15, మార్చి 2026, ఆదివారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శనివారం 14 మార్చి 2026*


*🙏

       *శ్రీ మహావిష్ణు పురాణం* 

    `` *25వ భాగం*``



*కపిల మహర్షి తన తల్లి దేవహూతికి చేసిన సాంఖ్యతత్త్వ బోధ!*


```

దేవహూతి ఒంటరిదయ్యింది. భర్త కర్దముడు సన్యాసాశ్రమం తీసుకుని తపస్సుకి వెళ్లి పోయాడు. తిరిగి రాడు. తొమ్మిది మంది కూతుళ్లు వివాహాలు చేసుకుని భర్తల వెంట వెళ్ళిపోయారు. పరమాత్ముడు కుమారుడిగా జన్మించాడు అన్న ఆనందం.. ‘పుట్టగానే యోగిగా, సాంఖ్య యోగప్రవక్తకుడు,ప్రచారకుడు’ అవడంతో మాయమైపోయింది. కట్టిన బంధాలు, కన్న బంధాలు అలా అయ్యేటప్పటికి దేవహూతి ఒంటరిదై మనస్సు చింతతో, బాధతో, దిగులుతో నిండిపోయింది.


భరించలేక కుమారుడికి తన పరిస్థితి చెబుదామని ఒకరోజు దేవహూతి ధ్యాన దీక్షలో ఉన్న కపిల మహర్షి వద్దకు వెళ్లింది. తల్లి రాకను, ఆమె మనస్సులోని ఆవేదనను గుర్తించి కన్నులు తెరచి కపిలుడు చిరునవ్వుతో “అమ్మా! నీ మనస్సంతా చింతతో నిండిపోయింది. ఒంటరితనం అనుభవిస్తున్నావు. ఎందుకమ్మా ఇంతటి ఆవేదన? దుఖం?

స్వాయంభువ మనువుకి కుమార్తెగా జన్మించావు. కర్దమమహర్షి వంటి మహాత్ముని భర్తను పొంది అనుకూల దాంపత్య జీవనం గడిపావు. చక్కటి తొమ్మిది మంది పుత్రికలను, కుమారుడైన నాకు జన్మనిచ్చి మాతృమూర్తిగా, గృహిణిగా పతివ్రతా ధర్మము నెరవేర్చావు. ఇలాంటి ఉత్తమ జీవితం కోటిలో ఒకరికి మాత్రమే లభిస్తుంది. భగవంతుని నామస్మరణలో గడపవలసిన ఈ సమయంలో ఇంత దుఖం, దిగులు ఎందుకు?” అని అనునయంగా అడిగాడు.


దేవహూతి మనస్సులోని దుఖం కుమారుడి అనునయపు మాటలకు కన్నీరుగా కళ్ళ నుండి రాసాగింది. కొంతసేపటికి స్థిమితపడి కన్నులు తుడుచుకని “కుమారా! నీవన్నది నిజం. నా తండ్రి స్వాయంభువ మనువు నన్ను అల్లారుముద్దుగా చూసుకున్నాడు. బాల్యం చక్కగా సాగిపోయింది. వివాహం జరిగాక 

నా భర్త నన్ను ఏలోటులేకుండా చూసుకున్నాడు. తొమ్మిది మంది ఆడపిల్లలకు, ఒక దైవాంశ కుమారుడికి జన్ నిచ్చిన నా వైవాహిక గృహస్థ జీవితం సంతృప్తిగా గడిచింది. నీవన్నట్టే నా అంత అదృష్టవంతురాలు లేదనుకున్నాను. కానీ తరువాత ఏం జరిగింది. ఒంటరి జీవితం మిగిలింది. నా గురించి ఆలోచిస్తే నేను తప్ప ఎవరూ నాతో లేరు. ఇందుకేనా జన్మ ఎత్తింది? భర్తకు సేవ చేస్తూ నవమాసాలు గర్భక్లేశాలు అనుభవించి పదిమందికి జన్మనిచ్చింది.


నన్ను కన్న తండ్రి నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు. జీవితకాలం తోడు ఉండవలసిన భర్త నన్ను సంతానవతిని చేసి, ఆడపిల్లల వివాహం చేసి తన బాధ్యత తీరిందని వదిలేసి తపస్సుకి వెళ్లిపోయాడు. తొమ్మిది మంది కుమార్తెలు వివాహాలు కాగానే తమ జీవితాలు భర్తలతోనే అనుకుని వారి వెంటనడిచి తమ బాధ్యత తీరిందనుకున్నారు. దైవాంశ సంభూతుడివైన నీవు కుమారుడిగా జన్మించావు. నీ నీడలో నీ పంచన శేష జీవితం గడపవచ్చు అనుకుని నీ తండ్రికి సన్యాసాశ్రమం వెళ్ళడానికి అంగీకరించాను. కానీ నీవేమో జన్మిస్తునే యోగిగా, సాంఖ్యయోగ ప్రబోధకుడిగా మారిపోయావు. ధ్యాన దీక్షలో, ప్రచార దీక్షలో నిమగ్నమై తల్లిని ఒంటరిదానిని చేసావు. నా మనస్సులో దుఃఖం, విచారం, ఒంటరితనం కాక ఇంకా ఏముంటుంది? స్త్రీగా పుట్టిన నాకు ఏమి దక్కింది. నా జన్మ ఉద్దేశం ఏమిటి? నన్ను కన్నందుకు, వివాహం చేసినందుకు నా తల్లిదండ్రులకు కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడిన నా భర్తకు గృహస్థాశ్రమ ధర్మ ఫలం, దాంపత్య సుఖం, కుమార్తెల వివాహాలు చేసి నందుకు కన్యాదాన ఫలం పొందాడు. వివాహాలై భర్తలతో వెళ్లిన కమార్తెలకు, కుమారుడైన నీకు పితృ ఋణం తీర్చిన ఫలం దక్కింది.


ఏ ఫలం ఆశించకుండా నా బాల్య యవ్వన కౌమార జీవితం మీకు అంకితం చేసి మీ అందరి సేవలు చేసిన నాకు దక్కినఫలం ఏమిటి. జీవిత చరమాంకంలో ఒంటరి తనం, దుఃఖం, ఆవేదన తప్ప! నా జీవితం ముగిసేదాక ఇలా దుఖంతో గడపవలసిందేనా? ఇందుకేనా నేను జన్మించింది?” అని దుఃఖం పొంగుకొస్తుంటే గద్గద స్వరంతో అడిగింది.


తల్లిని చిరునవ్వుతో చూస్తూ “అమ్మా! నీవు సంసార మోహ మాయా భ్రాంతిలో మునిగిపోయి ఇలా మాట్లాడుతున్నావు. ఇందుకు కారణం ఒంటరితనంతో నీవు నిరాహారివై ఉండటం కావచ్చును. కాస్తంత ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదా” అన్నాడు కపిలుడు.


దేవహూతి ఆశ్చర్యంగా చూస్తూ “కుమారా! నీవు మరచిపోయి నట్టున్నావు. నా దగ్గర మాట తీసుకున్నావు కదా నిరాహారిగా ఉండద్దని. నీ మాట కాదనలేక నాలుగు అరటి పళ్లు తిన్నాను” అంది. 


కపిలుడు అడిగాడు “ఒంటరిగా ఉన్నావు కదా! అరటి పళ్లు ఎక్కడ నుంచి వచ్చాయి?”


“మన ఆశ్రమంలో రకరకాల పళ్ళ చెట్లు నాటాము కదా. ఏ ఋతు వులో కాసే పళ్లను ఆ ఋతువులలో మనకు ఆచెట్లు ఇస్తున్నాయి. మనమందరం ఆ పళ్ళను ఆహారంగా తింటున్నాము కదా” అన్న తల్లి కళ్ళల్లో చూస్తూ “అంటే చెట్లు ఋతుధర్మం పాటిస్తూ పళ్లు ఇస్తున్నాయి కదా” అని కపిలుడు అడిగితే దేవహూతి అవునన్నట్టు తలవూపింది.


“అమ్మా! ఋతు ధర్మము అంటే ఏమిటో తెలుసా?” అని కపిలుడు అడిగాడు. 


తెలియదన్నట్టు చూసింది దేవహూతి. “ఋతువుకి ఒక ధర్మము ఉంటుంది. ఋతువుకి తగ్గట్టు పెరిగిన వృక్షాలను ఆ చెట్ల పళ్ళను మనకు ఆహారంగా ఇచ్చేట్టు చేస్తుంది. అందుకు కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం” అని ప్రశ్నించాడు.


“ధర్మానికి కృతజ్ఞత ఎలా చెబుతాం. ప్రకృతి నిర్దేశించినట్టు బుుతువు తగిన ఫలాలు ఇస్తుంది. అది ఋతు ధర్మము. మన నుంచి ఏమి ఆశించకుండానే చేస్తుంది! అవునా" అని దేవహూతి సమాధానం చెప్పింది. 


కపిలుడు చిరునవ్వుతో “అంటే ఋతువు మన నుంచి ఎటువంటి ప్రతిఫలం, కృతజ్ఞత ఆశించకుండానే తన ధర్మము నెరవేరుస్తోంది. మరి నీకు అరటి పళ్ళు ఇచ్చిన అరటి చెట్టు సంగతి ఏమిటి? అరటి చెట్టు తన మనుగడయే మనకు ఇచ్చింది. అరటి కాయలు,పళ్లు,ఊచ,పువ్వు మనకు ఆహారంగా ఉపయోగపడుతోంది. అరటి ఆకులు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అరటి పిలకలు తెచ్చి శుభకార్యాలకు ద్వారాలకు, మందిరాలకు, పూజా వేదికలకు కట్టుకుంటున్నాము. ప్రతిఫలంగా అరటి చెట్టుకి ఏమి లభిస్తోంది? కాయలు కోస్తున్నాము, పళ్లు తెంచుతున్నాము, పిలకలు, బోదె నరుకుతున్నాము. అంతా అయిన తర్వాత ఎండిన చెట్టుని పీకేసి మరొక అరటి మొక్క నాటుతున్నాము. మనం ఇన్ని విధాలుగా హింసించినా పట్టించు కోకుండా అరటిచెట్టు తిరిగి తన ధర్మం నెరవేరుస్తోంది. అంటే మన నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండానే ఈ ప్రకృతి, ఋతువు, చెట్లు తమ ధర్మం నెరవేరుస్తున్నాయి. అలాగే మనం జన్మించిన ఈ దేహం దేహధర్మం పాటించి తనకు నిర్దేశించిన ధర్మాలను నెరవేరుస్తోంది. అనగా జీవుని దేహం ప్రతిఫలం, కృతజ్ఞతలు ఆశించకుండానే పురుషుడిగా, స్త్రీగా తనకు ఉద్దేశించిన కార్యాలను పూర్తిచేస్తుంది. గ్రహించావా తల్లీ" అని సూటిగా అడిగాడు. 

మాటరాక దేవహూతి నిశ్చేష్టురాలైంది.


*తరువాతి కథ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు**🔔 _శుభోదయం_ 🕉️Goodmorning 🔔*

      

      *_సలహా పవిత్రంగా ఉండాలి, నమ్మకం పదిలంగా ఉండాలి._*

      *_స్నేహం పటిష్ఠంగా ఉండాలి, బంధంశాశ్వతంగా ఉండాలి._*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞


శుభ రవి వారం 💥Happy Sunday

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: