1, జూన్ 2026, సోమవారం

పంచాంగము

 


సుందరకాండ


          

   *సుందరకాండ-హనుమ*                               

            *9వ భాగం*


*నమోస్తు రామాయ సలక్ష్మణాయ*

*దేవ్యైచ తస్యై జనకాత్మజాయై*

*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో*

*నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః*

************************

*ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలన్నా, సభాపూజ్యత పొందాలన్నా, నలుగురికి మార్గదర్శకునికిగా నిలవాలన్నా, తన జీవిత గమ్యం చేరుకోవాలన్నా, ధృతి, దృష్టి, మతి మరియు దాక్ష్యం అనబడే ఈ నాలుగు లక్షణాలు ఖచ్చితంగా వుండి తీరాలి. 

ఈ లక్షణములు లేని వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తన గమ్యాన్ని చేరుకోలేరు.


*వాల్మీకి అందించిన రామాయణ శ్లోకాలలో, రచించిన శైలిలో అంతకన్నా గొప్పగా శీలం వైభవాన్ని ఆవిష్కరించగలిగిన మహర్షులు మరొకరు లేరు అన్నది వాస్తవం. 

మాట చెప్పడమే కాకుండా కధాభాగంలో ఆ శ్లోకాలను అన్వయం చేసి చూపించగలిగే నేర్పరితనం వాల్మీకి మహర్షికే చెల్లును. రామాయణం కల్పిత గాధ కాదు యదార్థ గాధను చెబుతూ ఈ లక్షణాలు మానవులకు ఎంతో అవసరమని తీర్పు చెబుతారు మహర్షి. ఒక జరిగిన కధ రచన చేస్తున్నప్పుడు ఆ సన్నివేశాలో ఆయా వ్యక్తుల మనసులో వున్నటువంటి ఆలోచనలను చెదరనీయకుండా ఆవిష్కరించారు మహర్షి. శ్రీరామచంద్రుని ఏకపత్నీ వ్రతం, సీతమ్మతల్లి పాతివ్రత్యం, హనుమ యొక్క స్వామిభక్తి మొదలగు అంశాలను అత్యంత వైభవంగా అందించారు మహర్షి.


*సాగర లంఘనం సామాన్యమైన విషయం కాదు, దానవులతో  సర్పములతో నిండివుంటుంది. భయంకరంగా ఘోషిస్తున్న తరంగాలతో వుంటుంది. అటువంటి క్లిష్టమైన కష్టమైన అవరోధాలను వివేకవంతుడై, ప్రజ్ఞావంతుడై దాటుకొని వచ్చారు స్వామి హనుమ. లంబపర్వతంపై దిగిన హనుమ లంకా వైభవాన్ని పరికిస్తున్నారు. త్రికూట పర్వతం మధ్య ఆకాశంలో వేలాడుతున్నట్టుగా వుంది లంకా నగరం, అంత సౌందర్యంగా నిర్మించారు విశ్వకర్మ. బంగారంతో మెరిసిపోతోంది లంక. ఇక్కడ వాల్మీకి మహర్షి హనుమకు లంకను చూడగానే ఎటువంటి భావనలు కలిగాయో ఆ భావాలను చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా పొందిన వరప్రసాదంతో, హనుమ దృష్టికి కనిపించిన లంకను ఆవిష్కరించారు.


*కాంచన లంక హనుమకు దేవేంద్రుని అమరావతి నగరంలా కనిపించింది, సర్వం స్వర్ణమయమై దేదీప్యమానంగా వెలుగుతోంది లంకానగరం. అమరావతి నగరాన్ని పోలిన లంకానగరం యొక్క సౌందర్యాన్ని చూసి ఆకర్షితుడై నిశ్చేష్టులై నిలిచిపోలేదు హనుమ, తను వచ్చిన కార్యాన్ని మరిచిపోలేదు. ఎంతటి సౌందర్యాన్ని చూసినా ఎటువంటి ఆటంకాలు ఎదురైనా తన గమ్యాన్ని మరువలేదు హనుమ.


*ఇక సీతమ్మ తల్లి, రావణుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఐశ్వర్యాన్ని చూపి ఆశ కల్పించి ప్రయత్నించినా తలొగ్గని మహాపతివ్రతా సౌందర్యం సీతమ్మ తల్లిది. ఇన్ని సౌందర్యాలు కలబోసిన కాండ సుందరకాండ.


*లంకా నగరం త్రికూటమనే పర్వతంపై వుంది. లంక అంటే మన శరీరం, ఆ లంకలోనే వుంది బ్రహ్మవిద్యాస్వరూపిణి, ఆదిపరాశక్తి, లోకపావని, ఆవిడకు మరొక పేరు త్రిపురసుందరి, ఈశ్వరుడు త్రిపురాంతకుడు, వీరిరువు ఆదిదంపతులు. ఇక త్రికూటమనగా జాగ్రత్, స్వప్నము, సుషుప్తి అవస్థలు.  మనిషి యొక్క మనసు నిరంతరము ఈ మూడు అవస్థలయందు సంచరిస్తూ వుంటుంది, లంకను నిత్యం కెరటములు వచ్చి తాకుతూ వుంటాయి ఆకలి, దప్పిక, శోకము మోహము, మరణము ఇవి కెరటముల రూపములలో మనసుని నిత్యం తాకుతూ వుంటాయి. ఈ అవస్థలను దాటి, లంకయనబడే ఈ శరీరములో అంతర్ముఖ ప్రయాణం చేస్తూ ఆదిపరాశక్తిని చేరుకోవాలి. ఇదే మానవ జీవిత పరమార్థమని గ్రహించాలి. మానవుడు సంసారమనే సాగరంలో సవ్యంగా ప్రవర్తించి, లంక అనబడే శరీరంలో ప్రయాణిస్తూ అరిషడ్వర్గాలను దాటి, త్రికూటమనే మూడు అవస్థలను దాటి తనలోనే అంతర్లీనమై క్రీడిస్తున్న త్రిపురసుందరీ మాతను చేరుకోవడం, అనగా మోక్షాన్ని పొందగలగడం. తన జీవిత గమ్యంలో తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ వైరాగ్యమును పొంది భగవంతుని సన్నిధి పొందడం కోసం నిత్య సాధన చేసే సాధకులకు, ఉపాసకులకు మాత్రమే ఇది సాధ్యమని గ్రహించాలి.```


             *(సశేషం)*``

             *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏


పంచాంగం 01.06.2026 Monday,

 ఈ రోజు పంచాంగం 01.06.2026 Monday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధికజ్యేష్ఠ మాస కృష్ణ పక్ష ప్రతిపత్తి తిథి ఇందు వాసర జ్యేష్ఠ నక్షత్రం సిద్ధ యోగః కౌలవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: ప్రతిపత్తి 


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప ।

సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ।। 33 ।।


ప్రతిపదార్థ:


శ్రేయాన్ — శ్రేష్ఠమైనది; ద్రవ్య-మయాత్ — భౌతిక సంపత్తి/ద్రవ్యములతో కూడిన; యజ్ఞాత్ — యజ్ఞము కంటెను; జ్ఞాన-యజ్ఞః — జ్ఞానముతో ఆచరింపబడే యజ్ఞము; పరంతప — శత్రువులను జయించేవాడా, అర్జునా; సర్వం — అన్నీ; కర్మ — పనులు; అఖిలం — సమస్త; పార్థ — అర్జునా, ప్రిథ పుతృడా; జ్ఞానే — జ్ఞానములో; పరిసమాప్యతే — పరిసమాప్తమగును.



 తాత్పర్యము : 


 ఓ శత్రువులను లోబరుచుకొనే వాడా, యాంత్రికముగా ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞము ఏంతో శ్రేష్ఠమైనది. ఏదేమైనా, ఓ పార్థ, అన్ని యజ్ఞ కర్మలు జ్ఞానమునందే పరిసమాప్తమగును.



వివరణ:



శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, ఇంతకు క్రితం వివరింపబడిన యజ్ఞములను సరియైన దృక్పథంలో పెడుతున్నాడు. శారీరకమైన భక్తి యుక్త కర్మలు చేయటం మంచిదే అయినా అవి సరిపోవు అని అర్జునుడుకి చెప్తున్నాడు. పూజాది క్రియలు, ఉపవాసాలు, మంత్ర జపాలు, తీర్థ యాత్రలు, ఇవన్నీమంచివే, కానీ వాటిని జ్ఞాన యుక్తంగా చేయకపోతే, అవి కేవలం భౌతికమైన క్రియలుగా మిగిలిపోతాయి. ఏమీ చేయకపోవటం కన్నా ఇటువంటి యాంత్రికమైన పనులు మంచివే కానీ మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి అవి సరిపోవు.


చాలా మంది జనులు భగవన్నామాన్ని పూసలమీద జపిస్తుంటారు, శాస్త్రాలు వల్లెవేస్తుంటారు, పవిత్ర ధామాలని సందర్శిస్తుంటారు మరియు పూజాది కార్యక్రమాలు చేస్తుంటారు; ఇటువంటి భౌతిక/శారీరక క్రియల తోనే భౌతిక బంధాలనుండి విముక్తి లభిస్తుందనే విశ్వాసంతో ఇవన్నీ చేస్తుంటారు. కానీ, సంత్ కబీర్ ఈ భావాన్ని నిర్ద్వందంగా త్రోసిపుచ్చాడు.


మాలా ఫేరత యుగ ఫిరా, ఫిరా న మన కా ఫేర్

కర్ కా మనకా డారి కే, మనకా మనకా ఫేర్


‘ఓ ఆధ్యాత్మిక సాధకుడా, నీవు జప మాలలు చాలా కాలం నుండి తిప్పుతున్నావు, కానీ మనస్సు యొక్క చాంపాల్యం తరగలేదు. ఇక ఇప్పుడు ఆ పూసలు పక్కన పెట్టి మనస్సు యొక్క పూసలు తిప్పు.” జగద్గురు కృపాలు జీ మహారాజ్ ఇలా అన్నారు:


బంధన్ ఔర్ మోక్ష్ కా, కారణ్ మన హి బఖాన్

యాతే కౌనిఉ భక్తి కరు, కరు మన్ తే హరిధ్యాన్ (భక్తి శతకం, 19వ శ్లోకం)


‘మోక్షానికి, కర్మ బంధనానికి కారణం మనస్సు మాత్రమే. ఏ విధమైన భక్తి చేసినా, నీ మనస్సుని మాత్రం భగవంతుని యందే లగ్నం చేయుము.’


జ్ఞాన సముపార్జనతో భక్తి పూర్వక భావాలు పెంపొందుతాయి. ఉదాహరణకి, మీ పుట్టిన రోజు వేడుక జరుగుతోందనుకోండి, మరియు అతిధులు వచ్చి మీకు బహుమతులు ఇస్తున్నారనుకోండి. ఎవరో వచ్చి మీకు ఒక పాత సంచి ఇచ్చారు. మీకు వచ్చిన ఇతర గొప్ప బహుమతులతో పోల్చితే, ఇదేదో పనికిమాలినదే అనుకోని దాని వైపు చిరాగ్గా చూస్తారు. ఆ వ్యక్తి మిమ్ములను ఆ సంచిలో చూడమన్నాడు. మీరు సంచి తెరిస్తే దానిలో రూ.2000 నోట్లు ఒక వంద ఉన్నాయి. మీరు వెంటనే ఆ సంచిని హత్తుకుని ‘అబ్బా, ఇదే నాకొచ్చిన అత్యుత్తమ బహుమానం!’ అనుకుంటారు. ఆ సంచిలో ఉన్నవి ఏమిటో అన్న జ్ఞానం, ఆ సంచి అంటే ప్రేమని పెంపొందించింది. ఇదే విధంగా, భగవంతునిపై మరియు ఆయనతో మనకున్న సంబంధంపై జ్ఞానం పెంపొందించు కోవటం వలన మన భక్తి భావన వృద్ధిచెందుతుంది. కాబట్టి, జ్ఞానంతో కూడిన యజ్ఞముల ఆచరణ అనేది భౌతిక వస్తువులతో కూడిన యాంత్రికమైన యజ్ఞము కంటే ఉన్నతమైనదని శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇక ఇప్పుడు జ్ఞాన సముపార్జన పద్ధతిని వివరిస్తున్నాడు.

01-06-2026 సోమవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యో నమః 🙏

01-06-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


అందరిలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.  

--------------------------------------- 


వృషభం


మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన ఋణయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. పనులలో శ్రమ తప్పదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. 

---------------------------------------


మిధునం


కొన్ని పనులు వాయిదా వేస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఉద్యోగమున అధికారులతో వ్యతిరేకత పెరుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. 

---------------------------------------


సింహం


  01-06-2026


ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు ఆశించిన మేరకు రాణిస్తాయి. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

---------------------------------------


కన్య


ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------


తుల


చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేస్తారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం అందదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.  

---------------------------------------


వృశ్చికం


గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

---------------------------------------


ధనస్సు


ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. నూతన ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు పరుస్తాయి.

---------------------------------------


మకరం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కుంభం


ఒక విషయంలో బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవచింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------


మీనం


ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

---------------------------------------

నరసయ్య మంత్ర మహిమ

  పాముల_నర్సయ్యగారు !

మంత్రాలకు చింతకాయలు రాలతాయా?అని ప్రశ్నించే వారికి సమాధానం పాముల నర్సయ్య గారి జీవితం. ఎందుకంటే దైవత్వం మూర్తీభవించిన పాముల నర్సయ్య గారి నోటి నుంచి వచ్చే మంత్రం విషానికి విరుగుడుగా మారింది అంటే అతిశయోక్తి కాదు. కేవలం దైవానుగ్రహం తో ప్రసాదించబడిన ఆ మంత్రం ఆనాటి కాలంలో పాము కాటుకు గురైన ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించింది. దైవశక్తి గల ఆ మంత్రం ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు ఎలాంటి కాలకూట విషానికైనా విరుగుడు లభించినట్లే. దైవానుగ్రహంతో తన మాటనే మంత్రం గా మలచుకున్న కారణజన్ముడు పాముల నర్సయ్య ‌.

నరసయ్య మంత్ర మహిమ...

పాముల నర్సయ్య గారు విశాఖపట్టణం ప్రాంతానికి చెందిన వారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు..చెరుకుమిల్లి వెంకట నరసింహారావు అనేది తల్లిదండ్రులు పెట్టిన పేరు. కానీ మంత్రశక్తి ఆయనను పాముల నర్సయ్యగా మార్చేసింది. చిన్న వయసులో ఒకసారి కాశీ వెళ్లారు.అక్కడ గంగానదిలో స్నానం చేస్తుండగా అదే సమయంలో ఆనాటి శృంగేరి పీఠాధిపతి కూడా అక్కడికి రావడం జరిగింది.ఆ శృంగేరీ పీఠాధిపతి నర్సయ్యను చూసి, ఇతనిలో ఏదో దివ్యత్వం దాగి ఉంది, ఇతని వల్ల ఒక మహత్కార్యం జరగాల్సి ఉందని గ్రహించి ఆయనకు గారుడీ మంత్రాన్ని ఉపదేశించారు. విషాన్ని హరించే మంత్రం అది. నర్సయ్య ఆ మంత్రాన్ని ఎన్నో ఏళ్ల పాటు భక్తిశ్రద్ధలతో జపించి శక్తిని సాధించారు. ఆ మంత్రశక్తితో ఆయన పాముకాటుకు గురైన ఎంతోమందిని కాపాడారు.

నరసయ్య గారి జీవితానికి ఓ మలుపు...

ఓ బ్రిటిష్ అధికారిని కాపాడటం పాముల నర్సయ్య గారి జీవితానికి ఓ మలుపు గా మారిందని చెప్పవచ్చు. అ మలుపే ఎంతో మందికి ప్రాణదానం జరిగేటట్లు చేసింది. ఒక్కసారి ఓ బ్రిటిష్ అధికారి పాముకాటుకు గురి అయ్యాడు.కొంతమంది చెంచులు పసరు మందు వేసినా ఫలితం కనపడలేదు.శరీరమంతటికీ విషం పాకిపోయింది. ఇక కొద్ది క్షణాల్లో చనిపోతాడు అనగా అటుగా వెళ్తున్న నరసయ్యకు ఈ విషయం తెలిసి ఆ బ్రిటిష్ అధికారి చెవిలో మంత్రాన్ని చెప్పాడు. కాసేపటికి ఆయన ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. రైల్వేలో ఉద్యోగం ఇవ్వడమే కాదు, ఆయన కూర్చున్న చోట ఫోన్ కూడా ఏర్పాటు చేశారు.

ఆ ఫోన్ నెంబరు ఆంధ్రా లోని అన్ని రైల్వే స్టేషన్లో వ్రాయించారు .ఇప్పుడు 108 అంబులెన్స్ నెంబర్ ఎలా ఉందో అలా నర్సయ్య గారి ఫోన్ నెంబరు నాటి జనం నోళ్ళలో నానింది. ఆ నెంబర్కు ఎవరైనా ఫోన్ చేసి పాము కాటుకు గురయ్యారు అని చెబితే చాలు ,నరసయ్యగారు ఆ పాము మంత్రాన్ని పాముకాటుకు గురైన వ్యక్తి చెవిలో చెప్పి విషాన్ని దించేసేవారు. ఇలా కేవలం ఫోన్ ద్వారానే మంత్రం చెప్పి కొన్ని వేలమందిని బతికించారు .కానీ ఏనాడు ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మద్రాసు రైల్వే సూపరింటెండెంట్ గా బదిలీ చేసినా,అక్కడ కూడా ఇదే విధంగా ఫోను ఏర్పాటు చేయడం జరిగింది.

వైద్యం ఎలా చేసేవారంటే...

మంత్రం పనిచేయాలంటే కొంతమంది స్పర్శ ద్వారా చేస్తారు. మరి కొంతమంది తీర్థం ఇచ్చి మంత్రం పని చేసేలా చేస్తారు. కానీ నర్సయ్య గారు ఫోన్ రిసీవర్ తో నయం చేసేవారు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇది వాస్తవం..వైద్యం ఎలా చేసేవారంటే విజయవాడలోని ఓ వ్యక్తికి పాము కరిచినట్లు ఫోన్ వస్తే ఆ ఫోన్ రిసీవర్ ను పాము కరిచిన వ్యక్తి చెవి దగ్గర పెట్టు అనేవారు. నరసయ్య భుజం మీద ఎప్పుడూ గుడ్డ పీలికలు ఉండేవి .దాంట్లోని ఓ పీలికనకు ముడి వేసి ఆ తర్వాత పాము కాటు వేసిన వ్యక్తికి చెవిలో గారుడీ మంత్రాన్ని చెప్పేవారు.. కాసేపు ఆయన కళ్ళు మూసుకొని ఉపా‌సన చేసేవారు .దిగిపోతుందని చెప్పే వరకు ఆయన పాముకాటుకు గురైన వ్యక్తి చెవిలో ఏదో చెబుతుండే వారు . విషం దిగిపోయింది అని చెప్పిన తర్వాత ఆ గుడ్డ పీలికలలో కొంచెం ఇసుక వేసి దానిని చెట్టుకు కట్టివేసేవారు. దాంతో ఆ ప్రక్రియ పూర్తయినట్లు. ఇలా కొన్ని వేలమందిని ఆయన గారుడీ మంత్రంతో బతికించారు.

చేతులెత్తేసిన పరిశోధకులు...

నరసయ్య మంత్ర మహిమ ను గుర్తించి ఎన్నో దేశాల వారు ఆహ్వానాలు పంపారు .అదే సందర్భంలో ఈయన మంత్రం పై పరిశోధనలు సైతం జరిగాయి .నరసయ్య గారు తన జీవిత కాలంలో 22 సార్లు జర్మనీ వెళ్లారు .అలాగే 12 సార్లు ప్రపంచ పర్యటన చేశారు ఈయన పర్యటించిన దేశాలలో వీరి మంత్రాన్ని ఎన్నో విధాలుగా పరీక్షించారు.

ఓసారి రష్యా వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఈయనకే పాము కాటు వేస్తే బ్రతుకుతాడో లేదో పరీక్షించబోయారు, ఇలాంటి పిచ్చి పనులు చేయ వద్దని చెప్పిన వినలేదు. ఈయన నోట్లో నాభి అనే వేరు ఉండేది. దాని రసాన్ని ఎప్పుడూ పిలుస్తూ ఉండేవారు. ఆ మూలిక విషానికి విరుగుడుగా పని చేసేది. నన్ను పాము కాటు వేస్తే ఆ పాము కే ప్రమాదం అని చెప్పారు. కానీ రష్యన్లు ఈయన మాట వినకుండా ,ఎవరితోనో మాట్లాడుతుంటే చాటుగా భయంకరమైన సర్పంతో వేయించారు. సరిగ్గా ఎనిమిది నిమిషాలు అయ్యే సరికి ఆ సర్పం చనిపోయింది . పాము చనిపోయిన విషయం తెలుసుకుని నరసయ్య గారు ఎంతో బాధ పడ్డారు. ఎందుకంటే వీరికి పాములంటే ఎంతో ఇష్టం .ఎవరైనా పాములను చంపితే ఊరుకునేవారు కాదు.


 అచంచలమైన దైవ భక్తితో మంత్ర అనుష్టానంతో నరసయ్య గారు ఎందరినో ప్రాణహాని నుంచి కాపాడగలిగారు...    సనాతన ధర్మం🙏🚩

మూడు జల్లెడ్ల పరీక్ష*

  *_నేటి మాట_*

        *మూడు జల్లెడ్ల పరీక్ష*

ఇది నిత్య జీవితంలో అందరికీ అవసరమే, ఒకసారి పరిశీలించండి!!

ఒక సారి చాణిక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను” అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి “నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను *మూడు జల్లెడ్ల పరీక్ష*  (Triple Filter Test)” అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.


మొదటి జల్లెడ *నిజం* – “నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?” అని అడిగాడు.


అందుకు ఆ స్నేహితుడు “లేదు, ఎవరో అంటుండగా విన్నాను” అని అన్నాడు.

“అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట” అని చాణిక్యుడు అన్నాడు.


సరే రెండో జల్లెడ *మంచి*– ” నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?” అని అడిగాడు చాణిక్యుడు,


“కాదు” అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .


“అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం”అన్నాడు చాణిక్యుడు.


మూడో జల్లెడ *ఉపయోగం*– “నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? ” అని చాణిక్యుడు అడిగాడు.


“లేదు” అన్నాడు ఆ మిత్రుడు.


“అయితే నీవు చెప్పబోయే విషయం *నిజమైనది* *మంచిది*, *ఉపయోగకరమైనది* కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?” అని అన్నాడు చాణిక్యుడు


👌 *నీతి* : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.


బంధాలకు విలువ తెలిసిన వారికి మాత్రమే  ఈకథ!


         *_🔅శుభమస్తు🔅_*

🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

సర్వం ఖల్విదం బ్రహ్మ

  💐💐💐💐💐💐

🌺 *అశబ్దము – అస్పర్శము – అరూపము : ఉపనిషత్తులు బోధించిన బ్రహ్మస్వరూప రహస్యం* 🌺

💐💐💐💐💐💐

*ఈ శీర్షికలో కఠోపనిషత్తు మంత్రంలోని ప్రధాన పదాలు, ఉపనిషత్తుల బోధ, వివేకచూడామణితో ఉన్న అనుసంధానం — అన్నీ సమగ్రంగా ప్రతిఫలిస్తాయి.*

💐💐💐💐💐💐

ఉపనిషత్తులు బ్రహ్మస్వరూపాన్ని వివరిస్తూ "ఇది కాదు, అది కాదు" అనే విధానాన్ని అనుసరిస్తాయి. అందులో భాగంగా కఠోపనిషత్ ఈ మంత్రంలో బ్రహ్మాన్ని ఇంద్రియాలకు అతీతమైనదిగా వర్ణిస్తుంది.


*బ్రహ్మము అశబ్దము – అస్పర్శము – అరూపము*


> अशब्दम् अस्पर्शम् अरूपम् अव्ययं

> तथारसं नित्यमगन्धवच्च यत् ।

> अनाद्यनन्तं महतः परं ध्रुवं

निचाय्य तन्मृत्युमुखात् प्रमुच्यते ॥


— *కఠోపనిషత్ 1.3.15*


*భావము*


*బ్రహ్మము అశబ్దము* — చెవులతో వినగలిగే శబ్దం కాదు.


*బ్రహ్మము అస్పర్శము* — చేతులతో తాకగలిగేది కాదు.


*బ్రహ్మము అరూపము* — కళ్లతో చూడగలిగే ఆకారం కాదు.


*బ్రహ్మము అరసము* — నాలుకతో రుచి చూడగలిగేది కాదు.


*బ్రహ్మము అగంధము* — ముక్కుతో వాసన చూడగలిగేది కాదు.


అంటే *బ్రహ్మము పంచ జ్ఞానేంద్రియాలకు గోచరించే వస్తువు కాదు.*


*అయితే బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి?*


అదే ఉపనిషత్తుల ప్రధాన బోధ.


*బ్రహ్మము ఒక వస్తువు కాదు; అది సర్వవస్తువులకు ఆధారమైన చైతన్యం.*


> కన్ను అన్నింటినీ చూస్తుంది; కానీ కన్ను తనను తాను చూడలేదు. అలాగే బ్రహ్మము అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది; కానీ అది ఇంద్రియాలకు విషయంగా కనిపించదు.


అందుకే *కేనోపనిషత్* చెబుతుంది:


> యచ్చక్షుషా న పశ్యతి యేన చక్షూంషి పశ్యతి


> "కన్ను దేనిని చూడలేదో, కానీ దాని వల్లనే కన్ను చూస్తుందో, అదే బ్రహ్మము."


*వివేకచూడామణితో సంబంధం*


*శ్రీ ఆదిశంకరాచార్యులు వివేకచూడామణి 62, 63, 64 శ్లోకాలలో ఇదే విషయాన్ని బోధిస్తున్నారు.*


> బ్రహ్మము గురించి వినడం సరిపోదు.


> బ్రహ్మశబ్దాలను ఉచ్చరించడం సరిపోదు.


*"అహం బ్రహ్మాస్మి"* అని చెప్పడం మాత్రమే సరిపోదు.


ఆ సత్యం అపరోక్షానుభూతిగా ప్రత్యక్షం కావాలి.


*ఔషధం పేరు చెప్పడం వల్ల రోగం పోనట్లే, బ్రహ్మము గురించి మాట్లాడటం వల్ల ముక్తి రాదు. బ్రహ్మస్వరూపం తన స్వరూపమే అని ప్రత్యక్షంగా గ్రహించినప్పుడే ముక్తి సిద్ధిస్తుంది.*


అందుకే వేదాంతంలో ఒక ప్రసిద్ధ వాక్యం ఉంది:


> *బ్రహ్మము తెలిసికొనవలసిన వస్తువు కాదు; తానే బ్రహ్మమని తెలుసుకోవలసిన సత్యము.*


🙏 *సర్వం ఖల్విదం బ్రహ్మ* 🙏

💐💐💐💐💐💐

*Kumara Sharma*

*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*

*జగద్గురు జ్ఞానపీఠం*

*9063939567*

💐💐💐💐💐💐

శ్రీమన్నారాయణీయము

  *శ్రీమన్నారాయణీయము*


*86వ దశకము - సాల్వాదుల వధ - భారత యుద్ధము - 11వ శ్లోకము*


*316. ధర్మౌఘం ధర్మసూనోరభిదధదఖిలం* 

*ఛందమృత్యుస్స భీ‌ష్మః*


*త్వాం పశ్యన్ భక్తిభూమ్నైవ హి సపది యయౌ నిష్కలబ్రహ్మభూయమ్*


*సంయాజ్యాథాశ్వమేధైస్త్రిభిరతిమహితైర్ధర్మజం పూర్ణ కామం*


*సంప్రాప్తో ద్వారకాం త్వం పవనపురపతే ! పాహి మాం సర్వరోగాత్*


*భావము :*

*స్వామీ ! భీష్ముడు తాను కోరుకున్నప్పుడు మరణించేటట్లు తన తండ్రి వలన వరాన్ని పొంది వున్నాడు. అతడు ధర్మరాజునకు అంపశయ్యపై నుండియే అనేక ధర్మాలనెరిగించాడు. ఆతరువాత, పరమాత్మవైన నిన్ను చూస్తూ మిక్కిలి భక్తిచేత స్తుతించి, అతడు నీలో ఐక్యమొందాడు. తరువాత, నీవు ధర్మరాజుచే మహిమాన్వితములైన మూడు అశ్వమేధయాగాలను చేయించి, అతని కోరికలన్నీ తీర్చి, ద్వారకానగరానికి తిరిగివచ్చావు. అటువంటి గురువాయూరు పతీ ! నా రోగాలన్నింటినీ పోగొట్టి నన్ను రక్షించు.*

🙏🙏🙏

వివేకచూడామణి

  *వివేకచూడామణి*


*శ్రీఆదిశంకరాచార్య విరచితము*


*67. యస్త్వయాద్య కృతః ప్రశ్నో వరీయాంఛాస్త్రవిన్మతః*


*సూత్రప్రాయో నిగూఢార్థో జ్ఞ్యాతవ్యశ్చ ముముక్షుభిః*


*పదవిభజన :*

*యః + త్వయా + అద్య - కృతః - ప్రశ్నః + వరీయాన్ + శాస్త్రవిన్మతః - సూత్రప్రాయః + నిగూఢ + అర్థః + జ్ఞాతవ్యః + చ - ముముక్షుభిః*


*భావము :*

*శిష్యా ! నీవు అడిగిన ప్రశ్న ఉత్తమోత్తమమైనది. శాస్త్రపారంగతులచే సూత్రప్రాయమూ, నిగూఢార్థమూ అని కొనియాడబడినది. ముముక్షువులు తప్పక తెలుసుకోదగినది.*


*వివరణ :*

*అద్యః = ఇప్పుడు ; వరీయాన్ = ఎంతో శ్రేష్టమైనది*; 

*శాస్త్రవిన్మతః = మంచి శాస్త్రజ్ఞనము కలవారు మాత్రమే ఈ విధముగా ప్రశ్నించగలరు. శాస్త్ర పారంగతులచే పొగడబడినది ;*

*సూత్రప్రాయః = బంధమోచక సాక్షాత్కారము కలగటానికి ఏమేమి ప్రశ్నించాలో, అది అంతా కొద్దికొద్ది మాటలలో ప్రశ్నించబడినది.*

*నిగూఢార్థో = శబ్దం అల్పాక్షరమైనా, తెలుసుకొన వలసిన విషయమంతా దీనిలో నిగూఢమై ఉన్నదని భావము.*

*ముముక్షుభిః = ముముక్షువులందరూ తెలుసుకోవలసిన మార్గం చూపినవాడవని గురువుచే శ్లాఘింపబడినవాడు.*

*ఈ విధంగా మెచ్చుకుంటే, భక్తిశ్రద్ధలతో నిండిన మనస్సుగలవాడై, చెప్పిన విషయాన్ని శిష్యుడు వెంటనే గ్రహిస్తాడని గురువు యొక్క అభిప్రాయం.*

🙏🙏🙏