6, జూన్ 2023, మంగళవారం

⚜ *శ్రీ #వీరభద్రస్వామి ఆలయం*

 ⚜ *అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి*


⚜ *శ్రీ #వీరభద్రస్వామి ఆలయం*


💠 వీరభద్రస్వామి ఉగ్రరూపుడై కాకుండా... ప్రశాంతమైన రూపంలో దేవతలకే జ్ఞానభిక్ష పెట్టగల దక్షిణామూర్తి రూపంలో వెలసిన క్షేత్రం కడప జిల్లాలోని రాయచోటి.


💠 వీరభద్ర ఆలయం వీరశైవుల పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వయంగా వీరభద్రుడే విగ్రహ మూర్తిగా ఇక్కడ కొలువైనందున రాయచోటి వీరభద్ర ఆలయాన్ని దక్షణ భారత దేశ వీరభద్ర ఆలయాలకి మూలవిరాట్‌గా పేర్కొంటుంటారు.

 

⚜ స్థల పురాణం ⚜


💠 దక్షప్రజాపతి  శివద్వేశంతో తలపెట్టిన యజ్ఞానికి బ్రహ్మ, విష్ణువు తదితర దేవతలను ఆహ్వానించి నిరీశ్వర యాగం తలపెట్టారు.తన భర్త మాటమీరి విచ్చేసిన సతీదేవికి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక దేవతలందరి సమక్షంలో ఆత్మాహుతి గావించుకుంది. 

అది తెలిసిన మహోగ్రుడైన రుద్రుడు విలయతాండవం చేసి తన జటను పెరికి నేలకు విసిరితే  ప్రళయ భీకరాకర వీరభద్రుడు ఉద్భవించి రుద్రగణ సహితుడైన యజ్ఞశాలపై విరుచుకుపడ్డాడు. 


💠 ధక్షుని శిరస్సును తన ఖడ్గంతో ఖండించి అగ్నికి ఆహుతి ఇచ్చారు. వీరభద్రుడు సృష్టించిన బీభత్సానికి శివుడు సంతోషించారు. వీరభద్రుని వీరత్వానికి మెచ్చుకుని వీరులకు వీరేశ్వరుడువై వర్ధిల్లుగాక అని దీవించాడు.


💠 దక్ష యజ్ఞం విధ్వంసం జరిగాక దేవతలలో పశ్చాత్తాపం కలిగి శివుడిని జ్ఞానభిక్ష పెట్టమని 'అప్పుడు శంకరుడు వీరభద్రుణ్ని పిలిచి వారి కోరిక తీర్చమని ఆదేశించాడట.

దాంతో రుద్రాంశ సంభూతుడైన వీరభద్రుడి ఉగ్రం తగ్గింది. 

తన ఆగ్రహాన్ని ఉపసంహరించుకుని పరమశివుని అవతారమైన దక్షిణామూర్తి రూపంలో రామేశ్వర, శ్రీశైల క్షేత్రాల నడుమ రాయచోటి ప్రాంతంలో వీరేశ్వరుడుగా వెలసి దేవతలకు జ్ఞానభిక్ష పెట్టి అవతార పరిసమాప్తి గావించాడని స్థలపురాణం. 


💠 తన కర్తవ్యం ముగియగానే భూలోకంలో పరమేశ్వరుడి పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ చిట్టచివరకు మాండవ్య మహాముని తపోబలంతో పునీతమైన మాండవ్యనదీ తీరాన భద్రకాళీ సమేతుడై అర్చా విగ్రహమూర్తిగా అవతార సమాప్తి పొందాడు. 

అందుకే వీరభద్రస్వామి ఆలయాలన్నింటిలో ఈ దివ్యక్షేత్రం మూలస్థానమై ప్రసిద్ధి చెందింది. 


💠 రాజాధి రాజులెందరో విడిది చేసి తమ వీరఖడ్గాలను అర్పించి, నిత్యం రాజోపచారాలను చేసిన ఈ వీరభద్రస్వామి రాచరాయుడిగా పేరు పొందాడు. 

ఈ కారణంగానే, రాచరాయుడి నివాసమైన ఈ ప్రాంతం ‘రాచవీడు’గా పేరు పొంది కాలక్రమేణా ‘రాయచోటి’గా మారింది.


💠 ఆలయంలో స్వామి మూల విరాట్టుకు మీసాలూ, కోరలూ ఉండకపోవడం ఇక్కడి ప్రత్యేకత. విగ్రహానికి అలంకారంగా మాత్రమే వెండి మీసాన్ని పెడతారు. గర్భగుడిలో స్వామితో పాటు వీరేశుడనే పేరుతో శివలింగం ప్రతిష్ఠితమై ఉంది. 

ముఖ మండపం లోపల రెండు నందులు ఉంటాయి. పెద్దనందిని ‘శివనంది’ అనీ, చిన్నదాన్ని ‘వీరనంది’ అనీ పిలుస్తారు. 


💠 ఈ క్షేత్రంలో వీరేశ్వరుడికి పూర్వమే గ్రామ దేవతగా వెలసిన మాండవీ మాత (ఎల్లమ్మ)కు ప్రథమ పూజ తరువాత వీరేశలింగ పూజ, అనంతరం వీరభద్రుడి పూజ చేయడం ఆచారంగా వస్తోంది.


💠 ఆలయంలో ద్వారపాలకులైన నందికేశ్వర, మహాకాళేశ్వరులతో పాటు సూర్యభగవానుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నవగ్రహాలు, కాలభైరవులు కొలువయ్యారు.


💠 ఏటా మాఘ బహుళ దశమి లేదా ఏకాదశి నుంచి 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల వేళ మహానైవేద్య (అన్నకూటోత్సవం) ఘట్టం నిర్వహిస్తారు. రోజుకు 5 పావుల చొప్పున 365 రోజులకు లెక్కించి నైవేద్యం తయారు చేసి రాసిపోస్తారు. 

ఆలయ నిర్మాణంలో నైపుణ్యతను,

ఆలయాన్ని దోచుకోవడానికి కొందరు ప్రయత్నించినప్పుడు వడియరాజులు అడ్డుకున్నట్లు చెబుతారు. అందుకే నేటికీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో వీరికి ప్రాధాన్యం ఉంటుంది. 


💠 బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి బంగారంతో చేసిన మూడో నేత్రాన్ని అలంకరిస్తారు. అప్పుడు స్వామికి నైవేద్యంగా పెట్టేందుకు అన్నం, గారెలూ, బూరెలూ పెద్ద రాశిగా పోస్తారు. తర్వాత స్వామివారి మూడో నేత్ర దృష్టి ప్రసాదంపై పడి ఆరగించిన వెంటనే కుప్పగా ఉన్న అన్నప్రసాదం పలుచబడి మెత్తగా తయారవుతుంది. 

డప్పు వాయిద్యాలతో వచ్చే వడియరాజులు

ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ముందుగా ఆ ప్రసాదాన్ని కొంత తీసుకుని మరో ద్వారం గుండా వెళ్లిపోతారు. తర్వాతే మిగతా భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుంది. ఈ తంతు తిలకించడానికి లక్షల్లో జనం హాజరవుతారు. 

 

💠 బ్రహ్మోత్సవాలు నిర్వహణ అనంతరం మార్చి నెలలో 26 నుండి 31వ తేదీల మధ్యలో ఎన్నో ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం విశేషం. ఆలయ వాస్తు నిర్మాణ చాతుర్యానికి అది నిదర్శనమని చెప్పవచ్చు.


💠 ఆలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తు గల ఏక శిలారాతి దీప స్తంభం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంత పెద్ద ఏకశిల దీపస్తంభం దక్షణ భారత దేశంలోనే మరెక్కడా లేదని చెప్పవచ్చు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ స్తంభంపై భాగంలో దీపం వెలిగించి స్వామి వారిని దర్శించుకుంటారు.


💠 కడప నుంచి 50 కిమీ దూరం


🙏 జై వాసవి 🙏

కామెంట్‌లు లేవు: