25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

రామాయణమ్.96


ఇంత సైన్యము గంగ ఒడ్డుకు ఎందుకు వచ్చింది? కారణమేమై ఉంటుంది ? అనుమానం వచ్చింది గుహుడికి.ఆ రధము మీద కనపడే ధ్వజాన్ని బట్టి చూస్తే ఇది భరతుడిసేనావాహిని అని తేటతెల్లమవుతున్నది.

.

భరతుడు ఇప్పుడెందుకు వచ్చినాడు ? ఇక్కడున్న పల్లెలోని జనులను బంధించటానికి రాలేదుకదా! మనలను చంపటానికి కాదుకదా ! లేక రాజ్యాన్ని పూర్తిగా నిష్కంటకం చేసుకోవాలనే ఉద్దేశంతో రాముని చంపివేయటానికి కాదుకదా!

.

రాముడు నాకు ప్రభువే కాదు ,నాకు మిత్రుడు కూడా ఆయన ప్రయోజనం కాపాడటానికి అందరూ సన్నద్ధం కండు అని సేనను ఆజ్ఞాపించాడు .

.

ఐదువందల నావలలో ఒక్కొక్క దానిపై నూర్గురు యోధులు కవచధారులై సిద్ధంగా ఉండండి ! రాముడివిషయంలో భరతుడికి ఏ విధమైన దుష్టబుద్ధిలేదని తేలిన తరువాతనే ఆతని సేన గంగను సుఖంగా దాటగలుగుతుంది.అని పలికి అందరినీ సిద్ధం చేసి తాను మాత్రం భరతుడికి మత్స్యమాంసములు,తేనె పట్టుకొని వినయంగా భరతుడికి ఎదురు వెళ్ళాడు.

.

సుమంత్రుడు ఆతనిని చూపి భరతునితో ఈయన పేరు గుహుడు నీ అన్నకు ప్రాణస్నేహితుడు ఆయనను నీవుకలిసి మాట్లాడితే రాముని ఆచూకీ మనకు తెలుస్తుంది.అని చెప్పాడు.

.

అప్పుడు భరతుడు శీఘ్రంగా గుహుని తనవద్దకు తీసుకురమ్మన్నాడు.

.

గుహుడు వినయంగా భరతుడితో మేమంతా నీకు లొంగిఉండేవారము.ఇది నీదాసుని గృహము. దీనిలో నీ ఇచ్ఛానుసారము నివసింపు అని కోరినాడు

.

.నీకునీసైన్యమునకుసరిపడునంతదుంపలు ,పండ్లు,పచ్చిమాంసము,ఎండుమాంసము ఉన్నది నీ సైన్యము సుఖముగా నేటిరాత్రికి భుజించి ,విశ్రమించి రేపు బయలుదేరవచ్చును అని వినయంగా పలికాడు గుహుడు.

.

రాముని మిత్రుడా ఇంత సేనకు నీవు ఒక్కడవే ఆతిధ్యమివ్వాలనుకొనే నీ మనస్సు ఎంతగొప్పది ! .

.

మాకు ఒకటే కోరిక ఈ గంగ దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి మేమంతా సుఖంగా గంగదాటే మార్గం చూపించు అని భరతుడు కోరాడు.

.

అదెంత పని మేమంతా నీ వెంట వచ్చి దాటించగలము కానీ నాకొక సందేహమున్నది ,ఇంత సేనతో నీవెందుకు బయలుదేరావు రామునికి కీడు తలపెట్టే ఉద్దేశ్యమేమీ లేదుకదా!

.

అతని మాటలు విన్న భరతుడు ,రాముడికి కీడు తలపెట్టే దుష్కాలము ఎన్నడునూ రాకుండు గాక రాముడు నాకు తండ్రివంటి వాడు ! ( భ్రాతా ! జ్యేష్టః పితృసమో).

.

వనములో నివసిస్తున్న రాముని వెనుకకు తీసుకొని వచ్చుటకే వెళుతున్నాను .గుహుడా మరొక విధముగా తలపకుము .

ఇది సత్యము!.

.

భరతుడి మాటలువిన్న గుహుడి ముఖం వికసించింది.

.

ఆహా ! అప్రయత్నముగా లభించిన రాజ్యలక్ష్మిని తృణప్రాయంగా విడిచిపెట్టే నీవంటివాడు నాకీ లోకంలో ఎవ్వరూ కనపడలేదు.నీ కీర్తి లోకంలో శాశ్వతంగా వ్యాపించగలదు .

.

ఇంతలో రాత్రి అయ్యింది .అందరూ విశ్రమించారు.

.

రాముడిగురించిన ఆలోచనలతో భరతుడికి దుఃఖము చుట్టుముట్టింది.ఆయనను అది కాల్చి వేయసాగింది.అన్ని అవయవాలనుండీ ధారాపాతంగా చెమట కారటం మొదలుపెట్టింది.

.

 ఆయన దుఃఖమే ఒక మహా పర్వతము

ఆయన ఆలోచనలే ఆ పర్వతమందలి శిలలు

ఆయన నిట్టూర్పులు ధాతువులు

ఆయన దైన్యమే ఆపర్వతమందలి వృక్ష సముదాయము

ఆయనకు కలిగే శోకము,ఆయాసము ,మనస్తాపము దాని శిఖరములు.

ఆయనకు కలిగిన మోహము అనంతమైన జంతుసముదాయము

ఆయనకు కలిగిన సంతాపము దానిమీదున్న వెదురుపొదలు.

.

ఏమి చేయాలో తోచటం లేదు నిదురరాదు !కనులు మూత పడటం లేదు. దుఃఖము దుఃఖము ఒకటే దుఃఖము.మనశ్శాంతి కరవై అల్లల్లాడిపోతున్న భరతుడిని గుహుడు ఆ రాత్రి అంతా ఓదారుస్తునే ఉన్నాడు.

.

NB

చుట్టూ అష్టదిగ్బంధము చేసి వచ్చాడు గుహుడు .రాముడికి హాని జరుగుతుందేమో అని ఏమాత్రం అనుమానంకలిగినా భరతుడి సేన ముందుకు కదలలేదు.

.అందుకే "రామస్య ఆత్మ సమో సఖా" అని గుహుడి గురించి మహర్షి వ్రాసింది.


రామాయణమ్. 97

..

రామలక్ష్మణులను తాను కలిసినదిమొదలు వారితో కలిసి గడిపిన సమయాన్ని లక్ష్మణుడి మనో వేదనను ,ఆరాత్రి తాను,లక్ష్మణుడు ముచ్చటించుకున్నసంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పి,చివరగా వారిని తాను గంగదాటించిన విషయాన్ని కూడా ఎరుకపరచాడు గుహుడు .

.

ఈ సంగతులన్నీ విన్న భరతుని హృదయంలో శోకం పెల్లుబికి కట్టలు తెంచుకొని ప్రవహించింది.కొరడాలతో కొట్టినప్పుడు ఒక్కసారే కూలబడే ఏనుగులాగ కూలపడి పోయినాడాయన.భరతుడి స్థితి చూస్తున్న శత్రుఘ్నుడుకూడా శోకముతో పట్టుదప్పినిలువలలేక నేలపైబడిన భరతుని కౌగలించుకొని బిగ్గరగా ఏడ్చాడు.

.

ఈ శోకములు విన్న తల్లులు మువ్వురూ భరతుని వద్దకు వచ్చిచేరగా కౌసల్యామాత తన దుఃఖము ఆపుకోలేక తానూ నేలపైపడి భరతుని కౌగలించుకొని ఏడ్వసాగింది.

.

ఆవిడ తీవ్రమైన బాధతో భరతుని ఉద్దేశించి నాయనా ఇంకనీవు ఏడువకురా ,మొత్తము రాజవంశము అంతా నీమీదనే ఆధారపడి ఉన్నది నీకేమయినా అయితే మేమెవ్వరమూ తట్టుకోలేము. 

.

దశరధమహారాజులేడు,రామలక్ష్మణులు చెంతలేరు,నిన్నుచూసుకొని బ్రతుకుతున్నామురా తండ్రీ నాయనా ఎందుకీ దుఃఖము ? సీతారామలక్ష్మణులగూర్చి ఏ విధమైన అప్రియమైన వార్త నీవు వినలేదు కదా!.అని పలుకుతూ తనను ఓదారుస్తున్న పెద్దతల్లి మాటలకు కాస్త తెప్పరిల్లి ఏడుస్తూనే గుహుడితో మరలమరల సీతారామలక్ష్మణుల గూర్చి ప్రశ్నించాడు .వారు ఎక్కడ ఉన్నారు? ఏమి తిన్నారు?ఎక్కడ నిదురించారు ? ఇలాంటి విషయాలు పదేపదే అడిగితెలుసుకుంటున్నాడు భరతుడు.

.

అప్పుడు రాముడు నిదురించిన చెట్టు వద్దకు తీసుకెళ్ళాడు గుహుడు .

రాముడు అక్కడనే దర్భలమీద శయనించాడన్న సంగతితెలుసుకొని మరల ఆయనలో దుఃఖము పొంగిపొర్లింది.

.

దశరధకుమారుడైన రాముడే నేలపై పడుకోవలసి వచ్చిందంటే కాలము కంటే బలమైన వాడెవడూ లేడని తెలుస్తున్నది.

.

న నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరమ్

యత్ర దాశరధీ రామో భూమావేవ శయీత సః.

.

ఇదిగో ఇది నా అన్నగారు పరుండిన చోటు ,

ఇదిగో ఈ గడ్డి అంతా ఆయన శరీరపు రాపిడికి నలిగి పోయింది.

ఇదిగో ఈ దర్భలమీద ఇంకా బంగారపుపొడులు అంటుకొనే ఉన్నాయి మా వదినగారు అలంకారాలేవీ తీయకుండగనే శయనించినట్లున్నది.

ఆవిడ ఏమాత్రము దుఃఖించకుండగనే నా అన్నవెంట వెళ్ళినది .అత్యంత సుకుమారి,పతివ్రతా శిరోమణి ఆవిడ ! 

ఈ కష్టాలు ఏవి లెక్కపెట్టినట్లులేదు,

 భర్త ఉన్న చోటే తనకూ సుఖకరమైనది అనుకొంటున్నది.

.

అయ్యో ఎంత కష్టము వచ్చినది నేనెంత క్రూరుడను నావలన భార్యాసహితుడై రాముడు అనాధవలే ఇట్లాంటి పడకలపై నిదురించవలసి వచ్చినదికదా! అని మరల ఏడ్వసాగాడు భరతుడు.

కామెంట్‌లు లేవు: