🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*మంగళవారం 24 ఫిబ్రవరి 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*7వ భాగం*
*మధుకైటభ సంహారం:```
విష్ణమాయను ఆవాహింప చేసుకున్న శ్రీమహావిష్ణువు అనేక వేల సంవత్సరాలు యోగ నిద్రలోకి వెళ్లి పోయాడు. కొన్ని వేల సంవత్సరాల నిద్ర తరువాత శ్రీమహావిష్ణువు ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి ఒక శబ్దం ఉత్పన్నమైంది. ఆ శబ్దం క్రమక్రమంగా ఓంకారంగా మారి ప్రణవ నాదమయ్యింది. ప్రణవనాద శబ్దానికి సృష్టికర్త, అయ్యాడు కనుక విష్ణువు "శబ్దబ్రహ్మ". అయ్యాడు. ఈ ఓంకార శబ్దం నుండి శబ్దరూప మైన వేదము ఆవిర్భవించింది. కనుక మహావిష్ణువు వేదమూల మైన "వేద బ్రహ్మ" గా ప్రసిద్ది పొందాడు.
వేదము ఉచ్ఛ్వాస నిశ్వాసగా చేసుకుని నిద్రిస్తున్న విష్ణువు నాభి నుంచి ఒక పుష్పకాండము జనించి పెరగసాగింది. ఆ కాండము పైన ఒక మొగ్గ ఏర్పడి పుష్పించి మహా పద్మము అయ్యింది. పదహారు రేకులు గల ఆ మహా పద్మము ప్రకృతికి ప్రతిరూపమైనది. యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు మాయా మోహితుడై ఉండడం వలన అతని శరీరం నుండి ఒక భ్రమరం జనించింది. తుమ్మెద రూపం దాల్చిన మహావిష్ణువు మహా పద్మము వాలి ప్రణవనాదము చేస్తూ పద్మముతో సంపర్కమయాడు. పురుషుడు ప్రకృతి సంపర్కం వలన పద్మము నుండి విష్ణు తేజస్సుతో చతుర్ముఖుడు, చతుర్భుజుడు బంగారు ఛాయ శరీరంతో పద్మసంభవుడు జన్మించాడు. ఉదరములో పుట్టుకతోనే హిరణ్యము కలిగి ఉండటం వలన హిరణ్యగర్భుడు అయ్యాడు. పరబ్రహ్మము తేజస్సు నుండి పుట్టిన పరబ్రహ్మ పుత్రుడు "బ్రహ్మ" అయ్యాడు.
జన్మించిన బ్రహ్మదేవుడు నాలుగువైపుల నాలుగు ముఖాలతో చూశాడు. అన్ని వైపుల నీరే కనిపించింది. పదహారు రేకులు గలిగి మహాపద్మములో ఆసీనుడైన బ్రహ్మ పద్మము యొక్క కాండము వైపు చూశాడు. నూరుయోజనాల వరకు దూరం కాండము కింద వైపు కలిగివుంది. "చుట్టూ జలం ఉన్నప్పుడు తను ఎలాజన్మించాడు" అనే సందేహం బ్రహ్మకు కలిగింది.
సమాధానంగా ఓంకారనాదము వినిపించ సాగింది. ఈఓంకారము జపిస్తే తన జన్మరహస్యం తెలియవచ్చు అని అనిపించి ఓంకారము జపిస్తూ ధ్యాన నిష్టలో మునిగి పోయాడు.. అనేక సంవత్సరాల జపం తరువాత బ్రహ్మదేవునికి దివ్య దృష్టి లభించింది. దివ్యదృష్టితో తన జన్మకు కారకుడైన శ్రీమహావిష్ణువు అనంత జలరాశి పై యోగనిద్రలో కనపడ్డాడు.
అశరీరవాణి శయనిస్తున్న నారాయణుడే నీ తండ్రి అని పలికింది. తన తండ్రిని చూసిన ఆనందంతో బ్రహ్మదేవుడు చేతులు జోడించి భక్తి శ్రద్థలతో నమస్కరించాడు. ఆయన ముఖం వెంట "ఓం నమో నారాయణాయ" అని అష్టాక్షరి మంత్రం పుట్టుకు వచ్చింది. వెంటనే ఆ మంత్రంతో తపస్సు చేయి" అన్నట్టు "తపః తపః" అనే ఆదేశం వినిపించింది.
హిరణ్యగర్భుడు నారాయణమంత్రం జపిస్తూ వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు. అయినా తన జన్మకారణం, తనకర్తవ్యం తెలియరాలేదు. చుట్టూ మహాజలథి మాత్రమే కన్పిస్తోంది. దివ్యదృష్టితో కనిపించిన తన తండ్రి నారాయణుడు ఎక్కడ ఉన్నాడు? ఆయనను కలసే మార్గం ఏది?" అనుకుంటూ చింతాక్రాంతుడైనాడు.
అదే సమయంలో చాలా కాలము యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు చెవులలో ఏర్పడిన గుబిలి జలప్రవాహము తాకిడి వలన చెవుల నుండి బయటకు వచ్చింది. విష్ణువుని ఆవరించిన యోగమాయ స్పర్శతో ఆ గుబిలి రూపాలు పొంది మధు కైటభులు అనే కవల రాక్షస సోదరులుగా జన్మించారు. గుబిలి మాలిన్యంతో నల్లని శరీరము పొందిన వారు "మేము ఎవరం? మా నామధేయాలు ఏమిటి?" అని గట్టిగా అరవసాగారు.
అశరీరవాణి వారితో "మీరు పరబ్రహ్మ చెవి గుబిలి నుండి జన్మించారు. మీ నామధేయాలు మధు కైటభులు. మీకు స్వేచ్ఛా మరణం వరంగా లభించింది" అని పలికింది.
వారు అహంకారం పొంది "మమ్మలి ఎదిరించే వారు ఎవరైనా ఉన్నారా!" అంటూ సవాలు చేస్తూ నీటిలో ఈదుతూ ముందుకెళ్ళారు. వంద యోజనాల దూరం వెళ్లగా ఒక మహాపద్మం కనిపించింది. ఆ పద్మము నుండి "ఓం నమో నారాయణాయ" అని జపము చేస్తున్న శబ్దం వినిపించ సాగింది.
మధు కైటభులు కాండము పట్టుకుని పైకెక్కి బ్రహ్మ ఎదుట నిలుచున్నారు. ధ్యానభంగం కలిగిన బ్రహ్మ కన్నులు తెరచి మధుకైటభులను చూసి ఆశ్చర్యపడ్డాడు. జన్మించిన పిమ్మట తండ్రి మహావిష్ణువు తరువాత చూసినది ఈ ఇరువురు దేహధారులనే. బ్రహ్మ సంశయం తీరుస్తూ "మేము మధుకైటభులము. స్వేచ్ఛామరణం వరంగా పొందాము. నీతో యుద్దం చేసి మా బలం నిరూపించుకుంటాము. ఇంతకీ నీవెవరు?" అని అడిగారు.
బ్రహ్మ "నేను చతుర్ముఖ బ్రహ్మను. పరబ్రహ్మమైన నారాయణుడు నా తండ్రి. నా జన్మకి కారణం, నా కర్తవ్యం తెలుసుకోవాలని తపస్సు చేస్తున్నాను. కనుక మీతో యుద్దం చేయలేను" అనడంతో మధుకైటభులు "అయితే మీ తండ్రి ఎక్కడో చెప్పు! ఆయనతోనే యుద్దం చేస్తాం" అన్నారు.
బ్రహ్మ నిట్టూర్చి "నా తండ్రి నారాయణుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. నారాయణ మంత్రం జపించడం వలన లభించిన దివ్యదృష్టితో ఒక్కసారి మాత్రమే చూడగలిగాను" అని సమాధాన మిచ్చాడు.
"అయితే మంత్రం మాకు ఉపదేశించు! మేము ఆయన దర్శనం పొంది యుద్దం చేస్తాము" అని మధుకైటభులు అనడంతో బ్రహ్మ "తాను సృష్టించిన నారాయణ మంత్రం మరొకరికి ఉపదేశం చేసి గురు స్థానం పొందుతున్నాడు" అని సంతోషపడ్డాడు.
అష్టాక్షరి మంత్రాన్ని మధుకైటభులకు ఉపదేశించాడు. నారాయణ మంత్రం జపం చేస్తూ వేల సంవత్సరాలు గడిపారు. తాము జపించేది ముక్తి ప్రసాదించే దివ్య మంత్రం అని వారికి తెలియదు.
మంత్రసిద్ధి లభించడంతో వారు బ్రహ్మను వదలి నారాయణుడు ఉండే ప్రదేశానికి వెళ్ళారు. నారాయణుడు నిద్ర లేచి వీరిని చూశాడు. "మేము నీతో యుద్దం చేయాలని మంత్రం జపం చేసాము. మాతో యుద్దం చేయి" అని మధుకైటభులు కోరిన కోరికకు అంగీకరించి విష్ణువు యుద్దానికే సిద్దమయ్యాడు.
యుద్ధం ప్రారంభమై ఐదువేల సంవత్సరాలు గడిచాయి. ఎవరికీ విజయం లభించలేదు.
మహావిష్ణువు "నారాయణ మంత్రం జపంతో అజేయులైన వీరిని జయించడం సాధ్యం కాదు. ఉపాయంతోనే వీరి సంహారం చేయాలి" అని తలచి వారితో "నాతో ఇంతకాలం పోరాడిన మీ శౌర్యం నాకు నచ్చింది. మీ వీరత్వానికి మెచ్చి వరం ఇస్తాను. కోరుకోండి" అన్నాడు. మధుకైటభులకు విష్ణువు తమ శౌర్యాన్ని పొగిడేసరికే గర్వం కలిగి "మమ్మల్ని జయించ లేని నీవు వరము ఇవ్వటం మేమిటి? మేమే నీకు వరం ఇస్తాము. కోరుకో" అని అహంకారంతో పలికారు.
వెంటనే విష్ణువు "మీరు వరం ఇచ్చేది నిజమైతే, మీరిరువురు నాచేతిలో మరణించేట్టు వరము ఇవ్వండి" అని వరం కోరాడు.
మధుకైటభులు ఉలిక్కిపడ్డారు. తమ అహంకారమే తమ చావు తెచ్చింది అని గ్రహించారు. తప్పించుకునే ఉపాయం ఆలోచించి "నారాయణా! నీవు కోరిన వరం ఇస్తున్నాము. ఆడిన మాట తప్పం. కానీ ఒక నియమము పాటించాలి. నీరు లేని చోట మాత్రమే మమ్మల్ని నీవు సంహరించ గలవు" అన్నారు.
సమస్తం నీటితో నిండి ఉంది కనుక విష్ణువు తమని చంపలేడు అని ధైర్యం వారిది.
విష్ణువు దుర్గాదేవిని మనస్సులో తలచుకుని "దేవీ! మధుకైటభులను సంహరించే శక్తి నాకు ప్రసాదించు!" అని అడిగాడు.
దుర్గాదేవి వెంటనే ఆ మాయాశక్తి ప్రసాదించింది.
విష్ణువు వెంటనే తన ఊరువులను (తొడలను) పెంచి వాటితో మొత్తం నీరు కనపడకుండా ఆక్రమించాడు. మధుకైటభులకు విష్ణువు చేతిలో తమ మరణం తప్పదని అర్థమైంది.
చక్రం ధరించిన విష్ణువు "మీరు కోరుకున్నట్లే నీటిచుక్క లేని నా ఊరువుల పై మిమ్మల్ని చక్రాయుధంతో సంహరిస్తాను" అన్నాడు.
మధుకైటభులని అహంకార మద గర్వాలు వదలి పోయాయి. భక్తితో చేతులు జోడించి "నారాయణా! నీ అష్టాక్షరి మంత్ర జపంతో మేము ధన్యులమయ్యాము. మాకు ఇస్తామన్న వరం ఇచ్చి మమ్మల్ని చరితార్థులని చేయుము" అని కోరారు.
తథాస్తు అని శ్రీమహావిష్ణువు వారిని తన ఊరువులపై తీసుకుని చక్రంతో సంహరించాడు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏