22, ఏప్రిల్ 2023, శనివారం

వైశాఖ పురాణం: 2 వ అధ్యాయం.

 వైశాఖ పురాణం: 2 వ అధ్యాయం.


🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


               వైశాఖమాసమున చేయవలసిన

               వివిధ దానములు వాని ఫలితములు


నారద మహర్షి అంబరీష మహారాజు తో మరల ఇట్లనెను అంబరీష మహారాజా వినుము విష్ణు ప్రీతికరమగుటచే మాధవమాసముని వైశాఖమునందురు. వైశాఖ మాసము తో సమానమైన మాసము లేదు. కృత యుగమంతటి ఉత్తమ యుగము లేదు. జల దానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖము తో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు.


నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి,వ్యవసాయము తో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.


శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు  ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మల నందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువాని ఎన్ని ధర్మకార్యములను చేసినను - వైశాఖమాస వ్రతమును పాటింపనిచో - యివి అన్నియు వ్యర్ధములగుచున్నవి వైశాఖ వ్రతమును పాటించడానికి మాధవార్పితముల గావించి భక్షించే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుజ్యము కలుగును. అధిక ధనవ్యయముచే చేయగల వ్రతములెన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు ఎన్నో ఉన్నవి ఆ వ్రతములెన్నియో ఉన్నవి.ఆ వ్రతములన్నియు - తాత్కాలిక ప్రయోజనములు కలిగించును అంతేకాదు పునర్జన్మను కలిగించును. అనగా ముక్తినీయవు. కనుక నియమపూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము - పునర్జన్మను పోగొట్టును , అనగా ముక్తిని ఇచ్చును.


అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము సర్వతీర్థములందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున - జలదానము చేసినంతనే వచ్చును. జల దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి మరియొకనికి ప్రభోదించిన అట్టివానికి సర్వ సంపదలు కలుగును. హితములును చేకూరును. దానములన్నిటిని ఒకవైపునకు - జల దానమును మరొకవైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును.


బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జల దానము చేసినచో వాని కులము లోని వారందరూ పుణ్యలోకములు నందుదురు జలదానము చేసిన వారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము ఏర్పరుచుటచే బాటసారులు ,సర్వ దేవతలు ,పితృదేవతలు ,అందరును సంతృప్తులు ప్రీతి నంది వరములు ఇవ్వును. ఇది నిస్సంశయముగ సత్యము సుమా.దప్పిక గలవాడు నీటిని కోరును. ఎండ బాధ పడిన వాడు నీడను కోరును. చెమట పట్టినవాడు -  విసరుకొనుటకు - విసనకర్రను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును గొడుగులు విసనకర్రలు దానమియ్యవలెను నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై జన్మించును. (చాతకమను పక్షి - భూస్పర్శకల నీటిని త్రాగినా  చనిపోవును కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను - క్రింద పడకుండా - ఆకాశముననే త్రాగి ఉండును . ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు.


దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్య ఫలము కలుగును. ఎండకు అలసిన వానికి / బ్రాహ్మణునకు విసనకర్రతో విసరి ఆదరించినవాడు పక్షరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలము ఈయనివారు -  బహువిధములైన  వాతరోగములంది పీడితులు అగుదురు.ఎండకు అలసిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో - పై బట్ట (ఉత్తరీయము వగైరా) తో విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నొందును .పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నొందును.అలసటను వెంటనే పోగొట్టున్నట్టి విసనకర్రను ఈయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.


గొడుగును దానము చేసినచో - ఆధిభౌతిక ,ఆధిదైవిక, ఆధిఆత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయనివాడు నిలువ నీడలేని వాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను (చెప్పులను) దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. మరియు ఇహలోకమున బాధలను పొందడు. సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి ,చెప్పులు లేవని అడిగినవారికి - చెప్పులను దానం చేసిన వాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు -బాటసారులకు ఉపయోగించినట్లుగా - అలసట తీరునట్లుగా మండపము మున్నగునవి నిర్మించినవాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలరు.

కామెంట్‌లు లేవు: