18, ఆగస్టు 2026, మంగళవారం

శ్రీమద్భాగవతం - 22/42*

 *


    *శ్రీమద్భాగవతం - 22/42* 


*మత్స్యావతారం, సూర్యవంశం & అంబరీషుని ఏకాదశి వ్రతం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత యాత్రలో

నిన్నటి రోజున వామనావతారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మత్స్యావతార వృత్తాంతం (సత్యవ్రతుని కథ), సూర్యవంశ ఆరంభం మరియు అంబరీష మహారాజు ఏకాదశి వ్రతం / దుర్వాస మహర్షి గర్వభంగం** గురించిన వివరాలు యథాతథంగా తెలుసుకుందాం.


#1. మత్స్యావతార ఆవిర్భావం & సత్యవ్రతుడు


చాక్షుష మన్వంతరాంతంలో 'సత్యవ్రతుడు' అనే రాజర్షి (ఈయనే తర్వాతి జన్మలో అంటే ప్రస్తుతం జరిగే మన్వంతరం లో వివస్వంతునీ పుత్రుడు గా పుట్టి వైవస్వత మనువు అయ్యాడు) కృతమాల నదిలో జల తర్పణాలు ఇస్తుండగా, ఆయన దోసిలి నీటిలోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది.దాన్ని నీటితో సహా మళ్ళీ నదిలోకి జారవిడిచాడు సత్యవ్రతుడు. 


* **రక్షణ కోరిన చేప:** ఆ చిన్న చేపమిక్కిలి దైన్య స్వరంతో"రాజా! నన్ను ఈ పెద్ద చేపల నుండి రక్షించు" అని వేడుకొనగా, సత్యవ్రతుడు దయతో దాన్ని తన కమండలంలో వేశాడు.


* **రూప పెరుగుదల:** మరుసటి రోజుకి ఆ చేప కమండలానికి పట్టనంతగా పెరిగింది. రాజా నాకు ఉండుటకు చోటు చాలడం లేదు కాస్త పెద్ద స్థానం ఏర్పాటు చేయి అని వేడుకోగా రాజు దాన్ని ఒక పాత్రలో వేశాడు, అందులో వేసిన క్షణాల్లోనే అది మూడు మూరలు పెరిగింది రాజా నాకు ఇది కూడా చాలటం లేదు అంటే సరస్సులో వేశాడు అందులో కూడా క్షణాల్లో పెరిగితే, నీరు బాగా సమృద్ధిగా ఉండే పెద్ద తటాకం లో వేసాడు,ఇక ఎక్కడ ఉంచాలో అర్దం కాలేదు సముద్రమే అనంతం కనుక అందులో వదులుతూ ఉండగా లీలా మత్స్యం ఇలా అన్నది రాజా సముద్రం లో మొసళ్ళు ఉంటాయి నన్ను తినేస్తాయి వదలకు అన్నది.


ఆ మత్స్యము యొక్క మధురమైన పలుకులు విని సత్యవ్రతుడు ఇలా అన్నాడు. నన్ను మోహం లో ముంచిన నీవు ఎవరు, ఒకేరోజు లో వందయోజనల సరస్సు ఆక్రమించావు. ఇలాంటి జలచరం ఎక్కడ కనలేదు వినలేదు. నీవు తప్పక సర్వాంతర్యామి అయిన శ్రీహరే జీవులను అనుగ్రహించుటకు ఇలా మత్స్య రూపం ధరించావు అని స్వామికి ప్రణమిల్లగా, మత్స్యరూపి అయిన స్వామి ఇలా ఆజ్ఞాపించాడు:


"సత్యవ్రతా! ఇక్కడికి ఏడో రోజున ప్రళయం వచ్చి ముల్లోకాలు నీటిలో మునిగిపోతాయి. ఆ సమయంలో ఒక పెద్ద నౌక (పడవ) నీ వద్దకు వస్తుంది. నువ్వు సకల ప్రాణుల సూక్ష్మ శరీరాలు వెంటపెట్టుకుని, సమస్త ఓషధులను, ధాన్యాలను, సప్తరుషులను ఆ నౌకలోకి ఎక్కించు. నేను ఈ సముద్రంలో కొమ్ము కలిగిన దివ్య మత్స్యరూపంలో ఈదుకుంటూ వస్తాను.వాసుకి అనే సర్పరాజును తాడుగా చేసి, ఆ పడవను నా కొమ్ముకు కట్టివేయి. ప్రళయాంతం వరకు మిమ్మల్ని రక్షిస్తాను."


ఆ సమయమున చుట్టూ మహాసాగరజలములే యుండును. ఏ మాత్రమూ వెలుతురు ఉండదు. కేవలము ఋషులయొక్క దివ్యకాంతుల సహాయమున ఎట్టి తడ బాటూ లేకుండ నీవు ఆ నావపైన ఎక్కి నలువైపుల విహరించుచుండవలెను. ప్రచండవాయువుల కారణముగా ఆనావ ఇటునటు కదలుచుండును. అప్పుడు నేను ఈ మత్స్యరూపమున నేను దాన్ని రక్షిస్తూ ఉంటాను.


మహారాజా!అలా బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయము ముగియునంత వరకు ఋషులతోసహా నిన్ను ఆ నావను లాగుచు సముద్రమున విహరించెదను. 


ప్రళయ జలధిలో మత్స్యభగవానుడు సత్యవ్రతునికి, సప్తరుషులకు పరమ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు (దీనినే **'మత్స్య పురాణం'** అంటారు). అలాగే హయగ్రీవాసురుడు అపహరించిన వేదాలను సంహరించి బ్రహ్మదేవునికి అప్పగించాడు.


#2. నవమ స్కంధ ప్రవేశం – సూర్యవంశ వర్ణన (9వ స్కంధం – 1, 2, 3, 4 అధ్యాయాలు)


సత్యవ్రతుడు ప్రళయాంతంలో 'వైవస్వత మనువు' అయ్యాడు. వైవస్వత మనువు కుమారులలో **ఇక్ష్వాకువు, శర్యాతి, నాభాగుడు** మొదలైనవారు ప్రముఖులు.


* **ఇల వృత్తాంతం:** మనువు పెద్ద కుమారుడైన 'ఇలుడు' పరమశివుని శాపం వల్ల స్త్రీగా (ఇలగా) మారి, బుధుని వివాహమాడి పురూరవునికి జన్మనిచ్చాడు.

* **శర్యాతి & సుకన్య:** శర్యాతి చక్రవర్తి కుమార్తె సుకన్య పొరపాటున చ్యవన మహర్షి కళ్లను దర్భతో పొడిచింది. తప్పు తెలుసుకుని ముసలివాడైన చ్యవనుడిని వివాహం చేసుకుని పతిసేవ చేసింది. అశ్విని దేవతలు ప్రసన్నులై చ్యవనునికి నవయౌవనాన్ని అనుగ్రహించారు.


#3. అంబరీష మహారాజు భక్తి నిష్ఠ (9వ స్కంధం – 4వ అధ్యాయం)


సూర్యవంశంలో నాభాగుని కుమారుడైన **అంబరీష మహారాజు** మహాభాగవతోత్తముడు. సకల భూమండలానికి అధిపతి అయినప్పటికీ, ఐశ్వర్యాన్ని మిథ్యగా భావించి తన సకల ఇంద్రియాలను శ్రీహరి సేవలోనే నియోగించాడు: **"స వై మనః కృష్ణపదారవిందయోర్వచాంసి వైకుంఠగుణానువర్ణనే..."** *మనస్సును కృష్ణుని పాదపద్మాలపై, వాక్కును హరి గుణగానంపై, చేతులను హరి మందిర మార్జనంపై, చెవులను హరికథా శ్రవణంపై, నేత్రాలను విష్ణు విగ్రహ దర్శనంపై నిలిపి జీవించాడు.*


అంబరీషుని నిశ్చల భక్తికి ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు, ఆయన రాజ్యానికి ఏ ఆపదా రాకుండా తన **'సుదర్శన చక్రాన్ని'** రక్షణగా ఇచ్చి వెళ్లాడు.


#4. ఏకాదశి వ్రతం & దుర్వాస మహర్షి ఆగమనం (4, 5 అధ్యాయాలు)


అంబరీష మహారాజు తన భార్యతో కలిసి సంవత్సరం పాటు **'ద్వాదశి (ఏకాదశి) వ్రతాన్ని'** నియమబద్ధంగా ఆచరించాడు. వ్రత ముగింపు రోజున దానధర్మాలు పూర్తి చేసి పారణ (భోజనం) చేయడానికి సిద్ధపడుతుండగా, **దుర్వాస మహర్షి** తన శిష్యులతో అక్కడకు వచ్చాడు.


* **కాలపరిమితి ధర్మసంకటం:** అంబరీషుడు దుర్వాసుని భోజనానికి ఆహ్వానించగా, మహర్షి యమునా నదిలో స్నానానికి వెళ్లాడు. ద్వాదశి ఘడియలు ముగిసిపోతున్నాయి. ద్వాదశి దాటితే వ్రతభంగం అవుతుంది, బ్రాహ్మణుడు రాకముందే తింటే అతిథి అవమానం అవుతుంది.

* **తీర్థ ప్రాశనం:** పండితుల సలహా మేరకు అంబరీషుడు కేవలం **తులసి తీర్థాన్ని మాత్రమే** పుచ్చుకుని ద్వాదశిని కాపాడుకున్నాడు.

* **దుర్వాసుని ఆగ్రహం & కృత్యోత్పత్తి:** తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్యదృష్టితో విషయగ్రహణం చేసి: "నన్ను కాదని భోజనం చేస్తావా!" అని తీవ్ర ఆగ్రహంతో తన జటను పీకి భూమిపై కొట్టాడు. దాని నుండి అంబరీషుడిని దహించడానికి భయంకరమైన **'కృత్య' (రాక్షసి)** ఆవిర్భవించింది.


#5. సుదర్శన చక్ర విక్రమం & దుర్వాసుని శరణాగతి (5వ అధ్యాయం)


అంబరీషుడు భయపడకుండా శ్రీహరిని ధ్యానిస్తూ నిలబడ్డాడు. మరుక్షణమే అంబరీషునికి రక్షణగా ఉన్న **సుదర్శన చక్రం** జ్వాలలను చిమ్ముతూ వచ్చి ఆ కృత్యను క్షణంలో బూడిద చేసింది. ఆ తర్వాత దుర్వాసుడిని సంహరించడానికి ఆయన వెంట పడింది.


* **ముల్లోకాల ప్రయాణం:** దుర్వాసుడు భయంతో దిక్కులు పిక్కటిల్లేలా పరిగెత్తాడు.

#1. బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మ: "విష్ణుచక్రాన్ని ఆపే శక్తి నాకు లేదు" అన్నాడు.

#2. కైలాసానికి వెళ్లి పరమశివుడిని వేడుకున్నాడు. శివుడు: "నేను కూడా శ్రీహరి ఆజ్ఞకు బద్ధుడనే, నన్ను రక్షించలేను" అన్నాడు.

#3. వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువు పాదాలపై పడ్డాడు. **శ్రీహరి జవాబు (భక్త పరాధీనత):** **"అహం భక్తపరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ |**

**సాధుభిర్గ్రసితహృదయో భక్తైర్భక్తజనప్రియః ||"** "మునిశ్రేష్ఠా! నేను భక్తులకు పరాధీనుడను (దాసుడను). నా హృదయం సాధువుల యందు నిలిచి ఉంది. నా భక్తులు నా కోసం సమస్తాన్ని త్యజించారు. వారిని సాధించే వారిని నేను రక్షించలేను. నువ్వు వెంటనే వెళ్లి **ఆ అంబరీషుని పాదాలు పట్టుకో!** ఆయన క్షమిస్తేనే సుదర్శనం శాంతిస్తుంది."


దుర్వాసుడు తిరిగి వచ్చి అంబరీషుని పాదాలపై పడ్డాడు. పరమ భాగవతుడైన అంబరీషుడు సంకోచించి, సుదర్శన చక్రాన్ని స్తుతించి మహర్షికి ఏ ఆపదా రాకుండా శాంతింపజేశాడు. దుర్వాసుడు అంబరీషుని భక్తిని, ఉదారత్వాన్ని కొనియాడి ఆశీర్వదించాడు.


📝 నేటి అంతరార్థం / ముఖ్య విషయాలు:


1. **ఏకాదశి వ్రత మహత్యం:** ద్వాదశి పారణ సమయం ఎంత పవిత్రమైనదో, అంబరీషుని వ్రతనిష్ఠ మనకు తెలియజేస్తుంది.

2. **భక్త పరాధీనత:** పరమాత్మ తన భక్తుల పట్ల ఎంత వాత్సల్యం కలిగి ఉంటాడో భాగవతంలో అత్యంత స్పష్టంగా చాటే శ్లోకం "అహం భక్తపరాధీనః".

3. **వైష్ణవ క్షమాగుణం:** తనను చంపడానికి రాక్షసిని సృష్టించిన దుర్వాసుడిని కూడా అంబరీషుడు క్షమించి, ఆపద నుండి రక్షించాడు.


*(రేపటి **రోజు 23** లో: నవమ స్కంధ మధ్య భాగం – సూర్యవంశంలో పవిత్ర రఘువంశ చరిత్ర (శ్రీరామావతార సంగ్రహం) & చంద్రవంశ వర్ణన (యయాతి, పురూరవుల వైరాగ్య కథలు) యథాతథంగా తెలుసుకుందాం!)*


రేపు భాగవతంలో రామాయణం రాబోతుంది తెలుసుకుని, ఏమి అదృష్టం అండి చాతుర్మాస్య కాలంలో శ్రావణ మాసంలో భాగవతం చదివే భాగం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇది మనం అనుకుంటే అయ్యేది కాదు,ఆయన అనుగ్రహిస్తే జరిగేది ఎన్ని జన్మల సుకృతమో చదువుకుని తరిద్దాం, మనమేన నలుగురికి షేర్ చేసి వారు కూడా చదివేలా చేసి వారిని కూడా తరింపచేద్దాం 


....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

శ్రీమద్భాగవతం - 23/42*

  *


*శ్రీమద్భాగవతం - 23/42* 


*రఘువంశ చరిత్ర (శ్రీరామావతారం) & చంద్రవంశం (యయాతి చరిత్ర)*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత యాత్రలో 

నిన్నటి రోజున మత్స్యావతార లీల, సూర్యవంశ ప్రాభవం మరియు అంబరీషుని ఏకాదశి వ్రతం గురించి తెలుసుకున్నాం. ఈరోజు సూర్యవంశం,శ్రీరామావతార సంగ్రహం మరియు చంద్రవంశ ఆరంభం (యయాతి వైరాగ్య చరిత్ర)** గురించి తెలుసుకుందాం.


* **వైవస్వత మనువు & ఇక్ష్వాకుడు:** సూర్యుని కుమారుడైన వైవస్వత మనువు నుండి సూర్యవంశం ప్రారంభమైంది. ఆయన కుమారుడు **ఇక్ష్వాకుడు** అయోధ్యా రాజ్యాన్ని స్థాపించి ఇక్ష్వాకు వంశ మూలపురుషుడయ్యాడు.


* **వికుక్షి (శశాదుడు):** ఇక్ష్వాకువు కుమారుడు. పితృకార్యం కోసం వేటాడిన సమయంలో ఆకలికి తాళలేక ఒక కుందేలును (శశమును) తినివేయడం వల్ల 'శశాదుడు' అనే పేరు వచ్చింది.


* **పురంజయుడు (కకుత్స్థుడు):** వికుక్షి కుమారుడు. దేవతలకు సహాయంగా రాక్షసులతో యుద్ధం చేస్తూ, ఇంద్రుడే ఎద్దు రూపం దాల్చగా ఆ ఎద్దు మూపురం (కకుత్) పై కూర్చుని యుద్ధం చేసి గెలిచాడు. అందుకే ఆయనకు **కకుత్స్థుడు** అనే పేరు వచ్చింది (ఈయన వంశమే 'కాకుత్స్థ వంశం').


* **అనేనసుడు – పృథువు – శ్రావస్తుడు:** కకుత్స్థుని పరంపరలో వచ్చిన శ్రావస్తుడు 'శ్రావస్తి' అనే ప్రసిద్ధ నగరాన్ని నిర్మించాడు.


* **కువలాశ్వుడు (ధుంధుమారుడు):** లోక కళ్యాణం కోసం 'ధుంధువు' అనే రాక్షసుడిని సంహరించి **ధుంధుమారుడు**గా ఖ్యాతికెక్కాడు.


* **యువనాశ్వుడు:** కువలాశ్వుని వంశంలో వచ్చిన యువనాశ్వుడికి సంతానం కలగకపోవడంతో మునులు పుత్రకామేష్టి చేశారు.రాత్రివేళ తీవ్ర దాహంతో ఆయన మునులు మంత్రించిన యాగజలాన్ని స్వయంగా తాగడంతో, ఆ గర్భం నుంచే మహాబలశాలియైన **మాంధాత** జన్మించాడు.


* **మాంధాత జననం & పాలన:** పుట్టగానే పాలకోసం ఏడిస్తే ఇంద్రుడే అమృతం ఇచ్చాడు.ఇంద్రుని అమృతంతో పెరిగిన మాంధాత అఖండ భూమండలాన్ని ధర్మంతో పాలించిన మహాచక్రవర్తి అయ్యాడు.


* **సౌభరి మహర్షి వైరాగ్యం:** నీటిలో చేపల సంసారాన్ని చూసి మోహించి, మాంధాత 50 మంది కుమార్తెలను పెళ్ళాడిన సౌభరి ముని... ఎన్ని భోగాలు అనుభవించినా తృప్తి ఉండదని తెలుసుకుని చివరకు వైరాగ్యంతో మోక్షం పొందాడు.


* **సత్యహరిశ్చంద్రుని సత్యనిష్ఠ:** మాంధాత వంశంలో వచ్చిన హరిశ్చంద్రుడు సత్యం కోసం రాజ్యాన్ని, భార్యాబిడ్డలను త్యజించి, శ్మశానంలో కాపరిగా ఉంటూ సమస్త కష్టాలను ఓర్చి సత్యధర్మాన్ని నిలబెట్టాడు.


* **శునశ్శేపుని విముక్తి:** హరిశ్చంద్రుని కుమారుడు రోహితుని స్థానంలో బలి ఇవ్వబడబోయిన శునశ్శేపుడు, విశ్వామిత్రుని ఉపదేశంతో దేవతలను ప్రార్థించి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.


* **సగర చక్రవర్తి ప్రవేశం:** హరిశ్చంద్రుని పరంపరలో వచ్చిన బాహుకుని కుమారుడే సగరుడు. ఈయన సవతి తల్లులు పెట్టిన విషంతో పుట్టి 'స-గరుడు' (విషంతో ఉన్నవాడు) అని పేరు పొందాడు. ఆ తర్వాత పరశురాముని గురువైన ఔర్వ మహర్షి అనుగ్రహంతో చక్రవర్తి అయి అశ్వమేధ యాగం ప్రారంభించాడు.


సగర చక్రవర్తి & గంగావతరణం – భగీరథుని తపస్సు


 **సగర చక్రవర్తి** అశ్వమేధ యగాన్ని ప్రారంభించగా, ఇంద్రుడు యజ్ఞ అశ్వాన్ని దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశాడు. సగరుని అరవైవేల మంది కుమారులు భూమిని తవ్వి కపిలుని వద్ద గుర్రాన్ని చూసి, ఆయననే దొంగగా భావించి నిందించారు. కపిల మహర్షి కన్ను విప్పేసరికి సగర పుత్రులంతా కాలి బూడిదయ్యాడు.


* **భగీరథుని సుదీర్ఘ తపస్సు:** సగర పుత్రుల అస్థికలకు పవిత్రత కలగడానికి, వారి ఆత్మలకు ఉత్తమ గతులు కలగడానికి సగరుని ప్రపౌత్రుడైన **భగీరథుడు** ఘోరమైన తపస్సు చేశాడు.


* **భూమిపైకి గంగానది:** భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుని కమండలం నుండి ప్రవహించిన **గంగాదేవిని** పరమశివుడు తన జటాజూటంలో బంధించి, అనంతరం నేలపైకి విడుదల చేశాడు. భగీరథుడి రథం వెంట ప్రవహించిన గంగాభవాని సగర పుత్రుల బూడిదను స్పృశించగానే వారందరికీ దివ్య లోకాలు సిద్ధించాయి.


పవిత్ర రఘువంశము & శ్రీరామావతార సంగ్రహం


సూర్యవంశంలో భగీరథుని తర్వాత ఖట్వాంగుడు, దీర్ఘబాహుడు, రఘు మహారాజు, అజుడు, దశరథుడు జన్మించారు. సత్య ధర్మ రక్షణ కోసం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు తన చతుర్వ్యూహాలతో (రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా) దశరథుని ఇంట ఆవిర్భవించాడు.


* **శ్రీరామ లీలలు:** శుకమహర్షి శ్రీరాముని పవిత్ర చరిత్రను సంక్షేపంగా కీర్తించారు:


* విశ్వామిత్రుని యాగాన్ని రక్షించి తాటక వధ, సుబాహు వధ చేయడం.


* జనకుని యజ్ఞశాలలో త్రయంబక ధనుర్భంగం చేసి **సీతాదేవిని** పరిణయమాడటం.


* పితృవాక్య పరిపాలన కోసం 14 ఏళ్లు లక్ష్మణ, సీతలతో కలిసి దండకారణ్యానికి వెళ్లడం.


* శూర్పణఖ ముక్కుచెవులు కోయడం, ఖరదూషణాదుల వధ, మారీచ సంహారం.


* రావణుడు సీతమ్మను అపహరించగా... సుగ్రీవ మైత్రి, హనుమంతుని లంకానగరం దహనం, సముద్రంపై సేతు నిర్మాణం.


* లంకా యుద్ధంలో కుంభకర్ణ, మేఘనాథ, రావణాసురుల వధ చేసి విభీషణునికి లంకా రాజ్యాన్ని పట్టాభిషేకం చేయడం.


* **రామరాజ్యం:** అయోధ్యకు తిరిగి వచ్చి శ్రీరాముడు పట్టాభిషిక్తుడై **'రామరాజ్యాన్ని'** స్థాపించాడు. శ్రీరాముని పాలనలో క్షామం, వ్యాధులు, వృద్ధాప్య భయం లేకుండా ప్రజలంతా ధర్మబద్ధంగా జీవించారు. అనంతరం ఉత్తర రామాయణ లీలలను పూర్తి చేసి శ్రీరాముడు తన ధామానికి వేంచేశాడు.


* **కుశ-లవుల పరంపర:** శ్రీరామచంద్రుని కుమారులైన కుశుడు, లవుల నుండి సూర్యవంశం ఎలా ముందుకు సాగిందో కూడా శుకమహర్షి వివరిస్తాడు. కుశుని కుమారుడు అతిథి, అక్కడి నుండి నిషధుడు, నభుడు, పుండరీకుడు, క్షేమధన్వుడు వంటి ఎందరో ధర్మపరులైన రాజులు జన్మించారు.


* **భవిష్యత్ రాజులు:** ఈ వంశంలోనే బృహద్బలుడు (మహాభారత యుద్ధంలో అభిమన్యుని చేతిలో మరణించినవాడు), చివరకు సుమిత్రుడు అనే రాజు వరకు వంశ క్రమం కొనసాగుతుంది.


* సుమిత్రునితో ఇక్ష్వాకు/సూర్యవంశం ముగుస్తుందని చెబుతూ సూర్యవంశ చరిత్ర పరిసమాప్తమవుతుంది.


నిమి చక్రవర్తి శాపం & జనక (విదేహ) వంశ ఆవిర్భావం


* **నిమి చక్రవర్తి – వశిష్ఠుల శాపం:** ఇక్ష్వాకువు కుమారుడైన నిమి మహారాజు యజ్ఞం చేయదలచి వశిష్ఠుడిని ఆహ్వానించాడు. వశిష్ఠుడు ఇంద్రుని యజ్ఞం ముగించుకుని వస్తానని చెప్పగా, సమయం మించిపోతోందని నిమి గౌతమ మహర్షితో యజ్ఞం ప్రారంభించాడు. ఆగ్రహించిన వశిష్ఠుడు నిమి దేహం నశించాలని శపించగా, ప్రతిగా నిమి కూడా వశిష్ఠుని దేహాన్ని శపించాడు.


* **దేహాభిమానం లేని స్థితి:** యజ్ఞం పూర్తయ్యాక దేవతలు నిమిని తిరిగి శరీరంలో ప్రవేశించమన్నారు. కానీ నిమి, *"శరీరం దుఃఖభాజనం, నాకు మళ్లీ ఈ భౌతిక దేహం వద్దు"* అని నిరాకరించి, సమస్త ప్రాణుల నేత్రాల రెప్పలపై (నిమిషాలుగా) సూక్ష్మరూపంలో ఉండిపోయాడు.


* **మిథిల & జనక వంశ స్థాపన:** సంతానం లేని నిమి దేహాన్ని మహర్షులు అరణిలా మథించగా ఒక తేజోవంతుడైన బాలుడు జన్మించాడు.


* మథించడం వల్ల పుట్టాడు కాబట్టి **మిథి** (ఈయన నిర్మించినదే 'మిథిలా నగరం').


* తండ్రి శరీరం లేని స్థితిలో జన్మించాడు కాబట్టి **వైదేహుడు** (విదేహ రాజ్యం).


* స్వయంగా పుట్టినవాడు కాబట్టి **జనకుడు** అయ్యాడు.


* ఈ మిథి/జనకుని వంశంలోనే సీతాదేవి తండ్రియైన శిరధ్వజ జనకుడు మరియు ఆత్మజ్ఞానులైన అనేకమంది 'జనక' మహారాజులు జన్మించారు.(ఈ వంశం లోని రాజుల అందరిని జనకుడు అనే అంటారు)


*చంద్రవంశ ఆవిర్భావం & పురూరవ-ఊర్వశుల కథ


సూర్యవంశ వర్ణన ముగిసిన అనంతరం శుకమహర్షి **చంద్రవంశాన్ని** వర్ణించారు. 


* **చంద్రవంశ మూలం:** అత్రినేత్రం నుండి చంద్రుడు, చంద్రునికి తార ద్వారా బుధుడు, ఆ బుధునికి ఇళ ద్వారా **పురూరవుడు** జన్మించారు. దీంతో చంద్రవంశం ఆరంభమైంది.


* **ఊర్వశీ శోభ:** దేవలోక అప్సరసయైన **ఊర్వశి** భూలోకానికి వచ్చి పురూరవుని సౌందర్యానికి ముగ్ధురాలై కొన్ని నియమాలతో ఆయనతో జీవించింది.


* **వియోగం & జ్ఞానం:** నియమ భంగం జరగడంతో ఊర్వశి అంతర్ధానమైంది. ఆమె వియోగంతో తల్లడిల్లిన పురూరవునికి చివరకు వైరాగ్యం కలిగి, యజ్ఞాగ్నిని మథించి దేవతల లోకాన్ని పొందాడు.


పరశురామావతార ఆవిర్భావం & కార్తవీర్యార్జునుడు


* **భార్గవ వంశం:** పురూరవుని వంశంలో గాధి (విశ్వామిత్రుని తండ్రి), సత్యవతి, జమదగ్ని మహర్షి జన్మించారు. జమదగ్ని–రేణుకల కుమారుడిగా సాక్షాత్ శ్రీమహావిష్ణువు **పరశురాముడిగా** అవతరించాడు.


* **కార్తవీర్యార్జునుని దౌర్జన్యం:** వెయ్యి చేతులు గల కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి, ఆతిథ్యం పొంది కూడా దురాశతో కోరిన కోర్కెలిచ్చే కామధేనువును బలవంతంగా అపహరించుకుపోయాడు.


* పరశురాముడు అతనిని వెంబడించి, అతని వెయ్యి చేతులను నరికి సంహరించి ఆవును తిరిగి తీసుకొచ్చాడు.


21 సార్లు క్షత్రియ సంహారం & విశ్వామిత్ర చరిత్ర


* **జమదగ్ని వధ – పరశురాముని ప్రతీకారం:** కార్తవీర్యార్జునుని కుమారులు ప్రతీకారంతో తపస్సులో ఉన్న జమదగ్ని మహర్షిని దారుణంగా చంపేశారు. తీవ్ర క్రోధంతో పరశురాముడు భూమండలంపై ఉన్న దుష్ట క్షత్రియులందరినీ **21 సార్లు** తుదముట్టించి రక్తతర్పణం చేశాడు.


* ఆ తర్వాత కశ్యప మహర్షికి భూమినంతా దానం చేసి మహేంద్ర పర్వతంపై తపస్సుకు ఉపక్రమించాడు.


* **విశ్వామిత్రుల వైభవం:** ఇదే అధ్యాయంలో క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారిన వృత్తాంతం, శునశ్శేపుడిని దేవరాతుడిగా స్వీకరించి తన 101 మంది కుమారులలో అగ్రస్థానం ఇచ్చిన వివరాలు వస్తాయి.


కాశీ వంశం & యయాతి పూర్వీకులు


* పురూరవుని కుమారుడైన ఆయువు ద్వారా నహుషుడు, క్షత్రవృద్ధుడు, రంభుడు, రజి, అనేనసుడు జన్మించారు.


* ఈ వంశ శాఖల నుండి ధన్వంతరి (ఆయుర్వేద ప్రవర్తకుడు), దివోదాసు, ప్రతర్దనుడు వంటి కాశీ రాజులు ఉద్భవించారు.


* నహుషునికి జన్మించిన ఐదుగురు కుమారులలో **యయాతి** ప్రధాన చక్రవర్తి అయ్యాడు.


యయాతి – దేవయాని, శర్మిష్ఠ & శుక్రాచార్యుని శాపం


* **వివాహాలు:** రాక్షస గురువైన శుక్రాచార్యుని కుమార్తె **దేవయానిని**, వృషపర్వుని కుమార్తె అయిన **శర్మిష్ఠను** యయాతి వివాహం చేసుకున్నాడు.


* **ముసలితనపు శాపం:** దేవయాని పట్ల అన్యాయం జరిగిందని ఆగ్రహించిన శుక్రాచార్యుడు యయాతికి యవ్వనంలోనే ముసలితనం వచ్చేలా శపించాడు.


* పరితపించిన యయాతి ప్రార్థించగా, *"నీ ముసలితనాన్ని ఎవరైనా కుమారుడు స్వీకరిస్తే అతని యవ్వనాన్ని నీవు తీసుకోవచ్చు"* అని శుక్రుడు ఉపశమనం చెప్పాడు.


* పెద్ద కుమారులు యవ్వనాన్ని ఇవ్వడానికి నిరాకరించగా, శర్మిష్ఠ చిన్న కుమారుడైన **పూరుడు** తండ్రి ముసలితనాన్ని తాను స్వీకరించి, తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చాడు.


* **యయాతి వైరాగ్య బోధ:** పూరుని యౌవనంతో యయాతి వేయ్యేళ్లు సకల భోగాలను అనుభవించాడు. కానీ కామవాంఛలు ఏమాత్రం శమించకపోగా మరింత ప్రజ్వరిల్లాయి. చివరకు యయాతికి అద్భుతమైన జ్ఞానోదయం కలిగింది:


 **"న జాతూ కామః కామానాముపభోగేన శామ్యతి |**

 **హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే ||"**


**తాత్పర్యం:** "అగ్నిలో నెయ్యి వేసేకొద్దీ అది మరింత ప్రజ్వరిల్లుతుందే తప్ప శాంతించదు! అలాగే భౌతిక భోగాలను అనుభవించేకొద్దీ మానవుడి ఆశ, తృష్ణ పెరుగుతుందే తప్ప ఏనాటికీ శాంతించవు!"


ఈ పరమ సత్యాన్ని గ్రహించిన యయాతి తన కుమారుడైన పూరునికి యౌవనాన్ని తిరిగి ఇచ్చి, ఆయనకు పట్టాభిషేకం చేసి అడవులకు వెళ్లి తీవ్రమైన తపస్సుతో ముక్తిని పొందాడు. (ఈ పూరుని వంశంలోనే కురు, పాండవులు ఆవిర్భవించారు).


దుష్యంతుడు – శకుంతల & భరత చక్రవర్తి


* **పూరు వంశ విస్తరణ:** యయాతి కుమారుడైన పూరుని వంశంలో దుష్యంతుడు జన్మించాడు.


* **శకుంతలా పరిణయం:** వేటకు వెళ్లిన దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో మేనక-విశ్వామిత్రుల కుమార్తె అయిన శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు.


* **భరతుని జననం:** వీరిద్దరికీ పుట్టిన కుమారుడే **భరతుడు**. సింహాలతో ఆడుకునే అపార పరాక్రమవంతుడైన ఈ భరతుని పేరు మీదుగానే మన దేశానికి **'భారతదేశం'** అనే పేరు వచ్చింది.


* భరతుడు అనేక అశ్వమేధ యాగాలు చేసి, తన కుమారులు పాలనకు అర్హులు కారని భావించి భరద్వాజ మహర్షిని దత్తపుత్రుడిగా స్వీకరించాడు.


రంతిదేవుని పరమ కరుణ & త్యాగనిరతి


* **రంతిదేవుని చరిత్ర:** భరతుని పరంపరలో వచ్చిన రంతిదేవుడు నిస్వార్థ భక్తికి, పరమ దయకు ప్రతీక. తనకున్న సంపదనంతా దానం చేసి నిరుపేదగా మారాడు.


* **ఆకలి పరీక్ష:** కుటుంబంతో సహా 48 రోజులు అన్నపానీయాలు లేక అలమటించిన రంతిదేవుడికి 49వ రోజు కొంత ఆహారం, నీరు లభించాయి.


* ఆ సమయంలో వరుసగా వచ్చిన బ్రాహ్మణుడికి, శూద్రుడికి, కుక్కలతో వచ్చిన వ్యక్తికి, చివరకు దాహంతో ఉన్న కుక్కలకు తన ఆఖరి నీటిబొట్టును కూడా ఇచ్చివేశాడు.


* **దేవతల అనుగ్రహం:** త్రిమూర్తులే ఆ రూపాల్లో వచ్చి పరీక్షించారని గ్రహించిన రంతిదేవుడు మోక్షాన్ని కూడా కోరక, కేవలం సర్వ ప్రాణుల దుఃఖ నివారణనే కోరి పరమపదాన్ని పొందాడు.


కురువంశం, పాండవ-కౌరవ మూలాలు & పరీక్షిత్తు


* **హస్తినాపుర స్థాపన:** ఇదే వంశంలో హస్తిన అనే రాజు 'హస్తినాపురం' నిర్మించాడు. కురురాజు వల్ల ఈ వంశానికి **'కురువంశం'** అనే పేరు వచ్చింది.


* **శంతనుడు & భీష్ముడు:** శంతనునికి గంగాదేవి ద్వారా భీష్ముడు, సత్యవతి ద్వారా చిత్రాంగద, విచిత్రవీర్యులు జన్మించారు.


* **వ్యాస మహర్షి అనుగ్రహం:** విచిత్రవీర్యుని భార్యల ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించారు.


* పాండవులు, కౌరవుల జననం, మహాభారత యుద్ధం, అభిమన్యుని కుమారుడైన **పరీక్షిన్మహారాజు** (శ్రీమద్భాగవతం వింటున్న శ్రోత) జననంతో కురువంశ క్రమం పూర్తవుతుంది.


అనువు, ద్రుహ్యుడు, తుర్వసుల వంశాలు & జరాసంధుడు


* యయాతి ఇతర కుమారులైన తుర్వసుడు, ద్రుహ్యుడు, అనువుల వంశ శాఖల వర్ణన కూడా ఇక్కడ క్లుప్తంగా చెప్తాడు మహర్షి.


శిబి చక్రవర్తి త్యాగనిరతి


యయాతి కుమారుడైన అనువు వంశంలో జన్మించిన **శిబి చక్రవర్తి** పరమ ధర్మమూర్తి, అపర త్యాగశీలి.


* **పరీక్ష:** ఇంద్రుడు డేగ రూపంలో, అగ్నిదేవుడు పావురం రూపంలో వచ్చి శిబి ధర్మనిష్ఠను పరీక్షించారు. ప్రాణభయంతో శరణుజొచ్చిన పావురాన్ని కాపాడటానికి శిబి పూనుకున్నాడు.


* **ఆత్మత్యాగం:** డేగ తన ఆకలి తీర్చమని కోరగా, శరణార్థిని రక్షించడం రాజధర్మమని భావించి, ఆ పావురం బరువుకు సమానంగా **తన స్వంత శరీర మాంసాన్ని కోసి త్రాసులో తూచి** సమర్పించాడు.

* ఆయన నిరుపమాన త్యాగానికి దేవతలు పరవశించి యథారూపాలతో ప్రత్యక్షమై, ఆయనకు శాశ్వత కీర్తిని, ఉత్తమ లోకాలను అనుగ్రహించారు.


* ఈయన కుమారులైన మద్ర, కేకయుల పేర్ల మీదుగానే ప్రసిద్ధమైన **మద్ర, కేకయ రాజ్యాలు** ఏర్పడ్డాయి.


* **తుర్వసు, ద్రుహ్యుల శాఖలు:** తుర్వసుని వంశం పూరు వంశంలో విలీనమవగా, ద్రుహ్యుని పరంపరలో ఉత్తర సరిహద్దుల్లో గాంధార తదితర రాజ్యాలు ఏర్పడ్డాయి.


* **ప్రాచీన రాజ్యాల స్థాపన:** అనువు పరంపరలోనే దీర్ఘతమస్సు మహర్షి అనుగ్రహంతో జన్మించిన ఆరుగురు కుమారుల పేర్లతో


 **అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, సుహ్మ, పుండ్ర** దేశాలు విస్తరించాయి.


* **రోమపాదుడు & ఋష్యశృంగుడు:** అంగ రాజైన రోమపాదుడు తన రాజ్య కరవును పోగొట్టడానికి ఋష్యశృంగ మహర్షితో యజ్ఞం చేయించి, తన దత్తపుత్రిక శాంతను ఆయనకిచ్చి వివాహం చేశాడు.


యదువంశం & శ్రీకృష్ణావతార పీఠిక (నవమ స్కంధ ముగింపు)


* **యదువంశ వైభవం:** యయాతి పెద్ద కుమారుడైన **యదువు** వంశంలో కార్తవీర్యార్జునుడు, వృష్ణి, శూరసేనుడు ఉద్భవించారు.


* **వసుదేవ జననం:** శూరసేనుని కుమారుడే వసుదేవుడు (ఈయన పుట్టినప్పుడు ఆనకదుందుభులు మోగాయి కాబట్టి 'ఆనకదుందుభి' అని కూడా అంటారు).


* **దశమ స్కంధానికి నాంది:** వసుదేవుడు – దేవకీదేవిల వివాహం, భూభారాన్ని హరించడానికి శ్రీమహావిష్ణువు స్వయంగా

 **శ్రీకృష్ణుడిగా**, ఆదిశేషుడు **బలరాముడిగా** అవతరించడానికి రంగం సిద్ధం కావడంతో నవమ స్కంధం పరిపూర్ణమవుతుంది.

 

📝 నేటి ముఖ్య విషయాలు:


1. **భగీరథ ప్రయత్నం:** సత్కార్యం సాధించడానికి ఎంతటి అవరోధాలు వచ్చినా వెనకడుగు వేయకుండా సాధించడమే 'భగీరథ ప్రయత్నం'.


2. **రామరాజ్యం - ధర్మ మూలం:** శ్రీరాముని అవతారం మానవ మాత్రుడిగా ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పించిన మహోన్నత ఆదర్శం.


3. **ఆశకు సరిహద్దు లేదు:** యయాతి జీవితం నిరూపించినట్లుగా... వయస్సు పైబడ్డా కోరికలు చావవు. కేవలం ఆత్మజ్ఞానం, వైరాగ్యం మాత్రమే మానవుడికి పరిపూర్ణ శాంతిని ఇస్తాయి.


ఇందులో అనేక వంశాల వివరణ ఉంది అదంతా వివరిస్తే అదే దాదాపు 20 రోజుల వరకు పడుతుంది, అంతే కాదు ఇందులో అనేక విషయాలు గతములో రామాయణం చదువుకున్న సందర్భంగా వచ్చినవే అందుకే పూర్తిగా వదిలి వేయకుండా ఎంతవరకు అందించగలనో అంత ఇచ్చాను, భాగవతం చిన్న గ్రంథం కాదు మహాత్గ్రంధం ప్రతి విషయం వివరంగా చెపుతూ వెళ్ళాలి అంటే నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు,దాన్ని 42 రోజుల్లో పూర్తిగా చెప్పటం అసాధ్యం కానీ ఇక్కడ వీలైనంత వరకు ఏ అధ్యాయంలో ఏం ఉందో చెప్తూ ముఖ్య కథ మాత్రం వివరంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను.


భాగవతం చెప్పడం మహా మహా పండితులకే సాద్యం కాదు, నేనెంత అల్పుణ్ణి, అల్పుడు చేసే స్వల్ప ప్రయత్నం గా భావించి స్వీకరించండి, రాయగలిగే శక్తి నాకు లేదు రాయించే స్వామి నా వెనుక ఉన్నాడు అన్నదే నా దైర్యం. ప్రతి అక్షరం ఈశ్వరానుగ్రహం నాదేమి లేదు.. 


రేపటి నుండి శ్రీకృష్ణ లీలామృతం ప్రారంభం అవుతుంది చదివి తరించండి..


శ్రీ కృష్ణ శరణం మమ


....సశేషం

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

శ్రీమద్భాగవతం - 24/42*

  **శ్రీమద్భాగవతం - 24/42* 


*దశమ స్కంధ ప్రవేశం – కృష్ణ జన్మ పూర్వరంగం & దేవతల గర్భస్తుతి*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత యాత్రలో 

 శ్రీమద్భాగవతానికే ప్రాణమైన దశమస్కందం లోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఇందులో నారాయణుని పూర్ణావతర స్వరూపుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ అవతార విశేషాలు, లీలలు సమగ్రంగా ఇవ్వబడ్డాయి, కృష్ అంటే ఆకర్షించేవాడు ఆయన లీలలు,కథలు మనసును తొందరగా ఆకర్షిస్తాయి,అలా ఆకర్షించి మనకే తెలియకుండా మన మనస్సు అనే వెన్న దోచి,ఇంద్రియాలు అనే అయిదు తలలపై నాట్యం చేసి, నేను నేను అనే విషాన్ని విరిచి అంతా తానే అనే అయి మనల్ని ఆయనలో కలిపేసుకుంటాడు, అందుకు భాగవతం వినడం, చదవడం. కేవలం స్మరణ చేత ముక్తి ఇచ్చే ఏకైక గ్రంథం భాగవతం..


స్వామి చేసే పనులు చిలిపిగా ఇలా ఉన్నాయి ఏంటండీ అనేట్టు కనపడతాయి.అలా చూసే వాడు దాన్ని విమర్శించే నెపం తో అయినా నన్ను పట్టుకున్నాడు అలానే వాడికి ముక్తి ఇస్తాను అంటాడు స్వామి.


 అలాగని అలా చేయమని అనటం లేదు ఇవన్ని ఈశ్వర లీలలు అనే విషయం మనసులో ఉంచుకుని చదవండి అని చెప్తున్నాను ఇక్కడ అంత పెద్దలు ఉన్నారు అన్ని తెలిసిన వారే అయిన చెప్పటం నా బాధ్యత కనుక చెప్తున్న.


 లీల అర్దం అయితే అయినట్టు చదవండి, అర్దం అవ్వకపోతే నమస్కారం చేయండి, అంతే కానీ అబ్బే ఇలా చేస్తాడా అండి అని అనకండి ఈశ్వర చర్యలు ఊహలకు అందవు, అన్ని వివరించే అవకాశం నాకు రావచ్చు, రాకపోవచ్చు(అన్ని తెలిసిన పండితుని కూడా కాదు నేను) అయినా మీకు అలాంటి అనుమానం రాకుండానే చెప్పే ప్రయత్నం చేస్తాను,అలా స్వామి నా చేత చెప్పించాలి అని ప్రార్ధిస్తున్నాను..


కానీ ముందుగానే మీకు విషయం చెప్పి ప్రారంభం చేస్తే మీకు స్పష్టత ఉంటుంది అని ఇక కథలోకి వెళ్దాం.. శ్రీ కృష్ణ శరణం మమ 


1. దశమ స్కంధ విశిష్టత & భూదేవి ఆర్తనాదం 


శ్రీమద్భాగవతంలోని పన్నెండు స్కంధాలలో **దశమ స్కంధం** సాక్షాత్తు భగవంతుని **హృదయం (ఆశ్రయ తత్త్వం)** గా భావిస్తారు. పరీక్షిత్తు మహారాజు శుకమహర్షిని ప్రాధేయపడుతూ: "మహర్షీ! చంద్రవంశంలో అవతరించిన స్వయం భగవానుడైన శ్రీకృష్ణుని దివ్య లీలలను సమగ్రంగా, యథాతథంగా నాకు వినిపించండి" అని వేడుకున్నాడు.


ద్వాపరయుగాంతంలో రాక్షసాంశలతో జన్మించిన రాజుల సైన్యాల భారానికి తాళలేక భూదేవి గోరూపాన్ని (ఆవు రూపాన్ని)ధరించి కన్నీళ్లతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకుంది.


* **క్షీరసాగర తీరాన ప్రార్థన:** బ్రహ్మదేవుడు, పరమశివుడు మరియు దేవతలను వెంటబెట్టుకుని క్షీరసాగర తీరానికి వెళ్లి 'పురుష సూక్తం'తో శ్రీమహావిష్ణువును స్తుతించారు.


ఆ సమయంలో బ్రహ్మదేవునికి సమాధి స్థితిలో భగవంతుని దివ్యవాణి వినిపించింది


"దేవతలారా! భూదేవి దుఃఖాన్ని నేను ఎరుగుదును. నేను స్వయంగా యదువంశంలో వసుదేవుని ఇంట దేవకీ గర్భాన ఆవిర్భవిస్తాను. దేవతలందరూ భూలోకంలో యదువంశీయులుగా, గోపాలురుగా జన్మించి నా లీలలలో భాగస్వాములు కండి!"అని చెపితే ఆ విషయాలు బ్రహ్మగారు దేవతలకు చెప్పి, స్వయంగా నారాయణుడే నీ బాధా తీరుస్తాను అన్నాడు అని భూదేవిని ఊరడించి తన లోకానికి తిరిగి వెళ్ళాడు


2. దేవకీ-వసుదేవుల వివాహం


పూర్వం యధువంశ ప్రభువైన శూరసేనుడు మధురా నగరంలో నివసిస్తూ ఉన్నాడు, యాదవ మహారాజులు అందరికీ మధురా నగరం రాజధాని.


ఒకానొక సమయంలో శూరసేన మహారాజు కుమారుడైన వసుదేవునికి ఉగ్రసేన మహారాజు సోదరుడైన దేవకుని కుమార్తె దేవకీదేవితో అత్యంత వైభవంగా వివాహం జరిగింది.


చెల్లెలు అయిన దేవకి అంటే కంసునికి ఎంతో అభిమానం. ఆమెకు సంతోషం చేకూర్చడం కోసం వివాహానంతరం నూతన దంపతులను తన రథంపై కూర్చోబెట్టుకుని, స్వయంగా తానే రథసారథియై మధురా నగరంలో ఊరేగిస్తున్నాడు. దేవకుడు కూడా ఎన్నో విలువైన ఆభరణాలు, దాసీలను కూతురు పై ప్రేమతో ఇచ్చాడు.


చక్కగా శంఖా నాదాలు, మృదంగ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగావెళ్తూ రథం మధ్య మార్గంలో ఉండగా, ఆకాశం నుండి భయంకరమైన గంభీర ధ్వనితో ఆకాశవాణి పలికింది:


 *"ఓరి మూర్ఖుడా! కంసా! ఎవరినైతే ఇంత గారాబంగా రథంపై ఊరేగిస్తున్నావో... **ఆమె ఎనిమిదో గర్భం (8వ సంతానం) నిన్ను సంహరిస్తుంది!**"*అన్నది.


 3. కంసుని క్రూరత్వం & వసుదేవుని సత్య ప్రతిజ్ఞ 


ఆకాశవాణి మాటలు విన్న కంసుడు తీవ్రమైన భయంతో, ఆగ్రహంతో రగిలిపోయాడు.కంసుడు సహజంగా క్రూర స్వభావం గల వాడు, వంశానికే మచ్చ తెచ్చిన దూర్తుడు,ఆ మహాపాపి ఆ మాటలు విన్నంతనే తన ఖడ్గాన్ని దూసి, తోబుట్టువైన దేవకి జుట్టు పట్టుకుని ఆమె తలను నరకడానికి సిద్ధమయ్యాడు.


అది చూసి పరమ ధర్మాత్ముడుఅయిన వసుదేవుడు. కంసుని శాంతింపజేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలతో ఎంతో నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు.అయినా ఆ క్రూరుడు వినలేదు దాంతో..


 "కంసరాజా! దేవకి నీ ప్రియమైన సోదరి. స్త్రీహత్య మహాపాపం. పైగా నీకు భయం దేవకి వల్ల కాదు, ఆమెకు పుట్టబోయే కుమారుల వల్లనే కదా! మాకు పుట్టిన సంతానాన్ని పుట్టిన వెంటనే నీ చేతుల్లో పెడతాను. ఆమెను విడిచిపెట్టు!"అన్నాడు.


వసుదేవుని సత్యవాక్పరిపాలనను ఎరిగిన కంసుడు ఆ సమయానికి దేవకిని విడిచిపెట్టాడు.


కాలక్రమేణా దేవకి, వసుదేవులకు ప్రతి సంవత్సరం కి ఒక పుత్రుడు చొప్పున వరుసగా ఎనిమిది మంది కుమారులు, పిదప ఒక కుమార్తెను కన్నది.


వసుదేవుడు ఇచ్చిన మాట ప్రకారం మొదటి కుమారుడు జన్మించిన వెంటనే కంసునికి అప్పగించాడు. కంసుడు మొదట "నాకు ఎనిమిదో వాడితోనే భయం కదా"తీసుకువెళ్ళు బావా అన్నాడు. కానీ వసుదేవునికి మనసులో అనుమానం గానే ఉంది కంసుడు దుష్టుడు, పైగా మనసు నిలకడలేనివాడు, ఇతని వల్ల ఎప్పుడూ ఏ ముప్పు వస్తుందో అని చింతిస్తూనే ఉన్నాడు.


ఒకానొకప్పుడు నారదమహర్షి కంసుని దగ్గరకు వచ్చి - "కంసా! గోకులమునందు ఉండె నందుడు మొదలగు గోపాలురు, వారి భార్యలు, వృష్టివంశమునకు చెందిన వసుదేవుడు మొదలగువారు, యదువంశమునకు చెందిన దేవకి మొదలగు స్త్రీలు, నంద వసుదేవులయొక్క | (ఉభయ వంశములకు చెందిన) జ్ఞాతులు, బంధుమిత్రులు అందరును దైవాంశసంభూతులు. నిన్ను సేవించుచున్న వారందరు అసురులు. (ఆసురీసంపదగలవారు). ఆసురీస్వభావముతో భూమికి భారమైన ఈ దైత్యులను వధించే ప్రయత్నము దేవతల వలన జరుగుచున్నది”.అని చెప్పి వెళ్ళిపోయాడు.


అది విని భయంతో ఉన్మాదియైన కంసుడు తన తండ్రి ఉగ్రసేనుడిని కారాగారంలో బంధించి తానే రాజయ్యాడు. దేవకీ-వసుదేవులకు సంకెళ్లు వేసి కారాగారంలో బంధించాడు. దేవకికి పుట్టిన మొదటి ఆరుగురు శిశువులను (షట్గర్భులను) రాతిపై వేసి క్రూరంగా సంహరించాడు! (వీరు పూర్వజన్మలో బ్రహ్మదేవుని శాపం పొందిన మరిచి పుత్రులైన కాలనేమి సంతానం).


* **ఏడవ గర్భం – శ్రీ బలరాముడు:** దేవకి ఏడవసారి గర్భం దాల్చగా, అది ఆదిశేషుని అంశ. భగవంతుడు తన యోగమాయనుఆజ్ఞాపించి: "నువ్వు దేవకి గర్భంలో ఉన్న పిండాన్ని గోకులంలో నందుని పాలనలో ఆశ్రయం పొందుతూ ఉన్న వసుదేవుని భార్య అయిన రోహిణీ దేవి గర్భంలోకి సంకర్షణ (మార్పిడి) చేయి. నేనూ స్వయంగ పూర్ణ అంశతో దేవకి దేవికి తదుపరి గర్భంలో జన్మిస్తాను,అలాగే నీవు స్వయంగ నంద గోవుని భార్య యశోద గర్భాన ఆవిర్భవించు" అని ఆదేశించి లోకుల కోర్కెలు తీరుస్తావు.భూలోకమునందలి మానవులు నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక మొదలగు నామములతో ఆయా ప్రదేశములలో ప్రస్తుతించుచుందురు.


దేవకీదేవి గర్భమునుండి సంకర్షణమువలన (వెలికితీయబడుటవలన) 'సంకర్షణుడు' అనియు, లోకులను రంజింపజేయువాడు గావున, 'రాముడు' అనియు, బలవంతులలో మేటియగుటవలన 'బలభద్రుడు' అనియు, అతడు (బలరాముడు) భూతలమున వ్యవహరింపబడును.


సర్వేశ్వరుడైన శ్రీహరి ఆదేశమును అందుకొనిన పిదప 'సరే' అని ఆయన ఆజ్ఞను శిరసావహించి, ఆ ప్రభువునకు ప్రదక్షిణమొనర్చి, యోగమాయ భూలోకమునకు చేరి భగవంతుని ఆనతిని నెరవేర్చెను


లోకులు దేవకికి గర్భస్రావం అయిందని భావించారు. ఆ పిండం నుండే బలరాముడు ఆవిర్భవించాడు.


5. ఎనిమిదవ గర్భం – దివ్య గర్భస్తుతి


ఆ తర్వాత స్వయం భగవానుడైన శ్రీహరి దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించాడు. దేవకీదేవి ముఖంలో సూర్యచంద్రుల తేజస్సు వెల్లివిరిసింది. ఆమె ఉన్న కారాగారమే ఒక దివ్య దేవాలయంలా ప్రకాశించసాగింది. అది చూసి కంసుడు ఆమె వద్దకు రావడానికి కూడా భయపడసాగాడు.


దేవకీదేవి కడుపులో శ్రీహరి తన దివ్యాంశతో పెరుగుచుండెను. ఆమెముఖమునందు దరహాసశోభలు వెల్లివిరియుచుండెను ఆమె దేహకాంతులు చెఱసాల మందిరమున వెలుగులను నింపుచుండెను.


అటు కంసుడు భగవంతుడైన శ్రీహరియెడ వైరభావమును వీడక ఆ స్వామి జన్మించుటకై అనుక్షణము నిరీక్షించుచుండెను.


 శ్రీహరిపైగల వైర కారణముగా కంసునకు ఇతర ధ్యాసయే లేకుండెను. తిరుగుచున్నను, ఆహారము తినుచున్నను, పానీయములను త్రాగుచున్నను, అటునిటు కదలుచున్నను, కూర్చొనియున్నను, లేచినను, ఇంత ఏల, నిరంతరము ఎంతకును చల్లారని పగతో అతడు శ్రీహరినే తలంచుచుండెను. ఈ 'జగత్తంతయును, హరిమయమే' అని అతనికి అనిపింపసాగెను.


పిమ్మట బ్రహ్మదేవుడు, పరమశివుడు, సమస్త దేవతలు మరియు నారదాది మహర్షులు అదృశ్య రూపాలలో ఆ కారాగారానికి వచ్చి, దేవకీ గర్భంలో ఉన్న జగన్నాథుని దివ్యంగా 'గర్భస్తుతి' చేశారు:


**"సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే |**

**సత్యస్య సత్యమృతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః ||"**


**తాత్పర్యం:** "ఓ పరమాత్మా! నీవు సత్యస్వరూపుడవు. సృష్టి, స్థితి, లయములలో మార్పులేని త్రిసత్యానివి. సత్యానికి జన్మస్థానానివి. అట్టి పరమ సత్య స్వరూపుడవైన నిన్ను మేము శరణువేడుతున్నాము! భూభారాన్ని హరించి, ధర్మాన్ని రక్షించడానికి త్వరగా ఆవిర్భవించు ప్రభో!"అని స్తుతించి వారి వారి లోకాలకు వెళ్ళి పోయారు..


అఖిలాండకోటి బ్రహ్మాండ లోకాలను ఉదరంలో దాచుకునే పరమాత్మ పసిబిడ్డగా దేవకి దేవి గర్భంలో దాగి ఉన్నాడు. ,జన్మలు, కర్మలు లేని స్వామి మన కర్మ బంధాలు తెంచడం కోసం అవతారాలు స్వీకరించాడు.


మనవి కర్మ జనిత శరీరాలు, స్వామివి మన జనన మరణ చక్రానికి స్వస్తి చెప్పే అవతారాలు.అంతటి కరుణతో ఆయన వచ్చింది మనకోసం ఆయన గురించి చెప్పుకుని,విని, చదవడం ద్వారా ఇక మళ్ళీ పుట్టుక చావు లేని స్థితి పొందటమే ఈ జన్మకు సార్థకత. 


కోరికలు కోట్లకొలది ఉంటాయి కానీ అవి శాంతిని ఇవ్వలేవు భగవత్ కథలు మనసుకు శాంతిని, జీవుడికి శాశ్వతత్వాన్ని ఇస్తాయి.. కనుక విని తరించే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ 🙏 


 📝 నేటి ముఖ్య విషయాలు:


1. **ఆశ్రయ తత్త్వం:** దశమ స్కంధం శ్రీకృష్ణ లీలామృతం. ఇక్కడ ప్రతి లీల జీవుడిని భౌతిక బంధాల నుండి విముక్తం చేసి భగవంతుని పాదాల చెంత ఆశ్రయం కల్పిస్తుంది.


2. **వసుదేవుని సత్యనిష్ఠ:** ప్రాణాపాయ స్థితిలో కూడా సత్యాన్ని, ధర్మాన్ని వీడకపోవడమే భగవంతుడు తన ఇంట అవతరించడానికి మార్గం సుగమం చేసింది.


3. **సత్యమే దైవం:** దేవతలు చేసిన గర్భస్తుతి మనకు భగవంతుని నిత్య సత్య తత్వాన్ని, అచంచల శరణాగతిని బోధిస్తుంది.


రేపు శ్రీమద్భాగవతంలోనే అత్యంత ఆనందదాయకమైన పరమ మహోత్సవం – శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి శ్రీ కృష్ణ పరమాత్మ ఆవిర్భావం విని తరిద్దాం వేచి ఉండండి...


....సశేషం

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

మంగళవారం*🍁 *🌹18ఆగష్టు2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

  🍁 *మంగళవారం*🍁

*🌹18ఆగష్టు2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం* 

             

       *ఈనాటి పర్వం* 

    *మంగళగౌరీ వ్రతం* 

         *ప్రారంభం*


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం* 


*తిథి : షష్ఠి* సా 05.50 వరకు ఉపరి *సప్తమి*

*వారం   : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : స్వాతి* పూర్తిగా రోజంతా *రాత్రితో సహా*

*యోగం : శుక్ల* రా 03.23 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : తైతుల* సా 05.50 ఉపరి *గరజి* పూర్తిగా రాత్రంతా 

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ09.30-11.00 సా05.00-06.00*

అమృత కాలం  : *రా 09.19 - 11.02*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.36*

*వర్జ్యం    : ఉ 11.00 - 12.43*

*దుర్ముహూర్తం  : ఉ 08.24 - 09.14 రా 11.03 - 11.49*

*రాహు కాలం :మ03.21 -04.56*

గుళికకాళం      : *మ 12.11 - 01.46*

యమగండం    : *ఉ 09.02 - 10.36*

సూర్యరాశి : *సింహం*                          

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 06.00*

సూర్యాస్తమయం :*సా 06.40*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ 05.52- 08.24*

సంగవ కాలం       :*08.24 - 10.55*

మధ్యాహ్న కాలం    : *10.55 - 01.27*

అపరాహ్న కాలం : *మ 01.27- 03.59*

*ఆబ్ధికం తిధి    : శ్రావణ శుద్ధ షష్ఠి*

సాయంకాలం    : *సా 03.59-06.30*

ప్రదోష కాలం      : *సా 06.30-08.47*

రాత్రి కాలం        : *రా 08.47-11.49*

నిశీధి కాలం        : *రా 11.49 -12.34*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.21 - 05.07*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీమద్భాగవతం - 25/42*

 *


*శ్రీమద్భాగవతం - 25/42* 


*శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


నిన్నటి రోజున దశమ స్కంధములోకి ప్రవేశించాము, శ్రీ కృష్ణ పరమాత్మ పరిపూర్ణ అంశ తో దేవకీ దేవి గర్భంలో పెరుగుతున్నాడు, దేవతలు కారాగారం దగ్గరకే వచ్చి పరమాత్మని స్తుతించడం వరకు తెలుసుకున్నాం ఈరోజు శ్రీమద్భాగవతానికే పరమ మహోత్సవమైన **శ్రీకృష్ణ పరమాత్మ దివ్యావిర్భావం, యమునా నది దాటుట, యోగమాయ హెచ్చరిక మరియు గోకులంలో నందోత్సవ వైభవం** గురించి తెలుసుకుందాం.


---


1. శ్రీకృష్ణ దివ్యావిర్భావం – చతుర్భుజ రూపం


జన్మరహితుడు అయిన శ్రీహరి ఆవిర్భవించు సమయం ఆసన్నమైంది.ఆ సమయంలో చంద్రుడు రోహిణీ నక్షత్రము లో ఉన్నాడు, యావత్ భూమండలం మొత్తం మంగళ మయమై నిర్మలంగా ఉంది, కంసుని భయంతో ఆగిపోయిన అగ్నిహోత్రాలు ప్రజ్వరిల్లాయి. అసురుల బాధలతో తల్లడిల్లి పోతున్న దేవతల, సాధు పురుషుల హృదయాల్లో శాంతి నెలకొంది. దేవతలు పుష్ప వర్షం కురిపిస్తూ ఉండగా, విద్యాధర స్త్రీలు నాట్యం చేస్తుండగా

శ్రావణ బహుళ అష్టమి తిథి, రోహిణీ నక్షత్ర యుక్త అర్ధరాత్రి వేళ, నిబిడమైన అంధకారంలో ఉన్న సమస్త దిక్కుల చీకట్లను తొలగించే అఖండ ఆత్మ స్వరూపుడు అయిన శ్రీహరి  కారాగారంలో దేవకీదేవి గర్భం నుండి నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదా, పద్మాలు ధరించి వక్షః స్థలంలో శ్రీవత్స చిహ్నం తో, కంఠం లో కౌస్తుభమణి మెరుస్తూ ఉండగా, పట్టు పీతాంబరలు ధరించి శ్యామసుందర దేహుడై,కిరీటం, కుండలాల కాంతులు ఇంపు కొలుపుతూ ఉండగా దేదీప్యమానంగా విరాజిల్లుతూ పూర్ణ పురుషోత్తమ రూపంతో శ్రీహరి వసుదేవుడుకి దర్శనమిచ్చాడు.


* **తల్లిదండ్రుల స్తుతి:**

స్వామిని చూసినంత మాత్రం చేత వారికి కంస భయం,బంధనాలు తొలగి పోయాయి ఆ దివ్యరూపాన్ని చూసి దేవకీ-వసుదేవులు చేతులు జోడించి పరమానందంతో స్తుతించారు. 


అయితే కంసుని క్రూరత్వం గుర్తొచ్చి, "స్వామీ! కంసుడి నుండి నిన్ను దాచడం మా వల్ల కాదు. నీ ఈ దివ్య చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించి, సాధారణ పసిబాలుని రూపాన్ని ధరించు" అని ప్రార్థించారు. 


భగవంతుడు చిరునవ్వుతో తల్లి స్వాయంభువ మన్వంతరం లో నీవు ప్రుశ్ని అను సాధ్వీమణివి, మహాత్ముడైన ఈ వసుదేవుడు సుతపుడు అను ప్రజాపతి, మీరు ఇద్దరు సృష్టి విస్తరణ కోసం బ్రహ్మ గారి ఆదేశం మేరకు ఘోర తపస్సు ఆచరించారు అది అనితర సాధ్యమైన తపస్సు, దానికి మెచ్చి నేను ప్రత్యక్షం అయ్యాను మీరు నా వంటి పుత్రుడు కావాలీ అని కోరారు,నా వంటి పరమాత్మ ప్రత్యక్షం అయినా మోక్షం కోరక నా మాయ చేత విషయ సుఖాలు కోరారు.అది నా సంకల్పం.శీల,గుణ సంపదలో నావంటి వారు మరొకరు లేరు కనుక నేనీ ప్రుశ్నీగర్భుడు అనే పేరుతో ఖ్యాతి వహించి మీకు పుత్రుడను అయ్యను.


ఆ తదుపరి జన్మలో నీవు అదితిగా,వసుదేవుడు కశ్యపుడు గా వచ్చారు అప్పుడు ఉపేంద్రుడు అను పేర వామన అవతారం లో మీకు జన్మించాను.


ఇక ఇది మూడవ జన్మ ఈసారి మీ కోరిక పరిపూర్ణం చేసి మిమ్ము అనుగ్రహించడం కోసం పూర్ణంగా చతుర్భుజాలతో అవతరించాను,ఆ విషయాలు మీకు తెలుపుట కోసమే ఈ రూపంలో కనపడ్డాను. మళ్ళీ సాధారణ శిశు రూపంలోకి వచ్చాక మీకు నా అవతార వైశిష్ట్యం గుర్తుకు ఉండదు.


మీరు ఎల్లపుడు పుత్ర వాత్సల్యం ప్రదర్శిస్తూనే అప్పుడపుడు నన్ను పరబ్రహ్మంగా భావిస్తే ఇక మీకు నా పరంధామం లభిస్తుంది అని చెప్పి పరమాత్మ పసిపాపగా మానవ శిశువుగా మారిపోయాడు..


---


2. యమునా నది దాటుట – గోకులానికి ప్రయాణ


ఆ తరువాత వెంటనే భగవంతుని సంకల్పంతో అద్భుతాలు జరిగాయి:

1. కారాగార కావలిభటులందరూ మాయ చేత గాఢ నిద్రలోకి జారుకున్నారు.

2. వసుదేవుని కాళ్లకు, చేతులకు ఉన్న ఇనుప సంకెళ్లు తమంతట తామే విడిపోయాయి.

3. తాళాలు వేసి ఉన్న బరువైన రాతి తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి.


వసుదేవుడు భగవంతుని ప్రేరణ మేరకు పసికందును ఒక వెదురు బుట్టలో పెట్టుకుని, తలపై ఎత్తుకుని గోకులం వైపు నడిచాడు.


* **ఆదిశేషుని గొడుగు:** కుండపోతగా వర్షం కురుస్తుండగా, భగవంతునికి వర్షపు చినుకులు తగలకుండా సాక్షాత్తు ఆదిశేషుడు తన వేయి పడగలను గొడుగులా విప్పి వసుదేవుని వెనుక నడిచాడు.


* **యమునా నది దారి ఇచ్చుట:** ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది పరమాత్మ పాదస్పర్శ కాగానే రెండు పాయలుగా విడిపోయి మోకాలి లోతుకు తగ్గి వసుదేవునికి మార్గం ఇచ్చింది.


---


3. గోకులంలో శిశువుల మార్పిడి


వసుదేవుడు అర్ధరాత్రి వేళ గోకులంలోని నందమహారాజు భవనానికి చేరుకున్నాడు. యోగమాయ ప్రభావంతో యశోదతో సహా గోకులమంతా గాఢ నిద్రలో ఉంది. యశోద అప్పుడే ఒక ఆడశిశువుకు (యోగమాయకు) జన్మనిచ్చి అలసటతో నిద్రపోతోంది.


వసుదేవుడు నిశ్శబ్దంగా బాలకృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి, ఆమె పక్కనున్న ఆడపిల్లను తీసుకుని తిరిగి మధురా నగర కారాగారానికి వచ్చాడు. వసుదేవుడు లోపలికి రాగానే తలుపులు మళ్లీ మూసుకున్నాయి, సంకెళ్లు పడ్డాయి. మునుపటి వలె ఉన్నాడు.


---


4. కంసుని రాక & యోగమాయ దివ్య హెచ్చరిక 


వసుదేవుడు మరలి వచ్చిన తరువాత మళ్ళీ ద్వారాలు, బంధనాలు యధాతద స్తితిలో మూసుకున్నాయి అప్పుడు ఆడశిశువు ఏడుపు వినగానే కావలిభటులు మేల్కొని కంసునికి సమాచారం అందించారు.మృతుభీతిలో కంసుడు పిచ్చివాడిలా పరుగెత్తుకుంటూ వచ్చి, దేవకి ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆ పసికందును లాక్కున్నాడు. అన్నా అనుంగు కోడలు పుట్టెను విడువు అన్నా వినకుండా..శిశువు కాళ్లు పట్టుకుని రాతిబండపై కొట్టడానికి పైకి ఎత్తాడు. కానీ ఆ శిశువు కంసుని చేతుల నుండి జారి ఆకాశంలోకి ఎగిరిపోయింది! అంతట విష్ణు సోదరి అయిన యోగమాయ దేవి. .


* **అష్టభుజ దుర్గాదేవి:** ఆ శిశువు ఎనిమిది చేతులలో శంఖ, చక్ర, త్రిశూలాది ఆయుధాలను ధరించిన దివ్యమైన **యోగమాయగా (దుర్గాదేవిగా)** ఆవిర్భవించింది.


* **కంసునికి హెచ్చరిక:**

 **"కిం మయా హతయా మంద జాతః ఖలు తవాంతకృత్ |**

**యత్ర క్వ వా పూర్వశత్రుర్మా హింసీః కృపణాన్ వృథా ||"**


*"ఓరి మూర్ఖుడా! కంసా! నన్ను చంపి నువ్వు సాధించేది ఏమీ లేదు. **నిన్ను సంహరించే నీ పూర్వశత్రువు వేరొక చోట ఇప్పటికే జన్మించాడు!** అమాయకులైన ఈ దేవకీ-వసుదేవులను హింసించకు!"*


అలా పలికి యోగమాయ అంతర్థానమైంది.(ఈ తల్లి భూతలం లో అనేక పేర్లతో ప్రసిద్ధి వహించింది)


కంసుడు భయంతో వణికిపోయి దేవకీ-వసుదేవులను తాత్కాలికంగా విడుదల చేశాడు.


మరుసటి రోజు మంత్రులతో ఆలోచించి, రాజ్యంలో పుట్టిన పసిపిల్లలందరినీ సంహరించడానికి రాక్షసులను ఆజ్ఞాపించాడు.


---


5. గోకులంలో నందోత్సవం – ఆనంద తాండవం


మరుసటి రోజు ఉదయం యశోదకు పండంటి మగపిల్లాడు పుట్టాడని తెలిసి గోకులమంతా ఆనంద సాగరంలో మునిగిపోయింది. **నంద మహారాజు** బ్రాహ్మణులకు వేలాది గోవులను, సువర్ణాన్ని దానం చేసి జాతకర్మలు నిర్వహించాడు.


* **గోపికల ఆనందం:** గోపికలు దివ్యాంబరాలు, నగలు ధరించి పెరుగు, పాలు, పసుపు నీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ నాట్యాలు చేశారు. ఆరోజు నంద వ్రజము మొత్తం పండగ లా చేశారు. ప్రతి ఇల్లు అలంకరించారు, గోపికలు చిన్నారి కన్నయ్య ను చూడటం కోసం తరలి వచ్చారు. రక్షణ కోసం దైవ ప్రార్థన చేశారు, జోలపాటలు పాడారు.


* నారదుడు, దేవతలు ఆకాశం నుండి వీక్షిస్తూ ఆనందించారు. పరమాత్మ తన లీలలతో గోకులాన్ని వైకుంఠంగా మార్చివేశాడు!


రాజా! శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుండియు, ఆ నందగోకులము పాడిపంటలతో, సమస్త ధనకనక వస్తువాహనములతో కలకలలాడసాగెను. శ్రీహరి అవతారమైన కృష్ణపరమాత్మయొక్క నివాసమునకు నోచుకొనుటతో ఆ ప్రదేశము లక్ష్మీదేవికి విహారభూమి అయింది.


 📝 నేటి ముఖ్య విషయాలు:


1. **హరి రాకతో బంధనాల విముక్తి:** భగవంతుడు హృదయంలోకి ప్రవేశించగానే కర్మ బంధాలు (సంకెళ్లు), అజ్ఞానమనే తలుపులు తమంతట తామే తెరుచుకుంటాయి.


2. **భగవద్రక్షణ:** భగవంతుడిని తలపై మోసే భక్తునికి (వసుదేవునికి) ఉప్పొంగే యమున(కాలం) కూడా దారి ఇస్తుంది; ఆదిశేషుడే గొడుగు పడతాడు.


3. **కర్మఫలం అమోఘం:** అధర్మాత్ముడైన కంసుడు ఎంత ప్రయత్నించినా భగవత్ సంకల్పాన్ని, మృత్యువును తప్పించుకోలేకపోయాడు.


రేపటి నుంచి స్వామి లీలలు ప్రారంభం తెలుసుకుని తరిద్దాం రండి🙏


....సశేషం

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

పంచాంగం 18.08.2026 Tuesday,

  ఈ రోజు పంచాంగం 18.08.2026 Tuesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష షష్ఠి తిథి భౌమ వాసర స్వాతి నక్షత్రం శుక్ల యోగః తైతుల కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: షష్ఠి.



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



శ్రీ భగవానువాచ ।

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 35 ।।



ప్రతిపదార్థ:


శ్రీ భగవాన్ ఉవాచ — శ్రీ కృష్ణ పరమాత్మ పలికెను; అసంశయం — నిస్సందేహముగా; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; మనః — మనస్సు; దుర్నిగ్రహం — నిగ్రహించుటకు కష్టమైనది; చలం — చంచలమైనది; అభ్యాసేన — అభ్యాసం చేత; తు — కానీ; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; వైరాగ్యేణ — వైరాగ్యముచే; చ — మరియు; గృహ్యతే — నియంత్రించవచ్చు.



తాత్పర్యము: 


శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.



వివరణ:


శ్రీ కృష్ణుడు అర్జునుడి మాటలకు జవాబు చెప్తూ, అతన్ని 'మహాబాహో' అంటే ‘గొప్ప బాహువులు కలవాడా.’ అని అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే, ‘ఓ అర్జునా, నీవు యుద్ధములో అత్యంత సాహాసోపేత వీరులను ఓడగోట్టావు, ఈ మనస్సుని ఓడించలేవా?’ అని.


శ్రీ కృష్ణుడు, ఇలా, ‘అర్జునా, ఏంటి అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మనస్సుని సునాయాసముగా నియంత్రించవచ్చు.’ అని చెప్పి ఈ సమస్యను ఖండించలేదు. పైగా, నియంత్రించటానికి మనస్సు నిజంగా క్లిష్టతరమైనది అన్న అర్జునుడి మాటలతో ఏకీభవించాడు. కానీ, ప్రపంచంలో కష్టతరమైన పనులు ఎన్నో ఉన్నాయి, అయినా మనం అధైర్య పడకుండా ముందుకు సాగుతాము. ఉదాహరణకి, సముద్రం ప్రమాదకరమైనది మరియు భయంకర తుఫానులు వచ్చే అవకాశం ఉంటుంది అని నావికులకు తెలుసు. అయినా, ఒడ్డునే ఉండిపోయేలా చేయటానికి ఈ కారణాలు వారికి తగినట్టు ఎప్పుడూ అనిపించలేదు. కాబట్టి, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి, వైరాగ్యము మరియు అభ్యాసము ద్వారా మనస్సుని నియంత్రించవచ్చు అని హామీ ఇస్తున్నాడు.


వైరాగ్యము అంటే ఆంగ్లములో డిటాచ్మెంట్ (detachment). అనంతమైన పూర్వ జన్మల నుండీ ఉన్న మమకారాసక్తుల చేత, మనస్సుకు, తనకు అనురక్తి ఉన్న వస్తువిషయముల దిశలో పరుగులు పెట్టడం అలవాటైపోయింది. ఈ మమకార-ఆసక్తిని తీసివేయటం అనేది మనస్సు యొక్క అనవసరమైన పరిభ్రమణాన్ని నిర్మూలిస్తుంది.


అభ్యాసము అంటే ఆంగ్లములో ప్రాక్టీసు (practice). అంటే, పాత అలవాట్లను మార్చి, కొత్త వాటిని పెంపొందించుకునే ఏకాగ్రతతో కూడిన పరిశ్రమ. అభ్యాసము అనేది సాధకులకు ఒక ముఖ్యమైన పదం. సమస్త మానవ పరిశ్రమలలో, నైపుణ్యానికి, ప్రావీణ్యతకి, శ్రేష్ఠతకి దారితీసే ప్రముఖ విషయం ఈ అభ్యాసమే. ఉదాహరణకి ఒక అతి సామాన్య విషయమైన టైపింగ్ తీసుకోండి. మొదటి సారి టైపింగ్ ప్రారంభిస్తున్నప్పుడు, ఒక నిమిషానికి ఒక పదమే టైపు చేయగలుగుతారు. కానీ, ఒక సంవత్సరం టైపు చేసిన తరువాత, వారి చేతివేళ్లు సునాయాసంగా తిప్పుతూ నిమిషానికి ఎనభై పదాలు టైపు చేయగలుగుతారు. ఈ నైపుణ్యం కేవలం అభ్యాసం ద్వారానే సాధ్యము. ఇదే విధంగా, మూర్ఖమైన మరియు అల్లకల్లోలమైన మనస్సుని అభ్యాసము ద్వారా ఆ భగవంతుని చరణారవిందముల పైనే నిలుపాలి. మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీయాలి - ఇదే వైరాగ్యము - మరియు - మనస్సుని భగవంతుని మీదే నిలుపాలి - ఇది అభ్యాసము. పతంజలి మహర్షి ఇదే ఉపదేశం చెప్పాడు:


అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః (యోగ దర్శనం 1.12)


‘నిరంతర అభ్యాసము, వైరాగ్యముల ద్వారా మనస్సు యొక్క ఆందోళనలను నియంత్రించవచ్చు.

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 49*


*భవాంభోధౌ నౌకాం జడిమవిపినే పావకశిఖా-*

*మమర్త్యేంద్రాదీనామధిముకుటముత్తంసకలికామ్ ।*

*జగత్తాపే జ్యోత్స్నామకృతకవచఃపంజరపుటే*

*శుకస్త్రీం కామాక్ష్యా మనసి కలయే పాదయుగలీమ్ ॥*


*భావము :*


*తల్లీ! ఈ సంసారము ఒక మహా సాగరమైతే, దానిని దాటించే నౌక నీ పాదములు. మా బుద్ది హీనతను తొలగించే, ఔషధము నీ పాదములు. దేవతల కిరీటమునకు అలంకారములు, నీ పాదములు. వేదములనే పంజరములోని ఆడ చిలుక నీ పాదములు. అలాంటి పాద యుగళమును ధ్యానిస్తాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

17, ఆగస్టు 2026, సోమవారం

దాంపత్యం

 *దాంపత్యం*

               ➖➖➖✍️


▪️దాంపత్యం అంటే ఫోటోలలో నవ్వుతూ కనిపించే రెండు ముఖాల కథ కాదు. ఒకే ఇంట్లో వేలసార్లు మనస్పర్థలు వచ్చినా, బయటివారికి తెలియకుండా మళ్లీ మళ్లీ కలిసిపోయే రెండు హృదయాల ప్రయాణమే దాంపత్యం.`


`▪️ ```భార్యాభర్తల మధ్య ప్రేమ మాత్రమే ఉండదు. కోపం ఉంటుంది. అహంకారం ఉంటుంది. బాధ ఉంటుంది. రోజుల తరబడి మాట్లాడుకోని మౌనం కూడా ఉంటుంది. “ఇతను ఎప్పటికీ మారడు” అనే భార్య వేదన ఉంటుంది. “ఆమె నన్ను అర్థం చేసుకోవడం లేదు” అనే భర్త మనోవేదన కూడా ఉంటుంది.`


`▪️అయినా చూడండి... అదే భార్య, భర్త ఆలస్యంగా ఇంటికి వస్తే తలుపు తెరుచుకున్న శబ్దానికి మేల్కొంటుంది. అదే భర్త, భార్య భోజనం చేయలేదని తెలిస్తే.. కోపంలో ఉన్నప్పటికీ ఆమె ముందు భోజనం పెడతాడు.`


`అదే దాంపత్యం!`


`▪️పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు సందడిగా ఉంటుంది. వారి చదువు, పెళ్లి, ఉద్యోగం, పిల్లలు... ఇలా వారి జీవితాల్లో తల్లిదండ్రులు పూర్తిగా మమేకమైపోతారు. కానీ ఒక రోజు పిల్లలు తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్లిపోతారు. ఇల్లు క్రమంగా నిశ్శబ్దమవుతుంది.అప్పుడు మిగిలేది ఇద్దరే.`


`▪️ఒకప్పుడు చిరాకుగా అనిపించిన అదే గురక, ఒకరోజు వినిపించకపోతే కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. “ఇంకా మాట్లాడొద్దు” అని మందలించిన అదే స్వరం, ఒకరోజు శాశ్వతంగా వినిపించకపోతే ఇంటి గోడలే వెలితిగా అనిపిస్తాయి. ఒకరు దూరమైన తర్వాత చాలామంది వచ్చి ఓదార్పు మాటలు చెబుతారు. కానీ రాత్రి మంచం మీద ఖాళీగా మిగిలిన ఆ స్థలాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. మందు ఇచ్చే చేయిని, “భోజనం చేశావా?” అని అడిగే స్వరాన్ని, కోపంలోనూ దాగి ఉన్న ఆప్యాయతను ఎవరూ తిరిగి తీసుకురాలేరు.`


`▪️అందుకే గుర్తుంచుకోండి... అత్యుత్తమ జంట అంటే ఎప్పుడూ గొడవపడని జంట కాదు. గొడవల తర్వాత కూడా ఒకరినొకరు విడిచి వెళ్లని జంటే నిజమైన దాంపత్యానికి నిదర్శనం.`


`▪️దాంపత్యంలో ప్రేమకంటే గొప్పది అన్యోన్యత. అన్యోన్యతకంటే గొప్పది సహనం. సహనం కంటే గొప్పది... చివరి వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలనే మనసు.`


`▪️చిలిపితనం, సిగ్గు, గొడవలు, మౌనం, కష్టాలు, సుఖాలు, కన్నీళ్లు, నవ్వులు, పరస్పర అవగాహన—ఇవన్నీ కలిసి దాంపత్యాన్ని పవిత్రంగా నిలబెడతాయి.`


`▪️ ```జీవించి ఉన్నప్పుడే జీవిత భాగస్వామి విలువను గుర్తించండి. ఎందుకంటే వారు లేనప్పుడు కార్చే కన్నీటి కంటే, వారు ఉన్నప్పుడే చూపే ప్రేమ, గౌరవం, ఆదరణ మరింత పవిత్రమైనవి.`


🔷*గుర్తుంచుకోండి......*


`▪️జీవితంలో పరిపూర్ణమైన జీవిత భాగస్వామి ఎవరూ దొరకరు. కానీ ఒకరి లోపాలను మరొకరు అంగీకరించి, చివరి వరకు చేయి విడవకుండా కలిసి నడిచే జీవిత భాగస్వామి కంటే గొప్ప అదృష్టం మరొకటి లేదు.✍️ 


🕉️*మీరు చేసుకునే పుణ్య + పాప కర్మల్ని బట్టే - మీకు భార్యగా, జీవిత భాగస్వామిగా - తల్లిగా - తండ్రిగా - సోదరుడిగా - తనయుడు గా -కుమార్తెగా -మీయింటి పశువుగా -కుక్కగా వస్తుంది. ఏరూపంలో నైనా రావచ్చు. అందుకే: మీరు చేసే పనులు సక్రమంగా -చక్కగా చెయ్యండి. అందర్నీ ప్రేమగా చూడండి. అన్నీ బాగానే జరుగుతాయి. ఇక్కడ భగవంతుడు తప్ప వేరే ఏమీలేదు+ ఎవ్వరూ లేరు. అందర్నీ భగవంతుని స్వరూపాలుగానే చూడండి. అన్నీ బాగానే జరు గుతాయి*.✍️

.

శంకరంబాడి సుందరాచారి

  ఆధునిక తెలుగు కవులలో సుందరకవి గా , భావకవిగా , ప్రసన్న కవిగా పేరొందిన "శంకరంబాడి సుందరాచారి" గారి జయంతి 10 ఆగష్టు. ఆ మహానుభావున్ని గుర్తు చేసుకుంటూ.. 

హైదరాబాద్‌లో 1975 ఏప్రిల్ 12న ఉగాదినాడు తొలి తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమై ఆరురోజుల పాటు వైభవంగా జరిగాయి. ఆ సభ ప్రారంభంలో మా తెలుగుతల్లికి గీతాన్ని ఆలపించడానికి టంగు టూరు సూర్యకుమారిని ఇంగ్లండ్ నుంచి పిలిపించి పాడించారు. ఆ సమయంలో సదరు గేయకర్త ఎవరు అనే ప్రశ్న అక్కడున్న వారికి వచ్చింది. అక్కడే సభలో దూరంగా వెనుకవైపు ఒక వ్యక్తి చిరిగిన బట్ట లతో, దయనీయ స్థితిలో నిలబడి ఉన్నాడు. ఆయ నెవరో కాదు శంకరంబాడి సుందరాచారి. అక్క డున్న కొంతమంది ఆయనను గుర్తించారు. వేదికపై ఉన్న మహాసభల నిర్వాహకులు మండలి వెంకట కృష్ణారావు స్వయంగా సుందరాచారిని వేదికపైకి తీసుకెళ్లి సత్కరించి, ప్రభుత్వం తరపున 250 రూపాయల జీవితకాల గౌరవవేతనం ప్రకటించింది.

ఉద్యోగార్థం వెళ్లిన అభ్యర్థిని ఆ పత్రికాధిపతి నీకు తెలుగొచ్చా అని అడిగితే, ఏం మీకు తెలుగు రాదా అంటూ ఉద్యోగాన్నిచ్చే మహానుభావుడినే ఎదురు ప్రశ్నించినధీమంతుడాయన. ప్రశ్న అడిగింది ఆంధ్రపత్రిక అధిపతి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు కాగా ఎదురు ప్రశ్నించింది శంకరంబాడి సుందరాచారి. 

తన పై ఉన్నతాధికారి తిరుపతికి వచ్చి చేతి సంచిని అందివ్వబోతే తిరస్కరించి, ఆఫీసు జవానుకు, ఇన్‌స్పెక్టరుకు తేడా తెలియని వ్యక్తి విద్యాశాఖలో ఉండటం గర్హనీయమంటూ వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆత్మాభిమానం ఆయనది.

 ఉద్యోగం కోసం, హోదా కోసం, పేరు కోసం ఎవరినీ యాచించని, చేయిచాపని ఈ గుణం వల్లే జాతి మాతకు మల్లెపూదండలు గుచ్చి రచించిన ఆ రసరమ్య గీతకర్త ఎవరో కూడా దశాబ్దాల పాటు కనుమరుగైపోవడం నాటి చరిత్ర.

ఆధునిక తెలుగు కవులలో సుందరకవిగా పేరొందిన శంకరంబాడి సుందరాచారి కమలమ్మ, రాజగోపాలాచారి దంపతుల ప్రథమ సంతానంగా 10-08-1914న తిరుపతిలో జన్మించారు. తిరుపతి దేవస్థానం వారి ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. మదనపల్లె బెసెంట్ థియొసాఫికల్ కళాశాలలో చేరి ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చదువు పూర్త య్యాక తిరుపతిలోనే ఆంధ్రపత్రిక కార్యాలయంలో చేరి ఉపసంపాదకుడి స్థాయికి ఎదిగాడు. కళావని శీర్షికతో ఆం ధ్రపత్రికలో తను రాసిన వ్యాసాలు మం చి గుర్తింపు పొందాయి. 1939 లో చిత్తూరు బోర్డు హైస్కూలులో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మధ్యలో రెండేళ్లు సెలవు పెట్టి చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో దీన బంధు చిత్రానికి మాటలు, పాటలు రాశారు. 

తర్వా త జూనియర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా లభించిన పదవిని సైతం విద్యాశాఖ డెరైక్టర్ చేతి సంచినిచ్చి అవమానించినందుకు నిరసనగా వదిలే సుకున్నారు. 

తన పన్నెండో ఏటనే తెలుగులో కవి త్వం రాయటం ప్రారంభించిన సుందరాచారి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండకావ్య, కథారచనలే కాక, వేలాది ఉపన్యాసాలు కూడా చేశారు. 

నాస్వా మి, గీతాంజలి వంటి కావ్యరచనలు, కెరటాలు, సుందర సుధాబిందువులు వంటి ఖండకృతులు, గాలిమేడలు, అరాచకం వంటి దృశ్య కృ తులలో నాటకాలు, బుద్ధగీత, ఏకలవ్యు డు వంటి ప్రబోధ రచనలు, శాంతి దూ తలు, రంగిరాస్యం వంటి జానపద రచ నలు చేశారు.

ఎన్ని రచనలు చేసినప్పటికీ వీరి ప్రతిభకు తార్కాణంగా నిలిచిన రచనే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’. భారతదేశానికి ‘జనగణమన’ జాతీయ గీతమైనట్లే, ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ తెలుగు జాతికి రాష్ట్రగీతమైంది. 1975లో జరిగిన తొలి తెలుగు ప్రపంచ మహా సభలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి, విద్యాలయాల తరగతులు ప్రారంభించ డానికి ముందు విధిగా పాడాలని ఆదేశించింది.

 సుందరాచారి చివరిరోజులు చాలా దుర్భ రంగా గడిపారు. తిరుపతి వీధుల్లో బికారిగా తిరు గుతూ జీవించారు. చివరి దశలో తన శిష్యుడు మన్న వ భాస్కరనాయుడు ఇంట్లో ఉండేవారు. అనారో గ్యంతో 1977 ఏప్రిల్ 8న తుదిశ్వాస వదిలారు. మా తెలుగుతల్లికి మల్లెపూదండ గేయం తెలుగు ప్రజలు పాడుకుంటున్నంత కాలం ఆయన ఏనాటికైనా తెలు గువారికి చిరస్మరణీయుడే. ....,

ఎన్నడూ కీర్తి ప్రతిష్టలు ఆశించక నిరాడంబరుడిగా సాహిత్య సేవలే జీవితలక్ష్యంగా వ్యక్తిగత జీవితంతో నిరంతరం పోరాటం సాగించిన సుందరా చారి ఆయన వ్రాసిన ”మా తెలుగు తల్లికి ప్రార్థనా గీతం మన తరంతరం నిరంతరం ఆలపిస్తాము. ఆయన ప్రతి తెలుగువారి హృదయాలలో శాశ్వత స్థానం పొందారు.