21, ఏప్రిల్ 2026, మంగళవారం

సమస్యాపూరణం

  సమస్యాపూరణం

సమస్య.ఘనముగ గాడిదల్ మధురగానమొనర్చె, సభాంతరమ్మునన్.


వినుతిని గాంచె శాస్త్రమది, విజ్ఞతజాటుచు విశ్వమంతటన్,

దొనరగ నన్నికార్యముల దోహదమయ్యెను నవ్యమార్గమై,

ధ్వనులను రూపముల్ సరిగ దాల్చెడి కృత్రిమ మేధ గూర్పగా,

ఘనముగ గాడిదల్ మధురగానమొనర్చె సభాంతరమ్మునన్.


సురభిశంకరశర్మ.

శంకరుల జన్మస్థలం

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*శంకరుల జన్మస్థలం కాలడి*


సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శారదాంబతోవాదన

  తే. శారదాంబతోవాదన సల్పి సకల 

శాస్త్ర సారము నేర్చిన శంకరులు న 

లుదిశలందునుపీఠములుంచెనంత

 అద్వైత మత బోధలు జను లాదరించె


జయలక్ష్మి

వైశాఖ శుద్ధ పంచమి

 శ్రీరామ (125)


(నేడు 21-4-'26, వైశాఖ శుద్ధ పంచమి, జగద్గురు

 శ్రీ ఆదిశంకరుల జయంతి).


శ్లో//శ్రుతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్/

నమామి భగవత్పాద శంకరం లోక శంకరమ్//

(శ్రుతులు,స్మృతులు,పురాణములు,ఇతిహాసాదులయందు నిగూఢంగా ఉన్న విషయములను వెలికి తీసి,

సమస్త జీవకోటియందు కరుణ కలవారై, 

అద్వితీయమైన తమ రచనల ద్వారా మానవాళికి జ్ఞాన భిక్ష పెట్టి,

జగద్గురువులై,

సమస్త లోకములకు శుభము కలిగించే,

 శ్రీ శంకర భగవత్పాదుల వారికి నమస్కరిస్తున్నాను).


                             --------


శ్రీ శంకరభగవత్పాదులవారు కాలడిలో జన్మించడం, దుర్మతములను ఖండిస్తూ, భారతదేశమంతా మూడు పర్యాయములు పర్యటించడము, ప్రజలకు తన తరువాత కూడా సన్మార్గాన్ని నిరంతరం బోధించుటకు నలుదిక్కులా నాలుగు చతురామ్నాయ మఠములను స్థాపించడము అందరికీ తెలిసిన విషయమే.

అయితే ముఖ్యమైన విషయం వారి అద్వైత బోధ.

మానవజన్మ శాశ్వత సుఖం సంపాదించటానికి వచ్చింది.

దీనికి విరుద్ధంగా మానవజాతి అశాంతితోను, దుఃఖముతోను బాధపడుతున్నది.

దీనికి కారణం అజ్ఞానం.

సద్గురువులందరికి అజ్ఞానంతో దుఃఖములపాలవుతున్న ప్రజాబాహుళ్యంపై కరుణ ఎక్కువ.

శ్రీ శంకరభగవత్పాదులవారు కరుణామయులు

మానవులు సకల దుఃఖములనుండి తరించి, శాశ్వతానందం పొందగలిగే "అద్వైత స్థితిని" అనుభవం ద్వారా తెలుసుకున్నవారు. 


సామాన్యులకు కోట్లాది పూర్వజన్మలలో చేసిన పుణ్య పాపములు, అనేక జన్మలను కలిగించి నిరంతరం సుఖదుఃఖాలను అనుభవింపజేస్తూ ఉంటాయి.


బ్రహ్మజ్ఞాని మాత్రం ఆ పూర్వజన్మ కర్మలన్ని నశింపజేసుకొని శాశ్వతానందంలో ఉంటాడు.


అయితే బ్రహ్మజ్ఞానం ఉదయించగానే జ్ఞాని విదేహముక్తుడవుతాడని (అనగా దేహం నశిస్తుందని) కొందరంటారు.


కానీ అన్ని కర్మలు నశించినా ఇప్పుడు నడుస్తున్న జన్మ ఏ కర్మవల్ల వచ్చిందో ఆ కర్మమాత్రం దేహం నశించేపర్యంతం ఉంటుందని, 

దేహం నశించగానే అనగా మరణించగానే,ఆ కర్మ కూడా నశిస్తుందని, ఉపనిషత్తులు చెబుతున్నాయి.


భగవంతుని సంకల్పాన్ననుసరించి వేదవ్యాసమహర్షి వంటి కొంతమంది బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానం ఉదయించిన పిమ్మట కూడా శరీరధారణ చేస్తూ జగత్కార్యం నిర్వహిస్తున్నారు. 


అలాగే శ్రీ శంకరభగవత్పాదులవారు బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత కూడా కొంతకాలం దేహధారణ చేసి, లోకకల్యాణం కోసం అద్వైత స్థితి ఎలా సాధించాలో ప్రచారం చేశారు.


తాము బ్రహ్మజ్ఞానులై జీవన్ముక్తులుగా సంచరిస్తున్న తమ అనుభవాన్ని, శ్రీ శంకరభగవత్పాదులవారు తమ బ్రహ్మసూత్ర భాష్యంలో ఇలా సూచించారు.

        (బ్ర.సూ. భాష్యం 4 - 1 -15)


" అపి చ నైవాత్ర విదితవ్యం, బ్రహ్మవిదా కంచిత్కాలం శరీరం ధ్రియతే వా న వా ఇతి.

కథం హ్యేకస్య స్వహృదయ ప్రత్యయం, బ్రహ్మ వేదనం, దేహధారణం, చ అపరేణ ప్రతిక్షేప్తుం శక్యేత ? శ్రుతి, స్మృతిషు చ స్థితప్రజ్ఞ లక్షణ నిర్దేశేన ఏతదేవ నిరుచ్యతే "

( బ్రహ్మవేత్త కొంతకాలం శరీరాన్ని ధరించి జీవన్ముక్తుడుగా ఉంటాడా, ఉండడా, అని వివాదం చేయవలసిన పని లేదు. ఒకని హృదయానికి ప్రత్యక్షంగా గోచరిస్తున్న బ్రహ్మజ్ఞానము, దేహధారణము అనే వాటిని ఇతరుడు ఎలా నిరాకరించగలుగుతాడు ?

శ్రుతి స్మృతులలో స్థితప్రజ్ఞుని లక్షణాలను నిర్దేశించడంచేత ఇదే నిర్వచింప బడుచున్నది)


దీన్నిబట్టే ద్వైత, విశిష్టాద్వైత, సిద్ధాంతాలు సంపూర్ణజ్ఞానం ప్రసాదించలేవని,

అద్వైతాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న 

శ్రీ శంకరుల సిద్ధాంతమే సత్యమని మనం గ్రహించవచ్చు.


భగవత్తత్త్వం అవగాహన చేసుకోవటమే బ్రహ్మజ్ఞానం.

ఆ అవగాహనతో శాశ్వతానంద స్థితిలో ఉండటమే అద్వైతస్థితి.

అది ఈశ్వరానుగ్రహంతోనే సాధ్యం.


వేదం భగవంతుని గురించి

 "సత్యం, జ్ఞాన,మనంతం,బ్రహ్మ" 


(భగవంతుడు ఉన్నాడు.ఆయన సర్వజ్ఞుడు. సర్వ జగత్తును వ్యాపించి ఉన్న ఆ భగవంతుడు ఆద్యంతములు లేనివాడు)

 అని ఉపదేశించింది.

అది యథాతథంగా తెలుసుకోవడమే "బ్రహ్మజ్ఞానం" అన్నా, "ఆత్మజ్ఞానం"అన్నా.

అలా తెలుసుకున్నవాడు సమస్త దుఃఖములనుండి తరిస్తాడు.

అందువల్ల శ్రుతి "తరతి శోక మాత్మవిత్" (ఆత్మవేత్త సమస్త దుఃఖములనుండి తరిస్తాడు) అని చెబుతున్నది.


ఈ అద్వైత స్థితి భగవంతుని అనుగ్రహం వలన వస్తుంది అని ఉపదేశించారు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు. 


శ్లో// ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసనా/

మహాభయ కృత త్రాణా ద్విత్రాణాం యది జాయతే//

(జన్మ,మరణాది రూప సంసారం గురించిన మహాభయం పోగొట్టి,మోక్షస్థితి కలిగించే అద్వైత భావన, కోట్లాది మందిలో ఏ ఇద్దరు, ముగ్గురికో కలిగిందంటే అది కేవలం ఈశ్వరుని అనుగ్రహం వల్లనే). 



 "పరమేశ్వరుడు" అనేవాడు ఒకడున్నాడు,

 ఆయన అనుగ్రహం సంపాదించాలి,

 అనే ఆలోచన సంసారంలో నిమగ్నుడైన జీవునకు కలుగదు.

అంతేకాదు, పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా దేవునియందు అవిశ్వాసము,ద్వేషము కూడా కలుగుతాయి.


శ్లో//మహా పాపవతాం పుంసాం జ్ఞానయజ్ఞో 

న రోచతే/

ప్రత్యుత జ్ఞానయజ్ఞస్తు ప్రద్వేష్యో భాసతే స్వతః//


(పూర్వజన్మ పాప ప్రతిబంధకం వల్ల పురుషులకు జ్ఞానమార్గం రుచించక పోవడమే కాకుండా, దానిని గూర్చి స్వతః ద్వేషము కూడా జనించును).


మరి ఏ విధంగా ఈ ఆత్మజ్ఞానం లభిస్తుందో

వేదమాత ఇలా చెబుతున్నది:

" అణోరణీయా న్మహతో మహీయా నాత్మాగుహాయాం నిహితో౽స్య జన్తోః/

తమక్రతుం పశ్యతి వీతశోకో థాతుః ప్రసాదా న్మహిమాన మీశమ్ "

(ఆ పరమాత్మ అణువు కంటే సూక్ష్మమైన వాడు. గొప్పవైన ఆకాశాదికముకంటే గొప్పవాడు.

దేవ,మనుష్యాది ప్రాణిజాతము యొక్క హృదయ పద్మమందలి "బుద్ధి" అనే గుహలో గురువు ఉపదేశించిన విద్యచేత పొందబడుతున్నాడు.

ఈ స్థితి,

 "థాతుః - సర్వ జగన్నిర్మాత కాబట్టి థాత శబ్దముచే చెప్పబడుతున్న పరమేశ్వరుని యొక్క,

ప్రసాదాత్-- అనుగ్రహం వల్లనే,

మహిమానం - మిక్కిలి గొప్పవాడు,

ఆక్రతుం -- ఏ సంకల్పములు లేనివాడు అయిన

తం ఈశం -- ఆ ఈశ్వరుని,

పశ్యతి--సాక్షాత్కారం చేసికొనుచున్నాడు.

సాక్షాత్కారం చేసుకుని,

వీత శోకః--జన్మ,మరణాది శోకరహితుడు అగుచున్నాడు)


ఈ విధంగా "పరమేశ్వరుని" అనుగ్రహం వల్లనే ఆత్మ జ్ఞానం కలిగి జీవుడు సంసార బంధములనుండి ముక్తుడవుతాడు అని వేదమాత ఉద్బోధిస్తోంది.


ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఆయన ఆజ్ఞలైన

 "సత్యం వద(ఎల్లప్పుడూ సత్యమునే చెప్పుము),

"ధర్మం చర"(ధర్మమునాచరింపుము),

"మాతృదేవో భవ" (తల్లిని దైవముగా పూజింపుము),

"పితృదేవో భవ" (తండ్రిని దైవముగా పూజింపుము)

మొదలైన సత్కర్మానుష్ఠానం వల్ల లభిస్తుంది.

ఈ వేద బోధలన్నింటినీ సమన్వయపరిచి మానవజాతి మీద ఉన్న పరమ కారుణ్యంతో,

 జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులవారు,

తాము ఏ మార్గాన్ని అనుసరించి అద్వైత స్థితి సాధించారో ఆ సన్మార్గాన్ని 'వేదో నిత్య మధీయతాం' తో మొదలైన ఉపదేశపంచకం అనే ఐదు శ్లోకములలో మనకు ఈ విధంగా అనుగ్రహించారు.



1. నిత్యము వేదాధ్యయనము,(లేదా తత్తుల్యములైన పురాణములను అధ్యయనం) చేయాలి.

2. ఆ వేదములందు చెప్పబడిన నిత్య,నైమిత్తికాది సత్కర్మలను చక్కగా ఆచరించాలి.

3. ఆ కర్మలయొక్క ఫలములను ఆశింపక, వాటిని ఈశ్వరునకు అర్పించి, అ ఈశ్వరుని భక్తిపూర్వకంగా ఆరాధన చేయాలి.

4. క్రమ క్రమంగా, కామ్యకర్మలందు ఆసక్తి త్యజించాలి.

5. సత్కర్మానుష్ఠానంతో, జ్ఞానోత్పత్తికి అవరోధంగా ఉన్న పాపములను పోగొట్టుకోవాలి.

6. ప్రాపంచిక సుఖములు దోషభూయిష్ఠములనే విషయం గ్రహించి, వాటియందు వైరాగ్యం వహించాలి.

7. ఆత్మజ్ఞానమునందు కోరికను దృఢంచేసుకోవాలి.

8. ఆ కోరిక ధృఢమైన వెంటనే నిరాటంకంగా సాధన సాగించి, అద్వైత స్థితి సాధించేందుకు స్వగృహము నుండి బయటపడాలి.

9. సత్పురుషులతో సాంగత్యము చేయాలి.

10. ఆ సాంగత్యం వల్ల భగవంతుని యందు భక్తిని దృఢం చేసుకోవాలి.

11.బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము అయిన శమదమాదులు వృద్ధి చేసుకోవాలి.

12.తరువాత సన్యాసం స్వీకరించాలి.

13. బ్రహ్మవేత్తయైన విద్వాంసుని గురువుగా ఏర్పరచుకుని వారికి తనను సమర్పించుకోవాలి.

14. అనుదినము భక్తితో గురువును సేవించాలి.

15. బ్రహ్మతత్త్వమును ఉపదేశించమని వారిని ప్రార్థించాలి.

16. గురువుయొక్క ఉపదేశమును ఏకాగ్రతతో శ్రవణం చేయాలి.

17. గురువు ఉపదేశించిన వాక్యములను యథాశాస్త్రంగా విచారణ చేయాలి.

18. ఆ విచారణ తన బుద్ధికి తోచినట్లు చేయక వేదసమ్మితమైన పక్షమునే ఆశ్రయించి విచారణ చేయాలి.

19. దుస్తర్కమును చేయకూడదు.

20. శ్రుతి సమ్మతమైన తర్కముతో వాక్యముల అర్థమును నిశ్చయించుకోవాలి.

21. ఆ నిశ్చయముయొక్క పర్యవసానంగా జీవుడు, భగవంతుడు, ఒకడేనని, భేదము లేదని గుర్తించి, జీవుడననుకొనుచున్న తాను బ్రహ్మను అని దృఢముగా భావించాలి.

22. ఆ భావనా బలంతో గర్వమును నిశ్శేషంగా పరిత్యజించాలి.

23. పాంచభౌతికమగు ఈ దేహమునందు "నేను"అను బుద్ధిని విడనాడాలి.

24. పండితులతో వాదములు చేయకూడదు..

25. ఆకలి అనునది వ్యాధి అని, దానికి చికిత్స చేయాలి అనే భావన కలిగి ఉండాలి.

26. ఆ ఆకలివ్యాధిని శమింపజేయుటకు 'భిక్ష' అను ఔషధమును స్వీకరించాలి.

27. రుచికరమైన పదార్థములను యాచించ కూడదు.

28. దైవవశంతో లభించినదానితో తృప్తి పడాలి.

29. శీతోష్ణములు, జయపరాజయములు, లాభనష్టములు,సుఖదుఃఖములు, మొదలైన ద్వందములను ఓర్పుతో సహించాలి.

30. వ్యర్థముగా లౌకిక వాక్యములు పలకడం మానివేయాలి.

31. అన్ని విషయములందు ఉదాసీన భావము అలవర్చుకోవాలి.

32. జనులు తనయందు దయాభావం కలిగి ఉండాలి అనే భావము, తనను ఎవరూ నిందించకూడదు అనే భావము త్యజించాలి.

33. ఏకాంత ప్రదేశంలో సుఖముగా కూర్చోవాలి.

34. బ్రహ్మ తత్త్వమునందు చిత్తమును ఏకాగ్రం చేసి ఆ తత్త్వమును ధ్యానిస్తూ ఉండాలి.

35.పరిపూర్ణముగా ప్రపంచమంతా వ్యాపించినది,సర్వాత్మకమైనది యగు తన శుద్ధాత్మ స్వరూపమును సాక్షాత్కరించుకోవాలి.

36. 'అహంబ్రహ్మాస్మి' తానే బ్రహ్మ అనే విజ్ఞానముచే, దృశ్యమానమగు ఈ ప్రపంచము తనకంటే వేరుగా లేదని గుర్తించాలి.

37. బ్రహ్మ, ఆత్మ(తాను) ఒకటే అనే జ్ఞానముచే జీవన్ముక్త భావమును పొంది, జ్ఞానోదయమునకు పూర్వము తానార్జించిన కర్మలనన్నిటినీ నశింపజేయాలి.

38. ఆ జీవన్ముక్త భావము యొక్క బలముతో ముందు చేయబోవు కర్మలతో సంశ్లేషము పొందకుండా ఉండాలి.

39. ఈ దేహారంభానికి కారణమైన ప్రారబ్ధ కర్మను నిర్లిప్తంగా అనుభవించాలి.

40. ప్రారబ్ధ కర్మ వేగము నశించగా తాను శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడై ఉండిపోవాలి (విదేహముక్తి)


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

21-4-'26.

Mantra

 Mantra - 16 ARUNAM 2nd anuvaakam 


శుక్రం తే అన్య ద్యజతం తే అన్యత్। 

విషురూపే అహనీ ద్యౌరీవాసి|

విశ్వా హి మాయా అవసి స్వధావః| 

భద్రా తే పూషన్నిహ రాతిరస్త్వితి॥ 



ఈ మంత్రం అత్యంత ప్రసిద్ధమైన మంత్రాలలో ఒకటి. ఇది వాస్తవానికి ఋగ్వేదం నుండి గ్రహించబడింది. ఇది సూర్యునిలోని రెండు భిన్నమైన రూపాలను (పగలు మరియు రాత్రి) స్తుతిస్తూ, పోషకుడైన పూషుడు (సూర్యుడు) మనపై అనుగ్రహం కురిపించాలని ప్రార్థిస్తుంది.


*శుక్రం తే అన్యత్*: నీ యొక్క ఒక రూపం తెల్లనిది (పగలు/సూర్యకాంతి).


*యజతం తే అన్యత్*: నీ యొక్క మరొక రూపం పూజనీయమైనది/చీకటితో కూడినది (రాత్రి/చంద్రకాంతి లేదా నక్షత్ర కాంతి).


*విషురూపే అహనీ*: వేర్వేరు రూపాలు కలిగిన పగలు మరియు రాత్రి అనే రెండు కాలభాగాలు.


*ద్యౌః ఇవ అసి*: నువ్వు ఆకాశం వలె (అనంతంగా) ఉన్నావు.


*విశ్వా హి మాయా అవసి*: నీవు సమస్తమైన సృష్టి శక్తులను (మాయలను) రక్షిస్తున్నావు.


*స్వధావః*: నీలోనే నిక్షిప్తమై ఉన్న శక్తి కలవాడా! (స్వయం ప్రకాశకుడు).


*భద్రా తే పూషన్ ఇహ రాతిః అస్తు*: ఓ పూషన్! నీ యొక్క మంగళకరమైన అనుగ్రహం (దానం) మాకు ఇక్కడ కలుగుగాక.


ఓ సూర్య భగవానుడా (పూషన్)! నీవల్ల భూమి మీద రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి ప్రకాశవంతమైన పగలు, రెండోది పూజనీయమైన రాత్రి. విభిన్న రూపాలు కలిగిన ఈ అహోరాత్రులు రెండూ నీవే. ఆకాశం వలె నీవు సర్వవ్యాపివై ఉన్నావు. నీ సహజ సిద్ధమైన శక్తితో ఈ విశ్వంలోని సకల శక్తులను నీవే రక్షిస్తున్నావు. అట్టి నీ మంగళకరమైన అనుగ్రహం మాపై ఎల్లప్పుడూ ఉండుగాక.


 *శుక్రం మరియు యజతం*: ఇక్కడ 'శుక్రం' అంటే సూర్యుని తీక్షణమైన కాంతి. 'యజతం' అంటే యజ్ఞార్హమైనది, ప్రశాంతమైన రాత్రి కాలం. చీకటి అయినా సూర్యుని శక్తి చంద్రుని ద్వారా లేదా అగ్ని ద్వారా రాత్రి వేళ కూడా ఉంటుందని వేదం చెబుతుంది.


 *అద్వైత భావన*: పగలు-రాత్రి అనేవి మనకు విడివిడిగా అనిపించినా, అవి ఒకే సూర్య తత్త్వం యొక్క రెండు పార్శ్వాలని ఈ మంత్రం స్పష్టం చేస్తోంది.


 *పూషుడు* (Pushan): పూషుడు అంటే పోషించేవాడు. సూర్యుడు కేవలం వెలుగునివ్వడమే కాకుండా, భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటిని తన శక్తితో పోషిస్తున్నాడు కాబట్టి ఆయనను 'పూషన్' అని పిలుస్తారు.


ఈ మంత్రం పఠించడం వల్ల శుక్ర గ్రహ అనుగ్రహం, దృష్టి లోపాలు తొలగుతాయని, బుద్ధి ప్రచోదనం కలుగుతుందని వైదిక సంప్రదాయంలో విశ్వాసం. కాలచక్రాన్ని నడిపించే ఆ పరమాత్మ శక్తిని ఇక్కడ అత్యంత భక్తితో స్తుతించడం జరిగింది.

20, ఏప్రిల్ 2026, సోమవారం

పంచాంగం

 


జంటనగరాల పేర్ల

  *జంటనగరాల పేర్ల పుట్టు పూర్వోత్తరాలు* 


పూర్వం సుమారు 400 ఏళ్ళకు ముందు భాగ్యనగరంలో ఇద్దరు ముస్లిం సోదరులు, మూసీనది పక్కన బాతులు మేపుకుంటూ జీవనం చేసేవారు. ఆ ఇద్దరు సోదరులు ప్రతిరోజూ చాలా దూరం తిరుగుతూ బాతులు కాసేవారు. 


ఒకనాడు వారు బాతులు కాస్తుండగా, ఉన్నట్లుండి ఆకాశంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆ ఉరుముల శబ్దానికి బాతులు చెల్లాచెదరై, మూలమూల ప్రాంతాలకు వెళ్ళిపోయాయి.


అన్నదమ్ములిద్దరూ అష్టకష్టాలు పడి బాతులన్నిటినీ ఇంట్లోని దొడ్డిలోకి చేర్చగలిగారు. పెద్దవాడికి సందేహం వచ్చి బాతులన్నిటినీ లెక్కించగా, ఒక్క బాతు తక్కువగా ఉంది. వెంటనే అన్నదమ్ములిద్దరూ తప్పిపోయిన బాతును వెతికి పట్టుకోవడానికి బయలుదేరారు. అన్న భాగ్యనగరం వైపు, తమ్ముడు నేటి సికింద్రాబాద్ ఉన్న ప్రాంతం వైపు వెళ్ళారు. 


ఈ ఇద్దరికీ కూడా తెలుగు సరిగ్గా రాదు. అన్న భాగ్యనగరం అంతా తిరుగుతూ *హేదిరాబాతు* *హేదిరాబాతు* అంటూ వెతికి, వేసారిపోయి, తమ్ముడున్న చోటికి వచ్చాడు.


అప్పుడే తమ్ముడుకి బాతు దొరికింది. వాడు సంతోషంతో అరుస్తూ *సిక్కిందిరాబాతు* *సిక్కిందిరాబాతు* అంటూ, తనకు దొరికిన బాతుని అన్నకు సంతోషంగా ఇచ్చాడు. వాళ్ళిద్దరూ బాతుని తీసుకుని ఇంటికి వెళ్ళారు. 


కాలక్రమేణా ఆ అన్నదమ్ములు పలికిన మాటలే కొద్దిగా మార్పు చెంది, "హైదరాబాద్" "సికింద్రాబాద్" గా స్థిరపడ్డాయేమో కదా 


🤣🤣🤣

ఒక రూపాయి నాణెం

  ఒక రూపాయి నాణెం

ఎనిమిదేళ్ల ఒక చిన్న బాలుడు మార్కెట్‌లోని ఒక దుకాణానికి వెళ్లి, దుకాణదారుడికి ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు:

“మీ దుకాణంలో దేవుడు ఉంటే, ఈ ఒక రూపాయికి నాకు ఆయనను ఇస్తారా?”


దుకాణదారు కోపంగా ఆ నాణెాన్ని బాలుడి చేతి నుంచి కొట్టి, అతడిని వెళ్లగొట్టాడు. బాలుడు నాణెాన్ని తీసుకుని, ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి తిరుగుతూ, “ఒక రూపాయికి దేవుడు దొరుకుతాడా?” అని అడుగుతూనే ఉన్నాడు.


చాలా మంది దుకాణదారులు అతడిని తోసివేశారు. కానీ ఆ బాలుడు మాత్రం ధైర్యం కోల్పోలేదు.


చివరికి ఒక పెద్ద దుకాణంలోకి వెళ్లి అదే ప్రశ్న అడిగాడు. ఆ దుకాణ యజమాని చాలా కోపంగా అతడిని బయటికి లాగి తోసేశాడు. ఆ బాలుడు రోడ్డుపై . . అప్పుడే వెళ్లిపోతున్న ఒక ఖరీదైన విలాసవంతమైన కారు ముందు పడిపోయాడు. కారు వెంటనే ఆగింది. అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.


ఒక ధనవంతుడు కారు నుంచి దిగుతూ ఏమైంది అని అడిగాడు. బాలుడు జరిగిన సంగతిని మొత్తం చెప్పి, తన ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు:

“మీ దగ్గర దేవుడు ఉంటే, ఈ ఒక రూపాయికి నాకు ఇస్తారా?”


ఆ ధనవంతుడు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు:

“నేను ఒక రూపాయికి దేవుణ్ణి కొనుగోలు చేసి నీకు ఇస్తే, ఆయనతో ఏమి చేస్తావు?”


బాలుడు సమాధానమిచ్చాడు:

“నా అమ్మ నాకు అన్నీ. ఆమె నాకు భోజనం పెడుతుంది, జోలపాటలు పాడుతుంది, నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. డాక్టర్లు ‘దేవుడే ఆమెను కాపాడగలడు’ అన్నారు. అందుకే ఒక రూపాయికి దేవుడు దొరుకుతాడేమో అని వెతుకుతున్నాను.”


ఇది విన్న ఆ ధనవంతుడు అన్నాడు:

“నీకు ఒక రూపాయికి దేవుడు కావాలా? నేను ఇస్తాను.”


అతడు ఒక లేఖ రాసి, కవర్లో పెట్టి బాలుడికి ఇచ్చాడు.

“నీ అమ్మ ఉన్న ఆసుపత్రికి వెళ్లి, ఈ లేఖను ఒక ప్రత్యేక డాక్టర్‌కి ఇవ్వు,” అని చెప్పాడు.


బాలుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆ లేఖను పేర్కొన్న డాక్టర్‌కు ఇచ్చాడు. డాక్టర్ ఆ లేఖను తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. అది ఆసుపత్రి స్థాపకుడు స్వయంగా రాసిన లేఖ. వెంటనే బాలుడి తల్లికి అత్యుత్తమ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.


కొన్ని రోజుల తరువాత, అదే కారు నుంచి దిగిన ఆ ధనవంతుడు—అదే ఆసుపత్రి స్థాపకుడు—ముఖ్య వైద్యులతో కలిసి ఆమెను చూడడానికి వచ్చాడు.


తల్లి ఆసుపత్రి ఖర్చులు ఎలా చెల్లించాలి అని ఆందోళన చెందుతోంది.


ఆ ధనవంతుడు ఆమెను ధైర్యం చెప్పాడు:

“మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కుమారుడు ఇప్పటికే మీ చికిత్సకు కావాల్సిన మొత్తం చెల్లించాడు.”


అది విన్న తల్లి ఆశ్చర్యపోయి, తన పక్కన నిద్రిస్తున్న తన కుమారుడిని చూసింది.


ఆయన మరలా అన్నాడు:

“వైద్య ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ కుమారుడి చదువుకు వినియోగిస్తాను.”


తల్లి భావోద్వేగానికి లోనై, “మీరు ఇది ఎందుకు చేస్తున్నారు?” అని అడిగింది.


ఆయన సమాధానం ఇచ్చాడు:

“మీ కుమారుడి దేవుడిపై ఉన్న అచంచల విశ్వాసం, ఆయన ఎక్కడున్నా సంపాదించాలనే సంకల్పమే ఈ సేవకు కారణం.”


హృదయంలో విశ్వాసం ఉండి, దృఢమైన సంకల్పం ఉంటే — ఒక రూపాయికైనా దేవుడు దొరుకుతాడు. 🙏

చందనోత్సవం

 👉ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం.


👉అదే రోజున పరశురామ జయంతి .


మరిన్ని అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.


1. పరశురాముని 

     జన్మదినం


2. పవిత్ర గంగా నది

     భూమిని తాకిన

      పర్వదినం


3. త్రేతాయుగం 

    మొదలైన దినం


4. శ్రీకృష్ణుడు 

    తన బాల్యమిత్రుడైన

     కుచేలుని కలుసుకొన్న

     దినం


5. వ్యాస మహర్షి 

     “మహా భారతము”ను,

      వినాయకుని

      సహాయముతో,

      వ్రాయడం

      మొదలుపెట్టిన దినం


6. సూర్య భగవానుడు

     అజ్ఞాతవాసములో

     వున్న పాండవులకు

      అక్షయ పాత్ర

      ఇచ్చిన దినం


7. శివుని ప్రార్థించి

     కుబేరుడు

     శ్రీమహాలక్ష్మితో 

     సమస్త సంపదలకు

     సంరక్షకునిగా

     నియమింపబడిన దినం


8. ఆదిశంకరులు

     “కనకధారాస్తవం” ను

     చెప్పిన దినం


9. అన్నపూర్ణా దేవి 

     తన అవతారాన్ని

      స్వీకరించిన దినం


10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు

       దుశ్శాసనుని

       బారినుండి 

       కాపాడిన దినం.

19, ఏప్రిల్ 2026, ఆదివారం

కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ

  కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .


కుంకుమ పువ్వుని సంస్కృతము నందు కాశ్మీరజము , కుంకుమము , బాహ్లీకము , శోణితము , సంకోచము , పీతనకము అనే పేర్లతో పిలుస్తారు . భావప్రకాశము అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథము నందు కుంకుమపువ్వు యొక్క నాణ్యత మరియు ఔషధగుణములు ఆయా దేశ వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది అని తెలియచేయబడినది. వానిలో కాశ్మీర దేశము నందు పుట్టెడు కుంకుమపువ్వు చిన్నచిన్న కేశరములు కలిగి కొంచం అంత ఎరుపురంగుతో కూడుకుని కమలం వంటి పరిమళము కలిగి ఉండును అనియు ఇదే అత్యంత శ్రేష్టం అని రాయబడినది.


ద్రవ్యకోశము అనే వైద్యగ్రంధము నందు లేత ఎరుపురంగుతో , మంచి పరిమళముతో , చేతితో నలిపిన చేతికి అంటుకొని రంగువీడక యున్నచో అట్టి కుంకుమ పువ్వు శ్రేష్టం అయినది అనియు , బాగా ఎరుపు రంగుతో ఉండి నోటియందు వేసుకొనిన మిక్కిలి చేదుగా , పసుపుపచ్చ రంగుతో ఉన్నచో అట్టి కుంకుమపువ్వు తక్కువరకము అని తెలుసుకొనవలెను .


కుంకుమపువ్వు సాధారణముగా కొంచం చేదు కలిగి ఉండి నాలుకకు తిమ్మిరి కలిగించునదిగా మెత్తగా ఉండును. ఇది జిగటగా ఉండును. కొంతమంది ఈ కుంకుమపువ్వుని చందనంతో అరగదీసి పైపూతగా వాడుదురు . మరికొంతమంది తాంబూలముతో లోపలికి సేవించెదరు. శరీరం నందు వేడిని పుట్టించి వీర్యవృద్ధిని , కాంతిని , బలము , ఆయుర్వృద్దిని కలిగించి విషము , శోష , మదప్రకోపము , నేత్రవ్యాదులు , శిరోవ్యాధులు , గొంతుజబ్బులు , శరీరము నందలి మచ్చలు , దురదలు , కుష్టు , చిడుము , గజ్జి మున్నగు చర్మరోగములు , రసదోషములు , మేధోరోగములు మొదలైనవానిని హరించును . రక్తశుద్ది కలిగించి శరీర దుర్బలత్వము హరించును . గడ్డలను కరిగించును . చర్మరోగములు మాన్పును . కస్తూరి వలే ఏ ఔషధమునకు అయినను అనుపానంగా ఇచ్చిన ఔషధం త్వరగా పనిచేయును . టైఫాయిడు జ్వరము , ఉన్మాదరోగము , అపస్మారము , ప్రసవించు సమయంలో సంభవించు వాతరోగములు , ఋతురక్తబద్ధం , సమస్త నేత్రరోగములు ( కంటి పైన పట్టు వేయవలెను ) , ఓడలలో ప్రయాణము చేయువారికి వచ్చు జబ్బులు , మనోచాంచల్యములు పోగొట్టును .