6, జూన్ 2023, మంగళవారం

తల్లి తండ్రుల గురించి

 


తల్లి తండ్రుల గురించి ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది.*


*(1) ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి.*


*(2) ఆకాశము కన్నా ఉన్నతుడు జన్మనిచ్చిన తండ్రి.*


*(3) ఒక్కసారి తల్లికి, తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.*


*(4) సత్యం తల్లి - జ్ఞానం తండ్రి.* 


*(5) పదిమంది ఉపాధ్యాయులు కన్నా ఆచార్యుడు గొప్పవాడు. వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది మనకి  జన్మనిచ్చిన తల్లి.*


*(6) తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి.*


*(7) ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునకమాంసము కన్నా హీనం.*


*(8) ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం పోదు.*


*(9) తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది.*


*(10) ఈ లోకంలో తల్లిని మించిన దైవం లేదు,లేదు.*


 పదిహేనేళ్ళ తరువాత 


అప్పుడు మధ్యాహ్నం రెండు గంటల సమయం. సూర్యతాపం వల్ల ఎక్కడచూసినా విపరీతమైన వేడి. బెంగాల్ నుండి ఒక ముసలాయన వచ్చాడు. రావడం రావడంతోనే “పెరియవ ఎక్కడున్నారు?” అని కఠినంగా అడుగుతున్నాడు. 


మఠంలోని శిష్యులొకరు, “సాయింత్రం పరమాచార్య స్వామి దర్శనం చేసుకోవచ్చు” అని చెప్పారు. ఆ ముసలాయన సాక్షాత్ దూర్వాసో మహర్షి అవతారం లాగా ఉన్నాడు. 


“ఏంటి? సాయింకాలం రావాలా? నన్ను రమ్మని పిలిచి ఎక్కడికి వెళ్ళారు? వారికిష్టమైనప్పుడే రమ్మను. నేను వెళ్ళిపోతున్నాను” అని చెప్పి రైల్వేస్టేషను వైపు వెళ్తున్నాడు. 


ఇదంతా చూసి శిష్యుడికి చాలా కోపం వచ్చింది. ఆ ముసలాడితో, “ఏమిటి? ఎందుకు మమ్మల్ని నిందిస్తున్నావు? ఎవరు రమ్మన్నారు నిన్ను అసలు? నువ్వు నీ అవతారం. కాషాయం, నెరిసిన గడ్డం, జడలు కట్టిన జుట్టుతో సాధువులాగా వేషం కట్టి, ఇలా అరవడం ఏమి బాగోలేదు” అని చెప్తుండగా పరమాచార్య స్వామివారు చెరుకు పంటపొలంలో కనిపించారు. ఆ శిష్యుడు వెంటనే స్వామి వద్దకు పరిగెత్తాడు. 


దాదాపు గంట పాటు ఆ బెంగాల్ సాధువు స్వామివారు మాట్లాడుకున్నారు. తరువాత ఆఅ సాధువుకి కొంత ఆహారం కొనిపెట్టి రైల్వేస్టేషనులో వదిలిపెట్టవలసిందిగా ఆదేశించారు. ఆ శిష్యుడు స్వామివారు చెప్పినట్టు చేసి తిరిగొచ్చారు. 


అతణ్ణి చూసి మహాస్వామివారు, “నేను కాశీయాత్రకు వెళ్ళినప్పుడు మేము బెంగాల్ మిడ్నాపూర్ మీదుగా తిరిగొస్తున్నాము. అప్పుడు ఈ సాధువు మా వద్దనే కొద్ది రోజులు ఉన్నాడు. అతను ఒక యోగ పురుషుడు; సిద్ధుడు, కాని అందరిలాగే తన కోపాన్ని నిగ్రహించుకోలేడు” 


వెళ్తుండగా మరలా నా దర్శనం ఎప్పుడు అని అడిగాడు. పదిహేనేళ్ళ తరువాత దక్షిణ భారతంలో నన్ను నువ్వు కలుస్తావు అని చెప్పాను. భరతుడు ఎలాగైతే రాముడి కోసం ఎదురుచూసాడో అలాగే ఈ సాధువు కూడా ఇన్నేళ్ళు రోజులు లెక్కపెట్టుకుంటూ సరిగ్గా పదిహేనేళ్ళకి వచ్చాడు నన్ను వెతుక్కుంటూ. 


--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 7


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: