9, అక్టోబర్ 2020, శుక్రవారం

యత్ర యత్ర వేద పారాయణం:

 యత్ర యత్ర వేద పారాయణం: కన్నీరు పెట్టుకున్న కంచి స్వామి (పెరియవ ) 

మహాస్వామి వారు మధ్యాహ్నపు పూజ ముగించుకుని తీర్ధ ప్రసాదాలు ఇచ్చే సమయంలో కుంభకోణం సమీపంలోవున్న తిరువిడైమరుదూరు(మధ్యార్జునం) మహాలింగస్వామికి చైత్రపౌర్ణమినాడు 11 మంది ఘనాపాఠీలతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించి ప్రసాదం స్వామి వారికి సమర్పించాలని ఉత్సుకతతో ఒక సంపన్నుడైన మిరాశీదారు(భూస్వామి) ఒకరు వరుసలో వేచివున్నారు. మహాలింగ స్వామి ప్రసాదాన్ని కొత్త పట్టుగుడ్డలో చుట్టి తీసుకొనివచ్చాడాయన. ఆరోజు భక్తజన సమ్మర్ధం ఎక్కువగావుంది. మిరాశీదారు వంతు వచ్చింది. మహాస్వామివారియందు అమితమైన భక్తితాత్పర్యములు కలవాడాయన. స్వామివారిని చూస్తూనే భక్తితో వణికిపోతూ సాష్టాంగ నమస్కారంచేశాడు. స్వామివారు కనుబొమలెత్తి వారిని చూసి "ఏమి సమాచారం?" అన్నారు. ఆయన తడబడుతూ ప్రసాదాలను విప్పి వెదురు బుట్టలో విభూతి, చందనము, కుంకుమ, బిల్వపత్రములు, కొబ్బరిచెక్కలు విడివిడిగా వుంచి స్వామి వారికి సమర్పించాడు. ప్రసాదమనగానే ముందుకు వంగి గ్రహించే స్వామి "ఏ క్షేత్రానిది ఈ ప్రసాదం?" అని ప్రశ్నించారు. "స్వామీ! తిరువిడైమరుదూరు మహాలింగ స్వామికి నిన్న రుద్రాభిషేకం చేయించాను, స్వామివారి అనుగ్రహం కోసం ప్రసాదం సమర్పిస్తున్నాను" అన్నాడు మిరాశీదారు….స్వామివారు ప్రసాదాలున్న తట్టవైపు పరీక్షగాచూసి "నీవే ఎంతో స్థితి పరుడవు కదా! రుద్రాభిషేకానికి చందాలుకూడా పోగు చేశావా?" అన్నారు. "లేదుస్వామి! మొత్తంఖర్చు నేనే భరించాను", అన్నాడు నేనే అన్న పదాన్ని వత్తుతూ. “రుద్రాభిషేకం లోకక్షేమంకోసం జరిపించావా?” అన్నారు స్వామివారు. "రెండు మూడుసంవత్సరాలుగా పంటలు సరిగా పండటంలేదు, జ్యోతిష్కులు చైత్ర పౌర్ణమి నాడు అభిషేకం జరిపిస్తే ఫలసాయం ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పారు." అందుకు చేయించాను అన్నాడు మిరాశీదారు. "అయితే నువ్వు ఆత్మార్ధంగానో, లోకక్షేమార్ధమో కాక ఒక కామ్యాన్ని ఆశించి చేశావన్న మాట", అంటూ ప్రసాదాన్ని గ్రహించకుండానే కనులు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళారు స్వామివారు. ….కొన్ని నిమిషాల తరువాత కనులు తెరిచిన వారిని చూస్తే, జరిగిందేమిటో అవగతమైనట్లు తెలుస్తుంది. "సరే, ఎంతమంది వేదపండితులు వచ్చారు?" అన్నారు స్వామి. మిరాశీదారు "11 మంది" అన్నాడు. "నీవే నిర్వహించావుకదా! వారెవరు? ఏగ్రామానికి చెందినవారు?" అన్నారు స్వామి. అక్కడున్న భక్తులకు స్వామివారు ఎందుకలా తరచి తరచి ప్రశ్నలు వేస్తున్నారో అర్ధం కాలేదు. మిరాశిదారు కాగితం చూచి పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు. "ఓహో! అందరూ మహా పండితులు. నీ జాబితాలో తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనాపాఠి గారు వున్నారేమో చూడు". అన్నారు. మిరాశీదారుకు సంతోషంవేసింది. స్వామివారు చెప్పిన ఘనపాఠి గారుకూడా రుద్ర జపంలో పాల్గొన్నారు. "భేష్! భేష్! వేంకటేశ ఘనాపాఠి గారు కూడా వున్నారన్నమాట మంచిది. ఆయన చాలా పెద్ద విద్వాంసులు. మంచి వేద పండితులు. పెద్దవారయి పోయారు. రుద్ర జపం ఎంతో కష్టంమీద చేసి వుంటారు." స్వామివారి ఈ మాటలతో బలంపుంజుకున్న మిరాశీదారు "మీరు సరిగ్గా చెప్పారు స్వామీ! ఎక్కువ భాగం ఆయన పారాయణ చెయ్యకుండా కనులు మూసుకుని కూచుంటారు. దాని మూలంగా సంఖ్య తగ్గిపోతోంది. ఎందుకు పిలిచానా అనుకున్నాను" అన్నాడు. స్వామివారి కనులలో ఉవ్వెత్తున తీవ్రత కనిపించింది. "మనదగ్గర ఏదో కొంచెం డబ్బు ఉంది కదా అని ఎలాగయినా మాట్లాడవచ్చు అనుకోకూడదు. నీకు తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారి అర్హతలేమిటో తెలుసా? అతని చరణ ధూళికి సరితూగవు నీవు. ఆయనను అలా ఎలా అనగలిగావు నీవు. నిన్న ఏమి జరిగిందో నాకు ఇప్పుడు అర్ధమయింది. ఆయనలా కళ్ళు మూసుకు కూర్చున్నప్పుడు నీవు దగ్గరకు వెళ్ళి, “తీసుకున్న డబ్బుకు గట్టిగా వళ్ళు దాచుకోకుండా పారాయణం చెయ్యకుండా నోరు మూసుకుని కూరుచుంటే ఎలా?” అని అన్నావా లేదా చెప్పు" అన్నారు తీక్షణంగా! ప్రదేశమంతా చీమ చిటుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దంగా అయిపోయింది…భక్తులందరూ నిశ్చేష్టులయి పోయారు. క్షణంవరకు సాధారణంగా మాట్లాడుతున్న మిరాశీదారు గడగడ వణికి కాళ్ళబలం చాలక మోకాళ్ళమీద ముందుకు పడి బలవంతంగా లేచి నుంచున్నాడు. కన్నులనుండి నీరు జలజల స్రవిస్తుండగా నోటీమీద చేయి అడ్డు పెట్టుకుని, "నాది తప్పే! స్వామీ!దయచేసి క్షమించండి. ఘనపాఠి గారితో సరిగ్గా ఇప్పుడు మీరు చెప్పిన మాట్లే అన్నాను. క్షమించండి స్వామీ! క్షమించండి" అంటూ ప్రాధేయపడ్డాడు…."ఆగు! అంతటితో ఆపలేదు. ఇంకాఉంది. నువ్వు పండితులందరికి దక్షిణఇచ్చావా? ఎంత ఇచ్చావు?" అన్నారు. "ఒక్కక్కరికీ 10 రూపాయలు ఇచ్చాను""నాకంతా తెలుసు. మళ్ళీ చెప్పు. అందరికీ 10 రూపాయల చొప్పున ఇచ్చావా?" రెట్టించారు స్వామివారు. మిరాశీదారు మౌనంగాఉన్నాడు. స్వామి వదిలేటట్లు లేరు. "చెప్పడానికే సిగ్గువేస్తుందికదూ! నే చెబుతాను ఏమి జరిగిందో! మిగతా పండితులందరికీ నీవు 10 రూపాయలు చొప్పున ఇచ్చావు. వేంకటేశఘనపాఠి గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన సరిగా జపం చేయలేదని 7 రూపాయలకు తగ్గించావు. చేసిన దానికి తగినంత ఇచ్చానని నిన్ను నువ్వు మెచ్చుకుని ఆయనను కించ పరచినందుకు సంతోషించావు. ఆయన ఈషణ్మాత్రం ఈ విషయాన్ని సరుకు చెయ్యలేదు. నిన్ను చూచి ఒక చిరునవ్వు నవ్వి ఇచ్చినది తీసుకున్నారు. చెప్పు ఇది నిజమేనా?" అన్నారు. ఈ విషయమంతా స్వామి వారికి ఎలా తెలుసని భక్తులు ఆశ్చర్య పోయారు…[ఒక ఉపన్యాసంలో రాజగోపాల ఘనపాఠి అనే మహా పండితులు చెప్పారు. రామనామం జరిగేచోటల్లా హనుమంతుడున్నట్లు, వేద పారాయణంజరిగే చోటంతా మహాస్వామి వారు ఉంటారట. వారి …గురువుగారు ఎక్కడైనా పారయణాలలో శిష్యులు బాల చేష్టలు చేస్తుంటే "జాగ్రత్త! సరిగ్గాపారాయణ చెయ్యి. మహాస్వామి వారున్నారు".అనేవారట. మరుసటిరోజు వీరు పెద్ద స్వాములవారిని దర్శనంచేస్తే జరిగినదంతా సినిమాలో చూచినట్లు చెప్పేవారట మహాస్వామి.మిరాశీదారు నిర్ఘాంతపోయాడు. నోట మాటరాలేదు. తేరుకొని తాను తప్పు చేశానని, మరల ఇటువంటితప్పిదం చేయనని మరల మరల వేడుకుంటున్నాడు. కన్నీరుమున్నీరుగా అవుతున్నాడు.స్వామివారు అక్కడితో ఆపలేదు. మరి వారి మనసు ఎంత క్షోభపడిందో? "ఆగు అక్కడితో ఆగితే బాగానే ఉండేది. ఆరోజు బ్రాహ్మణులందరికి రామచంద్ర అయ్యర్ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశావుకదూ! అందరికి నీవే స్వయంగా వడ్డించావు. చక్రపొంగలి అమృతంలా ఉన్నది. మంచి నెయ్యి ఓడుతూ ఉంది. ఆనేతిలో ఎన్నో జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు తేలుతున్నాయి. ఆ చక్రపొంగలి నీవే స్వయంగా వడ్డించావు కదూ!" అన్నారు స్వామివారు…తానుచేసిన ఒక మంచిపని శ్రీవారు గుర్తించినట్లుగా మిరాశీదారు, "అవును స్వామీ! నేనే స్వయంగా వడ్డించాను". అన్నాడు."వడ్డించే టప్పుడు పంక్తి మర్యాదను పాటించావా?" అని ప్రశ్నించారు స్వామి….మిరాశీదారునుంచి సమాధానం లేదు…"సరే నేను చెప్తాను. చక్రపొంగలి రుచిగా ఉండడంతో పండితులు మరలమరల మారువడ్డనకై అడిగారు. నీవుకూడా ఆనందంతో వడ్డించావు. కాని వేంకటేశఘనపాఠి మారు అడిగితే, ఒకసారి కాదు అనేకసార్లు, నీవు విననట్లే నటించావు. చాలాసార్లు అడిగారాయన. ఒక్కసారి కూడా నీవు స్పందించలేదు. ఇది పంక్తి మర్యాదా? ఇది ధర్మమా? ఎంత ఘోరంగా అవమానించావు". మహాస్వామివారి మాటలు బాధతో తొట్రుపడుతున్నాయి. ఎంతో విచారంగా కన్పిస్తున్నారు…మిరాశీదారు సిగ్గుతో చితికిపోతూ నిలుచున్నాడు…మహస్వామివారు దండం పట్టుకొని మాలధారి అయిన పరమేశ్వరిని వలె సర్దుకొని నిటారుగా కూర్చున్నారు. మళ్ళీ కొంతసేపు మౌనంగా ధ్యానముద్రలో కనులు మూసికొని ఉద్విగ్నతను అదుపు చేసుకుంటూ .కూర్చున్నారు…కనులుతెరచి సూటిగా చూస్తూ "మిరాశీదారుగారూ! ఒక విషయం అర్ధం చేసుకోండి. తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారికి 81 ఏళ్ళు. వారు తన పదహారేళ్ళ ప్రాయంనుండి అనేక శివాలయాలలో రుద్రజపం చేశారు. శ్రీరుద్రం వారి నరనరములలో, వారి నెత్తురులోనూ, వారి ఊపిరిలోనూ వ్యాపించింది. వారు మహాపురుషులు. వారి యెడ నీవు ప్రవర్తించిన తీరు పూర్తిగా పాపభూయిష్టం. పాపం తప్ప మరొకటికాదు." మహాస్వామి వారు ఇక మాటలాడలేక పోయారు. కొంచెంసేపు ఆగి మరలా కొనసాగించారు…."నీవు చేసిన అవమానం ఆయనను కలవరపరచింది. లోతుగా బాధించింది. నీకు తెలుసా? ఆ తరువాత ఆయన ఇంటికి పోలేదు. నిన్న సాయంత్రం ఆయన నేరుగా మహాలింగస్వామి గుడికిపోయారు. మూడు ప్రదక్షిణలు చేసి స్వామి ఎదురుగా నుంచొని ఏమి ప్రార్ధించారో తెలుసా?" మహాస్వామివారికి మాట్లాడటం కష్టమయిపోతుంది. కొంతసేపయినతరువాత కొనసాగించారు."కన్నీరు బుగ్గలమీదుగా జలజల కారుతుండగా తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి, స్వామికి చేతులెత్తి నమస్కరించి, "అయ్యా! జ్యోతి మహాలింగమా! నేను నీకెంత భక్తుడినో నీకు తెలుసు. నీ సన్నిధిలో నా చిన్నతనం నుండి నే చేసిన రుద్రజపములు నీవు అనేక పర్యాయములు అవధరించావు. ఇప్పుడు నావయసు 81. హృదయం చాలా గట్టిగానే ఉన్నది. కానీ వార్ధక్యం తగ్గిపోయింది. ఇవ్వాళ భోజన సమయంలో ఏమి జరిగిందో చూశవు కదా! ఆ చక్రపొంగలి ..... ఎంతో రుచిగావుంది. నా సిగ్గును ప్రక్కనుంచి, మరికొంచెం వడ్డించమని అర్ధిస్తున్నాను. ఒకసారికాదు....అనేకసార్లు. మిరాశీదారు విననట్లు నటించి వెళ్ళిపోయాడు. నీకు తెలుసు కదా? నాకు చక్రపొంగలి అంటే ఎంతో ఇష్టం. నేను అర్ధించినా అతడు వడ్డించక పోవడంవలన నేనెంతో బాధపడ్డాను. కానీ స్వామీ! తరువాత నాకీ విధమైన చాపల్యం - అదీ ఒక వంటకంపై ఉండరాదని గుర్తించాను. అందుకే ఇప్పుడు నీ ముందు నుంచున్నాను. కాశీ వెళితే ఇష్టమైన పండు, కూర వదిలిపెడతారని చెబుతారు. నీవు కాశీలో ఉండే మహాలింగానివే! అందుకే నీ ముందు వాగ్దానంచేస్తున్నాను. ఈ నిమిషం నుండి నా శరీరంలొ జీవం ఉండేదాకా చక్రపొంగలే కాదు ఏ మధుర పదార్ధమూ ముట్టుకోను. ఇది నా వాగ్దానము. స్వామీ! ఇక సెలవు." అంటూ కన్నీటితో ఆ ఘనపాఠి నిన్న రాత్రి తన గ్రామం చేరారు. ఇప్పుడు చెప్పండి అయ్యర్ గారూ! నీవు చేసినది మహాపాపం కాదా"? మహాలింగ స్వామి నీ చేష్టితాలను ఒప్పుకుంటారా?"..మహాస్వామివారు మౌనం వహించారు. మూడు గంటలయింది. పరిచారకులు భిక్షకై రావలసినదని ప్రార్ధిస్తున్నారు. ఎవరు ఆ ప్రదేశం వదలి కదలటంలేదు. ప్రతివారి కనులనిండా నీరు.మిరాశీదారు మహాస్వామి పాదముల ఎదుట ఆపుకోలేనంతగా విలపిస్తున్నాడు. మాటలు రావటంలేదు. అయినా ప్రయత్నంమీద "స్వామీ! నా ప్రవర్తనకు సిగ్గు పడుతున్నాను. నేను పెద్ద తప్పు చేశాను. క్షమించానని చెప్పండి. మళ్ళీ ఇటువంటి అపరాధం చేయను స్వామీ! క్షమించండి. మహాలింగస్వామి ప్రసాదంతీసుకోండి. నన్ను క్షమించండి." అంటున్నాడు. స్వామివారు ప్రసాదం ముట్టుకోలేదు…."కొంచెం ఆగు. నాకు మహాలింగస్వామియే అనుగ్రహంతో ప్రసాదం పంపుతాడు". న్నారు.అంతలో రుద్రాక్షలు ధరించిన 65ఏళ్ళ పండితుడు చేతిలో వెదురుతట్టలో ప్రసాదాలు పుచ్చుకొని వచ్చాడు. "స్వామీ! నా పేరు మహాలింగం. నేను తిరువిడైమరుదూరు అర్చకుడను. నిన్న మహాలింగస్వామికి రుద్రాభిషేకం జరిగింది. ఆ ప్రసాదాలు పరమాచార్య స్వామి వారికి సమర్పించి ఆశీస్సులు తీసుకొని వెళదామని వచ్చాను". అన్నారు. ఆయన నమస్కరించబోతుండగా స్వామివారు "శివదీక్ష పుచ్చుకొన్న వారు ఇతరులకు మస్కరించరాదు" అంటూ వారించి, ప్రసాదం ఎంతోభక్తితో గ్రహించి, ఆ పండితునకు బదులు మర్యాద చేసి పంపారు. ఆయన వెళుతు ఈ మిరాశీదారును చూచి, "ఈయనే నిన్న రుద్రాభిషేకం జరిపించింది" అని చెప్పి వెళ్ళిపోయాడు…మిరాశీదాదు ఈ పాపమునకు పరిహారమేమిటని మహా స్వామి వారిముందు మళ్ళీమళ్ళీ ప్రాధేయపడినాడు…మహాస్వామివారు లేస్తూ, "ప్రాయశ్చిత్తం నేను చెప్పలేను. తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి మాత్రమే చెప్పగలరు" అన్నారు."ఇంత జరిగిన తరువాత ఆయన ప్రాయశ్చిత్తం చెబుతాడా" అన్నాడు మిరాశీదారు…"నీకుప్రాప్తముంటే ఆయన చెబుతాడు" అంటూ తనగదిలోనికి వెళ్ళిపోయారు స్వామివారు. రాత్రిదాకా స్వామివారు బయటకు రాలేదు…

మిరాశీదారు నేరుగా తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి పాదములు పట్టుకొని ప్రాయశ్చిత్తానికై ప్రార్ధించడానికి నిశ్చయించు కొన్నాడు. అక్కడకు చేరేసరికి తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి ఇంటిముందు జనం గుమికూడి ఉన్నారు. ఘనపాఠి గారు ఆ తెల్లవారుఝామునే శివసాయుజ్యమొందారు. స్వామివారు "నీకుప్రాప్తముంటే" అన్న మాటలకర్ధం మిరాశీదారుకు ఇప్పుడు అర్ధమయింది. తాను మహాపాపిననుకొంటూ ఘనపాఠి గారి పార్ధివదేహానికి నమస్కరించి ఇంటికిపోయాడు. వేదపండితులకు మనమీయవలసిన మర్యాద ఎటువంటిదో మహాస్వామివారు అనేక సందర్భాలలో ఈ విధంగా తెలియచేశారు…ఇట్టి మహాపరాధం చేసిన, తనను ఆశ్రయించిన మిరాశీదారును పరమ కరుణామూర్తి ఐన స్వామివారు వదిలివేయలేదు. ఆయన శ్రీవారి ఆదేశం మేరకు ప్రాయశ్చిత్తంగా కాశీవాసం చేసి కాశీలో ముక్తి పొందారు.

జీవితంలొ ఎవ్వరిని తక్కువగా చూదకండి…….!

కామెంట్‌లు లేవు: