14, జూన్ 2026, ఆదివారం

వివేకచూడామణి

  *వివేకచూడామణి*


 *శ్రీఆదిశంకరాచార్య విరచితము*


*80. విషయఖ్యగ్రహో యేన సువిరక్త్యసినా హతః*

*స గచ్ఛతి భవాంభోధే పారం ప్రత్యూహవర్జితః*


*పదవిభజన :*

*విషయ + ఆఖ్య గ్రహః + యేన - సువిరక్త్యసినా - హతః - స - గచ్ఛతి - భవ + అంబోధేః - పారం - ప్రత్యూహవర్జితః*


*భావము :*

*పరిపూర్ణ వైరాగ్యమనే ఖడ్గంతో విషయ వాసనలనే మకరాన్ని ఎవరైతే నరికివేయగలరో, వారే సంసారసాగరాన్ని దాటగలరు.*


*వివరణ :*

*విషయమనే మొసలి, ఏ పురుషునిచే దృఢతరమైన వైరాగ్యమనే కత్తిచే నశింపజేయబడుతుందో, ఆ పురుషుడు సంసార సాగరాన్ని దాటటంలో విఘ్నములు లేనివాడై, జనన మరణాది కల్లోలములతో వ్యాకులమైన సంసార సముద్రం యొక్క అంతమును - అంటే విష్ణువు యొక్క పరమపదమును పొందుతాడు. ముక్తుడవుతాడు.*

*ఇంకా, అటువంటి పురుషుని గురించి 'కఠోపనిషత్తు' ఏమి చెప్పిందంటే :*

*యస్త్వవిజ్ఞానవానవతి అమనస్కః సదా(అ )శుచిః*

*న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్ఛతి*

*యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదాశుచిః*

*స తు పదమాప్నోతి యస్మాద్భూయో న జాయతే*


*ఎవడు విజ్ఞానము లేనివాడై, మనోనిగ్రహము లేనివాడై, సర్వదా అశుచియై ఉంటాడో, అతడు ఆస్థానాన్ని పొందడు. సంసారాన్ని పొందుతాడు. ఎవడు విజ్ఞానవంతుడై, నిగృహీతమనస్కుడై, సర్వదా శుచియై ఉంటాడో, అతడు దేనిని చేరిన పదప మరల జన్మ పొందడో, అటువంటి పదాన్ని పొందుతాడు.*

🙏🙏🙏

పాదారవిందశతకము

 *శ్రీ మూకశంకర విరచిత* *మూక పంచశతి*


 *పాదారవిందశతకము* 


 **14 వ శ్లోకము* 


 *పవిత్రీకుర్యు ర్నః పదతలభువః పాటలరుచః* 


 *పరాగాస్తే పాపప్రశమన ధురీణాః పరశివే !*

 

 *కణం లబ్ధుం యేషాం నిజశిరసి కామాక్షి ! వివశా* 

 *వలంతోహ్యాతన్వంత్యహమహమికాం మాధవముఖాః*

 

 

*భావము :*


*నీ చరణ పరాగాన్ని తలపై దాల్చుటకు విష్ణ్వాదులు తహతహలాడుతూ తొందరపాటుతో ప్రతిచోటా సంచరిస్తున్నారు. అమ్మా కామాక్షీదేవి ! పాపపరిహారంచేసే నీ పాదధూళులు మమ్ములను పావనం చేయాలి సుమా !*


*అమ్మ పాదదూళి మాహాత్మ్యం వివరిస్తూ జగద్గురువులు చెప్పిన 'సౌందర్యలహరి'లో చెప్పిన 3 వ శ్లోకం, భావం :*

 

*అవిద్యానామంత-స్తిమిర-మిహిర ద్వీపనగరీ*

*జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ*

*దరిద్రాణాం - చింతామణిగుణనికా జన్మజలధౌ*

*నిమగ్నానాం దంష్ట్రా - మురరిపు వరాహస్య భవతి*

 *అమ్మా ! నీ దివ్యచరణారవిందముల పాదధూళి, అజ్ఞానమనే చీకటిలో ఉన్నవానికి కాంతులతో నిండిన సూర్యోదయ పట్టణమువంటిది.(అనగా నీ పాదసేవ వలన అజ్ఞానము తొలగి జ్ఞానం కలుగుతుంది). అదేవిధంగా, తెలివిలేని మందబుద్దులైన కదలలే‌ని బద్దకస్తుల పాలిట వారికి చైతన్యము కలిగించే కల్పవృక్ష పుష్పగుచ్ఛమునుండి*

 *జాలువారే మకరందము వంటిది.( నీపాదభక్తి జడులను చైతన్యవంతులను చేస్తుంది). ఇక కోరికలు తీరని దరిద్రులపాలిట సకల కోరికలనూ తీర్చే చింతామణి వంటిది.( నీ పాదపూజ దరిద్రాన్ని పోగొట్టి కోరికలను తీరుస్తుంది). సంసార సాగరములో మునిగిపోవువారి పాలిట, వారిని ఉద్దరించే విష్ణు అవతారమై భూమిని ఉద్దరించిన యజ్ఞవరాహము యొక్క కోరలవంటిది.( నీ పాదస్మరణ భవసాగరమును దాటించి ముక్తిని ప్రసాదిస్తుంది).*

 

*ఆ తల్లి* 

*పాదపద్మములకు నమస్కరిస్తూ* 🙏🙏🙏

వంటింటి చిట్కాలు part 2

   వంటింటి చిట్కాలు part 2

=================

పోపుల పెట్టె లో దాగున్న మరిన్ని ఆరోగ్య రహస్యాలు మరికొన్ని మనం తెలుసుకుందాం. వాస్తవానికి ఇవి అన్నీ మనకి తెలిసినవే అయినా మనం పాటించడం మానేసాము.


పేరిన నెయ్యి లో కాసింత బెల్లం వేసుకుని తింటే గొంతు గర గర తగ్గుతుంది. అదే విధంగా తమలపాకులు పరగడుపునే తింటే కఫం తగ్గుతుంది అని చెప్పేవారు. తమలపాకులు తడిపి నుదిటిపై పెట్టుకుంటే తల నొప్పి మటు మాయం అవుతుంది. ఈ మధ్య పెళ్ళిళ్ల ల్లో తములపాకుల బజ్జిలు వేయడం ఎక్కువ అయ్యింది.మంచిదే తమలపాకులు ఎక్కువ వాడటం. అయితే అతి సర్వత్రా వర్జినియేత్ మరువకండి...దేనికీ అతి పని చేయదు.


అన్నం అరుగుదలకు కూడా తమలపాకులు బాగా పనిచేస్తాయి. అందుకే పూర్వం భోజనం తరువాత తాంబూలం తప్పనిసరిగా వేసుకునే వారు.


ఐరన్ లోపం ఉంటే తమలపాకులు లో పాత బెల్లం వేసుకుని రెండు ఆకులు తింటే నీరసం తగ్గుతుందని చెప్పెవారు.

 అందుకే ప్రతి ఇంట్లో తమలపాకులు పాదు ఉండాలి. పెంచడం కూడా చాలా సులభం.


పిల్లలు పుట్టని దంపతులకి మినప సున్ని ఉండలు పెట్టే వారు. పాలు లొ యాలకులు వేసి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.


పిలల్లు నీరసం గా, బలం లేకుండా ఉంటే ప్రతీ రోజు పప్పు అన్నం లో ఆవు నెయ్యి ఎక్కువ గా వేసి పెట్టే వారు.ఆవు నెయ్యి ఎక్కువ గా పిల్లలకు పెట్టడం వల్ల మేధస్సు పెరుగుతుంది.


 బలం తక్కువగా ఉండి ఎప్పుడు నీరసం గా, చె లాకీ తనం లేకుండా ఉండే వారికి వారం లో రెండు మూడు రోజులు గారెలు నేతిలో లో వేయించి పెట్టిన మంచి బలం కలుగు తుందని చెప్పేవారు. మరి ఎక్కువ గా తింటే కడుపు ఉబ్బరం తగ్గడానికి అల్లం రసం లేదా అల్లం పచ్చడి వాడమని చెప్పేవారు.


ఇంతకు ముందు తరం బలం గా ఆరోగ్యం గా ఉండటానికి కారణం వారు తీసుకునే బలమైన ఆహారంమే.


కాళ్ళు నొప్పులు గా ఉంటే కొబ్బరి నూనె తో కాళ్ళు మర్ధనా చేసుకుని వేడినీటిలో నిమ్మకాయ చెక్క పిండి ఒక పదినిముషాలు కాళ్ళు మునిగే వరకూ వేడి నీటిలో ఉంచితే కాళ్ళు నొప్పులు తగ్గుతాయని చెబితే అర్చర్యం కలుగుతుంది....నిమ్మకాయ బదులు ఉప్పు వేసుకుంటే కాళ్ళు పగుళ్ళు తాగుతాయి.


ఇలా ఇలా అనేక చిట్కాలు... నేను స్వయంగా చూసాను...వీలైతే తప్పకుండ ఆచరించండి...

వంటింటి చిట్కాలు మరువ కండి. ఇది పెద్దలు మనకి ఇచ్చిన ఆస్తి.....


సురేష్ వంకాయలపాటి

పోపుల పెట్టె

  పోపుల పెట్టె

=========

రచన:- వంకాయలపాటి వెంకట సూర్య నారాయణ ( సురేష్) పిఠాపురం

==================


అమ్మ ప్రేమతో నిండిన వంటింటి మూలన

నవ్వుతూ నిల్చున్న పోపుల పెట్టె.

చిన్నదే కానీ లోపల

రుచుల ప్రపంచం నింపుకొని,

విస్మయం కలిగించే

మందుల గుట్ట....


జీలకర్ర సువాసనల జ్ఞాపకాలు,

ఆవాల ఆత్మీయతతో,

మెంతుల గుబాళింపుల తిరుగుమోతతో

పదిలంగా దాచుకున్న

పసిడి మూటలా మెరిసే పెట్టె.....


పసిడి లాంటి పసుపు,

ఆత్మీయంగా కలిసే లవణం,

ధనియాల ధ్వనిలో

మనసుకు మధుర సంగీతం వినిపించే

ఆ చిన్న లోకం.....


పొయ్యి పొగలోనూ

అమ్మ ప్రేమ పరిమళం;

పోపుల పెట్టె తెరిచినప్పుడల్లా

ఇంటంతా పండుగ వాతావర నం.


చిన్న పెట్టె అయినా

చెప్పే కథలెన్నో;

చిన్నదే అయినా

తగ్గించే రోగాలెన్నో....