శ్రీ రామ (128 )
(శ్రీ శంకర భగవత్పాదులవారి రచనల గురించి ఒక మిత్రుని సందేహం, నా సమాధానం, మరొక మిత్రుల అభిప్రాయం, చూద్దాం).
శ్లో //శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్/
నమామి భగవత్పాద శంకరం లోక శంకరమ్//
(శ్రుతులు,స్మృతులు,పురాణములు,ఇతిహాసాదులయందు నిగూఢంగా ఉన్న విషయములను వెలికి తీసి,
సమస్త జీవకోటియందు కరుణ కలవారై, అద్వితీయమైన తమ రచనల ద్వారా మానవాళికి జ్ఞాన భిక్ష పెట్టి,
జగద్గురువులై, సమస్త లోకములకు శుభము కలిగించే,
శ్రీ శంకర భగవత్పాదుల వారికి నమస్కరిస్తున్నాను).
--------------------
శ్రీ శంకర భగవత్పాదుల వారి రచనలను గురించి అనేకమంది ఆస్తిక మహాశయులకు తరచుగా వచ్చే సందేహాన్నే " శ్రీ బి. సోమయాజులుగారు" అనే మా మిత్రులు ఈ విధంగా వెలిబుచ్చారు.
సందేహం.
" 🙏 ఓం నమో నారాయణాయ! "
అద్వైత మతాన్ని స్థాపించిన శ్రీ శంకర భగవత్పాదులవారు జగద్గురువులు ఎలా అయ్యారు ?
" అహం బ్రహ్మాస్మి " అని అద్వైతాన్ని ప్రతిపాదించిన శ్రీ శంకరులు అనేక స్తోత్రాలు అనేక దేవతలను ఉద్దేశించి వ్రాయడంలో అంతరార్థం ఏమిటి ?
"సోహమ్" అన్న ఆచార్యులవారు స్తోత్రాలలో "దాసోహం" అని ఎందుకు అన్నారు?
ఇది నాకు వచ్చిన సందేహం.
పెద్దలు వివరించమని ప్రార్థన! "
------
ఆ సందేహానికి నా సమాధానం.
యూనివర్సిటీ " (విశ్వవిద్యాలయం) అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎవరికైనా ఇక్కడ విద్య లభిస్తుంది అని భావం.
ఏ తరగతి వారికి ఏ విద్య చెప్పాలో దానిని "సిలబస్" అంటాం.
ఆ "సిలబస్" తో కూడిన పుస్తకాన్ని "టెక్స్ట్ బుక్" అంటాం.
అలా ప్రపంచం లోని సమస్త మానవులకు వారి, వారి, తరగతులకు అనుకూలంగా "సిలబస్" మరియు
"టెక్స్ట్ బుక్స్" రచించిన విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ) శ్రీ శంకర భగవత్పాదులవారు.
ఆ విధంగా వారు విశ్వమంతకు గురువులు అయినారు.
రెండు వేల సంవత్సరముల క్రితం అవతరించి,
"ఆధ్యాత్మిక అగాధాల్లో " కూరుకుపోయిన మానవజాతిని మేల్కొల్పి,
పిన్న వయస్సులోనే, సన్యసించి,
ధర్మబోధ కోసం ఆశేతు శీతాచలం మూడుసార్లు భారతదేశమంతా పర్యటన చేసి,
భక్తి, జ్ఞాన, యోగాది విషయములను ప్రజోపయోగం కొరకు గ్రంథస్థం చేసి,
ప్రజలకు జ్ఞానభిక్ష పెట్టిన "జగద్గురువులు"
శ్రీ భగవత్పాదులవారు.
" సత్యం, జ్ఞాన, మనంతం బ్రహ్మ" (భగవంతుడు సత్య స్వరూపుడు. జ్ఞాన స్వరూపుడు. ఆద్యంతములు లేనివాడు),
మరియు,
" ఆనందో బ్రహ్మ" (భగవంతుడు అంటే ఆనందమే),
అని వేదము ఉపదేశించిన పరతత్త్వమును "ఆత్మ " అనగా "తానే" అని తెలుసుకోవడమే, " అద్వైతం ".
ఇది పి.హెచ్.డి.
ఈ డాక్టరేటు (పి.హెచ్.డి) గమ్యంగా,
శ్రీ శంకర భగవత్పాదుల వారు,ఒకటవ తరగతి నుండి,
పి. హెచ్.డి., దాకా పుస్తకాలు వ్రాసి ఉంచారు.
వారి వారి పూర్వజన్మ సంస్కారమునుబట్టి వివిధ దేవతల యందు ఏర్పడే భక్తి,
యోగ, జ్ఞానములయందు అనురక్తి,
పూర్వజన్మ వాసనలననుసరించి ఏర్పడే స్వభావము,
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, శివ స్తోత్రాలు, విష్ణు స్తోత్రాలు, దేవీ స్తోత్రాలు మొదలైన అనేక దేవతా స్తోత్రాలు,
యోగ తారావళి లాంటి యోగ శాస్త్రాలు,
జ్ఞాన బోధకములైన ఉపనిషత్తులకు, భగవద్గీతకు,బ్రహ్మసూత్రములకు భాష్యములు,
మొదలైన అనేక రచనలు ఆచార్యులవారు చేశారు.
సద్గురువులు ఆ యా తరగతి విద్యార్థులకు వారి వారి యోగ్యతానుసారంగా తగిన పాఠాలు చెబుతారు.
పదో తరగతి పాఠాలు ఒకటో తరగతి విద్యార్థికి అర్థం కావు.
పదోతరగతి విద్యార్థి ఒకటో తరగతి పాఠాలు చదువుతూ కాలం వ్యర్థం చేసుకోడు.
శ్రీ శంకర భగవత్పాదుల వారు అన్ని తరగతుల విద్యార్థులకు, వారి వారి స్థాయికి తగినట్లు రచనలు చేసి మానవాళిని అనుగ్రహించారు అని మాత్రం అర్థం చేసుకుని,
వారు అనుగ్రహించిన గ్రంథములను మన స్థాయిని బట్టి అధ్యయనం చేస్తూ,
గురువుల ద్వారా సందేహములు తీర్చుకుంటూ, ముందుకు పోవాలి.
క్రమంగా అన్ని సందేహములు తీరి డాక్టరేటు గమ్యం చేరుకుంటాము".
అద్వైతం లక్ష్యంగా సంస్కరింపబడి, ఇప్పుడున్న శైవ, వైష్ణవ,గాణపత్య,ద్వైత, విశిష్టాద్వైత,స్మార్తాది సమస్త సంప్రదాయములకు మూలం శ్రీ శంకరుల బోధలే.
సద్గురువులు ఆ యా కాలములలో అవతరించి ఈ బోధలను ప్రజల యోగ్యతానుసారం వివిధ రీతులలో ఉపదేశిస్తూ ఉంటారు.
-------
పై సమాధానమునకు శ్రీమతి మాలినీ శ్రీ గారు ఈ విధంగా స్పందించారు.
* నమామి భగవత్పాద శంకరం లోక శంకరం 🙏🙏 *
అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అసత్యం నుండి సత్యం వైపు, చీకటి నుండి వెలుగులోకి, మృత్యువు నుంచి ముక్తి మార్గము వైపు నడిపించే వారు గురువులు 🙏🙏.
శంకరాచార్యుల వారు ఒక విశ్వవిద్యాలయం అని, ఆయన రచనలను పాఠ్యాంశాలు అని, ఎంతో చక్కగా సువిశాలమైన దృక్పథంతో కూడిన వివరణ అపూర్వం పెదనాన్న.
నిజమే కదా, అసలు శంకరాచార్యుల వారు లేక పోతే ఆధ్యాత్మిక చింతన, దేవాలయాలు, పూజలు, అనేవి ఉండేవి కావు.
ధర్మం అట్టడుగున పడిపోయి ఇతర బౌద్ధం, జైనం, చార్వాక ధర్మాలు, కాపాలిక మతము మొదలైన ఆచరణలు విర్రవీగుతూ ఉన్న సమయంలో శివుడే స్వయంగా శ్రీ శంకరాచార్య స్వామి వారి రూపంలో అవతరించి ధర్మ సంరక్షణ చేశారు.
శంకరాచార్యులవారు సనాతన ధర్మాన్ని పదిలంగా నిలపడానికి జన్మించిన మహాపురుషుడు.
ఈ వేదం, పురాణాలు, ఉపనిషత్తులు ఈరోజు ఇంకా నిలదొక్కుకొని ఉన్నాయంటే దానికి మూలం శ్రీ శంకరులు.
కొందరు అద్వైత సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఉంటారు.
కానీ అది అన్నిటికీ పునాది.
ఒక ఆలయం నిలబడడానికి పునాది ఎలాగో అలాగే అద్వైతం.
అద్వైతం పునాది అయితే దానిపై నిలబడిన ఆలయ గోపురాలు విశిష్టాద్వైత, ద్వైతములు.
పునాది లేనిదే ప్రయోజనం లేదు.
ఇది చాలా మంది పెద్దల అభిప్రాయం.
గురువు అంటే శ్రేయస్సు కోరేవారు. శంకరులు సమస్త మానవాళికి, భూమికి శ్రేయస్సు కోరుతూ, దానికి అనువైన సనాతన ధర్మాన్ని కాపాడారు. అందుకే శంకరులు జగద్గురువు. 🙏
మీరు తరగతులు, దానికి తగినట్లుగా పాఠ్యాంశాలు, విద్యార్థుల అర్హత, పూర్వ జన్మ సుకృతం మేరకు ఆయన రచనలను అభ్యాసం చేస్తారు అన్నది అమోఘం.
ఎంతో సత్యము, అంతరార్థము దాక్కుంది దానిలో 🙏
అద్వైతం నిజంగానే పి.హెచ్. డి.
అనంతమైన పాఠ్యాంశం ఉన్న పదవి.
దానిని పొందడం కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే సాధ్యం అని నా అభిప్రాయం.
నేను కేవలం శంకరులు రచించిన స్తోత్రములు చదివే ఒకటో తరగతి విద్యార్థిని.
ఇంతకే ధన్యురాలిని అనుకుంటా.
ఇంకా కాస్త పై తరగతిలోకి ఉత్తీర్ణత సాధించగలిగితే అది తప్పకుండా శారదా మాత, గురువుల ఆశ్శీస్సులు. 🙏
శ్రీ శంకరులు పంచాయతన పూజా విధానం స్థాపించి సుబ్రహ్మణ్య స్వామిని అన్ని విధానాల్లో జ్యోతి స్వరూపంలో నిలిపారు.
భారత దేశం మొత్తం నాలుగు దిక్కులా నాలుగు పీఠాలు స్థాపించి రక్షణా కవచాన్ని నిర్మించి ధర్మం నిలబెట్టారు. 🙏
అలా చేయడం వల్లే వైష్ణవ, మధ్వ, మరియు ఇతర మతాలు ఈనాడు మనగలుగుతున్నాయి.
శివ కేశవులకు అభేధం. అది గళస్య కంఠస్య బంధం.
సోహం, దాసోహం వివరణ చాలా ఆలోచింప చేస్తుంది. సోహం అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది.
అన్నీ నేనే, అన్నింటా నేనే అనేదే ఆత్మ తత్వము.
ఆ తత్త్వమును అలవరుచుకొని దానికి లోబడి ఉండడం దాసోహం, అని నేను అనుకుంటున్నాను.
ఇతర దేవతలకు దాసోహం అని పైకి తోస్తున్నా , వారిలో ఉన్న ఆత్మ తత్త్వానికి దాసోహం అని నేను అనుకుంటున్నాను.
అలా ఆ అద్వైత తత్వానికి శరణాగతి కావడం, ఆచరించడం మన కర్తవ్యం అని ఇంతమాత్రం నా చిన్న, పామర మెదడు అర్థం చేసుకుంది.
నా అభిప్రాయంలో తప్పులుంటే సరిదిద్దండి పెదనాన్న.
శంకరాచార్యుల వారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.
🙏. ఆయన అనంతం. 🙏
కేవలం నమస్కారం చేసే యోగ్యత మాత్రమే ఉంది.
నాకు చాలా చాలా నచ్చిన వ్యాసం ఇది పెదనాన్న.
నాతో చాలా ఆలోచింప చేసి, నేను విన్న ఎన్నో విషయాలు స్ఫురణకు తెచ్చింది మీ వ్యాసం.
ధన్యవాదాలు పెదనాన్న.
మీరు మీ రచనలతో అందరికి ఎంతో జ్ఞానం పంచుతున్నారు 🙏
------------
(25-4-'23 న పెట్టిన పోష్టు)
శుభమస్తు
తూములూరి మధుసూదనరావు,
25-4-'26