25, డిసెంబర్ 2021, శనివారం

సాధన -1

సాధన -1  

విమానంలో కిటికీ ప్రక్కన కూర్చున్న ప్రయాణకునికి విమానము కదలటం మొదలుకాగానే భూమి మీద వస్తువులు వెనుకకు వెళుతున్నట్లు కనపడి విమానం గాలిలో ఎగరటం మొదలు కాగానే అవి మొదట చిన్నగా తరువాత సుష్మముగ కనపడి తరువాత కనపడకుండా పోతాయి. కేవలం ఆకాశంలో మేఘాలు మాత్రమే కనపడుతుంటాయి. అంటే దీని అర్ధం విమానం క్రింద భూమి, భూమిమీది వస్తువులు లేకుండా పోయాయని కాదు.  కేవలం ప్రయాణికుడు అవి చూడలేని అంత ఎత్తుకు వెళ్లాడని మాత్రమే.  ఆ ఎత్తులో మేఘాలు ఉంటాయి కాబట్టి వాటిని మాత్రం స్పష్టంగా చూడగలడు. 

సంసారబంధనాలలో కొట్టు మిట్టాడుకునే మానవుడు ఎప్పుడైతే జిజ్ఞాసకుడిగా అయ్యి సాధన మొదలు పెడతాడో అప్పుడు తన సాధన క్రమంలో మొదట్లో బౌతికంగా వున్న భావ బంధాలు అంటే భార్య పిల్లలు, నా వారనే బంధాలు కొంత చిన్నవిగా కనపడతాయి అదే సాధనలో పరిపక్వత చెందుతున్న కొద్దీ ఆ బంధాలు సుష్మముగా తరువాత లేనట్లుగా గోచరిస్తూ కేవలం అద్వితీయమైన, అనంతమైన, శాశ్వితమైన, నిత్యమైన భగవంతునితో మాత్రమే అనుసందానం కలిగి ఉంటాడు. 

సంసార జీవనం గడిపే మనకు సాధన సాగదు, మనకు ఒక మంచి గురువు తనంతట తానె వెతుక్కుంటూ వస్తాడు, ఫలానా ప్రవచనాకారుడు చెప్పాడు విగ్రహారాధన ఒక్కటే మార్గం కేవలం సన్యాసం తీసుకున్న వారు మాత్రమే వారికి ఎలాంటి భాద్యతలు వుండవు కాబట్టి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనం గడప  గలరు. ఈ జన్మకు నేను చేసే పూజలే  చాలు. కలియుగంలో నామ స్మరణే చాలు మోక్షానికి అని ఇలా పలుతెరుగుల వాదనలు, సమర్ధింపులు చేసుకునే వారిని పెక్కు మందిని మనకి తారస పడతారు.  కానీ నిజమైన సాధకుడు ఆ మాటలను ఏమాత్రం గణించక తన ఆధ్యాత్మిక జీవనం కోన సాగిస్తాడు. 

ఇలా వ్యర్ధ ప్రసంగాలను చేసి కాలాన్ని వృధా చేసుకునే వారిని ఆది శంకరాచార్యుల వారు " కాకికి దంతాలు వున్నాయి, దంతాలు లేవని వాదన చేసే (మూర్ఖులు ) గా అభివర్ణించారు.  

సాధకులారా ఇంకా కాలయాపన చేయకండి ఇప్పుడే మీ ఆధ్యాత్మిక జీవనానికి నంది పలకండి.  ఈ జన్మలోనే నేను మోక్షాన్ని పొందుతాను అని దృఢ సంకల్పులు కాండి. 

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః.