9, మే 2026, శనివారం

సావడి కబుర్లు

  *సావడి కబుర్లు -1*


వందేమాతరం


*అమ్మలకి లెక్కల రావు*


_జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ॥_

_తల్లి మరియు జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవి._


ఆ మధ్య సాయంత్రం సావడిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఎవరో నవ్వుతూ అన్నారు, “ఈ అమ్మలకి లెక్కలు రావు!” అని. ఆ మాట విన్నాక నేను కాసేపు ఆలోచించాను. నిజమేనేమో అనిపించింది. ఎందుకంటే మా అమ్మకి లెక్కలు వచ్చి ఉంటే,


 “అమ్మా… ఆకలిగా ఉంది, రెండు చపాతీలు పెట్టు” అన్నప్పుడు నాలుగు ఎందుకు పెడుతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, పరీక్షల రోజున తెల్లవారుజామున ఐదు గంటలకే లేపి, “ఏడయ్యిందిరా! ఇంకా పడుకున్నావేంటి?” అని ఎందుకు తొందర పెడుతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, నేను పరీక్షలో ముప్పై మార్కులు తెచ్చినా, పక్కింటివారికి “యాభై వచ్చాయి” అని గర్వంగా ఎందుకు చెబుతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, ఖర్చులకని గోముగా యాభై రూపాయలు అడిగితే, పోపుల డబ్బాలోంచి వంద రూపాయలు ఎందుకు ఇస్తుంది?


లెక్కలు వచ్చి ఉంటే, నాన్న తెచ్చిన జీతం నుంచి పాలవాడు, చాకలివాడు, కిరాణావాడు, పనివాడు అంటూ అందరికీ ఇచ్చిన లెక్కలు చెప్పి, పోపులు డబ్బాలో దాచిన చిల్లర సంగతిని మాత్రం ఎందుకు మర్చిపోతుంది?


లెక్కలు వచ్చి ఉంటే, నేను దొంగచాటుగా సినిమాకు వెళ్లి రాత్రి ఒంటిగంటకు వచ్చి పడుకున్నా, ఉదయాన్నే నాన్నకి “రాత్రి పదింటికే వచ్చి పడుకున్నాడు” అని ఎందుకు కాపాడుతుంది?


అందుకే అనిపించింది, అమ్మకి నిజంగానే లెక్కలు రావు.

ఒక్క ప్రేమ తప్ప!


అమ్మ అంటే మా అమ్మ ఒక్కతే కాదు. ఈ లోకంలోని ప్రతి అమ్మది అదే తీరు. వారు చదివేది పాఠశాల పుస్తకాలు కాదు, జీవితంలోని ప్రేమానురాగాలు. వారు అనుసరించేది గణిత సూత్రాలు కాదు, అనురాగ సూత్రాలు.


సమకాలీన జీవితంలో సాగే ప్రతి చిన్న మార్పునూ, ప్రతి కష్టాన్నీ, ప్రతి ఆనందాన్నీ నిశ్శబ్దంగా గమనించేది అమ్మ మాత్రమే. కుటుంబానికి అవసరమైనది ఏదో, అవసరం లేనిది ఏదో చెప్పకుండానే తెలుసుకునే అంతర్దృష్టి ఆమెది. బయటకు సాధారణురాలిగా కనిపించినా, లోపల పరిపూర్ణ ఆలోచనాశీలి.


అసలు అమ్మలు ఆత్మకథలు రాస్తే అవి ఆయా కాలాలకు చెందిన చారిత్రిక గ్రంధాలుగా ఆవిష్కృతమవుతాయి. అందులో మన జీవిత పోరాటాలు ఉంటాయి, కన్నీటి చరిత్ర ఉంటుంది, త్యాగాల గాథ ఉంటుంది, వాటిపై మనకు కావలసిన సమీక్షలు ఉంటాయి, విమర్శలకు సమాధానాలుంటాయి, ప్రేమకు నిర్వచనాలుంటాయి.


ఉద్యోగంలో చేరిన కొత్తలో, ఒకవైపు కార్యాలయ పని, మరోవైపు ఇంటి బాధ్యతలు చూసుకుంటూ ఉండగా ఒక్కసారిగా అనిపించింది “వామ్మో! అమ్మకు ఎన్ని చేతులున్నాయో!” అని. అప్పుడే తెలిసింది, ఆమెకు రెండు చేతులే ఉన్నా, ఆ చేతుల్లో వెయ్యి పనుల శక్తి ఉందని.


ఎప్పుడో చదివాను రాఘవ గారు తన "అమ్మ ముచ్చట్లు" లో అమ్మ ఉన్నంతకాలం నేను ఎంత పెద్దయినా, అమ్మ కొంగుచాటు బిడ్డనే అన్నారు. అలాగే మన మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారు నంద్యాలలో మాట్లాడుతూ దేశానికి రాజైన అమ్మకు బిడ్డే అని తన మనసులోని మాట చెప్పారు. రాజ్యాలను నడిపినవారికైనా, శాస్త్రాలను జయించినవారికైనా, ప్రపంచం గెలిచినవారికైనా, అమ్మ ఎదుట మాత్రం వారు పిల్లలే.


మానవత్వం మిగిలి ఉన్న ప్రతి మనసుకీ అమ్మ ప్రేమ అర్థమవుతుంది. అమ్మ హృదయం సముద్రంలా ఎంత విశాలమైనదో అంత లోతైనది. ఆ ప్రేమను కొనలేం, కొలవలేం, తీర్చలేం. కాలాలు మారినా, యుగాలు గడిచినా, అది కాలాతీత సత్యంగానే నిలుస్తుంది.


మనకు నడక నేర్పింది అమ్మే, నడత నేర్పింది అమ్మే, మాట నేర్పింది అమ్మే, మనిషిగా నిలబడటం నేర్పింది కూడా అమ్మే. అలాంటి తల్లికి సేవ చేయగలగడం జీవితంలో దక్కే మహాభాగ్యం. అటువంటి అమ్మపై మన ఫేమస్ సత్యమై, నిత్యమై ఉండాలి.


అబ్బురపరిచే విషయమేమిటంటే, ఇప్పుడు చాలామంది పౌర్ణమి రోజునో, పాడ్యమి రోజునో సముద్ర తీరాన నిలబడి గట్టిగా కేక వేస్తూ తమ స్వరమే సముద్ర ఘోషలా వినిపిస్తోందని చాటింపు వేసుకుంటున్నారు. కానీ నిజానికి మన జీవితమంతా వినిపించే మహాఘోష ఒకటే, అది అమ్మ పిలుపు.


అది సరే… ఇంతకీ అమ్మ కమ్యూనిస్టా? విప్లవవాదా? శ్రామికవాదా? ఆధ్యాత్మిక అమృతవాహినియా? జాతీయవాదా? లేక నా జీవితానికి జగద్గురువా?

ఏమో… నాకు అవన్నీ తెలియదు.

నాకు మాత్రం అమ్మే.

అమ్మ పిలుపు ఎప్పుడైనా మధురమే.

గడిచిన నిన్నైనా…

జరుగుతున్న నేడైనా…

రాబోయే రేపైనా…


ఉంటా

మృశి

(దశిక ప్రభాకర శాస్త్రి)

14.12.2024

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం - సప్తమి - శ్రవణం -‌‌ స్థిర వాసరే* (09.05.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

విష్ణు స్తుతి

 ☘️🌸☘️ విష్ణు స్తుతి🙏


కేశవా! హరిహృషీకేశ నారాయణా

   దామోదర మధుసూదన మహాత్మ

విష్ణు అధోక్షజా!జిష్ణు త్రివిక్రమ

   పద్మనాభ !యుపేంద్ర వాసుదేవ

యచ్యుత గోవింద యనిరుద్ధ మాధవ

  శ్రీధరా !శ్రీకృష్ణ శిష్ట పోష

సంకర్షణ నృసింహ శాశ్వతా యనుచును

మునులునిన్ కొలిచిరి ముదముతోడ

తే..వాసుదేవమాధవనీకు వందనములు

 నందగోపాల శ్రీ పతి నాగశయన 

సకల దేవతా పూజిత శరణు శరణు 

విన్నపాలు వినుము దేవ విష్ణుమూర్తి



సాహితీ శ్రీ జయలక్ష్మీ

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ।

సమః సిద్ధావసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే ।। 22 ।।



ప్రతిపదార్థ:


యదృచ్ఛా— అప్రయత్నముగానే లభించిన; లాభ — లాభము; సంతుష్టో — తృప్తి; ద్వంద్వ — ద్వంద్వములకు (సుఖ-దుఃఖములవంటి); అతీతః — అతీతుడు; విమత్సరః — అసూయా రహితుడై; సమః — సమత్వముతో; సిద్దౌ — జయమునందు; అసిద్దౌ — అపజయమునందు; చ — మరియు; కృత్వా — కర్మలను చేయుచూ; అపి — ఉన్నాసరే; న, నిబధ్యతే — బంధింపబడడు.



తాత్పర్యము : 


   

అప్రయత్నముగానే లభించిన దానితో సంతృప్తి చెంది, అసూయారహితులై, వారు జీవన ద్వంద్వములకు (సుఖ-దుఃఖాలు, లాభ-నష్టాలు వంటివి) అతీతులై ఉంటారు. అన్ని విధముల పనులు చేస్తూనే ఉన్నా, గెలుపు-ఓటమిలలో సమత్వ బుద్ధి తో ఉండి, వారు తమ కర్మలచే బంధింపబడరు.



వివరణ:


ఒకే నాణానికి రెండు పక్కలు ఉన్నట్టు, భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని ద్వంద్వములతో సృష్టించాడు - పగలు, రాత్రి; తీపి-చేదు; వేడిమి-చల్లదనం; వాన-కరువు మొదలగునవి. అందమైన పువ్వు ఉన్న గులాబి మొక్కకి, వికృతమైన ముల్లు కూడా ఉంది. జీవితం కూడా తన వంతు ద్వంద్వములను తెస్తుంది – సుఖము-దుఃఖము; గెలుపు-ఓటమి; కీర్తి-అపకీర్తి. శ్రీ రామచంద్రమూర్తి సైతం, తన దివ్య లీలలలో, అయోధ్యకి మహారాజుగా పట్టాభిషేకం అయ్యే ఒక్కరోజు ముందు వనవాసానికి పంపివేయబడ్డాడు.


ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు, ఎవ్వరూకూడా ద్వంద్వములు లేకుండా, కేవలం అనుకూల పరిస్థితులే ఉండాలని ఆశించలేరు. మరి మన జీవితంలో ఎదురయ్యే ద్వంద్వములను విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలి? ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదిగి అన్ని పరిస్థితులను సమానంగా స్వీకరిస్తూ, సమస్థితిలో ఉండటమే దీనికి పరిష్కారం. ఫలితాలపై ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని చేస్తూపోతూ, మన కర్మ ఫలాలపై అనాసక్తి పెంచుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. మనం భగవంతుని ప్రీతి కోసం కర్మలను ఆచరించినప్పుడు, అనుకూల-ప్రతికూల ఫలితాలను ఈశ్వర సంకల్పంగా పరిగణించి రెంటినీ సంతోషంగా స్వీకరిస్తాము.

పంచాంగం 09.05.2026 Saturday,

  ఈ రోజు పంచాంగం 09.05.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష సప్తమి తిథి స్థిర వాసర శ్రవణం నక్షత్రం శుక్ల యోగః బవ తదువరి బాలవ కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: సప్తమి 


 

నమస్కారః , శుభోదయం

09-05-2026 శనివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

09-05-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.  

---------------------------------------


వృషభం


వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు.

---------------------------------------


మిధునం


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇంటాబయట ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

---------------------------------------


కర్కాటకం


ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. 

---------------------------------------


సింహం


సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

---------------------------------------


కన్య


దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------


తుల


బంధు మిత్రులతో ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. 

---------------------------------------


ధనస్సు


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.

---------------------------------------


మకరం


ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం.

---------------------------------------


కుంభం


ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------


మీనం


సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.

---------------------------------------

Mantra - 34

 Mantra - 34 ARUNAM 4 anuvaakam


ప్రకృతిని ఒక రణరంగంగా, జ్ఞాన సాధనను ఒక వీరకృత్యంగా క్రిందటి మంత్రం వర్ణిస్తే, ఈ క్రింది మంత్రం సూర్య భగవానుడి యొక్క తేజస్సును, ముఖ్యంగా హేమంత ఋతువులో ఆయన కళ్ళు (కిరణాలు) ఎలా ఉంటాయో ఒక అద్భుతమైన ఉదాహరణతో వివరిస్తుంది.


"అక్రుధ్ధస్య యోథ్స్యమానస్య | 

క్రుద్ధస్యేవ లోహినీ। 

హేమతశ్చక్షుషీ విద్యాత్|

అక్ష్ణయోః క్షిపణోరివ||”


“అక్రుధ్ధస్య యోథ్స్యమానస్య” - కోపం లేకపోయినప్పటికీ, యుద్ధానికి సిద్ధమవుతున్న వీరుని వలె. 

సాధారణంగా యుద్ధం చేసేవారు క్రోధంతో ఉంటారు. కానీ, ఇక్కడ వీరుడు శాంతంగా ఉంటూనే పరాక్రమాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. రామాయణంలో (1.1.18) రాముడు శాంత స్వరూపి కానీ కోపం వస్తే ‘కాలాగ్ని సదృశః క్రోధే’ అంటారు వాల్మీకి. అంటే ఇదే.


"క్రుద్ధస్యేవ లోహినీ” - కోపంతో ఉన్నవాని కళ్ళు ఎలాగైతే ఎర్రగా (లోహినీ) ఉంటాయో.


“హేమతశ్చక్షుషీ విద్యాత్” - హేమంత ఋతువులో సూర్యుని కళ్ళను (కిరణాలను) ఆ విధంగానే గ్రహించాలి. 

హేమంతంలో సూర్యుడు ఉదయించేటప్పుడు లేదా అస్తమించేటప్పుడు కిరణాలు ఎర్రటి రంగులో, తీక్షణంగా కనిపిస్తాయి.


“అక్ష్ణయోః క్షిపణోరివ" - బాణాన్ని ప్రయోగించే వేటగాని లేదా వీరుని కళ్ళలో ఉండే తీక్షణత వలె.

గురి చూసి బాణాన్ని వదిలేటప్పుడు కళ్ళలో ఎంతటి ఏకాగ్రత, ప్రకాశం ఉంటాయో, సూర్య కిరణాలు కూడా అంతటి శక్తిని కలిగి ఉంటాయని భావం.


హేమంత ఋతువు వర్ణన - చలికాలం (హేమంతం) లో సూర్యరశ్మి పగటిపూట తక్కువగా ఉన్నప్పటికీ, ఉదయ కాలంలో ఆ ఎర్రటి కాంతి మనకు వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ ఎరుపు రంగును వేదం ఇక్కడ "క్రుద్ధస్యేవ లోహినీ" (కోపంతో ఎర్రబడిన కళ్ళ వంటిది) అని వర్ణించింది.


శాంతంగా ఉంటూనే లోకాన్ని రక్షించడానికి సిద్ధమైన వీరునితో సూర్యుడిని పోల్చడం ద్వారా, భగవంతుని నిర్గుణ మరియు సగుణ రూపాల మధ్య సమన్వయాన్ని ఇక్కడ చూడవచ్చు.


"విద్యాత్" (తెలుసుకోవాలి), "యోథ్స్యమానస్య" (యుద్ధానికి సిద్ధపడుతున్న) వంటి వైదిక పదజాలములు ఉపనిషత్ శైలిలో జ్ఞానాన్ని బోధిస్తాయి. అలాగే "అక్ష్ణయోః" (కళ్ళ యొక్క) అనే పదం కంటి చూపుకు సూర్యుడే అధిదేవత అని గుర్తుచేస్తుంది.


సూర్యుడు లోకాన్ని దహించడానికి కాదు, రక్షించడానికి తన తీక్షణతను ప్రదర్శిస్తాడు. హేమంతం లోని ఆ ఎర్రటి కిరణాలు మన శరీరంలోని దోషాలను హరించి, దృష్టిని ప్రసన్నం చేస్తాయని అరుణ పారాయణ చేసే ఉపాసకులు నమ్ముతారు.


తత్త్వ విచారణ చేస్తే..

అద్వైత సిద్ధాంతం ప్రకారం, ఈ వర్ణన వెనుక ఉన్న లోతైన సూత్రాలు కొన్ని ఉన్నాయి.


ఇక్కడ సూర్యుడిని "అక్రుద్ధుడైన యోధుడు" గా వర్ణించారు. Action without Anger.

అద్వైత సాధనలో లేదా భగవద్గీత నిష్కామ కర్మలో, పని చేయాలి (యుద్ధం) కానీ అది రాగ ద్వేషముల తో కూడినది కాకూడదు.

పరమాత్మ ఈ సృష్టిని నడిపిస్తున్నప్పుడు లేదా లయ చేస్తున్నప్పుడు ఆయనకు ఎవరిమీదా కోపం ఉండదు. అది ఆయన స్వభావం (ధర్మం). 

అలాగే, జ్ఞాని కూడా లోకంలో వ్యవహరిస్తున్నప్పుడు ఎర్రని కళ్లతో (తీక్షణంగా) కార్యదక్షతను ప్రదర్శించవచ్చు, కానీ అంతరంగా మాత్రం కోపానికి అతీతమైన శాంత స్థితిలో ఉంటాడు.


ఎరుపు రంగు ఇక్కడ కేవలం కోపానికి సంకేతం కాదు, అది తీక్షణతకు మరియు పరిపక్వతకు సంకేతం.

హేమంత కాలంలో సూర్యుడు మంచును చీల్చుకుంటూ వస్తున్నప్పుడు ఎర్రగా కనిపిస్తాడు. 

అద్వైతంలో అజ్ఞానమనే మంచును దహించివేసే 'జ్ఞానాగ్ని'కి ఇది ప్రతీక. The light of wisdom.

సాధకుడి బుద్ధి, బాణం వలె (క్షిపణోరివ) సూటిగా, సత్యాన్ని ఛేదించే విధంగా ఉండాలని ఇక్కడ సూచించబడింది.


మంత్రంలో "క్రుద్ధస్యేవ" (కోపంతో ఉన్నవాని వలె) అని వాడబడింది. అంటే, సూర్యుడికి నిజంగా కోపం లేదు, కానీ అలా కనిపిస్తున్నాడు.

ఇది అద్వైతంలోని 'వివర్తవాదం' (కనిపించేది ఒకటి, నిజమైనది మరొకటి). మాయ కు ప్రతీక. The Illusion of Appearance.

పరమాత్మకు గుణాలు లేవు (నిర్గుణ), కానీ లోక కల్యాణం కోసం లేదా మాయా ప్రభావం వల్ల రకరకాల రూపాల్లో, భావాల్లో ఉన్నట్లు మనకు గోచరిస్తాడు.


హేమంత కాలంలో ప్రకృతి నిశ్శబ్దంగా, చల్లగా ఉంటుంది. ఇది సాధకుని ఉపరతి (ఇంద్రియాలను వెనక్కి తీసుకోవడం) అనే స్థితికి సంకేతం.

బయట చల్లదనం ఉన్నా, లోపల ఆత్మ ప్రకాశం (ఎర్రని కళ్లు/తీక్షణత) వెలుగుతూనే ఉంటుంది. బయటి ప్రపంచం నిశ్చలంగా ఉన్నప్పుడే మనలోని ఆత్మ చైతన్యాన్ని యోధుడి వలె జాగృతం చేసుకోవాలి. హేమంతము - అంతర్ముఖత్వమునకు The Cold of Self-Reflection కు చిహ్నము.


అద్వైత కోణంలో ఈ మంత్రం ఇచ్చే సందేశం - నీవు చేసే ప్రతి పనిలో యోధుడి వంటి పట్టుదల, ఏకాగ్రతతో గురి చూసి వదిలిన బాణం వలె ఉండాలి. కానీ, నీ అంతరంలో మాత్రం కోపతాపాలకు తావులేని శాంతి (అక్రోధము) ఉండాలి. సూర్యుడు మంచును చీల్చి ప్రకాశించినట్లు, నీ జ్ఞాననేత్రం అజ్ఞాన పొరలను చీల్చి పరమ సత్యాన్ని దర్శించాలి.

పురాణ భాషను అర్థం చేసుకోకపోవడం


 పురాణ భాషను అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చే అపోహ. భారతీయ సాహిత్యంలో భార్య, పత్నీ, సహచరి, జటాజూటవాసిని, సుత, కుమారుడు, ఇలా ఇటువంటి పదాలు ఎల్లప్పుడూ లౌకిక అర్థంలోనే ఉండవు. చాలా సందర్భాల్లో అవి తాత్త్విక, కవితాత్మక, సంకేతాత్మక భావాలను సూచిస్తాయి.

ఉదాహరణకు: గంగా శివజటాజూటంలో నిలిచింది అంటే శివుడు గంగావేగాన్ని నియంత్రించాడు.

పార్వతి శివపత్ని అంటే శక్తి తత్వానికి ప్రతీక.

గంగా శివుని శిరస్సుపై ఉంది అంటే పవిత్రత, జ్ఞానం, కరుణ ప్రవాహానికి సంకేతం.

అందువల్ల ఎక్కడైనా కవి గంగను “శివుని మరో భార్య” అన్నట్లుగా చెప్పినా అది న్యాయపరమైన వివాహం కాదు. కవిసమయం.


కవిత్వంలో అలంకారం, భావవ్యక్తీకరణ, కవిసమయం అని ఉంటాయి. సంస్కృత, తెలుగు కవిత్వంలో కవిసమయం అనే ఒక సంప్రదాయం ఉంది. అంటే కవులు అందరికీ తెలిసిన చిహ్నాలను, అలంకారాలను, రూపకాలను ఉపయోగించి భావాన్ని బలంగా చెప్పడం.

ఎలా అంటే, 

చంద్రుడు ప్రేమికుడు,

భూమి తల్లి,

గంగా దేవి,

శివుడు గంగాధరుడు,

లక్ష్మి సముద్రతనయ, ఇలా,...

ఇవి చరిత్ర నిజాలు కాదు.

 సాహిత్యరూపకాలు.

ఇక్కడ చెప్పిన చాటువులో కూడా కవి నీటి కొరత తీవ్రతను చెప్పడానికి గంగను విడిచిపెట్టు, పార్వతి చాలు అని హాస్యరసంతో అన్నాడు. ఇది శివతత్వంపై దూషణ కాదు.


నాస్తిక వాదులు, హిందూ వ్యతిరేకుల వాదనలో లోపం

ఏమిటంటే ఒక కవితలోని రూపకాన్ని పట్టుకుని దేవతలను అపహస్యం చేయడం.


“భారతమాత” అంటే దేశం ఒక స్త్రీనా? అని ఒక మూర్ఖుడు అడిగినట్టే, “సూర్యుడు ఉదయించాడు” అంటే సూర్యుడు నిజంగా నడిచి వచ్చాడా? అనేవాళ్ళు ఉన్నారు. అలాగే నా చిన్నప్పుడు చదివాను

“గంగమ్మ తల్లి” అంటే నది ప్రసవించిందా? అని ఒక వామపక్షవాది వ్యంగ్యంగా అన్నది. ఇలా రూపకాన్ని యథార్థంగా తీసుకుని వెక్కిరించడం సబబు కాదు.


గంగాదేవి స్థానం ఏమిటి?

ఒక కవి వర్ణించినట్టు గంగా అనేది పవిత్రనది, దేవలోక ప్రవాహం, పాపనాశిని, భగీరథ తపస్సుకు ప్రసన్నమైన దివ్యశక్తి, శివజటాజూటంలో స్థిరపడిన కరుణస్వరూపిణి. ఆమెను అవమానించడం అంటే భారతీయ సంస్కృతిలో పవిత్రత భావనను అవమానించడం.


కాబట్టి, కవిత్వంలోని రూపకాన్ని చరిత్రగా తీసుకుని హేళన చేయడం అజ్ఞానం. గంగ శివుని భార్య అని శాస్త్రసిద్ధ వివాహం ఎక్కడా లేదు. గంగాధరుడు అనే శివనామాన్ని కవులు అలంకారంగా విస్తరించారు. దాన్ని అపహాస్యానికి వాడటం సాహిత్యానికీ, సంస్కృతికీ అవమానం. కవిత్వంలో భావరూపకాలు ఉంటాయి. అవన్నీ యథార్థ నిర్ణయాలు కావు. రూపకాన్ని యథార్థంగా తీసుకుని దేవతలను దూషించే వారు విమర్శకులు కాదు, వికృత దృష్టి కలవారు అని నా అభిప్రాయం.


సనాతన ధర్మంలో గంగా పవిత్రతకు ప్రతీక. శివుడు నియంత్రణకు ప్రతీక. పార్వతి శక్తికి ప్రతీక. ఇవి తత్వాలు, వీధి చర్చల విషయాలు కావు.


_*పురాణాన్ని చదవని వారు ప్రశ్నిస్తారు.*_

_*సాహిత్యాన్ని అర్థం చేసుకోని వారు వెక్కిరిస్తారు.*_

_*సంస్కృతి తెలిసినవారు మాత్రం నమస్కరిస్తారు.*_


 

 మనకు ఈ జగత్తులో రెండు గోచరిస్తున్నాయి ఒకటి శక్తి 2 పదార్థ ం ఏ పదార్థంలో చైతన్యం కావాలన్నా ఆ పదార్థంలో నిగుడికృతమైన శక్తి చైతన్య పరచటము వలన పదార్థం చైతన్యవంతంగా మనకు కనబడుతున్నది 


మన మహర్షిలు బహుశా శక్తిని ఆదిపరాశక్తిగా పదార్థాన్ని పరమేశ్వరుడు గా పేర్కొని ఉండవచ్చు కాదా 


 మనము ఎప్పుడు భగవంతుడు మనలాగే అవయవాలు కలిగి ఉన్న మానవుడి లాగా తలవకూడదు భగవంతుడు శక్తి స్వరూపుడు శక్తి మనకు కనబడదు అటువంటి పరిస్థితుల్లో భగవంతుని చూడలేము అన్నది సత్యం


 కానీ సామాన్య మానవులు దైవ తత్వాన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉండరు కాబట్టి దేవుడికి రూపాన్ని కల్పించి మన మనస్సుని ఆ రూపాన్ని ఆరాధించే దిశలో పంపించి ముందుగా మనస్సును స్థిరపరచుకొని తర్వాత జ్ఞానంతో భగవంతుని చేరుకోవాలని మనకు మన మహర్షులు వారు ఆచరించి ఆ దైవ తత్వాన్ని అనుభవించి మనకు   బోధించారు

 నాస్తికుడు కనబడే దానిని కూడా నమ్మడు

 భక్తుడు భగవంతుడు వేరు తాను వేరు అని తలుస్తాడు

 కేవలం జ్ఞాని మాత్రమే భగవంతుడు మాత్రమే ఉన్నాడు తాను కూడా భగవంతుడే అని నమ్ముతాడు