19, జనవరి 2023, గురువారం

అగస్త్యాశ్రమం

 *కాశీ ఖండం - 2*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻


 *అగస్త్యాశ్రమం* 


 దేవతలందరూ వారణాసి చేరి, అయిదు రోజులు నిత్యము గంగా స్నానం చేస్తూ, విశ్వేశ్వర విశాలాక్షీ అన్నపూర్ణా, దుండి గణపతి, కాలభైరవులను దర్శించారు. 


 ఆ తర్వాత అగస్త్యముని ఆశ్రమాన్ని చేరుకొన్నారు. అగస్త్యుడు తన పేర, అగస్త్యేశ్వర స్వామిని స్థాపించి, జప,హోమాలను చేస్తూ, పరమేశ్వర ధ్యానంలో, భార్య లోపాముద్ర తో, గడుపుతున్నాడు. 

 

 సముద్రాలను తన పుక్కిలిలో ఉంచి పానం చేసినప్పుడు, అందులో ఉండే బడబాగ్ని, ఆయన శరీరంలో ప్రవేశించి, దివ్యకాంతులను వెలువరుస్తోంది. ఆయన తన తపస్సుచే, సూర్యుని ప్రకాశింప జేస్తున్నాడు, అగ్నిని మండింప జేస్తున్నాడు, ఆయన తపో బలం వల్ల, చపలాలు ఆచపలాలుగా మారాయి. ఆశ్రమంలో క్రూర మృగాలతో సాధుజంతువులు, కలిసి మెలుగుతున్నాయి. మహా 

ప్రశాంతంగా అగస్త్యాశ్రమం ఉన్నది. దుష్ట మృగాలు మాంసభక్షణ మాని, పచ్చ గడ్డి మేస్తున్నాయి. కొంగలు చేపలను, పెద్ద చేపలు చిన్న వాటిని తినటం లేదు. ఆశ్రమంలో‘మాంసం ఎక్కడ? శివ భక్తీ ఎక్కడ? మందిర మెక్కడ ?శివార్చనం ఎక్కడ? మద్యమాంసాలు తిన్న వారికి, శంకరుడు దూరంగా ఉంటాడు. "శివానుగ్రహం లేక అజ్ఞానం నశించదు‘’ అన్న వాక్యం వ్రాసి, అందరికి అహింసా ధర్మాన్ని బోధిస్తోంది - అగస్త్యాశ్రమం. 


 ఈ ప్రశాంతతను చూసి దేవతలు ఆశ్చర్యపడ్డారు. ’’ఇక్కడున్న పక్షులు, విశ్వేశ్వరుని ధ్యానిస్తున్నాయా? చిలుకలు విశ్వనాధుని కీర్తిస్తున్నాయా ?కోకిలలు కలికాల పరిస్థితులకు కలత చెంది, విశ్వేశ్వర 

తలంపుతో చిత్తశాంతి పొందుతున్నాయి. స్వర్గంలో నుండి పతనం చెడటం ఉంది కాని, కాశీ లో పతనం ఉండదు. యముడి దగ్గర ఉండటం కంటే, కాశీలో ఉండటం శ్రేయస్కరం. బ్రహ్మాండంలో ఏ ప్రదేశంలో ఉన్న దాని కంటే, కాశీ లో నివశించటం శ్రేష్టం. ఇక్కడ ఉన్నా, ఈశ్వరదర్శనం లేకపోతే వ్యర్ధం. ఉత్తర వాహిని అయిన గంగానదిలో స్నానం చేసి, విశ్వేశుని దర్శించిన వారి శ్రేయస్సుకు, అంతం ఉండదు. *’’దేవ దేవ మహా దేవ శంభో! శివా శివా! ధూర్జటే ! నీల కంఠేశ! పినాకీ! శశి శేఖర! నన్ను రక్షించు‘’* అంటూ ముక్తిమండపం పై కూర్చోవటం, ధర్మ విషయాలు మాట్లాడుకోవటం, పురాణ శ్రవణం చేయటం, నిత్య కర్మలు చేయటం, పిండాదులు పెట్టటం, పరోపకారం చేయటం, అంటే సమస్త ధర్మాలను ఆచరించటమే.  


 శుక్లపక్షంలో చంద్రకళ  అభివృద్ధి చెందినట్లు, కాశీ క్షేత్రంలో ఉన్నవారికి, పుణ్యం అలా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ పురుషార్ధాలను ఇచ్చేది, భవానీమాత.  కోరికలను తీర్చేవాడు డుంఢి విఘ్నేశ్వరుడు. విశ్వేశ్వరుడు మరణ కాలంలో సమస్త ప్రాణులకు, రామ తారక మంత్రాన్ని చెవిలో, బోధించి మొక్షాన్నిస్తాడు. విశ్వేశ్వరుడు ధర్మార్ధ కామ మోక్ష స్వరూపుడు. పరమాత్మ స్వరూపుడు. అందుకనే కాశీ వంటి పట్టణం, మూడు లోకాలలోనూ లేదనే ప్రఖ్యాతి వచ్చింది. అని దేవతలందురూ అను కొంటూ, అనేకమంది బ్రహ్మచారి శిష్యులతో పరివేష్టించి ఉన్న అగస్త్య మునిని దర్శించారు. శ్యామక ధాన్యాన్ని, హోమంకోసం చేతులో పట్టుకొన్న రుషి కన్యలను చూశారు. సాధ్వి,  లోపాముద్ర పాద ముద్ర లను చూసి పులకించారు. ఆ పాద ముద్రలకు భక్తీ గా నమస్కరించారు. అక్కడ సమాధి నుండి మేల్కొన్న, బ్రహ్మదేవునిలా ప్రకాశిస్తున్న అగస్త్య మహర్షిని దర్శించి, నమోవాకాలనర్పించారు. 

 

 ఆయన వీరిని సాదరంగా ఆహ్వానించి, అతిధి మర్యాదలు చేసి, శుఖాసీనులను చేశాడు. వారి రాకకు కారణాన్ని అడిగాడు మహర్షి.

                                               

 *పతివ్రతాఖ్యానం*


అప్పుడు దేవతలందరి తరఫున, దేవ గురుడు బృహస్పతి, మహర్షితో,  ‘’లోపాముద్ర వల్లభా !నీవు ఘనులలో ఘనుడవు. 

నీవంటి తపోధనులు లేరు. ఈ కల్యాణి లోపాముద్ర, నీ సహాధర్మచారిణిగా నీ ఛాయలాగా ప్రవర్తిస్తోంది. మహా పతివ్రతలైన అరుంధతి, అనసూయ, సావిత్రి, శాండిల్య , సత్య , లక్ష్మి , శతరూపలతో ఈమె సమానం. ఈమెను మించిన పతివ్రతను ఊహించలేము." అని, లోపాముద్రాగాస్త్యులను కీర్తించాడు. 


 తర్వాత, పతివ్రతా ధర్మాలను వివరించాడు బృహస్పతి. 


 ‘’కన్య వివాహ సందర్భంలో, పెండ్లి కుమార్తెతో పురోహితుడు, ‘’భర్త తో జీవించినా లేకపోయినా సహచరిగా ఉండు‘’ అని చెబుతారు. కనుక భార్య, భర్తను నీడ లాగా అనుసరించాలట. అది పతివ్రత లక్షణం. యమ దూతలు పతివ్రతను చూస్తె, అగ్నిని చూసి నంత భయంతో, పారిపోతారు. ఆమె తేజస్సు ముందు, సూర్యాగ్నుల తేజస్సు, దిగదుడుపు. స్త్రీల పతివ్రతాచారణం వల్లనే, భూమి భారం తగ్గుతోంది.  ఈ లోకానికి, పరలోకానికి, భార్యయే మూలం. భార్య తో కలిసి, దేవ ,పితృ కార్యాలు చేయాలి. భర్తను కోల్పోయిన స్త్రీ, ఏ దానం చేసినా, ‘’నా భర్త సంతోషించు గాక ‘’అని చేయాలి. శ్రావణ, భాద్రపద మాసాలలో, ఆమె, భోజనాలు అతిధులకు పెట్టాలి. కార్తీకంలో మౌనాన్ని పాటించాలి. ఆకులలో భుజించాలి. దీప దానం చేయాలి. ఈ దానంతో ఏదీ సమానం కాదు. సూర్యోదయం అవగానే, మాఘస్నానం చేయాలి. దీపాన్ని దానం చేసేటప్పుడు, పరమేశ్వర స్వరూపుడైన తన భర్త సంతోషించాలి, అని అనుకోవాలి. కొడుకు అనుమతితో, పనులు చేయాలి . పాతివ్రత్యం గల స్త్రీ ని పూజిస్తే, గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది. 


 అమ్మా! లోపాముద్రా దేవీ ! మీ దర్శనం మాకు గంగా స్నానం తో సమానం‘, అని చెప్పాడు. 


 బృహస్పతి తాము వచ్చిన కారణాన్ని ఇప్పుడు వివరించి చెబుతున్నాడు.  


 ‘’మహర్షీ వీరు అగ్ని , యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, రుద్రదేవతలు. లోకంలో జనం, వీరివల్ల అన్ని అర్ధాలను పొందుతున్నారు.

 

 వింధ్య పర్వతం మేరుగిరి పై ఈర్ష్య పెంచుకొని, విపరీతంగా పెరిగింది. సూర్యుని మార్గానికి అవరోధమేర్పడింది. దానిని మీరే దారిలోకి తేవాలి, లోక కార్యాలన్నీ మళ్ళీ యధాప్రకారం జరిగేటట్లు చేయాలి. అందుకే మేమంతా మీ దర్శనం చేసి అర్ధించటానికి వచ్చాం. అని విన్నవించాడు.

 

 అగస్త్య మహర్షి,  ‘’అలాగే చేస్తాను. నిశ్చింత గా వెళ్ళండి."  అని అభయమిచ్చి దేవతలను పంపించాడు. 


 *కాశీఖండం సశేషం..*

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

*🅰️🅿️SRINU*

కామెంట్‌లు లేవు: