14, మే 2026, గురువారం

వైశాఖ పురాణం



 


   *🚩వైశాఖ పురాణం🚩*        

      *27వ అధ్యాయము*


*కలిధర్మములు - పితృముక్తి*```


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు.. 

శ్రుతదేవుని మాటలను విన్న శ్రుతకీర్తి 'మహామునీ! యీ వైశాఖమాసమున ఉత్తమములగు తిధులేవి? దానములలో నుత్తమ దానములేవి? వీనిని ఎవరు లోకమున వ్యాపింపజేసిరి? దయయుంచి నాకు వివరముగ జెప్పగోరుదు’నని యడిగెను.


అప్పుడు శ్రుతదేవుడు ‘శ్రుతకీర్తిమహారాజా! సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున వచ్చు ముప్పది తిధులును ఉత్తమములే. కాని యేకాదశినాడు చేసిన పుణ్యకార్యము కోట్లకొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుటవలన ఫలితము, అన్ని తీర్థములయందును స్నానమాడుటవలన వచ్చు పుణ్యము వీనినన్నిటిని వైశాఖ ఏకాదశినాడు స్నానము చేయుటవలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్ర్కియలు, హరికథాశ్రవణము యివన్నియును సద్యోముక్తిదాయకములు సుమా. రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాదికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమునందును.


పవిత్రమగు వైశాఖమందలి దినములను జలాశయములు దగ్గరగానుండి శరీరము బాగున్నను స్నానాదికము చేయక గడపినవారు, గోహత్య, కృతఘ్నత, తల్లిదండ్రులకు ద్రోహము చేయుట, తనకు తానే అపకారము చేసికొనుట, మున్నగు వానిని చేసినంత పాపమునందును. శరీరారోగ్యము సరిగలేనిచో శ్రీహరిని మనసున తలపవలెను. వైశాఖమాస కాలము సద్గుణాకరము, సర్వపుణ్యఫలప్రదము. సజ్జనులును దయావంతులు, ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింపవారెవరుందురు? ఎవరునుండరని భావము.


దరిద్రులు, ధనవంతులు కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విధురులు(భార్యలేనివారు)స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్ఠివారు వీరందరును యధాశక్తిగ నాచరించి తరింపదగిన పుణ్యకాలము వైశాఖ మాసకాలము. సర్వధర్మకార్యఫలప్రాప్తికిని మూలమైన వైశాఖమాసమున ధర్మకార్యములను స్నానదానాదులను చేయగోరువారు, చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖమాస ధర్మముల నాచరింపనివారు సులభముగ నరకలోకములను పాపాత్ములై చేరుదురు సందేహములేదు. పాలను తరచి సారభూతముగ వెన్నను తీసినట్లుగ సర్వపాపములను హరించి సర్వపుణ్యములనిచ్చు తిధిని చెప్పుదును వినుము. మేషరాశియందు సూర్యుడుండగా పాపముల నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిధిని చెప్పుదును. ఆ తిధినాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో కోటిమార్లు పిండప్రదానము చేసిన పుణ్యఫలము కల్గును. ఈ విషయమున సావర్ణిమనువు భూమిని పరిపాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథయొకటి పెద్దలు చెప్పినది కలదు వినుము.


ముప్పది కలియుగములు గడచిన తరువాత సర్వధర్మవిహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. ముప్పదియొకటవ కలియుగమున ప్రధమపాదమున ప్రజలందరును వర్ణధర్మములను విడిచి పాపకార్యముల యందాసక్తులైయుండిరి. ఇట్టి పాపపంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కరక్షేత్రమున మౌనవ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చుని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడచటికి చేరెను.


అచటనున్న మునులు కర్మలయందాసక్తి కలవారై యుగమును మెచ్చుచు నిట్లనిరి. కృతయుగమున సంవత్సరకాలమున నియమనిష్ఠలతో భక్తిశ్రద్దలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున నొకమాసము చేసిన వచ్చును. ద్వాపర యుగమున ఒక పక్షము చేసిననంతటి పుణ్యము వచ్చును. కాని దానికి పదిరెట్ల పుణ్యము కలియుగమున శ్రీమహావిష్ణువును స్మరించినవచ్చును. కావున కలియుగమున చేసిన పుణ్యము కోటిగుణితము దయాపుణ్యములు, దానధర్మములులేని యీ కలియుగమున శ్రీహరిని ఒక్కమారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వానివలె పుణ్యలోకములకు పోవుదురు అనియను కొనుచుండిరి.


ఆ సమయమున నారదుడచటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శిస్నమును మరోక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచు నాట్యము చేయసాగెను. అచటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని యడుగగా నారదుడిట్లనెను. మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి యానందమును పట్టలేక నాట్యమాడుచు నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్పప్రయాసతో అధికపుణ్యమునిచ్చు గొప్ప యుగము కలియుగము. ఈ కలియుగమున స్మరణము చేతనే సంతోషించి కేశవుడు క్లేశముల నశింపజేయు వనిన సంతోషము నాపుకొనలేకపోతిని. మీకొక విషయమును చెప్పుచున్నాను. వినుడు శిశ్నమును నిగ్రహించుట కష్టము అనగా సంభోగాభిలాషనుని గ్రహించుకొనుట కష్టము. నాలుకను రుచిజూచుటను నిగ్రహించుట కష్టము అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున భోగాభిలాష తిండిధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శిస్నమును, నాలుకను పట్టుకొంటి అని నారదుడు వివరించెను మరియు నిట్లనెను. శిశ్నమును, జిహ్వను నిగ్రహించుకొన్నచో పరమాత్మయగు శ్రీహరి దయ యీ యుగమున సులభసాధ్యము. కలియుగమున భారతదేశము వేదధర్మములను విడిచి ఆచారవ్యవహార శూన్యమయినది. కావున మీరీదేశమును విడిచి యెచటకైన వెళ్లుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరును తమకిష్టమైన ప్రదేశములకు వెళ్లిరి.


ధర్మవర్ణుడును భూమిని విడిచి యరియొకచోట నుండెను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలెననియనిపించెను. తేజశ్శాలియు వ్రత మహితుడును అగు నతడు దండకమండలములను, జటావల్కలములను ధరించి కలియుగ విచిత్రములను చూడదలచి భూలోకమునకు వచ్చెను.


భూలోకమున జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపముల నాచరించుచు దుష్టులై యుండిరి. బ్రాహ్మణులు వేదధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరును శూద్రులవలెనైరి. ధేనువులు మేకలైనవి. వేదములు కథాప్రాయములైనవి. శుభక్రియలు సామాన్యక్రియలైనవి. భూతప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరును సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను గూడ విడుచువారై యుండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు మోసగించు స్వభావము కలవారగునుగను ఉండిరి. మనసునందొకటి మాటయందు మరొకటి పనియందు యింకొకటి అగురీతిలో నుండిరి. విద్యాభ్యాసము పారమార్థికముకాక హేతు ప్రధానముగ భావింపబడెను. అట్టి విద్య రాజపూజితమై యుండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు, గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములనెవరును గౌరవించుటలేదు. ఆచారవంతులగు బ్రాహ్మణులు దరిద్రులై యుండిరి. విష్ణుభక్తిజనులలో కంపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేదధర్మవిహీనములై యుండెను. శూద్రులు, ధర్మప్రవక్తలు, జటాధారులు, సన్యాసులనైరి. మానవులు అల్పాయుష్కులై యుండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగానుండిరి. అందరును ధర్మమును చెప్పువారే. అందరు దానమును స్వీకరించువారే. సూర్య గ్రహణాది సమయములనుత్సవముగ దలచువారే. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును అందరును తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్దిలోనున్నవారిని జూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రికుమార్తెను తక్కువజాతివారిని కోరుచుండిరి పొందుచుండిరి. అందరును వేశ్యాసక్తులై యుండిరి. సజ్జనులు నవమానించుచుండిరి. పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగ ప్రచారము చేయుచుండిరి. పాపాత్ముల దోషములను, గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణముగ జనులు స్వీకరించిరి.


జలగస్తనముపై వ్రాలి పాలను త్రాగదు. రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఓషధులు సారహీనములయ్యెను. ఋతువులు వరుసలు తప్పెను అనగా ధర్మములని విడిచినవి. అంతట కరవువుండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయసున ప్రసవించుటలేదు. నటులు, నర్తకులు వీరియందు ప్రజలు ప్రేమనంది యుండిరి. వేదవేదాంత శాస్త్రాదులయందు పండితులను సేవకులనుగా, ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులగు బ్రాహ్మణులు, ధర్మహీనులను సేవించి యాశీర్వదించుచుండిరి. అవమానించిన ధనమదాంధులను, నీచులును ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా! వేదములయందు చెప్పిన క్రియలను, శ్రాద్దములను శ్రీహరినామములను అందరు విడిచిరి. శృంగారమున నాసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణుసేవ, శాస్త్రచర్చ, యాగ దీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర దానధర్మములు కలియుగమున నెచటను లేవు. ఇది మిక్కిలి చిత్రముగనుండెను.


ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూచి మిక్కిలి భయపడెను. పాపమును చేయుట వలన వంశనాశమును గమనించి మరియొక ద్వీపమునకు పోయెను. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును జూడబోయెను. అచటనున్న వారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రిందపడి యేడ్చుచుండిరి. చీకటి గల నూలిలో పడి గడ్డిపరకను పట్టుకొని నూతిలో పడకుండ వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటియుండెను. ఇంతకన్న భయంకర విషయమును చూచెను. ఒక యెలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుచున్న గడ్డిపరకను మూడువంతులు కొరికి వేసెను. గడ్డిపరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూచి పైన యెలుకగడ్డిని కొరికివేయుటను చూచి దీనులై దుఃఖించుచుండిరి.


ధర్మవర్ణుడును దీనులై ,యున్నవారిని జూచి జాలిపడి మీరీనూతియందు యెట్లు పడిరి. యెట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను? మీరే వంశము వారు? మీకు విముక్తి కలుగు మార్గమేమయిన నున్నదా నాకు చెప్పుడు. చేతనగు సాయమును చేయుదును అని అడిగెను అప్పుడు వారు ఓయీ! మేము శ్రీవత్సగోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానము లేదు. అందువలన పిండములు, శ్రాద్దములును లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశము సంతానము లేక యున్నది. మాకు పిండము నిచ్చువారులేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు యీ చీకటికూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి యొకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసికొనక ఒంటరిగ దిరుగుచున్నాడు. ఈ మిగిలిన గడ్డిపరకను చూచితివా? మా వంశమున నతడొక్కడే మిగులుట వలన నిచటను యిది యొకటే మిగిలినది. మేమును దీనిని బట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశమువాడైన ధర్మవర్ణుడొక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకముననున్న మాకును యీ గడ్డిపరక యొక్కటే మిగిలినది. అతడు వివాహము చేసికొనక పోవుటచే సంతానము లేకపోవుటవలన యీ గడ్డికి అంకురములులేవు. ఈ యెలుక యీ గడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత నీ యెలుక మిగిలిన యీ గడ్డిముక్కను తినివేయును. అప్పుడు మేము అగాధము భయంకరమునగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది.


కావున నాయనా! భూలోకమునకు పోయి మా ధర్మవర్ణునివద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకెదురు చూచుచున్నామని చెప్పి వివాహమాడుట కంగీకరింప జేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడియున్నారు. బలవంతమైన యెలుక మిగిలిన ఒక గడ్డిపరకను కొరుకుచున్నది. ఆ యెలుకయే కాలము. ఇప్పటికి యీ గడ్డిలో మూడువంతులు పోయినవి. ఒకవంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది. నీవుపేక్షించినచో మావలెనో నీవును మరణించిన తరువాత నిట్లే మాతో బాటు యిందుపడగలవు. కావున గృహస్థ జీవితము నవలంబించి సంతతిని పొంది వంశవృద్దిని చేసి మమ్ము నూతిలోపడకుండ రక్షింపుమని చెప్పుము. పుత్రులెక్కువమందిని పొందవలెను. వారిలో నొకడైనను గయకు పోయి పిండప్రదానము చేయును. అశవమేధయాగమును చేయవచ్చును. ఆయా మాసవ్రత విధానమున మాకు దానము, శ్రాద్దము మున్నగువి చేయవచ్చును. ఇందువలన మాకు నరకవిముక్తియు పుణ్యలోక ప్రాప్తియు కలుగునవకాశమున్నది. మా వంశమువారిలో నెవడైన పాపనాశినియగు విష్ణుకథను విన్నను చెప్పినను మాకు ఉత్తమగతులు కలుగవచ్చును.


తండ్రి పాపియైనను పుత్రుడుత్తముడు భక్తుడునైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మవిహీనులగు పుత్రులెక్కువమండి యున్న ప్రయోజనమేమి? శ్రీహరిని అర్చింపని పుత్రులెంతమంది యున్ననేమి? పుత్రహీనుడగువానికి ఉత్తమ గతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రునిల పొందవలెను. మాయీ బాధను యీ మాటలను వానికి వరముగ జెప్పుము. గృహస్థ జీవితము స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుమనుము అని వారు పలికిరి.


ధర్మవర్ణుడును పితృదేవతల మాటలను విని ఆశ్చర్యమును దుఃఖమును పొందిన వాడై యిట్లు పలికెను. మీ వంశమున చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహము చేసి కొనరాదను పనికి మాలిన పట్టుదల కలిగి మిమ్మిట్లు బాధపడునట్లు చేసినవాడను నేనే. పూర్వము సత్రయాగము జరిగినప్పుడు నారదమహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము, నాలుక అదుపులోనుండవు. విష్ణుభక్తీయుండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో నుండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాపభూయిష్ఠులగు జనుల సాంగత్యము యిష్టము లేక ద్వీపాంతరమున వసించుచుంటిని. ఇప్పటికి కలియుగము మూడు పాదములు గడచినవి. నాలుగవ పాదమున గూడ చాల వరకు గడచినది. నేను మీ బాధనెరుగను. మిమ్మిట్లు బాధలకు గురిచేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన ఋణమును తీర్చలేకపోతిని. విష్ణువును, పితృదేవతలను, ఋషులను పూజింపనివాని జన్మ వ్యర్థము. వానియునికి భూమికే భారము. నేను మీ యాజ్ఞను పాటించి వివాహమాడుదును. కలిబాధకలుగకుండ సంసారబాధలు లేకుండ మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యముల నాజ్ఞాపింపుడని ప్రార్థించెను.


ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత యూరటను పొంది నాయనా! నీ పితృదేవతల పరిస్థితిని జూచితివి కదా! సంతానము లేకపోవుటచే గడ్డిపరకను పట్టుకొని యెట్లు వ్రేలాడుచున్నామో చూచితివి కదా! విష్ణుకథలయందనురక్తి, స్మరణము, సదాచారసంపన్నత కలవారిని కలిపీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామశిలగాని, భారతము గాని యింటియందున్నచో కలి వారిని బాధింపడు. వైశాఖవ్రతము, మాఘస్నాన వ్రతము, కార్తీకదీపదానము పాటించువారిని కలి విడుచును. ప్రతి దినము పాపహరము ముక్తిప్రదమునగు శ్రీహరి కథను విన్నచో కలివారిని పీడింపడు. వైశ్వదేవము, తులసి, గోవు వున్నయింటిని కలి బాధింపడు. ఇట్టివి లేనిచోట నుండకుము. నాయనా త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖమాసము గడచుచున్నది. సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలెనని మేషరాశి యందున్నాడు. ఈ నెలలోని ముప్పది తిధులును పుణ్యప్రదములే. ప్రతి తిధియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలము నిచ్చును. చైత్ర బహుళ అమావాస్య మానవులకు ముక్తి నిచ్చునది. పితృదేవతలకు ప్రియమైనది. విముక్తిని యిచ్చునది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్దము చేయవలయును. జలపూర్ణమగు కలశము నిచ్చి పిండప్రదానము చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి కోటిరెట్లు ఫలితము నిచ్చును. చైత్ర అమావాస్యనాడు శక్తిలేనిచో కూరతోనైన శ్రాద్దము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకము గల కలశమును దానమీయనివాడు పితృహత్య చేసినవాడు. ఆనాడు చల్లని పానీయము నిచ్చి శ్రాద్దము చేసినచో పితృదేవతలపై అమృతవర్షము కురియును. ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్దము ప్రశస్తము. కావున నీవు త్వరగ వెళ్లి ఉదకుంభదానమును, శ్రాద్దమును పిండ ప్రదానము చేయుము. వివాహమాడి యుత్తమ సంతానమునంది పురుషార్థములనంది అందరును సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారము చేయుము, అని వారు చెప్పిరి.


ధర్మవర్ణుడును త్వరగా భూలోకమును చేరెను. చైత్ర బహుళ అమావాస్యనాడు ప్రాతః కాలస్నానము పితృదేవతలు చెప్పినట్లు జలకలశదానము శ్రాద్దము మున్నగు వానిని చేసెను. వివాహము చేసికొని యుత్తమ సంతానమునందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను.```


_*వైశాఖ పురాణం ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం*_ 


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

.

శ్రీ కృష్ణ కుచేల

               శ్రీ కృష్ణ కుచేల 


సతి మాటల్ విని  భూసురాన్వయుడు 

           శ్రీ సర్వేశునిన్ జూడగన్

నతి వేగంబుగ నేగె ద్వారకకు

           నానా ప్రాంతముల్ దాటియున్ ,

గతి యింకన్ తన  కీజగంబునను

         యా కంసారియే నంచు తా

మతిలో దల్చుచు భక్తితో మధు రి

          పున్ మాధుర్య ముప్పొంగగన్      17* 


కతిపయ దినములు నడచియు

యతులితమగు   భక్తి తోడ  యా భూసురుడున్

శృతి వంద్యు డైన కేశవు

నతి వేగము తోడ కలువ నగరము జేరెన్.  18** 


అటజని కాంచె భూమిసురు

           డంబరచుంబిత భర్మహర్మ్యముల్ ,

భటయుత రాజమార్గములు ,

           భాసుర దివ్య వికాస పణ్యముల్ ,

నటు నిటు  దిర్గు పౌరులను ,

           నవ్య శుభాంగుల దివ్య కాంతులన్ ,

స్పుటతర చారుసుందరపు

         శోభల నచ్చట ద్వారకాపురిన్       19** 


సర్వ మెరిగిన కృష్ణుడు సమ్మతమున

బాల్య మిత్రుని రాకకు పరవశించి

గురుకులంబున విషయముల్ గుర్తురాగ

పలికె నీరీతి సతులతో బాల్యసరళి.       20** 


✍️గోపాలుని మధుసూదనరావు🙏

చేయవలసిన పనిని

  ☘☘☘☘☘☘☘☘☘☘☘☘

                    *ధార్మికగీత - 126*

                      ***************

       *శ్లో:- ఉపేక్ష్య సమయే కార్యే౹*

              *భగ్నే చింతా నిరర్థకా ౹*

              *నిర్గతే సలిలే తత్ర ౹*

              *సేతు బంధో నిరర్థకః ౹౹*

                             *****

    *భా:- చేయవలసిన పనిని తగిన సమయములో చేయ కుండా, తరువాత ఆ పని పాడయి పోయినదని విచారించడం వలన ప్రయోజనం ఉండదు. నీరు పారు తున్నప్పుడే గట్టు కట్టాలి. తరువాత గట్టు కడితే లాభం ఏమిటి? గత జల సేతుబంధనం అంటే ఇదే!*

☘☘☘☘☘☘☘☘☘☘☘☘

🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*గురువారం 14 మే 2026*


*🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁* 

*🍁జ్ఞాన యజ్ఞం -10వ రోజు **🌹


నిన్న మనం హనుమంతుని విద్యా చాతుర్యాన్ని, రామకార్యం పట్ల ఆయనకు ఉన్న ఆతురతను తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుడు శ్రీరాముని కథను వినడానికి ఎంతటి మక్కువ చూపుతారో మరియు ఆయన హృదయంలో సీతారామ లక్ష్మణులు ఎలా కొలువై ఉంటారో ఈ ఎనిమిదవ చౌపాయి ద్వారా తెలుసుకుందాం.


    **ఎనిమిదవ చౌపాయి**


 **ప్రభు చరిత్ర సునిబే కో రసియా |**

**రామ లఖన సీతా మన బసియా ||**


           **ప్రతిపదార్థం**


          * **ప్రభు చరిత్ర**  


తన ప్రభువైన శ్రీరామచంద్రుని కథలను/చరిత్రను


  * **సునిబే కో** 

        వినడానికి


  * **రసియా:** 


మిక్కిలి ఆసక్తి కలిగినవాడు (ఆనందాన్ని పొందేవాడు)


  * **రామ లఖన సీతా**


 శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు సీతమ్మ


  * **మన బసియా**


(ఆయన) మనస్సులో ఎల్లప్పుడూ నివసిస్తారు.


**విస్తృత ఆధ్యాత్మిక వివరణ**


**1. ప్రభు చరిత్ర సునిబే కో రసియా (రామకథా ప్రేమికుడు)**


ఆసక్తి దేనియందు ఉంటుందో అది రసికత. ప్రభు చరిత్ర వినడం లో రసికుడు స్వామి.రామకథను వినడంలో ఆయనకు ఎప్పుడూ తృప్తి కలగదు. "ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ హనుమంతుడు అంజలి ఘటించి రెండు చేతులు శిరసు మీద పెట్టుకొని పరమ ఆర్ద్రత తో కన్నీరు కారుస్తూ వింటాడు" 


రామచంద్రమూర్తి అయోధ్య వాసులందరికి ముక్తినిస్తూ సరయూనదిలోకి వెళుతూ హనుమంతుని మాత్రం నువ్వు చిరంజీవి కనుక ఇక్కడే ఉండాలన్నాడు. నీ కథ ఉన్నంతకాలం ఉంటానన్నాడు హనుమ. ఆయనకు రామకథ అంటే అంత ఆసక్తి సర్వవ్యాపకమైన పరమేశ్వరస్వరూపం కనుక ఇప్పటికీ ఎక్కడ రామకథ జరిగితే అక్కడ ఉంటాడు ఆంజనేయస్వామి


శ్రవణం ఒక యోగం, భగవత్ కథలు ఏడు రోజుల విన్నంత మాత్రాన ముక్తి పొందాడు పరీక్షిత్తు. రసికత ఉంటే వెంటనే ఆ యోగం వస్తుంది.


ప్రుధు చక్రవర్తి అనేక యాగాలు చేసి సాక్షాత్ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షం చేసుకుని కోరిన వరం ఏమిటో తెలుసా ఎల్లప్పుడూ నీ కథలు వినడానికి పది వేల చెవులు ఇవ్వమని. అంటే ఎల్లప్పుడూ నీ కథలు వినే భాగ్యం కావాలి అని కోరడం.


సంస్కారం ఉన్నవారికి భగవత్కథలు వింటూ ఉంటే విసుగు రాదు, ఇంకా వినాలనిపిస్తుంటుంది. వారు ఎన్నిమార్లు వింటామని కాకుండా ఎన్నిమారైనా వింటారు. హనుమంతుడు ఎన్నో మార్లు విన్నాడు... ఇప్పటికీ వింటూనే ఉంటున్నాడు. రామకథలో రసజ్ఞత ఉన్నది.


మనం చదివితే కొంతే మనసులోకి వెళ్తుంది,అదే వింటే అనేక విషయాలు వస్తాయి,మనం చదువుకునేది హనుమాన్ చాలీసా కానీ ఇందులో రామాయణం వస్తుంది, పరాశర సంహిత వస్తుంది, అక్కడక్కడ భారతం వస్తుంది, భాగవతం వస్తుంది అందుకే శ్రవణం ఒక యోగం.


రెండు చేతులూ శిరస్సు మీద పెట్టుకుని, కనుల ఆనందబాష్పాలు రాల్చుతూ తన్మయుడై వింటాడు అలా విన్నవాడు ఎవడైనా కనిపిసే వాడే హనుమంతుడు మహాత్ములు ఎప్పుడు ప్రచ్ఛన్నంగా వస్తారు. అలాంటి వారిని పోల్చడం కూడా మహాకష్టం


రామకథ జరిగేచోట హనుమంతుడు ఉంటాడు. తులసీదాసుకు ఇది అనుభవము. అందుకే రామకథ జరిగేటప్పుడు ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి. హనుమంతుడు ఉన్న చోటులో మనం కూర్చుంటాం. ఆ మహాత్ముని శక్తి తరంగాలు వ్యాపించిన ప్రాంగణంలో కూర్చుంటే సమస్త పాపాలూ నశించిపోతాయి. రామకథారసజ్ఞుడు హనుమంతుడు. అది 'ప్రభుచరిత్రసునివేకోరసియా'


ఇది భక్తుడికి ఉండవలసిన 'శ్రవణ భక్తి'కి నిదర్శనం. జ్ఞానం ఎంత పెరిగినా భగవంతుని లీలలను వినడం వల్ల కలిగే ఆనందం అంతటిది.


**2. రామ లఖన సీతా మన బసియా (హృదయ పీఠం)**


హనుమంతుని హృదయం ఒక దివ్యమైన కోవెల. అక్కడ సీతారామ లక్ష్మణులు నిరంతరం కొలువై ఉంటారు అని ఒక భావం. ఇది సత్యమే కానీ తులసి దాసు గారు హృదయం ఇది కాదు అని పెద్దలు చెపుతారు.సీతా, రామ లక్ష్మణుల హృదయాల్లో ఉన్న హనుమను ఇక్కడ తులసి దాసు గారు దర్శించారు.


దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్


రామచంద్రమూర్తికి దక్షిణం వైపు లక్ష్మణుడు, ఎడమవైపు సీతమ్మ ఉన్నారు. ముందు హనుమ ఉండి ఆ ముగ్గురినీ హృదయంలో నిలుపుకుని ధ్యానిస్తున్నాడు. కానీ ఆ ముగ్గురి హృదయంలో హనుమంతుడు ఉన్నాడని ఇక్కడ చెప్పారు. అంటే హనుమంతుడు ఎంత రామభక్తుడో సీతారాములు అంత హనుమద్భక్తులు అనే విషయాన్ని ప్రమాణంతో చెప్పుకున్నాం.


రామచంద్ర మూర్తి ఇసుమంత ఉపకారం చేస్తేనే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు.వేలకొలది అపకారాలు చేసినా మర్చిపోతాడు. అది రామచంద్రమూర్తి గొప్ప వ్యక్తిత్వం. అంత వ్యక్తిత్వం కలవాడు మహోపకారం చేసిన హనుమను మర్చిపోతాడా...? ఎప్పుడూ హృదయంలోనే పెట్టుకున్నాడు.


ఇక సీతమ్మ హనుమ ను ఎప్పుడు మర్చిపోదు పట్టాభిషేక సమయంలో కూడా రాముడు ప్రేమతో ఇచ్చిన ముత్యాల హారం హనుమ కి ఇచ్చింది తల్లి. అంతటి కృతజ్ఞతా భావం.


సంజీవని తెచ్చి ప్రాణం కాపాడిన హనుమను, సంజీవ రాయుడుగా ఎల్లప్పుడూ హృదయం లోనే పెట్టుకున్నాడు.


అందుకే 'రామలషన సీతా మన బసియా' అనే ఒక్క మాటలో సీతారామలక్ష్మణులు హనుమంతుడి నుంచి పొందిన ఉపకారం, ఆ ఉపకారాన్ని నిరంతరం మనస్సులో పెట్టుకోవడాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు.


అటు తర్వాత మరొక అద్భుతమైన చౌపాయీలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడినుంచి రెండు చౌపాయీలు హనుమ యొక్క అద్భుతమైన రూపాలను చూపిస్తుంటాయి. వాటిని రేపు దర్శించబోతున్నాం. ఇవి అత్యంత ముఖ్యమైన చౌపాయీలు.


**తులసీదాసు గారి సందేశం**


తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా భక్తి మార్గంలో రెండు ముఖ్యమైన సూత్రాలను చెప్పారు:


*1. **వినడం (Listening)** 


ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుని గుణగణాలను నిరంతరం వినడం అవసరం.


*2. **ధ్యానం (Meditation)** 


మనస్సును భగవంతుని నివాసంగా మార్చుకోవాలి.

మనం కూడా హనుమంతుని వలె రామకథా రసికులమైతే, మన మనస్సులో కూడా ఆ పరమాత్మ స్థిరంగా కొలువై ఉంటాడని ఈ చౌపాయి అంతరార్థం.


*జై శ్రీరామ్! జై హనుమాన్!*       

       🍁🌹🙏🌷🍁


          *🌷సేకరణ🌷*

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

విషములువిషములు

విషములు వాని లక్షణములు  - 


 మహా విష సర్పములు  - 


 శ్మశానము , రచ్చ చావిళ్ళు, పాడుబడిన యజ్ఞ స్థానములు, పాడుబడిన ఇండ్లు, నాలుగు దోవలు కలిసిన తావు, నీళ్ల గట్టు, పాడు తోటలు, మాణి తొర్రలు, పాలమాను, వేపచెట్టు, సెలయేళ్ళు, గుహలు, వీనియందు ఉండు సర్పములు , జడలు ధరించిన సర్పములు , చత్రరేఖలు, మత్స్యరేఖలు, కుంభ రేఖలు , త్రిశుల రేఖలు , గల సర్పములు , ఎర్ర ముఖము , ఎర్ర కన్నులు గల సర్పములు కరచిన యెడల వీనికి కాల నియమం లేదు . విషము ఎక్కుటకు క్రమము లేదు . ఈ విషమును తిప్పుటకు మంత్ర ఔషదములు లేవు . ఒకవేళ బలి, నమస్కార , జప, శాంతి, మంత్ర ఔషధుల చేత ఎవడన్నా బ్రతికినా రూపము చెడును. అంగవైకల్యం కలుగును.


 స్థాన విధి దోషము  - 


 శ్మశానము, రచ్చ మాకులు వీని యందు పంచమి, పక్ష సంధులు, అష్టమి, నవమి, సంధ్యలు, అర్ధరాత్రి ఈ కాలముల యందు ఎట్టి పాము కరిచినను విషం ఎక్కును.


 నక్షత్ర దోషము  - 


 భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, పుబ్బ, పుర్వాబాద్ర, పుర్వాషాడ , మఖ, శతబిషం , నైర్రుత ముహూర్తం , పర్వములు వీని యందు పాము గరిచిన యెడల మనుష్యుడు జీవించుట దుర్లభం .


 విష సాధ్య లక్షణములు  - 


  పాము కరిచిన వానికి తలవెంట్రుకలు రాలుట , మూర్చ, శ్వాసము, వెక్కిళ్ళు, దగ్గు , వాంతి , రొమ్ము బరువు, వణుకు, వికారము , వేదన, కన్నులు ఎరుపు ఎక్కుట , గొంతు పట్టుట, పండ్లు నేరేడు పండ్లు వలే నల్లనగుట, నవ రంధ్రముల నుండి రక్తము కనిపించుట, నోట నురుగు వచ్చుట, కాళ్ళు, చేతులు నల్లగా అగుట ఈ లక్షణాలు కనిపించిన ఆ మనుష్యుడు బ్రతకడు. 


 తేలు విషము  - 


  సర్ప శరీరములు మురగిన యెడల తేళ్ళు జనించును.మరియు పేడ లొను , శ్మశాన దగ్ధ స్థలముల యందు బుట్టును. వీని విశములు మంత్ర ఔషధములకు సాద్యం కాదు. అవి తెలుపు,ఎరుపు,నలుపు వర్ణములు కలిగియుండును. వీని విషం ఎక్కినవానికి నాలుక మంధమేక్కును , మిక్కిలి నొప్పి , ముక్కున నెత్తురు వచ్చుట, శరీరం చెమర్చుట, మూర్చ, నోరెండుట కలుగును. 


 గర విష లక్షణము  - 


 స్త్రీలు పురుషులను వశపరుచుకోనుటకు , అట్లే పురుషులు , స్త్రీలను వశపరుచుకోనుటకు నానా జంతువుల బస్మ, మల, మూత్రాదులు, ఔషధములను , అల్ప వీర్యములు గల విషములు మొదలగు వానితో కుడా చేర్చి అన్నపాన తాంబూలం, మద్యపానం తో నోసంగేదరు. దీనినే గర విషము , పెట్టుడు మందు అనికూడా అంటారు. 


 పెట్టుడు మందు లక్షణము  - 


 ముఖము తెల్లగా అగుట,ఓడలు చిక్కుట, అగ్నిమాంద్యము, దగ్గు , ఉబ్బసము , వాత ప్రకోపము, మహోదరము, గుండెలలో నొప్పి , బలహీనత, హీన స్వరము, మోహము, కడుపు ఉబ్బారము, నిద్ర యందు భ్రమ. స్వప్నం నందు నక్క,పిల్లి, ముంగీస, పాము , కోతి, ఎండిన గుంటలు, కాలిన మానులు , వీనిని చూచుట, తన దేహము నానా వర్ణములు గా కనిపించుట, ముక్కు విరిగినట్టుగా ఉండుట, కన్నులు గుంటలు పడుట ఈ లక్షణములు పెట్టుడు మందు వలన కలుగును. ఇవి కనిపించిన వెంటనే చికిత్స చేసిన బ్రతుకును. లేనిచో మరణం తప్పదు. 


 విషాన్న లక్షణము  - 


 విషముతో కూడిన అన్నము తేలికగా నుండక దట్టముగా ఉండును.చిరకాలమునకు పక్వమగును. పక్వమైన అన్నము చద్ది అన్నము వలే ఉండును. అన్నం ఉడుకుతున్నప్పుడు దాని మీద ఆవిరి నెమలి కంట మ్ రంగు వలే ఉండును. ఆ అన్నం చూసినప్పుడు మొహము, మూర్చ , నోట నీళ్ళను కనిపించును. వర్ణము, వాసనయు హీనమగును. ఆవిరి యందు తళుకులు కలిగి ఉండును. 


 విషము కలిపిన కూరలు  - 


 విషముతో కలిసిన కూరలు ఎండి నట్టు ఉండును. కాషాయ వర్ణం కలిగి రుచిహీనమై వేరొక వికారm చెందును. ఆ కూరల పైన నురుగు వలెను , సీమంత రేకల వలెను , బుగ్గల వలెను కనపడును. ఇలా ఉండిన కూరల యందు విషం కలిసినట్టు . 


 విషాన్న పరీక్ష  - 


  విషముతో కూడిన అన్నమును అగ్నిలో వేసిన జ్వాల పుట్టాక ఉండును. పొగ , దుర్గంధం పుట్టును. ఆ అన్నం మీద ఈగలు వాలిన చచ్చును. కాకి చూచినా హీన స్వరముగా కూయును . నెమలికి మంద దృష్టి కలుగును . చిలుకలు, గోరువంకలు చూచిన మిక్కిలి కూయును . కొతి మలం జార్చుకోనును. కావుణ బుద్ధిమంతుడు అయిన వాడు పరీక్షించి తినవలెను. 


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 

13, మే 2026, బుధవారం

గురువారం🌷* *🌹14, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌷గురువారం🌷*

    *🌹14, మే, 2026🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

               

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : ద్వాదశి* మ 11.20 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : రేవతి* రా 10.34 వరకు ఉపరి *అశ్విని*

*యోగం : ప్రీతి* రా 05.53 వరకు ఉపరి *ఆయుష్మాన్*

*కరణం  : తైతుల* మ 11.20 *గరజి* రా 10.00 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

*మ 01.00 - 02.00 సా 04.00 - 06.00*       

అమృత కాలం  : *రా 08.20- 09.49*

 అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : ప 11.25 - 12.54*

*దుర్ముహూర్తం  : ఉ 09.55 - 10.47 మ 03.04 - 03.56* 

*రాహు కాలం   :మ01.41- 03.17*

గుళికకాళం      : *ఉ 08.51 - 10.27*

యమగండం    : *ఉ 05.37 - 07.14*

సూర్యరాశి : *మేషం*                   

చంద్రరాశి : *మీనం/మేషం*

సూర్యోదయం :*ఉ 05.45* 

సూర్యాస్తమయం :*సా 06.41*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 05.37 - 08.12*

సంగవ కాలం        :*08.12 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.21*

అపరాహ్న కాలం   :*మ 01.21- 03.56*

*ఆబ్ధికం తిధి        : వైశాఖ బహుళ త్రయోదశి*

సాయంకాలం    :*సా 03.56- 06.31*

ప్రదోష కాలం      :*సా 06.31- 08.44*

రాత్రి కాలం        :*రా 08.44 - 11.41*

నిశీధి కాలం       :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.52*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః.🕉️🌹*


      *శత్రునాశకరం స్తోత్రం* 

     *జ్ఞానవిజ్ఞానదాయకమ్*

           

  *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*



       *శ్రీ మహావిష్ణు పురాణం*                                  

               *87వ భాగం*


      *శ్రీరామావతారం-8*


       *రావణ సంహారం*```


లంకకు సీతాదేవిని రావణుడు తీసుకువెళ్లి ఆశోకవనంలో 

బందీగా రాక్షస స్త్రీల మధ్య ఉంచాడు. సీత మనస్సు మార్చి తనను భర్తగా అంగీకరించేట్టు చేయడానికి రావణుడు అనేక విఫల ప్రయత్నాలు చేసాడు. సీతాదేవి రావణుని గడ్డిపోచగా తృణీకరించి “తనభర్తరాముడేనని, త్వరలో అన్వేషించి రావణుని సంహరించి తీసుకువెళ్ళతాడని, ప్రాణాలు కావాలంటే తనను మర్యాదగా రామునికి అప్పగించ మని" హెచ్చరించింది.


రావణుడు ఆగ్రహంతో సీతకు మనస్సు మార్చుకోవడానికి పన్నెండు మాసాలు గడువు ఇచ్చాడు. మనస్సు మార్చుకోక పోతే ఆమెను చంపి కాపలా ఉన్న రాక్షస స్త్రీలకు ఆహారంగా వేస్తానని హెచ్చరించి వెళ్లి పోయాడు.


సీతాన్వేషణ చేస్తున్న రామలక్ష్మణులు శబరిమాతసూచించినట్లు ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరి వెళ్లారు. 


పర్వతంపైనుండి ధనుర్బాణములు ధరించివస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు "అన్న వాలి తనను చంపడానికి పంపించిన వీరులని" ఆందోళన చెందాడు. 


సుగ్రీవుని మంత్రి అయిన హను మంతుడు "నేనువిషయంతెలుసుకు వస్తానని" భరోసాఇచ్చి బ్రాహ్మణుని వేషంలో రామలక్ష్మణుల వద్దకు వెళ్లి వివరాలు అడిగాడు.


లక్ష్మణుడు "తాము అయోధ్య రాజకుమారులైన రామలక్ష్మణులమని, వనవాసంలోఉన్న తమను మోసం చేసి వదినగారైన శ్రీరాముని పత్ని సీతాదేవిని రావణుడు అపహరించాడని, సీతాన్వేషణలో శబరి మాత సూచన ప్రకారం సుగ్రీవుని సహాయం కోరుతూ వచ్చామని" చెప్పాడు.


ఆరాధ్యునిగా చిన్నతనం నుండి మనస్సులో కొలుస్తున్న శ్రీరాముడు ఎదురుగా కనపించేసరికి హనుమంతుడు మహదానంద భరితుడు అయ్యాడు. నిజరూపం దాల్చి "తనను సుగ్రీవుని మంత్రి హనుమంతుడిగా" పరిచయం చేసుకున్నాడు. 


కలలో కనిపించిన శ్రీరాముని బాల్యం నుండి ప్రభువుగా ఆరాధిస్తున్న సేవకుడనని, దర్శన భాగ్యం ఇన్నాళ్లకు కలిగిందని శ్రీరాముని పాదాలకు భక్తితో నమస్కరించాడు. 


రాముడు ఆంజనేయుని లేపి ఆలింగనం చేసుకున్నాడు.


హనుమంతుడు తన ఆకారం పెంచి రామలక్ష్మణులను భుజాల పై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతం పైన గల సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్లాడు. సుగ్రీవునితో మైత్రి కోసం వచ్చారని అయోధ్య రాజకుమారులు శ్రీరామలక్ష్మణులను పరిచయం చేసాడు. 


శ్రీరాముడు "రావణుడు తన భార్య సీతను మోసంతో అపహరించాడని, సీతాన్వేషణలో సహాయం చేయమని" సుగ్రీవుని అడగగా సుగ్రీవుడు "అన్నగారైన వాలి తనను అనుమానించి రాజ్య బహిష్కరణ చేసి, తన భార్య రుమను బలవంతంగా చెఱపట్టడమే కాకుండా తనను చంపడానికి ప్రయత్నం 

చేస్తున్నాడని" తన గురించి చెప్పాడు. 


అగ్నిసాక్షిగా రామ సుగ్రీవులు మైత్రీబంధం ఏర్పరచుకుని ఒకరికొకరు సహాయం చేసుకుంటామని ప్రమాణం చేసారు.


రావణుడు సీతాదేవిని పుష్పక విమానంలో తీసుకువెళుతున్నప్పుడు రామునికి తన జాడతెలియజేయాలని జారవిడిచిన ఆభరణాల మూట ఋష్యమూక పర్వతం పైన పడ్డాయి. సుగ్రీవుడు ఆ మూట తెచ్చి ఆ ఆభరణాలను "ఒక స్త్రీని రాక్షసుడు బంధించి ఆకాశమార్గాన దక్షిణ దిశ వైపు తీసుకు వెళ్లుతునప్పుడు రక్షించ మని వేడుకుంటూ కిందకి పడ వేసింది" అని రాముడికి చూపించాడు.


రాముడు ఆ ఆభరణాలు సీతవేనని గుర్తు పట్టి బాధపడ్డాడు. సీతను ఎక్కడ దాచినా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ముందుగా సుగ్రీవుని సమస్య పరిష్కరిస్తానని వాలిని ద్వంద్వ యుద్దానికి పిలవమని చెప్పి పంపాడు. వాలి సుగ్రీవులు యుద్దం చేస్తుండగా సమయం చూసి చెట్టు చాటు నుండి బాణం వేసి వాలిని సంహరించాడు. లక్ష్మణుని సుగ్రీవుని వెంట కిష్కింధకు పంపి వానర రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. వానకాలం ముగిసిన పిమ్మట సీతాదేవి అన్వేషణ ప్రారంభించుదామని, అందుకు వానరులను సమీకరించి సిద్దం చేయమని చెప్పాడు.


వానకాలం తరువాత సుగ్రీవుడు సమీకరించిన వానర సేనలను నాలుగు భాగాలుగా చేసి నాలుగు దిక్కులకు సీతాన్వేషణ నెలలోపు చేసి రమ్మని పంపారు. దక్షిణదిశ వైపు వెళుతున్న హనుమంతునికి రాముడు తన అంగుళీయకము గుర్తుగా సీతాదేవికి చూపించమని ఇచ్చి పంపాడు. 


సీతాదేవిని వెతుకుతూ దక్షిణ సముద్ర తీరం చేరిన హనుమంతుడి బృందానికి జటాయువు అన్న శంపాతి అక్కడకు సముద్రంలో వందయోజనాల దూరంలో ఉన్న లంకలో రావణుడు సీతను బంధించి ఉంచాడన్న సంగతి తెలిపాడు.


హనుమంతుడు గాలిలో ఎగిరి దక్షిణ సముద్రాన్నిఆకాశమార్గాన దాటి లంక చేరి సీతాదేవి జాడ కనుగొని ఆమెకు రాముడు ఇచ్చిన ఉంగరం ఇచ్చి త్వరలో రాముడు వానర సేనలతో వచ్చి రావణుని సంహరించి ఆమెను తీసుకు వెళతాడని భరోసా ఇచ్చాడు. రామునికి గుర్తుగా చూపించడానికి సీతాదేవి నుంచి చూడామణి ని తీసుకున్న హనుమంతుడు లంకలో విధ్వంసం సృష్టించి బందీగా రావణుని కలిసి బతికి ఉండాలంటే సగౌరవంగా సీతను రామునికి అప్పగించమని సలహా ఇచ్చాడు.


తిరస్కరించిన రావణుడు విభీషణుని సూచనపై చంపకుండా తోకకు నిప్పు పెట్టి హనుమంతుని వదిలి వేశాడు. హనుమంతుడు ఆ నిప్పుతో సగం లంకను ఆయుధాగారాలతో సహా కాల్చి వేసాడు. కిష్కింధకు తిరిగి వచ్చి రామునికి సీతజాడగురించి చెప్పి చూడామణి ఇచ్చాడు. రాముడు హనుమంతుని కౌగిలించుకుని భరతునితో సమానంగా సోదరుడిని చేసుకున్నాడు.


రామలక్ష్మణులు సుగ్రీవుడి వానర సేనలతో కలసి దక్షిణ సముద్ర తీరం చేరి సముద్రం పై వారధి నిర్మించి లంక చేరారు. సీతను అప్పగించి యుద్దం నివారించమన్న తమ్ముడు విభీషణుని రావణుడు ఆగ్రహంతో రాజ్యం నుండి బహిష్కరించాడు. విభీషణుడు రాముని వద్దకు వెళ్లి శరణు కోరాడు. విభీషణుని రాముడు ఆదరించి రావణ సంహారం తరువాత లంకకు రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు.


ఆఖరి ప్రయత్నంగా చేసిన అంగద రాయబారం విఫలం అవ్వడంతో రామరావణ సంగ్రామం ఆరంభమైంది. రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలైన కుమారులు, బంధువులు, సేనాధిపతులు, ఆశేష రాక్షస సైన్యం యుద్దంలో మరణించారు. చివరకు రావణుడు కూడా ఘోర యుద్దంచేసి రాముడి బాణానికి నేల కూలాడు. చని పోబోతున్న చివరి క్షణాలలో రాముని నారాయణుడుగా గుర్తించాడు. సనకసనందాది మునుల శాపానికి గురై నారాయణుని శత్రువులుగా జన్మించిన రెండవ జన్మ ముగిసినందుకు రామునికి మనస్సులో నమస్కరిస్తూ ప్రాణాలు వదిలేశాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుకుందాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁*



*🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁* 

*🍁జ్ఞాన యజ్ఞం - 9వ  రోజు 9🌹*


నిన్న మనం హనుమంతుని దివ్యమైన తేజస్సును, శివాంశ సంభూతుడైన ఆయన వైభవాన్ని తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుడు కేవలం శక్తివంతుడు మాత్రమే కాదు, ఆయన ఎంతటి బుద్ధిమంతుడో, రామకార్యం పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ ఎటువంటిదో ఈ ఏడవ చౌపాయి ద్వారా దర్శించుకుందాం.


          **ఏడవ చౌపాయి**


 **బిద్యావాన గుణీ అతి చాతుర |**

 **రామ కాజ కరిబే కో ఆతుర ||**


         **ప్రతిపదార్థం**


  * **బిద్యావాన (విద్యావాన్)** సకల విద్యలు తెలిసినవాడా (మహాపండితుడా)!

  * **గుణీ** సద్గుణములు కలవాడా!

  * **అతి చాతుర** అత్యంత సమయస్ఫూర్తి, నేర్పు (చతురత) కలవాడా!

  * **రామ కాజ** శ్రీరామచంద్రుని పనులను

  * **కరిబే కో** చేయడానికి

  * **ఆతుర** ఎల్లప్పుడూ ఉత్సాహముతో (ఆతురతతో) ఉండేవారు.


 **విస్తృత ఆధ్యాత్మిక వివరణ**


**1. బిద్యావాన & గుణీ (విద్య మరియు సంస్కారం)**


హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు.సూర్యభగవానుడి వద్దే సకల శాస్త్రాలను అభ్యసించిన జ్ఞాని.*అనేన బహుధాశ్రుతం* – ఇతను చాలా విద్యలు తెలిసినవాడని రామచంద్రమూర్తి మొట్ట మొదటి సారి సాదు వేషంలో హనుమ రామ లక్షణులను కలిసిన సమయంలో అంటాడు చతుర్వేదాలు, వేదాంగాలు తెలిసినవాడు.ఎలా తెలుసు అంటే 


ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టిన సందర్భం లో దేవతలందరూ తమ బలాలను హనుమకు ఇచ్చినప్పుడు సూర్యభగవానుడు - "నా తేజస్సులో నూరవ భాగాన్ని ఈయనకు ఇస్తున్నానని" అన్నాడు. సూర్యతేజస్సులో నూరవభాగం హనుమంతునిలో ఎప్పుడూ ఉంటుంది.ఇతనికి చదువుకునే వయస్సు వచ్చినప్పుడు నేను విద్య నేర్పుతాను అంటాడు సూర్యభగవానుడు.సూర్యుడు సకల వేదాలు తెలిసిన వాడు, ఆయనకు నమస్కారం చేస్తే మనము కూడా సకల విద్యల్లో నిష్ణాతులు అవుతాం.


ఆంజనేయస్వామివారికి సూర్యుని వల్ల వర్చస్సు వచ్చింది ఆ విద్య కేవలం హనుమకు మాత్రమే పనికొచ్చిందా...! లోకానికి మేలు చేసిన వర్చస్సు. ఆ విద్యతో లోకానికి ఉపకారం చేశాడు ఆంజనేయస్వామి


భారతజాతికి హనుమంతుడు ఆదర్శం కావాలని స్వామి వివేకానంద చెప్పారు.


త్యాగము, శక్తి, బలము, దృఢత్వము, జ్ఞానము... ఇవన్నీ ఉండేలా మానవుడు తయారు కావాలి అంటే అవన్నీ ఉన్న హనుమనే ఉపాసన చేయాలి.


సూర్యభగవానుడు హనుమకు ఇచ్చింది విద్య. ఆ విద్యవల్ల వచ్చేది వర్చస్సు. ఆ వర్చస్సు పదిమందికి మేలు చేస్తే 'సు-వర్చస్సు'


హనుమకు 'సువర్చస్సు' సూర్యుని వల్ల వచ్చింది. సూర్యుని వల్ల వచ్చిందంటే - దేవతావ్యవస్థలో 'వారి నుండి వచ్చిన దానిని' - కూతురు/కొడుకు అంటారని చెప్పుకున్నాం. సూర్యుని నుండి వచ్చిన 'సువర్చస్సు' విద్య ద్వారా హనుమంతునకు వెళ్ళింది. హనుమ దాన్ని స్వీకరించి ధరించాడు.దీనినే సూర్యుడు తన కూతురైన సువర్చలను హనుమంతునకు ఇచ్చి పెళ్ళిచేశాడని మనకు అర్థం కావడం కోసం కథగా చెప్పారు. పురాణాలు అన్ని విశ్వ విజ్ఞాన రహస్యాలు. వాటిని సూక్ష్మ బుద్ధి తో అన్వయం చేస్తేనే అందులోని రహస్యాలు అర్దం అవుతాయి.


ఇలా సువర్చస్సు తో ఉన్న హనుమ ఉపాసన చేస్తే పర అపర అనే రెండు విద్యలు సిద్ధిస్తాయి.


ఆంజనేయస్వామివారు సూర్యపుత్రికయైన సువర్చలతో ఇప్పటికీ గంధమాదన పర్వతము మీద కదళీవన మధ్యంలో ఉష్ణ వాహనంపై ఉంటారు. ఉష్ట్రం అనగా ఒంటె ఒంటె హనుమంతుని వాహనమని మంత్రశాస్త్రం చెప్తోంది.


ఒంటె వాహనము, కదళీవనము అనగానే సువర్చలా సమేత ఆంజనేయ స్వామివారే దీనిని శక్తి సహిత ఉపాసన అంటారు.అలా హనుమ విద్యావాన్.


హనుమ వేద విద్యలు, వ్యాకరణం మాత్రమే కాదు సంగీతం లోనూ దిట్ట, త్రిశూల రోముడు అనే రాక్షసుడు దుర్భేద్యమైన గుహలో దాక్కుంటే హనుమ సంగీతం తో ఆ రాళ్ళు కరిగించి వాడిని సంహరించాడు. స్వయంగా నారద, తుంబురులే నీ అనుగ్రహం ఉంటే మేం బాగా పాడగలము అంటారు. అందుకు విద్యావాన్ స్వామికి తెలియని విద్య లేదు...


ఇంత విద్య ఉండటం ఒక్కటే కాదు గొప్ప గుణములు కలవాడు హనుమ, రామ కథ మొట్ట మొదట చెప్పింది హనుమ సుందర కాండ లో అశోక వనం లో చెట్టు పై కూచుని కొంత భాగం, దిగిన తర్వాత సీతమ్మను ఓదారుస్తూ ముందు జరగ బోవు కథ చెప్తాడు. అందుకే సుందరకాండ చదివితే రామాయణం చదివినట్టే.


తరగని జ్ఞానం తో పాటు అపార వినయం,ఉత్సాహం,బలం,విశ్వాసం, పరాక్రమం ఇలా ఒక్కటా సకల గుణాలకు ఆలవాలం స్వామి.


మహేంద్ర పర్వతం మీద నుండి ఎగురుతూ రామ బాణం లా లక్ష్యాన్ని సాధించే వస్తాను అని తన బలంగా కాకుండా రామ అనుగ్రహం గా చెప్తాడు. సీతమ్మ దొరక్క దిగులు చెంది నీరసించి పోతాడు మళ్ళీ తనను తానే ఉత్తేజ పరచుకుని వెతకి విజయం సాధిస్తాడు. లంకలో సీతమ్మ ను వెతికే ప్రయత్నం లో చూడకూడనీవి కొన్ని కనపడతాయి వీటి యందు నా మనస్సు లగ్నం కాలేదు కనుక దోషం లేదు అంటాడు.అంటే దేని మీద మనసు పెట్టాలో, ఎక్కడ ఎలా తనను తాను నిగ్రహించు కోవాలో తెలిసిన వాడు హనుమ.

అన్ని తెలిసినా సీతమ్మ దగ్గర నేను వానరులు అందరిలో అల్పుడిని అంటారు.అదీ గొప్ప గుణం.


చిన్న చిన్న పనులు చేసి అంతా నేనే చేశాము అనే మనం హనుమ నుండి ఈ గుణం నేర్చుకోవాలి అంతా రాముని అనుగ్రహం అంటాడు తప్ప తాను చేశాను అనడు,అదే గొప్ప గుణం.ఈ గుణం ఉన్నవాడికి లోకంలో తిరుగులేదు..


ఎంతటి జ్ఞానమున్నా అది సత్ప్రవర్తనతో తోడైనప్పుడే దానికి విలువ అని ఇది మనకు నేర్పుతుంది.


**2. అతి చాతుర (అసాధారణ చతురత)**


చాతుర్యం అంటే నేర్పరితనం. స్వామివారి నేర్పరితనాన్ని అనేక సందర్భాలలో జరిగిన ఘట్టాలలో పరిశీలించవచ్చు. తెలివితేటలు ఉండడమే కాదు, వాటిని ఎలా వినియోగించుకుంటున్నామనేది నేర్పరితనం. విద్య, జ్ఞానం గొప్పతనం వాటి వినియోగదశలో తెలుస్తుంది. దానినే వ్యవహారంలో చురుకుతనం, చలాకీతనమని

అంటారు, సురస ను ఓడించిన సందర్భంలో మనం ఇది చూడవచ్చు.క్లిష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ఆయనను చూసి నేర్చుకోవాలి.


**3. రామ కాజ కరిబే కో ఆతుర (సేవా తత్పరత)**


రామకార్యం చేయడంలో ఆత్రుత కలవాడు ఆతురత అంటే ఎలాగైనా సాధించాలి. సాధించేవరకూ నిద్రపోకూడదనుకోవడం అది హనుమ వద్ద రామ కార్యంలో కనబడుతుంది. మైనాకుడు కాసేపు ఆగి వెళ్ళవయ్య అంటే నాకు సమయం లేదు అని ముట్టుకుని ఆగకుండా ముందుకు వెళ్తాడు.


భగవంతుని సేవలో ఆయనకు ఉన్న ఆ ఉత్సాహం (ఆతురత) మనకు ప్రేరణ. ఏ పనినైనా వాయిదా వేయకుండా, అత్యంత ఆసక్తితో పూర్తి చేయాలనేది ఇక్కడి అంతరార్థం.


ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి,కానీ వివరణ మరీ పెద్దగా అవుతుంది అన్న ఉద్దేశ్యం తో ఇంతటితో ఆపుతున్నాను,మీకు ఇంత వివరణ కావాలా వద్ద కామెంట్ చేయండి👇


ఇన్ని విషయాలు చెపితే ఏదోక విషయం చాలీసా చదివే సమయంలో మనసులోకి వచ్చి నిలబడితే అదే అసలైన పారాయణ అనే ఉద్దేశ్యం తో ఇస్తున్నాను, పైగా రామాయణ స్మరణ, హనుమత్ కథల తో హనుమాన్ చాలీసా యజ్ఞం పరిపూర్ణం అవుతుంది అని. మీరెలా అంటే అలాగే ముందుకు పోదాం...


 **తులసీదాసు గారి సందేశం**


తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా ఒక పరిపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం ఇచ్చారు. ఒక వ్యక్తికి **విద్య** ఉండాలి, ఆ విద్యకు **సద్గుణం** తోడవ్వాలి, లోకంలో బ్రతకడానికి **చాతుర్యం** ఉండాలి, వీటన్నింటికీ మించి భగవంతుని సేవలో **నిరంతర ఉత్సాహం** ఉండాలి. ఈ నాలుగు లక్షణాలు ఉన్నచోట విజయం తథ్యం.


*జై శ్రీరామ్!జై హనుమాన్!*

        🍁🌹🙏🌷🍁


         *🌷సేకరణ🌷*

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

12, మే 2026, మంగళవారం

ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

లోకంలో బంధువులు

 శ్లోకం:☝

*లోకః పృచ్ఛతి సద్వార్తాం*

  *శరీరే కుశలం తవ ।*

*కుతః కుశలమస్మాకం*

  *ఆయుర్యాతి దినేదినే ॥*

భావం: లోకంలో బంధువులు, ఆత్మీయులు, మిత్రులు ఎదురైనప్పుడు _‘క్షేమంగా ఉన్నారా?’_ అని ఆప్యాయంగా కుశల ప్రశ్నలడుగుతుంటారు. అనుదినం పగలు రాత్రి మన ఆయువు తరిగిపోతుంటే ఇంకా కుశలమేమిటి? దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణముండగానే అపరోక్షజ్ఞానం సంపాదించుకోవాలి. లేకపోతే కనీసం మళ్ళీ మానవజన్మ వచ్చేలా పుణ్యకార్యాలు ఆచరించాలి. *ఆయుర్యాతి దినేదినే* అనే సంస్కృత నానుడి చాలా ప్రసిద్ధం.