🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*సోమవారం 13 ఏప్రిల్ 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *56వ భాగం*``
*వామనావతారం*
బలి చక్రవర్తి మూడు అడుగుల దానం -
వామనుడు బలిని సుతలానికి పంపి స్వర్గలోకం ఇంద్రునికి అప్పగించుట..```
వామనుడు జగత్తు అంతా ఆశ్చర్యం, ఆనందంగా చూస్తుంటే నడుస్తూ
బలి చక్రవర్తి యాగ ప్రదేశానికి చేరుకున్నాడు.
తేజస్సుతో ప్రకాశిస్తూ వస్తున్న బాల వటువుని చూసి యాగశాలలో అందరు విష్ణువో శివుడో సూర్యుడో లేక అగ్నిదేవుడో బాలకుని రూపంలో వస్తున్నాడని అనుకున్నారు.
ఋషులు, మహర్షులు, ఋత్వికులు, అతిథులు, రాజ భటులు
ఆ వామన మోహన రూపం చూసి ఆనందం చెందుతున్నారు. ఎవ్వరు ఆపటం లేదు, అడగటం లేదు. వామనుడు మోహన రూపంతో, ముద్దు ముద్దు మాటలతో అందరిని పలకరిస్తూ, నవ్వ్వుతూ ముందుకు వెళ్ళాడు.
బలి చక్రవర్తి బాలవటువుని చూసి విస్మయం చెందాడు. ‘భగవంతుడే
ఈ రూపంలో రాలేదు కదా?’ అని అనుకున్నాడు. వామనుడు
తన లేత చేతులతో బలిని ఆశీర్వదించాడు.
బలి చక్రవర్తి సతీమణి వింధ్యావళి బాల వటువుని చూసి ముచ్చటపడి దగ్గరకు తీసుకుంది. దంపతులిరువురు వామనుని సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్లెంలో పాదాలుంచి, వింధ్యావళి నీరు పోస్తుంటే పాదాలు కడిగి నీళ్ళు నెత్తిన చల్లుకున్నారు. మెత్తటి వస్త్రంతో పాదాలు తుడిచి శుభ్రపరిచాడు.
రాక్షస గురువు శుక్రచార్యుడు యజ్ఞస్థలి నుంచి అప్పుడే వచ్చి బలి దంపతుల చేత పూజించ బడుతున్న వామనుని చూసాడు. బాలుని దివ్య తేజస్సు చూడగానే అనుమానం వచ్చింది. బాలుని రూపంలో విష్ణువు బలి చక్రవర్తిని మోసం చేయడానికి వచ్చి ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి" అని వామనుని గమనించసాగాడు.
బలి చక్రవర్తి వామనునితో.. "బాల బ్రాహ్మణా! బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్న నీ ఆశీస్సులు పొంది నా జన్మ ధన్యమైంది. ఎవరు నీవు? ఎక్కడ నుంచి వచ్చావు? నీవేమి అడిగినా దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ధనమా, గోవులా, బంగారమా, రత్నాలా, భూములా లేక వేరే ఏమన్నా మనస్సులో ఉంటే చెప్పుము. తప్పక ఇస్తాను" అన్నాడు.
బాల వటువు నవ్వుతూ "నా నామధేయం వామనుడు. బాల బ్రహ్మచారిని. అందరు నా వాళ్లు అయినా నేను మాత్రం ఒంటరి వాడిని. ఒక చోట ఉండక విశ్వమంతా తిరుగుతుంటాను. నాకు ధన సంపదలు వస్తు వాహనాలు స్వర్ణ రత్నాదుల పై మోజు లేదు. అయినా మంచివాడవైన నీవు అడుగుతున్నావు కాబట్టి ఒక్క చిన్న కోరిక కోరుతాను. ఇదే నా తొలి మరియు తుది కోరిక. సాధ్యమైతే ఇవ్వు లేదన్నా పర్వాలేదు. నాకు మూడు అడుగుల నేల దానంగా ఇవ్వు! చాలు" అని కోరాడు.
బలి చక్రవర్తికి వామనుడి కోరిక విని నవ్వు, కోపము రెండూ వచ్చాయి. "ముల్లోకాల చక్రవర్తినైన నన్ను మూడు అడుగుల నేల అడుగుతావా? దాత గొప్పదనాన్ని గమనించి అడగాలి అని తెలియదా! నీ కోరిక వినడానికే సిగ్గుగా ఉంది" అన్నాడు.
వామనుడు నవ్వుతూ "నీవు సర్వస్వం అడిగినా ఇవ్వగల మహాదాతవని నాకు తెలుసును! కానీ నేను బాలుడిని! బ్రహ్మచారిని. నాకు మూడడుగుల నేల దానం చాలు. సరిపోతుంది" అని అన్నాడు.
వామనుడి వింత కోరిక విన్న శుక్రచార్యుడికి అనుమానం బలపడింది. వచ్చింది విష్ణువే అనుకుని బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి "రాజా! విష్ణువే ఈ బాల వటువు రూపంలో వచ్చాడు. మూడు అడుగులు నీవు దానమిస్తే ముల్లోకాలు ఆక్రమిస్తాడు. దానం ఇవ్వవద్దు" అని హెచ్చరించాడు.
బలి చక్రవర్తి తిరస్కరిస్తూ "ఆచార్యా! మూడు అడుగులు నేల దానమివ్వలేని అసమర్థుడు అనే చెడ్డ పేరు నాకు వద్దు. మీరన్నట్టు శ్రీహరే ఈ రూపంలో దానమడిగితే అది నాకు గౌరవం, గొప్పదనం తెస్తుంది. భగవంతునికే దానమిచ్చిన దాతగా నా పేరు చిరస్థాయిగా నిలుస్తుంది" అనడంతో శుక్రచార్యుడు కోపగించి "గురువు మాట కాదన్నందుకు రాజభ్రష్టుడివి అవుతావు" అని పలికాడు.
అయినా దానమాపడానికి శుక్రచార్యుడు ఆఖరి ప్రయత్నంగా బలి వామనునికి దానమివ్వడానికి నీరు పోసే కమండలంలో సూక్ష్మరూపంతో నీరు పడకుండా అడ్డుగా నిలిచాడు.
వామనుడు గమనించి దర్భపుల్లతో లోపలికి పొడిచాడు. అది శుక్రచార్యుడి కన్నుకి గుచ్ఛుకుంది. బాధతో అరుస్తూ మాయమయ్యాడు. నాటి నుండి శుక్రచార్యుడు ఒక కన్ను పోయి ఒంటి కన్నుతో జీవించాడు.
బలి చక్రవర్తి మూడడుగుల నేలను శాస్త్రోక్తంగా వామనుడి చేతిలో నీరు పోస్తూ దానమిచ్చాడు. మరుక్షణం అద్భుత సంఘటన జరిగింది. బలి చక్రవర్తి, అక్కడి వారు ఆశ్చర్యంగా చూస్తుండగా వామనుడు తన శరీరం పెంచి త్రివిక్రముడు అయ్యి ఆకాశం అంచులు తగిలేంత ఎత్తుకి ఎదిగాడు. ఒక పాదముతో భూమిని, మరొక పాదముతో ఆకాశాన్ని ఆక్రమించాడు.
బలిని చూసి “నీ విచ్చిన మూడడుగులలో రెండు అడుగులకు భూమి ఆకాశం సరిపోయాయి. మరి నా మూడో అడుగుకి నేల ఎక్కడ ఉంది?" అని అడిగాడు.
బలి చక్రవర్తి మోకాళ్ల పైనుంచుని నమస్కరిస్తూ "బ్రాహ్మణ దేవా! నీవు మహావిష్ణువు అని తెలుసుకున్నాను. అయినా నేను ఇచ్చిన మాట తప్పను.
నీ మూడో అడుగు నా శిరస్సు పై ఉంచుము" అని తల వంచాడు.
బలి చక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు అక్కడకు వచ్చి "నారాయణా! నా మనవడు బలి నీ భక్తుడు. నీవే ఇంద్రపదవి ఇచ్చావు. ఇప్పుడు మరల నీవే తీసుకుంటున్నావు. పదవితో వచ్చిన అహంకారాన్ని తొలగించి కరుణించుము" అని ప్రార్ధించాడు.
బలి చక్రవర్తి అర్థాంగి వింధ్యావళి పతి భిక్ష పెట్టమని ప్రార్ధించింది.
త్రివిక్రముడు నారాయణుడు బలి చక్రవర్తి సత్య సంధతను ప్రశంసిస్తూ "బలి చక్రవర్తీ! నీవు నా ప్రియభక్తుడవి. మూడో అడుగు నీ శిరస్సు పై ఉంచి నిన్ను సుతలానికి పంపుతాను. అక్కడ నీకు సంరక్షణగా ఉండి రక్షిస్తాను. స్వర్గము కన్నా సుఖమైన సుతలంలో సుఖంగా జీవించుము. భవిష్యత్తులో సావర్ణి మనువు కాలంలో నీకు ఇంద్రపదవి మరల లభిస్తుంది. ఆ తరువాత నీవు నా సన్నిధికి చేరుకుంటావు" అని బలిని తన పాదము అతని శిరస్సు పై ఉంచి పాతాళలోకమైన సుతలానికి పంపివేశాడు.
ఇంద్రాదులకు స్వర్గలోకం ఇచ్చి వేశాడు. వామనావతార ఉద్దేశం నెరవేరడంతో నారాయణుడై వైకుంఠం చేరుకున్నాడు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏