28, అక్టోబర్ 2022, శుక్రవారం

Bhagavatham

 : Srimadhandhra Bhagavatham -- 56 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

2. క్షీరసాగర మథనం:

పంచమి ఉండగా ఉన్న శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నింటికి ఐశ్వర్యమును ఇచ్చింది. దానివలన మొట్టమొదట అనుగ్రహమును పొందినవాడు దేవేంద్రుడు. మనము ఐశ్వర్యమునకు గాని, అధికారమునకు గాని, భోగలాలసతకు గాని, వైభోగమునకు కాని, ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాము.

ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక అరణ్యప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆయన సురాపానం చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా దుర్వాసోమహర్షి వస్తున్నారు. ఆయన మహా బ్రహ్మజ్ఞాని. శంకరాంశ సంభూతుడు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ ఉన్న పరివారం దేవేంద్రుడిని కుశలం అడిగి దేవేంద్రుని ఆశీర్వచనం చేశారు. దుర్వాసోమహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పం ఉన్నది.

ఆ పారిజాత పుష్పమును ఈయన కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ‘మహానుభావా! ఈ పుష్పమును స్వీకరించండి’ అని కృష్ణుడు ఇచ్చాడు. అది భగవంతునిచే స్వయంగా ఇవ్వబడినది. ఈశ్వర నిర్మాల్యం అంటారు. లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది. ఇంద్రుడు సురాపానం చేసి మదోన్మత్తుడై ఉన్నాడు. ఆ పువ్వును తీసుకున్నాడు. పువ్వును తీసుకున్నప్పుడు కళ్ళకు అద్దుకుని పక్కన పెట్టాలి. ఈశ్వర నిర్మాల్యం అయినట్లయితే తలమీద కానీ, చెవిలో కానీ పెట్టుకోవచ్చు లేదా ఎవరూ తొక్కనిచోట దానిని భద్రం చేయవచ్చు. ఇంద్రుడు ఆ పువ్వును తీసుకొని ఐరావతం మీదకి విసిరాడు. ఆ ఐరావతం విశేషమయిన తేజస్సును సంతరించుకుంది. అది భగవంతుని నిర్మాల్యం. అది దాని శిరస్సు మీద పడింది. అది తేజస్సును పొంది ఇంద్రుడిని మోయడం మానివేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. దుర్వాసో మహర్షి ఇంద్రుడిని చూసి ‘నీవు ముకుంద పాదారవిందము నుండి వచ్చిన పారిజాత పుష్పమును తిరస్కరించావు కనుక నీవు ఉత్తరక్షణం ఐశ్వర్య భ్రష్టుడవు అయ్యెదవు గాక! స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి స్వస్థానమయినటువంటి వైకుంఠములో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యం అయిపోతుంది. ఇక నీకు స్వర్గంలో ఐశ్వర్యం ఉండదు’ అన్నారు. ఈమాట వినగానే శత్రువులు వచ్చేస్తారు. ఐశ్వర్యం పోవడానికి ఒక కారణం ఉండాలి కదా! రాక్షసులు అందరూ వచ్చేశారు. చుట్టుముట్టి పడగొట్టేశారు. ఇంద్రుని ఐశ్వర్యం పోయింది. ఇంద్రునికి ఐశ్వర్యం పోవడానికి కారణం తెలిసింది. దేవతలు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు ‘అప్పుడప్పుడు నీవు కండకావరంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్లావు. ఇవాళ దుర్వాసోమహర్షి జోలికి వెళ్లావు. అందువలన ఐశ్వర్యం పోయింది. నీకు మరల ఐశ్వర్యం ఆ పద్మనాభుడి అనుగ్రహంతోనే రావాలి. ఆయననే ధ్యానం చెయ్యాలి’ అని కన్నులు మూసుకుని ధ్యానమునందు ఉన్నవాడై ఆ పరమాత్మను ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అనగా ధ్యానమునందు ద్యోతకమైన నారాయణుడు ఒక మార్గోపదేశం చేసాడు.

బ్రహ్మగారు ‘ నీకు ఐశ్వర్యము పోయినది కదా! నీవయినా నేనయినా మరల ఐశ్వర్యము ఇమ్మని శ్రీమన్నారాయణునే అడగాలి. ఆయన పాదముల మీద పువ్వును నీవు విసిరేశావు. అందుకు దుర్వాసునికి కోపం వచ్చింది. పరమాత్మకు కోపం రాదు. ఆయనా కోపం పెట్టేసుకుంటే ఇక లోకంలో ఉద్ధరించే వాడెవడు? పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు. నీవు దుర్వాసుని నన్ను అర్థించడం వల్ల పరమాత్మ సంతోషిస్తున్నాడు. తప్పు చేసినవాడు తనకు ఎంత దగ్గర వాడయినా పరమాత్మ శిక్షిస్తాడు. ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు. శాశ్వత మిత్రుడు కాదు. మీ నడవడిని బట్టి ఆయన మిత్రత్వము కాని, శత్రుత్వము కానీ ఆవిష్కరింప బడుతుంది. ఇంద్రా! నేను కాని, దుర్వాసుడు కానీ, సమస్త దేవతలు శ్రీమన్నారాయణుడికి మ్రొక్కి నమస్కరించినపుడు సంతోషిస్తాము. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందడం కాదు. శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులం అవుతాం. ఆయనను ప్రార్థన చేద్దాం’ అన్నారు.

బ్రహ్మగారు ఆమాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వాడిని పరమాత్మ రక్షిస్తాడు అనే జ్ఞానం కలిగింది.పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే స్వామి వరం ఇచ్చేస్తాడు. దితి సంధ్యాకాలంలో తప్పు చేసింది -హిరణ్యకశిపుడు పుట్టాడు. భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు.తప్పు చెయ్యడం సహజం. పశ్చాత్తాప పడి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం మంచిమనిషి లక్షణం. అపుడు ఇంద్రుడు తాను చేసింది తప్పు పనే అని, తనను మన్నించమని మనస్సులో అనుకుని స్వామిని ప్రార్థించాడు. అంతే! ఎక్కడికో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసిన వాళ్లకి దొరకని పరమాత్మ దర్శనం పశ్చాత్తాపం కలగగానే ఇంద్రునికి దొరికింది. వెంటనే పరమాత్మ ఇంద్రుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు. అలా సగుణంగా కనపడగానే అందరూ చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఆయనను చూడడానికి ఆయన అనుగ్రహం కావాలి. అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడడానికి వీలుగా ఎదురుగుండా ఈశ్వరానుగ్రహంతోనే చూసారు. పరమాత్మ ప్రత్యక్షం అయేసరికి వీరందరి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థన చేశారు.

శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా సంతసించాడు. ‘నీవు ఐశ్వర్యము పోయింది కదా అని విచారిస్తున్నావు. ఐశ్వర్యమేమిటి! ఈ శరీరమునకు యౌవనము పోకుండా మృత్యువు రాకుండా ప్రళయకాలమునందు మాత్రమే మరల లీనమయేలా వార్ధక్యం రాకుండా, ఐశ్వర్యం చెడకుండా, అనారోగ్యం రాకుండా, నిరంతరం తేజస్సుతో, కనురెప్ప పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి భూమికి పాదము ఆనకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులను ఇవ్వగలిగిన అమృతమును మీకు ఇస్తాను’ అని అన్నారు. అదీ ఈశ్వరానుగ్రహం అంటే. ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదు. పరమాత్మను మనసులో తలచుకొని ‘నాది తప్పే మహానుభావా’ అన్నాడు. పరమాత్మ అమృతమును ఇస్తాను అంటున్నాడు. ‘మీరు అనేక ఓషధులను తీసుకురండి. గడ్డి తీసుకురండి. పువ్వులు తీసుకురండి. ఇవన్నీ పట్టుకు వెళ్ళి పాలసముద్రంలో వెయ్యండి. మంధర పర్వతమును తీసుకువచ్చి కవ్వంగా మెల్లగా పాలసముద్రంలోకి దించండి. దానికి వాసుకిని త్రాడుగా చుట్టండి. దేవతలు, దానవులు దానిని అటుఇటు పట్టుకోండి. ఇపుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీమాట వినరు. నాగుపాము కూడా ఎలుకను పట్టుకోవాలంటే కలుగులో నుంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవులను మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చేయండి. వారిని క్షీర సాగర మథనమునకు తీసుకు వచ్చి సాగరమును చిలకండి. అందులోంచి అమృతం పుడుతుంది. మొదట హాలాహలం వస్తుంది. అగ్నిహోత్రం వస్తుంది. భయపడకండి. పూనికతో మరల చిలకండి. చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి. మనసు పారేసుకోవద్దు. నిగ్రహించుకోండి. నేను ఇస్తే పుచ్చుకోండి. లేకపోతే ఊరుకోండి. ఎవరికీ ఏది ఇవ్వాలో నాకు తెలుసు. అది వాడికి ఇస్తాను అంటే

దేవతలు శ్రీమన్నారాయణుని మాటలు శ్రద్ధగా విని తప్పకుండా అలా చేస్తాం అని చెప్పి వారు బయలుదేరారు. మొట్టమొదట మంధర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాలి. ఇపుడు దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమకొక పెద్ద తవుకోలను తయారుచేసి ఇవ్వవలసినదని కోరారు. త్వష్టప్రజాపతి ఎందుకు? అని అడిగాడు. దేవతలు ‘మేము మంధర పర్వతమును కింద తవ్వేస్తాము. తరువాత దానిని ఊడబెరికి సముద్రం వద్దకు తీసుకువెడతాము. అలా చేయమని శ్రీమన్నారాయణుడు చెప్పాడని చెప్పారు. ఆయన వారు కోరిన విధంగా తవుకోలను చేసి ఇచ్చాడు. వారు దానిని తీసుకువెళ్ళి మంధరపర్వతం అడుగు భాగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. మంధర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో దింపాలి. అందుకని కొన్ని తాళ్ళు వేసి దానిని ఊపుతున్నారు. అలా ఊపి మొత్తం మీద పర్వతమును అందరూ కలిసి పైకి ఎత్తారు. అయితే అది పక్కకి ఒరిగిపోయి పడిపోయింది. ఈ సందర్భంలో దానికింద పడి కొందరు మరణించారు. మిగిలిన వారందరూ ప్రక్కకు చేరి ఈ మంధరపర్వతమును సముద్రము వరకు తీసుకుని వెళ్ళడానికి మనం శ్రీహరి సహాయం అడగలేదు. అడిగి ఉంటే ఆయనే వచ్చి మనకు సహాయం చేసి ఉండేవాడు. ఆయన వస్తే ఎంత బాగుండునో’ అని అనుకున్నారు. వాళ్ళు ఈమాట అనుకునేసరికి బంగారురంగులో ఉన్న గరుడపక్షిమీద నుంచి శ్రీమన్నారాయణుడు క్రిందకి దిగి దేవతలను ఓదార్చి మంధరపర్వతమును బంతివలె నేర్పుతో చేతితో పట్టుకుని, దానిని తీసుకుని మరల గరుడవాహనం ఎక్కి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు పాలసముద్రం ఒడ్డున దిగి గరుత్మంతుడిని వెనక్కు పంపించి వేశాడు. చిలికేటప్పుడు వాసుకి శరీరం ఒరిసి పోకుండా మంధరపర్వతమును నునుపుగా చెక్కించారు. వాసుకిని తీసుకు వచ్చి పర్వతమునకు చుట్టి పాలసముద్రంలో పెట్టారు. ఇప్పుడు అది మునిగి పోకూడదు. దేవతలను పిలిచి వారిని వాసుకి తలవైపు పట్టుకొనమని రాక్షసులను పిలిచి వారిని తోకవైపు పట్టుకొనమని చెప్పాడు. వెంటనే దేవతలు అందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు. రాక్షసులు ‘మేము తోక పట్టుకోవడం ఏమిటి? మేము తలవైపు పట్టుకుంటాము’ అన్నారు. అందుకు స్వామి వెంటనే ఒప్పుకుని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకొనమని చెప్పారు. దేవతలు మారు మాట్లాడకుండా వాసుకి తోకవైపు వెళ్ళి తోకను పట్టుకున్నారు. స్వామి మాటల పట్ల దేవతలకి గల విశ్వాసం వారిని అమృతం తాగేట్లు చేస్తుంది.



శాక్తేయ నాయనారు – నారదుడు మాయకు వశుడగుట


మనకు పెరియపురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకి నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది. అందులో ‘శాక్తేయ నాయనారు’ అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తితత్పరుడు. కాని ఆయన ఉన్నరోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని, ‘శివ’ అన్న నామం పలకడం కాని, శివార్చన చెయ్యడం కాని కుదరని భయంకర పరిస్థితులు ప్రబలివున్నాయి.కానీ ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమభక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము నొకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్లి శివ నామములు జపిస్తూ ఆ శివలింగం మీద పూవులు వెయ్యాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరయినా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురి చేసేవారు. అపుడు ఆయన పైకి శివార్చన చెయ్యనివాడిలా కనపడాలి లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోర్కె తీరాలని ఒక మార్గము ఎంచుకుని ఆయన అటుగా వెళుతూ అన్నం తినేముందు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని శివా! నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను? అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి, నీవు శివుడివా?” అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనస్సులో భావిస్తూ ఆ శివలింగం మీద పడేసేవారు. మరొక రాయిని తీసుకుని ‘నీవు శివుడివా? అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లెపువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు. నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరినా రాళ్ళకు బదులు చేమంతిపువ్వులు, మల్లెపువ్వులు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారముల ననుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు. ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు. అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థం అవుతుందా –శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. అదీ ఆయన పూజ! ఇది ఆర్తిలోనుంచి వచ్చిన పూజ.

ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అపుడు ‘శర్వతి’ అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది. ‘ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలి వెడితే దానిని జీర్ణం చేస్తున్న వాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద నాలుగు పువ్వులు వెయ్యడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గరనుంచి లేచి, భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్లి ‘శివుడివా’ అని నాలుగు రాళ్ళు తీసి శివలింగం మీద విసిరాడు. ఇలా తప్ప మరొకవిధంగా నీకు పూజ చేయలేక పోతున్నా' ని మనస్సులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజ మూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగిన వాడు. ఇదీ ఆయన స్వతంత్రత. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి నాలుగు రాళ్ళతో పూజ చేసిన మోక్షము ఇచ్చినవాడు శంకరుడు. అలా మోక్షమును ఇవ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది. ఇది మహేశ్వర శబ్దముచేత ప్రతిపాదించబడుతుంది. ఈశ్వరుని శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుని కనపడకుండా చేస్తుంది. ఈ మాయ ఈశ్వర వాక్కువలన, ఈశ్వర స్వరూపులయిన గురువాక్కుల వలన తొలగుతుంది. నిరంతర గురు వాక్ శ్రవణమే మాయ తొలగేందుకు కారణం. అందుకే గురువులేని విద్య గుడ్డివిద్య. గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు. మాయ వలన ఈశ్వర దర్శనమును విస్మరించి ‘ఇదంతా నా ప్రజ్ఞ’ అనుకుంటూ కామక్రోధములతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. చంద్రశేఖర పరమాచార్య తన 73వ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది’ అని చెప్పుకున్నారు. మహాత్ములు విషయములను దాచరు. శివమహా పురాణం ఈ జ్ఞానమును ఉపదేశించడానికి ఒక అద్భుతమయిన ఘట్టమును తీసుకువచ్చి మీకు బోధచేసే ప్రయత్నమును ప్రారంభం చేస్తోంది.

ఒకానొక సమయంలో నారదమహర్షి హిమవత్పర్వతము క్రింది భాగమునందు, గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో, అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశారు. తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతునియందు మగ్నమై ఉండాలి. అది చంచలం అవుతున్నదీ లేనిదీ పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు మన్మథుడిని పిలిచి ఒకమాట చెప్పాడు.

‘మన్మధా ! మహా సంయముడయిన నారదమహర్షి తపస్సు చేస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను, ఇంద్రియములకు చూపించి ప్రలోభపెట్టి, నారదుడు ఇంద్రియములకు వశుడవుతాడేమో చూడవలసినది అని చెప్పాడు. మన్మధుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు. నారదుడు లొంగలేదు. నారదుని తపస్సు సఫలీకృతం అయింది. ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి ‘ఈశ్వరా! హిమవత్పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను. మన్మధుడు వచ్చి నామీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు. నేను వాటిని లెక్కపెట్టలేదు. కామమును జయించి తపస్సునందు సిద్ధిని పొందాను’ అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం. ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి. నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి ‘నారదా! నీవు కాముడినే జయించావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు’ అని చెప్పాడు. నారదుడు శంకరుని మాటలను పట్టించుకోలేదు. గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానములోనికి రానివిద్య. ఆ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది. అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్యవలన ప్రయోజనం లేదు. నారదుడు వైకుంఠమునకు వెళ్తూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు, సిద్ధిని పొందినట్లు చెప్పాడు. బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకుపూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మథుడు వస్తే మూడవ కంటి మంటచేత కాల్చివేశాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకుపూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం. నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు. అది శివ ప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు.

నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. వైకుంఠమునకు వెళ్ళాడు. నారాయణుడు ఎదురువచ్చి స్వాగతించాడు. నారదుడు ‘స్వామీ! నేను తపస్సు చేశాను. మన్మథుడు నామీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు. సిద్ధి పొందాను’ అని చెప్పాడు. నారాయణుడు ‘ఎంత గొప్పపని చేసావు. శివుని తర్వాత మరల నీవే చేసావు’ అని మెచ్చుకున్నాడు. నారదునికి లోపల జ్ఞానము బాగా నిలబడేటట్లుగా చేయవలసిన అవసరం ఏర్పడిందని నారదుని పంపించివేశాడు. ఇపుడు మాయ ప్రారంభమయింది.

నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యమును శీలనిధి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కుమార్తె, పేరు శ్రీమతి. నారదుడు శీలనిధి అంతఃపురంలోనికి వెళ్ళాడు. రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు. తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చి ఆమెచేత నారదునికి నమస్కారం చేయించి, తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినది అని కోరాడు.

నారదుడు త్రికాలవేది. ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడో, ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకం చేత పూజించబడుతూ ఉంటాడో, ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీమహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది’ అన్నాడు. అక్కడివరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండని లోపల అనుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు. స్వయంవరం పెట్టాము. స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది. అని చెప్పాడు. అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడని నారదుడు గ్రహించాడు. వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి ‘ నామనస్సు ఆ శ్రీమతిని పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నది. ఆమె నాకు దక్కకపోతే మన్మథబాణముల చేత చచ్చిపోతాను’ అన్నాడు. ఇంతకు మునుపు మన్మథబాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఇదీ మాయ అంటే. నేను బతకాలంటే నాకు నీరూపం కావాలి. అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది. అందుకని దయచేసి నీ రూపమును నాకీయవలసినది’ అని అడిగాడు. శ్రీమహావిష్ణువు మహానుభావుడు. ఆయన హరి శరీరమునూ ఇచ్చాడు, శిరస్సునూ ఇచ్చాడు. హరి అనే పదమునకు రెండు అర్థములు – పాపములను హరించే శ్రీమహావిష్ణువు, హరి శరీరమును కిందవరకు ఇచ్చాడు, కోతి తలను పైన ఇచ్చాడు.

వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి అటూ ఇటూ రుద్రపార్షదులు కూర్చుని ఉన్నారు. ఈతని అలంకరణ చూస్తే మహావిష్ణువులా అలంకరించుకున్నాడు, పైన మాత్రం కోతి ముఖం. ఇతని మెడలో ఎలా మాల వేస్తుందని అనుకుంటున్నారు. పక్కవాళ్ళు అసూయతో అలా అనుకుంటున్నారని అనుకుంటున్నాడు నారదుడు. శ్రీమతి దండ పట్టుకుని దగ్గరకు వచ్చింది. ఆమె నారదుని వంక ఒకసారి చూసి భ్రుకుటి ముకుళించి ఈ కోతి శిరస్సు ఏమిటి? ఈ రూపమేమిటి? అనుకుని వెళ్ళిపోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. వరమాల తీసుకువెళ్ళి ఆయన మెడలో వేసింది. ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.

అపుడు నారదునికి ఎక్కడలేని బాధా కలిగింది. పక్కన ఉన్న రుద్రపార్షదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. నారదుడు వారిద్దరినీ మీరు రాక్షస యోనులయందు జన్మించెదరు గాక అని శపించాడు. మాయా ప్రభావం కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్రపార్షదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు. నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్లి “శ్రీమన్నారాయణా! ఎంత పని చేశావు. హరిరూపము ఇవ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు. ఆమెను నాకు కాకుండా చేశావు. నీవు ఒకానొకనాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పడి ఏడిస్తే, ఈ కోతిముఖం ఉన్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను శపిస్తున్నాను’ అన్నాడు. శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మమార్గము నేర్పడానికి రామావతారమునందు సీతావియోగముగా తీసుకున్నారు. ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది. తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు. ఆత్మపరిశీలన చేసుకున్నాడు. మాయ తొలగింది. శ్రీమన్నారాయణుని చూసి

యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి. గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా! ఇంకా ఎంత మాత్రము జాగు చెయ్యకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించెయ్యి. అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ళమీద పడ్డాడు. నారదుడు కాబట్టి మరల అంత తొందరగా స్వస్తితిని పొందగలిగాడు. మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము. పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణం అయింది. అదే రజకుడు మరల ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినపుడు, కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు ఇవ్వమని అడిగితే ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలిచేసి మాట్లాడాడు. యుగం మారినా వాని బుద్ధి మారలేదు. అపుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వేయిముక్కలు చేశాడు. ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి. ‘నేను’ అనేమాట అంటే మాత్రం ఇబ్బందిలోకి వెళ్ళిపోతారు. మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి. నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళము? ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపము. మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్ములను దగ్గరికి తీసి, మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీచేత ఈశ్వర సేవ చేయించి, ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామపాశములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తిపాశములుగా మారిపోతాయి. ఆవిడ మాయాశక్తి, స్వరూపిణి. మాయా పాశమును భక్తి పాశము చేస్తుంది. లోకమునందు పంచతన్మాత్రలను ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది. అది మహేశ్వరుని చేరుకోవడానికి మార్గం. ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఈశ్వర ప్రజ్ఞను ఈశ్వరానుగ్రహమును గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

కామెంట్‌లు లేవు: