13, జూన్ 2022, సోమవారం

జ్యేష్ఠ పూర్ణిమ

 జ్యేష్ఠ పూర్ణిమ


సకల శూభాలూ చేకూర్చే పూర్ణిమ 


జ్యేష్ఠ మాసం శుక్ల పక్ష పౌర్ణమి విశిష్టమైన రోజు. ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం జూన్ 13 సోమవారంనాడు పౌర్ణమి వస్తుంది. ఈ రోజున నదుల్లో స్నానం చేయడం, దానాలు చేయడం మంచిది. అంతేకాకుండా ఈ రోజు వట పూర్ణిమ ఉపవాసం కూడా పాటిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమ అనేక శుభాలు చేకూరుస్తుందని శాస్త్ర వచనం. ఈ శుభ తిథిన కొన్ని పద్దతులు పాటిస్తే ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. అంతేకాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా పొందవచ్చని జ్యోతిషశాస్త్రం ప్రస్తావించింది.


పౌర్ణమి రాత్రి మధ్యలో మహాలక్ష్మీ, విష్ణువులను ఆరాధించాలి. అంతేకాకుండా రాత్రిపూట ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. జ్యేష్ఠ పూర్ణిమను అదృష్ట తిథిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున లక్ష్మీ స్తోత్రాలు, కనకధార స్తోత్రాలు పఠించడం వలన సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. స్తోత్రాలు, మంత్రాలు పఠించడం ద్వారా లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది. సాయంత్రం లక్ష్మీదేవిని ధ్యానించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి.


ఆర్థిక పరమైన సమస్యలనుంచి బయటపడటానికి పౌర్ణమి తిథినాడు చంద్రోదయం తర్వాత ముడిపాలు, బియ్యం, చక్కెరను నీటిలో కలపి, అనంతరం *ఓం శ్రీం హ్రాం స్రౌం సః చంద్రమాసే నమః* అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలిగిపోవడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. భార్యభర్తలు కలిసి అర్ఘ్యం సమర్పిస్తే వారి అనుబంధం మరింత బలపడుతుంది. చిరకాలం కలిసే ఉంటారు. అలాగే ఎముక, కంటి వ్యాధులు కూడా నయమవుతాయి.


జ్యేష్ఠ పూర్ణిమ తిథి నాడు 11 గవ్వలకు పసుపురాసి లక్ష్మీదేవి విగ్రహం పాదాల వద్ద ఉంచాలి. అనంతరం పసుపు లేదా కుంకుమతో తిలకం దిద్ది పూజించాలి. తర్వాత లక్ష్మీ చాలీసా పారాయణం చేయాలి. మరుసటి రోజు వీటిని ఎరుపు వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఐశ్వర్యం, కీర్తి వృద్ధి చెందుతాయి.


జ్యేష్ఠ పూర్ణిమ రోజున లక్ష్మీదేవికి పాయసం నైవేద్యంగా సమర్పించి పెళ్లి కాని ఐదుగురు యువతులకు ఆహారంగా ఇచ్చి దక్షిణ సమర్పించాలి. తర్వాత ఇంట్లో అందరూ లక్ష్మీదేవి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం ప్రతి కుటుంబ సభ్యుడికి లభిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.


జ్యేష్ఠ పూర్ణిమ రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి విష్ణువు, లక్ష్మీదేవిని సక్రమంగా పూజించండి. సువాసన వెదజల్లే ధూపం వేసి, గులాబీ పూలతో అర్చించండి. దీంతోపాటు విష్ణు సహస్రనామం పఠిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా రుణ భారం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. విష్ణువు, లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.🙏

కామెంట్‌లు లేవు: