*సామాజిక స్పృహ - పూర్ణ నాగరికతా చైతన్యము 9*
*భద్రం మనః కృణుష్వ* అని అంటుంది సామవేదం. అంటే మా మనస్సులను కళ్యాణమయం చేయుము అని.
వీధులు శుభ్రంగా ఉంచుకోవడం, కాలనీలు బాగు చేసుకోవడం మాత్రమే నాగరికత కాదు.
మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, స్వపరిపాలన వచ్చి 77 సంవత్సరాలు అయినది. విద్య, వైద్య, ఆర్థిక, సాంకేతిక మరియు రక్షణ రంగాలలో అభివృద్ధి పరంగా ఎంతో ఎదిగాము. *కాని, నైతికంగా ఎదగవలసినంతగా మనము ఎదగలేదు, అంటే నాగరికత పెరగలేదు*. ప్రలోభాల ప్రభావాలను అధిగమించే తత్వాన్ని అలవరచుకొలేక పోతున్నాము....ఇంకా చెప్పుకుంటాము ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశమని. అవుతే *స్వార్థ పరంగా, దోషులను సమర్థించడంలో మరియు నేరస్తులను ఉపేక్షించడంలో నియమిత ఎల్లలు, హద్దులు దాటి ఎదిగాము*. ఇది కూడా నాగరికత కాదు. *ఇంకా చెప్పాలంటే శృతి మించిన అనాగరిత*.
రాజకీయ నాయకులు, ఇతర రంగాలలో ఉన్న ప్రముఖులు, పార్టీలు గాని అవకతవకలకు పాల్పడినప్పుడు వారి ప్రథమ మరియు ప్రథాన ఆయుధము *మతము, కులము, లింగ బేధం, ఉత్తరాది, దక్షిణాది వాదనలు*. ఈ వాదనలు, కుంటి సాకులు *ఇంకెన్నేళ్లు*. గత త్రింశతి (30) సంవత్సరాలుగా దేశ చరిత్రను పరిశీలించిన వారికి, దోష భూయిష్టులైన ఏ ఏ నాయకులు, ఇతర రంగాలలోని ప్రముఖులు దేశ స్వతంత్రతను, ప్రజాస్వామ్యాన్ని కవచంగా వాడుకున్నారో మనందరికీ అన్ని కరతలామలకములే....
అభిజ్జానములే
సావకాశంగా సంఘటనలు పరిశీలిస్తే ఒక నాయకుడంటాడు నేను మైనారిటీ మతం వాడిని నన్ను బలి పశువును చేస్తున్నారు అని. ఇంకొక ప్రముఖుడంటాడు నేను వెనుకబడిన తరగతుల వాడిని కాబట్టి నాపై కక్ష్య కట్టారు అని. ఇంకొక ప్రముఖురాలంటుంది నేను మహిళను కాబట్టి నేరం ఆపాదిస్తున్నారు అని. రాజకీయ నాయకుల దుర్మార్గాలు, దుష్చేష్టలు, దురలవాట్లు బైటపడ్డప్పుడు, ఆ పార్టీ వాళ్ళు వందలకొద్దీ ధర్నాలు, సమ్మెలు. రక్షకభట శాఖ *నిందితులను* న్యాయస్థానాల వైపు తరలిస్తున్నప్పుడు, ఏ మాత్రం *న్యూనత, లజ్జ* లేకుండా త్వరలో జనంలోకి వస్తామని చేతులూపుతూ *సన్మాన గ్రహీతలు లాగా* చిరు నవ్వులతో నిర్బంధశాలలకు వెళ్తుంటారు. ప్రతి రాజకీయ పార్టీకి అండ దండగా వారి సమాచార (పత్రిక, Tv) మాధ్యమాలు ఉంటాయి. అందులో పని గట్టుకుని ప్రభుత్వాన్ని విమర్శించడం మరియు ప్రత్యర్థులను నిందించడం మామూలైపోయింది. పార్టీల బేధం ఉన్నప్పుడు దక్షిణాది వారు ఉత్తరాది వారిని, ఉత్తరాది వారు దక్షిణాది వారిని విమర్శించడం సర్వ సాధారణమైనది. తమ తప్పులను సమర్థించుకోవడానికి మతాన్ని, కులాన్ని, వర్గాన్ని లింగాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ రాజకీయ వ్యక్తిగత లాభాలను పొందడానికి నిస్సిగ్గుగా వాడుకుంటున్నారు. *ఇదీ నాగరికత కాదు.*
*మనమందరము భారతీయులము అను జాతీయ భావం నాస్తి*. జాతీయత లోపించింది. ఈ పరిస్థితులలో పూర్ణ నాగరికతా చైతన్యము సిద్ధించాలంటే ఎంత శ్రమ అవసరమో భగవంతుడికే తెలియాలి అని చతికిల పడరాదు. *కృషితో నాస్తి దుర్భిక్షం* అని చదువుకున్నాము.
*ఆత్మ విమర్శ* చేసుకోవాలి ఇకనైనా. ఇంకా ఎన్ని దశాబ్దాలు కావాలి *నీతివంతమైన జీవితం గడపడానికి*,
భగవదనుగ్రహం పొందడానికి,
*మన మనస్సులు కళ్యాణ మయం కావడానికి.*
ధన్యవాదములు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి