11, జులై 2022, సోమవారం

ఈశావాస్యోపనిషత్తు

 ఈశావాస్యోపనిషత్తు 

ఈశా వాస్యమిదxసర్వం యత్కించ జగత్యాం జగత్, 

తేన త్యక్తేన భుంజీథా మాగృధః కస్య స్విద్ ధనమ్.


జగత్యామ్ = అఖిల బ్రహ్మాండము నందు; యత్ కించ ఏదైతే; జగత్ =జడ, చేతన స్వరూపమైన జగత్తుగలదో; ఇదమ్ = ఈ; సర్వమ్ = సమస్తమును; ఈ = ఈశ్వ రునిచే; వాస్యమ్ =వ్యాపించియున్నది; తేన=అందుచే; త్యక్తేన త్యాగపూర్వకముగ (ఈశ్వరుని వెంట నిడుకొని); భుంజీథా= (దీనిని) అనుభవింపుము; మాగృధః= ( దీనియందు) ఆసక్తుడవు గాకుండుము; (ఏలయన) ధనమ్ = ధనము-సంపద భోగ్య పదార్థములు; కస్యస్విత్ = ఎవరిది? అనగా ఎవరిదీకాదు.


 తాత్పర్యము: అఖిల బ్రహ్మాండము నందుగల చేతనా చేతన జగత్తంతయు ఈశ్వరుని చేత వ్యాపించియున్నది. అందుచే ఈశ్వరుని సాన్నిహిత్యము ననుభవించుచు, సమర్పణ బుద్ధి ద్వారా త్యాగపూర్వకముగ, ప్రాప్తించిన దానిని అనుభవింపుము. కాని దాని యందు ఆసక్తుడవు గాకుండుము. ఈ సంపద, ధనము, భోగ్యసామగ్రి ఎవరిది? అనగా ఎవరికీ చెందినదికాదు.


వ్యాఖ్య: అఖిల విశ్వబ్రహ్మాండము నందుగల చరాచరాత్మకమైన జగత్తు నీ చూపుద్వారా, వినికిడి ద్వారా తెలియవచ్చు చున్నదంతయునూ సర్వాధారుడు, సర్వనియంత, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సకల కళ్యాణగుణ స్వరూపుడునగు పరమేశ్వరుని చేత వ్యాపింపబడి యున్నది; సదా, సర్వత్ర అతనిచేత పరపూర్ణమై యున్నది. (గీత.9-4) ఇందలి ఏ అంశము కూడా అతనితో రహితమై లేదు. (గీత.10-39, 42) ఈ విధంగా తెలిసి ఆ పరమేశ్వరుని నిరంతరము సన్నిహితంగా భావిస్తూ - సదా, సర్వదా అతనిని స్మరించుచునే నీవు ఈ జగత్తునందు త్యాగభావం కలిగి కేవలం కర్తవ్య నిర్వహణకై మాత్రమే విషయములను యధోచితముగా ననుభవింపుము. అనగా - విశ్వరూపుడగు -


ఈశ్వరుని అర్చించుట కొరకే కర్మలను ఆచరించుము. విషయములందు మనస్సును చిక్కుకొననివ్వకుము. ఇందులోనే నీకు నిశ్చితమైన మేలు గలదు. (గీత.2-64; 3-9; 18–46) నిజమునకు ఈ భోగ్యపదార్ధములు ఎవరివీ కావు. మనుజుడు పొరపాటుగా వీనియందు మమతా, ఆసక్తిని పెంచుకుంటాడు(ముడి వేసుకొని కూర్చుంటాడు) ఇవన్నియును పరమేశ్వరునివే, ఆతని కొరకే వీటినుపయోగించ వలయును. (త్వదీయం వస్తు గోవింద తుల్యమేవ సమర్పయే) అని మనుజుల పట్ల వేదభగవానుడిచ్చిన పవిత్రమైన ఆదేశము నెరుగుము. (1) 846 


4

గుణం ప్రధానం

 హరిహరులు, అమరేంద్రుడు, కుమారస్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు- ఇలా దాదాపు పురాణ దేవతలందరూ సుందర రూపులే.

కానీ వినాయకుడు?! చూడబోతే ఏనుగు ముఖం, పెద్ద పొట్ట, గుజ్జు రూపం, నడవలేక నడవలేక నడిచే నడక, జందెముగా పాము, ఒక విరిగిన దంతం, వాహనమేమో పంటలు పాడుచేసే ఎలుక- ఇలా అన్నీ వికృతులే. అయినా ఆయన సర్వజన సమాదృతుడై, సకల ప్రజాపూజితుడై యావద్దేవ గణాధిపత్యార్హుడై, విఘ్న నివారణకు ఆదిదేవుడైనాడు. ఇందులోనే చక్కని సందేశం ఇమిడి ఉంది.

రూపం కాదు; గుణం ప్రధానం

నడక కాదు; నడత ప్రధానం

మనిషి ఎత్తు కాదు; మనసులోతు ముఖ్యం

తినేది ఏమిటి కాదు; ఇచ్చేది ఏమిటి?

– ఈ నాలుగు అంశాలూ ప్రతి మానవుడూ మనసులో పెట్టుకొని మనుగడ సాగించాలి అనేదే ఆ మహాగణాధిపతి స్వరూపం మానవాళికి ఇచ్చే మహోదాత్త సందేశం.

భారతంలో లేకపోయినా

 వ్యాస భారతంలో లేకపోయినా, ప్రచారంలో ఉండి అందరూ నమ్మే మహాభారత విషయాలు ఏమిటి?


వ్యాస భారతంలో లేకపోయినా సినిమాలు, సీరియళ్ళ వలనో, మరొక రకంగానో, పాత్రల ఔచిత్యాన్ని ఇష్టమొచ్చినట్టు దిగజార్చేసి, అవే నిజాలు అనుకునేలా చాలా విషయాలు ప్రచారంలో ఉన్నాయి. విన్నవి విన్నట్టు, చూసినవి చూసినట్టు నమ్మేస్తామే కానీ, మూల గ్రంథాలు చదవము. అలాంటి కల్పిత మహాభారత విషయాల జాబితా, నాకు తెలిసినంత మేరలో చెబుతాను -


దానవీరశూర కర్ణ మొదలగు సినిమాలలో చూపించినట్టుగా ద్రౌపది కర్ణుడిని ఆరవ భర్తగా కోరుకుంది అనేది తప్పు. తన పరాభవానికి కారణమైన వాడిని, జారస్త్రీ అని తూలనాడిన వాడిని ఆవిడ ఎన్నటికీ వరించదు. కర్ణుడు అర్జునుడి చేతిలో మరణించాలని కోరుకుంది.


ద్రౌపది పుట్టడం ద్రుపదుడికి నచ్చలేదు, ఆవిడని దుఃఖాలనుభవించమని శపించాడు అనేది తప్పు. ద్రుపదుడికి ద్రౌపది అంటే ఎనలేని ప్రేమ, ఆమెని అర్జునుడికిచ్చి వివాహం చేయాలని ఆయన కోరిక.


కర్ణుడు మత్స్య యంత్రాన్ని ఛేదించలేకపోయాడని భారతంలో స్పష్టంగా ఉంది.


కర్ణుడు పాండవుల వైపు యుద్ధం చేస్తే ద్రౌపదిని కర్ణుడికిచ్చి కట్టబెడతానని కృష్ణుడు అనలేదు.


ద్రౌపదీ దేవి మయసభలో దుర్యోధనుడిని చూసి నవ్వలేదు. అసలు ఆ సందర్భంలో ఆవిడక్కడ లేనే లేదు.


పాండవుల ఇతర భార్యలు ఇంద్రప్రస్థంలో ఉండరాదని ద్రౌపది షరతు విధించలేదు.


ద్రౌపదీ దేవి యుద్ధం అయ్యేంతవరకు జుట్టు విరబోసుకుని ఉండటం, దుశ్శాసనుడి రక్తంతో ఆమె కురులను తడపటమనేది వ్యాసభారతంలో లేదు.


కృష్ణుడి వేలు తెగి రక్తం కారితే ద్రౌపది వస్త్రం చించి కట్టింది అన్న కథ వ్యాసభారతంలో లేదు.


ద్రౌపదికి కృష్ణుడికి మధ్య స్వచ్ఛమైన స్నేహం తప్ప ఇంక ఏ సంబంధం లేదు. కృష్ణుడితో విడదీయరాని అనుబంధం ఉన్న అర్జునుడి ద్వారానే (పెళ్ళైన తర్వాత) ఆమె కృష్ణుడి గురించి తెలుసుకున్నది.


సహదేవుడికి భవిష్యత్తు సంఘటనలు తెలుసు కానీ తన సోదరులకు చెప్పలేదని, అటువంటి శక్తులు పాండు రాజు మెదడో, చిటికిన వేలో తినటం వలన వచ్చాయన్న కథ కల్పితం. 


పాండు రాజు చనిపోయినప్పుడు, సహదేవుడు చంటి పిల్లాడు. సహదేవుడికి అటువంటి శక్తులు లేవు.


ఐదు గ్రామాలు అడగమని సహదేవుడు ధర్మరాజుకు సూచించలేదు. అది ధర్మజుని ఆలోచనే.


నకుల సహదేవులకు ఎటువంటి దివ్య శక్తులు లేవు, అశ్వినీ దేవతలలా వైద్యం తెలియవు.


ద్రోణాచార్యుడు కర్ణుడిని శిష్యునిగా చేర్చుకోవటానికి నిరాకరించాడన్నది తప్పు కథ. కర్ణుడు కృపుడు, ద్రోణుడు నుండి నేర్చుకుని తరువాత వారి ఆశ్రమం వదిలి బ్రహ్మాస్త్రం కోసం పరశురాముడిని ఆశ్రయించాడని భారతంలో స్పష్టంగా ఉంది. అంతే కాదు, ద్రోణుడికి గురుదక్షిణ ఇవ్వటం కోసం ద్రుపదుడి మీద సలిపిన పోరులో కర్ణుడు కూడా పాల్గొన్నాడు.


కర్ణుడికి, దుర్యోధనుడికి స్నేహం గురుకుల వాసం నుండే ఉంది. రంగభూమిలోనే వారిద్దరి స్నేహం ఏర్పడటం అన్నది కట్టు కథ.


గాంధారి వ్రత సమయంలో శరీరం బలం చేయటానికి దుర్యోధనుడిని నగ్నంగా రమ్మని అనలేదు.


శకుని కౌరవ వంశాన్ని నాశనం చేయాలని ఏనాడూ అనుకోలేదు.

ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహాన్ని శకుని వ్యతిరేకించలేదు. తానే హస్తినాపురానికి వెళ్ళి గాంధారినిచ్చి పెళ్ళి చేసాడు.


సినిమాలలో, సీరియళ్ళలో చూపించినట్టు శకుని ఎప్పటికీ హస్తినాపురంలోనే ఉండిపోలేదు. ధృతరాష్ట్రునికి బహుమతులు ఇచ్చిన తరువాత తన గాంధార రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు.


భీష్మునితో శకునికి ఎటువంటి శత్రుత్వము లేదు. ఏనాడూ వారిద్దరు వాదించుకోలేదు.


కృష్ణుడు మరియు శకుని మధ్య ఇతిహాసంలో ఏ విధమైన సంభాషణ లేదు, ఆఖరికి శ్రీ కృష్ణుడు హస్తినాపురానికి రాయబారిగా వచ్చినప్పుడు కూడా లేదు.


కురుసభలో మాట్లాడటానికి శకుని ఎన్నడూ సాహసించలేదు. ఎప్పుడూ భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాత్రమే మాట్లాడేవారు. అలా కురు సభలో ఇష్టానుసారంగా మాట్లాడింది కర్ణుడు ఒక్కడే. శకుని ధృతరాష్ట్ర, దుర్యోధనులు ముందు మాత్రమే మాట్లాడేవాడు.


పాండవులపై అన్ని కుట్రలలో శకుని భాగమే తప్ప, వాటి వెనుక సూత్రధారి శకుని కాదు.


భీముడికి విషం పెట్టి చంపటం, లాక్షా గృహ దహనం అనేవి దుర్యోధనుడి ఆలోచన, శకునిది కాదు. మేనల్లుడి పై మమకారంతో అందులో భాగం పంచుకున్నాడు శకుని.


దుర్యోధనుడు రాజసూయ యాగంలో పాండవుల వైభవాన్ని చూసి అసూయపడగా, శకుని అతనికి ఉన్నదానితో సంతృప్తి చెందమని సలహా ఇచ్చాడు.


దుర్యోధనుడు ఆ సలహాను అంగీకరించకపోగా, పాండవులతో యుద్ధం చేయాలనే కోరికను కూడా వ్యక్తం చేశాడు. అప్పుడు శకుని పాండవుల పరాక్రమాన్ని వివరించి, దుర్యోధనుడికి వాస్తవాలు చెప్పి కళ్ళు తెరిపించటానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు.


అల్లుడి మీద మమకారంతో, దుర్యోధనుడి మొండి పట్టుదల కారణంగా మాత్రమే, శకుని పాచికల ఆటలో పాండవుల రాజ్యాన్ని గెలుస్తానని అతనికి వాగ్దానం చేశాడు.


ద్రౌపదికి జరిగిన అవమానంలో శకుని ఎలాంటి పాత్ర పోషించలేదు. ద్రౌపది వస్త్రాపహరణంలో కీలక పాత్రలు కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మాత్రమే.


ధర్మరాజుపై శకుని విజయంలో ఎలాంటి మాయాజాలం లేదు. జూదంలో శకుని నేర్పరి, అంతే.


శకుని ఉపయోగించిన పాచికలు అతని తండ్రి బూడిద లేదా ఎముకలతో తయారు చేయబడలేదు. ఇది ఎలాంటి ప్రామాణికమైన ఆధారం లేని కల్పిత కథ.


దుర్యోధనుడి భార్య భానుమతితో కర్ణుడు ఆట ఆడాడని, ఆ ఆటలో తాళం గుత్తి తీసాడన్న కథ నిజం కాదు. అసలు ఆమె పేరు భానుమతి అని ఎక్కడా చెప్పబడలేదు.


దుర్యోధనుడికి ఇద్దరు భార్యలు, ఒకరు కాశీరాజు కుమార్తె, మరోకరు కళింగ రాజు కుమార్తె. వారిద్దరి పేర్లు వ్యాస భారతంలో ఇవ్వబడలేదు.


అర్జునుడికి చిత్రాంగదకి మధ్య ప్రేమకథ నడవలేదు. ఆమెనిచ్చి వివాహం చేయమని అర్జునుడు నేరుగా ఆమె తండ్రిని అడిగాడు.


ఖాండవ వన దహనం సమయంలో కృష్ణార్జునులతో పాటుగా సత్యభామ, ద్రౌపది, సుభద్ర కూడా అక్కడే ఉన్నారు.


అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉండగా పద్మవ్యూహం నేర్చుకున్నాడని భారతంలో లేదు.


పద్మవ్యూహ ప్రవేశం అభిమన్యుడికి (వయస్సొచ్చాక) అర్జునుడే నేర్పాడు, శ్రీకృష్ణుడు కాదు.


బార్బరీకుడు అనేవాడు అసలు లేనే లేడు.


అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి తప్పించుకుని బయటకు వచ్చివుంటే అతడిని సంహరించడానికి తాను మరొక అవతారం ఎత్తవలసి వస్తుందని కృష్ణుడు అన్నట్టు ఎక్కడా లేదు.


కృష్ణుడు మహాభారతం జరిగిన 18 రోజులూ కేవలం వేరుసెనగ గుళ్ళే తిన్నాడని భారతంలో లేదు.


కురుక్షేత్ర యుద్ధం ముహూర్త సమయాన్ని నిర్దేశించింది శ్రీకృష్ణుడు. ముహూర్తం నిర్ణయించమని దుర్యోధనుడు సహదేవుడిని అడగలేదు, సహదేవుడు నిర్ణయించలేదు.


అభిమన్యుడు పూర్వ జన్మలో రాక్షసుడనేది తప్పు. ఆయన చంద్రుని కుమారుడి అంశతో జన్మించాడని స్పష్టంగా చెప్పబడింది.


అభిమన్యుడికి యుద్ధవిద్యనంతటినీ నేర్పింది అర్జునుడే, శ్రీకృష్ణుడు కాదు.


శిశుపాలుడి నుండి ద్రౌపదిని కర్ణుడు కాపాడినట్టు భారతంలో లేదు. అది నిజం కాదు.


ద్రౌపది వస్త్రాలు తీయమని దుశ్శాసనుడిని ప్రేరేపించింది కర్ణుడే.


కర్ణుడు చేతిలో ఏ ఆయుధం లేకపోయినా అర్జునుడు చంపాడన్నది తప్పు. ఆఖరి క్షణం వరకు కర్ణుడు ఆయుధాలతో పోరాడుతూనే ఉన్నాడు.


కర్ణుడు ఆఖరి నిమిషంలో బంగారు పన్ను దానం చేసాడని వ్యాస భారతంలో లేదు.


కర్ణుడు తనదేం తప్పని శ్రీకృష్ణుడిని అడగలేదు. శ్రీకృష్ణుడు యుద్ధ భూమిలో కర్ణుడు చేసిన తప్పిదాలన్నీ గుర్తుచేస్తే కర్ణుడు తన తప్పులకు మౌనంగా తలదించుకున్నాడు అని భారతంలో ఉంది.


కర్ణుడి చేతిలో అర్జునుడు ఒక్కసారైనా ఓడిపోయినట్టు భారతంలో లేదు.


కర్ణుడికి పరశురాముని శాపం కేవలం బ్రహ్మాస్త్రం గుర్తుకురాదని మాత్రమే. దాని ప్రకారమే అది అతనికి గుర్తురాలేదు. అయితే, అతను మళ్ళీ గుర్తు తెచ్చుకుని బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి మీదికి ప్రయోగించగా, అర్జునుడు తిరిగి దానిని శమింపజేసాడని భారతంలో ఉంది.


యుద్ధంలో శల్యుడితో వాదులాడుతున్నప్పుడే కర్ణుడు తనకన్నా అర్జునుడి ఆధిపత్యాన్ని, ఉత్తర గోగ్రహణంలో తన ఓటమిని అంగీకరిస్తాడు.


అర్జునుడు పాశుపతాన్ని జయద్రథుడి మీదనే కాదు, అసలు ఎవరిమీద కూడా వాడలేదు.


శిఖండి చాటునుండి అర్జునుడు భీష్ముడిపై బాణం వేసాడనేది కూడా తప్పు. అసలు అర్జునుడు, శిఖండి ఒక రథంలో నిలబడినట్టు లేనే లేదు.


శిఖండిని చూసి భీష్ముడు విల్లంబులు వదిలి పెట్టాడన్నది కూడా నిజం కాదు. శిఖండితో యుద్ధం మాత్రమే చేయకుండా అర్జునుడితో యుద్ధం చేసాడు.


శిఖండిని పట్టించుకోకుండా అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు శిఖండి వేసిన బాణాలు భీష్ముడికి ఏ మాత్రం ఆనలేదు.


భీష్ముడు అస్త్ర సన్యాసం చేయలేదు. ఆఖరి క్షణం వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం పదవరోజు కూడా పదివేల మంది సైన్యాన్ని భీష్ముడు చంపాడు.


కర్ణుడు అర్జునుడి రథాన్ని ఎత్తాడన్నది ఎక్కడా లేదు.


హనుమంతుడు, అర్జునుడు కలిసినట్టు భారతంలో లేదు.


జయద్రథుని వధలో శ్రీకృష్ణుడు సూర్యుడికి చక్రాన్ని అడ్డుపెట్టలేదు.


తనకి తెలిస్తే, ఆహ్వానం లేకపోయినా వచ్చి జూదం ఆడటం వల్ల వచ్చే అనర్థాలు, మనిషి ఎలా ఒక్క పూటలో తన సర్వస్వం కోల్పోగలడో చెప్పి ఆట ఆడనించేవాడు కాదని, అందుకోసం ధృతరాష్ట్రుడిని ఒప్పించటానికి భీష్మ, ద్రోణ, కృపాదుల సహాయం తీసుకునేవాడిననిf TV శ్రీకృష్ణుడు అన్నాడు. ఆయనే అక్కడ ఉండుంటే, ఆ ఆట ఆడనిచ్చేవాడు కాదు.


ఇప్పటికింతే. ఇంకేమైనా గుర్తొస్తే చేరుస్తాను.


సవరణలు:


కర్ణుడు బంగారు పన్ను దానము చేసే కథ భాసకవి ప్రణీతమైన కర్ణభారము[1] అనే నాటకము లోనిది...


భీముడు ద్రౌపది కురులను దుశ్శాసనుడి రక్తంతో తడపటమనే కథ భట్టనారాయణ ప్రణీతమైన వేణీసంహారము అనే సంస్కృత నాటకము లోనిది..


*రాయ పెద్ది అప్పా శాస్త్రి*

నేరేడుపండు

ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - II 

నేరేడుపండు - మాంసాహారం - అంతరార్థం    

    ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. 
    సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా  తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు. 
    దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి. 

    మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. 
    కానీ, సంస్కృతంలో "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించునది" అని  అర్థం. 
    వరిధాన్యంవంటివి మనం ఆహారంగా తీసుకుంటాము కదా! 
    అది ప్రాణాన్ని కోల్పోయి, మనకి ఆహారమవుతుంది. అదియే మాంసాహారము. 
    అది సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణం. 

హింస - ప్రాయిశ్చిత్తము 

     మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. 
     మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. 
    అందులొ మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పటి ప్రాణిహింస".  
     అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. 
    దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". 
    అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. 

    ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, 
    వేదాలని న్యాసమొనరించి, ఈ రూపంలో అందించిన ఆయనను స్మరించి,  
     వేదాలని కాపాడుకోవడం మన విధి. 
    
ప్రకృతిలో మార్పు - వైద్యం 

    దేహంనుండీ శ్వేదరూపంలో బయటకు వెళ్ళే నీరు, 
    ఆషాఢంలో ఎండతగ్గి,    
    మూత్రంరూపంలో అధికంగా విడుదల అవుతుంది. 
    వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 
    అతిమూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో విద్యార్థులు చదువుతారు. 

గమనించవలసిన విషయాలు 

1. వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడమూ, 
2. బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత  గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. 

ఆచరణ 

    కాబట్టి మన పెద్దలు ఆషాఢ మాసం సందర్భంగా మనకందిచ్చిన ఆరోగ్య సూత్రాన్ని పాటించి,  ఆరోగ్యాన్ని పొందుతూ, 
    తద్వారా, దాని వెనక ఏర్పరచిన సాంకేతిక కారణాన్ని తెలుసుకొని, 
     శాస్త్రీయ వైదిక విజ్ఞానాన్ని కాపాడుకొందాం. తరువాత తరాలకి అందిద్దాం.  

                    =x=x=x= 

    — రామాయణం శర్మ 
             భద్రాచలం

బస్సెళ్ళిపోతోంది


        *🌷"బస్సెళ్ళిపోతోంది"🌷* *శ్రీ కొచ్చెర్లకోట జగదీశ్ గారి కథనం* 

                   🌷🌷🌷                   

చిన్నప్పుడు మాటిమాటికీ వర్షం పడేదని అనిపిస్తూ ఉంటుంది. నిజమేనా? అప్పుడంతా చిన్నచిన్న ఇళ్లలో కాపురం ఉండటంవల్ల ప్రకృతితో పరిచయం ఎక్కువగా ఉండేది. 


వీధిలో పిల్లలతో కలిసి కలక్టరాఫీసు గ్రౌండ్‌లో గోళీలు, గూటీబిళ్లా ఆడేటప్పుడు ఎండ....


నాన్నగారి రెవెన్యూ ఫారాలన్నీ మడతలుపెట్టి కత్తిపడవలు చేసి అక్కాచెల్లీ, అన్నయ్యలతో కలిసి వర్షంనీటిలో వదిలేటప్పుడు వాన....


పదిరోజుల ముందునుంచే కర్రలన్నీ ఎండబెట్టి, చెక్కతలుపులు, చెదపట్టిన గుమ్మాలు పోగేసి భోగిమంట కోసం ఎదురుచూసేటప్పుడు చలీ.....


అవును. 


కాలాలన్నీ మనతోనే మారేవి. అప్పుడిలా చలికోట్లు, వానకోట్లంటూ వేరే ఆచ్ఛాదనల కోసం పరుగెత్తిన జ్ఞాపకం లేదు. ఎందుకంటే ఆ కాలాలన్నీ మనకోసం వచ్చినవి. తప్పించుకుపోతే ఎలా? 


బళ్లో ఆఖరిగంట కొట్టడానికి అరగంటముందు మబ్బులేసేశాయంటే ఆ గంట ముందే మోగేది. పాపం, పిల్లలంతా వానలో తడుస్తూ ఇళ్లకెలా వెళ్తారంటూ మేష్టారు ముందే కొట్టించేసేవారు. అయినా దారిలో ఉండగానే చినుకులు మొదలైపోయేవి. ఆనక పుస్తకాలే గొడుగయ్యేవి. తల తడవకపోతే జలుబు చెయ్యదంటూ అమ్మ చెప్పిన మాట వేదం. 


రాత్రంతా ఒకే దుప్పటిని అటూఇటూ లాక్కుంటూ వెర్రినిద్దర పోయినా భోగిమంట కోసం మాత్రం తప్పకుండా లేచేవాళ్లం. 


ఎందుకంటే.... 


అది చలిని దూరం చేస్తుందని కాదు. వీధిని దగ్గరచేస్తుందని! 


అందరూ కలిస్తే చూడాలన్న తపన నీ రక్తంలోనే ఉంటుంది. ఇప్పుడంతా దానికి క్యాంప్ ఫైరంటూ నువ్వు పేరు మార్చినా అంతరార్ధం మాత్రం అదే!


ఆమూలనించి ఈమూలదాకా అన్నిళ్లవాళ్లూ బయటికొచ్చి కబుర్లాడుకోవడం నీ కళ్లలో వెలుగులు నింపుతుంది. ఆ వెలుగుల ముందు మంటా వెలవెలబోతుంది, వేకువసూర్యుడూ తెలతెలబోతాడు. 


ఎర్రటి ఎండ ఎంతలా ఏడిపించినా ఏదో ఒకమూల వేసవంటే మల్లెలంత మమకారం, మావిడిపండంత ఇష్టమూనూ! పక్కింటావిడ బయట ఎండబెట్టే రేగువడియం చూస్తే నీలోని దొంగబుద్ధి చెలరేగుతుంది. అమ్మానాన్నలు చిన్నతనం నుంచీ పుండరీకుడి కథా, అజామీళుడి వృత్తాంతమూ దోసకాయపచ్చడిలా నూరిపోసి పెంచినవాడివే అయినా ఆ సగ్గుబియ్యం వడియాల్ని చూస్తే నీకు సిగ్గూ, బిడియం మాయమవుతాయి.


ఒకటనుకుని రెండు తీస్తావు. తీరా తినేశాక మళ్లీ వస్తావు. అదంతా ఇప్పుడు తలుచుకుంటే... ఇప్పుడు కూడా మళ్లీ దొంగతనం చెయ్యాలనే అనిపిస్తుంది తప్ప, అప్పుడు చేసింది తప్పనిపించదు. 


బడికి సెలవులంటూ ఇచ్చేశాక పూర్తిగా వదిలేస్తే బడితెలా తయారవుతాడని ఏదో ఒకదాంట్లో ఇరికించే కుట్రలనుంచి తప్పించుకోవడంలో ఉండే మజా భలే బావుండేది. ఫలానా బళ్లో ఇంగ్లీషు గ్రామరు, ఆ లాయరుగారి మేడమీద సంగీతమూ అంటూ పిల్లల మీద ఏవో అదనపు ఆశల్ని పెట్టుకునే అమ్మానాన్నలకి పిల్లల కళ్లలో గోళీలు కనబడేవి. ఆడపిల్లలైతే అయిష్టంతో లక్కపిడతల్లాంటి నోళ్లని మరింత బుంగల్లా ముడిచేసేవారు. సర్లే పొండని అనగానే విఠలాచార్య సినిమాలో చిలకలా వాడు తక్షణం ఎగిరిపోయేవాడు. వీధరుగుమీద తాడాటలో ఆ పిల్ల మునిగిపోయేది. 


వేసవనేది పిల్లలకోసం. ఈ విశాల ప్రపంచంలో మైదానాలు, ఆటస్థలాలు, చెరువుగట్లు, చింతచెట్లు ఇవన్నీ ఆ దేవుడే సహజంగా ఏర్పరచిన వేసవి విడుదులు.


మనలోని భావుకుడు బయటపడాలంటే ముందు మనం బయటపడాలి. 


చుక్కలన్నీ కిందకి రాలుతోంటే మనకోసం కన్నీరుకార్చే మేఘాల మీద మమకారం కలగాలి. పంట కోసమో, గుక్కెడు నీళ్లకోసమో, లేక కత్తిపడవల కోసమో వాన పడాలని కోరుకోవాలి.


అదిగో, ఆ ఊడలమర్రిని పలకరించేవారెవరు? తనలో తానే ఐక్యమైపోతూ తరతరాల కథల్ని కబుర్లుగా రాత్రీ పగలూ చెప్పుకుంటుంది. 


ఆ నేలంతా రాలిన ఆకులు నీ పాదాల తాకిడికి పరవశమవుతాయి. అది సవ్వడిలా ఉంటుందే తప్ప చప్పుడనిపించదు.


పొడవైన కొమ్మల్ని తప్పించుకుని నేలను తాకాలని జారుతున్న చినుకులన్నీ కనురెప్పల్ని తాకి కాసేపటికి పెదాలపై పడుతూ అంతలోనే సిగ్గుపడి నేలను చేరతాయి.


ప్రకృతి ఎప్పుడూ అలానే ఉంది. మొన్ననేగా, ఈ చెట్టు నాకు నచ్చలేదంటూ మొత్తం కొట్టేస్తే రెండు వానలకే మళ్లీ నాలుగాకులు ఎక్కువేసింది? చిగురించాలన్న ఆశ బలంగా ఉంటే గొడ్డలికి భయపడుతూ బాధతో తలవంచదు. ఆర్తిగా ఆకాశాన్ని చూస్తుంది.


మనం మాత్రం ఇప్పుడంతా మూసిన తలుపుల మధ్య మహరాజా మంచంమీద నిద్ర. పీల్చే గాలిమీద సైతం వత్తిడి తెచ్చి బలవంతంగా చల్లబరిచి, బయట కురుస్తున్న వాన గురించి పుంఖానుపుంఖాలుగా రాయడం. 


అవును. ప్రకృతి ఎప్పుడూ అలానే ఉంది. మన బాల్యమే మనల్ని వదిలేసి బస్సెక్కి వెళిపోతోంది.


.............జగదీశ్ కొచ్చెర్లకోట

వేయి శిరస్సులు

 శ్లోకం: ☝

*సహస్ర శీర్షం దేవం*

   *విశ్వాక్షం విశ్వశంభువం |*

*విశ్వం నారాయణం దేవం*

   *అక్షరం పరమం పదం ||*


భావం: వేయి శిరస్సులు కలిగి అనేక నేత్రములతో ప్రపంచమునకు సుఖము చేకూర్చు వాడును, సర్వ వ్యాపకుడును, సమస్త ప్రాణికోటికీ ఆధారమైనవాడును, శాశ్వతుడూ, శుభకరుడును, మోక్షస్థానమైన వాడును అయిన శ్రీమన్నారాయణునకు  నమస్కరించెదను.🙏