27, ఏప్రిల్ 2026, సోమవారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*మంగళవారం 21 ఏప్రిల్ 2026*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           2️⃣0️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *202వ రోజు*                    

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


ఉద్యోగ పర్వము,  మహాభారతం ఇతిహాసంలోని ఐదవ భాగము. 

ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.

ఉద్యోగము అనగా "ప్రయత్నము". యుద్ధానికీ, శాంతికి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కథాంశం. 

సంస్కృత మూలంలో 6,698 శ్లోకాలు ఉన్నాయి.  సనత్సుజాతీయము ఉద్యోగ పర్వంలో ఒక భాగం (41 నుండి 46 వరకు అధ్యాయాలు). దీనిపై ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానం వ్రాశారు..


         *ప్రధమాశ్వాసం*

```

ఉత్తరాభిమన్యుల వివాహం గడిచి నాలుగు రోజుల తరువాత ధర్మరాజు తన సోదర, పుత్ర సమేతంగా విరాటరాజు కొలువు కూటంలో ప్రవేశించాడు. అప్పుడు విరాటరాజు కృష్ణుడు, బలరాముడు, వారి పుత్రులు బంధువులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ చూసి “పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసారు. వారు ఎంతటి ధర్మపరులో అందరికీ తెలుసు. సుయోధనుడు శకుని సాయంతో పాండవులను మాయా జూదంలో ఓడించి పాండవుల రాజ్యలక్ష్మిని అన్యాయంగా అపహరించాడు. కనుక పాండవులకు కౌరవులకు క్షేమకరమైన ఒక మార్గం అన్వేషించి పాండవుల రాజ్యం వారికి సంక్రమింప చేయాలి. పాండవులకు పితృధనంగా కొంతరాజ్యం లభించింది. ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహించి రాజ్యాన్ని విస్తరించి మాయా జూదంలో అంతా దుర్యోధనుని పరం చేసి అడవులలో సోదర, పత్నీ సమేతంగా అనేక ఇడుములు పడ్డాడు. సుయోధనుడు,శకుని, దుశ్శాసన, కర్ణాదులతో చేరి వారిని అనేక అవమానాల పాలు చేసాడు. పాండవులు సాయం సంతరించుకునే లోపే వారిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కనుక పాండవులు వారికి సహాయాన్నందించే వారిని సమీకరించడం అనివార్యం. వారి బలపరాక్రమాలను ప్రదర్శించ వలసిన సమయం ఆసన్నమైంది. అయినా కౌరవుల మనసులో ఏముందో తెలుసుకుని తదుపరి కార్యక్రమ రచన చేయడం ఉచితం కనుక హస్తినా పురానికి ఒక దూతను పంపుట ఉచితం. వారు పాండవులకు రాజ్యభాగం శాంతి మార్గంలో ఇస్తే ఇరువర్గాలకు మంచిది. లేకుంటే ఏది ఉచితమో తరువాత నిర్ణయిస్తాము” అన్నాడు. 


అప్పుడు బలరాముడు లేచి.. 

“తమ్ముడు శ్రీకృష్ణుడు చెప్పినది ఉచితం. ఇరువర్గాలకూ ఇది క్షేమకరం. మనం ఒక దూతను కౌరవేంద్రుని వద్దకు పంపుదాము. జూదం ఆడటం సరిగా ఎరుగని ధర్మనందనుడు జూదానికి సిద్దంగావున్న కర్ణ దుర్యోధనాదులను వదిలి జూదంలో నిపుణుడైన శకునిని ఆటకు పిలిచి అతని చేతిలో ఓడిపోతూ, రోషావేశంతో జూదంను కొనసాగించి ఓడిపోయాడు. దానిలో శకుని తప్పేమీ లేదు. తన ప్రావీణ్యంతో రాజ్యాన్ని జూదంలో గెలిచి సుయోధన పరంచేసాడు. ఇందులో దుర్యోధనుని అపరాధం ఏమీ లేదు. కనుక ఇక్కడి నుంచి వెళ్ళే దూత ధృతరాష్ట్రుడికి నమస్కరించి వినయపూర్వకంగా వారికి ఏ విధంగానూ కోపం తెప్పించకుండా సంభాషించి కార్యాన్ని చక్కబెట్టేలా ఉండాలి” అన్నాడు.```


         *సాత్యకి ఆవేశం*```


బలరాముని మాటలు సాత్యకికి కోపం తెప్పించాయి "బలరామా! నువ్వు ఇలా మాట్లాడటం తగదు. ఇలా మాట్లాడటం నీకే తగింది. మనుష్యునికి ఎలాంటి హృదయం వుంటే వారు అటువంటి మాటలే మాట్లాడుతారు. దుర్యోధనుడు మంచి వాడంటున్న నిన్ను మాట్లాడించి వింటున్న వారిని అనాలి. ధర్మరాజు వేడుక పుట్టి జూదం ఆడాడా? దుర్యోధనాదులంతా కుట్రపన్ని ధర్మరాజుని క్షత్రియ ధర్మాన్ని అనుసరించి జూదానికి పిలిచి, కపట జూదం ఆడి అతడి రాజ్యలక్ష్మిని అపహరించి అతని సోదరలను ధర్మ పత్నిని అవమానించారు. ధర్మరాజు ధర్మగుణం లోకానికి తెలియనిదా? నియమం ప్రకారం వనవాసం నుండి విముక్తుడు కాగానే వారి రాజ్యంను పొందడానికి ధర్మరాజు అర్హుడైనాడు. దీనుడై అతడు రాజ్యంను యాచించడం తగదు. పాండవుల వద్ద అపహరించిన రాజ్యం పాండవులకు ఇవ్వక తప్పదు. లేకున్న పాండవులు యుద్ధంలో వారి రాజ్యాన్ని పొందగలరు. భీమార్జునులను ఎదిరించి యుద్ధభూమిలో నిలువగల వాడెవడు. విరాటుని పరాక్రం తక్కువా? పాంచాల వీరులు, వృష్టి వీరులు యుద్ధంలో తలపడి సుయోధనుని తమ్ములను హతమార్చక మానరు. రాజ్యం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు. దూతను పంపండి కానీ న్యాయంగా ఇస్తే సరి. అంతేగాని యాచన వలదు" అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: