నూరు యాగాలు చేస్తే సగర చక్రవర్తికి ఇంద్రపదవి పొందడానికి అర్హత లభిస్తుంది. సగరకుమారుల బలపరాక్రమాల వలన యాగం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇంద్రుడు తెలుసుకుని సగరుడి నూరవ అశ్వమేధ యాగం భగ్నం చేయదలచాడు. భూపరిక్రమణకు వెళ్లిన యాగాశ్వాన్ని అపహరించి దొరకకుండా పాతాళంలో గల కపిల ముని ఆశ్రమంలో చెట్టుకి కట్టేసి వెళ్లి పోయాడు. కపిలముని ధ్యానంలో ఉండి చూడలేదు.


యాగాశ్వం కనపడటం లేదన్న సంగతి తెలిసిన సగరుడు, యాగ దీక్షలో ఉన్న తాను వెళ్లకూడదని, అరవైవేల మంది పుత్రులను అశ్వాన్ని వెదికి తీసుకు రమ్మని పంపాడు. భూమండలమంతా వెతికినా సగర పుత్రులకి యాగాశ్వం పాతాళంలో ఉన్నదని తెలిసింది. భూమిని తవ్వుకుంటూ మార్గం చేసుకుని సగరపుత్రులు పాతాళానికి వెళ్లారు.


పాతాళ లోకంలో వెతుకుతున్న సగరపుత్రులకు యాగాశ్వం కపిల మహర్షి ఆశ్రమంలో చెట్టుకి కట్టివేయబడి కనిపించింది. సమీపంలోనే కపిల మహర్షి తపోముద్రలో ధ్యానం చేస్తూ కనపడ్డాడు. అరవై వేల మంది సగర పుత్రులు కపిల మహర్షే యాగాశ్వాన్ని దొంగిలించి ఆశ్రమంలో కట్టేసి దొంగ తపస్సు చేస్తున్నాడని భావించారు.


ఇతనిని చంపి యాగాశ్వం తీసుకెళదాం అని ఆయుధాలతో కపిల మహర్షి పై దాడి చేయబోయారు. కన్నుల తెరిచిన కపిల మహర్షి దివ్యదృష్టితో జరిగింది గ్రహించి, ఆగ్రహించి సగర పుత్రుల వంక తీక్షణంగా చూసాడు. మహర్షి కన్నుల నుండి అగ్ని కణాలు వెలువడి అరవై వేల సగర పుత్రులను క్షణంలో కాల్చి బూడిద చేసాయి.


కుమారుల మరణ వార్త నారదుని ద్వారా తెలుసుకున్న సగరుడు బాధపడ్డాడు. యాగదీక్షలో ఉన్నందున మనవడు అంశుమంతుని పిలిచి కపిల మహర్షికి కుమారులు చేసిన దుష్కార్యానికి క్షమాపణలు చెప్పి యాగాశ్వం తీసుకురమ్మని పంపాడు. అంశుమంతుడు పాతాళానికి వెళ్లి కపిల మహర్షిని దర్శించి, వినయంతో నమస్కరించి స్తుతించాడు.


కపిల మహర్షి అంశుమంతుని భక్తి శ్రద్థలకు, వినయ విధేయతలకు ప్రసన్నుడై "అంశుమంతా! యాగాశ్వం తీసుకువెళ్లి మీ తాతగారి యాగం పూర్తి చేయించు" అని యాగాశ్వాన్ని చూపించాడు. 


అంశుమంతుడు ప్రణమిల్లి "మహర్షీ! మా తండ్రులు చేసిన దుష్కర్మలు క్షమించి, మరణించిన వారికి సద్గతులు పొందే మార్గం చెప్పండి. లేదంటే వారి ప్రేతాత్మలు ఇక్కడే ఉండిపోతాయి" అని పలికాడు.


కపిల మహర్షి కరుణించి "వత్సా! శ్రీహరి పాదాల నుండి ఉద్భవించిన ఆకాశగంగ దివి నుండి ఇక్కడకు వచ్చి ఈ చితాభస్మాలపై ప్రవహిస్తే మీ తండ్రులకు స్వర్గవాస ప్రాప్తి కలుగుతుంది. మీరు, మీ వంశజులు భూమి మీదకు ఆకాశ గంగను తెచ్చే ప్రయత్నం చేయండి" అని దీవించాడు.


అంశుమంతుడు "మహర్షీ! ఆకాశగంగను తీసుకు రావడానికి నేను తప్పక ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆ పవిత్ర గంగాదేవి గురించి తెలుసుకోవాలని ఉంది" అని అడిగాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది*                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వైశాఖ పురాణం🚩*_ *15వ అధ్యాయము*

 *🐚శనివారం 2 మే 2026🐚*


_*🚩వైశాఖ పురాణం🚩*_ 

     *15వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉️🕉️

        

*వైశాఖవ్రత మహిమ*```


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు ‘శ్రుతదేవమునీ! వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణుప్రీతికరములు, ధర్మాధి ధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టియుత్తమ ధర్మములు శాశ్వతములు వేదనిరూపితములు కదా! ఇట్టి యుత్తమధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస, తామస ధర్మములు కష్టసాధ్యములు అధికధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతీపాతాది ధర్మములను మరికొందరు ప్రసంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నా’నని యడిగెను.


శ్రుతదేవుడును ‘మహారాజా! వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో యితర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము.. లోకములోని జనులు చాలమంది ఐహికభోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజస తామస గుణప్రధానులు. ఇంతమందిలో నెవడోయొకడు యేదో యొక విధముగ స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాన్నిధ్యములైనను స్వర్గవ్యామోహముతో వానినే అతికష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒక్కడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధికకర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజసతామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్త్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్త్వికకర్మలు నిష్కామకర్మలు. కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు యీ విషయము నెరుగురు. ఆధిపత్యము,ఉన్నతపదవి సిద్దించినచో వాని మనోరధమ్ములన్నియు తీరినవనియనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి 

పురుషార్థసాధన ఆగిపోవును.


వైశాఖ ధర్మములు సాత్త్వికములు. అవి నిగూఢములుగ యెవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు. ఇక్ష్వాకు వంశరాజులలో నుత్తముడు. కీర్తిశాలి. అతడు యింద్రియములను జయించినవాడు. కోపము నెరుగనివాడు. బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి యాశ్రమ ప్రాంతమును చేరెను.


అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్టమహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను, యేర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకఱ్ఱలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను యిచ్చుచుండిరి. మధ్యహ్నకాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును యిచ్చుచుండిరి. చెట్లనీడలయందు, యింటి ముంగిళ్లయందు మండపములయందు యిసుకను పరచి కూర్చుండుటకు వీలుగచేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి యిదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్టులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. 


మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. 


మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్టుని యాశ్రమమునకు వెళ్లెను.


అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును జూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిధి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని యిచ్చిన ఆతిధ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షీ! మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధిసత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా! దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిధి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిధి సత్కారములు విస్మియమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు. శ్రేష్ఠుడవు. సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయయుంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను.


వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా! నీ బుద్ధికిగల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకధా ప్రసంగమునందు విష్ణుప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును. వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటె వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు. వైశాఖమాసమున బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చెసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు, పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించిననువారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని యెరుగుము. వైసాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాధుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా! వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనములచేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్పపూజకైనను స్వల్పకర్మకైనను సంతసించును. భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధిక కర్మకు అధికఫలము, స్వల్పకర్మకు స్వల్పఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్పకర్మకైనను అధికఫలమునిచ్చును. భక్తిలేని కర్మయే అధికమైనను ఫలితముండదు. కర్మమార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా! వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా! నీవును వైశాఖమాస ధర్మములను యెక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్ణముగ నాచరింపుము. నీ దేశప్రజలచేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠమహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాసవ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.


ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు 

శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు యెనుబది సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాసవ్రత ధర్మము నాచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును. లేదా దేశమునుండి బహికరింతునని చాటించెను. వైశాఖవ్రతము నాచరింపని వారు తండ్రియైనను, పుత్రుడైనను, భార్యయైనను, ఆత్మబంధువైనను తీవ్రదండన కర్హులేయనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతఃకాలస్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యధాశక్తిగ దానము చేయవలయును. చలివేంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని సిక్షించుటకై అయిదు గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున పది మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును యిహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాలస్నానము చేసినను పాపవిముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి.


ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు(నరకమునకు) పోవువారెవరును లేకపోయిరి. ప్రతిప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖస్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను.```


*వైశాఖపురాణం పదిహేనవ అధ్యాయం సంపూర్ణం*


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

*శ్రీ మహావిష్ణు పురాణం*

 2.5.f4;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀7️⃣4️⃣



     *శ్రీ మహావిష్ణు పురాణం*

             ➖➖➖✍️

     (డెభ్బై నాలుగవ భాగం)


*మాధాంత వంశము - సగర చక్రవర్తి జననం```

మాంధాత కుమారుడు అంబరీషుడు. అంబరీషుడి కుమారుడు యువనాశ్వుడు. యువనాశ్వుడి కుమారుడు హరిషుడు. వీరి సంతతి అంతా అంగిరసులు అనే ఆరు కోట్ల గంధర్వులుగా వృద్ధి చెందారు. వీరు పాతాళానికి వెళ్లి నాగజాతితో యుద్ధం చేసి చెదరకొట్టి వారి వద్ద నున్న రత్నాలు మణులు అపహరించారు.


నాగులు శ్రీమన్నారాయణుడి వద్దకు వెళ్లి అంగిరసులు అనే గంధర్వులు తమ లోకం పై దాడి చేసి తమ రత్నాలు మణులు అపహరించడం గురించి విన్నవించి రక్షించమని ప్రార్ధించారు. విష్ణువు వారికి అభయమిస్తూ "నాగులారా! భూమి పైన పురుకుత్సుడు అనే రాజు రాజ్యం చేస్తున్నాడు. అతనికి నా శక్తి రక్షణగా ఉంది. మీరు వెళ్ళి ఆ రాజుని ప్రార్ధించండి గంధర్వులను సంహరించి మీకు రక్షణ ఇస్తాడు" అని ఉపాయం చెప్పాడు.


నాగులు తమలోకం తిరిగి వెళ్లి పురుకుత్సుడు దగ్గరకు ఎవరిని పంపుదాము అని చర్చిస్తుండగా అక్కడ తపస్సు చేస్తున్న ముని వచ్చి "పురుకుత్సుడికి నర్మద (నది) అంటే చాలా ఇష్టం. నర్మదకు కూడా పురుకుత్సుడి పై ప్రేమ ఉంది. నర్మద చెబితే పురుకుత్సుడు కాదనడు. మీ పక్షాన యుద్దం చేసి శత్రువులను సంహరిస్తాడు. మీరు ఆమెను ప్రార్ధించండి" అని సూచించాడు.


నాగులు నర్మదానది వద్దకు వెళ్లి ప్రార్ధించగా ఆమె దివ్యకాంతగా దర్శనమిచ్చింది. నాగులు శ్రీమహావిష్ణువు పురుకుత్స మహారాజు గురించి చెప్పినది చెప్పి ఆ రాజుని తమకు సహాయం చేసేటట్టు చేయమని ప్రార్ధించారు. 


నర్మద అంగీకరించి పురుకుత్సునికి విషయం చెప్పి నాగుల వద్దకు తీసుకువచ్చింది. 


నాగులు స్వాగతించి సత్కరించి "మహారాజా! మహావిష్ణువు వాక్కుని నిజం చేయండి. మాకు సహాయంగా యుద్ధం చేసి శత్రువులైన గంధర్వులను సంహరించండి" అని ప్రార్ధించారు.


నర్మద కూడా నాగులకు సహాయం చేయమని చెప్పింది.   


నర్మద చెప్పడంతో వెంటనే పురుకుత్సుడు గంధర్వులతో యుద్ధం చేసి వారిని సంహరించి నాగులకు భయం తొలగించాడు. 


తమకు ఉపకారం చేసిన నర్మదకు నాగులు "ఎవరైతే "ఓం నర్మదా నమః" అని ఉభయ సంధ్యలలో భక్తితో స్మరిస్తారో వారికి సర్పవిషం సోకదు. నర్మద నామం పలికి భోజనం చేసేవారికి విషము పెట్టినా అమృతం అవుతుంది" అని వరం ఇచ్చారు. 


నర్మద వరం తీసుకుని ఆనందంగా తన మాట నిలబెట్టిన పురుకుత్సుని వరించి వివాహం చేసుకుంది.


పురుకుత్సునికి నర్మదకు త్రసదస్యుడు అనే కుమారుడు కలిగాడు. అతని కుమారుడు అనరణ్యుడు యజ్ఞం చేస్తుండగా రావణుడు వచ్చి యజ్ఞం భగ్నం చేసి అనరణ్యుని చంపి వెళ్లి పోయాడు. 


అనరణ్యుని కుమారుడు హర్యాక్షుడు. హర్యాక్షుని కుమారుడు ప్రియారణుడు. ప్రియారణుని కుమారుడు సత్యవత్రుడు.


సత్యవ్రతుడు వసిష్టుని శాపం పొంది త్రిశంకుడు అనే నామంతో ఛండాలుడై అడవుల్లో ఉండసాగారు. విశ్వామిత్రుడు కుటుంబాన్ని ఆశ్రమంలో వదలి తపస్సుకి వెళ్లినప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. తినడానికి తిండి, త్రాగడానికి నీరు లేక జనులు చనిపోసాగారు. త్రిశంకుడు అడవిలో మృగాలను చంపి మాంసం తెచ్చి ఇచ్చి విశ్వామిత్రుడి భార్య పిల్లలు మరణించకుండా కాపాడాడు.


విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని, తన కుటుంబాన్ని కాపాడిన త్రిశంకుడు కోరినట్లు యాగం చేసి సశరీరంగా స్వర్గానికి పంపాడు. 


ఇంద్రుడు క్రిందకు తోసివేస్తే త్రిశంకుడు స్వర్గం మధ్యలో సృష్టించి ఉంచటంతో ఇంద్రుడు భయపడి స్వర్గంలోకంలో ఉండటానికి అనుమతించారు.


త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి వచ్చిన కలలో ఇచ్చిన మాటకు కట్టుబడి విశ్వామిత్రునికి సకల సంపదలు, రాజ్యం ఇచ్చేసి భార్య కుమారుడితో కాశికి వెళ్లి పోయాడు. అక్కడ భార్యాబిడ్డలను అమ్మి కాటికాపరిగా పని చేసి విశ్వామిత్రుడి ఋణం తీర్చాడు. సత్య పరీక్షకు నిలబడి గెలిచి సత్య హరిశ్చంద్రుడు అయ్యాడు. స్వర్గలోకంలో ఇంద్రునితో సమానంగా సింహాసనం అధిష్టించాడు.


హరిశ్చంద్రుని కుమారుడు లోహితాస్యుడు. అతని కుమారుడు హరిషుడు. హరిషుని కుమారుడు చంచుడు. చంచునికి విజయుడు, వసుదేవుడు అనే ఇద్దరు కుమారులు. విజయుని కుమారుడు రురుడు. రురుని కుమారుడు వృకుడు. వృకుని కుమారుడు బాహుడు.


బాహుడు రాజ్యం చేస్తున్న సమయంలో హైహయులు ఆకస్మత్తుగా దాడి చేసి రాజ్యం ఆక్రమించారు. బాహుడు భార్యలతో కలిసి అడవులలో గల ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళ్లి శరణు కోరి ఆశ్రయం పొందారు. అప్పుడు పట్టపురాణి గర్భవతిగా ఉంది. సవతి అసూయ చెంది పట్టపురాణికి భోజనంలో విషం కలిపి పెట్టింది. ఆ విషము గర్భాన్ని స్తంభింప చేసింది.


అలా ఏడు సంవత్సరాలు గడచిపోయాయి. రాజ్యం కోల్పోయిన విచారంతో బాహుడు మరణించాడు. గర్భవతియై గర్భం రాని పట్టమహిషి భర్తతో కలిసి సహగమనం చేయాలని చితి మీద కూర్చుంది. ఔర్వ మహర్షి తెలిసి అక్కడకు వచ్చి పట్టపు రాణిని వారిస్తూ "తల్లీ! నీ గర్భం నుంచి బలపరాక్రములు కలిగిన మహావీరుడు జన్మిస్తాడు. శత్రువులను ఓడించి చక్రవర్తిగా రాజ్యం చేస్తాడు. సహగమనం విరమించు" అని పలికాడు.


పట్టపురాణి మహర్షి మాటలు గౌరవించి సహగమనం మాని భర్తకు అంత్యక్రియలు చేసింది. ఔర్వ మహర్షి చెప్పినట్లు కొంతకాలం తరువాత గరముతో (విషముతో) కుమారుడు కలిగాడు. విషము భరించి పుట్టాడు కనుక ఔర్వ మహర్షి ఆ బిడ్డకు "సగరుడు" అని పేరు పెట్టాడు. జాతకర్మాదులు చేసి, ఉపనయనం చేసి విద్యాభ్యాసం ప్రారంభించాడు. అస్త్రాశస్త్రాలు, ధనుర్విద్యలు నేర్పించాడు.✍️సశేషం 

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం..

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

-సేకరణ:పెండ్యాల ఉపేంద్ర రావు```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

తిరుపతి వెంకన్న దర్శనం

 114f5;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀




*తిరుపతి వెంకన్న దర్శనం 24×365 చాలా రద్దీగా ఉంటుంది. మిగతా దేవాలయాల్లో అలా ఉండదు, ఎందుకు?*

            ➖➖➖✍️


```

తిరుపతి వెంకన్న దర్శనం 24×365 రద్దీగా ఉండడానికి కారణం ఒక్క మాటలో చెప్పాలంటే - “నమ్మకం + ప్రకృతి + సౌకర్యం = తిరుమల మహాత్మ్యం.”


ఒక ఉదాహరణ తీసుకుంటే, రాహు-కేతు పూజ అన్ని గుళ్లల్లో చేసినా కాళహస్తి అంటేనే ఒక ఫీలింగ్.దుర్గమ్మ అనగానే విజయవాడ దుర్గగుడి గుర్తొస్తుంది. అలాగే ‘కలియుగ దైవం’ అనగానే తిరుమల వెంకన్నే. ఎందుకు..?```


*1. స్థల మహిమ - భూమి ఎంపిక:*```

శంకరాచార్యులు, రామానుజులు లాంటి మహానుభావులు ఏ కొండ పడితే ఆకొండ ఎక్కి గుడి కట్టలేదు. తిరుమల సప్తగిరులు సాక్షాత్తు ఆదిశేషుడి అవతారం అని పురాణం. వాయు పురాణంలో ‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన’ - ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన స్థలం లేదు అని ఉంది. 

అంటే ఆ కొండ మీద అడుగు పెడితేనే వైబ్రేషన్ మారిపోతుంది. సైన్స్‌లో చెప్పాలంటే ‘జియోమాగ్నెటిక్ ఫీల్డ్’ ఎక్కువ ఉన్న ప్రదేశాలు. అక్కడ ధ్యానం చేస్తే మనసు తొందరగా శాంతిస్తుంది.


*. సంకల్ప బలం - కోట్లాది మంది నమ్మకం:

ఒక దీపం వెలుగుతుంది, కోటి దీపాలు కలిస్తే సూర్యుడే అవుతుంది. తిరుమలకి 2000 ఏళ్లుగా కోట్లాది మంది ‘గోవిందా,గోవిందా’ అని మొక్కుతున్నారు. ఆ సంకల్పం, ఆ కన్నీళ్లు, ఆ మొక్కులు అన్నీ ఆ గాల్లోనే ఉన్నాయి. అందుకే కొత్తగా వెళ్లిన వాడికి కూడా గుండె బరువు దిగిపోయినట్టు ఉంటుంది. దీన్నే మన పెద్దలు ‘క్షేత్ర మహాత్మ్యం’ అన్నారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, అక్కడి ఎనర్జీ నిన్ను పట్టుకుంటుంది.


*. సర్వం సిద్ధం - ప్రకృతి + సౌకర్యం: 

అక్కడ అనేకమైన ప్రత్యేకతలు ఉంటాయి అందులో జపాలి ఆంజనేయుడు, పాపవినాశనం, ఆకాశగంగ, శిలాతోరణం - ఒక గుడి కాదు, ఒక లోకం. పైన కొండలు, కింద మేఘాలు, చుట్టూ అడవి. నగరం గోల వినపడదు. పైగా TTD వాళ్లు అన్నదానం, బస్సు, క్యూ లైన్, లడ్డూ - భక్తుడు తిన్నాడా, పడుకున్నాడా అని చూసుకుంటారు. 


‘కలియుగంలో ప్రత్యక్ష దైవం’ అంటే భయం వేయకూడదు కదా, భరోసా ఇవ్వాలి. తిరుమల అదే చేస్తుంది!```


*2. జియోగ్రఫీ - అందరికీ అందుబాటు:*```


AP, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర - అన్ని రాష్ట్రాలకు 1 రాత్రి జర్నీ. "వీకెండ్‌లో వెళ్లొద్దాం పద" అనేంత దగ్గర. అది కూడా ఒక కారణం.


మరి మిగతా గుళ్లల్లో ఎందుకు లేదు?


ప్రతి గుడికీ శక్తి ఉంటుంది. కానీ కొన్ని గుళ్లు "పవర్ హౌస్" లాంటివి. కరెంట్ అన్ని ఇళ్లల్లో ఉన్నా, పవర్ స్టేషన్ దగ్గరే లోడ్ ఎక్కువ. తిరుమల అలాంటి పవర్ స్టేషన్. 

కలియుగంలో మనిషి అరిషడ్వర్గాలతో, టెన్షన్లతో సతమతం అవుతున్నాడు. "ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడేవారు?" అని ఏడ్చినప్పుడు "నేనున్నాను" అని ఆ కొండ మీద నుంచి ఒక భరోసా వినిపిస్తుంది. ఆ భరోసా పేరే వెంకటేశ్వరుడు.


అందుకే 24×365 క్యూ ఉంటుంది. అది రద్దీ కాదు, కోట్ల గుండెల నమ్మకం లైన్‌గా నిలబడింది. నువ్వు వెళ్లేది రాయితో చేసిన విగ్రహం దగ్గరికి కాదు, నీ కోసం ఎదురుచూస్తున్న తండ్రి దగ్గరికి. అందుకే ఎంత రద్దీ ఉన్నా కాలు లాగుతూ అయినా వెళ్తాం.


‘వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’ - వెంకన్న లాంటి దేవుడు లేడు, రాడు. అందుకే ఆ క్యూ ఎప్పటికీ తగ్గదు. గోవిందా!


ఇవి నాతో చూసినట్టు అంశాలు మిగిలినవి మీకు తోస్తే వాటిని కూడా చెప్పొచ్చు …ఎవరి నమ్మకం వారిది✍️``` - TMS Rao.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖