నాహంకర్తా...
2003 జూన్ మాసంలో ఒకరోజు...
హైదరాబాదు జూబ్లీహిల్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన డా॥ మర్రి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ పి.వి.ఆర్.కె ప్రసాద్తో సమావేశమయ్యాను. అప్పటివరకు ఒక వారపత్రికలో ‘సర్వసంభవామ్’ శీర్షికన ప్రచురితమవుతున్న ప్రసాద్గారి వ్యాసాల్ని ఒక పుస్తకంగా (నాహంకర్తా... హరిః కర్తా) ప్రచురించే విషయమై మాట్లాడుతున్నాం. అదే సంస్థలో జాయింట్ డైరెక్టర్ జనరల్గా ఉన్న ప్రముఖ రచయిత, ఐపిఎస్ అధికారి శ్రీ రావులపాటి సీతారామారావు, ప్రసాద్గారికి రచనాసహకారం అందించిన శ్రీ జి.వల్లీశ్వర్ కూడా ఉన్నారు.
ఆ వారపత్రికలో సీరియల్ ఆఖరి భాగం ఆ రోజు పోస్టుకు వెళ్లాలి. వల్లీశ్వర్ ఆ భాగం చదివి వినిపిస్తున్నారు. అందులో - ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోకి వచ్చిన కొత్త రోజుల్లో పివిఆర్కె ప్రసాద్ ‘సకల కళా వల్లభుడు’గా ఎలా పేరు పడ్డాడో వర్ణించే పేరాలు వచ్చినప్పుడు సీతారామారావు అభ్యంతర పెట్టారు.
“సర్, ఇంతకుముందు అధ్యాయాలన్నిట్లోనూ మీరొక శ్రీనివాసుడి సేవలో తరించి పునీతుడైన వ్యక్తిగా కనిపించారు. ఇప్పుడు ఈ చివరి అధ్యాయంలో ఇలా ‘ఒకప్పుడు నేను సకలకళా వల్లభుణ్ణి’ అని రాస్తే, పాఠకుల మనోభావాలు దెబ్బతింటాయేమో! ఇది రాయటం అవసరమా?’’ అని సందేహం వ్యక్తం చేశారు. నేను వింటున్నాను. అలా రాయటం, రాయకపోవటంలో ఉండే ప్రభావాన్ని గురించి ఒక ప్రచురణకర్తగా ఆలోచిస్తున్నాను.
ప్రసాద్గారు తక్షణం స్పందించారు, “సీతారామారావ్, ‘నేను ఏమిటి’ అని తీర్పు ఇచ్చేది పైవాడు (భగవంతుడు). పాఠకుల మనోభావాలు దెబ్బతింటాయన్న కారణంగా ఆ పైవాణ్ణి నేను మోసం చేయగలనా? నో... ఆ పేరాలు అలానే ఉండాలి.’’
ప్రసాద్గారిలో నాకొక నిజాయితీ మూర్తీభవించిన రచయిత కనిపించాడు. ఆయన్ని అభినందించకుండా ఉండలేకపోయాను. అలాంటి అనేక సంఘటనలు ఆయన్ని ఎప్పటికప్పుడు ఒక విశిష్ట వ్యక్తిగా ఆవిష్కరిస్తూ వచ్చాయి.
సానుకూలతా దృక్పథం: విలువలు
ఒక అధికారిగా ఆయనలో ఉట్టిపడే సానుకూలతా దృక్పథాన్ని, పనిరాక్షసత్వాన్ని నేను అనేక సందర్భాల్లో దగ్గరనుండి చూడటం జరిగింది.
చాలామంది అధికారులు ఎవరికి సహాయం చేసినా, దానికి గుర్తింపు కోరుకునేవాళ్లే. సహాయం చేయలేకపోతే చేయలేమని చెప్పకుండా పదేపదే తిప్పుకునేవాళ్లు కొంతమంది. నాకు తెలిసి ప్రసాద్గారు తనను కలిసి సహాయం కోరిన ప్రతివాళ్లకీ సహాయం చేశారని చెప్పలేను. కాని ఆయన సహాయం చేయలేకపోయినా ఆయన మాట్లాడే తీరు మనసుకి ఏమాత్రం కష్టం కలిగించదు. పని కాలేదన్న అసంతృప్తినీ మిగల్చదు.
తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వ్యక్తి తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాడు అన్నట్లుగా ప్రవర్తించడంగాని, అవసరం లేకపోయినా పదేపదే తిప్పించుకోవడంగాని ప్రసాద్గారి తత్త్వానికి సరిపడదు. ఒక వ్యక్తి తనదగ్గరికి ఓ సబబైన విషయంలో సహాయం కోసం వచ్చాడంటే అతనికి సహాయం చేసే అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించాడు అని విశ్వసించేవారు. అందుకేనేమో ఆయన సహాయం కోరి వెళ్లి, పని జరగనివాళ్లు కూడా ఆయనను ప్రేమిస్తారు.
నాకు తెలిసి ప్రసాద్గారి మాట సాయం కోసం వెళ్లిన అనేకమందికి ప్రసాద్గారే తిరిగి ఫోన్ చేసి, పని అయిందీ, లేనిదీ, వచ్చిన వాళ్లు వెళ్లి ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి వగైరా... వివరాలు తనంతతానుగా చెప్పేవారు. చేస్తాను అని మాట ఇచ్చాక, చివరిదాకా ప్రయత్నం చేయటం ప్రసాద్గారి తత్త్వం.
నా గత పదిహేనేళ్ల సాన్నిహిత్యంలో ఆయన ఏ వ్యక్తినీ ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ తూలనాడటం నేనెరగను. అనేక లోపాలు ఉన్న వ్యక్తిని గురించి ప్రస్తావన వచ్చిన సందర్భాల్లోనూ, తనని వ్యతిరేకించినవాళ్లను గురించి ఎవరన్నా మాట్లాడిన సందర్భాల్లోనూ కూడా చతురోక్తులతో ఆ సంభాషణని మరోవైపు మళ్లించేవారు.
ఏదన్నా ఒక బృహత్కార్యానికి చేయూతనివ్వాలని ఏవన్నా సంస్థలు వచ్చి అడిగితే, అది చేయదగిన మంచికార్యం అని భావిస్తే, తనకి శక్తి లేకపోయినా ఏదో రకంగా పనిజరిగే మార్గాన్ని ఎంచుకుని పని జరిపించేవారు.
“ఎందుకు సార్ అంత కష్టపడతారు’’ అని నేనెప్పుడన్నా అడిగితే, ఆయన చెప్పే మాట - “నో.. అని చెప్పడం ఎంతో సులభం విజయకుమార్. కాని కార్యం మంచిదైతే చేయడానికి మార్గాన్నీ, శక్తినీ, యుక్తినీ ఆయనే (శ్రీనివాసుడు) కల్పిస్తాడయ్యా.’’
ప్రభుత్వంలో ఆయన ఉద్యోగం చేసినా అలానే చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్గా ఉన్నప్పుడు ఆయన తనకి తానుగా తలకెత్తుకున్న - ‘ప్రభుత్వంలో అన్ని శాఖలలో అన్ని స్థాయిల ఉద్యోగాలకు మాన్యువల్స్ తయారుచేసే బృహత్కార్యం’, ‘సుపరిపాలన సంస్కరణలు’ ఇందుకు ఉదాహరణలు.
ఇవ్వాళ విలువలు గురించి ప్రభుత్వంలో ఎక్కువగా ఎవరూ మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా అర్థం వేరేగా ఉంటుంది అని అర్థం చేసుకోవలసిన రోజులివి.
1987 లో పివిఆర్కె ప్రసాద్ ఎక్సైజ్ కమీషనర్గా పనిచేస్తున్నారు. ఒకరోజు సాయంత్రం ప్రముఖ లిక్కర్ వ్యాపారి మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రసాద్ గారింటికి వచ్చి, మర్యాదపూర్వకంగా మాట్లాడి, ఒక స్వీట్ పాకెట్ ఇచ్చి వెళ్లిపోయారు. కొంతసేపటికి స్కూలు నుంచి వచ్చిన పిల్లలు స్వీట్స్ తిందామని పేకెట్ ఓపెన్ చేస్తే, అందులో కరెన్సీ ఉంది. వెంటనే పిల్లల్ని ప్రసాద్గారు ఆ కరెన్సీ ముట్టుకోనీకుండా ఆపేసి, అవినీతి నిరోధక శాఖకి ఫోన్ చేశారు. ఎయిర్పోర్టులో సుబ్బరామిరెడ్డిగారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ పేకెట్లో ఉన్న కరెన్సీ విలువ లక్ష రూపాయలు!
1990 లో... తిరుపతిలో పోర్టు ఛైర్మన్ ప్రసాద్గారి కుమార్తె వివాహం జరిగినప్పుడు పెళ్లికి కార్లు సరఫరా చేసిన సంస్థకి 24 వేల రూపాయల బిల్లు ఒక గుర్తు తెలియని వ్యక్తి చెల్లించాడు. ఆ బిల్లు చెల్లించింది ఒక పోర్టులో ఒక కాంట్రాక్టరు అని తెలుసుకొని, ప్రసాద్గారు ఆ కాంట్రాక్టరు ‘ఎందుకు ఇలా చేశానా’ అని పశ్చాత్తాపపడేలా చేసేదాకా వదలిపెట్టలేదు.
...ఇలాంటి విలువలున్న అధికారుల్ని ఇప్పుడు వెతికి వెతికి చూడాల్సి వస్తోంది. ఉన్నతమైన విలువలు, సేవాభావం, సానుకూలతా దృక్పథాలతో వ్యవహరించే గత తరం అధికారులకి ప్రతీక శ్రీ పివిఆర్కె ప్రసాద్.
మానవ సంబంధాలు
ప్రసాద్గారు భువనగిరి సబ్కలెక్టరుగా పనిచేసింది 1960వ దశకం చివర్లో. కాని భువనగిరి ప్రాంతం నుంచి లేదా ఆయన కలెక్టరుగా పనిచేసిన ఖమ్మం జిల్లానుంచి... అవేకాదు, ఆయన గతంలో పనిచేసిన తి.తి.దేవస్థానాలు, పంచాయతీ రాజ్, ఎక్సైజ్, వైజాగ్ పోర్టు, వంటి సంస్థలు లేదా ప్రభుత్వశాఖలనుంచి ఎవరెవరో సిబ్బంది ఇప్పటికీ వస్తూనే ఉన్నారు, ఆయన్ని కలుస్తూనే ఉన్నారు.
నాకు ఆశ్చర్యం వేసేది. పదేళ్లు పక్కింట్లో ఉన్నవాళ్లే బయటికెళ్తే మనల్ని పలకరించరే! ఈయనకేమిటి ఇంత అభిమాన సందోహం!!
ఆ వచ్చినవాళ్లు ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ, “మీరున్నప్పుడు ఎంత బావుండేదండీ! ఇప్పుడు అలా లేదండీ’’ అని అర్థం వచ్చేలాగా ఏవో కొన్ని ప్రశంసావాక్యాలు వేస్తుంటారు. వెంటనే ప్రసాద్గారు మాట మార్చేసి, “మీ పిల్లలెరా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నీ వ్యాపారం/ఉద్యోగం ఎలా ఉంది?’’ అంటూ ఆ కుటుంబం పట్ల తన కుతూహలాన్ని చూపించేవారు.
మానవసంబంధాల నిర్వహణలో ప్రసాద్గారిది అందె వేసిన చేయి. పనిచేసిన ప్రతిచోటా తనదంటూ ఒక ముద్రవేయటం, ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ తనతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరినీ తన సానుకూలతాదృక్పథంతో ప్రభావితం చేయటం, ఎన్ని సంవత్సరాల తరువాతయినా ఆ ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకొని పేరుతో సంబోధించడం, వాళ్లు బావుండాలన్న తన తపన వ్యక్తం చేయటం... ఇలాంటి అసాధారణమైన మానవతావిలువలు ప్రసాద్గారి ప్రతి అడుగులోనూ కనిపిస్తాయి.
ఆయనతో కలసి పనిచేసిన ఏ స్థాయి ఉద్యోగిని ఇవాళ కదిలించినా, “ప్రసాద్గారితో పనిచేశాక వేరే వాళ్లతో పనిచేయటం కష్టమండి’’ అంటారు.
మానవసంబంధాల నిర్వహణకి ఆయన ఒక నిలువెత్తు దర్పణం అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద దృష్టాంతాలున్నాయి. ఆయన 1978-82 లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. అప్పుడు దేశంలో కొంతమంది పీఠాధిపతులతో పరిచయాలేర్పడ్డాయి. 1993-94 లో ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు, అయోధ్య రామాలయాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్మించాలని పి.వి. నరసింహారావుగారు కోరుకుని ఆ బాధ్యతను తన మీడియా సలహాదారు ప్రసాద్కి అప్పగించారు.
ఆయన దేశంలోని అన్ని పీఠాలు, మఠాలు, అఖాడాలు, గడీలు తదితర ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ తిరిగి కీలకమైన హిందూ ధర్మాచార్యులందరితో అయోధ్య రామమందిర నిర్మాణానికి ఒక ట్రస్టును రిజిస్టరు చేయించారు. (ఈ విషయం ప్రసాద్గారు 2010 లో తన ‘అసలేం జరిగిందంటే..’ వ్యాసాల్లో రాసేదాకా ఎవరికీ తెలియదు).
2006 - 17 మధ్య కాలంలో హిందూధర్మ పరిరక్షణ ఉద్యమం కోసం సుమారు 60 మంది పీఠాధిపతులు, మఠాధిపతులతో తిరుమలలో నాలుగుసార్లు ధార్మిక సదస్సులను విజయవంతంగా నిర్వహించగలిగిన ఏకైకవ్యక్తి పివిఆర్కె ప్రసాద్. ఆయన ద్వైత శాఖకు చెందిన వ్యక్తి అయినా అన్ని శాఖల ధర్మాచార్యులు ఆయనని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, అనుసరిస్తారు.
“ఎలా సాధ్యం?’’ అని అడిగితే, “ఆ మధ్య (1978-82) టి.టి.డి ఈవోగా చేశాను కదా. అప్పటి పరిచయాలే!’’ అని చులాగ్గా అనేస్తారు. ఎంత దుస్సాధ్యం - ఇంతలా మానవసంబంధాల్ని నిర్వహించడం!
ముఖ్యమంత్రులుగా పనిచేసిన పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, టి. అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీ రామారావు, ఎన్. జనార్దన రెడ్డి, చంద్రబాబు నాయుడు, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, కె. రోశయ్య లతో సహా తనకు సంబంధించిన ప్రతి మంత్రితో కూడా సత్సంబంధాలు నెరుపుతూనే, తన విశ్వాసం, విలువల విషయంలో రాజీ పడకుండా “అత్యంత సమర్థుడైన అధికారిగా పనిచేశాడు’’ అనిపించుకున్న ఏకైకవ్యక్తి కూడా పివిఆర్కె ప్రసాద్ గారే.
ఆగస్టు 21 2017 ఉదయం శ్రీ ప్రసాద్గారి భౌతికకాయానికి నమస్కారం పెట్టుకోవటానికి నేను వెళ్లినప్పుడు ప్రసాద్ గారి భార్య శ్రీమతి గోపిక గారు గద్గద స్వరంతో ‘నాహంకర్తా హరిః కర్తా... ఇక లేరు’ అన్నారు.
నాహంకర్తా హరిః కర్తా ఆయన రాసిన పుస్తకం పేరు మాత్రమే కాదు. ఆయన జీవితాన్ని నడిపించిన వాక్యం.
అందుకే శ్రీప్రసాద్ గారు ఈ తరానికి ఒక స్ఫూర్తి.
ఆయనతో నాకు కొన్ని అనుభవాలున్నట్లే ఈ సమాజంలో అనేకమందికి గొప్ప అనుభవాలున్నాయి. ఆయనతో గల అనుబంధాన్ని అక్షరరూపంలో పంచుకోవాలనే నా మిత్రులు కొందరి ఆకాంక్ష ఈ పుస్తకానికి నాంది పలికింది. సోదరులు, సీనియర్ పాత్రికేయులు శ్రీ వల్లీశ్వర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంతో ఈ పుస్తక రూపకల్పన మాకు సులభతరం అయింది. కొండంత దేవుడికి కొండంత పత్రితో పూజ చేయలేం కదా! కాని కొండంత ప్రేమతో, భక్తితో పూజ చేయవచ్చు. అందుకే ఆకాశమంత మిత్రుడికి ఈ నివాళి!
ఎమెస్కో విజయకుమార్
[22/08, 2:15 pm] Deekshitulu Chavali: ⬆️ పై వ్యాసం చదవండి కొంచెం పెద్దదైనా. ఎందుకంటే, ఒక మంచి అధికారి వుంటే సొసైటీ ఎంత బాగుపడుతుందన్న విషయం మనకు విశధం అవుతుంది. శ్రీ ప్రసాద్ గారు మధ్వ బ్రాహ్మణులు.