16, ఫిబ్రవరి 2026, సోమవారం

వాగర్థావివ సంపృక్తౌ

  శ్లో. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ !!


వాగర్థావివ = వాక్కు, అర్థముల వలె, సంపృక్తౌ = కూడియున్న

వారును, జగతః = ఈ జగత్తునకు, పితరౌ = తల్లి దండ్రులును

అయిన, పార్వతీ పరమేశ్వరౌ = పార్వతీ పరమేశ్వరులను, వాగర్థ =

వాక్కుల, అర్థముల, ప్రతిపత్తయే = సంప్రాప్తి కొఱకు , వందే =

నమస్కరిస్తున్నాను.


అర్థం: మాటలు, వాని అర్ధముల ఙ్ఞానము కొరకు, వాటి వలెనే

ఎప్పుడూ కలిసియుండెడి, జగత్తునకు తల్లిదండ్రులైన పార్వతీ

పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను.


మహాకవి కాళిదాసు 'రఘువంశం' కావ్యానికి మొదట ఈ

మంగళ శ్లోకం రచించాడు. జగత్తుకు అనగా ప్రపంచానికి

పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులవలె ఉన్నారు, అని

ఆ మహాకవి అన్నాడు. 

ఇదేవిధంగా శంకర భగవత్ పాదులు కూడా 'మాతా చ

పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః, బాంధవా శ్శివభక్తాశ్చ

స్వదేశో భువనత్రయమ్' అని ఒకచోట నిర్ధారించారు.

*సేకరణ*

అతివేడిని తగ్గించుటకు

 శరీరంలో అతివేడిని తగ్గించుటకు సులభ యోగం - 


      రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి ఆ అన్నము మునిగే విధముగా వేడిపాలు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టాలి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి బాగా నీరు కలిపి కొంచం ఉప్పు చేర్చుకొని ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను . 


              ఇది తీసుకున్న గంటన్నర తరువాత 80ml అలోవెరా జ్యూస్ కి 160 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను . మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను. పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు 


 

అరుణాచలుని ఆవిర్భావము

  🔱*అరుణాచలుని ఆవిర్భావము* 🔱        


 లింగోద్భవ సమయంలో.... తమిళనాడులోని అరుణాచలంలో....

 సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అగ్ని లింగోద్భవం ( అగ్ని లింగం గా.. బ్రహ్మ.,విష్ణువుల మధ్య ఆవిర్భవించిన పుణ్య ప్రదేశం అరుణాచలము )

  శివరాత్రి అర్ధరాత్రి సమయం లో...

అరుణాచలం లో అరుణచలేశ్వరుడిగర్భ ఆలయం..

 వెనక వైపున మహ శివరాత్రి రోజున....

 లింగోద్భవ సమయంలో...

 అగ్ని లింగం ఆవిర్భావానికి సంబంధించిన పూజలు ఇక్కడ నిర్వహిస్తారు.


అరుణాచల సన్నిధిలో అంతరాలయం వెనక భాగంలో ఉండే ఈ లింగోద్భవ మూర్తికి ప్రత్యెక అభిషేకాలు నిర్వహిస్తారు.

ఈ మూర్తిని మనం పరిశీలిస్తే... అగ్ని స్తంభ రుపంలో పరమేశ్వరుడు మరియు దాని యొక్క ఆద్యంతాలను గమనించడం కోసం ఊర్ధ్వ దిశలో హంస రూపంలో వెళ్లిన బ్రహ్మ అధో దిశలో వరాహ రూపంలో వెళ్ళిన విష్ణు మూర్తి యొక్క రూపాలను గమనించ వచ్చు. ఇటువంటి మూర్తిని గురించి దర్శించి ఇతరులకు ఈ విషయాన్ని తెలియ జేయండి.

ఆ పరమేశ్వరుని అగ్ని లింగోద్భవానికి ప్రత్యక్ష సాక్షి అరుణాచల మే... నేటికీ మన కనుల ఎదుట ప్రత్యక్షంగా సాక్షాత్కరిస్తుంది *లింగోద్భవ కాలం* 

శివుడు లింగ రూపంలో ఉద్భవించిన కాలాన్ని లింగోద్భావకాలం అంటారు . శంకరుడు శివరాత్రి పర్వదినము రోజున లింగరూపంలో ఉద్భవించాడు . 

అభిషేక ప్రియః శివః అని పెద్దలు అంటారు . అనగా శివుడు అభిషేక ప్రియుడు అని అర్ధం . 


ఇది వరకే మనం చాలాసార్లు చెప్పుకున్న విధముగా శివుడు బోలా శంకరుడు . తెలిసో,తెలీకో వుద్దరినుడు నీటిని లింగం మీద పోస్తే చాలు ఆ పరమేశ్వరుడు కరిగిపోతాడు . అదే శివుడికి ఇష్టమైన సోమవారం రోజునో లేక ఆయన జన్మ నక్షిత్రం రోజునో అభిషేకం చేయించుకున్నా లేక వారే స్వయం గా ఇంట్లో అభిషేకం చేసుకున్నా ఫలితం అద్వితీయం గా వుంటుంది . అదే లింగోద్భవ కాలంలో కనుక అభిషేకం చేయించుకున్నా,చేసుకున్నా మామూలు రోజులలో చేసే అభిషేకానికి కొన్ని వేల రెట్లు అధికంగా ఫలితము,పుణ్యము లభిస్తాయి అనడంలో మాత్రం ఏమి సందేహం లేదు . 

🔱*అరుణాచలుని ఆవిర్భావము*✨

ఏకమై, అద్వితీయమై విరాజిల్లే "కురుణా సముద్రుడగు పరమేశ్వరునకు ఒకమారు తాను అనేకము కావాలనే సంకల్పము కలిగింది. ఆ సంకల్పానుసారం పరమాత్మనుండి బ్రహ్మవిష్ణువులు పుట్టారు. బ్రహ్మదేవుడు లోకాలను సృజించుటకు, విష్ణువు వాటిని రక్షించుటకు పరమేశ్వరునిచే నియమితులయ్యారు. ఐతే, పరమేశ్వరుని ఆజ్ఞానుసారం బ్రహ్మవిష్ణువులు తమవిధులను నిర్వహించుటకు బదులుగా ఒకమారు అహంకారపూరితులై "నేను గొప్పయంటే, నేను గొప్ప" యని పరస్పరము పోట్లాడుకోసాగారు. వారి తగువును సాక్షీస్వరూపుడైన పరమేశ్వరుడు చూశాడు. ఇట్లను కొన్నాడు "నేను వెంటనే వీరి తగువును మాన్పాలి. లేనియెడల సృష్టికార్యమునకు ఆటంకము కలుగును. నాశక్తి అంతటా నిండియున్నది. ఈశక్తియే సృష్టికి మూలము. దీనిని మించినది లేనేలేదు. ఇది వేదసమ్మతమైన వైదిక సత్యము. ఈ ధర్మాన్ని బ్రహ్మవిష్ణువులు అహంకారము చేత ఆవేశపూరితులై మరచి పోయారు. తామే అధికులమన్నట్లు భావించి పరస్పరము పోట్లాడుకొంటున్నారు. ఇది తగనిపని. ఈసృష్టిలో ప్రతిపాణి అణుకువ కలిగియుండాలి. తమకంటే శ్రేష్టతమములైనవి ఎన్నియో వున్నాయని సమ్మతించాలి. ఇతరుల సమానత్వమును గానీ, ఆధిఖ్యతనుగానీ సమ్మతింపనివాడు నిజముగా అజ్ఞాని. అట్టివాడు తప్పక ఆపదలలో చిక్కుకొనును. పరాభవమును పొందును. పతనమౌను. ఈ ధర్మసూక్ష్మాన్ని బ్రహ్మవిష్ణువుల మూలంగా లోకాలకు తెలియజేయాలి. నన్ను తలచినంత మాత్రాన అల్పులను కూడా తరింపజేస్తూ ఈవిశ్వములో ఏదోయొకచోట ప్రత్యేకరూపాన్ని ధరించి వుండిపోవాలనే కోరిక నాకుండేది. ఇప్పుడు అందుకు తగిన సమయము వచ్చింది” అని పరమశివుడు నిశ్చయించుకొని తేజోవంతమైన జ్యోతిస్పంభముగా కలహించుకొనే చూచి బ్రహ్మవిష్ణువుల మధ్యనిలిచాడు.


అనంతమైన ఆదివ్య తేజస్తంభాన్ని బ్రహ్మవిష్ణువులు చూశారు. భయకంపితులై ఊరక చూస్తూవుండిపోయారు. ఇంతలో అందుండి దేవవాణి వినిపించింది. “ఓ కుమారులారా! ఎందుకు ఈ బుద్ధిమాలిన తగవు? మీ బలాబలాలు పరమేశ్వరునకు తెలుసు. మీయెదుట తేజోవంతంగా ప్రకాశించే ఈ జ్యోతిస్త్సంభము ఏదోకాదు. ఇది పరమశివుని యొక్క స్వరూపము. దీని ఆద్యంతములను మీలో ఎవరు కనుగొందురో వారే గొప్పవారు" అన్న పరమేశ్వరుని పలుకులు విని బ్రహ్మ విష్ణువులు కలహమును మాని నీటిలో కనిపించే చంద్రబింబమును పట్టుకొనుటకు ప్రయత్నించే మూఢుల్లాగా ఆ స్తంభము యొక్క ఆద్యంతములను కనుగొనుటకు సిద్ధమయ్యారు. తమ బలాబలాలను నిరూపించుకొనుటకు పూనుకొన్నారు. అంతేగానీ! పరమేశ్వరుని స్తుతించాలను తలంపే వారికి కలుగలేదు. ఇక వారు భూమిని కేంద్రంగా తీసుకొన్నారు. విష్ణువు తేజస్సంభము యొక్క అంతమును కనుగొనుటకు సిద్ధమయ్యాడు. అందుకోసం ఆయన వరాహరూపమును ధరించాడు. భూమిని త్రవ్వుకుంటూ దాని వెంట పోయాడు. పోవుకొలది ఆజ్యోతిస్త్సంభము క్రిందకు అనంతంగా వ్యాపించిపోతూనే వుంది. లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని ఎంతో ప్రయత్నించాడు. చివరకు బలము తగ్గింది. అలసట హెచ్చింది. శరీరము పూర్తిగా డస్సింది. వెనుకకు తిరిగి వచ్చుటకు కూడా శక్తిలేదు. ఈవిధంగా విష్ణువు ఆపదలో చిక్కుకొన్నాడు. ఇప్పుడు ఆహంభావనంతా పోయింది. వెంటనే పరమేశ్వరుని ఎఱుక విష్ణువునకు కలిగింది. అప్పుడు తనలోతాను ఇట్లనుకొన్నాడు. "ఆహా! ఏమి ఈయహముయొక్క మాయ. దీనిచేత ఆదిదైవతమై, ద్రష్టగా నాలో వెలిగే పరమేశ్వరున్నే మరచిపోయాను. ఈసృష్టినంతా నేనే రక్షిస్తున్నాను. దీనికి కర్తను నేనే నాకంటే అధికుడు లేడని గర్వించాను. “నేను, నాది” అనే అహంతత్వముతో పరమేశ్వరున్ని పూర్తిగా మరచి పోయాను. నిజంగా దేవతలకు, వేదాలకు, సమస్తవిశ్వానికి ఆధారము ఆపరమాత్మ ఒక్కడే. ఆపరమేశ్వరుడే ఆదిదైవము. నేను అజ్ఞానము చేత అసహ్యమైన పందిరూపమును ధరించి అనంతుడైన ప్రేమ శివుని అంతము కనుగొనుటకు ప్రయత్నించానే! ఇది సాధ్యమా! ఇది కేవలం పరమేశ్వరుని అనుగ్రహము చేతనే సాధ్యము. ఇప్పుడు సత్యము తెలియవచ్చినది. పరమశివుడు తనభక్తున్ని రక్షించాలని తలచినంత మాత్రాన ఆభక్తునిలోని అహము పారిపోతుంది. ముక్తి లభిస్తుంది. ఇది ముమ్మాటికీ సత్యము ఇప్పుడు ఈతేజస్తంభమును పూజించాలంటే నాకు తగిన శక్తిగానీ, సమయంగానీ లేదు. ఆయనకు శరణుజొచ్చుటే తగిన పని” అని నిశ్చయించుకొని తనలో తాను మునిగి పరమేశ్వరున్ని ధ్యానించాడు. శరణుజొచ్చాడు. అంత కరుణా సముద్రమైన పరమేశ్వరుడు విష్ణువును అనుగ్రహించి భూకేంద్రానికి చేర్చాడు.


ఇక బ్రహ్మ హంసరూపమును ధరించి తేజస్తంభము యొక్క మొదలును కనుగొనుటకు భూమి నుండి ఆకాశమునకు కొన్ని వేల సంవత్సరాలు ఎగురుతూ పోయాడు. కానీ ప్రయోజనము లేదు. ఎగిరి ఎగిరి రెక్కలు పాడైపోయాయి. ఆయాసము హెచ్చింది. ఇంద్రియాల బలము బాగా తగ్గింది. చూపు కనిపించడం లేదు. తాను ఎత్తుకు పోవుకొలది ఆతేజము ఇంకా ఎత్తుకు వ్యాపిస్తూనే వున్నది. ఇంత జరిగినా బ్రహ్మ మాత్రము తన ప్రయత్నాన్ని మానలేదు. గగనానయున్న సిద్ధ పురుషులు, బ్రహ్మయవస్థను, పట్టుదలను చూశారు. విస్తుపోయారు. వారు ఈవిధంగా అనుకొన్నారు. “ఏమి ఈ బ్రహ్మఅహంకారపు వ్యర్ధపు ప్రయత్నము! శరీరము పడిపోవుటకు సిద్ధంగా వున్నది. ఐతే, ఆయనలోని అహంకాము చావలేదు. అందుకే ప్రయత్నము మానలేదు. నిజంగా శివస్వరూపానికి ఆద్యంతములు లేవు. అందుచేత దానిని కొలవడానికి ఎవరికినీ సాధ్మము కాదు. కానీ, అహంకారము తొలగినపుడు ఆయన అనంతమైన తత్త్వము తెలియవస్తుంది. పరమేశ్వరుని స్వరూపమైన ఈ తేజోరాశి ఆద్యంతములు తెలియాలంటే మొదట తనలో తాను మునిగి పరమేశ్వరుని ధ్యానించాలి. ఆయన కరుణతో అహం అంతమౌతుంది. అప్పుడు ఆత్మస్వరూపము తెలియవస్తుంది. ఆస్వరూపము ఏదోకాదు అది పరమేశ్వరుని స్వరూపమే. అప్పుడు మాత్రమే తేజస్తంభము యొక్క అవధులను తెలుసుకొన్నవాడౌతాడు." అని సిద్ధపురుషులు చర్చించుకొనుచుండగా వారి పలుకులను బ్రహ్మ విన్నాడు. వెంటనే జ్రాగ్రత్త కలిగింది. తన జన్మకు మరియు సృష్టికి కారణమైన పరమేశ్వరుని ఎఱుక కలిగింది. తనపొరబాటునకు వగచి ఇట్లనుకొన్నాడు. "ఆహా! ఏమివింత! పరమేశ్వరుని సంకల్పము వలన మేము పుట్టాము. ఆయన కరుణచేతనే ఈవిశ్వాన్ని సృష్టించి రక్షిస్తున్నాము. ఇదంతా పరమేశ్వరుని లీలావిలాసమనీ, ఆయనే సమస్తానికి ఆధారమని మరచి అహంకారముతో ఏకమై మేమే కర్తలమన్నట్లు భావించి పోట్లాడుకొన్నాము. మా అహంకారమును పోగొట్టి పరమాత్మసమ్మతమైన విధేయతను కలింగించుటకే ఈశ్వరుడు జ్యోతిస్తంభముగా మాయేదుట నిలిచాడు. నిజంగా మా జన్మలు ధన్యమయ్యాయి" అని గ్రహించి బ్రహ్మ వేదమంత్రాలతో పరమశివున్ని స్తుతించాడు. తరువాత ఆత్మనిష్ఠతో పరమేశ్వరుని శరణంది ఆయన కరుణకు పాత్రుడై తిరిగి భూకేంద్రాన్ని చేరుకొన్నాడు.


ఇదంతా స్కాందపురాణ పూర్వభాగమందు వివరింపబడెను. నందికేశ్వరుడు లింగపురాణములో మాత్రము బ్రహ్మ ప్రయత్నమును గూర్చి కొంచెము విభిన్నంగా వివరించాడు. అదేమనగా :- బ్రహ్మ తేజస్సంభపు అంతమును కనుగొనలేక నీరసించి పోయాడు. ఇంతలో గగనతలము నుండి వస్తున్న మొగలిరేకు మరియు కపిలగోవు బ్రహ్మకు కనిపించాయి. వారిని చూచి బ్రహ్మ, “మీరెవరు? ఎక్కడనుండి వస్తున్నారు?" అని ప్రశ్నించెను. నేను మొగలిపూవును సుగంధ సంభరితమైన దానిని. ఇదేమో గోవు. మేమిరువురము శివుని ఆజ్ఞానుసారము చాలా కాలము నుండి శివస్వరూపమైన తేజస్తంభము తలమీద వుండేవారము. ప్రపంచాన్ని చూడాలని ఆశపడి అటనుండి క్రిందకు వస్తున్నాము.." అని కేతకి సమాధాన మిచ్చెను. “ఐతే, ఈ స్తంభపు అంతము ఇచ్చటకు ఎంత దూరమున వుండును." అని బ్రహ్మ అడిగెను. అంత మొగలి వూవు నవ్వి, "నీవెవరవు? ఏమీ తెలియనట్లున్నావు. ఈ శివస్వరూపానికి ఆదిగాని, అంతముగాని లేదు. బ్రహాండములన్నీ ఇందులో వున్నాయి. దీని స్వరూపము అనంతము. లెక్కింప సాధ్యము కాదు. మేము క్రిందకు బయలు దేరి ఇప్పటికి కొన్నివేల చాతుర్యుగాలు గడచి పోయాయి. కానీ భూకేంద్రాన్ని చేరలేకున్నాము” అనెను. అంత బ్రహ్మసంతోషించి వారికి నమస్కరించి ఇట్లనెను. “ఓదివ్య స్వరూపులారా! నేను బ్రహ్మను. సృష్టికర్తను. అహంకారముతో విష్ణువునకు, నాకు తగవు ఏర్పడింది. అందుచే పరమేశ్వరుని మహిమను మరచిపోయాము. మా బలాలాలను నిరూపించుకొనుటకు ఈ తేజస్తంభము యొక్క ఆద్యంతములను కనుగొనుటకు పూనుకొన్నాము. విష్ణువైతే వరాహరూపము ధరించాడు. నేను హంసరూపం ధరించాను. విష్ణువు సంగతి ఏమియోగాని, నేను మాత్రం తేజస్సంభపు అంతమును కనుగొనుటకు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ప్రయాణము సాగిస్తున్నాను. ఫలితము శూన్యము. శక్తి పూర్తిగా చచ్చిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితిలో మీతో కలవడం సంభవించింది. నేను నిస్సహాయుడను. నాకు దిక్కెవరూ లేరు. మీరే నాకు రక్ష. నాకోరికను మన్నించండి. విష్ణువు స్తంభపు అంతమును కనుగొనెనా నేను ఓడిపోవుదును. కనుగొనలేక పోయెనా మేమిద్దరమూ సమాన మగుదుము. ఈరెండూ నాకు ఇష్టము కాదు. అందుచేత మీరిద్దరూ నాకు సాయం చేయాలి. మీరు శివుని శిరముపై వుండేవారు కదా! ఈ తేస్తంభపు శిఖరమును నేను చూచినట్లుగా మీరు సాక్ష్యమివ్వండి దాని చేత నేను విష్ణువు కంటే అధికుడనగుదును” అని వారిని ప్రార్ధించి సమ్మతింపజేసెను.


బ్రహ్మదేవుడు వారితో కలసి వెనుదిరిగి వచ్చెను. విష్ణువు జ్యోతిస్సంభవు ఆదిని కనలేక పోయానని తన ఓటమిని అంగీకరించెను. ఐతే బ్రహ్మ మాత్రము తాను అంతమును చూడగలిగితినని అసత్యము పల్కెను. అందుకు మొగలిపూవు ఔను అని మరియు కపిల నోటితో ఔనంచూ తోకెత్తి కాదని అడ్డముగా కదల్చినది. అప్పుడు సదాశివుడు జ్యోతిస్సంభము నుండి ప్రత్యక్షమై అసత్యము పల్కినందులకు నీకు పూజలుండవని బ్రహ్మను శాసించెను. నా పూజకు పనికి రావని మొగలి పూవును నిరసించెను. గోవు అబద్దమాడినందులకు పూర్వభాగము అపావనమని మరియు మొదటి పూజకు అనర్హమనీ, ఐతే సత్యమును సూచించిన వెనుక భాగము పూజార్హమని, అందలి యోని సంచితము. గోమయము పావనులని కరుణించి వల్కెను. విష్ణువు యొక్క సత్యవాక్కునకు మెచ్చి పరమశివుడు తన సుదర్శన చక్రమును విష్ణువునకు బహూకరించెను ఇక బ్రహ్మవిష్ణువులు ఇరువురు శివపరమాత్మకు శణాగతులైరి.


ఇప్పుడు బ్రహ్మవిష్ణువులు ఇద్దరూ కలసి పరమశివున్ని ఈవిధంగా ప్రార్ధించారు. “ఓ తేజోమూర్తి! పరమశివా! భూమ్యాకాశములు మరియు పాతాళములందు అనంతంగా వ్యాపించే తమ తోజోరాశిని మేము చూడలేము. కావున దయచేసి తమ తేజోమయశక్తిని భూమిపైకి మరల్చి పరిమితము చేయండి” అని ప్రార్ధింపగా దయామయుడు భక్తసులభుడైన సదాశివుడు వారి ప్రార్ధనను మన్నించి అపరిమితమైన తన తేజోకాంతిని వెనుకకు మరల్చి పరిమితమైన తేజస్తంభముగా భూమిమీద అవతరించాడు.


మార్గశిరమాసంలో (డిశెంబరు-జనవరి) ఆరుద్ర నక్షత్రమునాడు పరమేశ్వరుడు ఆజ్యోతిస్త్సంభముగా ధరలో వెలశాడు, బ్రహ్మవిష్ణువులు సర్వదేవతలు, సిద్ధులు, మునీశ్వరులు మున్నగువారందరు ఆకాంతిసంభాన్ని వేదోచితంగా ప్రస్తుతించారు. వైభవంగా పూజలు చేశారు. వారి పూజలను మన్నించి పరమశివుడు మాఘమాసంలో (ఫిబ్రవరి-మార్చి) చతుర్దశినాడు (పున్నము పోయిన తరువాత 14వ దినము) అందుండి వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆరూపము చాలా మనోహరమైనది. ప్రకాశవంతమైన తెల్లని శరీరచ్ఛాయ, జడలు మరియు రుద్రాక్షమాలలను ధరించి, ఫాలమందు మూడు విభూతి రేఖలు మరియు వాటి మీద సుగంధ పరిమళమైన కస్తూరికా బొట్టు, మెడలో సత్త్వసంపన్నమైన సర్పాభరణము, ఒక చేతిలో త్రిశూల ఢమరకాలు, దుష్టశిక్షణ మరియు శిష్టరక్షణను సూచించే అభయహస్తం, సిగలో నెలవంక మరియు పలుచని వస్త్రమును ధరించి మురిపాల ముక్కంటి వారికి దర్శనమిచ్చాడు. వరములు కోరుకోమన్నాడు. అప్పుడు బ్రహ్మవిష్ణువులు పరమశివున్ని ఈ విధంగా ప్రార్ధించారు “ఓ ప్రభు! సర్వవ్యాపకా! పరమేశ్వరా! ఈ తేజస్తంభము యొక్క ప్రకాశము అమితమైనది. ఈదివ్యతేజోకాంతిని లోకాలు చూడలేవు. ఈతేజస్సును చూడటానికి భౌతిక నేత్రాలు పనికి రావు. అందుచే ఓవిశ్వరూపా! పరమశిమా! మమ్ము కరుణించి లోక కళ్యాణము కోసము ఈకాంతికి మారుగా మనోహరమైన లింగాకృతి గల కదలని కొండగా “అరుణాచలము” అనే పవిత్రమైన పేరుతో ఈ భూమి మీద అవతరించండి. మీనన్నిధి మాత్రాననే అందరి భవరోగాలను తొలగించండి. కోరికలను తీర్చండి. సుఖాలనివ్వండి. కావలసిన వారికి మోక్షాన్ని ప్రసాదించండి" అని. అంత శివపరమాత్మ ప్రసన్నుడై వారి కోరికలను మన్నించి తన తేజస్తంభాన్ని అరుణాచలంగా మార్చుకొని ఈభూమి యందు ప్రాదుర్భవించాడు.


ఇక పరమేశ్వరుడు ప్రేమతో బ్రహ్మవిష్ణువులను చూచి, “ఓ కుమారులారా! మీకోసము నాచే అనుగ్రహించబడిన ఈ అరుణాచలము కడుపవిత్రమైనది. ఇది తేజోవంతమైన స్వయంభూనగము. మోక్షాన్ని ప్రసాదిస్తుంది. "అరుణాచలము" అని స్మరిస్తే చాలు సమస్త పాపాలు సమసిపోగలవు. ఈనా అరుణాచల నివాసం చేత ఈస్థలము పవిత్రపుణ్యక్షేత్రమౌతుంది. ఈక్షేత్రము చుట్టూ మూడు యోజనాల దూరమున (48 కి.మీ) నివసించే వారందరూ ఎట్టి సాధనగానీ, ఆచార వ్యవహారములుగానీ లేకయే తరించగలరు. సులభంగా నాలో ఒకరై పోగలరు. స్థావరజంగమాలు అనగా కదిలేవి మరియు కదలనివి అన్నీకూడా ఇక్కడున్నంత మాత్రముననే ముక్తిని పొందగలవు. దూరము నుండియే నన్ను చూచేవారు లేదా తలంచేవారు నమస్త వేదాంతసారమును సులభంగా తెలుసుకోగలరు. నాతేజోవంతమైన కాంతి ఈ అరుణాచల మందు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ, అనుగ్రహిస్తూ ఉంటుంది అరుణాచాలాన్ని నీరు ముంచలేదు. అగ్ని కాల్చలేదు. దేవతా శరీరాలన్నీ ఈ తేజోపర్వతము చుట్టు ఎల్లప్పుడు తిరుగుతూ వుంటాయి. దూరము నుండియో లేక దగ్గర నుండియో తలవంచి నమస్కరిస్కే చాలు ముక్తిని పొందగలరు. అన్నిటికంటే “గిరిప్రదక్షిణ” నాకు చాలా ఇష్టము. గిరిప్రదక్షిణ చేస్తే చాలు సుఖశాంతులు లభిస్తాయి.” అని అభియమిచ్చాడు.


బ్రహ్మవిష్ణువులు పరమశివుని పలుకులు విని సంతోషించి నమ్రతతో ఆయనకు తలవంచి నమస్కరించి మరలా ఇట్లు విన్నవించుకొన్నారు. 'ఓ లోకనాధా! పరంధామా! పరమేశ్వరా! భూలోకవాసులు క్షేమము కోసము ప్రతి సంవత్సరము కార్తీక మాసంలోకృత్తికా నక్షత్రము ప్రధానముగా గల పౌర్ణమి నాటి సంధ్యాసమయమున ఈ పర్వతము నుండి తేజోవంతమైన దీపంగా దర్శనమివ్వండి. ఆజ్యోతిని చూచిన వారిని ధన్యలను చేయండి". అంత పరమశివుడు వారి కోర్కెల మన్నించి, "అట్లేకానిమ్ము” అని అభయమిచ్చాడు.


అందుకు బ్రహ్మవిష్ణువులు సంతోషించి మరలా ఇట్లు విన్నవించుకున్నారు. “ఓ ప్రణవస్వరూపా! మహేశ్వరా! ఇంత పెద్దదైన అరుణాచలాన్ని సాధారణ మానవులు ఏ విధంగా పూజించగలరు? ప్రకృతి మరియు దేవతలైతే పూజించగలరు. వరుణుడు మేఘాల రూపములో వచ్చి నిన్ను అభిషేకించగలడు. నీ కొండచరియల్లో ఉండే వృక్షాలైతే సుగంధ పరిమళ పుష్పాలతో నిన్న అర్చించగలవు. సూర్య చంద్రులు దీపారాధన మరియు హారతులతో నిన్ను పూజించగలరు. మందమారుత పవనాలు వింజామరులుగా నీకు వీచి ఉపచారములు చేయగలవు. ఇదంతా సాధారణ మానవులకు సాధ్యమా! అందుచేత ఓ ప్రభూ! పరమేశ్వరా ఈ అరుణాచలానికి తూర్పున వేద సమ్మతంగా నిన్ను మంత్రాలతో అభిషేకించి పూజించడానికి తేజోలింగముగా అవతరించండి. ఆ శివలింగానికి మేము చేసే పూజలు గైకొని మమ్ము ధన్యులను చేయండి. మమ్మేకాదు. మిమ్ములను పూజించే వారినందరినీ కరుణించి అభీప్సితములను తీర్చండి." బ్రహ్మవిష్ణువుల అభిమతాన్ని పరమశివుడు మన్నించాడు. తననుండి మంగళప్రదమైన శివలింగాన్ని కల్పించాడు. బ్రహ్మాది దేవతలకు, మునులకు, గంధర్వులకు, విశ్వకర్మ మున్నగు వారలకు పూజావిధానాన్ని మరియు ఆలయ నిర్మాణాన్ని వివరించాడు. దేవతలందరూ దేవతా శిల్పియైన విశ్వకర్మచే ఆ స్వయంభూతేజోలింగానికి ఆయలాన్ని కట్టించారు. పరమేశ్వరుడ చెప్పిన ప్రకారము బ్రహ్మవిష్ణువులు, అష్టదిక్పాలురు, దేవతలు, సిద్ధపురుషులు, మునీశ్వరులు మున్నగు మహితాత్ములందరూ ఆతేజోలింగాన్ని పూజించారు. ఇదంతా జరిగిన పిదప పరమేశ్వరుడు సంతసించి మానవరూపధారియై కౌపీనమును ధరించి అరుణగిరియోగిగా ఒక మఱివృక్షము క్రింద ఆశీనుడై ధ్యాన నిష్ఠలో ఉండుటకు అరుణాచలమునకు వెళ్ళిపోయాడు.


ఈ విధంగా సర్వవ్యాపకుడు, తేజోస్వరూపుడైన పరమేశ్వరుడు భక్తులు మనసారా పూజించుటకు, అభిషేకించుటకు, ఆరాధించుటకు మరియు వారి పూజలను గైకొని ఆనందించుటకు అరుణాచలముగాను, జ్యోతిర్లింగముగాను, అరుణగిరియోగిగాను భూమిపై అవతరించాడు. ఇదే అరుణాచలుని అద్వితీయమైన ఆవిర్భావము. ఇదంతా మన ప్రసిద్ధ పురాణాలైన సూతసంహిత, స్కాందపురాణము, అరుణాచలపురాణము, లింగపురాణము మున్నగు ప్రసిద్ధ శివపురాణాలన్నీ మనోహరంగా వర్ణించి వివరించాయి.


ఏదిఏమైనా పరమేశ్వరుని అవతారమే ఈ అరుణాచలమని శివపురాణాలన్నీ చెబుతున్నాయి. అంతేకాదు చాలామంది సాధువులు, కవులు తేజస్తంభము యొక్క ఆధ్యంతములను కనుగొనుటకు బ్రహ్మవిష్ణువులు ప్రయత్నించిన విధమును మనోహరంగా తమ కవితల్లో నుతించారు, పాడారు. అందుచే అరుణాచల ప్రాదుర్భావము కల్పితమని ఊహించుటకు వీలుకాదు. ఇది సర్వులూనమ్మదగిన విషయము. సత్యమైన సంఘటన.


అందుచేత ఈ సృష్టిలో అరుణాచలముతో సమానమైనది మరేదియునూ లేదు. ఈ లోకములో ఎందరో జ్ఞానులు, అవధూతలు, సిద్ధపురుషులు ఉండవచ్చు. కానీ వారు ఆయనతో సమానమని చెప్పవీలులేదు. అట్లు చెప్పడము శుద్ధతప్పు. అరుణాచలునితో సమానమని తలంచడమే గొప్ప అజ్ఞానము. ఆయన నిరంతరము ప్రకాశించే అవధులులేని జ్యోతిస్తంభము. అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహత్తర జ్యోతి స్వరూపమే ఈ అరుణాచలము. అరుణాచల శివ, ...🙏 🕉️🪷

పంచభూతలు

 మనలో పంచభూతలు(1). భూమి మాంసము తో కూడిన కండరాలు ఎముకలు, చర్మం మొదలైన ఘనపదార్థాలు , (2).నీరు రక్తము లాలాజలం మొదలైన ద్రవ పదార్థాలు,(3)గాలి ఊపిరితిత్తుల్లో లోని గాలి, త్రేన్పులు మొదలైన గాలి పదార్థాలు, (4). అగ్ని మన శరీర సాధారణ ఉష్ణోగ్రత 98.6F,జటరాగ్ని మొదలైన అగ్ని స్వభావం,(5).ఆకాశం కడుపు , చెవి మొదలైన వాటిలో ఖాళీ మన శరీరంలో "నేను "అనే భావం ఎక్కడ పుడుతుంది అదియే జీవుడు ఈ జీవుడు దేవుడిని కనుగొనాలి అంటే నేను (తాను )ఎవరో తెలుసుకోవాలి? అని అంటారు పెద్దలు. గుండె కొట్టుకోవడం మనం పుట్టకముందు తల్లి గర్భంలో నుంచి మొదలై మరణించేంతవరకు ఎలా పనిచేస్తూ ఉంది? మనం ఊపిరిని వదులుతూ తీసుకుంటూ ఏ శక్తితో( ఆత్మ) జీవించి ఉన్నాము? ఓం నమఃశివాయ 🙏🙏🙏మహాశివరాత్రి శుభాకాంక్షలు 💐💐💐

నమశ్శివాయ.. సాంబాయ..*

 


*నమశ్శివాయ.. సాంబాయ..*

            *శాంతాయ.. పరమాత్మనే.*

                  ➖➖➖✍️


*సాంబా... అని పిలిస్తే చాలు... శివుడు వెంటనే కరిగిపోతాడు.* 


*మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి శివదీక్ష ఇస్తూ...*


*”నమశ్శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే...*

*య ఇదం కీర్తయేన్నిత్యం* *శివసాయుజ్యమాప్నుయాత్”* 


*అనే మంత్రాన్ని ఉపదేశించారు.*


*ఇది శివపురాణంలో కూడా వస్తుంది.*


*ఇది చాలా గొప్ప మంత్రం.* 


*నమశ్శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే.*


*నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది.*



*1). నమశ్శివాయ...*


*(శివాయనమః) మహాపంచాక్షరీ మంత్రం.*

*శివభక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి.*


*అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయవాలతో కూడిన ఓంకారం సూక్ష్మప్రణవం.. న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాల శివమంత్రం స్ధూలప్రణవం. పంచాక్షరీని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధం.*



*2). సాంబాయ...*


*అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవి అన్ని సమృద్ధిగా పొందవచ్చును.*


*3). శాంతాయ...*


*ఆయనని తలంచుకొంటే వచ్చేది శాంతం.*

*జీవితానికి కావలసింది కూడా శాంతమే.*

*"ప్రపంచోప శమం శాంతం అద్వైతం మన్యంతే"*

*అని ఉపనిషత్తు చెప్పింది. అలజడులు అన్నీ అణగిన తరువాత వచ్చే శాంతం అది.*


*4). పరమాత్మనే నమః...*


*చిట్ట చివరికి పొందవలసినది పరమాత్మ తత్త్వమే... అన్నిటిని కలిపి నాలుగు నామాలతో పొదిగిన మంత్రరాజం ఈ శ్లోకం..!*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సోమవారం శివపూజ …* *శివానుగ్రహం*

  


           *సోమవారం శివపూజ …*

                  *శివానుగ్రహం*

                   ➖➖➖✍️


*శివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం, శివానుగ్రహానికి నెలవైందని సంప్రదాయం చెబుతోంది..!*


*రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది, సాధుస్వభావులను కాపాడుతుంది, శివార్చనలో శివలింగం ప్రధానం, లింగం శివుడికి ప్రతిరూపం, శివుడు అభిషేక ప్రియుడు, అందుకే నెత్తిమీద గంగను ధరించి గంగాధరుడయ్యాడు... పంచభూతాల్లో భక్తుడు శివుణ్ని దర్శిస్తాడు...*


*మట్టితో శివలింగాన్ని రూపొందించుకొని స్వయంభూలింగంగా భావించి పూజిస్తారు...*


*జలబిందువుల రూపంలో లింగాలెన్నో , జ్వలిస్తున్న విస్ఫులింగం భక్తుడికి శివలింగంలా కనిపిస్తుంది, అందుకే అగ్నికి నమస్కరిస్తాడు, ఆకాశం అంతా శివలింగ రూపమే.*


*శబ్దం ఆకాశానికి ప్రాణం, శబ్దంలోనే కదా నటరాజు ధ్వనించేది! డమరుక నాదంలో వినిపించే మాహేశ్వర సూత్రాలన్నీ శివస్వరూపాలే...*


*శివపూజకు ఏ ఆడంబరాలూ అవసరం లేదు... ప్రకృతి నుంచి లభించే పత్రి, పుష్పం, పండు, నీళ్లు... ఇవే శివుడికి ప్రీతిదాయకాలు.*


*‘హరహరా’ అంటూ నీటితో అభిషేకిస్తే చాలు, ఎంతో తృప్తిచెంది పాపాలను హరిస్తాడు...*


*బిల్వదళాలనే పట్టువస్త్రాలుగా భావిస్తాడు, పువ్వులను అలంకరిస్తే చాలు, మనసును ఇచ్చినంతగా సంతోషపడతాడు...*


*ఒక్క పండు ఇస్తే జీవితాన్నే సఫలం చేస్తాడు, అందుకే అతణ్ని బోళాశంకరుడంటారు...*


*రుద్రాభిషేకాలు పుణ్యదాయకాలు, యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలో ఈ ప్రపంచం అంతా రుద్ర గణాలతో నిండి ఉందనే వర్ణనలున్నాయి...*


*ఆ రుద్రగణాలన్నింటికీ అధిపతి శివుడు, అందుకే అతడు రుద్రుడు...*


*రుద్రాధ్యాయంలో రెండు భాగాలున్నాయి, ఒకటి నమకం. రెండోది చమకం...*


*‘నమః’ అనే పదంతో రుద్రుణ్ని స్తుతించేది కనుక ఇది నమకం...* 


*‘చ’ కారంతో శివుడి విశ్వరూపాన్ని స్తుతించిన భాగం కనుక అది చమకం.*

 

*ఒక్కొక్క భాగంలో పదకొండు అనువాకాలు (మంత్ర సముదాయాలు) ఉంటాయి...*

*అందుకే ఏకాదశరుద్రులు అనే ప్రసిద్ధి, శివుడి పూజలో పదకొండు సంఖ్య ఎంతో విశిష్టం...*


*శివుడి పూజకు నిర్మలమైన మనసు ఉంటే చాలు, మానసపూజకే శివుడు ప్రసన్నుడవుతాడు. మనసు ఏర్పడాలంటే భక్తి ఉండాలి, భక్తి అంటే మానసికంగా దగ్గర కావడమే..*


*శివుణ్ని పూజిస్తున్నంతసేపూ శివసంకీర్తనంతో ‘సారూప్యముక్తి’ లభిస్తుంది.*


*శివభక్తులు చేసే పూజల్లో పాల్గొంటూ వాళ్లతో సంభాషిస్తుంటే ‘సామీప్యముక్తి’ వస్తుంది...*


*శివస్వరూపం అయిన ఈ చరాచరప్రకృతిలో జీవిస్తున్నందువల్ల మనిషికి ‘సాలోక్యముక్తి’ సాధ్యం.*


*శివుణ్ని వీడకుండా ఉండే మనసు వల్ల ‘సాయుజ్యముక్తి’ సంప్రాప్తించినట్లే...!*


*మనిషి మోహం అనే అడవిలో దారీతెన్నూ తెలియక తిరుగుతుంటాడు. అతణ్ని బాల్యంలో, కౌమారంలో, యౌవనంలో, వార్ధక్యంలో వ్యామోహాలు వెంటాడుతుంటాయి.*


*వాటినుంచి తప్పించుకోవడం అతడికి అంత సులభం కాదు, శివతత్త్వాన్ని చక్కగా తెలుసుకుంటే మోహం తొలగిపోతుంది, యథార్థం తెలుస్తుంది...*


*సోమవారం చంద్రుడికి నెలవు...!!!* 

*కనుక ప్రతీ సోమవారం చంద్రకళాధరుడి పూజ ఐహికాముష్మిక ఫలదాయకం...*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*653 వ రోజు*

గౌతముడు ఇంద్రుడిని గుర్తించుట

గౌతముడు " మహాత్మా ! మీరు సామాన్యులు కారు సాక్షాత్తు దేవేంద్రులు. లేని ఎడల సకల లోకముల గురించి తెలియడం ఎలా సాధ్యం. దేవేంద్రా ! నీవు అన్ని లోకములు తిరుగుతుంటావు కదా ! నీవు పోకూడని లోకము ఏది ? " అని అడిగాడు. ఆ మాటలకు దేవేంద్రుడు సంతోషించి " మహాత్మా నీకు ఏమి కావాలో కోరుకో " అని అడిగాడు. గౌతముడు " దేవేంద్రా ! నేను ఈ ఏనుగును బిడ్డలా పెంచుకున్నాను దీనిని నా వద్ద ఉండనివ్వు " అని వేడుకున్నాడు. ఇంద్రుడు " గౌతమా ! నాకు ఆ మాత్రము తెలియదా ! ఆ ఏనుగు చూడు ప్రేమతో నీ తల మీద తన తొండముతో తడుముతూ వాసన చూస్తుంది. నిన్ను నీ బిడ్డను ఎలా వేరు చెయ్యగలను. మారు వేషములో ఉన్న నన్ను దేవతలు సహితం గుర్తుపట్ట లేరు. నీవు నీ పుణ్యవశమున నన్ను గుర్తు పట్టగలిగావు. నీకు నీ ఏనుగుకూ స్వర్గలోకప్రాప్తి కలిగిస్తాను నీవు నీ ఏనుగుతూ స్వర్గలోకములో శాశ్వతంగా ఉండండి " అని స్వర్గలోకానికి ఆహ్వానించాడు. గౌతముడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ఏనుగుతో స్వర్గలోకముకు వెళ్ళాడు " ఇదీ స్వర్గలోకము కథ అని భీష్ముడు చెప్పాడు.

తపోధర్మము

ధర్మరాజు " పితామహా ! మీరు తపోధర్మము గురించి చెప్పారు కదా ! తపోధర్మము కంటే మించిన ధర్మము మరొకటి లేదా " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ధర్మములన్నీ మంచివే అందులో తపోధర్మము మిక్కిలి శ్రేష్టము. తపస్సు అనగా ముఖ్యముగా మితంగా భుజించడం. ఒక సారి భాగీరధుడు బ్రహ్మసభకు వేళ్ళాడు. భాగీరధుడిని చూసిన బ్రహ్మ " నిర్మల తపస్సు చేస్తే కాని ఇక్కడకు రావడం సాధ్యము కాదు. ఎలాంటి తపస్సు చేయని నీవు ఎలా ఇక్కడకు వచ్చావు " అని అడిగాడు. భాగీరధుడు " బ్రహ్మదేవా ! నేను గోదానములు, భూదానములు, కన్యాదానము, రాజసూయయాగములు, అశ్వమేధయాగములు ఎన్నో చేసాను. కాని నేను అవి చేసినంత మాత్రాన ఇక్కడకు రాలేదు. ఒకసారి బ్రాహ్మణులు అంతా చేరి ఒక చోట యజ్ఞము చేస్తున్నారు. అప్పుడు వారి యజ్ఞానికి ఎన్నో అవరోధాలు కలిగాయి. నేను ఆ అవరోధాలు తొలగించి వారి యజ్ఞం సక్రమంగా జరిగేలా చూసాను. అందుకు వారు నన్ను " బ్రహ్మలోక ప్రాప్తి రస్తు " అని దీవించారు. అందుకని నేను బ్రహ్మలోకానికి వచ్చాను. నేను ఆకలిదప్పులు మాని బ్రాహ్మణులకు సేవ చేసాను. అందుకు మించిన తపస్సు ఏదైనా ఉందా " అని అన్నాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు భగీరధుడిని ఎంతో ఆదరించాడు. ధర్మనందనా ! నీవు కూడా బ్రాహ్మణులను భక్తితో సేవింపుము " అని అన్నాడు భీష్ముడు.

ఆశీర్వాదము ఆయుస్షు

ధర్మరాజు " పితామహా ! శ్తాయుష్మాన్భవ అనేది వేద వాక్కు కదా ! అయినా చాలామంది అల్పాస్కులుగా మరణించాడానికి కారణం ఏమిటి ? ఆయుస్షు వృద్ధి చెందడానికి కారణం ఏమిటి ఆయుస్షు క్షీణించడానికి కారణం ఏమిటి ? " అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా ! సదాచారము, నియమబద్ధ జీవితము ఆయుస్షును పెంచి వాడికి సంపదలు, కీర్తి కలిగిస్తుంది. దురాచారము, నియము లేని జీవితము ఆయువును క్షీణింపజేస్తుంది. సృష్టిలోని సమస్త భూతములు వాడిని తిరస్కరిస్తాయి. కనుక సదాచారము నియమబద్ధంగా జీవించుట మంచిది. ఉత్తములు నడచుమార్గమున నడిచిన నియమబద్ధ జీవితము అలవడుతుంది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ మురుగన్ ఆలయం

  🕉 మన గుడి : నెం 1390


⚜  తమిళనాడు : మైలం


⚜  శ్రీ మురుగన్ ఆలయం 



💠 మైలం అనేది తిండివనం సమీపంలోని ఒక గ్రామం మరియు ఇది మైలం మురుగన్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది.


💠 మైలం మురుగన్ ఆలయం ఒక చిన్న కొండపై ఉంది. ఈ కొండ నెమలి ఆకారంలో విశాలమైన ఈకలతో కనిపిస్తుంది. 

అందుకే ఈ ప్రదేశాన్ని మయూరాచలం అని కూడా పిలుస్తారు. 


🔆 స్థల పురాణం 


💠 అరుపదై వీడు ఆలయాలలో ఒకటి కాకపోయినా , మైలం మురుగన్ ఆలయంగా బాగా ప్రాచుర్యం పొందింది. 

అయితే, ఈ ఆలయం గురించి ఆసక్తికరమైన విషయం ఇది నిజానికి శివాలయం , విశ్వనాథర్ మరియు విశాలాక్షి ప్రధాన దేవతలు.


💠 అసురుడైన శూరపద్ముడు వివిధ తపస్సులు చేసి శివుడి నుండి వరం పొందాడు, అది అతనికి చాలా శక్తివంతం చేసింది. 

ఫలితంగా, అతను మూడు లోకాలను స్వాధీనం చేసుకున్నాడు మరియు దేవతలు, ఋషులు సహా అందరినీ హింసించడం చేయడం ప్రారంభించాడు.


💠 వారు శివుడి వద్దకు వెళ్లి తమను రక్షించమని వేడుకున్నారు. 

ఒకసారి ఇచ్చిన వరం తిరిగి తీసుకోలేము, కాబట్టి శివుడు తన మూడవ కన్ను నుండి 6 శక్తివంతమైన నిప్పురవ్వలను సృష్టించాడు, వాటిని 6 గురు కృత్తికలు మోసుకెళ్ళి కార్తికేయుడు (సుబ్రహ్మణ్యుడు, మురుగన్ పేర్లు) అయ్యాడు. 


💠 తమిళ నెల కార్తీకై ఆరవ రోజు (షష్టి) మురుగన్ సూరపద్మను ఓడించాడు. 

ఇది తిరుచెందూర్‌లో జరిగిన సంఘటన. 

ప్రతి సంవత్సరం, ఈ రోజు (కంద షష్టి /శూర సంహారంగా జరుపుకుంటారు)


💠 మురుగన్ విసిరిన ఆయుధం ఈత చెట్టు రూపంలో ఉన్న సూరపద్ముడిని రెండుగా చీల్చింది. 

ఆ సమయంలో, సూరపద్ముడు తన తప్పులను గ్రహించి, తనను క్షమించమని మురుగన్‌ను వేడుకున్నాడు, తనతో ఎప్పటికీ ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. 


💠 ఆ రాక్షసుడు తన మరణం తర్వాత తనకు మోక్షం ఇవ్వమని శ్రీ సుబ్రహ్మణ్యుడిని ప్రార్థించాడు. అసురుడిని నెమలి రూపాన్ని ధరించి తపస్సు చేయమని కోరాడు.


💠 సుర పద్మం నెమలి రూపాన్ని ధరించి ఈ కొండ వద్ద తపస్సు చేశాడు. అందుకే ఈ ప్రదేశం మయిల మలై అని పిలువబడింది, తరువాత ఇది మైలం అయింది. 


💠 భగవాన్ మురుగన్ నెమలి తపస్సుకు సంతోషించి దానిని తన వాహనంగా స్వీకరించాడు.

కాబట్టి మురుగన్ మైలం వెళ్లి తన కోసం వేచి ఉండమని కోరాడు. సూరపద్మన్ ఇక్కడ కొంత సమయం గడిపిన తర్వాత, అతనిలో ఒక సగం మురుగన్ వాహనం (నెమలి) అయింది మరియు మిగిలిన సగం కోడి (మురుగన్ జెండాపై ఉన్న చిహ్నం) అయింది. 


💠 శివుని గణాలలో ఒకరైన సంకకన్నన్ పార్వతిని కాపాడే తన విధిని నిర్వర్తించడంలో విఫలమయ్యాడు, అందుకే శివుడు భూమిపై జన్మించమని శపించాడు . ఫలితంగా, అతను బొమ్మపాళయం గ్రామంలో బాలసిద్ధుడిగా జన్మించాడు.


💠 అతను పెద్దయ్యాక, మురుగన్ మరియు శూరపద్మ కథను విన్నాడు, మురుగన్ మాత్రమే తనను శాపం నుండి విముక్తి చేయగలడని నిర్ణయించుకున్నాడు మరియు తదనుగుణంగా మురుగన్ పూజించడం ప్రారంభించాడు. 

కానీ అతని తండ్రి శివుడు శాపం కారణంగా, మురుగన్ బాలసిద్ధుడికి ఉపశమనం కలిగించడానికి నిరాకరించాడు.


💠 అతని మొండితనం అతని భార్య అతన్ని విడిచిపెట్టి బాలసిద్ధ ఆశ్రమంలో ఆశ్రయం పొందేలా చేసింది. 

మురుగన్ వేటగాడిగా ఆశ్రమంలోకి ప్రవేశించాడు, కానీ బాలసిద్ధుడు వెంటనే అతనిని గుర్తించి అతని పాదాలపై పడ్డాడు. 

సంతోషించిన మురుగన్ అతన్ని శాపం నుండి విముక్తి చేశాడు, మరియు వల్లి మరియు దేవసేన కూడా అతని వద్దకు తిరిగి వచ్చారు. ఈ ఆలయంలో మురుగన్ తన భార్యలతో కళ్యాణ కోలంలో కనిపిస్తాడు. 

ఈ చెరువు ఆలయాన్ని బాలసిద్ధర్ అగ్నితీర్థం అంటారు.


💠 శ్రీ మురుగన్ పక్కన శ్రీ వల్లి మరియు శ్రీ దేవయాని ఇరువైపులా ఉన్నారు. 

ఆయన ఒక చేతిలో ఈటె, మరొక చేతిలో కోడి చెక్కబడిన జెండాను కలిగి ఉన్నారు.


💠 ఉదయం పూజ సమయంలో శ్రీ మురుగన్ ను నోచి ఆకులతో చేసిన దండతో అలంకరిస్తారు. 

ఆ తర్వాతే పూల దండలు వేస్తారు. 


💠 శ్రీ మురుగన్ గర్భగుడి వెలుపల, ఆయన పవిత్ర ఈటె (వేల్) మరియు ఆయన వాహన నెమలి యొక్క భారీ విగ్రహాలు ఉన్నాయి.


💠 ప్రతి మంగళవారం, కాళ సంధి పూజ సమయంలో, ఈ వేల్ విగ్రహానికి ప్రత్యేక అర్చన చేస్తారు. ఈ పూజలో పాల్గొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు.


💠 శ్రీ మురుగ ఉర్చవమూర్తి దగ్గర, శ్రీ వీర భగవానుడి విగ్రహం ఉంచబడింది. 

శ్రీ వీర భగవానుడు మురుగకు సహాయం చేయడానికి శివుడు సృష్టించిన యోధుడు. 


💠 ప్రతి మంగళవారం, శ్రీ వీర భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. 

ఈ పూజలో పాల్గొనడం వల్ల వివాహ సంబంధాలు ఫలిస్తాయని నమ్ముతారు.


💠 శ్రీ మురుగన్ ఉదయం వెండి కవచంతో, సాయంత్రం బంగారు కవచంతో దర్శనమిస్తాడు.


💠 పంగుని ఉత్సవం పండుగను ఆలయంలో ఘనంగా జరుపుకుంటారు. 

అన్ని షష్టి రోజులు, మంగళవారాలు ఇక్కడ ప్రత్యేక రోజులు. ఇంకా, థాయ్ పూసం, వైకాసి విశాకం మరియు కార్తీక మాసంలోని అన్ని రోజులు ఈ ఆలయంలో ఘనంగా జరుపుకుంటారు.



💠 పాండిచ్చేరి మైలం నుండి 30 కిలోమీటర్ల దూరం


రచన

©️ Santosh Kumar

ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి

 ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి - ఎరుపు రంగు తిలకమే ఎందుకు.............!!

అతివలను చూడగానే చంద్రబింబం వంటి ముఖంలో ముందుగా కనిపించేది బొట్టు. ముఖ సౌందర్యాన్ని పెంచే బొట్టులో.. చాలా ప్రత్యేకతలున్నాయి. అందంగా కనిపించడమే కాకుండా.. ఆరోగ్యానికి ప్రయోజనకరమే. కుంకుమ బొట్టు పెట్టుకుంటే.. దాని ద్వారా సూర్యకిరణాలు శరీరమంతా ప్రసరించి.. నూతనోత్తేజాన్నిస్తాయి.


హిందువుల సంప్రదాయం ప్రకారం మహిళలు, ముఖ్యంగా పెళ్లైన ముత్తైదులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఐదోతనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్లైన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేని ముఖం అందవిహీనంగా కనిపించడమే కాదు..శుభ కార్యాలు చేయటానికి అర్హత లేదని హిందూ సంప్రదయం చెబుతోంది. మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే ముందుగా బొట్టు పెట్టుకుని పూజ చేయాలని పెద్దలు చెబుతుంటారు.


బొట్టు పెట్టుకోవడం మంచిది, సంప్రదాయం అని అందరికీ తెలుసు. కానీ.. బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాం..? ఎలా పెట్టుకుంటే మంచిది అన్న విషయంలో చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే అసలు బొట్టు ఎందుకు ధరించాలి ? నుదుటి మీదే ఎందుకు పెట్టుకోవాలి ? ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి ? అన్న సందేహాలను తీర్చుకుందాం...


గౌరవసూచకం బొట్టు పెట్టటం మర్యాదకి గుర్తింపు. అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికి ముందుగా బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి గౌరవిచమూ హిందూ సంప్రదాయం.


బొట్టు పెట్టుకునేటప్పుడు ఏం స్మరించాలి ? సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని జగన్మాతను స్మరించుకుంటూ నుదుటన బొట్టు పెట్టుకుంటే మంగళకరం.. శుభకరం.


ఏ వేలితో ఏం ప్రయోజనం ? బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతుంటారు. కొందరు మధ్య వేలు మంచిదని.. మరికొందరు ఉంగరపు వేలు మంచిదని. అయితే ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి.. మధ్య వేలితే పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలితో పెట్టుకుంటే పుష్ఠి కలుగుతుంది. చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.


నుదుటనే ఎందుకు ? బొట్టు నుదుటిపైనే పెట్టుకోవాలనే సంప్రదాయం వెనక కారణాలున్నాయి. జ్ఞాపక శక్తికి, ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య తిలకము పెడతాము. మరో అధ్యయనం ప్రకారం.. బ్రహ్మ స్థానం నుదురుగా భావిస్తారు. అందుకే కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటే.. బ్రహ్మను పూజించినట్లు అవుతుందని నమ్ముతారు.

ఎరుపు రంగే ఎందుకు ? బొట్టు అంటే ఎరుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే.. చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు.. మనుషుల ఆత్మ జ్యోతి స్వరూపమని.. అందుకే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలని సూచిస్తారు.


ఆరోగ్యానికి కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరించి.. శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేదా విభూతి నుదుట రాయడమూ మంచిదే.


స్త్రీలకే కాదు ధర్మాన్ని పాటిస్తూ.. భగవంతున్ని నమ్ముతున్నారనడానికి బొట్టు ప్రతీకగా చెప్పవచ్చు. కాబట్టి కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే పరిమితం కాలేదు. పురుషులు కూడా పెట్టుకుంటే సంప్రదాయం పాటిస్తున్నారని తెలియజేస్తుంది. బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు. పెద్దలు, మనకోసం పాటించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. ఇది భారతీయులకే ప్రత్యేకం.

నుదుట వ్రాసిన ధనం

 శ్రీరామ (84)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


శ్లో// యద్ధాత్రా నిజ ఫాలపట్ట లిఖితం స్తోకం మహద్వా ధనమ్/

తత్ప్రాప్నోతి మరుస్థలేపి నితరాం, మేరౌచ నాతోధికం/

తద్ధీరో భవ, విత్తవత్సు కృపణాం వృత్తిం వృథా మాకృథాః/

కూపే పశ్య పయోనిధావపి ఘటో గృహ్ణాతి తుల్యం జలమ్//


(బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన ధనం కొద్దియైనను, గొప్పయైనను నీవు ఎడారిలో ఉన్నా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.

బంగారంతో నిండిన మేరు పర్వతానికి వెళ్లినా అంతకంటే ఎక్కువ ధనం నీవు పొందలేవు.

కుండను బావిలో ముంచితే తక్కువ నీరు, సముద్రంలో ముంచితే ఎక్కువ నీరు రావుగదా! 

దానికి సరిపడే నీటినే అది గ్రహించగలుగుతుంది.

ఈ విషయం దృష్టిలో పెట్టుకొ.

ధనవంతులను చూచి వారి ‌సహాయాన్ని ఆశిస్తూ దైన్యవృత్తి నవలంబించవద్దు).


దీనినే శ్రీ ఏనుగు లక్ష్మణకవి ఇలా తెలుగులో అనువదించారు.


చ//వనజభవుండు నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబొ కొంచెమో/

విను మరుభూమికేగిన లభించును, మేరువు జేరబోయినన్/

ధనమధికంబు రాదు,కడు దైన్యము మాను ధనాఢ్యులందు న/

వ్వననిధి, నూత, దుల్యముగ వారి గ్రహించు ఘటంబు సూడుమా//


పురుషుడు ఎప్పుడూ దీనంగా బ్రతక కూడదు.

తగు పురుష ప్రయత్నంతో కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి.

నీటిని గ్రహించే కుండ యొక్క ఉపాధి పరిమితమైనది.

మానవుడు తన ఉపాధి యొక్క శక్తి, సామర్ధ్యాలను,వేదోక్త ఉపాయములద్వారా,తపశ్చర్యాదులద్వారా వృద్ధి చేసుకోవచ్చు.

అగస్త్య మహర్షి సముద్రమును త్రాగటం, విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేయడం, అలాంటివే.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

16-2-'26.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం - చతుర్దశి - శ్రవణం -‌‌ ఇందు వాసరే* (16.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి. వేద ఆశీర్వచనం




.🙏🙏 

భవదీయుడు


దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం