16, ఫిబ్రవరి 2025, ఆదివారం

అహల్య కథ🙏

 🙏వాల్మీకి మహర్షి చెప్పిన అహల్య కథ🙏


అహల్య విషయంలో వాల్మీకి రామాయణం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది. అయితే అహల్య చరిత్ర వేదంలో కూడా వుంది. ఇతర పురాణాలలో అనేకచోట్ల ఆ ప్రసక్తి వచ్చింది. అహల్య చరిత్రయొక్క తత్వం సమగ్రంగా తెలియాలి అంటే కొన్ని సాంకేతిక అర్ధాల్లోకి కూడా వెళ్లాలి. మానవ జీవితాలు కేవలం వీళ్ల ఇచ్ఛల చేత కాకుండా గ్రహగతుల యొక్క ప్రభావంచేత కూడా నడుస్తుంటాయి. అయితే ఈ గ్రహగతులు ఎలా నడుస్తాయి అంటే గ్రహాలకంటే పైనున్న దివ్యలోక వాసులైన దేవతల ప్రవర్తన ద్వారా!గ్రహాలు ప్రభావితాలు కావడం అంటే గ్రహములయందు అధిష్టించినటువంటి దేవతలు ప్రభావితులై వాళ్ల ద్వారా వాళ్ల అంశలతోజన్మించిన వాళ్ల యొక్క ప్రభావంలో వున్న జీవుల మీద కూడా ప్రభావం చూపుతాయి. అలాంటి ప్రభావం మామూలుగా మనందరి మీదా పడుతూ వుంటుంది. కానీ మనం అందరమూ సామాన్య జీవులం కనుక చెప్పుకోదగ్గ కథ వుండదు. ఒకానొక సృష్టి క్రమంలో యుగ సంధి కాలంలో ఒక మహత్తరమైనటువంటి సృష్టి కార్యం చేయడంకోసం ఏ జీవులు అవతరిస్తారో, వాళ్ల జీవిత చరిత్రలు సామాన్యరీతికి భిన్నంగా ఉంటాయి. అహల్య అనేటువంటి జీవి స్ర్తి జీవిగా, బ్రహ్మ మానస పుత్రిగా జన్మించింది. ఆమెను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేసారు. మామూలుగా అందరి లాగా నడుచుకోవడం కోసం ఆ జీవి సృష్టించబడలేదు.

ఆ జీవివల్ల ప్రపంచానికి ఒక సందేశం అందాల్సి వుంది. అది ఉపాసనారీతి గురించిన సందేశం. ఆ ఉపాసనా రీతిలో మొదట ఆవిడ ఇంద్రుడ్ని ఉపాసన చేసింది. కానీ తండ్రి ఆమెను గౌతముడికి ఇచ్చి వివాహం చేసాడు. అప్పటినుంచీ ఆమె భర్తని ఉపాసన చేయాల్సి వచ్చింది. మొదట చేసిన ఉపాసన ఒకటి, తరువాత చేసిన ఉపాసన ఒకటి ఆవిడ భేద భావనలో మొదట్లో చేసిన ఉపాసనను వదిలేసింది. అది ఏమవుతుంది. దాని ఫలితం ఇస్తుంది. అటువంటప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి? అనే సాధక సందేహాన్ని నివారించదలుచుకున్నారు. ఉపాసనలో ఎక్కడా పొరపాటు పడకూడదు అనే విషయం స్పష్టంగా చెప్పడం కోసం వాల్మీకి ఆ విషయంలో అహల్యను నిందిస్తునే శ్లోకాలు రాసేసాడు. దానితో వాల్మీకి చెప్పదలచుకున్న విషయం పూర్తి అయింది

బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.

ఒకరోజు అహల్య భర్తయైన గౌతముడు ఉదయాన్నే నదీ స్నానానికి వెళ్ళగా ఆమె మీద కోరికతో దేవేంద్రుడు ఆమె భర్త రూపంలో వచ్చి కోరిక తీర్చమని అడుగుతాడు. ఇంద్రుడి మోసం తెలిసీ అహల్య అందుకు అంగీకరిస్తుంది.(मुनि वेशम् सहस्राक्शम् विज्ञा रघुनन्दना - సంస్కృత రామాయణం, బాలకాండ, 48వ సర్గ, 19వ శ్లోకము). అదే సమయానికి గౌతముడు తిరిగివచ్చి ఆమెని శపిస్తాడు. “ ఇహవర్ష సహస్రాణి బాహూని నిసిశ్యసి.వాయు భక్ష్యా నిరాహారా తప్యాని భస్మశాయినీ. అదృశ్య సర్వ భూతానాంఆశ్రమే అస్మిన్ నివసిష్యసి” (సంస్కృత రామాయణం, బాలకాండము, 48వ సర్గ,30వ శ్లోకము.) అనగా, “బహు సంవత్సరాలునీవు గాలిని భక్షిస్తూ ఆహారము లేక తపస్సు చేసుకుందువు. నీపైన పరాగము(బూడిద) కప్పబడుతుంది. నీవెవరికీ కనబడవు. అదృశ్య రూపమున ఇక్కడనే తపస్సు చేసికొనుము. “ , త్రేతా యుగంలో మహా విష్ణువు రాముని అవతారమెత్తి ఆయన పాదధూళిచే (ఆయన రాక వలన, దర్శనము వలన) ఆమెకు శాపవిమోచనం అవుతుందని తెలియబరుస్తాడు. (శ్రీమత్ ఆంధ్ర వాల్మీకి రామాయణము, యదాతథ అనువాదము, వావికొలను సుబ్బారావు గారు, 1932). అలాగే ఇంద్రుణ్ణి తన శరీరమంతా స్త్రీ జననేంద్రియాలతో నిండిపోయేలాగా శపిస్తాడు. వృషణాలు నేలరాలిపోయేటట్లు చేస్తాడు. కానీ ఇంద్రుడు ఇతర దేవతల సాయంతో ఒక జీవాన్ని బలి ఇచ్చి దాని వృషణాలను అతికించేటట్లు చేస్తాడు. అమ్మవారిని గురించి తపస్సు చేసి తన శరీరంపై ఉన్న స్త్రీ జననేంద్రియాలను కన్నులులాగా కనిపించేటట్లు వరం పొందుతాడు. అందుకనే ఆయన్ను సహస్రాక్షుడు అని కూడా వ్యవహరిస్తారు. “ఇట్లు అహల్య శిలగానయ్యెనని కొన్ని గ్రంధములయందు గలదు. కానియది వాల్మీకి మతముగాదు. దుఃఖభావము లేక శిలవలె యుండిన, పాపఫలమేమి అనుభవించినట్లు? కావున అహల్య స్త్రీగానుండియే తపమాచరించెను. “ - వావికొలను సుబ్బారావు గారు, వాల్మీకి రామాయణ ఆంధ్ర అనువాద కర్త.


గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తమ గురువైన విశ్వామిత్రుడు, లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయంవరానికి వెళుతుంటారు. నిర్మానుష్యమైన, కళావిహీనమైన ఆ ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది? అని రాముడు విశ్వామిత్రుని ప్రశ్నించగా , ఆయన వారి వృత్తాంతాన్ని రాముడికి వివరిస్తాడు. రాముడు వేంచేయటముతో అక్కడితో అహల్యకు శాపవిమోచనము కలిగినదని వివరిస్తాడు. వాల్మీకి రామాయణములో అహల్య శిలగా వుండుట, రాముడు శిలను కాలితో స్పర్శించుట అనునది లేదు, ఇక్కడ శిల అనునది , కదలకుండా , తీవ్ర తపోనిష్ఠలో వుండుటకు వ్యుత్పత్తి అనుకోవచ్చును. పరాగము కప్పబడి ఆ ప్రాంతమంతయు అహల్య అదృశ్యరూపములో అహల్య వుండెను. శ్రీరాముని పాదస్పర్శ యనిన ఇక్కడ గౌతమముని ఆశ్రమములో రాముడు పాదములు మోపుట అని భావింపవలెను. అనగా, కేవలము శ్రీరాముని ఉనికి మాత్రం చేత గౌతమముని ఆశ్రమము నందు అహల్యకు శాపవిమోచనము కలిగెనను. గౌతముడు కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలిగేలా దీవిస్తాడు



విశ్వనాధవారి కల్పవృక్షంలో అహల్యకు ఇంద్రుడిపైన వ్యామోహం అణువంతైనా లేదన్నారేమిటి?అహల్య కథ వేదాదుల్లో కూడా ఉంది. అందులో కొన్ని సాంకేతికార్ధ రహస్యాలున్నాయని చెప్పుకున్నాం గదా. విశ్వనాధ సత్యనారాయణగారు వేదాలవరకు, పురాణాలవరకు వెళ్లిపోయి అహల్యా పదానికి ‘దున్నడానికి వీలుపడని క్షేత్రం’ అని అర్ధం. ఇంద్రుడు అంటే వర్షం అని సంకేతం. ఈ అర్ధాలను మనసులో పెట్టుకుని, అహల్యకి మోహం లేకపోయినా ఆమె సృష్టికి విరుద్ధంగా ప్రవర్తించింది అని చెప్పాడు. అయితే శిలారూపం దగ్గరికి వచ్చేటప్పటికి శిలా పదాన్ని కేవలం రాయి అనే అర్ధంలో తీసుకున్నట్టయితే అర్ధం కుదరదు.

రామాయణంలో ఆ రాయికి ఆకలి దప్పులు వుంటాయి. ‘కేవలం వాయుభక్షణం చేస్తావు కాని కదలడానికి వీల్లేదు. అయినా ఆలోచనలు ఉంటాయి. అటువంటి నికృష్ట జీవితం నీకు కొన్ని వేల సంవత్సరాలు’’ అని గౌతముడు శిక్ష వేస్తాడు. అంటే ఏ సాధకుడు అయినా ఉపాసనలో పొరపాటుచేస్తే వాడికి ఇది శిక్ష. కాని నిజమైన ఉత్తమ తపస్వికి ఇది శిక్ష కాదు. ఇది సమాధికి అత్యంత అనుకూలం. వాడికి ప్రపంచంతో సంబంధం లేదు. ఆకలి దప్పులను పరిత్యాగం చేస్తే మనుస్సును పరమాత్మతో అనసంధానం చేయవచ్చు అని అహల్య భావించింది కనుక విశ్వనాధ సత్యనారాయణ ఇలా చెప్పారు. కేవలం సాధన మార్గాన్ని మాత్రమే వాల్మీకి చెప్పారు. ఇవి రెండూ రెండు దృక్కోణాలు!


*మన మతంలో ధర్మశాస్త్రానికి మరీ అంత ప్రాముఖ్యం ఎందుకు?మనది మతం కాదు. మనది ధర్మం. వేద ధర్మం మతం అనేది ఆ తర్వాత చాలా లక్షల సంవత్సరాల తరువాత పుట్టింది. ప్రకృతిలో సహజ సిద్ధమైన ఏ లక్షణం వుంటుందో అది ప్రకృతి ధర్మం. వైదేసికంగా వికాసం చెందిన మానవుడు క్రమంగా ప్రకృతికి దూరంగా జరుగుతాడు. దానివల్ల కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాడు. అలాంటి విపత్తుల నివారణ కోసం మహాత్ములు కొన్ని నిబంధనలు ఏర్పరిచారు.ఈ నిబంధనలు గ్రంథంగా ఏర్పడ్డాయి. అవే ధర్మశాస్త్రాలు. అందుకే అవి ముఖ్యమైనవి.

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: