21, ఏప్రిల్ 2026, మంగళవారం

సమస్యాపూరణం

  సమస్యాపూరణం

సమస్య.ఘనముగ గాడిదల్ మధురగానమొనర్చె, సభాంతరమ్మునన్.


వినుతిని గాంచె శాస్త్రమది, విజ్ఞతజాటుచు విశ్వమంతటన్,

దొనరగ నన్నికార్యముల దోహదమయ్యెను నవ్యమార్గమై,

ధ్వనులను రూపముల్ సరిగ దాల్చెడి కృత్రిమ మేధ గూర్పగా,

ఘనముగ గాడిదల్ మధురగానమొనర్చె సభాంతరమ్మునన్.


సురభిశంకరశర్మ.

శంకరుల జన్మస్థలం

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*శంకరుల జన్మస్థలం కాలడి*


సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారు.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శారదాంబతోవాదన

  తే. శారదాంబతోవాదన సల్పి సకల 

శాస్త్ర సారము నేర్చిన శంకరులు న 

లుదిశలందునుపీఠములుంచెనంత

 అద్వైత మత బోధలు జను లాదరించె


జయలక్ష్మి

వైశాఖ శుద్ధ పంచమి

 శ్రీరామ (125)


(నేడు 21-4-'26, వైశాఖ శుద్ధ పంచమి, జగద్గురు

 శ్రీ ఆదిశంకరుల జయంతి).


శ్లో//శ్రుతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్/

నమామి భగవత్పాద శంకరం లోక శంకరమ్//

(శ్రుతులు,స్మృతులు,పురాణములు,ఇతిహాసాదులయందు నిగూఢంగా ఉన్న విషయములను వెలికి తీసి,

సమస్త జీవకోటియందు కరుణ కలవారై, 

అద్వితీయమైన తమ రచనల ద్వారా మానవాళికి జ్ఞాన భిక్ష పెట్టి,

జగద్గురువులై,

సమస్త లోకములకు శుభము కలిగించే,

 శ్రీ శంకర భగవత్పాదుల వారికి నమస్కరిస్తున్నాను).


                             --------


శ్రీ శంకరభగవత్పాదులవారు కాలడిలో జన్మించడం, దుర్మతములను ఖండిస్తూ, భారతదేశమంతా మూడు పర్యాయములు పర్యటించడము, ప్రజలకు తన తరువాత కూడా సన్మార్గాన్ని నిరంతరం బోధించుటకు నలుదిక్కులా నాలుగు చతురామ్నాయ మఠములను స్థాపించడము అందరికీ తెలిసిన విషయమే.

అయితే ముఖ్యమైన విషయం వారి అద్వైత బోధ.

మానవజన్మ శాశ్వత సుఖం సంపాదించటానికి వచ్చింది.

దీనికి విరుద్ధంగా మానవజాతి అశాంతితోను, దుఃఖముతోను బాధపడుతున్నది.

దీనికి కారణం అజ్ఞానం.

సద్గురువులందరికి అజ్ఞానంతో దుఃఖములపాలవుతున్న ప్రజాబాహుళ్యంపై కరుణ ఎక్కువ.

శ్రీ శంకరభగవత్పాదులవారు కరుణామయులు

మానవులు సకల దుఃఖములనుండి తరించి, శాశ్వతానందం పొందగలిగే "అద్వైత స్థితిని" అనుభవం ద్వారా తెలుసుకున్నవారు. 


సామాన్యులకు కోట్లాది పూర్వజన్మలలో చేసిన పుణ్య పాపములు, అనేక జన్మలను కలిగించి నిరంతరం సుఖదుఃఖాలను అనుభవింపజేస్తూ ఉంటాయి.


బ్రహ్మజ్ఞాని మాత్రం ఆ పూర్వజన్మ కర్మలన్ని నశింపజేసుకొని శాశ్వతానందంలో ఉంటాడు.


అయితే బ్రహ్మజ్ఞానం ఉదయించగానే జ్ఞాని విదేహముక్తుడవుతాడని (అనగా దేహం నశిస్తుందని) కొందరంటారు.


కానీ అన్ని కర్మలు నశించినా ఇప్పుడు నడుస్తున్న జన్మ ఏ కర్మవల్ల వచ్చిందో ఆ కర్మమాత్రం దేహం నశించేపర్యంతం ఉంటుందని, 

దేహం నశించగానే అనగా మరణించగానే,ఆ కర్మ కూడా నశిస్తుందని, ఉపనిషత్తులు చెబుతున్నాయి.


భగవంతుని సంకల్పాన్ననుసరించి వేదవ్యాసమహర్షి వంటి కొంతమంది బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానం ఉదయించిన పిమ్మట కూడా శరీరధారణ చేస్తూ జగత్కార్యం నిర్వహిస్తున్నారు. 


అలాగే శ్రీ శంకరభగవత్పాదులవారు బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత కూడా కొంతకాలం దేహధారణ చేసి, లోకకల్యాణం కోసం అద్వైత స్థితి ఎలా సాధించాలో ప్రచారం చేశారు.


తాము బ్రహ్మజ్ఞానులై జీవన్ముక్తులుగా సంచరిస్తున్న తమ అనుభవాన్ని, శ్రీ శంకరభగవత్పాదులవారు తమ బ్రహ్మసూత్ర భాష్యంలో ఇలా సూచించారు.

        (బ్ర.సూ. భాష్యం 4 - 1 -15)


" అపి చ నైవాత్ర విదితవ్యం, బ్రహ్మవిదా కంచిత్కాలం శరీరం ధ్రియతే వా న వా ఇతి.

కథం హ్యేకస్య స్వహృదయ ప్రత్యయం, బ్రహ్మ వేదనం, దేహధారణం, చ అపరేణ ప్రతిక్షేప్తుం శక్యేత ? శ్రుతి, స్మృతిషు చ స్థితప్రజ్ఞ లక్షణ నిర్దేశేన ఏతదేవ నిరుచ్యతే "

( బ్రహ్మవేత్త కొంతకాలం శరీరాన్ని ధరించి జీవన్ముక్తుడుగా ఉంటాడా, ఉండడా, అని వివాదం చేయవలసిన పని లేదు. ఒకని హృదయానికి ప్రత్యక్షంగా గోచరిస్తున్న బ్రహ్మజ్ఞానము, దేహధారణము అనే వాటిని ఇతరుడు ఎలా నిరాకరించగలుగుతాడు ?

శ్రుతి స్మృతులలో స్థితప్రజ్ఞుని లక్షణాలను నిర్దేశించడంచేత ఇదే నిర్వచింప బడుచున్నది)


దీన్నిబట్టే ద్వైత, విశిష్టాద్వైత, సిద్ధాంతాలు సంపూర్ణజ్ఞానం ప్రసాదించలేవని,

అద్వైతాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న 

శ్రీ శంకరుల సిద్ధాంతమే సత్యమని మనం గ్రహించవచ్చు.


భగవత్తత్త్వం అవగాహన చేసుకోవటమే బ్రహ్మజ్ఞానం.

ఆ అవగాహనతో శాశ్వతానంద స్థితిలో ఉండటమే అద్వైతస్థితి.

అది ఈశ్వరానుగ్రహంతోనే సాధ్యం.


వేదం భగవంతుని గురించి

 "సత్యం, జ్ఞాన,మనంతం,బ్రహ్మ" 


(భగవంతుడు ఉన్నాడు.ఆయన సర్వజ్ఞుడు. సర్వ జగత్తును వ్యాపించి ఉన్న ఆ భగవంతుడు ఆద్యంతములు లేనివాడు)

 అని ఉపదేశించింది.

అది యథాతథంగా తెలుసుకోవడమే "బ్రహ్మజ్ఞానం" అన్నా, "ఆత్మజ్ఞానం"అన్నా.

అలా తెలుసుకున్నవాడు సమస్త దుఃఖములనుండి తరిస్తాడు.

అందువల్ల శ్రుతి "తరతి శోక మాత్మవిత్" (ఆత్మవేత్త సమస్త దుఃఖములనుండి తరిస్తాడు) అని చెబుతున్నది.


ఈ అద్వైత స్థితి భగవంతుని అనుగ్రహం వలన వస్తుంది అని ఉపదేశించారు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు. 


శ్లో// ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసనా/

మహాభయ కృత త్రాణా ద్విత్రాణాం యది జాయతే//

(జన్మ,మరణాది రూప సంసారం గురించిన మహాభయం పోగొట్టి,మోక్షస్థితి కలిగించే అద్వైత భావన, కోట్లాది మందిలో ఏ ఇద్దరు, ముగ్గురికో కలిగిందంటే అది కేవలం ఈశ్వరుని అనుగ్రహం వల్లనే). 



 "పరమేశ్వరుడు" అనేవాడు ఒకడున్నాడు,

 ఆయన అనుగ్రహం సంపాదించాలి,

 అనే ఆలోచన సంసారంలో నిమగ్నుడైన జీవునకు కలుగదు.

అంతేకాదు, పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా దేవునియందు అవిశ్వాసము,ద్వేషము కూడా కలుగుతాయి.


శ్లో//మహా పాపవతాం పుంసాం జ్ఞానయజ్ఞో 

న రోచతే/

ప్రత్యుత జ్ఞానయజ్ఞస్తు ప్రద్వేష్యో భాసతే స్వతః//


(పూర్వజన్మ పాప ప్రతిబంధకం వల్ల పురుషులకు జ్ఞానమార్గం రుచించక పోవడమే కాకుండా, దానిని గూర్చి స్వతః ద్వేషము కూడా జనించును).


మరి ఏ విధంగా ఈ ఆత్మజ్ఞానం లభిస్తుందో

వేదమాత ఇలా చెబుతున్నది:

" అణోరణీయా న్మహతో మహీయా నాత్మాగుహాయాం నిహితో౽స్య జన్తోః/

తమక్రతుం పశ్యతి వీతశోకో థాతుః ప్రసాదా న్మహిమాన మీశమ్ "

(ఆ పరమాత్మ అణువు కంటే సూక్ష్మమైన వాడు. గొప్పవైన ఆకాశాదికముకంటే గొప్పవాడు.

దేవ,మనుష్యాది ప్రాణిజాతము యొక్క హృదయ పద్మమందలి "బుద్ధి" అనే గుహలో గురువు ఉపదేశించిన విద్యచేత పొందబడుతున్నాడు.

ఈ స్థితి,

 "థాతుః - సర్వ జగన్నిర్మాత కాబట్టి థాత శబ్దముచే చెప్పబడుతున్న పరమేశ్వరుని యొక్క,

ప్రసాదాత్-- అనుగ్రహం వల్లనే,

మహిమానం - మిక్కిలి గొప్పవాడు,

ఆక్రతుం -- ఏ సంకల్పములు లేనివాడు అయిన

తం ఈశం -- ఆ ఈశ్వరుని,

పశ్యతి--సాక్షాత్కారం చేసికొనుచున్నాడు.

సాక్షాత్కారం చేసుకుని,

వీత శోకః--జన్మ,మరణాది శోకరహితుడు అగుచున్నాడు)


ఈ విధంగా "పరమేశ్వరుని" అనుగ్రహం వల్లనే ఆత్మ జ్ఞానం కలిగి జీవుడు సంసార బంధములనుండి ముక్తుడవుతాడు అని వేదమాత ఉద్బోధిస్తోంది.


ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఆయన ఆజ్ఞలైన

 "సత్యం వద(ఎల్లప్పుడూ సత్యమునే చెప్పుము),

"ధర్మం చర"(ధర్మమునాచరింపుము),

"మాతృదేవో భవ" (తల్లిని దైవముగా పూజింపుము),

"పితృదేవో భవ" (తండ్రిని దైవముగా పూజింపుము)

మొదలైన సత్కర్మానుష్ఠానం వల్ల లభిస్తుంది.

ఈ వేద బోధలన్నింటినీ సమన్వయపరిచి మానవజాతి మీద ఉన్న పరమ కారుణ్యంతో,

 జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులవారు,

తాము ఏ మార్గాన్ని అనుసరించి అద్వైత స్థితి సాధించారో ఆ సన్మార్గాన్ని 'వేదో నిత్య మధీయతాం' తో మొదలైన ఉపదేశపంచకం అనే ఐదు శ్లోకములలో మనకు ఈ విధంగా అనుగ్రహించారు.



1. నిత్యము వేదాధ్యయనము,(లేదా తత్తుల్యములైన పురాణములను అధ్యయనం) చేయాలి.

2. ఆ వేదములందు చెప్పబడిన నిత్య,నైమిత్తికాది సత్కర్మలను చక్కగా ఆచరించాలి.

3. ఆ కర్మలయొక్క ఫలములను ఆశింపక, వాటిని ఈశ్వరునకు అర్పించి, అ ఈశ్వరుని భక్తిపూర్వకంగా ఆరాధన చేయాలి.

4. క్రమ క్రమంగా, కామ్యకర్మలందు ఆసక్తి త్యజించాలి.

5. సత్కర్మానుష్ఠానంతో, జ్ఞానోత్పత్తికి అవరోధంగా ఉన్న పాపములను పోగొట్టుకోవాలి.

6. ప్రాపంచిక సుఖములు దోషభూయిష్ఠములనే విషయం గ్రహించి, వాటియందు వైరాగ్యం వహించాలి.

7. ఆత్మజ్ఞానమునందు కోరికను దృఢంచేసుకోవాలి.

8. ఆ కోరిక ధృఢమైన వెంటనే నిరాటంకంగా సాధన సాగించి, అద్వైత స్థితి సాధించేందుకు స్వగృహము నుండి బయటపడాలి.

9. సత్పురుషులతో సాంగత్యము చేయాలి.

10. ఆ సాంగత్యం వల్ల భగవంతుని యందు భక్తిని దృఢం చేసుకోవాలి.

11.బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము అయిన శమదమాదులు వృద్ధి చేసుకోవాలి.

12.తరువాత సన్యాసం స్వీకరించాలి.

13. బ్రహ్మవేత్తయైన విద్వాంసుని గురువుగా ఏర్పరచుకుని వారికి తనను సమర్పించుకోవాలి.

14. అనుదినము భక్తితో గురువును సేవించాలి.

15. బ్రహ్మతత్త్వమును ఉపదేశించమని వారిని ప్రార్థించాలి.

16. గురువుయొక్క ఉపదేశమును ఏకాగ్రతతో శ్రవణం చేయాలి.

17. గురువు ఉపదేశించిన వాక్యములను యథాశాస్త్రంగా విచారణ చేయాలి.

18. ఆ విచారణ తన బుద్ధికి తోచినట్లు చేయక వేదసమ్మితమైన పక్షమునే ఆశ్రయించి విచారణ చేయాలి.

19. దుస్తర్కమును చేయకూడదు.

20. శ్రుతి సమ్మతమైన తర్కముతో వాక్యముల అర్థమును నిశ్చయించుకోవాలి.

21. ఆ నిశ్చయముయొక్క పర్యవసానంగా జీవుడు, భగవంతుడు, ఒకడేనని, భేదము లేదని గుర్తించి, జీవుడననుకొనుచున్న తాను బ్రహ్మను అని దృఢముగా భావించాలి.

22. ఆ భావనా బలంతో గర్వమును నిశ్శేషంగా పరిత్యజించాలి.

23. పాంచభౌతికమగు ఈ దేహమునందు "నేను"అను బుద్ధిని విడనాడాలి.

24. పండితులతో వాదములు చేయకూడదు..

25. ఆకలి అనునది వ్యాధి అని, దానికి చికిత్స చేయాలి అనే భావన కలిగి ఉండాలి.

26. ఆ ఆకలివ్యాధిని శమింపజేయుటకు 'భిక్ష' అను ఔషధమును స్వీకరించాలి.

27. రుచికరమైన పదార్థములను యాచించ కూడదు.

28. దైవవశంతో లభించినదానితో తృప్తి పడాలి.

29. శీతోష్ణములు, జయపరాజయములు, లాభనష్టములు,సుఖదుఃఖములు, మొదలైన ద్వందములను ఓర్పుతో సహించాలి.

30. వ్యర్థముగా లౌకిక వాక్యములు పలకడం మానివేయాలి.

31. అన్ని విషయములందు ఉదాసీన భావము అలవర్చుకోవాలి.

32. జనులు తనయందు దయాభావం కలిగి ఉండాలి అనే భావము, తనను ఎవరూ నిందించకూడదు అనే భావము త్యజించాలి.

33. ఏకాంత ప్రదేశంలో సుఖముగా కూర్చోవాలి.

34. బ్రహ్మ తత్త్వమునందు చిత్తమును ఏకాగ్రం చేసి ఆ తత్త్వమును ధ్యానిస్తూ ఉండాలి.

35.పరిపూర్ణముగా ప్రపంచమంతా వ్యాపించినది,సర్వాత్మకమైనది యగు తన శుద్ధాత్మ స్వరూపమును సాక్షాత్కరించుకోవాలి.

36. 'అహంబ్రహ్మాస్మి' తానే బ్రహ్మ అనే విజ్ఞానముచే, దృశ్యమానమగు ఈ ప్రపంచము తనకంటే వేరుగా లేదని గుర్తించాలి.

37. బ్రహ్మ, ఆత్మ(తాను) ఒకటే అనే జ్ఞానముచే జీవన్ముక్త భావమును పొంది, జ్ఞానోదయమునకు పూర్వము తానార్జించిన కర్మలనన్నిటినీ నశింపజేయాలి.

38. ఆ జీవన్ముక్త భావము యొక్క బలముతో ముందు చేయబోవు కర్మలతో సంశ్లేషము పొందకుండా ఉండాలి.

39. ఈ దేహారంభానికి కారణమైన ప్రారబ్ధ కర్మను నిర్లిప్తంగా అనుభవించాలి.

40. ప్రారబ్ధ కర్మ వేగము నశించగా తాను శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడై ఉండిపోవాలి (విదేహముక్తి)


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

21-4-'26.

Mantra

 Mantra - 16 ARUNAM 2nd anuvaakam 


శుక్రం తే అన్య ద్యజతం తే అన్యత్। 

విషురూపే అహనీ ద్యౌరీవాసి|

విశ్వా హి మాయా అవసి స్వధావః| 

భద్రా తే పూషన్నిహ రాతిరస్త్వితి॥ 



ఈ మంత్రం అత్యంత ప్రసిద్ధమైన మంత్రాలలో ఒకటి. ఇది వాస్తవానికి ఋగ్వేదం నుండి గ్రహించబడింది. ఇది సూర్యునిలోని రెండు భిన్నమైన రూపాలను (పగలు మరియు రాత్రి) స్తుతిస్తూ, పోషకుడైన పూషుడు (సూర్యుడు) మనపై అనుగ్రహం కురిపించాలని ప్రార్థిస్తుంది.


*శుక్రం తే అన్యత్*: నీ యొక్క ఒక రూపం తెల్లనిది (పగలు/సూర్యకాంతి).


*యజతం తే అన్యత్*: నీ యొక్క మరొక రూపం పూజనీయమైనది/చీకటితో కూడినది (రాత్రి/చంద్రకాంతి లేదా నక్షత్ర కాంతి).


*విషురూపే అహనీ*: వేర్వేరు రూపాలు కలిగిన పగలు మరియు రాత్రి అనే రెండు కాలభాగాలు.


*ద్యౌః ఇవ అసి*: నువ్వు ఆకాశం వలె (అనంతంగా) ఉన్నావు.


*విశ్వా హి మాయా అవసి*: నీవు సమస్తమైన సృష్టి శక్తులను (మాయలను) రక్షిస్తున్నావు.


*స్వధావః*: నీలోనే నిక్షిప్తమై ఉన్న శక్తి కలవాడా! (స్వయం ప్రకాశకుడు).


*భద్రా తే పూషన్ ఇహ రాతిః అస్తు*: ఓ పూషన్! నీ యొక్క మంగళకరమైన అనుగ్రహం (దానం) మాకు ఇక్కడ కలుగుగాక.


ఓ సూర్య భగవానుడా (పూషన్)! నీవల్ల భూమి మీద రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి ప్రకాశవంతమైన పగలు, రెండోది పూజనీయమైన రాత్రి. విభిన్న రూపాలు కలిగిన ఈ అహోరాత్రులు రెండూ నీవే. ఆకాశం వలె నీవు సర్వవ్యాపివై ఉన్నావు. నీ సహజ సిద్ధమైన శక్తితో ఈ విశ్వంలోని సకల శక్తులను నీవే రక్షిస్తున్నావు. అట్టి నీ మంగళకరమైన అనుగ్రహం మాపై ఎల్లప్పుడూ ఉండుగాక.


 *శుక్రం మరియు యజతం*: ఇక్కడ 'శుక్రం' అంటే సూర్యుని తీక్షణమైన కాంతి. 'యజతం' అంటే యజ్ఞార్హమైనది, ప్రశాంతమైన రాత్రి కాలం. చీకటి అయినా సూర్యుని శక్తి చంద్రుని ద్వారా లేదా అగ్ని ద్వారా రాత్రి వేళ కూడా ఉంటుందని వేదం చెబుతుంది.


 *అద్వైత భావన*: పగలు-రాత్రి అనేవి మనకు విడివిడిగా అనిపించినా, అవి ఒకే సూర్య తత్త్వం యొక్క రెండు పార్శ్వాలని ఈ మంత్రం స్పష్టం చేస్తోంది.


 *పూషుడు* (Pushan): పూషుడు అంటే పోషించేవాడు. సూర్యుడు కేవలం వెలుగునివ్వడమే కాకుండా, భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటిని తన శక్తితో పోషిస్తున్నాడు కాబట్టి ఆయనను 'పూషన్' అని పిలుస్తారు.


ఈ మంత్రం పఠించడం వల్ల శుక్ర గ్రహ అనుగ్రహం, దృష్టి లోపాలు తొలగుతాయని, బుద్ధి ప్రచోదనం కలుగుతుందని వైదిక సంప్రదాయంలో విశ్వాసం. కాలచక్రాన్ని నడిపించే ఆ పరమాత్మ శక్తిని ఇక్కడ అత్యంత భక్తితో స్తుతించడం జరిగింది.

20, ఏప్రిల్ 2026, సోమవారం

పంచాంగం

 


జంటనగరాల పేర్ల

  *జంటనగరాల పేర్ల పుట్టు పూర్వోత్తరాలు* 


పూర్వం సుమారు 400 ఏళ్ళకు ముందు భాగ్యనగరంలో ఇద్దరు ముస్లిం సోదరులు, మూసీనది పక్కన బాతులు మేపుకుంటూ జీవనం చేసేవారు. ఆ ఇద్దరు సోదరులు ప్రతిరోజూ చాలా దూరం తిరుగుతూ బాతులు కాసేవారు. 


ఒకనాడు వారు బాతులు కాస్తుండగా, ఉన్నట్లుండి ఆకాశంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆ ఉరుముల శబ్దానికి బాతులు చెల్లాచెదరై, మూలమూల ప్రాంతాలకు వెళ్ళిపోయాయి.


అన్నదమ్ములిద్దరూ అష్టకష్టాలు పడి బాతులన్నిటినీ ఇంట్లోని దొడ్డిలోకి చేర్చగలిగారు. పెద్దవాడికి సందేహం వచ్చి బాతులన్నిటినీ లెక్కించగా, ఒక్క బాతు తక్కువగా ఉంది. వెంటనే అన్నదమ్ములిద్దరూ తప్పిపోయిన బాతును వెతికి పట్టుకోవడానికి బయలుదేరారు. అన్న భాగ్యనగరం వైపు, తమ్ముడు నేటి సికింద్రాబాద్ ఉన్న ప్రాంతం వైపు వెళ్ళారు. 


ఈ ఇద్దరికీ కూడా తెలుగు సరిగ్గా రాదు. అన్న భాగ్యనగరం అంతా తిరుగుతూ *హేదిరాబాతు* *హేదిరాబాతు* అంటూ వెతికి, వేసారిపోయి, తమ్ముడున్న చోటికి వచ్చాడు.


అప్పుడే తమ్ముడుకి బాతు దొరికింది. వాడు సంతోషంతో అరుస్తూ *సిక్కిందిరాబాతు* *సిక్కిందిరాబాతు* అంటూ, తనకు దొరికిన బాతుని అన్నకు సంతోషంగా ఇచ్చాడు. వాళ్ళిద్దరూ బాతుని తీసుకుని ఇంటికి వెళ్ళారు. 


కాలక్రమేణా ఆ అన్నదమ్ములు పలికిన మాటలే కొద్దిగా మార్పు చెంది, "హైదరాబాద్" "సికింద్రాబాద్" గా స్థిరపడ్డాయేమో కదా 


🤣🤣🤣

ఒక రూపాయి నాణెం

  ఒక రూపాయి నాణెం

ఎనిమిదేళ్ల ఒక చిన్న బాలుడు మార్కెట్‌లోని ఒక దుకాణానికి వెళ్లి, దుకాణదారుడికి ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు:

“మీ దుకాణంలో దేవుడు ఉంటే, ఈ ఒక రూపాయికి నాకు ఆయనను ఇస్తారా?”


దుకాణదారు కోపంగా ఆ నాణెాన్ని బాలుడి చేతి నుంచి కొట్టి, అతడిని వెళ్లగొట్టాడు. బాలుడు నాణెాన్ని తీసుకుని, ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి తిరుగుతూ, “ఒక రూపాయికి దేవుడు దొరుకుతాడా?” అని అడుగుతూనే ఉన్నాడు.


చాలా మంది దుకాణదారులు అతడిని తోసివేశారు. కానీ ఆ బాలుడు మాత్రం ధైర్యం కోల్పోలేదు.


చివరికి ఒక పెద్ద దుకాణంలోకి వెళ్లి అదే ప్రశ్న అడిగాడు. ఆ దుకాణ యజమాని చాలా కోపంగా అతడిని బయటికి లాగి తోసేశాడు. ఆ బాలుడు రోడ్డుపై . . అప్పుడే వెళ్లిపోతున్న ఒక ఖరీదైన విలాసవంతమైన కారు ముందు పడిపోయాడు. కారు వెంటనే ఆగింది. అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.


ఒక ధనవంతుడు కారు నుంచి దిగుతూ ఏమైంది అని అడిగాడు. బాలుడు జరిగిన సంగతిని మొత్తం చెప్పి, తన ఒక రూపాయి నాణెం చూపిస్తూ అడిగాడు:

“మీ దగ్గర దేవుడు ఉంటే, ఈ ఒక రూపాయికి నాకు ఇస్తారా?”


ఆ ధనవంతుడు చిరునవ్వు చిందిస్తూ అడిగాడు:

“నేను ఒక రూపాయికి దేవుణ్ణి కొనుగోలు చేసి నీకు ఇస్తే, ఆయనతో ఏమి చేస్తావు?”


బాలుడు సమాధానమిచ్చాడు:

“నా అమ్మ నాకు అన్నీ. ఆమె నాకు భోజనం పెడుతుంది, జోలపాటలు పాడుతుంది, నన్ను చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె చాలా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంది. డాక్టర్లు ‘దేవుడే ఆమెను కాపాడగలడు’ అన్నారు. అందుకే ఒక రూపాయికి దేవుడు దొరుకుతాడేమో అని వెతుకుతున్నాను.”


ఇది విన్న ఆ ధనవంతుడు అన్నాడు:

“నీకు ఒక రూపాయికి దేవుడు కావాలా? నేను ఇస్తాను.”


అతడు ఒక లేఖ రాసి, కవర్లో పెట్టి బాలుడికి ఇచ్చాడు.

“నీ అమ్మ ఉన్న ఆసుపత్రికి వెళ్లి, ఈ లేఖను ఒక ప్రత్యేక డాక్టర్‌కి ఇవ్వు,” అని చెప్పాడు.


బాలుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఆ లేఖను పేర్కొన్న డాక్టర్‌కు ఇచ్చాడు. డాక్టర్ ఆ లేఖను తెరిచి చూసి ఆశ్చర్యపోయాడు. అది ఆసుపత్రి స్థాపకుడు స్వయంగా రాసిన లేఖ. వెంటనే బాలుడి తల్లికి అత్యుత్తమ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల్లోనే ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.


కొన్ని రోజుల తరువాత, అదే కారు నుంచి దిగిన ఆ ధనవంతుడు—అదే ఆసుపత్రి స్థాపకుడు—ముఖ్య వైద్యులతో కలిసి ఆమెను చూడడానికి వచ్చాడు.


తల్లి ఆసుపత్రి ఖర్చులు ఎలా చెల్లించాలి అని ఆందోళన చెందుతోంది.


ఆ ధనవంతుడు ఆమెను ధైర్యం చెప్పాడు:

“మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ కుమారుడు ఇప్పటికే మీ చికిత్సకు కావాల్సిన మొత్తం చెల్లించాడు.”


అది విన్న తల్లి ఆశ్చర్యపోయి, తన పక్కన నిద్రిస్తున్న తన కుమారుడిని చూసింది.


ఆయన మరలా అన్నాడు:

“వైద్య ఖర్చులు తీర్చిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మీ కుమారుడి చదువుకు వినియోగిస్తాను.”


తల్లి భావోద్వేగానికి లోనై, “మీరు ఇది ఎందుకు చేస్తున్నారు?” అని అడిగింది.


ఆయన సమాధానం ఇచ్చాడు:

“మీ కుమారుడి దేవుడిపై ఉన్న అచంచల విశ్వాసం, ఆయన ఎక్కడున్నా సంపాదించాలనే సంకల్పమే ఈ సేవకు కారణం.”


హృదయంలో విశ్వాసం ఉండి, దృఢమైన సంకల్పం ఉంటే — ఒక రూపాయికైనా దేవుడు దొరుకుతాడు. 🙏

చందనోత్సవం

 👉ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం.


👉అదే రోజున పరశురామ జయంతి .


మరిన్ని అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.


1. పరశురాముని 

     జన్మదినం


2. పవిత్ర గంగా నది

     భూమిని తాకిన

      పర్వదినం


3. త్రేతాయుగం 

    మొదలైన దినం


4. శ్రీకృష్ణుడు 

    తన బాల్యమిత్రుడైన

     కుచేలుని కలుసుకొన్న

     దినం


5. వ్యాస మహర్షి 

     “మహా భారతము”ను,

      వినాయకుని

      సహాయముతో,

      వ్రాయడం

      మొదలుపెట్టిన దినం


6. సూర్య భగవానుడు

     అజ్ఞాతవాసములో

     వున్న పాండవులకు

      అక్షయ పాత్ర

      ఇచ్చిన దినం


7. శివుని ప్రార్థించి

     కుబేరుడు

     శ్రీమహాలక్ష్మితో 

     సమస్త సంపదలకు

     సంరక్షకునిగా

     నియమింపబడిన దినం


8. ఆదిశంకరులు

     “కనకధారాస్తవం” ను

     చెప్పిన దినం


9. అన్నపూర్ణా దేవి 

     తన అవతారాన్ని

      స్వీకరించిన దినం


10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు

       దుశ్శాసనుని

       బారినుండి 

       కాపాడిన దినం.

19, ఏప్రిల్ 2026, ఆదివారం

కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ

  కుంకుమ పువ్వు - సంపూర్ణ వివరణ - ఔషధోపయోగాలు .


కుంకుమ పువ్వుని సంస్కృతము నందు కాశ్మీరజము , కుంకుమము , బాహ్లీకము , శోణితము , సంకోచము , పీతనకము అనే పేర్లతో పిలుస్తారు . భావప్రకాశము అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథము నందు కుంకుమపువ్వు యొక్క నాణ్యత మరియు ఔషధగుణములు ఆయా దేశ వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది అని తెలియచేయబడినది. వానిలో కాశ్మీర దేశము నందు పుట్టెడు కుంకుమపువ్వు చిన్నచిన్న కేశరములు కలిగి కొంచం అంత ఎరుపురంగుతో కూడుకుని కమలం వంటి పరిమళము కలిగి ఉండును అనియు ఇదే అత్యంత శ్రేష్టం అని రాయబడినది.


ద్రవ్యకోశము అనే వైద్యగ్రంధము నందు లేత ఎరుపురంగుతో , మంచి పరిమళముతో , చేతితో నలిపిన చేతికి అంటుకొని రంగువీడక యున్నచో అట్టి కుంకుమ పువ్వు శ్రేష్టం అయినది అనియు , బాగా ఎరుపు రంగుతో ఉండి నోటియందు వేసుకొనిన మిక్కిలి చేదుగా , పసుపుపచ్చ రంగుతో ఉన్నచో అట్టి కుంకుమపువ్వు తక్కువరకము అని తెలుసుకొనవలెను .


కుంకుమపువ్వు సాధారణముగా కొంచం చేదు కలిగి ఉండి నాలుకకు తిమ్మిరి కలిగించునదిగా మెత్తగా ఉండును. ఇది జిగటగా ఉండును. కొంతమంది ఈ కుంకుమపువ్వుని చందనంతో అరగదీసి పైపూతగా వాడుదురు . మరికొంతమంది తాంబూలముతో లోపలికి సేవించెదరు. శరీరం నందు వేడిని పుట్టించి వీర్యవృద్ధిని , కాంతిని , బలము , ఆయుర్వృద్దిని కలిగించి విషము , శోష , మదప్రకోపము , నేత్రవ్యాదులు , శిరోవ్యాధులు , గొంతుజబ్బులు , శరీరము నందలి మచ్చలు , దురదలు , కుష్టు , చిడుము , గజ్జి మున్నగు చర్మరోగములు , రసదోషములు , మేధోరోగములు మొదలైనవానిని హరించును . రక్తశుద్ది కలిగించి శరీర దుర్బలత్వము హరించును . గడ్డలను కరిగించును . చర్మరోగములు మాన్పును . కస్తూరి వలే ఏ ఔషధమునకు అయినను అనుపానంగా ఇచ్చిన ఔషధం త్వరగా పనిచేయును . టైఫాయిడు జ్వరము , ఉన్మాదరోగము , అపస్మారము , ప్రసవించు సమయంలో సంభవించు వాతరోగములు , ఋతురక్తబద్ధం , సమస్త నేత్రరోగములు ( కంటి పైన పట్టు వేయవలెను ) , ఓడలలో ప్రయాణము చేయువారికి వచ్చు జబ్బులు , మనోచాంచల్యములు పోగొట్టును .



18, ఏప్రిల్ 2026, శనివారం

వైశాఖ పురాణం

 *🐚శనివారం 18 ఏప్రిల్ 2026🐚*


_*🚩వైశాఖ పురాణం - 1 వ అధ్యాయము🚩*_

                      

      *వైశాఖమాస ప్రశంస*


*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*

```

సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. “మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి ‘మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నా’నని సవినయముగ ప్రశ్నించెను.


నారదుడును “రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను.. ‘పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.


అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.

```

*🙏వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణం 🙏*


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏v

పురాణవైరాగ్యం

  పురాణవైరాగ్యం:


అది పరమపవిత్రమైన ''కాశీ'' క్షేత్రం.గంగా నది ఒడ్డున ఓ సత్రంలో డా..సర్వజ్ఞ గారి ప్రవచనం జోరుగా సాగుతోంది. . అందరూ ఆ మహేశ్వరుడి గురించి ఆయన చెపుతుంటే ఆనంద పారవశ్యంలో వింటున్నా రు.


వారిని చూసి మహేశ్వరుడి కి ఆనందం కలిగి పార్వతి తో చూశావా దేవి నాభక్తుల పారవశ్యం నేనంటే వారికి ఎంత ఇష్టమో! అనగానే అమ్మవారు నవ్వుతూ వారంతా భక్తులు గా నటిస్తున్న వారే కాని నిజమైన వారు కారు.కావాలంటే చూసుకోండి అంది అమ్మవారు.

అయితే చూడు పార్వతీ అన్నారు స్వామి. 


కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని సర్వజ్ఞ గారు చెబుతుంటే భక్తులంతా పారవశ్యంతో శివా మమ్మల్ని నీలో కలుపుకో మోక్షం ఇవ్వు మహేశ్వరా అనగానే టక్కున 

శివుడు ప్రత్యక్ష మయ్యాడు.


నా ప్రియ భక్తులారా మీ మొర ఆలకించా మోక్షం కావలసిన వారు

నాతో రావచ్చు రేపు ఇదే సమయానికి వస్తా సిద్ధంగా ఉండమని శివుడు అదృశ్యమైపోయాడు. 


మర్నాడు ప్రవచన సమయానికి శివుడు వచ్చాడు. ఆపాటికే భక్తులంతా సర్వజ్ఞ గారి తో సహా

అలహాబాద్ దాటిపోయారు.


కైలాసం చేరిన శివుడ్ని చూసి అమ్మవారు నవ్వింది ఎగతాళి గా

అప్పుడే అక్కడకు చేరుకున్న నారద

మునీంద్రుడు కి విషయం అర్దమయ్యింది.


అమ్మా జననీ ఇది మహేశ్వర లీల

ఆయనకి తెలియదా నిజ భక్తులు

ఎవ్వరో? పందెంలో నిన్ను గెలిపించాలనే స్వామి వారి లీల.


అది మానవనైజమైన పురాణ వైరాగ్యం.


మానవుడు ధర్మాచరణం చేస్తూ నిర్వహించే నిర్దేశిత కర్మమే మోక్ష సోపానం.


నారాయణ నారాయణ అంటూ ఆది దంపతుల దర్శనానందంతో వెనుతిరిగాడు నారదమునీంద్రుడు.


                            ***

జయంతి లక్ష్మీ నరసింహం

వైశాఖమాసమ్

 *వైశాఖమాసమ్/మాధవమాసమ్(18.04.26 నుండి 16.05.26)* 

వైశాఖమాసం అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన మాసం. దీనిని 'మాధవమాసం' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది శ్రీ మహావిష్ణువుకు (మాధవుడు) అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఏప్రిల్-మే నెలల మధ్య వచ్చే ఈ మాసం ఆధ్యాత్మిక, ఆరోగ్య మరియు దాన ధర్మాల పరంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.

 *వైశాఖమాసం/మాధవమాసం విశిష్టతలు:* 

 *మాధవ స్మరణ* - *విష్ణు పూజ* : వైశాఖమాసంలో శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అత్యంత శ్రేష్ఠం. ఈ మాసంలో తులసీ దళాలతో పూజించిన వారికి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

 *ప్రాతః స్నాన విశిష్టత* : ఈ మాసంలో సూర్యోదయానికి ముందే (ప్రాతఃకాలాన) నదులు, తీర్థాదులలో స్నానం చేయడం, మధుసూదనుని స్మరించడం వల్ల పాపాలు నశించి, దివ్యఫలాలు సిద్ధిస్తాయని విశ్వాసం.

 *దాన ధర్మాలు (చలివేంద్రాలు):* ఎండలు మండిపోయే కాలం కావడంతో, వైశాఖంలో నీటి దానం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పళ్ళరసాలు, మజ్జిగ దానం చేయడం చాలా పుణ్యప్రదం. అలాగే, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు, మంచం, పరుపు దానం చేయడం వల్ల అఖండ మోక్ష సామ్రాజ్యం, ఆరోగ్య సిద్ధి లభిస్తాయని చెబుతారు.

 *ఆరోగ్య నియమాలు* : వైశాఖమాసంలో ఒంటిపూట భోజనం (ఏకభుక్తం) లేదా రాత్రిపూట మాత్రమే భోజనం (నక్తం) చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 *పవిత్రమైన దినాలు:* 

 *వైశాఖ పౌర్ణమి (బుద్ధ పూర్ణిమ):* విశాఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి, దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

 *అక్షయ తృతీయ:* వైశాఖ శుద్ధ తదియ నాడు ఏ దానం చేసినా, ఏ జపం చేసినా అది అక్షయం (అక్షయం - తరగనిది) అవుతుంది.

 *నృసింహ జయంతి* : వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు శ్రీ నృసింహస్వామి అవతరించారు.

 *శంకర జయంతి* : ఆదిశంకరాచార్యుల జన్మదినం వైశాఖ శుద్ధ పంచమి.

కలశ స్థాపన సమయంలో

 కలశ స్థాపన సమయంలో లేదా కొబ్బరికాయను కలశంపై ఉంచేటప్పుడు పఠించే ఈ శ్లోకం యొక్క అర్థం మరియు అంతరార్థం చాలా గొప్పవి

ఆ శ్లోకం ఏమిటంటే..


> **నారికేళ సముద్భూత త్రినేత్ర హర సమ్మితా |**

> **శిఖయా దురితం సర్వం పాప పీడాంచ మే నుద ||**



 * **నారికేళ సముద్భూత:** కొబ్బరి చెట్టు నుండి ఉద్భవించిన ఓ ఫలమా!

 * **త్రినేత్ర హర సమ్మితా:** మూడు కన్నులు కలిగి ఉండటం వల్ల (కొబ్బరికాయకు ఉండే మూడు కన్నులు), నువ్వు ముక్కంటి అయిన ఆ పరమశివునితో సమానమైనదానివి.

 * **శిఖయా:** నీపై ఉన్న పీచు (శిఖ/జుట్టు) ద్వారా...

 * **దురితం సర్వం:** నాలో ఉన్న సమస్త దుర్గుణాలను, కష్టాలను...

 * **పాప పీడాంచ మే నుద:** నా పాప ఫలాల వల్ల కలిగే పీడను తొలగించు (నుద - తొలగించు/నశింపజేయు).


శాస్త్రం ప్రకారం, కొబ్బరికాయ కేవలం ఒక ఫలం మాత్రమే కాదు. అది మనిషి అహంకారానికి చిహ్నం. పైన ఉన్న పీచు మన అజ్ఞానానికి, లోపల ఉన్న గట్టి పెంకు మన అహంకారానికి, లోపల ఉండే తెల్లని కొబ్బరి నిర్మలమైన మనసుకి సంకేతం.

కలశం మీద కొబ్బరికాయను ఉంచేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం: **"ఓ దైవ స్వరూపమా! శివునితో సమానమైన శక్తి కలిగిన ఈ ఫలం ద్వారా నా పాపాలను, కష్టాలను హరించి నాకు ప్రశాంతతను ప్రసాదించు"** అని వేడుకోవడం.

ఈ శ్లోకాన్ని పఠిస్తూ కలశాన్ని పూజించడం వల్ల ఆ కలశంలో దైవ శక్తి పరిపూర్ణంగా ఆవాహన అవుతుందని భక్తుల నమ్మకం. 


మండప దానంతో పాటు ఈ కలశ మీద కొబ్బరికాయ బ్రహ్మ గారికి చెందుతుంది. అయితే ఇంట్లో స్వయంగా పూజ చేసుకుంటే కొబ్బరికాయను  ప్రసాదంగా యజమాని తీసుకోవాలి.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - రేవతి -‌‌ భృగు వాసరే* (17.04.2026)

https://youtube.com/watch?v=eEIcUKjd7KE&feature=shared

ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.

 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఇదీ సంగతి

  ఇదీ సంగతి 


సుబ్బారావు దంపతులు కాకినాడలోని

బంధువుల ఇంటికి పెళ్ళి కి వెళ్ళి నాలుగు 

రోజులు తర్వాత తిరిగి ‌హైద్రాబాదు వచ్చారు.


తలుపులు తీద్దామనుకునేసరికి తాళంకప్ప 

పగిలి ఉంది.


ఆందోళన తో లోపలికి అడుగు పెట్టారు.

ఎక్కవస్తువులక్కడే ఉన్నాయి.బీరువాకూడా

క్షేమం గా ఉంది.ఏ వస్తువు పోలేదు.


హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు దంపతులు.


పళ్ళు తోముకుని రండి కాఫీ పెడతానంది

భార్య.సుబ్బారావు పళ్ళు తోముకుని 

టీవీ ఆన్ చేశాడు.


ఇంతలో‌వంటింట్లోంచి భార్య‌ ఏవండీ 

అంటూ కెవ్వుకేక.


ఏమయిందే అంటూ పరుగెట్టాడు ‌సుబ్బారావు.

భార్య‌సంజ్జ్న‌ తో కిచిన్‌ గట్టు చూసీ నిర్ఘాంతపోయాడు.


కారణం


గేసుసిలెండరు మరియు స్పేరు సిలీండర్ 

ఎత్తుకు పోయారు దొంగలు.


అయ్యా! అదీ‌సంగతి.

                         ******

జయంతి లక్ష్మీ నరసింహం

18-04-2026 శనివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

18-04-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


వృషభం


మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు. మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి

---------------------------------------


మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. 

---------------------------------------


కర్కాటకం


చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు. కీలక వ్యవహారాలలో సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

---------------------------------------


సింహం


అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మిత్రులతో కీలక విషయాలలో చర్చలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

---------------------------------------


కన్య


ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


తుల


ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమౌతారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. 

---------------------------------------


ధనస్సు


సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలలో వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయటపడతారు.

---------------------------------------


మకరం


కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణ ప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------


కుంభం


ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఉద్యోగమున ఆశించిన మార్పులు కలుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


మీనం

 

వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

---------------------------------------

17, ఏప్రిల్ 2026, శుక్రవారం

దానాలకు శ్రేష్ఠం వైశాఖం....

 దానాలకు శ్రేష్ఠం వైశాఖం..................!!

అక్షయ తృతీయ దానాలకు పెట్టింది. పేరైన వైశాఖ మాసంలో వచ్చింది. అసలు వైశాఖమే రకరకాల దానాలకు ప్రశస్తమైన మాసం. సర్వదానాలలో ఉన్న పుణ్యం ఈ మాసంలో జల దానంతో లభిస్తుంది. జలదానం చేయ లేని వారు అందుకు ఇతరులను ప్రోత్స హించాలి. ఆ విధంగా చేయడం కూడా సర్వదానాధికఫలాన్ని ఇస్తుంది. దాహార్తితో ఉన్న వారికి ఉపశమనం కలిగించే చలివేంద్రం ఏర్పరచిన వారికి కోటి కులాలనుద్ధరించిన పుణ్యం వచ్చి విష్ణులోకంలో విరాజిల్లుతారు. ప్రపా దానం(చలివేంద్రం) ఏర్పాటు చేయడ మనేది దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు అత్యంత ప్రీతికరం, అలసటతో ఉన్న వారు ప్రపాదానంతో సంతుష్టులైతే బ్రహ్మ, విష్ము శివాదులను సంతోషింప చేసిన వారవుతారు. నీరు కోరే వారికి నీరు, నీడను కోరే వారికి గొడుగు, విసన కర్రను కోరు వారికి విసనకర్ర వైశాఖ మాసంలో దానం చేయడం శ్రేష్ఠ్యం. వైశాఖ మాసంలో ఉదకకుంభము (నీటితో ఉన్న కుండను) దానం చేయడం మహా పుణ్యప్రదం. దప్పికతో బాధపడుతున్న ఎవరైనా మహానుభావునికి చల్లటి నీరు ఇచ్చినంతనే పదిలక్షల రాజసూయ యాగముల ఫలం లభిస్తుంది. ఎండవేడి వల్ల అలసి బాధపడుతున్న వారిని విసనకర్రతో వీచి స్వస్థత చూకూర్చినంతనే పాపాలు తొలగి గరుడునిగా అవుతారు. కొన్నిరకాల దుఃఖాలను శాంతింపజేసేందుకు వైశాఖ మాసంలో ప్రయత్నపూర్వకంగా ఒక్క సారైనా గొడుగును దానం చేయాలి. ఈ మాసంలో పాదరక్షలను దానం చేసిన వారు నరకాన్ని, ఐహికమైన క్లేశాన్ని పొందరు. మార్గమధ్యంలో శ్రమను హరించే విధంగా విశ్రాంతి మందిరాన్ని నిర్మించిన వారికి వచ్చే ఫలాన్ని బ్రహ్మ కూడా చెప్పలేడు. అన్నం పెట్టిన వారు (అన్నదానం) చేసిన వారిలో సకల తీర్థాలు, సకల దేవతలు, సకల ధర్మాలు ఉంటాయి. వైశాఖ మాసంలో పరుపును దానం చేస్తే అదే జన్మలో సర్వభోగాలు కలవాడై తన వంశం లోరోగాల బాధలు లేకుండా ఆయుర్దాయం, పరమ ఆరోగ్యం, యశస్సు, ధైర్యం కూడా పొందుతారు. నూరు తరాల వరకు వారి వంశంలో అధార్మికుడు పుట్టడు. సకల భోగాలను అనుభవించి సకల పాపాలను తోసిరాజని బ్రహ్మానందాన్ని పొందుతాడు. వైశాఖ మాసంలో గడ్డితో చేసిన చాపను, మరొక చాపను దానం చేస్తే ఎక్కడున్న పరమేశ్వరుడైనా ఆ చాపపై పరుంటాడు. ఇంటిలో పడుకునేందుకు కంబళిని, అటు వంటి వాటిని ఇచ్చిన వారు అంతమాత్రం చేతే ముక్తిని పొందుతారు. అప మృత్యువుకు గురి కాక ఎక్కువ కాలం జీవిస్తారు. తాంబూల దానం చేసిన వారు శరీరంతో చేసిన సకల పాపాల నుంచి విముక్తులవుతారు. తాంబూల దానం చేసినవాడు యశస్సును, ధైర్యాన్ని, సంపదను పొందుతాడు. రోగంతో ఉన్నవారు తాంబూల దానం చేస్తే రోగ విముక్తులు అవుతారు. రోగం లేనివారు ఆ దానం చేస్తే మోక్షాన్ని పొందుతారు. వైశాఖ మాసంలో తాపాన్ని తగ్గించే మజ్జిగను దానం చేస్తే ధనవంతుడు, విద్యావంతుడు అవుతాడు...

గురు భక్తి - Guru Bhakthi 


#శ్రీ🚩

పంచాంగము

 


సాధనకు సమయం

 

 

సాధనకు సమయం

 

చాలామంది సాధకులు చెప్పేది ఏమిటంటే నాకు సాధనకు సమయం దొరకటం లేదునిజంగా ఇది వినటానికి వింతగా వున్నా ఇది నిజం. మీకు ఎందుకు సమయం దొరకడంలేదు అని అడిగితె వాళ్ళు చెప్పే సమాదానాలునాకు ఆఫీసులో పని వత్తిడిగా వుంది. ఇంట్లో నాభార్య నాకు అనుకూలంగా లేదు కాబట్టి నా మనస్సు ఎప్పుడు చికాగుగా వుంటున్నది. దేనిమీద మనస్సు నిలవటం లేదునిజానికి నాకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకటం లేదు మరి ఎలా సాధన చేయాలి. అని అనేక సాకులు చెపుతువుంటారు. యదార్ధానికి ఇవి ఏవి కూడా సాధనకు అవాంతరాలు కావు వారికి సాధన చేయాలని ఉంటే సమయం అదే దొరుకుతుంది

మీరు రోజు టీ కాఫీ తాగుతున్నారా అయ్యో టీ తాగకుంటే నాకు వెంటనే తలకాయ నొప్పి పుడుతుంది. కాబట్టి సమయానికి నాకు టీ కావలసిందే. మీరు రోజు ఫలహారాలు తింటున్నారా అంటే నాకు బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిరోజు ఒకటే తినాలంటే నాకు ఇష్టముండదు. అంటారుమరి భోజనం సంగతి అంటే పాటు తప్పినా సాపాటు తప్పదుగా అని హాస్యం చేస్తాడు. సమయానికి భోజనం చేస్తాను  అందుకే ఇంతమాత్రం ఆరోగ్యంగా వున్నాను అని అంటారు. నీ దైనందిక జీవితంలో ప్రతిదానికి నీకు సమయం దొరుకుతుంది మరి సాధనకు ఎందుకు సమయం కేటాయించలేక పోతున్నావు? నీ దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావుచాలా సంతోషం మరి నీకు దేహాన్ని ఇచ్చిన భగవంతునికి సాధన చేయటానికి సమయాన్ని ఎందుకు కేటాయించలేక పోతున్నావు

నిజానికి నీకు చిత్త శుద్ధి ఉంటే నీ దైనందిక జీవితంలో సాధనను కూడా ఒకటిగా చేసుకుంటావుఆలా చేసుకొని చూసుకోతప్పకుండ నీకు సాధనకు సమయం చేకూరుతుందిప్రతి సాధకుడు తన దైనందిక జీవితంలో సాదనను కూడా ఒక భాగంగా చేసుకోవాలి, అప్పుడే సాధన నిర్విఘ్నంగా కొనసాగుతుంది. తెలివిగా ప్రతి వక్కరు వారి దైనందిక జీవితాన్ని ఒక ప్రణాళికా బద్దంగా రూపుదిద్దుకుంటే తప్పకుండ సాధన నిరంతరాయంగా కొనసాగుతుంది

 84 లక్షల జీవరాశిలో మనిషి కూడా ఒక జీవి. అటువంటి మానవజన్మ ఈనాడు మనకు లభించింది. అందునా మగవాడుగా పుట్టటం ఇంకా శ్రేష్టం (ఇక్కడ స్త్రీలు తక్కువ వారని కాదు స్త్రీలకు పురుషునితో పోలిస్తే అనేక ఇబ్బందులు ఉంటాయివారి శరీరం సున్నితము, సుకుమారంగా వుండి వుంటుంది కాబట్టి పురుషులు చేయగలిగే కఠినమైన పనులు వారు చేయలేరు. జ్ఞ్యానసాధన అంటేనే ఎంతో నిష్ఠతో, కఠినమైన తప్పస్సుతో ఆచరించవలసింది. కాబట్టి అది స్త్రీలకన్నా పురుషులు కొంతవరకు సాదించటానికి శరీరం  సహకరిస్తుంది. ఐనా అనేకమంది స్త్రీలు తమ అకుంఠిత భక్తితో పాతివ్రత్యంతో మోక్షం పొందినట్లు మన పురాణ,ఇతిహాసాలు తెలుపుతున్నాయి) మానవ జీవితం అశాశ్వితం అంటే క్షణంలోనయినా పిలుపు రావచ్చుమీరు నేను అనుకునేది దేహం అని అనుకుంటున్నారా అయితే అది మిధ్య క్షణంలో నయినా అది రాలిపోవచ్చు  అది కేవలం ఈశ్వరునికే ఎరుకమనం మన అజ్ఞానానంతో రేపు అది చేస్తా రేపు ఇది చేస్తా అని ఐహికమైన వాంఛల మీద మనస్సు లగ్నం చేస్తూ ఈశ్వరుని మరుస్తున్నాం.   జీవితాన్ని పరమేశ్వరుని సాన్నిధ్యంలో గడిపి జన్మసార్ధకం చేసుకోవాలని యోచించాలిఅదే మనకు పరమేశ్వరుడు ఇచ్చిన  సువర్ణావకాశం. అవకాశం కనుక సరిగా వినియోగించుకోక పొతే మరల ఎన్ని జన్మలకు తిరిగి అవకాశం వస్తుంది అన్నది ఎవ్వరు చెప్పలేరు మనం నిత్యం ఇతరుల గురించి ఆలోచిస్తూ వారిని విమర్శిస్తూ నేనే గొప్పవాడిని అనే ప్రచారాన్ని చేసుకుంటూ ఇతరుల తప్పులను వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాము.  నిజానికి నిజమైన సాధకుడు ఇతరులగురించి అస్సలు ఆలోచించాడు. కేవలము తన సాదన ఎలా చేయాలి అనే విషయంన్నే దృష్టిలో వుంచుకొని ముందుకు వెళతాడు. మనము ఈ జన్మను వృధా చేసుకుంటే   తిరిగి మానవజన్మ ఎత్తాలంటే అవకాశం (PROBABILITY ) 84లక్షలలో ఒకటి అంటే మీరే ఆలోచించండి. ఐహిక వాంఛలతో, భోగవిలాసాలతో అపురూపమైన మానవ జన్మను వృధాచేస్తే చివరకు మనకు మిగిలేది నిరాశ మాత్రమే "పునరపి జననం పునరపి మరణం" మరల మరల పుట్టి చనిపోతూవుండటమే. కాబట్టి సాధకుడు మేల్కొని నిత్యము శాశ్వితము అయిన మోక్షపదాన్ని చేరుకోవటానికి అహర్నిశలు కృషిచేయాలి

శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారుఅది ఎంతవరకు నిజమో కానీ  ఒక్కటి మాత్రం సంపూర్ణంగా నిజము  దైవానుగ్రహం కోసం ప్రార్ధించటానికి కూడా దైవానుగ్రహం కావలి అదేంటి అని అనవచ్చు కానీ ఇది ముమ్మాటికీ నిజం.   మనకు దైవానుగ్రహం లేకుంటే మనస్సు ఎప్పుడు కూడా దేముడి మీదకు వెళ్ళదుఅందుకేనేమో మన మహర్షులు వినాయక చవితి నాడు సిద్ది వినాయకుడిని పూజించటానికి ముందు పసుపు గణపతి పూజ చేయాలని నియమము పెట్టారునిజానికి మనం పూజించేది వినాయకుడినే కదా ఆయనే విఘ్నధిపతి కదా మరి ఇంకా పసుపు వినాయకుడిని ఎందుకు పూజించాలి అనే సందేహం మనకు వస్తుందికానీ అందులోని మర్మం ఏమిటంటే చేసే సిద్ది వినాయక పూజ అనే దైవ కార్యం కాబట్టి దైవకార్యం నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా విఘ్నాధిపతి అయిన విగ్నేశ్వరుని అనుగ్రహం కావాలని మన మహర్షులు సూచించారు. కాబట్టి ఆయన పూజ కూడా నిర్విఘ్నంగా సాగటానికి మనం పసుపు గణపతి పూజ చేస్తాం

దేముడిని ఏమి కోరుకోవాలన్నది ఒక పెద్ద ప్రశ్న నిజానికి మనం దేముడిని రెండు విషయాలు ముందుగా కోరుకోవాలి అవి ఏమిటంటే మొదటిది భగవంతుడా నిన్ను సదా పూజించే మనస్సు నాకివ్వు. ఇక రెండోవది  నేను సదా నీ సేవ చేయటానికి నాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు  ఇవ్వుమీ మనస్సు, శరీరం సహకరిస్తేనే కదా మీరు దైవ ప్రార్ధన, , పూజ చేయగలరుమోక్ష మార్గం అంటే సులువు అయినది కాదు అది అత్యంత కఠినమైనది. మరియు దుర్భరమైనది ఎంతో కష్టపడితే మాత్రమే మనం మోక్షగాములము  కాలేము. కోటికి ఒక్కడు మాత్రమే జ్ఞ్యాన మార్గాన్ని  ఎంచుకుంటాడు. చాలా మంది తమకు తెలిసిన మిడి మిడి జ్ఞానమే జ్ఞానం  అని అనుకోని దానినే ప్రచారం చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించ  ప్రయతినిస్తారు. తత్ ద్వారా ధన ధాన్యాదికములను పొంది ఐహికమైన సుఖబోగాలను అనుభవిస్తుంటారు. జ్ఞాన మార్గాన్ని ఎంచుకొన్న వారిలో కోటికి ఒక్కడు మాత్రమే కైవల్యాన్ని పొందగలదు .

కాబట్టి సాధకా ఈ సత్యాన్ని తెలుసుకొని నిత్యం సత్పురుషుల సాన్నిధ్యాన్ని కలిగి నిరంతరమూ ఆ దేవదేవుడైన పరమేశ్వరుని మీద మనస్సు లగ్నత చేసి శాస్వితము నిత్యము అయిన కైవల్య పదాన్ని చేరి జన్మరాహిత్యనికి కృషి చేయాలి.

నిజానికి సాధనకు శరీర సుద్దత్వము అవసరము లెదు.  కాని ప్రారంభంలో మనం శరీరాన్ని పరిసుద్దంగా వుంచుకొని అంటే నిత్యం ప్రాతః కాలంలో స్నానాదులు ముగించుకొని తరువాత్ ఈశ్వర ద్యనాన్ని చేయాలి.  ఎప్పుడైతే సాధకుడు తన శరీరం ఎలా ఉన్నప్పటికీ కుడా మనస్సు సర్వవేళలా ఆ పరమేశ్వరుని మీదకు లగ్నత చెందుతుందో అప్పుడు శారీరిక పారిసుద్దంతో పని లేదు.  కాని సాధకుడు ఈ ప్రాపంచిక బంధనాలతో వుండివుండి నేను నా భార్య పిల్లలు అనే భావనతో వుండి జీవితం గడుపుతూ ఉన్నవారికి సాంసారిక జీగ్వితమే సర్వస్వము అనే చింతనలో వుంటారు. అప్పుడు నిత్యము సామ్సారిక్ సుఖాలకు మరిగి అవి లేకుంటే తాను బ్రతక లేదు అనే భావనకు వస్తాడు. జీవితాంతము సంసార సుఖాలకు  వాటిని పొందే తాపత్రయానికి దాసుడుగా అయి వాటిని సాదిన్చాతంతోటి కాలాన్ని గడుపుతూ పరమేశ్వరుని మారుస్తాడు. అప్పుడు ఎన్ని రకాలుగా సాదన మొదలు పెట్టినా కుడా మనస్సు బాగావంతుని మీద నిలువదు.  కేవలము ఐహిక వాన్చాలమీద మాత్రమె వెళుతుంది.  అప్పుడు ఎవరో చెప్పారని పున్యక్షేత్రదర్సానానికి బయలుదేరుతాడు. గుడులు గోపురాలు నదులు తీర్థాలు అని అనేక వేయప్రయసలకు లోనయి అన్ని క్షేత్రాలు తిరుగుతాడు. నేను ఈ క్షేత్రం తిరిగాను ఆ క్షేత్రం తిరిగాను అని అనుకోని మానసికంగా తృప్తి చెందుతూ ఉంటాడు.  కాని అవి ఏవి కుడా తనను మోక్షపదానికి తీసుకొని వేల్లలేవనే సత్యం తరువాత్ తెలుస్తుంది.  అప్పటికి సమయం మించి పోతుంది.  కాబట్టి సాధక మిత్రమా ఈ క్షణమే సరియైన సమయం ఇప్పుడే ఆ పరమేశ్వరుని పాదాలను ఆశ్రయించు.

భగవంతుడు ఇచ్చిన ప్రతి నిముషాన్ని భగవంతుని సేవకు మాత్రమె ఉపయోగించాలి అప్పుడే మనము ఈశ్వర సాన్నిద్యాన్ని పొందగలము.

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతి

ఇట్లు  

ఈశ్వర సేవకుల పాదదాసుడు

చేరువేల భార్గవ శర్మ