🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*శనివారం 14 మార్చి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣6️⃣4️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*164 వ రోజు*
*విరాట పర్వము ప్రథమాశ్వాసము*
*రాజకొలువులో ప్రవర్తించవలసిన పద్ధతులు*```
ధౌమ్యుడు పాండవులను చూసి..
“ధర్మరాజా! మీరు కురువంశంలో జన్మించారు. గౌరవంగా బ్రతికారు. ఇలాంటి మీరు పరులను సేవించుట కష్టమే. కాని మనకు అనుకూలం కాదని మరచి పోవద్దు. మీరు పరాక్రమాలు ప్రదర్శిస్తే అజ్ఞాతవాసం భగ్నమౌతుంది. రాజులను సేవించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. రాజుతో చనువుగా ఉన్నాను అనుకుని రాజమర్యాద అతిక్రమిస్తే హాని కలుగుతుంది. రాజుకన్నా విలువైన దుస్తులు ధరించటం కాని, రాజుకన్నా అధికంగా మాట్లాడటం కాని, రాజగృహంకన్నా ఆడంబరమైన గృహంలో నివసించటం కాని చేయకూడదు. సహజంగా రాజులు తమ ఆజ్ఞను ఉల్లంఘించిన వారు పుత్రులైనా మిత్రులైనా శత్రువులుగా చూస్తారు. తాను చేయలేని పని తలపై వేసుకోకూడదు అందువలన భంగపాటు తప్పదు. రాజుల యందు మౌనంగా ఉండకూడదు అలాగని అతిగా భాషించకూడదు. మితమైన చతుర సంభాషణచే రాజులను మెప్పించాలి. అంతఃపుర రహస్యాలను బయట పెట్టకూడదు. రాజుకు చెప్పదగినవి, వినదగినవి అయిన మాటలనే చెప్పాలి. రాజు అనుమతి మీదనే ఆసనాన్ని అధిరోహించాలి. రాజుకన్నా ఉన్నతాసనం పై ఎప్పటికీ అధిరోహించకూడదు. రాజు అభిమానించాడని పొంగిపోకూడదు. అలాగే అవమానిస్తే కుంగిపోకూడదు. రాజు చెప్పిన పనిని ఎండ, వాన, ఆకలి, దప్పిక, కాలము ప్రదేశం నిమిత్తం లేకుండా చేయాలి. రాజధనాన్ని విషంతో సమానంగా చూడాలి. రాజధనాన్ని సంగ్రహించడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. రాజు కొలువులో నవ్వటం ఆవులించడం చేయకూడదు. రాజుగారి శత్రువులతోకాని, వారి దూతలతో కాని సన్నిహితంగా మెలగకూడదు. భటుడు సంపద కలదు కదా అని అధికంగా భోగింపరాదు. రాజుకు కంటగింపుగా ఉంటుంది. కనుక అజ్ఞాతవాస సమయమున మీరు అణగి మెణగి మెలగవలసి ఉంటుంది” అన్నాడు.
```
*విరాటనగరానికి పయనం*```
ధర్మరాజు ధౌమ్యుని బుద్ధిమతి విని
“మాకు అన్నీ మీరే. మాకు తెలియని అనేక విషయాలు చెప్పారు. వాటిని తప్పక పాటిస్తాము”అన్నారు.
ధౌమ్యుని ఆశీర్వాదం పొంది పాండవులు,ధౌమ్యుడు అక్కడి నుండి విరాటనగరానికి వెళ్ళారు. యమునా నది వెంట నడుస్తున్నారు. మత్స్యదేశ పొలిమేర చేరగానే అక్కడ ఒక ఆశ్రమంలో ధౌమ్యుడు ఆగి పాండవులు వెళ్ళాక అగ్నిహోత్రాలు తీసుకుని పాంచాల దేశానికి వెళ్ళాడు.
పాండవులు అరణ్యాల వెంట తమ ప్రయాణం సాగించారు.విరాటనగరానికి వెళ్ళటానికి చాలా దూరం నడిచారు. ద్రౌపది ఇక నడవ లేక పోయింది విశ్రాంతి తీసుకుంటాము అనుకుంది. ధర్మరాజు అందుకు ఒప్పు కోలేదు. త్వరగా విరాట నగరం చేరాలన్నది అతని కోరిక పట్టుదల. ద్రౌపది ఇక ఒక అడుగు కూడా వేయలేనని చెప్పింది. ధర్మరాజు నకులుని చూసి
“నకులా! ద్రౌపది అలసి పోయింది. కొంచం ఎత్తుకుని తీసుకు రాగలవా” అని అడిగాడు.
నకులుడు “నేను కూడా అలసి పోయాను అన్నయ్యా!” అన్నాడు.
ధర్మరాజు సహదేవుని అడిగాడు. సహదేవుడూ అలాగే సమాధానం ఇచ్చాడు.
ఇక అర్జునిని వంతు వచ్చింది. అర్జునుడు ద్రౌపదిని అవలీలగా ఎత్తుకుని విరాట నగరం వైపు నడిచాడు.
అందరూ విరాట నగర పొలిమేర చేరగానే కొంత తడవు ఆగారు. ధర్మరాజు తమ్ములతో “మనం ఈ ఆకారాలతో,ఆయుధాలతో నగరంలో అడుగు పెడితే మనలను సులువుగా గుర్తిస్తారు. మనం మన ఆయుధాలను దాచాలి!” అన్నాడు.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి