29, నవంబర్ 2022, మంగళవారం

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 61 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


‘నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయిపోయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటివరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహాప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయ్యాయి. ఇంతకుముందు తొంభైతొమ్మిది యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది’ అన్నాడు. బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ‘ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటానని చెప్పలేను అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదని చెప్పడం ఎలా కుదురదు. ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తానని చెప్పడము కూడా కష్టమే. నేను మూడురకములుగా మాత్రము ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు నన్ను కోరుకున్న వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను’ అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి పిల్లవాడా! నిన్ను చూస్తే నాకు చాలా ఆనందముగా ఉన్నది. నీవు వటువువి నేను చక్రవర్తిని నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. నీకు ఏమి కావాలో కోరుకో’.

వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో

కరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీఖండమొ కాక ఏమడిగెదో దాత్రీసురేంద్రోత్తమా!

ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి ? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిస్తాను’ అన్నాడు. వామనుడు నవ్వి ‘నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. నాకు నీవు ఇవ్వగలిగినది ఏమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చానని అంటే నేను బ్రహ్మానందమును పొందుతాను ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను’ అన్నాడు.

బలిచక్రవర్తి ‘నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండములను జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితే అది ఇస్తాను’ అన్నాడు.

వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు

గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,

వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ

డడుగుల్ మేరయు త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

‘అవన్నీ ఇస్తానంటావేమిటి? నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు’ అన్నాడు. బలిచక్రవర్తి

ఓ వటువా! ఇదిగో బంగారుపాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ! బంగారుచెంబుతో నీళ్ళు పొయ్యి. ఈ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోస్తాను. నీళ్ళు పట్టుకొని రా’ అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొంగిపోతూ నీళ్ళు పట్టుకువద్దామని లోపలి వెళుతున్నది. ఈలోగా బ్రహ్మచారి బంగారుపాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చి రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట ఇచ్చావా? అని అడిగాడు. బలిచక్రవర్తి ‘ ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగితే ఇస్తానన్నాను’ అన్నాడు. శుక్రాచార్యులు ‘రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకుంటున్నాడు. ఎందుకో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. నీజోలికి రాలేడు. నీతో యుద్ధం చేయకుండా నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును తీసుకుని ఇంద్రునకు ఇస్తాడు. మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టనని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాటచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను.

వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు

జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప !

శుక్రాచార్యుల వారు రాక్షసనీతి చెప్పారు. దానిని ప్రాణభయంతో ఉన్నప్పుడు రాక్షసనీతిగా ఆయన చెప్పారు. ఆయన చెప్పిన విషయం ‘ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు దాని వలన పాపం రాదు. మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగుకూడా ఇవ్వకు ఇస్తే ప్రమాదం ఆయనను నమ్మకు’ అన్నాడు.

బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి ‘ఎంతమాట అన్నారు! లక్ష్మీనాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు.

ఆదిన్ శ్రీసతి కొప్పుపై, దనువుపై, నంసోత్తరీయంబుపై

బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ

ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్

గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే ?

‘ఆయన చేయి లక్ష్మీఅమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాడు. ఒక్కొక్క సారి ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతున్నది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు’.

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ.

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై.

యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!

‘ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా!

నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాటపోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను ఆ జాబితాలో చేరను. నేను దానం చేస్తాను’ అన్నాడు. శుక్రాచార్యుడు ‘నేను నా తపశ్శక్తితో అమృతం త్రాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేసాను. ఇవాళ నువ్వు గురువు మాటకాదన్నావు. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు!’ అని శపించాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[20/11, 5:59 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 62 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారుపళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి వంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లనిపాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూసాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదము ఏది ఉన్నదో ఆ పాదమును చూసాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూసాడు. చూసి పొంగిపోయి బంగారు పళ్ళెము ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకుని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూసాడు. బలిచక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నా నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచేసరికి శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసాడు.

వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.

ఇంతింతై, వటుడింతయై, మఱియుదానింతై, నభోవీధిపై

నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై

నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై.

పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పది అంగుళములు పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలోనుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు.

రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై, శిరోరత్న మై

శ్రవణాలంకృతియై గళాభరణ మై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా, తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయింది. ఇంకా దాటితే పాదములకు పెట్టుకున్న అందెలా అయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్రని పీటలా అయిపోయింది. బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు.

ఆయన బలిచక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది? అని అడిగాడు. బలిచక్రవర్తి

సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల; నాకు బొంకు లేదు;

నీ తృతీయ పదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!

నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. బలిచక్రవర్తి ‘వేళకాని వేళా క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు తనకు సిరిని ఇచ్చిన వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసికూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథరక్షకుడని పేరు. నీ సన్నిధానములో నేను అనాథను కావడమా! నాకు భర్తృ భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.

పది దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వస్తే బలిచక్రవర్తి ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ!ఎంత వరమును ఇచ్చావు’ అన్నాడు.

శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను వీనిని రక్షించాలి. వానిని వరుణపాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు. సావర్ణిమనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుని నాలో కలిపేసుకుంటాను. అప్పటివరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పదిదిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ లేకుండా ఉంటాడు’ అన్నారు.

మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భ్రుగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు ఇంత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం ఇస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణపాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణిమనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను.

‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి ఇచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు.

ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసము ఇస్తాను. వారికి లక్ష్మీకటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి’ అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు.

ఇది అంత పరమ ప్రఖ్యాతమయిన ఆఖ్యానము.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[20/11, 5:59 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 63 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


నవమస్కంధము – అంబరీషోపాఖ్యానము

అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమయిన విషయము. అంబరీషుడు నాభాగుని కుమారుడు. నాభాగుడనే చక్రవర్తి సామాన్యుడు కాదు. ఆయన చాలా గొప్ప రాజు. అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటినుంచి సహజముగా కొన్ని గుణములు అలవడ్డాయి. తపస్సు చేయడం ఎంత గొప్పదో తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడం అంత భయంకరమయిన విషయము. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమయిన వ్యక్తి. ఒక మహర్షి శాపమును ఇస్తే దానిని తప్పుకున్నవాడు కనపడడు. అంబరీషుడు మాత్రం మహర్షి శాపము నుండి తప్పించుకున్నాడు. అదీ ఈ చరిత్రకు ఉన్న గొప్పతనం.

అంబరీషుని చిత్తము ఎప్పుడూ శ్రీమహావిష్ణువు పాదములను పట్టుకుని ఉండేది. ఆయన ప్రవిఢవిల్లిన భక్తి చేత ఉన్నాడు. ఏది మాట్లాడినా హరి గుణములను వర్ణన చేస్తూ ఉంటాడు. ఆయన చెవులు ఎప్పుడూ మాధవుని కథాశ్రవణము వినడానికి ఉత్సాహమును పొందుతూ ఉండేవి. అంబరీషుడు భగవంతుని ముందు వంగి నమస్కరించే శిరస్సు ఉన్నవాడు. భగవంతుడిని నమ్ముకున్న భాగవతులు కనపడితే వారి పాదముల వాసన ముక్కుకు పట్టేటట్లు వారి పాదముల మీద పడేవాడు. వారి పాదములనుండి వెలువడే పద్మముల సువాసనను ఆయన ఆస్వాదించేవాడు. అంబరీషుడు రసేంద్రియమును గెలవగలిగాడు. ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఈశ్వరుని యందు మగ్నమై ఉండేవాడు. అయినా ఆయన రాజ్యపాలనమును విస్మరించలేదు. అంబరీషునికి అంతఃపురముల మీద కోరిక లేదు. ఏనుగుల మీద, గుఱ్ఱముల మీద, ధనం మీద, ఉద్యానవనముల మీద, కొడుకుల మీద, బంధుమిత్రుల మీద రాజ్యం మీద, భార్య మీద, దేనిమీదా కోరిక లేదు. అన్నింటితో ఉన్నాడు. దీనినే కర్తవ్యనిష్ఠ అంటారు.

పరమ పవిత్రమయిన జీవితమును గడుపుతున్న స్థితిలో అంబరీషుడు సరస్వతీనదీ తీరంలో అశ్వమేధయాగం చేశాడు. దానికి వసిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ సేవించాడు. భూరి తాంబూలములను ఇచ్చాడు. ఒక సంవత్సరం పాటు ద్వాదశీవ్రతము చెయ్యాలని అనుకున్నాడు. ఏకాదశీ వ్రతమునకు, ద్వాదశీ వ్రతమునకు తేడా ఏమీ లేదు. దశమినాటి సాయంత్రము నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసము అంటే ‘అశనము’ అని శాస్త్రంలో ఒక మాట ఉన్నది. అశనము అంటే వ్యక్తికి క్రిందటి జన్మలలో ఉన్న దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యము ఉన్నా, ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒకరోజు మాడ్చుకోవడం. ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమయిన పదార్ధం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్చితమయిన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే దానిని ఉపవాసము ఉంటారు. అంబరీషుడు ఏకాదశీ వ్రతమును చేస్తున్నాడు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి. ద్వాదశినాడు పారణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా పదార్థములను తినేయ్యడాన్ని పారణ అంటారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పు లేదు. నిత్యానుష్ఠానం చేసేసుకుని ద్వాదశినాడు భోజనం చేసేయవచ్చు. అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశీ వ్రతమును పూర్తి చేసాడు. ఏకాదశి తిథి అయి తెల్లవారి సూర్యోదయం అయింది. సంవత్సరకాలం పాటు చేసిన ఏకాదశీ వ్రతం పరిపూర్ణమయింది. యజ్ఞమును పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా ఆపివేసినట్లయితే ఆ యజ్ఞం పూర్తయినట్లు లెక్కకు రాదు. యజ్ఞభ్రంశం అవుతుంది. ఏకాదశీ వ్రతం పూర్తవుతున్నది. ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి. తాము భోజనం చేసేముందు ఏడాదిపాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళిందీనది ఒడ్డుకు వెళ్ళి నదీస్నానం చేసారు. అనంతరం మధువనంలోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణపరమాత్మకు అభిషేకం చేశారు. అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. వారికి దానములను ఇచ్చారు. వారికి కడుపునిండా భోజనం పెట్టాడు. వాళ్ళందరూ కడుపునిండా తిన్న తరువాత ఇతడు ద్వాదశి పారణం చేయాలి. తనుకూడా భోజనం చేయాలి.

అందరి భోజనములు పూర్తయిన తరువాత తాను భోజనం చేద్దామని సిద్ధ పడుతుండగా అక్కడికి దుర్వాసో మహాముని వచ్చారు. దుర్వాసుడు సర్వకాలముల యందు వేదములయందు, వేదాంతములయందు బుద్ధిని నిక్షేపించిన వాడు. గొప్ప తపస్సును పాటించిన వాడు. సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినవాడు. వచ్చిన దుర్వాసోమహర్షిని అంబరీషుడు ఈశ్వరునిగా భావించాడు. పొంగిపోయి ‘ఊరకరారు మహాత్ములు! ఇవాళ నేను చాలా అదృష్టవంతుడిని. నీవు శివాంశ సంభూతుడివి నా ఇంటికి అతిథిగా వచ్చావు. ఏమి నా భాగ్యము? ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారణ. మీరు మహాత్ములు కనుక ముందువచ్చి భోజనం చేయాలి. మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను. మీరూ నేనూ తొందరగా భోజనం చేయాలి. ద్వాదశి కాబట్టి మన ఇద్దరికీ యిదే ధర్మం. మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్తశేషమును నేను తింటాను’ అన్నాడు.

దుర్వాసోమహర్షి అలాగే వస్తాను అని తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. ఆయన యమునా నదీజలములలో స్నానమునకు దిగాడు. ఇక్కడ మాయ కమ్మింది. దుర్వాసోమహర్షి మహాభక్తుడు. ఈశ్వర ధ్యానమునందు సమయమును మరచిపోయి జలములలో ఉండిపోయాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. ఇపుడు అంబరీషునికి ఇబ్బంది వచ్చింది అతను పారణ చేయాలి. లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేలోపల పారణ చేయకపోతే వ్రతభంగం అవుతుంది. వ్రత భంగం అయితే ఆయన మరల ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులను, మహా పండితులను పిలిచాడు. విద్వాంసులు ఎంతో గొప్పగా చెప్పారు ‘ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు పిలవకూడదు. నీవు చూస్తే గృహస్థు. వ్రతం చేసి ఉన్నావు. భంగం జరుగ కూడదు. పోనీ పారణ చేసేయ్యడమే కదా అని ముందు తింటే వచ్చిన అతిథికి నీవు మహా అవమానము చేసినట్లు అవుతుంది. తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది. నీకు మధ్యే మార్గం ఒకటి చెపుతాము. సలిలము పుచ్చుకో ’ అన్నారు. అంటే కాసిని నీళ్ళు తాగమన్నారు. అయితే ‘నేను కొద్ది నీళ్ళు పుచ్చుకుంటాను ఆయన తినగా మిగిలిన శేషమునే నేను భోజనముగా తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది నీళ్ళు ఒక్కటే పుచ్చుకుంటాను’ అని నీళ్ళను పుచ్చుకున్నాడు.

ఇలా ఇక్కడ నీళ్ళు పుచ్చుకోగానే దుర్వాసోమహర్షి ధ్యానంలోంచి బయటకు వచ్చారు. ధ్యానంలోంచి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకు వచ్చి గబగబా అంబరీషుని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఎదురువచ్చి అయ్యా! ద్వాదశి తిథి వెళ్ళిపోబోతోంది. మీ గురించే చూస్తున్నాను. ముందు మీరు భోజనమునకు కూర్చోండి. తరువాత నేను చేస్తాను’ అన్నాడు. దుర్వాసుడు అంబరీషుడు నీళ్ళు త్రాగాడని తెలుసుకుని కోపం వచ్చింది. ఆయనకు ఒక పక్క లోపల ఆకలి. ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనే దుగ్ధ. రెండూ కలిసి ‘ఇంత మహర్షిని నేను నీకు ఇంత చవకబారు వానిలా కనపడ్డానా? పిలిచి ముందు నువ్వు త్రాగి నాకు నీ ఇంట్లో అన్నం పెడతావా? అంటే నీ భుక్తశేషం నేను తింటున్నాను. నా భుక్త శేషం నువ్వు తినడం లేదు. ఇది నాకు అవమానము. నిన్ను ఉపేక్షించను. నీవు విష్ణు భక్తుడివా? చూడు నిన్ను ఏమి చేస్తానో! ఇప్పుడు నేను గొప్పో నీవు గొప్పో తెలియాలి’ అన్నాడు. కోపంతో చేతిలోకి నీళ్ళు తీసుకుని తన జటాజూటం నుండి జటనొకదానిని సమూలంగా పెరికి నేలకేసి కొట్టి భయంకరమయిన ఒక కృత్యను సృష్టించాడు. కృత్య అనేది ఆయన దేనిని చెపితే దానితో ఆకలి తీర్చుకుంటుంది. తన కళ్ళముందు కృత్య అంబరీషుని తినెయ్యాలని అనుకున్నాడు. హద్దులేని క్రోధమునకు వెళ్ళిపోయాడు. ఇపుడు ఆ కృత్యను ప్రయోగించాడు. ఈ కృత్య చేతిలో భయంకరమయిన శూలం పట్టుకుని ఆకలితో ఎగురుతుంటే భూమి గోతులు పడింది. భయంకరమయిన క్రోధంతో కృత్య అంబరీషుని మీద పడింది. దీనిని చూసి దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు. తాను బ్రాహ్మణుడయివుండి అవతల వారి స్థితి గమనించకుండా నిష్కారణమయిన కోపం పెంచేసుకున్నాడు. ఆ కోపమునకు అందరూ బాధ పడుతున్నారు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తున్నాడు. ‘నాకు తెలిసి అపరాధం చేయలేదు. తెలియక చేసిన దోషము దోషము కాదు. నేను ధర్మం తప్పలేదు’ అని నమస్కారం చేస్తూ నిలబడి పోయాడు. ధర్మాధర్మములకు ఫలితమును ఇవ్వగలవాడు కదలాలి.

ధర్మం అంబరీషుని యందు ఉన్నది. సుదర్శనం కదిలి కృత్య మీదకి వెళ్ళింది. కృత్య కాలిపోయింది. సుదర్శనం బ్రాహ్మణుడి వెంట పడింది. సుదర్శనమునకు వెన్నిచ్చి దుర్వాసుడు పరుగెత్తడం మొదలు పెట్టాడు. ఆయన ఆకలి, కోపము అన్నీ మరచిపోయి ప్రాణరక్షణలోకి వచ్చాడు. దుర్వాసుడు పరుగెత్తి పరుగెత్తి బ్రహ్మలోకమునకు వెళ్ళాడు. బ్రహ్మగారు మిక్కిలి చతురతతో ‘ మహర్షీ! నీకు ఎంత కష్టం వచ్చింది? అంబరీషుడి జోలికి వెళ్ళావా? ఇప్పుడు నీవు విష్ణుమూర్తి పాదములను ఆశ్రయించు. ఏ మహానుభావుడి కనుకొలకులు ఎర్రబడితే నా బ్రహ్మస్థానము ఊడిపోయి, సత్యలోకము ఆగిపోతుందో అటువంటి వాని జోలికి నేను వెళ్ళలేను. ఆ చక్రమును నేను ఆపలేను’ అన్నారు. దుర్వాసుడు కైలాసమునకు పరుగెత్తాడు. దుర్వాసుడు పరమశివుని అంశ. మహాదేవా! నీకన్నా గొప్పవాడెవడున్నాడు? నన్ను కాపాడవలసింది’ అన్నాడు. పరమశివుడు ‘నాకూ, దక్షునికి, ఇంద్రునికి, ఉపేంద్రునికి, బ్రహ్మగారికి అర్థం కానిది ఏదయినా ఉన్నదంటే అది విష్ణుమాయ ఒక్కటే. ఆయన సుదర్శనమును నేను ఆపలేను. వైకుంఠమునకు వెళ్ళి విష్ణువు కాళ్ళమీద పడి ప్రార్థించు’ అని అన్నాడు. దుర్వాసుడు వైకుంఠమునకు వెళ్ళాడు. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సభ తీర్చి ఉన్నాడు. దుర్వాసుడు వెళుతూనే శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తూ ఆయన పాదముల మీద పడిపోయి ఆయన రెండుకాళ్ళను తన రెండుచేతులతో గట్టిగా పట్టుకుని పాదముల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు. ఆయన ‘ఏమిటి ఇలా పడిపోయావు. ఏమయింది? లేవవలసింది’ అన్నాడు. ఆయనకు తెలియదా? సుదర్శనమును పెట్టినవాడు ఆయనే కదా! ఏమీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడు. దుర్వాసుడు జరిగినది చెప్పి తనను రక్షించమని కోరాడు. ఆయన ‘నాకు ఒక బలహీనత ఉన్నది. తీగలన్నీ పీకి తాడుచేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్లు నన్నిలా నిలబెట్టేసి తాళ్ళతో కట్టి లక్ష్మీదేవి ఉన్నదని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలచుకుంటూ ఉంటారు. అలా పట్టుకుని వెళ్ళిపోయిన వారిలో అంబరీషుడు ఒకడు. నేనేకావాలి అని తాపత్రయపడే వాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందోనని దానివెనక ఆవు పరుగెత్తినట్లు నేను వానిని రక్షించుకుంటూ ఆ భక్తుని వెంట పరుగెడుతుంటాను. నీ వెనుక వస్తున్న నా సుదర్శన చక్రం అంబరీషుడిని రక్షిస్తోంది. వాడు బ్రాహ్మణుడా! తపస్సు చేశాడా! రాజా! కేవలం వ్రతం చేసాడా? ఇవన్నీ నేను చూడను పరమభక్తితో ఉన్నవాడికి నేను వశుడనయి ఉంటాను. అన్నిటితో ఉండి అన్నిటి విడిచి నన్ను పట్టుకున్నటువంటి వాడిని నేను పట్టుకుంటాను. అది నా లక్షణము’ అన్నాడు.

నీవు వానిపట్ల చేసిన తప్పు నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళుపట్టుకో అనగానే పరుగు పరుగున అంబరీషుని వద్దకు వెళ్ళాడు. దుర్వాసోమహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అదీ ఆయన ధర్మం అంబరీషుని పాదములు పట్టుకుని ‘మహానుభావా! ఈ సుదర్శన చక్రధారల నుండి నీవే నన్ను రక్షించాలి’ అన్నాడు. మహాత్ముడు తనవలన క్రోధమును పొంది అన్ని కష్టములు పడి తన కాళ్ళు పట్టుకొన్నందుకు అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రమును ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనను వింటే మనలను తరుముకు వస్తున్న దురితములనుండి మనం కాపాడబడతాము. సుదర్శనచక్రమునకు నమస్కరించి ‘కోరిన వాళ్లకి నా దగ్గర ఉన్నది లేకుండా ఇచ్చిన వాడనయితే నేను ఎప్పుడు ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనయితే నేను చేసిన పూజలకు శ్రీమహావిష్ణువు సంతోషమును పొందిన వాడయితే, ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న నువ్వు ప్రశాంతతను పొంది, శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువు గాక’ అన్నాడు. దుర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటిని ఒట్టు పెట్టాడు. ఉత్తరక్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠమునకు వెళ్ళిపోయింది.

దుర్వాసుడు ‘ఆహా! గృహస్థుగా ఉంటూ నీవు పొందిన దానిని నేను ఇన్ని ఏళ్ళు తపస్సు చేసి పొందలేక పోయాను. శ్రీ మహావిష్ణువు నామము జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పినా, శ్రీమన్నారాయణుని పాదములకు నమస్కరించినా, వారిని ఏ కష్టములు అడ్డవు. నీవు మహానుభావుడవు. నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి. నీ వైభవము ఏమిటో నేను ఈ వేళ చూశాను. మిత్రుడవై రక్షించావు. ఇకనుండి నీపేరు అన్నిలోకములలో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్లకి శ్రీమన్నారాయణుని పాదములయందు భక్తి కలుగుతుంది’ అని అంబరీషుడిని స్తోత్రం చేస్తూ దుర్వాసోమహర్షి వెళ్ళబోయాడు. అంబరీషుడు ‘మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు. మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్ధమును భుక్తశేషంగా భావించి నేను తింటాను. ముందు మీరు భోజనం చేయండి’ అన్నాడు. దుర్వాసుడు పరమసంతోషంగా భోజనమునకు కూర్చున్నాడు.

క్రోధము ఒక్కటి వుంటే ఎంతటి దానిని ఎలా పాడుచేస్తుందో గమనించాలి. అందువలన క్రోధము నొక్క దానిని ప్రక్కన పెడితే తపస్సులో ఎంత కిందనున్న వాడయినా అంబరీషుడు ఏ స్థితిని పొందాడో గ్రహించాలి. గృహస్థాశ్రమంలో ఉండి అంబరీషుడు సాధించిన విజయమునకు అందరు పొంగిపోయి అంబరీషుని పాదములకు వేయి నమస్కారములు చేయాలి.

ఆ మహానుభావుడు అంబరీషుడు తదనంతరం తపస్సు చేసి ఈశ్వరుని పునరావృత్తిరహిత శాశ్వత నారాయణ సాయుజ్యమును పొంది తరించాడు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[20/11, 5:59 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 65 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

దేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకువెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. వసుదేవుని చూసి ‘బావా చూశావా నువ్వు ఎంత మాట తప్పని వాడవో! పిల్లవాడు పుట్టగానే తీసుకు వచ్చి ఇచ్చావు. నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది! మొదటివాడిని చంపడమెందుకు? తీసుకువెళ్ళిపో’ అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవ కొడుకు పుట్టాడు. ఎనిమిదవ గర్భమును కదా ఇమ్మన్నాడని రెండవ పిల్లవానిని తీసుకు వచ్చి ఇవ్వలేదు. ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు. ఆ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి, నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోకకళ్యాణం చేస్తాడు. కంసుని దగ్గరకు వచ్చి ‘కంసా! ఎంత వెర్రివాడవయ్యా! అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుష్యులు కారు. నువ్వు క్రిందటి జన్మలో ‘కాలనేమి’ అను పేరు గల రాక్షసుడవు. నిన్ను శ్రీమహావిష్ణువు సంహరించారు. నీ తండ్రి, తల్లి, దేవకీ, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు’ అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయాడు.

కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా! వసుదేవుడిని ఆరుగురి పిల్లలను తీసుకురమ్మనమని కబురు చేశాడు. ‘ఎనిమిదవవాడికి వీళ్ళు సహాయ పడితే నా బ్రతుకు ఏమయిపోవాలి? ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి’ అనుకుని పిల్లలను చంపేశాడు. తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పూతన – ఇలాంటి వారినందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేసాడు. వస్తున్న గర్భం ఏడవ గర్భం. జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమయిన కారాగారంలో పెట్టాడు. రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు. ఇక్కడ ఒక అనుమానం రావాలి. వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు. లోకకళ్యాణకారకుడు. ‘నారం దదాతి యితి నారదః’ అని ఆయన జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడు అయ్యాడు? వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడని అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీభాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యమును చెప్పారు.

పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. బ్రహ్మగారు ‘మీరు రాక్షసుని కడుపున పుట్టండి’ అని శపించారు. అందువలన వారు ఆరుగురు క్రిందటి జన్మలో ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపున పుట్టారు. అప్పటికి వాళ్ళకి ఉన్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈవిషయమును వారు తండ్రయిన హిరణ్యకశిపునకు చెప్పారు. హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. ‘నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు. మీరు అప్పుడే పొందారా? మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు’ అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు. వాళ్ళ శాపం ఈ జన్మతో ఆఖరవుతుంది. వీళ్ళు ఇప్పుడు గతజన్మలోని తండ్రి కాలనేమి అయిన కంసుడిచేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనమయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేసాడు. అదీ నారదుని రాకలో గల కారణం. ఇది దేవీ భాగవతాంర్గతం.

కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములనన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీమహావిష్ణువుని తనకడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని కారాగారమునందు మగ్గుతున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలని అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. యోగమాయను పిలిచి ఒకమాట చెప్పాడు. ‘నీవు భూమి మీదకి వెళ్ళు. అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. కంసుడు వసుదేవుని భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉన్నది. వసుదేవుని తేజస్సు దేవకీదేవిలో ఏడవగర్భంగా శేషుని అంశ ఉన్నది. ఎవరికీ తెలియకుండా ఆ గర్భస్థమయిన పిండమును వెలికి తీసి దానిని తీసుకు వెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు. గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. ఇక్కడ జారిపోయిన పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడన్న పేరుతో జన్మిస్తాడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. నీవు వెళ్ళి ఆపని చేయవలసినది’ అని చెప్పాడు. వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది. ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండమును బయటికి లాగి నందవ్రజంలో నందుని దగ్గర వున్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది.

ఇవాళ భాగవతమును వింటున్నప్పుడు ఇది జరుగుతుందా అని సందేహించనవసరం లేదు. ఇప్పుడు మనవాళ్ళు చేసే పనిని భాగవత కాలంలోనే మహర్షులు చేశారు. చాలా బలవంతుడయిన వాడు కాబట్టి ఆయనకు ‘బలభద్రుడు’ అని పేరు. లోకముల నన్నింటిని ఆనందింప చేస్తాడు కాబట్టి రామ శబ్దమును ప్రక్కన పెట్టి ‘బలరామా’ అని పిలిచారు. ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశ పెట్ట బడ్డాడు ‘సంకర్షణుడు’ అని పేరు వచ్చింది. ఈవిధంగా బలరాముని ఆవిర్భావం జరిగింది. తదనంతరం కృష్ణపరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణుని పూర్ణమయిన తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది. వసుదేవుడి లోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోనికి ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఈ గర్భంలోకి ముప్పది కోట్ల మంది దేవతలు బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. ఇదీ గర్భశుద్ధి అంటే. వారందరూ మహానుభావా! నీవు మాయందు అనుగ్రహించాలి. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులయిన వారిని నిగ్రహిస్తున్నారు. ముకుందా! నీవు అమ్మ గర్భంలోనుండి బయటకు రావసిందని పరమాత్మను స్తోత్రము చేస్తున్నారు.

ఇక్కడ కంసుని పరిస్థితి దారుణంగా ఉన్నది. దేవకికి అష్టమ గర్భం వచ్చేసింది. నెలలు పెరుగుతున్నాయి. తొమ్మిదవ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనపడుతున్నది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం. జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసునికి కూడా కనపడుతోంది. నారదుడు ధర్మరాజు గారితో ‘కొందరు వైరముతో కూడా ఈశ్వరుని పొందుతున్నారు’ అన్నాడు. కంసుడు ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతున్నది. శ్రావణమాసంలో అర్థరాత్రి పన్నెండు గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉన్నది. కంసుడు గాఢనిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి ఇనుప గొలుసులు వేసాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేసాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమయినా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్ళకు చేతులకు ఇనుప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆతల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్థరాత్రి పన్నెండు గంటల వేళయింది.

మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. నాలుగు బాహువులతో, నల్లటి మబ్బువంటి కాంతితో, పట్టు పీతాంబరము కట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకొన్న వాడై, మహానుభావుడు వజ్ర వైడూర్యములు పొదగబడిన కిరీటముతో, నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండ స్థలములయందు ప్రకాశిస్తూ ఉండగా, మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, సమస్త లోకములు కొలిచే పాదపద్మములతో, చంటిపిల్లవాడిగా వసుదేవునికి దర్శనం ఇచ్చాడు. పిల్లవానిని చూసి సంకెళ్ళలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. నేను ఎన్ని దానాలు చెయ్యాలి. కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. నేను చెయ్యడానికి కూడా లేదు. ‘కృష్’ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందములో ఆయన స్నానం చేసాడు. ఒక్కసారి నీళ్ళు ముట్టుకున్నాడు. మానసికముగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడు. ‘నేను కారాగారమునుండి బయటకు వచ్చిన తరువాత తీర్చుకుంటాను’ అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ ‘భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెపుతాను వినండి.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

[20/11, 5:59 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 64 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీరామ చరిత్ర

నవమస్కంధములో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమ స్కంధమును ప్రారంభం చేసేముందు నవమస్కంధములో రామాయణమును చెప్పారు. నవమ స్కంధములో శ్రీరామచంద్రప్రభువు యొక్క సంకీర్తనము విశేషంగా చేయబడింది. ఇక్ష్వాకువంశములో జన్మించిన దశరథ మహారాజుగారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే, సంతానం కలగడానికి ప్రతిబంధకమయిన పాపము పరిహరింపబడి, యజ్ఞపురుషుని అనుగ్రహముచేత లభించిన పాయసమును తన ముగ్గురు ధర్మపత్నులయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచి ఇస్తే పుట్టిన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నలుగురు కుమారులలో మహాధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని, తాను భార్య సీతమ్మతో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితుని చేయడం కోసం, పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల పీచమడచి, అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో కబంధవధ జరిగిన తరువాత సుగ్రీవుని జాడ తెలుసుకుని, మైత్రి చేసి, వాలిని సంహరించి, హనుమ సహాయంచే నూరుయోజనముల సముద్రమునకు ఆవల దక్షిణదిక్కున వున్న లంకాపట్టణంలో రావణాసురుని ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మజాడ హనుమ ద్వారా తెలుసుకుని, సముద్రమునకు సేతువు కట్టి, ఆవలి ఒడ్డుకు చేరి, రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి, తిరిగి సీతమ్మను పొంది పదకొండు వేల సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి, రామరాజ్యమని పేరు తెచ్చి, ఎన్నో ఆశ్వమేధములు, వాజపేయములు, పౌండరీకములు మొదలయిన యాగములు చేసి, మనిషి ఎలా ప్రవర్తించాలనే దానికి ఒక అద్భుతమయిన కొలమానమును ఏర్పాటు చేసిన విశేషమయిన అవతారము రామావతారము.

ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతనగారియందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడింది. రాముడు కృష్ణుడని ఇద్దరు లేరు కనుక ఆ రాముడే కృష్ణకథ చెప్పించాడు.

దశమ స్కంధము – పూర్వ భాగము – శ్రీకృష్ణ జననం

భాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు లాంటిది. ఈ దశమస్కంధము జీవితంలో తప్పకుండా విని తీరాలి. ఇందులో వ్యాసభగవానుడు కృష్ణ భగవానుని లీలలను విశేషమయిన వర్ణన చేసారు. పోతనగారు దానిని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేశారు. దశమస్కంధమును ప్రారంభం చేస్తూ ఒకమాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చి ‘మహానుభావా! భూలోకంలో ఎందరో రాజులు భూమి పతులమని పేరు పెట్టుకొని పరమదుర్మార్గమయిన పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది అధర్మాత్ములు ఈవేళ భూమిమీద తిరుగుతున్నారు. వారి భారం నాకు ఎలా తగ్గుతుంది? అటువంటి వారి మదమణచి భూమి భారమును తగ్గించవలసినది’ అని ప్రార్థించింది. భూభారము అనేది తక్కెట్లో పెట్టి తూచే కొలత కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే, ఎన్ని ప్రాణులు వున్నా, భూమికి ఎప్పుడూ బరువు కాదు. కాని ధర్మము తప్పి ప్రవర్తించే మనుష్యులను చూసి భూమి భారమని బాధపడుతుంది. అన్నిటిని సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది. ‘భారము తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారకుడయిన శ్రీమహావుష్ణువు అనుగ్రహం కాబట్టి నీవయినా నేనయినా ఆయనను ప్రార్థన చేయాలి’ అని ఆనాడు బ్రహ్మగారు ధ్యాన మగ్నుడై పురుషసూక్తముతో స్వామి వారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానమునందు ఆయనకు ఒక వాణి వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వునవ్వి బ్రహ్మగారు ‘భూమీ! నీవేమీ బెంగపెట్టుకోవద్దు. స్వామి తొందరలో కృష్ణావతారమును స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమయిన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షససంహారం ప్రారంభం చేస్తాడు. ఎందరో రాక్షసులు, దుర్మార్గులు మరణిస్తారు. నీకు భారము తగ్గుతుంది. దేవతలను, సురకాంతలను తమతమ అంశలతో భూమిమీద జన్మించమని స్వామి ఆదేశం ఇచ్చాడు. ఆయన యదుకులంలో యాదవుడిగా పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు. జగదాచార్యునిగా లోకమునకు జ్ఞానమును ఇస్తాడు’ అని చెప్పాడు. భూమాత పరమ సంతోషమును పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసమని నిరీక్షిస్తున్నది.

ఈలోగా భూలోకంలో యదువంశమునకు చెందిన శూరసేనుడు అనే రాజు మధుర రాజ్యమును పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశమునకు చెందిన ఉగ్రసేనుడు, దేవకుడని ఇద్దరు అన్నదమ్ములు. దేవకుని కుమార్తె దేవకి. ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని చెల్లెలు దేవకీదేవి. దేవకీదేవిని శూరసేనుని కుమారుడైన వసుదేవునకిచ్చి వివాహం చేశారు.

దశమస్కంధము ఉపనిషత్ రహస్యము. దశమస్కంధము ప్రారంభంలోనే ఒక లక్ష టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానమును తెలుసుకోగలిగితే హృదయగ్రంథి విడిపోయినట్లే! కృష్ణ జననం పరమపవిత్రమయిన ఆఖ్యానం.

దేవకీ వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుఱ్ఱములను, బంగారు ఆభరణములతో అలంకరింపబడిన ఏనుగులను, కొన్ని వేల రథముల నిండా బంగారమును, కొన్ని వందలమంది దాసీజనమును ఏర్పాటు చేసి, మహానుభావుడయిన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు. రాజమార్గంలో కొన్ని వేల రథములు అనుసరించి వెడుతున్నాయి. దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. రథమును నడపడానికి సారథి ఉంటాడు. ఆ సమయంలో కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. అతనికి చెల్లెలు అంటే మహాప్రేమ. ఆమె తన తండ్రిగారి సోదరుని కుమార్తె అయినా, కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ. ఆయన దేవకీదేవి రథమును నడపడానికి సిద్ధపడ్డాడు. అందరూ చాలా సంతోషించారు. తానే చెల్లెలిని అత్తవారింటిలో దింపుతానని గుఱ్ఱముల పగ్గములు పట్టుకున్నాడు. వెనక దేవకీవసుదేవులు కూర్చున్నారు. రథం వెళుతున్నది.

అశరీరవాణి కొన్ని మాటలు పలికింది. ‘అశరీరవాణి’ చాలా గమ్మత్తయిన మాట. శరీరము ఉంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తున్నదని గుర్తు. కనీసంలో కనీసం ఎదురుగుండా నామ రూపములతో ఏదో ఉండాలి. మనుష్యుడు లేకుండా మాట ఉండదు. కానీ ఇక్కడ శరీరము లేదు కానీ మాట వినబడుతున్నది అంటున్నారు అదీ చిత్రం.

‘తలోదరి’ అంటే పైకి కనపడని కడుపు కలది. కొంతమందికి కడుపు కనపడదు. అసలు కడుపు ఉన్నదా లేదా అనే అనుమానం ఉన్నట్లు ఉన్నవాళ్ళని ‘తలోదరి’ అంటారు. అసలు కడుపు లేనట్లుగా శుష్కించిన కడుపులా కనపడుతున్నది. ఈ కడుపులో ఎనమండుగురు పుట్టబోతున్నారు. వారిలో ఎనిమిదవవాడు కంసుడిని చంపబోతున్నాడు. ఆవిడ చక్కగా వసుదేవుడిని వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది. ‘ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా, రథము నడుపుతున్నావు! కాని ఈమె ఎనిమిదవ గర్భము నిన్ను చంపేస్తుంది’ అని అశరీర వాణి పలికింది.

ఇప్పటివరకు కంసుడు పరమప్రేమతో ఉన్నాడు. ఆకాశంలోంచి ఈమాట వినపడగానే వెంటనే రథమును ఆపి క్రిందికి దిగాడు. కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి. అపారమయిన కోపం వచ్చేసింది. తన ఎడమ చేతితో చెల్లెలి కొప్పు పట్టుకొని రథములో నుండి క్రిందకు లాగి ఒరనుండి కరవాలమును తీసి ఆమెను నరికివేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆసమయంలో వసుదేవుడు మాట్లాడాడు. ఇది చాలా గమ్మత్తయిన సన్నివేశం. ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్న వాడు బావమరిది, తన చెల్లెలినే లాగేసి చంపేస్తాడని, అశరీరవాణి పలుకుతుందనిగాని వసుదేవుడు కలగనలేదు.

ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా చాలా పెద్దమనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పలేని మాట అయ్యేటట్లుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంతో గొప్పగా మాట్లాడాడు.

ముందు కంసుని అనుగ్రహం కోసమని బ్రతిమలాడాడు. ప్రపంచంలో పరమపవిత్రమయిన సంబంధములలో ‘అన్న’ అనిపించుకున్న రక్తసంబంధం ఒకటి. అన్నగా పుట్టినవాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికి వుండాలని కోరుకోవాలి. ‘బావమరిది బ్రతక కోరతాడు’ అని ప్రపంచంలో ఒక సామెత ఉన్నది నీవు అన్నవి రథం తోలడానికి వచ్చావు. నీ చెల్లెలిని సంతోష పెట్టాలి. చక్కని మాటలు నాలుగు మాట్లాడాలి. నువ్వు చంపేస్తాను అంటున్నావు. గాలిమాటలు నమ్మి చెల్లెలిని చంపేస్తావా! రేపు ప్రపంచం నిన్ను ఏమంటుంది? అరివీర పరాక్రమము కలిగినవాడు భోజవంశంలో పుట్టినవాడయిన కంసుడు ఒక చెల్లెలి ఎనిమిదవ గర్భము వలన చచ్చిపోతాననే గాలిమాట విని, ఇంకా పాదముల పారాణి ఆరని ఆడపిల్లను చంపేశాడని లోకం చెప్పుకుంటుంది.. అది ఎంత మహాపాపం. అందుకని తొందరపడి చంపకు. నిన్ను అభ్యర్థిస్తున్నాను’ అన్నాడు.

కంసుడు ‘అది మిన్నులమోతో, అధికారిక వాక్యమో నాకు అనవసరం. ఈమె కడుపున పుట్టిన ఎనిమిదవ పిల్లవాడి వలన నాకు ప్రాణహాని అని నాకు వినపడింది. అందుకని నేను చంపేస్తాను’ అన్నాడు.

వసుదేవుడు ‘నీ అదృష్టం కొద్దీ నీ చావుకు ఒక కారణం తెలిసింది. ఒకవేళ నీవు ఈమెను చంపివేశావనుకో నీకు చావురాకుండా ఉంటుందా? చెల్లెలిని చంపిన పాపమునకు అధోగతికి వెళ్ళిపోతావు. నీ చెల్లెలిని విడిచిపెట్టెయ్యి’ అన్నాడు. ఎంత గొప్ప వేదాంతమును చెపితే మనసు మారే అవకాశం ఉంటుందో దానిని చెప్పాడు. ఏడురోజులు వినేది శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పారు. ఏడు క్షణములలో వినేది వసుదేవుడు కంసునికి చెప్పాడు. వాని మనస్సు మారలేదు. కంసుడు ‘నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు. నేను మరణమును అంగీకరించను. దేవకిని చంపేస్తాను’ అన్నాడు. వసుదేవుడు ఆలోచించాడు. ఉన్నదున్నట్లు చెపితే కంసుని తలకెక్కదని భావించాడు. తానొక ధర్మము నిర్వర్తించాలి తన భార్యను రక్షించుకోవాలి. జ్ఞానబోధ చేస్తే వీని బుద్ధికి ఎక్కదు. అలాగని ఎలాగయినా తన భార్యను రక్షించుకోవాలని అసత్యమును చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. అది కంసుని మనస్సుకు నచ్చేదయి ఉండాలి. ముందు అసలు నేను తక్షణం చేయవలసిన పని దేవకీదేవి ప్రాణములను రక్షించడం అనుకుని ‘బావా! అయితే నీకొక మాట చెబుతాను. నీ చెల్లెలికి పుట్టిన ఎనిమిదవ వాని చేత నీవు మరణిస్తానని అనుకుంటున్నావు. ఈ దేవకీ దేవి గర్భమునుండి పుట్టిన ప్రతి పిల్లవాడిని, పుట్టీ పుట్టగానే తీసుకువచ్చి నీకు ఇచ్చేస్తాను. వాడిని నువ్వు చంపెయ్యి. అపుడు నీకు మృత్యువు రాదు కదా! అంతేకానీ నీ చెల్లెలిని చంపడం ఎందుకు? పాపకర్మ కదా! నీ మృత్యుహేతువును నువ్వు చంపినట్లయితే ప్రపంచం నిన్ను తప్పు పట్టదు. నువ్వూ ధర్మం తప్పనక్కరలేదు. నేనూ ధర్మం తప్పనక్కరలేదు. ఆమెను విడిచి పెట్టు’ అన్నాడు.

కంసుడు ‘ఇదేదో బాగానే చెప్పాడు’ అనుకుని మీ ఇద్దరు హాయిగా అంతః పురమునకు వెళ్ళిపొండి’ అని ఆ రథమును వదిలిపెట్టేశాడు. దేవకీ వసుదేవులు ఎంతో సంతోషముగా ఉన్నారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[21/11, 8:32 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 66 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


స్వాయంభువ మన్వంతరంలో మీరిద్దరూ (దేవకీ వసుదేవులు) ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు. ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ పన్నెండు వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షం అయి ‘ఏమి కావాలి?’ అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. ‘నీలాంటి కొడుకు కావాలి’ అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేదు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒకమారు అడిగితే నేను మూడుమార్లు పుట్టాను. ఒకసారి నేను పృశ్నికి పృశ్నిగర్భుడుగా, రెండవమారు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా ఇప్పుడు కృష్ణభగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉన్నది. అంతరార్ధం తెలిసినా తెలియకపోయినా నా కథ విని, నన్ను స్మరిస్తూ, నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షమును పొందండి’ అన్నాడు.

ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయములు వసుదేవునకు అంతరమునందు ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయమును బాహ్యమునందు చెప్పలేదు. ‘ఇదే సమయమునందు యమునానదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమయిన యోగమాయ యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరల అక్కడనుంచి ఆడపిల్లను తెచ్చి దేవకి ప్రక్కన పడుకోబెట్టు’ అన్నాడు.

వెంటనే వసుదేవుని కాళ్ళు, చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెలమీద పెట్టుకున్నాడు. చాలామంది తలమీద పెట్టుకున్నారు అంటారు. పోతనగారి భాగవతంలో అలా లేదు. గుండెల మీద పెట్టుకున్నాడనే ఉన్నది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారమునకు ఉన్న ఇనుప గొలుసులు, తాళములు, మేకులు అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడపట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు ఆకాశం అంతా నల్లటి మబ్బుపట్టి ఉన్నది. గాఢాంధకారము. శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. విపరీతమయిన వేగంతో ప్రవహిసస్తున్న యమునానది దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడు పరమాత్మను గుండెలమీద పెట్టుకుని యమున వంక చూశాడు.

కృష్ణభగవానుని గుండెలమీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు యిచ్చిన సముద్రములా యమున చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ పిల్లను ఎత్తుకుని మళ్ళీ తిరిగివచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుపసంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆ ఆడపిల్లను దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణపరమాత్మను గుండెలమీద ధరించాడు. అనగా వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపమును తెలుసుకున్నాడు. ఆయన హృదయగ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకియందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది.

ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ వున్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్పలమీద రాజముద్ర ఉన్నదీ లేనిదీ చూశారు. రాజముద్ర ఉన్నది. లోపలి వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటులు పిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్న వాడు పరుగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీ దేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆ ఆడపిల్లే తనపిల్లే, తానే రక్షించుకోవాలని అనుకుని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టుకున్నది. ‘అన్నయ్యా! ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు మేనకోడలు. నన్ను నమ్ము ఆరుగురిని చంపేశావు. ఏడవది గర్భస్రావము అయింది ఇది ఆడపిల్ల. ఇంటికి ఆడపడుచు నీకు కోడలు. నువ్వు మన్నన చేయాలి. పసిపిల్లయిన దానిని చంపాడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనయినా బ్రతకనివ్వు. చంపవద్దు ’ అని ఏడుస్తూ వేడుకున్నది.

కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి పసిపిల్ల రెండు కాళ్ళు పట్టుకు లాగేసి గిరగిర త్రిప్పి బండకు వేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమునందు ఆరూఢయై కూర్చుంది. అటునుంచి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. ‘నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పదునాలుగు నామములతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ నామములు వింటున్న వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ వున్నా నీవు రక్ష చేస్తావు’ అన్నాడు. ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపములు సమర్పిస్తున్నారు. నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవన్నీ తీసుకుని క్రింద ఉన్న కంసుని చూసి ‘ఓరీ దుర్మార్గుడా! పిల్లలందరినీ రాళ్ళకు వేసి కొట్టి చంపావు. నన్నుకూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతోపాటు పుట్టి నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నీవు చనిపోవడం ఖాయం’ అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది.

వెంటనే కంసుడు పరుగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండమని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు.

అవతల నందవ్రజంలో ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కృష్ణపరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది. నంద వ్రజం భగవద్భక్తులతోనూ, గోవులతోను నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోష పడిపోతు చూచివద్దామని యశోద గృహమునకు వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు ‘అబ్బ పిల్లవాడు ఎంత బాగున్నాడే!’ అని పరవశించిపోతున్నారు. బయట నందప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి గోవులను దానం ఇచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇచ్చాడు. పిల్లవాని జాతకము చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి ‘లేక లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడవుతాడు లక్ష్మీదేవి వీనిదే. ఎటువంటి వీరులనయినా ఓడిస్తాడు. గొప్ప దీర్ఘాయుర్దాయమును పొందుతాడని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడకు వచ్చిన వాళ్ళలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్ళు పోయమని అడిగారు. లోకములన్నింటిని ప్రళయం చేసేయ్యాలనుకున్నప్పుడు నీళ్ళలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకుమీద ఏమీ తెలియనివాడిలా బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రశాయి ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పడుకొని నీళ్ళు పోయించుకొని ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగకృష్ణుడు. ఆఖరుకి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పడుకోపెట్టారు.

పూతన సంహారం

కంసుడు అష్టమగర్భమును తాను సంహరించగలనని ఎన్నో ప్రయత్నములు చేశాడు. ఎన్ని ప్రయత్నములు చేసినా అష్టమగర్భం జారిపోయి ఇంకొకచోట పెరుగుతోంది. తన మృత్యువును ఏ ప్రయత్నము చేత అధిగమించలేకపోతున్నాడు. ఈ సత్యమును కంసుడు అంగీకరించి ఉంటే కంసుడి జీవితం వేరొకరకంగా మారి ఉండేది. కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయముననే తన మంత్రులను పిలిచి ‘మీరు అందరూ చూసారు. నిన్న నేను ఆ బిడ్డను చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారిపోయి పైకి వెళ్ళి నీవు తొందరగా మరణించబోతున్నావు. నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టి వేరొకచోట పెరుగుతున్నాడు’ అని చెప్పింది. నాకు కొంచెం భయంగా ఉన్నది’ అన్నాడు.

కంసుని చుట్టూ ఉన్నవాళ్ళు ‘రాజా! ఈ మాత్రం డానికే భయపడి పోతావేమిటి? మీ ధాటికి ఆగలేక దేవతలందరూ దాక్కుని ఉన్నారు. మీ శక్తి మామూలుది కాదు. మీరు మాకు ఒక్క ఉత్తరువు ఇచ్చారంటే మేము అంతటా తిరిగి కొత్తగా పుట్టిన పిల్లల దగ్గరనుంచి పళ్ళు వస్తున్న పిల్లల వరకు అందరినీ చంపేస్తాము’ అన్నారు. నీ ప్రధాన శతృవు శ్రీమహావిష్ణువు. గతంలో నీవు కాలనేమిగా ఉండగా నిన్ను సంహరించాడు. నీకు రహస్యం చెపుతాను విను. ఇప్పటికి కూడా పిల్లవాని రూపంలో వచ్చి నిన్ను విష్ణువే చంపుతాడు. విష్ణువు మూలమును తీసివేయాలి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో దానిని తీసివేయాలి’

ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారో, ఎవరు జపం చేస్తున్నారో, ఎవరు ఈశ్వరుని నమ్ముతున్నారో, ఎవరు ప్రశాంతముగా ఉంటున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో, ఎవరు అగ్నికార్యం చేస్తున్నారో, ఎవరు వేదం చదువుకుంటున్నారో, ఎక్కడ ఆవులు ఉన్నాయో, ఎక్కడ దూడలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హోమములు జరుగుతున్నాయో, వీటినన్నింటిని నాశనం చేసేస్తే విష్ణువనేవాడు లేకుండా పోతాడు. మనకు శత్రువు ఉండడు. వీటినన్నిటిని నాశనం చేస్తాము మాకు అనుజ్ఞ ఇవ్వండి’ అన్నారు. నందవ్రజంలో కృష్ణభగవానుడు పెరుగుతున్నాడు. ‘అజాయమానో బహుధా విజాయతే’ అని వేదం అంటోంది. జన్మించ వలసిన అవసరం లేనివాడు అనేకమయిన జన్మలను పొందుతున్నాడు. అటువంటి వానికి జాతకర్మ చేస్తున్నారు. ఆయన కన్నా ముందు ఉన్నవాడు ఎవడూ లేడు. ఆయన తర్వాత ఉండేవాడు లేదు. ఆయన ఎప్పుడూ తల్లిపాలు త్రాగి ఎరుగడు. అటువంటి వాడు ఈవేళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకొని పాలు త్రాగుతున్నాడు. పరబ్రహ్మము అనుగ్రహం ఎంత ఆశ్చర్యం! ఆ యశోద ఎంత పుణ్యం చేసుకున్నదో కదా! ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా ఆ యశోదను చూడాలనుకుంటే వేంకటాచలంలో వేంకటరమణుని సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా అందుతున్నదీ లేనిదీ చూస్తూ వకుళమాతగా కూర్చుంది. ఆయనకు హానీ తెలియదు, వృద్దీ తెలియదు. ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం, పెరగడం, తరగడం లాంటివి ఉండవు. అలాంటివాడు ఆశ్చర్యంగా రోజురోజుకీ అమ్మ ఒడిలో పెరుగుతున్నాడు. ఎంత తపస్సు చేసినా చూడడానికి వీలుకాని మూర్తి ఇవాళ ఏమీ చేతకాని గోపకాంతల ఇళ్ళల్లో పెరిగి పెద్దవాడయి ఆడుకుంటున్నాడు. నందవ్రజంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి వారు నైవేద్యం పెట్టనవసరం లేకుండా తానే అడిగి తినేవాడు. ప్రత్యక్ష కైంకర్యం ఎంత అదృష్టం. ఎంత చదువుకున్నా బ్రహ్మము ఎలా వుంటుంది అంటే చెప్పడం కుదరదు.

‘యతోవాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా’

మనస్సు, వాక్కు ఇంకా మేము పరబ్రహ్మము గురించి చెప్పలేమని ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మము ఉన్నది. ఏ చదువు కూడా చెప్పలేని ఆ పరబ్రహ్మము ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇది పరమాత్మ కారుణ్యము. ఏదయినా ఈశ్వరానుగ్రహంలో నుంచే వస్తుంది.



https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

[21/11, 8:32 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 67 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఆవిడ బాలఘాతకి. ఆవిడ శిశువులు ఎక్కడ వున్నా తొందరగా పసిగట్టి చంపగలదు. ఆవిడ కామరూపిణి. రూపం మార్చుకుంటుంది. మార్చుకుని భవనమునందు ప్రవేశించింది. ఆమె శిశువులను చాలా గమ్మత్తుగా చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. విషమును పాలలా ఇస్తుంది. పాలు త్రాగి శిశువులు మరణిస్తారు. అది ఆవిడకు ఉన్న శక్తి. ఆమె చంపేదానిలా కనపడదు. పెంచేదానిలా కనపడుతుంది. ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. ఆమె ఆకాశంనుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో ఉన్న కృష్ణ పరమాత్మను కనిపెట్టింది. లోపల ఊయల దగ్గరకు వెళ్ళింది. పర్యంకము దగ్గరకు చేరింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుని దగ్గరకు చేరింది. ఆమె రాశీభూతమయిన పిల్లవాని సౌందర్యమును చూసి ‘నేను సహజంగా రాక్షసిని. చాలా వికృతంగా ఉంటాను. నా రూపమును మరుగుపరచి చాలా అందమయిన దానిలా వచ్చాను’. ఈవిడ వస్తుంటే చరాచర ప్రపంచపు ఆంతరమున, బాహ్యమునందు నిండిపోయిన పరమాత్మకు ఈవిడ ఎందుకు వస్తోందో తెలుసు. కాలు చేయి పొట్టకింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా జగత్తునంతా నిండి ఉన్న పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలు పెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసయినా ఆ బాలుని అందమునకు వశపడిపోయింది. ఆమె తెలియకుండానే ‘నేను నీ ప్రాణములను తీసెయ్యడానికి ఇంత అందంగా వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు త్రాగితే ఎందుకూ పనికిరాకుండా అయిపోతావు’ అని అన్నది.

పూతన తెలియకుండానే ‘నళినదళాక్షా’ అని పిలిచింది. ‘తామరరేకుల వంటి కన్నులు వున్న పిల్లవాడా! ఎంత అందంగా ఉన్నావు! నా పాలు ఒక గుక్కెడు త్రాగావంటే ఇంత అందం చటుక్కున మాయమయిపోతుంది. నా అందమేమిటో అప్పుడు చూద్దువుగాని! నీ అందానికి సార్థకత వస్తుంది. రా త్రాగు’ అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి చూసి ‘అయ్యో! అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు! మా పిల్లవాడు అన్యస్త్రీల క్షీరమును స్వీకరించడు. ఆగుఆగు’ అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే. ఒక్కసారి ఆ విషమును నోట్లో పెడితే చాలు అనుకుని గబగబా పిల్లవాడిని తీసి ఒడిలో పెట్టుకుని, వాడి ముఖమును త్రిప్పి, ఎలాగయినా సరే స్తన్యం నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలో ఆవులించాడు. ఒకసారి క్రీగంట చూసాడు. మరల నిద్ర వచ్చేసినవాడిలా కళ్ళు మూసాడు. మళ్ళీ కళ్ళు విప్పాడు. ‘పాలు త్రాగక తప్పదా’ అన్నట్లుగా చూసి విసుక్కుని అయినా పాలను తాగడం అలవాటయిన వాడిలా అమ్మ స్తన్యం త్రాగినట్లే ఆ స్తనమును తన బుజ్జి బుజ్జి వేళ్ళతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ రెండు గుక్కల పాలు త్రాగాడు.

ఆ రెండుగుక్కలలో ఆమె గుండెలలో ప్రాణముల దగ్గరనుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటిని లాగేశాడు. ఇప్పటి వరకు ‘త్రాగు త్రాగు’ అనడమే తప్ప ‘వదులు వదులు’ అనడం తెలియదు. పూతన ‘వదలరా బాబోయ్ అంటున్నది పూతన. ఆయన పట్టుకుంటే వదులుతాడా? ఆయన త్రాగేశాడు. ఆయన పాలు త్రాగెయ్యగానే ఆమె కామరూపం పోయి ఒక్కసారి గిరగిరగిర తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమయిన శరీరంతో క్రిందపడిపోయింది. పదమూడు కి.మీ దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయింది. పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. స్తన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెలమీద ఉన్నాడు. ఆ గుండెల మీద వున్న కృష్ణుడిని అలాగే చేతులతో పట్టుకొని గిరగిర తిరిగి పడిపోయింది. ఆమె కోరలు నాగటి చాళ్ళలా ఉన్నాయి ముక్కు రంధ్రములు పెద్ద కొండగుహల్లా ఉన్నాయి. పర్వత శిఖరములవంటి స్తనములు, కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఆమె శరీరం చుట్టూ గోపగోపీ జనమంతా నిలబడి ‘ఎంత పెద్ద రాక్షసి’ అంటున్నారు. కృష్ణుడు ఆమె మీద ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం యశోదా రోహిణులకు మాత్రమే తెలుసు. అయ్యో పిల్లాడు అయ్యో పిల్లాడని పూతన భుజములమీదనుండి పర్వతమును ఎక్కినట్లు ఎక్కారు. పసికూన అయిన కృష్ణునికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని ఏమీ తెలియని వాడిలా బోసి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో పిల్లవాడు బ్రతికి వున్నాడని పిల్లాడిని ఎత్తుకుని భుజంమీద పెట్టుకొని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి క్రింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు. ఆయనకా భయం? ‘భయకృద్భయనాశనః’ అని ఆయనకు పేరు. గోపికలు అనుకుంటున్నారు. వీళ్ళదీ పరమభక్తి అంటే! వాళ్లకి కృష్ణుని గొప్పతనం తెలియదు. వారు కృష్ణుని ప్రేమించారు.

ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరకి తీసుకు వెళ్ళారు. ఆవుతోక పిల్లవాడి చుట్టూ తిప్పి, ఆవు మూత్రము ఆయన మీద చల్లి, ‘నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠమును హృషీకేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, గర్భమును మాధవుడు రక్షించు గాక, తొడలను ముకుందుడు రక్షించుగాక’ అంటూ పరమాత్మ పన్నెండు నామములు పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమయిన అంగములకు పేడ పూస్తూ రక్షపెట్టారు. ‘ఏమి భక్తిరా వీళ్ళది?’ అని ఆయన మనస్సులో నవ్వుకుంటున్నాడు. ఇంతలో ఒక చిత్రమయిన గమ్మత్తు జరిగింది.

నందవ్రజమునకు పూతన రావడానికి పూర్వము నందుడు మధుర వెళ్ళాడు. కంసరాజుకి ఈయన సామంతుడు. ప్రతి ఏడాది కప్పం కట్టాలి. కప్పం కట్టడం కోసమని ధనమును తీసుకువెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి, మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుని చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురువచ్చి కౌగలించుకొని ‘నందా! నిన్ను కలవడం చాలా సంతోషం. నీకు కొడుకు పుట్టాడని విన్నాను. ఎంత ఐశ్వర్యము ఉన్నా పిల్లలు లేని ఇల్లు ఐశ్వర్యము లేని ఇల్లే కదా! నీవు గొప్ప ఐశ్వర్యమును పొందావు. నేను చాలా సంతోషిస్తున్నాను’ అన్నాడు. నందుడు నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీకు ఆరుగురు కుమారులు పుట్టారు. ఆరుగురినీ దుష్టుడై కంసుడు సంహరించాడు. వసుదేవా! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నాకొడుకు నీ కొడుకే’ అని అన్నాడు. నిజమునకు కృష్ణుడు వసుదేవుడి కొడుకేగదా! వసుదేవుడు త్రికాలవేది. వసుదేవుడు ‘నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి. నీవు తొందరగా బయలుదేరి వెళ్ళిపో’ అన్నాడు. కంసుడు కృష్ణుడిని పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడని తెలుసు.

నందుడు గబగబా బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాడు. దారిలో పడివున్న రాక్షసి శరీరమును చూశాడు. వసుదేవుడు చెప్పినది యథార్థమని గ్రహించాడు. ఆ శరీరమునంతటినీ ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రమును వెలిగించారు. ఆవిడ రాక్షసి. శరీరం కొవ్వుతో నిండిపోయి ఉన్నది. అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుందని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అగరువత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో వున్న పాపమును కూడా త్రాగేశాడు. పుణ్యమే మిగిలిపోయింది. ఆ శరీరం కాలిపోతుంటే అగరువత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణునికి తల్లి ఉంటే ఏ లోకములకు వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్ళిపోయింది. మరి ఆ ‘పిల్లవాడు నా కొడుకు’ అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో ఆ స్థితిని నేనుచెప్పలేను అన్నారు పోతనగారు.

ఇది పూతన సంహార ఘట్టము. ఈ ఘట్టమును తాత్త్వికంగా పరిశీలించాలి. భాగవత దశమస్కంధము ఉపనిషత్ జ్ఞానము. ఆవిడ పేరు పూతన. అమరకోశం ‘పునాతి దేహం పూతన’ అని అర్థం చెప్పింది. దేహమును పవిత్రముగా చేయుడానికి పూతన అని పేరు. మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిదీ అని ప్రశ్నిస్తే నాదని చెపుతాము. అయితే నేను అనబడే నువ్వు ఎవరు? దానికి జవాబు మనకే తెలియదు. అదే పెద్ద అజ్ఞానము. ‘నేను నేను’ అంటున్నది ఏది? అంటే తెలియక ఆ ‘నేను’ని చీకటితో, అజ్ఞానముతో కప్పివేశాము. అదే పూతన. అవిద్య. ‘నేను’కు ‘నాది’ తోడవుతుంది. నేను అనేది అబద్ధము. ఈ అబద్ధమునకు నాదనే మరొక అబద్దం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. ‘నా’ అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. ‘నేను, నాది’ అనే రెండు పూతన రెండు స్తనములు. ఇందులోంచి విషయములను ఇస్తుంది. విషయమే విషము. దేహము ఎప్పుడూ సుఖమునే కోరుతుంది. దేహసంబంధమయిన సుఖములు విషముతో సమానమయినవి. అవి ఎప్పటికీ దేహి సూక్ష్మరూపమును తెలియనివ్వవు. అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు. దీనిని ఏమయినా చేయగలమా? ఏ పని చేసినా దానిని భగవత్ ప్రసాదమని భావించాలి. భగవదర్పణ చేసి సుఖములను అనుభవిస్తే అవి మనపట్ల విషములు కావు అమృతములవుతాయి. భగవంతుని అర్పించడం వలన లోపల శుద్ధి జరుగుతుంది. శుద్ధి లేకుండా తింటే విషం. పూతన కృష్ణునికి విషపూరిత స్తన్యమును ఇచ్చింది. విషము అమృతము అయింది. మీకు కూడా అన్నింటినీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటయితే అది అమృతం అవుతుంది. మనస్సును దేహమును కూడా శౌచపరచగలదు. ఈశ్వరుని వైపు తిప్పగలదు. ఈ రహస్యమును ఆవిష్కరించడమే పూతన సంహారమునందున్న పెద్ద ప్రయత్నము.

ప్రకృతి వికారమయిన శరీరం పైకి అందంగా ఉన్నట్లు ఉంటుంది. దీనియందే ఉండిపోతే అసత్యమయిన ‘నేను’నందు మీరు ఉండిపోతే అది అమృతత్వమును ఇవ్వదు. అసత్యమయిన ‘నేను’ సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు వెళ్ళినట్లయితే ఈ భక్తి ఒకనాడు జ్ఞానము అవుతుంది. జ్ఞానము ఎప్పుడు కలిగేదీ మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. జ్ఞానమును అగ్నిహోత్రంతో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒకరోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అసలు ‘నేను’ను తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంహారఘట్టం. కృష్ణుని మొదటి లీల పూతన సంహారంతో మొదలవుతుంది. అపవిత్రమయినది పవిత్రం అయింది. పవిత్రము అవగానే లోపల ఉన్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోతుంది. మారిపోయి అసలు ‘నేను’ను పసిగట్టగలిగిన స్థితికి తీసుకు వెళుతుంది. ఈ ఘట్టమును పరమోత్కృష్టమయిన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...

instagram.com/pravachana_chakravarthy

[21/11, 8:32 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 70 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


కృష్ణ పరమాత్మ వెన్నలన్నీ తినేసి వచ్చాడు. ఇంటికి వచ్చిన గోపకాంతలను చూసి యశోద ‘ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు? అని అడిగింది. అక్కడకు వచ్చిన గోపకాంతలు అందరూ ఒకరి తర్వాత ఒకరు కృష్ణుని మీద ఫిర్యాదులు చెప్పడం ప్రారంభించారు. ఒక గోపకాంత అన్నది

బాలురకు బాలు లేవని, బాలింతలు మొఱలు వెట్ట పకపక నగి యీ

బాలుం డాలము సేయుచు, నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!

‘అమ్మా యశోదా! నీవేమిటో ‘మా అబ్బాయి మా అబ్బాయి’ అని పొంగిపోతున్నావు. మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? చంటి పిల్లలకి తల్లి పాలు లేకపోతే ఆవుపాలు పడతారు. బాలింతలు సాయంకాలం అవుతోంది. ఇక పిల్లాడికి పాలు పడదాం అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుపాలు వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేస్తున్నాడు. ఆ దూడలన్నీ వచ్చి ఆవులపాలను తాగేస్తున్నాయి. మీవాడు ఎదురుగుండా ఉన్న చెట్టుకొమ్మ ఎక్కి దూడలను వదిలినందుకు మేము బాధ పడుతుంటే అతను చక్కగా నవ్వుతూ కూర్చుంటున్నాడు. మాకు దొరకడు’ అని చెప్పింది.

ఇందులో ఉండే అంతరార్థమును పరిశీలిద్దాం. మనకి మనకుటుంబం వరకే మన కుటుంబం. పక్కింటి వాళ్ళ అబ్బాయి తినకపోతే నాకెందుకు అనుకుంటాం. ఈశ్వరుడు జగద్భర్త. ఈ లోకమునంతటికీ తండ్రి. ఆయన రెండుపనులు ఏకకాలమునందు చేస్తున్నాడు. ఆవుదూడలు అంటే ఉపనిషత్తులు. వాటిని పోషిస్తున్నాడు. ఈశ్వరుడు ఉపనిషత్ జ్ఞానమును పోషిస్తాడు. అందుకని దూడలను వదిలాడు. రెండవది ఆవులు ఎక్కడికో వెళ్ళి గడ్డితిని, కుడితి తాగి వాటిని పాలుగా మారుస్తున్నాయి. ఆవులు తమ దూడలకు పాలను ఇవ్వడానికి సంతోషంగా ఎదురు చూస్తుంటాయి. ఇంటి యజమాని వచ్చి ముందుగా దూడ దగ్గరకు వెళ్ళి దాని మెడలో ఉన్న ముడిని విప్పితే వెంటనే దూడ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆర్తితో తల్లిపాలను త్రాగుతుంది. ఇంకా దూడకు ఆకలి తీరదు. ఆ దూడను లాగేసి స్తంభమునకు కట్టేసి పిల్లాడి కోసం పాలను పితకడం ప్రారంభిస్తారు. దాని దూడ దాని పిల్ల కాదూ! నీ పిల్లాడు ఎక్కువా! ఈశ్వరునికి ఆవు తనబిడ్డే, దూడా తన బిడ్డే. అందుకని ఆయన వదిలాడు. నీవు ఆయనను వంక పెట్టడం ఎందుకు? దొంగ ఎవరు? నీవా, ఆయనా? ఆయన దొంగ కాదు. నువ్వు దొంగ. తమ దొంగతనం దాచుకుని చోరలీలని ఆయనయందు దొంగతనం చెపుతున్నవారి దొంగ బ్రతుకును స్వామి బయటపెడుతున్నాడు. ఇదీ దీని అంతరార్థం.

మరొక గోపస్త్రీ

పడతీ! నీ బిడ్డడు మా, కడవలలో నున్న మంచి కాగిన పాలా

పడుచులకు బోసి చిక్కిన, కడవల బో నడిచె నాజ్ఞ గలదో లేదో?

యశోదా! నీకు అసలు క్రమశిక్షణ లేదు. నీకే లేనిది నీ పిల్లాడికి ఎలా వస్తుంది? ఏమి చేసాడో తెలుసా! మా ఇంట్లో పాలన్నీ ఎర్రగా కుండల్లో కాచాము. పిల్లలందరినీ తీసుకు వచ్చి చప్పుడు చేయకుండా కుండలను ఎత్తి ఆ పాలన్నీ త్రాగేసి, కడవలను క్రిందపారేసి వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. పాలూ పోయాయి, కడవలూ పోయాయి. ఇదెక్కడి పిల్లాడు’ అన్నది.

ఒకరికి పెట్టడం అన్నది లేకుండా ఎప్పుడూ తమకోసమే దాచుకునే వారి ఇంట్లో ఐశ్వర్యమును ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. అసలు పరాయివాడికి పెట్టడం రాని ఇంట్లోంచి లక్ష్మీదేవిని ఎలా తీసుకు వెళ్ళిపోవాలో నారాయణునికి తెలుసు. నిశ్శబ్దంగా తీసుకువెళ్ళి పోతాడు. పరులకు పెట్టడం నేర్చుకుంటే జీవితం వృద్ధిలోకి వస్తుంది. ఏది పెట్టారో అది ఆస్తి. పుణ్యం కాపాడుతుంది. అదీ ఇక్కడ కృష్ణుని ఈ చర్యలోని అంతరార్థం.

మరొక గోపిక కొంచెం తెలివయినది. అప్పటికే కృష్ణుడు వచ్చి దొంగతనములు చేస్తున్నాడని, కిందపెడితే పాలు పెరుగు త్రాగేసి కుండలు పగల కొట్టేస్తున్నాడని తెలుసుకుంది. ఆమె తన కోడలిని పిలిచి ‘కుండలను క్రింద పెట్టకు ఉట్టి మీద పెట్టు కృష్ణుడికి అందదు’ అన్నది. అందరూ హాయిగా పడుకున్నారు. కృష్ణుడు వచ్చి చూశాడు. ‘అమ్మా ఎంత తెలివయిన దానివే! నీవు ఎక్కడ పెట్టావో నాకు తెలియదా అనుకున్నాడు. ఈశ్వరుడు ఐశ్వర్యమును తీసివేయాలంటే ఎక్కడ పెడితే మాత్రం తీయలేడు? ఆయన ఎక్కడ ఉన్నా వెన్నను (భక్తిని) తింటాడని రెండవ అర్థం. కృష్ణుడు రోళ్ళు, పీటలు వేసాడు. చెయ్యి అందలేదు. కుండకు క్రింద కన్నం పెట్టాడు. అందులోంచి శుభ్రంగా మిగతా పిల్లలందరితో కలిసి వెన్న తినేశాడు. ఆ గోపస్త్రీ ‘యశోదా! నీ కడుపు పైకి కనపడదు ఇంత తిండి తినేసే పిల్లవాడిని ఎక్కడ కన్నావమ్మా? వెన్న పాలు చేరలు పట్టి తాగేస్తున్నాడు’ అన్నది.

మరొక ఆమె అమ్మా! మా ఇంటికి వచ్చి వెన్న, నెయ్యి తినేశాడు. ఈ ఇంట్లో కుండ పట్టుకువెళ్ళి పక్కవాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళి పోయేవాడు. వాళ్ళు లేచి చూసుకునే సరికి వాళ్ళ కుండలు పక్కఇంట్లో ఉండేవి. వాళ్ళూ వీళ్ళూ దెబ్బలాడుకునేవారు. ఈయన వీధిలో ఆవులకి గడ్డి పెడుతున్నట్లుగా నిలబడి వీళ్ళ దెబ్బలాటని చూసి నవ్వుకునేవాడు. ఎందుకీ లీల? ఒక్కొక్కళ్ళకి తమకి సంపద ఉన్నదనే గొప్ప అహంకారం ఉంటుంది. తమ పక్కన పేదవాడు అన్నం లేక సొమ్మసిల్లి పడిపోయినా తాను మృష్టాన్న భోజనం చేసి పేదవాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాడు నిర్దయుడు. బీదవానికి పట్టెడు అన్నం పెట్టమని అనలేదు. అలాంటి వాడి ఐశ్వర్యమును తీసివేయడమే కుండను మరొకచోట పెట్టడం. ఆయన తలుచుకుంటే వ్యక్తుల స్థానం మార్చగలడు కదా! పేదవాడిని చూసి పరిహాసం చేస్తే ‘నీ పుర్రె అక్కడ పెట్టగలను – ఆ పుర్రె ఇక్కడ పెట్టగలను. జాగ్రత్త సుమా’ అని స్వామి మనకు ఒక పాఠమును నేర్పారు.

కృష్ణుడు ఇంకొక చోటికి వెళ్ళాడు.

ఆడం జనీ వీరల పెరు, గోడక నీసుతుడు ద్రావి యొకయించుక తా

గోడలి మూతిం జరిమిన, గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!

ఆ ఇంట్లోకి వెళ్లి శుభ్రంగా వెన్న, నెయ్యి తినేశాడు. ఆ ఇంట్లో అత్తాకోడళ్ళు పడుకుని ఉన్నారు. వెళ్ళిపోయే ముందు ఆ కోడలి మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయాడు. పొద్దుట నిద్రలేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది. నెయ్యి లేదు. కోడలు మూతివంక చూస్తే నెయ్యి ఉన్నది. ‘ఓసి ముచ్చా! రాత్రి నెయ్యంతా తినేశావా?’ అని కోడలిని పట్టుకుని కొట్టింది. ఈయన కిటికీలోంచి చూసి నవ్వుతున్నాడు.

అత్త కోడలికి నేర్పవలసిన గొప్ప ధర్మం ఒకటి ఉంటుంది. ఇంటికి వచ్చిన మహాత్ములను ఆదరించడం వలన ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంటి ఐశ్వర్యం కోడలి వలన నిలబడాలి. వచ్చిన అతిథులను ఎలా గౌరవించాలో అత్తగారు కోడలికి నేర్పాలి. అలాకాకుండా అత్తగారు కోడలికి దుష్టచేష్టలు నేర్పితే చివరికి అది వారిద్దరి మధ్య దెబ్బలాటలకు దారితీస్తుంది. సంసారములు చితికిపోతాయి. ధర్మమునందు పూనిక ఉండదు. అత్త కోడలిని సంస్కరించుకోవాలి. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకును పక్కన పెట్టుకోవాలి. దానం చేయడం కొడుక్కి కూడా అలవాటయి రేపు వృద్ధిలోకి వస్తాడు. అది మహాధర్మమని స్వామి నేర్పారు.

ఓయమ్మ! నీకుమారుడు, మా యిండ్లను బాలు బెరుగు మననీడమ్మా!

పోయెద మెక్కడి కైనను, మాయన్నుల సురభులాన మంజులవాణీ!!

చివరికి వాళ్ళు ‘అమ్మా! ఇంక నీ కొడుకు మా ఇంట్లో పాలు, పెరుగు బతకనివ్వడు. ఈ ఊరు విడిచి వెళ్లిపోతాము’ అన్నారు.

యశోద వారిని ‘ఇవన్నీ ఎప్పుడు చేశాడు?’ అని అడిగింది. ‘ఇవన్నీ ఈవేళ పొద్దున్న చేశాడు’ అని వాళ్ళు చెప్పారు. ఆవిడ ఈవేళ పొద్దుటినుండి మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. మీరంతా నా కొడుకును గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు అందంగా ఉంటాడని, బుజ్జి కృష్ణుడని మీరు ఇన్ని చాడీలు చెపుతారా! అన్నీ అబద్ధములే’ అలా చెప్పకూడదమ్మా’ అన్నది. ‘అవును ఇప్పుడెందుకు తెలుస్తుందిలే. ఇని ఇళ్ళల్లో జరిగినవి నీ ఇంట్లో జరిగితే నీకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తావో మేము చూస్తాము’ అని గోపికా స్త్రీలు అక్కడనుండి నిష్క్రమించారు.

ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పని చేసుకుంటోంది. బయట బలరాముడు, ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న వారు గబగబా పరుగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరకు వచ్చి ‘అమ్మా! అమ్మా! నువ్వు ఎన్నోమాట్లు కృష్ణుడికి మట్టి తినకూడదని చెప్పావు కదా! తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడు’ అని చెప్పారు.

పిల్లలు దాక్కునే ఆట అని ఒక ఆట ఆడతారు. కృష్ణునికి అది చాలా ఇష్టం. మనకి జారత్వం చోరత్వం చాలా ఇష్టం. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆ రెండులీలలే చేసాడు. దొంగాట ఆడేటప్పుడు ఈయన ఎక్కడో దాక్కుని ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకునే వాడు. ఈ చర్యవలన భూకాంత పొంగిపోయేది. ఈలోగా మరొకచోట దాక్కున్నవాడు కృష్ణుడు నోట్లో మట్టిపోసుకోవడం చూసాడు. గోపబాలురందరూ కలిసి కృష్ణుని చేయిపట్టుకుని లాక్కుని యశోద దగ్గరకు తీసుకువెళ్ళారు. యశోద అదృష్టమే అదృష్టం. జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్నవాళ్ళు అరుదు. యశోద దగ్గరకు పరమాత్మ వెడితే ఆవిడ -

మన్నేటికి భక్షించెదు? మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ

యన్నయు సఖులును జెప్పెద, రన్నా! మన్నేల? మఱి పదార్థము లేదే?

పిల్లలు చెప్పిన మాటలను ఆవిడ నమ్మేసింది. ఆయన ఏమీ తక్కువ వాడు కాదు. తిన్నాడు ఈ లీల యశోద అదృష్టమును ఆవిష్కరిస్తోంది. పరమాత్మ లొంగిపోయినట్లుగా కనపడిన స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప మరొకచోట లేదు. ఆయన లోకములకన్నిటికి నడవడిని నేర్పినవాడు. ప్రపంచమునకు మార్గదర్శనం చేసిన మహా పురుషుడయిన పరమాత్మని ఈవిడ మార్గదర్శనం చేస్తోంది. ‘ కృష్ణా! మన్ను తినవద్దని నీకు ఎన్నిమాట్లు చెప్పాను! మన్ను ఎందుకు తింటున్నావు? నేను ఇంతకు ముందు నీకు ఎన్నోమాట్లు ఇలా తినవద్దని చెప్పాను కదా! నీవు యిలా ఎందుకు చేసావు?’ అని అడిగింది.

కృష్ణుడు మాట్లాడిన తీరును పోతనగారు చేసిన దర్శనం -

అమ్మా! మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెఱ్ఱినో ?

నమ్మం జూడకు వీరి మాటలు మదిన్, న న్నీవు కొట్టంగ వీ

రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు, కాదేనిన్ మదీయాస్య గం

ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే !

అమ్మా! నేను మన్ను తినడమేమిటి? నేను శిశువునా? నేను వెఱ్ఱివాడనా? వీళ్ళ మాటలు నమ్మి నన్ను మట్టి తిన్నావని అనేస్తున్నావు. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ నామీద కల్పించి చెప్తున్నారు. ఆయన వేదాంతం ఎంత చెప్తున్నారో ! తన్మాత్రలలో పృథివికి వాసన ఉంటుంది. ‘నేను నిజంగా మట్టిని తిన్న వాడనయితే పృథివిలోనుండి వాసన వస్తుంది. నా నోరు మట్టి వాసన రావాలి కదా! ఏదీ నా నోరు వాసన చూడు. వాసన వస్తే అప్పుడు కొట్టు’ అన్నాడు. యశోద ‘ఏమిటి వీడు ఇంత తెంపరితనంగా మాట్లాడుతున్నాడు. మట్టి తినలేదంటున్నాడు. నిజం ఏమిటో పరిశీలిస్తాను’ అని కృష్ణుడిని నోరు తెరవమన్నది. ఏమి యశోదాదేవి అదృష్టం! ఎంతో తపస్సు చేసిన మహాపురుషులు ఎక్కడో జారిపోయి మరల జన్మములు ఎత్తారు. అంతటా నిండివున్న ఈశ్వరుని చూడలేకపోయారు. అంతటా ఈశ్వరుని చూడడం అనేది జ్ఞానము. ఏమీ చదువుకోని స్త్రీకి అంతటా ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు పరమాత్మ. ఈశ్వరుని యందు లోకం కనపడుతోంది. లోకము ఈశ్వరుని యందు ఉన్నది. పరమాత్మ ఈ తత్త్వమును ఆవిష్కరిస్తున్నాడు. ఇది బ్రహ్మాండ దర్శనం. దీనినే ‘మృద్భక్షణమున విశ్వరూప ప్రదర్శనము’ అంటారు.

కృష్ణుడు నోరు తెరిచాడు. సమస్త పర్వతములతో, నదులతో, సముద్రములతో, చెట్లతో, నరులతో, లోకంతో, నందవ్రజంతో, నందవ్రజంలో ఉన్న పశువులతో, తన ఇంటితో, తనతో, నందుడితో కలిసి అందరూ లోపల కనపడ్డారు. ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోటిలో కనపడుతుంటే ఆవిడ తెల్లబోయింది.

కలయో! వైష్ణవమాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!

తలపన్ నేరకయున్నదాననో ? యశోదాదేవి గానో ప్ర

జ్వలమై యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్!!

నోరు తెరిస్తే పిల్లవాని నోట్లో ఉన్నవన్నీ చూసి యశోద ‘ఇది కలా? వైష్ణవ మాయా? ఏదయినా సంకల్పమా? నేను యశోదనేనా? నేను నా ఇంట్లోనే ఉన్నానా? వీడు నా కొడుకేనా? వీని నోట్లో బ్రహ్మాండములు అన్నీ ఉన్నాయా? ఆలోచించి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. పిల్లవాడేమిటి? నోట్లో బ్రహ్మాండములు ఏమిటి?’ అని ఆశ్చర్యపోయింది. యశోద కృష్ణుని కేవలము తన కొడుకుగా భావన పెంచుకుంది ఈ ప్రేమయే భక్తి. తెలియకుండా ప్రేమించినా ఆమె ఈశ్వరునే ప్రేమించింది. భక్తికి పర్యవసానము జ్ఞానము. ఇదే విశ్వరూప సందర్శనము.

అమ్మ ఇలా జ్ఞానంతో ఉండిపోతే నాకు అమ్మగా ఉండలేదు. మరల వైష్ణవమాయ కప్పాలి అనుకొని పరమాత్మ ఆమె జ్ఞానమును ఉపసంహారం చేశాడు. అంతే! ఆమె వైష్ణవమాయలోకి వెళ్ళిపోయింది. ఇదే పరమాత్మ అనుగ్రహం.




facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[21/11, 8:32 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 69 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


రాక్షసుడు చిన్నికృష్ణుని ఎత్తుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అలా ఎత్తుకు వెళ్ళి పోతున్నప్పుడు పిల్లలకి భయం వేసినట్లయితే వాళ్ళు కంఠమును గట్టిగా పట్టుకుంటారు. రాక్షసుడు పైకి తీసుకు వెళుతుంటే కృష్ణుడు తన చిన్నచిన్న చేతులతో రాక్షసుడి కంఠమును గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరు చేయలేని పనిని తాను చేస్తున్నానని రాక్షసుడు సంతోషిస్తున్నాడు. కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరిగిపోవడం ప్రారంభించాడు. ఈ బరువుకి వాడు క్రిందపడిపోవడం మొదలు పెట్టాడు. ‘ఇంత బరువుగా ఉన్నావేమిటి వదులు, వదులు!’ అని అరవడం ప్రారంభించారు. పట్టుకుంటే వదలడం పరమాత్మకు ఉండదు! బాణం కొడితే త్రిపురములు ఎలా పడిపోయాయో, గట్టిగా కంఠమును కౌగలించుకుంటే పైనుంచి తృణావర్తుడు అలా క్రింద పడిపోతున్నాడు. పెద్ద రాళ్ళకుప్ప మీద పడిపోయాడు. అలా పడిపోవడం వలన రాక్షసుని శరీరం ముక్కలై పోయింది. కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుని శరీరంమీద పడుకొని మరల ఏమీ తెలియని వాడిలా చక్కగా ఆడుకుంటూ అమ్మకోసం చూస్తున్న వాడిలో దొంగ ఏడుపు ఏడుస్తూ పాకుతున్నాడు. తల్లి చూసింది.

ఏమీ తెలియని వాడు, భక్తుడయిన వాడు పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు. ఇక్కడే ఈ తృణావర్తోపాఖ్యానంలో యశోద రాక్షసుని కళేబరం మీద పడిపోయి వున్న చిన్ని కృష్ణుడిని తీసుకుని భుజం మీద వేసుకుని ఒక విషయమును విజ్ఞాపన చేసింది. ఈ పద్యం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి తెలుసుకోవలసిన పద్యం.

గత జన్మంబుల నేమి నోచితిమొ? యాగశ్రేణు లే మేమి చే

సితిమో? యెవ్వరి కేమి పెట్టితిమొ? యే చింతారతింబ్రొద్దు పు

చ్చితిమో? సత్యము లేమి పల్కితిమొ? యే సిద్ధప్రదేశంబు ద్రొ

క్కితిమో? యిప్పుడు సూడ గంటి మిచటం గృష్ణార్భకున్ నిర్భయున్.

ఒక్కొక్కసారి పిల్లలను గండం తరుముకు వచ్చేస్తుంది. అది ప్రమాదరూపంలో ప్రాణములను తీసుకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ప్రమాదరూపంలో మృత్యువు ప్రాణమును తీసుకు వెళ్ళాలా కూడదా అని ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. ఫలితం ఇవ్వాలి. పిల్లలు ప్రమాదమునందు వెళ్లిపోతుంటారు. వారు దీర్ఘాయుష్మంతులు కాకుండానే వారికి అపమృత్యువు వచ్చేస్తుంది. అలా తీసుకెళ్ళే ముందు పరమాత్మ తల్లిదండ్రుల ఖాతాను ఒకసారి చూస్తాడు. ఆ పిల్లవాడి గండం గట్టెక్కించదానికి తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యములు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు. స్త్రీలు నోచే ఒక్కొక్క నోము చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నట్లు ఉంటుంది ఫలితములు ఆ నోము నోచిన వారిని కొన్ని కోట్లజన్మలు కాపాడతాయి. సత్యం చెప్పడం చాలా కష్టం సత్యమును పలకాలి. మహాపురుషుల ఆశ్రమములను దర్శించాలి. వారు ఆత్మజ్ఞానులై ఈశ్వరునితో సమానమైన వారు. అలాగే భగవంతునికి పూజలు చేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ప్రయత్నపూర్వకంగా ఇలాంటి పనులు చేసి తీరాలి. ఈమాటలు చెప్పి తల్లి యశోద పిల్లవాడిని తీసుకొని పొంగిపోయి, ముద్దులు పెట్టుకొని ‘ నేను బ్రతికానురా నువ్వు దొరికావు’ అన్నది.

చిత్రం ఏమిటంటే ఎన్నిమాట్లు ఎన్ని లీలలు జరుగుతున్నా యశోదకు తెలియదు. వీటినన్నిటిని చేస్తున్నవాడు కృష్ణపరమాత్మని తెలియనక్కరలేదు.

ఈ లీలలో అంతరార్థం - ‘తృణము’ అంటే గడ్డిపరక. దానికన్నా తేలిక అయినది ప్రపంచంలో ఉండదు. ‘ఆవర్తనము’ అంటే త్రిప్పుట త్రిప్పేది తృష్ణ. తృష్ణకే తృణావర్తుడని పేరు. గృహస్థు పుణ్యం ఖర్చయిపోతుంటే మరల పుణ్యమును సంపాదించుకుంటూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా మరల పుణ్యం చేసుకుంటూ ఉండాలి. వచ్చేజన్మల యందు కూడా ఇది నిలబడుతుంది. ఒక్కొక్కరు చేసుకున్న పుణ్యం వలన అతడు పట్టినదల్లా బంగారం అవుతుంది. ఏది పట్టుకున్నా ఐశ్వర్యం అలా కలిసివస్తుంది.

తృష్ణయందు చిక్కుకోకూడదు. వచ్చిన దానియందు తృప్తిలేక ఇంకా సంపాదించాలని అనుకున్నారంటే ఆ సంపాదనకు హద్దు ఉండదు. గృహస్థాశ్రమంలో ఉన్నవారు కొంతవరకు దాచుకోవడం తప్పు కాదు. అది అర్థంలేని దాపరికం అయితే అది తృష్ణగా మారుతుంది. దీనివలన ఆ శరీరంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోయి అలా తిరగడంలో డబ్బు సంపాదించి ఒకనాడు మరణిస్తారు. ఇలా సంపాదించడంలో వానికి గల పుణ్యం అంతా వ్యయమైపోయి ఉత్తర జన్మలలో దరిద్రము అనుభవించ వలసి వస్తుంది. వందరూపాయలు సంపాదించుకున్నట్లయితే అందులో కనీసం అయిదు రూపాయలు పుణ్యం నిమిత్తం ఖర్చు పెట్టి తీరాలి. మరి ఉత్తరజన్మకు పుణ్యం అవసరం. ఈ అయిదు రూపాయలు మీ పుణ్యం ఖాతాలో జమచేయబడతాయి. దీనివలన ఉత్తరజన్మలో అన్నవస్త్రములకు లోటులేకుండా సంతోషంగా బ్రతకగలుగుతారు. ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంత జాగ్రత్తగా ఖర్చు పెట్టడం తెలియాలి. అది తెలియకపోతే మనిషి పాడయిపోతాడు. తృష్ణకు లొంగకుండా డబ్బు సంపాదించాలి. తృప్తి వస్తే తృష్ణ ఆగిపోతుంది. తృప్తి లేకపోతే లోపల తృష్ణ రగులుతూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కు తిరిగిచూసి ఒక వయస్సు వచ్చిన తరువాత కొన్నింటికి చెక్ పెట్టకపోతే తృష్ణ కాలుస్తూనే ఉంటుంది. తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చి మొత్తం నందవ్రజ ప్రజలందరి కళ్ళు మూసేశాడు. తృష్ణకు లొంగితే గడ్డిపరకను చేసి తిప్పేస్తుంది. నందవ్రజ ప్రజలందరూ కృష్ణా! కృష్ణా! అని ఏడ్చారు. కృష్ణుడు తృణావర్తుని చంపాడు. చంపి తానే వాళ్లకు దక్కాడు. వాళ్ళు దక్కించుకున్నారా? తాను దక్కాడా? అంటే తానే దక్కాడు. భగవంతుని నామం చెప్పడం మొదలు పెట్టినట్లయితే అదే భగవంతుడిని మీ దగ్గరికి తీసుకువచ్చి, మీ బుద్ధిని మార్చి, మిమ్మల్ని సక్రమమయిన మార్గంలోకి తిప్పేస్తుంది. అలా తిప్పి ఏది గెలవలేక జీవితం పాడైపోతున్నదో దానిని గెలవగలిగిన మార్గమును ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. తృప్తి కలవాడు చక్రవర్తి కంటే అధికుడు. తరించడానికి భగవంతుని నామము, రూపము పట్టుకుంటే చాలని తృణావర్తోపాఖ్యానం ద్వారా తెలుస్తుంది.

శ్రీకృష్ణ బలరాముల బాల్యలీలలు

నెమ్మది నెమ్మదిగా కృష్ణ బలరాములు పెద్దవారవుతున్నారు. లోకమున కంతటికీ నడక నేర్పే పరమాత్మ నందవ్రజంలో తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఏమి ఆశ్చర్యమని ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారు. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఆహా ఏమి అదృష్టం? ఏ పరమాత్మకు హవిస్సులు ఇస్తున్నామో అటువంటి పరమాత్మ ఈవేళ బుడిబుడి నడకలు నడుస్తున్నాడు’ అని దివ్యదృష్టితో చూసి సమాధిమగ్నులయిపోయారు. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకు మరణకాలం దగ్గరకు వచ్చిందని వాళ్ళ అడుగులు తడబడడం మొదలుపెట్టాయి. అమ్మ చెపుతున్న కథలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. తల్లి చిన్న వేణువును ఇస్తే ఊదుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు.

తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెఱిభూతి పూతగాగ

ముందఱ వెలుగొందు ముక్తాలలామంబు తొగలసంగడికాని తునుకగాగ

ఫాలభాగంబుపై బరగు కావిరిబొట్టు కాముని గెల్చిన కన్నుగాగ

గంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగు మెడకప్పుగాగ

హారవల్లు లురగ హారవల్లులుగాగ బాలలీల బ్రౌఢబాలకుండు

శివుని పగిది నొప్పె శివునికి దనకును వేఱులేమిఁ దెలుప వెలయునట్లు.

ఈ సందర్భంలో పోతనగారు ‘మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటుంటే నాకు కృష్ణుడు కనపడడం లేదు. ఒంటినిండా భస్మం అలముకున్న బాలశంకరుడు కనపడుతున్నాడు అన్నారు. ఆయన మెడలో వేసుకొన్న నీలపతక హారం కాంతి కంఠం మీద కొడుతుంటే గరళమును కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనపడుతున్నాడు. అమ్మ కొప్పుకు కట్టిన ముత్యాల సరాలు చూస్తుంటే కపర్ది అని పెద్ద జటాజూటం ఉండి అందులో గంగమ్మను ధరించి చంద్రరేఖను పెట్టుకున్న శంకరుడు దర్శనం అవుతున్నాడు. మెడనిండా అమ్మ హారములు వేస్తే నాగభూషణుడై పాములను ధరించిన శంకరుడు దర్శనం అవుతున్నాడు. చిన్నికృష్ణుడు నా వంకచూసి పోతనా! కృష్ణుడు, శివుడని ఇద్దరు లేరు’ అని నాకు పాఠం చెప్పినట్లు ‘కృష్ణుడు శివుడని రెండుగా కనపడుతున్నది ఒకటే తత్త్వము సుమా అని నాకు పాఠం చెప్పాడా! అన్నట్లుగా కనపడ్డాడు’ అని పద్యం రాసుకున్నారు. మహానుభావుడు ఎంతో శివకేశవ అభేదమును పాటించి ధన్యుడయిపోయాడు.

పోతనగారు కృష్ణుని బాల్యలీలలు వర్ణిస్తూ ఎన్నో చక్కని పద్యములు వ్రాశారు. పోతనగారిని మరచిపోవడం దౌర్భాగ్యం. ఒక్క గ్రామములో గాని పట్టణంలో కానీ, పోతనగారి విగ్రహం లేకపోవడం చాలా విచారించవలసిన విషయం. పిల్లలకి ఈయన పోతనగారని చెప్పడానికి ఇళ్ళల్లో ఫోటోలేని దరిద్రానికి తెలుగుజాతి దిగజారిపోవడం మన దౌర్భాగ్యం.

కృష్ణుడు అందరి ఇళ్ళల్లోకి వెళ్ళిపోయేవాడు. అన్ని ఇళ్ళల్లో ఉన్న వెన్న, నెయ్యి అన్నీ తినే వాడు. ఎవరయినా తన మీద నేరములు చెపితే అమ్మ నమ్మకుండా ఉండాలని బయటే మూతి అంతా శుభ్రంగా తుడిచేసుకునే వాడు. అలా వెన్నలన్నీ తినేసి వచ్చాడు. కృష్ణ పరమాత్మ వెన్న నెయ్యి తినడంలో ఒక రహస్యం ఉన్నది.

తమంత తాముగా చేసుకోవలసిన ప్రయత్నముతో ఏర్పడేది నిర్మలమయిన మనస్సు ఈ నిర్మలత్వము ఎవ్వరూ తేలేరు. ఈశ్వర కథాశ్రవణం చేసి, భగవంతుడిని మనస్సుకి ఆలంబనముగా ఇచ్చి రాగద్వేషములకు అతీతంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నిర్మలంగా ఉన్న మనస్సును పాలకుండని పిలుస్తారు. మనస్సుకు ఈశ్వరుని తీసుకు వచ్చి ఆలంబనం ఇచ్చినట్లయితే పొంగిపోయి భక్తితోకూడిన కర్మాచరణమును సంతోషంతో కూడిన పూజను చేయడం మొదలు పెడతారు. దాని చేత భక్తి ఏర్పడుతుంది. భక్తి చేత ఏర్పడిన కర్మవలన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధివలన వైరాగ్యభావన కలుగుతుంది. ఈ వైరాగ్యమనే అగ్నిహోత్రము మీద నిర్మలమయిన మనస్సనే పాలు కాగాలి. ఈ పాలు ఎర్రటి తొరక కడతాయి. కమ్మటి పాలు నిర్మల కైంకర్యమయిన మనసు వలన, భక్తివలన వైరాగ్యభావననే అగ్నిహోత్రం మీద కాలి, కాగి వున్నాయి. ఈ పాలు పెరుగు అవ్వాలి.

పాలను పెరుగుగా మార్చాలంటే పెరుగు కావాలి. పెరుగే పాలను పెరుగుగా మారుస్తుంది. ఇంతకూ పూర్వం ఈశ్వరుని గుణములను విని లోపల స్తంభించిపోయి ధ్యానమునందు ఎవరు అనుభవించారో వారే వచ్చి మరల ఆమాట చెప్పాలి. గురువు ఉపదేశం వినాలి. పెరుగు పాలలోకి వచ్చి తోడుకుంటుంది. రమించిపోయి బోధిస్తున్న గురు ఉపదేశమును కదలని కుండలా పట్టాలి. ఈ పాలలోకి ఆ పెరుగు పడితే పాలు తోడుకుంటాయి. గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు. అలా పరంపరగా గురువు వెనుక గురువు తయారవుతాడు.

పెరుగు గట్టిగా తోడుకున్న తరువాత పూర్వం గురువులు చెప్పిన మాటలను చెవితో విని వదలడం కాకుండా వారు చెప్పిన మాటలను లోపల బాగా తిప్పాలి. ఈ తిప్పడమే మననము అనే కవ్వము. ఇది తిరుగుతుంటే పెరుగు చిలకబడుతుంది. గురువు వలన తాను విన్న విషయములను కూర్చుని మనసుపెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది. ఆయన వెంటనే వచ్చేస్తాడు. పెరుగును చిలికితే లోపలనుండి వెన్న పైకి తేలుతుంది. వెన్నకి రెండు లక్షణములు ఉంటాయి. ఈ వెన్నను అగ్నిహోత్రం మీద పెడితే కరిగి నెయ్యి అవుతుంది. నీటిలోకాని, మజ్జిగలో కానీ వేస్తే తేలుతుంది. భగవత్సంబంధమయిన జ్ఞానమనే అగ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలోనే ఉన్నా పైకి కనపడని నెయ్యి చిట్టచివరి దశలోపైకి వస్తుంది. పాలను నెయ్యిగా తీసుకురావాలంటే ఇదంతా జరగాలి. నేతిని తిరిగి పాలుగా మార్చలేము. ఒకసారి బ్రహ్మజ్ఞానమును పొందిన తర్వాత ఇంక వెనక్కి వెళ్ళడము జరగదు. తాను ప్రారబ్ధం అయిపోయే వరకు శరీరంలో ఉండి శరీరం పడిపోతూ ఉండగా అమ్మయ్య శరీరమును వదిలి పెట్టేస్తున్నానని జీవుడు సంతోషిస్తాడు.

ఆత్మజ్ఞాన స్వరూపమయిన వెన్న నెయ్యి కాదు. దీనిని ఆధారం చేసుకుని ఆత్మదర్శనం అవ్వాలి. దానికి నిధిధ్యాసనం లోనికి వెళ్ళాలి. లోపలి వెన్న ఎవ్వరికీ పనికిరాదు ఒక్క ఈశ్వరునికే పనికి వస్తుంది. అత్యంత ప్రశాంతమయిన ప్రదేశమునందు కూర్చుని పరమేశ్వరుని ధ్యానం చేయాలి. ఈ వెన్నను ఒక్క ఈశ్వరుడే తింటాడు అన్యులు దీనిని తినలేరు. ఈశ్వరుడు ఇక్కడకు వచ్చి తినడమే గోపకాంతల ఇళ్ళల్లోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడం. ఆ భక్తి, ఆ వెన్న కృష్ణ స్పర్శచేత జ్ఞానముగా మారుతుంది అది నేయి. అది యజ్ఞమునందు పడుతుంది. అదే హవిస్సుగా మారుతుంది. ఈ శరీరము పడిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతాడు. ఇదీ కృష్ణుడు వెన్న తినడం అంటే! అంతేకానీ చేతకాక, పనిలేక, అవతారమును స్వీకరించి వాళ్ళింట్లోకి, వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తిన్నాడని దాని అర్థం కాదు. ఎందుకు వెన్న తిన్నాడో అంతరమునందు విచారణ చేయాలి. దీనిని నవనీత చోరత్వము అంటారు. వెన్నను ప్రసాదంగా స్వీకరించడం వెనక ఉన్న రహస్యం అది!


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...


instagram.com/pravachana_chakravarthy

[21/11, 8:32 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 68 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

శకటాసుర సంహారం

కృష్ణ లీలలు అన్నీ కూడా మనకు జీవితంలో చేయి ఇచ్చి పైకి ఎక్కించే లీలలు. శకటాసుర సంహారం చాలా చిన్న ఘట్టం. ఎంత విన్నా వేదాంతము వేదాంతముగా ఎప్పుడూ లోపల నిలబడదు. పక్క ఒక ఆలంబనము ఉండాలి. అన్నమును అన్నముగా తినలేరు. పక్కన కూరో, పచ్చడో, పులుసో ఉండాలి. అలాగే వేదాంతము ఎప్పుడూ కథగా ఉండాలి. కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. పరమాత్మ చేసే లీలలు కర్మతో చేసినవి కాదు. అందులో ఏదో పరమార్థం ఉంటుంది. ఆయన లీలల వెనక ఎంతో ఔచిత్యం ఉంటుంది.

ఒకనాడు కృష్ణపరమాత్మ బోర్లా పడ్డాడు. పిల్లలను మొదట్లో పడుకోపెట్టినపుడు ఎటు పడుకున్నవాడు అటే పడుకుంటాడు. పసిపిల్లవాడు మొదట చేసేపని బోర్లాపడడం. పిల్లవాడు బోర్లాపడితే ఆ రోజున ఇంట్లో అదొక పెద్ద ఉత్సవం. బోర్లాపడ్డాడు అని బొబ్బట్లు మొదలయిన పిండివంటలు వండుకు తినేస్తారు.

యశోద అలా చెయ్యలేదు. ముత్తైదువలను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలను ఇచ్చింది. వాళ్లకి చీరలు, రవికల గుడ్డలు పెట్టింది. బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానము చేసింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. యశోద అన్నిటికి దైవం వైపు చూస్తోంది. యశోద అంటే యశస్సును ఇచ్చున్నదని అర్థము. కీర్తి ఎటు పక్కనుంచి వస్తుందో జీవితము ఎటువైపు నడవాలో యశోదవైపు నుంచి తెలుస్తుంది. పిల్లాడు బోర్లాపడితే మనం బొబ్బట్లు వండుకు తినడం కాదు! శివాలయమునకు వెళ్ళి అభిషేకం చేయించాలి. లేదా రామాలయమునకో, కృష్ణాలయమునకో వెళ్ళి తులసి పూజ చేయించాలి. మనవడు బోర్లాపడే అదృష్టం ఈశ్వరుడు సమకూర్చాడు. పిల్లవాడు వృద్ధిలోకి రావడమును ఈశ్వరానుగ్రహంగా భావించాలి.

నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి అందరూ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాదవుల ఐశ్వర్యం పశువులు, పాడి, పాలకుండలు, పెరుగు కుండలు, నేతి కుండలు, అరటి పళ్ళ గెలలు మొదలయినవన్నీ పెట్టారు. బండికి కూడా ఒక తోరణం కట్టేశారు. ఒక మంచం వేసారు. ఆ మంచం మీద ఒక పరుపు వేసారు. ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు. ఉత్సవం అంతా కృష్ణుడు బోర్లాపడ్డాడు. అతడికోసం చేస్తున్నారు. ఉత్సవం వేడుకలో పడి ఈయనని మరచిపోయారు. ఈయనకు ఆకలి వేసింది. పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆయన పక్కనే బండి ఉన్నది. ఆయనది చిన్ని అరికాలు. దానికి పెసర గింజలంత చిన్నిచిన్ని వేళ్ళు. అందులోనే శంఖం, చక్రం, నాగలి, అమృతపాత్ర మొదలయిన దివ్యచిహ్నములు. అటువంటి కాలితో బండిని ఒక్క తన్ను తన్నాడు.

ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రములు, ఇరుసు అన్నీ ధ్వంసం అయ్యాయి. అక్కడినుండి క్రిందపడిపోయి తుత్తునియలయిపోయాయి. దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు, యశోద, నందుడు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు. బండి చాలా పెద్దది. ఆకాశమునకు ఎగిరిపోయేలా బండిని కాలితో తన్నడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉన్నది. యశోద పిల్లవాడిని తీసుకుని సముదాయించింది. ‘అయ్యో! నాన్నా! ఆకలి వేసిందా? నీ కాలు బండికి తగిలిందా? కాలేమీ నొప్పి పెట్టలేదు కదా! అని పిల్లాడిని ఎత్తుకుని పాలిచ్చింది. అది అమ్మ హృదయం. మాతృత్వమునకు ఉన్న గొప్పతనం. మాతృత్వమునందు దేవతాంశ ప్రవేశించి పరాభట్టారికరూపమై నిలబడింది. స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది. కృష్ణుడు ప్రదర్శించిన లీల చాలా చిన్నది. దీనిలో ఉన్న అంతరార్థమును గ్రహించేటందుకు ప్రయత్నించాలి. ఈ శరీరమును భగవంతుడు ఇచ్చాడు. శరీరము మనం నిర్మించుకున్నది కాదు. అన్నింటిని ‘నావినావి’ అంటారు. ‘నావి’ అని చూపించిన ఈ శరీరములో ఏ ఒక్కటీ తనది కాదు. ఏదీ తాను తేకపోయినా ఈశ్వరుడు దీనిని నిర్మాణం చేశాడు. ఈశ్వరునిచే ఇంత గొప్పగా నిర్మింపబడి ప్రసాదింప బడిన ఈ దేహము దేనికొరకు? ఇది శకటము. ఈ బండిని ఎక్కి మీరు తీరమును చేరగలరు. మనము ఈ బండినెక్కి తీరమును చేరడం లేదు. ఎందువలన? దీనిని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. లక్ష్యం వైపు వెళ్ళడం లేదు. ఈ మానవ శరీర శకటంలో కూర్చుని తాను పొందుతున్న శుభములు ఈశ్వరానుగ్రహములని తలపక అన్నీ ‘నా ప్రజ్ఞ’ అంటూ ఉంటాడు. ‘ఈ పనులను ఈశ్వరుడు చేయించాడు. చేయగలిగాను’ అనడు. జీవుడు ఈశ్వరానుగ్రహము తీసివేసి మాట్లాడుతాడు. ఈశ్వరానుగ్రహము వలన తాను ఆ పనులను చేయగలుగుతున్నాననే భావన మనసులో ఉండాలి. అటువంటి భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ శకటమును ఎక్కి లక్ష్యమును చేరతారు. లేకపోతే ఇది ‘శకటతి యితి శకటః’ అవుతుంది. శం అనగా సుఖము, ఈశ్వరుడు. ఈ శకటమును ఎందుకు ఎక్కారో తెలుసుకుంటే దానిని ఈశ్వరానుగ్రహమని భావించడం ప్రారంభిస్తారు. ఈశ్వరానుగ్రహం తప్పు పనులు చేయించదు. సాత్త్వికమైన ప్రవృత్తిలోనికి తిప్పేస్తుంది.

అనగా నీవు ఎక్కిన శకటమునకు ఎవరు సారధిగా ఉన్నాడు? ఈశ్వరుడు. స్థిత ప్రజ్ఞుడయిన సారధి శకటమును వేయికళ్లతో చూసి నడిపిస్తాడు. శకటములో ప్రయాణిస్తున్న జీవునికి ఏ ప్రమాదము కలుగదు. సారధియే బుద్ధి. ఆ బుద్ధిని కృష్ణ పాదముల దగ్గర పెట్టేయాలి. తెలిసికాని, తెలియక కాని పరమభక్తితో భాగవతంలో దశమ స్కంధార్గత శకటాసుర వృత్తాంతమును విన్నంత మాత్రం చేత శకటాసురుడు – జీవుడు ప్రయాణిస్తున్న ఈ బండి రాక్షసుడు. ఎప్పుడు? ‘ఇదే నేను – అన్నీ నేను చేస్తున్నాను’ అనే భావన ఉన్నప్పుడు. కృష్ణుడు జగదాచార్యుడై వచ్చాడు. అజ్ఞానం బాగా ఉంటుంది దానిని చీల్చడానికి అర్థరాత్రి పుట్టాడు. ఆయనేమి చేశాడు? ‘మనః మనః’ అనకురా, ‘నమః నమః’ అనమని చెపుతాడు. జీవుడు కర్మచేత, భక్తిచేత, జ్ఞానము వైపు నడుస్తాడు. ఈవిధంగా శకటాసుర సంహారం పైకి చిన్న లీల. అంతరమునందు స్వామి పెద్ద రహస్యమును దాచారు.

తృణావర్తోపాఖ్యానం

వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంటుంది. దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్లకి జీవితంలో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక ఉత్తమమైన దశానిర్దేశం జరుగుతుంది. అటువైపుగా ప్రయాణించడం చేత వారు మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యమును చేరుకుంటారు. కథా శ్రవణం చేతకూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది. పరీక్షిత్తు శుకమహర్షి చెప్పిన బాహ్యకథనే విని మోక్షమును పొందాడు. జీవితంలో అసలు భాగవతం వినడం కాని, చదవడం కాని చాలా గొప్ప విషయములు. భాగవతమును విన్నంత మాత్రం చేత వాని జీవితం కొన్ని కోట్లజన్మల తరువాత ఒక మలుపు తిరిగిందని లెక్క.

ఒకనాడు నందవ్రజంలో పక్కన రోహిణి ఉండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోపెట్టుకుని ఆనందంగా ఉన్నది. హఠాత్తుగా ఒళ్ళో ఉన్న కృష్ణుడు చాలా బరువయిపోయినట్లుగా అనిపించాడు. పర్వత శిఖరం ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. పిల్లవాడు ఇంత బరువుగా ఉన్నాడేమిటి? అనుకుని పిల్లవాడిని పక్కన దింపింది. అక్కడికి కంసుని పనుపున ఒక రాక్షసుడు వచ్చాడు. అతని పేరు తృణావర్తుడు. అతడు పెద్ద సుడిగాలి రూపంలో వస్తున్నాడు. ఆ రావడంలో దుమ్ము పైకి లేచింది. ధూళి కన్నులలో పడింది. ఇంతకూ పూర్వం ఎప్పుడూ అసలు కష్టం అంటే ఏమిటో తెలియని శ్రీమన్నారాయణుని అవతారమయిన చిన్ని కృష్ణుని కళ్ళల్లోకి ధూళి పడింది. అందరూ కన్నులు మూసుకుని ఏమయిందని చూసే లోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించి తీసుకుపోయాడు. కేవలం కృష్ణుని సంహరించడమే అతని లక్ష్యం. ‘ఆవర్తము’ అంటే త్రిప్పడం. గిరగిర త్రిప్పుతూ కృష్ణుడిని ఆకాశంలోకి తీసుకు వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపి క్రింద పడెయ్యాలని అతని ఉద్దేశం. సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకు నడుస్తుంది. గుండ్రంగా తిరుగుతూ కృష్ణుడిని తనతో పాటు పైకెత్తుకుని వెళ్ళిపోయింది.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersU...

instagram.com/pravachana_chakravarthy

[22/11, 12:32 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 71 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


శుకమహర్షి చెప్పిన లీలలలను విని పరీక్షిత్తు మిక్కిలి ఆశ్చర్యపోయాడు. శుకమహర్షిని ‘ప్రపంచములో ఇంతటి గొప్ప అదృష్టమును పొందిన యశోదా నందులవంటి భార్యాభర్తలు ఎవరయినా ఉన్నారా? నంద యశోదలది ఏమి అదృష్టము! వారిద్దరూ ఏమి పూజ చేశారు? ఏ పూజచేస్తే కృష్ణుడు వారికి కొడుకయి పుట్టాడు? ఈ విషయమును చెప్పవలసినది’ అని పరీక్షిత్తు అడిగాడు.

శుకబ్రహ్మ ‘వారేమీ తపస్సు చేయలేదు. కృష్ణ పరమాత్మ భూమిమీద అవతరించే ముందు దేవతలను తమ అంశలతో భూమిమీద ఆవిర్భవించమన్నాడు. బ్రహ్మగారి దగ్గర ఉండే వసువులలో ప్రముఖుడయిన వాడు ద్రోణుడు, ద్రోణుడి భార్య ధర బ్రహ్మగారు వీరిద్దరినీ పిలిచి ‘శ్రీమన్నారాయణుడు కృష్ణ పరమాత్మగా భూమిపై ఆవిర్భవిస్తున్నాడు. మీరిద్దరూ కూడా వెళ్ళి భూమిమీద అవతరించండి’ అన్నారు. వారు ‘మేము అవతరిస్తాము. గొల్లవానిగా, గొల్లవాని భార్యగా మేము జన్మిస్తాము. దయచేసి మాకొక వరమును ఇవ్వవలసినది. భూమిమీద అవతరించిన కృష్ణ పరమాత్మని మా కొడుకు అనే భావనతో కొడుకుగా లాలించి పెంచి పోషించేలా మాకు వరమునీయవలసినది’ అని కోరారు. దాని ప్రకారం వారు భూమిపై యశోదానందులుగా జన్మించి, కృష్ణ పరమాత్మకు తల్లిదండ్రులుగా ప్రవర్తించారు.

ఉలూఖల బంధనము

ఉలూఖల బంధనం ఒక అద్భుతమయిన శ్రీకృష్ణ లీల. భాగవతం మొత్తం మీద తలమానికమయిన లీల ఇదే. చాలామంది ఈ లీలను చెప్పమని అడిగి, తమ ఇళ్ళల్లో చెప్పించుకుని విని పొంగిపోతూ ఉంటారు. ఒకనాడు యశోదమ్మ సంతోషంగా పెరుగు చిలుకుతున్నది. భగవానుడు జన్మించిన తరువాత నందవ్రజంలోని వారందరూ అధిక ఐశ్వర్యవంతులయారు. గొల్ల స్త్రీలు స్నానం చేసి శుభ్రమయిన వస్త్రములు ధరించి భగవన్నామము చెపుతూ చల్ల చిలికేవారు. యశోద పెరుగు చిలుకుతూ ఒకపక్క నోటివెంట భగవన్నామము పలుకుతున్నది. మనస్సులోకృష్ణయ్యను తలుచుకుంటోంది. ఆ సమయమునకు అక్కడికి బాలకృష్ణుడు వచ్చి అమ్మా! నాకు బాగా ఆకలి వేస్తోంది. నాకు తొందరగా పాలు ఇవ్వు’ అన్నాడు. ఆమె పిల్లవాడు ఏమి చేస్తాడో చూద్దామని పెరుగు చిలకడం ఆపకుండా ఇంకా చిలుకుతూనే ఉన్నది. కృష్ణుడు ‘నువ్వు పాలు చిలకడం ఆపి నాకు పాలు ఇస్తావా? ఇవ్వవా? అని కవ్వం పట్టుకున్నాడు. కవ్వం తిరిగితే పిల్లవాని చెయ్యి నొప్పి పెడుతుందేమోనని తల్లి అనుకుని చల్ల చేయడం ఆపేసింది. కొడుకుని ఒడిలో పడుకోబెట్టుకుని స్తన్యం ఇస్తున్నది. కృష్ణుడు పాలు త్రాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అవి పొంగి పైకి రావడం ఆవిడ చూసింది. పాలు పొయ్యిలో పడిపోతాయేమోనని పక్కన ఒక పీటవేసి దానిమీద పిల్లవాడిని కూర్చోపెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. పొయ్యి మీదవున్న పాలకుండను జాగ్రత్తగా దింపి చుట్ట కుదురు మీద పెట్టింది. ఈవిధంగా పాలుత్రాగుతున్న వాడిని పక్కన పెట్టేసి మరుగుతున్న పాలకుండను దింపడానికి వెళ్ళిపోయింది.

తల్లి తనను ఎందుకు దింపివేసిందని చూసాడు. కృష్ణుడికి కోపం వచ్చి అక్కడ ఉన్న ఒక రాయితీసి కుండకి వేసి కొట్టాడు. కుండ పగిలిపోయి అందులోంచి వెన్నముద్దలు తేలి, పైకి వస్తున్న పెరుగు ఒలికిపోయి పల్లంవైపు ప్రవహిస్తోంది. క్రిందపడిన వెన్నను నోట్లో పెట్టుకుని, గబగబా మింగేస్తూ తనకి పాలివ్వలేదని మధ్యమధ్యలో దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. అమ్మ ఇంకా తనని చూడలేదు. ఆవిడ పాలకుండను పొయ్యిమీద నుంచి దించే ప్రయత్నంలో ఉండిపోయింది. ఆవిడ వచ్చి చూస్తే కోప్పడుతుందని రెండుచేతులతో రెండు వెన్నముద్దలను పట్టుకుని గబగబా ఇంట్లోంచి బయటకు వచ్చి పక్కయింట్లోకి వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో దంచడానికి పనికిరాని కొయ్యరోలు ఒకటి ఉంది. ఆ రోలును తిరగేసి దానిమీద ఎక్కి నిలబడ్డాడు. అమ్మ వస్తుందేమోనని తిరిగి చూస్తూ ఆకలివేస్తోందని మధ్య మధ్యలో దొంగ ఏడుపు రాగాలు తీస్తున్నాడు. అలా చేస్తూ అక్కడ చెట్ల మీద ఉన్న కోతులను పిలిచాడు. ఆ పిల్ల కోతులన్నీ వచ్చి గోడ ఎక్కి కూర్చున్నాయి. వాటన్నిటికి ఆ ఇంట్లోని వెన్న తెచ్చి పెడుతున్నాడు. అవి చక్కగా ఆ వెన్నను తింటున్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూసి దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు.

ఆవిడ పాలకుండను దింపి వెనక్కి తిరిగివచ్చి కృష్ణుడి కోసం చూసింది. ఇంకెక్కడి కృష్ణుడు! కుండ పగిలిపోయింది. ప్రవహిస్తున్న మజ్జిగ, వెన్న వీటినన్నిటిని చూసింది. ‘గోపికలు చెప్పింది యథార్థమే. వీడు చాలా అల్లరి చేస్తున్నాడన్నమాట’ అని అనుకున్నది. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఒక రాతిని తిరగేసి దానిమీద కూర్చుని కోతులకు వెన్న పెట్టేస్తున్న కృష్ణుని చూసింది. ఆవిడ వీడి అల్లరి ఎక్కువయి పోయింది. ఏదో ఒకటి చెయ్యాలి వీడిని ఇవాళ కొట్టేస్తాను’ అనుకుంది. గోపకాంతలు అందరూ యశోద ఏమి చేస్తుందా అని పరిశీలిస్తున్నారు. యశోద ‘ఈవేళ నిన్ను పట్టుకుంటాను, కట్టేస్తాను’ అనగానే కోతులకు పెడుతున్న వెన్న వదిలేసి ఆ రోలు మీదనుంచి దూకేశాడు. కృష్ణుడిని పట్టుకుందామని ఆవిడ దగ్గరకు వెళ్ళింది. ఆ ఇల్లంతా స్తంభములు ఉన్నాయి. ఈయన వెతుకుతున్న యశోదకు దొరకకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళి స్తంభముల చాటున నక్కుతూ తిరిగాడు. అమ్మా! నేనింక ఎప్పుడూ దొంగతనం చేయను. ఎవరింటికీ వెళ్ళను. వెన్న తిననే తినను. నన్ను కొట్టకు’ అని కళ్ళు నులిమేసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అరిచెయ్యి అంతా కాటుకయి బుగ్గలన్నీ కాటుక అయింది. ఈ లీల జరుగుతుంటే ముప్పైమూడుకోట్లమంది దేవతలు, పార్వతీ సహితుడై ఈశ్వరుడు, బ్రహ్మగారు ముక్కున వేలు పెట్టుకుని చూసారు. ఆయన ఆ రోజున అంత భయమును నటించాడు.

అమ్మ ఎటునించి వస్తుందోనని క్రీగంట చూస్తూ పరుగెడుతూనే ఉన్నాడు. ఆఖరికి దొరికిపోయాడు. కొడదామనుకుని చేయి ఎత్తింది. కళ్ళు నులుముకుంటూ ఏడుస్తున్న చిన్నికృష్ణుని ముఖం చూసేసరికి కొట్టలేక ‘నిన్ను కట్టేస్తాను’ అని మాత్రమే అనగలిగింది. యశోద ఎంత అదృష్టవంతురాలో. ఎవరికీ దొరకని పరమాత్మ ఆమె చేతికి దొరికిపోయాడు. ఆమె కృష్ణుడిని కట్టెయ్యడము కోసమని తాడుకోసం వెతుకుతున్నది. అక్కడ అంతకు ముందు కవ్వమునకు పెట్టి తిప్పిన తాళ్ళు ఉన్నాయి. వాటితో కట్టాలని తెచ్చి బొజ్జ చుట్టూ తిప్పుతోంది. తిప్పితే రెండు అంగుళములు తక్కువ వస్తోంది. ఎన్ని తాళ్ళుతెచ్చి ముడివేసి కడదామనుకున్నా ఎప్పుడూ రెండు అంగుళములు తక్కువ వస్తోంది.

చిక్కడు సిరి కౌగిటిలో, జిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం

జిక్కడు శృతిలతికావలి, జిక్కె నతడు లీల దల్లి చేతన్ రోలన్!

ఆయన లక్ష్మీదేవి కౌగిలించుకుందామనుకుంటే ఆమె కౌగిలికి దొరకని వాడు, సనక సనందనాది మహర్షుల మనస్సులకు చిక్కనివాడు, వేదమంత్రములకు దొరకని వాడు, ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టబడినాడు. చివరికి యశోదాదేవి కృష్ణుడిని త్రాటితో రోటికి కట్టేసి నీతులు చెప్పడం ప్రారంభించింది. నిజంగా కొడుతుందని భయపడిన వాడిలా అమాయకంగా చూస్తున్న స్వామికి, ఒంటిమీద శ్రీవత్సం తప్ప మరొక మచ్చలేని స్వామికి, పొట్టభాగం అంతా తాడుతో నలిగిపోయి గుర్తు పడిపోయింది.

రెండు అంగుళముల తాడు తక్కువ అవడం అంటే భగవంతుని పూజ చేసేటప్పుడు మనం ఎందుకు పూజ చేస్తున్నామో మరిచిపోవాలి. నా స్వామికి ఇది చేయకుండా నేను ఎలా ఉండగలను? అనే భావన పెరగాలి. మీరు చేసిన పూజకు కోరిక ఉండదు. ఒక ప్రయోజనమును ఆశించి చేస్తున్నాను, నేను ఈ పూజను చేస్తున్నాను అన్న ఈ రెండు భావనలను మరిచిపోతారు అదీ విచిత్రం. పూజలో తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోతారు. ఈ రెండు భావనలను మరచి పోవడమే తాడు రెండు అంగుళములు తక్కువ అవుతున్నదనే విషయమును మరిచిపోవడం. అలా ఎలా తక్కువవుతున్నదని తెలియక పోవడం. ఇటువంటి తాదాత్మ్యానికి ఈశ్వరుడు పొంగిపోతాడు. కేవలము భక్తి చేత పరమాత్మ వశుడు అవుతాడు.

జ్ఞానులచే మౌనులచే, దాసులచే యోగసంవిధానుల చేతం

బూని నిబద్ధుండగునే, శ్రీనాథుడు భక్తి యుతుల చేతం బోలెన్?

మౌనముగా వున్న వాళ్లకు, జ్ఞానులకు, ధ్యానం చేసేవాళ్ళకు, దానం చేసేవాళ్ళకు భగవంతుడు యిలా లొంగుతాడని చెప్పలేము. కేవలము పరమభక్తితో ఆయన వెంటపడి మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా, అది ఉద్ధరించి ఈశ్వరుని కట్టి మీ దగ్గరకు తీసుకువచ్చి నిలబెట్టగలదు. అది కేవలం భక్తికే సాధ్యం.

ఇక్కడ పరమాత్మ యశోద భక్తికి లొంగి ఆమెకు పట్టుబడిపోయాడు..

[22/11, 12:33 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 72 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


యమళార్జున భంజనము:


యశోదాదేవి కృష్ణుని తీసుకుని వెళ్ళి రోటికి కట్టేసింది. ఆయన విడిపించుకోవడం చేతకాని వాడిలా నటిస్తున్నాడు. కర్మపాశముల చేత లోకముల నన్నిటిని కట్టగలిగిన పరమాత్మ తాను ఆ కట్టు విప్పుకోలేని వాడిలా నటిస్తూ, పెరట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. కొడుక్కి శిక్ష వేశాను కదా అనుకుని అమ్మ తన పనిలోకి తాను వెళ్ళిపోయింది. గోపకాంతలు కూడా వెళ్ళిపోయారు. కృష్ణుడిని అలా చేస్తే గోపకాంతలు అనవసరంగా తల్లికి చెప్పి కృష్ణుడిని బాధపెట్టిన వారమయ్యామని లోపల బాధపడ్డారు. ఆశ్చర్యకరమయిన ఒక లీల ప్రారంభం అయింది. ఆ ఇంటి ప్రాంగణంలో రెండు పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. అవి కొన్ని వందల సంవత్సరముల నుండి అక్కడ పెరిగిపోయి ఉన్నాయి. వాటి మానులు చాలా స్థిరమయిన స్థితిలో ఉన్నాయి. వాటిని కూలదోయడం అంత తేలికైన విషయం కాదు. రోటికి కట్టివేయబడిన పరమాత్మ నెమ్మదిగా రాతిని ఈడ్చుకుంటూ పాకుతున్నాడు. అంత బలశాలియై ఆయన పాకుతూ వెనకాల రోలును ఈడ్చుకు వచ్చేస్తున్నాడు. ఈ రెండుమద్దిచెట్ల మధ్యనుంచి పిల్లవాడు అటువైపు వెళ్ళిపోయాడు. ఈడుస్తున్న రోలు అడ్డం తిరిగి రెండు మద్దిచెట్లకి అడ్డుపడింది. కృష్ణుడు రాతిని ముందుకు లాగాడు. ఆ రెండు మద్దిచెట్లు ఫెళఫెళమనే పెద్ద ధ్వనులతో పక్కకి పడిపోయాయి. రెండు వృక్షముల నుంచి మహాపురుషులు ఇద్దరు ఆవిర్భవించారు.

ఆ చెట్లలోంచి బయటకు వచ్చిన ఇద్దరు కుబేరుని కుమారులయిన నలకూబర, మణిగ్రీవులనే యక్షులు. కుబేరుడు ఐశ్వర్యమునకు అధిపతి. ఆయన నవనిధులకు దేవత. ఆయనకు రెండుశక్తులు ఉన్నాయి. ఒకటి ఆయన అపారమయిన ఐశ్వర్యమునకు ఆధిపత్యంలో ఉంటాడు. రెండు – సర్వకాలములయందు ఆయన శంకరుని పక్కన నిలబడి ఉంటాడు. కైలాసంలో పరమశివుని పక్కన నిలబడి స్వామి ఎప్పుడయినా పని చెపుతారేమో నని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ రెండు లక్షణములు గలిగిన కుబేరుడు అహంకరించినట్లు మీకు పురాణములలో ఎక్కడా కనపడదు. కుబేరుడు విశ్రవసువుబ్రహ్మ కుమారుడు. రావణాసురుని కన్న ముందు పుట్టాడు. పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయి ‘ఏమి కావాలి?’ అని అడిగారు. కుబేరుడు తనకు దిక్పాలకత్వం ప్రసాదించమని కోరాడు. అపుడు బ్రహ్మగారు ‘నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను. నీవు ఉత్తర దిక్కున శంకరుని పక్కనే ఉండి నవనిధులకు అధిపతివై ఉంటావు. నిన్ను కుబేరుడని పిలుస్తారు’ అన్నారు.

కుబేరుని జీవితంలో ఒకే ఒక్కసారి పొరపాటు జరిగింది. హిమవత్పర్వత ప్రాంతములో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ సౌందర్యమును చూసి తెల్లబోయి ఎవరీ కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు. దానివల్ల కుబేరుని కన్నులలో ఒక కన్ను మెల్లకన్ను అయిపోయింది. అది తప్ప కుబేరుడు తన తండ్రిగారయిన విశ్రవసు బ్రహ్మగారు ఎలా చెపితే అలా ప్రవర్తించేవాడు. తండ్రిగారు కాంచనలంకను విడిచి పెట్టివేయవలసిందని చెపితే విడిచిపెట్టేసి తమ్ముడయిన రావణునికి ఇచ్చేశాడు. తాను ఉత్తరదిక్కుకు పోయి వేరే నగరమును నిర్మించుకున్నాడు. తన తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానమును రావణాసురుడు ఎత్తుకు పోతే మారుమాట్లాడలేదు. అంతటి మహానుభావుడు కుబేరుడు. ఐశ్వర్యము వలన కుబేరుడు మదించినట్లు ఎక్కడా కనపడదు. భగవద్భక్తుడు కనపడితే అతని పాదములకు వంగి నమస్కరించగలడు. తండ్రి ఐశ్వర్యమునకు మాత్రమే వారసత్వమును పొంది తండ్రి సంస్కృతికి కొడుకులు వారసత్వం పొందక పోతే వారు ప్రమాదంలో పడతారు. అదే ఇక్కడ జరిగిన గొప్ప విశేషం.

నలకూబర మణిగ్రీవులు ఒకనాడు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు. దిగంబరంగా స్నానం చేస్తే శరీరం పిశాచగ్రస్తమయిపోతుంది. నలకూబరమణిగ్రీవులు దిగంబరంగా స్నానం చేస్తున్నారు. వారితో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒంటిమీద బట్ట లేదు. వారు మధువు సేవించి ఉన్నారు. తాము అలా ప్రవర్తించకూడదనే విషయమును మరచిపోయి ఉన్నారు. వీళ్ళు అటువంటి స్నానం చేస్తుండగా ఆకాశమార్గమున నారదమహర్షి వెళుతున్నారు. గంధర్వకాంతలకు బుద్ధి కలిగి గబగబా ఒడ్డుకువచ్చి వస్త్రములు కట్టుకుని నారదమహర్షికి నమస్కరించారు. నలకూబరమణిగ్రీవులు మాత్రం దిశమొలలతో నిలిచి నారదమహర్షికి కనీసం నమస్కారం కూడా చేయలేదు. పెద్దల పట్ల అవిధేయత మంచిపద్ధతి కాదు. పెద్దల మాటల యందు, ప్రవర్తన యందు, వారియందు, గౌరవమును కలిగి ఉండాలి. నారదుడు సామాన్యుడు కాదు. అంత అవిధేయతతో నిలబడ్డ వారిని చూసి నారదుడు మనస్సులో ఒకమాట అనుకున్నాడు.

‘వీళ్ళకి కలవారి సుతులం అనే అహంకారం వచ్చింది. ఈ సంపాదన వీరి తండ్రిది. వీరు ఈవేళ మదోన్మత్తులై ఉన్నారు. తండ్రి గుణముల యందు వీరికి వారసత్వం లేదు. కాబట్టి వీరికి ఈ ఐశ్వర్యమును తీసివేస్తాను. వీరికి దేనివలన అహంకారం వచ్చిందో ఆ అహంకారం పోతుంది. వీళ్ళ కంటికి కాటుక పెట్టాలి. ఏ కాటుక పెట్టుకుంటే అవతలి వారిలో ఉన్న భక్తికి వంగి నమస్కరించడం అలవాటు అవుతుందో ఆ అన్జనమును వీళ్ళ కళ్ళకి దిద్దుతాను. వీళ్ళకు బుద్ధి చెపుతాను’ అనుకుని వారితో ‘మీరు కోట్ల సంపదకు పడగలెత్తిన కుబేరుని కుమారులు. మీకు బట్టకట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ లేదు. అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది. మీరు నూరు దివ్య సంవత్సరముల పాటు యమళార్జునములనే పేర్లతో మద్దిచెట్లయి నందవ్రజమునందు పడి ఉండెదరు గాక!’ అని శపిస్తే ఒంటికి పట్టిన మదం తీరిపోయి నారదుని కాళ్ళమీద పడ్డారు.

గురువు అనుగ్రహించాలి. నారదుని అనుగ్రహించి ఆయన ‘ఇపుడు మీకు పట్టిన మదం ఇంకెన్నడూ మీ తలలకు ఎక్కకూడదు. అలా చేయగలిగిన శక్తి ముకుంద పాదారవిందములనుండి స్రవించే రజస్సుకు మాత్రమే ఉన్నది. భగవంతుని పాదములను చూడగానే ఆయన పాదములకు తగిలేటట్లుగా శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ పాదరేణువులు తలమీద పడాలి. భాగవతుల పాద ధూళిలోకి బ్రహ్మాండములలో ఉండే శక్తి చేరి ఉంటుంది. ఆ పాదధూళి వారి తలమీద పడగానే వారు పుణ్యతీర్థములలో స్నానం చేసినంతటి ఫలితమును పొందుతారు. అదే వారి పుణ్యమునకు, ఐశ్వర్యమునకు, వారి అభివృద్ధికి హేతువు అవుతుంది. మీరు నందవ్రజంలో మద్దిచెట్లయి పుట్టండి. కృష్ణపరమాత్మ పాకుతున్న రోజులలో ఆయన పాదములనుండి స్రవించిన పరాగము మీ మీద పడుతుంది. చెట్ల రూపంలో ఉన్న మీరు చెట్ల శరీరమును వదులుతారు. మీరు నా పట్ల అపచారం చేస్తే చేసారు కానీ నా అనుగ్రహము వలన ఉత్తరోత్తర మోక్షమును పొందుతారు. నారాయణ భక్తులు అవుతారు. అపారమయిన ఐశ్వర్యముతో ఉంటారు. మరల యథారూపమును పొంది మీ యక్షలోకమునకు చేరుకుంటారు. చేరుకొని మీ సంపత్తిని మీ సౌఖ్యమును పొందుతారు’ అని అనుగ్రహించాడు. ఈ విధంగా నారదమహర్షి శాపావసానమును ఇచ్చారు. దీనివలన పడిపోయిన రెండుచెట్లనుండి వెలుపలికి వచ్చిన మణిగ్రీవ నలకూబరులు రెండుచెట్ల మధ్యవున్న ఏడుస్తున్న కృష్ణుని చూసి నమస్కరించి స్తోత్రం చేశారు.

నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్

నీ పేరం బనిసేయు హస్తయుగముల్ నీమూర్తిపై జూపులున్

నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్

నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజ పత్త్రేక్షణా!!

ఈపద్యమును ఒకసారి చదువుకుంటే చాలు. మనం పూజ చేసినట్లే. స్వామీ! మేము ఎప్పటికీ మరల అహంకారం రాకుండా, మా కళ్ళు ఎల్లప్పుడూ నీ మూర్తినే చూడగలగాలి. మా శిరస్సులు నీ పాదములను తాటించగలగాలి. ఎప్పుడెప్పుడు ఈశ్వరుని సేవిద్దామా అని మనస్సునందు తొందర గలగాలి. అటువంటి చిత్తమును మాకు ప్రసాదించవలసినది’ అని చేతులెత్తి పరమాత్మను ప్రార్థించారు. ఆయన ‘తథాస్తు’ మీకు అటువంటి బుద్ధి కలుగుతుంది. మీరు సంతోషంగా బయలుదేరి మీ యక్షలోకమును చేరుకోండి ’ అని చెప్పారు. వాళ్ళు బయలుదేరి యక్షలోకమునకు వెళ్ళిపోయారు.

ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాడో ఆ భక్తులకు వంగి నమస్కరించగలిగితే ఎల్లప్పుడూ ఐశ్వర్యమును అనుభవిస్తూ ఆనందముగా ఉండగలరు అనే మహోత్కృష్టమైన సందేశమును ఈ లీల మనకు అందజేస్తోంది. యశోదానందులు అక్కడ ఉన్న గోపాలురు ఈ చెట్లు పడిపోయిన శబ్దమును విన్నారు. ఈ రెండు చెట్లూ భూమిమీద ఎలా పడ్డాయని అక్కడి వాళ్ళందరూ అనుకుంటున్నారు. చెట్లు పడిపోవడం కృష్ణునితో పాటు ఆడుకుంటున్న చిన్న పిల్లలు చూశారు. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు వచ్చి ఈ చిన్ని కృష్ణుడే రోలు ఈడ్చుకుంటూ రెండు చెట్ల మధ్యలో వచ్చాడు. అలా వచ్చినపుడు ఈ రెండుచెట్లూ భూమిమీద పడిపోయాయి. అందులోనుండి దివ్యతేజస్సుతో ఇద్దరు మహాపురుషులు వచ్చారు. వారు చిన్నికృష్ణుని స్తోత్రం చేసి ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు. అది మేము చూశాము అన్నారు.

పెద్దవారు వీళ్ళమాటలు కొట్టి పారేశారు. కృష్ణుడు ఏమీ తెలియని చిన్నపిల్లవాడి వలే ఏదో పాటను పాడుతున్నాడు. ఆ పాటకు అర్థం ఏమీ ఉండదు. గోపవనితలు చుట్టూ చేరి తాళం వేస్తుంటే తన కాళ్ళ గజ్జెలు మోగేటట్లుగా కాళ్ళు చేతులు తిప్పుతూ గంతులు వేస్తున్నాడు. ఇంతగా అమాయకత్వంతో ఉన్న పిల్లవాడిని చూసి వానికి దైవీశక్తులు ఉన్నాయని ఎవరు అనుకుంటారు? ఈవిధంగా కృష్ణుడు నందవ్రజంలో వారిని మభ్యపెడుతున్నాడు. అలా మభ్యపెడుతున్న కృష్ణుని మనసు దర్శనం చేసిన నాడు మనలను ఆవహించి ఉన్న మాయ తొలగిపోతుంది. గర్భిణి అయిన స్త్రీ దశమస్కంధం వింటే కృష్ణ భగవానుడి వంటి కొడుకు పుడతాడు.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage 


instagram.com/pravachana_chakravarthy

[22/11, 12:33 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 73 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


ఒకనాడు గోపాలురందరూ కలిసి నందవ్రజంలో జరుగుతున్న సంఘటనలను గురించి చర్చించుకుంటున్నారు. ‘నందవ్రజంలో చాలా విపరీతమయిన సంఘటనలు జరుగుతున్నాయి. చిన్నికృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎంతోమంది రాక్షసులు ఎన్నోరూపములతో వచ్చారు. ఇతనిని సంహరిద్దామనుకుంటున్నారు. కేవలము భగవంతుని నిర్హేతుకమయిన కృపవలన కృష్ణుడు కాపాడబడుతున్నాడు. మనం ఈ ప్రాంతమును విడిచిపెట్టేద్దాము. ఇక్కడకు దగ్గరలో బృందావనము అనే ప్రదేశం ఒకటి ఉన్నది. అక్కడ సమృద్ధిగా నీరు దొరుకుతుంది. పచ్చిగడ్డి దొరుకుతుంది. మనం అందరం భద్రంగా ఉండవచ్చు’ అని అక్కడున్న గోపకులలో పెద్ద వాడయిన ఉపనందుడనే ఆయన అన్నాడు. మిగిలిన గోపకులందరూ ఆయన చెప్పిన మాట విన్నారు. ఇప్పటికి కూడా భారతదేశంలో అత్యంత పవిత్రమయిన ప్రదేశములలో బృందావనం ఒకటి. భగవంతునితో సంబంధం కలిగిన మహర్షులు కూడా అక్కడకు వచ్చి బృందావనంలో భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటారు. బృందావనంలోని మట్టిని తీసి కొద్దిగా నోట్లో వేసుకున్న వాడు గొప్ప అదృష్టవంతుడు. ఉత్తరక్షణం నందవ్రజంలోని గోపగోపీజనం ఆ ప్రదేశమును వదిలిపెట్టి, బృందావనమునకు బయలుదేరి వెళ్ళిపోయారు.

వత్సాసుర వధ

ఒక చిత్రమయిన లీల జరిగింది. ఆవులమందలోకి కొత్త ఆవుగాని వచ్చినట్లయితే గోపబాలురు దానిని కనిపెట్టేస్తారు. ఒకనాడు ఆ మందలోనికి ఒక కొత్త ఆవు వచ్చింది. వీళ్ళు దానిని కనిపెట్టి ఆ విషయమును కృష్ణునికి చెప్పారు. కొత్త ఆవుదూడ చెంగుచెంగుమని ఆడుతోంది. కృష్ణుడు దానిని చూశాడు. కొత్తగా వచ్చిన దూడ ఒక రాక్షసుడు. కంసుని పనుపున కృష్ణుని చంపడానికి దూడ రూపంలో వచ్చాడు. వాని పేరు వత్సాసురుడు.

కృష్ణుడు ఏమీ తెలియనట్లుగా దాని దగ్గరకు వెళ్ళి దాని తోక పట్టుకున్నాడు. రెండు చేతులూ చాపి దాని నాలుగు కాళ్ళను పట్టుకుని గభాలున పైకెత్తి తోకతో ఆ నాలుగు కాళ్ళను కట్టేశాడు. ఆ దూడను చంపెయ్యాలి. దానిని గిరగిర తిప్పి అక్కడే ఉన్న వెలగచెట్టుకు వేసి కొట్టాడు. అలా కొట్టేసరికి అక్కడ ఏకకాలంలో ఇద్దరు రాక్షసులు చచ్చారు. ఒకడి పేరు కపిత్థాసురుడు వెలగచెట్టు రూపంలో వచ్చాడు. రెండవవాడు వత్సాసురుడు దూడ రూపంలో వచ్చాడు. ఈ లీల జరిగినప్పుడు దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. ఎంత రాక్షసుడయినప్పటికీ శ్రీకృష్ణుడంతటి వాడు ఆవుదూడను అలా చంపవచ్చునా – అది పాపము కాదా - అది గోహత్య అవలేదా అనే సందేహం కలుగుతుంది. ఆవుదూడ రుచికి ప్రసిద్ధి. ఆవుదూడకి ఏది పడితే అది పడదు. ఆవుదూడ వృద్ధిలోకి రావాలని దానిచే పాలుకూడా చాలా తక్కువగా తాగిస్తారు. తినకుండా ఉండడానికి దాని మూతికి ఒక బుట్ట కట్టేస్తారు. అది ప్రతిదానినీ తిందామనుకుంటుంది. అలాగే వెలగపండు వాసనకు ప్రసిద్ధి. వాసనను దాచలేము. ఆవుదూడ, వెలగపండు రుచికి, వాసనకు ప్రసిద్ధి చెంది ఉంటాయి. రుచి వాసనలు జన్మ జన్మాంతరములుగా తరుముతు ఉంటాయి. ఉండకూడని రుచి, వాసనల యందు మనస్సు నిలబడి పోయినట్లయితే దానివలన చాలా ప్రమాదం ఉన్నది. అందువలనే ప్రయత్నపూర్వకంగా సుఖములను పరిత్యజించడం అలవాటు అవాలి. లేకపోతే ఈ మనస్సు వెళ్ళిపోయి ఏదో ఒకదానియందు ఉండిపోతుంది. అంత్యకాలం వచ్చినపుడు మనస్సు దానికి బాగా ఇష్టమయిన రుచిని పట్టుకుని, ఇంద్రియములను గబగబా మూట కట్టి ఏదో ఒక ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోతుంది అదే వాసన. వెళ్ళి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినపుడు పాత శరీరమునుండి వాసనను తీసుకువస్తుంది. పుట్టుకతోనే వాసనలు వచ్చేస్తాయి. ఒక్కొక్కడు పుట్టుకతో దుర్మార్గ ఆలోచనలు చేస్తాడు. ఒక్కొక్కడు పుట్టుకతో భగవంతుని వైపు వెడతాడు. ఈ వాసన వెలగపండు అసురీశక్తి. మనస్సు అనుభవించడం, గుర్తుపెట్టుకోవడం అనేదే రుచి. వెళ్ళిపోయే ముందు మనస్సు బతికి ఉన్నన్నాళ్ళు వ్యామోహం దేనిమీద పెరిగిపోయిందో దానినే పట్టుకుని కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. తరువాతి జన్మలో ఆ వాసన కోసమే జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్కడు చిన్నతనం నుంచే దుష్టసాంగత్యం వైపు వెళ్ళిపోతాడు. వాడిని వెనక్కు తీసుకురాలేము. అటువంటి వాడిని ఈ లీల మాత్రమే బాగుచేయగలదు. వాడికి ఈ లీల వినిపించాలి. అమ్మను చూడగానే కాముకత్వం ఎలా చల్లారి పోతుందో అలా ఈశ్వరుని గురించి వినేసరికి వాసనాబలం క్షీణించి ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది. మీరు మీ వాసనలను ముందు జయింపలేరు. అందుకని భక్తితో కృష్ణా! కృష్ణా! అని భగవంతుని ప్రార్థించాలి. భాగవతం దశమస్కంధము వినాలి. ఈ లీలవిని పొంగిపోవాలి. కృష్ణుడిని మనసులో పెట్టాలి. లోపలి రుచి, వాసన పైకి వస్తుంది.

బకాసుర వధ

ఒకానొక సమయంలో కంసుని పనుపున కృష్ణ భగవానుడిని చంపడం కోసమని ఒక రాక్షసుడు బయలుదేరి వచ్చాడు. ఆయన పేరు బకాసురుడు. బకుడు అనగా కొంగ. గోపకులు అందరూ ఉదయముననే కృష్ణ బలరాములతో కలిసి తమ గోసంపదనంతటినీ తీసుకుని బృందావనమునకు బయలుదేరారు. వారికి అక్కడ ఒక పెద్ద పర్వతం ఎంత ఎత్తు ఉంటుందో అంత పెద్ద కొంగ కనపడింది. బకుడు అన్ని పనులను మానివేసి ఒకే విషయం మీద దృష్టిపెట్టి ధ్యానం చేస్తున్న వాడిలా, తాను నోరు విప్పి మాట్లాడితే అది తన సత్త్వరూపమునకు భంగమన్న ఉద్దేశంతో, మహాపురుషులయిన వారు మౌనమును ఆశ్రయించి ఎలా ఉంటారో అలా, ఏ విధంగా ఇతర ఆలోచన లేకుండా, శ్రీకృష్ణ పరమాత్మ మీదనే దృష్టిపెట్టి ఉన్నాడు. చూడడానికి చాలా సత్త్వగుణంతో ఉన్నదని, ఒకరికి అపదారం చేయనిది నమ్మేలా ఉంటుంది. మనస్సులో ఉండే భావన వేరు. కృష్ణ పరమాత్మను ఈ గోపబాలుర నుండి వేరుచేస్తే, కృష్ణుడిని ఒక్కడినీ నిర్జించగలిగితే మిగిలిన గోపాల బాలురందరూ తమంత తాము ప్రాణములను విడిచిపెట్టేస్తారు. అందుకని బకుడనబడే రాక్షసుడు కృష్ణుడిని చంపాలనే ఆలోచనతో వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఏది కొత్తది కనపడినా కృష్ణుడికి చెప్పడం గోపబాలురకు అలవాటు. ‘కృష్ణా! ఆ కొంగ ఎంత తెల్లగా, పెద్దగా ఉన్నదో చూడు’ అన్నారు.

అది ఒక్కసారి తన పాదమును భూమికి వేసి తాటించి పైకిలేచి, రెక్కలు అల్లారుస్తూ నోరుతెరుస్తూ, మూస్తూ, ఆకాశంలో వేగంగా తిరగడం ప్రారంభించింది. దాని రెక్కల నుండి వచ్చిన గాలికి అక్కడ వున్న చెట్ల కొమ్మలు విరిగి కిందపడిపోతున్నాయి. అంత పెద్ద పక్షి తిరుగుతుంటే పిల్లలందరూ ఆశ్చర్యంతో పైకి చూస్తున్నారు. చటుక్కున ఆ పక్షి కిందకు దిగి కృష్ణ పరమాత్మను తన రెండు చంచూపుటములలో ఇరికించుకుని ఎగిరిపోయి ఒక పర్వత శిఖరం మీద కూర్చుని కృష్ణుడిని మింగేసింది. ప్రాణము పోయిన ఇంద్రియములు ఎలా ఉంటాయో, కృష్ణుని బకుడు మింగేస్తే గోపబాలురు అలా అయిపోయారు. ఆయన లేనినాడు తమకు అస్తిత్వమే లేదని భావిస్తున్నారు. ఇదీ భగవంతుని పట్ల వాళ్ళకి ఉన్న గౌరవం. ఇదీ వారికి ఉన్న భక్తి. కృష్ణుడు భగవంతుడని వారికి తెలియదు. ఆ పదార్థము అటువంటిది. ఏ వస్తువును ప్రేమిస్తే ఆనందమును మాత్రమే ఇవ్వగలదో ఆ వస్తువు పరబ్రహ్మము అని తెలియనక్కరలేదు. ఎప్పుడయితే వీరంతా ప్రాణములు లేని ఇంద్రియములలా అయిపోయారో ఉత్తరక్షణమునందు కొంగ కంఠమునందు ఉన్న కృష్ణ పరమాత్మ అగ్నిహోత్రము వలే అయ్యాడు.

కంఠమునందు ఉన్నవాడు బయటవున్న గోపబాలుర ఆర్తిని గ్రహించాడు. ఈ బాలురు వెనక్కి తిరిగి పారిపోయినట్లయితే, పరమాత్మ ఉత్తరక్షణం వైకుంఠమునకు చేరగలడు. తన గురించి ఆర్తి పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇపుడు వెంటనే ఆయన వాళ్ళకి దర్శనం ఇవ్వాలి. కొంగ కంఠం నుండి బయటకు రావడానికి ఆయన అగ్నిహోత్రం అయితే వెంటనే కొంగ కక్కేసింది. ఈ పిల్లవాడిని వదిలిపెట్టకూడదు ముక్కుపుటములతో పొడిచి చంపి మ్రింగివేస్తానని తన చంచూపుటములు పెట్టి పొడుస్తూ ఆయన వెంట పడింది. అటువంటి దాని చంచూపుటములను రెండింటిని గట్టిగా పట్టుకుని గడ్డిపరకను చీల్చినట్లుగా చీల్చి, కృష్ణుడు ఆ పక్షిని చంపివేశాడు. ఆ పక్షి కొంగగానే ఎందుకు రావాలి? వస్తే కృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చంపాడు. అలా రాకుండా చంపకూడదా? బకుడు అనే రాక్షసుడు ఎక్కడో లేదు. మనలోనే ఉన్నాడు. అతని పేరు దంభము. దంభము అంటే పైకి ఒకలా కనపడుతూ లోపల మరొకలా ఉండుట. దంభమును నిగ్రహించలేరు. ఇది పైకి ఒకలా ఉంటుంది. లోపల ఒకలా ఉంటుంది. ప్రతిక్షణం వెన్నంటి ఉంటుంది. మనస్సును ప్రయత్నపూర్వకంగా గెలవాలి. దంభము మహాపాపకార్యము. దంభము సత్యముగా ఉండడమును అంగీకరించదు. సత్యమంటే కృష్ణుడు. కృష్ణుడిని తినేస్తాను అంటుంది. లోపల ఎలా ఉన్నామో పైన కూడా అలా వుండే ప్రయత్నం మొదలు పెట్టాలి. అందుకు భగవంతుని స్మరణ చేయడం మొదలు పెట్టాలి. ఈ నామ స్మరణ మనస్సుని నిరంతర ప్రక్షాళన చేస్తూ ఉంటుంది.

దంభమును తప్పించుకోవడం కష్టం. అది సత్యమును మ్రింగుతుంది. అందుకని ముందుగా కృష్ణుడు మ్రింగబడాలి. ఆర్తి చెందేవాడు వుంటే అగ్నిహోత్రమై బయటకు రావాలి. దంభమును చీల్చాలి. అలా చీలిస్తే కృష్ణుడు తనంత తాను గోపాల బాలురకు దక్కాడు. ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ఆయనను ఆర్తితో ప్రార్థిస్తే ఆయనే మన దంభమును తీసువేస్తాడు. ఆయనే మనలను రక్షించి పుణ్య పురుషుడుగా మారుస్తాడు.

దీపము మీద వెళ్ళి పడిపోయిన శలభములు ఎలా కాలిపోతాయో అలా ఈ పిల్లవాడిని ఎంతమంది రాక్షసులు నిర్జిద్దామని ప్రయత్నం చేసినా వారందరూ మడిసిపోయారు. హృదయంలో భగవంతుని నిలబెట్టడం చేతనవాలి. అసురీ గుణములు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసినా నామం పట్టుకుని పరమాత్మను హృదయంలో నిలబెడితే అవి మడిసి పోయి రాలి పోయి, నీవెప్పుడూ పవిత్రమయి ఉండిపోతావు. గోపాల బాలురు కృష్ణుని గురించి ఆర్తి చెందినట్లు మనుష్య జన్మలోనికి వచ్చినందుకు భగవంతుడి గురించి ఆర్తిచెండడం నేర్చుకోవాలి. ఇది వేరొకరి ప్రబోధం చేత వచ్చేది కాదు. నీ అంత నీవుగా పరిశీలనం చేసుకోవాలి. భగవంతుని గూర్చి ఆర్తి, భక్తి అలవాటు చేసుకోవాలి. అవి మాత్త్రమే నిన్ను రక్షించగలవు. అన్యములు రక్షించలేవు. బకాసుర సంహార వృత్తాంతము నుండి ఈవిషయమును మనం గ్రహించాలి.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[22/11, 12:33 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 74 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


అఘాసుర వధ

ఒకనాడు కృష్ణపరమాత్మ పిల్లలందరితో కలిసి వెనక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఆయనకు ఒక ఊహ వచ్చింది. ‘రేపటి దినమున మనం అందరం కలిసి వనభోజనములకు వెడదాము. రేపు పొద్దున్న మీరందరూ బయలు దేరేటప్పుడు చక్కగా చిక్కములు పట్టుకొని, అందులో మీకిష్టమయిన మధుర మధురమయిన పదార్థములు పట్టుకొని రండి. మనందరం కలిసి వెడదాము. అరణ్యంలో మనందరం కలిసి కూర్చుని తెచ్చుకున్న చల్దులు ఆరగిద్దాము’ అన్నాడు. కృష్ణుడు పిల్లలకు ఎంత చెపితే అంత. మరునాడు వాళ్ళందరూ వనభోజనములకు బయలుదేరారు. వారు వివిధరకముల ఆటలకు సంబంధించిన పందెములు వేసుకుంటూ, హాస్యమునకు ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటూ పశువుల వెంట సంతోషంగా అడవిలోకి వెళ్ళారు. కొలనులలో నీళ్ళల్లో పడి చేపల్లా ఈదేవారు. కృష్ణునితో ఆడుకునే వారు. కోతులతో సమానంగా చెట్లు ఎక్కేవారు. వాళ్ళు ఆడని ఆటలు లేవు. పరమాత్మతో కలిసి ఆడుకుంటున్నారు. ఇలా ఆడుకుంటుంటే అక్కడికి దేవతలను కూడా భయపెట్టగలిగిన రక్కసుడు ఒకడు వచ్చాడు. వానిపేరు అఘాసురుడు. అఘము అనగా పాపము. అతను బకాసురుని సోదరుడు. ‘నా సోదరుడైన బకాసురుని కృష్ణుడు నిర్జించాడు. గోపాల బాలురందరికి ప్రాణ సమానమయిన వాడు కృష్ణుడు. ఈ కృష్ణుని చంపి తినేస్తాను’ అనుకున్నాడు.

వాడు వచ్చి కొండచిలువరూపంలో దారికి అడ్డంగా పడుకున్నాడు. కొండచిలువ వెంటాడి ఏ ప్రాణినీ చంపదు. అది పట్టింది అంటే మ్రింగి వేయడమే. అది ఏ చెట్టుకో చుట్టుకున్నప్పుడు లోపల ఉన్న ప్రాణి విరిగిపోతుంది. దానిని అలాగే జీర్ణం చేసేసుకుంటుంది. అఘాసురుడనే కొండచిలువ మార్గమునకు అడ్డంగా పడుకుని ఉన్నది. దాని నోటి పైదవడ ఆకాశమునకు పెట్టింది. క్రింద దవడ భూమిమీదకి పెట్టింది. ఈ పిల్లలు అక్కడికి వచ్చారు. దారికి అడ్డంగా పడివున్న దానిని గుర్తించి దానిని కొండచిలువగా నిర్ధారించుకున్నారు. ఏమి చేయాలా అని వారు వెనక్కి తిరిగిచూశారు. వెనక చిన్నికృష్ణుడు నవ్వుతూ కనపడ్డాడు. వీళ్ళు ‘బకాసురుని చంపిన కృష్ణుడు మన వెనకాతల ఉన్నాడు. ఎదురు కొండచిలువ ఉంటే మనకేమిటి భయం! మనం వెళ్ళిపోదాం’ అని వారు నవ్వుకుంటూ, వారి చిక్కములు పట్టుకొని ఆవుల్ని, దూడలని, ఎద్దులని, అన్నింటిని ఆ కొండచిలువ నోట్లోకి తోలేసి వారు కూడా అందులో ప్రవేశించారు. ఆ కొండచిలువ అఘాసురుడని కృష్ణుడికి తెలుసు. ‘దూర్త అఘాసురుడు అడ్డంగా పడుకున్నాడు. గోపబాలురందరూ నేనున్నాని గోసంపదతో సహా అఘాసురుని నోటిలోపలికి వెళ్ళిపోయారు. నా కోసమే ఇంకా దవడలను మూయలేదు. వారినందరినీ బ్రతికించడానికి నేను వెళ్ళాలి’ అని కృష్ణుడు అనుకుని దాని నోటి దగ్గరకు వెళ్లేసరికి, వీరందరూ దాని కంఠం దగ్గరకు వెళ్ళిపోయారు. అది నాలుకను చుట్టి గబుక్కున మ్రింగేసింది. వాళ్ళు కడుపులోకి వెళ్ళిపోయారు. లోపల ఉన్న విషజ్వాలలకి వారు మరణించారు.

కృష్ణుడు దాని కంఠం దగ్గరకి వెళ్ళగా కృష్ణుని కూడా మ్రింగబోయింది. పైనున్న దవడను నొక్కింది. నొక్కేసరికి స్వామి నిటారుగా పెద్దస్తంభంలా అయిపోయారు. అది నోటిని నొక్కేసరికి స్తంభంలాంటి పరమాత్మ శిరస్సు దాని దవడను పొడుచుకుని పైకి వచ్చింది. ఈయన తన శరీరమును పెంచాడు. డానికి లోపలికి ఊపిరి పీలిస్తే వెళ్ళడం లేదు గిలగిల కొట్టుకుంది. అటు తిరిగి ఇటు తిరిగి తిరుగుడు పడిపోయి గిలగిల కొట్టుకుంటోంది. ఆ సమయంలో దాని కడుపులో ఉన్న మరణించిన వారినందరినీ కృష్ణుడు చూశాడు. అసురసంధ్యవేళ అవుతుండగా నక్షత్రములతో కలిసి ఆకాశమునందు ప్రకాశిస్తున్న చంద్రబింబములా కేవలము తన కన్నులనుండి కారుణ్యామృత దృష్టిని చిన్నికృష్ణుడు వాళ్ళమీద ప్రసరింప చేసాడు. ఆయన కారుణ్యామృతదృష్టి పడగానే మరణించిన పిల్లలందరూ ఒక్కసారిగా జీవించారు. ఆవులు, దూడలు, ఎద్దులన్నీ జీవించాయి. అందరూ ఆ కొండచిలువ నోట్లోంచి ఇవతలికి వచ్చేశారు. బయరకు రాగానే వారొక అద్భుతమును చూశారు. ఆ పాము కొనప్రాణంతో కొట్టుకుంటోంది. చివరకు దాని ప్రాణం పోయింది. దానిలోంచి ఒక దివ్యమయిన వెలుగు వెలువడి పైకిలేచి చిన్నికృష్ణుడి లోకి వెళ్ళిపోయింది. దీనితో ఇంత పాపపు రక్కసుడు మోక్షమును పొందాడు. కృష్ణుడి స్పర్శ చేత అతనికి ఉన్న పాపములన్నీ విరిగిపోయాయి.

ఈ లీలలోని అంతరార్థం మనం తెలుసుకోవాలి. అఘాసురుడు ఒక పాపపు రక్కసుడు. పాపము అనగానేమి? పాపము అంటే దుష్కర్మ. పాపకర్మనుండి దుఃఖము వస్తుంది. పాపకర్మ కొండచిలువలా నోరు తెరుచుకుని మనదారిలోనే పడుకుంటుంది. పాపకర్మ మనమే దానిలోకి నడిచేటట్లుగా చేస్తుంది. అది ఎప్పుడూ తనంత తానుగా వచ్చి మింగదు. పాపకర్మ మిమ్ములను మింగలేదు. ‘నేను పాపము చేయను’ అని మీరు అనుకుంటే పాపము మీచేత చెడ్డపనిని చేయించలేదు. మనలో మోహబుద్ధి బయలుదేరుతుంది. ఏదో అప్పటికి ఒక సుఖమును కోరి ఫరవాలేదులే చేసేద్దాం అనుకుని పాపపు పనిని చేస్తాడు. కొండచిలువ నోట్లోకి వీళ్ళే వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళకి పాపకర్మ, పుణ్యకర్మ అంటే ఏమిటో తెలియాలన్నా, సత్కర్మకీ, దుష్కర్మకీ భేదం తెలియాలంటే వేదము తెలియాలి. ధర్మమునకు సంబంధించిన భాగములను చదవాలి. పెద్దల దగ్గర శ్రవణం చేయాలి. గోపాల బాలురకి అవన్నీ తెలియవు. పాపకర్మకి దేవతలు కూడా భయపడతారు. పాపకర్మ యందు వీళ్ళు లోపలికి వెళ్ళారు. వెడుతున్నప్పుడు ఒకపని చేశారు. ‘వెనక కృష్ణుడు ఉన్నాడు’ అని కృష్ణ భగవానుని మీద పూర్తి నమ్మకం కలిగి ఉండి దాని నోటిలోకి ప్రవేశించారు. అలా చేయడం పాపమా! పుణ్యమా! అనేది వారికి తెలియదు. పాపపు పనిని చేసి ఈశ్వరుడు చేయిస్తున్నాడని మాత్రం అనకూడదు. తెలిసి పాపమును చేస్తే ఆ పాపఫలితమును అనుభవించవలసి ఉంటుంది. అందుకే శాస్త్రము మరణము పాపము వలన వస్తుందని చెపుతోంది. పాపమే మరణమును ఇస్తుంది. చేసిన పాపము భయంకరమైనది అయితే అకాలమృత్యువు ఇవ్వబడుతుంది. పుణ్యచేసిన వాడికి కూడా మృత్యువు వస్తుంది కానీ అనాయాస మరణం వస్తుంది. మనం పూజ చేసినప్పుడు, దేవాలయమునకు వెళ్ళినప్పుడు, పుణ్యనదీ స్నానం చేసినప్పుడు ‘అనాయాసేన మరణం – వినా దైన్యేన జీవితం’ ఈ రెండింటినీ అడగాలి. చేసిన పాపమును అనుభవములోనికి ఈశ్వరుడు వృద్ధాప్యమునందు తెస్తాడు. ప్రతిజీవికీ మరణం తథ్యం. చనిపోయేటప్పుడు పువ్వులా వెళ్ళిపోవాలి. అందుకే చేసిన పాపపుణ్యములు మృత్యు సమయమునందు తెలుస్తాయి’ అని పెద్దలు అంటారు. వెనకాల ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ప్రవరించగలిగితే చాలు. చేస్తున్న ప్రతి సత్కర్మ ఈశ్వరుడు చేయిస్తున్నాడు అనుకోవాలి. ఒకవేళ ఎప్పుడయినా తప్పు చేస్తే దేవుడి ముందు అంగీకరించి ఆ తప్పునకు భగవంతుని క్షమాపణ అడగాలి. అప్పుడు తప్పులు చేయడం అనేదే ఉండదు. దీనికి ముందు భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. ఆయన చూస్తున్నాడన్న భయం మనసులో ఉండిపోతుంది.

అఘాసుర వధ ఘట్టంలో గోపబాలురను ఈశ్వరుడు రక్షించగలిగాడు. ఇది పరమాత్కృష్టమయిన కథ ఇది మనకందరికీ చిరస్మరణీయమై, నిత్య స్మరణీయమై, ప్రతిరోజూ భగవంతుని యందు పూనికను పెంచి, ఈశ్వరుడు మనలను అనుగ్రహించగలిగిన స్థితిని ఆవిష్కరిస్తుంది.

బ్రహ్మ గోవత్సములను, గోప బాలకులను అంతర్దానంబు చేయుట

శుకుడు పరీక్షిత్తుకు ఈ కథను చెపుతూ చిన్న మెలిక పెట్టారు. దీనిని ‘కౌమార పౌగండ లీల’ అంటారు అని చెప్పారు. మొదటి అయిదేళ్ళ వయస్సును కౌమారము అంటారు. తరువాతి అయిదేళ్ళను పౌగండము అంటారు. మరి పిల్లలు కౌమారములో జరిగినది పౌగండములో ఎలా చెప్పారు? పిల్లలందరికీ ఈ కథ అయిదవ ఏట జరిగింది. ఏడాది పాటు ఈ పిల్లలు ఇంటికి వెళ్ళలేదు. ఈ లీలను శుకుడు ‘కౌమారపౌగండలీల’ అని చెప్పారు. పరీక్షిత్తు ఈ లీల చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కౌమారంలో జరిగిన విషయం పౌగండంలో ఎందుకు చెప్పారు? ఏడాది పాటు పిల్లలు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? నాకీ కథ దయచేసి వివరంగా చెప్పవలసింది’ అని మహర్షిని ప్రార్థించాడు.

ఆర్తి కలిగిన శిష్యుడు ఉంటే గురువుకి ఉత్సాహంగా ఉంటుంది. శుకమహర్షి నీ ఆనందమును చూస్తే నాకు తప్పకుండా చెప్పాలనిపిస్తున్నది వినవలసింది’ అని దానికి సంబంధించిన కథను చెప్పడం ప్రారంభించారు. గోపాలురను బ్రతికించిన కృష్ణపరమాత్మ వీరినందరినీ తీసుకొని బృందావనం లోపలి వెళ్ళాడు. బాగా ఎండగా ఉన్నది. అపుడు కృష్ణుడు గోపబాలురతో

“ఎండన్ మ్రగ్గితి రాకటం బడితి రింకేలా విలంబింపఁగా

రండో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్క డీ

దండన్ లేగలు నీరు ద్రావి యిర వందం బచ్చికల్ మేయుచుం

దండం బై విహరించుచుండఁగ నమందప్రీతి భక్షింతమే?”

మీరు ఇప్పటివరకు ఎండలో తిరిగారు బాగా ఆకలివేస్తోంది, దాహం వేస్తోంది. మనం చల్దులు తెచ్చుకున్నాం కదా! నీడలో కూర్చుని వాటిని తిందాము’ అన్నాడు.

జలజాంతస్థితకర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే

కుల చందంబున గృష్ణునిం దిరిగిరా గూర్చుండి వీక్షించుచున్

శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా

కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా!

గోపాలబాలురికి తాము ఎందులో తింటున్నాము, ఏమిటి తింటున్నాము అనేది లెక్కలేదు. తామరపువ్వు బాగా విచ్చుకుంటే దాని రెక్కలనీ ఒకదానిమీద ఒకటి ఉండి మధ్యలో కర్ణిక ఉంటుంది. కర్ణికకు చుట్టూ రేకులన్నీ విచ్చుకుని ఉంటాయి. అలా కృష్ణుడిని వారందరి మధ్యలో కూర్చుండ చేసారు. గోపబాలురు కృష్ణుని చుట్టూ కూర్చున్నారు. వారికి శౌచము అంతగా తెలియదు. ఒకడు రాయి తెచ్చుకుని తను తినే ఆహార పదార్ధమును ఆ రాతిమీద పెట్టుకున్నాడు. ఒకడు నాలుగు చిగురుటాకులు కోసుకు తెచ్చుకుని తను తినే ఆహారం దానిమీద పెట్టుకున్నాడు. ఒకడు కొద్ది గడ్డికోసి తెచ్చుకుని ఆ గడ్డిని కంచంలా అమర్చి, దానిమీద తను తెచ్చుకున్న చల్దిమూటను పెట్టుకున్నాడు. ఒకడు తాను తెచ్చుకున్న చిక్కమును పరుచుకుని ఆ చిక్కంమీద తినేస్తున్నాడు. ఒకడు చెట్లకు అల్లుకొన్న పెద్ద పెద్ద తీగలలో ఒక తీగ కోసి దానిమీద పెట్టుకుని తింటున్నాడు. ఒకడు ఒక పెద్ద అడివిపువ్వును కోసితెచ్చి ఆ పువ్వులో పెట్టుకుని తింటున్నాడు.

మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు నూరుగాయలు దినుచుండు నొక్క

డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి చూడు లేదని నోరు చూపునొక్క

డేగు రార్గురి చల్దు లెలమి బన్నిద మాడి కూర్కొని కూర్కొని కుడుచు నొక్క

డిన్ని యుండగ బంచి యిడుట నెచ్చలితన మనుచు బంతెనగుండు లాడునొకఁడు

కృష్ణు జూడు మనుచుఁ గికురించి పరుమ్రోల, మేలి భక్ష్యరాశి మెసగు నొకడు

నవ్వు నొకడు, సఖుల నవ్వించు నొక్కడు, ముచ్చటాడు నొకడు మురియు నొకఁడు.

ఒకడు వాని ఇంటినుంచి ఊరగాయలు తెచ్చాడు. ఎడమచెయ్యి పూజయందు గాని, భోజనమునందు కానీ దూష్యము. వాడు చల్దిముద్ద ఎడమచేతిలో పెట్టుకున్నాడు. ఊరగాయ అన్నం తింటూ పక్కవాడికి వాడి ఊరగాయలను చూపించి ఊరించేవాడు. ఒకడు పక్కవాని చల్దిమూటనుంచి ఊరగాయను తీసి అవతలి వానికి తెలియకుండా గుటుక్కున మ్రింగి, పక్కవాడు అడిగితే నోరు చూపించి ‘నేనెక్కడ తిన్నాను?’ అనేవాడు. ఒకడు పక్కవాళ్ళు విస్తళ్ళకు ఆకులు తెచ్చుకుందామని పక్కకి వెడితే వాళ్ళ చల్ది మూటలలోని కొన్ని ఆహార పదార్థములను తీసేసుకొని గబగబా అయిదారుగురి చల్ది తననోట్లో కుక్కేసుకునేవాడు. ఒకడు తాను బంతెనగుండ్లు తింటాననే వాడు. బంతెన గుండ్లు అంటే అందరి విస్తళ్ళనుండి కొంచెం కొంచెం తీసుకుని నోట్లో పడేసుకుంటూ ఉండడం. ఒకడు కృష్ణుని చూపించి ‘ఆ ఆవకాయ ముక్కలు పట్టుకుని కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడరా’ అనేవాడు పక్కవాడు కృష్ణుడి వంక చూసేసరికి వాడి విస్తరిలోని ఆవకాయ ముక్కను వీడు తినేవాడు. ఒకడు నవ్వుకుంటూ, ఒకడు తాను నవ్వకుండా తన మాటలచేత పక్కవాళ్ళని నవ్విస్తున్నాడు. ఇన్ని రకములుగా వీరందరూ అక్కడ అన్నం తింటున్నారు. కృష్ణుడు వీరందరి మధ్యలో కూర్చున్నాడు. వీళ్ళు కృష్ణుణ్ణి చూస్తూ తింటున్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి చూస్తూ తినడంలో కడుపు నిండుతుంది. వీళ్ళకి అదొక గమ్మత్తు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/

[22/11, 12:33 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 75 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి

విమల శృంగంబును వేత్రదండంబును జాఱి రానీక డాచంక నిఱికి

మీగడపెరుగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలి చేత మొనయ నునిచి

చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి

సంగడీల నడుమ జక్కగ గూర్చుండి, నర్మభాషణముల నగవు నెఱపి

యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద, శైశవంబు మెఱసి చల్ది గుడిచె!

అందరి మధ్య నిలబడి కృష్ణపరమాత్మ తనమీద ఉన్న ఉత్తరీయం తీసి, నడుముకి కట్టి అందులోకి వేణువును దోపి, ఆవులను తోలే కర్ర, ఊదే కొమ్ముబూరను ఎడమ చంకలో పెట్టుకుని, ఎడమచేతిలో చద్ది అన్నపు ముద్ద పెట్టుకుని గోపబాలురు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలను తన వేళ్ళ సందులో పెట్టుకుని దానిని నంజుకుంటూ అన్నమును తింటున్నాడు. కృష్ణుడు తన చేతిలో పెట్టికున్నది గతరాత్రి వండిన పదార్ధం. నిలవున్న పదార్థం ఈశ్వర నివేదనమునకు పనికిరాదు. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే ఆ అర్హత ఉన్నది. దానికి నిలవ దోషం లేదు. ఆయన యాగభోక్త మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ‘ఓం నమోనారాయణాయ స్వాహా’ అని మంత్రం చెప్పి స్రుక్కు, సృవములతో నేతిని పోస్తే హవిస్సు వేస్తే, అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఈవేళ గోపబాలురందరితో కలిసి ఎంగిలి ముక్కలు నంజుకుని తింటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటుంటే అమరులు అన్ని లోకములనుండి వచ్చేశారు. ‘ఏమి ఆశ్చర్యం! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సులు స్వీకరించని పరమాత్మ గోపబాలురతో కలిసి స్నానం చెయ్యకుండా ఇంతమంది మధ్య కూర్చుని తాము ఎంగిలిచేసి పెట్టినది తింటున్నాడు. ఏమి ఆశ్చర్యము’ అని వారందరూ తెల్లబోయి చూస్తున్నారు. రంభాది అప్సరసలు పొంగిపోయి నాట్యములు చేస్తున్నారు. దేవతలు అందరూ ఆనందముతో ‘గోవిందా గోవిందా’ అని అరుస్తున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవిన పడ్డాయి. ఈ అల్లరి ఏమిటో చూసి రావాలని ఒకసారి సత్యలోకంనుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూశాడు. బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలురందరితో కలిసి తింటున్నాడు. ‘ఈ ఎంగిలి ముద్దలు ఎడమచేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మా? అఘాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఇతడు బ్రతికించాడా? యాగములందు తప్ప హవిస్సులు స్వీకరించని పరబ్రహ్మ ఇంత సులభుడయినాడా? ఇది నేను నమ్మను. ఆ పిల్లవాడు పరబ్రహ్మము కాదు’ అని అనుకున్నాడు.

‘నేను చతుర్ముఖ బ్రహ్మను ఇంటి పెద్దను. నాలుగు ముఖములు కలవాడిని. వేదములు చదివినవాడిని. నామాయ తప్పించుకోలేడు’ అని వెంటనే ఒక మాయ చేసాడు. అక్కడే నీరు త్రాగి పచ్చిక తింటున్న ఆవులని, దూడలని, ఎద్దులను కొంచెం దూరముగా తీసుకువెళ్ళి మాయం చేసేసి, వాటినన్నిటిని ఒక కొండగుహలో పెట్టేసాడు. అన్నం తింటున్న పిల్లలు కృష్ణా మన ఆవులను దూడలు కనపడటము లేదని చెపితే నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను. మీరు అన్నం తింటూ ఉండండి’ అని చెప్పి ఆవులను వెతకడానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. వాటి పాదముల జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. ఒకచోట మంద అంతా విడిపోయి వెళ్ళినట్లు కనపడింది. ఆవులు కనపడక పోయేసరికి తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఈలోగా బ్రహ్మగారు కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గోపాల బాలురను మాయం చేసేశాడు. ఇక్కడ చూస్తే గోపాలబాలురు లేరు. అక్కడ ఆవులు, దూడలు, ఎద్దులు లేవు. సాయంకాలం అవుతున్నది. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే మా పిల్లలేరి, మా ఆవులేవని అడుగుతారు. అవి ఏమైపోయాయి అని ఒకసారి దివ్యదృష్టితో చూసాడు. తన నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఈవేళ మోహబుద్ది పుట్టింది. ఆయన తనమీద మాయ చేసాడని తెలుసుకున్నాడు. ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. తాను ఒక్కసారి సంకల్పం చేశాడు. ఎన్ని ఆవులు వచ్చాయొ అన్ని ఆవులు, ఎద్దులు, దూడలు, గోపాలబాలురు అయిపోయాడు. తానే అన్నీ అయిపోయాడు. తానే తనని తోలుకుని అన్నింటితో కలిసి ఇంటికి వెళ్ళాడు.

ఒక్కొక్క తల్లిదగ్గర ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఒక్క కృష్ణుడే ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు ఏ దూడలు, ఆవులు, ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు. ఆ తల్లిదండ్రులు, గోపకాంతలు, గోపాలబాలురని చూసి మా పిల్లవాడే అని మురిసిపోయారు. కృష్ణుడు రోజూ ఇలా గే చేస్తున్నాడు. ఈలోగా త్రుటికాలం కనురెప్ప మూసి తెరచినంతకాల అయింది. బ్రహ్మగారికి త్రుటి అంటే మనకి సంవత్సరకాలం. సంవత్సరం తరువాత కృష్ణుడు ఏమిచేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు తలను ఇటు తిప్పాడు. అవే ఆవులు, అవే దూడలు, గోపాలబాలురు ఇక్కడ ఉన్నారు. తాను దాచాడు కదా అని తాను దాచిన గుహను చూశాడు. వారందరూ గుహలో ఉన్నారు. మాయ చేద్దామనుకున్నవాడు మాయలో పడ్డాడు. బ్రహ్మనయిన నేను ప్రాణులన్నింటినీ సృష్టిస్తాను.నేను సృష్టించిన ఆవులు, దూడలు, గోపబాలురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే అక్కడ ఉన్నారు. అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడయినా ఉన్నాడా’ అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. అది ఖాళీగానే ఉన్నది. తానే సృష్టికర్తగా ఉన్నాడు. మరి అక్కడ కనపడుతున్న వారెవరా అని ఆలోచించాడు. బ్రహ్మగారికి గుర్తు వచ్చింది. ‘నన్ను కూడా సృష్టించిన వాడెవడో అతడు పరబ్రహ్మ. ఎవని నాభికమలము నుండి నేను పుట్టానో ఆతడు చిన్నికృష్ణునిగా ఉన్నాడు. వాని మాయముండు నా మాయ తుత్తునియలయిపోయింది. నేను దీనిని తెలుసుకోలేక పోయాను’ అని అనుకోగానే ఒక్కసారి మోహబుద్ది విడిపోయింది. చిన్నికృష్ణుని పరబ్రహ్మమును చూద్దామని అటు చూసాడు. చూసేసరికి ఆవులలో, దూడలలో, ఎద్దులలో, పిల్లలలో, కృష్ణుడిలో నాలుగు భుజములతో, శంఖచక్రగదాపద్మములను పట్టుకొని పట్టు పీతాంబరములతో శ్రీవత్సముతో కౌస్తుభమణితో, వనమాలతో, కిరీటముతో, పెద్ద పెద్ద కుంతలములతో, వెలిగిపోతున్న పరబ్రహ్మము అనేకముగా దర్శనం ఇచ్చాడు. ఇన్ని కాంతి పుంజములను చూసి బ్రహ్మగారు అయోమయంలోకి వెళ్ళిపోయారు. ఎందుకిలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేనిమీద పనిచేయ్యదో దానిమీద మాయకమ్మే ప్రయత్నం చేశాను’ అనుకుని ‘స్వామీ! దయచేసి నేను చూడగలిగినట్లు కనపడు’ అని ప్రార్థించాడు. ఆవులను దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు. ఈ లీలను చేసినది తానేనని ఒకరోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు.

ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి

శంపాలతికతోడి జలదంబు కైవడి మెఱుగు టొల్లియతోడి మేనివాని

కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నంబుల వెలయువాని

గుంజా వినిర్మిత కుండలంబులవాని శిఖిపింఛవేష్టిత శిరమువాని

వనపుష్పమాలికా వ్రాత కంఠమువాని నలినకోమల చరణములవాని

గరుణ గడలుకొనిన కడకంటివాని గో, పాలబాలుభంగి బరగువాని

నగుమొగంబువాని ననుఁగన్నతండ్రిని, నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష!

శంపాలతిక అంటే మెరుపుతీగ. కృష్ణుడు మెరుపుతీగతో కూడిన వర్షాకాలములోని నల్లనిమబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు. పైన చిన్న ఉత్తరీయం ఉన్నది. ఎడమచేతిలో పెరుగు అన్నపు ముద్ద ఉన్నది. ఎడమచంకలో కొమ్ము బూర ఉంది. చేతిలో కర్ర ఉన్నది. పీతాంబరమును కట్టుకున్నాడు. ఏనుగు దంతంతో చేయబడిన కుండలములు పెట్టుకున్నాడు. చక్కటి నెమలి ఈక నొకదానిని పెట్టుకున్నాడు. అరణ్యములలో దొరికిన పద్మములతో కూడిన తీగనొకదానిని దండగా మెడలో వేసుకున్నాడు. అలా కనపడుతున్న కృష్ణుని పాదములమీద పడి బ్రహ్మగారు స్తోత్రం చేశారు.

ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగారాని ని

న్నీలోకంబున నీ వనాంతరమునం దీమందలో గృష్ణ యం

చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ

వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే?

నాకీ దిక్కుమాలిన బ్రహ్మపదవి ఎందుకు? బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీ కృతమయిన నీవు, ఈ వేళ ఇక్కడ ఈ అరణ్యంలో తిరుగుతున్నావు. నీతోకలిసి ఆడుకుని పొంగిపోయిన ఈ గోపబాలుర పాదములకు అంటుకొనిన ధూళికణమును తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టమును నాకు కటాక్షించు. నాకు ఈ బ్రహ్మపదవి వద్దు’ అన్నాడు.

ఎవరు ఈ బ్రహ్మగారు చేసిన స్తుతిని చదువుతారో వారిని మాయ విడిచిపెడుతుంది. అంతటా కృష్ణుడు కనపడుతుండగా ఏ భయం లేకుండా, సంతోషముతో చూస్తూ, తేలికగా ప్రాణములు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మములో కలిసిపోతారు. ఇహమునందు వారు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈవిధంగా కౌమారం నందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడింది. ఏడాదిపాటు కృష్ణుడే అన్నీ అయి ఉన్నాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage/