6, అక్టోబర్ 2024, ఆదివారం

హైందవం వర్ధిల్లాలి 22*

 *హైందవం వర్ధిల్లాలి 22*




*ధర్మ ప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాదిపతులు, హిందూ నాయకులు హైందవ జాగృతికై ప్రజలలోకి రావాలి* iii):-  

*వచనం* అంటే మాట. మామూలు మాటలు కాకుండా ఉన్నతమైన, ఉదాత్తమైన, ఉపయోగకరమైన, సంస్కారాలు, సద్భావనలు ప్రేరేపించేలా, ప్రజలకు ఆసక్తి కలిగించే విధానంలో "దృష్టాంతాల"తో సప్రమాణంగా బోధించడం, తెలియజేయడమే *ప్రవచనం*. *మంచి చెప్పడం ఒక ధర్మమే గాకుండా సామాజిక బాధ్యత గూడా*. మానవ జీవితాన్ని ఉన్నంతంగా తీర్చిదిద్ది,  సమాజంలో చక్కని సంస్కారాలు పెంపొందేలా కృషి చేయడం విజ్ఞుల  కర్తవ్యం. *అలాగే  అన్ని ప్రజా వర్గాల  శ్రేయస్సు, భద్రత కొరకు పాలన సాగించడం పాలకుల విధి, బాధ్యత అయివుండాలి*. ఇందులో హెచ్చు తగ్గులు కూడదు. 


పూర్వం ధర్మ ప్రవక్తలు, సంస్కర్తలు స్వచ్ఛందంగా ప్రజల మధ్యకు వెళ్లి శ్రేష్ఠమైన, సర్వోత్తమమైన బోధనలు చేసేవారు. ఈ యాంత్రిక మరియు అధునాతన కాలంలో ప్రసార మాధ్యమాల (పత్రికలు, రేడియో, Tv) ద్వారా మాత్రమే గాకుండా పట్టణాలలో, నగరాలలో, దేశ మరియు విదేశ వేదికల ద్వారా  ధర్మ పెద్దలు, ప్రవచనకారులు ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు పాటించుటకు దిశా నిర్దేశం చేస్తున్నారు. *అవుతే* ఆలకించిన వారిలో *చిత్త శుద్ధితో, నిజాయితీగా, మనః పూర్వకంగా ఆచరించే వారెందరో*. 


ప్రజలకు ధర్మం మరియు సంస్కృతి, సంప్రదాయాల అనుసరణలో 

 *నైతిక దిక్సూచిని* అందించవలసిన బాధ్యత సమాజ పెద్దలది. *పెద్దలు అంటే ఎవరో కాదు మనమే జ్ఞాన వృద్దులు, వయోవృద్ధులు అనుభవశీలురు*. కాలానుగుణంగా  మనను  మనం *భద్రత వైపు* సరిదిద్దుకోవడానికి,  మన జీవన విధానంలో, వృత్తి మరియు ప్రవృత్తులలో, ఆలోచనలలో , ఆచరణలలో పాటించవలసిన ఎన్నో. *ముఖ్యమైన అలవాట్లు. సమాజంలో జీవిస్తూ సమాజంతో సంబంధం లేనట్లు  నిర్లిప్తంగా ఉండడం సరికాదు. సమాజ మంచి చెడుల బాధ్యత గూడా ప్రతి ఒక్కరిది*. సమాజ నిర్లక్ష్య ధోరణి వలన *అవకాశవాదుల స్వార్థపూరిత కార్యాలను ప్రోత్సహించినట్లు, అనుమతించినట్లు  అవుతుంది*. ప్రజలు తమ సామర్థ్యం మేరకు  సమాజంలో తమ పాత్ర మేరకు న్యాయం చేస్తూ , పరిస్థితులను ఎప్పటికప్పుడు అవకాశ వాదులను ఎదిరించి ప్రశ్నించి చట్ట విరుద్ధం అయిన కార్యకలాపాలను గమనిస్తూ ఉండడం మనందరి ధర్మము మరియు బాధ్యత. *ఇందువలన ఎన్నో అధర్మ, అనైతిక కార్యక్రమాలకు పురిటిలోనే సంధి(అడ్డు )చెప్పినట్లవుతుంది*. ఇది కూడా సమాజ హితమే. 


హిందూ ధర్మం, సంస్కృతి సంప్రదాయాల పట్ల ప్రస్తుత  *అధిక శాతం ప్రజల ఉదాసీనత గమనించిన* పెద్దలు నిస్పృహ చెందుతున్నారు. ఎంతసేపు ఈ హిందూ ప్రజలు తాము, తమ కుటుంబాల, బంధు మిత్రుల సరదాలకు, సంతోషాలకే పరిమితమవుతున్నారు. ధర్మంపై, హిందూ పండుగల ఊరేగింపులపై అన్యుల దాడి జరిగినప్పుడు అట్టి హింసను అరికట్టు ప్రతిఘటనకు పూనుకోరు. *మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కనీసము తమ బాధ్యతగా ఓటు వేయడానికి గూడా బద్దకించే ఈ ప్రజలకు ఎవరు చెప్పాలి, ఎన్ని రోజులు చెబుతూ పోవాలి*.  ఈ విశయమై  సదరు బాధ్యతారాహిత్య ప్రజలు సమాధానం చెప్పాలి


*తన కోసం తాను బ్రతికేవాడు, తాను జీవించినంత కాలమే బ్రతికి ఉంటాడు. పదుగురి కోసం (సమాజం కోసం) బ్రతికేవాడు పదికాలాల పాటు బ్రతికి ఉంటాడు*. మనను  చూసి తల్లి, తండ్రి సంతోషించాలి, పెద్దలు ఆనందించాలి,   తోబుట్టువులు ప్రశంసించాలి, కుటుంబం గర్వపడాలి, సమాజం గౌరవ నీరాజనాలు పలకాలి, దేశం కీర్తించాలి, *అదే మానవ జీవిత సార్థకత*. 


*శ్లో! శరీర నిరపేక్షస్య, దక్షస్య వ్యవసాయనః, బుద్ధి ప్రారబ్ధకార్యస్య, నాస్తి కిఞ్చన దుష్కరం*.

 అర్థం:- దృఢమైన, ఆరోగ్యవంతమైన శరీరంతో ఎల్లప్పుడు శ్రమిస్తూ, తెలివి తేటలతో, దక్షతతో పనిచేసే వ్యక్తికి ఏది కష్టం కాదు. అతను ఏ పనైనా చేపట్టి చక్కగా సాధించగలడు. ఆటంకాలు వచ్చినా  ధైర్యంగా ఎదురొడ్డి నిలబడగలడు *కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులుూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*. 


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: