26, మే 2023, శుక్రవారం

సెంగోల్

 *పార్లమెంట్​లో లోక్​సభ స్పీకర్​ వద్ద పెట్టే ఎంతో ప్రాముఖ్యం గల 'సెంగోల్​' గురించి ఇప్పటికీ భారత ప్రజలకు సరిగ్గా తెలియదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.* మే28న కొత్త పార్లమెంట్​ భవనం ప్రారంభించాక ప్రధాని నరేంద్ర మోదీ.. 'సెంగోల్​'ను లోక్​సభ స్పీకర్​ సీట్ వద్ద పెడుతారని చెబుతూ దాని ప్రాముఖ్యాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే 'సెంగోల్'​ వెనుక ఉన్న అసలు కథెంటో తెలుసుకుందాం.


 *సెంగోల్​ అనే ఈ రాజదండాన్ని తొలిసారిగా భారత తొలి ప్రధాని జవహర్​ లాల్ నెహ్రూ స్వీకరించారు.* బ్రిటీష్​ వలస పాలనకు ముగింపు పలుకుతూ.. భారత స్వయంపాలనకు, అధికార మార్పిడికి గుర్తుగా దీనిని ఏర్పాటు చేశారు. *'సెంగోల్​'.. 'సెమ్మై' అనే తమిళ పదం నుంచి పుట్టింది.* దీనికి తమిళంలో ధర్మం అని అర్థం వస్తుంది.


 *'సెంగోల్'​ ఏర్పాటు వెనుక కథేంటి?* 

భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన నేపథ్యంలో బ్రిటిష్​ ఇండియా చివరి వైశ్రాయ్​ అయిన లార్డ్​ మౌంట్​ బాటన్​.. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో ఏర్పాట్లపై చర్చించారు. ఈ క్రమంలోనే అధికారికంగా స్వాతంత్ర్యం ఇచ్చినట్లుగా ఏదైనా ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేయాలని నెహ్రూకు సూచించారు మౌంట్ బాటన్​. దీనికి స్పందించిన నెహ్రూ.. వెంటనే భారత చిట్టచివరి గవర్నర్​ జనరల్​ సీ రాజగోపాలచారిని అడగగా.. ఆయన ఓ సలహా ఇచ్చారు

రాజవంశంలో నూతన రాజు సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో జరిగే ఆచారాల గురించి నెహ్రూకు చెప్పారు రాజగోపాలచారి. *కొత్తగా రాజు అయ్యే వ్యక్తి పూజారి నుంచి రాజదండాన్ని స్వీకరిస్తారని..* అలానే తాము కూడా *బ్రిటిష్​ పాలన నుంచి విముక్తి పొందడానికి సూచికగా ఈ రాజదండాన్ని స్వీకరిద్దామని* సూచించారు. దీనికి ప్రధానమంత్రి నెహ్రూతో పాటు మౌంట్​ బాటన్​ కూడా అంగీకరించారు. దీని బాధ్యతను సైతం రాజగోపాలచారికే అప్పగించారు జవహర్​లాల్ నెహ్రూ.  దీంతో ఆ 'సెంగోల్'​ను తయారు చేయించడానికి.. రాజగోపాలచారి వెంటనే నాటి మద్రాసులోని తిరువడుతురయైకి వెళ్లారు. అక్కడే ఉన్న ఓ మఠాన్ని సందర్శించి.. ఈ విషయం చెప్పగా మఠాధిపతులు సైతం దీనికి అంగీకరించారు. *ఉమ్మిడి బంగారు చెట్టి అనే ఓ బంగారు ఆభరణాల దుకాణం.. బంగారు 'సెంగోల్​'ను అద్భుతంగా తీర్చిదిద్దింది.* ఐదు అడుగుల పొడవుతో 'సెంగోల్'​ పైభాగంలో న్యాయానికి ప్రతీకగా నందిని చెక్కారు. అనంతరం ఈ 'సెంగోల్​'ను పవిత్ర గంగా జలంతో శుద్ధి చేసి లార్డ్ మౌంట్​ బాటన్​కు అందించారు మఠాధిపతులు. ఆ తర్వాత *స్వాతంత్ర్యానికి గుర్తింపుగా 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మౌంట్​ బాటన్ నుంచి సెంగోల్​ను స్వీకరించారు నెహ్రూ.* అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారట. ఆ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారట. ఇదండీ సెంగోల్​ వెనుక ఉన్న అసలు కథ. *ప్రస్తుతం ఇది అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది.* ఇప్పుడు దీనిని ఆదివారం కొత్త పార్లమెంట్‌ భవనంలో అమర్చనున్నారు.

కామెంట్‌లు లేవు: