29, అక్టోబర్ 2021, శుక్రవారం

బ్రాహ్మీముహూర్తంలో

 బ్రాహ్మీముహూర్తంలో లేస్తే ఏంటట!


ఉదయాన్నే నిద్రలేవాలని మన పెద్దవాళ్లు తెగ పోరేవారు. అలా చెప్పీ చెప్పీ చాలా తరాలు వెళ్లిపోయాయి. తరం మారుతున్న కొద్దీ జీవవనశైలి మారిపోతోంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. కొన్నాళ్ల తరువాత పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ బ్రాహ్మీముహూర్తం` అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనం ఏంటి!


సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే రుతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, 4:00 -4:30 a.mని బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి.


ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట! అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది.


మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం… ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తూ ఆయుర్వేదమే `తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి` అని చెబుతోంది. పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం `వాత` ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ `వాత` లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం; ప్రశాంతంగా ఉండగలం; మంచి ఆలోచనలు చేయగలం; చదివినదానిని ఆకళించు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం.


ధ్యానం చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయిని యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి… ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందట.


ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా, ధ్యానం, చదువు… చాలా తేలికగా ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారీ చేయాల్సిన విధులకు (ఉద్యోగం, కాలేజ్‌, వంటావార్పూ…) ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల… మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి.


గుండెజబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే `థ్రోంబస్‌` అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. పైగా ఇదే సమయంలో మనం హడావుడిగా లేచి విధుల్లోకి చేరాలనే టెన్షన్‌లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని… స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిని తరువాత బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తం అని ఎలా అనుకోగలం చెప్పండి!



To see more posts like this and join ALL INDIA BRAHMIN FEDERATION, click here 👇👇


https://kutumbapp.page.link/fMV3yzqM6gr6Y3UHA