నవనీత హారతి
ఆనందనిలయంలో కులశేఖరపడి వద్ద తెరవేసి, శ్రీస్వామివారికి దంతధావన జిహ్వోల్లేఖన ఆచమనాది అనుష్ఠాన క్రియలు సమర్పించి, ఆ తర్వాత 'మహంతు మఠం' వారు ప్రత్యేకంగా తెచ్చిన నవనీతం (తాజా వెన్న), పాలు, పంచదారలను స్వామివారికి నైవేద్యంగా పెట్టి, మంచి సువాసన గల తాంబూలాన్ని స్వామివారికి సమర్పిస్తారు.
గుడి బయట వేద పండితులు సుప్రభాత సేవను ముగిస్తున్న సమయంలో... లోపల అర్చకులు స్వామివారికి కర్పూర హారతి ఇస్తారు. వెన్న నైవేద్యం పెట్టే సమయంలో ఇచ్చే ఈ కర్పూర హారతినే 'నవనీత హారతి' అంటారు. సరిగ్గా ఈ హారతి ఇచ్చే సమయంలోనే బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. ఆ కర్పూర దీపాల వెలుతురులో శ్రీవేంకటేశ్వర స్వామివారి రూపం భక్తులకు కన్నులపండువగా కనిపిస్తుంది.
హారతి అయిపోయాక, రాత్రి సమయంలో బ్రహ్మ దేవుడు వంటి దేవతలు పూజించడానికి గర్భగుడిలో ఉంచిన పవిత్ర తీర్థాన్ని, చందనాన్ని, శఠారిని మొదట అర్చకులు తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని జియ్యంగారికి, ఏకాంగికి ఇస్తారు. చివరగా సన్నిధిగొల్లకు తీర్థం, శఠారితో పాటు నవనీత హారతిలోని తాంబూలాన్ని కూడా ప్రసాదంగా అందిస్తారు.
ఈ పూజ ముగిసిన వెంటనే జియ్యంగార్, ఏకాంగి, సన్నిధిగొల్ల ముగ్గురూ బంగారు వాకిలి దాటి బయటకు వస్తారు. అప్పుడు ఆలయ సిబ్బంది (పరిచారకులు) లోపలికి వెళ్లి, రాత్రి స్వామివారు పవళించిన మంచాన్ని, పరుపును (పాన్పును) తీసి బయట ఉన్న 'సభేరా గది' లోకి మారుస్తారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి