27, నవంబర్ 2021, శనివారం

బేగి ఎలిపొచ్చీ

 బేగి ఎలిపొచ్చీ...!


       సాహిత్యం... సంగీతం... విజయనగరం! ఈ మూడింటిని వేర్వేరుగా చూడలేం. ఒకరా ఇద్దరా... గురజాడ, గణపతిముని, ఆదిభట్ల, వంగపండు... ఎందరెందరు కవులు, కళాకారులు! ద్వారం, ఘంటసాల, సాలూరి, సుశీల... మరెందరెందరు సుస్వరాల సమ్రాట్టులు! ఇక అక్కడి సంస్థానాలు... జానపదుల నోళ్లలో నానే వాటి వీరగాథలు... అన్నీ అబ్బురమే! ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఆ నేలమాట ఇంకా ప్రత్యేకమైంది. పలుకుల కలకూజితాలతో తనదైన తెలుగు తియ్యందనాన్ని పంచే ఆ జిల్లా అమ్మభాషా విశేషాలు మీకోసం...! 

తెలుగునాడుకు ఉత్తర సరిహద్దులో, తూర్పుతీరపు అంచున... అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు వారధిలా ఉంటుంది విజయనగరం జిల్లా. అనేక భాషల సంగమం ఈ ప్రాంతం. నాగరిక, జానపద సంస్కృతులు దోబూచులాడుతుంటాయి. శాతవాహనుల పాలనలో ‘మధ్యపరగణాలు’గా వ్యవహారంలో ఉందీ ప్రాంతం. తర్వాత కళింగులు, గజపతులు, వెలమరాజులు ఇలా క్రమంగా విజయనగర గజపతుల చేతుల్లోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని భాగాలను విడదీసి 1979లో విజయనగరం జిల్లాను ఏర్పాటుచేశారు. 

      జిల్లా ఉత్తర, పశ్చిమ ప్రాంతమంతా పర్వతమయం. గిరిజనులు ఎక్కువగా ఉంటారు. దీనికితోడు నేడు ఒడిశాలో అంతర్భాగంగా ఉన్న గంజాం ప్రాంతం వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఏలుబడిలో కొన్నాళ్లుంది. ఇలా... తెలుగు, తమిళ, ఒడియా సంస్కృతులతో పాటు హిందీభాషా ప్రభావమూ ఈ ప్రాంతపు తెలుగు మీద బలంగానే ఉంది. భౌగోళికంగా అంతగా సంబంధం లేని హిందీ ఇక్కడికి ఎలా వచ్చిందంటే... ఒకప్పటి మధ్యప్రదేశ్, నేటి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్, జగదల్‌పుర్‌ తదితర ప్రాంతాల ప్రజలు వ్యాపారం నిమిత్తం ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించడం వల్ల. మొత్తమ్మీద విజయనగరం తెలుగు ఇన్ని భాషల కలగలుపు. ఉదాహరణకు ‘తన నివాసాన్ని మార్చుకున్నాడు’ అనే అర్థంలో ‘బిచాణా ఎత్తేశాడు’ అంటారు. ‘బిచాణా’ అనేది ఒడియా పదం. అలాగే ‘వేగం’ అనే పదానికి గ్రామ్యరూపం ‘బేగి’. ఈ పద రూపాంతరం మీదా ఒడియా ప్రభావం ఉంది. ఆ భాషీయులు ‘వ’ అక్షరాన్ని పలకరు. దాని బదులు ‘బ’ వాడతారు. వాళ్ల సాపత్యంతో ‘వేగిరం’ అనే ఉచ్చారణ కాస్తా ‘బేగిరం’గా మారింది. కాలక్రమేణా ‘బేగి’గా స్థిరపడిపోయింది. 

భలే భలే మాటలు

వివిధ భాషల సంపర్కంతో తయారైన ‘తెలుగు మాటలు’ ఇక్కడ కొల్లలు. ‘మేనత్త’ను స్థానికులు ‘బాప్ప’ అంటారు. హిందీ ‘బాప్‌’ (నాన్న)కి, తెలుగు ‘అప్ప’ (అక్క) కలిసి ‘నాన్నకి అక్క’... ‘బాప్ప’ అయిందన్న మాట. ఎవరైనా నేరాన్ని కప్పిపుచ్చితే ‘కామప్‌ చేసేశారు’ అంటారు. ఆంగ్లంలోని ‘క్లెయిమ్‌ అప్‌’ (దాచేయడం) దీనికి మూలం. ఎవరైనా అబద్ధాలు చెబుతోంటే, ‘వాడివన్నీ జూటా మాటలు’ అనేస్తారు. ‘ఝాటా’ అంటే హిందీలో అబద్ధం. ఇక ‘పొడవు’నేమో ‘జబరు’ అని పిలుచుకుంటారు. ఇది ఉర్దూ మాట. ఆ భాషలో దీనికి అర్థం ‘ఉన్నతమైన’ అని. ‘ఉష్ణం’ (వేడి) అనే సంస్కృత పదం ‘ఊష్టం’గా మారి విజయనగరం తెలుగులో జ్వరానికి మారుపేరైంది. అలాగే ఉక్కపోతని ‘ఈష్ట’ అంటారు. ఇదీ ‘ఉష్ణం’ రూపాంతరమే. ఇలా సంస్కృతం నుంచి వచ్చిన మరో మాట ‘జిమ్మ’. అంటే... నాలుక. ‘జిహ్వ’ దీనికి మూలం. ‘బైఠాయించు’ అంటే పత్రికా భాష అనుకుంటాం కానీ, ‘కూర్చోవడం’ అనే అర్థంలో స్థానికులు దీన్ని సాధారణంగానే వాడేస్తుంటారు. వీటన్నింటికీ మించి ఆశ్చర్యాన్ని కలిగించే మాట ‘ఎప్పెస్‌’. విజయనగరం భాషలో దానికి అర్థం ‘ఉచితం’. ఆంగ్ల ‘ఫ్రీ సర్వీస్‌’లోని ఎఫ్, ఎస్‌ అక్షరాల గ్రామ్య కలగలుపు ఇది! ఈ జిల్లా భాషని తరచిచూస్తే ఇలాంటి మాటలు చాలానే కనిపిస్తాయి. 

      ఇక్కడి ఊళ్ల పేర్లు కూడా ఆసక్తిదాయకంగా ఉంటాయి. చుట్టూ పర్వతాలు ఉన్న ఊరు మొదట ‘పర్వతపురం’ అయింది. కాలక్రమంలో అది పార్వతీపురంగా మారింది. భేల్‌- ఎలుగుబంటి, గాఁవ్‌- గ్రామం.... ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరించే గ్రామం ‘భేల్‌గాఁవ్‌’ అయింది. క్రమేపీ అది ‘బెలగాం’గా మారింది. నిడువైన కల్లు(కొండ) ఉన్న ఊరు ‘నిడువుకల్లు’గా వ్యవహారంలోకి వచ్చి ‘నిడగల్లు’గా రూపాంతరం చెందింది. ముళ్లపొదలు ఎక్కువగా ఉన్న పల్లె ‘కంటకాపల్లి’ అయింది. తాటిచెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతమే ‘తాడివాడ’. కోనేం రకపు చేపలు ఎక్కువగా అమ్ముడయ్యే సముద్రతీర గ్రామమే కోనవాడ.. అదే కోనాడ. ఇలా ప్రతి ఊరిపేరు వెనకా ఓ విశేషం కనిపిస్తుంది. 

వాళ్లది ప్రత్యేకం 

నాగావళి, వేగావతి, సువర్ణముఖి, చంపావతి, గోస్తని, జంఝావతి తదితర నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంత వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమే. అయినప్పటికీ ఆహార, వాణిజ్య పంటలకి అనువైన ప్రదేశం. ‘అయ్యకి ఆస్తి లేదు, గర్వమూ లేదు’ అన్న చందాన ఉంటుందీ ప్రాంత ఫలసాయం. తిండికి లోటుండదు. అలాగని అమ్ముకుని సొమ్ము చేసుకుందామంటే చాలదు. అలాంటి ఈ ప్రాంతానికి గోదావరి సీమనుంచి కొన్ని ద్రావిడ బ్రాహ్మణ కుటుంబాలు వలస వచ్చాయి. అగ్రహారాలను ఏర్పాటు చేసుకున్నాయి. తమిళనాడుకు చెందిన ఈ శాఖీయులు మొదట గోదావరీ పరీవాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. గోదావరి నదిమీద ఆనకట్ట లేని సమయంలో ప్రబలిన కరవుకు తట్టుకోలేక, వాళ్లలో కొందరు ఈ ప్రాంతానికి వచ్చారన్నది చరిత్ర కథనం. కృష్ణరాయపురం (‘కన్యాశుల్కం’లో దీని ప్రసక్తి ఉంది), అజ్జాడ (హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు స్వస్థలం), కలవరాయి, లోగిశ (కావ్యకంఠ గణపతిముని పుట్టిన ఊరు), సుంకి, చాకరాపల్లి, చల్లపేట... ఇవన్నీ ద్రావిడ బ్రాహ్మణ అగ్రహారాలు. వీటితోపాటు వెలనాటి బ్రాహ్మణుల అగ్రహారాలు- వెంగాపురం, కుసుమూరు, నందబలగ, శివరాంపురం మొదలైనవి కొన్ని ఉన్నాయి. ఈ రెండు రకాలైన అగ్రహారాలనీ కలిపి ‘నందాపురం పట్టీ’ పేరుతో పిలుస్తారు. ఈ ఆగ్రహారికుల మాటతీరు ఒకలా ఉంటుంది. వీళ్ల దగ్గర వివిధ వృత్తుల్లో కుదురుకున్న ఇతరుల మాటతీరు మరోలా ఉంటుంది. కాలక్రమంలో అగ్రహారాలు పోయినా, ఆ రెండు వర్గాల భాషలో మాత్రం ఆ తేడాలు కనిపిస్తూనే ఉంటాయి. 

      ఎక్కువ అనే పదానికి అగ్రహారపు పలుకుబడి ‘లావు’. దాన్నే ఇతర గ్రామీణులేమో ‘వింత’ అంటారు. కొంచెం- కాస్త (అ.ప), కసింత (గ్రా); ఇటువైపు- ఇసుంటా (అ.ప), ఇటింకా (గ్రా); వచ్చేసెయ్‌- ఒచ్చీ, వళపచ్చీ (అ.ప), ఎలిపొచ్చీ (గ్రా); గోళీలు- గొట్టికాయలు (అ.ప), అల్లికాయలు (గ్రా); తొందరగా- వేరంగా (అ.ప), బేగి (గ్రా); అత్యాశ- కాప్యానం, కాపీనం (అ.ప), కాపేనం (గ్రా); సంతృప్తి చెందు- ఆటిపారు (అ.ప), గీటెక్కు (గ్రా); వేళాకోళం- సరసాలు (అ.ప), ఇగటాలు (గ్రా)... ఇలా ఒకే ప్రాంతంలో రెండు రకాల మాటలు వినపడుతుంటాయి. 

అక్కడ అలా... ఇక్కడ ఇలా!

సాగతీతగానీ, తెగవేతగానీ లేకుండా పూర్తి పదాన్ని ఉచ్చరించడం ఈ జిల్లా ప్రత్యేకత. అంతేకాదు పదోచ్చారణ స్పష్టంగా ఉంటుంది. గ్రామీణభాషలో ‘ము’ వర్ణకాంత ప్రయోగాలు ఎక్కువ. ఉదాహరణకు ‘చేద్దాము’- సేతుము; చూద్దాము- సూతము; విందాము- విందము, ఉందాము- ఉందుము లాంటివి. ఇక ఒకే జిల్లా అయినప్పటికీ, కొన్ని మాటల్లో విజయనగరం ప్రాంత గ్రామ్యానికి, పార్వతీపురం ప్రాంత గ్రామ్యానికీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దీనికి కారణం నాడు విజయనగరం తెలుగు రాజుల పాలనలో ఉంటే, పార్వతీపురం కళింగ రాజుల ఏలుబడిలో ఉండేది. దీంతో ఆయా భాషల ప్రభావం స్థానికుల మాటల మీద పడింది.

      పశువులను పార్వతీపురం ప్రాంతంలో ‘సొమ్ములు’ అంటారు. అదే విజయనగరం వాళ్లయితే ‘పసరాలు’ అని పిలుస్తారు. అమ్మాయి, అబ్బాయిలను పార్వతీపురం వాళ్లు ‘గుంట’, ‘గుంటడు’గా వ్యవహరిస్తారు. విజయనగరం ప్రాంతవాసులేమో ‘పిల్ల’, ‘పిల్లడు’గానే ఉచ్చరిస్తారు. అలాగే... గోతులు- గుమ్ములు (పా), గాతలు (వి); నేను- నాను (పా), నీను (వి); ఉంచడం- ఇడ్డం (పా), ఎట్టడం (వి); పలకకుండా- పల్లక (పా), ఒల్లక (వి); కారం- నొర్ర (పా), వర్ర (వి)... లాంటి భేదాలెన్నో కనిపిస్తాయి. ఈ పదాలన్నీ విజయనగరం తెలుగుకు ఓ ప్రత్యేకతను సమకూర్చాయి. 

ఒకే పదానికి రెండు మూడు అర్థాలున్న పదాలూ ఉన్నాయి ఇక్కడ. గుంట- ఆడపిల్ల, రోలు; గూద- తిండియావ, కడుపు; కొర్రు- ఏ పనికైనా అడ్డుపుల్ల వేయడం, మేకు, కొండశిఖరం; పెడ- అరటి అత్తం, ఒకపక్క; జెల్ల- ఓ రకం చేప, లెంపకాయ; కొత్తెం- అరటిపువ్వు చివరి భాగం, తలవెనక భాగంలో కొట్టే చిన్నదెబ్బ... ఇలాంటివి ఎన్నో! ఎన్నెన్నో!! అలాగే, పంచదారను ‘చీనీ’ అని, ముల్లంగిని ‘సొత్తికూర’ అని పిలుస్తారు. 

అందరిదీ అదే బాట

ఈ ప్రాంతంలో పండితులు చాలామందే ప్రవర్ధిల్లారు. సంప్రదాయ సాహిత్యం నుంచి కాల్పనిక సాహిత్యం వరకూ అన్ని రకాల ప్రక్రియలకీ ఆలవాలమైంది ఈ నేల. ఎన్ని రకాల సాహితీ ప్రక్రియలు వెలువడినా, ఈ ప్రాంత భాషకి ప్రాధాన్యమివ్వడం మరవలేదు ఏ సాహిత్యకారుడున్నూ. ఆదిభట్ల అయితే ‘సీమపలుకు వహి’ అనే పేరుతో అచ్చతెలుగు మాటలకూర్పుతో ఓ నిఘంటువునే రూపొందించారు. అందులో కనిపించే విజయనగరం మాటల్లో కొన్ని... అచ్చిక బుచ్చిక (కలుపుగోలుతనం), ఆరిగం (మట్టి కుంపటి), ఇమ్ము (పదిలం), ఈండ్రపడు (మొరాయించు), ఉరిడి (కుమ్మరిపురుగు), ఆసడ్డ (నిర్లక్ష్యం). ఇక గురజాడ అయితే ‘కన్యాశుల్కం’ సంభాషణల రూపంలో విజయనగరం తెలుగుకు చెరగని ఖ్యాతిని తెచ్చిపెట్టారు.  

      ఈ ప్రాంతంలో ప్రజాసాహిత్యమూ ప్రబలంగానే వచ్చింది. దానికి కారణం రైతాంగ సాయుధ పోరాటానికి నెలవుకావడమే. ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని భూషణం, వంగపండు తదితరులు ప్రజలభాషలో రచనలు చేశారు. వాళ్ల పాటల్లో వినిపించే ఈ ప్రాంత గ్రామ్య పదాలు కొన్ని... పొవ్వాకు (పొగాకు), టకురు (ముదురు), ఉమ్మిరి (ముమ్మరం), ఎక్కిడి తొక్కిడి (పుష్కలం), ఎమకల (తెల్లవారుజామున), కవుకులు (ఇబ్బందులు), ఒగ్గేసి (వదిలేసి). గ్రామీణుల మాటల్లో దొర్లే ఇలాంటి పదాలకు సాహితీ పట్టం కట్టిన కవులు ఇక్కడ చాలామందే ఉన్నారు. 

      ఇలా ప్రాచీనకాలం నుంచి నేటివరకూ అనేక రూపాంతరాలు చెందుతూ... అటు పండితులను, ఇటు జానపదులను ఒకే బాటలో నడుపుతూ... తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది విజయనగరం తెలుగు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా తన మట్టిమాటలకే తొలి ప్రాధాన్యమిచ్చే ప్రాంతమిది.

(అయ్యగారి శ్రీనివాసరావు, విజయనగరం)

పురాణంలో ఏముందో తెలుసుకుందాము

 ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము

 

 1. మత్స్యపురాణం

 2. కూర్మపురాణం

 3. వామన పురాణం

 4. వరాహ పురాణం

 5. గరుడ పురాణం

 6. వాయు పురాణం

 7. నారద పురాణం

 8. స్కాంద పురాణం

 9. విష్ణుపురాణం

 10. భాగవత పురాణం

 11.అగ్నిపురాణం

 12. బ్రహ్మపురాణం

 13. పద్మపురాణం

 14. మార్కండేయ పురాణం

 15. బ్రహ్మవైవర్త పురాణం

 16.లింగపురాణం

 17.బ్రహ్మాండ పురాణం 

 18. భవిష్యపురాణం


ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.


 *మత్స్యపురాణం* 


మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.


 *కూర్మపురాణం* 


కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.


 *వామన పురాణం* 


పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.


 *వరాహపురాణం* 


వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.


 *గరుడ పురాణం* 


గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.


 *వాయుపురాణం* 


వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.


 *అగ్నిపురాణం* 


అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.


 *స్కందపురాణం:* 


 కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.


 *లింగపురాణం* 


లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.


 *నారద పురాణం* 


బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.


 *పద్మపురాణం* 


ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.


 *విష్ణుపురాణం* 


 పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.


 *మార్కండేయ పురాణం* 


శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.


 *బ్రహ్మపురాణం* 


బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.


 *భాగవత పురాణం* 


విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.


 *బ్రహ్మాండ పురాణం* 


బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.


 *భవిష్యపురాణం* 


సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.


 *బ్రహ్మావైపర్తపురాణము*


 ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తి సాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి

🙏

దక్షిణా దేవి!!*

 *దక్షిణా దేవి!!*


శ్రాద్ధ కర్మలయందు, యజ్ఞ కర్మల యందు..

దక్షిణా దేవి ప్రాముఖ్యత..............!!


ఒక గోపిక... సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా మారిపోవడం అనేది మనకి 'దక్షిణా దేవి' విషయంలో కనిపిస్తుంది. నిజానికి దక్షిణా దేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.


రాధా కృష్ణుల ప్రేమ ప్రపంచంలో... ప్రణయ తీరాల్లో విహరిస్తూ వున్న రోజుల్లో 'సుశీల' అనే గోపిక రాధకి ప్రధాన సహచరిగా వుండేది. గోలోకములో రాస లీలా వినోదములో తన్మయుడై యుండగా అతని దక్షిణ భాగము నుండి ఒక కన్య జనించెను. కృష్ణుని దక్షిణ పార్శ్వము నుండి పుట్టినది కావున ఆమెకు దక్షిణా దేవి అను పేరు గలిగెను. ఈమె శ్రీ కృష్ణుని యర్ధాంగి యగు రాధకు ప్రియసఖి రాధాకృష్ణులకు నిత్యము సేవలు చేయుచుండెను. 


ఒకసారి ఆమె శ్రీ కృష్ణుడితో మాట్లాడుతూ ఊహించని విధంగా ఆయన తొడపై కూర్చుంది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన రాధ... పరిగెత్తుకు రాసాగింది. అది చూసిన సుశీల అక్కడి నుంచి పారిపోయింది. తిరిగి ఆమె గోకులంలో ప్రవేశిస్తే ప్రాణాలు కోల్పోతుందని రాధ శాపం పెట్టింది.. దక్షిణ,గోలోకము వదలి వైకుంఠము నందున్న లక్ష్మీలో ప్రవేశించెను. దక్షిణా దేవి యద్రుశ్యు రాలగుట వలన యజ్ఞ యాగాదులు చేసిన వారికి ఫలము దక్కకుండా బోయెను.


'దానం యజ్ఞా నాం వరూధం దక్షిణా' అని శ్రుతి యజ్ఞములు పూర్తియైన తరువాత దక్షిణా దానము తప్పని సరి. ఆ దక్షిణ యజ్ఞ ఫలమును కవచము వలె కాపాడి, యజమానునకిచ్చును..


దేవతలకు హవిర్భాగములు సరిగా అందకుండా పోయెను. ఈ విషయమును దేవతలు బ్రహ్మతో చెప్పుకొనిరి. బ్రహ్మ కోరికపై విష్ణువు, లక్ష్మి నుండి దక్షిణను వేరు చేసెను. యజ్ఞ సంబందమైన సమస్త కార్యములను సంపన్న మొనర్చుటకు దక్షిణాదేవిని తీసుకుని పోయి యజ్ఞ పురుషునికి ఇచ్చి పెండ్లి చేసెను. యజ్ఞ పురుషునికి దక్షిణ యందు ఫలుడు (ఫలము ) అను పుత్రుడు గలిగెను.


బ్రహ్మ,కళ్యాణ సమయ మందు దక్షిణా యజ్ఞ పురుషులకు వర మిచ్చెను. 'యజ్ఞము చేసిన తరువాత యోగ్యమైన దక్షిణ నీయనివారికి ఫలము లేక పోవును. దక్షిణా యుక్తమైన యజ్ఞమే ఫలము నిచ్చును' అని దక్షిణ లేని యజ్ఞముల ఫలము బలి చక్రవర్తికి చెందును.


'యే బ్రాహ్మణా బహు విదః తేభ్యో యద్దక్షి ణాన నయేత్, దురిష్టగ్ స్యాత్' అని శ్రుతి బాగుగా చదువుకొన్న బ్రాహ్మణులు, అధ్వర్యులు గాను ఋత్విక్కులు గాను ఇతర పాత్రల లోను నిలిచి యజ్ఞము జరిపించిన తరువాత వారి కియ్యవలసినంత దక్షిణ సరిగా నియ్యక పోయినచో యజమానికి అనర్ధము కలుగునని యర్ధము..!


శ్రాద్ధ కర్మలయందు, యజ్ఞ కర్మల యందు, దేవతా ప్రీత్యర్ధం మొనరించిన సకల పూజా కార్యక్రమములందు యజ్ఞ కర్త దక్షిణ ఇవ్వకున్నను, పురోహితుడు దక్షిణ ఆర్జించని యెడల శ్రీ మహాలక్ష్మీ శాపముతో దరిద్రుడై భాదలను అనుభవించునని బ్రహ్మ వైవర్త పురాణం నందు వివరించబడినది.


దక్షిణ ఇవ్వకుండా,తీసుకోకుండా చేయు కర్మ ఫలితాలు బలి చక్రవర్తికి చెందును. శ్రాద్ధ కర్మములందు అర్పించిన వస్తువులన్నియు బలి చక్రవర్తికి భోజన రూపమున చేరగలవు.


దక్షిణా దేవి స్తోత్రమును యజ్ఞ సమయమున పఠించిన వారికి సర్వ యజ్ఞ ఫలములు నిర్విగ్నంగా సంపన్నమగును.


దక్షిణాదేవి దివ్య చరితా శ్రవణ మొనర్చిన వారికి ధనం, విద్య, స్ధిరాస్తులు, లభించును.


అలాంటి దక్షిణా దేవిని పూజించిన వారికి వ్యాధుల బారి నుంచి... బాధల బారి నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.


దక్షిణాదేవి ధ్యానము, స్తోత్రము, పూజాదికము, ఆ దక్షిణాదేవిని సాలగ్రామము లేక కలశమున ఆవాహనము చేసి పూజింపవలెను.


ఈదేవిని ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయైస్వాహా అను మూల మంత్రముచే పూజించుచు అర్ఘ్యపాద్యాది షోడశోపచార పూజలను చేయవలెను.


దక్షిణా దేవి స్తోత్రం.


పురా గోలోకగోపీ త్వం గోపీనాం ప్రవరాపరా | రాధాసమా తత్సఖీ చ శ్రీకృష్ణప్రేయసీ ప్రియే || 


కార్తికీ పూర్ణిమాయాంతు రాసేరాధా మహోత్సవే | 

ఆవిర్భూతా దక్షిణాంశాత్‌ కృష్ణస్యాతో హి దక్షిణా || 


పురా త్వం చ సుశీలాఖ్యా శీలేన సుశుభేన చ | 

కృష్ణ దక్షాంశవాసాచ్చ రాధాశాపాచ్చ దక్షిణా || 


గోలోకాత్త్వం పరిద్వస్తా మమభాగ్యాదుపస్థితా | 

కృపాం కురమత్వమేవాద్య స్వామినం కురు మాం ప్రియే || 


కర్తౄణాం కర్మణాం దేవీ త్వమేవ ఫలదా సదా | 

త్వయా వినా చ సర్వేషాం సర్వం కర్మ చ నిష్ఫలం || 


ఫలశాఖా విహీనశ్చ యథావృక్షో మహీతలే | 

త్వయా వినా తథా కర్మ కర్తౄణాం న చ శోభతే || 


బ్రహ్మవిష్ణు మహేశాశ్చ దిక్పాలాదయ ఏవ చ | 

కర్మణశ్చ ఫలం దాతుం న శక్తాశ్చ త్వయా వినా || 


కర్మరూపీ స్వయం బ్రహ్మా ఫలరూపీ మహేశ్వరః | 

యజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణీ ||


ఫలదాతా పరం బ్రహ్మ నిర్గుణః ప్రకృతేః పరః | 

స్వయం కృష్ణశ్చ భగవాన్‌ న చ శక్తస్త్వ యా వినా || 


త్వమేవ శక్తిః కాంతే మే శశ్వజ్జన్మని జన్మని | 

సర్వకర్మణి శక్తోహం త్వయాసహ వరాననే |


లక్షీ్మ దక్షాంశ సంభూతాం దక్షిణం కమలాకళాం | 

సర్వకర్మసు దక్షాం చ ఫలదాం సర్వకర్మణాం || 


విష్ణోః శక్తి స్వరూపాం చ సుశీలాం శుభదాం భజే | 

ధ్యాత్వానేనైవ వరదాం సుధీర్మూలేన పూజయేత్‌ 


ఈ దక్షిణాఖ్యానమును శ్రద్ధగా విన్నచో అతడు చేయు సత్కర్మలు నిర్విఘ్నముగా పరిపూర్ణమగును. 


పుత్రులు లేని వారికి పుత్రులు, భార్య లేని వారికి గుణవతియగు భార్య, విద్య లేని వానికి విద్య, ధనము లేని వానికి ధనము, భూమి లేని వానికి భూమి లభించును. 


కష్టకాలమున, బంధువుల వియోగకాలమున, కారాగారమున బద్దుడైనప్పుడు దీనిని ఒక నెలవరకు విన్నప్పటికిని అతని కష్టములన్నియు తీరిపోవును.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

సనాతన సాంప్రదాయాలు

 తరతరాలుగా మనం వింటున్న , క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. . 

1. సోమ వారం తలకు నూనె రాయరాదు.

2. ఒంటి కాలీపై నిలబడ రాదు

3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు

4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంప రాదు

5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలీ

6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు

7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు

8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు, తల దువ్వ రాదు

9. పెరుగును ఉప్పును అప్పు ఈయరాదు

10. వేడి వేడి అన్నం లోనికి పెరుగు వేసుకోరాడు

11. భోజనం మధ్యలో లేచి పోరాదు

12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు

13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు

14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు

15. గోడలకు పాదం ఆనించి పడుకో రాదు

16. రాత్రీ వేళలో బట్టలుతక రాదు

17. విరిగిన గాజులు వేసుకోరాడు

18. నిద్ర లేచిన తరువాత పడుకున్న ఛాపను మడిచి పెట్టాలి

19. చేతి గోళ్ళను కొరకరాడు

20. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాడు

21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు

22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు

23. భోజనం తరువాత చతిని ఎండ పెట్టవద్దు

24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు

25. ఇంటి గడపపై కూర్చోరాదు

26. తిన్న తక్షణమే పడుకోరాదు

27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు

28. చేతులు కడిన పిమ్మట ఝాడించ రాదు

29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి

30. ఎంగిలీ చేతితో వడ్డించరాదు

31. అన్నం, కూర చారు వండిన పాత్రలలో తినరాదు

32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు

33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు

34. చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు

35. ఇంటి లోపలికి చెప్పులు Shoes ధరించి రారాదు

36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే.

37. చిన్న జంతువులకు (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి

38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించ రాదు

39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీడి పదార్థాలు తీసుకోవద్దు.

40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు

41. అనవసరంగా కొత్త చెప్పులను కోనరాదు

42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి

43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసివుంటే అవే వస్తాయి.

44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి

45. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి

   మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.

మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి.


 కారు మేఘాలు కమ్ముతున్నాయి 

ఏక్షణంలో అయినా... 

వర్షం విపరీతంగా కురుస్తుంది...! 

వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !

      *అదీ..సంప్రదాయం!* 

 ....................


అంతర్జాతీయ ఖ్యాతినార్జించి

అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా 

పాఠాలు చెప్పిన పంతులుకు 

పాదాభివందనం చేస్తాడు…! 

 *అదీ .. సంస్కారం !* 

 .....................


ఖగోళ శాస్త్రాన్ని 

నమిలి మింగిన నిష్ణాతుడు.  

నిష్టగా ఉంటూ

గ్రహణం విడిస్తేగానీ... 

ఆహారం గ్రహించడు…! *అదీ .. నమ్మకం !* 🙏

  ....................


పరమాణు శాస్త్రాన్ని 

పిండి పిప్పిచేసిన పండితుడు. 

మనవడి పుట్టు వెంట్రుకలు 

పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…! 

 *అదీ .. ఆచారం !* 🙏

......................


అంతరిక్ష విజ్ఞానాన్ని

అరచేతబట్టిన అతిరధుడు. 

 అకుంఠిత నిష్ఠతో

పితృదేవతలకు 

పిండ ప్రదానం చేస్తాడు…!

 *అదీ .. సనాతన ధర్మం!

 ........................


అత్తింటికి వెళ్లేముందు 

ఇంటి ఆడబడుచు 

పెద్దలందరికీ 

పాదాభివందనం చేసి 

పయనమవుతుంది…! 

 *అదీ .. పద్ధతి !* 🙏

 ........................


పెద్ద చదువులు చదివినా 

పెద్ద కొలువు చేస్తున్నా 

పేరు ప్రఖ్యాతులున్నా 

పెళ్లి పీటలమీద .. వధువు

పొందికగా ఉంటుంది…! *అదీ .. సంస్కృతి!*🙏

శ్రీశైల క్షేత్రం.

 శ్రీశైల క్షేత్రం..

#శ్రీశైలం ఆంద్రదేశ్ కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని చెబుతారు. కానీ దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు. 


గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుహ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అపుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.


సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. అపుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. అపుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది 


సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. మనం అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.


అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామీ వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు. 


శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. 


అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని. అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. 


ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.


సర్వాం శివమయం జగత్..🙏

 ॐ సర్వం శివమయం జగత్ ॐ

  ॐ ఓం నమఃశివాయ ॐ

 🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏