🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*ఆదివారం 1 మార్చి 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*12వ భాగం*
*భూమండలం - సప్త ద్వీపాలు:*```
బ్రహ్మదేవుడు భూమండలాన్ని సప్త ద్వీపాలుగా విభజించి,జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలీ ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం అని పేర్లు పెట్టాడు.
#జంబూద్వీపం తొమ్మిదివర్షములు (దేశాలు)గా విస్తరించి ఉంది. తొమ్మిది వర్షములలో భరత వర్షము ఒక్కటే కర్మ క్షేత్రం. భగవంతునికే కాదు, దేవతలందరికి ప్రియమైనది. ఇక్కడ మానవులుగా జన్మించి పుణ్య కర్మలు, తపస్సులు చేసి జన్మరాహిత్యమైన మోక్షము పొందాలి అని దేవతలు కూడా కోరుకుంటారు. కర్మక్షేత్రం, ధర్మ క్షేత్రం అయిన ఈ భూమిలో మహావిష్ణువు అనేక అవతా రాలు ఎత్తి ధర్మపరిరక్షణ చేశాడు.
జంబూద్వీపానికి నాభి కేంద్రంగా లక్ష యోజనాల మేరు పర్వతము ఉంది. భరతవర్షానికి ఉత్తరాన నిషధ హోమకూట హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఇవి సరిహద్దులుగా హరివర్ష, కింపురుష వర్షములు ఉన్నాయి. భరతవర్షానికి పశ్చిమాన మాల్యవంత పర్వతము, తూర్పున గంధమాదన పర్వతాలు ఉన్నాయి. వీటికి సరిహద్దులుగా నీల, నిషధ పర్వతాలు ఉన్నాయి. దేవజాతుల వారు ఇక్కడ నివసిస్తారు.
వీటి సరిహద్దులుగా ఉన్న కేతుమాల, భద్రాశ్వ వర్షాలలో ఆయా దేశ జాతుల వారు నివసిస్తారు. మంధర, మేరు మంధర, సుపార్స్మక, కుముద పర్వతాలు మేరు పర్వత పాదగిరులుగా ఉన్నాయి. ఈ పర్వతాలపై క్షీర సరస్సు, మధు సరస్సు, ఇక్షు సరస్సు, శుద్ధోదక సరస్సులున్నాయి. దేవతలు ఈ సరస్సుల నీటిని స్పర్శించి ఐశ్వర్య యోగ సిద్దులను పొందుతారు.
నాలుగు పర్వతాల పై నందన, చైత్రరథక, వైభ్రాజక, సర్వభద్రక అనే నాలుగు ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ నాలుగు వనాలలో గీత వాయిద్య నర్తకీమణులైన అప్సరసలు నివసిస్తారు. దేవతాగణాలు ఈ నాలుగు వర్షాలలో విహరిస్తూ సుఖ భోగాలు పొందుతారు.
మేరు పర్వత శిఖరం పై పెద్ద నేరేడు (జంబు) వృక్షము ఉంది. జంబూద్వీపము అనే పేరు ఈ వృక్షము వలనలే వచ్చింది. ఈ జంబూవృక్షానికి ఏనుగు తలంత నేరేడు ఫలాలు కాస్తుంటాయి. జంబూ ఫలాలు పగిలి వాటి రసం ప్రవహించి జంబూనది ఏర్పడింది. జంబూనది తీరంలో శక్తి స్వరూపిణి "జంబాద్విని" గా వెలిసింది. తొలి సృష్టి మానవులు జంబూఫలాలను ఆహారంగా సేవించేవారు. దేవతల హస్త స్పర్శ తగిలి ఎండిపోయిన జంబూరసము బంగారంగా మారుతుంది. ఈ బంగారాన్ని జంబూరసంగా పిలుస్తారు.
జంబూద్వీపములో భరతవ వర్షము ఒక్కటే మానవులు నివసించే భూమిగా ఉంది. మిగిలిన ఎనిమిది వర్షాలు "దేవభూములు" గా ప్రసిద్ది చెందాయి. ఇక్కడ దేవతా జాతుల వారు నివసిస్తారు.
#రెండవ ద్వీపం ప్లక్ష ద్వీపము. జంబుద్వీపమంత పరిమాణమే కలిగి ఉంటుంది. ఇక్షు సముద్రం ప్లక్షద్వీపం చుట్టూ ఉంటుంది. ఇక్కడ అరుణ, నృమ్ణ,అంగీరస,సావిత్రి, సుప్రభాతిక, ఋతంభర, సత్యంభర అనే సప్త నదులు ఉన్నాయి. మణికూట, ఇంద్రసేన,జ్యోతిష్మతి,సువర్ణ, హరిణ్యష్టీవ, మేఘమాల అనే ఏడు పర్వతాలు ఉంటాయి. ఇక్కడ హంస, పతంగ, ఊర్థ్వాయన, సత్యాంగ అనే నాలుగు సంజ్ఞలు గల నాలుగు వర్ణాల వారు నిసిస్తుంటారు. ప్రజలు వేయి సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి ఉంటారు. సూర్యోపాసన చేస్తుంటారు.
#మూడవ ద్వీపం శాల్మల ద్వీపం. పరిమాణంలో ప్లక్ష ద్వీపానికి రెట్టింపు ఉంటుంది. ఈ ద్వీపాన్ని సురా సముద్రం చుట్టుముట్టి ఉంటుంది. ద్వీపం మధ్యలో శాల్మలీ వృక్షము ఉండటం వలన ద్వీపానికి ఈ పేరు వచ్చింది. గరుత్మంతుడు ఈ వృక్షము పై నివసిస్తుంటాడు. ఇక్కడ ఏడు పర్వతాలు, ఏడు నదులు ఉన్నాయి. శ్రుతధర, వీర్యధర, వసుంధర, ఇషుంధర అనే నాలుగు వర్ణాల వారు నివసిస్తుంటారు. వేదమయుడైన సోమేశ్వరుని పూజిస్తారు.
#నాలుగవ ద్వీపం కుశ ద్వీపం. ఈ ద్వీపాన్ని పరివేష్టించి ఘృత సముద్రం ఉంటుంది. ద్వీపం లోని కుశస్థంభం స్వయం ప్రకాశమై వెలుగుతూ నాలుగు వైపుల వెలుగులు ప్రసరిస్తూ ఉంటుంది. ఈ ద్వీపంలో కూడా ఏడుపర్వతాలు, ఏడు నదులు ఉన్నాయి. కుశల, కోవిధ, అభియుక్త, కులక అనే నాలుగు వర్ణాల ప్రజలు నివసిస్తూ, అగ్నిదేవుని పూజిస్తూ యజ్ఞయాగాదులు చేస్తుంటారు.
#ఐదవ ద్వీపం క్రౌంచ ద్వీపము. కుశద్వీపానికి పరిమాణంలో రెండు రెట్లు ఉంటుంది. క్షీర సముద్రం ఈ ద్వీపాన్ని పరివేష్టించి ఉంటుంది. ఇక్కడ గల క్రౌంచ పర్వతాన్ని కుమారస్వామి తన శక్తి ఆయుధంతో ఛేదించి ఏడు భాగాలు చేశాడు. ఏడు నదులు, ఏడు పర్వతాలు ఈ ద్వీపంలో ఉన్నాయి. పురుష, ఋషభ, ద్రవిణ, దేవిక అనే నాలుగు వర్ణాల వారు ఈ ద్వీపంలో నిసిస్తుంటారు. అగ్నిని ఉపాసిస్తూ యజ్ఞాలు చేస్తారు.
#ఆరవది శాకద్వీపం. ఈ ద్వీపం మధ్యలో పెద్దదైన శాక వృక్షము ఉండటం వలన ద్వీపానికి శాకద్వీపము అని పేరు వచ్చింది. ఇక్కడ కూడ ఏడు పర్వతాలు, ఏడు నదులు ఉన్నాయి. సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత అనే చాతుర్వర్ణాల ప్రజలు నిసిస్తుంటారు. ఇక్కడ పరమేశ్వరుని పూజిస్తారు.
#ఏడవది పుష్కర ద్వీపం. లక్ష బంగారు రేకులు కలిగిన పద్మము అనగా పుష్కరము ఉండటం వలన ద్వీపానికి ఈ పేరు వచ్చింది. ఈ పుష్కరమే బ్రహ్మదేవుని ఆసనం అంటారు. మహర్షులు "మానసోత్తరం" అని ఈ ద్వీపాన్ని కీర్తించడం వలన మానసోత్తర ద్వీపం అనే పేరు కూడా ఉంది. అవధిగిరి అనే పర్వతం ఈ ద్వీపాన్ని రమణ-ఘాతకి అనే రెండు భాగాలుగా విభజించి సరిహద్దుగా ఉంది. లక్ష యోజనాల ఎత్తు గల ఈ పర్వత శిఖరం పై ఇంద్రాది దిక్పాలకులు ఉండే నాలుగు నగరాలు ఉన్నాయి.
మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ లోకసంచారం చేసే సూర్యుడు ఈ అవధిగిరి పర్వతము నుంచే ఉదయిస్తాడు. మానవుల ఒక్క సంవత్సర కాలం ఇక్కడి వారికి ఒక రోజు అవుతుంది. ఈ ద్వీప ప్రజలు పరబ్రహ్మను ఉపాసన చేస్తారు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏