22, జూన్ 2026, సోమవారం

వృద్ధాప్యం

 ఏవండీ...మీకీ సంగతి తెలుసా...?   మన పక్క ఫ్లాట్ లో ఉండే  కరుణాకర్ గారూ, వసుంధర గారూ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లిపోతున్నారట...   

వాళ్ళుండే  ఫ్లాట్ అద్దెకి ఇస్తారట ప్రస్తుతం అంది భర్త తో ప్రభావతి.


అవునా... నీకెలా తెలుసు.. నీకు చెప్పారా..?  అన్నారు ప్రభావతి భర్త ముకుంద రావు గారు..

                            

ఈ విషయం మన పనిమనిషి చెప్పింది అందామె.


"పోనీలే పాపం,  అక్కడ ఉంటే మంచి కాలక్షేపం, 

కనిపెట్టుకుని చూసే వాళ్ళు ఉంటారు... సేఫ్టీ కూడా...

అన్నారు"  ముకుందం గారు...


:ఏంటో... ఖర్మ కాకపోతే,  ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని దిక్కులేనట్టు... అక్కడ ఉండటం ఏంటో..అంది"  ఆవిడ దీర్ఘం తీస్తూ...


"చూడు.. నువ్వు అలా మాట్లాడటం తప్పు...

ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు బ్రతుకుతారు అంతే గానీ ఇలానే బ్రతకాలి అని ఒక రూల్ పెట్టుకుని అందరం బ్రతకడం కష్టం... ఆ రూల్ ఎంత సహేతుకమైనా...

మనం విమర్శించడం మానేస్తే మంచిది"... అన్నారు ముకుందం గారు...


"సరే లెండి ఏదో పక్క వాళ్ళు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకోవడం అంతే... నాకెందుకు...?

సాయంత్రం వంట పని చూసుకోవాలి అంది ఆవిడ తనలో తను మాట్లాడుకున్నట్లుగా పైకే..


ఆవిడ కొడుకూ కోడలు ఉద్యోగాలనుండి రాత్రి 7 దాటాక  వస్తారు... ఈవిడే వాళ్ళొచ్చే టైంకి వంట చేసి పెట్టాలి.... కోడలు చిన్న సాయం కూడా చేయదు... మనవలిద్దరినీ వీళ్లే చూసుకోవాలి.. ఒకడు స్కూల్ కి వెళ్తాడు... రెండో వాడు రెండేళ్ల వాడు....

ఈవిడ ఓపిక లేక,  పిల్లల్ని చూసుకోలేక... పని చేయలేకుండా ఉంటుంది...


'ఆవిడకి పక్కవాళ్ళ మీద అసూయ....చక్కగా ఇద్దరే ఉంటారు లింగు లిటుకు అంటూ... పనేమీ ఉండదు ఆవిడకి అంతా రెస్ట్ అని ఆవిడ భావన'...


కొన్ని రోజులకే అందరికీ తెలిసింది... కరుణాకర్ గారి విషయం...


ఫ్లాట్స్ లో ఉన్న అసోసియేషన్ వాళ్ళ ఫంక్షన్ హాల్ లోనే ఆయనకి చిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశారు...


ఆ రోజు సాయంత్రం అందరూ వచ్చారు... చాలా మంది మాట్లాడారు...

కరుణాకర్ గురించి ఆయన భార్య గురించి... వాళ్ళు ఎంత మంచి వాళ్ళో... ఎంత హుందాగా ఉండేవారో... అని..

కొంతమంది సానుభూతిగా మాట్లాడారు...

పిల్లలుండీ ఈ పరిస్థితి రావడం మీద...ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోవడం లేదని..

ఇలాంటి తల్లి తండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించడం బాధాకరమని...

ఇలా అనేక రకాలుగా...

కొంతమంది కి మాట్లాడే అవకాశం వచ్చినా...చేతికి మైకు ఇచ్చినా పట్టలేము...

అందరూ కరుణాకర్ గారి  జంట వంక సానుభూతి తో చూస్తున్నారు...


చివరిగా కరుణాకర్ గారి వంతు వచ్చింది...

ఆయన మాట్లాడేస్తే.. అందరూ భోజనాలు చేసేసి వెళ్లిపోవచ్చని ఆత్రుత అందరిదీ...


ఆయన లేచి స్టేజి మీదకి వెళ్లి మైకు తీసుకున్నారు...

మాట్లాడటం ప్రారంభించారు... 


అందరికీ కృతజ్ఞతలు... మా మీద చాలా సానుభూతి చూపించారు..

మా లైఫ్ కూడా మీ అందరి సాన్నిధ్యంలో చాలా బాగా గడిచింది... నేను ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడతాను... దయచేసి వినండి...


మాకు ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరికీ రెండేళ్ల తేడా...

మేము ఇద్దరం కూడా ఉద్యోగస్థులం...


పిల్లల్ని మంచి స్కూల్ లోనే చదివించాం... ఆ రోజుల్లో అందరూ నడిచిన దారిలోనే నడిచాం... పిల్లల పదో తరగతి అవగానే ఒక కార్పొరేట్ కాలేజ్ లో  ఎం.పి.సి గ్రూప్ లో జాయిన్ చేయడం... దానితో పాట ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం.

డబ్బుకు చూసుకోలేదు...

పిల్లలకి దీని మీద ఆసక్తి ఉందా లేదా అని  అడగలేదు...


ఒకటే ధ్యేయం...

ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అవ్వాలి అంతే...


మా పిల్లలూ మేము ఏది చెప్తే అదే చేశారు..


ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకపోయినా,  లక్షల్లో డొనేషన్ కట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించాం....


ఇంజనీరింగ్ అయ్యాకా,  క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం వచ్చింది మా పెద్ద వాడికి...


మాకు అస్సలు ఆ ఉద్యోగం ఆనలేదు... అందరిలాగే అమెరికా పంపించాలని ఆశ... వాడిని జి.ఆర్.యి.  టోఫెల్ ఎక్జామ్స్ వ్రాయించాం. ఏదో యావరేజ్ గా గట్టెక్కాడు...


అమెరికాలో అన్ని యూనివెర్సిటీస్ కి అప్లై చేయించాం...


ఇద్దరం ఉద్యోగస్థులం కదా... డబ్బుకి వెనకాడలేదు...

బాంక్ లోన్స్ పెట్టి మొత్తానికి అక్కడ యూనివర్సిటీస్ లో ఎయిడ్ రాకపోయినా మా డబ్బుతోనే పంపించేసాం...

అక్కడ చదువు అయ్యాకా అక్కడే ఉద్యోగం వచ్చింది..

మా ఆనందానికి అవధులు లేవు.. గర్వంగా ఫీల్ అయ్యాము..


రెండో వాడిని కూడా అదే దారిలో పెట్టేసాము...

రెండో వాడు వెళ్లనన్నాడు... "ఇక్కడే చదువుకుంటాను నాన్నా  అని"  రిక్వెస్ట్ చేశాడు...


మేము ఒప్పుకోలేదు... ఇండియాలో ఏముందిరా... డెవలప్మెంట్ ఉండదు... ఎక్సపోజర్ ఉండదు అని వాడిని ఒప్పించి, ఇంచుమించు బలవంతంగా ఆస్ట్రేలియా పంపించేసాం పై చదువుకి....


మాకు ఎంత గర్వంగా ఉండేదో... మా ఇద్దరి పిల్లలు  విదేశాల్లో ఉన్నారని... దానికి తోడు,  మా చుట్టాలు, ఆఫీస్ లో మా ఇద్దరి కోలీగ్స్,  మమ్మల్ని పొగుడుతుంటే... నా ఛాతీ గర్వంతో వెడల్పు అయ్యేది...


మీకేమండి... మీ ఇద్దరి పిల్లలూ విదేశాల్లో ఉన్నారు అనగానే మాకు గాలిలో తెలిపోతున్నట్టు ఉండేది...

అసలు మా పూజలు, మా మొక్కులు అన్నీ మా ఇద్దరి పిల్లలు ఇండియా దాటి వెళ్లాలనే... అవన్నీ ఫలించి మా పిల్లలు అక్కడ ఉన్నారు అనుకునే వాళ్ళం...


ఇద్దరికీ ఉద్యోగాలు అక్కడే వచ్చాయి... ఇంకా పండగ మాకు...


కొంత కాలానికి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ అమ్మాయిలని భారత్ మెట్రిమోనియల్ డాట్ కాం లో చూసి పెళ్ళిళ్ళు కూడా చేసేసాం...

మరి ఇక్కడ అమ్మాయిని చేస్తే అక్కడికి వెళ్లడం... స్థిరపడటం టైం తీసుకుంటుంది అని...


మేము రెండు మూడేళ్ళ కోసారి అమెరికా, ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్లి వస్తూ ఉండేవాళ్ళం... మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు మావాడు, కోడలు మమ్మల్ని మొత్తం అంతా తిప్పి చూపించారు..

వాళ్ళ వైభోగం, ఆ దేశం చూడటానికి  మా కళ్ళు చాలలేదు...


మేమిద్దరమనుకున్నాం.. మనం పిల్లల్ని ఇక్కడికి పంపించి మంచి పని చేశాం అని... మమ్మల్ని మేము మెచ్చుకోలుగా  భుజాలు తట్టుకున్నాం...


వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వచ్చేవాళ్ళు...

వాళ్ళ హోదా, అలవాట్లుకి తగ్గట్టు మా ఇల్లుని పూర్తిగా మార్చేసామ్... అన్నట్లు మధ్యలో మేము రిటైర్ అయిపోయాం.... మాకు మనవలు కలిగారు...

మేము కూడా వెళ్లి అక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్నాం.


రెండోసారి వెళ్ళినప్పుడు మొదటిసారిలా ఎక్కడికీ తీసుకెళ్లలేదు వాళ్ళు...

అప్పటికే అన్నీ చూసేసి ఉండటం... చిన్న పిల్లలతో వీలు కాకపోవడం వలన...

అప్పుడు మాత్రం నాలుగు గోడల మధ్య ఓ ఆరు నెలలు జైలులా, నరకంగా ఉండేది...


ఇంట్లో పనులు, వంట, పిల్లల్ని చూసుకోవడం మా వల్ల కాలేదు...


తరువాత ఇండియాలో మా ఇంటికి వచ్చాకా మాకు ఇక్కడ స్వేచ్ఛ అర్ధమయ్యింది.... స్వేచ్ఛ విలువ తెలిసింది...


కొన్నాళ్ళకి మా పిల్లలు "మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది" అని ఫోన్ చేసినప్పుడు, నిజంగా మా సంతోషానికి అవధులు లేవు...

ఈ సారి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసామ్...

చుట్టాలకి ఫ్రెండ్స్ కి హోటల్ లో పార్టీ ఇచ్చాం...

కనిపించిన వాళ్లందరికీ స్వీట్స్ పంచాం....

అంత ఆనందం ఎప్పుడూ పొందలేదు....


కాలం ఆగదు కదా... సాగిపోతూనే ఉంటుంది...

మా పిల్లలు అక్కడే ఇళ్లు వాకిళ్ళు కొనుక్కున్నారు...

మా మనవలు పెద్ద వాళ్ళైయ్యారు....మా పిల్లలకి కూడా 40 ఏళ్ళు వస్తున్నాయి...

మాకు అంత పెద్ద ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలంటే కష్టంగా ఉండేది...


పిల్లలు ఇప్పుడు ఇండియా కి రావడం తగ్గిపోయింది...

అంత ఇంట్లో ఇద్దరం బిక్కు బిక్కు మంటూ ఉండలేకపోయాం...


మా పిల్లలు కూడా ఆలోచించి... రోజులు బాగాలేవు, క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి...ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చాలా వింటున్నాం... ఎందుకైనా మంచిది  మీరు అపార్ట్మెంట్ లో ఉంటే మంచిది అని,  ఇక్కడ ఫ్లాట్ కొని మమ్మల్ని షిఫ్ట్ అవమన్నారు...

ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసాం... ఇక్కడికి వచ్చాం...


నాకు 70 ఏళ్ళు, మా ఆవిడకి 65 దాటాయి...

వయసుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి... సహజం కదా....

ఇద్దరం ముసలి వాళ్ళు ఏ తోడూ లేకుండా ఒంటరిగా ఉండటంలో కష్టనష్టాలు తెలియడం మొదలు పెట్టాయి... నెమ్మదిగా వాస్తవాలు బోధపడసాగాయి...


మా పిల్లలు ఫోన్లు చేస్తూ ఉంటారు... మనకి పగలైతే వాళ్ళకి రాత్రి కదా...

వాళ్ళు వాళ్ళ పగలు టైం లో మాకు ఫోన్ చేస్తే... రాత్రి పదింటికి కొంచెం నిద్రపడుతున్న మాకు మెలుకువ వస్తుంది...

వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసినాకా ఇంక నిద్ర పట్టదు... అలా అని ఫోన్ చేయొద్దు అని చెప్పలేం..

ఇలా ఎన్నాళ్లు అనే ఆలోచన వచ్చేసింది....

ఏ అర్ధ రాత్రో ఎవరికి బాగోలేకపోయినా, వాళ్ళని తీసుకుని ఇంకొకరు హాస్పిటల్ కి వెళ్లడం అసంభవం....

మా ఆవిడ వంట చేయలేకపోతోంది మా ఇద్దరికే అయినా కూడా...


వంటమనిషిని పెట్టుకుందామంటే భయం...

కార్ కి డ్రైవర్ ని పెట్టుకుందాం అంటే  భయం...

మేము ఇద్దరమే అని తెలిసి మాకు ఏ హాని తలపెడతారో అని...


ఈ మధ్యనే  నమ్మిన ఒక  డ్రైవర్ తన ముసలి ఓనర్స్ ని చంపి దొరికినవన్నీ పట్టుకుపోయాడు.అని విన్నాం...

సాటి మనుషుల్ని నమ్మలేని స్థితి కి వచ్చాం...


మా ఈ దీనావస్థకి కారణం మా పిల్లలని, వాళ్ళకి హృదయం లేదని మీలో చాలా మంది అన్నారు...

కానీ ఎంత మాత్రం కాదు...

మా పిల్లలు చాలా మంచి వాళ్ళు... మేము చెప్పిందల్లా చేశారు...!

మమ్మల్ని ఆనంద పెట్టారు...!

వాళ్ళు విదేశాలు వెళ్తామని అడగలేదు... మేమే పంపాము...!

మాచిన్నబ్బాయి "నేను ఎక్కడికీ వెళ్ళను నాన్నా, ఇక్కడే మీ దగ్గరే ఉంటా"  అని రిక్వెస్ట్ చేసాడు...

మేము కొట్టి పారేసామ్... వినలేదు వాడి మాట...

ఎందుకంటే మాకు సొసైటీ లో గుర్తింపు కావాలి... మా ప్రతిష్ట పెరగాలి...

అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలనే యావ...


అక్కడ ఉద్యోగం వస్తే సంబరపడిపోయాం...

అక్కడ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తే...అయ్యో...పిల్లలు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారే అన్న బాధ లేకపోగా, ఎగిరి చంకలు గుద్దుకున్నాం...

ఆరోజుల్లో "ఇండియా వచ్చేయండి రా" అని మేము ఒక్క మాటంటే,  వచ్చేసేవారు... కనీసం ఒక్కళ్ళయినా...

మేము అనలేదు సరికదా అక్కడి పిల్లల్నిచ్చి పెళ్లి చేసామ్...

ఇప్పుడు మా కోడళ్ళకి కూడా అక్కడే ఉండాలని ఆశ...


ఒకవేళ మా పిల్లలకి రావాలని ఉన్నా తమ భాగస్వాములు, తమ పిల్లలూ కూడా ఒప్పుకోరు..

మేమే వాళ్ళని అక్కడనుండి కదలకుండా అనేక బంధనాలతో బంధించేసాం...

నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఈ పరిస్థితి మేమే కారణం...

మా పిల్లలు కాదు...ఇది స్వయం కృతం...


మా పిల్లల్ని తిడుతుంటే నేను భరించలేక వచ్చి చెప్తున్నాను...


ఇప్పుడు ఇక్కడ కూడా మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తున్నాయి...

మీరు మీ పిల్లల్ని ఈ దిశగా మరలించండి...

మీకు తెలుసు అనుకోండి..ఆయినా చెప్తున్నాను...


మీ పిల్లల ఫ్యూచర్ తో పాటు,  మీ ఫ్యూచర్ సంగతి కూడా చూసుకోండి...


ఇక్కడ కొన్ని కుటుంబాలు కొడుకుకొడళ్లతో, మనవలతో ఉండటం చూస్తుంటే ఆనందం వేస్తుంది...


మాకు అలాంటి అదృష్టం ఎప్పటికీ రాదు కదా...

అటువంటి అదృష్టాన్ని కోల్పోకండి...


మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తున్నా...

అది ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో ఉంది...

మా పిల్లలే ఆన్లైన్ లో చూసి ఏర్పాటు చేశారు...

అక్కడ ఉండటానికి చిన్న చిన్న కాటేజీలు, 

ఎవరికి ఎలాంటి తిండి అవసరమో అలాంటి ఫుడ్ వండి పెట్టె వంటమనుషులు....

మాలాంటి వాళ్ళు ఎందరో అక్కడ మాకు కాలక్షేపం....

పదిహేను రోజులకి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్ లు చేస్తారు..... వాకింగ్ సౌకర్యం... అందరికీ ఇంట్లో టీవీ... కామన్ హాల్ లో పెద్ద టీవీ.... ఆకుపచ్చని వాతావరణం....ఇవన్నీ ఉన్నాయి....


ఒక్కొకళ్ళకీ నెలకి 50000 కట్టి మా పిల్లలు ఇందులో చేర్చారు....  అంటే మా ఇద్దరికీ నెలకి ఒక లక్ష ఖర్చు పెడుతున్నారు...


ఒకప్పుడు మేము వాళ్ళ చదువులకి లక్షలు ఖర్చు  పెడితే, వాళ్ళు ఇప్పుడు మాకోసం ఖర్చు పెడుతున్నారు...

వాళ్ళు ఇప్పుడు మా విషయంలో ఇలా చేయక పోయినా మేము చేసేది ఏమీ లేదు... అంటే నా ఉద్దేశ్యం ఇంత జాగ్రత్త తీసుకోకపోయినా అని...

మా పిల్లలకి మేమంటే ప్రేముంది కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి, స్థోమత ఉంది కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు...

మేము ఒక విధంగా అదృష్టవంతులమే...

పిల్లలతో మనవలతో ఉండటమే ఎక్కువ అదృష్టం...  దానితో ఏ అదృష్టానికి పోలిక లేదు...

కానీ ఉన్నంతలో సంతృప్తి చెందాలి...


కానీ ఇండియా లో ఉంటూ కూడా  ముసలితనం లో తల్లి తండ్రులని పట్టించుకోకుండా వదిలేసిన పిల్లలూ ఉన్నారు...

ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా దయనీయం...


US లో ఉన్న పిల్లలు తాము రాలేక, తల్లిదండ్రులని తీసుకుపోలేక, పెద్దవయసైన తల్లిదండ్రులని ఒంటరిగా ఉంచలేక...

అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో,  వాళ్ళు తమ తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుతున్నారు... వాళ్ళకి వేరే దారి లేక...

కనీసం అక్కడ ఉంచితే, 

రక్షణ తో పాటు వాళ్ళ అతీ గతీ చూసేవాళ్ళు ఉంటారని...

వైద్య సదుపాయం ఉంటుందని....

మంచి ఆహారం తో పాటూ... ఒకే ఏజ్ వాళ్ళ సహచర్యంతో,  కొంత టైం పాస్ ఉంటుందని...

వాళ్ళని విమర్శించకండి...


దయచేసి మీ పిల్లల అభిప్రాయం తెలుసుకుని, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి చదివించండి...ఇది నా సలహా...అందని వాటికి అర్రులు చాచొద్దు...

మీకు వీలున్నప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి పోతూ ఉండండి...

మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ దగ్గరికి రాలేకపోవచ్చు....

మా మీద జాలి పడకండి...

నమస్తే....

అని ఆయన ఆపేశారు...


కొన్ని సెకండ్స్ నిశ్శబ్దంగా గంభీరమైపోయిన  ఆ ప్రదేశం... కొద్ది క్షణాల అనంతరం చప్పట్లతో మారు మ్రోగిపోయింది..


వసుంధర గారు చెంగుతో కళ్ళు వొత్తుకున్నారు...


....   ఉమ్మడి కుటుంబం దేవుని వరం🙏🙏

సేకరణ .

21, జూన్ 2026, ఆదివారం

తిప్పతీగ ఉపయోగాలు -

 తిప్పతీగ ఉపయోగాలు - 


చేలల్లో చెట్లల్లో కంచల్లో విరివిగా పెరిగేటువంటి తీగలలో తిప్పతీగ ఒకటి కొంచెం ఆయుర్వేద పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా తిప్పతీగను గుర్తించవచ్చు తిప్పతీగ ఆకులని నమిలితే కొంచెం చేదుగా ఉంటాయి తిప్పతీగ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు తెలుసు కరోనా అప్పుడు ఆనందయ్య గారు కరోనాకు మందు తయారు చేశారు ఆ మందు వల్ల చాలామంది వ్యాధిగ్రస్తులు వ్యాధి నుంచి విముక్తి పొంది జీవించాలన్నది సత్యం ఆనందయ్య గారు తయారు చేసిన మందు లో ప్రధానమైన మూలిక తిప్పతీగానే మనలో ఎంతమందికి తెలుసు నిజానికి తిప్పతీగ వల్ల అనేక రకాల వ్యాధులు నివారణ చెందటమే కాకుండా మనలోపడా వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని బాగా బలపరుస్తుందని అంటారు ఇప్పుడు తిప్పతీగ మాత్రలు కూడా మనకు పతంజలి ఆయుర్వేదం నుండి లభిస్తున్నాయి వాటిని వాడు విధానము అందులో పొందుపరిచి ఉంది దాని ప్రకారం ఆ మాత్రలను తీసుకొని సభ్యులు ఇమ్యూనిటీని పెంపొందించుకోవాలని ఆశిస్తున్నాను


      తిప్పతీగ అనునది ప్రతి వూరు డొంకలలో పెరుగుతుంది . దీనిని సంస్కృతంలో " గుడూచీ" అని పిలుస్తారు . దీనికి అర్థం వ్యాధుల నుండి రక్షించునది అని అర్థం.  " అమృత" అనే పేరు కూడా దీనికి కలదు. అనగా అమృతమునకు సమానం అయినది అని అర్థం.


            ఇప్పుడు మీకు దీనిలోని ఔషధ గుణముల గురించి మీకు వివరిస్తాను. 




  తిప్పతీగ యందలి ఔషధ గుణములు  - 




 *  ఇది వాత , పిత్త , కఫ దోషముల మూడింటి మీద పనిచేస్తుంది . బలకరము , ఆకలిని పెంచుతుంది . మెదడుకు మంచిది . నేత్రములకు బలాన్ని ఇచ్చును. పాండు , కామెర్లు , జ్వరము , మూత్రవ్యాధులు , కుష్ఠు , దగ్గు మొదలగు వ్యాధులను పోగొట్టును . కడుపులోని నులిపురుగులను నశింపచేయును . తల్లిపాలను శుద్ధిచేయును . 




 *  జ్వరములలో తిప్పతీగ కషాయం 20ml ఉదయము , సాయంత్రం ఇచ్చిన జ్వరములు తగ్గును. 




 *  మూత్రసంబంధ వ్యాధులలో తిప్పతీగ రసములో తేనె కలిపి ఇవ్వాలి. కామెర్ల యందు కూడా తిప్పతీగ రసములో ప్రతిరోజూ తేనె కలిపి ఇచ్చిన కామెర్ల సమస్య తగ్గును. 




 *  కీళ్లనొప్పుల యందు తిప్పతీగ , శొంఠి కలిపి ఇచ్చిన కీళ్లనొప్పులు తగ్గును. 




 *  ప్రతిరోజూ తిప్పతీగ రసం తాగించి రోగి బలానుసారం కందికట్టులో నెయ్యి చేర్చిన అన్నము తినుచున్న కుష్ఠు వ్యాధి తగ్గును. 




 *  తిప్పతీగ రసమును ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం ఒక నెలరోజుల పాటు సేవిస్తే ఏ వ్యాధులు రాకుండా , ముసలితనం రాకుండా మానవుడు ఆరోగ్యముగా ఉండును. 




 *  తిప్పతీగ చూర్ణము , బెల్లం , నెయ్యి , తేనె కలిపి ముద్దగా చేసి ఉండలా చేసి రోజూ ఒక ఉండ తింటే మానవుడు ఆరోగ్యముగా 100 సంవత్సరాలు జీవిస్తాడు. 




 *  తిప్పతీగ రసం కొద్దిగా నూనెలో కలిపి తాగిన బోదకాలు తగ్గును. 




 *  తిప్పతీగ కషాయంలో పిప్పలి చూర్ణం కలిపి ఇచ్చిన చాలా రోజుల నుంచి వేధిస్తున్న జీర్ణజ్వరం తగ్గును. 




 *  తిప్పతీగ కషాయం ప్రతిరోజూ సేవించిన మధుమేహం తగ్గును. మూత్రాశయపు రాళ్లు కూడా కరిగిస్తుంది. 




 *  మొలల సమస్య ఉన్నవారు తిప్పతీగ స్వరసాన్ని మజ్జిగతో కలిపి వాడవలెను .

20, జూన్ 2026, శనివారం

స్నేహ సంబంధం

 💐స్నేహ సంబంధం ఎలా ఉండాలి ?


💐పాపాన్నివారయతి యోజయతే హితాయ

గుహ్యం చ గూహతి గుణాన్ ప్రకటీకరోతి ।

ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే

సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః ॥


ఉత్సవే వ్యసనే చైవ

దుర్భిక్షే శత్రు సంకటే ।

రాజద్వారే శ్మశానే చ

యస్తిష్ఠతి స బాంధవః ॥

అర్థం:

ఉత్సవ సమయంలో, కష్టకాలంలో, కరువు వచ్చినప్పుడు, శత్రువుల వల్ల ప్రమాదం ఏర్పడినప్పుడు, రాజద్వారం (న్యాయస్థానం లేదా అధికారుల వద్ద) అవసరం వచ్చినప్పుడు, చివరికి శ్మశానం వరకు కూడా మనతో నిలబడి ఉండేవాడే నిజమైన బంధువు, నిజమైన స్నేహితుడు.


అందరూ తప్పక చూడండి మరియు మీ కుటుంబ సభ్యులకు అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి 


శ్రీ దత్త శర్మ గారు ఋగ్వేద అధ్యాపకులు శ్రీ కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం కర్నూలు

పంచాంగం 20.06.2026 Saturday,

 ఈ రోజు పంచాంగం 20.06.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస శుక్ల పక్ష షష్ఠి తిథి స్థిర వాసర మఘ నక్షత్రం వజ్ర యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: షష్ఠి


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 8 ।।



ప్రతిపదార్థ:



  పరిత్రాణాయ — రక్షించుటకు; సాధూనాం — ధర్మపరులను; వినాశాయ — నాశనంచేయటానికి; చ — మరియు; దుష్కృతామ్ — దుష్టులను; ధర్మ — సనాతన ధర్మమును; సంస్థాపన-అర్థాయ — మళ్ళీ స్థాపించుటకు; సంభవామి — నేను ప్రకటమవుతాను; యుగే యుగే — ప్రతి యుగము నందు.


 

 తాత్పర్యము : 


ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.




వివరణ:



పూర్వ శ్లోకం లో భగవంతుడు అవతరిస్తుంటాడు అని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు దానికి ఉన్న మూడు కారణాలను వివరిస్తున్నాడు: 1) దుష్టులను సంహరించుట కొరకు 2) సాధు జనులను రక్షించుట కొరకు 3) ధర్మాన్ని స్థాపించుట కొరకు. కానీ, వీటిని నిశితంగా పరిశీలిస్తే ఈ మూడు కారణాలు కూడా నమ్మకంగా అనిపించవు.


సాధు జనులను రక్షించుట కొరకు: పరమాత్మ తన భక్తుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు, లోపలనుండి వారిని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూనే ఉంటాడు. ఈ పని కోసం ఒక అవతారం తీసుకోవలసిన అవసరం లేదు.


దుష్టులను సంహరించుట కొరకు: భగవంతుడు సర్వ-శక్తివంతుడు, దుష్టులను తన సంకల్ప మాత్రంచేతనే సంహరింపగలడు. దీనికోసం ఒక అవతారం ఎత్తవలసిన అవసరం ఏమున్నది?


ధర్మాన్ని స్థాపించుట కొరకు: అనాది కాలం నుండి వేదములలో ధర్మము వివరించబడింది. భగవంతుడు దానిని ఒక మహాత్ముని ద్వారా తిరిగి స్థాపించవచ్చు. దీనిని సాధించటం కోసం తానే ఒక రూపంలో అవతరించాల్సిన అవసరం లేదు.


మరైతే, ఈ శ్లోకంలో చెప్పబడిన కారణాలను మరెలా అర్థం చేసుకోవాలి? శ్రీ కృష్ణుడు ఏం చెప్తున్నాడో కొంచెం లోతుగా వెళ్లి అర్థం చేసుకుందాం.


జీవాత్మ చేయ గలిగే అత్యున్నత ధర్మం, భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వటమే. దీనినే భగవంతుడు తన అవతారం ద్వారా వృద్ది నొందిస్తాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు తన దివ్య రూపములు, నామములు, గుణములు, లీలలు, ధామములు, మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు. ఇది జీవాత్మలకు భక్తి కోసం ఒక సులువైన ఆధారాన్ని అందిస్తుంది. మనస్సుకి ధ్యానం చేయటానికి, అనుసంధానమవటానికి ఒక రూపం అవసరం, అందుకే భగవంతుని నిరాకార తత్త్వం, ఆరాధించటానికి చాలా కష్టతరమైనది. అదే సమయంలో, సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది, సామాన్య జనులకు అర్థం చేసుకోవటం తేలిక, ఆచరించటానికి సులువైనది, మరియు ఎంతో మధురమైనది.


ఈ విధంగా, ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు అవతరించినప్పటి నుండి, కొన్ని కోట్ల జీవులు (జీవాత్మలు) కృష్ణుడి దివ్య లీలలను తమ భక్తికి ఆధారంగా వాడుకుని, తమ మనస్సులను సునాయాసంగా, ఆహ్లాదంగా పవిత్రమొనర్చుకున్నారు. ఇదే విధంగా, రామాయణం కూడా ఎన్నో శతాబ్దాలుగా జీవాత్మల భక్తికి, ఎంతో జనాదరణ పొందిన ఆధారంగా ఉపయోగపడింది. భారతదేశంలో ఆదివారాల్లో టీవీలో రామాయణం మొదలయిన రోజుల్లో, దేశంలో అన్ని వీధులు నిర్మానుష్యమయ్యేవి. రామచంద్రుని లీలలు జనులకు ఎంత ముగ్ధమోహనముగా ఉండేవంటే, ప్రజలు తమ టెలివిజన్ తెరలకు, ఆ లీలలను చూడటానికి, అతుక్కుపోయేవారు. శ్రీరామచంద్రుని అవతారం, చరిత్రలో ఎన్నో కోట్ల జీవాత్మలకు తమ భక్తికి ఒక ఆధారాన్ని అందించింది. రామాయణం ఇలా పేర్కొంటున్నది:


రామ ఏక తాపస తియ తారీ, నామ కోటి ఖల కుమతి సుధారీ


‘తన అవతార సమయంలో, రామచంద్ర మూర్తి ఒక్క అహల్యకే (గౌతమ ముని భార్య, ఆమెను రాముడు ఒక రాతి శరీరంనుండి విడిపించాడు) సహాయపడ్డాడు. కానీ, అప్పటి నుండి “రామ” నామము జపించి, కోట్ల మంది పతితులైన జీవులు తమను తాము ఉద్ధరించుకున్నారు.’ కాబట్టి, ఈ శ్లోకానికి నిగూఢమైన అర్థం ఏమిటంటే :


ధర్మాన్ని స్థాపించటం కోసం: జీవాత్మలకు భక్తిలో నిమగ్నమై తమ అంతఃకరణ శుద్దికి సహకరించటానికి, తన నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు, మరియు సహచరులను ప్రకటించటం ద్వారా, భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచటానికి భగవంతుడు అవతరిస్తాడు.


దుష్టులను సంహరించటం: భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి, ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి, దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి, రావణ-కుంభకర్ణులు నిజానికి భగవత్ దివ్య ధామము నుండి దిగివచ్చిన జయ-విజయులే. వారు రాక్షసులుగా నటించారు మరియు రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దివ్య పురుషులు కాబట్టి మరెవ్వరి చేత సంహరింపబడలేరు. కాబట్టి, భగవంతుడే అటువంటి రాక్షసులను తన లీలలలో భాగంగా సంహరించాడు. అలా సంహరించి, వారిని తన దివ్య ధామానికి పంపించాడు, ఎందుకంటే వారు నిజానికి అక్కడి నుండి వచ్చిన వారే.


ధర్మాత్ములను రక్షించటం: ఎన్నో జీవాత్మలు, భగవంతుడిని తమ ఎదురుగా దర్శించటానికి తగినంత ఉన్నతిని సాధనలో పొందిఉన్నారు. ఈ అర్హత సంపాదించిన జీవాత్మలు, శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి మొదటి అవకాశాన్ని పొందాయి. ఉదాహరణకి, కొంతమంది గోపికలు (శ్రీ కృష్ణుడు తన లీలలను ప్రదర్శించిన బృందావనానికి చెందిన మహిళలు) నిజానికి శ్రీ కృష్ణుని లీలలలో సహకరించటానికి ఆయన దివ్య ధామము నుండి దిగివచ్చిన ముక్త జీవులు. మరికొంత మంది గోపికలు, మొదటి సారి భగవంతుని కలిసి, సేవించుకుని, ఆయన లీలలలో పాలు పంచుకునే అవకాశమొచ్చిన, భౌతిక బంధములో ఉన్న జీవులు. కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, అలాంటి పరిపక్వత కలిగిన జీవాత్మలకు, ఆయన లీలలలో భాగస్వాములై, తమ భక్తిని పరిపూర్ణమొనర్చుకునే అవకాశం కలిగింది.


ఇది, ఈ శ్లోకం యొక్క నిగూఢమైన అర్థం. అదే సమయంలో, ఎవరైనా ఈ శ్లోకాన్ని ఉన్నదున్నట్లుగానే అర్థం చేసుకోవటంలో కూడా తప్పు లేదు.

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 16*


*సరాగః సద్వేషః ప్రసృమరసరోజే ప్రతిదినం*

*నిసర్గాదాక్రామన్విబుధజనమూర్ధానమధికమ్ ।*

*కథంకారం మాతః కథయ పదపద్మస్తవ సతాం*

*నతానాం కామాక్షి ప్రకటయతి కైవల్యసరణిమ్ ॥*


*భావము :*


*ఓ కామాక్షీ! నీ పాదపద్మములు, పద్మముల కాంతిని తిరస్కరించాయి. నీ పాదపద్మముల కాంతిని సకల దేవతలు, విజ్ఞులు శిరసున దాల్చారు. అలాంటి నీ పాదములు, నీ శరణు కోరినవారికి ముక్తిని ప్రసాదించడం మా భాగ్యము కాక మరేమిటి.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

శనివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏


20-06-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉదర అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.  

---------------------------------------


వృషభం


చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

---------------------------------------


మిధునం


వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా సన్నిహితుల సహాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.

---------------------------------------


కన్య


సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ యత్నాలలో విజయం వరిస్తుంది. స్నేహితుల నుండి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

---------------------------------------


తుల


కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.  

---------------------------------------


వృశ్చికం


నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు. ఇంటా బయట పెద్దల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------


ధనస్సు


ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి. వ్యాపారంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------


మకరం


ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నములలో ఆటంకలు తొలుగుతాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.

---------------------------------------


కుంభం


ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. కీలక వ్యవహారాలలో మీ కలలు నిజమవుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

---------------------------------------


మీనం

 

ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు తప్పవు. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని పనులలో సన్నిహితుల నుండి నిందలు పడవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

---------------------------------------

వృక్షయర్వేద విచిత్రాలు

 వృక్షయర్వేద విచిత్రాలు -


• కొబ్బరి చెట్లకు ఎక్కువు గా కాయలు కాయలంటే ప్రతి రోజు " మరువం , పెసలు, మిణుములు" ఈ మూడింటి తో తయరు అయిన కషాయాన్ని చల్లార్చి పోస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ ముడింటి ముద్దను చెట్ల మొదళ్లకు పట్టించాలి. అలా చేయడం వలన కొబ్బరి చెట్టు కి విపరీతమైన బలం వస్తుంది. చాలా పెద్ద మొత్తం లొ కాయలు కాస్తూ యవ్వనం గా తయారు అవుతుంది.


• మల్లెపూలు తెల్లగా ఉంటాయని మనకు తెలుసు.వాటిని ఎరుపు రంగులో పూయించ వచ్చు. పారిజాతం ( పగడ మల్లె ) చెట్టు వేరుకు రంధ్రం చేసి ఆ రంద్రం లొ మల్లె తీగను తీసుకొచ్చి గుచ్చాలి.ఆ తరువాత దానిపై మట్టి కప్పాలి. రోజు నీళ్లు పొస్తూ ఉంటే పారిజాతం తో పాటు మల్లె చెట్టు కుడా కలిసిపోయి పెరుగుతుంది. ఆ తరువాత భూమిని తవ్వి మల్లె వేరుని పారిజాతం నుంచి వేరు చేసి విడిగా పాతి పెడితే కొద్ది రోజుల్లోనే తెల్ల మల్లె చెట్టు ఎర్ర మల్లె పూలు పూస్తుంది.మంచి సువాసన కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఏ చెట్టు విత్తనాలు అయినా నాటి వాటికి ఏ రంగు నీళ్లు అయితే పోస్తామో ఆ రంగు పువ్వులే పూస్తాయి.


• మునగ చెట్టుకి కాసిన మునగ కాయలు చెట్టు మీదే పండి ఎండిన తరువాత వాటిని సేకరించాలి. ఆ కాయలను సగం విప్పదీసి , అందులోని మునగ గింజలని తీసివేసి వాటి స్థానం లొ కాకర గింజల్ని పెట్టి , దారం తొ కాయని గట్టిగా చుట్టి భూమిలో పాతి పెట్టాలి. కొన్నాళ్ళకి చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టుకి ఒకవైపు మునగ కాయలు, మరోవైపు కాకరకాయలు పుడతాయి.


• విత్తనాలు లేని కాయలు కాయలంటే వంకాయ,గుమ్మడి కాయ , పొట్ల కాయ మొదలయిన చెట్ల విత్తనలని వస రసం లొ నానబెట్టి భుమి లొ పాతి పెట్టాలి.చెట్లు మొలిచేవరకు ప్రతి రోజు వస నీళ్ళను పాదుల్లో పోయాలి.ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే చెట్లు ఆరోగ్యం గా పెరిగి గింజలు లేని పెద్ద కాయలు కాస్తాయి.


• కొన్ని పువ్వులు ఎంతో అందం గా ఉంటాయి.కాని వాటికి సువాసన ఉండదు.అలాంటి పూల చెట్టుకి ప్రతి రోజు " చెంగల్వ కోస్టు ,ఆకుపత్రి, సారాయి,తుంగ ముస్థలు , తగిరస, వట్టివేళ్ళు,"మొదలయిన ఔషధ చుర్ణముని నీళ్లలో కలిపి ఆ నీళ్లను చెట్ల పాదుల్లో పొస్తూ ఉంటే క్రమం గా ఆ చెట్లకి పూచే పూలకి అద్బుతమైన సుగంధం అబ్బుతుంది. ఒక నెల వరకు పూల సువాసనలు గుబాళిస్తునే ఉంటాయి.


" వృక్ష జాతులు అనగా తిన్త్రిని మామిడి మొదలగు చెట్లు ను తీగలుగా మార్చుట

బియ్యపు పొడి 1 భాగము , మినుముల 1 బాగము , నలగ దంచిన వడ్ల పిండి 1 భాగము , నువ్వుల పిండి 1 భాగము, వీటిని మాంసము కడిగిన నీళ్లలో కడిగి పసుపు పొడి పోగవేసి పాటి మట్టి నేలలో నాటితే అవి తీగలుగా మారును.


• చెట్లు అప్పటికి అప్పుడే పెరిగి చిగుర్చుట -

అంకోల తైలము లొ యే చెట్టు యెక్క బీజములు నైనా నూరు మాట్లు తడిపి వడగండ్లతో కలిపి పాటిమట్టి లొ నాటితే అప్పటికప్పుడే చెట్టు మొలిచి పండ్లు, పువ్వులు ఇచ్చును.


• బీజములు తొందరగా మొలుచుటకు -

ఆయా పండ్లు కాచే సమయమున వాటి విత్తనాలు సేకరించి వాటిని బాగుగా ఎండించి పాలలో తడిపి అయిదు దినములు ఎండనించి వాయు లవంగాల కషాయముతో కలిసిన నేతితో పోగవేసి పంచాంగం, బృహతి, నిప్పుల బూడిద ను పాలలొ కలిపి ఆ విత్తనాలను దీనితో పిసికి ఆ ప్రకారము అయిదు రోజులు అయిన పిమ్మట ఆ బీజములు ఆవు పేడతో , ఆవు మూత్రములో ఒక్కో దినము నానబెట్టి విత్తిన మొక్కలు తొందరగా మొలుచును .


• చెట్లకు విపరీతముగా పువ్వులు , పండ్లు కాచుటకు -

చేప మాంసమును , ఆవు పేడతో కలిపి చెట్లకు వేసి యావలు, నువ్వులు , మిణుములు, పెసలు, వులవులు ఈ ఐదింటిని సమబాగాలుగా కలిపి నీళ్లు పోసి వుడకపెట్టి ఆ నీళ్లు చల్లార్చి రెండు దినములు వరసగా చెట్లకు చల్లితే చెట్లు విశేషముగా ఫలించును.

మామిడి చెట్లకు నక్క మాంసం , ఉడుము మాంసం లేదా లేడి, పంది మాంసం , రావి చిగుల్లు, మర్రి చిగుల్లు , అత్తి చిగుల్లు, మామిడి చిగుల్లు, నేరేడు చిగుల్లు, కషాయం పెట్టి చల్లార్చి పాదులో పొసిన మంచి పండ్లు పండును.

మామిడి చెట్టు వేరు దగ్గర చుట్టు గొడ్డలితో కొంచం కాటు చేసి కషాయం పొసిన విశేషమైన ఫలములు ఇచ్చును.

పెసలు , మినుములు ఉడక పెట్టి చల్లార్చి ఆ నీళ్లు తేట వంచి ఆ గుజ్జు కొబ్బరి చెట్టు వేళ్ళకు పట్టించి ఉప్పు నిండా వేసి ఆ నీళ్లు పోస్తే పెద్ద పెద్ద కాయలు కాయును , కాయలు రాలవు.

*. పోక చెట్లకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పైన ఎండిపోయిన మట్టలు కోసి చెట్ల చుట్టు త్రవ్వి పైన చెప్పిన కషాయము పొస్తే అధికముగా పండును.


* అరటి చెట్టు కు ఏనుగు దంతపు పొట్టు కాల్చిన నిప్పులోగాని, పంది పెంటికలు, గుర్రపు పెంటికలు కాల్చిన నిప్పులో గాని ఇనప సలాకు ఎర్రగా కాల్చి చెట్టు మొదట వేరులో గుచ్చితే చాలా గొప్ప ఫలితాలు ఇచ్చును.

రేగు చెట్టుకి నువ్వులు , పెసలు సమబాగములు గా చేర్చి దానితో కొంచం అతిమధురం వేసి చెట్టు చుట్టు వేసి మాంసం కడిగిన నీళ్లు పొసిన మరియు నూవుల పిండి , అతిమధురం కలిపి ఎరువు వేసిన తియ్యటి ఫలములు మరియు తియ్యటి ఫలములు ఇచ్చును.


* పత్తి విత్తనాలను ఆవు పేడలో , ఆవు పంచితములో చాలుమార్లు తడిపి పేడనీళ్ళు చల్లుతూ నాటిన తరువాత పందికొవ్వు, మాంసం కడిగిన నీళ్లు చల్లిన అది తన జాతిని విడిచి నిమ్మ జాతిగా మారును.


* మామిడి టెంక నాటిన పిదప మొలచిన మొక్క జానెడు వరకు పెరిగిన పిదప చిగురు కత్తిరించిన యెడల నాలుగైదు కొమ్మలు పుట్టి పెరుగును. ఆ కొమ్మలు వ్రేళ్ళు వలె పెరిగిన పిమ్మట నాలుగు కొమ్మలకు నాలుగు జాతుల అంటు మామిడి అంట్లు కట్టిన నాలుగు వైపులా నాలుగు రంగుల కాయలు కాచును.


* పనస మొక్కకు మామిడి కొమ్మ కట్టి నాటిన మొదటను పనస కాయలును, కొమ్మలకు మామిడి కాయలను కాయును .


* నేరేడు మొక్క యెక్క కొమ్మకు గులాబి, జామ, అంటును కట్టవచ్చు.

నిమ్మ , దబ్బ , కమలా, నారింజ, ఈ జాతులు ఒక జాతి మొక్కకు అన్ని జాతుల మొక్కలు అంట్లు కట్టవచ్చును.

పాల మొక్కకు సపోటా, పనస అంటు కట్టవచ్చును.


* పొగాకుకు , గరుడ వాహన , జాజికి చమెలి, గులాభికి పల్ల సంపెంగి , మాలతికి సాంబ్రాణి అంట్లు కట్టవచ్చు.

మల్లె చెట్టు దగ్గర నొక యెర్ర బాడిద కొమ్మను పాతి ఆ కొమ్మ చిగిర్చిన పిదప అడ్డగముగా నొక రంధ్రము చేసి ఆ రంధ్రములో నుండి ఒక మల్లె కొమ్మని తీసి పేడ మన్ను ఆ రంధ్రముని గప్పి నీళ్లు పోయుచుండిన కొంతకాలానికి ఆ రంద్రములో గల కొమ్మకి వేర్లు వచ్చును. పిమ్మట ఆ కొమ్మని మొదటకి కోసి నాటిన మంకెన ( బాడిద ) పువ్వులు పూయును.


* పొగడ చెట్టు కొమ్మకు సంపెంగ మొక్కకు అంటు కట్టిన ఒక పక్క పొగడ పువ్వులు , ఇంకో పక్క సంపెంగ పువ్వులు పూయును.

సూర్య కాంత ( sunflower ) గింజలు పాలలొ 7 మార్లు నానవేసి ఎండబెట్టి నాటి రోజు పాలతో తడుపు చుండిన తెల్లని పువ్వులు పూయును.

ఎర్ర గన్నేరుకు , తెల్ల గన్నేరుకు అంటు కట్టిన రెండు రకాల పువులు పూయును.


అప్పారావు డైటింగ్

 అప్పారావు డైటింగ్ రేపటి నుంచి (హాస్య కథ)

==================

రచన : సురేష్ వంకాయలపాటి

=============


మా కాకినాడ దేవాలయం వీధిలో అప్పారావు అనే వ్యక్తి ఉండేవాడు. అప్పారావు చాలా మంచి మనిషి. అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు. కానీ అతనికి ఒక చిన్న బలహీనత ఉండేది.

అది ఏమిటంటే… తినడం!

తినడం అంటే అతనికి చాలా ఇష్టం. కొందరికి పుస్తకాలు అంటే ఇష్టం, కొందరికి సినిమాలు అంటే ఇష్టం. కానీ అప్పారావుకి మాత్రం తినడమే ప్రపంచంలో పెద్ద హాబీ.

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం – ఎప్పుడైనా ఏదైనా తినడానికి సిద్ధంగానే ఉండేవాడు.

అప్పారావు ఉదయం లేవగానే మొదట చేసే పని ఏమిటంటే… అద్దం చూడటం కాదు, మొబైల్ చూడటం కాదు… వంటగది చూడటం!

వంటగదిలోకి వెళ్లి

“ఈ రోజు ఏమి వండారు?”స్పెషల్స్ ఏమిటి అని అడగడం అతని దినచర్య.

ఒక రోజు ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్లి చూసాడు. అక్కడ అతని భార్య సీత ఇడ్లీలు వేస్తోంది.

అప్పారావు కళ్ళు మెరిసిపోయాయి.

“సీతా! ఇవాళ్టి టిఫిన్ ఏమిటి?” అని అడిగాడు.

సీత నవ్వుతూ చెప్పింది

“ఇడ్లీలు చేస్తున్నాను. కొద్దిసేపట్లో సిద్ధం అవుతాయి.”

అప్పారావు వెంటనే ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.

“అయితే ఇడ్లీకి కొబ్బరి చట్నీ కూడా చేయి. అలాగే కొంచెం దబ్బకాయ బెల్లం వేసిన పచ్చడి చేయి. అలా చేస్తే ఇడ్లీకి మహా రుచిగా ఉంటుంది. అన్నట్లు నెయ్యి వేడి చేసి కారప్పొడి కూడా పెట్టు.”

సీత విసుక్కుంటూ నవ్వింది.

“ఏమండీ! మీరు టిఫిన్ తింటున్నారా లేక హోటల్కి ఆర్డర్ ఇస్తున్నారా?”

కొద్దిసేపటికి ఇడ్లీలు సిద్ధమయ్యాయి.

సీత ప్లేట్‌లో నాలుగు ఇడ్లీలు పెట్టి తీసుకొచ్చింది.

అప్పారావు ఆ నాలుగు ఇడ్లీలు రెండు నిమిషాల్లో మాయమయ్యేలా తిన్నాడు.

తర్వాత మెల్లగా అన్నాడు

“సీతా… ఇడ్లీలు చాలా బాగున్నాయి. ఇంకో రెండు పెట్టు.”

సీత మళ్లీ రెండు పెట్టింది.

అప్పారావు మళ్లీ అడిగాడు

“ఇంకో రెండు పెడితే పర్లేదు కదా?”

ఇలా అడుగుతూ అడుగుతూ చివరికి పది ఇడ్లీలు తిన్నాడు.

సీత ఆశ్చర్యంగా చూసి చెప్పింది

“అయ్యో! ఇంత తింటే మీరు లావుగా అయిపోతారు.”

అప్పారావు నవ్వుతూ అన్నాడు

“పర్లేదు సీతా… మనిషి తినడానికి పుట్టాడు!”

సీత వెంటనే అన్నది

“కానీ మీరు మాత్రం ఇతరుల భాగం కూడా తినడానికి పుట్టినట్టు ఉన్నారు!”

కొన్ని రోజులు ఇలా గడిచాయి.

ఒక రోజు అప్పారావు అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకున్నాడు.

అతని పొట్ట కొంచెం ముందుకు వచ్చింది.

అప్పారావు వెంటనే భయపడ్డాడు.

“అయ్యో! నా పొట్ట చూస్తుంటే బెలూన్ లా ఉంది. ఇలా అయితే నడవలేను.”

అప్పుడే అతను గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.

“ఇక నుంచి నేను డైటింగ్ చేస్తాను!”

సాయంత్రం సీత దగ్గరకు వెళ్లి చెప్పాడు.

“సీతా! రేపటినుంచి నేను డైటింగ్ చేయబోతున్నాను.”

సీత ఆశ్చర్యంగా అడిగింది

“నిజంగా డైటింగ్ చేస్తారా?”

అప్పారావు గంభీరంగా చెప్పాడు

“అవును. ఇకనుంచి తక్కువగా తింటాను.”

సీత నవ్వుతూ అంది

“సరే… మీ డైటింగ్ ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం.”

మరుసటి రోజు ఉదయం వచ్చింది.

సీత మళ్లీ ఇడ్లీలు చేసింది.

అప్పారావు ప్లేట్ దగ్గరకు వచ్చి గంభీరంగా అన్నాడు.

“నేను డైటింగ్ చేస్తున్నాను కాబట్టి రెండు ఇడ్లీలు మాత్రమే తింటాను.”

సీత రెండు ఇడ్లీలు పెట్టింది.

అప్పారావు వాటిని మూడు క్షణాల్లో తిన్నాడు.

కొద్దిసేపటికి మెల్లగా అన్నాడు

“సీతా… డైటింగ్ చేస్తున్నా గానీ ఇడ్లీలు చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకో రెండు పెట్టు.”

మళ్లీ రెండు తిన్నాడు.

ఇంకొంచెం తర్వాత అన్నాడు

“ఇది చివరి సారి… ఇంకోటి పెట్టు.”

చివరికి మళ్లీ ఆరు ఇడ్లీలు తిన్నాడు.

సీత నవ్వుతూ అడిగింది

“ఇదేనా మీ డైటింగ్?”

అప్పారావు అన్నాడు

“ఇది మొదటి రోజు కాబట్టి ప్రాక్టీస్ డైటింగ్!”

మధ్యాహ్నం భోజనం వచ్చింది.

అప్పారావు అన్నాడు

“కొద్దిగా మాత్రమే పెట్టు. నేను డైటింగ్ చేస్తున్నాను.”

సీత చిన్న గరిటతో అన్నం పెట్టింది.

అప్పారావు ప్లేట్ కేసీ చూస్తూ 

“ఇంత తక్కువా? డైటింగ్ అంటే ఆకలితో ఉండటం కాదు కదా!”

ఇంకొంచెం పెట్టమన్నాడు.

ఇలా “ఇంకొంచెం… ఇంకొంచెం…” అంటూ చివరికి మూడు గిన్నెలు అన్నం తిన్నాడు.

సాయంత్రం టీ టైం వచ్చింది.

అప్పారావు అన్నాడు

“నేను డైటింగ్ చేస్తున్నాను కాబట్టి టీ మాత్రమే తాగుతాను.”

సీత టీతో పాటు బిస్కెట్లు కూడా పెట్టింది.

అప్పారావు మొదట అన్నాడు

“లేదు… బిస్కెట్లు తినను.”

కానీ కొద్దిసేపటికి ఒక బిస్కెట్ తీసుకున్నాడు.

“టీకి బిస్కెట్ లేకపోతే రుచి ఉండదు” అని అన్నాడు.

ఒక్కటి… రెండు… మూడు…

చివరికి ప్లేట్ మొత్తం ఖాళీ అయింది.

సీత నవ్వుతూ అంది

“ఇది డైటింగ్ కాదు… బిస్కెట్ మీటింగ్!”

రాత్రి భోజన సమయం వచ్చింది.

ఆ రోజు సీత పుట్టినరోజు కావడంతో పులిహోర, పాయసం, వడలు చేసింది.

వంటగది నుంచి మంచి వాసన వస్తోంది.

అప్పారావు కాస్త ఆలోచించాడు.

తర్వాత సీరియస్‌గా అన్నాడు

“సీతా… ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.”

సీత అడిగింది

“ఏమిటది?”

అప్పారావు నవ్వుతూ అన్నాడు

“డైటింగ్ రేపటినుంచి చేస్తాను. ఈరోజు స్పెషల్ వంటలు ఉన్నాయి కదా!”

సీత గట్టిగా నవ్వింది.

“మీ డైటింగ్ ఎప్పుడూ రేపటినుంచే మొదలవుతుంది!”

అప్పారావు కూడా నవ్వుతూ అన్నాడు

“అదే అసలు డైటింగ్ రహస్యం!”

అలా ప్రతి రోజు అప్పారావు

“రేపటినుంచి డైటింగ్!” అని చెప్పుకుంటూ

ఆ రోజు మాత్రం బాగా తినేస్తూ ఉండేవాడు.

ఇప్పటికీ కాకినాడ దేవాలయం వీధిలో అందరూ ఒక మాట చెప్పుకుంటారు —

“అప్పారావు డైటింగ్ అంటే… తినడం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టడం మాత్రమే! తినడం మానడం కాదు.”

ఖడ్గమాలాస్తోత్రానికి

  *ప్ర*: ఖడ్గమాలాస్తోత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? మరి *'అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మంత్రస్య'* అని ఎందుకన్నారు? ఖడ్గమాలలోని ఆ పేర్లన్నీ ఎవరివి?


*జ*: ఖడ్గమాల శ్రీవిద్యకు చెందినది. తొలుత లలితా త్రిపురసుందరి నామం చెప్పబడి, అటుపై న్యాసాంగ దేవతలు, తిథినిత్యా దేవతలు, దివ్యౌఘ సిద్ధౌఘ మానవౌఘ గురు మండల నామాలు; ఆ తరువాత క్రమంగా శ్రీచక్ర నవావరణ దేవతల నామాలు, నవచక్రేశ్వరీ నామాలు; చివరగా దేవి విశేషణాలు చెప్పబడ్డాయి.


ఒకే అక్షరం గల మంత్రాలు *'పిండ'* మంత్రాలనీ, 

రెండక్షరాలు కలవి *'కర్తరి'* అనీ, 

మూడు నుండి తొమ్మిది అక్షరాలు కలవి *'విధి బీజముల'* నీ, 

10 నుండి 20 అక్షరాల వరకు కలవి మంత్రములనీ, 

21 నుండి ఎన్ని అక్షరాలున్నా *మాలామంత్రముల* నీ


వ్యవహరింపబడుతాయి. ఆ కారణం చేతనే ఇది మాలా మంత్రం!


15 అక్షరాల పంచదశీ (శ్రీ) విద్యను ఆధారం చేసుకుని 15 విధాల మాలా మంత్రాలు ఏర్పడ్డాయి. 


అవి : 


శుద్ధ శక్తిమాల, 

నమోంత శక్తిమాల, 

స్వాహాంత శక్తిమాల,

తర్పణాంత శక్తిమాల, 

జయంత శక్తిమాల, 

శుద్ధ శివ సంబుధ్ధ్యంతమాల, 

నమోంత శివమాల, 

స్వాహాంత శివమాల, 

తర్పణాంత శివమాల, 

జయంత శివమాల,

శుద్ధమిధున మాల, 

నమోంత మిధునమాల, 

స్వాహాంత మిధునమాల, 

తర్పణాంత మిధునమాల, 

జయాంత మిధునమాల.


ఇందులో ప్రసిద్ధంగా లభిస్తున్నది *'శుద్ధ శక్తిమాల'*. 


దీనిని *'ప్రకృతిమాల'* అని కూడా అంటారు. 


ఈ మాలా మంత్రాలను వివిధ ప్రక్రియలతో ఉపాసించి కొన్ని సిద్ధులను పొందవచ్చు. పై చెప్పిన 15 విధాల మాలామంత్రాలకు 15 సిద్ధులున్నాయి. 


అందులో మొదటిది *'ఖడ్గసిద్ధి'*. 


తరువాత చెప్పబడిన పదునాలుగు : 


పాదుకాయుగ్మ సిద్ధి, 

అంజన సిద్ధి, 

బిల సిద్ధి, 

వాక్సిద్ధి, 

దేహ సిద్ధి, 

లోహ సిద్ధి, 

అణిమాద్యష్ట సిద్ధి,

వశీకరణ సిద్ధి, 

ఆకర్షణ సిద్ధి, 

సమ్మోహన సిద్ధి, 

స్తంభన సిద్ధి, 

చతుర్వర్గ సిద్ధి,

ఐహికాముష్మిక సిద్ధి, 

భోగ మోక్ష సిద్ధి.


ఒక్కొక్క సిద్ది కోసం ఈ మాలా మంత్రాలను వివిధ (15) విధాల వినియోగిస్తారు. *'ఖడ్గాది'* 15 సిద్ధుల నిచ్చే మాలా మంత్రము కనుక ఇది *'ఖడ్గమాల'* అని లోకంలో ప్రసిద్ధి పొందింది.


*'తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై।*

*అష్టాదశ మహాద్వీప సమ్రాద్భక్తా (సమ్రాద్భోక్తా) భవిష్యతి'll* 


-- అని ప్రస్తుత లభ్య గ్రంథాలలో ఉంది.


కానీ ఈ శుద్ధశక్తిమాలను 14వ దైన ఐహికాముష్మిక సిద్ధి కోసం వినియోగించడమే మంచిదని విజ్ఞుల అభిప్రాయం. 


దానికి సంబంధించిన శ్లోకం :


*అలౌకికం లౌకికం చేత్యానంద ద్వితయం సదా।*

*సులభం పరమేశాని త్వత్పాదౌ భజతాం నృణామ్|*


శుద్ధశక్తిమాలను నిష్కామంతో జపించితే సర్వ (15) సిద్దులూ లభిస్తాయని శాస్త్రవచనం. సర్వసిద్ధులలో మొదటిది *'ఖడ్గసిద్ధి'* కనుక - దానిని మొదలుకొని మిగిలిన సిద్ధులను ఇచ్చే శుద్ధశక్తి మాలామంత్రాన్ని *'ఖడ్గమాల'* గా వ్యవహరిస్తున్నాం.

సేకరణ