15, జూన్ 2026, సోమవారం

అక్షర ప్రేమికుడు*

 *అక్షర ప్రేమికుడు*

================

రచన :- సురేష్ వంకాయలపాటి (పిఠాపురం )

==================



    పచ్చని పొలాలు మధ్య  గోదావరి గాలులు చల్లదనానికి  సాయం సంధ్య వేళ  వేళ పక్షుల రమణీయమైన  కిలకిలారావాలతో  సందడి చేసే  ఒక చిన్న పల్లెటూరు లో మహేంద్ర అనే వ్యక్తి  ప్రశాంతంగా తన అభిరుచి కి అనుగుణంగా అందరినీ అలరిస్తూ పలకరిస్తూ....

చిన్నప్పటి నుంచే చదువులో మంచి ప్రతిభ  చూపిస్తూ  నే అన్ని రకాల పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం అతనికి ఎంతో ఇష్టంమైన వ్యాపకం  గా చేసుకున్నాడు...

           మహేంద్ర  కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.   దురదృష్టవశాత్తు  తన చదువుకు తగిన మంచి ఉద్యోగం దొరకలేదు. అయినా నిరాశ పడకుండా అన్ని  ప్రయత్నాలు చేస్తూ ఇంటర్వ్యూలకు వెళ్లాడు . ఎంతో  ఆశతో ఎదురు చూశాడు చూసిన ప్రతీ సారి తనకి  నిరాశే ఎదురైంది.

    తర్వాత కొన్ని   ప్రైవేట్  సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు.  చివరగా మరో ప్రైవేట్ కంపెనీలో  క్లర్క్‌గా  చాలా కాలం పని చేశాడు. అతను చేసే పని  అతనికి  నచ్చలేదు.. జీతం సమస్య కాకపోయినా ఎందుకో తన మనసుకు తృప్తి కలగలేదు. చివరకు ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు.

       మహేంద్రకు చిన్నప్పటి నుండి తనకటూ మరో లోకము ఉంది అదే అక్షర ప్రపంచం.

       అతనికి కథలు, కవితలు వ్రాయడం అంటే  చాలా ఇష్టం. ప్రకృతి అందాలు వర్ణిస్తూ  సగటు మనుషుల జీవిత విశేషాలు,  సమాజంలో జరిగే సంఘటనల  ఆలోచనలు తన  కలంతో  కథలుగా మారేవి.

     నిద్ర లేని ఎన్నో రాత్రిళ్ళు కాగితం మీద  తన భావాలను పదాలుగా మార్చేవాడు. పుస్తకాలు, కాగితాలు అతని నేస్తాలు.

కాల క్రమంలో జీవితంలో కొన్ని మార్పులు అనివార్యం అవుతూ వచ్చాయి.  వాళ్ల  పొలాలు అమ్మి రాజమండ్రి గోదావరికి 

చేరువుగా తన అభిరుచికి తగ్గట్టు ఒక ఇల్లు  కొనుగోలు చేశాడు. కొంత  డబ్బును బ్యాంకులో జమ చేశాడు. వచ్చే వడ్డీతో కుటుంబం సాదాసీదాగా ఒడి దుడుకులు లేకుండా ముందుకు సాగిపోతోంది.

      మహేంద్ర కు మేనమావ కూతురు శ్రీవల్లి  తో వివాహం అయింది. వారికి  ఒక్క గాని ఒక్క కూతురు . ఆమెకు సరస్వతి  అని పేరు పెట్టీ గారంగా పెంచుతున్నారు. సరస్వతి పేరుకు తగ్గట్టు చదువులో ముందు ఉండేది.  తెలివైన అమ్మాయి. ఆమెకు  తండ్రి అంటే  ఎంతో గౌరవం. 

     మహేంద్ర కు కూడా కూతురు అంటే అంతే ప్రేమ.  అమ్మాయి చదువు విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. కష్టపడి ఆమెను బి.టెక్ వరకు చదివించాడు.

అలాగే  మహేంద్ర తనకి ఇష్టమైన రచన వ్యాపకం   కొనసాగిస్తూ ఉన్నాడు. ఎక్కడ  సాహితీ సభలు జరిగితే అక్కడ పాల్గొనేవాడు  . అవకాశం  వచ్చినపుడు తన కవితలు తను వ్రాసిన కథలు చదివేవాడు. అలా ఎందరో  సాహిత్యప్రియులు తో సాన్నిత్యం  ఏర్పడింది. వారంతా అతనిలోని ప్రతిభ ను గుర్తించి తన  రచనలను మెచ్చుకునేవారు.

      కావలసిన వారు ,  చుట్టుపక్కల ఉన్నవారికి మాత్రం మహేంద్ర చేస్తున్న పని అంతగా రుచించలేదు. ఉద్యోగం , సద్యోగం లేకుండా కవితలు. గోష్టి అంటూ తిరిగితే ఏంటి ప్రయోజనం అంటూ జాలి పడుతూ హేళన చేసేవారు.

ఇరుగు పొరుగు అమ్మలక్కలు   శ్రీవల్లి తో...

మీ వారు రోజంతా ఇంట్లో కూర్చుని ఏవేవో  రాస్తుంటాడు. ఎక్కడికి వెళ్లాడా ఏ  పని చేయడా అని ఆడి పోసుకునేవారు..” పైగా ఇలాగే కొనసాగితే ఎదిగిన కూతురు పెళ్లి ఎలా  చేస్తారు అంటూ   దెప్పి పొడవటం మొదలు పెట్టారు. క్రమేణా శ్రీవల్లి వాళ్ళ మాటలకు భయపడటంతో తనలో కొంత మార్పు వచ్చింది. ఆమె భర్త తో అయిన దానికి కానిదానికి రుస రుస లాడటం కారణం లేకుండా  గొడవ పడటం మొదలు పెట్టింది.

“రోజంతా ఆ పుస్తకాలు, కాగితాలు ముందు వేసుకుంటే  వాటి వల్ల  మన జీవితాలు మారిపోతాయా అంటూ రుస రుస లాడటం కూడా  మొదలు పెట్టింది.

మహేంద్ర  ఆమె ప్రవర్తన చూసి కాస్త ఆశ్చర్య పడుతూ అంతలోనే  శాంతంగా నవ్వుకునేవాడు.

చూడు శ్రీ వల్లి … నువ్వు తీసి  పడేస్తున్న ఈ రచనలకు  కూడా ఒక రోజు వస్తుంది.”అని చెప్పటానికి ప్రయత్నిస్తుంటే 

      శ్రీవల్లి  మాత్రం ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు.

కళ్ళ ముందు రోజులు గడిచి పోయాయి  నెలలు గడచి పోతున్నాయి.

ఒక రోజు మహేంద్ర రాసిన కథ ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితమైంది. ఆ కథలో గ్రామీణ జీవితం, అక్కడ మనుషుల భావాలు చాలా హృదయానికి హత్తుకునేలా వ్రాయటం తో  అందరికీ బాగా  నచ్చింది.

       చివరకు ఆ కథ సినిమా దర్శకుడు  సురేష్ వంకాయలపాటి చదవటం జరిగింది. కథ చదివిన వెంటనే చాలా ఇంప్రెస్స్ అవటమే కాకుండా  చాలా  ఆశ్చర్యపోయాడు. ఇలాంటి 

మంచి కథ ఎవరు రాశారు?”  అని వాకబు చేయటం మొదలు పెట్టాడు.

పత్రికలో ఉన్న చిరునామాతో  మహేంద్ర ఆచూకీ తేలుకుని  ఒక  మంచి రోజు అతని ఇంటికి వెళ్ళాడు.

తలుపు తడితే  మహేంద్ర బయటికి వచ్చాడు.

“మీరు మహేంద్ర గారేనా?” అని అడిగాడు సురేష్.

“అవును… నేను మహేంద్రనే” అంటూ  సమాధానం ఇచ్చాడు. నేను దర్శకుడు సురేష్ ను అంటూ పరిచయం చేసుకున్నాడు.

“మీరు రాసిన కథ నేను చదివాను. అద్భుతం. ఆ కథను నేను సినిమాగా తీయాలనుకుంటున్నాను.” అని చెప్పటంతో  అతని మాటలకు 

మహేంద్ర ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు.

          సురేష్ వెంటనే ఒక కవర్ తీసి అతని చేతిలో పెట్టాడు.

“ఇది అడ్వాన్స్. మిగతా విషయం తరువాత మాట్లాడుకుందాం.”

ప్రక్కగా నిలబడి  చూస్తున్న శ్రీవల్లి కి ఒకటే  ఆశ్చర్యం.  తను తక్కువగా చూస్తున్న భర్త చేతి వ్రాతలే  వారి ఇంటికి  ఇంత గౌరవం తీసుకొచ్చాయి అని తెలుసుకుని  ఆశ్చర్యము తో ఆనందపడిపోతోంది.

నెమ్మదిగా  ఆ వార్త కాలనీ అంతా తెలిసిపోయింది.

ఇప్పటివరకు మహేంద్రను విమర్శించిన వారు  అతని దగ్గరకు వచ్చి అభినందనలు తెలియచేస్తున్నారు ఒక్కొక్కరుగా .

“మహేంద్ర గారూ! మేము మీలో ఉన్న  ప్రతిభ ను  గుర్తింక ఏవేవో  మీ గురించి తప్పుగా మాట్లాడాం అంటూ సంజాయిషీ చెప్పుకుంటున్నారు.

            త్వరలోనే కాలనీలో ఒక చిన్న సభ కూడా  ఏర్పాటు చేశారు. సభలో అందరూ ఆయన్ని కొనియాడారు. చివరగా  మహేంద్రను మాట్లాడమని కోరారు.

మహేంద్ర మైక్ దగ్గరకు వెళ్లి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు.

“ప్రియమైన మిత్రులారా…మీ అందరికీ  నా హృదయ పూర్వక నమస్కారములు. మీ విమర్శలే నన్ను చైతన్య వంతుణ్ణి  చేశాయి. రచయిత అంటే 

 కేవలం పదాలు అల్లేవాడు  మాత్రమే  కాదు. రచయిత ఎప్పుడూ   మనుషుల మనసులను అర్థం చేసుకునే వ్యక్తి. వారి  మనోగతాలను అవగాహన చేసుకునే శక్తి గల వ్యక్తి కూడా...

కవిగా పుట్టడం అంటే ఒక వరం.పూర్వ జన్మ సుకృతం.

కవిత్వం అంటే భావాలను అక్షరాలుగా మార్చే కళ. కొందరికి కొన్నిటి మీద మక్కువ. సైంటిస్టు కి ఏదో  ఒక కొత్తది కనిపెట్టాలి అనే తపన.  వ్యాపారం చేసేవారికి డబ్బు సంపాదించాలన్న కోరిక, మరొకరికి పదవి అంటే ప్రాణం.  అలాగే కొందరికి సాహిత్యం అంటే ఇష్టం. ఏ రంగంలో ఎవరికైనా 

డబ్బు వెంటనే రాకపోవచ్చు. గౌరవం కూడా ఆలస్యంగా రావచ్చు. కానీ నిజమైన అక్షరాలు ఎప్పటికైనా తమ విలువను చూపిస్తాయి. సంఘంలో గౌరవాన్ని పెంచుతాయి.

కవి ఆలోచనలు ఏదో ఒక  రోజు సమాజానికి అద్దం పడతాయి. అందుకే అక్షరాలను నమ్ముకున్న వాణ్ణి  , ప్రేమించే వాడిని  తక్కువగా చూడకూడదు.”

ఒక్కసారిగా అతని మాటలు వింటున్న ప్రతీ ఒక్కరు లేచి నిలబడి  గట్టిగా చప్పట్లు కొట్టారు.

శ్రీవల్లి  కళ్లలో ఆనందబాష్పాలు సుళ్ళు తిరుగుతున్నాయి. 

        సభ ముగిసిన తరువాత ఆమె మహేంద్ర దగ్గరకు వెళ్లి క్షమార్పణ కోరుతున్నట్టు నెమ్మదిగా  చెప్పింది.

“నన్ను క్షమించండి. నేను మీ అభిరుచి , మీ  అభీష్టం   అర్థం చేసుకోలేకపోయాను.” అంటుంటే

మహేంద్ర చిరునవ్వుతో  ఆమెను దగ్గరగా తీసుకుంటూ 

కొన్నింటి  విలువ తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. దానికి కొంచెం ఓపిక ఉండాలి అంటూ ప్రేమతో మరింత దగ్గరికి తీసుకున్నాడు. గోదావరి మీద నుండి వస్తున్న చల్లటి  గాలి తెర ఇద్దర్ని ఆశీర్వదించింది.

కామెంట్‌లు లేవు: