28, జనవరి 2021, గురువారం

రామాయణమ్ 192/193

 రామాయణమ్ 192/193

..

రామచంద్రుడు ఇంకా హనుమయొక్క సంభాషణా చాతుర్యము గురించి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు.

.

నూనం వ్యాకరణకృత్స్నమనేన బహుధా శ్రుతమ్

బహు వ్యాహరతానేన న కించిత్ అపశబ్దితమ్....అనగా

.

నిశ్చయముగా ఈతడు వ్యాకరణమును అనేక పర్యాయములు విని ఉన్నాడు . అందుచేత ఇన్ని సార్లు మాట్లాడినా ఒక్క అపశబ్దముకూడా ఇతనిచేత ఉచ్చరించబడలేదు .

.

ఇక్కడ బహుధా అనగా...... అనేక పర్యాయములు అనే పదం మహర్షి వాడారు.

.

న ముఖే నేత్రయోశ్చాపి లలాటే చ భ్రువోస్తథా

అన్వేష్వపి చ సర్వేషు దోషః సంవిదితః క్వచిత్.

.

ముఖమునందుగానీ 

నేత్రములయందు 

కానీ లలాటమునందు కనుబొమ్మలయందుగానీ ,

మరి ఏ ఇతర అవయవములయందుగానీ 

ఏ మాత్రము దోషము కనపడలేదు.

.

అవిస్తరమసందిగ్ధమవిలమ్బితమవ్యథమ్

ఉరఃస్థం కణ్ఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరమ్.

.

ఉచ్ఛారణలో సాగతీతలేదు ,

సందేహమునకు తావు లేదు,

ఆగి ఆగి మాట్లాడడము లేదు ,

వినేవారికి వ్యథలేదు

 బిగ్గరగా గానీ మందముగా గానీ లేక మధ్యమస్వరములో వినటానికి ఇంపుగా హాయిగా ఉన్నది.

.

NB


అదీ మాట్లాడడము అంటే .

"సాగతీత "అంటే ఏమిటో నిత్యంFM రేడియో వినే వారికి తెలుస్తుంది .

ఇక "అపశబ్దాలు" 24 గంటల News Channels వినేవారికి సుపరిచితమే.

ఆగి ఆగి మాట్లాడటము బిగ్గరగా మాట్లాడటము మన TV ఇంటర్వ్యూలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి....ఇవ్వన్నీ అవలక్షణాలు ..

.

మాట ఎలా ఉండాలి ? అదుగో పైన స్వామి మాట్లాడిన విధంగా ఉండాలి .

ఇంకా ;...

.

అవయవాలలో ఏ విధమైన వికారాలూ మాట్లాడేటప్పుడు ఉండరాదు.

.

గీతీ దీర్ఘ

శిరఃకంపీ

తధాలిఖితపాఠకః

అనర్ధజ్ఞోల్ప కంఠశ్చ

షడేతే పాఠకాధమాః

.

సాగతీస్తున్నట్గుగా ఉండరాదు ,

తల మెడ భుజాలు విసురుతూ మాట్లాడరాదు. 

ఇక వ్రాసుకొచ్చిన కాగితాలు చూస్తూ మాట్లాడరాదు 

,అర్ధము మారిపోయే విధముగా ఉండరాదు ,

కీచుకంఠము పనికి రాదు 

ఈ ఆరూ దోషాలు అని మన పెద్దలుచెప్పారు.

.

ప్రకృతి,ప్రత్యయ,సమాస,సంధి....వీటన్నింటిగురించి బాగా చదివి ఉన్నాడు ఆయన.

.

ఒక్కసారి ముక్కున పట్టుకొని పరీక్ష పేపర్లో వ్రాసి మార్కులు తెచ్చుకొని ,ఆ తరువాత పెళ్ళి శుభలేఖలలో ,visiting cards లో పెట్టుకోవడానికి తప్ప చదివినది ఏ మాత్రమూ గుర్తుండని చదువు మనది .

.

ఈ విశేషాలు ఇంకా వున్నాయి.

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: