20, మే 2026, బుధవారం

*సంపూర్ణ మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 20 మే 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                        2️⃣3️⃣1️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *231 వ రోజు*                   

*భీష్మ పర్వము ప్రథమాశ్వాసము*


*ధర్మరాజు పితామహ గురువుల వద్ద యుద్ధానికి అనుమతి తీసుకొనుట*```


కృష్ణార్జునులు పాంచజన్యం, దేవదత్తాలు పూరించగా అవి పాండవ సైన్యంలో ఉత్సాహాన్ని కౌరవ సైన్యంలో కలతను కలిగించాయి. కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగించే విధంగా మంగళ తూర్యనాదాలు మ్రోగించారు. ఆ సమయంలో ధర్మరాజు తన ఆయుధములను కవచాన్ని రథంలో వదిలి భీష్ముని వైపు పాదచారి అయి నడువ సాగాడు. అది చూసిన కృష్ణ, సాత్యకి ఇతర ధర్మరాజ సన్నిహితులు కలవర పడి రథాలు దిగి ధర్మరాజును అనుసరించారు. “ఇందరం నీ వెంట ఉండగా నీవు ఇలా పాదచారివై వెడలుట ఏమి. శత్రువులు మనది పిరికితనం అని హేళన చేయరా” అని సోదరులు తలా ఒక విధంగా అడుగుతున్నా ధర్మరాజు మౌనం వీడక చేతులు ముకుళించి నడచి పోతునే ఉన్నాడు. 


అది చూసిన శ్రీకృష్ణుడు “ధర్మజుని తలపు నాకు తెలుసు. అతడు భీష్మ, ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి యుద్ధం చేయడానికి అనుమతి తీసుకోవడానికి వెళుతున్నాడు. అలా చేస్తే విజయం తధ్యం" అన్నాడు. 


ఆ మాటలు విని అందరూ మౌనంగా జరిగేది వీక్షించ సాగారు. కృషార్జున, నకులసహదేవ, భీమాదులతో ధర్మరాజు భీష్ముని ఎదుట నిలువగా కౌరవ ప్రముఖులు మాత్రం ధర్మరాజులోని రాకకు అంతర్యం తెలియక భీమార్జున, నకులసహదేవ, ద్రుపద, సాత్యకుల అండ ఉన్న ధర్మరాజుకు భయమేల అని కొందరు అనుకోసాగారు. ధర్మరాజు పిరికి వాడు కాదు అయినా ఈ సమయంలో ఈ రాకలోని అంతర్యం ఏమిటో అనుకున్నారు. మానధనుడైన ధర్మరాజు ఏమి మాట్లాడతాడో, భీష్ముడు ఎలా సత్కరిస్తాడో, కృష్ణార్జునుల అంతర్యమేమిటో, భీమాదులు ఏమి చెప్తారో అని పలు పలు విధాలుగా ఆలోచించసాగారు. ధర్మరాజు భీష్ముని ఎదుట నిలిచి

"మహానుభావా! మీ ఎదుట నిలిచి యుద్ధం చేయవలసిన దుస్థితికి చింతిస్తున్నాను. మీ దీవెనలకు అనుమతికి వచ్చాను నాకు యుద్ధం చేయడానికి అనుమతి ఇచ్చి నన్ను దీవించండి. మీ దీవెనలు నాకు విజయాన్ని ప్రసాదిస్తుంది” అన్నాడు. 


భీష్ముడు ఆనందించి “ధర్మనందనా! ఈ సమయంలో నీ రాక సముచితమే కాక ఎంతో శ్రేయస్కరం కూడా. నీవిట్లు చేయకున్న నా శాపానికి గురికావలసి ఉండేవాడివి. ఇక నీకు జయం కలుగుతుంది. నీ పక్షాన యుద్ధం చేయడం తప్ప ఏదైనా వరం కోరుకో అనుగ్రహసిస్తాను. నీకు మేలు జరుగుతుంది" అన్నాడు. 


ధర్మరాజు "పితామహా! మీరు రారాజు తరఫున యుద్ధం చేయండి కాని మాకు మేలు చేయండి” అని కోరాడు. 


భీష్ముడు “ధర్మరాజా! నీ ఆంతర్యం వివరించు" అన్నాడు. 

ధర్మరాజు "పితామహా! మరేమి లేదు మీతో యుద్ధం చేసి గెలవడము ఎలాగో వివరించండి" అన్నాడు. 


భీష్ముడు చిరునవ్వుతో "ధర్మరాజా! నాతో రణరంగాన గెలవడం దేవతలకు కూడా సాధ్యం కాదు. అడిగావు కనుక చెప్తాను. నే చేతి ఆయుధం కింద పడిన కాని అది సాధ్యం కాదు. ఇప్పటికి ఇంతకంటే చెప్పను. ఈ సారి మన కలయిక నీ మనోరధాన్ని నెరవేర్చ గలదు" అన్నాడు. 


భీష్ముని వద్ద అనుమతి పొందిన ధర్మరాజు తన వారితో కలసి ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి వారి అనుమతి పొందాడు. 


ద్రోణుడు “ధర్మజా! శ్రీకృష్ణుని అండ ఉన్న నీకు విజయం తధ్యం” అన్నాడు. 


ధర్మరాజు ద్రోణుని అతడిని గెలిచే ఉపాయాన్ని చెప్పమని ప్రార్ధించాడు. ద్రోణుడు "ధర్మరాజా! నా చేతిలో ఆయుధమున్నంత వరకు నన్ను గెలవడం సాధ్యం కాదు, కాని నేను అస్త్రసన్యాసం చేసినా ప్రాయోపవేశం చేసినా నన్ను వధించగలరు. అశుభ వార్త వినినంతనే అస్త్రసన్యాసం చేస్తాను" అన్నాడు. 


కృపాచార్యుని గెలిచే ఉపాయం అడుగగా అతడు "నేను ఎవరి చేత చంపబడను కాని నీకు జయం తథ్యం" అన్నాడు. 


శల్యుని చూసి ధర్మరాజు తనకిచ్చిన మాట గుర్తు ఉంచుకొమ్మని చెప్పగా. అతడు ధర్మరాజుతో అతడికి ఇచ్చిన మాట గుర్తు ఉన్నదని అలాగే చేస్తానని నిశ్చింతగా ఉండవచ్చని మాట ఇచ్చాడు. 

*(మహాభారతయుద్ధములో కౌరవ పక్షాన పోరాడి చావకుండా బతికి బయట పడ్డవాళు కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ మాత్రమే. వీళ్లనే రధిక త్రయము అన్నారు.).*

శ్రీకృష్ణుడు యుద్ధాన్ని కుతూహలంతో చూడవచ్చిన కర్ణుని చూసి "కర్ణా! భీష్ముని మీద కోపంతో అతడు పడిపోయే వరకు యుద్ధం చేయనని చెప్పావట కదా! అప్పటి వరకు పాండవ పక్షాన యుద్ధం చేస్తూ వినోదించవచ్చు కదా!" అన్నాడు. 


కర్ణుడు "కృష్ణా! నేను భీష్ముని మీద కోపంతో యుద్ధం నుండి వైతొలిగాను కాని సుయోధనునికి ఇచ్చిన మాట తప్పనని నీకు తెలియనిదా” అన్నాడు. 


ఆ పై ధర్మజుడు రధాన్ని అధిరోహించి కవచాన్ని ధరించి కౌరవ పక్షంవైపు కొంత ముందుకు వెళ్ళి "కౌరవ ప్రముఖులారా! మీలో ఎవరైనా నాపై ఉన్న అభిమానంతో నా పక్షంలోకి రావచ్చు నేను వారిని నా తమ్ముల వలె చూసుకుంటాను" అన్నాడు. 


ఆ మాటలు విన్న *యుయుత్సుడు (ధృతరాష్ట్రుని వేరే భార్య కొడుకు)* ధర్మరాజు పక్షంలో చేరటానికి అంగీకరించాడు. యుయుత్సుడు సుయోధనుని దుష్కృత్యములను నిందిస్తూ పాండవులను పొగుడుతూ తన సైన్యాలతో పాండవ పక్షంలో చేరాడు. ధర్మరాజు సంతోషంగా యుయుత్సుని ఆహ్వానించాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం  చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

గురువారం🌷* *🌹21, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

   *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    *🌷గురువారం🌷*

 *🌹21, మే, 2026🌹*   

 *దృగ్గణిత పంచాంగం*               


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : పంచమి* ఉ 08.26 వరకు ఉపరి *షష్ఠి*

*వారం   : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : పుష్యమి* రా 02.49 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం : గండ* ఉ 10.58 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం  : బాలువ* ఉ 08.26 *కౌలువ* రా 07.20 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 08.30 - 09.30 సా 04.00 - 06.00*     

అమృత కాలం  : *రా 08.47 - 10.18*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : ప 11.44 - 01.15*

*దుర్ముహూర్తం  : ఉ 09.55 - 10.46 మ 03.06 - 03.57* 

*రాహు కాలం   : మ 01.41 - 03.19*

గుళికకాళం      : *ఉ 08.50 - 10.27*

యమగండం    : *ఉ 05.35 - 07.13*

సూర్యరాశి : *వృషభం*               

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.43* 

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.35 - 08.11*

సంగవ కాలం        :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం    :*10.46 - 01.22*

అపరాహ్న కాలం   :*మ 01.22- 03.57*

*ఆబ్ధికం తిధి  :అధిక జ్యేష్ట శుద్ధ షష్ఠి*

సాయంకాలం   :*సా 03.57- 06.33*

ప్రదోష కాలం     :*సా 06.33- 08.45*

రాత్రి కాలం        :*రా 08.45- 11.42*

నిశీధి కాలం       :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః.🕉️🌹*


*సర్వపాపం శమం యాతి* 

*దత్తాత్రేయ నమోఽస్తుతే*

           

*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 20 మే 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*                                   

             *94వ భాగం*


*గయా శ్రాద్ధఫలం -*

*అశ్వత్థ(రావి చెట్టు) వృక్ష మహత్మ్యం*

```

తమపితృదేవతలకుపుణ్యలోకాలు ప్రాప్తి కలగాలంటే గయకు వెళ్లి శ్రాద్ధం పెట్టాలి. పూర్వపుణ్యఫలం ఉన్నవారు గయకు వెళ్లి పితృదేవ తలకు శ్రాద్ధం పెడతారు. వారికి కోటి జన్మల పుణ్యఫలం కలుగు తుంది అంటారు. అంతేకాదు గయలో శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు నిర్వహించిన వారిపితృదేవతలు తప్పక వైకుంఠప్రాప్తిపొందుతారు.

గయలో పిండ ప్రదానం ఎవరికి పెడతారో వారు ఎటువంటి వారైనా మోక్షం పొందుతారు అని చెప్పడానికి ఒక కథ ఉంది.


పూర్వం కన్యాకుబ్జంలో చిత్రరథుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆతని భార్య పేరు చిత్రసేన. చిత్రరథుడు మహా ధనవంతుడు కావాలని అనేక పాప కార్యాలు చేసి ధనం, ఆస్తులు సంపాదించారు.. చిత్రరథుడు చేసిన పాపాలకు ఘోర వ్యాధికి గురి అయి చాలాకాలం బాధ పడి మరణించాడు.


యమభటులు అతనిని పాశాలతో కట్టి కొట్టుకుంటూ నరకలోకానికి తీసుకు వెళ్లారు. యముడు చిత్రగుప్తుని చిత్రరథుడు చేసిన పాప పుణ్యాల లెక్కలు అడిగాడు. చిత్రగుప్తుడు చిట్టా చూసి చిత్రరథుడు చేసినవన్నీ భయంకరమైన పాపాలే గాని పుణ్యం ఒక్కటి కూడా లేదని చెప్పాడు.


యమధర్మరాజా అతనిని చేసిన పాపాలు శిక్షగా కుంభీపాక నరకంలో వేసి ఘోరాతిఘోరంగా శిక్షించమని ఆదేశించాడు. యముడి ఆదేశం విని చిత్రరథుడు భయంతో వణికిపోతూ ఏడవ సాగాడు. చిత్రగుప్తుడు చూసి జాలిపడి "నీ కుమారులలో ఒకరు త్వరలో గయకు వెళ్లి శ్రాద్ధ కర్మలు చేస్తాడు. అప్పుడు నీకు కుంభీపాక నరకం నుండి విముక్తి లభిస్తుంది" అని చెప్పాడు.


భూమి పై ఒకరోజు చిత్రరథుని కుమారులలో పన్నెండేళ్ళ ఆఖరివాడు స్నేహితులతో ఆటపాటలలో మునిగి పోయి ఇంటికి భోజనానికి వెళ్లికుండా చాలా పొద్దుపోయిన తరువాత ఆలశ్యంగా ఇంటికి వచ్చాడు. వాడి తల్లి వాడిని నానాతిట్లు తిట్టి కర్ర తీసుకుని దేహశుద్ది చేసింది.


తల్లి మీద కోపం వచ్చి వాడు ఇల్లు, ఊరు వదలి వేసి పారిపోయి దేశమంతా తిరగసాగాడు. ఆ క్రమంలో అనేక తీర్థ స్థలాలు, పుణ్య స్థలాలు దర్శిస్తూ సేవిస్తూ మంచివాడు అయ్యాడు. దేశమంతా తిరుగుతూ గయ క్షేతం చేరాడు. అక్కడకు వచ్చిన వారు తమ పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేయడం చూసాడు. తనూ గంగలో స్నానం చేసి పితృదేవతలకు శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మలు చేశాడు.


కుమారుడి గయలో చేసిన శ్రాద్ధకర్మల ఫలంగా, చిత్రరథుడు, అతని పితృదేవతలు కుంభీపాకం మొదలైన నరకాల నుంచి విముక్తి పొంది వైకుంఠ ప్రాప్తి పొందారు" అని గయ మహత్మ్యం చెప్పిన తరువాత సూత మహర్షి అశ్వత్థ వృక్ష మహిమ గురించి చెప్పారు.


     *అశ్వత్థ వృక్ష మహిమ*


శ్రీమహావిష్ణువు లోకంలో ప్రజల పాపాలను నశింపచేసి ఉద్దరించడానికి వృక్ష రూపం దాల్చి వెలిశాడు. ఆ వృక్షమే అశ్వత్థ వృక్షము. ఆశ్వత్థ వృక్షాన్ని దర్శించినా, పూజించినా, ప్రదక్షిణం చేసినా, నీరు పోసినా పాపాలన్ని నశిస్తాయి. అంతేకాదు! ఇలా చేసినవారు మహావిష్ణువుని ప్రత్యక్షంగా సేవించిన పుణ్య ఫలం పొందుతారు.


అశ్వత్థ వృక్షము అనగా రావిచెట్టుకి నిత్యం నీళ్లు పోసి పూజించేవారు ధర్మ అర్థ కామ మోక్షాలు తప్పక పొందుతారు. చెట్టు చుట్టూ వేదిక కట్టించిన వారి సకల జన్మల పాపాలు నశిస్తాయి అంటారు. అశ్వత్థ వృక్షంలో శ్రీహారి సదా నివాసము ఉంటాడని పెద్దలు చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక పురాతన ఇతిహాసం ఉంది.


త్రేతాయుగంలో సౌరాష్ట్ర రాజ్యంలో ధనంజయుడు అనే బ్రాహ్మణులకు భిక్షాటనతో జీవన యాత్ర చేసేవాడు. అతని భార్య పేరు సుశీల. భార్యాభర్తలిద్దరు విష్ణుభక్తి పరాయణులు. పేదరికంలో ఉన్నప్పటికీ అతిథి అభ్యాగతులను తమ శక్తి మేరకు సేవించేవారు. భిక్ష దొరకని రోజు పస్తులుండి నారాయణ స్మరణ చేస్తూ గడిపేవారు. 


చలికాలంలో సరియైన దుస్తులు లేనందు వలన భిక్షాటన తరువాత ధనంజయుడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి ఇంటిలో మంట వేసుకుని దంపతులు చలి కాచుకునేవారు. ఒకరోజు భిక్షాటన చేసి ఆలస్యంగా రావడం వలన అడవికి వెళ్లే సమయం లభించలేదు. ఆ రాత్రి చలి బాగా ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక ఇంటికి ఎదురుగా ఉన్న రావిచెట్టు యొక్క ఎండిన కొమ్మను గొడ్డలితో కొట్టాడు.


రావిచెట్టు కొమ్మ నేల మీద పడగానే రావిచెట్టు నుండి శ్రీమహావిష్ణువు చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మాలతో ధనంజయుడు ముందు ప్రత్యక్షమైనాడు. కానీ మహావిష్ణువు శరీరం నుంచి రక్తం కారుతోంది. ధనంజయుడు చూసి భయపడి గొడ్డలి వదిలేసి శ్రీహరి పాదాల పై పడి "నారాయణా! నా మీద దయతో దర్శన భాగ్యం కలిగించావు. కానీ ఈ రక్తం ఏమిటి? దేవాధిదేవుడవు! నిన్ను ఆయుధంతో ఎవరు గాయపరచగలరు?" అని దుఖిస్తూ అడిగాడు.


మహావిష్ణువు చిరునవ్వుతో "ధనుంజయా! నీ వన్నది నిజం! నన్ను ఏ శత్రువు గాయపరచలేడు. కానీ నా భక్తుడు చేసిన పని ఇది. తెలియక చేశాడు. అందుకే సహిస్తున్నాను. నేను ఈ అశ్వత్థ వృక్షంలో నివసిస్తూ ఉంటాను. నీవు గొడ్డలితో కొమ్మ నరికావు కదా! అందుకే గాయమై రక్తం కారుతోంది" అనగానే ధనంజయుడు శ్రీహరి పాదాలను కన్నీళ్లతో అభిషేకం చేస్తూ క్షమించమని ప్రార్ధించాడు.


శ్రీహరి ధనుంజయుని లేవనెత్తి "జరిగినదానికి దుఖపడకు ధనుంజయా! నా భక్తులు ఏమి చేసినా నాకు ప్రియంగానే ఉంటుంది. పైగా ఈ గాయం వలన నీకు నా దర్శనం లభించింది కదా! నీ భక్తి నాకు నచ్చింది. వరం కోరుకో! అనుగ్రహిస్తాను" అన్నాడు. ధనంజయుడు ధన సంపదలు కోరలేదు. "పరమాత్మా! సదా నీ పాదపద్మాలపై నాకు భక్తి ప్రపత్తులు ఉండేటట్టు అనుగ్రహించు!" అని కోరుకున్నాడు.


మహావిష్ణువు ధనుంజయుని నిర్మల భక్తికి ప్రసన్నుడై విశ్వకర్మను పిలిచి ధనంజయుడు నివసించడానికి భవ్యమైన భవంతి నిర్మాణం చేయించాడు. అనంత సంపదలు, సుఖభోగాలు ఇచ్చి మరణానంతరం వైకుంఠం ప్రాప్తి కలిగేటట్టు వరమిచ్చి అదృశ్యమయ్యాడు. ధనంజయుడు, సుశీల అశ్వత్థ వృక్షాన్ని నిత్యం నియమ నిష్టలతో పూజిస్తూ సంతానం పొందారు. సుఖ జీవితం గడిపి వైకుంఠం చేరి ముక్తి పొందారు.


కనుక అశ్వత్థ వృక్షము పరమ పూజనీయం. "మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతే నమః" అని ధ్యానిస్తూ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేయాలి.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

దృష్టి

 *మన దృష్టి ఎలా వుండాలి ?**

 

ముందు మనం పొగడ్తలకు 

పొంగి పోయి, నిందలకు కృంగిపోకూడదు, 


ఏది మంచి? 

ఏది చెడ్డ? 

అనే విషయానికి వస్తే,

 ఏది నీకు మంచిదో 

అది ఇతరులకు చెడ్డ కావచ్చు, ఇతరులకు ఏది చెడ్డదో అది నీకు మంచి కావచ్చు. 


*ఉదా!!*

ఒకరి ఇంట్లో పెళ్ళి జరుగుతోంది, వారు వాన రాకూడదని ప్రార్ధిస్తున్నారు, 


కాని, వానలు లేక పైర్లు ఎండి పోతున్నాయి,

 కాబట్టి వ్యవసాయం చేసేవారు వానలు రావాలని ప్రార్ధిస్తున్నారు...


చూశారా! 

వాన రావటం ఒకరికి మంచిది, మరొకరికి చెడ్డది, 

అందుచేత వాటి గురించి పట్టించుకోవద్దు"... 


అయితే రెండు కరెక్ట్, 

మరి ధర్మం మాటేమిటి? 

దైవం ఎవరి మాట వింటాడు  ?అని అడిగితే,

"నిజంగా నీవు అందరి మంచీ కోరుకుంటే, అందరి క్షేమాన్ని కోరి ప్రార్ధిస్తే, నీ పొలం పైన వాన కురుస్తుంది;  


గాలికి మేఘము తొలగి పోయి ఊరిలో వాన పడకుండా, పెళ్ళి వారికి ఇబ్బంది లేకుండా  కూడా ఉంటుంది. 

ఇద్దరికీ మంచిదే జరుగుతుంది, అట్లు కాకుండా నీ ప్రార్థనలో సంకుచితమై మైన బుద్ధి ఉంటే అంతటా వర్షం పడినా, నీ పొలం పైన కురవదు...కనుక విశాలమైన దృష్టి అవసరము. 


        *_శుభమస్తు_*

🙏 *శ్రీ సద్గురు  పీఠం ద్వారా* ...✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము


శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి ।

శబ్దాదీన్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ।। 26 ।।



ప్రతిపదార్థ:


శ్రోత్ర-ఆదీని — వినికిడి ప్రక్రియ వంటి; ఇంద్రియాణి — ఇంద్రియములు; అన్యే — ఇతరులు; సంయమ — నిగ్రహించి; అగ్నిషు — యజ్ఞాగ్నిలో; జుహ్వతి — సమర్పణ; శబ్ద-ఆదీన్ — శబ్దము మొదలైన; విషయాన్ — ఇంద్రియ తృప్తి నిచ్చే వస్తు-విషయములు; అన్యే — మరి కొందరు; ఇంద్రియ — ఇంద్రియముల; అగ్నిషు — అగ్నిలో; జుహ్వతి — సమర్పణ.



తాత్పర్యము : 


మరికొందరు శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను ఇంద్రియనిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు.

   


వివరణ:


అగ్ని అనేది తనలో సమర్పించబడిన వస్తువుల స్వభావాన్ని మార్చివేస్తుంది. బాహ్యమైన వైదిక కర్మకాండ యజ్ఞంలో, భౌతికంగా తనకు సమర్పించబడిన వాటిని అగ్ని భక్షించివేస్తుంది. అంతర్గత ఆధ్యాత్మిక సాధనలో అగ్ని అనేది సంకేతాత్మకమైనది. ఆత్మ-నిగ్రహం అనే అగ్ని, ఇంద్రియ వాంఛలను దహించివేస్తుంది.


ఇక్కడ, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉన్న రెండు పూర్తి విరుద్ధమైన మార్గాల తేడాను వివరిస్తున్నాడు. ఒకటి, ఇంద్రియములను తిరస్కరించటం, ఈ పద్ధతిని హఠయోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో, అత్యంత ఆవశ్యకమైన శరీర నిర్వహణకి తప్ప, మిగతా అన్ని ఇంద్రియముల క్రియలను ఆపివేస్తారు. సంకల్పబలంతో మనస్సుని పూర్తిగా ఇంద్రియముల నుండి వెనక్కి మరల్చి, అంతర్ముఖంగా ఉంచుతారు.


దీనికి వ్యతిరేకమైనది భక్తి యోగ అభ్యాసము. ఈ రెండవ రకమైన యజ్ఞంలో, ఇంద్రియములను, ప్రతి పరమాణువులో కనిపించే ఆ సృష్టికర్త యొక్క అద్భుతమైన కీర్తిని ఆరాధించటానికి వాడతారు. ఇంద్రియములు ఇక భౌతిక సుఖములు ఆనందించటానికి పనుముట్లగా వాడబడవు; సర్వత్రా భగవంతుని దర్శించటానికే అవి పరిష్కృతం చేయబడతాయి. 7.8వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు అంటాడు, ‘రసోఽహం అప్సు కౌంతేయ ’ అని, ‘అర్జునా, నీటి యందు రుచిని నేనే అని తెలుసుకో.’ ఈ ప్రకారంగానే, భక్తి యోగులు, అన్ని ఇంద్రియముల ద్వారా భగవంతుడిని దర్శించటానికే అభ్యాసం చేస్తారు.- చూసే, వినే, రుచిచూసే, భావించే, ఆఘ్రాణించే అన్నిటిలో కూడా. ఇటువంటి భక్తి యజ్ఞము హఠయోగ మార్గం కన్నా సులువైనది; పాటించటానికి ఆహ్లాదకరమైనది, మరియు ఈ మార్గం నుండి పతనమవటానికి తక్కువ అవకాశం కలది. ఒకవేళ ఎవరైనా సైకిలు తొక్కుతూ ఉన్నప్పుడు, ముందుకు వెళ్ళటం ఆగటానికి బ్రేకులు గట్టిగా వేస్తే, వారు పడిపోయే అవకాశం ఉంటుంది; కానీ దీనికి బదులుగా సైకిలు తొక్కేవాడు తన హేండిల్‌ని కుడి పక్కకో, ఎడమ పక్కకో తిప్పితే, సైకిలు సునాయాసంగా ముందుకు వెళ్ళటం ఆగిపోతుంది మరియు సమతుల్యత తోనే ఉంటుంది.

అమ్మ ఏం చ‌దివింది*🙏

 🙏*అమ్మ ఏం చ‌దివింది*🙏


నాన్న పేరు ప‌క్క‌న డిగ్రీలు చూసిన‌ప్పుడ‌ల్లా

అమ్మ ఏం చ‌దివిందో తెలుసుకోవాల‌నిపిస్తుంది.


వంటింట్లో త‌న ఒంటిచేతి విన్యాసం చూస్తే...

గిన్నెలూ, గ‌రిటెల‌తో కూర ప‌ట్టు యుద్ధం చేస్తే..

హోటెల్ మేనేజ్‌మెంట్‌లో వంద డిగ్రీలైనా

హోల్‌సేల్‌గా క‌ట్ట‌బెట్టార‌నిపిస్తుంది.


ఇద్ద‌రికే స‌రిప‌డా కూర‌

న‌లుగురుకి తృప్తిగా వ‌డ్డించిన‌ప్పుడు

మ‌రో డిగ్రీ నెత్తిమీద పెట్టాల‌నిపిస్తుంది.


సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని

ఇంద్ర‌భ‌వ‌నంలా స‌ర్దిన‌ప్పుడు

పెర‌ట్లో పూసిన పిచ్చి పూల‌ను

ఖాళీ సీసాల్లో పేర్చి ఫ్ల‌వ‌ర్ వాజ్ గా మార్చిన‌ప్పుడు

ఇంటీరియ‌ర్ కోర్సేదో త‌న కొంగున‌

ముడివేసుకొందా అనే అనుమానం వేస్తుంది.


చాలీ చాల‌ని జీతంతో

నెలంతా స‌ర్దుకోలేక‌ నాన్న స‌త‌మ‌త‌మ‌వుతుంటే..

చిటికెలో ప‌ద్దులేసి చిల్ల‌ర మిగిల్చిన అమ్మ‌

క‌చ్చితంగా ఎక‌నామిక్స్ లో మాస్ట‌ర్ డిగ్రీ కొట్టేసుంటుంది.


నాన్న చేసే త‌ప్పుల్ని క‌నిపెడుతూ

నా అల్ల‌రిని అదుపు చేస్తూ

అమ్మ జడ్జిమెంట్ల‌ని పాస్ చేస్తున్న‌ప్పుడు

లా కూడా ఆమె ముందు

బ‌లాదూర్ కాకుండా ఎందుకు ఉంటుంది?


అమ్మ ద‌గ్గు చూడ‌లేక‌

డాక్ట‌ర్ ఖ‌రీదైన మందులు రాసిస్తే..

న‌వ్వుతూ ఆ చీటి డ‌స్ట్ బిన్ లో వేసేసి

పంటికింద లవంగాన్ని ప‌డేసిన అమ్మ‌...

ఎంబీబీఎస్‌ల‌కు అంద‌ని చ‌దువేదో చ‌దివేసింద‌నే నా న‌మ్మ‌కం.


బ్యాంకు ఎకౌంటు ఖాళీ అయినప్పుడు

నాన్న జేబులు నిండుకొన్న‌ప్పుడు

అమ్మ మెడ‌లో న‌గ‌లు మాయం అపోవ‌డం చూస్తే..

తాంత్రిక విద్య‌లోనూ పీహెచ్‌డీ క‌ట్ట‌బెట్టార‌న్న భ‌యమూ వేస్తుంది.


ఇన్ని చేసినా

నీకేం తెలీదెహె.. ఊరుకో అన్న‌ప్పుడు

ముసిముసిగా న‌వ్వుకొంటూ,

అల‌వాటు ప్ర‌కారం మ‌మ్మ‌ల్ని క్ష‌మించేస్తూ

మ‌ళ్లీ అమ్మ‌లా మారిపోతుంటే..

త‌త్వ‌శాస్త్ర‌మేదో ఔపోసన ప‌ట్టిన‌ట్టే ఉంటుంది.


ఇంతా చూసి ఉండ‌బ‌ట్ట‌లేక‌

ఓసారి అడిగేశా.. ఏం చ‌దివావ్ అని?!


ఆరో గ‌ళాసు.. అని ముసిముసిగా న‌వ్వేసింది.


త‌న‌కేం తెలుసు..?


ఎవ‌రికీ అంతుప‌ట్ట‌ని మ‌ధ్య‌త‌ర‌గతి జీవితాన్ని

అంద‌రికీ అర్థం కాని పేద‌రిక‌పు ప‌రిమ‌ళాన్నీ

పూర్తిగా చ‌దివేసింద‌న్న నిజం.. అమ్మ‌కు కూడా తెలీదు.🙏🙏🙏

20-05-2026 బుధవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

20-05-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి.  

---------------------------------------


వృషభం


సమాజంలో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

---------------------------------------


మిధునం


చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుంచి అందిన సమాచారం నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు తప్పవు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

---------------------------------------


కర్కాటకం


ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం అవుతాయి. 

---------------------------------------


సింహం


వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

---------------------------------------


కన్య


ప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో చికాకులు అధికమవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------


తుల


ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.  

---------------------------------------


వృశ్చికం


దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. 

---------------------------------------


ధనస్సు


కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆప్తుల నుంచి అవసరానికి ధనం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

---------------------------------------


మకరం


ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------


కుంభం


ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


మీనం

 

పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సంఘంలో సరైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.

---------------------------------------

పంచాంగము

 



19, మే 2026, మంగళవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*మంగళవారం 19 మే 2026*


     *శ్రీ మహావిష్ణు పురాణం*                              

              *93 వ భాగం* 

       

            *జగన్నాథ క్షేత్రం*```


పూర్వం శ్రీమన్నారాయణుడు మూర్తి (విగ్రహ) స్వరూపంలో లవణ సముద్రానికి ఉత్తరాన గల నీలాద్రి పర్వతం పై స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మహావిష్ణువుకి దేవాలయాన్ని విశ్వకర్మ స్వయంగా నిర్మించాడు. పురుషులందరిలోను ఉత్తమ పురుషుడైన మహావిష్ణువు నివాసం కనుక ఈ క్షేత్రానికి పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీహరి యొక్క నివాసము కనుక రెండవ వైకుంఠం అని, భూలోక 

వైకుంఠం అని పిలుస్తారు.


ఈ క్షేత్ర మహిమ వర్ణించడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఇక్కడ శ్రీమహావిష్ణువుకి లక్ష్మీదేవి స్వయంగా వండి  భోజనం పెడుతుంది అంటారు. స్వామి ఆరంగించగా మిగిలిన శేషాన్ని ప్రసాదంగా పెట్ఠేవారు. 

ఆ ప్రసాదం వర్ణ కుల భేదం లేకుండా జనులందరు ఆరగించే వారు. ప్రజలందరు తిని పాపాలు పోయి పుణ్యాత్ములు అయి స్వర్గానికి పోతుండటంతో స్వర్గం నిండి పోయింది. దేవతలందరు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి సమస్య చెప్పి పరిష్కారం చూపమని ప్రార్ధించారు.


మహావిష్ణువు దేవతల ప్రార్ధన పై తన స్వయంభువ విగ్రహాన్ని క్షేత్రం నుండి లవణ సముద్ర తీరం అడుగున దాచాడు. ఉత్కళ దేశాన్ని పాలించే ఇంద్రద్యుమ్న మహారాజు శ్రీమహావిష్ణువు మూర్తిని పునఃప్రతిష్టించాలని సంకల్పించి స్వామి మూర్తి కోసం తపోదీక్ష చేశాడు. శ్రీమహావిష్ణువు కలలో కనిపించి సముద్ర తీరాన వనాలలో ఉండే వృక్షములతో బలభద్ర, జగన్నాథ, సుభద్ర మూర్తులను తయారు చేసి ప్రతిష్టించమని చెప్పాడు. సముద్ర తీరానికి వెళ్లి వెతుకు తున్న మహారాజుకి బ్రాహ్మణ రూపంలో విశ్వకర్మ వచ్చి తాను తగిన వృక్షాలతో మూర్తులను తయారు చేసి ఇస్తాను అని చెప్పి బలభద్ర జగన్నాథ సుభద్ర మూర్తు లను తయారు చేసి ఇచ్చాడు.


ఇంద్రద్యుమ్న మహారాజు దేవాలయం పై శ్రీహరి సుదర్శన చక్రం కూడా ప్రతిష్టించాలని సంకల్పించి నిరాహారుడై కటిక నేలపై ధ్యాన దీక్షలో కూర్చు న్నాడు. నారాయణుడు రాత్రి కలలో బ్రాహ్మణ రూపంలో కనిపించి "రాజా! నీలగిరిలో దేవాలయం నిర్మించినపుడు అక్కడ నివసించే ఒక సర్పము సముద్రతీరానికి పారిపోయి అక్కడే చనిపోయింది. దాని తలపై ఉన్న మణి అక్కడే తీరంలో పడి ఉంది. ఆ మణి తెస్తే చక్రం తయారవుతుంది. 

ఆ చక్రం దేవాలయం పై స్థాపిస్తే ఆలయం నిర్మాణం పూర్తి అవుతుంది" అని చెప్పి అదృశ్యమయ్యాడు.


మరుసటి రోజు ఉదయం ఇంద్రద్యుమ్న మహారాజు సముద్ర తీరానికి వెళ్లి వెతకగా మణి కనిపించింది. నీలవర్ణములో ప్రకాశిస్తున్న మణిని భూమి నుండి తీసుకుని వెళ్ళదామని ప్రయత్నిస్తే ఎవరూ దానిని ఎత్తలేక పోయారు. మహారాజు మహావిష్ణువుని ధ్యానించాడు.


ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి అక్కడికి వచ్చి "మహారాజా! నేను ఆ మణి పై కూర్చుంటే, 

ఆ మణి తనంతతానే లేచి ఆలయం వద్దకు వస్తుంది" అని చెప్పాడు. మహారాజు అది భగవంతుని సందేశం అని అంగీకరించాడు. మణిపై పట్టువస్త్రము పరచి బ్రహ్మచారి కూర్చోగానే ఆ మణి లేచి కదిలి దేవాలయం వరకు వచ్చింది. కానీ దేవాలయం దగ్గరకు రాగానే మణి, దానిపై కూర్చున్న బ్రాహ్మణ బ్రహ్మచారి ఇద్దరు అదృశ్యమయ్యారు.


ఇంద్రద్యుమ్నుడు నిరాశ చెంది నిరాహారియై అక్కడే దర్భశయ్య పై నిదురించాడు. నారాయణుడు నిద్రలో కనిపించి "రాజా! బ్రాహ్మణ బ్రహచారి మణితో చక్రం తయారుచేసి ఉదయాన్నే పంపుతాడు. చింతించకు. చక్ర ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేయుము" అని అదృశ్య మయ్యాడు.


మరుసటి రోజు ఉదయం మహారాజు మంత్రి పరివారంతో దేవాలయం వద్దకు వెళ్లగా ముఖ ద్వారం వద్ద చక్రముతో ఒక వ్యక్తి వేచివున్నాడు.మంగళవాయి

ద్యాలు, శంఖనాదాల మధ్య దేవాలయంపై నీలమణి చక్రం ప్రతిష్టించబడింది. పెద్ద ఉత్సవం ఇంద్రద్యుమ్న మహారాజు జరిపాడు. దేవాలయం పై గల చక్ర మహిమ నారద పురాణంలో చెప్పబడింది. 


జగన్నాథ క్షేత్రంలో మార్కండేయం, ఇంద్రద్యుమ్నం, రోహిణి కుండం, శ్వేతకుండం, సముద్ర తీరం మొదలైన పుణ్య తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానం చేసి త్రిమూర్తులను పూజించి వటవృక్షాన్ని, మార్కండేయుని, యముని, హనుమంతుని, పాతాళేశ్వరుని, లక్ష్మీదేవిని, విమలాదేవిని దర్శించాలి. సముద్రతీరంలో తీర్థ శ్రాద్ధం చేయాలి.


ఈ విధంగా చేసినవారు పునర్జన్మ పొందకుండా వైకుంఠం చేరి మోక్షము పొందుతారు. జగన్నాథ క్షేతంలో పన్నెండు నెలలలో పదమూడు యాత్రలతో సందడిగా ఉంటుంది. వీటిలో చైత్ర మాసంలో జరిగే వారుణి యాత్ర, వైశాఖంలో జరిగే చందన యాత్ర, జేష్ఠ మాసంలో జరిగే అభిషేక యాత్ర, ఆషాఢంలో జరిగే రథయాత్ర, కార్తీకంలో జరిగే దామోదర యాత్ర, మాఘమాసంలో జరిగే మకర యాత్ర ముఖ్యమైనవి. ఫాల్గుణ మాసంలో డోలోత్సవము జరుగుతుంది.


రథయాత్రలో ఉన్న బలభద్ర స్వామిని దర్శించిన సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. ఈ క్షేత్రంలో చేసిన దానధర్మాలు కోటి రెట్ల ఫలం ఇస్తుంది.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 18 మే 2026*


     *శ్రీ మహావిష్ణు పురాణం*                                 

              *92వ భాగం*


          *భక్త అంబరీష చరిత్ర*```


మత్స్యావతారంలో శ్రీమహా విష్ణువు అనుగ్రహం పొందిన సత్యవత్ర మహారాజు తరువాత జన్మలో సూర్యుని పుత్రుడిగా జన్మించాడు. అతనికి 

‘శ్రాద్ధ దేవుడు’ అని నామకరణం చేశారు. అతడే ‘వైవస్వతుడు’

గా వైవస్వంత మన్వంతరానికి మనువు అయ్యాడు. సూర్య వంశము ఇతని ద్వారా విస్తరించింది.


వైవస్వతునికి ఇక్ష్వాకువు, నాభాగుడు మొదలైన పది మంది కుమారులు జన్మించారు. శ్రీరామచంద్రుడు జన్మించిన ఇక్ష్వాకు వంశం గురించి మీరు ముందుగానే విన్నారు. వైవస్వత మనువు మరో పుత్రుడైన నాభాగుడికి నభగుడు అనే కుమారుడు జన్మించాడు. నభగుడి కుమారునికి తాత నాభాగుడి పేరే పెట్టారు. మహా పండితుడు, విష్ణుభక్తుడు అయిన ఇతనికి అంబరీషుడు కుమారుడిగా జన్మించాడు.


అంబరీషుడు రాజర్షియై నిరంతరం శ్రీమన్నారాయణ నామ స్మరణ చేస్తుండేవాడు. విష్ణుమూర్తికి ప్రియభక్తుడైన అంబరీషుడు భూమండలానికి రాజైనా భౌతిక సుఖములందు కోరిక ఉండక, హరి నామ స్మరణ తో హరిభక్తులను సేవిస్తూ ఉండే వాడు. రాజ్యపాలనచక్కగాచేస్తూ ప్రజపాలన జనరంజకంగా చేస్తూ విష్ణుభక్తి, విరక్తి వలన రాజర్షిగా ప్రసిద్ది చెందాడు.


అంబరీషుని నిర్మల భక్తికి ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు తన భక్తుని రక్షణకు సుదర్శన చక్రాన్ని నియమించాడు. అంబరీషుడు తన ధర్మపత్నితో కలసి శ్రీమహా విష్ణువు ప్రీతి కోసం ఏడాది పాటు సాగే ద్వాదశీ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించాడు. వ్రతం పరిసమాప్తి అయిన కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం ఉండి కాళింది నదిలో స్నానం చేసి, మధువనంలో శ్రీహరికి అభిషేకం చేసి గంధాక్షలతో, పుష్పాలతో పూజించాడు. వ్రత ఉద్యాపన చేసి ఉపవాస దీక్ష ముగించాలి.


బ్రాహ్మణులకు గోదానం చేసి బ్రాహ్మణ సమారాధన చేసిన తరువాత అంబరీషుడు ఉపవాస దీక్ష విరమించడానికి సిద్దమైయ్యాడు. ఆ సమయానికి ఈశ్వరాంశ సంభూతుడు, మహా తపస్వి, మహా క్రోధి అయిన దూర్వాస మహర్షి అంబరీషుడి వద్దకువచ్చాడు. మహర్షికి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఉన్నతాసనం ఏర్పాటు చేశాడు. ద్వాదశి వ్రత పారణ లో తనతోటి భోజనం చేయవలసిందిగా కోరాడు. దూర్వాస మహర్షి అంగీకరించి నదికి వెళ్లి స్నాన సంధ్యాదులు ముగించి వస్తానని వెళ్లాడు. నదికి వెళ్లిన మహర్షి ఎంతకి రాలేదు. అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఏకాదశి ఉపవాసానంతరం ద్వాదశీ ఘడియలు ముగియక ముందే భోజనం (పారణ) చేసి ముగించ వలసి ఉంటుంది.


అతిథి అయిన దూర్వాస మహర్షి రాకుండ భోజనం చేస్తే మహర్షికి ఆగ్రహంవస్తుంది. సమయం లోపల మహర్షి రాకపోతే సంవత్సరo పాటు చేసిన ద్వాదశి వ్రతం వ్యర్ధమవుతుంది. సమయం ముగియటానికి అర్థ ముహుర్త కాలం మాత్రమే ఉండటంతో అంబరీషుడు పండితులను పిలిచి తన ధర్మ సంకటం వివరించి ఏమి చేయాలో చెప్పమని అడిగాడు.


శాస్త్రం తెలిసిన పండితులు ఆలోచించి "ఆహ్వానించిన అతిథి రాకుండా భోజనం చేయకూడదు. ద్వాదశి ఘడియలు దాటితే వ్రత భంగం అవుతుంది. మధ్యమార్గంగా ద్వాదశి ఉండగానే మీరు జలభక్షణ (జలము స్వీకరణ) చేస్తే వ్రతభంగం కాదు. భోజనం కాదు గనుక అతిథిని అగౌరవించినట్టు కాదు. ద్వాదశి వ్రత పారణ దక్కుతుంది" అని ఉపాయం చెప్పారు.


అంబరీషుడు ఆ మాటలను విష్ణువు ఆదేశంగా భావించి కొద్దిగా జలము స్వీకరించి మహర్షి కోసం నిరీక్షించసాగాడు. 


దూర్వాస మహర్షి నది నుంచి వచ్చాడు. జరిగింది తన దివ్య దృష్టితో గ్రహించి తను రాకుండానే జలభక్షణ చేసిన అంబరీషుని పై ఆగ్రహించాడు.

“అంబరీషా! అతిథిగా నన్ను భోజనానికి పిలిచి వేచి చూడకుండానే జలభక్షణ చేశావు. ఇంత గర్వము, అహంకారం ఉన్న నీవు విష్ణుభక్తుడివి, ధర్మపాలకుడివి కాదు. తగిన శిక్ష విధిస్తాను” అంటూ తన జడలలో ఒకటి పెరికి మంత్రించి భూమి పై విసిరాడు. అది కృత్య అనే మహారాక్షసిగా మారి అంబరీషుడి పైకి తినడానికి రాసాగింది.


ప్రజలందరు హాహాకారాలు చేస్తున్నా అంబరీషుడు కన్నులు మూసుకుని చేతులు జోడించి విష్ణునామం ధ్యానం చేస్తూ నిలిచాడు. 


వైకుంఠవాసుడైన శ్రీహరి గ్రహించి భక్తునికి రక్షణగా సుదర్శన చక్రం ప్రయోగించాడు. అగ్నిజ్వాలలు చిమ్ముతూ వచ్చిన సుదర్శన చక్రం కృత్య రాక్షసిని భస్మం చేసింది. తరువాత రాక్షసిని ప్రయోగించిన దూర్వాస మహర్షిని శిక్షించడానికి వెంట పడింది.


దూర్వాస మహర్షి సుదర్శన చక్రం నుంచి తప్పించుకోవడానికి మేరు పర్వత గుహలలోకి వెళ్లి దాక్కున్నాడు. అయినా సుదర్శన చక్రం వెంట పడటం మానలేదు. మహర్షి ఎక్కడికి వెళ్లినా అక్కడికి వెంట వస్తోంది. సత్యలోకంలో బ్రహ్మ దగ్గరకు వెళ్లి చక్రం నుంచి రక్షించమని ప్రార్ధించగా బ్రహ్మ “దేవదేవుని సుదర్శన చక్రాన్ని ఆపే శక్తి నాకు గానీ, ఇంద్రాది దేవతలకు గానీ లేదు” అని చెప్పాడు.


వెంటనే దూర్వాస మహర్షి తన పుట్టుకకు కారణమైన పరమేశ్వరుడి వద్దకు వెళ్లి సుదర్శన చక్రం నుంచి తనను రక్షించమని ప్రార్ధించాడు. శివుడు "సుదర్శనాన్ని ఆపడం దానికి స్వామి అయిన మహావిష్ణువు వలనే అవుతుంది” అని విష్ణువు వద్దకు వెళ్ళమన్నాడు.  


సుదర్శనం వెంట వస్తుండగా దూర్వాస మహర్షి వైకుంఠంలో శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లాడు. సుదర్శనం ద్వారం వద్ద ఆగి వేచి చూస్తోంది.


శ్రీహరి పాదాలకు ప్రణమిల్లి దూర్వాస మహర్షి "నారాయణా! నీ సుదర్శనం నుంచి నీవే కాపాడగలవు. నా తప్పు మన్నించి రక్షింపుము” అని ప్రార్ధించాడు. 


మహావిష్ణువు మందహాసంతో “మహర్షీ! నేను నా భక్తుల హృదయంలో బందీ అయ్యి ఉంటాను. అంబరీషుడి రక్షణ కోసం నియమింపబడిన సుదర్శనం ఆ భక్తుడు చెబితేనే వింటుంది.


అంబరీషుడు మహా భక్తుడు, ధార్మికుడు. ఎవరికీ హాని తలపెట్టని వాడు. అటువంటి మహాభక్తునికి ఆపద తలపెట్టి నీవు ఆపదలో చిక్కుకున్నావు. నిన్ను సుదర్శన చక్రం శిక్షించ కుండా ఉండాలంటే అంబరీషుని శరణు వేడి క్షమించమని కోరుము. అతను మాత్రమే నిన్ను కాపాడగలడు” అని చెప్పి పంపాడు.


దూర్వాస మహర్షి సుదర్శన చక్రం తరుముతుంటే అంబరీషుడి వద్దకు వచ్చి శరణు కోరి “అంబరీష చక్రవర్తీ! నా తప్పును మన్నించి నన్ను సుదర్శన చక్రం నుండి రక్షించుము” అని ప్రార్ధించాడు. 


మహర్షి తన పాదాల పై పడినందుకు అంబరీషుడు బాధపడి ఆయనను లేపి ఉచితాసనుని చేశాడు. సుదర్శన చక్రానికి నమస్కరించి

“చక్రరాజమా! శ్రీహరి ఆదేశంతో నీవు భక్తులను రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తావు. దూర్వాస మహర్షి దుష్టుడు కాదు మహాతపస్వి. శివాంశ సంభూతులు. క్షణిక ఆగ్రహంలో తప్పు చేశారు. సహృదయంతో మన్నించి ఆయనను శిక్షించకుండా వదిలి వేయుము” అని ప్రార్ధించడంతో సుదర్శన చక్రం శాంతించి అదృశ్యమయ్యింది.


దుర్వాస మహర్షి అంబరీషుడి ఆతిథ్యం స్వీకరించి దీవించి వెళ్లి పోయాడు. 


రాజర్షి అయిన అంబరీషుడికి ముగ్గురు పుత్రులు కలిగారు. పెద్దవాడైన విరూపునికి రాజ్యం అప్పగించి అంబరీషుడు ధర్మపత్నితో వానప్రస్థానికి వెళ్లి పోయాడు. తపస్సుతో శ్రీహరిని మెప్పించి వైకుంఠప్రాప్తిపొందాడు. చిన్నవారైన కేశుమంతుడు, శుంభుడు తండ్రి వలెనే విష్ణు భక్తులై తపస్సుకి వెళ్లారు. 


విరూపుని వంశంలోని రథీతరుడి సంతతి వారు బ్రాహ్మణులై రథీతరగోత్రులుగా ప్రసిద్ధి చెందారు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏