తెలుగు పండిత కవులు
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
20, ఏప్రిల్ 2026, సోమవారం
జంటనగరాల పేర్ల
*జంటనగరాల పేర్ల పుట్టు పూర్వోత్తరాలు*
పూర్వం సుమారు 400 ఏళ్ళకు ముందు భాగ్యనగరంలో ఇద్దరు ముస్లిం సోదరులు, మూసీనది పక్కన బాతులు మేపుకుంటూ జీవనం చేసేవారు. ఆ ఇద్దరు సోదరులు ప్రతిరోజూ చాలా దూరం తిరుగుతూ బాతులు కాసేవారు.
ఒకనాడు వారు బాతులు కాస్తుండగా, ఉన్నట్లుండి ఆకాశంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆ ఉరుముల శబ్దానికి బాతులు చెల్లాచెదరై, మూలమూల ప్రాంతాలకు వెళ్ళిపోయాయి.
అన్నదమ్ములిద్దరూ అష్టకష్టాలు పడి బాతులన్నిటినీ ఇంట్లోని దొడ్డిలోకి చేర్చగలిగారు. పెద్దవాడికి సందేహం వచ్చి బాతులన్నిటినీ లెక్కించగా, ఒక్క బాతు తక్కువగా ఉంది. వెంటనే అన్నదమ్ములిద్దరూ తప్పిపోయిన బాతును వెతికి పట్టుకోవడానికి బయలుదేరారు. అన్న భాగ్యనగరం వైపు, తమ్ముడు నేటి సికింద్రాబాద్ ఉన్న ప్రాంతం వైపు వెళ్ళారు.
ఈ ఇద్దరికీ కూడా తెలుగు సరిగ్గా రాదు. అన్న భాగ్యనగరం అంతా తిరుగుతూ *హేదిరాబాతు* *హేదిరాబాతు* అంటూ వెతికి, వేసారిపోయి, తమ్ముడున్న చోటికి వచ్చాడు.
అప్పుడే తమ్ముడుకి బాతు దొరికింది. వాడు సంతోషంతో అరుస్తూ *సిక్కిందిరాబాతు* *సిక్కిందిరాబాతు* అంటూ, తనకు దొరికిన బాతుని అన్నకు సంతోషంగా ఇచ్చాడు. వాళ్ళిద్దరూ బాతుని తీసుకుని ఇంటికి వెళ్ళారు.
కాలక్రమేణా ఆ అన్నదమ్ములు పలికిన మాటలే కొద్దిగా మార్పు చెంది, "హైదరాబాద్" "సికింద్రాబాద్" గా స్థిరపడ్డాయేమో కదా
🤣🤣🤣
ఒక రూపాయి నాణెం
ఒక రూపాయి నాణెం
ఎనిమిదేళ్ల ఒక చిన్న బాలుడు మార్కెట్లోని ఒక దుకాణానికి వెళ్లి, దుకాణదారుడికి ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు:
“మీ దుకాణంలో దేవుడు ఉంటే, ఈ ఒక రూపాయికి నాకు ఆయనను ఇస్తారా?”
దుకాణదారు కోపంగా ఆ నాణెాన్ని బాలుడి చేతి నుంచి కొట్టి, అతడిని వెళ్లగొట్టాడు. బాలుడు నాణెాన్ని తీసుకుని, ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి తిరుగుతూ, “ఒక రూపాయికి దేవుడు దొరుకుతాడా?” అని అడుగుతూనే ఉన్నాడు.
చాలా మంది దుకాణదారులు అతడిని తోసివేశారు. కానీ ఆ బాలుడు మాత్రం ధైర్యం కోల్పోలేదు.
చివరికి ఒక పెద్ద దుకాణంలోకి వెళ్లి అదే ప్రశ్న అడిగాడు. ఆ దుకాణ యజమాని చాలా కోపంగా అతడిని బయటికి లాగి తోసేశాడు. ఆ బాలుడు రోడ్డుపై . . అప్పుడే వెళ్లిపోతున్న ఒక ఖరీదైన విలాసవంతమైన కారు ముందు పడిపోయాడు. కారు వెంటనే ఆగింది. అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.
ఒక ధనవంతుడు కారు నుంచి దిగుతూ ఏమైంది అని అడిగాడు. బాలుడు జరిగిన సంగతిని మొత్తం చెప్పి, తన ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు:
“మీ దగ్గర దేవుడు ఉంటే, ఈ ఒక రూపాయికి నాకు ఇస్తారా?”
ఆ ధనవంతుడు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు:
“నేను ఒక రూపాయికి దేవుణ్ణి కొనుగోలు చేసి నీకు ఇస్తే, ఆయనతో ఏమి చేస్తావు?”
బాలుడు సమాధానమిచ్చాడు:
“నా అమ్మ నాకు అన్నీ. ఆమె నాకు భోజనం పెడుతుంది, జోలపాటలు పాడుతుంది, నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. డాక్టర్లు ‘దేవుడే ఆమెను కాపాడగలడు’ అన్నారు. అందుకే ఒక రూపాయికి దేవుడు దొరుకుతాడేమో అని వెతుకుతున్నాను.”
ఇది విన్న ఆ ధనవంతుడు అన్నాడు:
“నీకు ఒక రూపాయికి దేవుడు కావాలా? నేను ఇస్తాను.”
అతడు ఒక లేఖ రాసి, కవర్లో పెట్టి బాలుడికి ఇచ్చాడు.
“నీ అమ్మ ఉన్న ఆసుపత్రికి వెళ్లి, ఈ లేఖను ఒక ప్రత్యేక డాక్టర్కి ఇవ్వు,” అని చెప్పాడు.
బాలుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆ లేఖను పేర్కొన్న డాక్టర్కు ఇచ్చాడు. డాక్టర్ ఆ లేఖను తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. అది ఆసుపత్రి స్థాపకుడు స్వయంగా రాసిన లేఖ. వెంటనే బాలుడి తల్లికి అత్యుత్తమ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
కొన్ని రోజుల తరువాత, అదే కారు నుంచి దిగిన ఆ ధనవంతుడు—అదే ఆసుపత్రి స్థాపకుడు—ముఖ్య వైద్యులతో కలిసి ఆమెను చూడడానికి వచ్చాడు.
తల్లి ఆసుపత్రి ఖర్చులు ఎలా చెల్లించాలి అని ఆందోళన చెందుతోంది.
ఆ ధనవంతుడు ఆమెను ధైర్యం చెప్పాడు:
“మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కుమారుడు ఇప్పటికే మీ చికిత్సకు కావాల్సిన మొత్తం చెల్లించాడు.”
అది విన్న తల్లి ఆశ్చర్యపోయి, తన పక్కన నిద్రిస్తున్న తన కుమారుడిని చూసింది.
ఆయన మరలా అన్నాడు:
“వైద్య ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ కుమారుడి చదువుకు వినియోగిస్తాను.”
తల్లి భావోద్వేగానికి లోనై, “మీరు ఇది ఎందుకు చేస్తున్నారు?” అని అడిగింది.
ఆయన సమాధానం ఇచ్చాడు:
“మీ కుమారుడి దేవుడిపై ఉన్న అచంచల విశ్వాసం, ఆయన ఎక్కడున్నా సంపాదించాలనే సంకల్పమే ఈ సేవకు కారణం.”
హృదయంలో విశ్వాసం ఉండి, దృఢమైన సంకల్పం ఉంటే — ఒక రూపాయికైనా దేవుడు దొరుకుతాడు. 🙏
చందనోత్సవం
👉ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం.
👉అదే రోజున పరశురామ జయంతి .
మరిన్ని అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.
1. పరశురాముని
జన్మదినం
2. పవిత్ర గంగా నది
భూమిని తాకిన
పర్వదినం
3. త్రేతాయుగం
మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు
తన బాల్యమిత్రుడైన
కుచేలుని కలుసుకొన్న
దినం
5. వ్యాస మహర్షి
“మహా భారతము”ను,
వినాయకుని
సహాయముతో,
వ్రాయడం
మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు
అజ్ఞాతవాసములో
వున్న పాండవులకు
అక్షయ పాత్ర
ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి
కుబేరుడు
శ్రీమహాలక్ష్మితో
సమస్త సంపదలకు
సంరక్షకునిగా
నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు
“కనకధారాస్తవం” ను
చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి
తన అవతారాన్ని
స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు
దుశ్శాసనుని
బారినుండి
కాపాడిన దినం.
19, ఏప్రిల్ 2026, ఆదివారం
కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ
కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .
కుంకుమ పువ్వుని సంస్కృతము నందు కాశ్మీరజము , కుంకుమము , బాహ్లీకము , శోణితము , సంకోచము , పీతనకము అనే పేర్లతో పిలుస్తారు . భావప్రకాశము అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథము నందు కుంకుమపువ్వు యొక్క నాణ్యత మరియు ఔషధగుణములు ఆయా దేశ వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది అని తెలియచేయబడినది. వానిలో కాశ్మీర దేశము నందు పుట్టెడు కుంకుమపువ్వు చిన్నచిన్న కేశరములు కలిగి కొంచం అంత ఎరుపురంగుతో కూడుకుని కమలం వంటి పరిమళము కలిగి ఉండును అనియు ఇదే అత్యంత శ్రేష్టం అని రాయబడినది.
ద్రవ్యకోశము అనే వైద్యగ్రంధము నందు లేత ఎరుపురంగుతో , మంచి పరిమళముతో , చేతితో నలిపిన చేతికి అంటుకొని రంగువీడక యున్నచో అట్టి కుంకుమ పువ్వు శ్రేష్టం అయినది అనియు , బాగా ఎరుపు రంగుతో ఉండి నోటియందు వేసుకొనిన మిక్కిలి చేదుగా , పసుపుపచ్చ రంగుతో ఉన్నచో అట్టి కుంకుమపువ్వు తక్కువరకము అని తెలుసుకొనవలెను .
కుంకుమపువ్వు సాధారణముగా కొంచం చేదు కలిగి ఉండి నాలుకకు తిమ్మిరి కలిగించునదిగా మెత్తగా ఉండును. ఇది జిగటగా ఉండును. కొంతమంది ఈ కుంకుమపువ్వుని చందనంతో అరగదీసి పైపూతగా వాడుదురు . మరికొంతమంది తాంబూలముతో లోపలికి సేవించెదరు. శరీరం నందు వేడిని పుట్టించి వీర్యవృద్ధిని , కాంతిని , బలము , ఆయుర్వృద్దిని కలిగించి విషము , శోష , మదప్రకోపము , నేత్రవ్యాదులు , శిరోవ్యాధులు , గొంతుజబ్బులు , శరీరము నందలి మచ్చలు , దురదలు , కుష్టు , చిడుము , గజ్జి మున్నగు చర్మరోగములు , రసదోషములు , మేధోరోగములు మొదలైనవానిని హరించును . రక్తశుద్ది కలిగించి శరీర దుర్బలత్వము హరించును . గడ్డలను కరిగించును . చర్మరోగములు మాన్పును . కస్తూరి వలే ఏ ఔషధమునకు అయినను అనుపానంగా ఇచ్చిన ఔషధం త్వరగా పనిచేయును . టైఫాయిడు జ్వరము , ఉన్మాదరోగము , అపస్మారము , ప్రసవించు సమయంలో సంభవించు వాతరోగములు , ఋతురక్తబద్ధం , సమస్త నేత్రరోగములు ( కంటి పైన పట్టు వేయవలెను ) , ఓడలలో ప్రయాణము చేయువారికి వచ్చు జబ్బులు , మనోచాంచల్యములు పోగొట్టును .
18, ఏప్రిల్ 2026, శనివారం
వైశాఖ పురాణం
*🐚శనివారం 18 ఏప్రిల్ 2026🐚*
_*🚩వైశాఖ పురాణం - 1 వ అధ్యాయము🚩*_
*వైశాఖమాస ప్రశంస*
*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*
*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*
```
సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. “మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి ‘మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నా’నని సవినయముగ ప్రశ్నించెను.
నారదుడును “రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను.. ‘పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.
అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.
```
*🙏వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణం 🙏*
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏v
పురాణవైరాగ్యం
పురాణవైరాగ్యం:
అది పరమపవిత్రమైన ''కాశీ'' క్షేత్రం.గంగా నది ఒడ్డున ఓ సత్రంలో డా..సర్వజ్ఞ గారి ప్రవచనం జోరుగా సాగుతోంది. . అందరూ ఆ మహేశ్వరుడి గురించి ఆయన చెపుతుంటే ఆనంద పారవశ్యంలో వింటున్నా రు.
వారిని చూసి మహేశ్వరుడి కి ఆనందం కలిగి పార్వతి తో చూశావా దేవి నాభక్తుల పారవశ్యం నేనంటే వారికి ఎంత ఇష్టమో! అనగానే అమ్మవారు నవ్వుతూ వారంతా భక్తులు గా నటిస్తున్న వారే కాని నిజమైన వారు కారు.కావాలంటే చూసుకోండి అంది అమ్మవారు.
అయితే చూడు పార్వతీ అన్నారు స్వామి.
కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని సర్వజ్ఞ గారు చెబుతుంటే భక్తులంతా పారవశ్యంతో శివా మమ్మల్ని నీలో కలుపుకో మోక్షం ఇవ్వు మహేశ్వరా అనగానే టక్కున
శివుడు ప్రత్యక్ష మయ్యాడు.
నా ప్రియ భక్తులారా మీ మొర ఆలకించా మోక్షం కావలసిన వారు
నాతో రావచ్చు రేపు ఇదే సమయానికి వస్తా సిద్ధంగా ఉండమని శివుడు అదృశ్యమైపోయాడు.
మర్నాడు ప్రవచన సమయానికి శివుడు వచ్చాడు. ఆపాటికే భక్తులంతా సర్వజ్ఞ గారి తో సహా
అలహాబాద్ దాటిపోయారు.
కైలాసం చేరిన శివుడ్ని చూసి అమ్మవారు నవ్వింది ఎగతాళి గా
అప్పుడే అక్కడకు చేరుకున్న నారద
మునీంద్రుడు కి విషయం అర్దమయ్యింది.
అమ్మా జననీ ఇది మహేశ్వర లీల
ఆయనకి తెలియదా నిజ భక్తులు
ఎవ్వరో? పందెంలో నిన్ను గెలిపించాలనే స్వామి వారి లీల.
అది మానవనైజమైన పురాణ వైరాగ్యం.
మానవుడు ధర్మాచరణం చేస్తూ నిర్వహించే నిర్దేశిత కర్మమే మోక్ష సోపానం.
నారాయణ నారాయణ అంటూ ఆది దంపతుల దర్శనానందంతో వెనుతిరిగాడు నారదమునీంద్రుడు.
***
జయంతి లక్ష్మీ నరసింహం
వైశాఖమాసమ్
*వైశాఖమాసమ్/మాధవమాసమ్(18.04.26 నుండి 16.05.26)*
వైశాఖమాసం అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన మాసం. దీనిని 'మాధవమాసం' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది శ్రీ మహావిష్ణువుకు (మాధవుడు) అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఏప్రిల్-మే నెలల మధ్య వచ్చే ఈ మాసం ఆధ్యాత్మిక, ఆరోగ్య మరియు దాన ధర్మాల పరంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
*వైశాఖమాసం/మాధవమాసం విశిష్టతలు:*
*మాధవ స్మరణ* - *విష్ణు పూజ* : వైశాఖమాసంలో శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అత్యంత శ్రేష్ఠం. ఈ మాసంలో తులసీ దళాలతో పూజించిన వారికి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
*ప్రాతః స్నాన విశిష్టత* : ఈ మాసంలో సూర్యోదయానికి ముందే (ప్రాతఃకాలాన) నదులు, తీర్థాదులలో స్నానం చేయడం, మధుసూదనుని స్మరించడం వల్ల పాపాలు నశించి, దివ్యఫలాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
*దాన ధర్మాలు (చలివేంద్రాలు):* ఎండలు మండిపోయే కాలం కావడంతో, వైశాఖంలో నీటి దానం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పళ్ళరసాలు, మజ్జిగ దానం చేయడం చాలా పుణ్యప్రదం. అలాగే, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు, మంచం, పరుపు దానం చేయడం వల్ల అఖండ మోక్ష సామ్రాజ్యం, ఆరోగ్య సిద్ధి లభిస్తాయని చెబుతారు.
*ఆరోగ్య నియమాలు* : వైశాఖమాసంలో ఒంటిపూట భోజనం (ఏకభుక్తం) లేదా రాత్రిపూట మాత్రమే భోజనం (నక్తం) చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.
*పవిత్రమైన దినాలు:*
*వైశాఖ పౌర్ణమి (బుద్ధ పూర్ణిమ):* విశాఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి, దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
*అక్షయ తృతీయ:* వైశాఖ శుద్ధ తదియ నాడు ఏ దానం చేసినా, ఏ జపం చేసినా అది అక్షయం (అక్షయం - తరగనిది) అవుతుంది.
*నృసింహ జయంతి* : వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు శ్రీ నృసింహస్వామి అవతరించారు.
*శంకర జయంతి* : ఆదిశంకరాచార్యుల జన్మదినం వైశాఖ శుద్ధ పంచమి.
కలశ స్థాపన సమయంలో
కలశ స్థాపన సమయంలో లేదా కొబ్బరికాయను కలశంపై ఉంచేటప్పుడు పఠించే ఈ శ్లోకం యొక్క అర్థం మరియు అంతరార్థం చాలా గొప్పవి
ఆ శ్లోకం ఏమిటంటే..
> **నారికేళ సముద్భూత త్రినేత్ర హర సమ్మితా |**
> **శిఖయా దురితం సర్వం పాప పీడాంచ మే నుద ||**
* **నారికేళ సముద్భూత:** కొబ్బరి చెట్టు నుండి ఉద్భవించిన ఓ ఫలమా!
* **త్రినేత్ర హర సమ్మితా:** మూడు కన్నులు కలిగి ఉండటం వల్ల (కొబ్బరికాయకు ఉండే మూడు కన్నులు), నువ్వు ముక్కంటి అయిన ఆ పరమశివునితో సమానమైనదానివి.
* **శిఖయా:** నీపై ఉన్న పీచు (శిఖ/జుట్టు) ద్వారా...
* **దురితం సర్వం:** నాలో ఉన్న సమస్త దుర్గుణాలను, కష్టాలను...
* **పాప పీడాంచ మే నుద:** నా పాప ఫలాల వల్ల కలిగే పీడను తొలగించు (నుద - తొలగించు/నశింపజేయు).
శాస్త్రం ప్రకారం, కొబ్బరికాయ కేవలం ఒక ఫలం మాత్రమే కాదు. అది మనిషి అహంకారానికి చిహ్నం. పైన ఉన్న పీచు మన అజ్ఞానానికి, లోపల ఉన్న గట్టి పెంకు మన అహంకారానికి, లోపల ఉండే తెల్లని కొబ్బరి నిర్మలమైన మనసుకి సంకేతం.
కలశం మీద కొబ్బరికాయను ఉంచేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం: **"ఓ దైవ స్వరూపమా! శివునితో సమానమైన శక్తి కలిగిన ఈ ఫలం ద్వారా నా పాపాలను, కష్టాలను హరించి నాకు ప్రశాంతతను ప్రసాదించు"** అని వేడుకోవడం.
ఈ శ్లోకాన్ని పఠిస్తూ కలశాన్ని పూజించడం వల్ల ఆ కలశంలో దైవ శక్తి పరిపూర్ణంగా ఆవాహన అవుతుందని భక్తుల నమ్మకం.
మండప దానంతో పాటు ఈ కలశ మీద కొబ్బరికాయ బ్రహ్మ గారికి చెందుతుంది. అయితే ఇంట్లో స్వయంగా పూజ చేసుకుంటే కొబ్బరికాయను ప్రసాదంగా యజమాని తీసుకోవాలి.
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - రేవతి - భృగు వాసరే* (17.04.2026)
https://youtube.com/watch?v=eEIcUKjd7KE&feature=shared
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
---------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
