12, మార్చి 2021, శుక్రవారం

ఒకరోజు

 ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఉదయాన్నే జాగింగ్ కు బయలుదేరి దారిలో యాక్సిడెంట్ లో చనిపోయారు. చిత్రగుప్తుని సూచనల మేరకు యమభటులు ఆత్మని తీసుకుని బయలుదేరారు. దారిలో స్వర్గలోకపు సైనికులు ఇదే ఆత్మ కోసం వస్తూ కనిపించారు. అదేమని ప్రశ్నిస్తే ఇతను మరణించిన ఘడియలు మంచివి కనుక మాతో పంపమని వాదించారు. ఇలా తేలడం కష్టమని యముని వద్దకు పంచాయతీకి వెళ్ళారు. యమధర్మరాజు అంతా విని ఆ వ్యాపారవేత్తనే ఎటు వెళ్ళాలో తేల్చుకోమని అందుకుగాను ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ ఉండమని తీర్పు ఇచ్చారు. అదే తడవుగా యమభటులు ముందు మా లోకం చూడమని తీసుకుని వెళ్లారు. లోనికి వెళ్ళగానే తనకంటే ముందు చనిపోయిన పాత మిత్రులు ఎదురొచ్చి ఆహ్వానించారు. సరదా పలకరింపులు, తాను భూలోకంలో ఆడిన ఆటలు అన్నీ సరదాగా సాగుతున్నాయి. ఒకవైపు ఫాస్ట్ బీట్ పాటలతో, బిర్యానీ, మందు పార్టీలతో, ఆటపాటలతో సమయం గడిచింది కూడా తెలియకుండా రోజు పూర్తయింది.


మరుక్షణం స్వర్గలోక భటులు ప్రత్యక్షమై తమలోకానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా పరిచయం ఉన్న కొందరు మిత్రులు సాదరంగా ఆహ్వానించారు. మంద్రమైన సంగీతం హాయిగా ఉంది. భగవంతుని కీర్తనలు, సత్సంగాలు, ఆలోచింపచేసే బోధలతో నిండుగా సాగింది ఆరోజు. సాత్విక ఆహారం, అవసరమైన పోషకాలు నిండిన పానీయాలతో భోజనం పెట్టారు. మనసుకి హాయిగా ఉండగా నిద్ర పట్టేసింది. తెల్లవారుతూనే యమధర్మరాజు ముందు నిలబెట్టారు. నీ నిర్ణయం ఏమిటని అడగగానే కాస్త సందిగ్ధంలో పడి మళ్ళీ తన మిత్రులు అంతా ఉన్నారు, విలాసవంతమైన జీవితం అటే ఉందని యమలోకమని బదులిచ్చాడు. 


వెంటనే యమభటులు ఆ వ్యాపారవేత్తని తీసుకొని వెళ్ళి పోయారు. నరక ద్వారం లోకి రాగానే అంతా మురికి కూపంలా కనిపించింది. నిన్న తనను ఆహ్వానించిన మిత్రులు మురికి వస్త్రాలతో, వెట్టి చాకిరి చేస్తూ, మధ్యలో భటుల చేతిలో దెబ్బలు తింటూ కనిపించారు. వెంటనే "ఇదేమిటీ? నిన్న ఇలా లేదు కదా నరకం ఈనాడు ఇలా ఉంది" అని భటులను ప్రశ్నించాడు. 

"నిన్న మేము ప్రచారంలో భాగంగా నిన్ను ఆకర్షించేలా అన్నీ అలా చూపించాము. నిన్ను మా వైపు తిప్పుకునే ప్రయత్నం అది. నువ్వు అదే నిజమనుకుని మాకే ఓటు వేసావు. ఇక నువ్వు మా బానిసవి పద!" అంటూ చేతిలోని శూలంతో బాధించడం మొదలుపెట్టారు. 


   "అయ్యో! సాదాగా ఉన్న నిజమైన స్వర్గాన్ని వదిలి ఆర్భాటాలు అద్దిన నరకాన్ని నిజమని నమ్మి చేజేతులా వచ్చిన అవకాశం నాశనం చేసుకున్నా"నని చింతిస్తూ నరకకూపంలోకి చేరిపోయాడు.


మిత్రులారా! ఓటన్నది మన హక్కయితే, ఈ ఆకర్షణలు, ప్రలోభాలు, ధనం ఇవన్నీ మన బలహీనతలను లొంగదీసుకోవాలనుకునే ప్రయత్నాలు. నిజంగా మనకోసం, మనకి ఉపయోగపడే నాయకులు ఎవరో ఆచి తూచి ఎన్నుకోండి. ప్రలోభాలకు లోనయితే మరో అయిదేళ్ళవరకూ వారికి మనం బానిసలమవుతాం!! మేలుకోండి మిత్రులారా మనకి నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది, వదులుకోవదు... నిర్ణయిద్దాం!!

 మన నగర, రాష్ట్ర, దేశ ప్రగతికి దిశను నిర్ణయిద్దాం ఓటన్న చిరుదీపంతో!!!

మన మహర్షులు- 46

 మన మహర్షులు- 46


 సాందీపని మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


 సాందీపని మహర్షి  ఈపేరెప్పుడేనా విన్నారా? ఆలోచించండి. కృష్ణుడి గురువుగారు ఎవరు? 


ఇప్పుడు ఆయన గురించి తెల్సుకుందాం...


అవంతీపురంలో వేదజ్ఞులు, శాస్త్రజ్ఞులు, పురాణజ్ఞులు అయినటువంటి బ్రాహ్మణులుండే వాళ్ళు.

వారిలో సందీపని మహర్షి కొడుకు సాందీపుడు. సాందీపుడు చిన్నతనంలోనే అన్ని వేదశాస్త్రాలు నేర్చుకుని అన్ని వేదరహస్యాలు తెలుసుకుని దయాశాలి. ప్రియదర్శనుడు, సాత్వికుడు, విష్ణుపూజారతుడు, వివేకధనుడు అంటూ   పిలవబడేవాడు. తండ్రికి తగ్గ తనయుడునిపించుకున్నాడు.


సాందీపనికి వివాహం చేశాక ఒక కొడుకు పుట్టాడు. అతడు ఏకసంథాగ్రాహి, తండ్రి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అతడికి విష్ణు పాదపద్మాల దగ్గరే వుండాలని, సంసారం చావు, పుట్టుక ఇలాంటివి తనకిష్టం వుండదని అంటూండేవాడు.


ఒకరోజు మాఘ పౌర్ణమినాడు స్నానం చేస్తూ ఈ పుణ్యకాలం దాటితో మళ్లీ రాదు అనుకుని విష్ణుమూర్తిని తల్చుకుని నీళ్ళల్లో మునిగిపోయాడు. ఎంత వెతికించినా కనపడలేదు సాందీపని మహర్షి బంధాలుండకూడదని సరిపెట్టుకున్నాడు, కానీ ఆయన భార్య మాత్రం ఏడుస్తూనే వుండేది.


కంసుణ్ణి వధించాక దేవకీ వసుదేవులు బలరామకృష్ణులకి గర్గుడు మొదలైన మహార్షులతో ఉపనయనం చేయించి దానాలు, ధర్మాలు అన్నీ చేసి సాందీపని దగ్గర విద్యాభ్యాసం కోసం పంపించారు.


బలరామకృష్ణులు స్వతహాగా జగద్గురువులు, సంపూర్ణులు, సర్వజ్ఞులు అయినా కూడా గురుశుశ్రూషతో నేర్చిన విద్యే సరైన విద్యని లోకానికి తెలియచెప్పడం కోసం గురువు దగ్గర చేరి చదువుకున్నారు.


ఐలరామకృష్ణులు మహావైభవరాతియైన కాశీకి బ్రహ్మచారులై చేరి అక్కడ అవంతీపురంలో వున్న సాందీపని మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. 


సర్వజగత్తుని నియంత్రించగల బలరామకృష్ణులు తనకి సాష్టాంగపడ్డం ఎంత అపురూపం! ఎంత అద్భుతం ఎంత అదృష్టం! అనుకుని సాందీపని మహర్షి వాళ్ళని శిష్యులుగా అంగీకరించి విద్యాభ్యాసం మొదలుపెడితే రోజుకి ఒక విద్య చొప్పున చెప్పింది చెప్పగానే నేర్చేసుకున్నారు.


అదృష్టమంటే అందరినీ వరించదు. త్రిమూర్తుల్ని పరీక్షించే శక్తి భృగుమహర్షికి, త్రిమూర్తుల్ని చంటి పిల్లల్ని చేయగల శక్తి అనసూయకి, శ్రీరాముడికి గురువయ్యే అదృష్టం వసిష్ఠుడికి, విష్ణుమూర్తిని కొడుకుగా పొందిన యోగం కశ్యపుడిది, పద్నాలుగు లోకాల్ని సంరంక్షించే బలరామకృష్ణులకి పాఠం చెప్పే అదృష్టం వేలాది మహర్షుల్లో ఒక్క సాందీపనికే కలిగింది. 


బలరామకృష్ణులు విద్యాభ్యాసం అయిపోయాక గురువుగారికి, గురుపత్నికి నమస్కారం చేసి గురు దక్షిణగా ఏంకావాలనడిగారు.


 సాందీపని మహర్షి తన కొడుకు వృత్తాంతం చెప్పి నేనయితే ఇవన్నీ మాములే అని సరి పెట్టుకున్నానుగాని, నా భార్య కొడుకు కోసం ఏడ్వనిరోజు లేదు. మాకు తప్పకుండా గురుదక్షిణీవ్వాలని వుంటే నా కొడుకుని తీసుకురండని చెప్పాడు సాందీపని మహర్షి.


బలరామకృష్ణులు సముద్రుడి దగ్గరకెళ్ళి మా గురుపుత్రుణ్ణివ్వమని అడిగారు.


 సముద్రుడు అతణ్ణి నాలో వున్న పంచజన్య అనే రాక్షసుడు మింగేశాడని చెప్పాడు.


అప్పుడు కృష్ణుడు సముద్రంలోకి వెళ్ళి రాక్షసుడి పొట్ట చీల్చాడు. లోపల గురుపుత్రుడు లేడుగాని ఒక శంఖం వుంది. అది తీసుకుని యమపురం వెళ్ళి శంఖారావం చేశాడు. యముడు భయపడి బయటకి వచ్చి, బలరామకృష్ణులకి నమస్కారం చేసి ఆ పిల్లవాణ్ణి వాళ్ళకి అప్పగించాడు.


బలరామకృష్ణులు గురుపుత్రుణ్ణి తీసికొచ్చి సాందీపని మహర్షికి అప్పగించి

నమస్కరించి ఆశీర్వాదం తీసుకుని తమ గురుదక్షిణ చెల్లించుకున్నారు.


సాందీపని మహర్షి ఎంతోమంది శిష్యులకి విద్యాదానం చేస్తూ లోకకళ్యాణానికి పాటుపడ్డాడు.


సాందీపని మహర్షి కథ చదివారు కదా! ఈ మహర్షి గొప్పతనం ఎంత చెప్పినా తరగనిది..


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷

అరుణాచల శివ 🙏

 అరుణాచల శివ 🙏



🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


ఉత్తర భారతదేశానికి చెందిన భక్తుడు ఒకరు ఒక చీటీ వ్రాసి భగవాన్! చేతికి ఇచ్చారు.


 ఆ చీటీలో ఉన్న విషయం.....

 "బృందావనంలో శ్రీ కృష్ణుని నిజస్వరూపం దర్శిస్తే, నా కష్టాలన్నీ తొలగించుకొనే శక్తి లభిస్తుందా? వారిని దర్శించి నా భారమంతా అర్పించాలని కోరికగా ఉన్నది."


 భగవాన్! ఆ చీటీ చూసి ఇలా సెలవిచ్చారు....


 "దానికేమి అట్లే చేయవచ్చును. 


వారిని చూచిన వెనుక మన భారమంతా వారి పైనే ఉంటుంది. 


ఇప్పుడు మాత్రం ఆ చింత మీకెందుకు? భారమంతా వారిపైనే వేస్తే సరికదా! వారే చూచుకుంటారు."


    మరలా ఆ భక్తుడు ఇలా అడిగారు....

       "నేనిప్పుడు ఆ కృష్ణుని నిజరూపం చూడాలంటే బృందావనానికి వెళ్లి వారిని

ధ్యానించాలా? ఎక్కడ ఉండి ధ్యానించినా సరేనా?".


    భగవాన్! ఇలా సెలవిచ్చారు....


"తన ఉనికి తానెరిగి తానెక్కడుంటే అక్కడే బృందావనం గాని, ఎక్కడో బృందావనం ఉన్నదని పరగెత్తనక్కర లేదు. వెళ్ళవలెనన్న తీవ్రత కలవారు వెళ్ళవచ్చునే గాని, వెళ్ళకుంటే లాభం లేదన్న నిబంధన ఏమున్నది".


    భగవద్గీతలో  సెలవిచ్చినట్లు....

  

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః

అహమాదిశ్చ మధ్యంచ భూతానా మంత ఏవచ"


 తానున్న చోటే బృందావనం. తానెవరో, తన ఉనికి ఏదో విచారించి, తెలుసుకుంటే తానే కృష్ణుడౌతాడు, సకల విషయ వాసనలూ తనలో అణుగుటయే

తన్నర్పించుకొనుట. 

 

ఆ తర్వాత మన భారం అతనిదే కదా!!!


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

మొగలిచెర్ల ప్రార్ధన..ఫలితం..*

 *ప్రార్ధన..ఫలితం..*


"అయ్యా..దత్తాత్రేయ స్వామి పుట్టినరోజు ఎప్పుడూ?.." అని దత్తజయంతికి నెల రోజుల ముందునుంచే..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చే భక్తులలో చాలామంది అడిగే ప్రశ్న..దత్తజయంతి తాలూకు తేదీ ని వాళ్లకు చెపుతూ ఉంటాము.."ఆరోజుకు వస్తామయ్యా..స్వామిని దర్శించుకొని..ఇక్కడ ప్రసాదం తీసుకొని వెళతాము.." అని చెపుతుంటారు..మరికొందరు దత్తజయంతి రోజున అన్నదానానికి మేము కూడా సహకరిస్తాము..మాకూ అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటారు..మొగిలిచెర్ల చుట్టుప్రక్కల గ్రామాల్లో కానీ..స్వామివారి మందిరాన్ని తరుచూ దర్శించుకునే వారి మదిలో కానీ..దత్తజయంతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది..ఆరోజు మొగిలిచెర్ల స్వామివారి మందిరం ఒక పండుగ శోభను సంతరించుకుంటుంది..దత్తజయంతి అనేది మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడి పుట్టిన రోజుగా భావించేవారూ వున్నారు..ఆరోజు స్వామివారి పుట్టినరోజు అని చాక్లెట్ లు తీసుకొచ్చి మందిరం వద్ద భక్తులకు పంచడం కూడా ఒక ఆనవాయితీగా వస్తోంది..


మరి ఈ ఆచారాన్ని ఎవరు ప్రారంభించారో నావరకూ అవగాహన లేదు..నేను మందిర నిర్వహణ బాధ్యతలు తీసుకున్న తొలి సంవత్సరం (2004) లో కుతూహలం పట్టలేక ఒక భక్తుడిని అడిగాను.."చాక్లెట్ లు తీసుకొచ్చి ప్రసాదంగా ఇచ్చే అలవాటు ఎలా వచ్చింది..?" అని.."ఏమో స్వామీ..అందరూ తీసుకొస్తున్నారు..నేనూ తీసుకొచ్చి..మందిరం వద్ద పంచుతున్నాను.." అన్నాడు..అప్పటికీ సంతృప్తి చెందక..మా అమ్మగారిని అడిగాను.."అమ్మా..స్వామివారి మందిరం వద్ద దత్తజయంతి రోజు చాలామంది చాక్లెట్ లు తీసుకొచ్చి పందేరం చేస్తున్నారు కదా..ఈ పద్ధతి ఎలా వచ్చింది.. ?" అని..ఆవిడ పెద్దగా నవ్వి.."ఒకరు చెప్పింది కాదురా..ఏదో దత్తక్షేత్రం లో ఇలా పంచుతారని కొందరు అన్నారు..అదే పద్ధతి ఇక్కడ కూడా పాటిద్దామనుకొని..ఓ పది పన్నెండేళ్ల క్రితం కొందరు ఒక పాకెట్ చాక్లెట్ లు తీసుకొచ్చి..ఇక్కడున్న నలుగురికీ ఇచ్చారు..వాళ్ళను చూసి..మరికొందరు పంచారు..మరుసటి ఏటి కల్లా..ఆ పద్ధతి ఆచారమై పోయింది..సరేలే..వాళ్ళ ఉత్సాహాన్ని మనం ఎందుకు కాదనాలి అని మేము కూడా ఆ విషయమై పెద్దగా పట్టించుకోకుండా వదిలేసాము..అంతే తప్ప..ఇలా ఖచ్చితంగా చాక్లెట్ లు తీసుకురావాలి అని నియమం లేదు.." అన్నది..ఇక అంతటితో ఆ విషయం వదిలేసాను..


2005వ సంవత్సరం దత్తజయంతికి మధ్యాహ్నం పూట భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాను..అప్పటికి స్వామివారి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం మొదలుకాలేదు..ఆరోజుల్లో దత్తజయంతికి దూరప్రాంతాల నుంచి సుమారు ఐదారు వందలమంది భక్తులు వచ్చేవారు..స్వామివారి సమాధి దర్శించుకొని..తిరిగి వెళ్లిపోతూ ఉండేవారు..స్వామివారి మందిరం వద్ద భోజన ఏర్పాటు లేని కారణంగా ఇబ్బంది పడేవారు..ఈ పద్ధతి మార్చాలని అనిపించి..ముందుగా మా తల్లిదండ్రుల సలహా తీసుకున్నాను.."వనరు ఉంటే..ఏర్పాటు చెయ్యి..ముందుగా స్వామివారి సమాధి వద్దకు మీ దంపతులు వెళ్లి..మీ మనసులోని కోరికను తెలపుకోండి..ఆయన ఆశీర్వాదం ఉంటే..నీకు ఏ శ్రమా లేకుండా అన్నీ సమకూరుతాయి.." అని అమ్మ చెప్పింది..సరే అన్నాను..దత్తజయంతి అప్పటికి వారం రోజులు ఉన్నది..ప్రక్కరోజు ఉదయం స్వామివారి సమాధి వద్ద మేమిద్దరం నమస్కారం చేసుకొని.."స్వామీ..ఒక్క దత్తజయంతి నాడే కాకుండా..ఇక్కడ ప్రతి వేడుకకూ అన్నదానం జరిగేటట్టు మాకు అవకాశం కల్పించు తండ్రీ.." అని మొక్కుకున్నాము..


ఆరోజు సాయంత్రం ఐదు గంటల వేళ..ఒక భక్తుడు నూటాయాభై కిలోల బియ్యాన్ని తీసుకొచ్చి.."అయ్యా..స్వామికి ఇద్దామనుకున్నాను..తీసుకోండి.." అని మందిరం లో ఉంచి వెళ్ళిపోయాడు..ఆ బియ్యం తో ఆ సంవత్సరం దత్తజయంతికి అన్నదానం భేషుగ్గా జరపొచ్చు..ఆ ప్రక్కరోజే మరికొంతమంది భక్తులు..ఎవరో పిలిచినట్టు వచ్చి..కొంత నగదు రూపంలో..మరికొంత వస్తురూపం లో విరాళంగా ఇచ్చారు..రెండు మూడు రోజుల్లోనే..మా అంచనాలను మించి సరుకులూ..నగదూ సమకూరాయి..ఆ దత్తజయంతి రోజు ఏ ఇబ్బందీ లేకుండా..మధ్యాహ్నం మాత్రమే కాదు..ఆరాత్రికి స్వామివారి మందిరం వద్దకు వచ్చిన భక్తులకు కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేసాము..ఆసంవత్సరం నుంచీ..నేటిదాకా..ప్రతి దత్తజయంతికి అన్నదానం ఏలోటూ లేకుండా జరుగుతున్నది..భక్తుల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి..అలాగే సహకరించేవారూ వస్తున్నారు.. గత పది సంవత్సరాలుగా..దత్తజయంతి రోజు రాత్రికి..మొగిలిచెర్ల గ్రామ యువకులు స్వామివారి మందిరం వద్ద అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు..దత్తజయంతి రోజు అన్నదాన కార్యక్రమం లో తాము కూడా ఏదో ఒక విధంగా పాలుపంచుకుంటే..తమకు మేలు జరుగుతుంది అనే ఒక విశ్వాసం ఏర్పడిపోయింది..మీకూ ఆసక్తి ఉంటే..మీరూ సహకరించవచ్చు..


ఆనాడు మా అమ్మగారు చెప్పిన మాట.."స్వామివారి ఆశీర్వాదం ఉంటే..నీకు ఏ శ్రమా లేకుండా అన్నీ సమకూరుతాయి.." ఇప్పటికీ మా దంపతులకు గుర్తు ఉన్నది..అది అక్షరసత్యం కూడా..అలా దత్తజయంతి పండుగ కోసం మేము చేసిన ప్రార్ధన ను స్వామివారు ఆలకించి..ఫలితాన్ని ప్రసాదించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).