16, ఏప్రిల్ 2026, గురువారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 15 ఏప్రిల్ 2026*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           1️⃣9️⃣6️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *196 వ రోజు*                   

*విరాట పర్వము పంచమాశ్వాసము*


*విజయవార్తను విరాటునికి తెలుపుట*```


దక్షిణ గోగ్రహణంలో విజయం సాధించి నగరానికి తిరిగి వచ్చిన విరాటుని ఉత్తర గోగ్రహణం విషయం కలవర పరచింది. భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణాది మహా వీరులతో దండెత్తి వచ్చిన సుయోధనుని ఎదిరించడానికి బృహన్నల సారథ్యంలో వెళ్ళిన ఉత్తరుని తలచుకుని పరితపించాడు. వెంటనే సేనలను ఉత్తరకుమారునికి సహాయంగా వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఉత్తరకుమారుని క్షేమం తెలుసుకుని రమ్మని వార్తాహరులను పొమ్మని ఆజ్ఞాపించాడు. అంతలో అక్కడకు వచ్చిన వార్తా హరులు ఉత్తరకుమారుని విజయవార్త చేరవేసారు. విరాటుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కళ్ళవెంట ఆనంద బాష్పాలు రాలాయి. "ఏమి మన ఉత్తరుడు కుఱుసైన్యాలను గెలిచాడా. వెంటనే నగరమంతా చాటింపు వేయించండి. సువాసినులను, బ్రాహ్మణులను ఉత్తరునికి స్వాగతం చెప్పటానికి పంపండి" అని విరాటుడు ఉత్సాహంగా చెప్పాడు. కంకుభట్టుని చూసి "కంకా! ఈ ఆనంద సమయంలో ఒక ఆట ఆడదామా" అన్నాడు. 


ధర్మరాజు "మహారాజా! తమరు ఆనందంలో ఉన్నారు. నేను ఈ రోజు మీతో ఆడి గెలవగలనా" అన్నాడు. 


విరాటుడు పెద్దగా నవ్వి "సైరంధ్రీ! పాచికలు తీసుకురా" అని అక్కడ ఉన్న ద్రౌపదిని ఆజ్ఞాపించాడు.

```

*విరాటుడు ధర్మరాజు మిదకు పాచికలు విసరుట*```


ఆట ప్రారంభం అయింది విరాటుడు ధర్మరాజుతో "కంకా! అశేషమైన కుఱుసైన్యాలను జయించి నా కుమారుడు మా వంశ ప్రతిష్ఠ కాపాడాడు. అతని బాహుబలం ఎంత గొప్పదో కదా" అన్నాడు. 


ధర్మరాజు "బృహన్నల రథసారధిగా వుండగా విజయము సాధించటము పెద్దవిశేషము కాదు కదా" అన్నాడు. 


విరాటుడు ఆ మాటలకు ఆగ్రహించి 

"కంకుభట్టా! నా కుమారుని విజయాన్ని సందేహిస్తున్నావా? ఇంత వరకు నీవు ఏమి మాట్లాడినా సహించాను ఇక మీదట అలా కాదు" అన్నాడు. 


కాని కంకుభట్టు అంతంటితో వదల లేదు "ఒక్క కౌరవ సేనే కాదు. దేవతలు, రాక్షసులు కలసి వచ్చినా బృహన్నల రధ సారధ్యం వహిస్తుండగా ఉత్తరుని జయించడం ఎవరికీ సాధ్యం కాదు" అన్నాడు. 


విరాటుడు కోపం పట్ట లేక పోయాడు "కంకూ! ఇక చాలు నీవు ఎన్నో వింతలు చెప్పగా విన్నాను. ఒక పేడి అదియూ, సారధి శత్రువులను జయించడమా! నా కుమారుని విజయాన్ని ఎందుకు అంగీకరించవు. ఇక నీ మూర్ఖపు మాటలు కట్టి పెట్టు విప్రుడా" అన్నాడు. 


కాని ధర్మరాజు ఆపకుండా "అవును విరాటరాజా! బృహన్నలకు యుద్ధం చేయాలని ఆశ కలిగి ఉంటుంది. ఉత్తరుని సారధిగా చేసి కౌరవసేనను జయించి గోవులను మరలించాడు. నా మాట అసత్యం కాదు. బృహన్నల విజయ వార్తను నగరంలో చాటించు" అన్నాడు. 


విరాటుడిక ఆగలేక "ఆ పేడిని నా ముందు పొగుడుతావా" అంటూ పాచికలను ధర్మరాజుపై విసిరాడు. 


అందులో ఒక పాచిక ధర్మరాజు నుదిటిపై బడి గాయం చేసింది. ధర్మరాజు అక్కడే నిలబడి ఉన్న ద్రౌపదిని చూసి తల వంచాడు. 


ద్రౌపది వెంటనే పరుగున వచ్చి ధర్మరాజు నుదిటి మీద స్రవిస్తున్న రక్తాన్ని తన పైట కొంగుతో అదిమింది. పక్కనే బంగారు కలశంలో ఉన్న నీటితో తన పైట తడిపి తుడిచింది. 


ఇదిచూసి విరాటుడు "సైరంధ్రీ! అతని రక్తం నేలపై పడకుండా అలా తుడుస్తున్నావేంటి అన్నాడు.


"మహారాజా! ఉన్నత వంశ సంజాతుడైన ఈ బ్రాహ్మణుని రక్తం ఎన్ని చుక్కలు భూమి మీద పడితే అన్ని రోజులు ఈ దేశంలో వర్షాలు పడవు. మన దేశానికి కలుగబోయే కీడుని నివారించడానికే అలా చేసాను” అన్నది సైరంధ్రి.```


               *(సశేషం)*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

               🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 15 ఏప్రిల్ 2026*


         *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *58వ భాగం*``


*శ్రీ అనంత పద్మనాభ వ్రతము*```


వామనావతార కథ చెప్పిన తర్వాత సూత మహాముని శౌనకాదులను చూసి “మునులారా! నారాయణుడు భక్త సులభుడు. తనను నిరంతరం భక్తి శ్రద్థలతో కొలిచే భక్తులను తప్పక ఆదుకుంటాడు. పద్మనాభుడైన నారాయణుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక వ్రతము ఉంది.


అదే అనంత పద్మనాభ స్వామి వ్రతము. ఈ వ్రతము చేసినవారికి ఆయురారోగ్య భోగభాగ్యములు లభిస్తాయి. మరణానంతరం శ్రీహరి సన్నిధి లభిస్తుంది. ఈ వ్రతము భాద్రపద శుద్ద చతుర్దశి నాడు ఆచరిస్తారు. అందువలన ఈ చతుర్దశిని అనంత చతుర్దశి అని, పద్మనాభ చతుర్దశి అని కూడా పిలుస్తారు. దేశీయ, ప్రాంతీయ భేదాలను అనుసరించి వివిధ ప్రాంతాల్లో కదళీ చతుర్థి, అఘోర చతుర్థి అని, పాలీ చతుర్థి అని పిలుస్తుంటారు.


నారాయణునికి ఉన్న అనేక నామాలతో అనంత అనే నామము ఒకటి. అనంతుడు అన్న పదానికి ఆది అంతము లేని వాడని, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడని అర్ధాలు ఉన్నాయి. ఈ అనంత పద్మనాభ వ్రతము కామ్యవ్రతము. అనగా మనం కోరుకున్న కోరికలను ఈ వ్రతము ఆచరించడం ద్వారా నెరవేర్చుకోవచ్చును.


ఈ వ్రతాన్ని త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు ఆచరించ కూడదు. పూర్ణిమ తిథితో కలసి ఉండే చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలి. ఈ వ్రతములో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి.


1. యమునా జల పూజ

2. అనంత పద్మనాభ స్వామి పూజ

3. ప్రతిసర పూజ


ఈ మూడు ప్రధాన ఘట్టాలకు సంబంధించిన కథలు చెబుతాను.


1. యమునానది తీరంలో ముత్రా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో మాధవ శర్మ అనే పండితుడి ఇంటిలో ‘బహుళ’ అనే గోమాత ఉంది. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఆ గోవు యమునానదీ పరిసర ప్రాంతాల్లో గల వనంలో గడ్డి మేస్తుంటే ఒక పులి వచ్చి చంపబోయింది. ‘బహుళ’ ఆ పులికి ‘తన దూడకు పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు తనని చంపి తినమని’ అని వేడుకుంది.


మొదట ఒప్పుకోకపోయినా, ‘బహుళ’ మాటలలోని నిజాయితి, అమ్మదనం చూసి పులి అక్కడే వేచి ఉంటానని, తొందరగా రమ్మని ‘బహుళ’ను వదలి వేసింది. 


‘బహుళ’ ఇంటికి వెళ్లి తన దూడకు కడుపునిండేలా పాలిచ్చి, మంచి బుద్దులు చెప్పి పులి దగ్గరకు తిరిగి వచ్చింది.


ఈ లోపల పులికి ఏనుగుకి పోరాటం జరిగి ఏనుగు చేత గాయపడి పులి చనిపోయే స్థితిలో ఉంది. మాట నిలబెట్టుకుని తిరిగి వచ్చిన ఆవుని చూసిన పులికి అంత్యదశలో పూర్వజన్మ జ్ఞానము కలిగింది. ‘బహుళ’ను చూసి “మాట నిలబెట్టుకుని తిరిగి వచ్చిన నీవు ప్రశంసనీయురాలివి. భాద్రపద శుద్ద చతుర్దశి నాడు సత్య పాలన వలన నీకు శుభము కలిగింది.


ఈ భాద్రపద శుద్ద చతుర్దశి నాడు గోదానం చేసినవారి ఇళ్ళలో పశుసంపదకు ఎటువంటి హాని జరుగదు. ఈ నా మాటకు యమునా నదీజలాలే సాక్షి. యమునా నది జలాలు ఈనాడు చేసే అనంత పద్మనాభ వ్రతములో పూజినీయత పొంది పూజించ బడతాయి” అని ప్రాణాలు వదిలింది. 


ఆనాటి నుండి అనంత పద్మనాభ వ్రతములో యమునానది జలపూజ భాగమైంది.


అనంత పద్మనాభ వ్రతానికి చెందిన రెండవ కధ వినండి..


2. ధర్మరాజు జూదంలో సమస్తం ఓడిపోయి తమ్ములతో, ద్రౌపదితో పన్నెండేళ్ళ ఆరణ్యవాసం చేస్తున్నాడు. వారిని చూడటానికి శ్రీకృష్ణుడు అరణ్యానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణునికి నమస్కరించి “కృష్ణా! మేము ఈ అరణ్యవాసంలో అష్టకష్టాలు పడుతున్నాము. ఈ కష్టాలు పోయి అరణ్యవాసం చక్కగా జరిగే మార్గము ఏమైనా వుంటే చెప్పుము” అని కోరాడు.


శ్రీకృష్ణుడు పాండవులను చూసి “ధర్మరాజా! సమస్త పాపాలు నశింపచేసి, కష్టాలు తొలగింపచేసి సమస్త సంపదలు, సుఖాలు ఇచ్చే వ్రతము ఒకటి ఉంది. అదే అనంత పద్మనాభ వ్రతము. భాద్రపద శుక్ల చతుర్దశి నాడు చేయాలి. త్వరలో వచ్చే భాద్రపద మాసంలో ఈ వ్రతము చేయండి. మీరు సకల కష్టాల నుండి బయటపడతారు” అని చెప్పాడు.


ధర్మరాజు కృష్ణుడిని “ఎవరీ అనంతుడు. బ్రహ్మా, ఆదిశేషుడా లేక సాక్షాత్తు నారాయణుడా?” అని ప్రశ్నించాడు.


“ధర్మరాజా! అనంతుడు ఎవరో కాదు. నేనే! నా కాల స్వరూపమే అనంతుడు. అనంతుడైన నేను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం, భూభారం తగ్గించడం కోసం దేవకీ వసుదేవులకు జన్మించాను.సృష్టి స్థితి లయకారకులైన హరిహరబ్రహ్మాది స్వరూపాలు నావే! నేనే విశ్వమంతా వ్యాపించి అనంతుడిగా ఉంటాను. కనుక అనంత పద్మనాభుడిగా నన్ను కొలిచి పూజించుము. 


నా హృదయంలో పద్నాలుగురు ఇంద్రులు, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సప్త ఋషులు, భూర్భువశ్లోకాదులు నివసించి ఉన్నారు. సృష్టి సమస్తము అనంత పద్మనాభ స్వరూపమే" అని ఉపదేశించి అనంత పద్మనాభ వ్రత విధానానికి సంబంధించిన కథను వివరించి చెప్పాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

బ్రహ్మచారి

 **బ్రహ్మచారి* : సదా బ్రహ్మమందు ఎవరి మనస్సు సంచరిస్తూ ఉంటుందో వారు బ్రహ్మచారి.అంతే కాని పెళ్లి కానివారు అని చెబుతుంటారు.పెళ్లి మాత్రం చేసుకోకుండా తక్కిన కార్యక్రమాలు చేసేవారు బ్రహ్మచారులు కానేకారు. బ్రహ్మచర్యం అనేది నాలుగు ఆశ్రమాలలో మొదటిది. వేద జ్ఞానాన్ని అభ్యసిస్తూ, మనోవాక్కాయ కర్మలతో పవిత్రంగా జీవించేవారిని బ్రహ్మచారులు అంటారు. బ్రహ్మచారులు ప్రధానంగా నిష్ఠ, కాల పరిమితిని బట్టి రకాలుగా ఉంటారు. *ముఖ్యమైన రకాలు:* నైష్ఠిక బ్రహ్మచారి (ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటించేవారు), మరియు ఉపేతక బ్రహ్మచారి (విద్య పూర్తయ్యే వరకు పాటించేవారు). 

శాస్త్రమ్ ప్రకారం బ్రహ్మచారులు మరికొన్ని రకాలుగా కూడా వర్గీకరించబడ్డారు:

 *సావిత్ర:* ఉపనయన  తర్వాత, కనీసం మూడు రోజులు బ్రహ్మచర్యం పాటించే బ్రహ్మచారి.

 *ప్రాజాపత్య:* దీక్ష తర్వాత కనీసం ఒక సంవత్సరం పాటు కఠినంగా బ్రహ్మచర్యాన్ని పాటించేవారు.

 *బ్రహ్మ-బ్రహ్మచారి:* వేద అధ్యయనం కోసం కొంతకాలం బ్రహ్మచారిగా ఉండేవారు.

 *అస్ఖలిత బ్రహ్మచారి* : మనస్సు, శరీరం ద్వారా ఎటువంటి కామ వికారాలకు లోనుకాకుండా స్థిరమైన బ్రహ్మచర్యం పాటించేవారు. 

 *ముఖ్యమైన విభజన* :

 *నైష్ఠిక బ్రహ్మచారి* : జీవితాంతం వివాహం చేసుకోకుండా సత్య, శౌచ, నియమాలతో గడిపేవారు.

 *ఉపేతక / గృహస్థ-బ్రహ్మచారి* : చదువు పూర్తయ్యాక గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేవారు. 

పంచాంగం

 



🌸శ్రీ రామ స్తుతి 🙏

 🌸శ్రీ రామ స్తుతి 🙏

సీ. సాకేత రామయ్య! స్వామివి నీవయ్య !

               మముకావ రావయ్య మౌనమేల

     తాటకమర్ధనా ! తాపస పూజితా !

                పరమాత్మ ! శ్రీరామ ! పాహి పాహి !

     ఆశ్రితజనపోష ! యఖిలేశ ! రఘువీర !

                సత్యపరాక్రమా ! శరణు శరణు !

     వైకుంఠపురి వాస ! వైజయంతీధరా !

               మైథిలీప్రాణేశ ! మహిత తేజ !

తే.ధర్మ సంస్థాపనము సేయ ధరను నున్న

    ఆదినారాయణా ! నీకు ననవరతము

    నతుల నర్పింతు భక్తితో నతులితముగ

    రమ్యగుణగణశోభితా రామచంద్ర !


జయలక్ష్మి

15, ఏప్రిల్ 2026, బుధవారం

పెళ్లి

 పెళ్లి


" నాన్నా ఈ అమ్మాయి ఫోటో నాకు బాగా నచ్చింది అంటూ

 చేతిలో ఉన్న పది ఫోటోల్లో ఒకటి సెలెక్ట్ చేసి తండ్రి కి

 చూపించాడు రఘు. ఈ అమ్మాయి బీఎస్సీ బీడీ చదువుకుంది రా !మరి నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వి మీ ఇద్దరికీ ఎలా

 కుదురుతుంది ?పైగా పిల్ల ఎక్కడో కోనసీమలో ఉంటోoది అన్నాడు రఘు తండ్రి రఘురామయ్య.


" లేదు నాన్న టీచర్ ఉద్యోగమే బెస్ట్ ఆడవాళ్ళ కి. బోల్డన్ని సెలవులు ఉంటాయి . పైగా టైమింగ్ లు కూడా చాలా సౌకర్యంగా

 ఉంటాయి. నాకు ఆ కోనసీమ అంటే ఇష్టం. మనం రేపే

 పెళ్లిచూపులుకి వెళదాం అంటూ తండ్రి రఘురామయ్యని

 తొందరపెట్టాడు రఘు. రఘురామయ్యగారి భార్యతో ఆలోచించి పెళ్లి చూపులకు వస్తున్నామని పెళ్లికూతురు సీతాదేవి తండ్రి కృష్ణారావు గారికి కబురు పంపారు.


కృష్ణారావు గారు కోనసీమలోని అయినవిల్లి గ్రామంలో సైన్స్ టీచర్ గా పని చేస్తున్నారు. ఆయనకి ఇద్దరు పిల్లలు. కొడుకు కూతురులు ఇద్దరినీ బిఎస్సి బీఈడీ చదివించారు. 


చాలా సాంప్రదాయమైన కుటుంబం అని మధ్యవర్తుల ద్వారా విని రఘురామయ్య గారు భార్య పెళ్లి కొడుకు ,పెళ్లి కొడుకు చెల్లి హైదరాబాదులో రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కి తెల్లవారుజామున నాలుగు గంటలకి రావులపాలెంలో దిగి హోటల్ రూమ్ తీసుకుని కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత కార్లో అయినవిల్లి గ్రామం బయలుదేరారు.


 ఫలనా రోజున పెళ్లి చూపులకు వస్తున్నామని కృష్ణారావు గారికి ముందుగానే కబురు పంపారు.ఎప్పుడూ కోనసీమ అందాలు పుస్తకాల్లోనూ, యూట్యూబ్లోనూ చూడడం తప్పితే ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు రఘు. చుట్టూ అందమైన కొబ్బరి తోటలు, పచ్చటి వరి పొలాలు, గోదావరి నది ఒడ్డు, చల్లటి గాలి అబ్బ స్వర్గంలో ఉన్నట్టుంది అనుకున్నాడు కారులో ప్రయాణిస్తూ రఘు. రోడ్లు కూడా చాలా బాగున్నాయి అనుకుంటూ కోనసీమ అందాలను ఆస్వాదిస్తున్న సమయంలోనే పెళ్లి వారి ఇల్లు వచ్చేసింది.


పెళ్లి వారు కారు దిగిన వెంటనే కృష్ణారావు గారి దంపతులు ఎదురు వచ్చి నమస్కారం చేసి కాళ్లు కడుక్కుని "లోపలికి రండి అంటూ పెద్ద ఇత్తడి చెంబుతో నీళ్ళు అందించారు. అప్పటికే అక్కడ పెద్ద గంగాళం తోటి నీళ్లు పెట్టి ఉన్నాయి. కాళ్లు కడుగుకున్న తర్వాత లోపలికి తీసుకువెళ్లి మర్యాదగా కుర్చీల్లో కూర్చోబెట్టి మంచినీళ్ల గ్లాస్ అందించారు. 


ఆ కుర్చీలన్నీ కూడా పాతకాలంనాటి చెక్క కుర్చీలు . మంచినీళ్లు తాగిన తర్వాత ఇల్లు చూద్దాం రండి !అంటూ ఇల్లంతా తిప్పి చూపించారు.పెద్ద పెంకిటిల్లు. చుట్టూ అందమైన కొబ్బరి తోట మామిడి మొక్కలు అరటి మొక్కలు అక్కడ లేని మొక్క అంటూ లేదు వెనకాల పశువుల శాల తనకు సొంత వ్యవసాయం ఉందని ,ఇల్లు తన తండ్రిగారు కట్టారని కృష్ణ రావు గారి మాటల్లో చెప్పారు. అక్కడ వాతావరణం అంతా చూడడానికి చాలా బాగుంది. చల్లటి గాలి. అందమైన ప్రకృతి. మాయా మర్మం లేనటువంటి మాటలు చాలా ఆనందపడ్డాడు పెళ్లి కొడుకు.


ఇంతలో కృష్ణారావు గారి భార్య పెరటి వైపుకు వచ్చి అందరూ ఫలహారం తీసుకుందాం !రండి అంటూ మర్యాదగా లోపలికి తీసుకువెళ్లింది. అప్పటికే అక్కడ శుభ్రంగా తుంగ చాపలు పరిచి ఉన్నాయి . ఎదురుగుండా అరిటాకులో కొద్దిగా కారప్పూస మినప సున్ని ,పాలకోవా ,పూతరేకు ,కొద్దిగా వేయించిన అటుకులు వడ్డించి ఉన్నాయి. ఇది టిఫినా! లేక భోజనమా !అని అనుమానం వచ్చింది పెళ్ళికొడుకు రఘు కి. ఇవన్నీ మేము స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్నవి. బజారు వస్తువులు కాదు. అసలు మా ఆయన బజారు వస్తువులు తీసుకురారు పిల్లల్ని తిననివ్వరు. ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తారు. పైగా సైన్స్ మాస్టారు కదా! అంటూ కృష్ణారావు గారి భార్య కొసరి కొసరి వడ్డించింది.


 తినకూడదనుకుంటూనే పెళ్ళికొడుకు వాళ్ల మాటలు వింటూ ప్లేటు ఖాళీ చేసేసాడు. చాలా రుచిగా ఉన్నాయి.ఇవి నిజంగా ఇంట్లో తయారు చేసినవే. సాధారణంగా ఎవరైనా పెళ్లిచూపులు అంటే బజార్ నుంచి నాలుగు సీట్లు, నాలుగు హాట్లు తెచ్చి పెడతారు. ఎవరు తయారు చేస్తున్నారు ఇలాగా! ఇదివరకు పెళ్లి పెళ్లి చూపులకు వెళ్లిన చోట ఇలాగే కక్కుర్తి పడే ఒకటి రెండు స్వీట్లు తింటే ఆ డాల్డా నోరు పట్టుకుని వదలలేదు. పైగా వారం రోజులు దగ్గు కూడా ఏడిపించింది. ఇంతలో కృష్ణారావు గారి అబ్బాయి ఒక గాజు గ్లాసులో కొబ్బరిబొoడంనీళ్లు తీసుకువచ్చి అందరికీ ఇచ్చాడు. ఇవి కూడా మా దొడ్లోవే. వేసవికాలం కదా కాఫీ టీలు ఎందుకని ? అంటూ మాట పూర్తి చేయలేదు కృష్ణారావు గారు. 


ఇంతలో రఘురామయ్య గారు టైం అవుతుంది అమ్మాయిని తీసుకురండి అంటూ అడ గగానే కృష్ణారావు గారు భార్య పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నిజానికి సీతాదేవిలాగే ఉంది పెళ్లికూతురు ఆధునికమైన మేకప్ లు ఏమీ లేవు. గోదావరి నీళ్ళల్లాగా ఆ మొహం లో స్వచ్ఛత కనబడింది పెళ్ళికొడుకు కి. ఆమె అలంకరణలో ఎక్కడ ఆధునికత కనబడలేదు. కట్టుబొట్టు అన్ని సాంప్రదాయంగా ఉన్నాయి. అమ్మాయి తోటి మీరేమైనా మాట్లాడతారా? అని అడిగారు పెళ్లికూతురు తల్లి. అంగీకారంగా తల ఊపేడు రఘు. ఇద్దరినీ వెంటబెట్టుకుని పెళ్లికూతురు తల్లి పక్క గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది.


ఇద్దరి మధ్య మాటలు లేవు చాలాసేపు. ఆఖరికి రఘు ధైర్యం చేసి మీ పేరు ఏమిటి? అని పలకరించాడు. సీతాదేవి అని నెమ్మదిగా చెప్పింది. సమాధానంలో ఎక్కడ కరుకుదనం లేదు. నీ పేరేమిటి అని తిరిగి అడగలేదు. అంటే పల్లెటూర్లో పుట్టి పెరిగిన పిల్ల కదా !ఎక్కువ భయం అనుకుంటాను అనుకున్నాడు. ఆ అమ్మాయి అడిగిన అడగకపోయినా తన పేరు చేస్తున్న ఉద్యోగం పూర్తి వివరాలు అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మీరేం చేస్తున్నారు! అని అడిగారు చివర్లో ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నానంటూ చాలా నెమ్మదిగా చెప్పింది. ఇంత నెమ్మదిగా మాట్లాడుతుంది ఏమిటి ?అసలు ఈ పిల్ల చెప్పిన పాఠాలు విద్యార్థులకు వినపడతాయా! వినపడవా! అనిపించింది రఘు కి.


 పది నిమిషాలు పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు గదిలోంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత తండ్రి చెవిలో తన అంగీకారం తెలియజేశాడు రఘు.

రఘురామయ్య గారు కూడా వారి మర్యాద, ఆ ఇంటి వాతావరణం, మాటతీరు, పెళ్లికూతురు నడవడిక చాలా నచ్చాయి. ఇదే విషయం భార్యతోటి కూతురు తోటి చర్చించి మాకు మీ సంబంధం నచ్చింది అమ్మాయిని కూడా అడిగి మీకు కూడా నచ్చితే ఏ విషయం తెలియజేయండి అంటూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. 


కృష్ణారావు గారి దంపతులు కారు వరకు వచ్చి మర్యాదగా సాగనంపారు మగ పెళ్లి వారిని రఘురామయ్యగారు తాము సాయంకాలం బస్సు కి హైదరాబాద్ వెళ్ళిపోతున్నామని అంతవరకు రావులపాలెం లోని హోటల్లోనే ఉంటామని చెప్పారు.


కృష్ణారావు గారి దంపతులకు పెళ్ళికొడుకు ,ఉద్యోగం కుటుoబం బాగా నచ్చాయి గాని మనసులో ఇంకో దిగులు ఉంది. పెళ్లి విషయంలో కృష్ణారావు గారి భావాలకి మగ పెళ్లి వారు ఒప్పుకుంటారో లేదో!. ఒప్పుకోకపోతే ఎలాగా మనసు చంపుకుని పెళ్లి చేయడం ఎలాగా?. మంచి సంబంధం వదులుకోలేరు. అందరికీ ఆదర్శంగా ఉండేలా ఉండాలని చిన్నప్పటినుంచి కృష్ణారావు గారి ఆశ. 


అలాగే ఉద్యోగ విషయంలో కూడా చాలా కష్టపడి పిల్లలకి పాఠాలు నేర్పిస్తాడు. ఆ గ్రామ పాఠశాలలో సొంత ఖర్చులతోనే ఒక ప్రయోగశాల నిర్మించాడు. అక్కడ లేని పరికరం లేదు. ఆదర్శ ఉపాధ్యాయుడుగా ఇప్పటికి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత అవార్డులు అందుకున్నాడు. 


"సరే ఎప్పటికైనా చెప్పక తప్పదుగా అనుకుంటూ భార్య కూతురు అంగీకారం తీసుకుని భార్యాభర్తలిద్దరూ రావులపాలెం బయలుదేరి వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 3:00 అయింది.


కృష్ణారావు గారి దంపతులను సాదరంగాలోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి చేయగలిగిన మర్యాదలు అన్నీ చేశారు. "చూడండి మీ సంబంధం బాగా నచ్చింది మాకు. మా అమ్మాయి కూడా అంగీకారం తెలిపింది. మీ పద్ధతి, గౌరవo అన్ని బాగా మాకు నచ్చాయి. మాది ఏమీ లోటు లేని సంసారం. మేము అసలు సిటీలో ఉన్న పెళ్ళికొడుకుల సంబంధం చూడకూడదు అనుకున్నాము. కానీ మీ తండ్రి గారు మన కోనసీమ జిల్లా వాళ్లే కాబట్టి మన పద్ధతులు, ఆచార వ్యవహారాలు ఒకే విధంగా ఉంటాయని ఉద్దేశంతో మిమ్మల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాం.


 అయితే పెళ్లి విషయంలో నాకు కొన్ని భావాలు ఉన్నాయి. అంటే నేను ఆధునిక భావాలతోటి పెళ్లి చేయలేను. పర్యావరణ పరిరక్షణ అంటే నాకు చాలా ఇష్టం. అంటే హంగులు ఆర్భాటాలు ఏవి ఉండవు. మన శాస్త్రం ఏ విధంగా చెప్పిందో పర్యావరణాన్ని పాడు చేయకుండా పూర్వీకుల పద్ధతిలో పెళ్లి చేసి పదిమందికి ఆదర్శంగా ఉండాలని నా ఆకాంక్ష. సాధారణంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరు ధైర్యంగా ఈ మాట చెప్పరు. మగ పెళ్లి వారు ఏ విధంగా చేయమంటేనే ఆ విధంగా చేస్తారు పెళ్లి. అందుకనే ముందుగానే నా మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పేస్తున్నాను. మీకు ఇష్టమైతే తాంబూలాలు పుచ్చుకుందాం! అంటూ తన మనసులోని మాటని గబగబా చెప్పేశారు కృష్ణారావు గారు. 


"మాకు ఏమీ తొందర లేదు మీరు నిదానంగా ఆలోచించుకుని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కబురు చేయండి అంటూ అరటిపళ్లబట్ట వాళ్లకి ఇచ్చి మా దొడ్లో పండినవే. మేము మందులు మాకులు వాడము. మాది అంతా గో ఆధారిత వ్యవసాయం అంటూ నవ్వుతూ చెప్పి బయటకు వెళ్లిపోయారు కృష్ణారావు గారు.


మర్నాడు ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు రఘు రామయ్య గారు. పెళ్ళికొడుకుని గుచ్చి గుచ్చి మరీ మరీ అడిగారు. అంటే కొంతమందికి పెళ్లి చాలా ఆర్భాటంగా జరగాలని పెద్దపెద్ద కళ్యాణ మండపాల్లో చేయాలని, ప్రీ వెడ్డింగ్ షూటింగు, పోస్ట్ వెడ్డింగ్ షూటింగు, డాన్సులు ,బ్యాండ్ మేళాలు, ఊరేగింపులు ఇవి ఈనాటి పిల్లల కోరికలు. అటువంటి ఉద్దేశం రఘుకు ఏమైనా ఉందేమో !అని చాదస్తంగా ప్రశ్నించారు.


 రఘు చెప్పిన మాటలు విని రఘురామయ్యగారికి చాలా ఆశ్చర్యం కలిగింది. "చూడు నాన్న ఈ హంగులు ఆర్భాటాలు ఊరేగింపులు డాన్సులు ఆ ఒక్క రోజుకు మాత్రమే ఉంటాయి. కానీ జీవితాంతం నాతో కలిసి ఉండేది ఆ పెళ్లికూతురు మాత్రమే. ఆమె నాకు మనస్ఫూర్తిగా నచ్చింది. పెళ్లి ఎలా చేసినా పర్వాలేదు ఆ అమ్మాయి తోటే నా పెళ్ళంటూ కచ్చితంగా చెప్పేసాడు రఘు. 


"తమకి కట్నకానుకలు ఏమీ వద్దని పెళ్లి ఆడపిల్ల వారి ఇష్టప్రకారమే చేయమని తాంబూలాలు పుచ్చుకునే అవసరం లేదని డైరెక్ట్ గా ముహూర్తాలు పెట్టించమని కబురు పంపారు రఘురామయ్య గారు.


మొత్తానికి అనుకున్న శుభ ముహూర్తం రానే వచ్చేసింది. మగ పెళ్లి వారి అయినవిల్లి లోని విడిది ఇంట్లోకి తరలి వచ్చారు. ఆడపిల్ల వారు డోలు సన్నాయి బాజా భజంత్రీలతో గౌరవ మర్యాదలతో లోపలకి ఆహ్వానించారు. లోపలికి రాగానే చూస్తే ఆ విడిదిల్లు పెద్ద పెంకుటిల్లు. ఇంటి ముందు తాటాకులతో వేసిన పందిరి ,దానికి మావిడాకులు తోరణాలు ఇంటి లోపల ప్రతి గుమ్మానికి మావిడాకులు తోరణాలు ఇల్లు కొత్తగా వెల్లవేసినట్టుంది. గుమ్మాలకి పచ్చగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి. సుమారుగా పది గదులున్నాయి. పెద్ద మండువా ఇల్లు. లోపల ఫ్యాన్లు ఉన్నప్పటికీ పెరటి వైపు నుంచి మంచి చల్ల గాలి. ప్రాణం చాలా హాయిగా ఉందనుకున్నారు మగ పెళ్లి వారు. 


బయట అరుగు మీద ఒక ఇరవై వరకు మడత మంచాలు గోడకు చేర వేసి ఉన్నాయి. అచ్చు పల్లెటూరి పెళ్లి లాగే ఉంది అనుకున్నారు. కాఫీ టిఫిన్లు రెడీగా ఉన్నాయి రండి అంటూ ఆడపెళ్లి వారు బొట్టు పెట్టి పేరుపేరునా ఆహ్వానించారు కృష్ణగా రావు గారి ఇంటికి మగ పెళ్లి వారిని. 


కృష్ణారావు గారి ఇంటికి వెళ్లేటప్పటికి ఇంటి వెనకాల ఉన్న పెరడులో పెద్ద తాటాకుల పందిరి వేసి ,పచ్చటి మావిడాకులు తోరణాలు కట్టి , నేలంతా శుభ్రంగా అలికేసి, అందంగా ముగ్గులు పెట్టి ,నేల బల్లలు వేసి, అరిటాకులో ఇడ్లీ కారప్పొడి పెసరట్టు ,రెండు రకాల పచ్చళ్ళు వడ్డించి రెడీగా ఉన్నాయి. పంచలు కట్టుకున్న వంట బ్రాహ్మలు చేతిలో తాటాకు బట్టలతో అటు ఇటు తిరుగుతూ ఆప్యాయంగా వడ్డిస్తున్నారు. కృష్ణారావు గారు భార్య దగ్గరుండి కొసరి కొసరి వడ్డించారు. ఈ వంట బ్రాహ్మలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అని అడిగారు రఘు రామయ్య గారు. అమలాపురం పక్కనున్న ఇందుపల్లి నుంచి తీసుకొచ్చామని చెప్పారు.టిఫిన్ చాలా రుచికరంగా ఉందని మెచ్చుకున్నారు రఘు రామయ్య. 


కాఫీలు గాని టీలు గాని ఎక్కడ లేవు. పాలు తప్పితే చెరుకు రసం ఈ రెండింటితోటే టిఫిన్ కార్యక్రమం ముగించారు. ఈ విందు చాలా వెరైటీగా ఉందని హైదరాబాద్ నుంచి వచ్చిన రఘురామయ్యగారి బంధువులు మెచ్చుకున్నారు. పెళ్లి వేదిక చూద్దురుగాని రండంటూ మగపెళ్లి వారిని కృష్ణారావు గారు ఆ పెద్ద పందిరిలోనే తూర్పుముఖంగా కట్టిన పెళ్లి వేదిక దగ్గరికి తీసుకువెళ్లారు.. చుట్టూ అరటిగె లతో ఉన్న అరటి మొక్కలు ఆ నాలుగు రాటలకి కొబ్బరి ఆకులు లోపల మామిడి తోరణాలు నాలుగు పక్కల మల్లెపూల దండలు అబ్బా !ఎంత అందంగా ఉంది కళ్యాణ వేదిక.మధ్యలో ట్యూబ్ లైట్లుతో చాలా చూడముచ్చటగా ఉంది. ఎక్కడ అధునాతన అలంకరణలు లేవు.

 కంటికి ఆకర్షణీయమైన రంగులే గాని ప్రమాదకరమైన రంగులు లేవు.సాయంకాలము ఈ మల్లెపూలు దండలు తీసేసి గులాబీ దండలు కడతామని చెప్పారు కృష్ణారావు గారు


 పురోహితులనుకుంటాను ఒక వారగా కూర్చుని స్నాతకం ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణారావు గారిని చూడగానే "అయ్యా మళ్లీ దుర్ముహూర్తాలు వచ్చేస్తాయి. స్నాతకం పీటల మీద కూర్చోవాలని మగ పెళ్ళి వారికి చెప్పండి అంటూ తొందర పెట్టాడు."నమస్కారం నా పేరు రఘురామయ్య నేను పెళ్ళికొడుకు తండ్రిని మీది ఏ ఊరు? అంటూ ప్రశ్నించారు. అయ్యా మాది తణుకు పక్కన ఉన్న ఇరగవరం. మేము వేద పండితులం. మా గురువుగారు సాయంకాలం వస్తారు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. 


"సరేనండి మేము తయారయ్యే వస్తాo అంటూ మగపెళ్లివారు వెళ్లిపోయారు .కాసేపటికి కృష్ణారావు గారు మేళతాళాల తోటి భజంత్రీలు తోటి పెళ్ళికొడుకుని పల్లకిలోను మగ పెళ్లి వారిని వేదిక దగ్గరికి సగౌరవంగా తీసుకుని వచ్చారు. ముందుగానే చెప్పిన విధంగానే ఫోటోగ్రాఫర్ వేదికను ఎక్కకుండా కింద పందిరి లోనే కెమెరా పెట్టుకుని ఫోటోలు వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 


కాశీ ప్రయాణం సజావుగా జరగకుండా బావమరిది బతిమాలి అక్కను పెళ్లి చేస్తానని మాట ఇచ్చి నోరు తీపి చేసి పెళ్ళికొడుకును వెనకకు తీసుకొచ్చాడు. పురోహితులు గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మంత్రాలుదాటించకుండా శాస్త్ర ప్రకారం స్నాతకం పూర్తి చేసేటప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది. 


ఈ మధ్యకాలంలో ఇంత సేపు స్నాతకం చేయించిన వారిని ఎక్కడ చూడలేదు అనుకుని రఘురామయ్య గారు సంతృప్తి పడ్డారు. నిజమే మరి ఆ కాలం మనుషులకి ఆ కార్యక్రమ యొక్క విలువ ఏమిటో తెలుస్తుంది.


ఈలోగా కృష్ణారావు గారు భార్య మగ పెళ్లి వారిని వంటలు రెడీగా ఉన్నాయని "వంటలు రెడీగా ఉన్నాయి భోజనాలకు రండి అని బొట్టు పెట్టి ఆహ్వానించారు ప్రతి ఒక్కరిని. 

ఉదయం లాగే నేల బల్లలు వేసి ఎదురుగుండా అరిటాకు లో పప్పు టమాట, కొత్త అవకాయి, గుత్తి వంకాయ కూర, పనసపొట్టు కూర బూరె లు ,పులిహార ,ముక్కల పులుసు అప్పడాలు ,వడియాలు తో ఆకు అంతా నిండుగా ఉంది. గాజు గ్లాసులతో మంచినీళ్లు చక్కగా పెట్టి ఉన్నాయి.కొమ్ము చెంబుతో నెయ్యి పట్టుకుని మడి కట్టుకున్న వంట బ్రాహ్మలు పెళ్లి వారికి వడ్డనలోమునిగిపోయారు. కృష్ణారావు గారు భార్య ప్రతి వారి దగ్గరికి వచ్చి ఏం కావాలో? దగ్గరుండి చూసుకుంటున్నారు.


 అసలు ఈ కాలంలో క్యాటరింగ్ భోజనాలు తప్పితే ఇలా గౌరవంగా మర్యాదలతో ఆప్యాయంగా భోజనాలు వడ్డించేవారిని చూడలేదని ఊరి ప్రజలతో పాటు హైదరాబాదు పెళ్ళివారు కూడా ఆనందపడ్డారు. భోజనాల్లో ఎక్కడ అధునాతనమైన వంటలు గానీ ,మసాలా దినుసులు గాని కృష్ణారావు గారు వాడనివ్వలేదు. అంతా సాంప్రదాయ పద్ధతే తృప్తిగా భోజనం చేసి మగపెళ్లి వారు ఆనందంగా విడిదిలోకి వెళ్లిపోయారు. వెళ్లేటప్పుడు తమలపాకులు వక్కపొడి సున్నం రాసి చిలకల్లా చుట్టి పెళ్ళివారికి అందించారు ఇది చూడడానికి చాలా అందంగా ఉంది.


సాయంకాలం ఆరు గంటలకల్లా ఎదురు సన్నాహాలని , మధ్యాహ్నం పూట ఫలహారాలు విడి దిలోకే తీసుకొస్తామని, రాత్రి ఏడు గంటలకు అలా పెళ్లి పీటల మీద కూర్చోవాలని ఒకపక్క పెళ్లి అవుతుంటే మరొక పక్క భోజనాలు ఏర్పాట్లు చేసుకుంటామని రఘురామయ్యగారికి చెప్పాడు కృష్ణారావు గారు.


పెళ్లిలో ప్రతి కార్యక్రమం నిదానంగా ఆనందంగా నడిపిస్తేనే దాని అందం తెలుస్తుంది. మగ పెళ్లి వారిని బెల్లం పానకంతో నోరు తీపి చేసి ,ఆడపడుచులను ఇత్తడి బిందువులతో సత్కరించి, శుభలేఖను తప్పులు లేకుండా చదివి ఇరు వర్గాల పెళ్లి వారిని ఒకరినొకరు సత్కరించుకుని అందంగా ఆనందంగా పరిచయాలు పూర్తి చేసుకుని ఎదురు సన్నాహం కార్యక్రమం ముగించి "భోజనాలు రెడీ అంటూ ఆహ్వానించారు.

శనివారం నియమం ఉన్నవాళ్లు టిఫిన్లు, కాని వాళ్ళు భోజనాలు ఉదయం లాగే అరిటాకులలో నేల బల్లల మీద కూర్చుని సంతృప్తిగా భోజనాలు కాని చ్చారు. రాత్రి భోజనానికి బంగాళదుంప ఉప్మా కూర ,అరటికాయ వేపుడు, కొబ్బరికాయ పచ్చడి ,సాంబారు, అప్పడాలు ,వడియాలు, బొబ్బట్లు, పొట్టి కాజా ,అరటికాయ బజ్జి, గడ్డ పెరుగు లు తయారు చేయడంలో ఇందుపల్లి వంట వాళ్ళు తమ ప్రతాపం చూపించారు. మజ్జిగ లోకి మామిడిపండు అంటూ కొసరి కొసరి వడ్డించారు. కోనసీమ భోజనమా మజాకా. వంట వాళ్ళు అటు ఇటు వడ్డన చేస్తూ నాలుగైదు గాజు గ్లాసులు పగలగొట్టేశారు. 


ఈ కృష్ణారావు గారి శ్రద్ధ చూడండి ఫలహారాలు భోజనాలకి అరటి ఆకులు ,మంచినీళ్లకి గాజు గ్లాసులు వాడి పర్యావరణానికి పెద్ద పీట వేశారు. ఎక్కడా ప్లాస్టిక్ అనే మాట లేదు. 


డైనింగ్ టేబుళ్లు షామియానాలు కుర్చీలు అసలు లేవు. 

ఎందుకంటే షా మియనాలు ఈ మధ్యన చావుకి ,పెళ్లికి కూడా అవే వాడేస్తున్నారు. అదీ కృష్ణారావు గారు భయం. ఎన్నాళ్ళయిందో ఇలాంటి పెళ్లి చూసి అని మగపెళ్లి వారు అనుకున్నారు. ఇక పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి తంతులన్నీ శాస్త్రం చెప్పిన ప్రకారం యధావిధిగా పురోహితులు వారు చేయించుకుంటూ వెళ్ళిపోతున్నారు.


 తలంబ్రాలు స్వచ్ఛమైన బియ్యంతో ఆనందంగా ,సంతోషంగా పెళ్లికూతురు ,పెళ్ళికొడుకు నిదానంగా ఒకరి తల మీద ఒకరు పోసుకున్నారు. పెళ్లి మండపం మీద పురోహితులు కన్యాదానం చేసే వాళ్ళు మగ పెళ్లి వారిలో ముఖ్యులు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తప్ప ఇంకెవరికి ఆస్కారం ఇవ్వలేదు కృష్ణారావు గారు. దాని మూలంగా ఆహుతులు అందరికీ కూడా పెళ్లి శుభ్రంగా కనబడింది. యధావిధిగా కార్యక్రమాలన్నీ తూచా తప్పకుండా చేయించి మర్నాడు ఉదయమే అయినవిల్లి వినాయకుడి దర్శనం చేయించి నూతన దంపతులను పెళ్లి వారిని సాగనంపారు.


రఘురామయ్య గారు బస్సు ఎక్కబోతు ఈ పెళ్లి ఆరోగ్యకరమైన పెళ్లి అని చాలా సంతోషంగా ఉందని ఇది చాలా కాలం పాటు ప్రజలందరూ చెప్పుకుంటారని ఆదర్శవంతమైన వివాహం అని పదేపదే కృష్ణారావు గారిని ప్రశంసించి హైదరాబాద్ వెళ్లిపోయారు. 


ఈ పెళ్లి గురించి పేపర్ వాళ్ళు టీవీలు వారు పెద్ద ఎత్తున ప్రచారం చేసాయి. పర్యావరణానికి పెద్ద ఎత్తున పీఠo వేసే ఆ జిల్లా కలెక్టర్ గారు కృష్ణారావు గారిని రఘురామయ్య గారిని ఇద్దరిని సన్మానించి గౌరవించారు.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

కాకినాడ 9491792279

తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు...

 తిరుమల వేంకటేశ్వరుని ఐదు రూపాలు...............!!


తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో మూలవిరాట్టు కాకుండా, మరో నాలుగు మూర్తులు ఉన్నాయి. ఈ మూర్తులు వరుసగా - భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వాములు. 

ఏయే రూపాల ప్రాధాన్యత ఏమిటో

మూలమూర్తి (ధ్రువబేరం) నిత్యం లక్షలాదిమంది భక్తిప్రపత్తులతో దర్శించుకునే మూలవిరాట్టును ధ్రువబేరం అంటారు. 


ధ్రువ అంటే స్థిరంగా ఉండేది అని అర్ధం. ధృవబేరం అంటే నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉండే విగ్రహమూర్తి. మూలవిరాట్టు అయిన ధ్రువబేరానికి తెల్లవారుజామున సుప్రభాతసేవ మొదలు, అర్ధరాత్రి ఏకాంతసేవ వరకూ రోజంతా ఆరాధనలు జరుగుతాయి. 


ఈ మూలవిరాట్టు సాలగ్రామమూర్తి. మూలమూర్తి శిరస్సు నుండి పాదం వరకూ ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది. ''వీరస్థానక'' పద్ధతిలో నిలబడి ఉన్న మూలవిరాట్టు పక్కన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉండవు. 


నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమలేశుని దివ్య మంగళ దర్శనం కోసం ఎదురుచూస్తారు కనుక ఈ మూలవిరాట్టును (ధృవబేరం) దర్శించుకోడానికి రెండు క్షణాల కంటే సమయాన్ని కేటాయించలేరు.

భోగ శ్రీనివాసమూర్తి (కౌతుక బేరం)

ఒక అడుగు ఎత్తులో ఉండే భోగ శ్రీనివాసమూర్తిని వ్యవహారంలో భోగ శ్రీనివాసుడు అంటారు.


 ఇంకోరకంగా కౌతుక బేరం లేదా పురుష బేరం అంటారు. నిత్యం జరిపే దీపారాధన, నైవేద్యం, అభిషేకం, ఏకాంత సేవలు భోగ శ్రీనివాస మూర్తికి జరిపిస్తారు. ఈ వెండి శ్రీనివాసుని విగ్రహాన్నిక్రీస్తుశకం 614లో పల్లవ మహారాణి సామవాయి పేరిందేవి ఆలయానికి సమర్పించినట్లు శాసనాల్లో ఆధారాలు లభించాయి. మహారాణి ఈ శ్రీనివాసమూర్తిని సమర్పించిన నాటి నుండి నేటివరకూ ఎన్నడూ ఆలయం నుండి విగ్రహాన్ని ఆలయం నుండి తొలగించలేదు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మూలవిరాట్టుకు చేసే సేవలు భోగ శ్రీనివాస మూర్తికి అందుతాయి.


ఉగ్ర శ్రీనివాసమూర్తి (స్నపన బేరం)

ఉగ్ర శ్రీనివాసమూర్తిని స్నపన బేరం అంటారు. ఈ మూర్తి శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. నిజానికి శ్రీనివాసమూర్తి రూపం 11వ శతాబ్దం వరకూ ఉత్సవ విగ్రహంగా ఉండేది. క్రీస్తుశకం 1330లో ఒకసారి ఉత్సవ విగ్రహంగా ఊరేగింపు జరుపుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో, అది ఉగ్ర శ్రీనివాసుని రూపానికి సంకేతంగా భావించారు. అప్పటినుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప రూపాన్ని ఉత్సవ విగ్రహంగా రూపొందించారు. ఆవిధంగా అగ్ని ప్రమాదం జరిగినప్పటినుంచి ఉగ్ర శ్రీనివాస మూర్తిని సంవత్సరానికి ఒకసారి సూర్యోదయానికి ముందు సర్వ అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్ది ఊరేగింపుకు తీసుకెళ్ళి, తిరిగి అంతరాలయానికి తీసుకొస్తారు.


శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (ఉత్సవబేరం)

13వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఊరేగింపుకు తీసికెళ్ళడం మానేసిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవ వేడుకల్లో ఊరేగిస్తున్నారు. ఈ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని ఉత్సవబేరం అంటారు. ఈ మూర్తి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది. బ్రహ్మోత్సవాలతో సహా ప్రతి ఉత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామినే ఊరేగిస్తారు.


కొలువు శ్రీనివాసమూర్తి (బలిబేరం)

గర్భగుడిలో మూలవిరాట్టు పక్కన ఉండే మరొక చిన్న విగ్రహాన్ని కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆగమ పరిభాషలో బలిబేరం అంటారు. మూలవిరాట్టుకు తోమాలసేవ నిర్వహించిన తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు. తిరుమలలో ఆవేళ జరిగే ఉత్సవ వేడుకలు ఏమైనా ఉంటే వాటి వివరాలను తెలియజేస్తారు. శ్రీవారి హుండీలో గతరోజు వచ్చిన కానుకల వివరాలను, ఆదాయ, వ్యయాలను తెలియజేస్తారు.

ఆర్యా శతకం - 1*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 82*


*అధికాంచితమణికాంచనకాంచీ మధికాంచి కాంచిదద్రాక్షమ్।*

*అవనతజనానుకంపామనుకంపా కూలమస్మదనుకూలామ్॥*


*భావము :*


*అమ్మా! నీ బంగారు మొలనూలు, మణిమాణిక్యములతో కూర్చబడి అత్యంత సుందరముగా ఉన్నది. 'నీవే తప్ప ఇతఃపరంబెరుంగ' అని ప్రార్థించేవారిని రక్షిస్తూ, కంపా తీరములో విహరించే మాతను నేను కాంచీపురములో దర్శించాను.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః*🙏🙏 🙏

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము


అర్జున ఉవాచ ।

అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః ।

కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ।। 4 ।।



ప్రతిపదార్థ:



అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; అపరం — తరువాతిది; భవతః — మీ యొక్క; జన్మ — జన్మ (పుట్టుక); పరం — ఇంతకు ముందే; జన్మ — జన్మ (పుట్టుక); వివస్వతః — వివస్వతుడు (సూర్య దేవుడు); కథం — ఎట్లా; ఏతత్ — ఇది; విజానీయాం — నేను అర్థం చేసుకోవాలి; త్వం — నీవు; ఆదౌ — ప్రారంభంలో; ప్రోక్తవాన్ — ఉపదేశించుట; ఇతి — ఈ విధంగా.



తాత్పర్యము : 


అర్జునుడు ఇలా అన్నాడు : నీవు వివస్వానుడి తరువాత ఏంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు, అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?



వివరణ:


శ్రీ కృష్ణుడి మాటల్లో, పైకి అగుపిస్తున్న పొంతనలేని ఘటనల వల్ల అర్జునుడు అయోమయానికి గురౌతున్నాడు. సూర్య భగవానుడు సుమారుగా సృష్టి ప్రారంభం నుండీ ఉన్నాడు, కానీ, శ్రీ కృష్ణుడు ఈ మధ్యనే ఈ లోకంలో పుట్టాడు. ఒకవేళ శ్రీ కృష్ణుడు దేవకీవసుదేవుల తనయుడైతే, ఆయన చెప్పినట్టు, ఈ యొక్క యోగ విద్యని వివస్వానుడికి (సూర్య భగవానుడు) చెప్పాడనే విషయం అర్జునుడికి పొసగలేదు, అందుకే అతను ఇలా అడుగుతున్నాడు. అర్జునుడి ప్రశ్న, భగవంతుని దివ్య అవతార విషయం మీద వివరణని అడుగుతోంది, మరియు శ్రీ కృష్ణుడు దీనికి తదుపరి శ్లోకాలలో బదులిస్తున్నాడు.

15-04-2026 బుధవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

15-04-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.

---------------------------------------


వృషభం


కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక వివాదాలు నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు.

---------------------------------------


మిధునం


ఋణ దాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలా కష్టం మీద పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

---------------------------------------


కర్కాటకం


సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. 

---------------------------------------


సింహం


చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

---------------------------------------


కన్య


ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

---------------------------------------


తుల


దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి,వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.  

---------------------------------------


వృశ్చికం


సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

---------------------------------------


ధనస్సు


ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గంధరగోళంగా ఉంటుంది. నూతన వ్యాపారవిస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

---------------------------------------


మకరం


సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన అవకాశములు అందుతాయి.

---------------------------------------


కుంభం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేదాటుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------


మీనం

 

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం పొందుతారు.

---------------------------------------