20, జూన్ 2026, శనివారం

పంచాంగం 20.06.2026 Saturday,

 ఈ రోజు పంచాంగం 20.06.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస శుక్ల పక్ష షష్ఠి తిథి స్థిర వాసర మఘ నక్షత్రం వజ్ర యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: షష్ఠి


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 8 ।।



ప్రతిపదార్థ:



  పరిత్రాణాయ — రక్షించుటకు; సాధూనాం — ధర్మపరులను; వినాశాయ — నాశనంచేయటానికి; చ — మరియు; దుష్కృతామ్ — దుష్టులను; ధర్మ — సనాతన ధర్మమును; సంస్థాపన-అర్థాయ — మళ్ళీ స్థాపించుటకు; సంభవామి — నేను ప్రకటమవుతాను; యుగే యుగే — ప్రతి యుగము నందు.


 

 తాత్పర్యము : 


ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, మరియు ధర్మ సూత్రములను తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.




వివరణ:



పూర్వ శ్లోకం లో భగవంతుడు అవతరిస్తుంటాడు అని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు దానికి ఉన్న మూడు కారణాలను వివరిస్తున్నాడు: 1) దుష్టులను సంహరించుట కొరకు 2) సాధు జనులను రక్షించుట కొరకు 3) ధర్మాన్ని స్థాపించుట కొరకు. కానీ, వీటిని నిశితంగా పరిశీలిస్తే ఈ మూడు కారణాలు కూడా నమ్మకంగా అనిపించవు.


సాధు జనులను రక్షించుట కొరకు: పరమాత్మ తన భక్తుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు, లోపలనుండి వారిని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూనే ఉంటాడు. ఈ పని కోసం ఒక అవతారం తీసుకోవలసిన అవసరం లేదు.


దుష్టులను సంహరించుట కొరకు: భగవంతుడు సర్వ-శక్తివంతుడు, దుష్టులను తన సంకల్ప మాత్రంచేతనే సంహరింపగలడు. దీనికోసం ఒక అవతారం ఎత్తవలసిన అవసరం ఏమున్నది?


ధర్మాన్ని స్థాపించుట కొరకు: అనాది కాలం నుండి వేదములలో ధర్మము వివరించబడింది. భగవంతుడు దానిని ఒక మహాత్ముని ద్వారా తిరిగి స్థాపించవచ్చు. దీనిని సాధించటం కోసం తానే ఒక రూపంలో అవతరించాల్సిన అవసరం లేదు.


మరైతే, ఈ శ్లోకంలో చెప్పబడిన కారణాలను మరెలా అర్థం చేసుకోవాలి? శ్రీ కృష్ణుడు ఏం చెప్తున్నాడో కొంచెం లోతుగా వెళ్లి అర్థం చేసుకుందాం.


జీవాత్మ చేయ గలిగే అత్యున్నత ధర్మం, భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వటమే. దీనినే భగవంతుడు తన అవతారం ద్వారా వృద్ది నొందిస్తాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు తన దివ్య రూపములు, నామములు, గుణములు, లీలలు, ధామములు, మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు. ఇది జీవాత్మలకు భక్తి కోసం ఒక సులువైన ఆధారాన్ని అందిస్తుంది. మనస్సుకి ధ్యానం చేయటానికి, అనుసంధానమవటానికి ఒక రూపం అవసరం, అందుకే భగవంతుని నిరాకార తత్త్వం, ఆరాధించటానికి చాలా కష్టతరమైనది. అదే సమయంలో, సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది, సామాన్య జనులకు అర్థం చేసుకోవటం తేలిక, ఆచరించటానికి సులువైనది, మరియు ఎంతో మధురమైనది.


ఈ విధంగా, ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు అవతరించినప్పటి నుండి, కొన్ని కోట్ల జీవులు (జీవాత్మలు) కృష్ణుడి దివ్య లీలలను తమ భక్తికి ఆధారంగా వాడుకుని, తమ మనస్సులను సునాయాసంగా, ఆహ్లాదంగా పవిత్రమొనర్చుకున్నారు. ఇదే విధంగా, రామాయణం కూడా ఎన్నో శతాబ్దాలుగా జీవాత్మల భక్తికి, ఎంతో జనాదరణ పొందిన ఆధారంగా ఉపయోగపడింది. భారతదేశంలో ఆదివారాల్లో టీవీలో రామాయణం మొదలయిన రోజుల్లో, దేశంలో అన్ని వీధులు నిర్మానుష్యమయ్యేవి. రామచంద్రుని లీలలు జనులకు ఎంత ముగ్ధమోహనముగా ఉండేవంటే, ప్రజలు తమ టెలివిజన్ తెరలకు, ఆ లీలలను చూడటానికి, అతుక్కుపోయేవారు. శ్రీరామచంద్రుని అవతారం, చరిత్రలో ఎన్నో కోట్ల జీవాత్మలకు తమ భక్తికి ఒక ఆధారాన్ని అందించింది. రామాయణం ఇలా పేర్కొంటున్నది:


రామ ఏక తాపస తియ తారీ, నామ కోటి ఖల కుమతి సుధారీ


‘తన అవతార సమయంలో, రామచంద్ర మూర్తి ఒక్క అహల్యకే (గౌతమ ముని భార్య, ఆమెను రాముడు ఒక రాతి శరీరంనుండి విడిపించాడు) సహాయపడ్డాడు. కానీ, అప్పటి నుండి “రామ” నామము జపించి, కోట్ల మంది పతితులైన జీవులు తమను తాము ఉద్ధరించుకున్నారు.’ కాబట్టి, ఈ శ్లోకానికి నిగూఢమైన అర్థం ఏమిటంటే :


ధర్మాన్ని స్థాపించటం కోసం: జీవాత్మలకు భక్తిలో నిమగ్నమై తమ అంతఃకరణ శుద్దికి సహకరించటానికి, తన నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు, మరియు సహచరులను ప్రకటించటం ద్వారా, భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచటానికి భగవంతుడు అవతరిస్తాడు.


దుష్టులను సంహరించటం: భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి, ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి, దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి, రావణ-కుంభకర్ణులు నిజానికి భగవత్ దివ్య ధామము నుండి దిగివచ్చిన జయ-విజయులే. వారు రాక్షసులుగా నటించారు మరియు రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దివ్య పురుషులు కాబట్టి మరెవ్వరి చేత సంహరింపబడలేరు. కాబట్టి, భగవంతుడే అటువంటి రాక్షసులను తన లీలలలో భాగంగా సంహరించాడు. అలా సంహరించి, వారిని తన దివ్య ధామానికి పంపించాడు, ఎందుకంటే వారు నిజానికి అక్కడి నుండి వచ్చిన వారే.


ధర్మాత్ములను రక్షించటం: ఎన్నో జీవాత్మలు, భగవంతుడిని తమ ఎదురుగా దర్శించటానికి తగినంత ఉన్నతిని సాధనలో పొందిఉన్నారు. ఈ అర్హత సంపాదించిన జీవాత్మలు, శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి మొదటి అవకాశాన్ని పొందాయి. ఉదాహరణకి, కొంతమంది గోపికలు (శ్రీ కృష్ణుడు తన లీలలను ప్రదర్శించిన బృందావనానికి చెందిన మహిళలు) నిజానికి శ్రీ కృష్ణుని లీలలలో సహకరించటానికి ఆయన దివ్య ధామము నుండి దిగివచ్చిన ముక్త జీవులు. మరికొంత మంది గోపికలు, మొదటి సారి భగవంతుని కలిసి, సేవించుకుని, ఆయన లీలలలో పాలు పంచుకునే అవకాశమొచ్చిన, భౌతిక బంధములో ఉన్న జీవులు. కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, అలాంటి పరిపక్వత కలిగిన జీవాత్మలకు, ఆయన లీలలలో భాగస్వాములై, తమ భక్తిని పరిపూర్ణమొనర్చుకునే అవకాశం కలిగింది.


ఇది, ఈ శ్లోకం యొక్క నిగూఢమైన అర్థం. అదే సమయంలో, ఎవరైనా ఈ శ్లోకాన్ని ఉన్నదున్నట్లుగానే అర్థం చేసుకోవటంలో కూడా తప్పు లేదు.

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 16*


*సరాగః సద్వేషః ప్రసృమరసరోజే ప్రతిదినం*

*నిసర్గాదాక్రామన్విబుధజనమూర్ధానమధికమ్ ।*

*కథంకారం మాతః కథయ పదపద్మస్తవ సతాం*

*నతానాం కామాక్షి ప్రకటయతి కైవల్యసరణిమ్ ॥*


*భావము :*


*ఓ కామాక్షీ! నీ పాదపద్మములు, పద్మముల కాంతిని తిరస్కరించాయి. నీ పాదపద్మముల కాంతిని సకల దేవతలు, విజ్ఞులు శిరసున దాల్చారు. అలాంటి నీ పాదములు, నీ శరణు కోరినవారికి ముక్తిని ప్రసాదించడం మా భాగ్యము కాక మరేమిటి.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

శనివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏


20-06-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉదర అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.  

---------------------------------------


వృషభం


చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

---------------------------------------


మిధునం


వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా సన్నిహితుల సహాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


బంధువులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు.

---------------------------------------


కన్య


సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ యత్నాలలో విజయం వరిస్తుంది. స్నేహితుల నుండి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

---------------------------------------


తుల


కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.  

---------------------------------------


వృశ్చికం


నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు. ఇంటా బయట పెద్దల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------


ధనస్సు


ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి. వ్యాపారంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------


మకరం


ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నములలో ఆటంకలు తొలుగుతాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.

---------------------------------------


కుంభం


ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. కీలక వ్యవహారాలలో మీ కలలు నిజమవుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

---------------------------------------


మీనం

 

ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు తప్పవు. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని పనులలో సన్నిహితుల నుండి నిందలు పడవలసి వస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

---------------------------------------

వృక్షయర్వేద విచిత్రాలు

 వృక్షయర్వేద విచిత్రాలు -


• కొబ్బరి చెట్లకు ఎక్కువు గా కాయలు కాయలంటే ప్రతి రోజు " మరువం , పెసలు, మిణుములు" ఈ మూడింటి తో తయరు అయిన కషాయాన్ని చల్లార్చి పోస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ ముడింటి ముద్దను చెట్ల మొదళ్లకు పట్టించాలి. అలా చేయడం వలన కొబ్బరి చెట్టు కి విపరీతమైన బలం వస్తుంది. చాలా పెద్ద మొత్తం లొ కాయలు కాస్తూ యవ్వనం గా తయారు అవుతుంది.


• మల్లెపూలు తెల్లగా ఉంటాయని మనకు తెలుసు.వాటిని ఎరుపు రంగులో పూయించ వచ్చు. పారిజాతం ( పగడ మల్లె ) చెట్టు వేరుకు రంధ్రం చేసి ఆ రంద్రం లొ మల్లె తీగను తీసుకొచ్చి గుచ్చాలి.ఆ తరువాత దానిపై మట్టి కప్పాలి. రోజు నీళ్లు పొస్తూ ఉంటే పారిజాతం తో పాటు మల్లె చెట్టు కుడా కలిసిపోయి పెరుగుతుంది. ఆ తరువాత భూమిని తవ్వి మల్లె వేరుని పారిజాతం నుంచి వేరు చేసి విడిగా పాతి పెడితే కొద్ది రోజుల్లోనే తెల్ల మల్లె చెట్టు ఎర్ర మల్లె పూలు పూస్తుంది.మంచి సువాసన కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఏ చెట్టు విత్తనాలు అయినా నాటి వాటికి ఏ రంగు నీళ్లు అయితే పోస్తామో ఆ రంగు పువ్వులే పూస్తాయి.


• మునగ చెట్టుకి కాసిన మునగ కాయలు చెట్టు మీదే పండి ఎండిన తరువాత వాటిని సేకరించాలి. ఆ కాయలను సగం విప్పదీసి , అందులోని మునగ గింజలని తీసివేసి వాటి స్థానం లొ కాకర గింజల్ని పెట్టి , దారం తొ కాయని గట్టిగా చుట్టి భూమిలో పాతి పెట్టాలి. కొన్నాళ్ళకి చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టుకి ఒకవైపు మునగ కాయలు, మరోవైపు కాకరకాయలు పుడతాయి.


• విత్తనాలు లేని కాయలు కాయలంటే వంకాయ,గుమ్మడి కాయ , పొట్ల కాయ మొదలయిన చెట్ల విత్తనలని వస రసం లొ నానబెట్టి భుమి లొ పాతి పెట్టాలి.చెట్లు మొలిచేవరకు ప్రతి రోజు వస నీళ్ళను పాదుల్లో పోయాలి.ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే చెట్లు ఆరోగ్యం గా పెరిగి గింజలు లేని పెద్ద కాయలు కాస్తాయి.


• కొన్ని పువ్వులు ఎంతో అందం గా ఉంటాయి.కాని వాటికి సువాసన ఉండదు.అలాంటి పూల చెట్టుకి ప్రతి రోజు " చెంగల్వ కోస్టు ,ఆకుపత్రి, సారాయి,తుంగ ముస్థలు , తగిరస, వట్టివేళ్ళు,"మొదలయిన ఔషధ చుర్ణముని నీళ్లలో కలిపి ఆ నీళ్లను చెట్ల పాదుల్లో పొస్తూ ఉంటే క్రమం గా ఆ చెట్లకి పూచే పూలకి అద్బుతమైన సుగంధం అబ్బుతుంది. ఒక నెల వరకు పూల సువాసనలు గుబాళిస్తునే ఉంటాయి.


" వృక్ష జాతులు అనగా తిన్త్రిని మామిడి మొదలగు చెట్లు ను తీగలుగా మార్చుట

బియ్యపు పొడి 1 భాగము , మినుముల 1 బాగము , నలగ దంచిన వడ్ల పిండి 1 భాగము , నువ్వుల పిండి 1 భాగము, వీటిని మాంసము కడిగిన నీళ్లలో కడిగి పసుపు పొడి పోగవేసి పాటి మట్టి నేలలో నాటితే అవి తీగలుగా మారును.


• చెట్లు అప్పటికి అప్పుడే పెరిగి చిగుర్చుట -

అంకోల తైలము లొ యే చెట్టు యెక్క బీజములు నైనా నూరు మాట్లు తడిపి వడగండ్లతో కలిపి పాటిమట్టి లొ నాటితే అప్పటికప్పుడే చెట్టు మొలిచి పండ్లు, పువ్వులు ఇచ్చును.


• బీజములు తొందరగా మొలుచుటకు -

ఆయా పండ్లు కాచే సమయమున వాటి విత్తనాలు సేకరించి వాటిని బాగుగా ఎండించి పాలలో తడిపి అయిదు దినములు ఎండనించి వాయు లవంగాల కషాయముతో కలిసిన నేతితో పోగవేసి పంచాంగం, బృహతి, నిప్పుల బూడిద ను పాలలొ కలిపి ఆ విత్తనాలను దీనితో పిసికి ఆ ప్రకారము అయిదు రోజులు అయిన పిమ్మట ఆ బీజములు ఆవు పేడతో , ఆవు మూత్రములో ఒక్కో దినము నానబెట్టి విత్తిన మొక్కలు తొందరగా మొలుచును .


• చెట్లకు విపరీతముగా పువ్వులు , పండ్లు కాచుటకు -

చేప మాంసమును , ఆవు పేడతో కలిపి చెట్లకు వేసి యావలు, నువ్వులు , మిణుములు, పెసలు, వులవులు ఈ ఐదింటిని సమబాగాలుగా కలిపి నీళ్లు పోసి వుడకపెట్టి ఆ నీళ్లు చల్లార్చి రెండు దినములు వరసగా చెట్లకు చల్లితే చెట్లు విశేషముగా ఫలించును.

మామిడి చెట్లకు నక్క మాంసం , ఉడుము మాంసం లేదా లేడి, పంది మాంసం , రావి చిగుల్లు, మర్రి చిగుల్లు , అత్తి చిగుల్లు, మామిడి చిగుల్లు, నేరేడు చిగుల్లు, కషాయం పెట్టి చల్లార్చి పాదులో పొసిన మంచి పండ్లు పండును.

మామిడి చెట్టు వేరు దగ్గర చుట్టు గొడ్డలితో కొంచం కాటు చేసి కషాయం పొసిన విశేషమైన ఫలములు ఇచ్చును.

పెసలు , మినుములు ఉడక పెట్టి చల్లార్చి ఆ నీళ్లు తేట వంచి ఆ గుజ్జు కొబ్బరి చెట్టు వేళ్ళకు పట్టించి ఉప్పు నిండా వేసి ఆ నీళ్లు పోస్తే పెద్ద పెద్ద కాయలు కాయును , కాయలు రాలవు.

*. పోక చెట్లకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో పైన ఎండిపోయిన మట్టలు కోసి చెట్ల చుట్టు త్రవ్వి పైన చెప్పిన కషాయము పొస్తే అధికముగా పండును.


* అరటి చెట్టు కు ఏనుగు దంతపు పొట్టు కాల్చిన నిప్పులోగాని, పంది పెంటికలు, గుర్రపు పెంటికలు కాల్చిన నిప్పులో గాని ఇనప సలాకు ఎర్రగా కాల్చి చెట్టు మొదట వేరులో గుచ్చితే చాలా గొప్ప ఫలితాలు ఇచ్చును.

రేగు చెట్టుకి నువ్వులు , పెసలు సమబాగములు గా చేర్చి దానితో కొంచం అతిమధురం వేసి చెట్టు చుట్టు వేసి మాంసం కడిగిన నీళ్లు పొసిన మరియు నూవుల పిండి , అతిమధురం కలిపి ఎరువు వేసిన తియ్యటి ఫలములు మరియు తియ్యటి ఫలములు ఇచ్చును.


* పత్తి విత్తనాలను ఆవు పేడలో , ఆవు పంచితములో చాలుమార్లు తడిపి పేడనీళ్ళు చల్లుతూ నాటిన తరువాత పందికొవ్వు, మాంసం కడిగిన నీళ్లు చల్లిన అది తన జాతిని విడిచి నిమ్మ జాతిగా మారును.


* మామిడి టెంక నాటిన పిదప మొలచిన మొక్క జానెడు వరకు పెరిగిన పిదప చిగురు కత్తిరించిన యెడల నాలుగైదు కొమ్మలు పుట్టి పెరుగును. ఆ కొమ్మలు వ్రేళ్ళు వలె పెరిగిన పిమ్మట నాలుగు కొమ్మలకు నాలుగు జాతుల అంటు మామిడి అంట్లు కట్టిన నాలుగు వైపులా నాలుగు రంగుల కాయలు కాచును.


* పనస మొక్కకు మామిడి కొమ్మ కట్టి నాటిన మొదటను పనస కాయలును, కొమ్మలకు మామిడి కాయలను కాయును .


* నేరేడు మొక్క యెక్క కొమ్మకు గులాబి, జామ, అంటును కట్టవచ్చు.

నిమ్మ , దబ్బ , కమలా, నారింజ, ఈ జాతులు ఒక జాతి మొక్కకు అన్ని జాతుల మొక్కలు అంట్లు కట్టవచ్చును.

పాల మొక్కకు సపోటా, పనస అంటు కట్టవచ్చును.


* పొగాకుకు , గరుడ వాహన , జాజికి చమెలి, గులాభికి పల్ల సంపెంగి , మాలతికి సాంబ్రాణి అంట్లు కట్టవచ్చు.

మల్లె చెట్టు దగ్గర నొక యెర్ర బాడిద కొమ్మను పాతి ఆ కొమ్మ చిగిర్చిన పిదప అడ్డగముగా నొక రంధ్రము చేసి ఆ రంధ్రములో నుండి ఒక మల్లె కొమ్మని తీసి పేడ మన్ను ఆ రంధ్రముని గప్పి నీళ్లు పోయుచుండిన కొంతకాలానికి ఆ రంద్రములో గల కొమ్మకి వేర్లు వచ్చును. పిమ్మట ఆ కొమ్మని మొదటకి కోసి నాటిన మంకెన ( బాడిద ) పువ్వులు పూయును.


* పొగడ చెట్టు కొమ్మకు సంపెంగ మొక్కకు అంటు కట్టిన ఒక పక్క పొగడ పువ్వులు , ఇంకో పక్క సంపెంగ పువ్వులు పూయును.

సూర్య కాంత ( sunflower ) గింజలు పాలలొ 7 మార్లు నానవేసి ఎండబెట్టి నాటి రోజు పాలతో తడుపు చుండిన తెల్లని పువ్వులు పూయును.

ఎర్ర గన్నేరుకు , తెల్ల గన్నేరుకు అంటు కట్టిన రెండు రకాల పువులు పూయును.


అప్పారావు డైటింగ్

 అప్పారావు డైటింగ్ రేపటి నుంచి (హాస్య కథ)

==================

రచన : సురేష్ వంకాయలపాటి

=============


మా కాకినాడ దేవాలయం వీధిలో అప్పారావు అనే వ్యక్తి ఉండేవాడు. అప్పారావు చాలా మంచి మనిషి. అందరితో నవ్వుతూ మాట్లాడేవాడు. కానీ అతనికి ఒక చిన్న బలహీనత ఉండేది.

అది ఏమిటంటే… తినడం!

తినడం అంటే అతనికి చాలా ఇష్టం. కొందరికి పుస్తకాలు అంటే ఇష్టం, కొందరికి సినిమాలు అంటే ఇష్టం. కానీ అప్పారావుకి మాత్రం తినడమే ప్రపంచంలో పెద్ద హాబీ.

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం – ఎప్పుడైనా ఏదైనా తినడానికి సిద్ధంగానే ఉండేవాడు.

అప్పారావు ఉదయం లేవగానే మొదట చేసే పని ఏమిటంటే… అద్దం చూడటం కాదు, మొబైల్ చూడటం కాదు… వంటగది చూడటం!

వంటగదిలోకి వెళ్లి

“ఈ రోజు ఏమి వండారు?”స్పెషల్స్ ఏమిటి అని అడగడం అతని దినచర్య.

ఒక రోజు ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్లి చూసాడు. అక్కడ అతని భార్య సీత ఇడ్లీలు వేస్తోంది.

అప్పారావు కళ్ళు మెరిసిపోయాయి.

“సీతా! ఇవాళ్టి టిఫిన్ ఏమిటి?” అని అడిగాడు.

సీత నవ్వుతూ చెప్పింది

“ఇడ్లీలు చేస్తున్నాను. కొద్దిసేపట్లో సిద్ధం అవుతాయి.”

అప్పారావు వెంటనే ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టాడు.

“అయితే ఇడ్లీకి కొబ్బరి చట్నీ కూడా చేయి. అలాగే కొంచెం దబ్బకాయ బెల్లం వేసిన పచ్చడి చేయి. అలా చేస్తే ఇడ్లీకి మహా రుచిగా ఉంటుంది. అన్నట్లు నెయ్యి వేడి చేసి కారప్పొడి కూడా పెట్టు.”

సీత విసుక్కుంటూ నవ్వింది.

“ఏమండీ! మీరు టిఫిన్ తింటున్నారా లేక హోటల్కి ఆర్డర్ ఇస్తున్నారా?”

కొద్దిసేపటికి ఇడ్లీలు సిద్ధమయ్యాయి.

సీత ప్లేట్‌లో నాలుగు ఇడ్లీలు పెట్టి తీసుకొచ్చింది.

అప్పారావు ఆ నాలుగు ఇడ్లీలు రెండు నిమిషాల్లో మాయమయ్యేలా తిన్నాడు.

తర్వాత మెల్లగా అన్నాడు

“సీతా… ఇడ్లీలు చాలా బాగున్నాయి. ఇంకో రెండు పెట్టు.”

సీత మళ్లీ రెండు పెట్టింది.

అప్పారావు మళ్లీ అడిగాడు

“ఇంకో రెండు పెడితే పర్లేదు కదా?”

ఇలా అడుగుతూ అడుగుతూ చివరికి పది ఇడ్లీలు తిన్నాడు.

సీత ఆశ్చర్యంగా చూసి చెప్పింది

“అయ్యో! ఇంత తింటే మీరు లావుగా అయిపోతారు.”

అప్పారావు నవ్వుతూ అన్నాడు

“పర్లేదు సీతా… మనిషి తినడానికి పుట్టాడు!”

సీత వెంటనే అన్నది

“కానీ మీరు మాత్రం ఇతరుల భాగం కూడా తినడానికి పుట్టినట్టు ఉన్నారు!”

కొన్ని రోజులు ఇలా గడిచాయి.

ఒక రోజు అప్పారావు అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకున్నాడు.

అతని పొట్ట కొంచెం ముందుకు వచ్చింది.

అప్పారావు వెంటనే భయపడ్డాడు.

“అయ్యో! నా పొట్ట చూస్తుంటే బెలూన్ లా ఉంది. ఇలా అయితే నడవలేను.”

అప్పుడే అతను గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.

“ఇక నుంచి నేను డైటింగ్ చేస్తాను!”

సాయంత్రం సీత దగ్గరకు వెళ్లి చెప్పాడు.

“సీతా! రేపటినుంచి నేను డైటింగ్ చేయబోతున్నాను.”

సీత ఆశ్చర్యంగా అడిగింది

“నిజంగా డైటింగ్ చేస్తారా?”

అప్పారావు గంభీరంగా చెప్పాడు

“అవును. ఇకనుంచి తక్కువగా తింటాను.”

సీత నవ్వుతూ అంది

“సరే… మీ డైటింగ్ ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం.”

మరుసటి రోజు ఉదయం వచ్చింది.

సీత మళ్లీ ఇడ్లీలు చేసింది.

అప్పారావు ప్లేట్ దగ్గరకు వచ్చి గంభీరంగా అన్నాడు.

“నేను డైటింగ్ చేస్తున్నాను కాబట్టి రెండు ఇడ్లీలు మాత్రమే తింటాను.”

సీత రెండు ఇడ్లీలు పెట్టింది.

అప్పారావు వాటిని మూడు క్షణాల్లో తిన్నాడు.

కొద్దిసేపటికి మెల్లగా అన్నాడు

“సీతా… డైటింగ్ చేస్తున్నా గానీ ఇడ్లీలు చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకో రెండు పెట్టు.”

మళ్లీ రెండు తిన్నాడు.

ఇంకొంచెం తర్వాత అన్నాడు

“ఇది చివరి సారి… ఇంకోటి పెట్టు.”

చివరికి మళ్లీ ఆరు ఇడ్లీలు తిన్నాడు.

సీత నవ్వుతూ అడిగింది

“ఇదేనా మీ డైటింగ్?”

అప్పారావు అన్నాడు

“ఇది మొదటి రోజు కాబట్టి ప్రాక్టీస్ డైటింగ్!”

మధ్యాహ్నం భోజనం వచ్చింది.

అప్పారావు అన్నాడు

“కొద్దిగా మాత్రమే పెట్టు. నేను డైటింగ్ చేస్తున్నాను.”

సీత చిన్న గరిటతో అన్నం పెట్టింది.

అప్పారావు ప్లేట్ కేసీ చూస్తూ 

“ఇంత తక్కువా? డైటింగ్ అంటే ఆకలితో ఉండటం కాదు కదా!”

ఇంకొంచెం పెట్టమన్నాడు.

ఇలా “ఇంకొంచెం… ఇంకొంచెం…” అంటూ చివరికి మూడు గిన్నెలు అన్నం తిన్నాడు.

సాయంత్రం టీ టైం వచ్చింది.

అప్పారావు అన్నాడు

“నేను డైటింగ్ చేస్తున్నాను కాబట్టి టీ మాత్రమే తాగుతాను.”

సీత టీతో పాటు బిస్కెట్లు కూడా పెట్టింది.

అప్పారావు మొదట అన్నాడు

“లేదు… బిస్కెట్లు తినను.”

కానీ కొద్దిసేపటికి ఒక బిస్కెట్ తీసుకున్నాడు.

“టీకి బిస్కెట్ లేకపోతే రుచి ఉండదు” అని అన్నాడు.

ఒక్కటి… రెండు… మూడు…

చివరికి ప్లేట్ మొత్తం ఖాళీ అయింది.

సీత నవ్వుతూ అంది

“ఇది డైటింగ్ కాదు… బిస్కెట్ మీటింగ్!”

రాత్రి భోజన సమయం వచ్చింది.

ఆ రోజు సీత పుట్టినరోజు కావడంతో పులిహోర, పాయసం, వడలు చేసింది.

వంటగది నుంచి మంచి వాసన వస్తోంది.

అప్పారావు కాస్త ఆలోచించాడు.

తర్వాత సీరియస్‌గా అన్నాడు

“సీతా… ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.”

సీత అడిగింది

“ఏమిటది?”

అప్పారావు నవ్వుతూ అన్నాడు

“డైటింగ్ రేపటినుంచి చేస్తాను. ఈరోజు స్పెషల్ వంటలు ఉన్నాయి కదా!”

సీత గట్టిగా నవ్వింది.

“మీ డైటింగ్ ఎప్పుడూ రేపటినుంచే మొదలవుతుంది!”

అప్పారావు కూడా నవ్వుతూ అన్నాడు

“అదే అసలు డైటింగ్ రహస్యం!”

అలా ప్రతి రోజు అప్పారావు

“రేపటినుంచి డైటింగ్!” అని చెప్పుకుంటూ

ఆ రోజు మాత్రం బాగా తినేస్తూ ఉండేవాడు.

ఇప్పటికీ కాకినాడ దేవాలయం వీధిలో అందరూ ఒక మాట చెప్పుకుంటారు —

“అప్పారావు డైటింగ్ అంటే… తినడం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టడం మాత్రమే! తినడం మానడం కాదు.”

ఖడ్గమాలాస్తోత్రానికి

  *ప్ర*: ఖడ్గమాలాస్తోత్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? మరి *'అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మంత్రస్య'* అని ఎందుకన్నారు? ఖడ్గమాలలోని ఆ పేర్లన్నీ ఎవరివి?


*జ*: ఖడ్గమాల శ్రీవిద్యకు చెందినది. తొలుత లలితా త్రిపురసుందరి నామం చెప్పబడి, అటుపై న్యాసాంగ దేవతలు, తిథినిత్యా దేవతలు, దివ్యౌఘ సిద్ధౌఘ మానవౌఘ గురు మండల నామాలు; ఆ తరువాత క్రమంగా శ్రీచక్ర నవావరణ దేవతల నామాలు, నవచక్రేశ్వరీ నామాలు; చివరగా దేవి విశేషణాలు చెప్పబడ్డాయి.


ఒకే అక్షరం గల మంత్రాలు *'పిండ'* మంత్రాలనీ, 

రెండక్షరాలు కలవి *'కర్తరి'* అనీ, 

మూడు నుండి తొమ్మిది అక్షరాలు కలవి *'విధి బీజముల'* నీ, 

10 నుండి 20 అక్షరాల వరకు కలవి మంత్రములనీ, 

21 నుండి ఎన్ని అక్షరాలున్నా *మాలామంత్రముల* నీ


వ్యవహరింపబడుతాయి. ఆ కారణం చేతనే ఇది మాలా మంత్రం!


15 అక్షరాల పంచదశీ (శ్రీ) విద్యను ఆధారం చేసుకుని 15 విధాల మాలా మంత్రాలు ఏర్పడ్డాయి. 


అవి : 


శుద్ధ శక్తిమాల, 

నమోంత శక్తిమాల, 

స్వాహాంత శక్తిమాల,

తర్పణాంత శక్తిమాల, 

జయంత శక్తిమాల, 

శుద్ధ శివ సంబుధ్ధ్యంతమాల, 

నమోంత శివమాల, 

స్వాహాంత శివమాల, 

తర్పణాంత శివమాల, 

జయంత శివమాల,

శుద్ధమిధున మాల, 

నమోంత మిధునమాల, 

స్వాహాంత మిధునమాల, 

తర్పణాంత మిధునమాల, 

జయాంత మిధునమాల.


ఇందులో ప్రసిద్ధంగా లభిస్తున్నది *'శుద్ధ శక్తిమాల'*. 


దీనిని *'ప్రకృతిమాల'* అని కూడా అంటారు. 


ఈ మాలా మంత్రాలను వివిధ ప్రక్రియలతో ఉపాసించి కొన్ని సిద్ధులను పొందవచ్చు. పై చెప్పిన 15 విధాల మాలామంత్రాలకు 15 సిద్ధులున్నాయి. 


అందులో మొదటిది *'ఖడ్గసిద్ధి'*. 


తరువాత చెప్పబడిన పదునాలుగు : 


పాదుకాయుగ్మ సిద్ధి, 

అంజన సిద్ధి, 

బిల సిద్ధి, 

వాక్సిద్ధి, 

దేహ సిద్ధి, 

లోహ సిద్ధి, 

అణిమాద్యష్ట సిద్ధి,

వశీకరణ సిద్ధి, 

ఆకర్షణ సిద్ధి, 

సమ్మోహన సిద్ధి, 

స్తంభన సిద్ధి, 

చతుర్వర్గ సిద్ధి,

ఐహికాముష్మిక సిద్ధి, 

భోగ మోక్ష సిద్ధి.


ఒక్కొక్క సిద్ది కోసం ఈ మాలా మంత్రాలను వివిధ (15) విధాల వినియోగిస్తారు. *'ఖడ్గాది'* 15 సిద్ధుల నిచ్చే మాలా మంత్రము కనుక ఇది *'ఖడ్గమాల'* అని లోకంలో ప్రసిద్ధి పొందింది.


*'తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్త స్థితేనవై।*

*అష్టాదశ మహాద్వీప సమ్రాద్భక్తా (సమ్రాద్భోక్తా) భవిష్యతి'll* 


-- అని ప్రస్తుత లభ్య గ్రంథాలలో ఉంది.


కానీ ఈ శుద్ధశక్తిమాలను 14వ దైన ఐహికాముష్మిక సిద్ధి కోసం వినియోగించడమే మంచిదని విజ్ఞుల అభిప్రాయం. 


దానికి సంబంధించిన శ్లోకం :


*అలౌకికం లౌకికం చేత్యానంద ద్వితయం సదా।*

*సులభం పరమేశాని త్వత్పాదౌ భజతాం నృణామ్|*


శుద్ధశక్తిమాలను నిష్కామంతో జపించితే సర్వ (15) సిద్దులూ లభిస్తాయని శాస్త్రవచనం. సర్వసిద్ధులలో మొదటిది *'ఖడ్గసిద్ధి'* కనుక - దానిని మొదలుకొని మిగిలిన సిద్ధులను ఇచ్చే శుద్ధశక్తి మాలామంత్రాన్ని *'ఖడ్గమాల'* గా వ్యవహరిస్తున్నాం.

సేకరణ

పురాణము - అవగాహన (2029)*

  *పురాణము - అవగాహన (2029)*


శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ గురుభ్యోనమః

కలియుగంలో పురాణశ్రవణం కంటే మించిన ధర్మము, పుణ్యము లేవని వ్యాసభగవానుడు చెప్పాడు. వాల్మీకి నారదుడిని ప్రశ్నించడం వల్ల రామాయణాన్ని, పరీక్షిత్తు శుకుణ్ణి ప్రశ్నించడం వల్ల భాగవతాన్ని పొందాము. అదే స్ఫూర్తితో పురాణము - అవగాహన అనే కార్యక్రమం శ్రీ ప్రణవపీఠము నిర్వహిస్తున్నది.


_*నిన్నటి ప్రశ్నలకు సమాధానాలు*:_. 

4057. శ్రద్ధ, లక్ష్మీ, ధృతి, తుష్టి, పుష్టి, మేధా, క్రియా, బుద్ధి, లజ్జా, వపు, శాంతి, ఋద్ధి, కీర్తి అనే కన్యలను ఎవరు భార్యలుగా స్వీకరించారు?

(ఆచారకాండము – గరుడ పురాణం)

◆ దక్ష ప్రజాపతి కుమార్తెలైన ఈ పదమూడు కన్యలను ధర్ముడు భార్యలుగా స్వీకరించాడు.


4058. ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమా, సన్నతి, అనసూయ, ఊర్జా, స్వాహా, స్వధా అనే కన్యలను ఎవరెవరు వివాహం చేసుకున్నారు?

(ఆచారకాండము – గరుడ పురాణం)

◆ ఈ కన్యలను వరుసగా భృగు మహర్షి, మహాదేవుడు, మరీచి మహర్షి, అంగిరస మహర్షి, పులస్త్య మహర్షి, పులహ మహర్షి, క్రతు మహర్షి, అత్రి మహర్షి, వశిష్ఠ మహర్షి, అగ్నిదేవుడు, పితృగణాలు వివాహం చేసుకున్నారు.


👏 నిన్నటి ప్రశ్నలకు సరైన సమాధానాలు ముందుగా సమాధానం ఇచ్చిన వారి 3 పేర్లు 👏

◆ కార్తికేయ, హైదరాబాద్

◆ రాజా కుమార్, నాగోల్, హైదరాబాద్

◆ చల్ల సూర్య కుమారి,‌ కాకినాడ.


_ఈ రోజు ప్రశ్నలు:_

4059. శ్రద్ధ కుమారుని పేరేమిటి?

(ఆచారకాండము – గరుడ పురాణం)


4060. లక్ష్మీ కుమారుని పేరేమిటి?

(ఆచారకాండము – గరుడ పురాణం)


సమాధానాలు తెలిసినవారు, సమాధానంతో పాటు, పేరు, ఊరు నాకు మాత్రమే వాట్సాప్ సందేశం (టెక్స్ట్, వ్రాసిన లేదా ఆడియో) పంపగలరు. 


సందీప్,

‪‪‪‪‪‪‪‪+91 89783 41489‬‬‬‬‬‬‬‬

బలం గురోః ప్రవర్ధతామ్🙏

పంచాంగం

 *🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏*

        *📿పంచాంగం📿*

*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*తేదీ ... 17 - 06 - 2026,*

*వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )*

శ్రీ పరాభవ నామ సంవత్సరం,

ఉత్తరాయణం,

గ్రీష్మ ఋతువు,

*నిజ జ్యేష్ఠ మాసం,*

శుక్ల పక్షం,


తిథి : *తదియ* రా2.09 వరకు,

నక్షత్రం : *పునర్వసు* సా6.00 వరకు,

యోగం : *ధృవం* రా1.44 వరకు,

కరణం : *తైతుల* మ3.16 వరకు

                   తదుపరి *గరజి* రా2.09 వరకు


వర్జ్యం : *ఉ6.45 - 8.15*

                           మరల రా1.34 - 3.05 వరకు*

దుర్ముహూర్తము : *ఉ11.34 - 12.26*

అమృతకాలం : *మ3.45 - 5.15*

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : మిథునం,

చంద్రరాశి : మిథునం 

సూర్యోదయం : 5.29,

సూర్యాస్తమయం : 6.31,


               *_నేటి విశేషం_*

*🌙 చంద్ర దర్శనం మహిమ*


అమావాస్య అనంతరం శుక్ల పక్షంలో కనిపించే తొలి చంద్రకళలను దర్శించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. చంద్రుడు మనస్సుకు అధిపతి. చంద్ర దర్శనం వల్ల మనశ్శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


చంద్ర దర్శన శ్లోకం:

దధిశంఖ తుషారాభం

క్షీరోదార్ణవ సంభవమ్ ।

నమామి శశినం సోమం

శంభోర్మకుట భూషణమ్ ॥


🌙 చంద్రుడిని దర్శించి ఈ శ్లోకాన్ని పఠిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం


*🌿 తులసీ మహిమ*


బుధవారం తులసీదేవికి దీపారాధన చేసి, 11 లేదా 21 ప్రదక్షిణలు చేస్తే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రోక్తం.


తులసీదేవి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందువల్ల తులసీ పూజ ద్వారా విష్ణు అనుగ్రహం కూడా లభిస్తుంది.


*🕉️ బుధ గ్రహ ఆరాధన*

బుధుడు జ్ఞానం, వ్యాపారం, గణితం, వాక్చాతుర్యానికి కారకుడు.

బుధ గ్రహ మంత్రం

ఓం బుం బుధాయ నమః ॥


ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.


*🌺 నేటి ఆధ్యాత్మిక సందేశం*


"జీవితంలో సంపద కన్నా సద్బుద్ధి గొప్పది. సద్బుద్ధి ఉంటే సంపద, సంతోషం, గౌరవం అన్నీ స్వయంగా వస్తాయి.


🙏 ఈ రోజు తప్పక స్మరించవలసిన నామాలు


🔸 ఓం నమో నారాయణాయ

🔸 ఓం గం గణపతయే నమః

🔸 ఓం శ్రీ కృష్ణాయ నమః

🔸 ఓం బుం బుధాయ నమః


*🌺 సర్వేజనాః సుఖినో భవంతు 🌺*

            *_📿శుభమస్తు📿_*

*🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏*