13, జూన్ 2022, సోమవారం

అభ్యాసంతో

 ఎవరో ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడని అనుకుందాం. ఆ తప్పుని అతనికి ఎత్తి చూపి తను తప్పు చేశాడని నిరూపించి, తర్వాత క్షమించడం క్షమ అనిపించుకోదు. 


ఆ క్షమించిన విషయం సైతం ఆ వ్యక్తికి తెలియకుండా జరిగిపోవాలి. వారిలో తప్పు చేశామనే భావనే రాకూడదు. అది సరైన క్షమ. వారి తప్పును ఎత్తి చూపిస్తున్నావంటే వారిని ఇంకా క్షమించడం లేదని తెలుసుకోవాలి. తప్పు చేశామనే భావన పెద్ద శిక్ష. 


సాధనతో సంపాదించుకున్న జ్ఞానం ఈ భావన నుంచి తప్పించి జీవితాన్ని విశాల దృక్పథంతో చూసేలా చేస్తుంది. అదే అసలైన జ్ఞానం.


అవతలి వ్యక్తుల తప్పులను ఎత్తిచూపడమే పనిగా పెట్టుకునేవారు లోకంలో కోకొల్లలు కనిపిస్తుంటారు. వారంతా ఒకసారి తమ తప్పులను గుర్తించగలిగితే, ఎదుటివారిని అర్థం చేసుకోగలుగుతారు. 


అంటే, తప్పును సమర్థించాలని కాదు, తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయాలే కానీ, దాన్ని చేస్తున్న వ్యక్తిని తప్పుబట్టకూడదు. అలా చేసేంతటి సహనశీలత కొందరిలో ఉండకపోవచ్చు. కానీ, అభ్యాసంతో అన్నీ సాధ్యమే! మన మనసు పారదర్శకంగా ఉంటే, అవతలి వ్యక్తి మనసూ అంతే పారదర్శకంగా కనిపిస్తుంది. మనలో మాలిన్యాలు ఉంటే, ఎదుటివారిలోనూ అవే కనిపిస్తాయి.


క్షమించడానికి ప్రయత్నిద్దాం. ప్రయత్నే ఫలే అన్నారు పెద్దలు. వారు చెప్పిన సూక్తులు ఇప్పటిదాకా వమ్మైన దాఖలాలు లేవు కదా.

సీతారాముల అన్యోన్యత

 ॐ  సీతారాముల అన్యోన్యత - ఆదర్శం 


    ఉత్తమమైన మనస్సుగల రాముడు సీతయందే మనస్సు నిలిపేవాడు. ఆమె తన హృదయమునందు రామునే సర్వదా నిలుపుకొనేది. ఈ విధముగ అన్యోన్యాసక్తులై సీతారాములు అనేక ఋతువులపాటు (చాలాకాలం) విహరించారు. 


    తండ్రి అంగీకరించిన సంబంధమవడంతో రామునకు సీతపై ప్రేమకలిగింది. ఆమెయొక్క సద్గుణాలచేతా, లోకోత్తర సౌందర్యముచేతా అతని ప్రేమ ఇంకా వృద్ధి చెందింది. 


    సీత హృదయంలో భర్తయైన రాముడు రెండింతలుగా మసలుచున్నాడు. లోలోపల నున్న భావమును గూడ ఒకరి హృదయము మరొకరి హృదయంతో చెప్పుచుండెడిది.


    సౌందర్యమున దేవతా స్త్రీవలె ఉన్నదీ, లక్ష్మీవలె అపూర్వ సౌందర్యం గలదీ, మిథిలానగర సంజాతయు, జనకుని కూతురూ ఐన సీత రాముని హృదయంలో ఇంకా ఎక్కువగా మసలుతోంది. 


విశేషం 


    తండ్రి అంగీకరించి చేసిన సంబంధమవడంతోనూ, ఆమెకు గల రూపసద్గుణాలచేతనూ రామునకు సీతపై గాఢానురాగం కలుగగా, 

    సీతకు మాత్రమూ అట్టి బాహ్యనిమిత్తాలతో పనిలేకుండానే, భర్త అనే ఒక్క కారణంచేతనే రామునిపై రెట్టింపు ప్రేమయుండేది. 

    ఆ ప్రేమ ఎంత ఉత్కృష్టమైనదంటే, వారిరువురూ నోటితోకాక హృదయాలతోనే మాట్లాడుకొనేవారు, 

    ఒకరి హృదయంలో ఉన్న భావము నొకరు అనాయాసంగా గ్రహించి తదనుగుణంగ ప్రవర్తించేవారు. 

    వారి ప్రేమ ఒకరిపై ఒకరికి రెట్టింపు రెట్టింపు ఉన్నదట. వారి ప్రేమ కొలవడానికి గానీ, ఎవరికి ఎవరిపై ఎక్కువ ప్రేమయో చెప్పుటకు సాధనమేదీ లేదని భావము. 


    The high-minded Sree Raama, whose heart was set on his spouse and who stood enthroned in her heart, enjoyed life with her for much time. 

    Seetha was dear to Sree Raama as a partner made available to him by his father. Nay because of her manifold virtues and comeliness of form his affection for her grew all the more. 

    Her husband too, because of his excellences and lovely exterior, gained a doubly secure footing in her heart. 

    Seetha, the princess of Mithila and daughter of Janaka, who compared with goddesses in bodily charm and was beauty incarnate as it were, 

    could vividly read in minute detail with her mind even that which existed in the inmost heart of Sree Raama.


రామస్తు సీతయా సార్థం విజహార బహూనృతూన్ I 

మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః ॥ 

ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి I 

గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోఽభ్యవర్ధత ॥ 

తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే I 

అన్తర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా ॥ 

తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా I 

దేవతాభిః సమా రూపే సీతా శ్రీరివ రూపిణీ ॥ 

          - బాలకాండ 77/28,29,30,31 


గమనిక: 


    మా తల్లిదండ్రులు 


లక్ష్మీ సమానురాలైన లక్ష్మీ కనకదుర్గా సుందరి - 

బ్రహ్మశ్రీ వేదమూర్తులైన బొడ్డపాటి కుటుంబరావు గారల


     వివాహము 1947లో ఈ రోజే జరిగి, ఈ నాటికి 75 సంవత్సరాలైంది. 


    2007లో అరవై వసంతాల వైవాహిక జీవితాన్ని పూర్తిచేసుకుని, 

    మా నాలుగో మేనమామ ఉపనయనము, మా తల్లిదండ్రుల వివాహముల ఆనాటి సంయుక్త శుభలేఖని, 

    భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి సమక్షంలో చదివించుకుని, 

   దండలు మార్చుకుని, 

   సీతారామ కళ్యాణం చేయించారు. 

 

    వాళ్ళ దాంపత్యం సీతారాముల జీవితంలాగా ఆదర్శవంతమైనది. 

    మాకు వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. 

    వారి 

  - దైవీ సంబంధమైన ఆ జీవనమూ, 

  - కుటుంబ నిర్వహణా విధానమూ, 

   మా జీవితాలలో మాకు ఎల్లప్పుడూ మార్గదర్శనం. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

భక్తి సోపానములు

 శ్లోకం:☝️

*శ్రవణం కీర్తనం విష్ణోః*

    *స్మరణం పాదసేవనం l*

*అర్చనం వందనం దాస్యం*

    *సఖ్యమాత్మనివేదనం ll*


భావం: భగవత్కథా శ్రవణము, ఈశ్వర మహిమా సంకీర్తనము, భగవన్నామస్మరణ, విష్ణు పాదసేవ, పూజ, నమస్కరించుట, సేవచేయుట, స్నేహము, ఆత్మనివేదనము - ఈ తొమ్మిదీ భక్తి సోపానములు 🙏

జ్యేష్ఠ పూర్ణిమ

 జ్యేష్ఠ పూర్ణిమ


సకల శూభాలూ చేకూర్చే పూర్ణిమ 


జ్యేష్ఠ మాసం శుక్ల పక్ష పౌర్ణమి విశిష్టమైన రోజు. ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం జూన్ 13 సోమవారంనాడు పౌర్ణమి వస్తుంది. ఈ రోజున నదుల్లో స్నానం చేయడం, దానాలు చేయడం మంచిది. అంతేకాకుండా ఈ రోజు వట పూర్ణిమ ఉపవాసం కూడా పాటిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ అనేక శుభాలు చేకూరుస్తుందని శాస్త్ర వచనం. ఈ శుభ తిథిన కొన్ని పద్దతులు పాటిస్తే ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. అంతేకాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా పొందవచ్చని జ్యోతిషశాస్త్రం ప్రస్తావించింది.


పౌర్ణమి రాత్రి మధ్యలో మహాలక్ష్మీ, విష్ణువులను ఆరాధించాలి. అంతేకాకుండా రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమను అదృష్ట తిథిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున లక్ష్మీ స్తోత్రాలు, కనకధార స్తోత్రాలు పఠించడం వలన సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. స్తోత్రాలు, మంత్రాలు పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. సాయంత్రం లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి.


ఆర్థిక పరమైన సమస్యలనుంచి బయటపడటానికి పౌర్ణమి తిథినాడు చంద్రోదయం తర్వాత ముడిపాలు, బియ్యం, చక్కెరను నీటిలో కలపి, అనంతరం *ఓం శ్రీం హ్రాం స్రౌం సః చంద్రమాసే నమః* అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలిగిపోవడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. భార్యభర్తలు కలిసి అర్ఘ్యం సమర్పిస్తే వారి అనుబంధం మరింత బలపడుతుంది. చిరకాలం కలిసే ఉంటారు. అలాగే ఎముక, కంటి వ్యాధులు కూడా నయమవుతాయి.


జ్యేష్ఠ పూర్ణిమ తిథి నాడు 11 గవ్వలకు పసుపురాసి లక్ష్మీదేవి విగ్రహం పాదాల వద్ద ఉంచాలి. అనంతరం పసుపు లేదా కుంకుమతో తిలకం దిద్ది పూజించాలి. తర్వాత లక్ష్మీ చాలీసా పారాయణం చేయాలి. మరుసటి రోజు వీటిని ఎరుపు వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఐశ్వర్యం, కీర్తి వృద్ధి చెందుతాయి.


జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా సమర్పించి పెళ్లి కాని ఐదుగురు యువతులకు ఆహారంగా ఇచ్చి దక్షిణ సమర్పించాలి. తర్వాత ఇంట్లో అందరూ లక్ష్మీదేవి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం ప్రతి కుటుంబ సభ్యుడికి లభిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.


జ్యేష్ఠ పూర్ణిమ రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి విష్ణువు, లక్ష్మీదేవిని సక్రమంగా పూజించండి. సువాసన వెదజల్లే ధూపం వేసి, గులాబీ పూలతో అర్చించండి. దీంతోపాటు విష్ణు సహస్రనామం పఠిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా రుణ భారం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. విష్ణువు, లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.🙏