28, జనవరి 2021, గురువారం

రామాయణమ్ 198

 రామాయణమ్ 198

............................................................................................

రామా మేమందరమూ ఒకరోజు పర్వతముపై కూర్చొని ఉండగా ఒక స్త్రీ తన ఉత్తరీయమును ,శ్రేష్టమైన అలంకారములను జారవిడిచినది . ఆ స్త్రీ ఆ రాక్షసుని ఒడిలో ఆడుపాము వలే దోర్లుచూ మిక్కిలి బాధతో రోదించుచూ మాకు కనపడినది .

.

ఆమె జారవిడిచిన నగలన్నిటినీ మేము భద్రపరచితిమి  ,నేను వాటిని తీసుకొని వచ్చెదను నీవు గుర్తింపుము . 

.

మిత్రమా ఆలస్యమెందులకు త్వరగా తీసుకొని రమ్ము  అని రాముడు పలుకగా సుగ్రీవుడు వాటిని తానె స్వయముగా గుహలోనికి వెళ్లి తీసుకొని వచ్చి ఆయన ముందుంచాడు .

.

ఆ అలంకారములు ,ఉత్తరీయము చూసిన వెంటనే రాముని కన్నులు పొగమంచు కప్పిన చంద్రుడి వలె బాష్పముచేత ఆవరింపబడినవి .

.

ఒక్కసారిగా హా !సీతా  అంటూ ఏడుస్తూ నేలపై బడి మూర్చిల్లి నాడు .

.

మరల కొంతసేపటికి తేరుకొని మాటిమాటికీ తన గుండెలకు ఆ నగలను దగ్గరకు చేర్చుకొని కలుగులో కోపముతో బుసలుకొట్టే పాములాగా నిట్టూర్పులు విడుస్తూ కన్నులనుండి ఎడతెరిపిలేకుండా కన్నీరు కారుస్తూ ప్రక్కనే ఉన్న లక్ష్మణుని వైపు చూస్తూ కడు దీనంగా విలపించసాగాడు .

.

లక్ష్మణా ఇదుగో ఈ అలంకారాలు చూడు పచ్చిక మీద పడటము వలన విరిగిపోకుండా పూర్వమువలెనే ఉన్నవి .

.

అప్పుడు లక్ష్మణుడు,

 అన్నా ! నాకు కేయూరాలు కానీ ,కుండలాలు కానీ తెలువవు ,

కానీ ఆవిడ కాలి నూపురాలను మాత్రము నేను గుర్తించగలను.

.

నిత్యమూ ఆవిడ పాదాలకు వందనము చేయుదును కావున అవి నేను గుర్తుపట్టగలను.

.

నిస్సందేహముగా అవి ఆవిడవే ! 

.

సుగ్రీవుడా ,నా ప్రాణాధిక అయిన సీతను రావణుడు ఎటువైపుగా తీసుకొని వేళ్ళినాడో నీవు చెప్పగలవా!

 వానిని ఇప్పుడే యమ సదనమునకు పంపగలను అని రాముడు  కోపముతో సుగ్రీవుని వైపు తిరిగి పలికినాడు .

.

NB

( లక్ష్మణుడన్న ఈ మాటలు ప్రాచ్య పాఠమునందు లేవని పెద్దల అభిప్రాయము ).

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: