6, జులై 2026, సోమవారం

కాళహస్తీశ్వర శతకం - 32

 🕉️ శ్రీ కాళహస్తీశ్వర శతకం - 32


ఆరావం బుదయించెఁ దారకముగ నాత్మాభ్రవీధిన్మహా(అ)

కారోకారమకారయుక్తమగు నోంకారాభిధానంబు చె

న్నారున్ విశ్వ మనంగఁ దన్మహిమచే నానాదబిందుల్

సుఖశ్రీ రంజిల్లఁ గడంగు నీవదె సుమీ శ్రీ కాళహస్తీశ్వరా!


తాత్పర్యం :


శ్రీ కాళహస్తీశ్వరా ! 


ఆత్మకు ఆశ్రయ స్థానమగు దహరాకాశమునందు ఒక సూక్ష్మతమధ్వని ఉత్పన్నమైనది. 


అదియే అకార, ఉకార మకార అను మూడు అవయవముల కూడికచే ఏర్పడిన  ’ఓం’ కారము. 

దీనిని ఉపాసనాసంప్రదాయము నందు "తారకము" అని అందురు. 


మరియొక నామము "నాదము". దీనినుండి మరియు దీని మహిమచేతనే విశ్వము ఉత్పన్నమైనది. 

ఈ విశ్వమునకు "బిందువు" అనియు వ్యవహరింతురు. 


నాదము కాని బిందువు కాని చక్కని శోభతో ప్రకాశించుటకు మూలముగ ఉండు నీవు అదియే సుమా. ప్రణవమనగ పరమేశ్వరుడు. 


అతని నుంచి జనించిన విశ్వము సావయవము కాగా అందలి సకలదృశ్యతత్త్వములను చెప్పు శబ్దములకు అన్నిటికిని మూలమగునని అకారాది (౫౦) వర్ణములు. 

ఇచ్చట ప్రణవము ఏకైకాక్షరము ఈశ్వరుని తెలుపునది. 


ఈశ్వరుడు వాచ్యము (ప్రణవముచే చెప్పబడువాడు) నిరవయవుడు. 

అట్లే ఈశ్వరుని నుండి జనించినది సావయవ మగు విశ్వము. 

దానిని తెలుపు సావయవ శబ్దముల మూలతత్త్వము "కళలు” అనబడు వర్ణములు. 


ప్రణవము ఏకైకాక్షరమైనను దానియందు ఉపాసనకై ఆ తత్త్వమును శివుడు - శక్తి అను అంశములుగ చూడవలయును. 


ఏదేని ఒక వస్తువునకును ఆ వస్తువును తెలుపు శబ్దమునకు అభేదము. 

కనుకనే ప్రణవమునకును దానిచే చెప్పబడు ఈశ్వరునకును అభేదము.


ఓం నమః శివాయ


*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*

పూవులను రేకులుగా విడదీసి పూజ చేయవచ్చా?

 ప్ర : పూవులను రేకులుగా విడదీసి పూజ చేయవచ్చా?


జ : పువ్వు అంటే లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం సరస్వతి. పువ్వు అంత కోమలమైనది, పువ్వు అంత పరిమళంతో కూడుకున్నది పువ్వు అంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. అందులో ఎర్రటి పువ్వు కానీ నేలమీద పడి ఉంటే ఎవరైనా సరే దానిని తీసేయాలి ముందు. అది క్రింద ఉండకూడదు. ఎర్రపువ్వు క్రింద పడి సువాసిని కానీ, ఎవరు కానీ తొక్కకూడదు. సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు. ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు. ఎవరైనా తొక్కుతారు అని వెంటనే తీసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి. అంత పరమ పవిత్రమైన పువ్వులు పూజ చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వే వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటు వచ్చినా అక్షతలతో పూరణ చేస్తారు. నిజానికి పూజలో మనం చాలా ఇవ్వనే ఇవ్వం. మంత్రం ఒకలా ఉంటుంది. మనం అక్కడ ఇచ్చేది ఏమీ ఉండదు. సింహాసనం సమర్పయామి అంటారు. రోజూ పట్టుకువచ్చి సింహాసనం వేస్తున్నామా? అక్షతలు వేస్తారు. మనసులో భావన చేయాలి. ఎర్రటి మెత్తటి పరుపులు, పాదపీఠం, సింహం ముఖం తీసుకువచ్చి అక్కడ వేస్తే దానిమీద ఆయన కూర్చున్నట్లు భావిస్తాం. ’క్షతము’ అంటే విరిగిపోవడం; ’అక్షత’ నడుము విరగని పసుపు కలిపిన బియ్యం. అవి వేస్తే అందులోకి వచ్చేస్తుంది పదార్థం. ఈశ్వరుడికి అందిపోతుంది. అలాగే తాంబూలం. మనం నిజానికి ఏం చెప్తాం అంటే ఒక మాట చెప్తాం ’ముక్తాచూర్ణేన సంయుక్తే తాంబూలం ప్రతిగృహ్యతామ్’ – అసలు మంచి ముత్యం తీసుకువచ్చి కాలుస్తారు. దాని బూడిద ఒక సూది మొన పెట్టి తీస్తే ఎంత వస్తుందో అంత వేయాలి. అది కానీ ఎక్కువ అయితే నోరు అంతా పొక్కిపోయి బొబ్బలు వచ్చేస్తుంది. ముత్యపుగుండ అంత శక్తివంతం. తృణం వేస్తే చాలు నోరంతా ఎంత ఎర్రగా పండుతుందో! తాంబూలం ఐదోతనానికి గుర్తు. అందుకే భర్త తాంబూలం పూజలో పెడితే దానిని మధ్యాహ్నం భార్య వేసుకోవాలి. ఆమె తాంబూలం వేసుకుంది అంటే భర్తగారి భోజనం అయిపోయింది అని గుర్తు. అయిదోతనానికి గుర్తు తాంబూలచర్వణం. అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నములుతూ ఉంటుంది. అటువంటి తాంబూలానికి మనం చెప్పే మంత్రం ఒకటి, ఇచ్చేది ఒకటి. భక్తితో తమలపాకులు పెట్టి అందులో వక్క, అక్షతలు పెట్టి దేవుడి దగ్గర పెడితే అప్పుడు పూర్ణంగా పదార్థాలు అన్నీ వేసి తాంబూలం ఇచ్చినట్లే. అన్నింటికీ అక్షతలు సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర చిదిపేసి నలిపేసి రేకులు వేయమని ఎవరు చెప్పారు? ఒక అందమైన పువ్వును ఈశ్వరుడు ఎలా సృష్టించాడో చూస్తే మహాశిల్పి కనబడతాడు. అంత అందంగా ఆయన గుదిగుచ్చి పువ్వు తయారుచేస్తే తుంపి పూజ చేస్తారా? ఈశ్వరుడు అడిగాడా నిన్నుతక్కువైందని? తక్కువైందన్న మాట ఆయన అంటే జన్మలో పూజ చేయగలమా మనం? రోజూ సింహాసనాలు తెస్తామా? రోజూ పంచెలచాపులు తెస్తామా? పట్టుచీరలు తెస్తామా? దానికి పనికి వచ్చింది పువ్వుల దగ్గరకి వచ్చేటప్పటికి ఎందుకు తక్కువైంది? ఎందుకు పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం. అది హింస. పరమ కఠోరమైన మనస్తత్త్వంతో చేసేటటువంటి పని. కొంతమంది తెలియక చేస్తారు మనస్సు కఠినమై కాదు. మనస్సు కోమలంగా ఉంటుంది. తెలియక పొరపాటు జరుగుతుంది. అందుకే పువ్వును చిదమనవసరం లేదు. ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి. మిగిలినవి అక్షతలతో పూరణ చేయండి.



తిరుమల 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి దర్శనభాగ్యం

 తిరుమల



116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి దర్శనభాగ్యం కల్పించిన‌ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు


కాలినడకన తిరుమలకు వెళ్తున్న వృద్ధురాలి వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ 


శ్రీవారిపై వృద్ధురాలి అచంచలమైన భక్తికి స్పందించిన  

సీఎం, టీటీడీ చైర్మన్


వృద్ద భక్తురాలికి, ఆమె కుటుంబసభ్యులకు ప్రత్యేక దర్శనం చేయించాలని నిర్ణయించుకున్నట్లు, ఆమె వివరాలు తెలియపరగలని నిన్న Xలో పోస్ట్ పెట్టిన చైర్మన్


చైర్మన్ విజ్ఞప్తి పై సత్వరం స్పందించి....వృద్దురాలిని కనుగొన్న విజిలెన్స్ అధికారులు


తమిళనాడు చెన్నైకి చెందిన నవనీతమ్మ గా గుర్తింపు


చైర్మన్ నిర్ణయం ప్రకారం ఈ ఉదయం వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులకు విఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన చైర్మన్ కార్యాలయ సిబ్బంది


వృద్ధురాలిని బయోమెట్రిక్ లో దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లిన చైర్మన్ కార్యాలయ సిబ్బంది


రంగనాయకుల‌ మండపంలో వృద్ధురాలికి పండితులతో దగ్గరుండి వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి తీర్థప్రసాదాలను‌ అందజేసిన‌ టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర


వృద్ధురాలికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ఈఓ రవిచంద్ర


ఆ స్వామివారి రూపంలో టీటీడీ చైర్మన్ మా అమ్మమ్మ తో పాటు కుటుంబానికి మంచి దర్శనభాగ్యం కల్పించారు


టీటీడీకు, చైర్మన్ కు మా ధన్యవాదాలు


- దిక్పతీ, వృద్ధురాలు నవనీతమ్మ మనవడు

పంచాంగం 06.07.2026 Monday,

  ఈ రోజు పంచాంగం 06.07.2026 Monday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస క్రిష్ణ పక్ష షష్ఠి తిథి ఇందు వాసర పూర్వాభాద్ర నక్షత్రం సౌభాగ్య యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: సప్తమి 


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

--------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ।

ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ।। 22 ।।




ప్రతిపదార్థ:



యే — ఏదైతే; హి — నిజముగా; సంస్పర్శ-జాః — ఇంద్రియ వస్తు-విషయముల సంపర్కంచే జనించిన; భోగాః — భోగములు; దుఃఖా — దుఃఖములు; యోనయః — మూలము; ఏవ — నిజముగా; తే — వారు; ఆద్య-అంతవంతః — మొదలు మరియు తుది కలిగిన; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; న — ఎప్పటికీ కాదు; తేషు — వాటిలో; రమతే — రమించరు; బుధః — తెలివైనవారు.


 

తాత్పర్యము : 


 

ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం (మొదలు-చివర) ఉంటాయి, కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు.



వివరణ:


ఇంద్రియ వస్తు-విషయ సంపర్కంచే ఇంద్రియములు సుఖానుభూతులను కలుగచేస్తాయి. మనస్సు ఒక ఆరవ ఇంద్రియము లాగా, గౌరవము, పొగడ్త, పరిస్థితులు, విజయము మొదలైన అగ్రాహ్యమైన వాటి నుండి ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. ఈ యొక్క శారీరక, మానసిక సుఖాలన్నిటినీ భోగాలు (భౌతిక సుఖానుభవము) అంటారు. ఇటువంటి ప్రాపంచిక భోగాలు, ఈ క్రింది కారణాల వలన ఆత్మను సంతృప్తి పరచలేవు:


ప్రాపంచిక ఆనందాలు పరిమితమైనవి, కాబట్టి ఏదో లోపించిన భావన వాటిలో అంతర్గతంగా ఉంటుంది. ఒక వ్యక్తికి లక్షాధికారి అయ్యాననే సంతోషం ఉండవచ్చు, కానీ అదే లక్షాధికారి ఒక కోటీశ్వరున్ని చూసినప్పుడు అసంతృప్తికి లోనై ఇలా అనుకుంటాడు, ‘నాకు కూడా ఒక కోటి రూపాయలు ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేవాడిని.’ అని. దీనికి విరుద్ధంగా, భగవంతుని ఆనందం అనంతమైనది, కాబట్టి పరిపూర్ణ సంతృప్తిని ఇస్తుంది.


ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమైనవి. ఒకసారి అయిపోయిన తరువాత, వ్యక్తిని మరల అసంతృప్తితో వదిలిపెడతాయి. ఉదాహరణకి ఒక తాగుబోతు, రాత్రి పూట మద్యం తాగటాన్ని ఎంజాయ్ చేయవచ్చు. కానీ మరుసటి రోజు పొద్దున్న దాని దుష్ప్రభావం, అతనికి తీవ్రమైన తలనొప్పి ఇస్తుంది. కానీ, భగవంతుని ఆనందం నిత్యమైనది, ఒకసారి పొందిన తరువాత అది ఎప్పటికీ ఉంటుంది.


ప్రాపంచిక సుఖాలు అస్థిరమైనవి మరియు త్వరితగతిన వీగిపోతాయి. జనులు ఒక గొప్ప అవార్డు పొందిన సినిమాను చూసినప్పుడు, ఏంతో ఆనందిస్తారు, కానీ అదే సినిమాని రెండవ సారి స్నేహితుడికి తోడు కోసం చూడవలసి వస్తే, ఆ ఆనందం ఉండదు. ఇంకొక స్నేహితుడు మూడో సారి చూడటానికి ఒత్తిడి చేస్తే, వారంటారు , ‘ఏదైనా శిక్ష వేయండి కానీ, మరల ఆ సినిమా చూడమని అడగవద్దు.’ అని. భౌతిక వస్తువుల నుండి కలిగే సుఖం మనం దానిని ఆనందించే కొద్దీ తగ్గిపోతుంది. ఆర్థికశాస్త్రంలో దీనిని ‘లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్’ (Law of Diminishing Returns) అంటారు. కానీ, భగవంతుని ఆనందం చైతన్యవంతమైనది; అది సత్-చిత్-ఆనందం (శాశ్వతమైన నిత్య నూతనమైన దివ్య ఆనందము). కాబట్టి, ఒక వ్యక్తి అదే భగవత్ నామాన్ని నిరంతరం రోజంతా జపిస్తూ ఉన్నా, నిత్య నూతనమైన ఆధ్యాత్మిక తృప్తిని దానిలో పొందుతాడు.


ఒక స్వస్థచిత్తంగల మనిషి, రుచికరమైన స్వీటుని అస్వాదిస్తునప్పుడు, దానిని వదిలి బురదని తినమంటే తినడు. అదేవిధంగా, ఒక వ్యక్తి దివ్య ఆధ్యాత్మిక ఆనందాన్ని అస్వాదిస్తున్నప్పుడు, మనస్సు అన్ని భౌతిక సుఖాల యందు రుచిని కోల్పోతుంది. విచక్షణా జ్ఞానం ప్రసాదించబడిన వారు ఈ పైన చెప్పబడిన భౌతిక సుఖాల లోపాలను అవగతం చేసుకుని, తమ ఇంద్రియములను వాటినుండి నిగ్రహిస్తారు. శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకంలో దీనిని ఉద్ఘాటిస్తున్నాడు.

5, జులై 2026, ఆదివారం

🌼శ్రీ విష్ణు ధర్మోత్తర మహా పురాణం*

  🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏


*🌼శ్రీ విష్ణు ధర్మోత్తర మహా పురాణం*

*🌼132.అధ్యాయం*


*🌼ప్రధమ ఖండము:* 


*🌼చంద్రోదయ వర్ణనము:* 


*🌼మార్కండేయుడనియె:-* 


రంభ చంద్రోదయమున కెదురు నూచుచున్న యూర్వశింగని వినోదము కొఱకామె కావనమున జూపించెను. చెలీ? ఈ తోటలో పూవులతో నిలపుగుల్కు నీ చంపక ద్రుమముం జూడవె. ఇది నీ మేని రంగునకు సరియగు నిండ జూచిన విరుల నిండుకొని యున్నది. ఓ వామనయనా! ఇదిగో పుష్పించిన యీ దానిమ్మ చెట్టు గనవె. పువ్వులతో నిది నీ యధర బింబము సొంపుగొని యుల్నది. ఇరిదె జూడు మీ సహకారము పంచశర శరాకారమెంత మనోహరముగ నున్నది! నీ మెఱుగు చెక్కిళ్లు కొక క్రొత్తయనుందల వరించు పువ్వులతో నున్న మదూకమును (ఇప్పచెట్లును) గనుము. నీ పయోధరములట్లతి రమ్యములయిన పండ్ల బరువెక్కి మనసున కెంతేని వేడుక గూర్చు నీ తాటిచెట్టు వంక చూపు నిల్పుము. కల్యాణీ? నీ యూరపులకు సరైయై నిల్భు నీయరటింగ గనుగొనవె. విశ్వకర్మ దీనికి చక్కని వన్నె గూర్ఛి సర్వాంగ సుందరముగ నిర్మించినాడు. పువ్వుల విరియబూచి మనసుందొంగిలుచున్న యీ యవిముక్తలతికం దిలకింపవే. ఇది వేనలి కెనయై తుమ్మెదలు ముసరనెంతేని ముచ్చట గొల్పుచున్నది. విశాలాక్షీ! ఇటుచూడు మీమొల్ల తరువు. నీ పలువరుస కీడుగా చక్కని హపుల మిగుల రాణించుచున్నది. ఇది యుం గనుగొనవె. ఈ కలువపూ దీగ నీ కనుల కెనయగు విరిసిన కలువలడెందమున కానందము నించుచున్నది చక్కగ విరసిన కమలములతో నిండిన యీ తామర తీగనో సుందరీ! కాంచు మిది నీ యూర్పులనెత్తావుల జిమ్ముచు బంగారు కింజల్కముల నొల్లసిల్లు విప్పారిన కమలము నెంతేని సొంపు నింపుచున్నది. తామర కొలని దరులందరిసిన యీ రాయచలం గనుమివి నీ మనోహర మందగమనము పిలాసము పేర్చికొన్నట్టున్నవి. నీ కెంగేలి రంగు గొనిన లేజిపురులం దేజిరిల్లు పలురకము లయిన తరుపులనలము కొన్న యీ క్రీడా శైలమును నీక్షింపుము. ఈ విహార గిరిపై నున్న తీయ మావిగున్నపై నుండి మరునూరక యెస కొల్పుచుం నీ మథుర కంఠ స్వరమునకు సరిగ గూయుచు మనసు నాచికొనుచున్నధదిగో కోకిల. క్రీడాద్రి నుండి వెడలుచున్న యీనదిం జూడుమిది నీ మనసు వలె నతి స్వచ్ఛమైన చల్లని తేట నీట గాటముగ దనియంచుచున్నది. ఎంతయు వింత గొల్పుచు నెంతేని జూడ ముచ్చటయగు నీ చల్లని పూదోట నాలో కింపు ముదిమదిగో నీవు కాము బారికిం జిక్కితవని తెలిసి జాలిం గొని కాబోలు జగద్భంధువు తన కరముల నిమిడించి కొని రవి చాటగు చున్నాడు. ఓ సుందరి! ఎంతచిరు సైనవియు చెట్ల యాకులం జివురాకులును సూర్యాస్తమయ సమయ తాపమున తాయెఱుపెక్కి మిక్కిలి దీపించుచున్నవి. దినకరుడు గిరి శిఖరముల నెరుపార జేయుచున్నాడు.


రవి స్వధర్మము నిర్వర్తించి దివసాన మందస్త మించి నాడు. కల్యాణీ! అదురక్తిమైన సంధ్యా కాలము తనంత నొక కాముకు డొక్క కామిని నట్ట ప్రాగ్దిక్కును కౌగిలించు కొనుచున్నదల్లదిగో చూడుము! ద్విజశ్రేష్ఠులు నీయమముగొని సత్పురుషుల మార్గముననువర్తించుచు నిపుడు సంధ్యాకాలము నుపాసించుచున్నారు. (సాయం సంధ్యా వందనము సేయుచున్నారన్నమాట.) అస్తంగతుడైనను సూర్య ప్రభువును కులీనయమునస్వినయు నగు సాధ్వివలె సంధ్యా దేవి అనువర్తించు చున్నది. ఓ నునాసోరూ! (చక్కని ముక్కు చక్కని ఊరువులును గలదానా!) చూడు మిది. భూతలము తుమ్మోదలలముకొన్న తాపింఛ వృక్షములతో పోలికగ చీకటిం గ్రమ్ముకొన్నది. సర్వము గాఢాంధకార బంధురమై యేమియు గనిపించుట లేదు. సర్వజగత్తు మాలిన్యముచేనేకరూప మయినది. సఖీ! ఇత్తఱి బిత్తఱులు కామాయత్తలై నల్లని చీరలు గట్టుకొని నగలుపెట్టుకొని కాంతులు గదియ జనుచున్నారు. ఓ సుందరీ! అల్లదిగో చూడు చంద్ర బింబముదయించినది. అది పౌన్మతవైన మత్తకాశినుల నెమ్మోములతో సమముగ ప్రభలొల్కు చున్నది. ఇంచుకగ గగన మాక్రమించి యది తెల్లదన మంది నయనానందకరమగుచు చంద్రుని జూడుము. శశాంకు డొక సత్త్వ మట్టీ జగమ్ము నలము కొన్న తమస్సును (చీకటిని) దూరి పాటి అచ్చము తెలికాంతి గులుకు నాకసమున స్వచ్ఛముగ రాజిల్లు చున్నాడు. అనగా తమోగుణవశుడైన వాడు. పుడమి విడిచి కేనలసత్త్వగుణ సంపన్నుడై మీది కేగి పుణ్య లోకముల రాజిల్ల బూనిన పుణ్యాత్ము నట్లున్నాడని భావము. చంద్రుడిరు వంకల నేకరూపముగ వెన్నెలల జిమ్ముచు కామబాణ నిహతలైన నీ చెక్కిశుల తళుకు గొని యున్నాడు. ఈ తూర్పుదిశ చంద్రుడును వెండిబిందెందాల్చి ఈ భూదేవి వెన్నెల నెపమున కేవల రజతమయయో యన్నట్లు (కేవలం వెండితో చేసినదో యన్నట్లు) రాజిల్లు చున్నది.


చంద్రుడుదయింప విప్పారిన కునుదిని (నల్లకలువ తీగ) నీ చిఱు నవ్వుల సరిపుచ్చు పువ్వులతో మిక్కిలి శోభించు చున్నదల్లదె చూడుము. విశహము గొని యీ చక్రవాక వక్షి మిక్కిలి దుఃఖము గని పిరహ తాప శాంతికి కాబోలు చల్లని తెల్ల గలువ గతీ లోనికి జొచ్చుచున్నట్లున్నది.


ఈచంద్రకాంతసదసమునుండి చంద్రకిరణసమప్రభలును చంద్రకిరణ సంఘృఫ్టములునైన నీటిచినుకులుపడుచున్నవి. విరహదశలో నాయకుడు గురియు నశ్రుబిందువులో యన్నట్లు మంచు బిందువులు గురియు చున్న వన్నమాట. చంద్రునిచే గౌగిలికిం దార్చబడి రాత్రి (కాముని కౌగిట నున్న కామినివలె) తమః పటమును (చీకటి యను పలువను) విప్పికొన్నది.


ఓ చంద్రాసనా! ఈ చంద్రోదయమందు ప్రమదామనోహరుడైన యీ నరేంద్ర చంద్రునందూర్వశీ! నీవు జీవితాశను దర్శింపుము (బతుకుతెఱువు గమనింపు మన్నమాట) అంతియకాదాతని యందు ప్రాణములమీది యాశనుబెట్టుకొనుము. అని రెండవయర్థము (ఇది నీ భాగ్య విశేషమున తటాలున నీకు తారసిల్లినది.)


*ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున చంద్రోదయవర్ణనమను నూటముప్పదిరెండవ అధ్యాయము.*


🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏

ఆప్తవాక్యము

 🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏


 👌 _*ఆప్తవాక్యము*  85_ 👌



✳️ _*సుసందృశం త్వా వయం మఘవన్ వన్దిషీమహి*_ 🙏


💐 _*యజ్ఞస్వరూపా! చక్కగా దర్శిస్తున్న నీకు మేము వందనము చేస్తున్నాము♪.*_

                          -- యజుర్వేదం


🪷 జగత్కారణుడైన‌ భగవానుని స్తుతిస్తూ వేదం - _*సుసందృశం త్వావయం మఘవన్ వన్దిషీమహి*_ అని పలికింది♪. భగవానుడు సర్వసమగ్ర దృష్టి కలవాడు♪. ఆయన చూపు శక్తిమంతమైనది♪.

_*'అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః'*_ అని శ్రుతిచెప్పినట్లుగా సృష్టిలో ప్రత్యణువున బహిరంతరాలలో వ్యాపించిన పరమేశ్వరుడు అన్నిటినీ సమగ్రంగా దర్శిస్తున్నారు♪.


✳️ _*[భగవానుడు చూస్తున్నాడనే స్పృహ ఉన్నవాడు పాపం చేయడు♪. ఆయనకు ప్రీతికరమైన సత్కర్మనే ఆచరిస్తాడు♪. ఇలా ధార్మికంగా అతడు జాగ్రత్తపడతాడు♪. అంతేకాదు - ఆయన గమనించుకుంటున్నాడు కనుక, దేనికీ వెరవకుండా ధైర్యంగా, అభయస్థితిలో ఉంటాడు♪. ఇలా ధర్మనిష్ఠనీ, అభయాన్నీ ఇవ్వగలిగే సత్యస్ఫురణ ఈ వేదవాక్యంలో విశదమవుతోంది♪.]*_


🪷 *'సుసందృశం'* అనే మాట చాలా చక్కనిది. సమ్యగ్‌దృష్టి - సదృశం. సర్వకాల జ్ఞానము, సర్వభూత జ్ఞానము కలవాడు భగవానుడు♪. జీవులది పరిచ్ఛిన్న దృష్టి. పరిమితంగానే చూడగలడు, పరిమితంగానే భావించగలడు. కానీ భగవానునిది అపరిచ్ఛిన్న దృష్టి. అనంత దర్శనశక్తి సంపన్నుడు. కాలపరంగా, దేశపరంగా అనంతత్వమది. అపరిమితమై, సర్వవ్యాపకమైన దృష్టిలో జీవుల కర్మలను గమనిస్తూ, తదనుగుణ ఫలాలను అందిస్తూ విశ్వాన్ని నిర్వహిస్తున్న విశ్వేశ్వరుడతడు♪. అది సమగ్రమైన దృష్టి♪. ఎవరికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలిసిన స్వామి సర్వకాలాలలోను సర్వజీవులను గమనించుకుంటున్నాడు. అందుకే _*"సహస్రాక్షః, సుదర్శనః, సులోచనః, సాక్షీ సర్వదర్శీ"*_ అనే నామాలతో నారాయణుని స్తుతించారు♪.


🪷 భగవానుడు సర్వమును తెలిసినవాడనే భావం ఈ వాక్యంలో స్పష్టమౌతోంది♪. సూర్యుడు, చంద్రుడు, పగలు-రాత్రి (కాలము), అంతఃప్రజ్ఞ, నక్షత్రాలు...ఇవన్నీ పరమేశ్వరుని దర్శన శక్తులు. ఇవన్నీ కూడా ప్రతి జీవుని కర్మలను గమనించే సాక్షి స్వరూపాలు♪.


🪷 ఇవన్నీ భగవానుని నేత్రాల వంటివి. వీటి కన్ను ఎవరూ కప్పలేరు. భగవానుని చూపు మనపై ఎల్లప్పుడూ ఉన్నదనే జ్ఞానం ఈ వాక్యంలో ద్యోతకమౌతోంది♪. ఈ వాక్యాన్ని స్పృహలో ఉంచుకుంటే చాలు మనకు జాగ్రత్త, ధైర్యం కలుగుతాయి. భగవానుడు చూస్తున్నాడనే స్పృహ ఉన్నవాడు పాపం చేయడు. ఆయనకు ప్రీతికరమైన సత్కర్మలనే ఆచరిస్తాడు. ఇలా ధార్మికంగా అతడు జాగ్రత్తపడతాడు. అంతేకాదు - ఆయన గమనించుకుంటున్నాడు కనుక, దేనికీ వెరవకుండా ధైర్యంగా, అభయస్థితిలో ఉంటాడు. ఇలా ధర్మనిష్ఠనీ, అభయాన్నీ ఇవ్వగలిగే సత్యస్ఫురణ ఈ వేదవాక్యంలో విశదమవుతోంది.


🪷 _*'సందృశం'*_ అనే మాటకు ముందు 'సు' అనే శబ్దం కూడా ఉంది. ఈ 'సు' శబ్దానికి శుభం, క్షేమం, మంచి, చక్కని... అని అర్థాలున్నాయి. స్వామి చూపులు శుభమైనవి, క్షేమమైనవి, ప్రసన్నమైనవి, సౌందర్యవంతమైనవి.... అని అర్థాలు గ్రహించవచ్చు♪. స్వామి దర్శనశక్తి జగతికి క్షేమాన్నీ, మంగళాన్నీ కలిగిస్తోంది♪.


🪷 ఈ భావాన్ని మరింతగా బలపరుస్తూ 'మఘవన్' అనే మాట ఉన్నది♪. పూజ్యుడు, యజ్ఞస్వరూపుడు అనే అర్థాలను ఈ మాటకు చెప్పుకోవచ్చు♪.


🙏 _*లోకహితానికై భగవానుడు చేసే విశ్వనిర్వహణయే యజ్ఞం. అదే ఆయన స్వరూపం. హితాన్ని కలిగించే శోభనమైన సమగ్రదృష్టి కలిగిన అనంత శక్తిసంపన్నుడు ఈశ్వరుడు♪.*_


🪷 అటువంటి పరమేశ్వరుని సభక్తికంగా నమస్కరించి, ఆయన కృపకు పాత్రులమవడమే మన విధి♪.


🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏

తిప్పతీగ ఉపయోగాలు

 తిప్పతీగ ఉపయోగాలు - సంపూర్ణ వివరణ .


తిప్పతీగ అనునది ప్రతి వూరు డొంకలలో పెరుగుతుంది . దీనిని సంస్కృతంలో " గుడూచీ" అని పిలుస్తారు . దీనికి అర్థం వ్యాధుల నుండి రక్షించునది అని అర్థం. " అమృత" అనే పేరు కూడా దీనికి కలదు. అనగా అమృతమునకు సమానం అయినది అని అర్థం. ఇప్పుడు మీకు దీనిలోని ఔషధ గుణముల గురించి మీకు వివరిస్తాను.


తిప్పతీగ యందలి ఔషధ గుణములు -


• ఇది వాత , పిత్త , కఫ దోషముల మూడింటి మీద పనిచేస్తుంది . బలకరము , ఆకలిని పెంచుతుంది . మెదడుకు మంచిది . నేత్రములకు బలాన్ని ఇచ్చును. పాండు , కామెర్లు , జ్వరము , మూత్రవ్యాధులు , కుష్ఠు , దగ్గు మొదలగు వ్యాధులను పోగొట్టును . కడుపులోని నులిపురుగులను నశింపచేయును . తల్లిపాలను శుద్ధిచేయును .


• జ్వరములలో తిప్పతీగ కషాయం 20ml ఉదయము , సాయంత్రం ఇచ్చిన జ్వరములు తగ్గును.


• మూత్రసంబంధ వ్యాధులలో తిప్పతీగ రసములో తేనె కలిపి ఇవ్వాలి. కామెర్ల యందు కూడా తిప్పతీగ రసములో ప్రతిరోజూ తేనె కలిపి ఇచ్చిన కామెర్ల సమస్య తగ్గును.



• కీళ్లనొప్పుల యందు తిప్పతీగ , శొంఠి కలిపి ఇచ్చిన కీళ్లనొప్పులు తగ్గును.


• ప్రతిరోజూ తిప్పతీగ రసం తాగించి రోగి బలానుసారం కందికట్టులో నెయ్యి చేర్చిన అన్నము తినుచున్న కుష్ఠు వ్యాధి తగ్గును.


• తిప్పతీగ రసమును ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం ఒక నెలరోజుల పాటు సేవిస్తే ఏ వ్యాధులు రాకుండా , ముసలితనం రాకుండా మానవుడు ఆరోగ్యముగా ఉండును.


• తిప్పతీగ చూర్ణము , బెల్లం , నెయ్యి , తేనె కలిపి ముద్దగా చేసి ఉండలా చేసి రోజూ ఒక ఉండ తింటే మానవుడు ఆరోగ్యముగా 100 సంవత్సరాలు జీవిస్తాడు.


• తిప్పతీగ రసం కొద్దిగా నూనెలో కలిపి తాగిన బోదకాలు తగ్గును.


• తిప్పతీగ కషాయంలో పిప్పలి చూర్ణం కలిపి ఇచ్చిన చాలా రోజుల నుంచి వేధిస్తున్న జీర్ణజ్వరం తగ్గును.


• తిప్పతీగ కషాయం ప్రతిరోజూ సేవించిన మధుమేహం తగ్గును. మూత్రాశయపు రాళ్లు కూడా కరిగిస్తుంది.


• మొలల సమస్య ఉన్నవారు తిప్పతీగ స్వరసాన్ని మజ్జిగతో కలిపి వాడవలెను .


• తిప్పతీగ కషాయాన్ని సేవించిన వాంతులు తగ్గును.



ఆయుర్వేద ఔషధాలు

   ఆయుర్వేద ఔషధాలు సేకరించే విధానము -


ఆయుర్వేదం ఔషధాలను ఒక ప్రత్యేక మయిన పరిస్థితులు , ఒక నిర్దిష్టమైన సమయం లొ మాత్రమే ఔషదులని గ్రహించాలి. అటువంటి ఔషధాలు మాత్రమే పరిపూర్ణం గా పనిచేస్తాయి.

ఔషధాలు ఎంత శక్తివంతం గా పనిచేస్తాయి అనేది ఆ ఔషధి ఉన్నటువంటి నేల కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి ఔషధాలను జాగ్రత్తగా తీసుకుని వచ్చి వాడినప్పుడే శరీరం పైన వాటి ప్రభావాన్ని బలం గా చూపిస్తాయి.


  ఔషధాలు సేకరించు స్థలం -


ఋతువులు సరిగా ఏర్పడుతూ ఉండాలి. వెన్నెల, నీరు , గాలి కాలానుసారం గా ఉండాలి. అట్టి స్థలం లొ ప్రదిక్షణం గా ప్రవహించుచున్న నీరు కలిగి ఉండి దర్భ మొదలయిన మొక్కలచే వ్యాపించి అట్టి మన్ను నల్లగా కానీ బంగారు రంగులొ కలిగి ఉన్నది అయ్యి సువాసనలుతో కుడుకొని ఉన్నది అయి ఉండాలి. అచ్చట గండ్ర ఇసుక, చౌడు, గులక రాళ్లు , గోతులు, పుట్టలు మొదలయినవి ఉండకుడదు. మరియు అచ్చటి భూమి రాజవీధి , స్మశానం, ఇండ్లు, రచ్చబండ, ఉద్యానవనం వీటి సమీపం లొ ఉండకుడదు. నాగలిచే దున్నబడక వృక్షములను ఆవరించి ఉండవలెను.

పురుగులు కలదియు, సర్వ కాలంబులు నీరుచే వ్యాప్థమైపొయి , పూర్వం చెప్పిన గుణములు లేనిది అయ్యి, పిశాచములు కలిగి ఉన్న భూమిలో పుట్టిన ఔషధాలు పనికి రావు . విస్తారంగా స్థూల వృక్షాలు, గసువు, పైరు మొదలగు వానిచే ఉండి గట్టిగా ఉండి, బరువు కలిగి అనేక పాషానాలతో ఉండి శ్యామల వర్ణం కలిగి, నల్లని వర్ణం కలిగిన భూమి లొ చాలా అదిక గుణం కలిగిన ఔషధాలు ఉండును. భూమి యెక్క గుణం ఏ విదంగా ఉండునో ఆ ఔషధీ గూడా అదే విదంగా ఉండును.


• భూమి గుణాలు -


   పృథ్వి, ఉదక గుణములు కలిగిన భూమి యందు పుట్టిన ఔషధాలు విరేచానకారులు అవును. ఆకాశ గుణం కలిగిన భూమి యందు పుట్టిన ఔషధాలు వమన కారిణి గా ఉంటాయి. పంచ భూతముల లక్షణాలు కలిగిన భూమి లొ పుట్టిన ఔషధాలు వమన కారిణులు , విరేచన కారిణులు అవును.


• ఔషధాలు సేకరించే విదానం -


     ఔషధాలను సేకరించాలి అనుకున్న వైద్యుడు పూర్వపు రోజున ఉపవాసం ఉండి పవిత్రుడి గా ఉండి దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, బ్రహ్మ్మను, దక్షప్రజపతిని , అశ్విని దేవతలను పూజించి నాలుగు దిశలలో బలి ని సమర్పించి ఆ ఔషధిని ఆశ్రయించి ఉండు సమస్త దేవతలను గూర్చి " ఓ దేవతలారా నన్ను నిరపరాధుని చేసి మీరు ఆశ్రయించి ఉండు ఈ ఔషధిని విడిచి పొండు సర్వ ప్రాణ కోటికి జీవ పదార్ధంబైన ఈ ఔషధిని నేను గ్రహించేదను. మరియు ఓ దేవతలారా నేను ఈ ఔషధిని లోభం కొసం గ్రహించడం లేదు . ప్రధానం గా బ్రాహ్మ్మన రక్షణార్ధం అని ప్రార్ధించి నానా వర్ణములు గల దారాలతో ఆ ఔషధానికి రక్షాబంధనం చేసి పిమ్మట గృహమునకు పోవలెను.

           మరునాడు తను రక్షాబంధనం కట్టిన ఔషధి దగ్గరికి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించ వలెను. తాను కట్టిన రక్షాబంధం పూర్వం వలె ఉండి అక్కడ మరేటువంటి వికారములు లేకుండుట చూచి బ్రహ్మ్మనుల చేత స్వస్తివాచకం చెప్పించుకొనుచూ అక్కడికి వచ్చి సూర్యుడు ఉదయించి నడినెత్తికి రాగా "ఖనన మంత్రం " ప్రకారం ఆ ఔషధి యెక్క తూర్పు వైపు బారిన వేరును అయినా ఉత్తరం వైపు బారిన వేరును అయినా తవ్వవలెను.


• ఖనన మంత్రం -


    ఔషధి కొసం తవ్వేప్పుడు ఖనన మంత్రం ఖచ్చితం గా పటించాలి ." బ్రహ్మ, విష్ణు వుని యే హస్తం చే తవ్వేధరో అట్టి అయిదు వేళ్ళు గల చేతితో నిన్ను తవ్వేదను". ఇదియే ఖనన మంత్రం. దీని చేత ముందు చెప్పిన ప్రకారం తవ్వాలి.


• గ్రహణ మంత్రం -

   

      "మంగళ కరం అగు ఔషధి నీకు నమస్కారం .మీకు శుభం ఔషదులార . బలవంతం లగుదురు కాక .ఒక్కోనియందు వీర్యం కలగ చేయుడు .మీకు ప్రార్దిన్చేదను అని మంత్రం చెప్పి ఔషధిని పట్టుకోవలెను.


• ఔషధిని పుచ్చుకునే ముందు మంత్రం


  ఔషధి శ్రేష్టమ మంగళం విగ్నం లను మిక్కిలి దహించుము . మిక్కిలి నశింప చేయుము . మిక్కిలి చీల్చుము. నీకు నమస్కారము. అని ఈ మంత్రం చెప్పి ఔషధిని లొపలికి పుచ్చుకోవలెను.


• వ్యర్ధ ఔషధాలు -


      పురుగు కుట్టినది. నీటిలో మునిగినది. మేకలు తినినది. పిశాచముల చేత వికారం పొందింది. ఎల్లప్పుడు నీడనే ఉన్నది. నీటిచేత తడియక ఎండినది . చెట్ల సందుల ఎందు ఉండినది. నడిచే దారిలో ఉన్నది. పది మందికి తెలిసినది సారం లేనిది గాని ఔషధములు వాడ రాదు. ఒకవేళ వాడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే చంద్రగ్రహణ సమయం లొ , మరియొక రాత్రులలో గానీ మూలికలు గ్రహింప కూడదు .


• ములికలు గ్రహింప వలసిన కాలం -


వర్ష ఋతువు నందు కొమ్మలు, వసంత ఋతువు నందు చిగురుటాకులు, శిశిర ఋతువు నందు , గ్రీష్మ ఋతువు నందు పండుటాకులను , మొలకెత్తు ఆకులను, మూలములను గ్రహించాలి.



రుణానుబంధరూపేణ

 రుణానుబంధరూపేణ పశు పత్నీ సుతాలయాః ।

రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా ॥


తాత్పర్యం:

పూర్వకర్మల వల్ల ఏర్పడిన రుణానుబంధాలే ఈ జన్మలో బంధాలుగా కనిపిస్తాయి. ఆ రుణం తీరిన క్షణం, ఆ బంధం కూడా ముగుస్తుంది. అందుకే కలయికకైనా... విడిపోవడానికైనా... అతిగా శోకించవద్దని ఋషులు హెచ్చరించారు.


---


ఈ లోకం కోసం నువ్వు పుట్టలేదు...

నీ కర్మను అనుభవించడానికి ఈ లోకమే నీ చుట్టూ అల్లబడింది.


తల్లిదండ్రులు...

భార్య... భర్త...

పిల్లలు...

బంధువులు...

స్నేహితులు...

శత్రువులు కూడా...


వీరిలో ఒక్కరూ యాదృచ్ఛికంగా రాలేదు.


నీ కర్మఫలాన్ని నీకు అందించడానికి వచ్చిన పాత్రలు మాత్రమే.


ఎవరు ప్రేమ ఇస్తారో...

ఎవరు బాధ ఇస్తారో...

ఎవరు గౌరవిస్తారో...

ఎవరు అవమానిస్తారో...


అన్నీ నీ పూర్వకర్మల ప్రతిధ్వనులే.


"వీళ్లు నావాళ్లు" అనేది మనసు సృష్టించిన మాయ.

"వాళ్లు నా జీవితమే" అనేది అహంకారం చెప్పే అబద్ధం.


చివరికి...


నీతో రానిది సంపద.

నీతో రానిది బంధం.

నీతో రానిది పేరు, ప్రతిష్ఠ.


నీతో వచ్చేది...

నీతో వెళ్లేది...

నీకు ఫలితాన్ని ఇచ్చేది...


నీ కర్మ మాత్రమే.


భగవంతుడు ఎవరికీ అన్యాయం చేయడు...


ఆయన నీ జీవితంతో ఆట ఆడటం లేదు.

నీ కర్మకు తగిన ఫలితాన్ని అందించే అవకాశాలను మాత్రమే నీ ముందుంచుతున్నాడు.


అందుకే...


ఏదీ శాశ్వతమైన గెలుపు కాదు...

ఏదీ శాశ్వతమైన ఓటమి కాదు...

ఏదీ శాశ్వతమైన బంధం కాదు...


ఇది అంతా...


కర్మ అనే మహానాటకంలో ఒక క్షణం మాత్రమే.


బంధాల మీద కాదు...

కర్మ మీద దృష్టి పెట్టు.


ఎందుకంటే...

బంధాలు మారిపోతాయి.

కర్మ మాత్రం నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు.


> "నీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి...

నిన్ను ప్రేమించడానికి కాదు, ద్వేషించడానికి కాదు...

నీ కర్మఫలాన్ని అందించడానికి మాత్రమే వచ్చాడు.

అది పూర్తయిన రోరుణానుబంధరూపేణ పశు పత్నీ సుతాలయాః ।

రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా ॥


తాత్పర్యం:

పూర్వకర్మల వల్ల ఏర్పడిన రుణానుబంధాలే ఈ జన్మలో బంధాలుగా కనిపిస్తాయి. ఆ రుణం తీరిన క్షణం, ఆ బంధం కూడా ముగుస్తుంది. అందుకే కలయికకైనా... విడిపోవడానికైనా... అతిగా శోకించవద్దని ఋషులు హెచ్చరించారు.


---


ఈ లోకం కోసం నువ్వు పుట్టలేదు...

నీ కర్మను అనుభవించడానికి ఈ లోకమే నీ చుట్టూ అల్లబడింది.


తల్లిదండ్రులు...

భార్య... భర్త...

పిల్లలు...

బంధువులు...

స్నేహితులు...

శత్రువులు కూడా...


వీరిలో ఒక్కరూ యాదృచ్ఛికంగా రాలేదు.


నీ కర్మఫలాన్ని నీకు అందించడానికి వచ్చిన పాత్రలు మాత్రమే.


ఎవరు ప్రేమ ఇస్తారో...

ఎవరు బాధ ఇస్తారో...

ఎవరు గౌరవిస్తారో...

ఎవరు అవమానిస్తారో...


అన్నీ నీ పూర్వకర్మల ప్రతిధ్వనులే.


"వీళ్లు నావాళ్లు" అనేది మనసు సృష్టించిన మాయ.

"వాళ్లు నా జీవితమే" అనేది అహంకారం చెప్పే అబద్ధం.


చివరికి...


నీతో రానిది సంపద.

నీతో రానిది బంధం.

నీతో రానిది పేరు, ప్రతిష్ఠ.


నీతో వచ్చేది...

నీతో వెళ్లేది...

నీకు ఫలితాన్ని ఇచ్చేది...


నీ కర్మ మాత్రమే.


భగవంతుడు ఎవరికీ అన్యాయం చేయడు...


ఆయన నీ జీవితంతో ఆట ఆడటం లేదు.

నీ కర్మకు తగిన ఫలితాన్ని అందించే అవకాశాలను మాత్రమే నీ ముందుంచుతున్నాడు.


అందుకే...


ఏదీ శాశ్వతమైన గెలుపు కాదు...

ఏదీ శాశ్వతమైన ఓటమి కాదు...

ఏదీ శాశ్వతమైన బంధం కాదు...


ఇది అంతా...


కర్మ అనే మహానాటకంలో ఒక క్షణం మాత్రమే.


బంధాల మీద కాదు...

కర్మ మీద దృష్టి పెట్టు.


ఎందుకంటే...

బంధాలు మారిపోతాయి.

కర్మ మాత్రం నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు.


> "నీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి...

నిన్ను ప్రేమించడానికి కాదు, ద్వేషించడానికి కాదు...

నీ కర్మఫలాన్ని అందించడానికి మాత్రమే వచ్చాడు.

అది పూర్తయిన రోజు...

అతను వెళ్లిపోతాడు.

కాబట్టి బంధాలను కాదు... కర్మను అర్థం చేసుకోజు...

అతను వెళ్లిపోతాడు.

కాబట్టి బంధాలను కాదు... కర్మను అర్థం చేసుకో