6, మే 2026, బుధవారం

హనుమంతుడు

 శ్రీరామ (137 ) హనుమంతుడు - 5


( వాల్మీకి మహర్షి ధ్వనిరూపంలో చెప్పిన కుండలనీ యోగమే సుందరకాండ )



శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                        ----------------------



నిన్నటి (5-5-'26) పోష్టులో,

 హనుమంతుడు శ్రీవిద్యోపాసకుడని,సుందరకాండ హనుమంతుడు ఆచరించిన కుండలినీ యోగమన్న విషయం ఈ క్రింది శ్లోకాన్ని బట్టి పండితులు వ్యాఖ్యానిస్తున్నారని చెప్పుకున్నాము.


శ్లో// కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మన:/

త్వాం ద్రష్టు ముపయాతో౽హం, సమాశ్రిత్య పరాక్రమమ్//


(నేను నా పరాక్రమాన్ని ఆశ్రయించి దురాత్ముడైన రావణుని శిరస్సు పై పాదము పెట్టి,నిన్ను దర్శించుటకు ఇక్కడకు వచ్చితిని. తల్లీ! ) 


అని, అశోకవనంలో సీతాదేవిని దర్శించిన హనుమంతుడు అన్నాడు.


పై శ్లోకాన్ని వివరిస్తూ, సాధకుడు మూర్ధ్ని స్థానమైన సహస్రార చక్రంలో దృఢంగా పాదము నిలిపి శిఖాస్థానమైన " పీఠక " చక్రంలో ఉన్న చిచ్ఛక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని దర్శించాలని పరమపూజ్యులు శ్రీ చందోలు శాస్త్రిగారు చెప్పిన విషయం కూడా నిన్నటి పోష్టులో చెప్పుకున్నాము.


ఆ శ్లోకంలోని ' రావణస్య దురాత్మనః ' అంటే ఏమిటి?

కామ, క్రోధములకు వశుడై, అంతులేని సంసారచక్రములో పరిభ్రమిస్తూ ఉంటాడు జీవుడు.

ఆజీవుడే రావణుడు. 


దురాత్ముడు (నిష్కల్మష చిత్తం లేనివాడు) అయిన అట్టి రావణుని శిరస్సుపై పాదము పెట్టాను అన్నాను హనుమంతుడు.


 అనగా యమ, నియమాదులు బాగా అభ్యసించి, రాగద్వేషములను జయించిన చిత్తము కలవాడినయ్యాను అనటం.


సుందరకాండ ప్రారంభ శ్లోకంలోనే హనుమంతుడు శత్రుకర్శనుడు అనగా శత్రువులను క్షీణింపజేసినవాడు అనే పదం వాడబడింది.


శ్లో// తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్శనః/

ఇయేష పదమన్వేష్టుం చారణా చరితే పథి//


( జాంబవంతుడు,మొదలైన వారు ప్రేరేపించగా, శత్రువులను కృశింపజేసిన హనుమంతుడు, రావణుడు అపహరించిన సీతా దేవిని వెదకుటకై,చారణులు మొదలైన దేవతలు సంచరించు ఆకాశమార్గము ద్వారా లంకకు వెళ్లవలెనని నిశ్చయించుకొనెను).


సుందరకాండ లోని ఈ మొదటి శ్లోకంలో హనుమంతుడు " శత్రుకర్శనుడు" అని కీర్తింపబడ్డాడు.


సముద్ర లంఘనమునకు ముందు హనుమంతుడు ఏ శత్రువులను నశింపజేయలేదు.


అందువలన " శత్రుకర్శనుడు " అంటే ఈసందర్భంగా కామ,క్రోధాది అంతశ్శత్రువులను నశింపజేసిన వాడు, అనే అర్థం అని పండితులు వ్యాఖ్యానించారు.


" కామ క్రోధాదులను జయించి, కల్మషరహితమైన అంత:కరణము కలవాడినై,

 నీ దర్శనము కోసము వచ్చాను తల్లీ ! "


అని హనుమంతుడు సాక్షాత్తు చిచ్ఛక్తి స్వరూపిణి, జగన్మాత, అయిన సీతాదేవితో విన్నవించడము, పై శ్లోకము యొక్క తాత్పర్యము అని పండితుల అభిప్రాయం.


అలాగే " పరాక్రమమును ఆశ్రయించి" (సమాశ్రిత్య పరాక్రమం) అనే పదములను పెద్దలు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు.


" పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ, అని నాలుగు విధములుగా వుండే "వాక్కు" లో, మొదటిదైన "పరా" వాక్కు వుండే స్థానం "మూలాధార చక్రము".

అక్కడ నుండి క్రమముగా ( పరాక్రమం) "స్వాధిష్ఠానము", "మణిపూరము", "అనాహతము", "విశుద్ధము", " "ఆజ్ఞా", అనే ఆరు చక్రములను దాటి ఏడవ చక్రమైన "సహస్రారము" చేరుకోవటం, 

 "సమాశ్రిత్య పరాక్రమమ్" అనే పదానికి అర్థం అని పండితులు చెబుతున్నారు.

అలాగే,

" త్వాం ద్రష్టు ముపయాతోహం" లోని చివరి అక్షరం "హం",

" సమాశ్రిత్య పరాక్రమమ్" అనే పదములోని మొదటి అక్షరం "సం" ,

ఈ రెండు అక్షరములు కలిసి "హంసం"అవుతుంది.

ఇదే ప్రాణశక్తి స్వరూపమైన హంస గాయత్రి.


"హంస హంస:పరమహంస స్సోహం హంస స్సోహం హంస:"

"హంస హంసేతి యో బ్రూయాత్, హంసో నామ సదాశివ:" 

రుద్రాభిషేకం సందర్భంగా మహాన్యాసం లో చెప్పే పై మంత్రం "హంస" అంటే సదాశివుడు అని అర్థం చెబుతున్నది.

హంస గాయత్రి అంటే ఆ సదాశివుని మంత్రమే.


ఆ హంస గాయత్రి మంత్రమును ఆశ్రయించి,పరా,పశ్యంతి,మధ్యమా, వైఖరీ క్రమమున నీ దర్శనం కోసం వచ్చాను తల్లీ, అని సీతాదేవితో హనుమంతుడు అన్నట్లుగా ప్రఖ్యాత కవులు, శ్రీవిద్యా ఉపాసకులు అయిన కీ.శే.లు 

శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు వ్యాఖ్యానించారు.


ఈ పదములను,సుందరకాండలోని ఇతర శ్లోకములను కూడా వ్యాఖ్యానిస్తూ, సుందరకాండ, కుండలినీ యోగమే అని చెప్పారు.( షోడశి రామాయణ రహస్యాలు).


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

6-5-'26.

కామెంట్‌లు లేవు: