15, మే 2024, బుధవారం

*శ్రీ శృంగేరి శారదా దేవాలయం

 🕉 *మన గుడి : నెం 317*


⚜ *కర్నాటక*  :- 


*శృంగేరి - చిక్కమగళూరు*


⚜ *శ్రీ శృంగేరి శారదా దేవాలయం*



💠 శృంగేరి అంటే తెలీని హిందువు వుండడు.

వేదపాఠశాల అంటే ముందుగా శృంగేరీ జ్ఞాపకం వస్తుంది, మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా మందిరాలలో పూజారులైనా, పౌరోహిత్యం చేసుకుంటున్నవారైనా శృంగేరీలోని వేదపాఠశాలలో చదువుకున్నవారే అయి వుంటారు. ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన శారదాపీఠం కూడా యిక్కడే వుందనీ మనకు తెలుసు.


💠 నిజానికి ఇది శ్రీ ఆదిశంకరులు ఒక రాతిపై చెక్కిన శ్రీ చక్రంపై ప్రతిష్టించబడిన చందనంతో చేసిన శారదా మూర్తితో ఒక మందిరం.

శ్రీ భారతీ కృష్ణ తీర్థ చందనం విగ్రహం స్థానంలో ప్రస్తుతం ఉన్న బంగారు విగ్రహం పెట్టారు.


💠 మరోవైపు దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదము ఈ శృంగేరి శారద మఠానికి ప్రధాన వేదం. 

ఈ మఠానికి పీఠాధిపతిని స్వయంగా శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు.


💠 శారదాదేవి జ్ఞానానికి , విజ్ఞాన సర్వస్వానికి తల్లి. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు నెలకొల్పారని చెబుతారు.  మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి ఇక్కడ విగ్రహంగా మారిపోయిందని స్థలపురాణం.


💠 శ్రీ శారదాంబ యొక్క మూల విగ్రహం, ఇప్పుడు శృంగేరిలోని శ్రీ విద్యాశంకర దేవాలయంలో ఉంది.

మహామండపంలో దుర్గ, రాజ రాజేశ్వరి, ద్వారపాలకులు మరియు దేవీ దేవతలతో అద్భుతంగా చెక్కబడిన భారీ రాతి స్తంభాలు ఉన్నాయి.


💠 మనకి తెలిసి ఆదిశంకరులు శారదాపీఠం స్థాపించడం వల్ల శృంగేరీ ప్రసిధ్ది పొందిందనుకుంటే తప్పే. 

శృంగేరీ పట్టణం వున్న పర్వతాన్ని ఋష్యశృంగగిరి మీద నిర్మింపబడింది. ఋష్యశృంగగిరి కాలాంతరాన శృంగేరిగా మారింది. ఋష్యశృంగ మహర్షిని గురించిన వివరణ మనకి వాల్మీకి రామాయణంలో వుంది, విభకంతన మహర్షి పుతృడు ఋష్యశృంగ మహర్షి, అతను తపస్సు చేసుకున్న పర్వతమే ఋష్యశృంగగిరిగా పిలువబడసాగింది.


💠 ఆది గురువు శంకరాచార్యులవారు పీఠాలను స్థాపించాలని సంకల్పించుకుని సరైన ప్రదేశం కొరకు దేశాటన చేసేరట, ఆ సమయంలో భద్రానదీ తీరాన అతను ఓ వింతను చూసేరట.

ఓ కప్ప వర్షంలో ప్రసవ వేదన పడుతూ వుంటే నాగుపాము జాతివైరం మరచి కప్పకు తన పడగతో వర్షం నుంచి కాపాడుతూ వుందట, కప్ప నిశ్చింతగా వుందట. అది చూసిన శంకరులు జాతివైరుల మధ్య యింత స్నేహభావం కలగడం అన్నది ఆ ప్రదేశం గొప్పతనమని గుర్తించి అక్కడ 12 సంవత్సరాలు గడిపి శారదా పీఠాన్ని స్థాపించి గురుకులం ప్రారంభించేరట. ఇక్కడే మొదటిసారి ఆదిశంకరులు తన శిష్యులకు అధ్వైతం గురించి బోధించారట.


💠 శారదాపీఠం గురించిన మరో కథ కూడా 

చెప్తారు అదేమిటంటే శంకరులవారు దేశాటనచేస్తూ ఓ సారి తర్కశాస్త్ర చర్చలో పాల్గొన్నారట, శంకరుల ధాటికి యెవరూ ఆగలేకపోయేరట, ఆఖరుగా మండన మిశృనితో (ముండన మిశృడు) చర్చ సాగుతుంది, యెవరు ఓడిపోతే వారు గెలిచినవారికి దాసుడవాలనే షరతు కూడా వుంటుంది.

శంకరులవారు మండనమిశృని ఓడిస్తారు. షరతు ప్రకారం మండనమిశృడు శంకరులను దాసునిగా అనుసరిస్తాడు. 


💠 అప్పటికే శంకరులవారికి భారతి, మండనమిశృడు సరస్వతీ బ్రహ్మ అవతారాలనే జ్ఞానం కలుగుతుంది? మండనమిశృని యెంత వారించినా అతను శంకరుల దాసునిగా తనను తాను అర్పించుకుంటాడు, మహాసాధ్వియైన భారతి పతిని అడుగుజాడలలో వారిని అనుసరిస్తుంది. 


💠 శంకరులవారు మొదటి పీఠాన్ని శారదాంబ పీఠంగా భారతికి అంకితమిచ్చి తన ఉత్తరాధికారిగా మండనమిశృని నియమించి హిమాలయాలకి వెళ్లి కేదార్ నాధ్ లో కేదారునిలో యైక్యం అయిపోయేరు.


💠 స్ఫటిక చంద్రమౌళీశ్వర లింగాన్ని శివుడు శ్రీ ఆదిశంకరాచార్యులకు కానుకగా ఇచ్చాడని ప్రతీతి. ఇప్పటికీ ఈ లింగాన్ని దర్శించవచ్చు మరియు లింగానికి చంద్రమౌళీశ్వర పూజను ప్రతిరోజూ రాత్రి 8:30 గంటలకు శృంగేరి శారద పీఠం జగద్గురువులు, శ్రీమద్ జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం మరియు శ్రీమద్ జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం, గురు నివాసంలో నిర్వహిస్తారు. 


💠 శారదాంబిక దేవి ఉభయ భారతిగా భూమిపైకి వచ్చిన సరస్వతీ దేవి అవతారమని నమ్ముతారు. ఆమెను పూజించడం ద్వారా పార్వతి, లక్ష్మి మరియు సరస్వతితో పాటు బ్రహ్మ, శివ, మరియు విష్ణువుల ఆశీస్సులు లభిస్తాయని సాధారణ విశ్వాసం. ఇక్కడ నిర్వహించే అక్షరాభ్యాస వ్రతం పవిత్రమైనది మరియు సార్ధకమైనదిగా పరిగణించబడుతుంది.


🔆 *శృంగేరిలోని ముఖ్య దేవాలయాలు.*


💠 శృంగేరిలో 40కి పైగా ఆలయాలు ఉన్నాయి. ముఖ్యమైనవి మల్లప్ప బెట్ట అని పిలువబడే చిన్న కొండపై ఉన్న మలహానికరేశ్వర ఆలయం.

శ్రీ శారదాంబ ఆలయం పక్కనే ఉన్న శ్రీ విద్యాశంకర ఆలయం.

జనార్దన ఆలయం, 

హరిహర ఆలయం, 

విద్యా శంకర ఆలయం, 

తోరణ గణపతి, 

శంకర కొండ, 

శ్రీ శంకర భగవత్పాద సన్నిధి,

తూర్పున కాలభైరవ ఆలయం, 

దక్షిణాన దుర్గ ఆలయం, 

పశ్చిమాన ఆంజనేయ ఆలయం కొన్ని ముఖ్యమైన ఆలయాలు.


💠 నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు.

కార్తీక పూర్ణిమ రోజున శ్రీ శారదా పుణ్యక్షేత్రంలో దీపోత్సవాలు నిర్వహిస్తారు.

మాఘ శుద్ధ తృతీయ నాడు శ్రీ శారదాంబ రథోత్సవం జరుగుతుంది.

 

💠 బెంళూరునుంచి 335 కిమీ దూరంలోనూ, ఉడిపికి సుమారు 85 కిమీ దూరంలోనూ వుంది.

కామెంట్‌లు లేవు: