🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*బుధవారం 29 ఏప్రిల్ 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *72వ భాగం*``
*సూర్యవంశ రాజుల చరిత్ర*```
శ్రీమహావిష్ణువు తన యోగనిద్రను వీడి సృష్టి ఆరంభించాలి ఆని సంక ల్పించాడు. ఆయన నాభి నుండి పద్మము ఉద్భవించింది. పద్మము నుండి పద్మసంభవునిగా బ్రహ్మదేవుడు జన్మించాడు. నారాయణుడు సృష్టి కార్యం ప్రారంభించమని బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ కుడిచేతి బొటనవ్రేలు నుంచి దక్షుడు మానస పుత్రుడిగా జన్మించాడు.
దక్షుడు తన కుమార్తె అదితిని కశ్యపునికి ఇచ్చి వివాహంచేశాడు. కశ్యపునికి-అదితికి జగత్తుకి
శక్తి,ప్రకాశము ఇచ్చే సూర్యుడు జన్మిం చాడు. సూర్యుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజ్ఞాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి వైవస్వతుడు పుత్రుడిగా జన్మించాడు. వైవస్వతుడు ప్రస్తుత ఏడవ మన్వంతరానికి మనువుగా ఉన్నాడు.
వైవస్వతునికి ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నభగుడు, ప్రాంశుడు, నేదిష్ఠుడు, కరూషుడు, వృషధ్రుడు అనే పదిమంది కుమారులు జన్మించారు. ఈ పదిమందికి జన్మించిన సంతానం శాఖోప శాఖలుగా విస్తరించి సూర్యవంశం గా వృద్ధి చెందింది.
వైవస్వతుడి పెద్ద కుమారుడు ఇక్ష్వాకుడి పేరుతో ఇక్ష్వాకు వంశం జగత్ ప్రసిద్ధి చెందింది. శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశం లోనే జన్మించాడు. ఇక్ష్వాకుడికి నూరుగురు కుమారులు జన్మించారు. వీరిలో యాభై మంది ఉత్తర భారతానికి రాజ్యాలు స్థాపించుకోగా, నలభై ఎనిమిది మంది దక్షిణ భారతానికి వెళ్లి రాజ్యాలు ఏర్పరచుకున్నారు.
పెద్దకుమారులు ఇద్దరు తండ్రి ఇక్ష్వాకుని వద్ద ఉండిపోయారు.
ఒకసారి ఇక్ష్వాకుడు పితృదేవతలకు శ్రాద్దకర్మ చేయాలని నిశ్చయించి పెద్ద కుమారుడైన వికుక్షిని అడవికి వెళ్లి కుందేళ్ళ మాంసం తెమ్మన్నాడు. అడవికి వెళ్లి వేటాడి కుందేళ్ళ మాంసం తెస్తున్న వికుక్షికి బాగా ఆకలి వేసింది. ఆకలి బాధ ఎక్కువ సేపు ఓర్చుకోలేక తెస్తున్న కుందేళ్ళ మాంసంలో కొంత అగ్నితో వండుకుని తినేశాడు. మిగిలినమాంసాన్ని తండ్రి ఇక్ష్వాకునికి తెచ్చి ఇచ్చాడు.
శ్రాద్దకర్మలు చేయిస్తున్న కుల గురువు వసిష్టుడు వికుక్షి తెచ్చిన మాంసం చూసి అది వికుక్షి తినగా మిగిలిన మాంసమని గ్రహించాడు.
ఎంగిలి చేయబడిన మాంసము శ్రాద్ధకర్మకు పనికిరాదని బయట పారవేయమన్నాడు.
పితృ శ్రాద్ధ కర్మలో అపచారం కలిగినందుకు ప్రతి చర్యగా వికుక్షిని "అడవిలో కుందేలు మాంసం భక్షిస్తూ శశాదుడిగా జీవించమని" శపించాడు.
అడవికి వెళ్లి శశాదుడిగా మారిన వికుక్షి ప్రాయశ్చిత్తంగా అనేక పుణ్యకార్యాలు చేసి ధర్మనిరతుడు అయ్యాడు. ఆశ్రమ జీవితం గడుపుతూ యాగాలు చేసి రాజర్షి అయ్యాడు. దోషం నుండి విముక్తి పొందాడు. తెలుసుకున్న కులగురువు వసిష్టుడు వికుక్షిని అడవి నుంచి రప్పించి ఇక్ష్వాకుని తరువాత రాజుగా పట్టాభిషేకం చేశాడు. జనరంజక పాలన చేస్తూ శశాదుడు పేరు ప్రఖ్యాతులు పొందాడు.
శశాదుని తరువాత శశాదుని కుమారుడు పురంజయుడు రాజైనాడు. ఆ సమయంలో జరిగిన దేవదానవ యుద్దంలో దేవతలు పరాజితులైనారు. దేవతలు వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువుని తమకు సహాయం చేయమని ప్రార్ధించారు. శ్రీహరి వారితో "ఇక్ష్వాకు వంశంలో నా అంశతో పురంజయుడు అనే రాజు జన్మించి రాజ్యం చేస్తున్నాడు. అతనిని ప్రార్ధించి మీ తరపున దానవులతో యుద్దం చేయమని అర్ధించండి. తప్పక విజయం లభిస్తుంది" అని ఉపాయం చెప్పాడు.
దేవతలు పురంజయుడి దగ్గరకు వెళ్లి తమ తరపున దానవులతో యుద్దం చేయమని అర్ధించారు.
పురంజయుడు "శత యాగాలు చేసి ఇంద్రపదవి పొందిన ఇంద్రుడు నన్ను భుజాల మీద మోసుకుని యుద్ద రంగానికి తీసుకు వెళ్లితే, నేను యుద్దంచేస్తాను" అనిషరతు పెట్టాడు. ఇంద్రుడు అంగీకరించి వృషభంగా మారాడు.
వృషభాన్ని అధిరోహించి పురంజయుడు దానవుల మీద యుద్ధానికి వెళ్లి వారిని జయించి సంహరించి దేవతలకు విజయం చేకూర్చాడు.
వృషభ రూపం దాల్చిన ఇంద్రుని కకుత్థ్సాలాన్ని (వీపు) ఎక్కి పురంజయుడు యుద్దం చేసాడు కనుక అతనికి ‘కకుత్థ్సుడు’ అని పేరు వచ్చింది. ఇతని వంశం కాకుత్థ్స వంశము అయ్యింది.
కకుత్థ్సుడి మనవడు పృధు చక్రవరి. ఇతడు భూమిని గోవుగా చేసి క్షీరముగా భూసారాన్ని పిండి ప్రవహింప చేసి ఎండిపోయిన భూములను సస్యశ్యామలం చేసాడు. భూమికి ఇతని నామంతో ‘పృధ్వి’ అని పేరు వచ్చింది. పృధు చక్రవర్తి మనవడు యవనాశ్వుడు. యవనాశ్వుడి ముని మనవడు కువలాశ్వుడు.
కువలాశ్వునికి ఇరవై ఒక్క వేలమంది పుత్రులు జన్మించారు. ఆ సమయంలో ధుంధుడు అనే రాక్షసుడు ఉత్తంక మహామునికి తపోభంగం చేసి మునులు ఆశ్రమాలలో చేసే యజ్ఞయాగాదులు భగ్నం చేస్తూ భూమి లోపల దాక్కునేవాడు. ఉత్తంక మహాముని విజ్ఞప్తి పై కువలాశ్వుడు తన ఇరవై ఒక్క వేల పుత్రులతో ధుంధుడు, అతని రాక్షస సేనలపై దండెత్తి యుద్దం చేసాడు. ధుంధుని సంహరించి ధుంధుమారుడు అనే పేరు పొందాడు.
కానీ ఆ యుద్దంలో ధృఢాశ్వుడు అనే కుమారుడు తప్ప కువలాశ్వుని ఇరవై ఒక్క వేల మంది పుత్రులు మరణించారు. ధృఢాశ్వుడు తండ్రి తరువాత రాజ్యాధికారం చేపట్టాడు. ధృఢాశ్వునికి యవనాశ్వుడు అనే కుమారుడు జన్మించాడు. యవనాశ్వుడు మహావీరుడు. ధర్మ రక్షణ దుష్ట శిక్షణ చేసి ప్రజారంజకంగా పాలన చేసాడు.
చాలాకాలం యవనాశ్వుడికి సంతానం కలుగ పోవడంతో మునులు అతనిచేత పుత్రకామేష్టి యాగం చేయించారు. యాగం పరిసమాప్తికి ముందురోజు రాత్రి యాగమంత్ర జలాలను బంగారు కల శంలో వేదిక పై నుంచి యాగ శాలలోనే నిద్రించారు. యజ్ఞం పరిసమాప్తి అయిన తర్వాత ఆ మంత్ర జలాలను మహారాణి స్వీకరిస్తే పుత్రుడు జన్మిస్తాడు.
యవనాశ్వుడు కూడా మునులతో పాటు ఆ రాత్రి యాగశాలలో నిద్రించాడు. అర్ధరాత్రి యవనాశ్వుడికి దప్పిక కలిగి మెలుకువ వచ్చింది. నోరెండిపోతుండటంతో చీకటిలో మంచి నీరు అనుకుని వేదిక మీద ఉంచిన కలశంలోని మంత్రజలాలు త్రాగి దప్పిక తీర్చుకుని నిద్రపోయాడు.
మరుసటి రోజు ఉదయాన్నే కలశంలో మంత్రజలం లేకపోవడం గమనించి మునులు "ఈ మంత్రజలం మహారాణి గారు త్రాగితే పిల్లలు పుట్టి ఉండేవారు" అని చెప్పి యాగం వ్యర్ధం అయిందని బాధ పడ్డారు. యవనాశ్వుడికి రాత్రి తాను దప్పికతో అదే మంత్రజలం త్రాగి ఉంటాను అని జ్ఞప్తి తెచ్చుకుని మునులకు ఆ విషయం చెప్పాడు.
విన్న మునులు "రాజా! యాగ మంత్రజలం మహిమాన్వితమైనవి. మీరు త్రాగిన ఫలితంగా మీకు గర్భం వచ్చి పుత్రుడు పుడతాడు. కానీ జనన సమయంలో మీరు ప్రాణాలు కోల్పోవచ్చును" అని హెచ్చరించారు.
పుత్రుడు పుడతాడన్న ఆనందంలో చనిపోతాడన్న విషయాన్ని యవనాశ్వుడు లెక్క చేయలేదు.
యవనాశ్వుడు గర్భం ధరించాడు. నవమాసాలు నిండిన తరువాత అతని ఉదరపు దక్షిణభాగాన్నీ చీల్చుకుని కుమారుడు బయటకు వచ్చాడు. యవనాశ్వుడు మరణించాడు. యవనాశ్వుడి భార్య భర్త దేహంతో చితిపై సహగమనం చేసింది. పుట్టిన పుత్రుడు తల్లితండ్రిలేనివాడయ్యాడు.
మునులు ఆ బాలుని పెంచడానికి తగిన దాది కోసం వెతుకుతుంటే ఇంద్రుడు ప్రత్యక్షమై శిశు పోషణ భారాన్ని తాను స్వీకరిస్తానంటూ ‘మాం ధాస్యతి’ అని అన్నాడు. మునులు ఆ బాలునికి ‘మాంధాత’ అని పేరు పెట్టి ఇంద్రునికి అప్పగించారు.
ఇంద్రుడు బాలుని ఆకలి తీర్చడానికి తన చూపుడు వ్రేలు శిశువు నోటిలో ఉంచి అమృతాన్ని స్రవింప చేశాడు. అమృత పానం వలన మాంధాత మహా బలవంతుడై భూమిని పాలించి మాంధాత చక్రవర్తి అయ్యాడు. మాంధాతకు పురుకుత్సుడు, అంబరీషుడు, ముచికుందుడు అనే కుమారులు జన్మించారు. విష్ణు భక్తులైన వీరు ధర్మబద్దంగా పరిపాలన చేసి వైకుంఠం చేరి విష్ణు సన్నిధి పొందారు.
*(సశేషం)*
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి