🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*శనివారం 30 మే 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*104 వ భాగం*
*శ్రీకృష్ణావతారము-7*
*కాళీయ మర్దనము*```
కృష్ణుడు, గోపబాలురు గోవులను కాచే ప్రదేశం సమీపంలో ఒక నీటి మడుగుఉంది. వర్షాకాలంలో యమునా నది పొంగి ప్రవహించే సమయంలో నీరు ఆ మడుగు లోకి వచ్చి చేరేది. అంతుతెలియని లోతు కలిగిన ఆ నీటి మడుగు దగ్గరకు అక్కడివారు ఎవ్వరు వెళ్లేవారు కాదు. ఆ నీరు సలసల కాగుతున్నట్టు ఉండి వేడి విషపు పొగలు చిమ్ముతూ ఉంటుంది.
పొరబాటున ఆ నీరు త్రాగే జంతువులు, ఆ మడుగు పై ఎగిరి విషపు గాలి పీల్చేపక్షులు నల్లబడి కింద నీటిలో చనిపోయేవి. నీరు త్రాగడానికి వచ్చే జంతువులను, ఆ మడుగులో ఉండే కాళీయుడు అనే ఐదు తలల మహాసర్పము తన తోకతో పట్టి లాగి తినేసేది. తెలిసిన గోపాలురు తమ గోవులను మడుగు సమీపానికి వెళ్ల కుండా చూసేవారు.
కృష్ణుడి మధుర మురళీగానంలో మునిగిపోయి గోపాలురుండగా ఒక గోవత్సము(దూడ) చెంగు చెంగున ఎగురుతూ కాళీయమడుగు తీరానికి వెళ్లింది. గోపబాలుడు ఒకడు చూసి దానిని మళ్ళించుకురావడానికి పరుగెత్తి వెళ్లాడు. గోపబాలుడు పట్టుకునేలోపు మడుగు నుంచి ఐదు తలల కాళీయ సర్పము లేచి తన తోక చాచి తీరాన ఉన్న ఆవుదూడను చుట్టుకుని పట్టుకుని మడుగు లోకి లాగివేసింది. ఆవుదూడ భయంతో అంబా అంబా అని అరుస్తుంటే గోపబాలుడు భయ పడి పరిగెత్తుకుంటూ కృష్ణుడి వద్దకు వచ్చాడు.
“కన్నయ్యా! మన దూడను మడుగులో ఉండే సర్పం పట్టుకుని నీళ్ళ లోపలికి లాగేసింది” అని ఏడుస్తూ కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు వెంటనే చెట్టు మీద నుంచి దిగి మడుగు దగ్గరికి పరిగెత్తుకు వెళ్లాడు. బలరాముడు, గోపబాలురు వెంట పరిగెత్తారు. మడుగు దగ్గరకు వెళ్లిన కృష్ణుడు అక్కడ ఉండే పెద్ద చెట్టు పైకెక్కి మడుగు మధ్యకు వ్యాపించిన చెట్టు కొమ్మను చేరి ఆవుదూడను సర్పము నీట ముంచుతున్న ప్రదేశంలోకి దూకాడు.
బలరాముడు నిబ్బరంగా ఉన్నా, చూస్తున్న గోపబాలురు భయ పడ్డారు. హాహాకారాలు చేశారు. కొందరు నంద యశోదలకు చెప్పడానికి గ్రామానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. నీటిలో దూకిన కృష్ణుడు సర్పము తోకకు చుట్టుకుని అరుస్తున్న ఆవుదూడను విడదీసి ఒడ్డుకు నీటినుండే విసిరేశాడు. బలరాముడు పట్టుకుని ఆ దూడకు సపర్యలు చేశాడు.
కాళీయ సర్పానికి తన బంధనం నుంచి దూడను విడిపించిన కృష్ణుడిపై ఆగ్రహం వచ్చింది. కృష్ణుని తోకతోచుట్టి నాగపాశంతో బంధించి తన పడగల నుంచి విషపు గాలులు కృష్ణుని పైకి వదిలాడు. బాలకృష్ణుడు సృహ తప్పాడు.
తరువాత కథ చెప్పే ముందు కాళీయుడు ఎవరో చెబుతాను..
రసాతలంలో కాళీయుడు అనే సర్పరాజు భార్యలు, పిల్లలు, సేవకులతో నివసించేవాడు.
తన విషపు అగ్ని జ్వాలలతో రసాతల వాసులను భయ భ్రాంతులను చేసేవాడు. దొరికిన వారిని చంపి ఆహారంగా తీసుకునేవాడు. రసాతల వాసులు గరుత్మంతుడితో మొర పెట్టుకుని కాళీయుని నుంచి రక్షించమని కోరారు. గరుత్మంతుడు కాళీయుని చంపడానికి బయలుదేరి వెళ్లాడు.
గరుత్మంతుడు వస్తున్నాడని తెలుసుకున్న కాళీయుడు ప్రాణాలు రక్షించుకోవడానికి తనవారిని తీసుకుని సముద్రం ద్వారా యమునకు, యమున నుంచి నీటి మడుగుకు వచ్చి దాక్కున్నాడు. మడుగు సమీపానికి వచ్చే జంతువులను, మనుషులను చంపి ఆకలి తీర్చుకోసాగాడు. కాళీయుని విషానికి మడుగు నీరు విషపూరితమై త్రాగడానికి పనికిరాకుండా పోయింది.
ఇక కథలోకి వస్తే, సమాచారం తెలిసిన నందుడు యశోద గోపికలు గోపబాలురతో కలసి కాళింది మడుగు దగ్గరకు వచ్చారు. కృష్ణుడు కనపడలేదు. కాళింది మడుగు మధ్య నుండి ఉబుకుతున్న వేడి నీరు, పొగలుగా చిమ్ముతున్న విషపు జ్వాలలు చూసి యశోద “కన్నయ్యా” అంటూ దుఖంతో సృహతప్పింది. నందుడు, గోపికలు,గోపాలురు దుఖిస్తున్నారు. మడుగులోకి వెళ్లే సాహసం ఎవ్వరికీ లేదు.
బలరాముడికి తన అవతారాంశ జ్ఞప్తికి వచ్చి మడుగులోపల సృహ తప్పి కాళీయుడి బంధనంలో చిక్కిన కృష్ణుని కన్నులు మూసుకుని దివ్యదృష్టితో చూశాడు. మనస్సులోనే నమస్కరిస్తూ “శ్రీహరీ! మీ అవతారాన్ని లోకానికి చూపించే సమయం వచ్చింది. సృహకి వచ్చి కాళీయుడికి బుద్ది చెప్పి శిక్షించండి. లేదంటే నా ఆదిశేష రూపము ప్రకటించవలసి వస్తుంది” అని ప్రార్ధించాడు.
మడుగులో నాగపాశానికి బందీ అయ్యి సృహతప్పిన కృష్ణుని బలరాముని ప్రార్ధన మేలుకొలిపింది. క్షణంలో శరీరము సవరించుకొని ఒక్క ఉదుట్న నాగపాశం నుండి విడిపించుకున్నాడు. చేతిలో కాళీయుడి తోక చివరి భాగం పట్టుకుని చటుక్కున కాళీయుడి పడగల పైకి ఎగిరాడు. కాళీయుని పడగలను పాదాలతో మర్ధిస్తూ నాట్యం చేయసాగాడు.
కృష్ణుడి పాద ధాటికి కాళీయుడి ఐదు పడగల నుంచి విషం,రక్తం బయటకు వచ్చాయి. మడుగు మధ్య నుండి రక్తము ఉబికి రావడంతో నందుడు గోపాలురు హాహాకారాలు చేశారు. బలరాముడు వారికి “కృష్ణుడికి ఏమి కాలేదు” అని ధైర్యం చెబుతూ త్వరలో మడుగు నుంచి సురక్షితంగా కృష్ణుడు వస్తాడని హామి ఇచ్చాడు.
కాళీయుడి రక్తం అంతా పోయింది. ప్రాణాలు మరికొన్ని క్షణాలలో పోతాయి అనుకునే సమయంలో కాళీయుని పత్నులు కృష్ణుడి ముందుకు వచ్చి చేతులు జోడించి పతికి ప్రాణభిక్ష పెట్టమని ప్రార్ధించారు. కాళీయుడు కూడా ‘పాహి మాం కృష్ణా’ అని శరణు వేడాడు.
కృష్ణుడు శాంతించి “మీరు తక్షణమే ఈ మడుగు వదలి రసాతలం వెళ్లి పోవాలి. నా అడుగుల ముద్రలు పడగల పైన ఉండటంతో గరుత్మంతుడు కాళీయుని ఏమీ చేయడు. ఇక జీవ జంతువులను విషంతో చంపకుండా రసాతలంలో లభించేవి తిని ఆకలి తీర్చు కోవాలి. ఇలా ప్రమాణం చేస్తే వదిలేస్తాను. ఈ మడుగు ఇకనుంచి కాళింది మడుగు అనే పేరుతో ప్రసిద్దమవుతుంది” అన్నాడు.
కాళీయుడు అంగీకరించాడు. పడగలపై వేణుగానం పలికిస్తూ నాట్య భంగిమలో ఉన్న తనను నీటి పైకి తీసుకెళ్లమని కాళీయుని కృష్ణుడు ఆదేశించాడు. కాళీయుడు కృష్ణుని మడుగు నీటి నుండి పైకి తీసుకొచ్చాడు. కాళీయుడి పడగల పై వేణుగానం చేస్తూ నృత్యభంగిమలో ఉన్న కృష్ణుని నందుడు, గోపాలురు, గోపికలు, గోపబాలురతో పాటు అప్పుడే సృహలోకి వచ్చిన యశోద చూసి ఆనందించింది. గోపాలురు హర్షధ్వానాలు చేసారు.
కాళీయుడు శ్రీకృష్ణుని తీరాన దించి తన భార్యలు, పిల్లలు, పరివారంతో మడుగు వదలి రసాతలానికి వెళ్లి పోయాడు. యశోద నందులకు తమ కుమా రుడు దివ్యబాలుడు, నారాయణుడి అవతారమని అర్ధమయ్యింది. కృష్ణుడికి అర్ధం అయ్యి యశోదను కుదుపుతూ “అమ్మా! చాలా ఆకలిగా ఉంది. వెన్న పెట్టవా అమ్మా!” అని మారాం చేస్తూ ముద్దు ముద్దుగా అడిగాడు.
యశోద పై విష్ణుమాయ ప్రభావం పడి భగవంతుడు అనే మాట మరచిపోయింది. మాతృప్రేమ బయటకు వచ్చి “పదరా కన్నా! ముందు దిష్టి తీసి తరువాత కడుపు నిండేంత వెన్న తింటానికి ఇస్తాను" అంటూ చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది. బలరాముడు నందుడు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.
*తరువాత కథ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి