*వందేమాతరం*
*సుఖం కాదు ధర్మమే జీవితాన్ని నిలబెడుతుంది — సీతారాములు నేటి యువతకు ఎందుకు ఆదర్శం?*
సీతారాముల జీవితాన్ని పైపైన చూస్తే నిజంగా ఒక ప్రశ్న మనసులో కలుగుతుంది. ఇంతటి ధర్మమూర్తులు, దేవతావతారాలు అయిన వారికే సుఖం లేకపోతే వారు మనకు ఆదర్శం ఎలా అవుతారు?
ఈ ప్రశ్న చాలా సహజం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఆదర్శ జీవితం అంటే ఏమిటి అనే విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. నేటి ప్రపంచం దృష్టిలో ఆదర్శ జీవితం అంటే, ఎప్పుడూ సంతోషంగా ఉండటం, సమస్యలు లేకపోవడం, సంపద, పేరు, విజయాలు ఉండటం అనే భావిస్తోంది.
దానికి మన సనాతన ధర్మం చెబుతున్న నిర్వచనం ఏమిటంటే, సుఖంలో పొంగి పోకూడదు, దుఃఖంలో కృంగి పోకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నా ధర్మాన్ని విడవకుండా ఉండటమే ఆదర్శ జీవితం. అందుకే రామాయణం ఒక సుఖాంత కావ్యం కాదు, అది ధర్మాంత కావ్యం.
రాముడి అవతారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం రాక్షస సంహారం మాత్రమే కాదు. అది ఒక భాగం మాత్రమే. అసలు లక్ష్యం మానవజీవితానికి ఒక సంపూర్ణ నిర్వచనం ఇవ్వడం. మానవ జీవితంలోని ప్రతి సంబంధంలో, ప్రతి బాధ్యతలో, ప్రతి పరిస్థితిలో ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలో చూపించిన పరిపూర్ణ మనిషి అవతారమే శ్రీరాముడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు.
శ్రీరాముడు తన దైవశక్తిని ఉపయోగించి ఒక్క క్షణంలో సమస్యలు తొలగించగలడు. అయినా ఎందుకు అలా చేయలేదు? ఎందుకంటే ఆయన దేవుడిగా గెలవడానికి రాలేదు. మనిషిగా ఎలా జీవించాలో నేర్పించడానికి వచ్చాడు. అందుకే అమ్మవారితో కలిసి వచ్చాడు.
నేటి కాలంలో, ముఖ్యంగా యువతలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన వ్యాధి శరీరిక వ్యాధి కాదు, బలహీనమైన మనస్సు.
చాలామంది యువత బయటికి సాధారణంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నారు. “నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?”, “దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు?”, “నేను మంచివాడినే కదా మరి నాకు ఎందుకు బాధలు?”, “అసలు దేవుడికే సుఖం లేదు వారి నుంచి మేమేం ఆశించగలం?”, ఇలాంటి ఆలోచనలు వారి మనసును క్రమంగా బలహీనపరుస్తున్నాయి.
ఇది కేవలం భావోద్వేగ సమస్య కాదు.ఇది జీవితాన్ని చూసే దృష్టిలో తేడా. ఎందుకంటే నేటి ప్రపంచం నుంచి యువత ఒక తప్పుడు సందేశాన్ని తీసుకొంటోంది. “జీవితం అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.” “బాధపడితే విఫలమైనట్టే.” “ జీవితంలో సమస్యలు ఉన్నవాడు దురదృష్టవంతుడు”, అంటూ ప్రతీ చిన్న అపజయానికి చాలామంది కూలిపోతున్నారు.
కానీ సనాతన భారతీయ ఋషులు జీవితం గురించి చెప్పిన సత్యాన్ని ఇక్కడ విస్మరిస్తున్నాం. వారు చెప్పింది, “జీవితం అనేది సుఖదుఃఖాల సమ్మేళనం.”
అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు. “మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ।”
చలి, వేడి ఎలా వస్తూ పోతాయో, అలాగే సుఖదుఃఖాలు కూడా వస్తూ పోతుంటాయి. ఇది అర్థం చేసుకోకపోవడం వల్లే మనిషి బాధలో మునిగిపోతాడు.
నిజానికి మనిషిని బాధపెట్టేది సమస్య కాదు, “ఇలా జరగకూడదు” అనే మన అంతర్గత ఘర్షణ. ఇక్కడే రామాయణం మనకు గొప్ప కౌన్సిలర్లా మారుతుంది.
శ్రీరాముడు ఎవరు?, సాక్షాత్తు మహావిష్ణువు అవతారమే కదా?, అయితే మరి ఆయన జీవితంలో ఏమి జరిగింది? పట్టాభిషేకం జరగబోయే రోజే రాజ్యం పోయింది. అరణ్యవాసం వచ్చింది. తండ్రి మరణించాడు. భార్య దూరమైంది. స్నేహితులను కోల్పోయాడు. ప్రజల మాటల కోసం తన వియోగాన్ని భరించి సీతాదేవిని దూరం చేసుకోవలసి వచ్చింది.
ఇక్కడ ఒక అపరిపక్వ మనసు ఎలా ఆలోచిస్తుఃదంటే, దేవుడికే సుఖం లేదు, ఆయన జీవితం అన్యాయాల నిలయం. ఆయన దానిని ఎదుర్కోలేకపోయాడు అని.
కానీ పరిపక్వమైన దృష్టి ఉన్న మనసు ఎలా ఆలోచిస్తుందో తెలుసా?, దేవుడే కష్టాలను ఎదుర్కొని చూపించాడు అంటే, కష్టం జీవితం యొక్క వైఫల్యం కాదు అని చెప్పడానికి.
ఇక్కడే చాలా గొప్ప తేడా. రాముడు కష్టాలను తొలగించడానికి మాత్రమే రాలేదు. కష్టాల మధ్యలో ఎలా నిలబడాలో చూపించడానికి వచ్చాడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు. ఆయన మనకు నేర్పింది, బాధ రాకపోవడం గొప్ప కాదు, బాధ వచ్చినా ధర్మం కోల్పోకపోవడం అనే గొప్పతనం.
ఇనాటి యువతలో ఉన్న ఒక ప్రధాన మానసిక బలహీనత ఏమిటంటే, చాలామంది నేను మంచివాడిని కాబట్టి నాకు చెడు జరగకూడదు అనుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడూ మన మంచితనానికి తక్షణమే ప్రతిఫలం ఇవ్వదు. రాముడు మంచివాడు. హరిశ్చంద్రుడు సత్యవంతుడు, పాండవులు ధర్మవంతులు, ప్రహ్లాదుడు పరమ భక్తుడు. అయినా వారు కష్టాలు అనుభవించారు.
అంటే ధర్మం పాటిస్తే కష్టాలు రావని కాదు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనిషి మానసికంగా కృంగి పోకుండా ఉండే అంతర్గత శక్తి వస్తుంది. ఇదే దైవానుగ్రహం.
మన సమస్య ఏమిటంటే, దేవుడిని మన కోరికలు నెరవేర్చే యంత్రంలా చూస్తున్నాం. కోరిక నెరవేరితే దేవుడు ఉన్నాడు అంటున్నాం. జరగకపోతే దేవుడు ఉన్నాడా, ఉంటే నాకేం చేశాడు? అంటున్నాం. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు. భక్తి అంటే ఒప్పందం కాదు. భక్తి అంటే అంతర్గత బలం.
ఒక్కసారి ఆలోచించండి, రాముడు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా ధర్మాన్ని వదల్లేదు. సీతాదేవి అశోకవాటికలో ఉన్నప్పుడు కూడా ఆశ కోల్పోలేదు. ఇదే భక్తి యొక్క అసలైన అర్థం.
దేవుడిని నమ్ముకుంటే మన జీవితంలో అన్ని సమస్యలు తొలగిస్తాడు అని కాదు. కొన్ని సార్లు సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. నేటి యువత చాలా ప్రమాదకరమైన పోలికలలో పడిపోయింది. బయటకు కనిపించే ఇతరుల జీవితాలను చూసి, వారందరికీ సుఖమే ఉంది. నా జీవితమే అంతా బాధల మయం అని ప్రతి విషయాన్ని ఇతరులతో పోల్చుకోవడం, తనను తాను తక్కువగా ఆలోచించుకోవడం. కానీ ఇది ఒక మాయ. ప్రతి మనిషి లోపల ఒక మానసిక యుద్ధం జరుగుతూ ఉంటుంది. బయట కనిపించేది మాత్రమే సత్యం కాదు అన్న సత్యాన్ని గ్రహించాలి.
రామాయణం నుంచి మన నేర్చుకోవాల్సింది, జీవితం అనేది పోటీ కాదు, ఒక అంతర్గత సాధన. రాముడు నుంచి నేర్చుకోవాల్సింది ఆతని గొప్ప మానసిక సాధన. రాముడు ఎప్పుడూ నాకు ఎందుకు మాత్రమే ఇన్ని కష్టాలు? అనుకోలేదు. ఎందుకంటే ఆయన జీవితాన్ని శిక్షగా చూడలేదు, ధర్మయాత్రగా చూశాడు.
ఎవరైనా, ఎందుకు నాకే?” అని బాధపడితే కృంగిపోతారు. అదే ఈ స్థితి నాకు ఏమి నేర్పిస్తోంది అని చూస్తే ఎదుగుతారు. ఇదే బాధను బలంగా మార్చే రహస్యం. ఇదే మనం రాముడిని నుంచి నేర్చుకోవాల్సింది.
సీతాదేవి జీవితాన్ని కూడా చూడండి. ఆమెకు జీవితంలో జరిగినది చాలా అన్యాయం అని మనకి కూడా అనిపిస్తుంది. కానీ ఆ తల్లిలో ఏనాడు ద్వేషం కనిపించలేదు. ఆమే ఎవరి జీవితాన్ని శపించలేదు, తీవ్రమైన మానసిక పరిస్థితులలో కూడా తన నిగ్రహాన్ని కోల్పోలేదు. ఇదే గొప్ప మానసిక పరిపక్వత.
నేడు ప్రపంచంలో చిన్న అవమానానికే యువత ఇతరులపై ద్వేషం పెంచుకుంటున్నారు. తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. కానీ సీతాదేవి మనకు నేర్పినది ఏమిటి?. బాధ మన హృదయాన్ని కఠినంగా మార్చకూడదు.
రామాయణం నుంచి నేటి యువత మరొక గొప్ప సత్యం తెలుసుకోవాలి. జీవితం ఎప్పుడూ న్యాయంగా ఉండకపోవచ్చు. అది వాస్తవం. కొన్ని సార్లు చెడ్డవాళ్లు సుఖపడుతున్నట్టు కనిపిస్తారు. మంచివాళ్లు బాధపడుతున్నట్టు కనిపిస్తారు. కానీ భారతీయ తత్వం అర్థం చేసుకుంటే, ఆ క్షణం మనకు కనిపించేదే సత్యం కాదు, అదే సంపూర్ణం కాదు.
రామాయణాన్ని ఒక మామూలు కథలా చూస్తే బాధగా ఉంటుంది. కానీ యుగాల దృష్టితో చూస్తే,
రావణుడు శక్తివంతుడు అయినా నశించాడు. రాముడు బాధపడ్డా యుగయుగాలకు ఆదర్శమయ్యాడు. అంటే తాత్కాలిక సుఖం విజయానికి ప్రమాణం కాదు. అంతర్గత విలువలే నిజమైన విజయం.
ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేటి యువతలో చాలామంది మానసికంగా ఎందుకు బలహీనపడుతున్నారు?. ఎందుకంటే, నేటి యాంత్రిక జీవనంలో వారికి బాధను ఎలా ఎదుర్కోవాలి అని ఎవరూ నేర్పించలేదు. నేటి విద్య డబ్బు సంపాదించడం నేర్పింది. కానీ అపజయాన్ని తట్టుకొని నిలబడడం నేర్పించలేదు. నేటి ప్రపంచం విజయాన్ని చూపించింది. కానీ విఫలమైనప్పుడు ఎలా నిలబడాలో నేర్పలేదు.
ఇక్కడే రామాయణాన్ని మనం ఒక మహా గురువుగా చూడాలి. ఏడవచ్చు, బాధపడవచ్చు, నిరాశ రావచ్చు, కానీ మన గమ్యం అక్కడే ఆగిపోకూడదు.
సీతను కోల్పోయినప్పుడు రాముడు కుమిలిపోయాడు, కానీ అక్కడే ఆగిపోలేదు. వెంటనే తేరుకుని లక్ష్యసాధనతో ముందుకు నడిచాడు. హనుమంతుడిని పంపించాడు. సేనను సమీకరించాడు. సేతువు నిర్మించాడు. లంకను చేరాడు. రావణ సంహారం చేశాడు.
ఇదే నేటి యువతకు అత్యంత అవసరమైన సందేశం. విజయుడు అంటే ఎప్పుడూ ఓడిపోని వాడు అని కాదు. పడిపోయినా మళ్ళీ నిలదొక్కుకుని ముందడుగు వేసేవాడు అని తెలుసుకోవాలి.
మరొక గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, జీవితంలో నేడు చీకటి ఉందంటే, దేవుడు మనల్ని ద్వేషిస్తున్నాడని కాదు. కొన్ని సార్లు విత్తనం చీకటి నేలలోనే మొలకెత్తుతుంది. బంగారం అగ్నిలోనే మెరుస్తుంది. వజ్రం ఒత్తిడిలోనే తయారవుతుంది.
చివరిగా, రామాయణం మనకు నేర్పే మహాసత్యం, జీవితంలో సమస్యలు రావడం శాపం కాదు.
సమస్యల వలన మన ఆత్మవిశ్వాసం కోల్పోవడమే అసలైన శాపం.
అందుకే నేటి యువత తెలుసుకోవలసింది, మనం బాధలో ఉన్నాము అంటే మనం బలహీనులమని కాదు. అలాగే, మనం కష్టాలను ఎదుర్కొంటున్నామంటే దేవుడు మనల్ని వదిలేశాడని కాదు.
సీతారాములు కూడా బాధను అనుభవించారు, కానీ వారు ఏనాడు కృంగిపోలేదు. అందుకే వారు దేవతలయ్యారు. కాబట్టి జీవితాన్ని శాపంగా చూడకూడదు. ఇది ఒక సాధన. ఒక అంతర్గత యాత్ర. ఒక ఆత్మ వికాసం. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కుమిలి పోకుండా, ఇది నన్ను మరింత అర్ధాంతమైన, బలమైన, పరిపక్వమైన వ్యక్తిగా తయారుచేసే ప్రక్రియ అది భావించి ముందుకు సాగాలి.
జీవిత సంఘర్షణాయాత్రలో ధైర్యంగా ముందుకు సాగే ఆత్మజ్ఞానాన్ని మనకి అందించారు సీతారాములు. అందుకే వారు రేపటి భవిష్యత్తును నిర్ణయించే నేటి యువతకు. ఆదర్శం.
మృశి
(దశిక ప్రభాకరశాస్త్రి)
9849795167