15, జూన్ 2026, సోమవారం

మా కామాఖ్య అంబుబాచి మేళా 2026

 మా కామాఖ్య అంబుబాచి మేళా 2026

​భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శాక్త మరియు తాంత్రిక పండుగలలో ఒకటైన 'మా కామాఖ్య అంబుబాచి మేళా 2026', గౌహతిలోని నీలాచల్ కొండపై ఉన్న ప్రముఖ కామాఖ్య ఆలయంలో 2026 జూన్ 22 నుండి జూన్ 26 వరకు జరగనుంది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, అంబుబాచి మహాయోగం 2026 జూన్ 22 రాత్రి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఆలయ గర్భగుడిని సాంప్రదాయబద్ధంగా మూసివేస్తారు, ఇది మా కామాఖ్య అమ్మవారి వార్షిక పవిత్ర రజస్వల (ఋతుస్రావం) సమయాన్ని సూచిస్తుంది.


​జూన్ 23, 24, మరియు 25 తేదీలలో భక్తులకు ఆలయ దర్శనం ఉండదు. ఈ రోజుల్లో ప్రత్యేక తాంత్రిక పూజలు, ప్రార్థనలు మరియు ఆధ్యాత్మిక ఆచారాలు నిర్వహిస్తారు. అత్యంత శుభప్రదమైన 'నివృత్తి' (ఆలయాన్ని తిరిగి తెరిచే కార్యక్రమం) 2026 జూన్ 26 తెల్లవారుజామున జరుగుతుంది. సూర్యోదయ సమయంలో గర్భగుడి తలుపులు తిరిగి తెరుచుకుంటారు, ఆ తర్వాత భక్తులకు దర్శనంతో పాటు 'అంగోదక్' మరియు 'అంగవస్త్ర' ప్రసాదాలను అందజేస్తారు.


​స్త్రీ శక్తిని, సంతానోత్పత్తిని, సృష్టిని మరియు శక్తి యొక్క శాశ్వతమైన ప్రాముఖ్యతను చాటిచెప్పే ఈ అద్భుతమైన పండుగ కోసం లక్షలాది మంది యాత్రికులు, సాధువులు, అఘోరాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులు తరలివస్తారని భావిస్తున్నారు. అంబుబాచి మేళా అనేది మా కామాఖ్య అమ్మవారి విశ్వ శక్తిని గుర్తుచేసే ఒక పవిత్రమైన పండుగ మరియు ఇది హిందూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సమ్మేళనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము


శ్రీ భగవానువాచ ।

సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ ।

తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ।। 2 ।।



ప్రతిపదార్థ:

 

 శ్రీ భగవానువాచ — భగవంతుడు ఇలా పలికెను; సన్యాసః — సన్యాసము; కర్మ-యోగః — భక్తితో పని చేయటము; చ — మరియు; నిఃశ్రేయస-కరౌ — అత్యున్నత లక్ష్యం వైపు తీసుకెళ్లును; ఉభౌ — రెండూ; తయో — ఈ రెంటిలో; తు — కానీ; కర్మ-సన్యాసాత్ — కర్మ సన్యాసము కంటే; కర్మ-యోగః — భక్తితో పనిచేయటం; విషిశ్యతే — ఉన్నతమైనది.

 


 తాత్పర్యము : 


భగవానుడు పలికెను: కర్మ సన్యాస (పనులను త్యజించుట) మార్గము మరియు కర్మ యోగ (భక్తితో పనిచేయుట) మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి. కానీ, కర్మ యోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్ఠమైనది.



వివరణ:


ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాసమును మరియు కర్మ యోగమును పోల్చి చూపిస్తున్నాడు. ఇది చాలా నిగూఢమైన/గంభీరమైన శ్లోకం; కాబట్టి దీనిని ఒక్కొక్క పదాన్ని విడదీసి అర్థం చేసుకుందాం.


ఒక కర్మ యోగి, ఆధ్యాత్మిక మరియు సామాజిక ధర్మాలని రెంటినీ చేస్తాడు. మనస్సుని భగవంతుని యందే నిలిపి, కేవలం శరీరంతో సామాజిక ధర్మాలు చేయబడుతాయి. జగద్గురు కృపాలుజీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు:


సోచు మన యహ కర్మ మమ సబ లఖత హరి గురు ప్యారే


(సాధన భక్తి తత్త్వ)


‘ఓ ప్రియ సాధకుడా! ఎల్లప్పుడూ నీ యొక్క అన్ని పనులను, గురువు మరియు భగవంతుడు గమనిస్తున్నారని భావించుము.’ ఇదే కర్మ యోగ సాధన, దీనితో మనల్ని మనం క్రమక్రమముగా శారీరక దృక్పథం నుండి ఆధ్యాత్మిక దృక్పథం వైపు ఉద్ధరించుకోవచ్చు.


కర్మ సన్యాసము అనేది శారీరక దృక్పథానికి అతీతంగా వెళ్ళిన ఉన్నత స్థాయి జీవుల కోసము. పూర్తి స్థాయిలో భగవత్ భావనలో ఐక్యమగుట వలన, సామాజిక బాధ్యతలను త్యజించి, సంపూర్ణంగా ఆధ్యాత్మిక విధులనే (భగవత్ సేవ) నిర్వర్తించే మనిషి కర్మ సన్యాసి. శ్రీ రామ చంద్రుడు లక్ష్మణుడిని ప్రాపంచిక విధులను నిర్వర్తించమన్నప్పుడు, ఈ కర్మ సన్యాస భావము లక్ష్మణుడిచే చక్కగా వ్యక్తపరచబడింది:


మోరె సబఇ ఏక తుమ్హ స్వామీ, దీనబంధు ఉర అంతరయామీ


(రామచరితమానన్)


 


లక్ష్మణుడు రామునితో అన్నాడు, ‘నీవే నా స్వామివి, తండ్రివి, తల్లివి, స్నేహితునివి, మరియు నా సర్వస్వమూ నీవే. నీ పట్ల ఉన్న ధర్మాన్నే నేను శాయాశక్తులా నిర్వర్తిస్తాను. కాబట్టి దయచేసి నా శారీరక ధర్మాల్ని నాకు చెప్పవద్దు.’


కర్మ సన్యాసం అభ్యాసం చేసే వారు తమని తాము శరీరము అనుకోరు, తత్ఫలితంగా వారు తమ శారీరక ధర్మాల్ని నిర్వర్తించే అవసరం లేదు అని భావిస్తారు. ఇటువంటి కర్మ సన్యాసులు తమ పూర్తి సమయాన్ని ఆధ్యాత్మికత కోసమే కేటాయిస్తారు. అదే సమయంలో, కర్మ యోగులు తమకున్న సమయాన్ని ప్రాపంచిక విధులకు, ఆధ్యాత్మిక విధులకు మధ్య విభజించాల్సి ఉంటుంది. అందుకే కర్మ సన్యాసులు భగవంతుని దిశగా వేగంగా వెళ్ళగలుగుతారు, కానీ కర్మ యోగులు సామాజిక విధుల భారంతో నెమ్మదిగా సాగుతారు.


కానీ, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాసం కంటే, కర్మ యోగాన్నే ప్రశంసిస్తున్నాడు మరియు అర్జునుడికి దానినే అనుసరించమని సిఫారసు చేస్తున్నాడు. ఎందుకంటే కర్మ సన్యాసులు ఒక ప్రమాదంలో చిక్కుకోవచ్చు. ఒకవేళ తమ కర్తవ్యములను త్యజించిన పిదప తమ మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేయలేకపోతే వారు అటూ ఇటూ కాకుండా పోతారు. భారత దేశంలో, ఇటువంటి, ఎన్నోవేల మంది సాధువులు, తమకు వైరాగ్యం కలిగింది అనుకుంటూ, ప్రపంచాన్ని త్యజించారు, కానీ వారి మనస్సు భగవంతుని పట్ల పూర్తిగా లగ్నం కాలేదు. దీని వలన వారు ఆధ్యాత్మిక పథంలో దివ్య ఆనందాన్ని అనుభవించలేకపోయారు. కాబట్టి, ఏదో బైరాగులు ధరించే కాషాయి వస్త్రాలు ధరించినా, గంజాయి పీల్చటం వంటి అత్యంత పాపభూయిష్ట పనులు చేస్తుంటారు. కేవలం అజ్ఞానులు మాత్రమే తమ సోమరిపోతుతనాన్ని, వైరాగ్యమని తప్పుగా అర్థం చేసుకుంటారు.


మరో పక్క, కర్మ యోగులు, ప్రాపంచక విధులు మరియు ఆధ్యాత్మిక విధులను రెండూ చేస్తుంటారు. కాబట్టి ఒకవేళ వారి మనస్సు ఆధ్యాత్మికత నుండి పక్కకి తప్పితే, కనీసం వారి వృత్తి/పని మీద ఆధార పడవచ్చు. ఈ విధంగా కర్మ యోగము అనేది అత్యధిక జనులకు సురక్షితమైన మార్గము; అదే సమయంలో, సమర్థుడైన గురువు గారి పర్యవేక్షణ లోనే కర్మ సన్యాస మార్గమును అవలంబించాలి.

*శ్రీ మూకశంకర విరచిత* *

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 11*


*జటాలా మంజీరస్ఫురదరుణరత్నాంశునికరైః*

*నిషిదంతీ మధ్యే నఖరుచిఝరీగాంగపయసామ్ ।*

*జగత్త్రాణం కర్తుం జనని మమ కామాక్షి నియతం*

*తపశ్చర్యాం ధత్తే తవ చరణపాథోజయుగలీ ॥*


*భావము :*


*జగన్మాతా! నీ కాలి అందియలలో కూర్చబడిన ఎర్రటి రత్నములు నీ పాదములకు కేశములవలె అమరి ఉన్నాయి. నీ పాద నఖములనుండి వెలువడుతున్న వెన్నెల కాంతులు గంగా నదీ ప్రవాహమువలే దృశ్యమై, జటలతో కూడి నదీమధ్యమున స్థితమైన నీ పాదములు, సకల జగత్తును రక్షిస్తున్న తాపసివలె కనిపిస్తున్నాయి.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

హిమోగ్లోబిన్

  హిమోగ్లోబిన్ అనునది ఇనుము సంబంధిత రసాయన పదార్ధము. ఇది మన శరీరంలో ఎక్కడ శక్తి కావాలో అక్కడకు ఆక్షీజనును తీసుకొని వెళుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉన్నాకూడా రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మన శరీరానికి కావలసినంత ఆక్షీజను లభించదు దద్వారా మన శరీరాన్ని శక్తివంతంగా పనిచేయలేము. ఈ రోజుల్లో ఎక్కువగా మహిళల్లో రక్తహీనత సర్వసాధారణమైనది. ఎవ్వరు చూసిన రక్త హీనతతో బాధపడుతున్నవారే అయితే ఎక్కువగా మహిళలకే ఎందుకు రక్త హీనత వస్తుంది అని ఆలోచించినట్లయితే దానికి అనేక కారణాలు వున్నాయి. అందులో ఒకటి మహిళల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పురుషులలో వుండే హిమోగ్లోబిన్ శాతం కన్నా తక్కువ ప్రకృతి సిద్దంగానే ఉంటుంది. 


పురుషుల్లో హిమోగ్లోబిన్ : 14 to 18 g/dl;


మహిళల్లో హిమోగ్లోబిన్ 12 to 16 g/dl. 


ఇక్కడ ఇచ్చిన సమాచారం సగటు ఆరోగ్యవంతులైన వారి విషయం. ఇంకొక విషయం మనం గుర్తించాలి పురుషలల్లో రక్తం శరీరంలో వున్నది వున్నట్లే ఉంటుంది. కానీ మహిళలకు ఋతుక్రమంలో వారి ప్రమేయం లేకుండా చాలా రక్తం వెలువడుతుంది. అసలే శరీరంలో హిమోగ్లోబిన్ పురుషులకన్నా తక్కువ ఉంటే వారు ఈ విధంగా కూడా రక్తాన్ని కోల్పోతారు. నాకు వున్న సమాచారం ప్రకారం చాలామంది మహిళలు 10g /dl కన్నా తక్కువ ఉన్నట్లు తెలిసింది. పూర్వకాలంలో మన ఇండ్లలో వున్న వస్తువులు, ఆహారపు అలవాట్లు చాలావరకు మనం ముఖ్యంగా మహిళలు ఆరోగ్యంగా రక్త హీనత లేకుండా ఉండటానికి ఉపకరించేవి. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రక్త హీనత వలన అనేక ఇతర రుగ్మతలు కూడా రావచ్చు. ఎందుకంటె ఎప్పుడైతే శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ అవుతుందో అప్పుడు శరీరం బలహీన పడుతుంది దానివల్ల శరీరం ఇతర రోగాలను రాకుండా నిరోధించే శక్తిని కోల్పోతుంది దాని పర్యవసానంగా ఇతర రోగాలు ప్రవేశించటానికి తలుపులు తేరాచినట్లు అవుతుంది. కాబట్టి ప్రతివారు తమ ఇంటిలోని ఆడవారి శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ కాకుండా ఉండేటందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. 


వంటశాలలో మార్పులు: పూర్వం మన ఇండ్లలో అనేక వంట సామాగ్రిని మనం ఇనుముతో చేసినవి ఉపయోగించే వాళ్ళము. ఇప్పుడు మన వంటశాలలో ఇనుము పూర్తిగా కనుమరుగు అయ్యింది. వాటి వల్ల శరీరం అనారోగ్యం పాలు అవుతున్నది. ఇప్పుడు నిశీతంగా పరిశీలిద్దాం. 


ముఖ్యంగా మనందరికీ తెలిసిన వంట ఇంటి వస్తువు ఇనుప మూకుడు. మనం పూర్వం ఇనుప మూకుడులో అనేక పిండివంటలను చేసుకునేవారము. పూరి, వడ, బజ్జే కారపూస, అదే జంతికలు, వడియాలు, అప్పడాలు, చల్లమెరపకాయలు అంతే కాదు బండపచ్చళ్ళు గోంగూర, బచ్చలికూర, చింతకాయ, మామిడికాయ, దోసకాయ మొదలయిన పచ్చళ్ళు చేయటానికి ఇనుప మూకుడునూనెలో వేయించి రోట్లో రుబ్బుకొని చక్కగా అన్నంలో కలుపుకొని తినే వాళ్ళం. అంతే కాకుండా పోపుపెట్టాలన్నా ఇనుప మూకుడు లేక ఇనుప గరిటను వాడే వాళ్ళము. ఒక్క మాటలో చెప్పాలంటే మన వంట సగానికి సగం ఇనుప ముకుడు మీదనే ఆధారపడి వున్నది. పూర్వం ఆడవారు ఇలా మాట్లాడుకునే వారు "వదిన మా ఇంట్లో మూకుడు పెట్టి వారం రోజులైంది నా కుమారుడు వచ్చాడు ఏదైనా చేయాలి" అని అంటే ఇంట్లో పిండి వంట చేసి అని అర్ధం. ఈ రకంగా మన వంట ఇల్లు ఇనుప మూకుడుతో అనుసందానం చేసి ఉండటం వలన మనం ఆరోగ్యంగా వుండే వాళ్ళము. మూకుడు తరువాత స్తానం ఇనుప పెనం తీసుకుంది. అట్లు వేసుకోవాలన్న, రొట్టెలు చేసుకోవాలన్న, పెనం మనకు అవసరం. వీటితో పాటు అట్లకాడ, జాలి గంటె ఇవికూడా ఇనుమువే ఉండేవి.


వీటితరువాట్ మరింత ప్రాధాన్యత సంతరించుకున్న వంట ఇంటి ఇనుప వస్తువు కత్తిపీట కత్తిపీట లేని ఇల్లు గతంలో ఉండేదే కాదు. ప్రతి కూరగాయను కత్తిపీటతోటె తరిగే వాళ్ళు ఎప్పుడైతే కూరలు కత్తిపీటతో తరుగుతారో ఆ కూరలలో వుండే ఆమ్లము ఇనుముతో రసాయనకిక్ చర్య చెంది ఆమ్లంలో కరిగిన ఆ పదార్ధం కూరలతో పాటు వంటగిన్నెను చేరేది. మనందరికీ తెలిసిన విషయం మనం మామిడికాయలు తిరిగినప్పుడు కత్తిపీట చాలా పదును ఎక్కుతుంది. "అరె ఇప్పుడే మామిడి కాయలు తరిగా కత్తిపీట బాగా పదును మీద వుంది జాగ్రత్త" అని కత్తిపీట పిల్లలకు ఇచ్చేటప్పుతూ అనటం కద్దు అంటే మరి కత్తిపీట ఎలా పదును ఎక్కింది అంటే కత్తిపీటలోని ఇనుము మామిడి కాయలలో కరిగి ముక్కలలో కలిసింది అని అర్ధం. 


గతంలో మనకు ప్రతి ఆహారపదార్ధం ఇనుముతో చేసిన వస్తువుమీది నుంచి వచ్చేవి దానివలన ఇనుము స్వల్పంగా ఆహారపదార్ధాలలో కరిగి మన ఆహారంలోకి ప్రేవేశించేది. దాని వలన ఇనుము మన శరీరానికి అందేది రక్త హీనత అనేది అస్సలు ఉండేది కాదు. 


ఇప్పుడు ఇనుప వస్తువులు అన్నీ స్టీలు అల్యూమినియం, ప్లాస్టిక్ పదార్ధాలతో మార్పు చేయబడినవి వాటి వలన ఆరోగ్యకరమైన కరిగిన ఇనుము మన శరీరంలోకి వేళ్ళ కుండా అనారోగ్యాన్ని చేకూర్చే ప్లాస్టిక్కు, అల్యూమినియం వెళ్లి శరీరాన్ని సుషుకింపచేస్తూ అనారోగ్యం పాలుచేస్తున్నాయి. 


శరీరంలో రక్త హీనతను గుర్తించటం ఎలా: రక్తహీనత వుండే వారిలో త్వరగా అలసట చెందటం, కంటి గ్రుడ్డు క్రింది రెక్కను ప్రక్కకు అని చుస్తే అక్కడ గులాబిరంగుగా, లేక పాలిపోయి ఉంటాయి. శరీరం శుష్కించినట్లుగా కనపడుతుంది. రక్తహీనత సాదారణ మైన విషయమే కానీ దీనిని ఆశ్రర్ధ చేయకూడదు. సత్వరం తగిన ఆహారపదార్ధాలు అంటే ఇనుము ఎక్కువ ఉండేవి తినటం వలన దీనినుండి కాపాడుకోవచ్చు. 


కొన్ని వంటింటి చిట్కాలు: 


1) పల్లీ చెక్క అంటే వేరుశనగ పల్లెలను బెల్లంలో కలిపి చేసే స్వీట్ ఇది చావుకగా లభిస్తుంది. దీనిని రోజు స్వేకరించాలి . 


2) పల్లీలు, బెల్లం నువ్వులు, రోజు తినే అలవాటు చేసుకోవాలి.


విధిగా మన వంటకాలలో పంచదార బదులుగా బెల్లాన్ని వాడాలి. మరల ఇనుపముకుడును మన వంటశాలకు ఆహ్వానిస్తే చాలావరకు మనం రక్త హీనతనుండి కాపాడుకోగలుగుతాము. ఈ వ్యాసము చదివిన వారందరికీ ఆరోగ్యం చేకూరాలని ఆశిస్తున్నాను.

నవనీత హారతి

 నవనీత హారతి 


ఆనందనిలయంలో కులశేఖరపడి వద్ద తెరవేసి, శ్రీస్వామివారికి దంతధావన జిహ్వోల్లేఖన ఆచమనాది అనుష్ఠాన క్రియలు సమర్పించి, ఆ తర్వాత 'మహంతు మఠం' వారు ప్రత్యేకంగా తెచ్చిన నవనీతం (తాజా వెన్న), పాలు, పంచదారలను స్వామివారికి నైవేద్యంగా పెట్టి, మంచి సువాసన గల తాంబూలాన్ని స్వామివారికి సమర్పిస్తారు.


గుడి బయట వేద పండితులు సుప్రభాత సేవను ముగిస్తున్న సమయంలో... లోపల అర్చకులు స్వామివారికి కర్పూర హారతి ఇస్తారు. వెన్న నైవేద్యం పెట్టే సమయంలో ఇచ్చే ఈ కర్పూర హారతినే 'నవనీత హారతి' అంటారు. సరిగ్గా ఈ హారతి ఇచ్చే సమయంలోనే బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. ఆ కర్పూర దీపాల వెలుతురులో శ్రీవేంకటేశ్వర స్వామివారి రూపం భక్తులకు కన్నులపండువగా కనిపిస్తుంది.


హారతి అయిపోయాక, రాత్రి సమయంలో బ్రహ్మ దేవుడు వంటి దేవతలు పూజించడానికి గర్భగుడిలో ఉంచిన పవిత్ర తీర్థాన్ని, చందనాన్ని, శఠారిని మొదట అర్చకులు తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని జియ్యంగారికి, ఏకాంగికి ఇస్తారు. చివరగా సన్నిధిగొల్లకు తీర్థం, శఠారితో పాటు నవనీత హారతిలోని తాంబూలాన్ని కూడా ప్రసాదంగా అందిస్తారు.


ఈ పూజ ముగిసిన వెంటనే జియ్యంగార్, ఏకాంగి, సన్నిధిగొల్ల ముగ్గురూ బంగారు వాకిలి దాటి బయటకు వస్తారు. అప్పుడు ఆలయ సిబ్బంది (పరిచారకులు) లోపలికి వెళ్లి, రాత్రి స్వామివారు పవళించిన మంచాన్ని, పరుపును (పాన్పును) తీసి బయట ఉన్న 'సభేరా గది' లోకి మారుస్తారు.

భాగవతం

 *'భాగవతం వింటే బాగవుతాం'*

శ్రీ పోతన భాగవత మధురిమలు 

 

(8-215-క.)

ఆలోల జలధి లోపల

నాలో నహి విడిచి సురలు నసురులుఁ బఱవం

గీలా కోలాహలమై

హాలాహల విషము పుట్టె నవనీనాథా!


*భావము:-* పరీక్షిన్మహారాజా! అల్లకల్లోలమైన ఆ పాలకడలిలో నుండి అగ్నిజ్వాలల కోలాహలంతో కూడిన “హాలాహలము” అనే మహావిషము పుట్టింది. అది చూసి భయంతో దేవతలూ, రాక్షసులూ పట్టుకున్న నాగరాజు వాసుకిని వదలిపెట్టి పారిపోసాగారు.


_(లకార ప్రాసతో హాలాహల, కోలహలాలకు జత కట్టించిన బమ్మెరవారి పద్యం మధురాతి మధురం.)_


శ్రీ తాళ్ళూరి నారాయణ కవి గారి శివ తత్వ కీర్తనతో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

పంచాంగం 15.06.2026 Monday

  ఈ రోజు పంచాంగం 15.06.2026 Monday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష అమావాస్య తదుపరి నిజ జ్యేష్ఠ మాస శుక్ల పక్ష ప్రతిపత్తి తిథి ఇందు వాసర మృగశిర నక్షత్రం శూల తదుపరి గండ యోగః నాగవం తదుపరి కింస్తుఘ్నం తదుపరి బవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: ప్రతిపత్తి.


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి ।

నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే ।। 3 ।।



ప్రతిపదార్థ:


జ్ఞేయః — పరిగణించవలెను; సః — అతను; నిత్య — ఎల్లప్పుడూ; సంన్యాసీ — సన్యాస దీక్షను ఆచరిస్తూ; యః — ఎవరైతే; న, ద్వేష్టి — దేనినీ ద్వేషింపక; న, కాంక్షతి — దేనినీ ఆశించక; నిర్ద్వంద్వః — అన్ని ద్వంద్వములకు అతీతంగా; హి — నిజముగా; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; సుఖం — సునాయాసముగానే; బంధాత్ — బంధము నుండి; ప్రముచ్యతే — విముక్తి చేయబడును.



 

 తాత్పర్యము : 



దేనినీ ద్వేషింపక, దేనినీ ఆశించక ఉన్న కర్మ యోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి, వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులౌతారు.



వివరణ:


బాహ్యంగా ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే, కర్మ యోగులు, అంతర్గతంగా అనాసక్తత/వైరాగ్యాన్ని అభ్యాసము చేస్తుంటారు. అనుకూల, ప్రతికూల ఫలితాలని రెంటినీ సమదృష్టితో, ఈశ్వర అనుగ్రహంగా స్వీకరిస్తారు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా రచించాడంటే అది మన క్రమానుసార ఉన్నతి కొరకు సంతోషాన్ని, దుఃఖాన్ని అనుభవింప చేస్తుంటుంది. మనం సాధారణ జీవితాన్ని గడుపుతూ మన దరికి వచ్చే దేనినైనా సహిస్తూ, సంతోషంగా మన ధర్మ మనం చేస్తూ ఉంటే ఈ ప్రపంచం సహజంగానే క్రమక్రమంగా మనల్ని ఆధ్యాత్మిక పురోగతి వైపు తీసుకువెళ్తుంది.


దీనిని వివరించటానికి ఒక చక్కటి కథ ఉంది:


ఒకప్పుడు ఒక కొయ్య ముక్క ఉండేది. అది ఒక కొయ్యబొమ్మలు చేసే శిల్పి దగ్గరికి వెళ్లి, ‘నన్ను దయచేసి అందంగా చేయవా?’ అని అడిగింది.


శిల్పి అన్నాడు, ‘నేను ఆ పనికి సిద్ధంగా ఉన్నాను. కానీ, నీవు దానికి సిద్ధమేనా?’


ఆ చెక్క అన్నది, ‘అవును, నేను కూడా సిద్ధమే.’


ఆ శిల్పి తన పనిముట్లు తీసుకుని దానిని చెక్కటం మొదలుపెట్టాడు. ఈ కొయ్య “అయ్యో, ఏం చేస్తున్నావు? దయచేసి ఆపు, చాలా నొప్పిగా ఉంది’ అని అరిచింది.


అప్పుడు ఆ శిల్పి తెలివిగా అన్నాడు, ‘నీవు అందంగా అవ్వాలనుకుంటే, నీవు బాధని సహించాలి.’


‘సరే’, అన్నది కొయ్య. ‘అయితే చెక్కండి, కానీ దయచేసి కాస్త నెమ్మదిగా, సున్నితంగా చేయండి’.


ఆ శిల్పి తన పని మళ్ళీ ప్రారంభించాడు. ఈ కొయ్య అరుస్తూనే ఉంది, ‘ఇక ఈ రోజుకు చాలు; ఇంకా సహించలేను. దయచేసి మళ్ళీ రేపు తిరిగి ప్రారంభించండి.’ అని. ఆ శిల్పి తన పని యందే శ్రద్ధతో ముందుకెళ్ళాడు, మరియు కొద్ది రోజుల్లోనే ఆ కొయ్య, గుడిలో ఉంచతగిన, ఒక అందమైన విగ్రహంగా తయారయ్యింది.


ఇదే విధముగా, అనంతమైన జన్మలలో ప్రపంచంతో మమకారం వలన మన హృదయములు మొరటుగా, మలినముతో ఉన్నాయి. మనం అంతర్గత సౌదర్యంతో ఉండాలంటే మనం బాధని సహించి, ఈ ప్రపంచాన్ని మనలని పరిశుద్దం చేసే తన పనిని చేసుకోనివ్వాలి. కాబట్టి, కర్మ యోగులు భక్తితో పని చేస్తూ, ఫలితముల పట్ల సమదృష్టితో ఉంటారు, మరియు భగవంతుని యందే తమ మనస్సుని లగ్నం చేయటానికి అభ్యాసం చేస్తుంటారు.

15-06-2026 సోమవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏


15-06-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.  

---------------------------------------


వృషభం


ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------


మిధునం


కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వ్యాపారస్థులకు అవసరానికి ధన సహాయం అందుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు.

---------------------------------------


కర్కాటకం


ఉద్యోగాలలో అధికారులతో చర్చల్లో పురోగతి కలుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. 

---------------------------------------


సింహం


ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

---------------------------------------


కన్య


ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగాల్లో కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

---------------------------------------


తుల


పాత ఋణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి.  

---------------------------------------


వృశ్చికం


ముఖ్యమైన వ్యవహారాలలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చాలాకాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


ధనస్సు


బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.

---------------------------------------


మకరం


అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందక ఇబ్బందిపడతారు. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.

---------------------------------------


కుంభం


చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------


మీనం

 


ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తికావు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగాలలో ఊహిం చని మార్పులు ఉంటాయి.

---------------------------------------