3, జూన్ 2023, శనివారం

సీతారాములకళ్యాణము

 *సీతారాములకళ్యాణము* (1/4)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము బాలకాండము నుండి….


తెల్లవారిన పిమ్మట జనకమహారాజు ప్రభాతసమయమున చేయవలసిన కార్యములన్నియు నిర్వర్తించి రామలక్ష్మణసమేతుడైన విశ్వామిత్రుని పిలిపించెను. 


జనకుడు విశ్వామిత్రుని, రామలక్ష శ్రణులను యధావిధిగా గౌరవించి విశ్వామిక్రునితో, “పూజ్యుదా! నీకు స్వాగతమగుగాక! నేను నీకేమి చేయుదును? ఆజ్ఞాపింపుము. నేను నీచే ఆజ్ఞాపింపదగినవాడను.” అని పలికెను.

జనకుని మాటలు విని, విశ్వామిత్రుడు, “దశరథుని పుత్రులు, క్షత్రియులు, లోకప్రసిద్దులు అయిన ఈ రామలక్ష్మణులు నీవద్ద నున్న (శ్రేష్టమైన ధనుస్సును చూడదలచుచున్నారు.. ఆ ధనుస్సును చూపుము. నీకు భద్రమగుగాక! ఈ రాజకుమారులు దానిని చూచి, కోరిక తీరగా వారి ఇష్టము ప్రకారము తిరిగి వెళ్లిదరు.” అని చెప్పెను.


*శివధనువృత్తాంతము*

విశ్వామిత్రుని మాటలు విని జనకుడు ఈవిధముగ ప్రతివచనము పలికెను, “మహామునీ! ఈ ధనుస్సు ఇచట ఎందువలన ఉన్నదో ఆ వృత్తాంతమును చెప్పెదను, వినుము. ఈ ధనుస్సును మహాత్ముదైన శివుడు నిమిచక్రవర్తికి ఆరవవాదైన దేవరాతు డనెడు రాజువద్ద న్యాసముగా ఉంచెను.

పూర్వము దక్షయజ్జధ్వంసము చేయుచు వీర్యవంతుడైన రుద్రుడు ధనుస్సును వంచి, కుపితుదై దేవతలతో, “దేవతలారా! యజ్ఞభాగముల నపేక్షించుచున్న నాకు మీరు యజ్ఞభాగములను కల్పింపలేదుగాన ఈ ధనుస్సుతో మీ శిరస్సులను ఖండించెదను.' అని పలుకగా ఆ దేవతలందరును భయపడి మహేశ్వరుని అనుగ్రహింపచేసుకొనిరి. మహేశ్వరుడు దేవతలను అనుగ్రహించి ఆ ధనుస్సును వారికి ఇచ్చివేయగా దానిని దేవతలు మా పూర్వపురుషుని వద్ద న్యాసముగా ఉంచిరి. 


నేనొకప్పుడు యజ్ఞభూమిని దున్ని పరిశుద్ధము చేయుచుండగా సీత అను కన్య నాగలినుండి బయటకు వచ్చి నాకు లభించినది. భూమినుండి బయటకు వచ్చిన ఆమె నా కుమార్తెగా పెరిగినది. అయోనిజ యైన ఈమెను వివాహమాడవలెనన్నచో పరాక్రమమే శుల్కమని నేను నిశ్చయించితిని. 


మహామునీ! భూతలమునుండి ఆవిర్భవించి, నా కుమార్తెగా పెరుగుచున్న ఈమెను వివాహము చేసుకొనుటకు ఎందరో రాజులు వచ్చిరి. ఆ రాజులందరును వచ్చి కన్యనిమ్మని కోరగా, ఈమె వీర్యశుల్కయని  చెప్పి నేను వారి కీయలేదు. పిమ్మట ఆ రాజులందరును కలిసి తమ బలమెంత యున్నదో పరీక్షించుకొనగోరి మిథిలకు వచ్చిరి. తమ బలమును పరీక్షించదలచిన వారికి ధనుస్సును చూపగా దానిని పట్టుకొనుటకు గాని, కదల్చుటకుగాని వారికి సాధ్యముకాలేదు. 


ఆ రాజుల బలము అల్పమైన దని తెలిసికొని నేను వారికి సీత నీయ నిరాకరించితిని. ఈ విషయము తెలిసికొనుము. ఈవిధముగ తమ బలము విషయమున సందేహము కలుగగా రాజులందరును మిక్కిలి కోపించి మిథిలానగరమును ముట్టడించిరి. ఇది తమకు జరిగిన అవమానమని భావించి కోపముతో మిథిలాపురిని బాధించిరి. ఈవిధముగా (వారి ముట్టడిలో) సంవత్సరము గడవగా నగరములో నున్న జీవనోపకరణము లన్నియు తరిగిపోయినవి. దానితో నాకు చాల దుఃఖము కలిగెను. 


అప్పుడు నేను తపస్సుచే దేవతల నందరిని అనుగ్రహింపచేసికొనగా వారు నాకు చతురంగబలమును ఇచ్చిరి. తమ బలమును గూర్చి సందేహము గల ఆ వీర్యశూన్యులగు పాపాత్ములైన రాజులు యుద్ధమునందు పరాజితులై, సపరివారముగా దిక్కులు పట్టి పారిపోయిరి.

ఓ ముని శ్రేష్టా! మిక్కిలి ప్రకాశించు ఆ శివధనుస్సును రామలక్ష్మణులకు కూడ చూపెదను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలిగినచో, అయోనిజయగు సీతను ఈతనికి ఇచ్చెదను అని ప్రకటించెను.


*శివధనుర్భంగము*

విశ్వామిత్రమహాముని జనకుని మాటలు విని, “రామునకు ఆ ధనుస్సును చూపుము” అనెను. 

విశ్వామిత్రుని వాక్యము విని జనకమహారాజు, “గంధమాల్యాదులచే అలంకరించిన ఆ దివ్యధనుస్సును తీసికొని రండు.”అని సామంతులను ఆజ్ఞాపించెను. 

జనకుని ఆజ్జ్ఞప్రకారము మంత్రులు నగరములో ప్రవేశించి ఆ ధనుస్సును ముందిడుకొని బయలుదేరి వచ్చిరి. మంచి బలము కలవారును, దీర్ధకాయులును అగు ఏబదివందల మంది పురుషులు ఆ ధనుస్సు ఉంచిన ఎనిమిది చక్రాలున్న పెట్టెను అతికష్టముగ లాగికొనివచ్చిరి. 


జనకుని మంత్రులు ధనుస్సు ఉన్న ఆ ఇనుపపెట్టెను తీసికొనివచ్చి, దేవతాసమానుడైన ఆతనితో ఇట్లనిరి. “మిథిలాధిపతీ! నీవు రామునకు చూపదలచు చున్న సర్వరాజపూజితమును, శ్రేష్టమును అగు ధనుస్సు ఇదిగో.”

రాజు వారి వాక్యము విని చేతులు జోడించి, మహాత్ముడైన విశ్వామిత్రునితోను రామలక్ష్మణులతోను ఇట్లు పలికెను.

“విశ్వామిత్రమహామునీ! మా జనకవంశీయులును, పూర్వము దీనిని ఎక్కుపెట్టపోయి విఫలులైన మహావీర్యవంతులగు రాజులును పూజించిన శ్రేష్టమైన ధనుస్సు ఇదియే. సురగణములు కాని, అసురులుకాని, రాక్షసులుకాని, గంధర్వ-యక్ష-కిన్నర-మహోరగులు గాని దీనిని ఎక్కుపెట్టజాలకపోయిరి. ఈ ధనుస్సును వంచుటకుగాని, నారి కట్టుటకుగాని, బాణము సంధించుటకుగాని, నారిని లాగుటకుగాని, కదల్చుటకుగాని మనుష్యులకు శక్తి ఎక్కడిది? ఓ మునిశ్రేష్టా! అట్లి ఈ ధనుస్సును తీసికొని వచ్చినారు. దీనిని ఈ రాజపుత్రులకు చూపుము.” 


విశ్వామిత్రుడు జనకుని మాటలు విని, “వత్సా! రామా! ఆ ధనుస్సును చూడుము.” అని రామునితో అనెను. 

ఆ బ్రహ్మర్షి ఆదేశానుసారము రాముడు ధనుస్సు ఉన్న ఆ పెట్టెను తెరిచి, ధనుస్సును చూచి విశ్వామిత్రునితో, “బ్రహ్మర్షీ! ఇపుడీ శ్రేష్టమైన ధనుస్సును హస్తముతో స్పృశించెదను. దీనిని కదల్చుటకును, సాధ్యమైనచో ఎక్కుపెట్టటకును ప్రయత్నించెదను.” అనెను. 

జనకమహారాజును, విశ్వామిత్రుడును “అటులే చేయుము.” అని పలికిరి. 


విశ్వామిత్రుని ఆజ్జప్రకారము రాముడు అనాయాసముగా ఆ ధనుస్సును మధ్యయందు పట్టుకొనెను. ధర్మాత్ముడైన ఆ రఘునందనుడు వేలకొలది జనులు చూచుచుండగా ఆ ధనుస్సును అనాయాసముగ ఎక్కుపెట్టెను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టి నారిని ఆకర్ణాంతము లాగగా అది విరిగిపోయెను.  

ఆ ధనుస్సు విరిగినపుడు పిడుగులు

పడుచున్నప్పుడు కలిగే ధ్వనితో సమానమైన

గొప్ప ధ్వని వచ్చిను. పర్వతము

బ్రద్దలగుచున్నపుడు అదరినట్లు భూమి

అదరిను. విశ్వామిత్రుడు, జనకుడు,

రామలక్ష్మణులు తప్ప మిగిలిన జను

లందరును ఆ ధ్వనికి మూర్చితులై క్రింద

పడిరి.

అచట వారందరు యథాపూర్వస్థితికి వచ్చిన పిమ్మట మాటలలో నేర్చరియైన జనకుడు, కంగారు లేనివాడై విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.


“మహామునీ! దశరథాత్మజుడైన రాముని వీర్యమును ప్రత్యక్షముగ చూచితిని. అత్యద్భుతము, ఊహింప శక్యము కానిది అగు ఈ కార్యము ఇట్లు జరుగునని నేను అనుకొనలేదు. నా కుమార్తె సీత దశరథుని పుత్రుడైన రాముని భర్తగా పొంది మా వంశమునకు కీర్తిని తీసికొని రాగలదు. నా కుమార్తె సీతను వివాహ మాడుటకు వీర్యమే శుల్కమని నేను చేసిన ప్రతిజ్ఞ సత్యమైనది. నా ప్రాణములతో సమానురాలగు ఈమెను రామున కిచ్చి వివాహము చేసెదను.

 *సీతారాములకళ్యాణము* (2/4)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము బాలకాండము నుండి….


*దశరథునకు కబురంపుట*

నీవు ఆజ్ఞాపించినచో నా మంత్రులు రథముల నధిరోహించి శీఘ్రముగా అయోధ్యకు వెళ్లెదరు. వీర్యశుల్మయగు సీతను రామునకీయ నిర్ణయించుట మొదలగు వృత్తాంతము నంతను వారు సవినయముగ దశరథునకు తెలిపి ఆతనిని నా నగరమునకు తీసికొనివచ్చెదరుగాక! నా మంత్రులు శీఘముగ వెళ్లి, రామలక్ష్మణులు విశ్వామిత్రుని సంరక్షణలో నున్నారని దశరథునకు తెలిపి, సంతోషించిన అతనిని తీసికొనివత్తురు!”

అటులే చేయుమని విశ్వామిత్రుడు పలుకగా జనకమహారాజు మంత్రులతో సంప్రదించి, దశరథునకు జరిగిన దంతయు చెప్పి ఆతనిని తీసికొనివచ్చుటకై తన ఆజ్ఞానిర్వాహకులగు భృత్యులను అయోధ్యకు పంపెను.


జనకుడాజ్ఞాపించిన దూతలు మూడు దినములు ప్రయాణము చేసి, అలసిపోయిన గుర్రములతో అయోధ్యానగరము చేరిరి. అచట రాజభవనమునకు వెళ్లి, ద్వారపాలకులతో, “జనకమహారాజు దూతలు వచ్చినారని దశరథమహారాజుతో చెప్పుడు.” అని పలికిరి.


ద్వారపాలకులు వారి మాటలు దశరథునకు నివేదించిరి. పిమ్మట రాజాజ్ఞ ప్రకారము రాజభవనములో ప్రవేశించిన ఆ దూతలు దేవతాసద్భృశుడును, వృద్ధుడును అగు దశరథుని చూచిరి. 

ఆ దూతలందరును చేతులు జోడించి, కంగారు పడనివారై, నియమబద్భులై దశరథునితో మధురాక్షములుగల వాక్యమును పలికిరి. 

“మహారాజా! మిధిలాధిపతియైన జనకమహారాజు స్నేహపూర్ణమగు మధురమైన వాక్కుతో అగ్నిహోత్రాదినిరతుడ వగు నీయొక్కయు, నీ ఉపాధ్యాయులయొక్కయు, పురోహితులయొక్కయు, పరివారజనముయొక్కయు యోగక్షేమములను విచారించు చున్నాడు. మిథిలాధీశుడగు జనకమహారాజు శద్ధాపూర్వకముగ నిన్ను కుశలప్రశ్న చేసి, విశ్వామిత్రుని అనుమతి పొంది, నీతో ఈ మాట చెప్పుచున్నాడు. 

'నా పుత్రిక వీర్యశుల్కయని నేను పూర్వము చేసిన ప్రతిజ్ఞ ప్రసిద్ధమే కదా. (తమ బలపరాక్రమములు చూపించలేక నాపై) కోపించి వచ్చిన రాజులు నిర్వీర్యులై పరాజితులైపోయిరి. 

దశరథమహారాజా! అట్టి నా ఈ పుత్రికను విశ్వామిత్రుని వెంట దైవవశముచే మిథిలకు వచ్చిన వీరుడైన నీ కుమారుడు సంపాదించుకొన్నాడు. మహాత్ముడైన రాముడు, గొప్ప సభలో, దివ్యమైన ఆ శివధనుస్సును మధ్యకు విరచెను. వీర్యల్కయైన సీతను ఈ మహాత్మున కిచ్చినా ప్రతిజ్ఞను నెరవేర్చుకొనవలెను గావున అందులకు అనుజ్ఞ ఇమ్ము. 

దశరథమహారాజా! నీవు ఉపాధ్యాయపురోహితసహితుడవై శీఘముగ వచ్చి రామలక్ష్మణులను చూడుము. ఇచటికి వచ్చి నాకానందమును కలిగింపుము. నీకు కూడ పుత్రవివాహోత్సవాది దర్శనానందము కలుగగలదు. 

జనకమహారాజు విశ్వామిత్రుని అనుజ్ఞ పొంది, శతానందుని అనుమతితో ఈవిధముగ మధురవాక్యమును చెప్పినాడు”.


*మిథిలకు దశరథుని పయనం*

దూతలు ఈ విధముగా జనకుని సందేశమును వినిపించి రాజుపై గల గౌరవముచే అధికముగ మాటలాడ జంకి ఊరకుండిరి.

దూతవాక్యములు విన్న దశరథుడు మిక్కిలి సంతసించి వసిష్ట వామదేవులతోడను, ఇతర మంత్రులతోడను ఇట్లు పలికెను. 

“కౌసల్యానందవర్ధనుడైన మన రాముడు విశ్వామిత్రపరిరక్షితుడై, సోదరుడైన లక్ష్మణునితోగూడ ఇపుడు విదేహదేశమునం దున్నాడు. మహాత్ముడైన జనకుడు రాముని పరాక్రమమును చూచి తన కుమార్తెను ఆతని కీయగోరుచున్నాడు. జనకుని ఆచారసంపత్తి మీకు నచ్చినట్లయితే విలంబ మేమియు చేయక శీఘముగ మిథిలాపురికి వెళ్లుదము.”

మంత్రులును, మహర్షులును అందరును, “తప్పక అట్లే చేయుదము.” అని పలుకగా దశరథుడు మిక్కిలి సంతోషించి, “రేపే ప్రయాణము.” అని మంత్రులతో అనెను. 

సకలసద్దుణసంపన్ను లగు జనకుని మంత్రులు మంచి సత్క్మారముల నంది ఆ రాత్రి అయోధ్యానగరముననే ఉండిపోయిరి.


రాత్రి గడచిన పిమ్మట, బంధువులతోను, ఉపాధ్యాయులతోను కూడిన దశరథమహారాజు సంతసించి సుమంత్రునితో ఇట్లు పలికెను. 

“ధనాధ్యక్షు లందరును పుష్కలముగా ధనమును, వివిధరత్నములను గూడ గ్రహించి, బాగుగా సంసిద్ధులై ముందుగా వెళ్లైదరుగాక. నేను ఆజ్ఞాపించిన క్షణమునందే చతురంగ బల సైన్యము, శ్రేష్టమైన పల్లకీలు, రథములు మొదలగునవియు బయలుదేరుగాక!


వసిష్టుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, మార్కండే యుడు, కాత్యాయనఋషి - ఈ బ్రాహ్మణు లందరును ముందు వెళ్లెదరుగాక! నా రథమును కూర్చి శీఘ్రముగ తీసికొని రమ్ము. విలంబము చేయవలదు. జనకుని దూతలు నన్ను తొందర పెట్టుచున్నారు.”


దశరథమహారాజు బుషులతో కలిసి వెళ్లుచుండగా, ఆతని ఆజ్ఞానుసారము చతురంగబలము అతని వెనుకనే వెళ్లెను. 


*దశరథునకు స్వాగత సత్కారములు*

నాల్గు దినములు ప్రయాణము చేసి దశరథుడు విదేహదేశము చేరగా జనకమహారాజు ఆ విషయము విని, దశరథునకు ఆయా ప్రాంతములలో తగు విధముగ సత్కారముల నేర్చరచెను. పిమ్మట జనకమహారాజు వృద్ధుడైన దశరథమహారాజును కలుసుకొని చాల సంతోషించెను. 

అతనితో, “దశరథమహారాజా! నీకు స్వాగతము. నా భాగ్యవశముచే నీవు మిథిలకు వచ్చినావు. నీ ఇరువురి కుమారుల పరాక్రమముచే ప్రాప్తించిన ఆనందమును పొందగలవు. మహాతేజఃశాలియు, భగవంతుడును అగు వసిష్టమహర్షి బ్రాహ్మణోత్తములతో కలిసి, దేవతలతో కలిసి దేవేంద్రుడు వలె, నా భాగ్యవశమున ఇచటికి వచ్చినాడు. నా భాగ్యమువలన పరాక్రమముచే శ్రేష్టులును, మహాత్ములును అగు రఘువంశరాజులతో వియ్యమందితిని. నా విఘ్నము లన్నియు తొలగినవి. నా కులము పూజనీయమైనది. రాజాధిరాజా! రేపు ప్రాతఃకాలము యజ్ఞము పూర్తియెన పిమ్మట బుషిసమ్మతమైన వివాహమును నెరవేర్చుము.” అని సాదరముగా పలికెను. 


మాట నేర్పరులలో శ్రేష్టుడగు దశరథమహారాజు జనకుని వచనము విని, అచటి ఋషులందరును వినుచుందగా ఆతనితో, “జనకమహారాజా! నీవు ధర్మము తెలిసినవాడవు. ప్రతిగ్రహము అనునది దాత చేతిలో నున్నది. దాత ఇచ్చినప్పుదే కదా ప్రతిగ్రహీత స్వీకరించునది! నీ కన్యాదాననిర్ణయాదికమును విని యున్నాము. నీ వెట్లు చెప్పెదవో అట్లే చేసెదము.” అనెను.


సత్యవాదియైన దశరథుడు పలికిన ధర్మసమ్మతము, యశస్కరము అయిన వచనము విని జనకమహారాజు చాల ఆశ్చర్యపడెను. 

అచ్చటి మునీశ్వరు లందరును, పరస్పరము కలిసినందులకు చాల సంతసించినవారై, ఆ రాత్రి సుఖముగ గడిపిరి. 

దశరథమహారాజు పుత్రులైన రామలక్ష్మణులను జూచి ఆనందభరితుడై, జనకుని సత్కారములకు సంతుష్టుడై నివసించెను.


జనకమహారాజు, యజ్ఞమునకు సంబంధించిన కర్మలను, కుమార్తెల వివాహమునకు సంబంధించిన అంకురారోపణాదిక్రియలను పూర్తిచేసికొని ఆ రాత్రి గడపెను.

కామెంట్‌లు లేవు: