9, మే 2026, శనివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*736 వ రోజు*

అశ్వమేధ పర్వము తృతీయాశ్వాసము

వసుదేవుడికి అభిమన్యుడి మరణవార్త తెలుపుట

కురుక్షేత్రయుద్ధ విశేషాలు విన్న వసుదేవుడు చింతాకాంతుడయ్యాడు. అభిమన్యుడి మరణవార్త వసుదేవుని ఇంకా క్రుంగదీస్తుందని చెప్పలేదు. కాని సుభద్ర దుఃఖం ఆపుకోలేక " అన్నా ! మీ తండ్రి వసుదేవుడు. అది విని దుఃఖిస్తున్న వసుదేవుడిని అక్కడ ఉన్న యాదవులను ఓదార్చడము కృష్ణుడివంతైంది. ధృతరాష్ట్రుడితో చేరి ధర్మరాజు కౌరవులందరికి అంతిమ క్రియలు జపించినతీరు బ్రాహ్మాణులకు దానములు ఇవ్వడము వారిపేరు మీద అనేక ధర్మకార్యాలు నిర్వహించడము సవిస్తరంగా వివరిండు. అందరూ మెల్లమెల్లగా ఆ దుఃఖమునుండి బయట పడ్డారు " అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.

ఆశ్వమేధయాగము


జనమేజయుడు " వైశంపాయన మహర్షీ ! వ్యాసుడు ధర్మరాజును అశ్వమేధయాగమును చేయమని ఆదేశించాడు కదా ! ధర్మరాజు ఆయాగమును ఎలా నిర్వహించాడు " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయ మహారాజా ! వ్యాసుడు తన మీద ఉన్న వాత్సల్యముతో అశ్వమేధయాగము చేయమని ఆదేశించిన తరువాత ధర్మరాజు తన తమ్ములను పిలిచి " భీమార్జున నకులసహదేవులారా ! వ్యాసుడి ఆదేశము విన్నారు కదా ! యాగనిర్వహణకు కావలసిన ధనము మన వద్దలేదు. కనుక వ్యాసుడు చెప్పినట్లు బ్రాహ్మాణులు దాచిన ధనము తీసుకురావలసిన అవశ్యకత ఉంది. హిమాలయములలో ఉన్న ఆ నిధిని తీసుకురావడానికి కావలసిన మార్గము గురించి, చేయవలసిన ఏర్పాటు గురించి మీరు నాకు మీ అభిప్రాయములు చెప్పండి " అని అడిగాడు. జవాబుగా భీముడు " అన్నయ్యా ! ధర్మనందనా ! మనము ఆ పరమేశ్వరుడిని నియమ నిష్టలతో పూజించి ఆయన కరుణ పొంది ప్రమధగణములను పూజించి, భూతబలులు సమర్పించి ఆ నిధిని తీసుకు వస్తాము. కనుక ధనముగురించిన చింతతో పనిలేదు. ఆ కార్యము సాధించడానికి సముచిత సైన్యము కావాలి " అని భీముడు చెప్పాడు. భీముని మాటలకు అర్జునుడు, నకులసహదేవులు తమ అంగీకారము తెలిపారు. తమ్ముల మాటలకు ధర్మరాజు సంతోషించాడు. అందరూ కలిసి హిమాలయములకు పోవడానికి నిశ్చయించుకున్నారు. తరువాత పెదనాన ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకోవడానికి వెళ్ళారు. ధర్మరాజు ధృతరాష్ట్రుడికి చెప్పగానే ధృతరాష్ట్రుడు తన కుమారులు లేనందుకు విలపించాడు. ధర్మరాజు ధృతరాష్ట్రుడి పాదములు పట్టుకుని గాంధారి వింటూ ఉండగా వ్యాసమహర్షికి తనకు జరిగిన సంభాషణ వ్యాసుడు తనను అశ్వమేధయాగము చేయమని చిప్పిన విషయము చెప్పి యాగము చేయడానికి ధృతరాష్ట్రుడి అనుమతి పొందాడు. తరువాత తన తల్లి కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆమెకు యాగము గురించి చెప్పాడు. ఆ మాటలు విని కుంతీదేవి సంతోషంతో యాగముకు అనుమతి ఇచ్చింది. కుంతీదేవి అనుమతి తీసుకున్న ధర్మరాజు ఆస్థానమండపానికి వెళ్ళి యుయుత్సుడికి హస్థినాపుర బాధ్యత అప్పగించి అతడికి తోడుగా విదురుడిని నియమించాడు. సైన్యాధిపతులను పిలిచి ప్రయాణసన్నాహములు చెయ్యమని ఆదేశించాడు. తరువాత సమస్తదేవతలకు, పితరులకు పూజలు చేసాడు. అగ్నికార్యము నిర్వహించాడు. ధౌమ్యుడికి నమస్కరించి తరువాత రథము మీద కూర్చున్నాడు. మార్గమధ్యములో బ్రాహ్మణుల వద్ద పుణ్యస్త్రీల వద్ద ఆశీర్వాదములు స్వీకరిస్తూ తన పూరోహితుడు ముందుగా నడువగా హిమాలయములకు పయనమయ్యాడు. ధర్మరాజు వెంట భీమార్జున నకులసహదేవులు రథముల మీద అనుసరించారు. మార్గమధ్యములో సామంతరాజులు కూడా వారితో కలిసారు. అందరూ కలిసి ఒక సమతలప్రదేశంలో విడిది చేసారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: