30, ఆగస్టు 2024, శుక్రవారం

విదురుడు

 

                  *విదురుడు*

                 ➖➖➖✍️


*మహాభారతంలో విదురుడు మహానీతిమంతుడు.*


*యమధర్మరాజు అంశలో ఆయన- వేదవ్యాసుడికి, కుఱురాజు అంతఃపురంలోని ‘పరిశ్రమి’ అనే దాసికి జన్మించాడు.*


*భారతంలో కుఱువంశీయుల జన్మ వివరాలు వింతగా అగుపిస్తాయి.* 


*విదురుడు ధృతరాష్ట్రుడికి సవతి తమ్ముడు. ఇతడికి కుఱు వంశ పితామహుడైన ‘దేవవ్రతుడు’ (భీష్ముడు) విద్యాబుద్ధులు నేర్పించాడు.*


*పాండవులకు కౌరవులు చేసిన అన్యాయాలకు విదురుడు ప్రత్యక్షసాక్షి. అన్యాయం సహించని నైజం ఆయనది. ఎవరితోనూ శత్రుత్వం ఉండరాదన్నది ఆయన నీతి.*


*వైరం లేకుండా జీవించడం ఒక సాధన. విదురుడికి, అక్రూరుడికి, ధర్మరాజుకు శత్రువులే లేరు.*


*విదురుడు సుయోధనుడి దుష్టత్వాన్ని సహిస్తూనే మిత్రుడిగా జీవించాడు. శిష్టుడైన శ్రీకృష్ణుడితోనూ అంతే స్నేహం ప్రదర్శించాడు.*


*పాండవ పక్షపాతి అని భావించిన కౌరవులు సైతం విదురుణ్ని భక్తిపూర్వకంగా ‘విదుర దేవా!’ అని సంబోధించేవారు.*


*ఆయన మహావీరుడు. యుద్ధవిద్యలన్నీ తెలుసు. మహారథి అయినా భారతయుద్ధంలో ఎవరి పక్షమూ వహించలేదు.*


*ధృతరాష్ట్రుడు ఆయన పట్ల అసహనం ప్రదర్శించేవాడు. కొన్నిసార్లు అది క్రోధంగా మారేది. విదురుడు మాత్రం ధృతరాష్ట్రుడితో, ఆయన నూరుగురు కొడుకులతో స్నేహంగానే మెలిగేవాడు. ఎప్పుడూ ధర్మాన్నే అనుసరించాడు.*


*తామరాకుపై నీటిబొట్టులా ఉండేవాడు. ఎవరి మనసునూ నొప్పించేవాడు కాదు.*

*జీవిస్తే విదురుడిలా, తనువు చాలిస్తే సరయూ నది నుంచి నేరుగా వైకుంఠం చేరిన శ్రీరాముడిలా ఉండాలన్నది అక్రూరుడి మాట.*


*బలవంతులతో విరోధం మంచిది కాదని విదురుడు చాలాసార్లు దుర్యోధనుడికి హితవు పలికాడు.*


*ఆయన మంచిని తాను సాధన చేసి ఇతరులకు చెప్పిన మాన్యుడు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణులు మనిషిలోని తాపత్రయాలకు గుర్తులని పలు మార్లు ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు.*


*శకుని వల్ల మాయాజూదంలో ఓడిన ధర్మరాజుకు- ‘సాత్విక స్వభావం, నిశ్చల ధర్మస్థితి గల పురుషుడు ఎన్నడూ వంచితుడు కా’డంటూ నిష్ఠుర సత్యాలు బోధించాడు.*


*కష్టాల్లో ధైర్యంగా ఉన్న వ్యక్తినే విజయం వరిస్తుందని విదురుడు చెప్పిన మాటలు- ధర్మరాజుకు సాంత్వన కలిగించాయి.*


*ఆదరిస్తే ఆనందం, అనాదరణకు గురైతే కోపం పొందేవారు ఏమీ సాధించలేరు. అవమానాలను వ్యక్తం చేయకుండా, ఆ స్థితినే విజయానికి మెట్టుగా భావించడం ద్వారా శత్రువును జయించాలన్నది విదుర బోధ.*


*శకునికి ఈ విషయాన్ని ఆయనే రహస్యంగా బోధించాడని రాజాజీ ‘మహాభారతం’ వెల్లడిస్తోంది.*


*తీవ్రమైన మనోరథం కలిగినవారు మూర్ఖులేనని ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ సందర్భంలో విదురుడు దుశ్శాసనుడికి చెబుతాడు.* 


*దుశ్శాసనుడు మూర్ఖత్వం చూపించి, దుర్యోధనుడి ఆజ్ఞలను అనాలోచితంగా పాటించి పతనమయ్యాడు.*

*శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లినప్పుడు, విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన మాటలు అమూల్యమైనవి.*


*‘మహావీరుడి ధనుస్సు నుంచి వెలువడిన బాణం ఎప్పుడైనా గురి తప్పడం వల్ల శత్రువును బాధించకపోవచ్చు... కానీ, మహానుభావుడి పలుకులు గురి తప్పవు.*


*జీవరాశులన్నింటితో పాటు భూమినీ అవి నాశనం చేయగలవు’ అన్నది ఆయన హితోక్తి. నూరుగురు కౌరవుల దురాగతాలను ధర్మరాజు క్షమించాడు. ఆ వ్యక్తిత్వాన్నే విదురుడు ఉదాహరిస్తూ- ‘సుయోధనా! క్షమను అసమర్థతగా భావించకూడదు.*


 *క్షమించడం కంటే బలమైన అస్త్రం లేదు. సమర్థుడి క్షమ- సమయం ఆసన్నమైనప్పుడు భూమిని సైతం నశింపజేయగల శక్తిగా పరిణమిస్తుంది. ధర్మరాజుతో కయ్యం, సర్పంతో నెయ్యం ప్రమాదకరం’ అని హెచ్చరించాడు.*


*కుటుంబంలో ఎవరూ లేని వ్యక్తిని, విపత్తుల్లో పడిన స్నేహితుణ్ని, దారిద్య్రం వల్ల ఆకలితో అలమటిస్తున్న శత్రువును, సంతానం లేని సోదరిని అక్కున చేర్చుకొని ఆశ్రయమివ్వాలని విదురుడు చెప్పేవాడు. ఆయన నీతిసూత్రాలు ఎవరికైనా ఆచరణీయాలే..!!*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖


.🙏

కామెంట్‌లు లేవు: