కోతి ఉపవాసం ........... [నాకొక పాఠం ]
ఒక కోతి ఒకరోజు స్వామీజీ ఉపన్యాసం విన్నది. దానికి ఉపన్యాసం చాలా నచ్చింది. ఒక పరవదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది. జపం చేయటానికి నిశ్చయించుకుంది.పని అంతా పూర్తి చేసుకుంది. కూర్చొని జపం మొదలుపెట్టింది.
ఉన్నాట్టుండి దానికొక సందేహం వచ్చింది .ఈరోజంతాఉపవాసం ఉండి జపం చేస్తుంటే,రేపు నాకు చాలా నీర్సంగా వుంటుందేమో! అప్పుడు మరి చెట్టు నుంచి చెట్టుకు దూకి పళ్ళు కోసుకోగలనా? నీరసం మరీ ఎక్కువైపోతే ! ఎలా? ఏమీ చెయ్యలేనేమో ?
ఈ ఆలోచన వచ్చాక ,కోతి జపం చేయటం ఆపింది. అప్పటికప్పుడు లేచి చెట్టూపుట్టా గాలించి మరుసనాటికి సరిపడే ఆహారాన్ని సేకరించింది. దానిని ఒక మూల భద్రపరచింది.మళ్ళీజపం కొనసాగించింది.
మరికొంత సేపటికి కోతికి ఇంకో ఆలోచనవచ్చింది. "రేపు నీరసం వల్ల నేను నడవలేక పోతేనో? ఆహారం ముందేవుంచుకుని కూడా ఆకలితో అలమతించి పోతాను కాబోలు! ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడి పోయింది.
వెంటనే లేచింది. ఆహారాన్ని తన చేతికి అందుబాటులో వుంచుకుంది. మళ్ళీ జపం ఆరంభించింది.
ఆకోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది. "ఒకవేళ నేను మరీ నీరసించి పోయి ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెటుకోలేక పోతేనో" అంటూ జరగబోయేది ఊహించుకుంది. ఆహారాన్ని నోటిలోనే వుంచుకుని ఉపవాసం చేయాలనుకుంది. ఆవిధంగా అది ఆహారాన్ని నోటిలో పెట్టుకుని జపం చేయబోయింది. కానీ నోటిలో నిండుగా ఆహారం పెట్టుకుని జపం ఎలాచేస్తుంది?
చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది."భోజనం నోట్లో వుంచుకోవడం ఎందుకు?ఇప్పుడైతే ఏమిటి ?రేపైతే ఏమిటి? ఎలాగూ అది నేను తినవలసినదేకదా! అందువల్ల ఈఆహారాన్ని ఇప్పుడే తినేసి కూర్చుని,సుఖం గా జపం చేసుకుంటాను." అనుకుంది. తనకు వచ్చిన ఈ గొప్పాఅలోచనకు ఎంతగానో మురిసి పోయింది. ఆహారం తీసుకుంది.నిద్ర ముంచుకొచ్చింది. స్వామీజీ ఉపన్యాసం మరచిపోయింది. పక్కపరుచుకుంది. హాయిగా నిదురపోయింది.
[ఈరోజు పిల్లలకు ఈకథచెబుతుంటే ,ఎందుకో ఎవరో చర్నాకోలతో కొట్టినట్లు చురుక్కుమన్నది. నాసాధనకూడా ఇంతేనేమో నని.]
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి