తెలుగు పండిత కవులు
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
30, మార్చి 2026, సోమవారం
సోమవారం రాశి ఫలితాలు
శ్రీ గురుభ్యోనమః 🙏
30-03-2026 సోమవారం రాశి ఫలితాలు
మేషం
వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం వలన నష్టాలు తప్పవు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమౌతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. గృహ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం ఉండదు.
---------------------------------------
వృషభం
సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరిగినప్పటికీ ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి.
---------------------------------------
మిధునం
దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. శుభకార్యాల కొరకు వృధా వ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.
---------------------------------------
కర్కాటకం
దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.
---------------------------------------
సింహం
చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికావు. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
---------------------------------------
కన్య
దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగస్తులకు విధులలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
---------------------------------------
తుల
అన్ని వైపుల నుండి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో పెద్దల ఆదరణ కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపార విషయమై ఇతరుల సలహాలు అంతగా కలిసిరావు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.
---------------------------------------
వృశ్చికం
ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ప్రయాణాలలో వాహన విషయంలో ఇబ్బందులుంటాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
---------------------------------------
ధనస్సు
ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణయత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వాదనకు వెళ్లకపోవడం మంచిది. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
---------------------------------------
మకరం
చుట్టుపక్కలవారితో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగమున స్థిరత్వం కలుగుతుంది.
---------------------------------------
కుంభం
ఇంటా బయట విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు అందుతాయి.
---------------------------------------
మీనం
సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధన పరమైన ఇబ్బందులు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
---------------------------------------
పంచాంగం
ఈ రోజు పంచాంగం 30.03.2026 Monday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష ద్వాదశి తిథి ఇందు వాసర మఘ నక్షత్రం శూల యోగః బసవ తదుపరి కౌలవ కరణం.
రాహుకాలం : ఉదయం 07:30నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
ఈ రోజు వామన ద్వాదశి
శ్రాద్ధ తిథి: త్రయోదశి
నమస్కారః , శుభోదయం
వేదముల పవిత్రతను
శ్రీరామ (121).
( వేదముల పవిత్రతను రక్షించుకుందాం)
శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//
(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).
-----------
ఒక్క వేద పదమునకు గాని, వేద వాక్యమునకు గాని అర్థం చెప్పాలంటే, శీక్షా, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము,ఛందస్సు, కల్పము, అను ఆరు అంగములతో సహా వేదములను బ్రహ్మచర్య దీక్షతో అధ్యయనం చేసినవారే సమర్థులు.
శ్లో// షడంగ వేద విదుషాం క్రతు ప్రవర యాజినామ్/
శుశ్రావ బ్రహ్మ ఘోషాన్ స విరాత్రే బ్రహ్మరక్షసామ్//
(షడంగములతో కూడిన వేదవిద్యలందు నిష్ణాతులు, అనేక శ్రేష్టములైన యజ్ఞ యాగాదులు చేసిన వారు, అయిన, ఆ లంకా పట్టణమందలి, రాక్షసజాతికి చెందిన బ్రాహ్మణులు, బిగ్గరగా వేదాధ్యయనము చేయుచుండగా, ఆ వేదఘోషను, హనుమంతుడు వినెను).
ఇది వాల్మీకి రామాయణములోని సుందరకాండ లోని శ్లోకము.
అశోక వనములో సీతాదేవిని చూచిన తరువాత, రాక్షస స్త్రీలు చుట్టూవుండి కాపలా కాస్తున్న ఆమెతో ఎలా సంభాషించాలా అని హనుమంతుడు ఆలోచిస్తున్నాడు.
అది తెల్లవారుఝాము.
అప్పుడు ఆయనకు లంకానగరములో బ్రహ్మరాక్షసులు పఠిస్తున్న మహత్తరమైన వేదఘోష వినపడినది.
ఆ బ్రహ్మరాక్షసులందరు,శీక్షా, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము,ఛందస్సు, కల్పము, అను ఆరు అంగములు కల వేదములను అధ్యయనం చేస్తున్నారు.
రాక్షస జాతికి చెందిన వారు కూడా అంత శ్రద్ధతో షడంగములతో కూడిన వేదాధ్యయనం చేస్తున్నారు, అంటే ఎంత ఆశ్చర్యం!
అందులో ఏ ఒక్క అంగము సమగ్రముగా అధ్యయనం చేయని,మనలో చాలామంది, వేదపండితులుగా చెలామణి అవుతున్నారు.
అంతే కాకుండా వేదవాక్యాలకు తమ మేధాశక్తి ననుసరించి,ఏ విద్యారణ్య భాష్యము, శంకర భాష్యము మొదలైన ప్రమాణములు లేకుండా తమకు తోచిన అర్ధాలు చెబుతున్నారు.
ఆమధ్య నేను పురుష సూక్తం మీద ఒక ప్రసిద్ధి చెందిన ప్రవచనకారుడు, చేసిన ప్రసంగము వినటం తటస్థించింది.
ఆ ప్రసంగం చేసినాయన గొప్ప మేధావి, పండితులు.
చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు.
వారంటే నాకు గౌరవం ఉంది.
కాని ఆయన చదివిన పురుష సూక్తమంతా అపస్వరములతో కూడి ఉన్నది.
దాన్నిబట్టి ఆయన వేదాధ్యయనము చేయలేదని తెలుస్తున్నది.
వేదాధ్యయనం చెయ్యకుండా, ఆయనలాగానే ఈమధ్య చాలామంది, వేదముల మీదా, వేదాంతముల మీదా ప్రవచనములు ఇస్తున్నారు.
వివిధ మార్గాలయిన భక్తి, జ్ఞాన, యోగ, కర్మ, మార్గాలను కలగాపులగం చేస్తూ ప్రజలను,అయోమయానికి గురిచేస్తున్నారు.
లౌకిక విషయాలతో, రాజకీయాలతో, ఛలోక్తులతో,పురుషసూక్తము యొక్క అర్ధము తనకు తోచిన విధముగా వివరిస్తూ, ఏ ప్రమాణము ఉదహరించకుండా, సాగిన ఆ పండితుని ప్రసంగం విన్నతరువాత, నాకు ఎంతో బాధవేసింది.
భారత, భాగవత, రామాయణాదులు పౌరుషేయములు అనగా పురుషకృతములు.
విభిన్న మనస్తత్వాలతో కూడిన విభిన్న పాత్రలు ఆ గ్రంధాలలో ఉంటాయి.
ఎవరి మేధాశక్తిని బట్టి వారు వ్యాఖ్యానించుకోవచ్చు.
కానీ వేదములు అపౌరుషేయములు.
సాక్షాత్తు భగవంతునినుండి ప్రకటితమయినవి.
అతీంద్రియ విషయములను తెలిపే ఆ వేదవాక్యముల యొక్క అర్థము మన మేధస్సుతో తెలుసుకోలేము.
కేవలము తపోనిష్ఠా గరిష్ఠులైన మహాత్ములే వాటి అర్థము చెప్పగలరు.
శంకరభగవత్పాదులవారు,
భగవద్రామానుజులు,
మధ్వాచార్యులవారు,
విద్యారణ్యస్వామి,
మొదలైన భాష్యకారులు ఆ కోవకు చెందినవారు.
శ్రీ షణ్ముఖశర్మ గారిలాంటి ప్రవచనకారులు కూడా వారి వాక్యాలనే ఉదహరిస్తున్నారు గాని, వేదవాక్యాలకు తమ స్వంత అర్దాలు చెప్పటము లేదు.
వేదాధ్యయనము తపస్సు.
స్వాధ్యాయ ప్రవచనములతో కూడిన వేదాధ్యయనము తపస్సు అని మౌద్గల్య మహర్షి చెప్పినట్లు, వేదములోనే ఉన్నది.
" స్వాధ్యాయ ప్రవచనే ఏ వేతి నాకో మౌద్గల్య:/ తద్ధి తపస్తద్ధి తపః// "
"అదే తపస్సు" , "అదే తపస్సు" అని రెండుసార్లు గట్టిగా చెబుతున్నారు మహర్షి.
వేదవాక్యములకు అర్థము చెప్పే ముందు శ్రీ శంకరభగవత్పాదులవారు, కూడా, వినయంగా ఇలా అన్నారు.
శ్లో// యైరిమే గురుభి: పూర్వం పదవాక్య ప్రమాణతః/
వ్యాఖ్యాతా స్సర్వ వేదాంతా స్తాన్నిత్యం ప్రణతోస్మ్యహమ్//
(పద, వాక్య, ప్రమాణ, వివేచనా పూర్వకముగా, ఈ ఉపనిషత్తులన్నింటికీ ఏ గురువులు వ్యాఖ్యానము చేసినారో ఆ గురువులందరికి నేను నిత్యము నమస్కరిస్తున్నాను).
తాము సర్వజ్ఞులైనా శ్రీభగవత్పాదులవారు,తాము స్వంతంగా వేదవాక్యాలకు అర్థం చెబుతున్నాము అని అనలేదు.
పూర్వ గురువుల వ్యాఖ్యానాన్ని అనుసరించి మాత్రమే తాము భాష్య రచన చేస్తున్నట్లు చెప్పుకున్నారు.
దయచేసి అందరు పై విషయములు దృష్టిలో పెట్టుకొని,
తమకు తోచినట్లు వేదవాక్యములకు అర్థములు చెప్పకుండా, వేద పవిత్రతను కాపాడుతారని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు,
30-3-'26
వివాహప్రక్రియలో
🙏హిందూ వివాహప్రక్రియలో ముఖ్య ఘట్టాలు 🙏
మొదటి భాగం
వ్యాసం పెద్దది అయింది. చదవడానికి సులభంగా కొన్ని భాగాలుగా విభవించాను 🙏
ముందు హిందువుగా పుట్టడం ఒక అదృష్టమయితే బ్రాహ్మణునిగా జన్మించడం, వేదాధ్యయనం చేసి పురోహితుడు కావడం జన్మాన్తర సుకృతం అనే చెప్పాలి. వివాహ వ్యవస్థలోని సంప్రదాయాలు వ్రాస్తున్నాను. కొంతమంది బ్రాహ్మణులకు కొన్ని మినహాయింపు ఉండవచ్చు. అలాగే వధూవరుల వస్త్రధారణలోనూ, భాషికములువిషయాలలోనూ. అలాగే గోదావరి జిల్లాల్లో తెలుపు తలంబ్రాలు, మిగిలిన ప్రాంతాల వారు పసుపు తలంబ్రాలు ఉపయోగిస్తారు. ఇవి ప్రాంతీయ ఆచారాలు అనుకోండి. ఋగ్వేద సంప్రదాయంలో అయితే ముందు తలంబ్రాలు తరువాత తాళిగట్టుట జరుగును.
సోమ: ప్రధమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర:
తృతీయో అగ్నిష్టేపతి స్తురీయ స్తే మనుష్య జా:
ఈ మంత్రములో పతి శబ్దం వాడబడినది. ఇక్కడ పతి అంటే ప్రజాపతి అని అర్ధం. ప్రజా అంటే సంతానం. పతి అంటే సంరక్షకుడు ప్రజాపతి అంటే సంతాన సంరక్షకుడు అని అర్ధం చెప్పుకోవాలి.
ఇక్కడ కొందరు విపరీతార్ధము చెప్పి ప్రక్కదోవ పట్టిస్తున్నారు. అది మహాపచారం.
ప్రతి వధువు ఐదు సంవత్సరాలవరకు చంద్రుని సంరక్షణలో ఉండి ముఖకాంతిని పొందుతుంది. ఆపై చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించి పది సంవత్సరాలవరకు శరీరక సౌందర్యం ఇచ్చి సంరక్షణ చేస్తాడు. ఆ తరువాత గంధర్వుని సాక్షిగా అగ్ని దేవుడు స్వీకరించి మానసిక శరీరక వికాసం నిచ్చి ఆమెను భర్తకు అప్పగిస్తాడు. వరుడు అగ్ని సాక్షిగా స్వీకరిస్తాడు. అందుకే అగ్ని సాక్షిగా వివాహం అంటాము.
ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతోంది. నా ఆందోళన తెల్పి తరువాత విషయంలోకి వెడతాను.
ఈ రోజుల్లో ఎవరు పురోహితుల మంత్రాలు వినడం లేదు. వారిని గౌరవించడం లేదు. చాలా నీచానికి దిగజారి ఫొటోస్ కు అడ్డువస్తున్నారు అంటూ పురోహితులను విసుక్కుంటున్నారు. ఇది ఎంత దారుణమో ఈ విషయలో బ్రాహ్మణులు అతీతులు కారు. ఈ జాడ్యం అందరిలోనూ ఉంది.ఆలోచించండి.ముందు బ్రాహ్మణుల్లో మార్పు వచ్చి సంస్కరింపబడాలి. తరువాత మిగిలిన వారికి చెప్పవచ్చు.. ఈ మధ్య కొత్తగా ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రారంభించారు. హిందూ సంస్కృతిని ఎటువైపు తీసుకొని వెడుతున్నారు.
వివాహ ఘట్టాలను చదివి తెలుకుంటే దంపతుల మధ్య ప్రమాదకరమైన అభిప్రాయభేదాలు ఉండవు.
విడాకులు అనే మాట ఉండదు. నా మాట నిజం నమ్మండి.ఇక విషయంలోకి వెడదాము.
ముఖ్య ఘట్టలాను పరిశీలిద్దాం.
వివాహము మహా పవిత్రమైన విషయం.
మంగళ స్నానములు:- కొందరు ముత్తైదువులు సిరిసంపదలతో సంతానసౌభాగ్యాలతో సంతోషంగా వుండమని ఆశ్వీరదిస్తూ, వధూవరులకు మంగళం కోరుకుంటూ వారిని పవిత్రీకరిస్తూ మంగళ స్నానములు ఆచరిస్తారు.
మంగళాష్టకాలు:- నూతనవధూవరులకు మంగళం కలగాలని లక్ష్మీనారాయణులను, పార్వతీపరమేశ్వరులను, సీతారాములను, రుక్మిణీకృష్ణులు మొదలగువారిని ప్రార్ధిస్తూ, దంపతులు కాబోతున్న వీరికి ఆయురారోగ్య భోగభాగ్యాలను సత్సంతాన్ని ప్రసాదించి అనుగ్రహించమని ఎనిమిది మంగళ శ్లోకములను చదువుతారు.
బాషికం:- మానవుని శరీరంనందు ఇడ పింగళ సుషుమ్న అనే ప్రధాన నాడులుంటాయి. ఇవన్నీ కలిసేస్థానం భ్రూమద్యం. భౌతికమైన ఉపద్రవాలనుండి రక్షణకోసం, ఇతరత్రా దృష్టిదోషం పడకుండా వధూవరులకు ఈ స్థానంలో భాషికధారణ చేస్తారు.
(బ్రాహ్మణులలో కొందరికి ఈ సంప్రదాయం లేదు)
కాళ్ళు కడగడం:- కళ్యాణవేదికపై వధువు, వధువుతల్లితండ్రులు తూర్పుముఖముగా, వరుడు పశ్చిమముఖముగా కూర్చోగా వీరి నడుమ అడ్డుగా తెల్లటి తెరను (ఆ తెరపై స్వస్తిక్ గుర్తువుంటే మరీమంచిది) వధువుతరుపువారు ముగ్గురు ఓప్రక్కన, వరుడుతరుపువారు ఇద్దరు మరోప్రక్కన పట్టుకుంటారు.కన్యాదాత, అతనిభార్య వరుడును శ్రీనారాయణస్వరూపముగా భావించి, అల్లుని కాలుకడిగి పూజించి కన్యాదానం చేస్తారు. కన్యాదాత పెండ్లికుమారుని కాళ్ళు కడిగినప్పుడు అంతా భగవన్మయంగా భావిస్తూ శ్రీనారాయణుని పాదాలను కడుగుతున్న భావనతో ముందుగా కుడిపాదంను, తర్వాత ఎడమపాదంను ఆపై రెండు పాదములను కడగాలి.
కన్యాదానం:- అన్నిదానంలోనూ గొప్పదానం కన్యాదానం. కన్యాదానం చేయబోయేముందు కన్యాదాత ఇలా అంటారు -
'కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్యుతామ్ దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజిగీషయా "
భావం:- బ్రహ్మలోకప్రాప్తికోసం నేను సువర్ణసంపదగల స్వర్ణాభరణభూషితమైన ఈ కన్యను నారాయణస్వరూపుడవైన నీకు దానం చేయబోతున్నాను.
విశ్వంభర స్సర్వభూతా స్సాక్షిణ్యః సర్వదేవతాః కన్యా మిమాం ప్రదాస్యామి పితృణాం తారణాయ వై
భావం:- భగవంతుడు, పంచభూతాలు, సకలదేవతలు సాక్షులుగా నా పితృదేవతలు తరించడానికి ఈ కన్యను దానం చేయబోతున్నాను
.
కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయత్కోహం ప్రయచ్చామి ధర్మకామార్ధసిద్ధయే
భావం : సర్వాలంకారశోభిత, సాధ్వి, సుశీలయిన ఈ అమ్మాయిని ధర్మార్ధకామాలనే పురుషార్ధాలు సిద్ధించడానికి నియమపూర్వకంగా ఈ బుద్ధిమంతునికి దానం చేస్తున్నాను.
నాతిచరామి:- వదువుతండ్రి కన్యాదానం చేస్తూ, వరునిని ఇలా మాటివ్వమని అడుగుతాడు - "నాయనా! అల్లారుముద్దుగా పెంచిన నా కుమార్తెను నీ చేతిలో పెడుతున్నాను. నీవు ఈమెను (స్నేహేన పాలయ) స్నేహంతో చూసుకోవాలి. జీవితంలో మీరిద్దరూ కలిసిమెలిసి ఎన్నో మంచిపనులు చేయాలి. సిరిసంపదలను అనుభవించాలి. సత్సంతాన్ని కనాలి. ధర్మార్ధకామాలనే పురుషార్ధాలను సంపాదించడంలో నీకు అర్ధాంగి అయిన నా కూతురును అతిక్రమించి వెళ్ళకు. అలా అతిక్రమించి వెళ్లనని నాకు మాట ఇవ్వు అని అడగగా (ఈమెను అతిక్రమించనని మాట ఇస్తున్నాను) "నాతిచరామి" అని మూడుసార్లు అల్లుడు అంటాడు.
సమీక్షణం:- వధూవరుల చేతిలో జీలకర్రబెల్లమును మెత్తగా నూరి ఉండచేసి సిద్ధంగా వుంచుతారు. మంగళవాద్యాలు మ్రోగుతుండగా వేదమంత్రాలు పురోహితులు పఠిస్తుండగా దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహుర్తాన వరుడు ఇష్టదైవమును ధ్యానిస్తూ వధువు నడినెత్తిన బ్రహ్మరంద్రంపైన, వధువుకూడా అదే సమయమున తన ఇష్టదైవంను ధ్యానిస్తూ వరుని నడినెత్తిన బ్రహ్మరంద్రంపై పెట్టగ నెమ్మదిగా తెరతొలగిస్తున్న ఆ సుమూహర్త సమయమున వధూవరులు ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడమే సమీక్షణం. జీలకర్రబెల్లమును ఒకరితలపై ఒకరుపెట్టుకోవడంద్వారా ఒకరుమస్తాకాన్ని ఒకరు స్పృశిస్తారు. తద్వారా హస్తమస్తక సంయోగామన్న యోగక్రియ సిద్ధిస్తుంది. జీలకర్రబెల్లం ఈ రెండింటి సంయోగంవలన ఒక ధనసంజ్ఞక విద్యుత్తుశక్తి జనిస్తుంది. హస్తమస్తకసంయోగం వలన ఒకరిలోని విద్యుత్తు ఒకరిలోనికి ప్రసరించి ఇరువురి మనస్సులను ఏకంచేస్తుంది. అందుకే ఆ శుభసమయమున ఒకరి కనుబొమ్మల మద్యభాగాన్ని ఒకరు చూసుకోవడంవలన వధూవరులకిద్దరకు ఒకరిపై ఒకరికి స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరిగి ఏకత్వభావన జీవితాంతం దృఢపడివుంటుందన్నది వేదప్రమాణం. శుభక్షణాల్లో కలిసిన అనురాగామయమైన ఆ దృష్టి వారిమధ్య మానసిక అనుబంధాన్ని క్షణక్షణమునకు పెంచి చక్కటి అన్యోన్య దాంపత్యానికి నాంది కాబట్టి ఆ సమయంలో ఒకరినొకరు చూసుకోవడంలో ఏమరిపాటు పనికిరాదు. ఈ ముఖ్యవిషయంను, దీనియొక్క అద్భుతఫలితంను పెద్దలు వధూవరులకు ముందుగానే తెలిపి వారిని సంసిద్ధులు చేయవలెను
సశేషం
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ద్వాదశి - మఘా - ఇందు వాసరే* (30.03.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
---------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
వాల్మీకి రామాయణం - 20)
శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 20)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(29-3-'26 పోష్టు తరువాయి భాగము)
పరశురాముడు, దశరథరాముడితో ఇంకా ఇలా అన్నాడు.
ఒకానొకప్పుడు దేవతలందరు శివ, విష్ణువుల బలాబలములను గురించి బ్రహ్మదేవుని అడుగగా ,
అతడు, శివ విష్ణువులకు మిథ్యావైరము కల్పించెను.
అంతట పరస్పర జయాభిలాషులైన శివుడు, విష్ణువుల మధ్య భయంకరమైన పోరాటము జరిగెను.
శ్లో // తదా తు జృంభితం శైవం ధనుర్భీమ పరాక్రమమ్ /
హుం కారేణ మహాదేవః స్తంభితో ౽ థ త్రిలోచనః //
( అప్పుడు విష్ణువు ' హుం ' కారము చేయగా భయంకరమైన పరాక్రమము గల శివధనస్సు జృంభితం = ఆవులించినది, అనగా జడప్రాయమైనది.
త్రిలోచనుడైన శివుడు కూడా, స్తంభితః = కదలలేక పోయెను)
శివుడు తెప్పరిల్లి తిరిగి యుద్ధసన్నద్ధుడవగా దేవతలు ప్రళయం సంభవిస్తుందని భయపడి శివ, విష్ణువు లిరువురిని ప్రార్థించి శాంతింపజేసిరి.
శ్లో// దేవైస్తదా సమాగమ్య సర్షిసంఘైః సచారణైః /
యాచితౌ ప్రశమం తత్ర జగ్మతుస్తౌ సురోత్తమౌ //
(అప్పుడు దేవతలు, ఋషులు, చారణులు, వచ్చి ప్రార్థింపగా ఆ దేవతాశ్రేష్ఠులైన శివ విష్ణువులు శాంతించిరి)
విష్ణువు యొక్క ' హుం ' కారమునకు శివధనస్సు జడమై పోవుటవలన దేవతలు, విష్ణువు అధికుడని భావించిరి.
యుద్ధంలో జడత్వం పొందినందుకు కోపించినవాడై, శివుడు ఆ ధనస్సును బాణసహితంగా విదేహవంశములోని 'దేవరాతు'నికి ఇచ్చివేసెను.
విష్ణువు కూడా తన ధనస్సును భృగువంశీయుడైన ఋచీక మహర్షికి న్యాసముగా ఇచ్చెను.
ఋచీకుడు ఆ ధనస్సును తన కుమారుడైన జమదగ్ని మహర్షికి ఇచ్చెను.
నా తండ్రియైన జమదగ్ని నుండి ఆ ధనస్సు నాకు సంక్రమించినది.
క్షత్రియ జాతికి చెందిన కార్తవీర్యార్జునుని పుత్రులు, తపోబలసంపన్నుడైన నా తండ్రి అస్త్రసంన్యాసము చేసి తపమొనర్చుచుండగా అతనిని చాలా దారుణంగా, శిరస్సు ఖండించి చంపివేసిరి.
దానికి ప్రతీకారంగా నేను వారందరినిసంహరించాను.
అంతేకాదు,పుట్టిన ప్రతి క్షత్రియుడిని కూడా సంహరించాను.
ఈ భూమినంతా కశ్యపునకు దానమిచ్చి, మహేంద్ర పర్వతముమీద నివసిస్తున్నాను.
నీవు చేసిన శివ ధనుర్భంగం గురించి విని నీతో ద్వందయుద్ధం చేయడానికి ఇప్పుడు వచ్చాను.
క్షత్రియ ధర్మాన్ని అనుసరించి, నీవు ఈ వైష్ణవ ధనస్సును స్వీకరించి ఎక్కుపెట్టు.
నీవు అలా ఎక్కుపెట్టగలిగితే నీతో ద్వందయుద్ధం చేస్తాను" అన్నాడు పరశురాముడు.
శ్రీరాముడు, సహజముగా మితభాషి.
మహారాజు,తండ్రి, అయిన దశరథుడు దగ్గర వుండుటచే, ఆయనమీద ఉన్న గౌరవముతో ఇంకా మితముగా మాట్లాడుతూ, పరశురామునితో ఇలా అన్నాడు.
శ్లో// శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ/
అనురుంధ్యామహే బ్రహ్మన్ పితురానృణ్యమాస్థితమ్//
(ఓ భార్గవా!నీవు చేసిన పనులను వింటిమి. తండ్రి విషయమున స్వధర్మము నిర్వహించి ఋణవిముక్తుడవైన నిన్ను అభినందించుచున్నాము).
(సాటి క్షత్రియజాతిని నాశనం చేసినందుకు,పరశురాముని మీద రామునకు కోపం రాలేదు సరికదా!తన ధర్మం తాను నిర్వహించినందుకు, ఆయనను అభినందిస్తున్నాడు రాముడు.
ధర్మం ముందు స్వ, పర, పక్షపాత బుద్ధి ఉండకూడదు.
" రామో విగ్రహవాన్ ధర్మః " అనే నానుడికి ఈ శ్లోకం ఒక చక్కటి ఉదాహరణ).
రాముడు ఇంకా ఇలా అన్నాడు.
"నన్ను క్షత్రియధర్మం పాటించగల సమర్ధత లేనివానిగాను,పరాక్రమం లేని వానిగాను,భావిస్తూ నీవు నన్ను అవమానిస్తున్నావు".
శ్లో// ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనమ్/
శరంచ ప్రతి జగ్రాహ హస్తాల్లఘు పరాక్రమ://
(ఇట్లు పలికి రాముడు శీఘ్రమైన పరాక్రమముతో,పరశురాముని చేతిలోనుండి
ఆ విష్ణుధనస్సును, బాణమును గ్రహించెను).
(సశేషం)
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
30-3-'26
ఆర్యా శతకం - 1*
*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 66*
*దగ్ధషడద్వారణ్యం దరదలితకుసుంభసంభృతారుణ్యమ్।*
*కలయే నవతారుణ్యం కంపాతటసీమ్ని కిమపి కారుణ్యమ్||*
*భావము :*
*సకల జగము నామము, రూపము కలది. అనేక మార్గములలో దట్టమైన అరణ్యము వలె ప్రబలి ఉన్నది. అటువంటి అరణ్యమును దగ్ధం చేయడానికి అమ్మ అగ్ని నేత్రమునుండి వెలువడే ఒక్క అగ్ని కణము చాలు. కుసుంభా పుష్పమువలె రక్తవర్ణముతో యౌవనవతియై, వెలసివున్న దయాసముద్రురాలిని ధ్యానిస్తాను.*
🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
భగవద్గీత
-------------------- భగవద్గీత. -------------------
తృతీయోధ్యాయ: కర్మ యోగము.
యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ ।
సర్వజ్ఞాన విమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః ।। 32 ।।
ప్రతిపదార్థ:
యే — ఎవరైతే; తు — కానీ; ఎతత్ — ఈ యొక్క; అభ్యసూయంతః — లేని దోషాలు వెతుకుతూ; న, అనుతిష్ఠంతి — పాటించరో ; మే — నా యొక్క; మతం — ఉపదేశము; సర్వ-జ్ఞాన — అన్ని రకాల జ్ఞానం లో; విమూఢాన్ — భ్రాంతి నొంది; తాన్ — వారు; విద్ధి — తెలుసుకుంటారు; నష్టాన్ — భ్రష్టులైన వారు; అచేతసః — విచక్షణా జ్ఞానం లేని వారు.
తాత్పర్యము :
కానీ, జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి, నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు, ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యముచేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు.
వివరణ:
శ్రీ కృష్ణుడు చెప్పిన ఉపదేశం మన శాశ్వతమైన సంక్షేమం కోసం మంచిది. కానీ, మన ప్రాపంచిక బుద్ధి అసంఖ్యాకమైన దోషాలతో ఉంది, కాబట్టి ఆయన ఉపదేశ ఔన్నత్యాన్ని కానీ, దాని ప్రయోజనాన్ని కానీ అన్నిసార్లూ అర్థం చేసుకోలేదు. అలా అర్థం చేసుకోగలిగితే, అత్యల్ప జీవాత్మలమైన మనకు, మహోన్నత దివ్య పరమాత్మకు ఉన్న తేడా ఏముంటుంది? అందుకే, భగవద్గీత యొక్క దివ్య ఉపదేశాన్ని అర్థం చేసుకోవటానికి నమ్మకం/విశ్వాసం అనేవి చాలా అవసరం. ఎక్కడైతే మన బుద్ధి అర్థం చేసుకోలేదో, అక్కడ ఉపదేశంలో రంధ్రాన్వేషణ (తప్పులు వెతుకుట) చేసే బదులుగా, మన బుద్ధిని సమర్పించాలి. ‘శ్రీ కృష్ణుడు అంతటి వాడు చెప్పాడే, అయితే అది తప్పకుండా సత్యమే అయిఉంటుంది, నేను ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ప్రస్తుతానికి దీనిని ఒప్పుకొని, ఆధ్యాత్మిక సాధన చేస్తా. సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించిన తరువాత భవిష్యత్తులో నేను అర్థం చెసుకోగలను’; అన్న దృక్పథమే శ్రద్ధ లేదా విశ్వాసం అనబడుతుంది.
జగద్గురు శంకరాచార్య, శ్రద్ధ అంటే ఇలా నిర్వచించారు : గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాసః శ్రద్ధా, ‘గురువు మరియు శాస్త్రముల మాటల్లో గట్టి నమ్మకమే శ్రద్ధ.’ చైతన్య మహాప్రభు ఇలాగే వివరించాడు : శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయ (చైతన్య చరితామృతము, మధ్య లీల, 2.62) ‘ప్రస్తుతానికి మనం వారి ఉపదేశం అర్థం చేసుకోలేకపోయినా, గురువు, దైవము పట్ల బలమైన నమ్మకమే, శ్రద్ధ.’ బ్రిటిష్ కవి అల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇలా అన్నాడు : ‘నిరూపించలేనప్పుడు, విశ్వాసము ద్వారానే నమ్మకాన్ని అలవరచుకో’. కాబట్టి, శ్రద్ధ అంటే భగవద్గీతలో అర్థమయ్యే భాగాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి అవగతం చేసుకోవటమే కాక, నిగూఢమైన అర్థం కాని భాగాలని, భవిష్యత్తులో అర్థమవుతాయి అని ఆశిస్తూ, నమ్మకంతో విశ్వశించటమే.
కానీ, అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం. ఈ అహంకారం వలన, దేనినైతే బుద్ధి ఇప్పుడు అర్థం చేసుకోలేదో, దానిని తప్పు అని తిరస్కరిస్తుంది. శ్రీ కృష్ణుడి ఉపదేశాలు, జీవాత్మల సంక్షేమం కోసం సర్వజ్ఞుడైన భగవంతుని ద్వారానే చెప్పబడినప్పటికీ, జనులు దానిలో తప్పులు పడుతుంటారు, ఉదాహరణకి ‘దేవుడు ఎందుకు అన్నీ తనకే సమర్పితం చేయమని అడుగుతున్నాడు? ఆయన దురాశ కలవాడా? అహంకారి ఏమో, అర్జునుడిని తననే పూజించమంటున్నాడు?’ ఇలాంటి వారిని శ్రీ కృష్ణుడు 'అచేతసః' అంటే ‘విచక్షణా జ్ఞానం లేని వారు’ అంటున్నాడు, ఎందుకంటే వారికి – ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది; మంచేదో, చెడేదో; ధర్మానికి, అధర్మానికి; సృష్టికర్తకి, సృష్టింపబడిన వానికి; సర్వోన్నత యజమానికి, సేవకునికీ; తేడా తెలియదు. అలాంటి వారు ‘తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు’, ఎందుకంటే వారు శాశ్వతమైన మోక్ష మార్గాన్ని తిరస్కరించి, జనన-మరణ చక్రంలో పడి తిరుగుతుంటారు.
29, మార్చి 2026, ఆదివారం
अस्य अद्भुतस्य
अस्य अद्भुतस्य जगतः सृष्टिकारकाः ये केऽपि स्युः, तेषां प्रति “पाहि पाहि पाहि” इति शतकोटि-साष्टाङ्ग-प्रणामाः।
आदित्यसहितान् अनेकान् ग्रहान् स्वस्वगतिषु स्थापयित्वा ऋतून् निर्माय, जीवचैतन्यस्य कारणभूतायै अस्यै अद्भुतायै सृष्टये ये कर्तारः, तेषां अभिनन्दनानि। अस्याः विचित्रायाः जीवसृष्टेः कारणभूतेभ्यः नमः।
यदा वयं मानवाः किञ्चित् नवीनं वस्तु निर्मामः अथवा किञ्चित् आविष्करोमः, तदा अस्मान् सहाययति मेधा। तादृशीं चराचरसृष्टेः मूलकारणभूतां यां मेधां धारयति यः, तस्मै पुष्पाञ्जलिः।
ऋषीणां वचनानि वेदवाक्यानि इति मन्यमानाः, अस्य सृष्टेः कारणभूतं श्रीमान् नारायणं प्रति शतकोटि-साष्टाङ्ग-प्रणामान् समर्पयामि।
श्रीमन्नारायणः त्रिमूर्तिरूपेण—ब्रह्म-विष्णु-महेश्वररूपेण—अस्य जगतः सञ्चालनं करोति इति ऋषयः उद्घोषितवन्तः।
तेषां ऋषीणां वचनानि शतधा सहस्रधा विश्वसन्, श्रीमन्नारायणनाम निरन्तरं जपन् तपश्चरन्, अस्मिन् अखण्डे जगति भगवतः एकांशस्वरूपः अणुरूपः आत्मा शरीरधारी सन्, अनेकैः व्यर्थकर्मभिः बद्धः, पुनरपि जननं पुनरपि मरणं च अनुभूय, मोक्षं न प्राप्नोमि।
मोक्षं न कामये; किन्तु व्यर्थरहितकर्मयुक्तं जीवनं मे प्रददातु, तथा अन्ते मोक्षप्राप्तिं ददातु इति तव पादयोः पतित्वा प्रार्थये।
सर्वे जना: सुखिनो भवन्तु।
लोकाः समस्ताः सुखिनो भवन्तु।
विश्वे जनाः सुखिनो भवन्तु।
समस्तसन्मङ्गलानि भवन्तु॥
