16, ఫిబ్రవరి 2025, ఆదివారం

విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (52)*


*గభస్తినేమిః సత్త్వస్థః*

*సింహో భూత మహేశ్వరః ।*


*ఆదిదేవో మహాదేవో*

*దేవేశో దేవభృద్గురుః ॥* 


*ప్రతి పదార్థం:~*


*487) గభస్తినేమి: - నీతిమంతమైన చక్రాయుధమును ధరించినవాడు*


*488) సత్వస్థః: - అందరిలో ఉండువాడు; భక్తుల హృదయములందు వసించువాడు .*


*489) సింహః: - సింహం వలె పరాక్రమశైలియైనవాడు ; శ్రీ నృసింహ మూర్తి, అనంత శక్తిసంపన్నుడు*


*490) భూతమహేశ్వరః: - సర్వ భూతములకు ప్రభువైనవాడు.*


*491) ఆదిదేవః: - సృష్టికి ఆది అయిన దేవుడు; తొలి దేవుడు*


*492) మహాదేవః: - గొప్పగా క్రీడించువాడు; గొప్ప దేవుడు.*


*493) దేవేశః: - దేవతలకు కూడా పాలకుడు; దేవదేవుడు.*


*494) దేవభృత్ -గురుః: -  దేవతల అధిపతి అయిన ఇంద్రునకు గురువు.*


*495) గురుః:- గురువు. వేదముల రూపమున జ్ఞానం అంతటికిని మూలము.*


*తాత్పర్యం:~*


*కిరణచక్రము యొక్క మధ్యభాగమునందు సూర్యరూపమున విలసిల్లువాడును, సత్త్వగుణమునందు ప్రతిష్టితుడై యున్నవాడును, సింహం వలె పరాక్రమశైలియైనవాడును, సమస్తభూతజాలములకు అధిపతియును, అందరి దేవతలకంటే ముందుగా నున్నవాడును, పరమశివుడును, దేవతల కందరకును ప్రభువైనవాడును, దేవతలందరికి అధిపతియైనవాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*


*పాఠకులందరికీ శుభం భవతు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       ‌        *సూచన*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*హస్త నక్షత్రం 4వ పాదం జాతకులు పై 52వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

*భజే శ్రీనివాసమ్

 *భజే శ్రీనివాసమ్.*

*(ఇరవై ఏడు నక్షత్రాల శ్రీనివాస దివ్య వైభవం)*

*రచన.*

*తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్త.*

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴


 **విశాఖ -- 16*

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


విశాఖ నక్షత్రానికి అధిపతులు ఇంద్రాగ్నులు. విశాఖ అయిదు

నక్షత్రాల సమూహం. ఇక్కడినుంచీ జ్యోతిశ్చక్రం మరో శాఖలోనికి

వెళుతుంది. అందుకే ఇది వి-శాఖ, విశాఖ నక్షత్రంగా పిలవబడు తున్నది.ఈ నక్షత్రాన్ని రాధా నక్షత్రమని కూడా అంటారు. ఇందువలననే వైశాఖమాసాన్ని రాధామాసం అని కూడా వ్యవహరిస్తారు.వైశాఖ మాసం శ్రీనివాసునికి ఎంతో ప్రీతిపాత్ర మైనది. ఈ మాసంలోఎవరైతే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ

ఉంటారో వారి సర్వభాగ్యాలు కలుగుతాయి. జీవించినంత కాలం సుఖంగా జీవించి చివరకు అమృతతత్త్వాన్ని పొందుతారు. ఈ అష్టాక్షరీమంత్రానికి మించిన దివ్య ఔషధం మరొకటి లేదు. మంత్రము అంటేమననం చేయువారిని రక్షించునది అని అర్థం. ఎవరైతే ఓం నమో

నారాయణాయ అనే మంత్రాన్ని రోజులో ఒక్కసారైనా జపిస్తున్నారో వారు అన్ని ఆపదల నుండి రక్షింపబడుతారు. అకాల మృత్యువు దరిచేరదు.

పూర్ణాయుష్షుతో కలకాలం సుఖంగా జీవిస్తారు.  అద్భుతమైన ఈ అష్టాక్షరీ మంత్రం సృష్టిలో తిరుగులేని శక్తి కలది. ఈ మంత్రంలో ఓం అనేది ఆత్మ స్వరూపం. నమః అనేది ప్రకృతి స్వరూపం. అకార, ఉకార, మకార కలయికే ప్రణవ స్వరూపమైన ఓంకారము. ఈసృష్టి మొత్తం ఓంకారంనుంచే ఉద్భవించింది.   అదే నారాయణ స్వరూపం.

శ్రీమన్నారాయణుడు సృష్టి చేయాలి అనే సంకల్పించగానే అతని మహోజ్వల స్వరూపం నుంచి హిరణ్యగర్భుడు ఆవిర్భవించాడు. ఆ తర్వాత

పంచభూతాలు ఉద్భవించాయి. ఆ తరువాత శ్రీమన్నారాయణుడు

మరొక్కమారు సంకల్పం చేయగా ఆ పరబ్రహ్మమూర్తినుండే బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, సకల వేదాలూ ఉద్భవించాయి.

ఓంకార స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు సత్యము, నిత్యము. భూమి, ఆకాశము, దశ దిశలూ వ్యాపించి ఉన్నది ఆ శ్రీమన్నారాయణుడే.

ఊర్ధ్వ, మధ్య, అధోభాగముల యందు ఉన్నది ఆ శ్రీనివాసుడే. అతడుకాలపురుషుడు. భూత, భవిష్యత్ వర్తమాన కాలాలు అతడే. ఈ సృష్టిమొత్తం

శ్రీమన్నారాయణుని స్వరూపమే. ఈ విషయం గ్రహించిన వారు కూడా నారాయణ స్వరూపులే అవుతారు. సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు జీవుల హృదయపద్మంలో ప్రకాశిస్తూ ఉంటాడు. సర్వ జీవకోటియందు అంతర్యామి

స్వరూపంగా భాసిస్తున్నది అతడే. అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో

నారాయణాయ లోని ఓంకారము బ్రహ్మ స్వరూపము. నకారము విష్ణుస్వరూపము, మకారము రుద్ర స్వరూపము. నకారము ఈశ్వర రూపము.రకారము విరాట్ స్వరూపము. యకారము పరమ పురుష స్వరూపము.

ణకారము భగవత్స్వరూపము, ఇక చివరిదైన యకారము పరమాత్మ  స్వరూపము. ఇంతటి మహోన్నతమైన నారాయణ అష్టాక్షరీ మంత్రాన్నిజపించిన వారికి సర్వ భాగ్యాలూ సమకూరుతాయి.

మానవు లందరూ అనేక కర్మలు చేస్తుంటారు. మనం చేసే మంచి కర్మలవలన పుణ్యమూ, చెడు కర్మలవలన పాపమూ కలుగుతుంది.మానవులు చేసే కర్మ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సంచిత కర్మ.రెండవది వర్తమాన కర్మ. సంచిత కర్మ అంటే మనం జన్మ జన్మలనుంచిమోనుకుని వచ్చినది. ఇది ప్రతి జన్మలోనూ ఎంతోకొంతఅనుభవిస్తుంటాము. ఈ కర్మను పూర్తిగా క్షయం చేయాలంటే ఆ కర్మను

పూర్తిగా అనుభవించటమే. అనుభవించటం వలన మాత్రమే కర్మ క్షయంఅవుతుంది. కానీ మానవుడు కోటానుకోట్ల జన్మలలో మూటకట్టుకున్న కర్మను క్షయం చేసుకోవాలంటే ఈ కల్పాంతం దాకా జన్మలెత్తినా

సాధ్యపడదు. కాబట్టి ఈ సంచిత కర్మను జ్ఞానాగ్నిలో దగ్ధం చేయాలి. ఈవిధంగా మాత్రమే సంచితకర్మ క్షయమవుతుంది.ఇకపోతే రెండవది వర్తమానంలోని కర్మ. అంటే ఈ జన్మలో చేసిన

కర్మవల్లనే క్షయమయ్యేది. ఇది లాగి వదిలిన బాణం వంటిది. ఈ జన్మలోచేసిన మంచి చెడులకు కొంతమేర ఈ జన్మలో అనుభవించవలసి రావడం.

ఎటువంటి కర్మనైనా క్షయం చేసుకునే జ్ఞానాన్ని, దివ్యత్మాన్ని

ప్రసాదించగలిగేది ఒక్క నారాయణ అష్టాక్షరీ మంత్రం ఒక్కటే. ఇది

మోక్షప్రాప్తికి అతి తేలికైన సాధనం.

శ్రీమన్నారాయణుడు ఆశ్రిత వత్సలుడు. అల్ప సంతోషి కూడాను.కేవలం గుప్పెడు అటుకులు మాత్రమే ఇచ్చిన సుదామునికి సర్వ సంపదలూ

అనుగ్రహించాడు.శ్రీమన్నారాయణ తత్త్వాన్ని అర్థం చేసుకుని అతడే

పరమాత్ముడు, పరమ గురువు, పరమ గతి, పరమాశ్రయుడు,  పరమ సఖుడు, అని తెలుసుకున్నవారికి సర్వ భాగ్యాలూ లభిస్తాయి. ఇంతటి

అమృతమూర్తి అయిన శ్రీమన్నారాయణుడే తిరుమలలో శ్రీనివాసునిగావెలసి తనను శరణు వేడిన భక్తులను ఎల్లవేళలా రక్షిస్తున్నాడు. సర్వసంపదలూ అనుగ్రహిస్తున్నాడు.

ఓ శ్రీనివాసా! ఎంతటి అమృతమూర్తివి తండ్రీ నీవు. సకల చరాచరసృష్టి కర్తవు నీవే, సర్వ మంగళ స్వరూపడవు నీవే. నీకివే మానమస్కారములు. ఓ శ్రీమన్నారాయణా! నీకివే ప్రణామములు.

జగద్రక్షకా! నీకివే మా నమస్కారములు.

*" శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్*

*శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ”*

🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

శారదా దేవి దివ్య స్వరూపం!

 శు భో ద యం🙏


శారదా దేవి దివ్య స్వరూపం!  


ఉ:  "  అంబ!  నవాంబుజోత్పల  కరాంబుజ  శారద!  చంద్ర  చంద్రికా


          డంబర  చారుమూర్తి; !  ప్రకట స్ఫుట భూషణ  రత్నదీపికా 

          

           చుంబిత  దిగ్విభాగ , శ్రుతి  సూక్తి  వివిక్త  నిజప్రభావ,   భా

            

           వాంబర  వీధి   విశ్రుత  విహారిణి!  నన్ గృపజూడు  భారతీ!


                 హరివంశము- అవతారిక - ఎఱ్ఱాప్రగ్గడ ;


(నవాంబుజోజ్జ్వలయనిపాఠాంతరము)


మాత  సరస్వతిని  కవులందరూ  స్మరించారు. కానీ , కవిత్రయంలో  తృతీయుడు  ఎఱ్ఱన  ప్రస్తుతించిన  తీరు అబ్బురమైనది.

ఆమూర్తిలోని  అంతస్ఫూర్తి  ,నింత గొప్పగా  ఆవిష్కరించిన  కవి  మరియొకఁడు  కానరాడు. బాహిర స్వరూపము నొక్కింత తడవుచు ఆతల్లి యక్షరామృత  వితరణా శీలమును  యెఱ్ఱన  యీపద్యమున  రూపు గట్టించినాడు.

    

         కఠినపదములకు అర్ధము:- అంబుజము-పద్మము; ఉత్పలము-కలువ; చంద్రిక-వెన్నెల;  చారు మూర్తి-  మనోహరాకారము కలది; రత్నదీపిక- రత్న దీపము; చుంబిత -ముద్దిడుకొను ; శ్రుతి-వేదము; సూక్తి-మంచిమాట;

వివిక్త- విశ్లేషణ;( కాళీప్రదేశమని మరొక అర్ధముంది) భావాంబరము- మనస్సనే యాకాశము; విశ్రుత విహారిణి: ప్రసిధ్ధినొందిన విహారముగలది;


           అప్పుడే వికసించిన పద్మములను,కలువలను బోలిన కరములు గలదానా! చంద్రుని వెన్నెలను బోలిన  మనోహర స్వరూపిణీ! ఆభరణములందు గల దీప సదృశములగు రత్నకాంతులను దిగంత పరివ్యాప్త మొనరించుదానా! వేదవాక్యములయందు  నిరూపింపబడు మహా ప్రభావ శాలినీ!  హృదయాకాశమునందు  స్వేఛ్ఛావిహారమొనరించు  మాతా! 

భారతీ!  నన్ను  దయజూడుము;  అని భావము.


                    ఈపద్యంలో 1  నవాంబుజోత్పల కరాంబుజ!


                                        2భూషణ  రత్నదీపికా చుంబిత  దిగ్విభాగ!

   

                                        3 శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ!

       

                                        4 భావాంబర వీధి విశ్రుత విహారిణి!                      అనే యీనాల్గు  విషయాలూ  విశ్లేషింప దగినవి.

మొదటిది: ఆమె కరములు  అంబుజములట! అంబుజములు రెండురకములు .పగటికి తామరలు పద్మములు.రేయికి కలువలు. ఆమెహస్తము లీ  రెంటిని బోలి యుండునట. రేయింబవళ్ళు  ఆమెచేతులకు పని. యేమిపని? జ్ఙానామృతమును పంచుపని.అక్షరామృతమునందించుపని, పద్మమునందు మకరంద ముండును.మాత సరస్వతి హస్తమున జ్ఙానామృతముండును. దానినామె నారాధించువారికి  రేయింబవళ్ళు వితరణ మొనర్చును. ఆహా! ఎఱ్ఱనగారి యూహ యెంత గొప్పది!!!


               ఇఁక రెండవ యంశము: ఆమెభూషణములు  రత్నదీపములట!ఔను రత్నదీపికలే! శ్రుతులే యామెకు నిజభూషణములు. వాటిప్రభావము విశ్వ వ్యాప్తమేగదా! భారతీయ జ్ఙాన వికాసమునకు వాని వెలుగులే  యాధారము.


            3శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ! వేద సూక్తుల యందు ఆమెప్రభావము  అడుగడుగునా ప్రస్ఫుట మగుట మనకు విదితమే"  అక్షరం పరమంపదం"- ఆఅక్షరమైన పరంబ్రహ్మ  స్వరూపావిష్కరణకు  అక్షరం అవసరంగదా! ఆఅక్షరమే ఆమెరూపము, ఆమెస్వభావము, ఆమెప్రభావము. 


                        4  భావాంబర వీధి  విశ్రుత విహారిణి! హృదయాకాంశంలో  తిరుగు లేని సంచారంచేసే తల్లి.ఆమాట నిజమే!

కానీ, భావాంబరమని  " అంబర"- శబ్దాన్ని యెఱ్ఱన ప్రయోగించుటలో  నేదో ప్రత్యేకత యున్నది. అంబరము అనుపదమునకు 

ఆకాశము  అను నర్ధమేగాక  వస్త్రము  అను నర్ధముకూడా ఉన్నది. హృదయమనే కేన్వాసుపై  చెరగని ముద్రవైచుకొని  యెటుబోయిన నటువచ్చు(మూవీ) స్వరూపముగలదట! ఈచిత్ర మెంత చిత్రము!


                               మనము  మరియొక దాని నుపేక్షించితిమి ." శారద  చంద్ర చంద్రికా డంబర  చారుమూర్తి" శరత్కాలమునందలి చంద్రుని వెన్నెలనుదలపించు చల్లని మనోహర రూపిణి! మాత  సరస్వతి  చల్లనిది. ఆమెకరుణ సూర్యాతపమువంటిదికాదు, చంద్రాతపమును బోలి చల్ల నిది. వెన్నెలను జ్ఙానముగా పెద్దల సూచన! అందుచేత చల్లగ మెల్లగ జ్ఙాన సంపదను యిచ్చుతల్లీ!యని కవియను చున్నాడు.


                              ఇటులీ పద్యము  అనవద్యము  హృద్యమునై  చదువుల తల్లి యంతః సత్త్వమును వ్యక్తమొనర్చు

పరమామ్నాయ  సదృశమై  యొప్పారు చున్నది.


                                                                  స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అఘోరీ_మూడవ_భాగము_3

 #అఘోరీ_మూడవ_భాగము_3

ఇంతవరకూ చదివింది...

[ " తెలుగా?" 

" ఔను స్వామినీ "

దీక్ష ఎప్పుడయింది? 

ఐదేళ్ళ కిందట. 

ఈ రాత్రి రెండో జాముకి, నిన్న హోమము చేసిన చోటుకి రా... అంటూ ఆమె సమాధానం కోసము చూడకుండా వెళ్ళిపోయింది. ]

పగలంతా ఇంకేమీ పని లేదు. తనతో వచ్చిన తమ తెగ వారితో కలిసి భోజనము చేసింది. ఉడికించిన చామగడ్డలు, చిలగడ దుంపలు, కాసిని మరమరాలు. ఒక అరటి పండు. అంతే. పాలు మాత్రము దండిగా దొరుకుతాయి. మహా కుంభమేళా లో ఎందరో సాధకులు, అధికారులు లక్షలకొలదీ భక్తులకు షడ్రసోపేతమైన భోజనాలు ఉచితంగా అందిస్తున్నారు.  తమకు అవి నిషేధము.  కాకపోయినా కూడా తనకు ఆహారం మీద అంత పట్టింపు లేదు. 

భోజనం చేసి తిరిగి జపములో మునిగింది. సాయంత్రము ఐదు గంటలకు మరలా స్నానము చేసి వచ్చింది. ఈసారి ఆ మాత కనపడలేదు. వచ్చి యోగసాధనలో మునిగిపోయింది.  రాత్రిళ్ళు భోజనాలు ఉండవు. అసలు ఒక పూట భోజనము దొరకడమే ఎంతో అదృష్టము. తమ స్థావరాలలో ప్రతిరోజూ భోజనం ఉండదు.  ఏది దొరికితే దానితో సరిపెట్టుకోవాలి. మాంసాహారం నిషిద్ధం. జనాలు అనుకునేటట్టుగా తాము శవాలను పీక్కు తినము.  మేళాలో కొందరు తనని ఇదే అడిగారు.  అదంతా అబద్ధమని స్పష్టంగా చెప్పింది. అయితే, రొట్టెలకు, పళ్ళకు, పాలకు, మాంసాహారానికి, శవాల కట్టెలకు తమకు భేదం ఉండదు. అన్నీ ఒకటే. సామాన్య జనాలకు ఇది అర్థం కాదు. 

రాత్రవుతోంది. చంద్రుడు, నక్షత్రాలు బాగా కనిపిస్తున్నాయి. నవమి వెన్నెల, ప్రశాంత, నిర్మల ఆకాశం నుండీ సోనలుగా జాలువారి వచ్చి పడుతున్నది. తీతువు ఒకటి అరచుకుంటూ చంద్రుడికి అడ్డంగా వెళ్ళింది. దాన్ని మొదట్లో తాను చక్రవాకం గా పొరపడేది. 

నిన్నటి శవము కాల్చిన చోటకి బయలు దేరింది. తాను శిష్యురాలి నుండీ సాధకురాలిగా మారిన ఈ రెండేళ్ళలో ఎన్నెన్నో రాత్రుల్లో , శ్మశానాలలో హోమాలు చేసింది. కొన్నిసార్లు ఒంటరిగా శవాల మీద కూడా హోమాలు చేసింది. అప్పుడెప్పుడూ కలగని ఒక అనిర్వచనీయమైన భావం ఈ మహా కుంభమేళాలో కలుగుతోంది. కారణం తెలీదు కాని, ఇక్కడ అఘోరాచార్యులు, ఆచార్యాణులు, మహాంత్ లు, కౌళాంతరులు చేస్తున్న అనుష్ఠానాల ప్రభావం కావచ్చు. వారి స్థితికి తాను చేరుకోవాలంటే ఇంకా వందల యేళ్ళు అవుతుందేమో, బ్రతికి ఉంటే!! 

ఆలోచనల్లోనే తన గమ్యం చేరుకుంది. ఈరోజు కూడా ఒక శవాన్ని కాలుస్తున్నారు. స్మశానాలలో అయితే శవాలు దొరకడము, కాల్చడము సులభమే, కానీ ఈ మహా కుంభమేళాలో, కోట్లాది మంది శ్రద్ధాళువులు స్నానాలు చేస్తున్నా కూడా వారందరికీ కనపడకుండా  శవాన్ని తీసుకురావడమే కష్ట సాధ్యము.  దగ్గరికి వచ్చి చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ నిన్నటి ఆ మాత తప్ప ఇంకెవ్వరూ లేరు. వెళ్ళి ప్రణామము చేసింది. మాత, తనను కూర్చోమని పక్కనే చోటు చూపింది.  ఆమెతో పాటు మంత్రము చెపుతూ హోమము చేసింది.  అదయ్యాక ఇసుక తీసుకెళ్ళి నదిలో కలిపి మళ్ళీ వచ్చి కూర్చున్నారు. 

ఆ మాతే అడిగింది " కుముద్వతిని వెతుక్కుంటూ వచ్చావా?" 

తాను ఆశ్చర్యంతో అవాక్కైంది.  ఔనన్నట్టు తలాడించి, " మా గురువు గారి ఆదేశానుసారము " అంది.

మీ గురువుగారు ఇంకా ఏమి చెప్పారు? 

ఇంకేమీ లేదు స్వామినీ, ’ నీకు అదృష్టం ఉంటే కుముద్వతి  నీకు కనిపిస్తుంది. కనిపిస్తే, ఏమి చేయాలో ఆమే చెపుతుంది. ఆమె చెప్పినట్టు నడుచుకో..’ అన్నారు.

ఆమె కనబడుతుందనుకుంటున్నావా? 

తెలీదు స్వామిని, అసలు ఆమె ఉందో లేదో తెలీదు. తమరిని ఒకటి అడగవచ్చునా?

ఏమిటది?

కుముద్వతి మీకు తెలుసా? ఆమె అదే పేరుతోనే ఉండేదా? 

తెలుసా..అన్నదానికి జవాబు ఇవ్వకుండా స్వామిని అంది," అఘోరీలు కానీ, అఘోరాలు కానీ ఎవరూ తమ అసలు పేర్లు మార్చుకోవలసిన అవసరం లేదు. నీకు తెలియదా? 

తెలియదు,స్వామిని, నేనయితే మార్చుకోలేదు... కొందరి పేర్లు చూస్తే అసలు పేర్లు కావేమో అనిపించేది. అందుకు మార్చుకున్నారేమో..అనుకొనేదాన్ని. 

కుముద్వతి గురించి మీ గురువుగారు ఇంకేమీ చెప్పలేదా? నువ్వు యే స్థావరం నుండీ వచ్చావు? 

గురుదేవులు ఇంకేమీ చెప్పలేదు, స్వామిని, నేను దీక్ష తీసుకున్నది నేపాల్ సరిహద్దు లోని ’ కుమావ్ ’ కొండల దగ్గర. 

ఉన్నట్టుండి స్వామిని, పాట మొదలు పెట్టింది," జైసే గంగాకి ధారా శంకరా హో తేరే గల్లే మె నాగన్ కీ మాలా డమ్మే డమ్మే డమరూ బాజే...

ఆ పాట తానూ అందుకుంది, తనకు ఇష్టమైన పాట.  ఇద్దరూ కలిసి పాట మొత్తం పాడారు.  నిన్నటి తెలుగుపాట పాడింది ఈ స్వామిని తప్ప ఇంకెవరూ కాదు అని అర్థమైంది. అదే గొంతు.

తాను మళ్ళీ అడిగింది, ’ ఇంకో ప్రశ్న అడగవచ్చా?" 

అడుగు

’ నిన్న మీరు పాడిన తెలుగుపాట మీకెలా వచ్చింది? రేడియోలో విన్నారా? ’

స్వామిని మొహం పై అతిచిన్న మందహాసము మెరిసింది. అది మందహాసమేనా, లేక తాను అలా అనుకుందా?””

ఆ పాట వ్రాసింది మా పూర్వాశ్రమపు తాతగారు. ఇప్పటికి ఐదు వందల సంవత్సరాల పైనే అయి ఉంటుంది.  చిన్నపుడు మా అమ్మ నాకు నేర్పింది. మాతాత గారు నాతో అన్నారు, ’ నువ్వు జీవితాంతమూ ఈ పాట పాడుకుంటూ ఉండాలి, ఎప్పటికీ మరచిపోరాదు..’ అని.. నా వయసు ఇప్పుడు నాలుగు వందలా అరవయ్యో, డెబ్బయ్యో. 

అయితే మీరు పుట్టుకతో తెలుగువారేనా, మా జేజెమ్మ కుముద్వతి గురించి మీకు తెలిసిందంతా చెప్పండి... ఆమె ఇప్పుడు ఎక్కడుంది? 

కుముద్వతిని మరచిపో.. ఆమె మరణించి వంద సంవత్సరాలు దాటింది... అంది స్వామిని గంభీరంగా. 

మళ్ళీ తానే అంది, " కుముద్వతి మరణించేనాటికి ఆమెకు రెండు వందల యాభై యేళ్ళ పైనే. నువ్వనుకున్నట్టు ఆమెకు ఇప్పుడుంటే నూట అరవై యేళ్ళు కాదు, మూడువందలయాభై యేళ్ళూ ఉండేవి "

తాను విస్మయముతో  నిరుత్తరురాలైంది. జేజెమ్మను కలుస్తానని ఎందుకో బలమైన నమ్మకం ఉండింది. ఆమెను కలవడానికే దేవుడు ఇక్కడికి పంపించాడేమో ...అనుకునేది.  గురువుగారు కూడా, ఆమెను కలుస్తావు అనే అర్థంతోనే అనేవారు... హఠాత్తుగా...ఆమె లేదంటే... మనసు ఒకలా అయిపోయింది. కానీ తానొక అఘోరీ. ఇటువంటి వాటికి చలించే దుర్బల మనసు కాదు తనది. తమకు ఇచ్చే శిక్షణ కూడా అటువంటిది...

ఇద్దరూ మౌనంగా మరలా హోమం చేశారు. స్వామినిని ఇంకేమో అడగాలనుకుంది కానీ ఆమె గంభీర ముద్ర చూసి అడగలేకపోయింది. 

హోమం అయ్యాక స్వామిని అంది, " ఈ రోజు త్రయోదశి. ఎల్లుండి మహా మాఘి. ఆరాత్రి నువ్వు తప్పకుండా రావాలి. నిన్ను ఇక్కడికి రప్పించిన ఉద్దేశమే అది. "

" క్షమించాలి, స్వామిని, ఆ రోజు మా తెగ వారమంతా రాత్రంతా అనుష్ఠానాలలో ఉండాలి అని నిర్ణయించారు. "

" మహా అఘోరాచార్యాణి వైజయంతి చెప్పింది అని చెప్పు " అని ఇక మాట్లాడ కుండా ఆమె స్నానానికి వెళ్ళింది. 

అవాక్కై, తాను కూడా స్నానం చేసి భస్మ ధారణ చేసి వచ్చింది. ఇద్దరూ మళ్ళీ మాట్లాడుకోలేదు. 

తిరిగి వస్తుండగా మహా అఘోరాచార్యాణి మాట గుర్తు వచ్చింది.." నిన్ను ఇక్కడికి రప్పించిన ఉద్దేశమే అది. "

అంటే నన్ను ఇక్కడికి మహాచార్యాణి ఆదేశం మేరకు పంపారా? స్వామిని మహా చార్యాణి అని నాకు మొదట తెలీదు. గురువుగారికి తెలుసేమో... మహా అఘోరాచార్యాణి అంటే అంతకన్నా పెద్ద స్థాయి ఇక లేదు. ’ మహాంత్ ’ అని కూడా అంటారు. ’ " కౌళాంతర " అని కూడా అంటారు.. తనను పిలిపించడములో ప్రత్యేక కారణము ఉందా? తానింకా సాధకురాలిని మాత్రమే.  తర్వాత గురువు కావచ్చు. యోగీశ్వరి కావచ్చు.... ఆ తర్వాత మహాంత్.. సర్వోన్నతంగా ’ మహా అఘోరాచార్యాణి ’ .....పై మెట్టులలో ఒకదాని నుండీ ఇంకోదానికి వెళ్ళాలంటే సులభం కాదు. కొందరికి వందల యేళ్ళు శ్రమించినా అసంభవం.  

శిబిరానికి వచ్చి ఇతర కృత్యాలు యాంత్రికంగా చేసింది. మనసు నిండా వైజయంతి అఘోరాచార్యాణి , ఆమె మాటలు నిండి పోయాయి.  తెలుగుపాట వారి పూర్వాశ్రమపు తాతగారు ఐదు వందల యేళ్ళ కిందట వ్రాశారా? ఆమెకు వారి తల్లి నేర్పించిందా? మరి మా అమ్మకు ఎవరు నేర్పించి ఉంటారు? కుముద్వతి జేజెమ్మ చిన్నతనములోనే సన్యాసుల్లో కలసిపోయిందని చెప్పేవారు. ఆమెను తాను ప్రత్యక్షంగా చూడనే లేదు. అమ్మ చూసి ఉంటుందా? అనుమానమే. . ఆమె ద్వారా అమ్మకు ఆ పాట వచ్చిందా? ఔను,  తన అత్తగారి నుండీ నేర్చుకున్నాను అందిగా,  అమ్మ ?  అత్తగారు అంటే కుముద్వతి ఎలా అవుతుంది? ఆమె చిన్నవయసులో సన్యాసం తీసుకోలేదా?   అన్నీ జవాబు లేని ప్రశ్నలే. మరి ఈ ఆచార్యాణికి కుముద్వతి ఎలా తెలుసు? ఎక్కడైనా శిబిరం లో కలిసిందేమో?. జేజెమ్మ పోయి వంద సంవత్సరాలు అయిందట. అంటే, అంతకు ముందే చూసి ఉండాలి. అప్పటికి ఆచార్యాణికి మూడు వందల యాభై యేళ్ళు వయసు. చూస్తే అలా కనపడదు. అంత సాధన తాను చేయగలదా? వీళ్ళంతా చిన్నతనము నుండే సాధన మొదలు పెట్టినవాళ్ళు కాబట్టి అంతకాలం బతకగలిగారు. నేను ఈ మధ్యే మొదలు పెట్టాను. 

జరుగుతున్నదంతా ఒక కలలా ఉంది. తాను మహా కుంభమేళాకు వస్తానని తెలుసు గాని, ఇక్కడ జరుగుతున్నవి తాను ఊహించనివి. నన్ను ఏదో ముఖ్యమైన పని మీదే రప్పించారు. అది ఏమిటో తెలీదు. ఆ పనికి తనకన్నా పైవాళ్ళు ఎందరో ఉన్నారు కదా? తననే ఎందుకు ఎంచుకున్నారు? ఒక సాధారణ సాధకురాలిని?  అన్నీ ప్రశ్నలే. ఎల్లుండి మహా మాఘి. అంటే మాఘ పౌర్ణమి. ఆనాడు తనకు ఏదో గొప్ప పని అప్పజెప్పుతారేమో?  

మహా మాఘి రానే వచ్చింది. ఉదయము నుండే తనకు ఏదో తెలీని ఉద్విగ్నత. మధ్యాహ్నం ఎలా గడిచిందో.. సంధ్యా స్నానాల్లో ఆచార్యాణి కనిపించలేదు.  తన శిబిరములో ఆమె పేరు చెప్పగానే ఎవరూ ఇక రెట్టించలేదు. వెళ్ళమన్నారు. 

రాత్రి మొదటి జాము దాటింది. జపము చాలించి బయలు దేరింది.  కాస్త త్వరగానే వెళ్ళింది. అక్కడ ఇప్పుడు కూడా మహా అఘోరాచార్యాణి వైజయంతి ఒక్కతే ఉంది. 

 " నువ్వు త్వరగా రావడం మంచిదైంది. త్వరగా రమ్మని నేనే చెప్పాల్సింది, మరచిపోయాను. ఈ రాత్రి తంతు చాలా విపులంగా ఉంటుంది." అని కూర్చోమంది. పక్కన కూర్చోబోతుంటే, అహ, కాదు నాకు ఎదురుగా, శవానికి ఆవల కూర్చో! అంది. ఆమె ఎదురుగా తాను కూర్చుంది. ఇద్దరి మధ్యలో శవం, చితిపైన. ఇంతకు ముందు గమనించలేదు కానీ, మాహా ఆచార్యాణి కళ్ళు నిప్పుగోళాలో, విస్ఫు లింగాలో అన్నట్టు ఎర్రగా కణకణలాడుతున్నాయి. ముఖం లోకి చూడాలంటే మామూలు జనం భయపడుతారు. దానికితోడు,  ఆ జటాజూటం...........

 అదేమిటి, ఆచార్యాణి కూడా తాను పెట్టుకున్నటువంటిదే లోలాకులే పెట్టుకుంది? శంఖం ఆకారం లో ఉన్న బంగారపు లోలాకు ఆమె కుడి చెవికి వేలాడుతోంది. ఎడమవైపు జటలతో కప్పుకున్నందున కనబడటం లేదు.  తాను సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు తెచ్చుకున్న పెట్టెలో ఒక లోలాకు ఉండింది. అంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అమ్మదేమో... పాతవస్తువుల చిన్న సంచీ తనతోపాటు అనుకోకుండా వచ్చింది. అందులో ఉండింది తానుపెట్టుకున్న లోలాకు. రెండోది వెతికితే దొరకలేదు. మళ్ళీ వెతకాలి అనుకుని మర్చేపోయింది...

    ఆలోచన నుండీ తేరుకొని చూసింది... ఈ సారి ఒక స్త్రీ శవం వచ్చింది. ఆమె గర్భవతిగా ఉండి మరణించిందో ఏమో, పొట్ట చాలా ఎత్తుగా ఉంది. ప్రసవం అయ్యేలోపే పోయిందేమో...

" మనకు ఈ రాత్రి ఇటువంటి శవమే కావలసినది. అంతా మహాదేవుడి అనుగ్రహం " అంది మహాచార్యాణి.  మొదటి రోజు కనిపించిన ఇతర అఘోరాలు మళ్ళీ కనపడలేదు.  తామిద్దరికీ రెండు పక్కలా పేలాలు, అటుకులు, నువ్వులు, బియ్యపు పిండి,  నెయ్యి, పాలు అమర్చి ఉన్నాయి. ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేశారో?

" అనవసర విషయాలు ఆలోచించక, అఘోర జపము వెయ్యిసార్లు చేయి... " అంది ఆచార్యాణి

తాను తలఊపి, గురుదేవులకు నమస్కరించి, కళ్ళు మూసుకుని జపములో మునిగింది. అయ్యాక కళ్ళు తెరిచి చూస్తే, ముందర, ఆచార్యాణికి పక్కన అటు పది మంది, ఇటు పది మంది కూర్చొని ఉన్నారు. ఎప్పుడు వచ్చారో... అందరి పక్కనా అవే హోమద్రవ్యాలు ఉన్నాయి. శవము చుట్టూ ఒక గంపలోని ఇసుక తీసి, గుప్పెళ్ళు గుప్పెళ్ళుగా పెట్టించింది ఆచార్యాణి. మొత్తం నూట ఇరవై. 

 శవము నుదుట ఉన్న కుంకుమ తీసి  వాటి మీద  అలంకరించింది. నువ్వులు చల్లింది. ఒక పాత్రలో నుండీ ఏదో ఎర్రటి ద్రవం అన్ని కుప్పలమీదా కొద్దికొద్దిగా పోసింది. అది రక్తమే అయి ఉండాలి.. ఎవరిదో..?

హోమం మొదలు అయ్యింది. మొదట తాము ఇద్దరూ ఆహుతులు వేస్తుంటే తర్వాత మిగతావారు కూడా అదే మంత్రము చెప్పి ఆహుతులు వేస్తున్నారు. ఒక వేయి ఎనిమిది ఆహుతులు అయ్యాయి. శవము సగము కాలి ఉంది. భరించలేని వాసన వస్తోంది కానీ, అందరికీ అది అలవాటే కాబట్టి, హోమం మీదే ఏకాగ్రతతో ఉన్నారు. 

ఉన్నట్టుంది ఆ ఇసుక కుప్పలనుండీ తెల్లటి పొగ, వెలుగు కిరణం వలె, పైకి ఎగజిమ్మడము మొదలైంది. అందరూ ఆనందంతో ’ హర్ హర్ మహాదేవ్’ అని అరిచారు. ఎందుకో తెలీకున్నా తానూ శ్రుతి కలిపింది. ఆ తెల్లటి పొగ వేగంగా బయటకు వస్తూ పైకి ఎగస్తోంది. అన్ని కుప్పలనుండీ వచ్చిన ఆ పొగ గాలిలో ప్రయాణిస్తూ వెళ్ళిపోయింది. అందరూ చప్పట్లు కొట్టారు. శవం ఇప్పుడు పూర్తిగా కాలిపోయి ఉంది.  హోమం ముగిసింది . అందరూ ఆ ఇసుక కుప్పల నుండే దోసిళ్ళతో ఇసుక తీసుకొని నదికి వెళ్ళి కలిపి, స్నానం చేసి వచ్చారు. మళ్ళీ యథా ప్రకారము జపము. కళ్ళు తెరిచేసరికి అరుణోదయం అయి ఉంది. ఎదుట ఎవరూ లేరు. ఎప్పుడు వెళ్ళిపోయారో? 

తాను లేచి, చితికి నమస్కరించి, శిబిరానికి వచ్చేసింది.  వచ్చేటప్పటికి శిబిరాల్లోని వారంతా గుమికూడి ఉన్నారు. అందరి ముఖాల్లోను ఏదో తెలియని భావం. అది గాంభీర్యమో, బాధో, ఆందోళనో తెలియడం లేదు. 

ఉన్నట్టుండి ఒక వృద్ధ అఘోరా వచ్చారు. ఆయన తెలుగులో అన్నారు, " ధన్యురాలవు  వైశ్వానరీ, నీకిచ్చిన కార్యము సమర్థవంతముగా నిర్వహించావు, నీకు గురు స్థానము త్వరలోనే ఇవ్వబడుతుంది. మహదేవుడి ఆశీస్సులు నీపై మెండుగా ఉంటాయి " అని చేయి పైకెత్తి ఆశీర్వదించారు. 

తనకు ఆశ్చర్యం అయింది, నేనేమి చేశాను? ఎప్పుడూ చేసే హోమాలే చేశాను కదా? 

అయినా, వినయముగా నమస్కరించి పక్కకు తొలిగాను. శిబిరాల వద్ద చేరుకున్న వారు ఇంకా అలాగే ఉన్నారు. ఎందుకో నాకు అర్థము కాలేదు. 

నిత్య కృత్యాలు ముగించి మళ్ళీ స్నానానికి వెళ్ళబోతుంటే పక్కనున్న వారు ఆపారు. " స్నానం ఇప్పుడే కాదు, దహనం తర్వాత.!" అని. 

దహనమా? ఏ దహనము? అని ఆశ్చర్యముతో అడిగాను.

వారు నవ్వి అన్నారు... ’ అదే నీ గొప్పతనము. నీకిచ్చిన కార్యాన్నీ మొక్కవోని ఏకాగ్రతతో ముగించావు, పక్కన ఏమి జరుగుతున్నదో కూడా తెలీనంత ఏకాగ్రత!. ఈ తెల్లవారుజామున, మీరు జపములో ఉండగానే, మహా అఘోరాచార్యాణి తనువు చాలించింది. నీ ఎదురుగానే!. కానీ నువ్వు ఎరుగవు.  ఈ ఉదయమే ఆమె శవ  దహనం  ఉంటుంది"

నాకు కళ్ళు తిరుగుతున్నట్టైంది.. మహాచార్యాణి చనిపోయిందా? నా ఎదురుగనే? నాకు తెలీకుండానే?  విద్యుద్ఘాతము తగిలినట్టైంది.  అయోమయంగా చూస్తున్నాను. 

[సశేషమ్]

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝  *పద్మాకరం దినకరో వికచం కరోతి*

        *చంద్రో వికాసయతి కైరవ చక్రవాలమ్‌।*

        *నాభ్యర్థితో జలధరో-పి జలం దదాతి*

        *సంతః స్వయం పరహితే విహితాభియోగాః॥* 


       *--- _భర్తృహరి సుభాషితరత్నావళిః_ ---*


*తా𝕝𝕝 అభ్యర్థించనవసరం లేకనే సూర్యుడు తామర కొలనును వికసింపజేయుచున్నాడు....ప్రార్థన చేయనవసరంలేకనే చంద్రుడు తెల్లకలువను వికసిల్లజేయుచున్నాడు..... మేఘుడు ప్రార్థించకుండకనే నీటిని యిచ్చుచున్నాడు....* *సత్పురుషులు తమంతట తామే పరులకు హితము చేయుటకు పూనిక వహింతురు....*


 ✍️🪷🌸💐🙏

రాముడు

 సేకరణ;



ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు .


మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన  - ఆదర్శ పురుషుడు


మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన -  అద్దం - రాముడు .


ధర్మం పోత పోస్తే రాముడు

ఆదర్శాలు రూపుకడితే రాముడు .

అందం పోగుపోస్తే రాముడు 

ఆనందం నడిస్తే రాముడు


వేదోపనిషత్తులకు అర్థం రాముడు

మంత్రమూర్తి రాముడు .

పరబ్రహ్మం రాముడు .

లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు


ఎప్పటి త్రేతా యుగ రాముడు ?

ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?

అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే


చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -


శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.


బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన

పాట -

రామాలాలీ - మేఘశ్యామా లాలీ


మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.


మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - అయ్యో రామా


వినకూడని మాట వింటే అనాల్సిన మాట -

రామ రామ


భరించలేని కష్టానికి పర్యాయపదం -

రాముడి కష్టం .


తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - రాముడు


కష్టం గట్టెక్కే తారక మంత్రం

శ్రీరామ .


విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - శ్రీరామ శ్రీరామ శ్రీరామ .


అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - అన్నమో రామచంద్రా


వయసుడిగిన వేళ అనాల్సిన మాట -

కృష్ణా రామా !


తిరుగులేని మాటకు - రామబాణం 


సకల సుఖశాంతులకు - రామరాజ్యం .


ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన


ఆజానుబాహుడి పోలికకు - రాముడు


అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 


రాముడు ఎప్పుడూ మంచి బాలుడే .


చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -

Rama killed Ravana ;


Ravana was Killed by Rama .


ఆదర్శ దాంపత్యానికి సీతారాములు


గొప్ప కొడుకు - రాముడు


అన్నదమ్ముల అనుబంధానికి -రామలక్ష్మణులు


గొప్ప విద్యార్ధి రాముడు

(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .


మంచి మిత్రుడు- రాముడు

(గుహుడు చెప్పాడు).


మంచి స్వామి రాముడు

(హనుమ చెప్పారు).


సంగీత సారం రాముడు

(రామదాసు , త్యాగయ్య చెప్పారు) నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం

(పిబరే రామరసం)

సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)


కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .


రామాయణం పలుకుబళ్లు


మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .


తెలుగులో కూడా అంతే .


ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని

అడిగినట్లే ఉంటుంది ...


చెప్పడానికి వీలుకాకపోతే -

అబ్బో అదొక రామాయణం .


జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే

సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .


ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -

అదొక పుష్పకవిమానం


కబళించే చేతులు , చేష్టలు

కబంధ హస్తాలు .


వికారంగా ఉంటే -

శూర్పణఖ


చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).


పెద్ద పెద్ద అడుగులు వేస్తే -

అంగదుడి అంగలు.


మెలకువలేని నిద్ర

కుంభకర్ణ నిద్ర


పెద్ద ఇల్లు

లంకంత ఇల్లు .


ఎంగిలిచేసి పెడితే -

శబరి


ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు


అల్లరి మూకలకు నిలయం

కిష్కింధ కాండ


విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -

అగ్ని పరీక్షలే .


పితూరీలు చెప్పేవారందరూ -

మంథరలే.


సాయం చేసినపుడు- ఉడుత భక్తి..

కార్యాన్ని సాధించినపుడు -హనుమ యుక్తి..

 గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిని


యుద్ధమంటే రామరావణ యుద్ధమే .


ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -

(రావణ కాష్టాలే .)


కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది

(ఇది విచిత్రమయిన ప్రయోగం ).


సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు


ఒంటిమిట్టది ఒక కథ ..

భద్రాద్రిది ఒక కథ

అసలు రామాయణమే మన కథ .

అది రాస్తే రామాయణం

చెబితే మహా భారతం


అందుకే కీ.శే. సర్వేపల్లిరాధాకృష్ణన్ గారు అన్నారు హిందుయిజమ్ ఒక మతం కాదు

అది ఒక జీవన విధానం


అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు


రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు


జై శ్రీ రామ్.....


|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||


ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది


జై శ్రీరామ్

అప్పకవీయం

 🙏అప్పకవీయం 🙏

అప్పకవీయం ఒక లక్షణ శాస్త్ర గ్రంథం.ఇప్పటికి యతి ప్రాసలకు ఈ గ్రంథమే ప్రామాణికం.

అప్పకవి రచించిన యీగ్రంథముపేరు 'ఆంధ్రశబ్దచింతామణి' అని యవతారికనుబట్టియు, ఆశ్వాసాంతగద్యలనుబట్టియుఁ దెలియుచున్నది. కాని 'అప్పకవీయ'మను నామమే దీనికిఁ బ్రసిద్ధము. కృతికర్త, యిది వ్యాకరణగ్రంథమని చెప్పేకొన్నను, ఇందు ఛందోవిషయములకే ఎక్కువ ప్రాధాన్య మీయఁబడినది. ఛందోగ్రంథముగానే దీనికి ప్రసిద్ధి కల్గినది. ఛందోవిషయపరిజ్ఞానమునకే దీనిని చదువుకుందురు. సాధారణముగా విశ్వవిద్యాలయములవారు తమపరీక్షలకు ఛందస్సునకు సంబంధించిన యిందలి తృతీయ, చతుర్థాశ్వాసములనే పాఠ్యములుగా నిర్ణయించుచుందురు.

అప్పకవీయము తత్కర్త రచించిన స్థితిలో నిప్పుడున్నట్లు కానరాదు. శ్రీ రేకము రామానుజసూరిగారు స్వతంత్రించి కొన్ని సవరణలు చేసినట్లు శ్రీగిడుగువారు తెలిపియున్నారు. ఇతర సంస్కర్తలును తమకుఁ దోఁచినట్లు సంస్కరించుచున్నట్లు తర్వాతి ముద్రణములనుబట్టి తెలియుచున్నది. లక్షణవిరుద్ధములగు విషయములు పెక్కు లీగ్రంథమునఁ గానవచ్చుట కిది కారణము కావచ్చును

కాకునూరి అప్పకవి తెలుగు లాక్షణిక కవిగా సుప్రసిద్ధుడు. ఇతను మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తాలుకాలోని కాకునూరి అగ్రహారానికి చెందినవాడు.అప్పకవి నన్నయభట్టు రచించిన 'ఆంధ్రశబ్ద చింతామణి' ఆధారంగా 'ఆంధ్రశబ్దచింతామణి' అను ఛందో గ్రంథాన్ని రచించాడు. తెలుగుభాషలో లక్షణగ్రంథాలను వాటి రచయితల పేర్లతో పిలిచే రివాజుగా ఈ పుస్తకం తెలుగు సాహితీ లోకంలో 'అప్పకవీయం' గానే స్థిరపడిపోయింది. ఈ గ్రంథాన్ని అప్పకవి ' సారపాదపం 'అని కూడా అన్నాడు. అప్పకవి పూర్వికులది కాకునూరికి సమీపంలోని ' లేమామిడి ' గ్రామం. వీరి తాత గారి తాత అక్కడే ఉండేవాడు. అప్పకవి తాతముత్తాతలంతా పండితులే. వీరి తాత పెద సోమయ్య పండితుడే కాక శ్రీమంతుడు కూడా. అప్పకవి తండ్రి వెంగన్న గొప్ప వేదపండితుడు. అప్పకవి పల్నాడుసీమలోని కామేపల్లిలో తనమేనమామల ఇంట పెరిగాడు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కాకునూరి సూర్యనారాయణ మూర్తి వీరి వంశానికి చెందిన వారే 

కాకునూరి అప్పకవి మన్మథ నామ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి (1656 ఆగస్టు 03 వ తేది) నాడు జన్మించినట్లు తానే స్పష్టంగా తన అప్పకవీయంలో పేర్కొన్నాడట.

అప్పకవి విద్యాభ్యాసం తన మేనమామల ఇంట పల్నాడు సీమలో సాగింది. మూర్తి సర్వన్న దగ్గర యజుర్వేదం, కాండూరి గిరయ్య దగ్గర వ్యాకరణం, సూరభట్టు దగ్గర సకలసిద్ధాంతాలు, కొలిచెలమల్ల సింగన్న గారి దగ్గర స్మార్తకర్మలు, రాజయోగి దగ్గర ఆగమాలు, మంచికంటి ఓబన్న దగ్గర లక్షణగ్రంథాలు చదువుకున్నాడు. అప్పకవిని లక్షణ కవిగా తీర్చిదిద్దినది ఓబన్నగారే.

విద్యాభ్యాసం పూర్తయ్యాక అప్పకవి శ్రీశైలం వెళ్ళాడు. అప్పటి ఆ ప్రాంత అధికారి అయిన భోగి విభూషణుడి ఆస్థాన కవిగా కొంతకాలం పనిచేశాడు. అక్కడే స్మార్తకర్మలకు సంబంధించి 'అపస్తంబ షట్కర్మ నిబంధనం' అను సంస్కృత నిబంధన గ్రంథాన్ని రచించాడు. కాలబాలార్ణవ సంహిత అనే జ్యోతిష గ్రంథానికి శ్లోకరూప సంగ్రహాన్ని రాశాడు. స్త్రీలకు పనికి వచ్చే 'సాద్వీజన ధర్మం' అనే ద్విపద కావ్యాన్ని, 'అనంతవ్రత కల్పం' అను కావ్యాన్ని రచించాడు. శ్రీశైల మల్లికార్జుని మీద శ్లేష గర్భితమైన నిందా స్తుతి శతకాన్ని రాశాడు. 'అంబికావాదం' అను యక్షగానాన్ని, 'కవికల్పం' అను లక్షణ గ్రంథాన్ని రచించాడు.


సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

అహల్య కథ🙏

 🙏వాల్మీకి మహర్షి చెప్పిన అహల్య కథ🙏


అహల్య విషయంలో వాల్మీకి రామాయణం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. అయితే అహల్య చరిత్ర వేదంలో కూడా వుంది. ఇతర పురాణాలలో అనేకచోట్ల ఆ ప్రసక్తి వచ్చింది. అహల్య చరిత్రయొక్క తత్వం సమగ్రంగా తెలియాలి అంటే కొన్ని సాంకేతిక అర్ధాల్లోకి కూడా వెళ్లాలి. మానవ జీవితాలు కేవలం వీళ్ల ఇచ్ఛల చేత కాకుండా గ్రహగతుల యొక్క ప్రభావంచేత కూడా నడుస్తుంటాయి. అయితే ఈ గ్రహగతులు ఎలా నడుస్తాయి అంటే గ్రహాలకంటే పైనున్న దివ్యలోక వాసులైన దేవతల ప్రవర్తన ద్వారా!గ్రహాలు ప్రభావితాలు కావడం అంటే గ్రహములయందు అధిష్టించినటువంటి దేవతలు ప్రభావితులై వాళ్ల ద్వారా వాళ్ల అంశలతోజన్మించిన వాళ్ల యొక్క ప్రభావంలో వున్న జీవుల మీద కూడా ప్రభావం చూపుతాయి. అలాంటి ప్రభావం మామూలుగా మనందరి మీదా పడుతూ వుంటుంది. కానీ మనం అందరమూ సామాన్య జీవులం కనుక చెప్పుకోదగ్గ కథ వుండదు. ఒకానొక సృష్టి క్రమంలో యుగ సంధి కాలంలో ఒక మహత్తరమైనటువంటి సృష్టి కార్యం చేయడంకోసం ఏ జీవులు అవతరిస్తారో, వాళ్ల జీవిత చరిత్రలు సామాన్యరీతికి భిన్నంగా ఉంటాయి. అహల్య అనేటువంటి జీవి స్ర్తి జీవిగా, బ్రహ్మ మానస పుత్రిగా జన్మించింది. ఆమెను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేసారు. మామూలుగా అందరి లాగా నడుచుకోవడం కోసం ఆ జీవి సృష్టించబడలేదు.

ఆ జీవివల్ల ప్రపంచానికి ఒక సందేశం అందాల్సి వుంది. అది ఉపాసనారీతి గురించిన సందేశం. ఆ ఉపాసనా రీతిలో మొదట ఆవిడ ఇంద్రుడ్ని ఉపాసన చేసింది. కానీ తండ్రి ఆమెను గౌతముడికి ఇచ్చి వివాహం చేసాడు. అప్పటినుంచీ ఆమె భర్తని ఉపాసన చేయాల్సి వచ్చింది. మొదట చేసిన ఉపాసన ఒకటి, తరువాత చేసిన ఉపాసన ఒకటి ఆవిడ భేద భావనలో మొదట్లో చేసిన ఉపాసనను వదిలేసింది. అది ఏమవుతుంది. దాని ఫలితం ఇస్తుంది. అటువంటప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి? అనే సాధక సందేహాన్ని నివారించదలుచుకున్నారు. ఉపాసనలో ఎక్కడా పొరపాటు పడకూడదు అనే విషయం స్పష్టంగా చెప్పడం కోసం వాల్మీకి ఆ విషయంలో అహల్యను నిందిస్తునే శ్లోకాలు రాసేసాడు. దానితో వాల్మీకి చెప్పదలచుకున్న విషయం పూర్తి అయింది

బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.

ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు. ఇంద్రుడి మోసం తెలిసీ అహల్య అందుకు అంగీకరిస్తుంది.(मुनि वेशम् सहस्राक्शम् विज्ञा रघुनन्दना - సంస్కృత రామాయణం, బాలకాండ, 48వ సర్గ, 19వ శ్లోకము). అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెని శపిస్తాడు. “ ఇహవర్ష సహస్రాణి బాహూని నిసిశ్యసి.వాయు భక్ష్యా నిరాహారా తప్యాని భస్మశాయినీ. అదృశ్య సర్వ భూతానాంఆశ్రమే అస్మిన్ నివసిష్యసి” (సంస్కృత రామాయణం, బాలకాండము, 48వ సర్గ,30వ శ్లోకము.) అనగా, “బహు సంవత్సరాలునీవు గాలిని భక్షిస్తూ ఆహారము లేక తపస్సు చేసుకుందువు. నీపైన పరాగము(బూడిద) కప్పబడుతుంది. నీవెవరికీ కనబడవు. అదృశ్య రూపమున ఇక్కడనే తపస్సు చేసికొనుము. “ , త్రేతా యుగంలో మహా విష్ణువు రాముని అవతారమెత్తి ఆయన పాదధూళిచే (ఆయన రాక వలన, దర్శనము వలన) ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు. (శ్రీమత్ ఆంధ్ర వాల్మీకి రామాయణము, యదాతథ అనువాదము, వావికొలను సుబ్బారావు గారు, 1932). అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అమ్మవారిని గురించి తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు. “ఇట్లు అహల్య శిలగానయ్యెనని కొన్ని గ్రంధములయందు గలదు. కానియది వాల్మీకి మతముగాదు. దుఃఖభావము లేక శిలవలె యుండిన, పాపఫలమేమి అనుభవించినట్లు? కావున అహల్య స్త్రీగానుండియే తపమాచరించెను. “ - వావికొలను సుబ్బారావు గారు, వాల్మీకి రామాయణ ఆంధ్ర అనువాద కర్త.


గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తమ గురువైన విశ్వామిత్రుడు, లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయంవరానికి వెళుతుంటారు. నిర్మానుష్యమైన, కళావిహీనమైన ఆ ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది? అని రాముడు విశ్వామిత్రుని ప్రశ్నించగా , ఆయన వారి వృత్తాంతాన్ని రాముడికి వివరిస్తాడు. రాముడు వేంచేయటముతో అక్కడితో అహల్యకు శాపవిమోచనము కలిగినదని వివరిస్తాడు. వాల్మీకి రామాయణములో అహల్య శిలగా వుండుట, రాముడు శిలను కాలితో స్పర్శించుట అనునది లేదు, ఇక్కడ శిల అనునది , కదలకుండా , తీవ్ర తపోనిష్ఠలో వుండుటకు వ్యుత్పత్తి అనుకోవచ్చును. పరాగము కప్పబడి ఆ ప్రాంతమంతయు అహల్య అదృశ్యరూపములో అహల్య వుండెను. శ్రీరాముని పాదస్పర్శ యనిన ఇక్కడ గౌతమముని ఆశ్రమములో రాముడు పాదములు మోపుట అని భావింపవలెను. అనగా, కేవలము శ్రీరాముని ఉనికి మాత్రం చేత గౌతమముని ఆశ్రమము నందు అహల్యకు శాపవిమోచనము కలిగెనను. గౌతముడు కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలిగేలా దీవిస్తాడు



విశ్వనాధవారి కల్పవృక్షంలో అహల్యకు ఇంద్రుడిపైన వ్యామోహం అణువంతైనా లేదన్నారేమిటి?అహల్య కథ వేదాదుల్లో కూడా ఉంది. అందులో కొన్ని సాంకేతికార్ధ రహస్యాలున్నాయని చెప్పుకున్నాం గదా. విశ్వనాధ సత్యనారాయణగారు వేదాలవరకు, పురాణాలవరకు వెళ్లిపోయి అహల్యా పదానికి ‘దున్నడానికి వీలుపడని క్షేత్రం’ అని అర్ధం. ఇంద్రుడు అంటే వర్షం అని సంకేతం. ఈ అర్ధాలను మనసులో పెట్టుకుని, అహల్యకి మోహం లేకపోయినా ఆమె సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించింది అని చెప్పాడు. అయితే శిలారూపం దగ్గరికి వచ్చేటప్పటికి శిలా పదాన్ని కేవలం రాయి అనే అర్ధంలో తీసుకున్నట్టయితే అర్ధం కుదరదు.

రామాయణంలో ఆ రాయికి ఆకలి దప్పులు వుంటాయి. ‘కేవలం వాయుభక్షణం చేస్తావు కాని కదలడానికి వీల్లేదు. అయినా ఆలోచనలు ఉంటాయి. అటువంటి నికృష్ట జీవితం నీకు కొన్ని వేల సంవత్సరాలు’’ అని గౌతముడు శిక్ష వేస్తాడు. అంటే ఏ సాధకుడు అయినా ఉపాసనలో పొరపాటుచేస్తే వాడికి ఇది శిక్ష. కాని నిజమైన ఉత్తమ తపస్వికి ఇది శిక్ష కాదు. ఇది సమాధికి అత్యంత అనుకూలం. వాడికి ప్రపంచంతో సంబంధం లేదు. ఆకలి దప్పులను పరిత్యాగం చేస్తే మనుస్సును పరమాత్మతో అనసంధానం చేయవచ్చు అని అహల్య భావించింది కనుక విశ్వనాధ సత్యనారాయణ ఇలా చెప్పారు. కేవలం సాధన మార్గాన్ని మాత్రమే వాల్మీకి చెప్పారు. ఇవి రెండూ రెండు దృక్కోణాలు!


*మన మతంలో ధర్మశాస్త్రానికి మరీ అంత ప్రాముఖ్యం ఎందుకు?మనది మతం కాదు. మనది ధర్మం. వేద ధర్మం మతం అనేది ఆ తర్వాత చాలా లక్షల సంవత్సరాల తరువాత పుట్టింది. ప్రకృతిలో సహజ సిద్ధమైన ఏ లక్షణం వుంటుందో అది ప్రకృతి ధర్మం. వైదేసికంగా వికాసం చెందిన మానవుడు క్రమంగా ప్రకృతికి దూరంగా జరుగుతాడు. దానివల్ల కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాడు. అలాంటి విపత్తుల నివారణ కోసం మహాత్ములు కొన్ని నిబంధనలు ఏర్పరిచారు.ఈ నిబంధనలు గ్రంథంగా ఏర్పడ్డాయి. అవే ధర్మశాస్త్రాలు. అందుకే అవి ముఖ్యమైనవి.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

16.02.2025,ఆదివారం

 *జై శ్రీమన్నారాయణ* 

16.02.2025,ఆదివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:చవితి రా12.23 వరకు

వారం:(భానువాసరే) 

(ఆదివారం)

నక్షత్రం:హస్త తె3.02 వరకు

యోగం:ధృతి ఉ7.17 వరకు

కరణం బవ ఉ11.25 వరకు

తదుపరి బాలువ రా12.23 వరకు

వర్జ్యం:ఉ9.52 - 11.38

దుర్ముహూర్తము:సా4.25 - 5.11

అమృతకాలం:రా8.26 - 10.12

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం:6.31

సూర్యాస్తమయం:5.57




పుట్టిన ప్రతి ప్రాణికీ పూర్తికాలం జీవించాలన్న కోరిక ఉంటుంది. చరాచరాలకూ అలాగే ఉంటుంది. చెట్టును కాండం మొదలు వరకు నరికినా అది మళ్ళీ చిగురించాలన్న కాంక్షతో ఉంటుంది. నిత్యం పారే నదికి ఓ కొండ అడ్డుపడ్డప్పుడు అది కొద్దిసేపు ఆగి సేదదీరుతుంది. పల్లం ఎటువైపుందో తెలిసేదాకా నిరీక్షిస్తుంది. ఆ తరవాత దారి చూసుకొని ముందుకు ప్రవహిస్తుంది.

అడవిలో మొలిచే మొక్కలకు నీళ్లు పోసేవారెవరూ ఉండరు. అలాగని అవి నిరాశకు లోనుకావు. వర్షాల ఆగమనానికై ఆశగా ఎదురుచూస్తాయి. వీలుకానప్పుడు పులి కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. దానికీ మరణభయం ఉంటుంది. ఆయుష్షు తీరేదాకా బతకాలన్న బలమైన వాంఛా ఉంటుంది.

ఒక్కోసారి వెనక్కి రావడమూ ముందుకు పోవడంలో భాగం అవుతుంది. వాస్తవానికి అది సార్వజనీనం! జీవన పయనం- ఏ దిశలో సాగుతోంది అన్నది ముఖ్యం కాదు. అది ఆరోహణా భావనతో ఉందా లేదా అన్నదే ప్రధానం. జీవచైతన్యానికి నిర్విరామంగా విస్తృతం కావడమే తెలుసు. ఆ సహజాతి సహజ గమనం పటాటోప ప్రదర్శన కాదు. ఎవరి మెచ్చుకోలు కోసమో చేసే పని అంతకన్నా కాదు.

నాన్న నేర్పిన చదువు:*

 🔔  *సంస్కృతి*  🔔


*నాన్న నేర్పిన చదువు:*


*తండ్రి:-*

।।ఓం నమః శివాయ।।

అబ్బాయీ! *పద్మము* అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు?


*కొడుకు:-*

కమలము, నళినము, తామరపూవు


*తండ్రి:-*

అంతేనా!?


*కొడుకు:-*

నాకంతే తెలుసు!!!


*తండ్రి:-*

నేను చెబుతాను చూడు - *వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము...*


*కొడుకు:-*

నాన్నా! నాన్నా! ఆగు.


*తండ్రి:-*

చెప్పు.


*కొడుకు:-*

వీటన్నిటికీ అర్థం *పద్మం* అనేనా!?


*తండ్రి:-*

అవును.


*కొడుకు:-*

మరి *నిఘంటువు* (డిక్షనరీ) వెదికితే ఇవన్నీ దొరుకుతాయా!?


*తండ్రి:-*

ఆయా డిక్షనరీ కర్తల ఓపికను బట్టి ఉంటుంది. అన్నీ అన్నిట్లోనూ దొరకకపోవచ్చు.


*కొడుకు:-*

మరి డిక్షనరీలలో కూడా దొరకని పదాలు నీకెలా దొరికాయి!?


*తండ్రి:-*

నేను *అమరకోశం* చదువుకున్నాను.  అందువల్ల నేనే స్వయంగా అనేకపదాలను సృష్టించగలను. నాకు వేరే డిక్షనరీ అవసరం లేదు.  


*కొడుకు:-*

అదెలా!?


*తండ్రి:-*

*అమరకోశం* లో కొన్ని *పర్యాయపదా* లను *అమరసింహుడు* ఉపదేశించాడు. వాటికి కొన్ని *ప్రత్యయాలు* (Suffix) జోడిస్తే వేరే అర్థాన్ని బోధించే పదాలను మనం కూడా సృష్టించుకోవచ్చును.


*కొడుకు:-*

ఎలా?


*తండ్రి:-*

చెబుతా చూడు - *1. వారి, 2.నీరమ్, 3. జలమ్, 4.సలిలమ్, 5. కమ్, 6.తోయమ్, 7. ఉదకమ్, 8. పుష్కరమ్, 9.పయః, 10.అంభః, 11. అంబు...* ఇటువంటి కొన్ని పదాలను అమరసింహుడు *నీరు* అనే అర్థంలో చెప్పాడు.


*కొడుకు:-*

అయితే!?


*తండ్రి:-*

పద్మము పుట్టేది ఎక్కడ!? నీటిలో కదా!? అందువల్ల పైన చెప్పిన పదాలకు *జ* అనే ప్రత్యయం (suffix) చేరిస్తే - *పద్మము* అనేపదానికి సమానార్థకాలైన పదాలు వచ్చేస్తాయి.  మళ్లీ చెప్పనా!?  *వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము...*


*కొడుకు:-*

చివరలో *జ* - అని ఎందుకు చేర్చాలి!?


*తండ్రి:-*

*జ* - అంటే *జాతము, జన్మించినది* అని అర్థం వస్తుంది. *జలజ* అంటే *జలములో జన్మించినది* అని అర్థం. అలాగే *నీరజ* అంటే *నీటిలో జన్మించినది* అని అర్థం. అలా పదాలు పుట్టుకొస్తాయి.


https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B


*కొడుకు:-*

*జ* అనే ప్రత్యయం కాకుండా వేరే ప్రత్యయం చేర్చవచ్చా!?


*తండ్రి:-*

*"జాతము"* అనవచ్చు.


*కొడుకు:-*

అయితే నేను చెబుతాను చూడు. *వారిజాతము, నీరజాతము, జలజాతము, సలిలజాతము, కంజాతము, తోయజాతము, ఉదకజాతము, పుష్కరజాతము, పయోజాతము, అంభోజాతము, అంబుజాతము...*


*తండ్రి:-*

భలే! నీకు కూడా పదాలను సృష్టించే కళ వచ్చేసింది.


*కొడుకు:-*

*జ, జాత* మాత్రమే కాకుండా ఇంకే ప్రత్యయాలనైనా ఉపయోగించవచ్చా!?


*తండ్రి:-*

*భవ, ఉద్భవ, సంభవ* అనే పదాలను చేరిస్తే *పుట్టినది* లేదా *పుట్టినవాడు* అనే అర్థం వస్తుంది.  ఉదాహరణకు *జలభవము, జలోద్భవము, జలసంభవము* అంటే *జలంలో పుట్టినది* అని అర్థం.  అలాగే తృతీయ *నీరభవము, నీరోద్భవము, నీరసంభవము* అని చెప్పవచ్చు. అలాగే *రుహ* అనే ప్రత్యయం చేర్చవచ్చు. *రుహము* అంటే *పెరిగేది.* 


*కొడుకు:-*

అయితే నేను చెబుతా దానితో పేర్లు - *వారిరుహము, నీరరుహము, జలరుహము, సలిలరుహము, కంరుహము, తోయరుహము, ఉదకరుహము, పుష్కరరుహము, పయోరుహము, అంభోరుహము, అంబురుహము...*


*తండ్రి:-*

బాగా చెప్పావు. ఏకసంథాగ్రాహివి. వీటన్నిటికీ కూడా *పద్మము* అనే అర్థం. ఇంతకూ ఎన్ని పదాలను సృష్టించగలవో అర్థమైందా!?


*కొడుకు:-*

నీటికి *11* పర్యాయవాచకాలు చెప్పావు. వాటికి *జ* అనే ప్రత్యయం చేర్చి, *పద్మం* అనే అర్థంలో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *జాత* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *రుహ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *భవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను, *ఉద్భవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను, *సంభవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను. అంటే, మొత్తానికి *పద్మము* అనే అర్థంలో ఇప్పటికిప్పుడు *66* పదాలను చెప్పగలను.


*తండ్రి:-*

మరి మొదట అడిగితే మూడే మూడు పదాలు చెప్పి, ఇంతకంటె మరేమీ చెప్పలేనన్నావు!?  ఇప్పుడేమో ఏకంగా *66* పదాలు చెప్పగలనంటున్నావు!?


*కొడుకు:-*

నువ్వు ఇలా విడమరచి చెబితే ఎందుకు చెప్పలేను!?


*తండ్రి:-*

ఇంతే కాదు, వీటితో ఇంకా ఎన్నో అర్థాలలో ఎన్నెన్నో పదాలను సృష్టించవచ్చు.


*కొడుకు:-*

అదెలా నాన్నా!?


*తండ్రి:-*

పద్మంతో సంబంధం ఉన్న పౌరాణికవ్యక్తులెవరైనా ఉన్నారా చెప్పు!?


*కొడుకు:-*

పద్మాన్ని హస్తంలో ధరించే *విష్ణువు* ఉన్నాడు. పద్మాన్ని నాభిలో ధరించిన అదే *విష్ణువు* ఉన్నాడు. పద్మంలో జన్మించిన *బ్రహ్మదేవుడు* ఉన్నాడు.  *క్షీరసాగర* మధ్యంలో *పద్మం* లో జన్మించిన *లక్ష్మీదేవి* ఉన్నది.


*తండ్రి:-*

మంచి పురాణజ్ఞానం ఉన్నదే నీకు!? సరే, ఇప్పుడు చూడు.  *పద్మం* అనే అర్థంలో నీవు *66* పదాలు చెప్పగలవు కదా!?  వాటికి చివర *హస్తుడు* అని చేర్చు. వాటన్నిటికీ *పద్మాన్ని చేతిలో ధరించినవాడు* అనే భావంలో *విష్ణువు* అనే అర్థం వస్తుంది.  అంటే ఈ క్షణంలో నీవు *విష్ణువు* అనే పదానికి పర్యాయవాచకాలు *66* చెప్పగలవు.


*కొడుకు:-*

ఓహో. బలే! అర్థమైంది. *వారిజహస్తుడు, నీరజహస్తుడు...* ఇలా అన్నమాట.  


*తండ్రి:-*

అవును.


*కొడుకు:-*

అయితే నాన్నా, *హస్తం* అనే పదంతో పాటు *కరము, పాణి* అనే పదాలను కూడా *చేయి* అనే అర్థంలోనే ప్రయోగిస్తాం కదా! వాటిని కూడా ప్రత్యయాలుగా ఉపయోగించవచ్చా!?  


*తండ్రి:-*

హాయిగా ఉపయోగించవచ్చు.  ఆవిధంగా *హస్తుడు* అనే ప్రత్యయాన్ని చేర్చి *66*, *కరుడు* అనే ప్రత్యయాన్ని చేర్చి మరో *66*, *పాణి* అనే ప్రత్యయాన్ని చేర్చి మరో *66* మొత్తం *198* పదాలను నీవు స్వయంగా సృష్టించగలవు.


*కొడుకు:-*

అయ్యో నాన్నా, డబుల్ సెంచురీకి రెండు తక్కువైనాయే!?


*తండ్రి:-*

నీటికి ఇంకా *కబంధము, వనము, భువనము, అమృతము, అప్, సర్వతోముఖము, పానీయము, క్షీరము, శంబరము...* ఇట్లా చాలా పర్యాయవాచకాలు ఉన్నాయి. నీవు అన్నీ గుర్తుంచుకోలేక కంగారుపడతావని మొదట్లో ఓ పదకొండు మాత్రమే చెప్పాను. ఆ పదాలతో *పద్మం* అనే అర్థం సాధించి, మరలా ఆ *పద్మాన్ని చేత ధరించినవాడు* అనే అర్థంలో ఇంకెన్ని *విష్ణుపర్యాయవాచకాల* ను సృష్టించవచ్చో చూడు. 


*కొడుకు:-*

బలే నాన్నా! బలే.  అలాగే *పద్మంలో పుట్టిన బ్రహ్మ* అనే అర్థంలో - పద్మం యొక్క *66* పర్యాయవాచకాలకు *జ, జాత, భవ, సంభవ, ఉద్భవ,  రుహ* అనే ఆరు ప్రత్యయాలు చేర్చితే మొత్తం *396* (66x6) పదాలను ఈ క్షణంలోనే పుట్టించగలను.


*తండ్రి:-*

ఓహో! సమస్తప్రపంచాన్ని పుట్టించిన బ్రహ్మకే అన్ని పదాలు పుట్టించావా!?  *పద్మజుడు, పద్మసంభవుడు* అంటూ వాటిని పుంలింగాలలో ప్రయోగిస్తే *బ్రహ్మ* అనే అర్థం వస్తుంది. వాటిని *పద్మజ, పద్మసంభవ* అంటూ స్త్రీలింగాలలో ప్రయోగిస్తే *లక్ష్మీ* అనే అర్థం వస్తుంది. మరి ఆ *బ్రహ్మకు తండ్రి విష్ణువు* అనే అర్థంలో మరెన్ని పుట్టించగలవో చెప్పు!? 

 

*కొడుకు:-*

*పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ* అనే అర్థంలో *396* పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా! *తండ్రి* అనే అర్థాన్నిచ్చే *జనక, గురు, పితా, జన్మద* అనే నాకు తెలిసిన ఓ నాలుగు ప్రత్యయాలను ఆ *396* పదాలకు చేరిస్తే (396x4) *1584* పదాలను *విష్ణువు* అనే అర్థంలో సృష్టించగలను.


*తండ్రి:-*

మరి *లక్ష్మీదేవికి భర్త విష్ణువు* అనే అర్థంలో ఎన్ని పదాలు సృష్టించగలవు!?


*కొడుకు:-*

*పద్మంలో పుట్టినది లక్ష్మీ* అనే అర్థంలో *396* పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా! వాటికి *పతి, ప్రియ, వల్లభ, నాథ, భర్త, ప్రాణేశ* వంటి నాకు  తెలిసిన ఓ *6* ప్రత్యయాలను చేర్చి (396x6) *2376* పదాలను సృష్టించగలను. 


*తండ్రి:-*

చూశావా, నీవు విష్ణుసహస్రనామాలను రచించావు. విష్ణువుకు మొత్తం *3960* నామాలను సృష్టించావు. (1584+2376)


*కొడుకు:-*

అయ్యో, నాలుగు వేల నామాలకు ఒక 40 తక్కువయ్యాయే.


*తండ్రి:-*

*పద్మాన్ని నాభిలో కలిగినవాడు పద్మనాభుడు* అంటే *విష్ణువు* కదా! పద్మానికి *66* పర్యాయపదాలు నీకు తెలుసు కదా! వాటికి చివర *నాభుడు* అనే ప్రత్యయం తగిలించు.  *వారిజనాభుడు, జలజనాభుడు* అంటూ. కాబట్టి, *3960+66=4026* నామాలు వచ్చాయి.  మొత్తానికి ఇలా *విష్ణుచతుస్సహస్రనామాలు* సృష్టించగలవు.


*కొడుకు:-*

సంస్కృతం కొద్దిగా నేర్చుకుంటే, పదసంపదను ఇంత సులువుగా, ఇంత అపారంగా సృష్టించవచ్చా!?


*తండ్రి:-*

అవును. ఇప్పుడు చెప్పినవి కేవలం మచ్చుకు మాత్రమే. ఈవిధంగా సంస్కృతపదాలను ఇంకా వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా అలవోకగా సృష్టించవచ్చు.  ఇన్నేసి పదాలను డిక్షనరీలో చేర్చి వాటికి అర్థాలు ఎవరూ వ్రాయరు. అందువల్ల ఒక పదానికి అర్థం తెలియక డిక్షనరీ వెదికి, అక్కడ కనబడకపోతే అబ్బో అబ్బో సంస్కృతం చాల కష్టం సుమీ! అంటూ ఉంటారు.  


*కొడుకు:-*

అవును నాన్నా! ఇంతవరకు నేను కూడా ఇలాగే అనుకున్నాను.  


*తండ్రి:-*

సరే, *నళినదళేక్షణ* అనే పదం విన్నావా!?


*కొడుకు:-*

నా తరమా భవసాగరమీదను, నళినదళేక్షణ రామా అనే కీర్తనలో ప్రసిద్ధమే కదా!?


*తండ్రి:-*

*నళినదళేక్షణుడు* అంటే అర్థం ఏమిటి!?


*కొడుకు:-*

రాముడు.


*తండ్రి:-*

ఆ కీర్తన విని, ఆ కీర్తనలో రామపరంగా వాడిన పదాన్ని బట్టి *రాముడు* అంటూ రూఢి అర్థాన్ని గ్రహించావు. మరి *యౌగికార్థం* (యోగపరమైన) చెప్పు!?


*కొడుకు:-*

అదేమిటి?


*తండ్రి:-*

*నళినము* అంటే పద్మము. *నళినదళము* అంటే పద్మదళము, *ఈక్షణము* అంటే *చూపు* లేదా *కన్ను*.  కాబట్టి *నళినదళేక్షణుడు* అంటే *పద్మపు రేకులవంటి కన్నులు కలవాడు* అని అర్థం. అది యౌగికార్థం అంటే. అటువంటి కళ్లు ఎవరికి ఉన్నా సరే, వాళ్లందరూ కూడా నళినదళేక్షణులే. నీవు ఇంతవరకూ చెప్పిన పద్మపర్యాయవాచకాలు, విష్ణుపర్యాయవాచకాలు, బ్రహ్మపర్యాయవాచకాలు, లక్ష్మీదేవి పర్యాయవాచకాలు అన్నీ యౌగికపదాలే.  


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  - చతుర్థి - హస్త -‌‌  భాను వాసరే* (16.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*